16-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది, మీరు క్షీరఖండంగా అయ్యి కొత్త ప్రపంచంలోకి రావాలి, అక్కడ అందరూ క్షీరఖండం వలె ఉంటారు, ఇక్కడ ఉప్పు నీరుగా ఉన్నారు"

ప్రశ్న:-

త్రినేత్రి పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని తెలుసుకొని త్రికాలదర్శులుగా అయ్యారు ?

జవాబు:-

ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళం యొక్క జ్ఞానం లభించింది, సత్యయుగం నుండి కలియుగం అంతిమం వరకు గల చరిత్ర-భూగోళం మీకు తెలుసు. మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నామ రూపాల నుండి అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి.

గీతము:-

ఓర్పు వహించు మానవా..... ( ధీరజ్ ధర్ మనువా.....)

ఓంశాంతి. కల్ప-కల్పమూ పిల్లలకు చెప్తున్నారు మరియు పిల్లలకు తెలుసు, ఈ దుఃఖం నుండి విడుదలై త్వరగా సత్యయుగం ఏర్పడాలని మనసుకు అనిపిస్తుంది. కాని డ్రామా చాలా నేమ్మదిగా నడుస్తుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి ఓర్పు వహించమని చెప్తున్నారు. గొప్ప-గొప్పవారి ద్వారా కూడా ప్రపంచం పరివర్తనవుతుందన్న మాటలు వింటూ ఉంటారు. పోప్ వంటి గొప్ప-గొప్పవారు కూడా ప్రపంచం మారిపోతుందని అంటున్నారు. అయితే మరి శాంతి ఎలా స్థాపనవుతుంది? ఈ సమయంలో అందరూ ఉప్పునీరుగా ఉన్నారు. ఇప్పుడు మనం క్షీరఖండంగా అవుతున్నాము. అటువైపు రోజు రోజుకూ ఉప్పునీరుగా అవుతూ ఉంటారు. పరస్పరం కొట్లాడుకుని, గొడవపడి అంతమైపోనున్నారు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ డ్రామా చక్రం ఇప్పుడు పూర్తవుతుంది. పాత ప్రపంచం పూర్తయిపోతుంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. కొత్త ప్రపంచం పాతదిగా, పాతది మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. దీనిని ప్రపంచ చక్రమని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. లక్షల సంవత్సరాల తర్వాత పాత ప్రపంచం కొత్తదిగా అవుతుందని కాదు. పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు, భక్తి పూర్తిగా వేరు. భక్తికి రావణునితో సంబంధముంది. జ్ఞాన సంబంధం రామునితో ఉంది. ఇది మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రిని 'ఓ పతితపావనా, రండి, వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయండి' అని పిలుస్తారు కూడా, కొత్త ప్రపంచంలో తప్పకుండా సుఖముంటుంది. చిన్న-పెద్ద అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని తెలుసుకున్నారు. ఈ నాటకం పూర్తవుతుంది. మనం మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళి మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరగాలి. ఆత్మకు తన యొక్క దర్శనం అనగా సృష్టి చక్రం యొక్క దర్శనం అవుతుంది - అంటే ఆత్మకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది, అటువంటి వారిని త్రినేత్రులని అంటారు. ఇప్పుడు మీరు త్రినేత్రులు మరియు మనుష్యులందరికీ ఈ స్థూల నేత్రాలున్నాయి. జ్ఞాన నేత్రం ఎవ్వరికీ లేదు. త్రినేత్రులుగా అయి తికాలదర్శులుగా అయ్యారు, ఎందుకంటే ఆత్మకు జ్ఞానం లభిస్తుంది కదా. ఆత్మనే ఒక శరీరాన్ని విడిచి, మరో శరీరాన్ని తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ అవినాశి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నామ రూపాల నుండి అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. దేహమని భావించకండి. అర్ధకల్పం నుండి పరమాత్ముడిని స్మృతి చేస్తూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇందులో ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు ఎక్కువగా స్మృతి చేస్తారు, ఇప్పుడు ఎంత దుఃఖముంది! ఇంతకుముందు ఇంత దుఃఖం లేదు. బయటివారు వచ్చినప్పటి నుండి ఈ రాజులు కూడా పరస్పరం కొట్లాడుకున్నారు. రాజ్యం ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. సత్యయుగంలో ఒకే రాజ్యం ఉండేది.

సత్యయుగం నుండి కలియుగాంతం వరకు చరిత్ర-భూగోళాలను ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము. సత్య-త్రేతా యుగాలలో ఒకే రాజ్యముండేది. ఇలా ఒకే రాజ్యం ఎవ్వరిదీ ఉండదు. చూడండి, క్రిస్టియన్లలో కూడా గొడవలున్నాయి, అక్కడ అయితే విశ్వమంతా ఒక్కరి చేతిలోనే ఉంటుంది. అది కేవలం సత్య-త్రేతా యుగాలలో మాత్రమే ఉంటుంది. ఈ అనంతమైన చరిత్ర-భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మరి ఏ ఇతర సత్సంగాలలో చరిత్ర-భూగోళాలనే మాటలను వినరు. అక్కడ రామాయణం, మహాభారతం మొదలైనవి మాత్రమే వింటారు. ఇక్కడ అటువంటి విషయాలే ఉండవు. ఇక్కడ ప్రపంచ చరిత్ర-భూగోళాలున్నాయి. మన తండ్రి ఉన్నతాతి-ఉన్నతమైనవారని మీ బుద్ధిలో ఉంది. మొత్తం జ్ఞానం వినిపించిన తండ్రికి కృతజ్ఞతలు. ఒకటి ఆత్మల వృక్షం, మరొకటి మనుష్యుల వృక్షం. మనుష్యుల వృక్షంలో పైన ఎవరున్నారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మాను మాత్రమే అంటారు. బ్రహ్మా ముఖ్యమైనవారని తెలుసు కానీ బ్రహ్మా వెనుక ఏ చరిత్ర-భూగోళాలు ఉన్నాయో, ఇది ఎవ్వరికీ తెలియదు. ఉన్నతాతి-ఉన్నతమైన తండ్రి పరంధామంలో ఉంటారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనం గురించి కూడా మీకు తెలుసు. మనుష్యులే ఫరిస్తాలుగా అవుతారు, అందుకే సూక్ష్మవతనాన్ని చూపించారు. ఆత్మలైన మీరే వెళ్తారు, శరీరాలు సూక్ష్మవతనంలోకి వెళ్ళవు. ఎలా వెళ్తాయి? దీనిని మీరు మూడవ నేత్రం, దివ్యదృష్టి లేక ధ్యానం అని కూడా అంటారు. మీరు ధ్యానంలో బ్రహ్మా, విష్ణు, శంకరులను చూస్తారు. శంకరుడు మూడవ నేత్రం తెరిస్తే వినాశనమవుతుందని మనుష్యులు చూపిస్తారు. దీని ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. డ్రామానుసారంగా వినాశనం జరిగే తీరాలని ఇప్పుడు మీకు తెలుసు. పరస్పరంలో కొట్లాడుకుని వినాశనమైపోతారు. అయితే శంకరుడు ఏం చేస్తారు? ఇలా డ్రామానుసారంగా పేరు పెట్టబడింది. కావున అర్థం చేయించాల్సి ఉంటుంది. బ్రహ్మా-విష్ణు-శంకరులు ముగ్గురున్నారు. స్థాపన కొరకు బ్రహ్మాను ఉంచారు, పాలన కొరకు విష్ణువును, వినాశనం కొరకు శంకరుడిని ఉంచారు. వాస్తవానికిది తయారై-తయారవుతున్న డ్రామా. శంకరుని పాత్ర ఏమీ లేదు. బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర అయితే కల్పమంతా ఉంది. బ్రహ్మానే విష్ణువు, విష్ణువే బ్రహ్మా. బ్రహ్మాకు 84 జన్మలు పూర్తయినట్లయితే విష్ణువుకు కూడా పూర్తయినట్లే. శంకరుడు జనన-మరణాలకు అతీతంగా ఉంటారు, అందుకే తిరిగి శివుడిని మరియు శంకరుడిని కలిపేశారు. వాస్తవానికి శివుని పాత్ర చాలా పెద్దది. వారు చదివిస్తారు.

భగవంతుడిని జ్ఞానసాగరులని అంటారు. ఒకవేళ వారు ప్రేరణ ద్వారా కార్యం చేస్తే సృష్టిచక్ర జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, ప్రేరణ యొక్క మాటేదీ లేదు. తండ్రి రావల్సే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నాలో సృష్టిచక్ర జ్ఞానముంది. నాకు ఈ పాత్ర లభించింది, అందుకే నన్నే జ్ఞానసాగరులని, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. జ్ఞానమని దేనినంటారో అది లభించినప్పుడే తెలుస్తుంది. లభించకపోతే అర్థం ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు ఈశ్వరుడు ప్రేరేపిస్తారని మీరు కూడా అనేవారు. వారికంతా తెలుసు. మనం చేస్తున్న పాపాలను ఈశ్వరుడు చూస్తారని అంటారు. కాని తండ్రి చెప్తున్నారు, నేను ఈ పని చేయను. ఎటువంటి కర్మ చేస్తారో దానికి స్వయమే శిక్షలు అనుభవిస్తారు. నేనెవ్వరికీ ఇవ్వను, ప్రేరణ ద్వారా కూడా శిక్షించను. నేను ప్రేరణ ద్వారా చేస్తే అది నేను శిక్షించినట్లే అవుతుంది. వీరిని హత్య చెయ్యండి అని ఎవరికైనా చెప్పడం కూడా దోషమే. చెప్పినవారు కూడా చిక్కుకుంటారు. శంకరుడు ప్రేరణనిస్తే వారు కూడా చిక్కుకుంటారు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు సుఖాన్నిచ్చేవాడిని. బాబా, వచ్చి దుఃఖాన్ని హరించండి - అని మీరు నా మహిమ చేస్తారు. నేను దుఃఖాన్నివ్వను.

పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు, మరి ఎంత సంతోషం ఉండాలి? ఇక్కడ ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది. బాబా మనల్ని చదివిస్తున్నారు. దీనిని మేళా అని అంటారు. సేవాకేంద్రాలకు మీరు వెళ్ళినప్పుడు దానిని ఆత్మ-పరమాత్మల మేళా అని ఎవ్వరూ అనరు. ఆత్మ-పరమాత్మల మేళా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మేళా జరుగుతుందని మీకు కూడా తెలుసు. తండ్రి పిల్లల మధ్యలోకి వచ్చారు. ఆత్మలంతా ఇక్కడే ఉన్నారు. తండ్రి రావాలని ఆత్మనే స్మృతి చేస్తుంది. ఇదే అన్నిటికంటే మంచి మేళా. తండ్రి వచ్చి ఆత్మలందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. ఈ మేళా బాగుంది కదా, దీని ద్వారా మనుష్యులు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఆ మేళాల ద్వారా మనుష్యులు మలినంగా అయిపోతారు. ధనం వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, ఏమీ లభించదు. వాటిని మాయావీ, ఆసురీ మేళాలని అంటారు. ఇది ఈశ్వరీయ మేళా. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. మీరు కూడా ఆసురీ మేళాలో ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరీయ మేళాలో ఉన్నారు. బాబా వచ్చారని మీకు మాత్రమే తెలుసు. అందరూ తెలుసుకుంటే ఎంత గుంపు ఏర్పడుతుందో తెలియదు. అందరూ ఉండేందుకు అన్ని భవనాలు మొదలైనవి ఎక్కడ నుండి తెస్తారు? అహో ప్రభూ నీ లీల - అని అంతిమంలో పాడతారు కదా. ఏ లీల? సృష్టిని పరివర్తన చేసే లీల. ఇదే అన్నిటికంటే గొప్ప లీల. పాత ప్రపంచ వినాశనానికి ముందే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది, అందువలన ఎవరికి అర్థం చేయించినా మొదట స్థాపన, వినాశనం, తర్వాత పాలన అని చెప్పాలి. స్థాపన పూర్తయినప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది, తర్వాత పాలన జరుగుతుంది. మనం స్వదర్శన చక్రధారీ బ్రాహ్మణులమని, తర్వాత మనం చక్రవర్తి రాజులుగా అవుతామని పిల్లలైన మీకు ఈ సంతోషం ఉంటుంది. ఈ దేవతల రాజ్యం ఎక్కడకు వెళ్ళిపోయిందో ఇది ఎవ్వరికీ తెలియదు. దాని నామ-రూపాలే మాయమైపోయాయి. దేవతలమని చెప్పుకునేందుకు బదులుగా స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. హిందుస్థాన్ లో నివసించేవారు హిందువులు. లక్ష్మీనారాయణులను అలా ఎప్పుడూ అనరు. వారిని దేవతలని అంటారు. మీరు ఇప్పుడు ఈ మేళాలో డ్రామానుసారంగా వచ్చారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. నేమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీ పాత్ర ఏదయితే నడుస్తుందో అది మళ్ళీ కల్పం తర్వాత నడుస్తుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రావణ రాజ్యంలో ఆసురీ పాలన ఉంటుంది. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానం, తర్వాత దైవీ సంతానంగా, ఆ తర్వాత క్షత్రియులుగా అవుతారు. అపవిత్ర ప్రవృత్తి కలవారిగా అయిన మీరు మళ్ళీ పవిత్ర ప్రవృత్తి కలవారిగా అవుతారు. వీరు కూడా దైవీ గుణాలు కల మనుష్యులే కదా. కాకపోతే ఇన్ని భుజాలు మొదలైనవి ఇచ్చేశారు, విష్ణువు ఎవరో, ఎవరూ తెలియజేయలేరు. మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. జగదంబను ఎప్పుడూ ధనం అడగరు. ధనం ఎక్కువగా లభిస్తే లక్ష్మిని పూజించాము అందుకే వారు భాండాగారాన్ని నింపేశారని అంటారు. కానీ ఇక్కడ మీరు జగదంబ నుండి పరమపిత పరమాత్మ శివుని ద్వారా పొందుతున్నారు, ఇచ్చేవారు వారు. పిల్లలైన మీరు బాప్ దాదా కంటే కూడా అదృష్టవంతులు. జగదంబకు ఎన్ని మేళాలు జరుగుతాయో చూడండి, బ్రహ్మాకు అంతగా జరగవు. బ్రహ్మాను ఒకే చోట కూర్చోబెట్టారు. అజ్మేరులో పెద్ద మందిరముంది. దేవీల మందిరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా మహిమ ఉంది. మీరు భారత్ కు సేవ చేస్తారు. పూజలు కూడా మీకు ఎక్కువగా జరుగుతాయి. మీరు అదృష్టవంతులు. జగదంబను సర్వవ్యాపి అని ఎప్పుడూ అనరు. మీకు మహిమ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా సర్వవ్యాపి అని అనరు, నన్ను కణ-కణంలో ఉన్నానని అనేస్తారు, ఎంత నింద చేస్తారు.

నేను మీ మహిమను ఎంతో పెంచుతాను. భారత్ మాతా కీ జై అని అంటారు కదా! భారత మాతలు మీరే కదా. ధరణి కాదు. ధరణి మొదలైనవన్నీ ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నాయి, సత్యయుగంలో సతోప్రధానమవుతాయి, అందుకే ఈ పతిత ప్రపంచంలో దేవతలు అడుగు కూడా పెట్టరని అంటారు. ధరణి సతోప్రధానంగా అయినప్పుడు వస్తారు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవిని పొందుతారు. ఈ ఆలోచన ఉండాలి. స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. శ్రీమతం లభిస్తూ ఉంటుంది. సత్యయుగంలో మీ ఆత్మ పవిత్రంగా, బంగారుమయంగా అవుతుంది, కనుక శరీరం కూడా బంగారుమయమైనది లభిస్తుంది. బంగారంలో మలినం చేరుకున్నప్పుడు నగ కూడా అటువంటిదే తయారవుతుంది. ఆత్మ అసత్యమైతే శరీరం కూడా అసత్యమే. మాలిన్యం చేరుకుంటే బంగారం విలువ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఏ విలువా లేదు. మొదట మీరు విశ్వానికి యజమానులుగా 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారు. ఇప్పుడు 9 క్యారెట్లు అని చెప్తారు. తండ్రి పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు. కూర్చుని పిల్లలను ఆహ్లాదపరుస్తారు, మీరు వింటూ-వింటూ పరివర్తన చెందుతారు, మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి, స్వర్గమంటే ఏమనుకున్నారు! మీరు అక్కడ సూబి రసం మొదలైనవి కూడా తాగి వస్తారు. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద-పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ అవి లభించవు. సూక్ష్మవతనంలో ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వెళ్తారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళా, దీని ద్వారా మీరు ఉజ్వలంగా అవుతారు.

ఇక్కడికి రావడంతోనే పిల్లలైన మీరు ఫ్రీగా అవుతారు, ఇల్లూ-వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైనవాటి చింత ఏదీ లేదు. స్మృతియాత్రలో ఉండేందుకు మీకిక్కడ చక్కని అవకాశముంది. అక్కడ అయితే ఇల్లు-వాకిళ్ళు మొదలైనవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ అవేమీ లేవు. రాత్రి రెండు గంటలకు లేచి ఇక్కడ కూర్చోండి. సేవాకేంద్రాలకు రాత్రి 2 గంటలకు మీరు వెళ్ళలేరు. ఇక్కడైతే సహజం. శివబాబా స్మృతిలో వచ్చి కూర్చోండి, ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఇక్కడ మీకు సహాయం కూడా లభిస్తుంది. త్వరగా నిద్రపోండి మళ్ళీ ఉదయాన్నే లేవండి. 3 గంటల నుండి 5 గంటల వరకు వచ్చి కూర్చోండి. బాబా కూడా వచ్చేస్తారు, పిల్లలు సంతోషిస్తారు. బాబా యోగాన్ని నేర్పించేవారు. వీరు కూడా నేర్చుకునేవారు, కనుక తండ్రి, దాదా ఇరువురూ వచ్చేస్తారు, ఇక్కడ యోగంలో కూర్చోవడానికి మరియు అక్కడ యోగంలో కూర్చోవడానికి వ్యత్యాసం కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమీ గుర్తుకు రాదు, ఇందులో చాలా లాభముంది. బాబా సలహానిస్తున్నారు, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాము పిల్లలు లేవగలరా? చాలామందికి ఉదయమే లేచే అభ్యాసముంది. మీ సన్యాసం 5 వికారాలతో మరియు వైరాగ్యం మొత్తం పాత ప్రపంచమంతటితో ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు సృష్టి పరివర్తనయ్యే లీల జరుగుతుంది కావున స్వయం పరివర్తన చెందాలి. క్షీరఖండం వలె ఉండాలి.

2. ఉదయమే లేచి ఒక్క తండ్రి స్మృతిలో కూర్చోవాలి, ఆ సమయంలో ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. పాత ప్రపంచంపై అనంతమైన వైరాగిగా అయి 5 వికారాలను సన్యాసం చేయాలి.

వరదానము:-

దూరంగా వెళ్ళిపోయేందుకు బదులుగా ప్రతి క్షణం తండ్రి ఆధారాన్ని అనుభవం చేసే నిశ్చయబుద్ధి విజయీ భవ

'విజయీ భవ' అనే వరదానాన్ని పొందిన ఆత్మ ప్రతి క్షణం స్వయాన్ని ఆధారం కింద ఉన్నట్లుగా అనుభవం చేస్తుంది. వారి మనస్సులో సంకల్పమాత్రం కూడా ఆధారం లేనట్లుగా లేక ఒంటరిగా ఉన్నట్లుగా అనుభవమవ్వదు. ఎప్పుడూ ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు యొక్క వైరాగ్యం రాదు. వారు ఎప్పుడూ ఏ కార్యం నుండి, సమస్య నుండి, వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోరు, కాని ప్రతి కర్మ చేస్తూ, ఎదుర్కొంటూ, సహయోగిగా అవుతూ అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు.

స్లోగన్:-

ఒక్క తండ్రి కంపెనీలో (సహచర్యములో) ఉండండి మరియు తండ్రినే మీ కంపానియన్ గా (సహచరునిగా) చేసుకోండి.