ఓంశాంతి. అభ్యాసము కోసం పిల్లలు ఇక్కడ కూర్చుంటారు. వాస్తవానికి దేహీ అభిమానులుగా అయి తండ్రి స్మృతిలో ఉన్నవారు మాత్రమే గద్దెపై కూర్చోవాలి. స్మృతిలో కూర్చోకపోతే వారిని టీచర్ అని పిలువలేము. స్మృతిలో శక్తి ఉంటుంది, జ్ఞానములో శక్తి ఉండదు. దీనిని స్మృతి బలమని అంటారు. యోగబలము సన్యాసుల పదము. కష్టమైన పదాలను బాబా ఉపయోగించరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. చిన్న పిల్లలు తల్లి-తండ్రులను స్మృతి చేస్తారు కదా, వారు దేహధారులు. పిల్లలైన మీరు విచిత్రులు. మీకు ఈ చిత్రము ఇక్కడ లభిస్తుంది. మీరు విచిత్ర దేశ నివాసులు. అక్కడ చిత్రము (శరీరము) ఉండదు. నేను ఆత్మ అని మొట్టమొదట పక్కా చేసుకోవాలి. కనుకనే బాబా చెప్తున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. మీరు నిర్వాణ దేశము నుండి వచ్చారు. అది సర్వాత్మల ఇల్లు, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారు? ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానమున్నవారు ఈ ప్రపంచములో ఎవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదివారో అవన్నీ మర్చిపోండి. కృష్ణుని మహిమ, ఇతరుల మహిమ ఎంతగానో చేస్తారు. గాంధీని కూడా ఎంతగా మహిమ చేస్తారు. వారు రామరాజ్యము స్థాపన చేసి వెళ్ళినట్లు మహిమ చేస్తారు. కాని శివభగవానువాచ - ఆది సనాతన రాజా రాణుల రాజ్యములో ఏవైతే నియమాలు ఉండేవో, అవన్నీ నేర్పించి అంటే తండ్రి రాజయోగమును నేర్పించి రాజా-రాణులుగా చేశారో, ఆ ఈశ్వరీయ ఆచార వ్యవహారాలను కూడా వారు తెంచేశారు. మాకు రాజ్యము వద్దు, ప్రజలపై ప్రజారాజ్యము కావాలని అన్నారు. ఇప్పుడు దీని గతి ఏమయిందో చూడండి! దుఃఖమే దుఃఖముంది, గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉన్నారు. అనేక మతాలైపోయాయి. ఇప్పుడు పిలలైన మీరు శ్రీమతముననుసరించి రాజ్యము తీసుకుంటారు. మీలో ఎంత శక్తి ఉంటుందంటే, అక్కడ సైన్యము మొదలైనవి ఉండనే ఉండవు. భయపడే మాటే ఉండదు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, అది అద్వైత రాజ్యము. చప్పట్లు వినిపించేందుకు ద్వంద్వము ఉండేదే కాదు. దానిని అద్వైత రాజ్యమని అంటారు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి దేవతలుగా చేస్తారు. తర్వాత ద్వైతము వలన రావణుని ద్వారా దైత్యులుగా అయిపోతారు. భారతవాసీయులైన మనము పూర్తి విశ్వానికి అధికారులుగా ఉండేవారమని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మీకు విశ్వరాజ్యము కేవలం స్మృతి బలము ద్వారా లభించింది. ఇప్పుడు మళ్ళీ లభిస్తుంది. కల్ప-కల్పము కేవలం స్మృతి బలము ద్వారా లభిస్తుంది. చదువులో కూడా బలముంది. ఉదాహరణకు బారిస్టరుగా అవుతున్నారంటే బలము ఉందనే కదా అర్థము. అది అతి కనిష్ఠమైన బలము. మీరు యోగబలముతో విశ్వముపై రాజ్యము చేస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా బలము లభిస్తుంది. బాబా, మేము కల్ప-కల్పము మీ ద్వారా సత్యయుగ స్వరాజ్యమును తీసుకుంటాము, తిరిగి పోగొట్టుకుంటాము, తిరిగి పొందుతామని మీరు చెప్తారు. మీకు పూర్తి జ్ఞానము లభించింది. ఇప్పుడు మనము శ్రీమతము ద్వారా శ్రేష్ఠ విశ్వరాజ్యాన్ని తీసుకుంటాము. విశ్వము కూడా శ్రేష్ఠమైపోతుంది. ఈ రచన-రచయితల జ్ఞానము మీకిప్పుడే ఉంది. మేము రాజ్యాన్ని ఎలా తీసుకున్నామన్న జ్ఞానము ఈ లక్ష్మీనారాయణులకు కూడా తెలియదు! ఇక్కడ మీరు చదువుకుని తర్వాత వెళ్ళి రాజ్యము చేస్తారు. ఎవరైనా మంచి ధనవంతుల ఇంటిలో జన్మ తీసుకుంటే గత జన్మలో వీరు మంచి కర్మలు చేశారు, దాన-పుణ్యాలు చేశారని అంటారు కదా. ఎటువంటి కర్మనో అటువంటి జన్మ లభిస్తుంది. ఇప్పుడిది రావణరాజ్యము. ఇక్కడ ఏ కర్మ చేసినా అది వికర్మే అవుతుంది. మెట్లు దిగాల్సిందే. సర్వ శ్రేష్ఠమైన దేవీ దేవతా ధర్మమువారు కూడా మెట్లు దిగాల్సిందే. సతో, రజో, తమోలోకి రావలసిందే. ప్రతి వస్తువు క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఇప్పుడు మీకు అపారమైన సంతోషముండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీ సంకల్పములోనూ లేదు, స్వప్నములోనూ లేదు.
ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము పూర్తి విశ్వమంతటా ఉండేదని భారతవాసీయులకు తెలుసు. పూజ్యులుగా ఉండేవారే మళ్ళీ పూజారులైపోయారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని గాయనము కూడా ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి. ఈ నాటకము చాలా అద్భుతమైనది. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో 84 లక్షల జన్మలు అని వ్రాసేశారు. ఇవన్నీ భక్తిమార్గములోని అసత్యాలు అని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యము కదా. రామరాజ్యము, రావణ రాజ్యము ఎలా ఉంటాయో పిల్లలైన మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. ప్రతి సంవత్సరము రావణుని బొమ్మను కాలుస్తారు అంటే రావణుడు శత్రువైనట్లే కదా. పంచ వికారాలు మానవుని శత్రువులు. రావణుడు ఎవరో, ఎందుకు కాలుస్తారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే స్వయాన్ని సంగమయుగవాసులుగా భావిస్తారో వారికే మేము పురుషోత్తములుగా అవుతున్నామనే స్మృతి ఉంటుంది. భగవంతుడు మనకు రాజయోగమును నేర్పించి నరుడి నుండి నారాయణుడిగా, భ్రష్టాచారి నుండి శ్రేష్ఠాచారిగా తయారుచేస్తారు. మనల్ని ఉన్నతోన్నతమైన నిరాకార భగవంతుడు చదివిస్తున్నారంటే ఎంత అపారమైన సంతోషం ఉండాలి. పాఠశాలలో విద్యార్థి బుద్ధిలో - మేము విద్యార్థులమని ఉంటుంది కదా. కాని అక్కడ చదివించేది సాధారణ టీచర్. ఇక్కడ మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. చదువు ద్వారా ఇంత మంచి పదవి లభిస్తూ ఉంటే ఎంత బాగా చదువుకోవాలి. చదువు కూడా చాలా సులభము. కేవలం ఉదయము అరగంట లేక ముప్పావు గంట చదువుకోవాలి. రోజంతా వ్యాపార వ్యవహారాలలో మునిగి స్మృతి చేయడం మర్చిపోతారు. అందుకే ఇక్కడ ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చుంటారు. బాబాను చాలా ప్రేమతో ఇలా స్మృతి చేయమంటున్నారు - బాబా, మీరు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు, మీరు 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారని ఇప్పుడు తెలిసింది. బాబా వద్దకు పిల్లలు వచ్చినప్పుడు, ఇంతకు ముందు మీరు నన్ను ఎప్పుడు కలిశారు అని బాబా అడుగుతారు. ఇటువంటి ప్రశ్న ఏ సాధుసన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ అడగలేరు. అక్కడ సత్సంగాలలో ఎవరు కావాలంటే వారు వెళ్ళి కూర్చుంటారు. చాలా మంది ఉండటాన్ని చూసి అందరూ లోపలకు వస్తారు. మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు - మేము గీత, రామాయణము మొదలైనవాటిని ఎంత సంతోషంగా వెళ్ళి వింటూ ఉండేవారము, కాని ఏమీ అర్థమయ్యేది కాదు. అదంతా భక్తిమార్గములోని సంతోషము. చాలా సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు. కాని మళ్ళీ క్రిందకు దిగుతూనే వస్తారు. రకరకాల హఠయోగాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. అవన్నీ ఆరోగ్యము కోసమే చేస్తారు. కావున బాబా చెప్తున్నారు - ఇవన్నీ భక్తిమార్గపు ఆచార సంప్రదాయాలు. రచయిత మరియు రచనను గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక మిగిలింది ఏమిటి? రచయిత-రచనల గురించి తెలిస్తే మీరు ఏమవుతారు? తెలియకపోతే ఏమయ్యారు? తెలుసుకుంటే సంపన్నులుగా అవుతారు లేకపోతే ఆ భారతవాసీయులే బికారులైపోయారు. వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు. ప్రపంచములో ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఎంతో ధనము, బంగారం మొదలైనవి దోచుకుంటూ ఉంటారు! అక్కడ మనము బంగారు మహళ్ళను తయారు చేస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బారిస్టరి మొదలైనవి చదువుకునేప్పుడు మేము పరీక్ష పూర్తి చేసి ఇలా అవుతాము, ఇల్లు కడ్తాము అని మనసులో ఉంటుంది కదా. మేము స్వర్గ రాకుమారుడు-రాకుమారీలుగా అయ్యేందుకు చదువుతున్నామని మీ బుద్ధిలో ఎందుకు రాదు? ఎంత సంతోషం ఉండాలి? కాని బయటకు వెళ్తూనే సంతోషము మాయమైపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఈ జ్ఞాన మార్గములోకి వచ్చేస్తారు. బంధు మిత్రులకు ఏమీ అర్థము కాదు, ఇదంతా మాయ అని భావిస్తారు. మేము చదువుకునేందుకు అనుమతి ఇవ్వమని అంటారు. ఈ పరిస్థితిలో మైనర్ గా ఉన్నంతవరకు తల్లిదండ్రుల మాటను ఒప్పుకోవలసి ఉంటుంది. మేము తీసుకోలేము. చాలా గొడవలు జరుగుతాయి. ప్రారంభములో ఎన్ని గొడవలు జరిగాయి! నాకు 18 సంవత్సరాలని కుమార్తె చెప్పేది కాని తండ్రి 16 సంవత్సరాలు మాత్రమే నిండాయి, మైనర్ అని గొడవపడి తీసుకువెళ్ళిపోయేవారు. మైనర్ అంటే తండ్రి ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. మేజర్ అయితే ఏం చెయ్యాలనుకుంటే అది చేయవచ్చు. చట్టము కూడా ఉంది కదా. బాబా చెప్తున్నారు - మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు నియమము ఏమిటంటే - మీ లౌకిక తండ్రి నుండి అనుమతి పత్రమును తీసుకుని రావాలి. తర్వాత నడవడికను కూడా చూస్తారు. నడవడిక బాగా లేకపోతే తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. ఆటలలో కూడా ఇలాగే జరుగుతుంది. సరిగ్గా ఆడకపోతే బయటకు వెళ్ళమని పంపేస్తారు. పరువు తీస్తున్నావు అని అంటారు. మేము యుద్ధ మైదానములో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కల్ప-కల్పము తండ్రి వచ్చి మాయపై విజయము కలిగిస్తారు. ముఖ్యమైన విషయము - పావనంగా అవ్వడం. వికారాల వలన పతితులుగా అయ్యారు. తండ్రి చెప్తున్నారు - కామము మహాశత్రువు. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. బ్రాహ్మణులైనవారే దేవీ దేవతా ధర్మములోకి వస్తారు. బ్రాహ్మణులలో కూడా నెంబరువారుగా ఉంటారు. దీపము వద్దకు దీపపు పురుగులు వస్తాయి. కొన్ని కాలి మరణిస్తాయి. కొన్ని ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అలాగే, కొందరు పూర్తిగా బలి అయిపోతారు. కొందరు విని వెళ్ళిపోతారు. ఇంతకుముందు రక్తముతో కూడా వ్రాసి ఇచ్చేవారు - బాబా, మేము మీకు చెందినవారము అని, అయినా మాయ ఓడించేస్తుంది. ఇంతగా మాయతో యుద్ధం జరుగుతుంది, దీనిని యుద్ధ మైదానమని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సర్వ వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. లెక్కలేనన్ని చిత్రాలు తయారుచేయించారు కదా. నారదుని ఉదాహరణ కూడా ఈ సమయములోనిదే. అందరూ - మేము లక్ష్మీ లేక నారాయణులుగా అవుతామని చెప్తారు. తండ్రి చెప్తున్నారు - మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి - మేము అందుకు యోగ్యులమా? మాలో ఏ వికారమూ లేదు కదా? అందరూ భక్త నారదులే కదా. ఇది కేవలం ఉదాహరణగా చూపించారు.
భక్తిమార్గములోని వారు - మేము శ్రీలక్ష్మిని వరించగలమా అని అడుగుతారు? తండ్రి చెప్తున్నారు - లేదు, జ్ఞానము విన్నప్పుడే సద్గతిని పొందగలరు. పతితపావనుడినైన నేను మాత్రమే అందరికీ సద్గతినిచ్చేవాడను. తండ్రి మాకు రావణ రాజ్యము నుండి విముక్తినిప్పిస్తున్నారని మీకు తెలుసు. అది శారీరిక యాత్ర. భగవానువాచ - మన్మనాభవ. అంతే, ఇందులో ఎదురుదెబ్బ తినే విషయమే లేదు. అవన్నీ భక్తిమార్గపు దెబ్బలు. అర్ధకల్పము బ్రహ్మా పగలు, అర్ధకల్పము బ్రహ్మా రాత్రి. ఇప్పుడు బి.కె.లైన మనకంతా అర్ధకల్పము పగలు వస్తుందని, సుఖధామములో ఉంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ భక్తి ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీకు - మేము అందరికన్నా ధనవంతులుగా అవుతామని తెలుసు. మరి ఎంత సంతోషం ఉండాలి! మొదట మీరు కఠినమైన రాళ్ళుగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి ధారపై ఉంచి పదును పెడ్తున్నారు. బాబా వజ్రాల వ్యాపారి కూడా కదా. డ్రామానుసారముగా బాబా అనుభవీ రథమునే తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు అని గాయనము కూడా ఉంది. కృష్ణుడు పల్లెటూరి పిల్లవాడు ఎలా అవ్వగలడు? అతను సత్యయుగములో ఉండేవాడు. అతనిని ఊయలలో ఊపుతారు. కిరీటాన్ని ధరింపచేస్తారు, మరి పల్లెటూరి పిల్లవాడు అని ఎందుకు అంటారు? పల్లెటూరి బాలుడు అంటే శ్యాముడు. ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు వచ్చారు. బాబా జ్ఞానమనే ధారపై ఉంచి మనల్ని పదును పెడ్తున్నారు కదా. ఈ సత్యమైన సత్సంగము కల్ప-కల్పము కల్పములో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు. అందుకే తండ్రి చెప్తున్నారు - చెడు వినకండి.... నన్ను మరియు మిమ్మల్ని నింద చేస్తూ ఉండే ఆ మాటలను వినకండి.
మాకు తండ్రి ఆస్తిలో భాగముందని జ్ఞానంలోకి వచ్చిన కుమారీలు అడగవచ్చు. మేమెందుకు దాని ద్వారా భారతదేశ సేవార్థము సేవాకేంద్రము తెరవకూడదు. కన్యను దానము ఇవ్వాల్సిందే. ఆ భాగము మాకిస్తే మేము సేవాకేంద్రాన్ని తెరుస్తాము, చాలామంది కళ్యాణం జరుగుతుంది. ఇటువంటి యుక్తిని రచించాలి. ఇది మీ ఈశ్వరీయ మిషన్. మీరు రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేస్తారు. ఎవరైతే మన ధర్మానికి చెందినవారుగా ఉంటారో వారు వస్తారు. ఒక ఇంటిలోనే దేవీదేవతా ధర్మానికి చెందిన పుష్పము వస్తుంది, మిగిలినవారు రారు. కష్టమవుతుంది కదా. తండ్రి సర్వాత్మలను పావనంగా చేసి అందరినీ తీసుకెళ్తారు. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు - సంగమయుగ చిత్రము వద్దకు తీసుకు వెళ్ళండి. ఇటువైపు కలియుగము, అటువైపు సత్యయుగము ఉన్నాయి. సత్యయుగములో దేవతలుంటారు, కలియుగములో అసురులుంటారు. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. తండ్రియే పురుషోత్తములుగా చేస్తారు. ఎవరైతే చదువుకుంటారో వారే సత్యయుగములోకి వస్తారు, మిగిలిన వారంతా ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. మళ్ళీ తమ-తమ సమయాలలో వస్తారు. ఈ సృష్టిచక్ర చిత్రము చాలా బాగుంది. పిల్లలకు సర్వీసు చేయాలనే అభిరుచి ఉండాలి. మేము ఇలా-ఇలా సేవ చేసి, పేదవారిని ఉద్ధరించి వారిని స్వర్గానికి యజమానులుగా తయారుచేయాలి అనే ఆసక్తి ఉండాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మేము శ్రీ లక్ష్మీనారాయణుల సమానంగా అవ్వగలమా? మాలో ఏ వికారము లేదు కదా? ప్రదక్షిణ చేసి వెళ్ళే దీపపు పురుగులమా లేక బలి అయ్యేవారిమా? తండ్రి పరువు తీసే నడవడిక లేదు కదా? అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి.
2. అపారమైన సంతోషములో ఉండేందుకు ఉదయము ఉదయమే లేచి ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి మరియు చదువును చదువుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించి పురుషోత్తములుగా చేస్తున్నారు, మేము సంగమయుగములో ఉన్నామనే నషాలో ఉండాలి.