ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలకు శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఈ సమయంలో మనుష్యులందరూ విశ్వములో శాంతిని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కూడా కోరుకుంటారు మరియు విశ్వములో కూడా శాంతిని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ మనసుకు శాంతి కావాలని అంటారు. ఇప్పుడది కూడా ఎక్కడ నుండి లభిస్తుంది. శాంతిసాగరుడు అయితే తండ్రి మాత్రమే, వారి నుండే వారసత్వము లభించగలదు. వ్యక్తిగతంగానూ లభిస్తుంది, హోల్ సేల్ గానూ లభిస్తుంది అనగా అందరికీ లభిస్తుంది. ఏ పిల్లలైతే చదువుకుంటారో, వారు మేము శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయము కూడా పురుషార్థము చేస్తాము మరియు ఇతరులకు కూడా మార్గాన్ని చెప్తామని అర్థము చేసుకుంటారు. వారసత్వము తీసుకునేందుకు ఎవరైనా వచ్చినా రాకపోయినా విశ్వములో శాంతి అయితే ఏర్పడాల్సిందే. పిల్లలందరికీ శాంతినివ్వడం పిల్లల బాధ్యత. ఇద్దరు-ముగ్గురికి వారసత్వము లభించినంత మాత్రన లాభమేముంటుంది అన్నది అర్థము చేసుకోరు. ఎవరో ఒకరికి మార్గము తెలియజేస్తారు, కానీ నిశ్చయము లేని కారణంగా ఇతరులను తమ సమానంగా తయారుచేయలేరు. తండ్రి నుండి మాకు వరము లభిస్తుందని నిశ్చయబుద్ధి కలవారు అర్థం చేసుకుంటారు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అని కూడా వరదానాలిస్తారు కదా. కేవలం అలా అనడం వల్ల ఆశీర్వాదము లభించదు. ఎవరైనా ఆశీర్వాదము అడిగితే, మీకు శాంతి కావాలంటే ఇటువంటి పురుషార్థము చేయండి అని అర్థం చేయించడం జరుగుతుంది. కష్టపడితే అన్నీ లభిస్తాయి. భక్తిమార్గంలో ఎన్ని ఆశీర్వాదాలను తీసుకుంటారు. తల్లి, తండ్రి, టీచర్, గురువు మొదలైనవారందరి నుండి - మేము సుఖ-శాంతులతో ఉండాలని కోరుకుంటారు. కానీ అలా ఉండలేరు ఎందుకంటే ఇంతమంది మనుష్యులున్నారు, వారికి సుఖ-శాంతులు ఎలా లభిస్తాయి. శాంతిదేవా అని కూడా పాడుతారు. ఓ పరమపిత పరమాత్మ, మాకు శాంతిని కానుకగా ఇవ్వండి అని బుద్ధిలోకి వస్తుంది. వాస్తవానికి కానుక అనేది తీసి ఇచ్చే వస్తువు. ఇది నీకు కానుక, బహుమతి అని అంటారు. ఎవరెన్ని కానుకలిచ్చినా, ధనము, ఇళ్ళు, వస్త్రాలు మొదలైనవాటినన్నింటినీ ఇచ్చినా, ఆ దాన-పుణ్యాలు అల్పకాలము కొరకే అని తండ్రి అంటారు. అవి మనుష్యులు మనుష్యులకిస్తారు. షావుకార్లు పేదవారికి లేదా షావుకార్లు, షావుకార్లకు ఇస్తూ వచ్చారు. కానీ ఇది స్థిరమైన సుఖము మరియు శాంతి. ఇక్కడ ఎవరూ ఒక జన్మ కోసం కూడా సుఖ-శాంతులనివ్వలేరు ఎందుకంటే వారి వద్ద లేనే లేవు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని సుఖము-శాంతి-పవిత్రతల సాగరుడని అంటారు. ఉన్నతాతి-ఉన్నతమైన భగవంతుని మహిమయే గాయనము చేయబడుతుంది. వారి నుండే శాంతి లభిస్తుందని భావిస్తారు. అయినా మళ్ళీ ఆ సాధు-సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్తారు ఎందుకంటే ఇది భక్తిమార్గము కదా, కావున వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అవన్నీ అల్పకాలిక పురుషార్థాలు. పిల్లలైన మీకిప్పుడు అవన్నీ సమాప్తమైపోతాయి. అనంతమైన తండ్రి నుండి 100 శాతము పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వాన్ని పొందవచ్చు అని కూడా మీరు రాస్తారు. ఇక్కడ 100 శాతము అపవిత్రత, దుఃఖము, అశాంతి ఉన్నాయి. కానీ మనుష్యులు అర్థము చేసుకోరు. ఋషులు-మునులు మొదలైనవారైతే పవిత్రంగా ఉన్నారు అని అంటారు. కానీ వారు కూడా విషము ద్వారానే జన్మ తీసుకున్నారు కదా. ఇదే ముఖ్యమైన విషయము. రావణరాజ్యంలో పవిత్రత ఉండదు. పవిత్రత-సుఖము మొదలైనవాటన్నిటి సాగరుడు తండ్రి ఒక్కరే.
మాకు శివబాబా నుండి 21 జన్మలు అనగా అర్థకల్పము 2500 సంవత్సరాలకు వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. ఇది గ్యారెంటీ. అర్థకల్పము సుఖధామము, అర్థకల్పము దుఃఖధామము. సృష్టిలో రెండు భాగాలున్నాయి - ఒకటి కొత్తది, మరొకటి పాతది. కానీ కొత్తదిగా ఎప్పుడుంటుంది, పాతదిగా ఎప్పుడవుతుంది అనేది కూడా తెలియదు. వృక్షము ఆయుష్షు అంత ఏక్యురేట్ గా చెప్పలేరు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఈ వృక్షము గురించి తెలుసుకున్నారు. ఇది 5 వేల సంవత్సరాల పాత వృక్షము, దీని ఏక్యురేట్ ఆయుష్షు గురించి మీకు తెలుసు, ఇతర వృక్షాల ఆయుష్షు గురించి ఎవ్వరికీ తెలియదు, సుమారుగా చెప్తారు. తుఫాను వచ్చి, వృక్షము పడిపోయిందంటే, దాని ఆయుష్షు సమాప్తమైపోతుంది. మనుష్యులు కూడా అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఈ అనంతమైన వృక్షం యొక్క ఆయుష్షు పూర్తిగా 5 వేల సంవత్సరాలు. ఇందులో ఒక్క రోజు కూడా ఎక్కువ లేదా తక్కువ అయ్యే అవకాశము లేదు. ఇది తయారై-తయారవుతున్న వృక్షము. ఇందులో తేడా వచ్చే అవకాశము లేదు. డ్రామాలోని ఏ సీన్ ఏ సమయంలో జరగాలో, ఆ సమయంలోనే జరుగుతుంది. యధావిధిగా పునరావృతమవుతుంది. ఆయుష్షు కూడా ఏక్యురేట్ గా ఉంది. కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు తండ్రి కూడా రావలసి ఉంటుంది. ఏక్యురేట్ సమయానికి వస్తారు. అందులో ఒక్క సెకెండు కూడా తేడా ఉండదు. ఇప్పుడు మీ బుద్ధి అనంతమైనదిగా అయింది. మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. పూర్తి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ప్రవేశిస్తారు, కనుక శివరాత్రి అని అంటారు. కృష్ణుని కొరకు జన్మాష్టమి అని అంటారు. శివుని జన్మాష్టమి అని అనరు, శివుని రాత్రి అని అంటారు ఎందుకంటే జన్మ జరిగితే మళ్ళీ మరణించవలసి ఉంటుంది. మనుష్యుల విషయంలో జన్మదినమని అంటారు. శివుని విషయంలో ఎప్పుడూ శివరాత్రి అని అంటారు. ప్రపంచములోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. శివుని విషయంలో శివరాత్రి అని ఎందుకంటారో, జన్మాష్టమి అని ఎందుకనరో మీకు తెలుసు. వారి జన్మ దివ్యమైనది, అలౌకికమైనది, ఇంకెవ్వరికీ ఇటువంటి జన్మ ఉండదు. శివబాబా ఎప్పుడు, ఎలా వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రి అర్థమేమిటి అనేది మీకు మాత్రమే తెలుసు. ఇది అనంతమైన రాత్రి. భక్తి యొక్క రాత్రి పూర్తయి పగలు వస్తుంది. బ్రహ్మా రాత్రి మరియు పగలు అంటే అది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. ఒక్క బ్రహ్మా ఆట మాత్రమే జరగదు కదా. ఇప్పుడు పగలు ప్రారంభమవుతుందని మీకు తెలుసు. చదువుకుంటూ-చదువుకుంటూ తమ ఇంటికి చేరుకుంటారు, మళ్ళీ పగలులోకి వస్తారు. అర్థకల్పము పగలు మరియు అర్థకల్పము రాత్రి అని గాయనం చేయబడుతుంది కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. వారు కలియుగము ఆయుష్షు ఇంకా 40 వేల సంవత్సరాలుందని, సత్యయుగం ఆయుష్షు లక్షల సంవత్సరాలని చెప్తారు, అప్పుడు సగం-సగం యొక్క లెక్క వీలు కాదు. కల్పము ఆయుష్షు గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ సృష్టి, చక్రములో తిరుగుతూ ఉంటుంది. విశ్వము అలాగే ఉంటుంది, అందులో పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ మనుష్యులు ఈ రాకపోకలేమిటి అని విసిగిపోతారు. ఒకవేళ 84 లక్షల జన్మల రాకపోకలు అయ్యి ఉంటే ఇక ఏమైపోతుందో తెలియదు. తెలియని కారణంగా కల్పము ఆయుష్షును కూడా పెంచేసారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో చదువుకుంటున్నారు. మేము ప్రాక్టికల్ గా కూర్చున్నామని మీకు అనిపిస్తుంది. పురుషోత్తమ సంగమయుగము కూడా తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు కనుక ఎంతగా పులకరించిపోవాలి. మీరే కల్ప-కల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు అనగా మాయపై విజయాన్ని పొందుతారు, మళ్ళీ ఓడిపోతారు. ఇది అనంతమైన ఓటమి మరియు గెలుపు. ఆ రాజులకైతే గెలుపు-ఓటములు చాలా జరుగుతూ ఉంటాయి. అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చిన్న యుద్ధము జరిగితే, మేము గెలిచామని అంటారు. కానీ ఏం గెలిచారు? చిన్న ముక్కను గెలిచారు. పెద్ద యుద్ధములో ఓడిపోతే వారు తమ జెండాను కిందపడేస్తారు. మొట్టమొదట ఒక రాజు ఉంటారు, తర్వాత ఇంకా-ఇంకా వృద్ధిని పొందుతూ ఉంటారు. మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది, తర్వాత ఇతర రాజులు రావడం ప్రారంభమయింది. ఏ విధంగా పోప్ విషయంలో చూపిస్తారు, ప్రారంభంలో ఒకరే ఉండేవారు, తర్వాత నెంబరువారుగా ఇతర పోపులు కూడా వస్తూ ఉన్నారు. మృత్యువును గురించి ఎవ్వరికీ తెలియదు కదా.
బాబా మమ్మల్ని అమరులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు అమరపురికి యజమానులుగా చేస్తున్నారు, మరి ఎంత సంతోషముండాలి. ఇది మృత్యులోకము. అది అమరలోకము. ఈ విషయాలను కొత్తవారు ఎవరూ అర్థము చేసుకోలేరు. పాతవారికి కలిగే ఆనందము కొత్తవారికి కలగదు. రోజు-రోజుకూ వృద్ధి చెందుతూ ఉంటారు. నిశ్చయము పక్కా అవుతూ ఉంటుంది. ఇందులో చాలా సహనశీలత కూడా ఉండాలి. ఇది ఆసురీ ప్రపంచము, దుఃఖమునివ్వడంలో ఆలస్యం చేయరు. ఇప్పుడు మేము బాబా శ్రీమతముపై నడుస్తున్నాము అని మీ ఆత్మ చెప్తుంది. మనము సంగమయుగములో ఉన్నాము. మిగిలినవారందరూ కలియుగములో ఉన్నారు. ఇప్పుడు మనము పురుషోత్తములుగా అవుతున్నాము. పురుషులలో ఉత్తమ పురుషులుగా చదువు ద్వారానే అవుతారు. చదువు ద్వారానే ఛీఫ్ జస్టిస్ మొదలైనవారిగా అవుతారు కదా. మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మీరు మీ పురుషార్థానుసారముగా పదవిని పొందుతారు. ఎవరెంత చదువుకుంటారో అంత గ్రేడ్ లభిస్తుంది. ఇందులో రాజ్యం యొక్క గ్రేడ్ ఉంది. ఆ చదువులో ఈ విధంగా రాజ్యం యొక్క గ్రేడ్ ఉండదు. మేము రాజులకే రాజుగా అవుతున్నామని మీకు తెలుసు. మరి లోలోపల ఎంత సంతోషముండాలి. మనము డబల్ కిరీటధారులుగా, చాలా ఉన్నతంగా అవుతాము. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. నిరాకార తండ్రి ఎలా వచ్చి చదివిస్తారు అనేది ఎవ్వరూ ఎప్పుడూ అర్థము చేసుకోలేరు. ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మనుష్యులు పిలుస్తారు కూడా. అయినా పావనంగా అవ్వరు. కామము మహాశత్రువు అని తండ్రి చెప్తారు. ఒకవైపు మీరు పతితపావనా రండి అని పిలుస్తారు, ఇప్పుడు నేను వచ్చి పిల్లలూ, పతితత్వాన్ని వదిలేయండి అని చెప్తున్నాను, అయినా మీరెందుకు వదిలడం లేదు. ఒకవైపు తండ్రి మిమ్మల్ని పావనంగా చేస్తూ ఉంటే, ఇంకొకవైపు మీరు పతితంగా అవుతూ ఉండడం చెయ్యకూడదు కదా. చాలామంది ఇలా పతితంగా అవుతూ ఉంటారు. బాబా, ఈ పొరపాటు జరిగింది అని కొందరు సత్యము చెప్తారు. ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే వెంటనే చెప్పమని తండ్రి చెప్తారు. కొందరు సత్యము చెప్తారు, కొందరు అసత్యము చెప్తారు. ఎవరు అడుగుతారు? నేనేమీ ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చుని తెలుసుకోను, ఇలా జరగదు. నేను కేవలం సలహానిచ్చేందుకు మాత్రమే వస్తాను. పావనంగా అవ్వకపోతే మీకే నష్టము. కష్టపడి పావనంగా అయ్యి, మళ్ళీ పతితంగా అయినట్లయితే, చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. స్వయం మేమే పతితంగా అయ్యాము, ఇక ఇతరులకు పావనంగా అవ్వమని ఎలా చెప్తాము అని సిగ్గు అనిపిస్తుంది. నేను ఆజ్ఞను ఎంతగా ఉల్లంఘించాను అని లోపల మనసు తింటుంది. ఇక్కడ మీరు తండ్రితో డైరెక్ట్ గా ప్రతిజ్ఞ చేస్తారు, బాబా మనల్ని సుఖధామము-శాంతిధామములకు యజమానులుగా చేస్తున్నారని మీకు తెలుసు. వారు మన వద్ద హాజరై ఉన్నారు, మనము వారి సన్ముఖంలో కూర్చున్నాము. వీరిలో ఇంతకుముందు ఈ జ్ఞానము లేదు. జ్ఞానమునిచ్చే గురువు కూడా ఎవ్వరూ లేరు. ఒకవేళ గురువు ఉన్నట్లయితే, వారేమైనా ఒక్కరికే జ్ఞానమిస్తారా. గురువులకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కదా! ఒక్కరే ఉండరు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు కదా. సద్గురువు ఒక్కరే. వారు మనకు మార్గాన్ని తెలియజేస్తారు, మనము ఇతరులకు తెలియజేస్తాము. మీరు అందరికీ తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. అంతే, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని స్మృతి చేస్తేనే ఉన్నత పదవి లభిస్తుంది. మీరు రాజులకే రాజుగా అవుతారు. మీ వద్ద లెక్కలేనంత ధనము ఉంటుంది. మీరు మీ జోలెను నింపుకుంటారు కదా. బాబా మన జోలెను పూర్తిగా నింపుతున్నారని మీకు తెలుసు. కుబేరుని వద్ద చాలా ధనముండేదని అంటారు. వాస్తవానికి మీరందరూ కుబేరులే. మీకు వైకుంఠం రూపీ ఖజానా లభిస్తుంది. ఖుదా దోస్త్ కథ కూడా ఉంది. ఆ కథలో అతనిని ఎవరైతే మొట్టమొదట కలుస్తారో, అతడికి ఒక రోజు కొరకు రాజ్యాధికారం ఇచ్చేవారు. ఇవన్నీ ఉదాహరణలు. అల్లాహ్ అనగా తండ్రి, వారు అవల్దీన్ ను రచిస్తారు. ఆ తర్వాత సాక్షాత్కారము జరుగుతుంది. మనము తప్పకుండా యోగబలము ద్వారానే విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ ఆసురీ ప్రపంచములో చాలా-చాలా సహనశీలులుగా అయి ఉండాలి. ఎవరైనా నిందించినా, దుఃఖమునిచ్చినా కూడా సహనం చేయాలి. తండ్రి శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు.
2. డైరెక్ట్ తండ్రియే పావనంగా తయారవ్వమని ఆజ్ఞనిచ్చారు కావున ఎప్పుడూ పతితంగా అవ్వకూడదు. ఎప్పుడైనా ఏదైనా పాపము జరిగితే దానిని దాచిపెట్టకూడదు.