ఓంశాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు మరియు ఇప్పుడు మనం పాత్రధారులమని, 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని కూడా మీకు తెలుసు. ఇది పిల్లలైన మీ స్మృతిలోకి రావాలి. మనకు మళ్ళీ రాజ్య ప్రాప్తిని చేయించేందుకు మరియు తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారుచేసేందుకు బాబా వచ్చారని తెలుసు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీరిక్కడ స్కూల్లో కూర్చున్నట్లుగా కూర్చున్నారు. బయట ఉంటే స్కూల్లో ఉన్నట్లు కాదు. ఇది ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మిక పాఠశాల అని తెలుసు. ఆత్మిక తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. పిల్లలకు చదువు గుర్తుకు రావాలి కదా. వీరు కూడా పుత్రుడే. వీరికి మరియు అందరికీ నేర్పించేవారు ఆ తండ్రి. వారు మనుష్యాత్మలందరికీ తండ్రి. వారు వచ్చి శరీరాన్ని అప్పుగా తీసుకుని మీకు అర్థం చేయిస్తున్నారు. రోజూ అర్థం చేయిస్తారు, మీరిక్కడ కూర్చున్నప్పుడు మనం 84 జన్మలు తీసుకున్నామని బుద్ధిలో గుర్తుండాలి. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, దేవీ-దేవతలుగా ఉండేవారము, తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు వచ్చి పడిపోయాము. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది. అదంతా స్మృతిలోకి వచ్చింది. ఇదంతా భారత్ కు సంబంధించిన కథే, దానితోపాటు మీ కథ కూడా ఉంది. స్వయాన్ని మళ్ళీ మర్చిపోకండి. మనం స్వర్గంలో రాజ్యం చేసేవారము, తర్వాత 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. ఇది రోజంతా స్మృతిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు మొదలైనవి చేస్తున్నా చదువైతే గుర్తుండాలి కదా. ఎలా మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారమో, తర్వాత ఎలా మనం కిందికి దిగుతూ వచ్చామో, ఇది గుర్తుంచుకోవడం చాలా సహజం కాని ఈ స్మృతి కూడా ఎవ్వరికీ ఉండదు. ఆత్మ పవిత్రంగా లేని కారణంగా స్మృతి జారిపోతుంది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారన్న ఈ స్మృతి జారిపోతుంది. మనం బాబా యొక్క విద్యార్థులం. స్మృతియాత్రలో ఉండండి - అని తండ్రి చెప్తూ ఉంటారు. తండ్రి మనల్ని చదివించి ఈ విధంగా తయారుచేస్తున్నారు. రోజంతా ఈ స్మృతి కలుగుతూ ఉండాలి. ఈ భారత్ అలా ఉండేది కదా అని తండ్రే స్మృతినిప్పిస్తారు. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ అసురులుగా అయ్యాము. ఇంతకుముందు మీ బుద్ధి కూడా ఆసురీగానే ఉండేది. ఇప్పుడు తండ్రి ఈశ్వరీయ బుద్ధినిచ్చారు. అయినా కూడా కొంతమంది బుద్ధిలో కూర్చోవడం లేదు. మర్చిపోతారు. తండ్రి ఎంతగానో నషా ఎక్కిస్తారు. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు కావున ఆ నషా ఉండాలి కదా. మనం మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము, మనం మన రాజ్యం చేస్తాము, కొంతమందికైతే అస్సలు నషా ఎక్కదు. జ్ఞానామృతం జీర్ణమే కాదు. ఎవరికైతే నషా ఎక్కి ఉంటుందో, వారికి ఎవరో ఒకరి కళ్యాణం చేయడం తప్ప ఇతర విషయాలేవీ మాట్లాడడం కూడా బాగా అనిపించదు. పుష్పాలుగా తయారుచేసే సేవలోనే నిమగ్నమైపోతారు. మనం మొదట పుష్పాలుగా ఉండేవారము, తర్వాత మాయ ముళ్ళుగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ పుష్పాలుగా అవుతాము. ఈ విధంగా స్వయంతో మాట్లాడుకోవాలి. ఈ నషాలో ఉంటూ మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే, వెంటనే వారికి బాణం తగులుతుంది. భారత్ గార్డన్ ఆఫ్ అల్లాహ్ (ఈశ్వరుని పుష్పాలతోట) గా ఉండేది. ఇప్పుడు పతితంగా అయిపోయింది. మనమే మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఎంత గొప్ప విషయం! ఇప్పుడు మళ్ళీ మనమెలా అయిపోయాము! ఎంత పడిపోయాము! ఇది మనం కింద పడే మరియు పైకి ఎక్కే నాటకం. ఈ కథను తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు. అది అసత్యమైనది, ఇది సత్యమైనది. వారు సత్యనారాయణ కథను వినిపిస్తారు, మనం ఎలా ఎక్కామో, మళ్ళీ ఎలా పడిపోయామో అర్థం చేసుకోరు. ఈ తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను వినిపించారు. రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారో, ఇదంతా తమ పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం తండ్రి నుండి రాజ్యాన్ని ఎలా తీసుకుంటున్నామో ఆత్మకు ఇప్పుడు తెలిసింది. ఇక్కడ తండ్రి అడిగినప్పుడు - అవును, నషా ఉంది అని అంటారు, మళ్ళీ బయటకు వెళ్ళగానే నషా కొంచెం కూడా ఉండదు. పిల్లలకు స్వయంగా అర్థం అవుతుంది, భలే చేతులైతే ఎత్తుతారు కానీ నడవడిక ఎలా ఉందంటే ఇక ఆ నషా నిలువలేదు. ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా.
తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు - పిల్లలూ, నేను మీకు రాజ్యాన్నిచ్చాను, మీరు మళ్ళీ పోగొట్టుకున్నారు. మీరు కిందికి దిగుతూ వచ్చారు ఎందుకంటే ఇది పైకి ఎక్కే మరియు కిందికి దిగే నాటకం. ఈ రోజు రాజుగా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. వార్తాపత్రికల్లో ఇలాంటి విషయాలు చాలా వేస్తారు, వాటికి బదులిచ్చినట్లయితే కొద్దిగానైనా అర్థం చేసుకుంటారు. ఇది నాటకం, ఇది గుర్తున్నా కూడా సదా సంతోషం ఉంటుంది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం శివబాబా వచ్చారు, వచ్చి రాజయోగాన్ని నేర్పించారు - అని బుద్ధిలో ఉండాలి కదా. అప్పుడు యుద్ధం జరిగింది. ఇప్పుడు ఈ రైట్ విషయాలన్నీ తండ్రి వినిపిస్తున్నారు. ఇది పురుషోత్తమ యుగం. కలియుగం తర్వాత ఈ పురుషోత్తమ యుగం వస్తుంది. కలియుగాన్ని పురుషోత్తమ యుగమని అనరు. సత్యయుగాన్ని కూడా అనరు. ఆసురీ సంప్రదాయం మరియు దైవీ సంప్రదాయం అంటారు, వాటి మధ్యన ఈ సంగమయుగం ఉంటుంది, ఇప్పుడు పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా తయారవుతుంది. కొత్తది నుండి పాతదిగా అయ్యేందుకు చక్రమంతా పడుతుంది. ఇప్పుడిది సంగమయుగం. సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యముండేది. ఇప్పుడది లేదు. ఇతర ధర్మాలు చాలా వచ్చేశాయి. ఇది మీ బుద్ధిలో ఉంటుంది. 6-8 నెలలు, 12 నెలలు చదువుకుని తర్వాత పడిపోయినవారు చాలామంది ఉన్నారు. ఫెయిల్ అయిపోతారు. భలే పవిత్రంగా అవుతారు కానీ చదువుకోకపోతే చిక్కుకుంటారు. కేవలం పవిత్రత మాత్రమే పని చేయదు. అలాంటి సన్యాసులు కూడా చాలామంది ఉన్నారు, వారు సన్యాస ధర్మాన్ని విడిచిపెట్టి గృహస్థులుగా అయిపోతారు, వివాహం మొదలైనవి చేసుకుంటారు. మరిప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు స్కూల్లో కూర్చున్నారు. మనం మన రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నామో, ఎన్ని జన్మలు తీసుకున్నామో స్మృతిలో ఉంది. ఇప్పుడు విశ్వానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి మళ్ళీ చెప్తున్నారు. తప్పకుండా పావనంగా అవ్వాలి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు ఎందుకంటే బంగారంలో మాలిన్యం చేరుకుంది, అది ఎలా తొలగుతుంది? ఆత్మలైన మనం సతోప్రధానంగా ఉండేవారము, 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారము, తర్వాత కింద పడిపోతూ-పడిపోతూ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, మనమెలా అయిపోయాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. నేను ఎలా ఉండేవాడిని అని తండ్రి అయితే అనరు. మనుష్యులైన మీరే మేము దేవతలుగా ఉండేవారిమని అంటారు. భారత్ కే మహిమ ఉంటుంది కదా. భారత్ కు ఎవరు వస్తారో, ఏ జ్ఞానాన్నిస్తారో, ఇది ఎవ్వరికీ తెలియదు. లిబరేటర్ (ముక్తిదాత) ఎప్పుడు వస్తారో తెలియాలి కదా. భారత్ ప్రాచీనమైనదని గాయనం చేయబడింది కనుక భారత్ లోనే అవతరించి ఉంటారు మరియు జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. తండ్రి తప్పకుండా ఇక్కడే వస్తారు. భగీరథ్ అని కూడా అంటారు. కనుక మనిషి శరీరంలోనే వచ్చి ఉంటారు కదా. మళ్ళీ గుర్రపు రథాన్ని కూడా చూపించారు. ఎంత వ్యత్యాసం. కృష్ణుడిని మరియు రథాన్ని చూపించారు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా ఈ రథంలో వస్తారని, వీరినే భాగ్యశాలి రథమని అంటారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా సో విష్ణువు, చిత్రంలో ఎంత స్పష్టంగా ఉంది. త్రిమూర్తులపైన శివుడు, ఈ శివుని పరిచయాన్ని ఎవరిచ్చారు. బాబానే తయారుచేయించారు కదా. బాబా ఈ బ్రహ్మా రథంలో వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మా. 84 జన్మల తర్వాత విష్ణువే బ్రహ్మాగా అవుతారన్న విషయమెక్కడ, మళ్ళీ ఒక్క సెకెండులోనే బ్రహ్మా నుండి విష్ణువుగా అయ్యే విషయమెక్కడ, ఇవన్నీ పిల్లలకు అర్థం చేయించారు. ఇవన్నీ బుద్ధిలో ధారణ చేయాల్సిన అద్భుతమైన విషయాలు కదా. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. భారత్ తప్పకుండా స్వర్గంగా ఉండేది. (హెవన్లీ గాడ్ ఫాదర్) స్వర్గ రచయిత స్వర్గాన్ని తయారుచేసి ఉంటారు. ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది, అర్థం చేయించేందుకు అభిరుచి కలుగుతుంది కదా. తండ్రికి కూడా అభిరుచి ఉంది. మీరు సేవాకేంద్రాల్లో కూడా ఇలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి డైరెక్ట్ గా ఉన్నారు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మలు అర్థం చేయించడంలో మరియు తండ్రి అర్థం చేయించడంలో తప్పకుండా వ్యత్యాసముంటుంది, అందుకే సన్ముఖంగా వినేందుకు ఇక్కడకు వస్తారు. పదే-పదే పిల్లలూ-పిల్లలూ అని తండ్రే అంటారు. తండ్రి ప్రభావం ఎంతగా ఉంటుందో, సోదరుల ప్రభావం అంతగా ఉండదు. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ కలుస్తున్నారు, దీన్నే మేళా అని అంటారు. తండ్రి కూర్చుని సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు కావున చాలా నషా ఎక్కుతుంది. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మేము వారి మాట వినమా అని అనుకుంటారు. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, తర్వాత మీరు 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పతితంగా అయిపోయారు, మళ్ళీ మీరు పావనంగా అవ్వరా అని తండ్రి అంటారు. ఆత్మలతో అంటారు. కొంతమంది బాబా సత్యం చెప్తున్నారని భావిస్తారు, కొంతమందైతే వెంటనే, బాబా మేము పవిత్రంగా ఎందుకు తయారవ్వము అని అంటారు.
నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి అని తండ్రి చెప్తున్నారు. మీరు సత్యమైన బంగారంగా అయిపోతారు. నేను అందరికీ పతిత-పావనుడైన తండ్రిని, మరి తండ్రి అర్థం చేయించినదానికి మరియు ఆత్మలు (పిల్లలు) అర్థం చేయించినదానికి ఎంత వ్యత్యాసముంది. ఎవరైనా కొత్తవారు వచ్చారనుకోండి, వారిలో కూడా ఎవరైతే ఇక్కడికి చెందిన పుష్పాలుగా ఉంటారో వారికి టచ్ అవుతుంది. వీరు చెప్పేది నిజమే అని అంటారు. ఇక్కడివారు కాకపోతే అర్థం చేసుకోరు. కనుక ఆత్మలమైన మనకు, మీరు పావనంగా అవ్వండని తండ్రి చెప్తున్నారని, మీరు కూడా అర్థం చేయించండి. మనుష్యులు పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేస్తారు, గురువులను ఆశ్రయిస్తారు. కాని పతిత-పావనుడైతే తండ్రి మాత్రమే. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, మీరు ఎంత పతితంగా అయిపోయారు, అందుకే వచ్చి పావనంగా తయారుచేయమని ఆత్మ స్మృతి చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్ప-కల్పం వస్తాను, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండని పిల్లలైన మీకు చెప్తాను. ఈ రావణరాజ్యం సమాప్తమవ్వనున్నది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. స్వర్గంలో విషముండదు. ఎవరైనా వస్తే వారికి - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పావనంగా అయిపోతారు, మాలిన్యం తొలగిపోతుందని తండ్రి చెప్తున్నారని, వారికి అర్థం చేయించండి. మన్మనాభవ అనే పదం గుర్తుంది కదా. తండ్రి నిరాకారుడు, ఆత్మలమైన మనం కూడా నిరాకారులమే. ఎలాగైతే మనం శరీరం ద్వారా వింటున్నామో, తండ్రి కూడా ఈ శరీరంలోకి వచ్చి అర్థం చేయిస్తారు. లేకుంటే నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహం యొక్క సంబంధాలన్నీ విడిచిపెట్టండని ఎలా చెప్తారు. తప్పకుండా ఇక్కడకు వస్తారు, బ్రహ్మాలో ప్రవేశిస్తారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రజాపిత ఉన్నారు, వీరి ద్వారా మాకు తండ్రి ఇలా చెప్తున్నారు, మేము అనంతమైన తండ్రి చెప్పిందే అంగీకరిస్తాము. వారు చెప్తున్నారు, పావనంగా అవ్వండి, పతితత్వమును విడిచిపెట్టండి, పాత దేహం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టండి. నన్ను స్మృతి చేసినట్లయితే అంతమతి సో గతి అవుతుంది, మీరు లక్ష్మీ-నారాయణులుగా అవుతారు.
తండ్రి నుండి విముఖులుగా చేసే ముఖ్యమైన అవగుణం - పరస్పరంలో పరచింతన చేయడం. చెడు మాటలు వినడం మరియు వినిపించడం. మీరు చెడు విషయాలు వినకూడదని తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు. వీరి విషయాలు వారికి, వారి విషయాలు వీరికి వినిపించే, చాడీలు చెప్పే అలవాటు పిల్లలైన మీలో ఉండకూడదు. ఈ సమయంలో ప్రపంచంలోని వారందరూ విపరీతబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. ఒక్క రాముని విషయాలను తప్ప ఇతర విషయాలను వినిపించడాన్ని పరచింతన అనే అని అంటారు. ఈ పరచింతనను విడిచిపెట్టమని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మీరు ఆత్మలందరికీ చెప్పండి, ఓ సీతలారా, మీరు ఒక్క రామునితో యోగం జోడించండి. మీరు సందేశకులు, తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని ఈ సందేశమివ్వండి, చాలు. ఈ విషయం తప్ప మిగలిన విషయాలన్నీ పరచింతనయే. ఈ పరచింతనను విడిచిపెట్టమని తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు. సీతలందరి యోగాన్ని ఒక్క రామునితో జోడింపజేయండి. ఇదే మీ వ్యాపారము. ఈ సందేశమునిస్తూ ఉండండి, చాలు. తండ్రి వచ్చి ఉన్నారు, మీరు బంగారు యుగంలోకి వెళ్ళాలని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇనుమ యుగాన్ని విడిచిపెట్టాలి. మీకు వనవాసం లభించింది, అడవిలో కూర్చున్నారు కదా. అడవిని వనం అని కూడా అంటారు. కన్యకు వివాహమైనప్పుడు వనంలో కూర్చుంటుంది, తర్వాత మహలులోకి వెళ్తుంది. మీరు కూడా అడవిలో కూర్చున్నారు. ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి, ఈ పాత దేహాన్ని విడిచిపెట్టాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఎవరికైతే వినాశన కాలంలో ప్రీతిబుద్ధి ఉంటుందో వారు మహలులోకి వెళ్తారు, మిగిలిన విపరీత బుద్ధికలవారంతా వనవాసానికి వెళ్తారు. అడవిలో నివసిస్తారు. తండ్రి పిల్లలైన మీకు రకరకాలుగా అర్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండైతే ఇంత అనంతమైన రాజ్యాధికారం తీసుకున్నారో, వారిని మర్చిపోయారు కనుక వనవాసంలోకి వెళ్ళిపోయారు. వనవాసము మరియు గార్డన్ (పూతోట) వాసము. తండ్రి పేరే తోట యజమాని. కాని ఎవరికైనా బుద్ధిలోకి వస్తే కదా. భారత్ లోనే మన రాజ్యముండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడిది వనవాసము. మళ్ళీ తోటలోకి వెళ్తాము. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా బుద్ధిలో - మేము అనంతమైన తండ్రి నుండి మా రాజ్యం తీసుకుంటున్నామని ఉంది. తండ్రి చెప్తున్నారు, నాతో ప్రీతి ఉంచండి, అయినా మళ్ళీ మర్చిపోతారు. మీరు తండ్రినైన నన్ను ఎంతవరకు మర్చిపోతూ ఉంటారని - తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. మళ్ళీ బంగారు యుగంలోకి ఎలా వెళ్తారు. మేము ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మనం స్మృతి అనే అగ్నిలో పడి ఉన్నట్లున్నాము, దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఒక్క తండ్రితోనే ప్రీతిబుద్ధి కలిగి ఉండాలి. అందరికంటే ఫస్ట్ క్లాస్ ప్రియుడు, వారు మిమ్మల్ని కూడా ఫస్ట్ క్లాస్ గా తయారుచేస్తారు. థర్డ్ క్లాస్ లో మేకల వలె ప్రయాణం చేయడం ఎక్కడ, ఎయిర్ కండిషన్ లో ప్రయాణం చేయడం ఎక్కడ. ఎంత వ్యత్యాసం ఉంది. ఇదంతా విచార సాగర మథనము చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ బాబా కూడా చెప్తారు, నేను కూడా తండ్రిని స్మృతి చేసేందుకు చాలా తల బాదుకుంటాను (ఎంతగానో కష్టపడతాను). రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు కూడా ఈ శ్రమే చేయాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎవరికైనా ఒక్క రాముని విషయాలను తప్ప ఇతర ఏ విషయాలను కూడా వినిపించకూడదు. ఒకరి విషయాలు మరొకరికి వినిపించటం, పరచింతన చేయటం, దీనిని విడిచిపెట్టాలి.
2. ఒక్క తండ్రితోనే ప్రీతిని ఉంచాలి. పాత దేహం యొక్క అభిమానాన్ని విడిచి ఒక్క తండ్రి స్మృతి ద్వారా స్వయాన్ని పావనంగా తయారుచేసుకోవాలి.