30-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీకు ఒక్క తండ్రి నుండి ఒకే మతము లభిస్తుంది, దానినే అద్వైత మతమని అంటారు, ఈ అద్వైత మతము ద్వారానే మీరు దేవతలుగా అవ్వాలి”

ప్రశ్న:-

మనుష్యులు ఈ భూల్-భులయ్యా ఆట (తికమక దారుల ఆట) లో అన్నిటికన్నా ముఖ్యమైన ఏ విషయాన్ని మర్చిపోయారు?

జవాబు:-

మన ఇల్లు ఎక్కడుందో, ఆ దారినే ఈ ఆటలోకి వచ్చి మర్చిపోయారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి మరియు ఎలా వెళ్ళాలి అనేదే తెలియదు. ఇప్పుడు మిమ్మల్నందరినీ తోడుగా తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. వాణి నుండి అతీతంగా మధురమైన ఇంటికి వెళ్ళడము ఇప్పుడు మీ పురుషార్థం.

గీతము:-

రాత్రి ప్రయాణికుడా అలసిపోకు...... (రాత్ కే రాహీ థక్ మత్ జానా......)

ఓంశాంతి. డ్రామా ప్లాన్ అనుసారంగా పాట అర్థాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇలాంటి కొన్ని పాటలు మనుష్యుల ద్వారా తయారు చేయబడ్డాయి, ఇవి మీకు సహాయం చేస్తాయి. మనమిప్పుడు దేవీ దేవతలుగా అవుతున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆ చదువు చదువుకునేవారు, మేము డాక్టరుగా, బ్యారిస్టరుగా అవుతున్నామని అంటారు. మనము కొత్త ప్రపంచము కొరకు దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఈ ఆలోచనలు కేవలం మీకు మాత్రమే వస్తాయి. కొత్త ప్రపంచమైన సత్యయుగాన్నే అమరలోకమని అంటారు. ఇప్పుడు సత్యయుగమూ లేదు, దేవతల రాజ్యమూ లేదు. ఇక్కడైతే అవి ఉండవు. ఈ చక్రములో తిరిగి ఇప్పుడు మనము కలియుగములో కూడా అంతిమానికి వచ్చి చేరుకున్నామని మీకు తెలుసు. ఇంకెవ్వరి బుద్ధిలోకి ఈ చక్రము రాదు. వారు సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. తప్పకుండా 5 వేల సంవత్సరాల తర్వాత చక్రము తిరుగుతూ ఉంటుందని పిల్లలైన మీకు నిశ్చయముంది. మనుష్యులు 84 జన్మలే తీసుకుంటారు, లెక్క ఉంది కదా. ఈ దేవీ దేవతా ధర్మాన్ని అద్వైత ధర్మమని కూడా అంటారు. అద్వైత శాస్త్రమును కూడా అంగీకరిస్తారు. అది కూడా ఒక్కటే, మిగిలినవి అనేక ధర్మాలు, శాస్త్రాలు కూడా అనేకమున్నాయి. మీరు ఒక్కరే. ఒక్కరి ద్వారా ఒకే మతము లభిస్తుంది. దీనినే అద్వైత మతమని అంటారు. ఈ అద్వైత మతము మీకు లభిస్తుంది. ఈ చదువు దేవీ దేవతలుగా అయ్యేందుకు ఉంది కదా, అందుకే బాబాను జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. కొత్త ప్రపంచము కోసం మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఈ విషయం మర్చిపోకూడదు. ఎప్పుడైనా స్కూలులో విద్యార్థులు టీచర్ను మర్చిపోతారా? లేదు. గృహస్థ వ్యవహారములో ఉండేవారు కూడా గొప్ప పొజిషన్ పొందేందుకు చదువుతారు. మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ, మీ ఉన్నతి కోసం చదువుకుంటారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని మనసులో ఉండాలి. శివబాబా కూడా తండ్రి, ప్రజాపిత బ్రహ్మా కూడా తండ్రి. ప్రజాపిత బ్రహ్మా, ఆదిదేవ్ అన్న పేర్లు ప్రసిద్ధమైనవి. వీరు కేవలం గతంలో ఉండేవారు. గాంధీ కూడా గతంలో ఉండేవారు కదా. వారిని బాపూజీ అని అంటారు కానీ అర్థము చేసుకోరు, ఏదో నామమాత్రంగా అంటూ ఉంటారు. ఈ శివబాబా సత్యాతి-సత్యమైన వారు, బ్రహ్మాబాబా కూడా సత్యాతి-సత్యమైన వారు, లౌకిక తండ్రి కూడా సత్యాతి-సత్యమైనవారే ఉంటారు. ఇక మేయర్ మొదలైనవారినైతే నామమాత్రంగా బాపూ (తండ్రి) అని అనేస్తారు. వారందరూ అర్టిఫీషియల్. వీరు రియల్. పరమాత్మ తండ్రి వచ్చి ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఆత్మలను తన వారిగా చేసుకుంటారు. వారికి తప్పకుండా చాలామంది పిల్లలుంటారు. అందరూ శివబాబా సంతానమే, వారిని అందరూ గుర్తు చేస్తారు. అయినా కొందరు వారిని కూడా నమ్మరు, పక్కా నాస్తికులుగా ఉంటారు - ఈ ప్రపంచము సంకల్పాలతో తయారయ్యిందని అంటారు. మేము చదువుకుంటున్నాము, చదివించేవారు శివబాబా అని బుద్ధిలో గుర్తుంచుకోండి అని ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తారు. ఇది రాత్రింబవళ్ళు గుర్తుండాలి. దీనినే మాయ పదే-పదే మరిపింపజేస్తుంది, అందుకే స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువు, ముగ్గురినీ మర్చిపోతారు. ముగ్గురూ ఒక్కరే, అయినా మర్చిపోతారు. ఇందులోనే రావణునితో యుద్ధము జరుగుతుంది. ఓ ఆత్మలూ, మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు అని బాబా అంటారు. శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు. పవిత్రత లేకుండా ఏ ఆత్మ పైన ఉండలేదు, అందుకే ఆత్మలన్నీ పతితపావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటాయి. అందరూ పతితంగా, తమోప్రధానంగా అయినప్పుడు తండ్రి వచ్చి, నేను మిమ్మల్ని సతోప్రధానంగా తయారుచేస్తానని అంటారు. మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అపవిత్ర ఆత్మలేవీ అక్కడ ఉండలేవు. అందరూ శిక్షలను అనుభవించి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. బ్రహ్మములో లీనమైపోయారు, ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని కొందరు అంటారు. ఇవన్నీ భక్తిమార్గము యొక్క అనేక అభిప్రాయాలు. మీది అద్వైత మతము. మనుష్యుల నుండి దేవతలుగా అయితే ఒక్క తండ్రి మాత్రమే తయారుచేయగలరు. కల్ప-కల్పము తండ్రి చదివించేందుకు వస్తారు. వారి పాత్ర కల్పక్రితము వలె యధావిధిగా నడుస్తుంది. ఇది అనాది తయారై-తయారవుతున్న డ్రామా కదా. సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, తర్వాత ఈ సంగమయుగము ఉంది. ముఖ్యమైన ధర్మాలు, దేవతా ధర్మము, ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, అంటే వీటిలో రాజ్యము నడుస్తుంది. బ్రాహ్మణుల రాజ్యము ఉండదు, కౌరవుల రాజ్యము కూడా ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు పదే-పదే అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. మీరు బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. మొట్టమొదట బ్రాహ్మణుల పిలక ఉంటుంది, బ్రహ్మా వంశావళి మొట్టమొదట మీరేనని బాబా చాలాసార్లు అర్థం చేయించారు. ఈ విషయాలు మీకు తెలుసు, తర్వాత భక్తిమార్గములో మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. ఇప్పుడు మళ్ళీ మనము పూజ్యులుగా అవుతున్నాము. ఆ బ్రాహ్మణులు గృహస్థులుగా ఉంటారు, సన్యాసులుగా ఉండరు. సన్యాసులు హఠయోగులు, ఇళ్ళు-వాకిళ్ళను వదలడం హఠమే కదా. హఠయోగులు కూడా అనేక రకాల యోగాలు నేర్పిస్తారు. జయపూర్ లో హఠయోగుల మ్యూజియం కూడా ఉంది. అక్కడ రాజయోగ చిత్రాలు లేవు. రాజయోగ చిత్రాలు ఇక్కడ దిల్వాడాలో ఉన్నాయి. వీరి మ్యూజియం లేదు. హఠయోగాల మ్యూజియంలు ఎన్ని ఉన్నాయి. రాజయోగ మందిరము ఇక్కడ భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది చైతన్యమైనది. మీరిక్కడ చైతన్యంలో కూర్చున్నారు. మనుష్యులకు స్వర్గము ఎక్కడ ఉందో ఏ మాత్రం తెలియదు. దిల్వాడా మందిరంలో క్రింద తపస్సులో కూర్చున్నారు, అది పూర్తి స్మృతి చిహ్నంగా ఉంది. తప్పకుండా స్వర్గాన్ని పైనే చూపించవలసి ఉంటుంది. మనుష్యులు స్వర్గము పైన ఉందని భావిస్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అర్థకల్పము తర్వాత స్వర్గము మళ్ళీ క్రిందకు వెళ్ళిపోతుంది, మళ్ళీ అర్థకల్పము స్వర్గము పైకి వస్తుంది. దీని ఆయుష్షు ఎంతో ఎవ్వరికీ తెలియదు. బాబా మీకు మొత్తం చక్రము గురించి అర్థము చేయించారు. మీరు జ్ఞానము తీసుకుని పైకి వెళ్తారు, చక్రము పూర్తవుతుంది, మళ్ళీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆ నాలెడ్జ్ చదివేటప్పుడు బుద్ధిలో పుస్తకాలు మొదలైనవన్నీ గుర్తుంటాయి కదా. ఇది కూడా చదువు. ఇది నిండుగా ఉండాలి, మర్చిపోకూడదు. ఈ చదువును చదువుకునేందుకు వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైనవారందరికీ హక్కు ఉంది. కేవలం అల్ఫ్ (పరమాత్మ)ను తెలుసుకోవాలి. అల్ఫ్ ను తెలుసుకున్నారంటే తండ్రి ఆస్తి కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. జంతువులకు కూడా పిల్లలు మొదలైనవన్నీ బుద్ధిలో ఉంటాయి. అడవిలోకి వెళ్ళినా ఇల్లు మరియు పిల్లలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాటంతటవే వెతుక్కుంటూ వచ్చేస్తాయి. పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు మీ ఇంటిని స్మృతి చేయండి అని ఇప్పుడు బాబా చెప్తారు. అక్కడ నుండే మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఆత్మకు ఇల్లు చాలా ప్రియమనిపిస్తుంది. ఎంతగా గుర్తు చేసుకుంటారు కానీ దారి మర్చిపోయారు. మేము చాలా దూరంగా ఉన్నామని మీ బుద్ధిలో ఉంది. కానీ అక్కడకు ఎలా వెళ్ళాలో, మనమెందుకు వెళ్ళలేమో ఏమీ తెలియదు, అందుకే తికమక దారుల ఆటను కూడా తయారుచేస్తారని బాబా చెప్పారు, ఇందలో ఎటు నుండి వెళ్ళినా ద్వారం మూసి ఉంటుంది. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని మీకిప్పుడు తెలుసు. ఈ మృత్యులోకము నుండి అందరూ వెళ్ళిపోతారు, ఇంతమంది మనుష్యులందరూ నంబరువారుగా ధర్మము అనుసారంగా మరియు పాత్ర అనుసారంగా వెళ్ళి ఉంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మనుష్యులు బ్రహ్మ తత్వములోకి వెళ్ళేందుకు ఎంతగా తల బాదుకుంటారు. వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏ శబ్దమూ ఉండదు. మనది ఆ మధురమైన ఇల్లు అని పిల్లలకు తెలుసు. తర్వాత దేవతలది మధురమైన రాజధాని, అద్వైత రాజధాని.

తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. జ్ఞానమంతా అర్థము చేయిస్తారు, దీని గురించే మళ్ళీ భక్తిలో శాస్త్రాలు మొదలైనవి కూర్చుని తయారుచేసారు, ఇప్పుడు మీరు ఆ శాస్త్రాలు మొదలైనవి చదవకూడదు. ఆ పాఠశాలలో వృద్ధులు మొదలైనవారు చదవుకోరు. ఇక్కడైతే అందరూ చదువుకుంటారు. పిల్లలైన మీరు అమరలోకములో దేవతలుగా అవుతారు, అక్కడ ఎవరూ ఎవరినీ నిందించే మాటలు మాట్లాడరు. స్వర్గము గతించిపోయింది, దానికి మహిమ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఎన్ని మందిరాలను తయారుచేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడు ఉండి వెళ్ళారు అని వారిని అడగండి. వారికేమీ తెలియదు. మనమిప్పుడు మన ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ఓం అర్థము వేరు మరియు సో హమ్ అర్థము వేరని పిల్లలకు అర్థం చేయించారు. కానీ వారు ఓమ్, సో హమ్ సో అర్థమును ఒకటిగా చేసేశారు. ఆత్మలైన మీరు శాంతిధామములో నివసించేవారు, తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. ఓమ్ అనగా నేను ఆత్మను. ఎంత తేడా ఉంది. వారు మళ్ళీ రెండిటినీ ఒక్కటిగా చేసేశారు. ఇవి బుద్ధితో అర్థము చేసుకునే విషయాలు. ఎవరైనా పూర్తిగా అర్థము చేసుకోకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు. సంపాదనలో ఎప్పుడూ కునికిపాట్లు పడరు. ఆ సంపాదన అల్పకాలము కోసమే ఉంటుంది. ఇదైతే అర్థకల్పము కోసం ఉంటుంది. కానీ బుద్ధి వేరే వైపు భ్రమిస్తుంది కావున అలసిపోతారు. ఆవలిస్తూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకుని కూర్చోకూడదు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ అని మీకు తెలుసు. కలియుగీ నరకవాసులైన మనుష్యులు చూడడంలో మరియు మీరు చూడడంలో కూడా రాత్రి-పగలుకున్నంత తేడా ఉంటుంది. ఆత్మలైన మనము తండ్రి ద్వారా చదువుకుంటున్నాము. ఇది ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. ఆత్మలైన మనము వింటున్నాము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి. మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. శివబాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, ఇందులో చాలా రిఫైన్ బుద్ధి కావాలి. బుద్ధిని రిఫైన్ గా చేసుకునేందుకు తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రి స్మృతి కలగేందుకు మరియు కల్పమంతా తెగిపోయిన సంబంధమును జోడించేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. అక్కడ ఉండేది ప్రారబ్ధము, సుఖమే సుఖము ఉంటుంది, దుఃఖము యొక్క మాటే ఉండదు. దానిని స్వర్గమని అంటారు. స్వర్గ రచయితయే స్వర్గానికి యజమానులుగా చేస్తారు. అటువంటి తండ్రిని కూడా ఎంతగా మర్చిపోతారు. తండ్రి వచ్చి పిల్లలను దత్తత తీసుకుంటారు. మార్వాడీలు ఎక్కువగా దత్తత తీసుకుంటారు, అప్పుడు - నేను షావుకారుల ఒడిలోకి వచ్చానని పిల్లలకు సంతోషముంటుంది కదా. షావుకారుల బిడ్డ పేదవారి వద్దకు ఎప్పుడూ వెళ్ళుడు. మీరు ప్రజాపిత బ్రహ్మా పిల్లలు కనుక తప్పకుండా ముఖవంశావళిగా ఉంటారు కదా. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు కుఖ వంశావళి. ఈ తేడా మీకు తెలుసు. మీరు అర్థము చేయించినప్పుడు వారు ముఖవంశావళిగా అవుతారు. ఇది దత్తత. స్త్రీని వీరు నా స్త్రీ అని భావిస్తారు. మరిప్పుడు స్త్రీ కుఖవంశావళినా లేక ముఖవంశావళినా? స్త్రీ అయితే ముఖవంశావళి. తర్వాత పిల్లలు జన్మించినప్పుడు, వారు కుఖవంశావళి. వీరంతా ముఖవంశావళి, నా వారు అనగానే నావారిగా అయిపోయారు కదా అని తండ్రి అంటారు. నా పిల్లలు, అని అనడం ద్వారా నషా ఎక్కుతుంది. కనుక వీరంతా ముఖవంశావళి, ఆత్మలు ముఖవంశావళి కాదు. ఆత్మ అనాది - అవినాశీ. ఈ మనుష్య సృష్టి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మీకు తెలుసు. పిల్లలకు పాయింట్లు అయితే చాలా లభిస్తాయి. అయినా బాబా అంటారు - వేరే ఏ ధారణ చేయలేకపోయినా, చెప్పడం రాకపోయినా సరే, ఫర్వాలేదు, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు భాషణ మొదలైనవి చేసేవారి కన్నా ఉన్నత పదవిని పొందగలరు. భాషణ చేసేవారు కొన్ని సందర్భాలలో తుఫానుల్లో పడిపోతారు. కానీ వారు పడకుండా, తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. అన్నిటికన్నా ఎక్కువగా వికారాలలో పడిపోయేవారు 5 అంతస్తుల నుండి పడిపోవడంతో ఎముకులు విరిగిపోతాయి. 5వ అంతస్తు - దేహాభిమానము. 4వ అంతస్తు కామము, తర్వాత మిగతావి. కామము మహాశత్రువు అని బాబా చెప్తున్నారు. బాబా, మేము పడిపోయామని కూడా వ్రాస్తారు. మేము పడిపోయామని క్రోధం కోసం అలా అనరు. నల్ల ముఖం చేసుకుంటే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, ఇక తర్వాత కామము మహాశత్రువని ఇతరులకు చెప్పలేరు. అపవిత్ర దృష్టిని చాలా సంభాళించుకోవాలని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. సత్యయుగంలో నగ్నంగా అయ్యే మాటే ఉండదు. వికారీ దృష్టి ఉండదు. పవిత్రమైన దృష్టి ఉంటుంది. అది సివిలియన్ రాజ్యం (పవిత్రుల రాజ్యం). ఈ సమయంలో క్రిమినల్ ప్రపంచము ఉంది. ఇప్పుడు మీ ఆత్మకు పవిత్రమైన దృష్టి లభిస్తుంది, అది 21 జన్మలు ఉపయోగపడుతుంది. అక్కడ ఎవ్వరూ వికారులుగా అవ్వరు. ఇప్పుడు తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు, తండ్రిని స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. శ్రీ నారాయణుడే అంతిమంలోకి వచ్చి భాగ్యశాలి రథంగా అవుతారు అనేది కూడా ఒక అద్భుతము. వీరిలో తండ్రి ప్రవేశిస్తారు కనుక భాగ్యశాలిగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా, ఈ 84 జన్మల చరిత్ర బుద్ధిలో ఉండాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని రిఫైన్ గా చేసుకోవాలి. బుద్ధి సదా చదువుతో నిండుగా ఉండాలి. తండ్రిని మరియు ఇంటిని సదా గుర్తుంచుకోవాలి మరియు ఇతరులకు స్మృతిని ఇప్పించాలి.

2. ఈ అంతిమ జన్మలో వికారీ దృష్టిని సమాప్తం చేసుకుని పవిత్రమైన దృష్టిని తయారుచేసుకోవాలి. వికారీ దృష్టిని చాలా సంభాళించుకోవాలి.

వరదానము:-

స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఎక్కేకళను అనుభవం చేసే రాజ్యాధికారి భవ

స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంటే ప్రతి అడుగులోనూ ఎక్కేకళను అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతి సంకల్పంలోనూ సేవ ఉంటే వ్యర్థము నుండి విడుదల అవుతారు. సేవ, జీవితంలో ఒక అంగముగా అయిపోవాలి, శరీరంలో ఏ విధముగా అన్ని అంగములు అవసరమో, అదే విధంగా బ్రాహ్మణ జీవితంలో విశేషమైన అంగము సేవ. చాలా సేవ చేసే అవకాశము లభించడం, స్థానం లభించడం, సాంగత్యం లభించడం, ఇవి కూడా భాగ్యానికి గుర్తులు. ఇలాంటి సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ తీసుకునేవారే రాజ్యాధికారులుగా అవుతారు.

స్లోగన్:-

పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపము - సహజయోగీ జీవితము.