21-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చారు, ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయాలేవీ లేవు, మీరు చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేసినట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు"

ప్రశ్న:-

ఏ ఒక్క విషయాన్ని మీరు పదే పదే మీలో మీరు వల్లె వేసుకుంటూ పక్కా చేసుకోవాలి?

జవాబు:-

మేము ఆత్మలము, మేము తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నాము. ఆత్మలే పిల్లలు, పరమాత్మ ఆత్మల తండ్రి. ఇప్పుడు తండ్రి మరియు పిల్లల మేళా జరిగింది. ఈ విషయాన్ని పదే-పదే వల్లె వేసుకుంటూ పక్కా చేసుకోండి. ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో, అంతగా దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది.

గీతము:-

ఎవరైతే తండ్రితోపాటు ఉంటారో..... (జో పియా కే సాథ్ హై.....)

ఓంశాంతి. మేము తండ్రితోపాటు కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు - వీరు అత్యంత గొప్ప బాబా, అందరికీ తండ్రి. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, తండ్రి నుండి ఏం లభిస్తుందన్న ప్రశ్నే రాదు. తండ్రి ద్వారా వారసత్వమే లభిస్తుంది. వీరు అనంతమైన తండ్రి, వీరి ద్వారా అనంతమైన సుఖము, అనంతమైన ఆస్తి లభిస్తుంది. అది హద్దులోని సంపద. కొందరి వద్ద 1 వేయి, కొంతమంది వద్ద 5 వేలు ఉండవచ్చు. కొంతమంది దగ్గర 10-20-50 కోట్లు, 100 కోట్లు ఉండవచ్చు. ఇప్పుడు వారంతా లౌకిక తండ్రులు మరియు హద్దు పిల్లలు. మనమిక్కడ అనంతమైన తండ్రి దగ్గరకు, అనంతమైన ఆస్తిని తీసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. మనసులో ఆశ అయితే ఉంటుంది కదా. పాఠశాలలో తప్ప సత్సంగాలు మొదలైనవాటిలో ఎలాంటి ఆశ ఉండదు. శాంతి లభించింది అంటారు కాని అదైతే లభించదు. మనమిక్కడకు కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. లేదంటే ఇక్కడకు ఎందుకు వస్తారు? పిల్లలు ఎంతగా వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా, మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము, ఇందులో హద్దు యొక్క విషయాలు ఏవీ లేవని అంటారు. బాబా, మీ నుండి మేము అనంతమైన స్వర్గ వారసత్వమును తీసుకునేందుకు వచ్చాము. కల్ప-కల్పము మనం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము, మళ్ళీ మాయ పిల్లి మన నుండి లాక్కుంటుంది. అందుకే దీనిని గెలుపు-ఓటముల ఆట అని అంటారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వీరు ఏ సాధు-సత్పురుషులు కారు అని పిల్లలు కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. మీకు ఎటువంటి వస్త్రాలు ఉన్నాయో వీరికి కూడా అటువంటివే ఉన్నాయి. వీరైతే బాబా కదా. ఎవరి వద్దకు వెళ్తున్నారని ఎవరైనా అడిగితే మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని చెప్తారు. ఇదైతే ఒక కుటుంబం. ఎందుకు వెళ్తారో ఏం తీసుకునేందుకు వెళ్తారో, ఇదైతే ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని, వారి నుండి వారసత్వం లభిస్తుందని ఇతరులెవ్వరూ చెప్పలేరు. తాతగారి ఆస్తికి అందరూ హక్కుదారులే. శివబాబాకు అవినాశి పిల్లలుగా అయితే ఉన్నారు, మళ్ళీ ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలైనందుకు శివబాబాకు మనుమలు మనుమరాళ్ళు. మనమంతా ఆత్మలమని ఇప్పుడు మీకు తెలుసు. ఇదైతే చాలా అభ్యాసం చెయ్యాలి. ఆత్మలమైన మనం మన తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నాము. ఆత్మలైన మనం వచ్చి తండ్రితో కలుసుకున్నాము. ఇంతకుముందు దేహాభిమానం ఉండేది. ఫలానా ఫలానా పేరు కలవారు మాత్రమే ఆస్తి తీసుకుంటారని అనేవారు. ఇప్పుడు ఆత్మలందరూ పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటారు. ఆత్మలంతా పిల్లలు, పరమాత్మ పిల్లల తండ్రి. తండ్రి పిల్లల మేళా చాలా సమయం తర్వాత ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తిమార్గంలో అనేక కృత్రిమ మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇది అన్నిటికంటే అద్భుతమైన మేళా. ఆత్మలు, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు..... (ఆత్మ, పరమాత్మ అలగ్ రహే బహుకాల్.....) అని పాడారు. ఎవరు? ఆత్మలైన మీరే. ఆత్మలమైన మనం మన మధురమైన సైలెన్స్ ఇంటిలో ఉండేవారమని, ఇప్పుడిక్కడ పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ అలసిపోయామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. సన్యాసులు, గురువులు మొదలైనవారి వద్దకు వెళ్ళి శాంతి కావాలని వేడుకుంటారు. వారు ఇల్లు-వాకిలి వదిలి అడవులకు వెళ్ళినందుకు వారి నుండి శాంతి లభిస్తుందని భావిస్తారు. కాని అలా కానే కాదు. ఇప్పుడైతే అందరూ పట్టణాలలోకి వచ్చేశారు. అడవులలో గుహలు ఖాళీగా ఉన్నాయి. గురువులుగా అయి కూర్చున్నారు. లేకుంటే వారు నివృత్తి మార్గ జ్ఞానమునిచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో వారు వివాహాలు కూడా చేయిస్తూ ఉంటారు.

పిల్లలైన మీరు, యోగబలంతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగబలంతో శీతలమైపోతాయి. కర్మేంద్రియాలలో చంచలత ఉంటుంది కదా. ఇప్పుడు కర్మేంద్రియాలపై విజయం పొందాలి, ఏ చంచలతా ఉండకూడదు. యోగబలంతో తప్ప కర్మేంద్రియాలు వశమవ్వడం అసాధ్యం. తండ్రి చెప్తున్నారు - కర్మేంద్రియాల చంచలత యోగబలం ద్వారానే సమాప్తమవుతుంది. యోగబలం శక్తి అయితే ఉంటుంది కదా. ఇందులో చాలా శ్రమ చేయాలి. ముందు-ముందు కర్మేంద్రియాల చంచలత ఉండదు. సత్యయుగంలో అయితే ఎలాంటి అశుద్ధమైన రోగం ఉండదు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశం చేసుకుని వెళ్తారు కనుక అక్కడ ఎటువంటి అశుద్ధమైన విషయము ఉండదు. దాని పేరే స్వర్గం. దాన్ని మర్చిపోవడం వలన లక్షల సంవత్సరాలని అనేశారు. ఇంతవరకూ మందిరాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఒకవేళ లక్షల సంవత్సరాలై ఉంటే ఏ విషయమూ గుర్తుండేది కాదు. ఈ మందిరాలు మొదలైనవన్నీ ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఎటువంటి చంచలత ఉండదు. శివబాబాకైతే కర్మేంద్రియాలే లేవు. కానీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. శాంతిసాగరులు, సుఖసాగరులు వారే. కర్మేంద్రియాలు వశము కావని వారంటారు. యోగబలంతో మీరు కర్మేంద్రియాలను వశము చేసుకోండి, తండ్రి స్మృతిలో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. నియమ విరుద్ధమైన పనులేవీ కర్మేంద్రియాలతో చేయకండి. ఇటువంటి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఆ ప్రేమలో ఆనందబాష్పాలు వచ్చేయాలి. ఆత్మ పరమాత్మలో లీనమవ్వనే అవ్వదు. తండ్రి ఒకేసారి, శరీరాన్ని అప్పుగా తీసుకున్నప్పుడు మాత్రమే కలుస్తారు. కనుక అటువంటి తండ్రితో ఎంత ప్రేమగా వ్యవహరించాలి! ఈ బాబాకు ప్రేరణ కలిగింది కదా. ఓహో! నా తండ్రి నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు, ఇక ఈ ధనము సంపద ఏం చేయాలి, అన్నిటినీ వదిలేసారు, పిచ్చివారిలా అయిపోయారు. ఉన్నట్టుండి వీరికి ఏమయిందని అందరూ అనుకుంటూ ఉండేవారు. వ్యాపారం మొదలైనవన్నీ వదిలేసి వచ్చేశారు. సంతోషపు పాదరసం పైకెక్కిపోయింది. సాక్షాత్కారాలు జరగడం ప్రారంభమయ్యింది. రాజ్యపదవి లభిస్తుంది కాని ఎలా లభిస్తుందో, ఏమవుతుందో ఏమీ తెలియదు. లభిస్తుందని మాత్రమే తెలుసు. ఈ సంతోషంలోనే అంతా వదిలేశారు. తర్వాత క్రమ క్రమంగా జ్ఞానం లభిస్తూ వచ్చింది. పిల్లలైన మీరు ఈ పాఠశాలకు వచ్చారు, లక్ష్యమైతే ఉంది కదా. ఇది రాజయోగము, అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారము తీసుకునేందుకు వచ్చారు. బాబా! మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించి సుఖాన్నివ్వండి అని ఎవరినైతే స్మృతి చేస్తూ వచ్చామో వారి ద్వారానే చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. మాకు కృష్ణుని వంటి పుత్రుడు కావాలని పిల్లలు అంటారు. అరే! అతను వైకుంఠములోనే కదా లభించేది. కృష్ణుడు వైకుంఠవాసి. అతడిని మీరు ఊయలలో ఊపుతారు. అయితే అతని వంటి పుత్రుడు వైకుంఠములోనే కదా లభించేది. ఇప్పుడు మీరు వైకుంఠ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు వచ్చారు. అక్కడ తప్పకుండా రాకుమారుడు, రాకుమార్తెలే లభిస్తారు. పవిత్రమైన పుత్రుడు లభించాలనే ఆశ కూడా పూర్తవుతుంది. ఇక్కడ కూడా రాకుమార-రాకుమార్తెలు చాలామంది ఉన్నారు. కానీ వీరు నరకవాసులు. మీరు స్వర్గవాసులను కోరుకుంటున్నారు. చదువైతే చాలా సహజమైనది, తండ్రి చెప్తున్నారు, మీరు చాలా భక్తి చేసి ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. మీరు ఎంతో సంతోషంగా తీర్థయాత్రలు మొదలైనవాటికి వెళ్తారు. అమరనాథ్ కు వెళ్ళి శంకరుడు పార్వతికి అమరకథ వినిపించారని భావిస్తారు. అమరనాథుని సత్యమైన కథను మీరిప్పుడు వింటున్నారు. ఇక్కడ తండ్రి కూర్చుని మీకు వినిపిస్తున్నారు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇది భాగ్యశాలి రథమని, దీనిని బాబా అప్పుగా తీసుకున్నారని మీకు తెలుసు. మనం శివబాబా వద్దకు వెళ్తాము. వారి శ్రీమతం పైనే నడుస్తాము. ఏమైనా అడగాలంటే బాబాను అడగవచ్చు. పిల్లలు అంటారు - బాబా, మేము మాట్లాడలేకపోతున్నాము. అందుకు బాబా అంటారు - పిల్లలూ, ఇందుకు మీరు పురుషార్థం చేయండి, ఇందులో నేను ఏం చేయగలను.

తండ్రి పిల్లలైన మీకు శ్రేష్ఠంగా అయ్యేందుకు సహజమైన మార్గాన్ని తెలుపుతున్నారు. మొదటిది - కర్మేంద్రియాలను వశపరచుకోండి. రెండవది దైవీగుణాలు ధారణ చేయండి. ఎవరైనా కోపగించుకుంటే ఆ మాటలు వినకండి. ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేయండి. ఇష్టం లేని చెడు మాటలను అసలు విననే వినకండి. పతి కోపగించుకుని కొడుతున్నట్లేతే ఏం చేయాలి అని అడుగుతారు. పతి కోపగించుకుంటే వారిపై పుష్పవర్షం కురిపించండి, నవ్వుతూ ఉండండి. యుక్తులైతే చాలానే ఉన్నాయి. కామేషు, క్రోధేషు అని అంటారు కదా. అబలలు బాధతో పిలుస్తూ ఉంటారు. ద్రౌపది ఒక్కరే కాదు. అందరూ ద్రౌపదులే. ఇప్పుడు నగ్నమవ్వడం (అపవిత్రమవ్వడం) నుండి రక్షించేందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తున్నారు, ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి తీసుకెళ్ళేందుకు వచ్చాను. అక్కడకు పతితాత్మలు వెళ్ళలేరు, కనుక నేను వచ్చి అందరినీ పావనంగా చేస్తాను. ఎవరికి ఏ పాత్ర లభించిందో అది పూర్తి చేసి ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మొత్తం కల్పవృక్ష రహస్యమంతా బుద్ధిలో ఉంది. వృక్షములోని ఆకులను ఎవ్వరూ లెక్కించలేరు. కనుక తండ్రి కూడా ముఖ్యమైన విషయాలైన బీజము, వృక్షముల గురించి అర్థం చేయిస్తారు. మనుష్యులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. నేను కూర్చుని ఒక్కొక్కరి లోపల ఏముందో తెలుసుకోను. భగవంతుడు అంతర్యామి అని, ప్రతి ఒక్కరి ఆంతర్యము వారికి తెలుసునని మనుష్యులు భావిస్తారు. ఇవన్నీ అంధ శ్రద్ధలు.

మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి, రాజయోగాన్ని నేర్పించండి అని మీరు నన్ను పిలిచారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఈ మతమునిస్తారు కదా. తండ్రి ఇచ్చే శ్రీమతం మరియు సద్గతి అన్నిటికంటే భిన్నమైనది. మతము అనగా సలహా, దీని ద్వారా మనకు సద్గతి కలుగుతుంది. మన సద్గతి చేసేవారు ఆ ఒక్క తండ్రేనని, ఇతరులెవ్వరూ చేయలేరని మీకు తెలుసు. వారిని ఈ సమయంలోనే పిలుస్తారు. సత్యయుగంలో అయితే పిలవనే పిలవరు. సర్వుల సద్గతిదాత ఒక్క రాముడే అని చెప్పేది ఇప్పుడే. మాల తిప్పేటప్పుడు - ఆ మాలను తిప్పుతూ-తిప్పుతూ పుష్పం వస్తూనే, "రామ” అని చెప్పి కళ్ళకు అద్దుకుంటారు. జపించవలసింది ఒక్క పుష్పమునే. మిగిలినవారంతా వారి పవిత్ర రచన. మాలను గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రితో పాటుగా సేవ చేస్తారో వారిదే ఈ మాల. శివబాబాను రచయిత అని అనరు. రచయిత అంటే ఎప్పుడు రచించారనే ప్రశ్న వస్తుంది. ప్రజాపిత బ్రహ్మా ఇప్పుడీ సంగమయుగంలోనే బ్రాహ్మణులను రచిస్తారు కదా. శివబాబా రచన అయితే అనాదిగా ఉండనే ఉంది. కేవలం పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడిది పాత సృష్టి, కొత్తదానిలో దేవతలుంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా చేసేది ఎవరు? ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్య సృష్టిని రచించేవారు బ్రహ్మా. వారు మనుష్య సృష్టికి హెడ్, మిగిలిన ఆత్మలందరి అవినాశి తండ్రి శివుడే. ఈ క్రొత్త విషయాలు మీరు వింటున్నారు. ఎవరైతే బుద్ధివంతులుగా ఉంటారో వారు మంచి రీతిగా ధారణ చేస్తారు. మెల్లమెల్లగా మీరు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు, మేము మొదట దేవతలుగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు ఎలా తీసుకుంటామో తెలిసింది. ఇప్పుడు మీకు రహస్యమంతా తెలుసు. ఎక్కువ మాటలు మాట్లాడే అవసరమే లేదు.

తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు ముఖ్యమైన విషయము తండ్రి చెప్తున్నారు - ఒకటేమో నన్ను స్మృతి చేయండి, రెండవది పవిత్రులుగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. ఇతరులను మీ సమానంగా తయారుచేయండి. ఎంత సులభము! కాని స్మృతి నిలవదు. జ్ఞానమైతే చాలా సహజము. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. మళ్ళీ సత్యయుగంలో, నూతన ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యపాలన చేస్తారు. ఈ ప్రపంచంలో ఉండే అతిపురాతన దేవీదేవతా చిత్రాలు లేక వారి భవనాలు మొదలైనవి చాలా ఉన్నాయి. అత్యంత పురాతనమైనవారము, విశ్వ మహారాజులు, మహారాణులమైన మేమే అని మీరు చెప్తారు. శరీరాలైతే సమాప్తమైపోతాయి. చిత్రాలు మాత్రము తయారుచేస్తూ ఉంటారు. రాజ్యపాలన చేస్తూ ఉన్న ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారో, రాజ్యపదవి ఎలా తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. బిర్లా ఎన్నో మందిరాలు నిర్మిస్తున్నారు, కానీ ఈ విషయాలు వారికి కూడా తెలియదు. ధనము లభిస్తూ ఉంటే నిర్మిస్తూనే ఉంటారు. ఇదంతా దేవతల కృప అని భావిస్తారు. ఒక్క శివుడిని పూజించడమే అవ్యభిచారి భక్తి, జ్ఞానమునిచ్చేవారు జ్ఞానసాగరులు ఒక్కరే. మిగిలినదంతా భక్తిమార్గం. జ్ఞానం ద్వారా అర్ధకల్పము సద్గతి లభిస్తుంది. తర్వాత భక్తి చేసే అవసరముండదు. జ్ఞానం, భక్తి, వైరాగ్యము అని అంటారు. ఇప్పుడు భక్తిపై, ఈ పాత ప్రపంచముపై వైరాగ్యముండాలి. ఇప్పుడు పాతదంతా సమాప్తమవ్వనున్నది. దీనిపై ఆసక్తి ఎందుకుంచాలి? ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. ఆ సంతోషం ఉంటుంది. చాలామంది మోక్షము పొందడం మంచిదని, మళ్ళీ ఇక్కడకు తిరిగి రాము అని భావిస్తారు. ఆత్మ సాగరములో కలిసిపోయే నీటిబుడగ వంటిదని భావిస్తారు. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు. పాత్రధారులు తప్పకుండా పాత్రను అభినయిస్తారు. ఇంట్లో కూర్చునేవారు పాత్రధారులు కానే కాదు. మోక్షము ఎవ్వరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇక్కడ మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. మనుష్యుల బుద్ధిలో అయితే జ్ఞానం కొంచెం కూడా లేదు. తండ్రి నుండి జ్ఞానం తీసుకొని వారసత్వం పొందే పాత్ర మీకు మాత్రమే ఉంది. మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. పురుషార్థము తప్పకుండా చేస్తారు. డ్రామాలో ఉంటే లభిస్తుందని అనుకోవద్దు. అలా అయితే కూర్చునే ఉండండి, కాని కర్మ లేకుండా ఎవ్వరూ ఉండలేరు. కర్మ సన్యాసము జరగనే జరగదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగబలం ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి, అవి మీ వశంలో ఉండాలి. చెడు మాటలు వినరాదు, వినిపించరాదు. ఏ విషయమైతే మీకు నచ్చదో దానిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి.

2. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పవిత్రంగా అయి మీ సమానంగా తయీరుచేసే సేవ చేయాలి.

వరదానము:-

శక్తిశాలి సేవ ద్వారా నిర్బలంగా ఉన్నవారిలో బలం నింపే సత్యమైన సేవాధారీ భవ

సత్యమైన సేవాధారుల వాస్తవిక విశేషత – నిర్బలంగా ఉన్నవారిలో బలం నింపేందుకు నిమిత్తులుగా అవ్వడం. సేవ అయితే అందరూ చేస్తారు. కాని సఫలతలో ఏదైతే భేదం కనిపిస్తుందో, ఆ భేదానికి కారణం - సేవా సాధనాలలో శక్తి లోపించడం. ఎలాగైతే కత్తిలో పదును లేకుంటే అది పని చేయదో అలా సేవా సాధనాలలో స్మృతి బలం అనే పదును లేకుంటే సఫలత ఉండదు. కావున శక్తిశాలి సేవాధారులుగా అవ్వండి. నిర్బలంగా ఉన్నవారిలో బలం నింపి క్వాలిటీ కల ఆత్మలను వెలికి తీయండి, అప్పుడు సత్యమైన సేవాధారులని అంటారు.

స్లోగన్:-

ప్రతి పరిస్థితిని ఎగిరేకళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి.