11-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలు - మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో ఇదంతా పాత ప్రపంచ సామాగ్రి. ఇది సమాప్తమవ్వనున్నది. అందువలన ఈ దుఃఖధామాన్ని బుద్ధి యోగంతో మర్చిపోండి"

ప్రశ్న:-

మానవులు తండ్రిపై ఏ దోషం వేస్తారు, కానీ ఆ దోషం ఎవ్వరిదీ కాదు?

జవాబు:-

ఏదైతే మహావినాశనం జరుగుతుందో భగవంతుడే చేయిస్తారు, దుఃఖం కూడా వారే ఇస్తారు, సుఖం కూడా వారే ఇస్తారు అని మనుష్యులు అనుకుంటారు. ఈ చాలా పెద్ద దోషాన్ని తండ్రిపై వేశారు. తండ్రి అంటారు - పిల్లలు! నేను సదా సుఖ దాతను, నేను ఎవ్వరికీ దుఃఖాన్నివ్వను. నేను ఒకవేళ వినాశనం చేయిస్తే పాపమంతా నాపైకి వస్తుంది. అదంతా డ్రామానుసారంగా జరుగుతుంది. నేను చేయించను.

గీతము:-

రాత్రి ప్రయాణికుడా..... (రాత్ కే రాహీ ..... )

ఓంశాంతి. పిల్లలకు నేర్పించడానికి మంచి మంచి పాటలు చాలా ఉన్నాయి. పాట అర్థం చేయిస్తే నోరు తెరుచుకుంటుంది. మేమందరమూ పగలు యొక్క యాత్రలో ఉన్నామని, రాత్రి యొక్క యాత్ర పూర్తి అవుతుందని పిల్లలకు తెలుసు. భక్తిమార్గం అంటే రాత్రి యొక్క యాత్ర. అంధకారంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. అర్ధకల్పం మీరు రాత్రి యొక్క యాత్ర చేస్తూ దిగుతూ వచ్చారు. ఇప్పుడు పగలు యొక్క యాత్రలోకి వచ్చారు. ఈ యాత్ర ఒక్కసారి మాత్రమే చేస్తారు. ఈ స్మృతియాత్ర ద్వారా మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయి మళ్ళీ సతోప్రధాన సత్యయుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. సతోప్రధానంగా అవ్వడంతో సత్యయుగానికి అధికారులుగా, తమోప్రధానంగా అవ్వడంతో కలియుగానికి అధికారులుగా అవుతారు. దానిని స్వర్గమని, దీనిని నరకమని అంటారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి ద్వారా సుఖమే లభిస్తుంది. ఏమీ చెప్పలేని వారు కేవలం ఇది స్మృతిలో ఉంచుకోండి - "ఆత్మలైన మన ఇల్లు శాంతిధామం, సుఖధామం స్వర్గ రాజ్యాధికారం మరియు ఇది దుఃఖధామం, రావణరాజ్యం." ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. భలే ఇక్కడ ఉంటున్నా ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా రావణరాజ్యమని బుద్ధిలో ఉండాలి. ఈ శరీరాలను చూస్తున్నారు, ఇవి కూడా పాత ప్రపంచంలోని సామాగ్రి. ఈ మొత్తం సామాగ్రి ఈ యజ్ఞంలో స్వాహా అవ్వనున్నది. ఆ పతిత బ్రాహ్మణులు యజ్ఞం రచించినప్పుడు అందులో యవలు, నువ్వులు మొదలైన సామాగ్రిని స్వాహా చేస్తారు. ఇక్కడ అంతా వినాశనం అయ్యేది ఉంది. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి, తర్వాత బ్రహ్మా మరియు విష్ణు. శంకరునికి అంతగా పాత్ర లేదు. వినాశనమైతే అయ్యేది ఉంది. ఎవరికైతే ఎలాంటి పాపమూ అంటదో తండ్రి వారి ద్వారా వినాశనం చేయిస్తారు. ఒకవేళ భగవంతుడు వినాశనం చేయిస్తారంటే వారిపై దోషం వస్తుంది, అందువలన ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇది అనంతమైన డ్రామా, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియని కారణంగా అనాథలుగా అయిపోయారు. యజమాని ఎవ్వరూ లేరు. ఏదైనా ఇంట్లో తండ్రి లేకపోతే పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటే మీకు నాధుడు ఎవరూ లేరా ఏంటి అని అడుగుతారు? ఇప్పుడు కోట్లలాదిమంది మనుష్యులు ఉన్నారు, పరస్పరం కొట్లాడుకుంటున్నారు. వీరికి నాధుడు ఎవరూ లేరు. దేశానికి-దేశానికి మధ్యలో కూడా కొట్లాటలున్నాయి. ఒకే ఇంటిలో పిల్లలు తండ్రితో, పురుషుడు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు. ఈ దుఃఖధామంలో ఉండేదే అశాంతి. భగవంతుడైన తండ్రి దుఃఖాన్ని రచిస్తారని అనరు. సుఖ-దుఃఖాలు తండ్రే ఇస్తారని మనుష్యులు భావిస్తారు. కాని తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు. వారిని సుఖదాత అని అంటారు. అలాంటప్పుడు దుఃఖాన్ని ఎలా ఇస్తారు? తండ్రి అంటారు, నేను మిమ్మల్ని చాలా సుఖవంతులుగా చేస్తాను. ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మలైన మన నివాసస్థానం పరంధామం. దానిని శాంతిధామమని కూడా అంటారు. ఈ పదం సరైనది. స్వర్గాన్ని పరంధామమని అనరు. పరమ అంటే అతీతమైనది. స్వర్గమైతే ఇక్కడే ఉంటుంది. మూలవతనం అతీతంగా ఉన్న లోకం, అక్కడ ఆత్మలైన మనం ఉంటాము. ఇక్కడ మీరు సుఖ-దుఃఖాల పాత్రను అభినయిస్తారు. ఫలానా వారు స్వర్గానికి వెళ్ళారని అంటారు. ఇది పూర్తిగా తప్పు. స్వర్గం ఇక్కడ లేనే లేదు. ఇప్పుడిది కలియుగం, నరకం. ఈ సమయంలో మీరందరూ సంగమయుగవాసులు, మిగిలిన వారందరూ కలియుగవాసులు. ఒకే ఇంటిలో తండ్రి కలియుగవాసిగా ఉంటే కొడుకు సంగమయుగవాసిగా ఉంటారు. స్త్రీ సంగమయుగవాసి అయితే పురుషుడు కలియుగవాసి..... ఎంత తేడా ఉంటుంది. స్త్రీ జ్ఞానం తీసుకొని, పురుషుడు జ్ఞానం తీసుకోకపోతే ఒకరికొకరు సహయోగులుగా ఉండరు. ఇంట్లో గొడవలు జరుగుతాయి. స్త్రీ పుష్పంగా అవుతుంది, పురుషుడు ముల్లుగానే ఉంటాడు. ఒకే ఇంట్లో కొడుకు కు నేను సంగమయుగంలో పురుషోత్తమ పవిత్ర దేవతగా అవుతున్నానని తెలుసు. కాని తండ్రి, నాశనం చేసే వివాహం చేసుకుని నరకవాసిగా అవ్వమని అంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పవిత్రంగా అవ్వండి. ఇప్పటి పవిత్రత 21 జన్మలు కొనసాగుతుంది. ఈ రావణ రాజ్యమే వినాశనమవుతుంది. ఎవరితో శత్రుత్వం ఉంటుందో వారి బొమ్మను కాలుస్తారు కదా, అలా రావణుడిని కాలుస్తారు. కనుక శత్రువుపై ఎంత కోపం, అసహ్యం ఉండాలి. కాని రావణుడు ఎవరు అని ఎవ్వరికీ తెలియదు. చాలా ఖర్చు చేస్తారు. మనుష్యులను కాల్చడానికి ఇంత ఖర్చు చేయరు. స్వర్గంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. అక్కడ కరెంటులో పెట్టగానే సమాప్తమైపోతుంది. అక్కడ వారి మట్టి పనికిరావాలని ఆలోచించరు. అక్కడ ఆచార సంప్రదాయాలలో ఎటువంటి కష్టం లేక అలసట యొక్క విషయం ఉండదు. అంత సుఖం ఉంటుంది. కనుక ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేసే పురుషార్థం చేయండి. ఈ స్మృతి చేయడంలోనే యుద్ధముంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు - మధురమైన పిల్లలు! తమపై అటెన్షన్ అనే కాపలాదారుడిని పెడుతూ ఉండండి. మాయ ఎక్కడా ముక్కు-చెవులను కోసేయదు కదా ఎందుకంటే శత్రువు కదా. మీరు తండ్రిని స్మృతి చేస్తారు మరియు మాయ తుఫాన్లలో ఎగిరిపోయేలా చేస్తుంది. అందుకే తండ్రి అంటారు - ప్రతి ఒక్కరు రోజంతటి చార్టును వ్రాయాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేశాను? మనసు ఎక్కడకు పరుగు తీసింది? ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను? అని డైరీలో నోట్ చేసుకోండి. స్వయాన్ని పరిశీలించుకుంటే మాయ కూడా చూస్తుంది - వీరు మంచి సాహసవంతులు, స్వయంపై చాలా అటెన్షన్ పెడతారు అని. పూర్తి కాపలా ఉంచాలి. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలైన మీకు తమ పరిచయమిస్తున్నారు. భలే ఇళ్ళు వాకిళ్ళు సంభాళించండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. మీరేమీ ఆ సన్యాసుల వలె కాదు. వారు యాచనతో నడుస్తారు. అయినా కర్మలైతే చేయాల్సి వస్తుంది కదా. మీరు హఠయోగులు అని మీరు వారికి కూడా చెప్పవచ్చు. రాజయోగాన్ని నేర్పించేవారు భగవంతుడు ఒక్కరే. పిల్లలైన మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఈ సంగమయుగాన్నే స్మృతి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం సంగమయుగంలోనే సర్వోత్తమ దేవతలుగా అవుతాము. మనం ఉత్తమ పురుషులుగా అనగా పూజ్య దేవతలుగా ఉండేవారము. ఇప్పుడు కనిష్ఠులుగా అయిపోయాము. ఎందుకూ పనికిరాకుండా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ ఎలా తయారవుతున్నాము? మనుష్యులు బ్యారిస్టరీ మొదలైనవి చదువుకునే సమయంలో పదవి లభించదు. పరీక్ష పాసైన తర్వాత, పదవి యొక్క టోపి లభిస్తుంది. వెళ్ళి ప్రభుత్వ సేవలో చేరుతారు. ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే మనల్ని చదివిస్తున్నారని, తప్పకుండా ఉన్నతాతి ఉన్నతమైన పదవిని కూడా ఇస్తారని మీకు తెలుసు. ఇది మీ ముఖ్య లక్ష్యం. నన్నే స్మృతి చేయండని తండ్రి అంటారు. నేను ఎవరో, ఎలా ఉన్నానో మీకు అర్థం చేయించాను. ఆత్మల తండ్రినైన నేను బిందువును, నాలో పూర్తి జ్ఞానమంతా ఉంది, మీకు కూడా ఇంతకుముందు ఆత్మ బిందువు అనే జ్ఞానం లేదు. ఆత్మలో మొత్తం 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది. క్రైస్ట్ పాత్రను అభినయించి వెళ్ళారు. మళ్ళీ తప్పకుండా వస్తారన్నది సత్యమే కదా. ఇప్పుడు క్రైస్తవులందరూ వెళ్ళిపోతారు. క్రైస్ట్ యొక్క ఆత్మ కూడా ఇప్పుడు తమోప్రధానంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నతాతి ఉన్నతమైన ధర్మ స్థాపకులు ఉన్నారో వారు ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. వీరు కూడా చెప్తారు - నేను అనేక జన్మల అంతిమంలో తమోప్రధానంగా అయ్యాను, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా తయారవుతాను. తతత్వమ్.

దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. విరాటరూప చిత్రం యొక్క అర్థం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకిప్పుడు తెలుసు, ఆత్మ మధురమైన ఇంటిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేది. ఇక్కడకు రావడంతో పతితంగా అయింది. అందుకే ఓ పతితపావనా! మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేస్తే మేము మా ఇంటికి, ముక్తిధామానికి వెళ్తామని మీరు అంటారు. ఇది కూడా ధారణ చేయాల్సిన పాయింటు. ముక్తిధామం, జీవన్ముక్తిధామం అని దేనిని అంటారో మనుష్యులకు తెలియదు. ముక్తిధామాన్ని శాంతిధామమని అంటారు. జీవన్ముక్తిధామాన్ని సుఖధామమని అంటారు. ఇక్కడ దుఃఖ బంధనముంది. జీవన్ముక్తిని సుఖం యొక్క సంబంధమని అంటారు. ఇప్పుడు దుఃఖ బంధనాలు దూరమవుతాయి. ఉన్నతపదవి పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము కావున పిల్లల్లో ఈ నషా ఉండాలి. మనమిప్పుడు శ్రీమతాన్ని అనుసరించి రాజ్యభాగ్య స్థాపన చేస్తున్నాము. జగదంబ నంబర్ వన్ లోకి వెళ్తారు. మనం కూడా వారిని ఫాలో చేస్తాము. ఏ పిల్లలైతే ఇప్పుడు మాత-పితల హృదయాన్ని అధిరోహిస్తారో వారే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరైతే రాత్రింబవళ్ళు సర్వీసులో బిజీగా ఉంటారో వారే తల్లిదండ్రుల హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశమివ్వాలి. ఎవరి వద్దా ధనం తీసుకోకూడదు. వీరు రాఖీ కట్టడానికి వస్తారు, ఏమైనా ఇవ్వవలసి వస్తుందని వారు భావిస్తారు. మాకు ఇంకేమి వద్దు మీరు కేవలం 5 వికారాలను దానమివ్వండని చెప్పండి. ఈ దానం తీసుకోవడానికి మేము వచ్చాము, అందుకే ఈ పవిత్ర రాఖీని కడతాము, తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, దానితో దేవతలుగా అవుతారు, అంతేకానీ మేము ధనం వగైరా ఏమీ తీసుకోము. మేము ఆ బ్రాహ్మణులం కాదు, కేవలం 5 వికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. అందరికీ గ్రహణం పట్టి ఉంది. మీరు బ్రాహ్మణులు కదా. ఎక్కడికి వెళ్ళినా చెప్పండి - దానమిస్తే గ్రహణం వీడిపోతుంది, పవిత్రులవ్వండి. వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పుష్పాలుగా అవుతారు. మీరే పుష్పాలుగా ఉండేవారు. తర్వాత ముళ్ళగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ దిగిపోతూనే వచ్చారు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా వీరి ద్వారా డైరెక్షన్స్ ఇచ్చారు. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారికి శరీరం లేదు. మరి బ్రహ్మా, విష్ణు, శంకరులకు శరీరముందా? అవును సూక్ష్మ శరీరముందని మీరు చెప్తారు. కాని అది మనుష్య సృష్టి కాదు. ఆటంతా ఇక్కడే ఉంటుంది. సూక్ష్మవతనంలో నాటకం ఎలా నడుస్తుంది? అలా మూలవతనంలో కూడా సూర్య చంద్రులే ఉండరు అన్నప్పుడు నాటకం ఎందుకు ఉంటుంది! స్థూలవతనంలోనే నాటకమంతా జరుగుతుంది. ఇది చాలా పెద్ద నాటక రంగము. పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు. సూక్ష్మవతనంలో ఉండవు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం అనంతమైన ఆట ఉంది. దేవీదేవతలుగా ఉన్న మనమే వామ మార్గంలోకి ఎలా వచ్చామో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. వికారీ మార్గాన్ని వామమార్గమని అంటారు. అర్ధకల్పము మనం పవిత్రంగా ఉండేవారము. ఇది మన గెలుపు-ఓటముల ఆట. భారతదేశం అవినాశి ఖండం. ఇదెప్పుడూ వినాశనమవ్వదు. ఆదిసనాతన దేవీ దేవతా ధర్మముండేది. అప్పుడు మరే ధర్మమూ ఉండేది కాదు. మీ ఈ మాటలను కల్పక్రితం అంగీకరించినవారే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు. 5 వేల సంవత్సరాల కంటే పాత వస్తువేదీ ఉండదు. మీరు సత్యయుగంలోకి వెళ్ళి మొదట మీ మహళ్ళను తయారుచేసుకుంటారు. అంతేగాని స్వర్ణిమ ద్వారక ఏదో సముద్రం కింద ఉంది, అది బయటకు వస్తుందని కాదు. సాగరం నుండి దేవతలు రత్నాలను పళ్ళెములను నింపి ఇచ్చారని చెప్తారు. వాస్తవానికి జ్ఞానసాగరులైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలతో పళ్ళెములను నింపి ఇస్తున్నారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని చూపిస్తారు. జ్ఞానరత్నాలతో జోలెను నింపారు. శంకరుడు భంగు, ఉమ్మెత్త పువ్వుల మత్తు రసమును కూడా తాగేవారని చెప్తారు, మళ్ళీ వారి వద్దకు వెళ్ళి జోలెను నింపమని అంటారు. మాకు ధనమివ్వండి అని ప్రార్థిస్తారు. కావున చూడండి శంకరుడిని కూడా నిందించారు. అందరికంటే ఎక్కువగా నన్ను నిందించారు. ఇది కూడా ఆట. మళ్ళీ జరుగుతుంది. ఈ నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు. నేను వచ్చి ఆది నుండి అంత్యము వరకు రహస్యమంతా అర్థం చేయిస్తున్నాను. ఉన్నతాతి ఉన్నతమైన వారు తండ్రి అని కూడా తెలుసు. విష్ణువు నుండి బ్రహ్మాగా, మరలా బ్రహ్మా నుండి విష్ణువుగా ఎలా అవుతారో - ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.

మేము విష్ణు కులం వారిగా అవ్వాలని పిల్లలైన మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. విష్ణుపురికి యజమానులుగా అయ్యేందుకు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనం బ్రాహ్మణులము, మన కొరకు సూర్యవంశీ-చంద్రవంశీ రాజధానిని శ్రీమతం ఆధారంగా స్థాపన చేస్తున్నామని మీ హృదయంలో ఉంది. ఇందులో యుద్ధం మొదలైనవాటి విషయమే లేదు. దేవతలకు, అసురులకు యుద్ధం ఎప్పుడూ జరగదు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. అక్కడ యుద్ధమెలా జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు యోగబలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలం కలవారు వినాశనమవుతారు. మీరు సైలెన్స్ బలం ద్వారా సైన్స్ పై విజయం పొందుతారు. మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనం ఆత్మలము, మనం మన ఇంటికి వెళ్ళాలి. ఆత్మలు వేగవంతమైనవి. ఒక్క గంటలో ఎక్కడ నుండి ఎక్కడకో (చాలా దూరానికి) వెళ్ళే విమానాలు తయారయ్యాయి. ఇప్పుడు ఆత్మ వాటి కంటే కూడా వేగవంతమైనది. చిటికెలో ఆత్మ ఎక్కడి నుండి ఎక్కడకో వెళ్ళి జన్మ తీసుకుంటుంది. కొన్ని విదేశాలకు వెళ్ళి కూడా జన్మ తీసుకుంటాయి. ఆత్మ అన్నిటికంటే వేగవంతమైన రాకెట్. ఇందులో మిషనరీ మొదలైనవాటి విషయం లేదు. శరీరం వదలగానే ఎగిరిపోతుంది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పతితాత్మలు ఇంటికి వెళ్ళలేవు. మీరు పావనంగా అయ్యే వెళ్తారు. మిగిలినవారందరూ శిక్షలు అనుభవించి వెళ్తారు. శిక్షలైతే చాలా లభిస్తాయి. అక్కడ గర్భ మహళ్ళలో హాయిగా ఉంటారు. పిల్లలకు సాక్షాత్కారం కూడా అయ్యింది. కృష్ణుని జన్మ గురించి సాక్షాత్కారంలో చూశారు కదా. ఎటువంటి మాలిన్యం యొక్క విషయం లేదు. అక్కడ ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది. మీరిప్పుడు వైకుంఠాధిపతులుగా అవుతున్నారు. మరి అలాంటి పురుషార్థం చేయాలి. ఆహార పానీయాలు చాలా శుద్ధంగా, సాత్వికంగా ఉండాలి. పప్పన్నము అన్నిటికంటే మంచిది. ఋషికేష్ లో సన్యాసులు ఒక కిటికీ నుండి తీసుకొని వెళ్తుంటారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ఉంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1.స్వయంపై అటెన్షన్ అనే పూర్తి కాపలా ఉంచాలి. మాయ నుండి స్వయాన్ని సంభాళించుకుంటూ ఉండండి. స్మృతి యొక్క సత్యమైన చార్టు పెట్టాలి.

2.తల్లిదండ్రులను ఫాలో చేసి హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి. రాత్రింబవళ్ళు సర్వీసులో తత్పరులై ఉండాలి. తండ్రిని స్మృతి చేయమని అందరికీ సందేశాన్నివ్వాలి. 5 వికారాలను దానం చేస్తే గ్రహణం తొలగిపోతుంది.

వరదానము:-

తండ్రి స్మృతి ద్వారా అసంతోషకరమైన పరిస్థితులలో సదా సుఖం మరియు సంతోషాలను అనుభవం చేసే మహావీర్ భవ

సదా తండ్రి స్మృతిలో ఉండేవారు ప్రతి పరిస్థితిలో సదా సంతుష్టంగా ఉంటారు ఎందుకంటే జ్ఞానశక్తి ఆధారంతో పర్వతమంత పరిస్థితి కూడా ఆవగింజంత అనుభవమవుతుంది. ఆవగింజ అనగా ఏమీ లేనట్లు. పరిస్థితులు అసంతోషకరమైనవిగా ఉన్నా, దుఃఖం కలిగించే ఘటన జరిగినా, దుఃఖకరమైన పరిస్థితిలో సుఖ స్థితి ఉంటే అప్పుడు వారిని మహావీరులని అంటారు. ఏం జరిగినా నథింగ్ న్యూ తో పాటు తండ్రి స్మృతి ద్వారా సదా ఏకరస స్థితి ఉండగలదు. అప్పుడు దుఃఖం-అశాంతుల అల కూడా రాదు.

స్లోగన్:-

మీ దైవీ స్వరూపం సదా స్మృతిలో ఉన్నట్లయితే ఎవ్వరి వ్యర్థ దృష్టి పడదు.