26-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మేము సంగమయుగ బ్రాహ్మణులమనే నషాలో సదా ఉండండి, ఏ తండ్రినైతే అందరూ పిలుస్తూ ఉన్నారో, వారు మన సన్ముఖంలో ఉన్నారని మనకు తెలుసు"

ప్రశ్న:-

ఏ పిల్లల బుద్ధియోగం సరిగ్గా ఉంటుందో, వారికి ఎటువంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి?

జవాబు:-

సత్యయుగ కొత్త రాజధానిలో ఏమేముంటాయో, ఏ విధంగా మనం పాఠశాలలో చదువుకుంటామో, మళ్ళీ రాజ్యం ఎలా చేస్తామో, ఈ సాక్షాత్కారాలన్నీ సమీపంగా వచ్చే కొద్దీ మీకు కలుగుతూ ఉంటాయి. కానీ ఎవరి బుద్ధియోగమైతే బాగుంటుందో, ఎవరైతే తమ శాంతిధామం మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారో, వ్యాపార వ్యవహారాలు చేస్తున్నా కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉంటారో, వారికే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి.

గీతము:-

ఓం నమఃశ్శివాయ.....

ఓం శాంతి. భక్తిమార్గంలో గల సత్సంగాలకు అందరూ వెళ్ళే ఉంటారు. అక్కడ అందరూ వాహ్ గురూ అని కాని లేక రామ నామమును కాని పలకమని చెప్తారు. ఇక్కడ పిల్లలకు ఏమీ చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. ఒక్కసారి చెప్పేసారు, పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. తండ్రి కూడా ఒక్కరే, వారు చెప్పేది కూడా ఒక్కటే. ఏం చెప్తారు? పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. మొదట నేర్చుకుని తర్వాత ఇక్కడకు వచ్చి కూర్చున్నారు. ఏ తండ్రికైతే మనం పిల్లలమో వారిని స్మృతి చేయాలి. ఆత్మలైన మనందరి తండ్రి వారొక్కరే అని కూడా మీరిప్పుడు బ్రహ్మా ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచంలోని వారికిది తెలియదు. మనమంతా ఆ తండ్రి పిల్లలమే అని మీకు తెలుసు, వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. మిమ్మల్ని చదివించేందుకు నేను ఈ సాధారణ శరీరంలో వస్తానని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. బాబా వీరిలో వచ్చారు, మనం బాబాకు చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. తండ్రే వచ్చి పతితం నుండి పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. ఇది రోజంతా బుద్ధిలో ఉంటుంది. నిజానికి అందరూ శివబాబా సంతానమే కాని వారి గురించి మీకు తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. మనం ఆత్మలము, నన్ను స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞాపించారని పిల్లలైన మీకు తెలుసు. నేను మీ అనంతమైన తండ్రిని. పతిత-పావనా రండి, మేము పతితంగా అయ్యామని అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అలా ఈ దేహం అనదు. ఆత్మ ఈ శరీరం ద్వారా అంటుంది. 84 జన్మలు తీసుకునేది కూడా ఆత్మనే కదా. మనం పాత్రధారులమని బుద్ధిలో ఉండాలి. బాబా ఇప్పుడు మనల్ని త్రికాలదర్శులుగా తయారుచేసారు. ఆది-మధ్య-అంత్యముల జ్ఞానాన్నిచ్చారు. అందరూ తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు కూడా వారు పిలుస్తూనే ఉన్నారు, పిలుస్తూనే ఉంటారు కాని సంగమయుగంలోని బ్రాహ్మణులైన మీరు తండ్రి వచ్చేసారని అంటారు. ఈ సంగమయుగం గురించి కూడా మీకు తెలుసు, దీనిని పురుషోత్తమ యుగమని గాయనం చేస్తారు. కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యన పురుషోత్తమ యుగముంటుంది. సత్యయుగంలో సత్యమైన పురుషులు, కలియుగంలో అసత్యమైన పురుషులు ఉంటారు. ఎవరైతే సత్యయుగంలో ఉండి వెళ్ళిపోయారో, వారి చిత్రాలు ఉన్నాయి. అన్నిటికంటే పురాతనమైనవి ఈ చిత్రాలు, ఇంతకంటే పాత చిత్రాలేవీ ఉండవు. చాలామంది మనుష్యులు కూర్చుని అనవసరమైన చిత్రాలను తయారుచేస్తారు. ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారో మీకు తెలుసు. ఎలాగైతే కింద అంబ చిత్రాన్ని తయారుచేసారు మరియు కాళీ చిత్రం ఉన్నది, కాని అటువంటి భుజాలు కలిగిన వారెవ్వరూ ఉండరు. అంబకు కూడా రెండు భుజాలే ఉంటాయి కదా. మనుష్యులు వెళ్ళి చేతులు జోడించి పూజలు చేస్తారు. భక్తిమార్గంలో అనేక రకాల చిత్రాలు తయారుచేసారు. మనుష్యులకే రకరకాల అలంకారాలు చేస్తే రూపం మారిపోతుంది. వాస్తవానికి ఈ చిత్రాలు మొదలైనవేవీ లేవు. ఇవన్నీ భక్తిమార్గానికి సంబంధించినవి. ఇక్కడ మనుష్యులు కుంటివారు, గ్రుడ్డివారుగా వెలువడుతూ ఉంటారు. సత్యయుగంలో అటువంటి వారుండరు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేదని కూడా మీకు తెలుసు. ఇక్కడ డ్రస్సులు చూడండి, ప్రతి ఒక్కరికీ తమ-తమ వెరైటీలు ఎన్ని ఉన్నాయి. అక్కడైతే యథా రాజా రాణి తథా ప్రజా ఉంటారు. ఎంతగా సమీపంగా వెళ్తూ ఉంటారో అంతగా మీకు మీ రాజధానిలోని డ్రస్సు మొదలైనవి కూడా సాక్షాత్కారమవుతూ ఉంటాయి. మేము ఇటువంటి పాఠశాలలో చదువుకుంటాము, ఈ పనులు చేస్తామని చూస్తూ ఉంటారు. ఎవరి బుద్ధియోగమైతే బాగుంటుందో వారు చూస్తారు. తమ శాంతిధామం-సుఖధామాన్ని స్మృతి చేస్తారు. వ్యాపార వ్యవహారాలైతే చేసుకోవాల్సిందే. భక్తి మార్గంలో కూడా వ్యాపారాలు మొదలైనవైతే చేసుకుంటారు కదా. ఏమాత్రం జ్ఞానముండేది కాదు. అదంతా భక్తి. దాన్ని భక్తికి సంబంధించిన జ్ఞానమని అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారన్న ఈ జ్ఞానం వారు ఇవ్వలేరు. ఇప్పుడు మీరిక్కడ చదువుకుని భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ చదువు కొత్త ప్రపంచం, అమరలోకం కోసమే ఉందని మీకు తెలుసు. అంతేకాని అమరనాథ్ లో శంకరుడు పార్వతికి అమరకథను వినిపించలేదు. వారు శివ-శంకరులను కలిపేసారు.

ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు, వీరు కూడా వింటారు. తండ్రి తప్ప సృష్టి ఆది-మధ్య-అంత్యముల రహస్యమును ఎవరు అర్థం చేయించగలరు. వీరు ఏ సాధు-సత్పురుషులు మొదలైనవారు కాదు. మీరు ఎలాగైతే గృహస్థ వ్యవహారంలో ఉండేవారో, అలాగే వీరు కూడా ఉండేవారు. డ్రస్సు మొదలైనవన్నీ అప్పటివే. ఎలాగైతే ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారో, ఇది కూడా అలాగే, తేడా ఏమీ లేదు. తండ్రి ఈ రథంపై స్వారీ చేస్తూ పిల్లల వద్దకు వచ్చారు. ఇది భాగ్యశాలి రథమని మహిమ చేయబడుతుంది. అప్పుడప్పుడు ఎద్దుపై కూడా స్వారీ చూపిస్తారు. మనుష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మందిరంలో ఎప్పుడైనా ఎద్దులు ఉంటాయా? కృష్ణుడైతే రాకుమారుడు, వారు ఎద్దుపైన కూర్చోరు. భక్తిమార్గంలో మనుష్యులు చాలా తికమకపడిపోయారు. మనుష్యులకు భక్తిమార్గపు నషా ఉంటుంది. మీకు జ్ఞానమార్గపు నషా ఉంది. ఈ సంగమయుగంలో బాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీరు చెప్తారు. మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు కాని బుద్ధి ద్వారా బ్రాహ్మణులైన మేము సంగమయుగంలో ఉన్నామని భావిస్తారు. మిగిలిన మనుష్యులందరూ కలియుగంలో ఉన్నారు. ఇవి అనుభవయుక్తమైన విషయాలు. మేము కలియుగం నుండి బయటకు వచ్చేసామని బుద్ధి చెప్తుంది. బాబా వచ్చి ఉన్నారు. ఈ పాత ప్రపంచమే పరివర్తన అవ్వనున్నది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి, ఇతరులెవ్వరికీ తెలియదు. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే పరివారానికి చెందినవారు, అయినా అందులో తండ్రి నేను సంగమయుగంలో ఉన్నానని అంటే, కొడుకు కాదు, నేను కలియుగంలో ఉన్నానని అంటారు. ఇది ఆశ్చర్యం కదా! ఇప్పుడు మన చదువు పూర్తయితే వినాశనమవుతుందని పిల్లలకు తెలుసు. వినాశనం జరగడం తప్పనిసరి. మీలో కూడా కొంతమందికి తెలుసు, ప్రపంచం వినాశనమవుతుందని అర్థం చేసుకుంటే కొత్త ప్రపంచం కొరకు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమైపోతారు. బ్యాగ్-బ్యాగేజీని రెడీ చేసుకుంటారు. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది, బాబాకు చెందినవారిగా అయిపోవాలి. ఆకలితో చనిపోవలసి వచ్చినా కూడా మొదట బాబా, ఆ తర్వాత పిల్లలు. ఇదైతే బాబా భండారా (వంటిల్లు). మీరు శివబాబా భండారా నుండి తింటారు. బ్రాహ్మణులు భోజనం తయారుచేస్తారు, అందుకే బ్రహ్మాభోజనమని అంటారు. పవిత్ర బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, వారు స్మృతిలో ఉంటూ తయారుచేస్తారు, బ్రాహ్మణులు తప్ప శివబాబా స్మృతిలో ఎవ్వరూ ఉండలేరు. ఆ బ్రాహ్మణులు శివబాబా స్మృతిలో ఉండరు. ఇది శివబాబా భండారా, ఇక్కడ బ్రాహ్మణులు భోజనం తయారుచేస్తారు. బ్రాహ్మణులు యోగంలో ఉంటారు. పవిత్రంగా ఉండనే ఉంటారు. మిగిలింది యోగం యొక్క విషయం. ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. వ్యర్థ ప్రలాపాలు పనికిరావు. నేను సంపూర్ణ యోగంలో ఉన్నాను లేక 80 శాతం యోగంలో ఉన్నానని ఎవరూ ఈ విధంగా చెప్పలేరు. జ్ఞానం కూడా కావాలి. పిల్లలైన మీలో ఎవరైతే తమ దృష్టితోనే ఇతరులను శాంతపరుస్తారో వారే యోగులు. ఇది కూడా శక్తియే. ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది, ఎప్పుడైతే మీరు అశరీరులుగా అయి తండ్రి స్మృతిలో ఉంటారో, అదే సత్యమైన స్మృతి. ఇది మళ్ళీ అభ్యాసం చేయాలి. ఎలాగైతే ఇక్కడ మీరు స్మృతిలో కూర్చుంటారు, ఈ అభ్యాసం చేయించబడుతుంది. అయినా కూడా అందరూ యోగంలో ఉండరు. బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతూ ఉంటుంది. అది మళ్ళీ నష్టం కలిగిస్తుంది. నేను డ్రిల్ టీచర్ అని భావించేవారినే ఇక్కడ గద్దెపై కూర్చోబెట్టాలి. తండ్రి స్మృతిలో ఎదురుగా కూర్చుంటారు. బుద్ధియోగం ఎటువైపుకూ వెళ్ళకూడదు. నిశ్శబ్దమైపోతుంది. మీరు అశరీరులుగా అయిపోతారు మరియు తండ్రి స్మృతిలో ఉంటారు. ఇది సత్యమైన స్మృతి. సన్యాసులు కూడా శాంతిగా కూర్చుంటారు, వారెవరి స్మృతిలో ఉంటారు? వారిదేమీ సత్యమైన స్మృతి కాదు. ఎవ్వరికీ లాభం కలిగించలేరు. వారు సృష్టిని శాంతపరచలేరు. తండ్రి గురించి తెలియనే తెలియదు. బ్రహ్మతత్వాన్నే భగవంతునిగా భావిస్తారు. అది కానే కాదు. నన్నొక్కరినే స్మృతి చేయమని ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. మనం 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. చంద్రునిలో కళలు తగ్గినట్లుగా ప్రతి జన్మలో కొద్ది-కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి. చూసేందుకు అంతగా తగ్గినట్లు కనిపించదు. ఇప్పుడు ఎవ్వరూ కూడా సంపూర్ణంగా అవ్వలేదు. మున్ముందు మీకు సాక్షాత్కారాలవుతాయి. ఆత్మ ఎంత చిన్నది. అది కూడా సాక్షాత్కారమవుతుంది. లేకపోతే వీరిలో లైట్ ఎక్కువగా ఉందని, వీరిలో తక్కువగా ఉందని పిల్లలెలా చెప్పగలరు. ఆత్మను దివ్యదృష్టితో మాత్రమే చూస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. నా చేతిలో ఏమీ లేదు. డ్రామా నాతో చేయిస్తుంది, ఇదంతా డ్రామానుసారంగా జరుగుతూ ఉంటుంది. భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయించబడినవి. క్షణక్షణము పాత్ర నడుస్తూ ఉంటుంది.

ఇప్పుడు తండ్రి పావనంగా ఎలా అవ్వాలో శిక్షణనిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయాలి. పతితమైపోయిన ఇంత చిన్న ఆత్మ మళ్ళీ పావనంగా అవ్వాలి. అద్భుతమైన విషయం కదా. దీన్ని ప్రకృతి అని అంటారు కదా. తండ్రి నుండి మీరు అన్నీ సహజ సిద్ధమైన విషయాలనే వింటారు. అన్నిటికంటే సహజ సిద్ధమైన విషయం - ఆత్మ మరియు పరమాత్మకు సంబంధించింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైనవారెవ్వరికీ కూడా తెలియదు. ఇంత చిన్న ఆత్మనే రాతిబుద్ధి కలదిగా అయ్యి మళ్ళీ పారసబుద్ధి కలదిగా అవుతుంది. ఆత్మనైన నేను రాతిబుద్ధి కలవాడిగా అయిపోయాను, ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మళ్ళీ పారసబుద్ధి కలవాడిగా అవుతున్నాను అన్న చింతనయే బుద్ధిలో నడుస్తూ ఉండాలి. లౌకికంలో తండ్రి కూడా పెద్దవారు, అలానే టీచర్, గురువు కూడా పెద్దవారే లభిస్తారు. ఇక్కడైతే ఒక్క బిందువే తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. కల్పమంతా దేహధారులను స్మృతి చేసారు. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. మీ బుద్ధిని ఎంత సూక్ష్మంగా తయారుచేస్తున్నారు. విశ్వానికి యజమానులుగా అవ్వడం - ఇదేమైనా చిన్న విషయమా! ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగానికి యజమానులుగా ఎలా అయ్యారని కూడా ఎవ్వరూ ఆలోచించరు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. కొత్తవారెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. మొదట స్థూలంగా అర్థం చేయించిన తర్వాత సూక్ష్మంగా అర్థం చేయించబడుతుంది. తండ్రి బిందువు, కాని వారు ఇంత పెద్ద-పెద్ద లింగ రూపాలను తయారుచేస్తారు. మనుష్యుల చిత్రాలు కూడా చాలా పెద్ద-పెద్దవి తయారుచేస్తారు. కాని అటువంటివారు ఉండరు. మనుష్యుల శరీరాలైతే ఇక్కడే ఉంటాయి. భక్తిమార్గంలో ఏమేమో తయారుచేసారు. మనుష్యులు ఎంత తికమక పడిపోయారు. ఏదైతే జరిగిందో ఆ విషయాలు మళ్ళీ జరుగుతాయని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. వీరికి కూడా బాబా శ్రీమతాన్నిచ్చి సాక్షాత్కారం చేయించారు కదా. నీకు నేను రాజ్యాన్నిస్తాను, ఇప్పుడిక ఈ సేవలో నిమగ్నమైపో, నీ వారసత్వం తీసుకునే పురుషార్థం చేయ్యి, ఇవన్నీ విడిచిపెట్టు అని అన్నారు. అలా వీరు నిమిత్తమయ్యారు. అందరూ అలా నిమిత్తమవ్వరు, ఎవరికైతే నషా ఎక్కిందో, వారు వచ్చి కూర్చున్నారు. మాకైతే రాజ్యం లభిస్తుంది. మరి ఈ చిల్లరపైసలు ఏం చేసుకుంటాము అని భావించారు. ఇప్పుడైతే తండ్రి పిల్లలతో పురుషార్థం చేయిస్తున్నారు, రాజధాని స్థాపన అవుతూ ఉంది, మేము లక్ష్మీ-నారాయణుల కంటే తక్కువగా అవ్వమని కూడా అంటారు. అయితే శ్రీమతాన్ని అనుసరించి చూపించండి. ఒట్టి మాటలు చెప్పకండి. పిల్లాపాపల సంగతి ఏమవుతుంది - అని బాబా ఏమన్నా అన్నారా. ఏక్సిడెంట్ లో అకస్మాత్తుగా ఎవరైనా మరణిస్తే ఎవరైనా ఆకలితో అలమటిస్తారా. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరో ఒకరు తినేందుకు ఇస్తారు. ఇక్కడ చూడండి, బాబా పాత కుటీరంలో ఉంటున్నారు. పిల్లలైన మీరు వచ్చి మహళ్ళలో ఉంటారు. పిల్లలూ, బాగా ఉండండి, తినండి, తాగండి అని తండ్రి అంటున్నారు. ఏమీ తీసుకురానివారికి కూడా అన్నీ బాగా లభిస్తాయి. ఈ బాబా కన్నా కూడా మంచి రీతిలో నివసిస్తారు. నేనైతే రమించే యోగిని, నేను వెళ్ళి ఎవరి కళ్యాణమునైనా చేయగలను అని శివబాబా అంటారు. జ్ఞానీ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారెప్పుడూ సాక్షాత్కారాలు మొదలైన విషయాలతో సంతోషపడిపోరు. యోగం తప్ప ఇంకేదీ ఉండదు. ఈ సాక్షాత్కారాల విషయాల్లో సంతోషిపడిపోకూడదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దృష్టితోనే ఎవరినైనా శాంతపరచగల యోగస్థితిని తయారుచేసుకోవాలి. పూర్తి నిశ్శబ్దత ఏర్పడాలి. దీని కొరకు అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి.

2. జ్ఞానపు సత్యమైన నషాలో ఉండేందుకు మేము సంగమయుగంలో ఉన్నాము, ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది, మేము మా ఇంటికి వెళ్తున్నాము అనే స్మృతి ఉండాలి. సదా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి, ఒట్టి మాటలు చెప్పకండి.

వరదానము:-

లక్ష్యం అనుసారంగా లక్షణాలను బ్యాలన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే తండ్రి సమాన సంపన్న భవ

పిల్లలకు విశ్వకళ్యాణం చేసే కోరిక కూడా ఉంది, అలానే తండ్రి సమానంగా అవ్వాలనే శ్రేష్ఠమైన కోరిక కూడా ఉంది, కాని లక్ష్యమనుసారంగా ఏ లక్షణాలైతే స్వయానికి లేక సర్వులకు కనిపించాలో, అందులో వ్యత్యాసముంది. కావున బ్యాలన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకొచ్చి ఈ వ్యత్యాసాన్ని తొలగించండి. సంకల్పముంది కాని దృఢతా సంపన్నమైన సంకల్పముంటే తండ్రి సమానంగా సంపన్నంగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు స్వదర్శన మరియు పరదర్శన చక్రాలు రెండూ తిరుగుతున్నాయి. వ్యర్థ విషయాలలో త్రికాలదర్శులుగా అవుతున్నారు - దీనిని పరివర్తన చేసుకొని స్వచింతక స్వదర్శన చక్రధారులుగా అవ్వండి.

స్లోగన్:-

సేవా భాగ్యం ప్రాప్తించడమే అన్నిటికంటే గొప్ప భాగ్యం.