13-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - అమృతవేళలో మీ ఇతర సంకల్పాలన్నీ నిలిపివేసి ఒక్క తండ్రినే ప్రేమగా స్మృతి చెయ్యండి, తండ్రితో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేయండి"

ప్రశ్న:-

పిల్లలైన మీ ప్రతి మాటలో అర్థముంది, అర్థ సహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు?

జవాబు:-

ఎవరైతే దేహీ అభిమానిగా ఉంటారో, వారే ప్రతి మాట అర్థ సహితంగా మాట్లాడగలరు. తండ్రి మీకు సంగమయుగంలో ఏమేమి నేర్పుతారో, అదంతా అర్థ సహితమైనది. దేహాభిమానంలోకి వచ్చి మనుష్యులు ఏమేమి మాట్లాడుతారో అదంతా అర్థము లేని అనర్థము. దాని ద్వారా ఎలాంటి ప్రతిఫలమూ లభించదు, లాభముండదు.

గీతము:-

నయన హీనులకు దారి చూపించండి ప్రభూ..... (నైన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభూ!.....)

ఓంశాంతి. ఈ పాటలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి సంబంధించినవి. మీకు పాటల అవసరం లేదు. కష్టమైన విషయం ఏదీ లేదు. భక్తి మార్గంలో అయితే చాలా కష్టముంది. ఎన్ని ఆచారాలు-పద్ధతులు ఉంటాయి - బ్రాహ్మణులకు తినిపించడం, ఇది చేయడం, తీర్థ స్థానాలు మొదలైన చోట్ల చాలా చేయవలసి వస్తుంది. ఇక్కడకు వచ్చి అన్ని కష్టాల నుండి విడిపించేస్తారు. ఇందులో చేయవలసింది ఏమీ లేదు. నోటి ద్వారా శివ-శివ అని కూడా అనకూడదు. ఇది నియమబద్ధమైనది కాదు, దాని వలన ఎలాంటి ప్రతిఫలమూ లభించదు. తండ్రి చెప్తారు - నేను ఆత్మ అని లోపల భావించాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు, అంతర్ముఖులై తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే, మీ పాపాలు భస్మమైపోతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది యోగాగ్ని, దీని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి, తర్వాత మీరు తిరిగి వెళ్ళిపోతారు. చరిత్ర పునరావృతమవుతుంది. ఇవన్నీ మీతో మీరు మాట్లాడుకునేందుకు యుక్తులు. మీతో మీరు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. తండ్రి చెప్తున్నారు - నేను కల్ప-కల్పం మీకు ఈ యుక్తులు తెలియజేస్తాను. నెమ్మది-నెమ్మదిగా ఈ వృక్షం వృద్ధి పొందుతుందని కూడా మీకు తెలుసు. మాయ తుఫానులు కూడా ఈ సమయంలో వస్తాయి. నేను ఈ సమయంలో వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయా బంధనం నుండి విడిపిస్తాను. సత్యయుగంలో ఏ బంధనాలు ఉండవు. ఈ పురుషోత్తమ యుగం కూడా ఇప్పుడు అర్థ సహితంగా మీ బుద్ధిలో ఉంది. ఇక్కడ ప్రతి విషయం అర్థ సహితంగానే ఉంటుంది. దేహాభిమానులు ఏదైతే మాట్లాడుతారో అదంతా అనర్థము. దేహీ-అభిమానులు ఏదైతే మాట్లాడుతారో అది అర్థ సహితమైనది. ఆ మాటల ద్వారా ఫలితముంటుంది. ఇప్పుడు భక్తి మార్గంలో ఎంత కష్టముంటుంది. తీర్థయాత్రలు చేయడం, ఇది చేయడం - ఇవన్నీ భగవంతుని వద్దకు చేరే మార్గాలని భావిస్తారు. కాని ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మొదటి నంబరులో విశ్వాధికారులైన లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో, వారికే 84 జన్మలు ఉంటాయని చెప్తారు. మరి ఇతరులు ఎలా తప్పించుకోగలరు. అందరూ చక్రంలోకి వస్తారు, మరి కృష్ణుడు సదా స్థిరంగా ఉంటారని ఎలా చెప్పగలరు. అవును, కృష్ణుని నామ-రూపాలైతే వెళ్ళిపోయాయి, కాని ఆత్మ ఏదో ఒక రూపంలో ఉండనే ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. ఇది చదువు. విద్యార్థి జీవితముపై ధ్యానం పెట్టాలి. మీ చార్టును వ్రాసేందుకు ప్రతి రోజూ సమయాన్ని నిశ్చితం చేసుకోండి. వ్యాపారులకు చాలా బంధనాలుంటాయి. ఉద్యోగం చేసేవారికి బంధనముండదు. వారు వారి పనిని పూర్తి చేస్తే ముగిసిపోతుంది. వ్యాపారస్థుల వద్దకు ఎప్పుడు కస్టమర్లు వచ్చినా సప్లై (పంపిణీ) చేయవలసి ఉంటుంది. బుద్ధి యోగము బయటకు వెళ్ళిపోతుంది. కనుక ప్రయత్నం చేసి సమయాన్ని కేటాయించాలి. అమృతవేళ సమయం చాలా మంచిది. ఆ సమయంలో బయటి ఆలోచనలను నిలిపివేయాలి, ఏ ఆలోచనా రాకూడదు. తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి జ్ఞాన సాగరులు, పతిత పావనులు అని తండ్రి మహిమలో వ్రాయవలసి ఉంటుంది. బాబా మనల్ని విశ్వానికి అధికారులుగా తయారుచేస్తారు, వారి శ్రీమతాన్ని అనుసరించాలి. మన్మనాభవ అనే అన్నిటికంటే మంచి మతం లభిస్తుంది. ఇతరులెవ్వరూ ఇలా చెప్పలేరు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు కల్ప-కల్పం ఈ మతం లభిస్తుంది. తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తారు. దీనిని వశీకరణ మంత్రమని అంటారు, అర్థ సహితంగా స్మృతి చేస్తేనే సంతోషం కలుగుతుంది.

తండ్రి చెప్తున్నారు, అవ్యభిచారీ స్మృతి ఉండాలి. ఇలా భక్తి మార్గంలో ఒక్క శివుని పూజ అవ్యభిచారిగా ఉండేది, మళ్ళీ వ్యభిచారులుగా అవ్వడం వలన అనేకులకు భక్తి చేస్తారు. మొదట అద్వైత భక్తి ఉండేది, ఒక్కరి భక్తి చేసేవారు. జ్ఞానం కూడా ఆ ఒక్కరిదే వినాలి. పిల్లలైన మీరు ఎవరి భక్తి చేసేవారో, వారే స్వయంగా మీకు అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఇప్పుడు నేను వచ్చాను, ఈ భక్తి సంప్రదాయం ఇప్పుడు పూర్తి అయ్యింది. మీరే మొట్టమొదట ఒక్క శివబాబా మందిరాన్ని తయారు చేశారు. ఆ సమయంలో మీరు అవ్యభిచారీ భక్తులుగా ఉండేవారు, కనుక చాలా సుఖంగా ఉండేవారు. తర్వాత వ్యభిచారి భక్తులవ్వడం ద్వారా ద్వైతంలోకి వచ్చేశారు, అప్పుడు కొద్దిగా దుఃఖం కలుగుతుంది. అందరికీ సుఖాన్నిచ్చేవారు ఒక్క తండ్రే కదా. నేను వచ్చి పిల్లలైన మీకు మంత్రమునిస్తానని తండ్రి చెప్తున్నారు. మంత్రం కూడా ఒక్కరిదే వినండి, ఇక్కడ దేహధారులెవ్వరూ లేరు. మీరు ఇక్కడకు బాప్ దాదా దగ్గరకు వస్తారు. శివబాబా కంటే ఉన్నతమైనవారు ఎవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఈ భారత్ స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఎవరి పూజనైతే మీరు చేస్తున్నారో వారిని అలా తయారు చేసింది ఎవరు? మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మి పూర్వ జన్మ ఎలా ఉండేది? ఇవి ఎవ్వరికీ తెలియదు. వారు జగదంబ అని పిల్లలైన మీకు తెలుసు. మీరందరూ మాతలు, వందేమాతరం. పూర్తి జగత్తు పైనే మీరు మీ అధికారాన్ని పొందుతారు. భారతమాత అనేది ఎవరో ఒక్కరి పేరు కాదు. మీరందరూ యోగబలం ద్వారా శివుని నుండి శక్తిని తీసుకుంటారు. శక్తిని తీసుకోవడంలో మాయ జోక్యం చేసుకుంటుంది. యుద్ధంలో ఎవరైనా కిందికి పడేస్తే సాహసవంతులుగా అయ్యి యుద్ధం చేయాలి. ఎవరో పడేసారు మరియు మీరు చిక్కుకోవడం కాదు, ఇది మాయతో యుద్ధం. అంతేకాని కౌరవులు మరియు పాండవుల యుద్ధమేదీ లేదు, వారిది పరస్పరంలోని యుద్ధం. మనుష్యులు గొడవ పడినప్పుడు, 1-2 గజాల భూమి కొరకు గొంతులు కూడా కోసుకుంటారు. ఇదంతా తయారైన డ్రామా అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. రామరాజ్యం, రావణరాజ్యం, మనం రామరాజ్యానికి వెళ్తామని, అక్కడ అపారమైన సుఖముంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానముంది. దాని పేరే సుఖధామం, అక్కడ దుఃఖం నామమాత్రం ఉండదు. ఇప్పుడు అలాంటి రాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు, కనుక పిల్లలు ఎంత పురుషార్థం చేయాలి. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! అలసిపోకండి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని క్షణ-క్షణం చెప్తాను. వారు కూడా బిందువే, ఆత్మలమైన మనం కూడా బిందువులమే, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము, ఇప్పుడు పాత్ర పూర్తయింది. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. వికర్మలు ఆత్మలోనే ఏర్పడ్డాయి కదా. శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. కొందరు మనుష్యులు ఏదైనా పాప కర్మ చేసినట్లయితే తమ శరీరాన్నే సమాప్తం చేసుకుంటారు. కాని దీని ద్వారా ఏ పాపమూ తొలగిపోదు. పాపాత్మ అని అంటారు. సాధు-సత్పురుషులు మొదలైనవారు ఆత్మ నిర్లేపి అని, ఆత్మనే పరమాత్మ అని చెప్తారు. అనేక మతాలున్నాయి. ఇప్పుడు మీకు ఒకే శ్రీమతం లభిస్తుంది. తండ్రి మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చారు. అన్ని విషయాలు ఆత్మకే తెలుసు. ఇంతకుముందు ఈశ్వరుని గురించి ఏమీ తెలియదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఆత్మ ఎంత చిన్నదో, మొట్టమొదట ఆత్మానుభూతిని చేయిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, అది సాక్షాత్కారమవుతుంది, ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. జ్ఞానం యొక్క విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. వారు కూడా భృకుటి మధ్యలో పక్కనే వచ్చి కూర్చుంటారు. వీరు కూడా వెంటనే అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కొత్త విషయాలు, వీటిని తండ్రి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. వీటిని బాగా స్మృతి చేసుకోండి, మర్చిపోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు వినాశనమవ్వడం పైనే మీ భవిష్యత్తు ఆధార పడి ఉంది. పిల్లలైన మీతో పాటు భారత ఖండం కూడా అన్నిటికంటే సౌభాగ్యశాలి, ఇటువంటి సౌభాగ్యశాలి ఖండం వేరే ఏదీ లేదు. ఇక్కడ తండ్రి వస్తారు. భారత్ స్వర్గంగా ఉండేది, దీనినే గార్డన్ ఆఫ్ అల్లా (భగవంతుని పుష్పాల తోట) అని అంటారు. తండ్రి మళ్ళీ భారత్ ను పుష్పాల తోటగా చేస్తున్నారని, అక్కడికి వెళ్ళడం కోసమే మనం చదువుతున్నామని మీకు తెలుసు. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఇది అదే మహాభారత యుద్ధమని, మళ్ళీ అలాంటి యుద్ధం ఎప్పుడూ జరగదని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీ కొరకు కొత్త ప్రపంచం కూడా తప్పకుండా కావాలి. కొత్త ప్రపంచముండేది కదా, భారత్ స్వర్గంగా ఉండేది. 5 వేల సంవత్సరాలయింది. లక్షల సంవత్సరాల మాటే లేదు. లక్షల సంవత్సరాలైతే లెక్కలేనంత మంది మనుష్యులుండేవారు. అంత జన సంఖ్య లేనప్పుడు అది ఎలా అవుతుంది అని కూడా ఎవ్వరి బుద్ధిలో కూర్చోదు.

నేటికి 5 వేల సంవత్సరాల క్రితం మనం విశ్వంపై రాజ్యం చేసేవారమని, వేరే ఖండాలు లేవని, అవి తర్వాత వస్తాయని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, వేరెవ్వరి బుద్ధిలోనూ అస్సలు లేవు. కొద్దిగా సూచించినా అర్థం చేసుకుంటారు. ఇది నిజమే, ఇంతకుముందు తప్పకుండా ఏదో ధర్మముండేది. ఒక్క ఆదిసనాతన దేవీ దేవతా ధర్మముండేదని, అది ప్రాయః లోపమైపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. ఎవ్వరూ తమను తాము దేవతా ధర్మం వారమని చెప్పుకోలేరు. మేము ఆదిసనాతన దేవీ దేవతా ధర్మం వారమని అర్థమే చేసుకోరు, మరి ఆ ధర్మం ఏమయింది? హిందూ ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? ఎవరూ ఈ విషయాల గురించి ఆలోచించరు. తండ్రి జ్ఞానసాగరుడు, జ్ఞానంలో అథారిటీ అని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు. కనుక వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. ఇందులో ప్రేరణ మాటేదీ లేదు. తండ్రి చెప్తారు - ఇప్పుడు ఎలా వచ్చానో అలా కల్ప-కల్పమూ వస్తాను. కల్పం తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరితో కలుస్తాను. మీరు కూడా చక్రంలో ఇలా తిరుగుతూ ఉంటారు. రాజ్యాన్ని తీసుకుంటారు మళ్ళీ కోల్పోతారు. ఇది అనంతమైన నాటకం, మీరంతా పాత్రధారులు. ఆత్మ పాత్రధారి అయ్యి ఉండి సృష్టికర్త ని, డైరెక్టర్ ని, ముఖ్య పాత్రధారిని తెలుసుకోనట్లయితే ఎందుకు పనికొస్తుంది? ఆత్మ ఎలా శరీరాన్ని ధారణ చేస్తుందో మరియు పాత్రను అభినయిస్తుందో పిల్లలైన మీకు తెలసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడీ పాత ప్రపంచం యొక్క అంతిమ సమయం. ఎంత సహజమైన విషయం. తండ్రి ఎంత గుప్తంగా కూర్చున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రజాయిలో సృష్టికర్తను చూశారు (గోదరీ మే కర్తార్ దేఖా). ఇప్పుడు చూశారు అని చెప్పినా లేక తెలుసుకున్నారు అని చెప్పినా విషయం ఒక్కటే. ఆత్మను చూడగలరు, కాని దాని వలన ఏ లాభమూ లేదు. ఎవ్వరికీ అర్థం కాదు. నవవిధ భక్తిలో చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి, ఇంతకుముందు పిల్లలైన మీకు కూడా ఎన్ని సాక్షాత్కారాలు జరిగేవి, చాలా కార్యక్రమాలు వచ్చేవి, చివరి సమయంలో ఈ ఆటపాటలు మీరు మళ్ళీ చూస్తారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు చదువుకుని వివేకవంతులుగా అవ్వండి. ఒకవేళ చదువుకోకపోతే ఫలితాలు వెలవడినప్పుడు తల వంచుకుంటారు, ఎంత సమయాన్ని మేము వ్యర్థం చేశామో అని అనుకుంటారు. ఎంతెంతగా తండ్రి స్మృతిలో ఉంటామో, అంతగా స్మృతి బలం ద్వారా పాపం సమాప్తమైపోతుంది. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది.

భగవంతుడిని ఎందుకు స్మృతి చేస్తారో మనుష్యులకు తెలియదు. మీరే మాత-పిత.... అని కూడా అంటారు, కాని దాని అర్థం తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శివుని చిత్రం చూపించి వీరు జ్ఞాన సాగరులు, పతితపావనులు, వీరిని స్మృతి చేయాలని అర్థం చేయించగలరు. ఆ తండ్రి అపార సుఖానికి మార్గం చూపేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది చదువు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, అంత ఉన్నత పదవి పొందుతారు. సింహాసనం అలాగే కొనసాగేందుకు వీరేమీ సాధు-సన్యాసులు మొదలైనవారు కాదు. ఇది శివబాబా సింహాసనం. వీరు వెళ్ళిన తర్వాత వేరెవ్వరో సింహాసనంపై కూర్చుంటారని కాదు. తండ్రి అయితే అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. చాలామంది పిల్లలు వ్యర్థమైన ఆలోచనలతో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. బాగా ధనాన్ని పోగు చేయాలి, మనవళ్ళు, మనవరాళ్ళు తింటారు, తర్వాత ఉపయోగపడుతుంది, బ్యాంక్ లాకర్లో జమ చేయాలి, పిల్లా పాపలు తింటారని భావిస్తారు. కాని ఎవ్వరినీ ప్రభుత్వం విడిచిపెట్టదు. కనుక దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ భవిష్య సంపాదనలో తత్పరులవ్వాలి. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేయాలి, డ్రామాలో ఉంటే చేస్తాము అని భావించకూడదు. పురుషార్థం లేకపోతే భోజనం కూడా లభించదు. కాని ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. భాగ్యంలో లేకుంటే ఈశ్వరీయ పురుషార్థం కూడా ఏం చేయగలరు! ఎవరి భాగ్యంలో ఉంటుందో, వారు బాగా ధారణ చేస్తారు మరియు చేయిస్తారు. తండ్రి మీకు టీచర్ కూడా, గురువు కూడా, కనుక వారిని స్మృతి చేయాలి. అందరికంటే ప్రియమైన వారు తండ్రి, టీచర్ మరియు గురువు. వారిని స్మృతి చేయాలి. బాబా అనేక యుక్తులు తెలియజేస్తారు. మీరు సాధు-సత్పురుషులు మొదలైన వారిని కూడా ఆహ్వానించవచ్చు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పురుషార్థం చేసి తమ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి, డ్రామాలో ఉంటే చేస్తామని అంటూ పురుషార్థ హీనులుగా అవ్వకూడదు.

2. రోజంతటిలో ఏ పాపం జరిగినా లేక ఎవరికైనా దుఃఖమిచ్చినా దానిని నోట్ చేసుకోవాలి. సత్యంగా తండ్రికి వినిపించాలి, స్వచ్ఛమైన మనసు కలవారై ఒక్క తండ్రి స్మృతిలో అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి.

వరదానము:-

ప్రతి సంకల్పం మరియు కర్మను శ్రేష్ఠం మరియు సఫలం చేసుకునే జ్ఞానస్వరూప వివేకవంతులుగా కండి

ఎవరైతే జ్ఞానస్వరూపులుగా, వివేకవంతులుగా అయ్యి ఏ సంకల్పాన్నైనా, కర్మనైనా చేస్తారో వారు సఫలతామూర్తులుగా అవుతారు. దీని స్మృతిచిహ్నంగానే భక్తిమార్గంలో కార్యం ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తును వేస్తారు లేక గణేశునికి నమస్కరిస్తారు. ఈ స్వస్తిక్, స్వస్థితిలో స్థితి అయ్యేందుకు మరియు గణేశుడు జ్ఞానస్వరూప స్థితికి గుర్తు. పిల్లలైన మీరు ఎప్పుడైతే స్వయం జ్ఞానస్వరూపులుగా అయ్యి ప్రతి సంకల్పం మరియు కర్మ చేస్తారో అప్పుడు సహజంగా సఫలత అనుభవమవుతుంది.

స్లోగన్:-

బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంతోషం, అందువలన సంతోషాన్ని దానం చేస్తూ ఉండండి.