25-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉండేందుకు శ్రమ చేసినట్లయితే పావనంగా అవుతూ ఉంటారు, ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు, తర్వాత తోడు తీసుకెళ్తారు"

ప్రశ్న:-

మీరు అందరికీ ఏ సందేశాన్నివ్వాలి?

జవాబు:-

ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక పావనంగా అవ్వండి, నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారని పతిత-పావనుడైన తండ్రి చెప్తున్నారు - ఈ సందేశం అందరికీ ఇవ్వండి. పిల్లలైన మీకు తండ్రి తమ పరిచయమిచ్చారు, ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయడం మీ కర్తవ్యం. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అని కూడా అంటారు.

గీతము:-

నీ దారిలోనే మరణించాలి..... (మర్ నా తేరీ గలీమే, జీనా తేరీ గలీమే.....)

ఓంశాంతి. బాబా, మేము మీ రుద్రమాలలో తప్పకుండా కూర్చబడతాము అనే అర్థాన్ని తెలియజేసే పాటను పిల్లలు విన్నారు. ఈ పాటైతే భక్తిమార్గంలో తయారుచేయబడింది, ఈ ప్రపంచంలోని జప-తపాలు, పూజా-పారాయణాలు అన్నీ భక్తిమార్గానికి చెందిన సామాగ్రి. భక్తి రావణ రాజ్యం, జ్ఞానం రామ రాజ్యం. జ్ఞానాన్ని - నాలెడ్జ్, చదువు అని అంటారు. భక్తిని చదువు అని అనరు. మనం ఎలా తయారవుతామనే లక్ష్యమేదీ భక్తిలో లేదు, భక్తి చదువు కాదు. రాజయోగం నేర్చుకోవడం చదువు, చదువును ఒకచోట పాఠశాలలో చదువుకుంటారు. భక్తిలోనైతే ప్రతి ద్వారం వద్ద ఎదురుదెబ్బలు తింటారు. చదువంటే చదువే. కనుక చదువును పూర్తిగా చదువుకోవాలి. మనం విద్యార్థులమని పిల్లలకు తెలుసు. చాలామంది స్వయాన్ని విద్యార్థులుగా భావించరు, ఎందుకంటే చదవనే చదవరు. తండ్రిని తండ్రిగానూ భావించరు, శివబాబాను సద్గతిదాతగానూ భావించరు. బుద్ధిలో కొద్దిగా కూడా కూర్చోనటువంటివారు కూడా ఉన్నారు, రాజధాని స్థాపన అవుతుంది కదా. అందులో అన్ని రకాలవారు ఉంటారు. తండ్రి పతితులను పావనంగా తయారుచేసేందుకే వచ్చారు. ఓ పతిత-పావనా రండి అని తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు పావనంగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి. ప్రతి ఒక్కరికీ తండ్రి యొక్క సందేశాన్నివ్వండి. ఈ సమయంలో భారత్ వేశ్యాలయంగా ఉంది. ఇదివరకు ఇదే భారత్ శివాలయంగా ఉండేది. ఇప్పుడు రెండు కిరీటాలూ లేవు. ఈ విషయం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనంగా అయిపోతారని ఇప్పుడు పతిత-పావనుడైన తండ్రి చెప్తున్నారు. స్మృతిలోనే శ్రమ ఉంది. స్మృతిలో ఉండేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. భక్తుల మాల కూడా కొంతమందిదే కదా. అందులో ధన్నా భగత్, నారదుడు, మీరా మొదలైనవారి పేర్లు ఉన్నాయి. వీరిలో కూడా అందరూ వచ్చి చదువుకోరు. కల్పక్రితం ఎవరైతే చదువుకున్నారో, వారే వస్తారు. బాబా, మేము చదువుకునేందుకు మరియు స్మృతియాత్ర నేర్చుకునేందుకు మిమ్మల్ని కల్పక్రితం కూడా కలిశామని చెప్తారు కూడా. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తీసుకు వెళ్ళేందుకు తండ్రి వచ్చేసారు. మీ ఆత్మ పతితంగా ఉందని అర్థం చేయిస్తారు. అందుకే వచ్చి పావనంగా తయారుచెయ్యండని పిలుస్తారు. నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. తండ్రి చదివిస్తారు, తర్వాత తోడుగా కూడా తీసుకువెళ్తారు. పిల్లలకు లోలోపల చాలా సంతోషముండాలి. తండ్రి చదివిస్తున్నారు, కృష్ణుడిని తండ్రి అని అనరు. కృష్ణుడిని పతిత-పావనుడని అనరు. తండ్రి అని ఎవరిని అంటారో మరియు వారు జ్ఞానమెలా ఇస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. తండ్రి తమ పరిచయాన్ని పిల్లలకు మాత్రమే ఇస్తారు. కొత్త-కొత్త వారితో తండ్రి కలవరు. సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు) అని తండ్రి అంటున్నారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తండ్రి కొత్తవారెవరినీ కూడా కలవరు, మాట్లాడరు. ఇంతవరకు బాబా కొత్త-కొత్త వారిని కలుస్తూ ఉన్నారు, డ్రామాలో ఉంది, అనేకమంది వస్తూ ఉండేవారు. మిలటరీ వారిని కూడా ఉద్దరించాలని తండ్రి అర్థం చేయించారు, వారు కూడా ఉద్యోగం చేయాల్సిందే. లేకపోతే శత్రువులు దాడి చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. యుద్ధ మైదానంలో శరీరం విడిచిపెట్టేవారు, స్వర్గంలోకి వెళ్తారని గీతలో ఉంది. కాని అలా వెళ్ళలేరు. స్వర్గస్థాపన చేసేవారు వచ్చినప్పుడే వెళ్తారు. స్వర్గమంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు పంచ వికారాల రూపీ రావణుడితో యుద్ధం చేస్తారు, అశరీరి భవ అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్ను స్మృతి చేయండి. ఇతరులెవ్వరూ ఇలా చెప్పలేరు.

సర్వశక్తివంతుడని ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ అనరు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా అనరు. సర్వశక్తివంతుడు ఒక్క తండ్రి మాత్రమే. వరల్డ్ ఆల్మైటీ అథారిటి, జ్ఞానసాగరులని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. ఈ సాధు-సత్పురుషులు మొదలైనవారు శాస్త్రాల అథారిటి. భక్తికి అథారిటీ అని కూడా అనరు. శాస్త్రాలకు అథారిటీ, వారి ఆధారమంతా శాస్త్రాలపైన ఉంది. భక్తికి ప్రతిఫలం భగవంతుడు ఇస్తారని భావిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమయిందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. భక్తితో భగవంతుడు ప్రసన్నమవుతారని భక్తులు భావిస్తారు. భగవంతుడిని కలుసుకోవాలనే కోరిక ఉంటుంది, అయితే వారు ఎవరి భక్తితో ప్రసన్నమవుతారు? తప్పకుండా వారిని మాత్రమే భక్తి చేసినప్పుడే ప్రసన్నమవుతారు కదా. మీరు శంకరుని భక్తి చేస్తే తండ్రి ఎలా ప్రసన్నమవుతారు, హనుమంతుని భక్తి చేస్తే తండ్రి ప్రసన్నమవుతారా? సాక్షాత్కారమవుతుంది, అంతేకాని ఏమీ లభించదు. తండ్రి చెప్తున్నారు, నేను సాక్షాత్కారం చేయిస్తాను కానీ వారు నాతో వచ్చి కలుస్తారని కాదు. లేదు, మీరు నాతో కలుస్తారు. భగవంతుడిని కలుసుకునేందుకు భక్తులు భక్తి చేస్తారు. భగవంతుడు ఏ రూపంలో వచ్చి కలుస్తారో తెలియదని అంటారు, అందుకే దాన్ని అంధ-శ్రద్ధ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రిని కలుసుకున్నారు. ఆ నిరాకార తండ్రి శరీరాన్ని ధారణ చేసినప్పుడే, నేను మీ తండ్రిని అని తమ పరిచయాన్ని ఇస్తారని తెలుసు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్య-భాగ్యం ఇచ్చారు, తర్వాత మీరు 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ద్వాపర యుగం తర్వాతే ఇతర ధర్మాలు వస్తాయి, వారు వచ్చి తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇందులో గొప్పలు చెప్పుకునే విషయమేదీ లేదు. గొప్పతనమెవ్వరిదీ లేదు. తండ్రి వచ్చి ప్రవేశించినప్పుడే బ్రహ్మా యొక్క గొప్పతనం ఉంటుంది. లేకపోతే వీరు వ్యాపారం చేసేవారు, నాలో భగవంతుడు వస్తారని వీరికి కూడా తెలియదు. నేను వీరిలో ఎలా ప్రవేశించాను అన్నది తండ్రి ప్రవేశించి అర్థం చేయించారు. నాదంతా నీది, నీదంతా నాది అని, నీ తనువు-మనసు-ధనముల ద్వారా నీవు నాకు సహాయకునిగా అయితే దానికి ప్రతిఫలితంగా నీకు ఇది లభిస్తుందని వీరికి చూపించాను. తండ్రి చెప్తున్నారు - నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను, వీరికి తన జన్మల గురించి తెలియదు. కాని నేను ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో, ఇది ఎవ్వరికీ తెలియదు. సాధారణ శరీరంలో తండ్రి వచ్చారని ఇప్పుడు మీరు చూస్తున్నారు. వీరి ద్వారా మనకు జ్ఞానం మరియు యోగం నేర్పిస్తున్నారు. జ్ఞానమైతే చాలా సహజం. నరక ద్వారం మూయబడి స్వర్గ ద్వారం ఎలా తెరుచుకుంటుందనే విషయం కూడా మీకు తెలుసు. ద్వాపరయుగంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది అనగా నరక ద్వారం తెరుచుకుంటుంది. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం సగం-సగం ఉంటాయి. కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను. తండ్రిని స్మృతి చేస్తే జన్మ-జన్మాంతరాల పాపాలు నాశనమవుతాయి. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తెలియజేయాలి. ఏమేమి పాపాలు చేశాము, ఏమేమి దాన-పుణ్యాలు చేశాము అన్నది గుర్తుంటుంది కదా. వీరికి తమ బాల్యం గుర్తుంది కదా. నలుపు మరియు తెలుపు, శ్యామసుందరుడు అని కృష్ణునికే పేర్లున్నాయి. వాటి అర్థం ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకీ రాదు. పేరు శ్యామ-సుందరుడైతే చిత్రంలో నల్లగా చేసేశారు. రఘునాథ మందిరంలో చూస్తే అక్కడ కూడా నల్లగానే చేసారు, హనుమంతుని మందిరంలో చూడండి, అందరినీ నల్లగా చేసేశారు. ఇదైతే పతిత ప్రపంచం. ఇప్పుడు పిల్లలైన మీకు నలుపు నుండి తెలుపుగా అవ్వాలనే చింత ఉంది. దానికోసం మీరు తండ్రి స్మృతిలో ఉంటారు. ఇది అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మమైపోతాయి. తండ్రి తీసుకు వెళ్ళేందుకు వచ్చారని తెలుసు. కనుక తప్పకుండా శరీరాలను ఇక్కడే విడిచిపెట్టేస్తారు. శరీర సహితంగా తీసుకుని వెళ్ళరు. పతితాత్మలు కూడా వెళ్ళలేవు. తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తప్పకుండా తెలియజేస్తారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి అని చెప్తారు. భక్తిమార్గంలో అంధశ్రద్ధ ఉంది. శివకాశి అని అంటారు, శివుడు గంగను తీసుకొచ్చారు, భగీరథుని ద్వారా గంగ వచ్చింది అని కూడా అంటారు. మరి తల నుండి గంగ ఎలా వస్తుంది. జటాజూటముల నుండి గంగ వెలువడేందుకు భగీరథుడు ఏమైనా పర్వతంపైన కూర్చొని ఉన్నారా. సముద్రం నుండి ఆవిరై నీరు వర్షిస్తుంది, ఆ నీరు ప్రపంచమంతా ప్రవహిస్తుంది. నదులైతే అన్నివైపులా ఉన్నాయి. పర్వతాలపై మంచు ఏర్పడుతుంది, అక్కడ నుండి కూడా నీరు వస్తూ ఉంటుంది. పర్వతాలలో ఉండే గుహలలోని నీరు, మళ్ళీ బావులలోకి వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఆధారం వర్షం. వర్షం పడకపోతే బావులు కూడా ఎండిపోతాయి.

బాబా, మమ్మల్ని పావనంగా తయారుచేసి స్వర్గంలోకి తీసుకు వెళ్ళండి అని కూడా అంటారు. అందరికీ స్వర్గం లేక కృష్ణపురికి వెళ్ళాలనే ఆశ ఉంది. విష్ణుపురి గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని భక్తులు - ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. అరే, పరమాత్మ సర్వవ్యాపి అయితే ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మని ఎందుకనరు? ఇవన్నీ వారి రూపాలే అని పరమాత్ముని భక్తులు అంటూ ఉంటారు. ఈ లీలలన్నీ వారే చేస్తున్నారు. భగవంతుడు లీలలు చూపించేందుకే, రూపాన్ని ధరించారు. కావున ఇప్పుడు తప్పకుండా లీలలు చూపిస్తారు కదా. పరమాత్ముని ప్రపంచాన్ని స్వర్గంలో చూడండి, అక్కడ మలినం అనే మాటే ఉండదు. ఇక్కడైతే అంతా మలినమే మరియు పరమాత్మ సర్వవ్యాపి అని ఇక్కడ అంటారు. పరమాత్మనే సుఖమిస్తారు. కొడుకు జన్మిస్తే సంతోషిస్తారు, మరణిస్తే దుఃఖిస్తారు. అరే, భగవంతుడు మీకు ఇచ్చిన వస్తువును మళ్ళీ తీసుకుంటే ఇందులో మీరు ఏడవాల్సిన అవసరమేముంది! సత్యయుగంలో ఈ ఏడ్వడం మొదలైన దుఃఖాలుండవు. మోహజీత్ రాజును ఉదాహరణగా చూపించారు. ఇవన్నీ అసత్య ఉదాహరణలు. వాటిలో ఏ సారమూ లేదు. సత్యయుగంలో ఋషులు-మునులు ఉండరు. మరియు ఇక్కడ కూడా అటువంటి విషయాలు ఉండవు. అటువంటి మోహజీత్ రాజులు ఎవరూ ఉండరు. భగవానువాచ - యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసి వెళ్ళారు? మీకు తండ్రితో యోగముంది. తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీ ద్వారా నేను భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాను. ఇప్పుడు ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎవరు కలిసినా కూడా వారికి భగవంతుడు నన్నొక్కరినే స్మృతి చేయమంటున్నారని చెప్పండి. నాపట్ల ప్రీతిని పెట్టుకోండి మరియు ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి. ఇది అవ్యభిచారి స్మృతి. ఇక్కడ అభిషేకాలు మొదలైనవేవీ చేసే పని లేదు. భక్తిమార్గంలో వ్యాపారాలు మొదలైనవి చేస్తున్నా, స్మృతి చేసేవారు కదా. గురువులు కూడా నన్ను స్మృతి చేయండి, మీ పతిని స్మృతి చేయకండి అని చెప్తారు. పిల్లలైన మీకు ఎన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అన్న సందేశం అందరికీ ఇవ్వండి, ఇది ముఖ్యమైన విషయం. బాబా అంటేనే భగవంతుడు. భగవంతుడు నిరాకారుడు. కృష్ణుడిని భగవంతుడని అందరూ అనరు. కృష్ణుడైతే బాలుడు. శివబాబా వీరిలోకి రాకపోతే మీరు ఉండేవారా? శివబాబా వీరి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, తమవారిగా చేసుకున్నారు. వీరు తల్లి కూడా, తండ్రి కూడా. సాకారంలో తల్లి కావాలి కదా. వారైతే తండ్రి. కనుక ఇటువంటి విషయాలు మంచి రీతిగా ధారణ చేయండి.

పిల్లలైన మీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ తికమకపడకూడదు. చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. చాలామంది పిల్లలు సాంగత్య దోషంలోకి వచ్చి అలిగి సొంత పాఠశాలను తెరుచుకుంటారు. ఒకవేళ పరస్పరంలో గొడవపడి-కొట్లాడుకుని సొంత పాఠశాలను తెరిస్తే అది మూర్ఖత్వం, అలిగితే పాఠశాల తెరిచేందుకు అర్హతే లేదు. మీ దేహాభిమానం సాగదు ఎందుకంటే బుద్ధిలో శతృత్వముంది, ఇక అదే గుర్తుకొస్తుంది. ఎవ్వరికీ ఏమీ అర్థం చేయించలేరు. ఎవరికైతే జ్ఞానమిస్తారో వారు చురుకుగా ముందుకెళ్తారు, స్వయం క్రిందపడిపోతారు, ఇలా కూడా జరుగుతుంటుంది. నాకంటే వారి స్థితే బాగుంది అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. చదువుకున్నవారు రాజులుగా అవుతారు మరియు చదివించినవారు దాస-దాసీలుగా అవుతారు, ఇటువంటివారు కూడా ఉన్నారు. పురుషార్థం చేసి తండ్రి కంఠహారంగా అవ్వాలి. బాబా, జీవిస్తూనే నేను మీకు చెందినవారిగా అయ్యాను. తండ్రి స్మృతి ద్వారానే నావ ఆవలి తీరానికి చేరుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమకపడకూడదు. పరస్పరం అలిగి చదువును విడిచిపెట్టకూడదు. శతృత్వం తయారుచేసుకోవడం కూడా దేహాభిమానమే. సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకోవాలి. పావనంగా అవ్వాలి, తమ నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి.

2. ప్రీతిబుద్ధి కలవారిగా అయ్యి ఒక్క తండ్రి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. తనువు-మనసు-ధనం ద్వారా తండ్రి కార్యంలో సహాయకులుగా అవ్వాలి.

వరదానము:-

స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకొని విశ్వానికి ఆధారమూర్తిగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారీ భవ

శ్రేష్ఠ పదవిని పొందేందుకు బాప్ దాదా శిక్షణ ఏమిటంటే - పిల్లలూ, స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు బదులుగా, పరిస్థితులు లేదా ఇతర ఆత్మలు మారాలి అని ఆలోచిస్తే, లేదా ఈ పరిష్కారం లభించాలి, సహయోగం లేదా ఆధారం లభించాలి, అప్పుడు పరివర్తన అవుతాను అని సంకల్పం వస్తే - ఇలా ఏదైనా ఆధారంపై పరివర్తన అయ్యేవారి ప్రాలబ్ధం కూడా దేనిపైనైనా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఎంతమంది ఆధారం తీసుకుంటారో, అన్ని భాగాలుగా జమ ఖాతా పంచబడుతుంది. కావున సదా స్వయం పరివర్తనవ్వాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. నేను స్వయం విశ్వానికి ఆధారమూర్తిని.

స్లోగన్:-

సంగఠనలో ఉల్లాస-ఉత్సాహం మరియు శ్రేష్ఠ సంకల్పాలు ఉంటే సఫలత లభించే తీరుతుంది.