10-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - పతిత ప్రపంచంతో సంబంధాన్ని తెంచి, ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మాయతో ఓడిపోలేరు”

ప్రశ్న:-

సమర్థుడైన తండ్రి తోడుగా ఉన్నప్పటికీ, యజ్ఞంలో అనేక విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? కారణం ఏమిటి?

జవాబు:-

ఈ విఘ్నాలు డ్రామానుసారంగా రావాల్సిందే ఎందుకంటే యజ్ఞంలో అసురుల విఘ్నాలు కలిగినప్పుడే పాపపు కుండ నిండుతుంది. ఇందులో తండ్రి ఏమీ చేయలేరు, ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి కానీ మీరు విఘ్నాలకు భయపడకూడదు.

గీతము:-

తల్లి ఎవరు, తండ్రి ఎవరు..... (కౌన్ హై మాతా, కౌన్ పితా హై.....)

ఓంశాంతి. పిల్లలు అనంతమైన తండ్రి ఆజ్ఞను విన్నారు. ఈ జగత్తులోని తల్లిదండ్రులతో మీకు ఏదైతే సంబంధం ఉందో, అది దేహ పరంగా ఉంది, ఎందుకంటే దేహ పరంగా మొట్టమొదటగా తల్లితో బంధం ఏర్పడుతుంది, తర్వాత తండ్రితో ఏర్పడుతుంది, ఆ తర్వాత సోదరులు-బంధువులు మొదలైనవారితో ఏర్పడుతుంది. కనుక అనంతమైన తండ్రి చెప్తుంది ఏమిటంటే - ఈ జగత్తులో మీ తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో, వారితో బుద్ధి యోగాన్ని తెంచివేయండి. ఈ జగత్తుతో సంబంధం పెట్టుకోకండి ఎందుకంటే ఇవన్నీ కలియుగీ ఛీ-ఛీ సంబంధాలు. జగత్తు అంటే ప్రపంచము. ఈ పతిత ప్రపంచంతో బుద్ధియోగాన్ని తెంచి, నా ఒక్కరితో జోడించండి మరియు కొత్త జగత్తుతో జోడించండి, ఎందుకంటే ఇప్పుడు మీరు నా వద్దకు రావాల్సి ఉంది. ఇక్కడ కేవలం సంబంధాన్ని జోడించే విషయమే ఉంది, వేరే విషయమేమీ లేదు, వేరే కష్టమేమీ లేదు. ఎవరికైతే డైరెక్షన్ లభిస్తుందో, వారు సంబంధాన్ని జోడిస్తారు. సత్యయుగంలో మొదట, సంబంధాలు బాగుంటాయి, సతోప్రధానంగా ఉంటాయి, తర్వాత కిందకు దిగుతూ వస్తారు. అప్పుడిక సుఖం యొక్క సంబంధాలేవైతే ఉంటాయో, అవి నెమ్మది-నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచి వేయాల్సి ఉంటుంది. బాబా అంటారు - నాతో సంబంధాన్ని జోడించండి, శ్రీమతాన్ని అనుసరించండి మరియు దేహ సంబంధాలన్నింటినీ వదిలేయండి. వినాశనమైతే జరగాల్సిందే. ఏ తండ్రినైతే పరమపిత పరమాత్మ అని అంటారో, వారు కూడా డ్రామానుసారంగా సేవ చేస్తారని పిల్లలకు తెలుసు. వారు కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నారు. ఎలాగైతే కృష్ణుడిని కూడా సర్వశక్తివంతునిగా భావిస్తారో, అలా మనుష్యులు వారిని సర్వశక్తివంతునిగా భావిస్తారు. కృష్ణుడికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. దానితో శిరస్సును ఖండిస్తారని భావిస్తారు. కానీ దేవతలు హింసాత్మకమైన పనులు ఎలా చేయగలరు అన్నది అర్థం చేసుకోరు. దేవతలు అలా చేయలేరు. దేవతలు, అహింస పరమ ధర్మముగా ఉండేవారని అంటారు. వారిలో హింస ఎక్కడ నుండి వచ్చింది. ఎవరికి ఏది తోస్తే, అది కూర్చుని రాసేసారు. ధర్మాన్ని ఎంతగా కించపరిచారు. ఈ శాస్త్రాలలో సత్యమనేది, కేవలం పిండిలో ఉప్పు అంత మాత్రమే ఉందని బాబా అంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారని కూడా రాసి ఉంది. అందులో అసురులు విఘ్నాలను వేసేవారని, అబలలపై అత్యాచారాలు జరిగేవని రాసారు. ఇదంతా సరిగ్గానే రాయబడింది. శాస్త్రాల్లో సత్యమేమిటి, అసత్యమేమిటి అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. డ్రామాలో నిశ్చయించబడి ఉంది. పరమాత్మ తోడుగా ఉన్నారు కనుక విఘ్నాలను తొలగించేస్తారని కాదు. ఇందులో తండ్రి ఏమి చేస్తారు! డ్రామాలో అలా జరగాలని ఉంది. వీరంతా విఘ్నాలు వేసినప్పుడే కదా పాపపు కుండ నిండుతుంది. డ్రామాలో ఏదైతే నిశ్చయించబడి ఉందో, అదే జరగనున్నదని తండ్రి అర్థం చేయిస్తారు. అసురుల విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. మన రాజధాని స్థాపన అవుతూ ఉంది. అర్ధకల్పం మాయ రాజ్యంలో మనుష్యులు ఎంతగా తమోప్రధాన బుద్ధి కలవారిగా, భ్రష్టాచారులుగా అయిపోతారు. తిరిగి వారిని శ్రేష్ఠాచారులుగా తయారుచేయడం తండ్రి పని కదా. భ్రష్ఠాచారులుగా అవ్వడానికి అర్ధకల్పం పడుతుంది. ఒక్క క్షణంలో తండ్రి మళ్ళీ శ్రేష్ఠాచారులుగా చేస్తారు. నిశ్చయం ఏర్పడేందుకు సమయం పట్టదు. ఈ విధంగా నిశ్చయం కలిగిన మంచి పిల్లలు చాలామంది ఉన్నారు, వెంటనే ప్రతిజ్ఞ చేస్తారు, కానీ మాయ కూడా పహల్వాన్ (వస్తాదు) కదా. మనసులో ఏవో ఒక తుఫాన్లను తీసుకొస్తుంది. పురుషార్థం చేసి కర్మల్లోకి రానివ్వకండి. అందరూ పురుషార్థం చేస్తున్నారు. కర్మాతీత అవస్థ అయితే ఇంకా ఏర్పడలేదు. కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కర్మాతీత అవస్థ వరకు చేరుకునే లోపు, మధ్యలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. బాబా అర్థం చేయించారు - పురుషార్థం చేస్తూ-చేస్తూ అంతిమంలో కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది, అప్పుడిక ఈ శరీరం ఉండదు, అందుకే సమయం పడుతుంది. ఏవో ఒక విఘ్నాలు కలుగుతాయి, అక్కడక్కడ మాయ ఓడించేస్తుంది కూడా. ఇది బాక్సింగ్ కదా. బాబా స్మృతిలో ఉండాలని అనుకుంటారు, కానీ ఉండలేకపోతారు. ఏదైతే కొద్ది సమయం మిగిలి ఉందో, అందులో నెమ్మది-నెమ్మదిగా ఆ అవస్థను ధారణ చేయాలి. జన్మిస్తూనే ఎవరూ రాజుగా అవ్వరు. చిన్న బాలుడు నెమ్మది-నెమ్మదిగా పెద్దవాడవుతాడు కదా, ఇందులో కూడా సమయం పడుతుంది. ఇప్పుడింకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అంతా పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. ఎలాగైనా సరే, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అన్న అటెన్షన్ పెట్టాలి. మాయను తప్పకుండా ఎదుర్కొంటారు, అందుకే ప్రతిజ్ఞ చేస్తారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. చాలా చిన్న చిన్న రూపాల్లో కూడా వస్తుంది. రుస్తుంతో బాగా తీవ్రంగా పోరాడుతుంది. ఈ విషయాలేవీ శాస్త్రాలలో లేవు. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తానని తండ్రి అంటారు. తండ్రి ద్వారా మీరు సద్గతిని పొందుతారు. ఇక తర్వాత ఈ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. జ్ఞానంతో సద్గతి జరుగుతుంది. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు.

కావున మధురాతి-మధురమైన పిల్లలకు లక్ష్యం లభించింది. వృక్షం పెరిగేందుకు డ్రామానుసారంగా సమయమైతే పడుతుందని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. విఘ్నాలైతే చాలా కలుగుతాయి. పరివర్తన జరగవలసి ఉంటుంది. గవ్వ నుండి వజ్రం వలె అవ్వవలసి ఉంటుంది. రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పటికీ దేవతల మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు మందిరాలను నిర్మించరు ఎందుకంటే అది భక్తి మార్గము. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమై, జ్ఞాన మార్గం జిందాబాద్ అవ్వనున్నదని ప్రపంచంలోని వారికి అసలు తెలియదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుష్యులు కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉందని భావిస్తారు. వారిదంతా శాస్త్రాలపైనే ఆధారపడి ఉంటుంది. పిల్లలైన మీకైతే తండ్రి కూర్చుని అన్ని వేద శాస్త్రాల రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - ఇప్పటివరకు మీరు చదివినదంతా మర్చిపోండి, వాటి ద్వారా ఎవరి సద్గతి జరగదు, మహా అయితే అల్పకాలిక సుఖం లభిస్తూ వచ్చింది. సదా సుఖమే సుఖము లభించడమనేది జరగజాలదు. ఇది క్షణభంగుర సుఖము. మనుష్యులు దుఃఖంలో ఉంటారు. సత్యయుగంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవని మనుష్యులకు తెలియదు. అక్కడ కృష్ణపురిలో కంసుడు ఉండేవాడని, అది ఇది ఉండేదని, కృష్ణుడు జైలులో జన్మ తీసుకున్నారని..... అక్కడి కోసం వారు ఇటువంటి విషయాలను చెప్పేసారు. ఇలా చాలా విషయాలు రాసారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి నంబరు రాకుమారుడు, వారేమి పాపం చేశారు. ఇవన్నీ కట్టు కథలు, ఇది కూడా బాబా సత్యం చెప్పిన తర్వాత, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రియే వచ్చి సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. సత్య ఖండంలో ఎంత సుఖముండేది, అసత్య ఖండంలో ఎంత దుఃఖముంది. ఇదంతా మర్చిపోయారు. మేము శ్రీమతాన్ని అనుసరించి సత్య ఖండాన్ని స్థాపన చేసి, దానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు.

ఈ విధంగా మీరు శ్రీమతాన్ని అనుసరించినట్లయితే, ఉన్నత పదవిని పొందగలరని తండ్రి అర్థం చేయిస్తారు. మేము ఈ చదువు చదువుకొని సూర్యవంశీ మహారాజా-మహారాణిగా అవ్వాలని పిల్లలకు తెలుసు. ఉన్నత పదవిని పొందాలని అందరూ కోరుకుంటారు. అందరి పురుషార్థం నడుస్తూ ఉంటుంది. మంచి పక్కా భక్తులు ఎవరైతే ఉంటారో, వారు చిత్రాలను తమతో పాటు పెట్టుకుంటారు, అప్పుడు పదే-పదే వారి స్మృతి ఉంటుంది. త్రిమూర్తి చిత్రాన్ని మీతో పెట్టుకోండి, అప్పుడది పదే-పదే గుర్తుకొస్తుందని బాబా కూడా అంటారు. తండ్రిని స్మృతి చేయడంతో మనము సూర్యవంశీ రాజ్యంలోకి వచ్చేస్తాము. గదిలో త్రిమూర్తి చిత్రం తగిలించి ఉన్నట్లయితే, పదే-పదే అటువైపు దృష్టి వెళ్తుంది, మేము బాబా ద్వారా ఈ సూర్యవంశంలోకి వెళ్తాము. ఉదయం లేస్తూనే ఆ చిత్రం వైపు దృష్టి వెళ్తుంది. ఇది కూడా ఒక పురుషార్థమే. మంచి-మంచి భక్తులు చాలా పురుషార్థం చేస్తారని బాబా సలహానిస్తారు. కళ్ళు తెరుస్తూనే కృష్ణుడు గుర్తుకు రావాలని, ఆ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటారు. మీకైతే ఇంకా సహజము. ఒకవేళ సహజంగా స్మృతి కలగడం లేదంటే, మాయ సతాయిస్తుందంటే, అప్పుడు ఈ చిత్రాలు సహాయపడతాయి. శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని విష్ణుపురికి యజమానులుగా చేస్తారు. మనం బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. ఈ స్మరణలో ఉన్నా సరే చాలా సహాయం లభిస్తుంది. ఏ పిల్లలైతే పదే-పదే స్మృతిని మర్చిపోతున్నామని భావిస్తున్నారో, అటువంటివారికి బాబా సలహానిస్తున్నారు - చిత్రాన్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే, తండ్రి కూడా గుర్తుకొస్తారు మరియు వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. కానీ బ్రహ్మాను గుర్తు చేయకూడదు. నిశ్చితార్థం జరిగినప్పుడు మధ్యవర్తి గుర్తు రారు. మీరు బాబాను మంచి రీతిగా స్మృతి చేసినట్లయితే, బాబా కూడా మిమ్మల్ని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు ప్రియుని కర్తవ్యము గురించి మీకు తెలుసు. శివునికి ఎంతమంది భక్తులున్నారు, శివ-శివ అని అంటూ ఉంటారు. కానీ అది రాంగ్ - శివకాశీ, విశ్వనాథ అని అంటారు, మళ్ళీ గంగ అని అంటారు. నదుల తీరాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. తండ్రి, జ్ఞానసాగరుడు అని వారు అర్థం చేసుకోరు. బనారస్ ను చూసేందుకు విదేశీయులు మొదలైనవారు చాలామంది వెళ్తారు. అక్కడ పెద్ద-పెద్ద నదీ తీరాలుంటాయి, అయినా సర్వుల తండ్రి అయిన వీరి మందిరమే ఆకర్షిస్తుంది, అందరూ వారి వద్దకు వెళ్తారు. మందిరమైతే ఎవరి వద్దకు వెళ్ళదు. మందిరాల్లోని దేవతలు ఆకర్షిస్తారు, అలాగే శివబాబా కూడా ఆకర్షిస్తారు. నంబరు వన్ శివబాబా, తర్వాత సెకండు నంబరులో ఈ బ్రహ్మా, సరస్వతులు అనగా విష్ణువు. విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు. బ్రాహ్మణుల నుండి విష్ణుపురి దేవతలుగా అవుతారు. విష్ణుపురి దేవతల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. మనమే దేవతలుగా అవుతున్నాము కనుక ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి - ఇప్పుడిది మీ వ్యాపారము. మిగిలినవారంతా అడవుల్లోకి తీసుకువెళ్ళేవారు. మీరు అడవి నుండి బయటకు తీసి తోటలోకి తీసుకువెళ్తారు. శివబాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. మీరు కూడా ఈ వ్యాపారాన్నే చేస్తారు. ఈ విషయాల గురించి మీకు మాత్రమే తెలుసు. మీరు అర్థం చేయించేందుకు, ఇక్కడ రాజా-రాణులు ఎవరూ లేరు. పాండవులకు 3 అడుగుల భూమి కూడా లభించేది కాదని అంటారు. తండ్రి సమర్థుడు కనుక వారికి (పాండవులకు) విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పాత్ర నడుస్తుంది కదా. తండ్రి గుప్తమైనవారు. కృష్ణునికైతే ఎటువంటి విఘ్నాలు రాజాలవు. ఇప్పుడు తండ్రి వచ్చారు, తండ్రి వద్దకు వచ్చి వారసత్వాన్ని తీసుకోవాలి, దీని కోసం శ్రమించడం జరుగుతుంది. రోజు-రోజుకు కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శినీ ద్వారా అర్థం చేయించినప్పుడు మంచి ప్రభావం కనిపిస్తుంది. ప్రదర్శినీ ద్వారా మంచి ప్రభావం ఉంటుందా లేక ప్రొజెక్టరు ద్వారా ఉంటుందా అన్న విషయంలో బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ప్రదర్శనీలో అర్థం చేయించేటప్పుడు, వారి ముఖాలను చూస్తూ అర్థం చేయించవచ్చు. వారికి ఇలా రాసి ఇవ్వండి - ‘గీతా భగవంతుడు తండ్రి అన్నది అర్థమైతే, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి, 7 రోజులు ఇవ్వాలి.’ లేదంటే బయటకు వెళ్ళడంతోనే మాయ మరపింపజేస్తుంది. మేము 84 జన్మల చక్రం తిరిగామని, ఇప్పుడు వెళ్ళాలని, తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని మీ బుద్ధిలోకి వచ్చింది. ఈ చిత్రాలైతే మీతో పాటు ఉండాల్సిందే, ఇవి చాలా బాగుంటాయి. ఈ లక్ష్మీనారాయణులు ఈ రాజ్యభాగ్యాన్ని ఎప్పుడు మరియు ఎలా తీసుకున్నారు అనేది బిర్లా మొదలైనవారికి కూడా తెలియదు. మీకు తెలుసు కనుక మీకు చాలా సంతోషముండాలి. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తీసుకుని, వారు ఈ పదవిని ఎలా పొందారు అన్నది ఎవరికైనా వెంటనే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసినవి మరియు అర్థం చేయించవలసినవి. గమ్యము ఉన్నతమైనది. ఎవరు ఎలాంటి టీచరో, వారు అలాంటి సేవనే చేస్తారు. తమ అవస్థ అనుసారంగా ఎవరెవరు సెంటర్లు సంభాళిస్తున్నారు అనేది బాబా చూస్తారు. నషా అయితే అందరికీ ఉంది. కానీ అర్థం చేయించేవారు ఎంత తెలివైనవారిగా ఉంటే, సేవ అంత బాగా జరుగుతుందని వివేకం చెప్తుంది. అందరూ తెలివైనవారిగా ఉండలేరు. అందరికీ ఒకేలాంటి టీచరు లభించలేరు. కల్పక్రితం జరిగినట్లుగానే జరుగుతూ ఉంది. మీ అవస్థను తయారుచేసుకుంటూ ఉండండి అని తండ్రి అంటారు. ఇది కల్ప-కల్పపు పందెము. ప్రతి ఒక్కరి పురుషార్థం కల్పక్రితం వలె నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఏమి జరిగినా సరే - కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని మనం అంటాము, అప్పుడు సంతోషం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. బుద్ధి యోగం అక్కడ వేలాడుతూ ఉన్నట్లయితే చాలా కళ్యాణం జరుగుతుంది, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. మంచి చేస్తే మంచిని పొందుతారు. మాయ మతంపై అందరూ చెడునే చేస్తూ వచ్చారు. ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. మంచి చేసినట్లయితే మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు స్వయం కోసం శ్రమిస్తారు. ఎలా చేస్తే అలా పొందుతారు. మరి మనం యోగాన్ని జోడిస్తూ, సేవ చేస్తూ ఎందుకు ఉండకూడదు. యోగంతో ఆయుష్షు పెరుగుతుంది. స్మృతియాత్ర ద్వారా నిరోగులుగా అవ్వాలి కనుక మనం బాబా స్మృతిలో ఎందుకు ఉండకూడదు. ఇది యథార్థమైన విషయం అన్నప్పుడు, మనమెందుకు ప్రయత్నించకూడదు. జ్ఞానమైతే చాలా సులువైనది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. కానీ వారు యోగి అయితే కాదు కదా. తండ్రిని స్మృతి చేయాలి అన్నది పక్కా చేయించాలి. ఎవరైతే పదే-పదే మర్చిపోతున్నామని అనుకుంటారో, వారు చిత్రం పెట్టుకోండి, అలా అయినా మంచిదే. ఉదయం చిత్రాన్ని చూస్తూనే స్మృతి కలుగుతుంది - శివబాబా ద్వారా మేము విష్ణుపురి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ త్రిమూర్తి చిత్రమే ముఖ్యమైనది, దీని అర్థాన్ని మీరిప్పుడే తెలుసుకున్నారు. ప్రపంచంలో ఇటువంటి త్రిమూర్తి చిత్రం ఇంకెవ్వరి వద్దా లేదు. ఇది చాలా సహజము. మనం రాసినా రాయకపోయినా, బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అన్నది అందరికీ తెలుసు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ బాక్సింగ్ లో ఎప్పుడూ ఓటమి కలగకూడదు, ఈ విషయం పట్ల ధ్యానముంచాలి. కల్పక్రితపు స్మృతి ద్వారా మీ అవస్థను తయారుచేసుకోవాలి. సంతోషంగా మరియు శాంతిగా ఉండాలి.

2. మీ మేలు చేసుకునేందుకు శ్రీమతంపై నడుచుకోవాలి. ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచివేయాలి. మాయా తుఫాన్ల నుండి రక్షించుకునేందుకు చిత్రాలను ఎదురుగా పెట్టుకొని తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి.

వరదానము:-

నిర్బల ఆత్మలలో శక్తుల ఫోర్సును నింపే జ్ఞాన దాత మరియు వరదాత భవ

వర్తమాన సమయంలో నిర్బల ఆత్మలలో జంప్ చేసేంత శక్తి లేదు, వారికి ఎక్స్ట్రా ఫోర్సు (అదనపు శక్తి) కావాలి. కావున విశేష ఆత్మలైన మీరు స్వయంలో విశేషమైన శక్తిని నింపుకొని వారి చేత హై జంప్ చేయించాలి. దీని కోసం జ్ఞాన దాతతో పాటుగా శక్తుల వరదాతగా అవ్వండి. రచయిత ప్రభావం రచనపై పడుతుంది కావున వరదానులుగా అయి తమ రచనకు సర్వశక్తుల వరదానాలను ఇవ్వండి. ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరమే ఉంది.

స్లోగన్:-

సాక్షీగా ఉంటూ ప్రతి ఆటను చూడండి, అప్పుడు సురక్షితంగా కూడా ఉంటారు మరియు ఆనందం కూడా కలుగుతుంది.