18-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
“మధురమైనపిల్లలూ - ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా
సత్యమైన దేవతలుగా అవుతున్నారు, కనుక సత్యయుగంలో సత్సంగము చేసే అవసరము ఉండదు”
ప్రశ్న:-
సత్యయుగంలో దేవతల ద్వారా ఎటువంటి వికర్మలూ జరగవు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే వారికి సత్యమైన తండ్రి యొక్క వరదానము లభించి ఉన్నది. రావణుని శాపము
లభించడం మొదలైనప్పుడు వికర్మలు జరుగుతాయి. సత్య-త్రేతా యుగాలలో సద్గతియే ఉంటుంది,
ఆ సమయంలో దుర్గతి అన్న పేరే ఉండదు. వికర్మలు జరిగేందుకు వికారాలే ఉండవు.
ద్వాపర-కలియుగాలలో అందరి దుర్గతి జరుగుతుంది కావున వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఇవి
కూడా అర్థము చేసుకోవలసిన విషయాలు.
ఓంశాంతి.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తారు - వీరు సుప్రీమ్ తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా, సుప్రీమ్
సద్గురువు కూడా. తండ్రి మహిమను ఈ విధంగా వినిపించినట్లయితే, కృష్ణుడు ఎవ్వరికీ
తండ్రి కాలేరు అని ఆటోమెటిక్ గా ఋజువౌతుంది. వారు చిన్న బాలుడు, సత్యయుగ
రాకుమారుడు. వారు టీచరు కూడా కాలేరు. వారు స్వయం కూర్చుని టీచరు వద్ద
చదువుకుంటారు. అక్కడ గురువులు ఉండరు ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు.
అర్థకల్పము సద్గతి, అర్థకల్పము దుర్గతి. అక్కడ సద్గతి ఉంటుంది కనుక అక్కడ
జ్ఞానము యొక్క అవసరమే ఉండదు. జ్ఞానమనే పేరు కూడా ఉండదు ఎందుకంటే జ్ఞానముతో 21
జన్మలకు సద్గతి లభిస్తుంది, మళ్ళీ ద్వాపరము నుండి కలియుగాంతము వరకు దుర్గతి
ఉంటుంది. అటువంటప్పుడు కృష్ణుడు ద్వాపరంలోకి ఎలా వస్తారు. ఇది కూడా ఎవ్వరికీ
ధ్యానంలోకి రాదు. ఒక్కొక్క విషయంలో చాలా గుహ్యమైన రహస్యాలు నిండి ఉన్నాయి,
వాటిని అర్థము చేయించడం చాలా అవసరము. వారు సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచరు.
ఇంగ్లీషులో సుప్రీమ్ అనే అంటారు. ఇంగ్లీషులో కొన్ని పదాలు చాలా బాగుంటాయి.
ఉదాహరణకు డ్రామా అనే పదం ఉంది. డ్రామాను నాటకమని అనరు, నాటకంలోనైతే
మార్పులు-చేర్పులూ ఉంటాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతుంది అని కూడా అంటారు కానీ
అది ఎలా తిరుగుతుంది, యథావిధిగా తిరుగుతుందా లేక ఏమైనా మారుతుందా, ఇది ఎవ్వరికీ
తెలియదు. తయారై తయారవుతూ ఉందని కూడా అంటారు...... ఇది తప్పకుండా ఒక ఆట, ఇది
మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ చక్రములో మనుష్యులే తిరగాల్సి ఉంటుంది. అచ్ఛా, ఈ
చక్రము ఆయుష్షు ఎంత? ఇది ఎలా రిపీట్ అవుతుంది? దీనికి తిరిగేందుకు ఎంత సమయం
పడుతుంది? ఇవి ఎవ్వరికీ తెలియవు. ఇస్లామ ధర్మస్థులు, బౌద్ధ ధర్మస్థులు
మొదలైనవారి వంశాలు ఉన్నాయి, డ్రామాలో వీరికి పాత్ర ఉంది.
బ్రాహ్మణులైన మీకు రాజ్యము ఉండదు, ఇది బ్రాహ్మణ కులము. సర్వోత్తమ బ్రాహ్మణ కులము
అని అంటారు. దేవీ దేవతల కులం కూడా ఉంటుంది. ఇది అర్థం చేయించడం చాలా సహజం.
సూక్ష్మవతనంలో ఫరిస్తాలు ఉంటాయి. అక్కడ ఎముకులు-మాంసము ఉండవు. దేవతలకు
ఎముకులూ-మాంసము ఉంటాయి కదా. విష్ణువే బ్రహ్మా, బ్రహ్మాయే విష్ణువు. విష్ణు నాభి
కమలము నుండి బ్రహ్మాను ఎందుకు చూపించారు? సూక్ష్మవతనంలోనైతే ఈ విషయాలుండవు. నగలు
మొదలైనవి కూడా ఉండవు. అందుకే బ్రహ్మాను శ్వేత వస్త్రధారి బ్రాహ్మణుడిగా
చూపించారు. బ్రహ్మా సాధారణ మనిషి, వారు అనేక జన్మల అంతిమంలో పేదవారిగా అయ్యారు
కదా. ఈ సమయంలో ఉండేవే ఖద్దరు వస్త్రాలు. పాపం వారికి సూక్ష్మ శరీరమంటే ఏమిటో
తెలియదు. అక్కడ ఉండేదే ఫరిస్తాలు, వారికి ఎముకులు-మాంసము ఉండవు అని మీకు తండ్రి
అర్థము చేయిస్తారు. సూక్ష్మవతనములోనైతే ఈ అలంకరణలు మొదలైనవి ఉండకూడదు కానీ
చిత్రాలలో చూపించారు కనుక బాబా ఆ రూపాలనే సాక్షాత్కారము చేయించి తర్వాత అర్థము
వివరిస్తారు. ఉదాహరణకు హనుమంతుని సాక్షాత్కారము చేయిస్తారు. ఇప్పుడు హనుమంతుని
వంటి మనుష్యులెవ్వరూ ఉండరు. భక్తిమార్గంలో అనేక రకాల చిత్రాలను తయారుచేశారు,
ఎవరికైతే విశ్వాసము కూర్చుంటుందో, వారికి ఈ విధంగా ఏమైనా చెప్తే గొడవపడతారు.
దేవతలు మొదలైనవారిని ఎంతగా పూజిస్తారు, మళ్ళీ ముంచేస్తారు. ఇదంతా భక్తి మార్గము.
భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు, మరి బయటకు ఎలా తీయగలరు.
బయటకు తీయడము కష్టమైపోతుంది. కొంతమంది ఇతరులను బయటకు తీసేందుకు నిమిత్తంగా అయి
స్వయం మునిగిపోతారు. స్వయం గొంతు వరకు ఊబిలో చిక్కుకుంటారు అనగా కామ వికారంలో
పడిపోతారు. ఇది అన్నింటికన్నా పెద్ద ఊబి. సత్యయుగంలో ఈ విషయాలుండవు. ఇప్పుడు
మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. అక్కడ ఇక
సత్సంగాలుండవు. ఇక్కడ భక్తి మార్గములో సత్సంగాలు చేస్తూ ఉంటారు, అందరూ ఈశ్వరుని
రూపాలే అని భావిస్తారు. ఏమీ అర్థము చేసుకోరు. కలియుగంలో ఉన్నవారందరూ పాపాత్ములు,
సత్యయుగంలో పుణ్యాత్ములు ఉంటారని తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. రాత్రికి
పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. కలియుగము మరియు
సత్యయుగము, రెండిటి గురించి తెలుసు. ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్ళడం ముఖ్యమైన
విషయం. క్షీర సాగరం మరియు విషయ సాగరం గురించి గాయనం కూడా ఉంది కానీ వాటికి
అర్థమేమీ తెలియదు. ఇప్పుడు తండ్రి కూర్చుని కర్మ-అకర్మల రహస్యాన్ని అర్థము
చేయిస్తారు. కర్మలనైతే మనుష్యులు చేస్తూనే ఉంటారు, అయితే కొన్ని కర్మలు
అకర్మలవుతాయి, కొన్ని వికర్మలవుతాయి. రావణరాజ్యంలో కర్మలన్నీ వికర్మలవుతాయి,
సత్యయుగంలో వికర్మలు జరగవు ఎందుకంటే అది రామ రాజ్యము. తండ్రి నుండి వరదానము
పొంది ఉన్నారు. రావణుడు శాపమునిస్తాడు. ఇది సుఖం మరియు దుఃఖముల ఆట కదా. దుఃఖంలో
అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. అక్కడ
వికారాలుండవు. అంటు కడుతున్నారని పిల్లలకు అర్థము చేయించారు. ఈ అంటుకట్టే ఆచారము
కూడా ఇప్పటిదే. తండ్రి అంటు కట్టడం ప్రారంభించారు. ఇంతకుముందు బ్రిటీష్
ప్రభుత్వమున్నప్పుడు వృక్షాలకు అంటు కట్టారని వార్తాపత్రికలలో ఎప్పుడూ వచ్చేది
కాదు. ఇప్పుడు తండ్రి కూర్చుని దేవీ-దేవతా ధర్మపు అంటును కడతారు, ఇతరులెవ్వరూ
అంటు కట్టరు. అనేక ధర్మాలున్నాయి, దేవీ దేవతా ధర్మము ప్రాయఃలోపమైపోయింది. ధర్మ
భ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయిన కారణంగా ధర్మం పేరునే తప్పుగా పెట్టేసారు.
దేవతా ధర్మానికి చెందినవారు మళ్ళీ అదే దేవీ దేవతా ధర్మములోకి రావాలి. ప్రతి
ఒక్కరూ తమ ధర్మములోకే వెళ్ళాలి. క్రిస్టియన్ ధర్మము నుండి బయటకు వచ్చి దేవీ
దేవతా ధర్మములోకి రాలేరు. ముక్తులవ్వలేరు. అయితే, ఒకవేళ దేవీ-దేవతా ధర్మము నుండి
ఎవరైనా కన్వర్ట్ అయి క్రిస్టియన్ ధర్మములోకి వెళ్ళి ఉంటే, వారు మళ్ళీ తిరిగి తమ
దేవీ దేవతా ధర్మములోకి వచ్చేస్తారు. వారికి ఈ జ్ఞానం మరియు యోగం చాలా బాగా
అనిపిస్తాయి, దీనితో వారు మన ధర్మానికి చెందినవారని ఋజువౌతుంది. ఇది అర్థము
చేసుకునేందుకు మరియు అర్థము చేయించేందుకు ఇందులో చాలా విశాలబుద్ధి కావాలి. ధారణ
చేయాలి, పుస్తకము చదివి వినిపించకూడదు. ఎవరైనా గీతను వినిపించేటప్పుడు,
మనుష్యులు కూర్చుని వింటారు. కొంతమంది గీతా శ్లోకాలను పూర్తిగా కంఠస్థము
చేస్తారు. అయితే ప్రతి ఒక్కరు కూర్చుని వీటికి తమ-తమ అర్థాలను తీస్తారు.
శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సాగరాన్ని సిరాగా మార్చి, అడవినంతా కలముగా
తయారుచేసినా కూడా జ్ఞానానికి అంతముండదు అని ఇక్కడైతే గాయనం ఉంది. గీత అయితే చాలా
చిన్నది. 18 అధ్యాయాలున్నాయి. చాలా చిన్న గీతను తయారుచేసి మెడలో ధరిస్తారు.
పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మెడలో ధరించే అలవాటు కూడా ఉంటుంది. ఎంత చిన్న
లాకెట్ తయారవుతుంది. వాస్తవానికి ఇది సెకండు విషయము. తండ్రికి చెందినవారిగా
అయ్యారంటే విశ్వానికి యజమానిగా అయినట్లు. బాబా, నేను మీకు ఒక్క రోజు బిడ్డను,
అని కూడా వ్రాయడం మొదలుపెడతారు. ఒక్క రోజులో నిశ్చయం ఏర్పడిన వెంటనే లెటర్
వ్రాస్తారు. పుత్రునిగా అయ్యరంటే విశ్వానికి యజమానిగా అయినట్లు. ఇది కూడా
కొంతమంది బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు
కదా. అక్కడ ఇంకే ఖండమూ ఉండదు, నామ-రూపాలన్నీ మాయమైపోతాయి. ఒకప్పుడు ఈ ఖండాలన్నీ
ఉండేవని కూడా అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఉండి ఉంటే, వాటి చరిత్ర-భూగోళము
ఉండాలి. అక్కడ ఇవి ఉండనే ఉండవు, అందుకే మీరు విశ్వానికి యజమానులుగా
అవ్వబోతున్నారు అని అంటారు. నేను మీకు తండ్రిని కూడా, నేను జ్ఞానసాగరుడిని అని
తండ్రి అర్థం చేయించారు. ఇది చాలా ఉన్నతాతి ఉన్నతమైన జ్ఞానము, దీని ద్వారా మనము
విశ్వానికి యజమానులుగా అవుతాము. మన తండ్రి సుప్రీమ్, వారు సత్యమైన తండ్రి,
సత్యమైన టీచరు, సత్యమును వినిపిస్తారు. అనంతమైన శిక్షణనిస్తారు. వారు అనంతమైన
గురువు, అందరికీ సద్గతినిస్తారు. ఒకరిని మహిమ చేసారంటే, ఆ మహిమ మళ్ళీ మరొకరికి
ఉండదు. మళ్ళీ వారు తమ సమానంగా తయారుచేసినప్పుడే ఆ మహిమ ఉంటుంది. కనుక మీరు కూడా
పతితపావనులు. సత్ నామ్ (సత్యము యొక్క పేరు) అని వ్రాస్తారు. ఈ మాతలు పతిత పావని
గంగలు. శివశక్తులని అనండి లేక శివ వంశీయులని అనండి. శివ వంశీ
బ్రహ్మాకుమార-కుమారీలు. అందరూ శివ వంశీయులు. అయితే, బ్రహ్మా ద్వారా రచనను
రచిస్తారు కనుక సంగమయుగములోనే బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. బ్రహ్మా ద్వారా
దత్తత తీసుకుంటారు. మొట్టమొదట బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. ఎవరైనా
అభ్యంతరము తెలిపితే, వీరు ప్రజాపిత, వీరిలో ప్రవేశిస్తారని వారికి చెప్పండి.
అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను అని తండ్రి అంటారు. విష్ణు నాభి నుండి
బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు. అచ్ఛా, మరి విష్ణువు ఎవరి నాభి నుండి
వెలువడ్డారు? అందులో బాణపు గుర్తు వేసి ఒకరి నుండి ఒకరు వస్తారని చూపించవచ్చు.
బ్రహ్మా నుండి విష్ణు, విష్ణువు నుండి బ్రహ్మా. వీరు వారి నుండి, వారు వీరి
నుండి జన్మించారు. వీరికి ఒక్క సెకండు పడుతుంది, వారికి 5 వేల సంవత్సరాలు
పడుతుంది. ఇవి అద్భుతమైన విషయాలు కదా. మీరు కూర్చుని అర్థము చేయిస్తారు.
లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ వారి అనేక జన్మల అంతిమంలో నేను
ప్రవేశించి ఈ విధంగా తయారుచేస్తాను అని తండ్రి అంటారు. ఇవి అర్థము చేసుకోవలసిన
విషయాలు కదా. మీరు కూర్చుంటే వీరిని బ్రహ్మా అని ఎందుకు అంటారో అర్థము
చేయిస్తాము. ప్రపంచమంతటికీ చూపించేందుకు ఈ చిత్రాలను తయారుచేశారు. మేము అర్థం
చేయించగలము, అర్థము చేసుకునేవారే అర్థము చేసుకుంటారు. అర్థము చేసుకోనివారిని,
వీరు మన కులానికి చెందినవారు కారని అంటారు. పాపం వారు అక్కడకు వస్తారు కానీ
ప్రజలలోకి వస్తారు. మనకైతే అందరూ పాపం అని అనిపించేవారే కదా - పేదవారిని పాపం
అని అంటారు. పిల్లలు ఎన్ని పాయింట్లను ధారణ చేయాలి. టాపిక్స్ పై భాషణ చేయడం
జరుగుతుంది. ఈ టాపిక్ ఏమైనా తక్కువా. ప్రజాపిత బ్రహ్మా మరియు సరస్వతి, నాలుగు
భుజాలను చూపిస్తారు. కనుక రెండు భుజాలు కుమార్తెవి. వారు యుగల్ కాదు.
వాస్తవానికి యుగల్ అయితే కేవలం విష్ణువు మాత్రమే. సర్వస్వతి బ్రహ్మాకు కుమార్తె.
శంకరునికి కూడా యుగల్ లేరు, ఈ కారణంగా శివ-శంకరులని అంటారు. ఇప్పుడు శంకరుడేం
చేస్తారు? వినాశనమైతే ఆటంబాంబులతో జరుగుతుంది. తండ్రి కూర్చుని పిల్లల
మృత్యువును ఎలా చేయిస్తారు, ఇది పాపమవుతుంది. తండ్రి అయితే శ్రమ లేకుండా అందరినీ
శాంతిధామానికి తిరిగి తీసుకువెళ్తారు. లెక్కాచారాలు పూర్తి చేసుకొని అందరూ
ఇంటికి వెళ్తారు ఎందుకంటే ఇది వినాశన సమయము. తండ్రి సేవ కోసమే వస్తారు. అందరికీ
సద్గతినిస్తారు. మీరు కూడా మొదట గతి లోకి, తర్వాత సద్గతిలోకి వస్తారు. ఇవి అర్థం
చేసుకునే విషయాలు. ఈ విషయాలు కొద్దిగా కూడా ఎవ్వరికీ తెలియవు. మీరు చూస్తూ
ఉంటారు, కొందరైతే చాలా తల తినేస్తారు, అస్సలు అర్థం చేసుకోరు. ఎవరైతే బాగా
అర్థము చేసుకోగలరో, వారు వచ్చి అర్థం చేసుకుంటారు. ఒక్కొక్క విషయం గురించి
అర్థము చేసుకోవాలనుకుంటే సమయాన్నివ్వండి అని చెప్పండి. ఇక్కడైతే అందరికీ కేవలం
తండ్రి పరిచయమును ఇచ్చేందుకే ఆజ్ఞ ఉంది. ఇది ఉన్నదే ముళ్ళ అడవి, ఎందుకంటే
ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు, దీనిని దుఃఖధామమని అంటారు. సత్యయుగం
సుఖధామము. దుఃఖధామము నుండి సుఖధామముగా ఎలా తయారవుతుంది అనేది మీకు అర్థము
చేయించారు. లక్ష్మీనారాయణులు సుఖధామంలో ఉండేవారు, వారే మళ్ళీ 84 జన్మలను
తీసుకొని దుఃఖధామములోకి వస్తారు. ఈ బ్రహ్మా పేరును కూడా ఎలా పెట్టారు. నేను
వీరిలో ప్రవేశించి అనంతమైన సన్యాసము చేయిస్తాను అని తండ్రి అంటారు. వెంటనే
సన్యాసము చేయిస్తారు, ఎందుకంటే తండ్రి సేవ చేయించాలి, వారే చేయిస్తారు. వీరి
వెనుక చాలా మంది వెలువడ్డారు, వారికి కూర్చుని పేర్లు పెట్టారు. వాళ్ళేమో పిల్లి
పిల్లలను చూపిస్తారు. ఇవన్నీ కట్టుకథలు. పిల్లి పిల్లలు ఎలా ఉంటాయి. పిల్లి
కూర్చుని జ్ఞానము వినదు. తండ్రి చాలా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏ
విషయమైనా అర్థము కాకపోతే, వారికి ఇలా చెప్పండి - ఎప్పటివరకైతే ఆల్ఫ్ ను అర్థము
చేసుకోరో అంతవరకు ఏమీ అర్థము చేసుకోలేరు అని. ఒక్క విషయాన్ని నిశ్చయము చేసుకోండి
మరియు వ్రాయండి, లేకపోతే మర్చిపోతారు. మాయ మరిపింపజేస్తుంది. ముఖ్యమైన విషయము,
తండ్రి పరిచయము. మన తండ్రి సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచరు, వారు విశ్వమంతటి
ఆది-మధ్య-అంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, దీనిని గురించి ఎవరికీ తెలియదు.
ఇది అర్థము చేయించేందుకు సమయం కావాలి. తండ్రిని అర్థం చేసుకోనంత వరకు ప్రశ్నలు
తలెత్తుతూనే ఉంటాయి. అల్ఫ్ (పరమాత్మ) ను అర్థము చేసుకోకపోతే బే (వారసత్వము)
గురించి ఏమీ అర్థము చేసుకోరు. ఊరికినే డౌట్లు అడుగుతూ ఉంటారు - ఇలా ఎందుకు,
శాస్త్రాలలోనైతే ఇలా చెప్పారు, అందుకే మొదట అందరికీ తండ్రి పరియమునివ్వండి.
అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కర్మ, అకర్మ మరియు వికర్మల గుహ్యగతిని బుద్ధిలో
ఉంచుకుని ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయకూడదు, జ్ఞానం మరియు యోగమును ధారణ చేసి
ఇతరులకు వినిపించాలి.
2. సత్యమైన తండ్రి యొక్క సత్యమైన జ్ఞానమునిచ్చి మనుష్యులను దేవతలుగా తయారుచేసే
సేవ చేయాలి. వికారాల ఊబి నుండి అందరినీ బయటకు తీయాలి.
వరదానము:-
మీ శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ యొక్క
సర్టిఫికెట్ ను ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసీ భవ
విశ్వానికి లైట్ మరియు మైట్ ల వరదానమిచ్చేందుకు
అమృతవేళ స్మృతి యొక్క స్వ అభ్యాసము ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేయండి,
అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తిస్తుంది. చివరి సమయంలో మనసా సేవ
ద్వారానే దృష్టితో తృప్తి పరిచే, మీ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే
సేవ చేయాలి. మీ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థంగా చేయాలి. ఎప్పుడైతే ఈ
విధంగా లైట్ మైట్ ను ఇచ్చే అభ్యాసముంటుందో, అప్పుడు నిర్విఘ్న వాయుమండలం
తయారవుతుంది మరియు ఈ కోట దృఢంగా ఉంటుంది.
స్లోగన్:-
ఎవరైతే మనసా-వాచా-కర్మణా, మూడు సేవలను కలిపి
చేస్తారో వారే తెలివైనవారు.
|
|