27-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - జ్ఞాన-యోగాల ద్వారా నిశ్చయం ఏర్పడుతుంది, సాక్షాత్కారాల ద్వారా కాదు, సాక్షాత్కారాలు కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. వాటి వలన ఎవ్వరికీ కళ్యాణం జరగదు"

ప్రశ్న:-

తండ్రి ఏ శక్తిని చూపించరు? కాని తండ్రి వద్ద ఆ గారడి తప్పకుండా ఉంది?

జవాబు:-

భగవంతుడు సర్వశక్తివంతుడని, వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరని మనుష్యులు భావిస్తారు. కాని ఆ శక్తిని చూపించనని బాబా అంటారు. అయితే ఎవరైనా నవవిధ (తీవ్రమైన) భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం తండ్రి వద్ద ఉంది. అందువలన ఇంటిలో కూర్చొని కూడా బ్రహ్మా సాక్షాత్కారం లేక కృష్ణుని సాక్షాత్కారం అవుతుంది.

గీతము:-

నా మనసు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు..... (కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే.....)

ఓంశాంతి. ఇది పిల్లలు అనుభవంతో పాడిన పాట. సత్సంగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో అనేక సత్సంగాలు, అనేక మతమతాంతరాలున్నాయి. వాస్తవానికి అవేవీ సత్సంగాలు కావు. సత్సంగం ఒక్కటే ఉంటుంది. ఆ సత్సంగాలలో మీరు విద్వాంసులు, ఆచార్యులు, పండితుల ముఖాలను చూస్తారు, బుద్ధి వారి వైపుకు వెళ్తుంది కాని ఇక్కడిది విచిత్రమైన విషయం. ఈ సత్సంగం ఒక్కసారి మాత్రమే ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. ఇది పూర్తిగా క్రొత్త విషయం, ఆ అనంతమైన తండ్రికి ఏ శరీరమూ లేదు. నేను మీ నిరాకార శివబాబాను అని వారంటారు. మీరు ఇతర సత్సంగాలకు వెళ్తే శరీరాలనే చూస్తారు. శాస్త్రాలను స్మృతి చేసి వినిపిస్తారు. అనేక రకాల శాస్త్రాలున్నాయి. వాటిని మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇది కొత్త విషయం. "ఓ నా చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ! ఓ నా సాలిగ్రామాలూ!" అని అనేది తండ్రినే అని ఆత్మ బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. 5 వేల సంవత్సరాల క్రితం బాబా ఈ శరీరం ద్వారా చదివించారని పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. బాబా వచ్చారని తెలుస్తుంది. బాబా అనే పదం ఎంత మధురమైనది! వారు తల్లి-తండ్రి. ఈ మాట ఎవరైనా వింటే అసలు వీరి మాత-పితలు ఎవరు అని అంటారు. వారు సాక్షాత్కారం చేయించినా అందులో కూడా తికమకపడతారు. ఒక్కోసారి బ్రహ్మాను, ఒక్కోసారి కృష్ణుడిని చూస్తారు. ఇక ఇదేమిటని ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి ఇంట్లో కూర్చుని ఉంటూనే బ్రహ్మా సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాను ఎవ్వరూ ఎప్పుడూ పూజించరు. కృష్ణుడు మొదలైనవారిని పూజిస్తారు. బ్రహ్మాను గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇప్పుడు వచ్చారు. వీరే ప్రజాపిత. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ప్రపంచమంతా పతితంగా ఉంది కావున తప్పకుండా ఇతను కూడా అనేక జన్మల అంతిమంలో పతితులుగానే ఉంటారు కదా. ఎవ్వరూ పావనంగా లేరు. అందుకే కుంభమేళాకు, హరిద్వార్ లో గంగా సాగరముల మేళాకు వెళ్తారు, అందులో స్నానం చేస్తే పావనంగా అవుతామని భావిస్తారు. కాని ఈ నదులు ఏమైనా పతిత పావని అవుతాయా? నదులు సాగరం నుండే వెలువడ్డాయి. వాస్తవానికి జ్ఞాన గంగలు మీరే. గొప్పదనమంతా మీదే. జ్ఞాన గంగలైన మీరు అన్ని చోట్ల నుండి వెలువడ్డారు. ఈ విషయాన్ని వారు బాణం వేస్తే గంగ వెలువడిందని చూపిస్తారు. బాణం వేసే విషయమే లేదు. ఈ జ్ఞాన గంగలు దేశ-దేశాంతరాలకు వెళ్తారు.

శివబాబా చెప్తున్నారు, నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. అందరి పాత్ర నిశ్చితం చేయబడినది. నా పాత్ర కూడా నిశ్చితమే. భగవంతుడు చాలా శక్తివంతుడని, చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తారని కొంతమంది భావిస్తారు. ఇవన్ని వ్యర్థ ప్రలాపాలు. నేను చదివించేందుకు వస్తాను, అంతేకానీ శక్తినేమి చూపిస్తాను. సాక్షాత్కారం కూడా ఇంద్రజాలమే. నవవిధ భక్తి చేయడంతో నేను సాక్షాత్కారం చేయిస్తాను, కాళి రూపాన్ని చూపిస్తారు, వారి పైన నూనెతో అభిషేకం చేస్తారు. అటువంటి కాళి ఏమీ ఉండరు. కాని చాలామంది కాళికి నవవిధ భక్తి చేస్తారు. వాస్తవానికి కాళినే జగదంబ. కాళికి అటువంటి రూపం ఉండదు. కాని నవవిధ భక్తి చేసినందుకు బాబా వారి భావనకు ఫలమిస్తారు, కామచితిపై కూర్చోవడంతో నల్లగా అయ్యారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చొని తెల్లగా అవుతారు. ఏ కాళిక అయితే ఇప్పుడు జగదంబగా అయ్యారో, ఆమె సాక్షాత్కారాలు ఎలా చేయిస్తారు. ఆమె ఇప్పుడు అనేకజన్మల అంతిమంలో ఉన్నారు. దేవతలు ఇప్పుడు లేనే లేరు. ఇక వారు సాక్షాత్కారాలు ఏమి చేయిస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ సాక్షాత్కారం చేయించే తాళంచెవి నా చేతిలో ఉంది. వారి భావనను పూర్తి చేసేందుకు అల్పకాలం కొరకు సాక్షాత్కారం చేయిస్తాను. కాని వారెవ్వరూ నన్ను కలవరు. ఉదాహరణగా ఒక కాళికను చూపిస్తారు. ఈ విధంగా హనుమంతుడు, గణేశుడు మొదలైనవారు చాలామంది ఉన్నారు. సిక్కులు కూడా గురునానక్ కు చాలా భక్తి చేయడంతో వారికి కూడా అతని సాక్షాత్కారమవుతుంది. కాని వారు క్రిందకు దిగజారుతూనే వస్తారు. చూడండి, వీరు గురునానక్ భక్తిని చేస్తున్నారు అని బాబా పిల్లలకు చూపిస్తారు. వారికి సాక్షాత్కారం చేయించేది నేనే, అతనెలా సాక్షాత్కారం చేయించగలరు, అతని వద్ద సాక్షాత్కారం చేయించే తాళంచెవి లేదు కదా. నాకు కూడా వినాశనం, స్థాపన సాక్షాత్కారాలను ఆ బాబాయే చేయించారని ఈ బాబా చెప్తున్నారు. కాని సాక్షాత్కారం వలన ఎవరి కళ్యాణం జరగదు. ఇటువంటి సాక్షాత్కారాలు చాలా మందికి జరిగేవి. వారు ఈ రోజు లేనే లేరు. మాకు సాక్షాత్కారం అయినప్పుడు నిశ్చయం ఏర్పడుతుందని చాలా మంది పిల్లలంటారు. కాని సాక్షాత్కారం వలన నిశ్చయం ఏర్పడదు. జ్ఞాన-యోగాల ద్వారా నిశ్చయం ఏర్పడుతుంది. ఈ సాక్షాత్కారాలు నేనే చేయిస్తాను అని 5 వేల సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. మీరా కూడా సాక్షాత్కారం పొందారు. అలాగని ఆత్మ అక్కడకు వెళ్ళిపోయిందని కాదు, కూర్చొని ఉండగానే సాక్షాత్కారాలవుతాయి. కాని నన్ను ప్రాప్తి చేసుకోలేరు.

ఏ విషయంలోనైనా సంశయం వస్తే, బ్రాహ్మణీలు ఎవరైతే ఉంటారో వారిని అడగండి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలు కూడా నంబరువారుగా ఉన్నారని, నదులు కూడా నంబరువారుగా ఉన్నాయని మీకు తెలుసు. కొన్ని కాలువలు కూడా ఉన్నాయి, అందులో చాలా అశుద్ధమైన, దుర్వాసన గల నీరుంటుంది. అక్కడికి కూడా మనుష్యులు భక్తి భావంతో వెళ్తారు. అది భక్తిమార్గంలోని అంధశ్రద్ధ. ఎప్పుడూ ఎవ్వరినీ భక్తి నుండి విడిపించకూడదు. జ్ఞానంలోకి వస్తే భక్తి దానంతట అదే వదిలిపోతుంది. బాబా కూడా నారాయణుడి భక్తుడుగా ఉండేవారు. చిత్రంలో లక్ష్మీ దాసీగా అయ్యి, నారాయణుడి కాళ్ళను వత్తడం చూసినప్పుడు వారికది ఏమాత్రమూ నచ్చలేదు. సత్యయుగంలో అలా జరగదు. అప్పుడు నేను, లక్ష్మీని ఈ దాసత్వం నుండి విడిపించమని ఒక చిత్రకారుడికి చెప్పాను. బాబా అప్పుడు భక్తుడే. వారిలో జ్ఞానమైతే లేదు కదా. అందరూ భక్తులే. బాబా పిల్లలైన మనమైతే యజమానులము. పిల్లలను బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారుచేస్తారు. మీకు రాజ్యభాగ్యన్ని ఇస్తానని అంటారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూశారా? ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి. వారిని మీరు ఈ కనులతో చూడలేరు. వారితో యోగం జోడించాలి. స్మృతి మరియు జ్ఞానం చాలా సులభం. బీజాన్ని, వృక్షాన్ని తెలుసుకోవాలి. మీరు నిరాకార వృక్షం నుండి సాకార వృక్షంలోకి వచ్చారు. బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. వృక్షం రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. కర్మ, వికర్మ, అకర్మల గతిని గురించిన రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. తండ్రి, టీచర్, సద్గురువు, ముగ్గురి నుండీ శిక్షణ లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎటువంటి శిక్షణను ఇస్తానంటే, ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే వాటి ద్వారా మీరు 21 జన్మలకు సదా సుఖవంతులుగా అయిపోతారు అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. టీచర్ శిక్షణ ఇస్తారు కదా. గురువులు కూడా పవిత్రంగా ఉండేందుకు శిక్షణ ఇస్తారు లేక కథలు వినిపిస్తారు. కాని అక్కడ ధారణ ఏమాత్రమూ ఉండదు. ఇక్కడ అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని తండ్రి చెప్తున్నారు. మనుష్యులు చనిపోయేటప్పుడు 'రామ-రామ' అని అంటే బుద్ధి అటువైపు వెళ్తుందని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీకిప్పుడు సాకారుని పట్ల నుండి యోగం తొలగిపోయింది. ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలు చేయడం నేర్పిస్తాను. శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి - పాత ప్రపంచాన్ని కాలితో తన్నుతూ కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలితో తన్నుతూ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కనుక మీ కాళ్ళు నరకం వైపు, ముఖం స్వర్గం వైపు ఉంది. శ్మశానంలోకి వెళ్ళినప్పుడు శవం ముఖాన్ని అటువైపుకు తిప్పుతారు. కాళ్ళను వెనుకవైపుకు తిప్పుతారు. కావున ఈ చిత్రం కూడా అలా తయారు చేయబడింది.

మమ్మా-బాబా మరియు పిల్లలైన మీరు ఉన్నారు. మీరు మమ్మా-బాబాలను అనుసరించవలసి ఉంటుంది. అప్పుడు వారి సింహాసనంపై కూర్చోగలరు. రాజు సంతానాన్ని రాకుమార-రాకుమారీలని అంటారు కదా. భవిష్యత్తులో మనం రాకుమార-రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు. మీకు ఇటువంటి కర్మలు నేర్పించే తండ్రి, టీచర్, గురువు ఇంకెవరైనా ఉన్నారా? మీరు సదాకాలం కొరకు సుఖవంతంగా అవుతారు. ఇది శివబాబా ఇచ్చిన వరం. వారు ఆశీర్వదిస్తారు. అంతేకాని మనపై వారి కృప ఉందని కాదు. కేవలం అలా అన్నంతమాత్రాన ఏమీ జరగదు. మీరు నేర్చుకోవలసి వస్తుంది. కేవలం ఆశీర్వాదాలతో మీరు తయారవ్వలేరు. వారి మతాన్ని అనుసరించాలి. జ్ఞాన-యోగాలను ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నోటితో 'రామ-రామ' అనడం కూడా శబ్దమే అవుతుంది. మీరైతే వాణి నుండి అతీతంగా వెళ్ళాలి, మౌనంగా ఉండాలి. మంచి-మంచి నాటకాలు కూడా వెలువడతాయి. చదువుకోనివారిని అవివేకులని అంటారు. ఇప్పుడు అందరినీ మర్చిపోయి మీరు పూర్తిగా అవివేకులుగా అయిపోండి అని బాబా అంటారు. నేను మతాన్ని ఇస్తున్నాను, దానిని అనుసరించండి. పరంధామంలో ఆత్మలైన మీరంతా శరీరాలు లేకుండా ఉంటారు. ఇక్కడకు వచ్చిన తర్వాత శరీరాలు తీసుకుంటారు. అప్పుడు జీవాత్మలని అంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. బాబా అంటారు - నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలు నేర్పిస్తాను, టీచర్ చదవిస్తారు. ఇందులో శక్తి విషయం ఏముంది. సాక్షాత్కారం చేయిస్తారు, దీనిని ఇంద్రజాలమని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా చేయడమనే ఇంద్రజాలాన్ని ఇంకెవ్వరూ చెయ్యలేరు. బాబా వ్యాపారి కూడా, పాతవాటిని తీసుకొని క్రొత్తవి ఇస్తారు. దీనిని పాత ఇనుప పాత్ర అని అంటారు. దీనికి ఎటువంటి విలువా లేదు. ఈ రోజులలో రాగి పైసలు కూడా తయారవ్వడం లేదు. అక్కడైతే బంగారు నాణాలుంటాయి. ఆశ్చర్యం కదా! ఎలా ఉన్నది ఎలా అయిపోయింది!

తండ్రి చెప్తున్నారు - నేను మీకు నంబర్ వన్ కర్మలు నేర్పిస్తాను. 'మన్మనాభవ' గా అయిపోండి. ఆ తర్వాత చదువు. దీనితో స్వర్గంలో రాకుమారులుగా అవుతారు. ఇప్పుడు దేవతా ధర్మమేదైతే ప్రాయలోపమైందో, అది మళ్ళీ స్థాపనవుతుంది. మనుష్యులు మీరు చెప్పే కొత్త విషయాలు విని ఆశ్చర్యపోతారు. స్త్రీ - పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుంది అని అంటారు. బాబా చెప్తారు - కలిసే ఉండండి, లేకపోతే ఎలా తెలుస్తుంది. మీ మధ్యలో జ్ఞాన ఖడ్గమును పెట్టుకోవాలి. ఇంతటి సాహసాన్ని చూపించాలి. పరీక్ష జరుగుతుంది. కావున మనుష్యులు ఈ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు లేనే లేవు. ఇక్కడ ప్రాక్టికల్ గా శ్రమ చేయవలసి వస్తుంది. గాంధర్వ వివాహం విషయం కూడా ఇక్కడిదే. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు కనుక సాహసం చూపించమని బాబా చెప్తున్నారు. సన్యాసుల ముందు ఋజువునివ్వాలి. సమర్థులైన తండ్రియే ప్రపంచమంతటినీ పావనంగా తయారుచేస్తారు. తండ్రి అంటున్నారు - మీరు కలిసే ఉండండి, కేవలం నగ్నంగా (అపవిత్రంగా) అవ్వకూడదు. ఇవన్నీ యుక్తులు. చాలా గొప్ప ప్రాప్తిని పొందుతారు. కేవలం ఈ ఒక్క జన్మ మాత్రం బాబా డైరెక్షన్ పై పవిత్రంగా ఉండండి. జ్ఞాన-యోగాల ద్వారా 21 జన్మలకు సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది కదా. మీరు శక్తి సైన్యం, మాయపై విజయం పొంది జగత్ జీతులుగా అవుతారు. అందరూ అలా అవ్వరు కదా. ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు భారతదేశాన్నే పవిత్రంగా తయారుచేసి మళ్ళీ భారతదేశం పైనే రాజ్యం చేస్తారు. యుద్ధం ద్వారా ఎప్పుడూ సృష్టి రాజ్యాధికారం లభించదు. ఇది అద్భుతం కదా. ఈ సమయంలో అందరూ పరస్పరం కొట్లాడుకొని సమాప్తమైపోతారు. వెన్న భారతదేశానికి లభిస్తుంది. ఇప్పించేవారు మాతలు. మెజారిటీ మాతలే ఉన్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు - జన్మ జన్మాంతరాలు మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు. శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను - సత్యం ఏదో మీకు మీరే నిర్ణయించుకోండి. సత్యయుగం సత్యమైన ప్రపంచం. మాయ అసత్యంగా తయారుచేస్తుంది. ఇప్పుడు భారతవాసీయులు అధర్మయుక్తంగా అయిపోయారు. ధర్మం లేదు కావున శక్తి కూడా లేదు. అధర్మయుక్తంగా, అసత్యంగా, న్యాయవిరుద్ధంగా, బికారులుగా అయిపోయారు. వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు, ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ధర్మయుక్తులుగా మరియు అతి శక్తివంతులుగా తయారుచేస్తాను. స్వర్గం తయారుచేయడం శక్తివంతుని పని. కాని గుప్తంగా ఉంది. మీరు గుప్త యోధులు. తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది, సలహానిస్తారు. తండ్రి మతం, టీచర్ మతం, గురువు మతం, కంసాలి మతం, చాకలి మతం మొదలైన మతాలన్నీ ఇందులో వచ్చేస్తాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి డైరెక్షన్ పై నడుస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇందులో సాహసం చూపించాలి.

2. శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి. వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఏదైతే చదువుకున్నారో, విన్నారో, అదంతా మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-

శుభచింతన ద్వారా జ్ఞానసాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీ భవ

సముద్రం లోపల ఉండే జీవ జంతువులు సాగరంలో మునిగి ఉంటాయి, అవి బయటకు వచ్చేందుకు ఇష్టపడవు. చేప కూడా నీటి లోపల ఉంటుంది, సాగరం లేక నీరే దాని ప్రపంచం. ఈ విధంగా పిల్లలైన మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడైన తండ్రిలో సదా ఇమిడిపోయి ఉండండి, ఎంతవరకు సాగరంలో ఇమిడి ఉన్న అనుభవం చేయరో అంతవరకు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగే, సదా హర్షితంగా ఉండే అనుభవం చేయలేరు. అందుకు స్వయాన్ని సదా ఏకాంతవాసిగా చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల యొక్క వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి.

స్లోగన్:-

మీ ముఖంలో బిందువైన తండ్రి కనిపించే విధంగా మీ ముఖాన్ని నడుస్తూ, తిరుగుతూ ఉన్న మ్యూజియంగా తయారుచేసుకోండి.