ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థము చేయించారు - వీరు తండ్రి కూడా, టీచరు కూడా, సుప్రీమ్ గురువు కూడా అని ఇక్కడ పిల్లలైన మీరు ఈ ఆలోచనతో తప్పకుండా కూర్చోవలసి ఉంటుంది మరియు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి పవిత్రధామానికి చేరుకుంటామని కూడా మీకు అనిపిస్తుంది. పవిత్రధామము నుండే మీరు కిందకు దిగారని తండ్రి అర్థం చేయించారు. మొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో-రజో-తమోలోకి వచ్చారు. మేము కిందపడిపోయామని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. మీరు సంగమయుగంలో ఉన్నారు మరియు మేము పక్కకు తప్పుకున్నామని మీరు జ్ఞానము ద్వారా తెలుసుకున్నారు. ఒకవేళ మనము శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే శివాలయం ఎంతో దూరములో లేదు. శివబాబాను స్మృతే చేయకపోతే శివాలయము చాలా దూరంగా ఉన్నట్లు. శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కదా కనుక చాలా దూరమైపోతారు. కావున తండ్రి పిల్లలకు ఎక్కువ శ్రమనేమీ ఇవ్వరు. ఒకటేమో - మనసా-వాచా-కర్మణా పవిత్రంగా అవ్వాలని పదే-పదే చెప్తారు. ఈ కళ్ళు కూడా చాలా మోసము చేస్తాయి. చాలా సంభాళించుకొని నడుచుకోవలసి ఉంటుంది.
ధ్యానము మరియు యోగము పూర్తిగా వేరని బాబా అర్థము చేయించారు. యోగము అనగా స్మృతి. కళ్ళు తెరిచి ఉంటూ కూడా మీరు స్మృతి చేయవచ్చు. ధ్యానాన్ని యోగమని అనరు. ధ్యానములోకి వెళ్తే దానిని జ్ఞానమని అనరు, యోగమని అనరు. ధ్యానములోకి వెళ్ళేవారిపై మాయ కూడా బాగా దాడి చేస్తుంది కావున ఇందులో చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. తండ్రి స్మృతి నియమానుసారముగా ఉండాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే మాయ ఒక్కసారిగా పడేస్తుంది. ధ్యానము యొక్క కోరికను ఎప్పుడూ పెట్టుకోకూడదు, ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉండాలి. మీరు ఎటువంటి కోరికను పెట్టుకోకూడదు. తండ్రి మీ మనోకామనలన్నింటినీ అడగకుండానే పూర్తి చేస్తారు, అది కూడా తండ్రి ఆజ్ఞపై నడిస్తేనే పూర్తి చేస్తారు. ఒకవేళ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి తప్పుడు మార్గములోకి వెళ్తే స్వర్గంలోకి వెళ్ళేందుకు బదులుగా నరకంలోకి పడిపోవచ్చు. గజమును (ఏనుగును) మొసలి తినేసిందనే గాయనము కూడా ఉంది. అనేకులకు జ్ఞానమును ఇచ్చేవారు, భోగ్ పెట్టేవారు ఈ రోజు లేనే లేరు ఎందుకంటే నియమాలను ఉల్లంఘిస్తారు కనుక పూర్తిగా మాయావిగా అయిపోతారు. దేవతగా అవుతూ అవుతూ డెవిల్ (అసురులు)గా అయిపోతారు, అందుకే ఈ మార్గంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీపై మీరు కంట్రోల్ (నిగ్రహం) ఉంచుకోవాలి. తండ్రైతే పిల్లలను సావధానపరుస్తారు. శ్రీమతమును ఉల్లంఘించకూడదు. ఆసురీ మతంపై నడవడం వలనే మీ దిగే కళ జరిగింది. ఎక్కడ నుండి ఎక్కడకు చేరుకున్నారు, పూర్తిగా కిందకు దిగజారిపోయారు. ఇప్పటికీ కూడా శ్రీమతంపై నడవకుండా, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. శ్రీమతం ఆధారంగా కాకుండా ఏమి చేసినా కూడా చాలా డిస్ సర్వీస్ చేస్తారని బాబా నిన్న కూడా అర్థం చేయించారు. శ్రీమతం లేకుండా చేసినట్లయితే దిగజారుతూనే ఉంటారు. బాబా ప్రారంభం నుండి మాతలను నిమిత్తంగా ఉంచారు ఎందుకంటే కలశము కూడా మాతలకే లభిస్తుంది. వందేమాతరం అని గాయనం చేయబడింది. బాబా కూడా ఒక మాతల కమిటీని తయారుచేసారు. అంతా వారికి సమర్పించేసారు. కుమార్తెలు విశ్వాసపాత్రులుగా ఉంటారు, పురుషులు ఎక్కువగా దివాలా తీస్తారు. కావున తండ్రి కూడా కలశాన్ని మాతల పైనే పెడతారు. ఈ జ్ఞానమార్గంలో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదమ భాగ్యశాలిగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో, వారు కూడా మాయతో ఓడిపోయి దివాలా తీయవచ్చు. ఇక్కడ స్త్రీ-పురుషులు ఇరువురూ దివాలా తీయవచ్చు. అక్కడ కేవలం పురుషులు దివాలా తీస్తారు. ఇక్కడైతే ఎంతమంది ఓడిపోయి వెళ్ళిపోయారో చూడండి, అంటే దివాలా తీశారు కదా. భారతవాసులు పూర్తిగా దివాలా తీశారని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మాయ ఎంత శక్తివంతమైనది. తాము ఎలా ఉండేవారు అనేది అర్థము చేసుకోలేరు. ఎక్కడి నుండి కిందకు దిగజారి పడిపోయారు! ఇక్కడ కూడా పైకి ఎక్కుతూ, ఎక్కుతూ మళ్ళీ శ్రీమతాన్ని మర్చిపోయి తమ మతంపై నడిచినట్లయితే దివాలా తీసేస్తారు. ఇక వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. వారైతే దివాలా తీస్తారు, మళ్ళీ 5-7 సంవత్సరాల తర్వాత నిలబడిపోతారు. ఇక్కడైతే 84 జన్మలకు దివాలా తీస్తారు. మళ్ళీ ఉన్నతమైన పదవిని పొందలేరు, దివాలా తీస్తూనే ఉంటారు. ఎంతమంది మహారథులు అనేకులను పైకి లేపేవారు, వారు ఈ రోజు లేరు, దివాలా తీసేసారు. ఇక్కడ ఉన్నత పదవులైతే చాలా ఉన్నాయి, కానీ అప్రమత్తంగా ఉండకపోతే పూర్తిగా పై నుండి కిందకు పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తమ మతంపై కమిటీలు మొదలైనవి తయారుచేయడంలో లాభమేమీ ఉండదు. తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి, దీని ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ తండ్రితో యోగము జోడించకపోతే, శ్రీమతమును ఉల్లంఘిస్తే పూర్తిగా పడిపోతారు. కనెక్షన్ తెగిపోతుంది. లింకు తెగిపోతుంది. లింకు తెగిపోతే - మాయ మమ్మల్ని ఎందుకు ఇంతగా విసిగిస్తుందని చెక్ చేసుకోవాలి. ప్రయత్నం చేసి తండ్రితో లింకు జోడించాలి లేదంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది. వికర్మలు చేయడంతో బ్యాటరీ డిస్ఛార్జ్ అయిపోతుంది. పైకి ఎక్కుతూ-ఎక్కుతూ పడిపోతారు. ఇలాంటివారు ఎంతోమంది ఉన్నారని మీకు తెలుసు. ప్రారంభంలో ఎంతమంది వచ్చి బాబాకు చెందినవారిగా అయ్యారు. భట్టీలోకి వచ్చారు, కానీ ఈ రోజు వారు ఎక్కడున్నారు? పడిపోయారు ఎందుకంటే పాత ప్రపంచము గుర్తుకొచ్చింది. నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఈ పాత పతిత ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకూడదు. స్వర్గముతో మనసు పెట్టుకోండి, ఇందులో శ్రమ ఉంది. ఒకవేళ ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలనుకుంటే శ్రమంచవలసి ఉంటుంది. బుద్ధి యోగము ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచము పట్ల వైరాగ్యముండాలి. అచ్ఛా, పాత ప్రపంచాన్ని మర్చిపోతే మంచిదే. మరి ఎవరిని స్మృతి చేయాలి? శాంతిధామము-సుఖధామములను స్మృతి చేయాలి. ఎంత వీలైతే అంత లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. అనంతమైన సుఖం యొక్క స్వర్గాన్ని గుర్తు చేయండి. ఇదైతే చాలా సహజము. ఒకవేళ ఈ రెండు ఆశలకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. మీరిక్కడకు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని అందరికీ చెప్తారు ఎందుకంటే రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణం) జరుగుతుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతం అవ్వడం అనగా నరకం నుండి స్వర్గంగా, మళ్ళీ స్వర్గం నుండి నరకంగా అవ్వడము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి అని తండ్రి చెప్పారు. మేము ఎన్నిసార్లు ఈ చక్రములో తిరిగాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి. మనము స్వదర్శన చక్రధారులము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతాము. ప్రపంచంలో ఎవ్వరికీ ఈ రహస్యాలు తెలియవు. ఈ జ్ఞానము దేవతలకు వినిపించేది లేదు, వారు పవిత్రంగానే ఉంటారు. శంఖాన్ని మోగించేందుకు వారిలో జ్ఞానము లేదు. పవిత్రంగా ఉన్నారు కనుక వారికి గుర్తులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇరువురు కలిసి చతుర్భుజులుగా ఉన్నప్పుడు గుర్తులు ఉంటాయి. మీకు కూడా ఇవ్వరు ఎందుకంటే మీరు నేడు దేవతగా ఉంటారు, రేపు మళ్ళీ కిందకు పడిపోతారు. మాయ పడేస్తుంది కదా. తండ్రి దేవతలుగా తయారుచేస్తారు, మాయ మళ్ళీ డెవిల్ (అసురులు) గా చేస్తుంది. మాయ అనేక రకాలుగా పరీక్ష తీసుకుంటుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు నిజంగానే మా స్థితి దిగజారిపోయింది అన్నది తెలుస్తుంది. పాపం ఎంతోమంది తమదంతా శివబాబా ఖజానాలో జమ చేసారు, అయినా అప్పుడప్పుడు మాయతో ఓడిపోతారు. శివబాబాకు చెందినవారిగా అయ్యారు, మళ్ళీ ఎందుకు మర్చిపోతారు, ఇందులో యోగం యొక్క యాత్ర ముఖ్యమైనది. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. జ్ఞానముతో పాటు పవిత్రత కూడా కావాలి. బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, అప్పుడు మేము స్వర్గములోకి వెళ్ళగలమని మీరు పిలుస్తారు కూడా. పావనంగా అయి ఉన్నత పదవిని పొందేందుకే స్మృతియాత్ర ఉన్నది. ఎవరైతే వెళ్ళిపోతారో వారు కూడా ఎంతో కొంత విన్నారు కనుక శివాలయములోకి తప్పకుండా వస్తారు. వారు ఎలాంటి పదవిని పొందినా కానీ రావడమైతే తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసినా కూడా స్వర్గములోకి వచ్చేస్తారు కానీ ఉన్నత పదవిని పొందలేరు. కేవలం స్వర్గము యొక్క పేరు విని సంతోషపడిపోకూడదు. ఫెయిల్ అయ్యి పైసకు కొరగాని పదవిని పొందడంలో సంతోషపడకూడదు. అది స్వర్గమే కానీ అందులో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా. నేను నౌకరును, ఊడ్చేవాడిని అనే ఫీలింగు అయితే వస్తుంది కదా. మేము ఏమవుతాము, మా ద్వారా ఏ వికర్మ జరగడం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, నేను మహారాణిగా ఎందుకు అవ్వలేదు అని చివర్లో మీకంతా సాక్షాత్కారమవుతుంది. అడుగడుగూ అప్రమత్తంగా నడుచుకున్నట్లయితే మీరు పదమపతులుగా అవ్వగలరు. అప్రమత్తంగా లేకపోతే పదమపతులుగా అవ్వలేరు. మందిరాలలో దేవతలకు పదమపతుల గుర్తును చూపిస్తారు. తేడానైతే అర్థము చేసుకోగలరు కదా. పదవులలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడైనా కూడా ఎన్ని రకాల పదవులున్నాయో చూడండి. ఎంత ఆర్భాటముంటుంది. అది అల్పకాలికమైన సుఖమే. కావున ఈ ఉన్నతమైన పదవిని పొందాలి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దానికోసం అందరూ చేతులెత్తుతారు కావున అంతటి పురుషార్థం చేయాలి. చేతులెత్తేవారు కూడా స్వయం సమాప్తమైపోతారు. వీరు దేవతలుగా అవ్వబోయారు, పురుషార్థము చేస్తూ-చేస్తూ సమాప్తమైపోయారని అంటారు. చేతులెత్తడము సహజమే. అనేకులకు అర్థం చేయించడం కూడా సహజమే, మహారథులు అర్థం చేయిస్తూ కూడా మాయమైపోతారు. ఇతరుల కళ్యాణము చేస్తూ స్వయానికి స్వయం అకళ్యాణము చేసుకుంటారు, అందుకే అప్రమత్తంగా ఉండండని తండ్రి అర్థం చేయిస్తారు. అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధంగా? బాబా మాకు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా, మేము మా స్వీట్ హోమ్ కు (మధురమైన ఇంటికి) వెళ్తున్నాము. ఈ జ్ఞానమంతా లోలోపల ఉండాలి. తండ్రిలో జ్ఞానం మరియు యోగం రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు కావున ఇది జ్ఞానము కూడా అయినట్లు మరియు స్మృతి కూడా అయినట్లు. జ్ఞానం మరియు యోగం రెండూ కలిసి నడుస్తాయి. అంతేకానీ యోగములో కూర్చుని శివబాబాను స్మృతి చేస్తూ, జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు. తండ్రి యోగాన్ని నేర్పిస్తే జ్ఞానాన్ని మర్చిపోతారా! వారిలో జ్ఞానమంతా ఉంటుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానముండాలి. మీరు చదువుకోవాలి. నేను ఎటువంటి కర్మను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళీ చదవకపోతే ఇతరులు కూడా చదవరు. నేను ఏ విధంగా దుర్గతిని పొందుతానో, అలా ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు. ఇతరులను పడవేసేందుకు నేను నిమిత్తమవుతాను. కొంతమంది పిల్లలు మురళీని చదవరు, మిథ్య అహంకారము వచ్చేస్తుంది. మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగులోనూ శ్రీమతము కావాలి. లేకపోతే ఏదో ఒక వికర్మ జరుగుతుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తారు, ఇక తర్వాత సర్వనాశనమైపోతారు. పొరపాటు జరగడంతో మాయ చెంపదెబ్బ వేసి పైసకు కొరగానివారిగా చేసేస్తుంది, ఇందులో చాలా వివేకం కావాలి. అహంకారము వస్తే మాయ చాలా వికర్మలను చేయిస్తుంది. ఎవరైనా ఏదైనా కమిటీ మొదలైనవి ఏర్పరిచినప్పుడు అందులో హెడ్ గా ఒకరిద్దరు స్త్రీలు తప్పకుండా ఉండాలి, వారి సలహాపై పని జరగాలి. కలశం అయితే లక్ష్మి పైనే పెట్టడం జరుగుతుంది కదా. అమృతాన్ని అందించినప్పుడు అసురులు కూడా కూర్చుని తాగేవారని గాయనం కూడా ఉంది. తర్వాత యజ్ఞములో విఘ్నాలను కలిగిస్తారు, అనేక రకాల విఘ్నాలు వేసేవారు ఉన్నారు. రోజంతా బుద్ధిలో పరచింతన విషయాలే ఉంటాయి, ఇది చాలా చెడ్డ విషయము. ఏ విషయమైనా సరే తండ్రికి రిపోర్టు చేయండి. సరిదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి, అందరికీ తండ్రి పరిచయాన్నివ్వండి, అప్పుడే అలా అవ్వగలరు. మాయ చాలా కఠినమైనది, అది ఎవ్వరినీ వదలదు. సదా తండ్రికి సమాచారము రాయాలి. డైరెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క డైరెక్షన్ లభిస్తూనే ఉంటుంది. బాబా అయితే ఈ విషయము గురించి వారంతట వారే అర్థం చేయించారు కనుక వారు అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు - అలా కాదు, నేనైతే జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామి యొక్క విషయమే లేదు. అవును, వీరంతా నా పిల్లలు, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ నా సంతానమేనని నాకు తెలుసు. అంతేకానీ తండ్రి అందరిలో విరాజమానమై ఉన్నారని కాదు. మనుష్యులు తప్పుగా అర్థము చేసుకుంటారు.
అందరి సింహాసనముపై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసని తండ్రి చెప్తున్నారు. ఇది ఎంత సహజమైన విషయము. అయినా మర్చిపోయి పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇదే ఏకైక పొరపాటు, దీని కారణంగానే ఇంత కిందకు పడిపోయారు. విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారిని మీరు నిందిస్తారు, అందుకే యదా యదాహి..... అని తండ్రి అంటారు. తండ్రి ఇక్కడకు వస్తారు కనుక పిల్లలైన మీరు మంచి రీతిలో విచార సాగర మథనము చేయాలి. జ్ఞానము గురించి చాలా చాలా మథనము చేయాలి, సమయమునివ్వాలి, అప్పుడే మీరు మీ కళ్యాణాన్ని చేసుకోగలరు, ఇందులో ధనం మొదలైన వాటి విషయమేమీ లేదు. ఆకలితో ఎవ్వరూ మరణించరు. ఎవరు ఎంతగా తండ్రి వద్ద జమా చేస్తారో, అంతగా వారి భాగ్యము తయారవుతుంది. జ్ఞానము మరియు భక్తి తర్వాత వైరాగ్యము అని తండ్రి అర్థం చేయించారు. వైరాగ్యము అనగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. స్వయాన్ని డిటాచ్ చేసుకోవాలి, ఆత్మనైన నేను ఇప్పుడు శరీరము నుండి వెళ్తున్నాను. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీపై మీరు చాలా కంట్రోల్ (నిగ్రహం) పెట్టుకోవాలి. శ్రీమతంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడూ ఏ నియమాన్ని ఉల్లంఘించకూడదు.
2. అంతర్ముఖులుగా అయి ఒక్క తండ్రితోనే బుద్ధి యొక్క లింకును జోడించాలి. ఈ పతిత పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము పెట్టుకోవాలి. నేను ఎలాంటి కర్మను చేస్తానో, నన్ను చూసి అందరూ చేస్తారు అని బుద్ధిలో ఉండాలి.