05-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. ఎందుకంటే మీకు అనంతమైన వారసత్వము లభిస్తుంది, మీరు ప్రేమతో "నా బాబా" అని అంటారు"

ప్రశ్న:-

ఏ దేహధారి మనుష్యుల మాటలనూ తండ్రి మాటలతో పోల్చలేరు, ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే తండ్రి చెప్పే ఒక్కొక్క మాట మహావాక్యము. ఈ మహావాక్యాలను వినేవారు మహాన్ గా అనగా పురుషోత్తములుగా అవుతారు. తండ్రి యొక్క మహావాక్యాలు పుష్పాలుగా తయారుచేస్తాయి. మనుష్యుల మాటలు మహావాక్యాలు కావు, వాటి వలన ఇంకా కిందకు పడిపోతూ వచ్చారు.

గీతము:-

ప్రపంచము మారిపోయినా..... (బదల్ జాయె దునియా.....)

ఓంశాంతి. పాట మొదటి లైనులో కొంత అర్థముంది, మిగిలిన పాటంతా ఎందుకూ పనికిరాదు. ఎలా అయితే గీతలో భగవానువాచ - "మన్మనాభవ, మధ్యాజీ భవ" అనే ఈ పదాలు సరియైనవే. దీనిని పిండిలో ఉప్పుంత అని అంటారు. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అంటారో, ఇది పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. శివబాబాను భగవంతుడని అంటారు. శివబాబా వచ్చి శివాలయాన్ని రచిస్తారు. ఎక్కడకు వస్తారు? వేశ్యాలయములోకి వస్తారు. స్వయం వారే వచ్చి అంటారు - ఓ మధురాతి మధురమైన ప్రియమైన, చాలా కాలం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన ఆత్మిక పిల్లలూ, వినేది ఆత్మనే కదా. ఆత్మలమైన మనము అవినాశి అని మీకు తెలుసు. ఈ దేహము వినాశి. ఆత్మలమైన మనము ఇప్పుడు మన పరమపిత పరమాత్మ ద్వారా మహావాక్యాలు వింటున్నాము. ఒక్క పరమపిత పరమాత్మవే మహావాక్యాలు, అవి మహాన్ పురుషులుగా, పురుషోత్తములుగా తయారుచేస్తాయి. మిగిలిన మహాత్మలు, గురువులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారి వాక్యాలు మహావాక్యాలు కావు. శివోహం అనేది కూడా సరియైన వాక్యము కాదు. ఇప్పుడు మీరు తండ్రి నుండి మహావాక్యాలు విని పుష్పాలుగా అవుతారు. ముళ్ళకు, పుష్పాలకు ఎంత వ్యత్యాసముంది. మనకు వినిపించేది మనుష్యులు ఎవరూ కాదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వీరిలో శివబాబా విరాజమానమై ఉన్నారు, వారు కూడా ఆత్మనే, కాని వారిని పరమ ఆత్మ అని అంటారు. ఇప్పుడు పతితాత్మలు అంటారు - ఓ పరమాత్మా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. వారు పరమపిత, పరం గా తయారుచేయువారు. మీరు పురుషోత్తములుగా అనగా పురుషులందరిలో ఉత్తమ పురుషులుగా అవుతారు. వారు దేవతలు. పరమపిత అనే పదము చాలా మధురమైనది. సర్వవ్యాపి అనడంతో అంత మాధుర్యము అనిపించదు. మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే ప్రేమతో లోలోపల స్మృతి చేస్తారు, ఆ స్త్రీ-పురుషులు అయితే ఒకరినొకరు స్థూలంగా స్మృతి చేస్తారు. ఇది ఆత్మలు పరమాత్మను చాలా ప్రేమగా స్మృతి చేయడం. భక్తిమార్గములో ఇంత ప్రేమతో పూజించలేరు. ఆ ప్రేమ ఉండదు. వారెవరో తెలియనప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలైన మీకు చాలా ప్రేమ ఉంది. ఆత్మ - "నా బాబా" అని అంటుంది. ఆత్మలంతా భాయీ-భాయీ (సోదరులే) కదా. ప్రతి సోదరుడు బాబా మాకు తమ పరిచయమిచ్చారని అంటారు. కానీ దానిని ప్రేమ అని అనరు. ఎవరి నుండైనా ఎదైనా లభిస్తే వారిపై ప్రేమ ఉంటుంది. తండ్రిపై పిల్లలకు ప్రేమ ఉంటుంది ఎందుకంటే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఎంత ఎక్కువ వారసత్వమో, పిల్లలకు అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒకవేళ తండ్రి దగ్గర ఏ ఆస్తి లేకపోతే, తాతయ్య దగ్గర ఉంటే, అప్పుడు తండ్రిపై అంత ప్రేమ ఉండదు. అప్పుడు తాతయ్యపై ప్రేమ ఉంటుంది. వీరి నుండి ధనము లభిస్తుందని భావిస్తారు. ఇప్పుడు అయితే వీరు అనంతమైన తండ్రి. మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా సంతోషించే విషయము. భగవంతుడు మనకు తండ్రి. రచయిత అయిన ఆ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియకపోవడం వల్ల స్వయాన్ని తండ్రి అని చెప్పుకుంటారు. ఎలా అయితే చిన్న బాలుడిని, నీ తండ్రి ఎవరు? అని అడిగండి. చివరికి నేనే అని అనేస్తాడు. వారు తండ్రులందరికి తండ్రి అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు, ఇప్పుడు మనకు లభించిన అనంతమైన తండ్రికి, తండ్రి ఎవ్వరూ లేరు. వీరు అత్యంత ఉన్నతమైన తండ్రి. కనుక పిల్లలకు లోలోపల సంతోషముండాలి. ఆ యాత్రలకు వెళ్తే అక్కడ ఇంత సంతోషము ఉండదు ఎందుకంటే అక్కడ ప్రాప్తి ఏమి లేదు. కేవలం దర్శనము చేసుకునేందుకు వెళ్తారు. అనవసరంగా ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఒకటేమో తల నుదురు అరిగిపోతుంది, రెండవది ధనము కరిగిపోతుంది. ధనము చాలా ఖర్చు చేస్తారు, ప్రాప్తి ఏమీ ఉండదు. భక్తిమార్గములో ఒకవేళ సంపాదన ఉంటే భారతవాసులు చాలా శ్రీమంతులుగా అయ్యేవారు. ఈ మందిరాలు మొదలైనవి నిర్మించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. మీ యొక్క సోమనాథ మందిరము ఒక్కటే కాదు. రాజులందరి దగ్గర మందిరాలు ఉండేవి. మీకు ఎంత ధనమిచ్చాను - 5 వేల సంవత్సరాల క్రితము మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేశాను. ఇలా చెప్పేది ఒక్క తండ్రి మాత్రమే. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము మీకు రాజయోగము నేర్పించి మిమ్మల్ని ఇలా తయారుచేశాను. ఇప్పుడు మీరు ఎలా అయిపోయారు. ఇదంతా బుద్ధిలోకి రావాలి కదా. మేము ఎంత ఉన్నతంగా ఉండేవారము, పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పూర్తి నేలపైకి వచ్చి పడిపోయాము. గవ్వ సమానమైపోయాము. ఇప్పుడు మళ్ళీ మనము బాబా దగ్గరకు వెళ్తాము. ఆ బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ ఒక్క యాత్ర ద్వారా మాత్రమే ఆత్మలకు తండ్రి లభిస్తారు, కనుక లోపల ఆ ప్రేమ ఉండాలి. పిల్లలైన మీరిక్కడకు వచ్చినప్పుడు, ఏ తండ్రి ద్వారా మాకు మళ్ళీ విశ్వం యొక్క రాజ్యం లభిస్తుందో, ఆ తండ్రి వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉండాలి. ఆ తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారు - పిల్లలూ, దైవీ గుణాలు ధారణ చేయండి. సర్వశక్తివంతుడు, పతిత పావనుడు అయిన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను కల్ప-కల్పము వచ్చి నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని చెప్తాను. మనము అనంతమైన తండ్రి దగ్గరకు వచ్చామని మీ మనసులో ఉండాలి. నేను గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తున్నారు. నేను గుప్తమని ఆత్మ చెప్తుంది. శివబాబా దగ్గరకు, బ్రహ్మా దాదా దగ్గరకు వెళ్తున్నామని మీరు భావిస్తారు. ఎవరైతే కంబైండుగా ఉన్నారో, వారిని కలుసుకునేందుకు మనము వెళ్తాము, వారి ద్వారా మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. లోపల ఎంత అనంతమైన సంతోషం ఉండాలి. మధుబన్ కు వచ్చేందుకు మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు లోలోపల ఆనందముతో పులకరించిపోవాలి. తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు, దైవీగుణాలను ధారణ చేసేందుకు మనకు యుక్తులు తెలియజేస్తారు. ఇంటి నుండి బయలుదేరే సమయంలోనే లోలోపల ఈ సంతోషం ఉండాలి. ఎలాగైతే కన్య తన పతిని కలుసుకున్నప్పుడు నగలు మొదలైనవి ధరిస్తుంది, అప్పుడు ముఖము వికసించిపోతుంది. దుఃఖము పొందేందుకు ఆ ముఖము వికసిస్తుంది. మీ ముఖము సదా సుఖము పొందేందుకు వికసిస్తుంది. కనుక ఇటువంటి తండ్రి దగ్గరకు వచ్చే సమయములో ఎంత సంతోషముండాలి. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. సత్యయుగంలోకి వెళ్తాము, మళ్ళీ డిగ్రీ తగ్గిపోతుంది. ఇప్పుడైతే బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు. వారు మన తండ్రి కూడా, టీచరుగా కూడా, చదివిస్తారు, మళ్ళీ పావనంగా చేసి కూడా తీసుకువెళ్తారు. ఇప్పుడు ఆత్మలైన మనము ఈ ఛీ-ఛీ రావణ రాజ్యము నుండి విడుదల అవుతాము. లోలోపల అపారమైన సంతోషం ఉండాలి - తండ్రి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నప్పుడు, చదువును ఎంత బాగా చదువుకోవాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. బాబా, మేము శ్రీనారాయణునిగా అవుతామని పిల్లలంటారు. ఇది సత్యనారాయణ కథ అనగా నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. ఆ అసత్యపు కథలను జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఒక్కసారి మాత్రమే మీరు సత్యాతి సత్యమైన కథను వింటారు. తర్వాత అది భక్తి మార్గములో కొనసాగుతుంది. ఎలా అయితే శివబాబా జన్మ తీసుకున్నారు, అప్పటి నుండి ప్రతి సంవత్సరము వారి జయంతిని జరుపుకుంటూ వచ్చారు కదా. వారు ఎప్పుడు వచ్చారో, ఏం చేశారో, ఏమీ తెలియదు. అచ్ఛా, కృష్ణ జయంతిని జరపుకుంటారు, వారు కూడా ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో కొంచెము కూడా తెలియదు. కంసపురిలో వస్తారని అంటారు, ఇప్పుడు వారు పతిత ప్రపంచములో ఎలా జన్మ తీసుకుంటారు? అనంతమైన తండ్రి దగ్గరకు వెళ్తామని పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. అనుభవము కూడా వినిపిస్తారు కదా - మాకు ఫలానావారి ద్వారా బాణము తగిలింది, బాబా వచ్చారని తెలిసింది.....! అంతే, ఆ రోజు నుండి మేము తండ్రినే స్మృతి చేస్తున్నాము.

ఇది మీ అతి పెద్ద తండ్రి దగ్గరకు వచ్చే యాత్ర. బాబా అయితే చైతన్యమైనవారు, పిల్లల దగ్గరకు వెళ్తారు కూడా. అవి భౌతిక యాత్రలు. ఇక్కడ తండ్రి చైతన్యంగా ఉన్నారు. ఆత్మలమైన మనము ఎలా అయితే మాట్లాడుతామో, అలా ఆ పరమాత్మ తండ్రి కూడా శరీరము ద్వారా మాట్లాడుతారు. ఈ చదువు భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు. ఆ చదువు కేవలం ఈ ఒక్క జన్మ కొరకే. ఇప్పుడు ఏ చదువు చదువుకోవాలి మరియు ఏ వ్యాపారము చేయాలి? రెండూ చేయమని తండ్రి చెప్తున్నారు. సన్యాసుల వలె ఇల్లు-వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళకూడదు. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఈ చదువు ఇరువురి కొరకు. అందరూ చదవరు కూడా. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువ. కొంతమందికి వెంటనే బాణము తగులుతుంది. కొంతమంది వెర్రివాని వలె మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది – సరే, మేము అర్థము చేసుకునేందుకు ప్రయత్నిస్తామని అంటారు. కొంతమంది, ఇవి ఏకాంతములో అర్థము చేసుకోవలసిన విషయాలని అంటారు. అంతే, ఇక అదృశ్యమైపోతారు. ఎవరికైనా జ్ఞాన బాణము తగిలితే వెంటనే వచ్చి అర్థము చేసుకుంటారు. కొంతమంది - మాకు తీరిక లేదని అంటారు. అయితే బాణం తగల్లేదని అర్థం చేసుకోండి. చూడండి, బాబా బాణము తగిలిన వెంటనే వదిలేసారు కదా. చక్రవర్తిత్వం లభిస్తుంది, దాని ముందు ఇదెంత అని భావించారు. మనమైతే తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఆ వ్యాపారము మొదలైనవి కూడా చేయండి, కేవలం ఒక వారము ఇవి మంచి రీతిగా అర్థము చేసుకోండి. గృహస్థ వ్యవహారమును కూడా సంభాళించాలి. రచనను కూడా పాలన చేయాలి. వారు రచించి పారిపోతారు. మీరు రచించారు కావున మంచిరీతిగా సంభాళించండి అని తండ్రి చెప్తున్నారు. మీ స్త్రీ గానీ, పుత్రుడు గానీ మీ మాట వింటే సుపుత్రుడని భావించండి. ఒకవేళ వినకపోతే కుపుత్రుడు. సుపుత్రుడు ఎవరో మరియు కుపుత్రుడు ఎవరో తెలిసిపోతుంది కదా. తండ్రి చెప్తున్నారు, మీరు శ్రీమతం అనుసారంగా నడిచినట్లయితే శ్రేష్ఠంగా అవుతారు. లేదంటే వారసత్వము లభించదు. పవిత్రులుగా అయి, సుపుత్రులుగా అయి పేరు ప్రసిద్ధము చేయండి. బాణము తగిలితే – అంతే, ఇప్పుడిక మేము సత్యమైన సంపాదన చేస్తాము అని అంటారు. శివాలయంలోకి తీసుకెళ్ళేందుకు తండ్రి వచ్చారు. కనుక శివాలయంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వాలి. శ్రమ ఉంది. ఇప్పుడు శివబాబాను స్మృతి చేయండి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్పండి. వారి కళ్యాణము కూడా చేయాలి కదా. ఇప్పుడు స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని చెప్పండి. పుట్టింటినీ, అత్తవారింటినీ ఉద్ధరించడం పిల్లలైన మీ కర్తవ్యము. మిమ్మల్ని పిలిచినప్పుడు వారి కళ్యాణము చేయడం మీ కర్తవ్యము. దయాహృదయులుగా అవ్వాలి. పతిత తమోప్రధాన మనుష్యులకు సతోప్రధానమయ్యే దారిని చూపించాలి. ఏ వస్తువైనా కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుందని మీకు తెలుసు. నరకంలో అందరూ పతితాత్మలే ఉన్నారు, అందుకే వారు పావనంగా అయ్యేందుకు గంగలో స్నానము చేసేందుకు వెళ్తారు. మొదట మనము పతితులమని అర్థం చేసుకోవాలి, అందుకే పావనంగా అవ్వాలి. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. సాధు-సత్పురుషులు మొదలైన వారందరికి, నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అన్న నా సందేశాన్నివ్వండి. ఈ యోగాగ్నితో లేక స్మృతియాత్ర ద్వారా మీ మలినాలు తొలిగిపోతూ ఉంటాయి. మీరు పవిత్రంగా అయి నా వద్దకు వచ్చేస్తారు. నేను మీ అందరినీ వెంట తీసుకెళ్తాను. ఎలా అయితే తేలు వెళ్తూ-వెళ్తూ మెత్తని వస్తువును చూసినప్పుడు కుడుతుంది. రాతిని కుట్టి ఏం చేస్తుంది! మీరు కూడా తండ్రి పరిచయం ఇవ్వండి. తండ్రి ఇది కూడా తెలియజేసారు - నా భక్తులెక్కడుంటారు! శివాలయాలు, కృష్ణ మందిరాలు, లక్ష్మినారాయణుల మందిరాలలో. భక్తులు నన్ను భక్తి చేస్తూ ఉంటారు. వారు కూడా పిల్లలే కదా. నా ద్వారా రాజ్యము తీసుకున్నారు, ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. దేవతల భక్తులు కదా. నంబరువన్ భక్తి శివుని అవ్యభిచారి భక్తి. తిరిగి క్రింద పడుతూ-పడుతూ ఇప్పుడు భూత పూజ చేస్తున్నారు. శివుని పూజారులకు అర్థం చేయించడం సహజమవుతుంది. ఈ ఆత్మలందరికీ తండ్రి శివబాబా. స్వర్గ వారసత్వమునిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. మేము మీకు సందేశమును ఇస్తాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేనే పతిత పావనుడను, జ్ఞాన సాగరుడను. జ్ఞానము కూడా వినిపిస్తున్నాను. పావనంగా అయ్యేందుకు యోగము కూడా నేర్పిస్తున్నాను. బ్రహ్మా శరీరము ద్వారా నన్ను స్మృతి చేయండి అనే సందేశమునిస్తున్నాను. మీ 84 జన్మలను స్మృతి చేయండి. మీకు మందిరాలలో మరియు కుంభమేళాలలో భక్తులు లభిస్తారు. అక్కడకు వెళ్లి మీరు పతితపావని గంగనా లేక పరమాత్మనా అని వారికి అర్థము చేయించవచ్చు.

మేము ఎవరి వద్దకు వెళ్తున్నాము అని పిల్లలకు సంతోషముండాలి. ఎంత సాధారణంగా ఉన్నారు. ఏం ఆడంబరం చూపించాలి. గొప్ప వ్యక్తిగా కనిపించేందుకు శివబాబా ఏం చేయాలి? సన్యాసుల వస్త్రాలనైతే ధరించలేరు. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ శరీరాన్ని తీసుకుంటాను. నేను ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి. ఈ రథాన్ని ఎలా అలంకరించాలి? వారు హుస్సేన్ గుర్రమును అలంకరిస్తారు. ఇక్కడ శివబాబా రథముగా ఎద్దును తయారుచేశారు. ఎద్దు మస్తకముపై గుండ్రముగా శివుని చిత్రమును చూపిస్తారు. ఇప్పుడు శివబాబా ఎద్దులోకి ఎలా వస్తారు? మరి మందిరములో ఎద్దును ఎందుకు ఉంచారు? శంకరుని వాహనము అని అంటారు. సూక్ష్మవతనములో శంకరునికి వాహనము ఉంటుందా? ఇవన్నీ భక్తిమార్గములోనివి, డ్రామాలో నిర్ణయించబడినవి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి - ఇప్పుడు మేము సత్యమైన సంపాదన చేస్తాము, స్వయాన్ని శివాలయములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేసుకుంటాము, సుపుత్రులుగా అయి శ్రీమతమును అనుసరించి తండ్రి పేరును ప్రసిద్ధము చేస్తాము అని.

2. దయాహృదయులుగా అయి తమోప్రధాన మనుష్యులను సతోప్రధానంగా తయారుచేయాలి. అందరికి కళ్యాణము చేయాలి. మృత్యువు కన్నా ముందే అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి.

వరదానము:-

హాజి (సరే) అనే పాఠము ద్వారా సేవలలో మహాన్ గా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్ర భవ

ఏ సేవ అయినా సంతోషంగా, ఉత్సాహంగా చేస్తూ, ఏ సేవ జరిగినా అందులో అందరి ఆశీర్వాదాలు ప్రాప్తి అవ్వాలనే ధ్యాస సదా ఉండాలి, ఎందుకంటే ఎక్కడైతే ఆశీర్వాదాలుంటాయో, అక్కడ శ్రమ ఉండదు. ఇప్పుడిదే లక్ష్యముండాలి - ఎవరి సంపర్కములోకి వచ్చినా వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. హాజి (సరే) పాఠమే ఆశీర్వాదాలు పొందేందుకు సాధనము. ఎవరైనా తప్పు చేసినా వారిని నీవు తప్పు చేశావని క్రింద పడేసేందుకు బదులు ఆధారమిచ్చి నిలబెట్టండి. సహయోగులుగా అవ్వండి. అప్పుడు వారి ద్వారా కూడా సంతుష్టతా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆశీర్వాదాలు తీసుకోవడంలో మహాన్ గా అవుతారో వారు స్వతహాగా మహాన్ గా అయిపోతారు.

స్లోగన్:-

కష్టపడి పని చేసేవారిగా ఉండడంతో పాటు మీ స్థితిని కూడా శక్తివంతముగా చేసుకోవాలనే లక్ష్యము పెట్టుకోండి.