ఓంశాంతి. ఇది పురుషోత్తమ సంగమయుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మేము మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యయుగంలో వీరి (లక్ష్మీనారాయణుల) వంశావళిలోకి వెళ్తాము అనగా సుఖధామములోకి వెళ్తాము మరియు పురుషోత్తములుగా అవుతామని మీరు ఫీల్ అవుతారు. కూర్చొని-కూర్చొనే ఈ ఆలోచనలు వస్తాయి! విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో, వారికి తాము ఏ తరగతిలో చదువుతున్నారు, నేను బ్యారిస్టరుగా అవుతానా లేక ఫలానాగా అవుతానా అన్నది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశములోకి వెళ్తామని మీకు తెలుసు. విష్ణువుకు రెండు రూపాలున్నాయి - లక్ష్మీ నారాయణులు, దేవి-దేవత. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. ఇతర ఏ మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండకపోవచ్చు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది సాధారణ సత్సంగమేమీ కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన బాబా ఎవరినైతే శివ అని అంటారో, వారి సాంగత్యంలో కూర్చున్నామని భావిస్తారు. శివబాబాయే రచయిత, వారికే రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు మరియు వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. నిన్న జరిగిన విషయము వలె వినిపిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు - మేము రెజువనేట్ (మళ్ళీ కొత్తగా) అయ్యేందుకు అనగా ఈ శరీరము మార్చుకుని దేవతా శరీరము తీసుకునేందుకు ఇక్కడకు వచ్చామనైతే గుర్తుంటుంది కదా. ఇది నా తమోప్రధానమైన పాత శరీరమని, దీనిని మార్చుకొని ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలని ఆత్మ అంటుంది. లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత శ్రేష్ఠమైనది. చదివించే టీచర్, తప్పకుండా చదివే విద్యార్థుల కంటే చరుకైనవారిగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలు నేర్పిస్తారు కావున తప్పకుండా ఉన్నతంగా ఉంటారు కదా. మమ్మల్ని ఉన్నతోన్నతమైన భగవంతుడు చదివిస్తారని, భవిష్యత్తులో మేమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనమేదైతే చదువుతున్నామో, అది భవిష్య కొత్త ప్రపంచము కోసము. ఇంకెవ్వరికీ కొత్త ప్రపంచము కోసం తెలియను కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది. కావున తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. కావున మిమ్మల్ని చదివించి మనుష్యుల నుండి దేవతలుగా చేస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. దేవతలలో కూడా తప్పకుండా నంబరువారుగా ఉంటారు. దైవీ రాజధాని ఉంటుంది కదా. నేను ఆత్మను అని రోజంతా మీకు ఇదే ఆలోచన కలుగుతూ ఉండవచ్చు. మా ఆత్మ ఏదైతే చాలా పతితంగా ఉండేదో, అది మళ్ళీ ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పావనుడైన తండ్రిని స్మృతి చేస్తుంది. స్మృతి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. పిల్లలూ, నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సతోప్రధానమైన దేవతలుగా అవుతారని తండ్రి స్వయంగా చెప్తారు. పూర్తి ఆధారమంతా స్మృతియాత్ర పైనే ఉంది. పిల్లలూ, ఎంత సమయము స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా. స్మృతి చేయడంలోనే మాయతో యుద్ధము జరుగుతుంది. ఇది యాత్ర కాదు కానీ యుద్ధము వంటిదని, ఇందులో ఎన్నో విఘ్నాలు కలుగుతాయని మీరు స్వయంగా భావిస్తారు. స్మృతియాత్రలో ఉండడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది అనగా స్మృతిని మరపింపజేస్తుంది. పిల్లలు అంటారు - బాబా, మేము మీ స్మృతిలో ఉండడానికి మాయా తుఫానులు ఎన్నో వస్తాయి. నంబరు వన్ తుఫాను దేహాభిమానము. తర్వాత కామము, క్రోధము, లోభము, మోహము..... ఈ రోజు కామము యొక్క తుఫాను వచ్చింది, రేపు క్రోధము యొక్క తుఫాను, లోభము యొక్క తుఫాను వచ్చింది..... ఈ రోజు మా స్థితి బాగుంది, ఎటువంటి తుఫానులూ రాలేదు. స్మృతి యాత్రలో రోజంతా ఉన్నాము, ఎంతో సంతోషం కలిగింది. బాబాను చాలా స్మృతి చేశాము. స్మృతిలో ప్రేమ అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉండడంతో మీరు మధురంగా అయిపోతారు.
మేము మాయతో ఓడిపోతూ-ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరుకున్నాము అని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కల్పములో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు..... ఉంటాయని పిల్లలు లెక్క తీస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా. లక్షల సంవత్సరాల ఆయువు ఉందని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే, దానిని ఎవరూ లెక్కపెట్టలేరు. ఈ సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుందని, ఈ చక్రమంతటిలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటామని, ఎలా రాజ్యములోకి వెళ్తామని తండ్రి అర్థము చేయిస్తారు. ఇదైతే మీకు తెలుసు కదా. ఇవి పూర్తిగా కొత్త విషయాలు, కొత్త ప్రపంచము కోసం కొత్త జ్ఞానము. స్వర్గాన్ని కొత్త ప్రపంచమని అంటారు. ఇప్పుడు మేము మనుష్యులము, దేవతలుగా అవుతున్నామని మీరు అంటారు. దేవతా పదవి ఉన్నతమైనది. మనము అందరికన్నా అతీతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మమ్మల్ని చదివించేవారు పూర్తిగా అతీతమైనవారు, విచిత్రుడు. వారికి ఈ సాకార చిత్రము లేదు. వారు నిరాకారుడు. కావున డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడి ఉందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు? కావున నేను ఫలానా తనువులోకి వస్తాను అని వారు స్వయంగా తెలియజేస్తారు. వారు ఏ తనువులోకి వస్తారు అన్నది కూడా తెలియజేస్తారు. ఒకే తనువులోకి వస్తారా అని మనుష్యులు తికమకపడతారు, కానీ ఇది డ్రామా కదా. ఇందులో మార్పు జరగదు. ఈ విషయాలను మీరే వింటారు మరియు ధారణ చేస్తారు, మరియు శివబాబా మమ్మల్ని ఎలా చదివిస్తారు అన్నది వినిపిస్తారు. మనము మళ్ళీ ఇతర ఆత్మలకు చదివిస్తాము. ఆత్మ చదువుకుంటుంది. ఆత్మనే నేర్చుకుంటుంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ చాలా విలువైనది. ఆత్మ అవినాశీ, అమరమైనది. కేవలం శరీరం సమాప్తమవుతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలు మరియు 84 జన్మల జ్ఞానమును తీసుకుంటున్నాము. జ్ఞానము ఎవరు తీసుకుంటారు? ఆత్మ. ఆత్మ అవినాశీ. అవినాశీ వస్తువుపైనే మోహము పెట్టుకోవాలి, అంతేకానీ వినాశీ వస్తువుపై కాదు. ఇంత సమయము మీరు వినాశీ శరీరము పట్ల మోహము పెట్టుకుంటూ వచ్చారు. నేను ఆత్మను, శరీర భానాన్ని వదిలేయాలని ఇప్పుడు మీరు భావిస్తారు. ఆత్మనైన నేను ఈ పని చేశాను, ఆత్మనైన నేను ఈ రోజు ఈ భాషణ చేశాను, ఆత్మనైన నేను ఈ రోజు బాబాను చాలా స్మృతి చేశాను అని కొందరు పిల్లలు వ్రాస్తారు కూడా. వారు సుప్రీమ్ ఆత్మ, నాలెడ్జ్ ఫుల్. పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. మూలవతనము, సూక్ష్మవతనము గురించి మీకు తెలుసు. మనుష్యుల బుద్ధిలో అయితే ఏమీ లేదు. రచయిత ఎవరు అన్నది మీ బుద్ధిలో ఉంది. వారు ఈ మనుష్య సృష్టి రచయితగా గాయనము చేయబడతారు, మరి తప్పకుండా కర్తవ్యములోకి వస్తారు కదా.
ఆత్మ మరియు పరమాత్మ అయిన తండ్రి స్మృతి ఉన్న మనుష్యులు ఇంకెవ్వరూ లేరు అన్నది మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరంగా భావించి తలకిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము. ఆత్మకు అన్నిటికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది. వారే దుఃఖహర్త-సుఖకర్త. దోమలు మొదలైన వాటిని అవి దుఃఖహర్త-సుఖకర్త, జ్ఞానసాగరులు అని మహిమ చేయరు. ఇది తండ్రి మహిమ. మీలో కూడా ప్రతి ఒక్కరు దుఃఖహర్త-సుఖకర్తలే, ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే ఆ తండ్రి పిల్లలు కదా, అది కూడా అర్ధకల్పం కోసం. ఈ జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. ఒక్క తండ్రియే నాలెడ్జ్ ఫుల్. మనలో ఏ జ్ఞానమూ లేదు. ఒక్క తండ్రి గురించే తెలియకపోతే ఇంకే జ్ఞానము ఉంటుంది. మేము ఇంతకుముందు జ్ఞానము తీసుకునేవారము, అప్పుడు మాకు ఏమీ తెలిసేది కాదని ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. బేబీ లో (చిన్న పిల్లలలో) నాలెడ్జ్ ఉండదు మరియు ఏ అవగుణాలు ఉండవు, కావుననే వారిని మహాత్ములని అంటారు ఎందుకంటే వారు పవిత్రమైనవారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే, అంత నంబరువన్ పుష్పంగా ఉంటారు. పూర్తిగా కర్మాతీత స్థితి వలె ఉంటుంది. వారికి కర్మ, వికర్మల గురించి ఏమీ తెలియదు. కేవలం స్వయం గురించే తెలుసు. వారు పుష్పాలు కావుననే అందరినీ ఆకర్షిస్తారు. ఏ విధంగా బాబా ఆకర్షిస్తారో, అలా ఆకర్షిస్తారు. మిమ్మల్నందరినీ పుష్పాలుగా తయారుచేసేందుకే తండ్రి వచ్చారు. మీలో చాలామంది చాలా చెడ్డ ముళ్ళ వంటివారు కూడా ఉన్నారు. 5 వికారాల రూపీ ముళ్ళు ఉన్నాయి కదా. ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళ యొక్క జ్ఞానముంది. ముళ్ళ అడవి కూడా ఉంటుంది. తుమ్మ ముల్లు అన్నిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఆ ముళ్ళతో కూడా చాలా వస్తువులు తయారవుతాయి. మనుష్యులతో పోల్చబడుతుంది. ఈ సమయంలో చాలా దుఃఖమిచ్చే మనుష్య ముళ్ళులు ఉన్నారు కావున దీనిని దుఃఖపు ప్రపంచము అనడం జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రిని సుఖదాత అని కూడా అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. మళ్ళీ సత్యయుగంలో మాయ ఉండదు కావున ఈ విషయాలేవీ అక్కడ ఉండవు. డ్రామాలో ఒకే పాత్ర రెండు సార్లు ఉండజాలదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో, అదంతా కొత్తదని బుద్ధిలో ఉంది. మీరు ఆలోచించండి - సత్యయుగము నుండి ఇప్పటివరకు రోజులన్నీ మారిపోతాయి, యాక్టివిటీలు మారిపోతాయి. 5 వేల సంవత్సరాల పూర్తి యాక్టివిటీల (కార్య వ్యవహారాల) రికార్డు ఆత్మలో నిండి ఉంది, అది మారలేదు. ప్రతి ఆత్మలో తమ తమ పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయము కూడా ఎవరూ అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మీకు ఆదిమధ్యాంతాలు తెలుసు. ఇది స్కూలు కదా. సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి మరియు ఇది తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అయ్యే చదువు. మేము ఇలా తయారవ్వాలని ఇంతకుముందు మీకు ఏమైనా తెలుసా. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. మీరు మొదటి నంబరులో ఇలా ఉండేవారు, తర్వాత కిందకు దిగుతూ-దిగుతూ ఇప్పుడెలా అయిపోయారు. ప్రపంచము ఎలా అయిపోయిందో చూడండి! ఎంతమంది మనుష్యులున్నారు. ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఎలా ఉండేదో ఆలోచించండి. వీరు ఎక్కడైతే ఉండేవారో, అక్కడ ఎటువంటి వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉంటూ ఉండవచ్చు. ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నామని బుద్ధిలోకి వస్తుంది. అక్కడ మేము మా ఇళ్ళు మొదలైనవి తయారుచేస్తాము. శాస్త్రాలలో చూపించినట్లుగా కింద నుండి ద్వారక పైకి వస్తుందని కాదు. శాస్త్రాలు అనే పేరే కొనసాగుతుంది, ఇంకే పేరునూ పెట్టలేరు. వేరే పుస్తకాలు చదువుకునేందుకు ఉంటాయి. మరికొన్ని నవలలు కూడా ఉంటాయి. ఇకపోతే వాటిని పుస్తకాలు లేక శాస్త్రాలని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు. శాస్త్రాలు చదివేవారిని భక్తులని అంటారు. భక్తి మరియు జ్ఞానము, ఈ రెండూ వేరు వేరు. ఇప్పుడిక దేని పట్ల వైరాగ్యము? భక్తి పట్లనా లేక జ్ఞానము పట్లనా? తప్పకుండా భక్తి పట్లనే అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది. దీని ద్వారా మీరు ఇంత ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా తయారుచేస్తారు. సుఖధామమునే స్వర్గమని అంటారు. మీరు సుఖధామానికి వెళ్తారు కావున మిమ్మల్నే చదివిస్తారు. ఈ జ్ఞానము కూడా మీ ఆత్మ తీసుకుంటుంది. ఆత్మకు ఏ ధర్మమూ లేదు. అది ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే శరీరములోకి వస్తుందో, అప్పుడు శరీర ధర్మము వేరుగా ఉంటుంది. ఆత్మ ధర్మము ఏమిటి? ఒకటేమో ఆత్మ బిందువు వంటిది మరియు శాంతి స్వరూపము. ఆత్మలు శాంతిధామము, ముక్తిధామములో ఉంటాయి. పిల్లలందరికీ హక్కు ఉందని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ బయటకు వచ్చి తమ నిజ ధర్మములోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీదేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో, ఆ ఆకులన్నీ తమ స్థానాలకు తిరిగి వచ్చేస్తాయి. ఈ విషయాలన్నిటినీ ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నివ్వాలి, ఇందులోనే అందరూ తికమకలో ఉన్నారు. ఇప్పుడు మనందరినీ ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చదివిస్తున్నారు. కృష్ణుడైతే దేహధారి కదా. ఇతడిని (బ్రహ్మాను) దాదా అని అంటారు. అందరూ పరస్పరంలో సోదరులే కదా. ఇకపోతే అంతా పదవులపై ఆధారపడి ఉంటుంది. ఇది సోదరుని శరీరము, ఇది సోదరి శరీరము అని ఇది కూడా మీకిప్పుడు తెలుసు. ఆత్మ ఒక చిన్న నక్షత్రము వంటిది. ఇంతటి జ్ఞానమంతా చిన్న నక్షత్రములో ఉంది. నక్షత్రము శరీరము లేకుండా మాట్లాడలేదు కూడా. నక్షత్రానికి పాత్రను అభినయించేందుకు ఇంద్రియాలు కూడా కావాలి. నక్షత్రాల ప్రపంచమే వేరు, తర్వాత ఇక్కడకు వచ్చి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ చిన్న బిందువు. శరీరము పెద్ద వస్తువు. కావున దానిని ఎంతగా స్మృతి చేస్తారు! ఇప్పుడు మీరు ఒక్క పరమపిత పరమాత్మను స్మృతి చేయాలి. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల మేళా జరుగుతుంది అనేది సత్యము. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని గాయనము కూడా ఉంది..... మనము తండ్రి నుండి వేరయ్యాము కదా. ఎంత సమయం వేరయ్యాము అన్నది గుర్తుందా! బాబా కల్ప-కల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో, అదే వచ్చి వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. క్షణ-క్షణమూ ఏ పాత్ర అయితే నడుస్తుందో, అదంతా కొత్తది. ఒక్క క్షణం గతిస్తుంది, నిమిషం గతిస్తుంది, ఇక దానిని వదిలేస్తూ ఉంటారు. అలా గతిస్తూ ఉంటే - ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిముషాలు, ఇన్ని క్షణాలు దాటి వచ్చామని అంటారు. పూర్తి 5 వేల సంవత్సరాలు తర్వాత మళ్ళీ మొదటి నంబరు నుండి ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన లెక్క ఉంది కదా. నిమిషము, క్షణము అన్నీ నోట్ చేస్తారు. ఫలానావారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే, మీరు లెక్క పెట్టి చెప్తారు. కృష్ణుడు మొదటి నంబరులో జన్మ తీసుకున్నారు. శివుని గురించైతే నిమిషాలు, క్షణాలు ఏమీ కనుక్కోలేరు. కృష్ణుని తిథి, తారీఖు పూర్తిగా వ్రాయబడి ఉంది. మనుష్యుల గడియారంలో నిమిషాలు, క్షణాల తేడా ఉండవచ్చు. శివబాబా అవతరణలో అయితే ఏ మాత్రమూ తేడా ఏర్పడలేదు. వారు ఎప్పుడు వచ్చారు అనేది తెలియను కూడా తెలియదు. సాక్షాత్కారమైనప్పుడు వచ్చారని కూడా కాదు. సుమారుగా చెప్తారు. అంతేకానీ ఆ సమయంలో ప్రవేశించారని కాదు. నేను ఫలానాగా అవుతానని సాక్షాత్కారం జరిగింది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సుఖధామానికి వెళ్ళేందుకు సుఖవంతులుగా అవ్వాలి. అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ కూడా దుఃఖమునిచ్చే ముల్లుగా అవ్వకూడదు.
2. ఈ వినాశీ శరీరంలో ఆత్మనే అత్యంత విలువైనది, అదే అమరమైనది, అవినాశీ కావున అవినాశీ వస్తువు పట్ల ప్రేమను పెట్టుకోవాలి. దేహ భానమును తొలగించివేయాలి.