12-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకు వెళ్ళేందుకు మీకు నావికుడు లభించారు, మీ కాళ్ళు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు, మీ లంగరు ఎత్తబడింది"

ప్రశ్న:-

ఇంద్రజాలికుడైన తండ్రి చేసే అద్భుతమైన ఇంద్రజాలం ఏది, అది ఇతరులెవరూ చేయలేరు ?

జవాబు:-

గవ్వ సమానమైన ఆత్మను వజ్ర తుల్యంగా తయారు చేయడం, తోట యజమానిగా అయి ముళ్ళను పుష్పాలుగా చేయడం – చాలా అద్భుతమైన ఈ ఇంద్రజాలాన్ని తండ్రి మాత్రమే చేయగలరు, ఇతరులెవ్వరూ చేయలేరు. మానవులు కేవలం ధనం సంపాదించేందుకే ఇంద్రజాలికుడు అని చెప్పుకుంటారు కానీ తండ్రి చేసే ఇంద్రజాలాన్ని ఎవ్వరూ చేయలేరు.

ఓంశాంతి. మొత్తం సృష్టిచక్రం లేక డ్రామాలో తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో ఇలా ఎవ్వరూ భావించరు. అక్కడ కథ చెప్తున్నవారు తండ్రి కాదు, వింటున్నవారు పిల్లలూ కారు. వాస్తవానికి వారు ఫాలోవర్స్ (అనుయాయులు) కూడా కారు. ఇక్కడ పిల్లలు, విద్యార్థులే కాక అనుయాయులు కూడా మీరే. తండ్రి పిల్లలను తమతో తీసుకెళ్తారు. బాబా వెళ్తే పిల్లలు కూడా ఈ ఛీ-ఛీ ప్రపంచం నుండి తమ పుష్పాల ప్రపంచానికి వెళ్ళి రాజ్యం చేస్తారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఈ శరీరంలో ఉండే ఆత్మ చాలా సంతోషిస్తుంది. మీ ఆత్మ కూడా చాలా సంతోషించాలి. ఎందుకంటే సర్వాత్మలకు తండ్రి అయిన అనంతమైన తండ్రి వచ్చారు, ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇక ప్రపంచంలో ఉన్నవారంతా తెలివిహీనులే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - రావణుడు మిమ్మల్ని ఎంతో తెలివిహీనులుగా చేసేశాడు. తండ్రి వచ్చి మళ్ళీ వివేకవంతులుగా చేస్తున్నారు. మొత్తం విశ్వంపై రాజ్యం చేసేంత యోగ్యులుగా, అంతటి తెలివైనవారిగా తయారు చేస్తున్నారు. భగవంతుడు స్వయంగా వచ్చి చదివించే ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితం కూడా ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది మీ బుద్ధిలో ఉంది, మిగిలిన వారందరూ వారి వారి వ్యాపారాలలో చిక్కుకొని ఉన్నారు. భగవంతుడు చదివిస్తున్నారని వారి బుద్ధిలోకి ఎప్పుడూ రాదు. వారికి వారి వ్యాపార-వ్యవహారాలే గుర్తుంటాయి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారంటే మీరెంత హర్షితంగా ఉండాలి. వారంతా పైసా విలువ గలవారి పిల్లలు. మీరంతా భగవంతుని పిల్లలు, కావున పిల్లలైన మీకు అనంతమైన సంతోషముండాలి. కొందరు చాలా హర్షితంగా ఉంటారు. కొంతమంది పిల్లలు, బాబా మురళి నడిపించలేకపోతున్నాము, ఇలా అవుతుంది.... అని చెప్తారు. అరే! మురళి కష్టమేమీ కాదు. భక్తిమార్గంలో సాధు సన్యాసులు మొదలైన వారిని కొంతమంది - మేము ఈశ్వరుడిని ఎలా కలవాలి అని అడుగుతారు కానీ వారికి తెలియదు. భగవంతుని స్మృతి చెయ్యండని కేవలం వేలితో పైకి సూచిస్తారు. అంత మాత్రానికే సంతోషిస్తారు. భగవంతుడు ఎవరో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తమ తండ్రి గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాయే అలా తయారై ఉంది, మళ్ళీ కూడా మర్చిపోతారు. మీలో కూడా అందరూ తండ్రిని, వారి రచన గురించి తెలుసుకున్నారని కాదు. అక్కడక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారంటే అడగకండి. ఆ నషానే ఎగిరిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ కాళ్ళు పాత ప్రపంచంపై లేనట్లే ఉన్నాయి. ఇప్పుడు కలియుగ ప్రపంచం నుండి కాళ్ళు ఎత్తేశారు. బోటు (నావ) యొక్క లంగరు ఎత్తి వేయబడిందని మీకు తెలుసు. ఇప్పుడు మనం వెళ్తున్నాము, తండ్రి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో మీ బుద్ధిలో ఉంది ఎందుకంటే తండ్రి నావికుడే కాక తోట యజమాని కూడా. ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. ముళ్ళను పుష్పాలుగా చేసేటువంటి తోట యజమాని ఎవ్వరూ లేరు. ఈ ఇంద్రజాలం తక్కువైనదేమీ కాదు. గవ్వ సమానమైన ఆత్మలను వజ్ర సమానంగా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంద్రజాలికులు చాలామంది వెలువడ్డారు. ఇది మోసాల ప్రపంచం. తండ్రి సద్గురువు. సద్గురువు అకాలుడని కూడా చెప్తారు. చాలా నషాతో చెప్తారు. సద్గురువు ఒక్కరే, సర్వుల సద్గతిదాత ఒక్కరే అని చెప్తున్నప్పుడు మళ్ళీ స్వయాన్ని గురువుగా ఎందుకు పిలిపించుకోవాలి? వారూ అర్థం చేసుకోలేరు, మనుష్యులు కూడా అర్థం చేసుకోరు. ఈ పాత ప్రపంచంలో ఇంకా ఏమి ఉంది? తండ్రి కొత్త ఇల్లు నిర్మిస్తున్నారని పిల్లలకు తెలిసినప్పుడు కొత్త ఇంటిని ద్వేషిస్తూ, పాత ఇంటిని ప్రేమించే వారెవరుంటారు? బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక తండ్రి మా కొరకు నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారని మీ బుద్ధిలో సదా స్మృతి ఉండాలి. మనం ఆ నూతన ప్రపంచంలోకి వెళ్తాము. ఆ కొత్త ప్రపంచానికి అనేక పేర్లున్నాయి. సత్యయుగం, హెవెన్, ప్యారడైజ్, వైకుంఠము మొదలైనవి... మీ బుద్ధి ఇప్పుడు పాత ప్రపంచం నుండి తొలగిపోయింది ఎందుకంటే పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖముంది. దీని పేరే నరకం, ముళ్ళ అడవి, రౌరవ నరకం, కంసపురి. వీటి అర్థాలు కూడా ఎవ్వరికీ తెలియదు. రాతి బుద్ధి కలవారు కదా. భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. తండ్రి చెప్తున్నారు - ఈ సమయంలో అందరూ రాతిబుద్ధి కలవారే. సత్యయుగంలో అందరూ పారస బుద్ధి కలిగి ఉంటారు, యథా రాజా-రాణీ తథా ప్రజా. ఇక్కడ ప్రజలపై ప్రజా రాజ్యముంది అందుకే అందరి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు.

పిల్లలైన మీ బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఉన్నతోన్నతమైనవారు తండ్రి. మరి సెకెండు నెంబరులో ఉన్నతమైనవారు ఎవరు? బ్రహ్మా, విష్ణు, శంకరుల గొప్పతనమేమీ లేదు. శంకరుని దుస్తులు మొదలైనవి ఎలా చూపించారు. వారు భంగు తాగుతారు, ఉమ్మెత్త పూలను తింటారు...... అని అంటారు. ఇది అవమానించడం కదా. ఈ విషయాలేవీ జరగవు. వీరు తమ ధర్మాన్నే మర్చిపోయారు. తమ దేవతల గురించి కూడా ఏమేమో చెప్తుంటారు. ఎంత అగౌరవపరుస్తారు! అందుకే తండ్రి చెప్తున్నారు - నన్ను కూడా అగౌరవపరిచారు, శంకరుడిని, బ్రహ్మాను కూడా అగౌరవపరిచారు, విష్ణువును అగౌరవపరచరు. వాస్తవానికి వారిని కూడా గుప్తంగా నిందించారు. ఎందుకంటే విష్ణువే రాధా కృష్ణులు. కృష్ణుడు చిన్న బాలుడు కనుక మహాత్ముల కంటే శ్రేష్ఠమైన వాడని మహిమ చేయబడ్డారు. వీరు (బ్రహ్మా) అయితే తర్వాత సన్యసిస్తారు. కానీ అతనైతే చిన్న బాలుడు, పవిత్రంగానే ఉంటాడు. పాపం మొదలైన వాటి గురించి అతనికేమీ తెలియదు. కావున ఉన్నతోన్నతమైనవారు శివబాబా, ప్రజాపిత బ్రహ్మాను ఎక్కడ చూపించాలో కూడా పాపం వారికి తెలియదు. ప్రజాపిత బ్రహ్మాను శరీరధారిగా చూపిస్తారు కూడా. అజ్మేర్ లో వారి మందిరముంది. బ్రహ్మాకు గడ్డం, మీసాలు చూపిస్తారు. శంకరునికి, విష్ణువుకు చూపించరు. మరి ఇది అర్థం చేసుకునే విషయం. ప్రజాపిత బ్రహ్మా సూక్ష్మవతనంలో ఎలా ఉంటారు? అతను ఇక్కడ ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మాకు ఎంతమంది సంతానం? ప్రజాపిత బ్రహ్మాకుమార్-కుమారీలు అనేకమంది ఉన్నారని వ్రాసి ఉన్నదంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా ఉంటారు. చైతన్యంగా ఉన్నారంటే తప్పకుండా ఏదైనా చేస్తూనే ఉంటారు. ప్రజాపిత బ్రహ్మా కేవలం పిల్లలనే రచిస్తారా లేక ఇంకా ఏమైనా చేస్తారా? ఆదిదేవుడు బ్రహ్మా, ఆదిదేవి సరస్వతి అని అంటారు కాని వారి పాత్రల గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత కనుక తప్పకుండా ఇక్కడ ఉండి వెళ్ళి ఉంటారు. బ్రాహ్మణులను శివబాబా తప్పకుండా దత్తత తీసుకుని ఉంటారు లేకుంటే బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు. ఇవన్నీ కొత్త విషయాలు కదా. తండ్రి రానంతవరకు ఈ విషయాలన్నీ ఎవ్వరికీ తెలియవు. ఎవరికి ఏ పాత్ర ఉంటే దానినే అభినయిస్తారు. బుద్ధుడు ఏ పాత్రను అభినయించారు, ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేశారు - ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అతను తండ్రియా, శిక్షకుడా, గురువా? ఏదీ కాదు. సద్గతినైతే ఇవ్వలేరు. అతను కేవలం తన ధర్మ రచయిత మాత్రమే, అతను గురువు కాదు. తండ్రి పిల్లలను రచిస్తారు. తర్వాత చదివిస్తారు. తండ్రి, శిక్షకుడు మరియు గురువు ముగ్గురూ ఉన్నారు. మీరు చదివించండి అని ఇంకెవ్వరికీ చెప్పరు. ఇంకెవరి వద్దా ఈ జ్ఞానం లేనే లేదు. అనంతమైన తండ్రి మాత్రమే జ్ఞానసాగరులు. కనుక తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రియే స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - మీరు మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. ప్రపంచంలోని వారంతా ఎవరి కొరకు ఇంకా వెతుకుతున్నారో, వారు మాకు లభించారని పిల్లలకు లోలోపల సంతోషం ఉంది. పిల్లలూ, మీరు 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కలుసుకున్నారని బాబా చెప్తున్నారు. అవును బాబా, మేము మీతో అనేకసార్లు కలిశామని పిల్లలు చెప్తారు. ఎవరెంతగా కొట్టినా కానీ లోపల ఆ సంతోషం ఉంది కదా. శివబాబాను కలిసిన స్మృతి అయితే ఉంది కదా. స్మృతి ద్వారానే ఎన్నో పాపాలు అంతమవుతాయి. అబలలకు, బంధనాలలో ఉన్నవారికి ఇంకా ఎక్కువగా పాపాలు వినాశనమవుతాయి ఎందుకంటే వారు శివబాబాను ఎక్కువ స్మృతి చేస్తారు. అత్యాచారం జరిగినప్పుడు బుద్ధి శివబాబా వైపు వెళ్ళిపోతుంది. శివబాబా రక్షించండి అని అంటారు. స్మృతి చేయడం మంచిదే కదా. ప్రతి రోజూ దెబ్బలు తిన్నా శివబాబాను స్మృతి చేస్తారు, ఇది మంచిదే కదా. అలాంటి దెబ్బలకు బలిహారమవ్వాలి. దెబ్బలు తింటూ ఉంటే స్మృతి చేస్తారు. నోటిలో గంగా జలముండాలి, గంగా తీరంలో ఉండాలి, అప్పుడు ప్రాణం తనువును విడిచిపెట్టాలి అని అంటారు. మిమ్మల్ని కొట్టినప్పుడు బుద్ధిలో అల్ఫ్ మరియు బే గుర్తుండాలి, అంతే. బాబా అని అంటూనే వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. బాబా అని అంటూనే వారసత్వం గుర్తుకు రానివారు ఎవ్వరూ ఉండరు. తండ్రితో పాటు ఆస్తి తప్పకుండా గుర్తుకొస్తుంది. మీకు కూడా శివబాబాతో పాటు వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. వారు విషం (వికారాల) కొరకు మిమ్మల్ని కొట్టి శివబాబా స్మృతినిప్పిస్తున్నారు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు, పాపాలు నశిస్తాయి. ఇది కూడా డ్రామాలో మీ కొరకు జరుగుతున్న గుప్త కళ్యాణం. యుద్ధం కళ్యాణకారి అని చెప్పబడుతున్నట్లే, ఈ దెబ్బలు కూడా మంచివే కదా.

ఈ రోజుల్లో పిల్లలకు మేళాలు మరియు ప్రదర్శనిల సేవ చాలా ఎక్కువగా ఉంది. నవనిర్మాణ ప్రదర్శని అని వ్రాయడంతో పాటు గేట్ వే టు హెవెన్ (స్వర్గానికి ద్వారము) అని కూడా వ్రాయండి. రెండు వాక్యాలూ ఉండాలి. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దాని ప్రదర్శని అని విని మనుష్యులకు చాలా సంతోషం కలుగుతుంది. నూతన ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది, దీనిపై చిత్రాలు తయారుచేశారు. వచ్చి చూడండి. గేట్ వే టు న్యూ వరల్డ్ (నూతన ప్రపంచానికి ముఖ ద్వారము). ఈ వాక్యం కూడా బాగుంది. ఈ యుద్ధం ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి. భగవంతుడు వచ్చారు, వచ్చి రాజయోగాన్ని నేర్పించారని గీతలో కూడా ఉంది. మానవుల నుండి దేవతలుగా చేశారంటే తప్పనిసరిగా కొత్త ప్రపంచ స్థాపన జరిగి ఉంటుంది. మనుష్యులు చంద్రుని పైకి వెళ్ళేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. అక్కడ అంతా భూమియే ఉండడాన్ని గమనిస్తారు. అక్కడ మనుష్యులే కనిపించలేదని మాత్రం వినిపిస్తారు. దీని వలన లాభమేమిటి! మీరిప్పుడు సత్యమైన సైలెన్స్ లోకి వెళ్తారు. అశరీరులుగా అవుతున్నారు. అది సైలెన్స్ ప్రపంచం. మీరు మృత్యువును కోరుకుంటారు. శరీరాన్ని వదిలి వెళ్ళాలనుకుంటారు. మీరే వచ్చి మమ్మల్ని మీతో ముక్తి జీవన్ముక్తిలోకి తీసుకు వెళ్ళండని మృత్యువు కొరకే తండ్రిని కూడా పిలుస్తున్నారు. అయితే పతిత పావనుడు వచ్చారంటే మనం మహా కాలుడిని పిలిచినట్లేనని వారికి తెలియదు. ఇప్పుడు బాబా వచ్చారని మీరు తెలుసుకున్నారు. ఇంటికి పదండి అని బాబా చెప్పినప్పుడు మనం ఇంటికి వెళ్తాము. బుద్ధి పని చేస్తుంది కదా. ఇక్కడ అనేకమంది పిల్లల బుద్ధి, వ్యాపారాలు మొదలైనవాటి వైపు పరిగెడుతూ ఉంటుంది. ఫలానావారు అనారోగ్యంతో ఉన్నారు, ఎలా ఉన్నారో అని అనేక రకాల సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఎవరి కుమారుడైనా లండన్లో ఉన్నారనుకోండి, అతను వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం వస్తే, బుద్ధి అక్కడికే వెళ్తుంది. తర్వాత జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ కూర్చొని ఉన్నా బుద్ధిలో అతని స్మృతే వస్తూ ఉంటుంది. భర్త వ్యాధిగ్రస్థుడైతే భార్య మనసు అతలాకుతలం అవుతూనే ఉంటుంది. బుద్ధి అటువైపు వెళ్తుంది కదా. మీరు కూడా ఇక్కడ అన్ని పనులూ చేస్తూ శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇంతమాత్రం చేసినా అహో సౌభాగ్యము! వారు ఎలా అయితే పతి లేక గురువును స్మృతి చేస్తారో అలా మీరు తండ్రిని స్మృతి చేయండి. మీరు ఒక్క నిముషం కూడా వ్యర్థం చేయకూడదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సేవ చేసినప్పుడు కూడా తండ్రి గుర్తు వస్తారు. నా భక్తులకు కూడా అర్థం చేయించండని తండ్రి చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? శివబాబా. కృష్ణుని భక్తులకు ఏం తెలియజేస్తారు? కృష్ణుడు క్రొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని చెప్తే ఒప్పుకుంటారా? రచయిత అయితే గాడ్ ఫాదర్ కానీ కృష్ణుడు కాదు. పరమపిత పరమాత్మయే పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తున్నారు అని అంగీకరిస్తారు కూడా. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా అవుతుంది. కాని సమయం ఎక్కువ చెప్పినందుకు మనుష్యులు గాఢాంధకారంలో ఉన్నారు. మీకైతే ఇప్పుడు మీ అరచేతిలోనే వైకుంఠం ఉంది. తండ్రి చెప్తున్నారు - మిమ్మల్ని ఆ స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. అవుతారా? వాహ్, ఎందుకు అవ్వము! అచ్ఛా, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. పాపాలు స్మృతి ద్వారానే భస్మమవుతాయి. వికర్మల భారము ఆత్మపై ఉంది కానీ శరీరంపై కాదు అని మీకు తెలుసు. ఒకవేళ శరీరంపై పాప భారం ఉంటే శరీరాన్ని కాల్చగానే పాపం కూడా కాలిపోయేది. ఆత్మ అవినాశి, దానిలో కేవలం మలినం చేరుతుంది. దానిని తొలగించేందుకు తండ్రి ఒకే యుక్తిని తెలియజేస్తున్నారు, నన్ను స్మృతి చేయండి. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఇది ఎంత మంచి యుక్తి! మందిరాలను నిర్మించేవారు, శివుని పూజ చేసేవారు కూడా భక్తులే కదా. పూజారులను ఎప్పుడూ పూజ్యులని అనరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత- పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రపంచమంతా ఎవరి కొరకు వెతుకుతూ ఉందో ఆ బాబా నాకు లభించారు అని ఈ సంతోషంలో ఉండాలి. స్మృతి ద్వారానే పాపాలు వినాశనమవుతాయి, అందువలన ఎలాంటి పరిస్థితిలోనైనా, తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఒక్క నిమిషం కూడా మీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు.

2. ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి అనే లంగరును ఎత్తివేయాలి. బాబా మన కొరకు కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇది రౌరవ నరకం, కంసపురి, మనం వైకుంఠానికి వెళ్తున్నాము - సదా ఈ స్మృతిలో ఉండాలి.

వరదానము:-

నడుస్తూ-తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్త భవ

ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ ఉన్న బ్రహ్మా అదృశ్యమై శ్రీకృష్ణుడు కనిపించేవాడు. ఈ సాక్షాత్కారమే అన్నిటినీ విడిపించింది. ఇటువంటి సాక్షాత్కారం ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి. సాక్షాత్కారం ద్వారా ప్రాప్తి జరిగితే తయారవ్వకుండా ఉండలేరు. అందువలన నడుస్తూ-తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి. ఉపన్యసించేవారు చాలామంది ఉన్నారు కానీ మీరు అనుభవం చేయించేవారిగా అవ్వండి - అప్పుడు వీరు అల్లాహ్ పిల్లలు (భగవంతునికి చెందిన వారు) అని అంటారు.

స్లోగన్:-

సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడూ తికమకపడరు.