22-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 21-01-87


‘‘స్వరాజ్య అధికారియే విశ్వరాజ్య అధికారి’’

ఈరోజు భాగ్యవిధాత బాబా తమ సర్వ శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా ఎదురుగా ఇప్పుడు కూడా కేవలము ఈ సంగఠన మాత్రమే కాదు, కానీ నలువైపుల యొక్క భాగ్యశాలి పిల్లలు ఎదురుగా ఉన్నారు. దేశ-విదేశములలో ఏ మూల ఉన్నాగానీ అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలను చూస్తున్నారు. ఈ సాకార వతనములో స్థానము యొక్క హద్దు ఉంటుంది, కానీ అనంతమైన తండ్రి దృష్టి యొక్క సృష్టి అనంతమైనది. బాబా దృష్టిలో సర్వ బ్రాహ్మణ ఆత్మల సృష్టి ఇమిడి ఉంది కనుక దృష్టి యొక్క సృష్టిలో సర్వులు సమ్ముఖంగా ఉన్నారు. భాగ్యశాలి పిల్లలందరినీ చూస్తూ-చూస్తూ భాగ్య విధాత అయిన భగవంతుడు సంతోషిస్తారు. ఏ విధంగా పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారో, అలా బాబా కూడా పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ విశ్వము ఎదురుగా విశేష ఆత్మల లిస్టులో ఉన్నారు అని అనంతమైన తండ్రికి పిల్లలను చూసి ఆత్మిక నషా మరియు ఆత్మిక గర్వము కలుగుతుంది. 16,000 మాలలోని చివరి పూస అయినా కూడా, బాబా ఎదురుగా రావటంతో, బాబాకు చెందినవారిగా అవ్వటంతో, విశ్వము ఎదురుగా విశేష ఆత్మలుగా ఉన్నారు, కనుక జ్ఞాన విస్తారము వేరే ఏమీ తెలుసుకోలేకపోయినాగానీ, 'బాబా' అన్న ఒక్క పదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి, మనస్ఫూర్తిగా ఇతరులకు వినిపించి విశేష ఆత్మగా అయిపోయారు, ప్రపంచము ఎదురుగా మహాన్ ఆత్మగా అయిపోయారు, ప్రపంచము ఎదురుగా మహానాత్మ స్వరూపములో గాయనయోగ్యముగా అయ్యారు. ఇంతటి శ్రేష్ఠమైన మరియు సహజమైన భాగ్యము ఉంది అని భావిస్తున్నారా? ఎందుకంటే బాబా అన్న మాట 'తాళంచెవి'. దేనికి? సర్వ ఖజానాలకు, శ్రేష్ఠ భాగ్యముకు. తాళంచెవి లభించింది కనుక భాగ్యము మరియు ఖజానా తప్పకుండా ప్రాప్తిస్తుంది. మరి మాతలు మరియు పాండవులు, అందరూ తాళంచెవిని పొందేందుకు అధికారులుగా అయ్యారా? తాళంచెవిని వాడటం వచ్చా లేక ఎప్పుడైనా తాళంచెవిని వాడటం రావడం లేదా? తాళంచెవిని వాడే విధి - మనసుతో తెలుసుకోవటము మరియు స్వీకరించటము. కేవలం నోటితో అన్నట్లయితే తాళంచెవి ఉన్నా కూడా అది పట్టదు. మనసుతో అన్నట్లయితే ఖజానాలు సదా హాజరు అవుతాయి. తరగని ఖజానాలు ఉన్నాయి కదా! తరగని ఖజానాలైన కారణంగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా, అందరూ అధికారులే. తెరిచియున్న ఖజానాలు, నిండు ఖజానాలు. వెనుక వచ్చినవారికి ఖజానాలు సమాప్తమైపోవటము అనేది ఉండదు. ఇప్పటివరకు ఎంతమందైతే వచ్చారో అనగా బాబాకు చెందినవారిగా అయ్యారో మరియు భవిష్యత్తులో కూడా ఎంతమందైతే బాబాకు చెందినవారిగా అయ్యేవారు ఉన్నారో, వారందరికన్నా కూడా ఖజానాలు అనేకానేక రెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఎవరు ఎంత ఖజానాను తీసుకోవాలనుకుంటే అంత నిస్సంకోచంగా తీసుకోండి అని బాప్ దాదా పిల్లలందరికీ గోల్డెన్ ఛాన్సును ఇస్తున్నారు. దాతవద్ద లోటు లేదు, తీసుకునేవారి ధైర్యము మరియు పురుషార్థముపై ఆధారపడి ఉంది. ఇంతమంది పిల్లలు ఉన్నారు మరియు పిల్లలు ప్రతి ఒక్కరూ భాగ్యవంతులు, ఇటువంటి తండ్రి మొత్తము కల్పములో ఉండరు. కనుకనే ఆత్మిక బాప్ దాదాకు ఆత్మిక నషా ఉంది అని వినిపించాము.

మధువనమునకు రావాలని, కలవాలని అందరికీ ఉన్న ఆశ పూర్తయ్యింది. భక్తిమార్గములోని యాత్రకంటే కూడా మధువనములో హాయిగా కూర్చునేందుకు, ఉండేందుకు స్థానమైతే దొరికింది కదా. మందిరాలలో అయితే నిలబడి-నిలబడి కేవలము దర్శనం చేసుకుంటారు. ఇక్కడైతే హాయిగా కూర్చున్నారు కదా. అక్కడైతే 'పరుగెత్తండి-పరుగెత్తండి', 'నడవండి-నడవండి' అని అంటారు, ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చోండి, హాయిగా స్మృతి యొక్క సంతోషముతో ఆనందాన్ని అనుభవం చెయ్యండి. సంగమయుగములో సంతోషంగా ఉండేందుకు వచ్చారు. మరి అన్ని వేళలా నడుస్తూ-తిరుగుతూ, తింటూ-త్రాగుతూ సంతోషపు ఖజానాను జమా చేసుకున్నారా? ఎంత జమా చేసుకున్నారు? 21 జన్మలు హాయిగా తింటూ ఉండేంతగా జమ చేసుకున్నారా? మధువనము విశేషంగా సర్వ ఖజానాలను జమా చేసుకునే స్థానము ఎందుకంటే ఇక్కడ 'ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు' - దీనిని సాకార రూపములో కూడా అనుభవము చేస్తారు. అక్కడ బుద్ధి ద్వారా అనుభవము చేస్తారు కానీ ఇక్కడ ప్రత్యక్ష సాకార జీవితములో కూడా బాబా మరియు బ్రాహ్మణ పరివారము తప్ప ఇంకెవరన్నా కనిపిస్తారా? ఒకటే లగనము, ఒకటే విషయాలు, ఒకటే పరివారము మరియు ఏకరస స్థితి, మరే ఇతర రసము (అభిరుచి) లేనే లేదు. చదువుకోవటము మరియు చదువు ద్వారా శక్తిశాలిగా అవ్వటము, మధువనములో ఇదే పని కదా. ఎన్ని క్లాసులు వింటారు? కనుక ఇక్కడ విశేషంగా జమా చేసుకునే సాధనము లభిస్తుంది, అందుకే అందరూ పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. సదా స్వరాజ్య అధికారి స్థితిలో ముందుకు వెళ్తూ ఉండండి అని బాప్ దాదా పిల్లలందరికీ విశేషంగా ఈ స్మృతినే కలిగిస్తారు. స్వరాజ్య అధికారి - విశ్వ రాజ్య అధికారులుగా అయ్యేందుకు గుర్తు ఇదే.

"మేము భవిష్యత్తులో ఏమవుతాము, రాజుగా అవుతామా లేక ప్రజలుగా అవుతామా?” అని చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తూ బాబాను అడుగుతారు. నేను రాజుగా అవుతానా లేక షావుకారుగా అవుతానా లేక ప్రజాగా అవుతానా అని మిమ్మల్ని మీరు ఒక్క రోజైనా చెక్ చేసుకున్నట్లయితే మీకే తెలిసిపోతుంది అని బాప్ దాదా పిల్లలకు రెస్పాంస్ ఇస్తారు. ముందుగా అమృతవేళ నుండి మీ ముఖ్యమైన మూడు కార్య వ్యవహారములకు అధికారులు, మీ సహయోగులు, సహచరులను చెక్ చేసుకోండి. అవి ఏవి? 1 - మనసు అనగా సంకల్ప శక్తి. 2 - బుద్ధి అనగా నిర్ణయ శక్తి. 3 - గతం మరియు వర్తమానం యొక్క శ్రేష్ఠ సంస్కారాలు. ఈ మూడు విశేష కార్య వ్యవహారములు చేసేవి. నేటి ప్రపంచంలో రాజుతోపాటు మహామంత్రి మరియు విశేష మంత్రులు ఉంటారు, వారి సహయోగముతో రాజ్య కార్య వ్యవహారములు జరుగుతాయి. సత్యయుగములో మంత్రులు ఉండరు కానీ సమీప సంబంధీకులు, సహచరులు ఉంటారు. ఏదో ఒక రూపంలో, సహచరులనుకోండి లేక మంత్రులు అనుకోండి. కానీ చెక్ చేసుకోండి - ఈ మూడూ స్వయము యొక్క అధికారముతో నడుస్తున్నాయా? ఈ మూడింటిపై స్వ-రాజ్యము ఉందా లేక వాటి అధికారముతో మీరు నడుస్తున్నారా? మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనసును నడిపిస్తున్నారా? ఏది అనుకుంటే అది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు, అలానే సంకల్పాలను చెయ్యగలరా? బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే, అక్కడ పెట్టగలరా లేక బుద్ధి రాజు అయిన మిమ్మల్ని భ్రమింపజేస్తుందా? సంస్కారాలు మీ వశంలో ఉన్నాయా లేక మీరు సంస్కారాలకు వశమయ్యారా? రాజ్యము అనగా అధికారము. రాజ్య అధికారి ఏ శక్తికి ఏ సమయములో ఏ ఆర్డర్ ఇస్తే, అది ఆ విధిపూర్వకంగా కార్యాన్ని చేస్తుందా లేక మీరు ఒకటి చెప్తే, అది ఇంకొకటి చేస్తుందా? ఎందుకంటే నిరంతర యోగిగా అనగా స్వరాజ్య అధికారిగా అయ్యేందుకు విశేష సాధనమే మనసు మరియు బుద్ధి. మంత్రమే మన్మనాభవ. యోగమును బుద్ధి యోగము అని అంటారు. ఒకవేళ విశేష ఆధార స్తంభాలైన ఇవి మీ అధికారములో లేనట్లయితే లేక ఒక్కోసారి ఉండి, ఒక్కోసారి లేనట్లయితే, ఇప్పుడిప్పుడే ఉండి-ఇప్పుడిప్పుడే లేనట్లయితే, మూడింటిలో ఏ ఒక్కటైనా కూడా తక్కువ అధికారములో ఉన్నట్లయితే, మేము రాజుగా అవుతామా లేక ప్రజాగా అవుతామా అని దీని ద్వారానే చెక్ చేసుకోండి. బహుకాలపు రాజ్య అధికారిగా అయ్యే సంస్కారము బహుకాలపు భవిష్య రాజ్య అధికారిగా చేస్తుంది. ఒకవేళ ఒక్కోసారి అధికారిగా ఉంటూ, ఒక్కోసారి వశమైనట్లయితే అర్థకల్పము అనగా పూర్తి రాజ్య భాగ్యపు అధికారమును ప్రాప్తి చేసుకోలేరు. అర్థకల్పము తరువాత త్రేతాయుగ రాజుగా అవ్వగలరు, అంతేకానీ మొత్తము సమయము రాజ్య అధికారిగా అనగా రాజ్యమును చేసే రాయల్ ఫ్యామిలీకి సమీప సంబంధములో ఉండలేరు. ఒకవేళ మాటిమాటికీ వశమవుతుంటే సంస్కారాలు అధికారివిగా ఉండవు, రాజ్య అధికారుల రాజ్యంలో ఉండేవారిగా ఉంటారు. వారు ఎవరు? వారు ప్రజలు. మరి రాజుగా ఎవరు అవుతారు, ప్రజలుగా ఎవరు అవుతారు అన్నది అర్థమైందా? మీ దర్పణములోనే మీ భాగ్యమునకు చెందిన ముఖాన్ని చూసుకోండి. ఈ జ్ఞానము అనగా నాలెడ్జ్, దర్పణము. మరి అందరివద్ద దర్పణము (అద్దము) ఉంది కదా! కావున మీ ముఖాన్ని చూసుకోగలరు కదా! ఇప్పుడు బహుకాలపు అధికారులుగా అయ్యేందుకు అభ్యాసము చెయ్యండి. అంతిమములో అయితే తయారైపోతాములే అని ఇలా కాదు. ఒకవేళ అంతిమములో తయారైనట్లయితే అంతిమములోని ఒక్క జన్మలో కాస్త రాజ్యము చేస్తారు. కానీ ఇది కూడా గుర్తుంచుకోండి - ఒకవేళ ఇప్పటి నుండే బహుకాలపు అభ్యాసము లేనట్లయితే లేక ఆది నుండి అభ్యాసకులుగా అవ్వనట్లయితే, ఆది నుండి ఇప్పటివరకు ఈ విశేష కార్యకర్తలు మిమ్మల్ని వాటి అధికారములో నడిపిస్తున్నట్లయితే లేక స్థితిని కదిలిస్తున్నట్లయితే అనగా మోసగిస్తున్నట్లయితే, దుఃఖపు అలను అనుభవము చేయిస్తున్నట్లయితే, ఇక అంతిమములో కూడా మోసమే జరుగుతుంది. మోసము అనగా తప్పకుండా దుఃఖపు అల వస్తుంది. అంతిమములో కూడా పశ్చాత్తాపముతో కూడిన దుఃఖపు అల వస్తుంది కనుక రాజుగా అవ్వండి మరియు మీ విశేష సహయోగీ కర్మచారులను లేక రాజ్య కార్య వ్యవహార సహచరులను మీ అధికారముతో నడిపించండి అని బాప్ దాదా పిల్లలందరికీ మళ్ళీ స్మృతిని కలిగిస్తున్నారు. అర్థమైందా?

ఎవరెవరు ఎంతగా స్వరాజ్య అధికారులుగా అయ్యారు అని బాప్ దాదా ఇదే చూస్తారు. అచ్ఛా. అందరూ ఏమి అవ్వాలనుకుంటున్నారు? రాజుగా అవ్వాలనుకుంటున్నారా? మరి ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారా లేక అవుతున్నాము, అయిపోతాములే అని అంటారా? 'లే-లే' అనకండి. 'అవుతాములే', అప్పుడు బాబా కూడా - అచ్ఛా, రాజ్య భాగ్యాన్ని ఇచ్చే విషయాన్ని కూడా చూద్దాములే అని అంటారు. ఇప్పటి నుండే బహుకాలపు సంస్కారాలు కావాలి అని వినిపించాము కదా! నిజానికి, ఇప్పుడు బహుకాలము లేదు, కొద్ది కాలమే ఉంది. అయినా కూడా ఇంత సమయము యొక్క అభ్యాసము కూడా లేనట్లయితే, మేమైతే చివరిలో అయిపోతామనే అనుకున్నాము అని ఫిర్యాదు చేయకండి. కనుకనే ఎప్పుడో కాదు, ఇప్పుడే అని చెప్పటం జరిగింది. ఎప్పుడో ఒకప్పుడు అయిపోతుంది అని కాదు, ఇప్పుడు జరగాల్సిందే, తయారవ్వాల్సిందే. మీపై మీరు రాజ్యము చెయ్యండి, మీ సహచరులపై రాజ్యము చెయ్యటమును ప్రారంభించకండి. ఎవరికైతే స్వయము పైన రాజ్యము ఉంటుందో, వారి ముందు ఇప్పుడు కూడా స్నేహము కారణంగా సహచరులందరూ కూడా, వారు లౌకికము వారైనా, అలౌకికము వారైనా, అందరూ 'జీహజూర్', 'హా-జీ' (సరేనండి) అని అంటూ సహచరులై ఉంటారు, స్నేహితులుగా, సహచరులుగా అయ్యి 'హా-జీ' పాఠాన్ని ప్రాక్టికల్ లో చూపిస్తారు. ఏ విధంగా ప్రజలు రాజుకు సహయోగులుగా ఉంటారో, స్నేహీగా ఉంటారో, అలా మీ ఈ సర్వకర్మేంద్రియాలు, విశేష శక్తులు సదా మీ స్నేహీగా, సహయోగులుగా ఉంటాయి మరియు దీని ప్రభావము సాకారములో మీ సేవా సహచరులపై మరియు లౌకిక సంబంధీకులు, సహచరులపై పడుతుంది. దైవీ పరివారములో అధికారులుగా అయ్యి ఆర్డర్ వేయడం అనేది నడవదు. స్వయం మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకున్నట్లయితే స్వతహాగానే మీరు ఆర్డర్ వేసేందుకు ముందే సహచరులందరూ మీ కార్యములో సహయోగులుగా అవుతారు. వారే స్వయంగా సహయోగులుగా అవుతారు, ఆర్డర్ చేసే అవసరము ఉండదు. స్వయమే తమ సహయోగమును ఆఫర్ చేస్తారు ఎందుకంటే మీరు స్వరాజ్య అధికారులు. రాజు అనగా దాత, దాతకు చెప్పాల్సిన పని ఉండదు అనగా అడగాల్సిన అవసరము ఉండదు. మరి ఇటువంటి స్వరాజ్య అధికారులుగా అవ్వండి. అచ్ఛా! ఈ మేళ కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. 'వాహ్ డ్రామా' అని అంటున్నారు కదా. వేరే వాళ్ళు ఒక్కోసారి 'అయ్యో, డ్రామా' అంటే, ఒక్కోసారి 'వాహ్ డ్రామా' అని అంటారు. కానీ మీరు ఎప్పుడూ ఏమని అంటారు? వాహ్ డ్రామా! వాహ్! ప్రాప్తి ఉన్న చోట, ఆ ప్రాప్తి ముందు ఏదీ కష్టమనిపించదు. మరి అలాగే, ఇంతటి శ్రేష్ఠమైన పరివారమును కలిసే ప్రాప్తి జరుగుతున్నప్పుడు ఏ కష్టమూ, కష్టమనిపించదు. కష్టమనిపిస్తుందా? భోజనం దగ్గర వెయిట్ చేయవలసి ఉంటుంది. తింటున్నా ప్రభు గుణ గానము చెయ్యండి మరియు క్యూలో నిలబడినా కూడా ప్రభు గుణ గానము చెయ్యండి. ఈ పనే చెయ్యాలి కదా. ఇది కూడా రిహార్సల్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా వృద్ధి అవుతుంది కదా. ఈ విధంగా స్వయమును మలచుకునే అలవాటు చేసుకోండి, సమయానుసారంగా మిమ్మల్ని మీరు నడిపించుకోగలగాలి. ఇప్పుడు నేలపై పడుకోవడం కూడా అలవాటు అయ్యింది కదా. మంచం దొరకలేదు కనుక నిద్ర పట్టలేదు అని ఇలా అయితే కాదు కదా. టెంట్ లో ఉండే అలవాటు కూడా అయ్యింది కదా. బాగా అనిపించిందా? చలి వెయ్యటంలేదు కదా? మరిప్పుడు మొత్తము ఆబూలో టెంట్లు వేద్దామా? టెంట్ లో పడుకోవడం బాగా అనిపించిందా లేక గది కావాలా? గుర్తుందా, మొదట్లో పాకిస్థాన్ లో ఉన్నప్పుడు మహారథులను కూడా నేలపైన పడుకోబెట్టేవారు! ప్రసిద్ధులైన మహారథులెవరైతే ఉండేవారో, వారికి హాల్లో నేలపై మూడడుగుల స్థలం ఇచ్చి పడుకోమనేవారు. మరియు ఇప్పుడు బ్రాహ్మణ పరివారము వృద్ధి అయినప్పుడు కూడా ఎక్కడి నుండి ప్రారంభించారు? టెంట్ నుండే ప్రారంభించారు కదా! మొట్టమొదట ఎవరైతే వెలువడ్డారో, వారు కూడా టెంట్ లోనే ఉండేవారు. టెంట్ లో ఉండేవారు సెయింట్ (మహాత్మ) గా అయిపోయారు. సాకార పాత్ర ఉన్నప్పుడు కూడా వాళ్ళు టెంట్ లోనే ఉండేవారు. మరి మీరు కూడా అనుభవము చేస్తారు కదా. మరి అందరూ అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారా? అచ్ఛా! అయితే మరో 10,000 మందిని పిలిచి వారికి టెంట్లను ఇద్దాము, ఏర్పాట్లు చేద్దాము. అందరూ స్నానం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు, అవి కూడా జరిగిపోతాయి. గుర్తుందా, ఈ హాల్ కట్టినప్పుడు అందరూ ఏమన్నారు? ఇంతమంది స్నానం చేసేందుకు స్థానం కోసం ఏమి చేద్దాము? ఆ లక్ష్యముతోనే దీనిని తయారుచేసారు, ఇప్పుడు తక్కువపడుతుంది కదా. ఎంతగా కడుతూ ఉంటారో, అంతగా తక్కువయ్యేదే ఉంది ఎందుకంటే చివరకు అనంతములోకే వెళ్ళాలి. అచ్ఛా!

అన్నివైపుల పిల్లలు చేరుకున్నారు. మరి ఇది కూడా అనంతమైన హాలుకు అలంకారమయ్యింది. క్రింద కూడా కూర్చున్నారు. (వేరు-వేరు స్థానాలలో మురళీ వింటున్నారు) ఇలా వృద్ధి జరగటం కూడా అదృష్టానికి గుర్తు. వృద్ధి అయితే జరిగింది కానీ విధిపూర్వకంగా నడుచుకోవాలి. ఇక్కడకు మధువనానికైతే వచ్చేసాము, బాబాను కూడా చూసాము, మధువనాన్ని కూడా చూసాము, ఇప్పుడు ఎలా కావాలనుకుంటే అలా నడుచుకోవచ్చు అని కాదు. అలా చెయ్యవద్దు ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే - మధువనానికి వచ్చేందుకు అవకాశము రానంతవరకు చాలా పక్కాగా ఉంటారు, ఇక మధువనాన్ని చూసేసిన తరువాత కాస్త నిర్లక్ష్యంగా అయిపోతారు. కనుక నిర్లక్ష్యంగా అవ్వవద్దు. బ్రాహ్మణులు అనగా బ్రాహ్మణ జీవితము, మరి జీవితము అనేది మీరు ఎప్పటివరకైతే ఉంటారో అప్పటివరకు ఉంటుంది. జీవితాన్ని తయారుచేసుకున్నారు కదా. జీవితాన్ని తయారుచేసుకున్నారా లేక కొద్ది సమయము కోసం బ్రాహ్మణులుగా అయ్యారా? సదా మీ బ్రాహ్మణ జీవిత విశేషతలను తోడుగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ విశేషతల ద్వారా వర్తమానము కూడా శ్రేష్ఠంగా ఉంటుంది మరియు భవిష్యత్తు కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. అచ్ఛా! ఇంకేమి మిగిలింది? టోలీ. (వరదానము) వరదానమేమిటంటే వరదాతకే పిల్లలుగా అయిపోయారు. వరదాతకే పిల్లలు అన్నప్పుడు, వారికి ప్రతి అడుగులోనూ వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి. వరదానాలే మీ పాలన. వరదానాల పాలనతోనే పాలింపబడుతున్నారు. లేదంటే ఆలోచించండి, ఇంత శ్రేష్ఠ ప్రాప్తి లభించింది, కానీ కష్టపడిందెంత! ఏ కష్టము లేకుండా లభించే ప్రాప్తిని, వరదానము అని అంటారు. కనుక శ్రమ ఎంత చేసారు కానీ ప్రాప్తి ఎంత శ్రేష్ఠమైనది! జన్మజన్మల ప్రాప్తికి అధికారులుగా అయ్యారు. కనుక ప్రతి అడుగులోనూ వరదాత యొక్క వరదానాలు లభిస్తూ ఉన్నాయి మరియు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాయి. దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధము ద్వారా వరదానాలే వరదానాలు. అచ్ఛా!

ఇప్పుడైతే గోల్డెన్ జూబ్లీని జరుపుకునేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ అనగా సదా గోల్డెన్ స్థితిలో స్థితులయ్యే జూబ్లీని జరుపుకుంటున్నారు. సదా రియల్ గోల్డ్, కొంచెము కూడా కల్తీ ఉండకూడదు. దీనినే గోల్డెన్ జూబ్లీ అని అంటారు. కనుక ప్రపంచము ఎదురుగా గోల్డెన్ స్థితిలో స్థితులై ఉండే సత్యమైన బంగారముగా ప్రత్యక్షమవ్వాలి, దీనికోసమే ఈ సేవా సాధనాలన్నీ తయారుచేస్తున్నారు ఎందుకంటే మీ గోల్డెన్ స్థితి గోల్డెన్ యుగాన్ని తీసుకువస్తుంది, స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు ప్రపంచము కాస్త మారాలి అన్న కోరిక అందరికీ ఉంది. కనుక మీరు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే విశేష ఆత్మలు. మిమ్మల్నందరినీ చూసి నిజంగా స్వర్ణిమ ప్రపంచము రానే వచ్చింది అని ఆత్మలకు నిశ్చయము, శుభ ఆశ, నమ్మకము కలగాలి. అవును, ఇది మంచి వస్తువు అని శ్యాంపుల్ ను చూస్తే నిశ్చయం కలుగుతుంది కదా. మరి మీరు స్వర్ణిమ ప్రపంచపు శ్యాంపుల్. స్వర్ణిమ స్థితి కలవారు. శ్యాంపుల్ తయారైందంటే తప్పకుండా అటువంటి ప్రపంచము రానే వస్తుంది అని శ్యాంపుల్ అయిన మిమ్మల్ని చూసి వారికి నిశ్చయము కలగాలి. గోల్డెన్ జూబ్లీలో ఇటువంటి సేవను చేస్తారు కదా. నిరాశావాదులకు ఆశను కలిగించేవారిగా అవ్వండి. అచ్ఛా!

సర్వస్వరాజ్య అధికారులకు, సర్వ బహుకాలపు అధికారమును ప్రాప్తి చేసుకునే అభ్యాసీ ఆత్మలకు, విశ్వములోని సర్వ విశేష ఆత్మలకు, వరదాతయొక్క వరదానాలతో పాలింపబడే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థ గమ్యమును చూపించే చైతన్య లైట్-మైట్ హౌస్ భవ

ఎటువంటి భ్రమిస్తున్న ఆత్మలకైనా యథార్థమైన గమ్య స్థానమును చూపించేందుకు చైతన్యమైన లైట్ మైట్ హౌస్ గా అవ్వండి. దీనికోసం రెండు విషయాలు ధ్యానములో ఉండాలి. ఒకటి - ప్రతి ఆత్మ యొక్క కోరికను గుర్తించాలి. ఏ విధంగా యోగ్యులైన డాక్టర్ నాడిని తెలుసుకోగలరో, అలా పరిశీలన శక్తిని సదా ఉపయోగించాలి. రెండు - సదా మీ వద్ద సర్వ ఖజానాల అనుభవమును నిలిపి ఉంచుకోవాలి. కేవలం వినిపించటమే కాదు, సర్వ సంబంధాల, సర్వ శక్తుల అనుభవమును చేయించాలి అన్న లక్ష్యమును సదా పెట్టుకోవాలి.

స్లోగన్:-

ఇతరులను కరెక్ట్ చేసేందుకు బదులుగా ఒక్క బాబాతో సరైన కనెక్షన్ను పెట్టుకోండి.