ఓంశాంతి. ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు మనం కొద్ది రోజుల బాటసారులమని చాలా కాలం తర్వాత కలిసిన మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రపంచములోని మనుష్యులు ఇంకా 40 వేల సంవత్సరాలు ఇక్కడ ఉంటామని భావిస్తారు. పిల్లలైన మీకు నిశ్చయముంది కదా. ఈ విషయాలను మర్చిపోకండి. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు లోలోపల చాలా పులకరించిపోవాలి. ఈ కనులతో ఏవైతే చూస్తారో, అవన్నీ వినాశనమవ్వనున్నాయి. ఆత్మ అయితే అవినాశీ. ఆత్మలైన మనము పూర్తిగా 84 జన్మలు తీసుకున్నామని, ఇప్పుడు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని కూడా మీ బుద్ధిలో ఉంది. పాత ప్రపంచము పూర్తయినప్పుడు, కొత్త ప్రపంచం తయారుచేసేందుకు తండ్రి వస్తారు. కొత్త ప్రపంచము నుండి పాతదిగా, మళ్ళీ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అయ్యే ఈ చక్రము యొక్క జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. అనేకసార్లు మనము ఈ చక్రములో తిరిగాము. ఇప్పుడు ఈ చక్రము పూర్తవుతుంది. మళ్ళీ కొత్త ప్రపంచంలో మనము కొద్దిమంది దేవతలమే ఉంటాము. అక్కడ మనుష్యులు ఉండరు. ఇప్పుడు మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఇదైతే పక్కా నిశ్చయముంది కదా. ఇక ఆధారమంతా కర్మల పైనే ఉంది. మనుష్యులు తప్పుడు కర్మలు చేసినప్పుడు అవి లోలోపల తప్పకుండా తింటూ ఉంటాయి, అందుకే ఈ జన్మలో ఇటువంటి పాపాలేమీ చేయలేదు కదా అని తండ్రి అడుగుతారు. ఇది ఛీ-ఛీ రావణ రాజ్యము. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. రావణుడు అన్న పేరు ఎవరిదో ప్రపంచానికి తెలియదు. రామరాజ్యము కావాలని బాపూజీ అనేవారు కానీ దాని అర్థము తెలియదు. రామరాజ్యము ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇదైతే అంధకార ప్రపంచము. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలకు వారసత్వాన్నిస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. ఇప్పుడు తండ్రి చేయి లభించింది. తండ్రి ఆధారము లేనప్పుడు మీరు విషయ వైతరిణీ నదిలో మునకలు వేస్తూ ఉండేవారు, అర్ధకల్పము భక్తియే ఉంటుంది. జ్ఞానము లభించడంతో మీరు కొత్త ప్రపంచమైన సత్యయుగంలోకి వెళ్ళిపోతారు. మేము బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయిపోతామని, ఆ తర్వాత మళ్ళీ పవిత్ర రాజ్యంలోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయముంది. ఈ జ్ఞానము కూడా ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగంలోనే మీకు లభిస్తుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. మీరిప్పుడు ఛీ-ఛీ నుండి పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. అలా ఎవరు తయారుచేస్తారు? తండ్రి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఆత్మలైన మనకు వారు అనంతమైన తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. పారలౌకిక తండ్రి ఆత్మల లెక్కలో అందరికీ తండ్రి అవుతారు. అలాగే బ్రహ్మాకు కూడా కర్తవ్యము కావాలి కదా. పిల్లలైన మీరు అందరి కర్తవ్యాల గురించి తెలుసుకున్నారు. విష్ణువు కర్తవ్యము కూడా తెలుసు. వారు ఎంతగా అలంకరించబడి ఉన్నారు, వారు స్వర్గానికి యజమాని కదా. ఇతడినైతే సంగమయుగము వారనే అంటారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఇవి కూడా సంగమంలోనే ఉంటాయి కదా. ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచముల సంగమము అని తండ్రి అర్థం చేయిస్తారు . ఓ పతితపావనా రండి అని కూడా పిలుస్తారు. పావన ప్రపంచము కొత్త ప్రపంచము మరియు పతిత ప్రపంచము పాత ప్రపంచము. అనంతమైన తండ్రి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. క్రియేటర్, డైరెక్టర్ కదా. వారిని అందరూ ఒప్పుకుంటారంటే తప్పకుండా వారి పాత్ర కూడా ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరు, వారికైతే శరీరము లేదు. మిగిలిన వారందరినీ మనుష్యులు లేక దేవతలని అంటారు. శివబాబాను దేవత అని కానీ, మనిషి అని కానీ అనలేరు ఎందుకంటే వారికి శరీరమే లేదు. ఈ శరీరాన్ని అల్పకాలికముగా తీసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలూ, నేను శరీరము లేకుండా రాజయోగాన్ని ఎలా నేర్పించను అని వారు స్వయంగా అంటారు! మనుష్యులు నన్ను రాళ్ళల్లో-రప్పల్లో ఉంటానని అన్నారు, కానీ నేను ఎలా వస్తాను అనేది పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీనిని మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. దేవతలు సత్యయుగీ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు? తప్పకుండా పురుషోత్తమ సంగమయుగంలో రాజయోగము నేర్చుకొని ఉంటారు. కనుక దీన్ని గుర్తు చేసుకుంటూ పిల్లలైన మీకిప్పుడు అపారమైన సంతోషముండాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రమును పూర్తి చేశాము. తండ్రి కల్ప-కల్పము వస్తారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి స్వయంగా అంటారు. సత్యయుగ రాకుమారునిగా ఉండే శ్రీకృష్ణుడే మళ్ళీ 84 జన్మల చక్రములో తిరుగుతారు. మీరు శివునికి 84 జన్మలని చెప్పరు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగానే తెలుసుకున్నారు. మాయ చాలా కఠినమైనది, అది ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఇది తండ్రికి బాగా తెలుసు. తండ్రి అంతర్యామి అని భావించకండి. కాదు, వారు అందరి నడవడిక ద్వారా తెలుసుకుంటారు. మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుందని సమాచారాలు వస్తాయి. ఇటువంటి విషయాలెన్నో పిల్లలైన మీకు తెలియవు, తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. బాబా అంతర్యామి అని మనుష్యులు భావిస్తారు. నేను అంతర్యామిని కాదు అని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అంతా తెలుస్తుంది. చాలా ఛీ-ఛీ నడవడిక ఉంటుంది. తండ్రి పిల్లలను అప్రమత్తం చేస్తారు. మాయ నుండి సంభాళించుకోవాలి. మాయ ఎలాంటిదంటే ఏదో ఒక రూపములో పూర్తిగా మింగేస్తుంది. ఆ తర్వాత తండ్రి అర్థము చేయిస్తారు, అయినా బుద్ధిలో కూర్చోదు, కావున పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కామము మహాశత్రువు. తాము వికారాలలోకి వెళ్ళామని కూడా కొందరికి తెలియదు, ఇలా కూడా జరుగుతుంది, అందుకే తండ్రి అంటారు - ఏదైనా పొరపాటు మొదలైనవి జరిగినట్లయితే సత్యంగా చెప్పండి, దేనిని దాచిపెట్టకండి. లేకపోతే పాపం వంద రెట్లు పెరిగిపోతుంది, అది లోలోపల తింటూ ఉంటుంది. పూర్తిగా పడిపోతారు. సత్యమైన తండ్రితో పూర్తిగా సత్యంగా ఉండాలి, లేకపోతే చాలా చాలా నష్టం కలుగుతుంది. మాయ ఈ సమయంలో చాలా కఠినంగా ఉంది. ఇది రావణ ప్రపంచము. మనం అసలు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి! మనము కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి, ఇప్పుడు అక్కడకు వెళ్తున్నాము. తండ్రి కొత్త ఇల్లును నిర్మించేటప్పుడు, మా కోసం కొత్త ఇల్లు తయారవుతుందని పిల్లలు భావిస్తారు కదా. సంతోషం ఉంటుంది. ఇదేమో అనంతమైన విషయము. మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గము తయారవుతుంది. స్వర్గంలో నివసించేందుకు తప్పకుండా ఇళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు మనము కొత్త ప్రపంచములోకి వెళ్ళనున్నాము. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సుందరమైన పుష్పాలుగా అవుతారు. మనము వికారాలకు వశమై ముళ్ళలా అయిపోయాము. మాయ సగభాగాన్ని పూర్తిగా తినేసిందని బాబాకు తెలుసు. ఎవరైతే రారో వారు మాయకు వశమైనట్లే కదా అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. తండ్రి వద్దకైతే రారు. ఇలా మాయ చాలామందిని మింగేస్తుంది. మేము ఇలా చేస్తాము, ఇది చేస్తాము, మేము యజ్ఞము కోసం ప్రాణాలు ఇవ్వడానికి తయారుగా ఉన్నాము అని చాలా మంచి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతారు. నేడు వారు లేనే లేరు. మీది మాయతో యుద్ధము. మాయతో యుద్ధము ఎలా జరుగుతుంది అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రమునిచ్చారు, దీని ద్వారా మీరు అంధకారము నుండి ప్రకాశంలోకి వచ్చేశారు. కావుననే ఆత్మకే ఈ జ్ఞాన నేత్రాన్నిస్తారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. భక్తిలో మీరు స్మృతి చేసేవారు కదా. మీరు వచ్చినట్లయితే మేము బలిహారమైపోతాము అని కూడా అనేవారు. ఎలా బలిహారమవుతారు! ఇది తెలియదు. ఏ విధంగా మనము ఆత్మలమో, అదే విధంగా బాబా కూడా ఆత్మనే అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రిది అలౌకిక జన్మ. పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు! ఎవరైతే కల్ప-కల్పము మాకు తండ్రిగా అవుతారో, వారే ఈ తండ్రి అని మీరు స్వయం అంటారు. మనము కూడా బాబా, బాబా అని అంటాము, అలాగే తండ్రి కూడా పిల్లలూ, పిల్లలూ అని అంటారు. వారే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇతరులెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు కనుక ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి ఆ టీచర్ యొక్క శిక్షణను కూడా తీసుకోవాలి కదా. సంతోషంతో పులకరించిపోవాలి. ఒకవేళ ఛీ-ఛీగా అయినట్లైతే మళ్ళీ ఆ సంతోషం రానే రాదు. మీరు ఎంతగా తల బాదుకున్నా సరే వారు మన జాతి సోదరులు కానట్లే. ఇక్కడ మనుష్యులకు ఎన్ని ఇంటి పేర్లుంటాయి. మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి! వీరు అందరికన్నా ఉన్నతమైన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మా. వీరి గురించి ఎవరికీ తెలియదు. శివబాబానైతే సర్వవ్యాపి అనేశారు. బ్రహ్మాను గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మాను సూక్ష్మవతనములోకి తీసుకువెళ్ళారు. వారి జీవితచరిత్ర గురించి ఏమీ తెలియదు. సూక్ష్మవతనంలో బ్రహ్మాను చూపిస్తారు, మరి ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు! అక్కడ పిల్లలను దత్తత తీసుకుంటారా! ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మా అని అంటారు కానీ వారి జీవితచరిత్ర గురించి తెలియదు. ఇది నా రథమని బాబా అర్థం చేయించారు. అనేక జన్మల అంతిమంలో నేను దీన్ని ఆధారముగా తీసుకున్నాను. ఇది పురుషోత్తము సంగమయుగపు గీతా అధ్యాయము. పవిత్రత కూడా ముఖ్యమైనదే. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. దేహ సహితముగా అన్నింటినీ మర్చిపోండి అని సాధు-సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ ఈ విధంగా చెప్పరు. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే మాయ యొక్క పాప కర్మలన్నీ భస్మమైపోతాయి. ఏ గురువు ఈ విధంగా ఎప్పుడూ చెప్పలేరు.
వీరు బ్రహ్మాగా ఎలా అవుతారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. బాల్యంలో ఇతనొక పల్లెటూరి బాలుడిగా ఉండేవారు. ప్రారంభము నుండి మొదలుకొని చివరి వరకు 84 జన్మలు తీసుకున్నారు. కొత్త ప్రపంచము మళ్ళీ పాతదిగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి తాళము తెరుచుకుంది. మీరు అర్థము చేసుకోగలరు, ధారణ చేయగలరు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు, ఇక్కడ బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎదురుగా చూడండి, వీరు స్వర్గానికి యజమానులుగా ఉన్నారు కదా. కృష్ణుడు స్వర్గానికి యజమానిగా ఉండేవారు, మళ్ళీ చివర్లో పల్లెటూరి బాలుడిలా అయ్యారు. పిల్లలైన మీరు ఈ విషయాలను ధారణ చేసి తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రత యొక్క విషయమే ముఖ్యమైనది. బాబా, మాయ మమ్మల్ని పడేసింది, కనులు వికారీగా అయిపోయాయని వ్రాస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అంటారు. తండ్రిని స్మృతి చెయ్యాలి. కొద్ది సమయము శరీర నిర్వహణ కోసం కర్మలు చేసి మనము ఇక వెళ్ళిపోతాము. ఈ పాత ప్రపంచ వినాశనము కోసం యుద్ధము కూడా జరుగుతుంది. ఇది కూడా ఎలా జరుగుతుంది అనేది మీరు చూడండి. మనము దేవతలుగా అవుతాము కనుక మనకు కొత్త ప్రపంచము కూడా కావాలని బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటారు, అందుకే వినాశనము తప్పకుండా జరుగుతుంది. మనము శ్రీమతము అనుసారముగా మన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము.
నేను మీ సేవలో ఉపస్థితుడనవుతాను అని బాబా అంటారు. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని మీరు డిమాండ్ చేశారు కనుక మీరు పిలవడంతో నేను వచ్చాను, మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తాను. మన్మనాభవ. భగవానువాచ అని ఉంది కదా, కేవలం కృష్ణుని పేరు వ్రాసేశారు. తండ్రి తర్వాత కృష్ణుడు. వీరు పరంధామానికి యజమాని, వారు (కృష్ణుడు) విశ్వానికి యజమాని. సూక్ష్మవతనంలో అయితే ఏమీ జరగదు. అందరిలోనూ నంబర్ వన్ అయినవారు శ్రీకృష్ణుడు, వారిని చాలా ప్రేమిస్తారు. మిగిలినవారంతా వెనుక వచ్చినవారే. స్వర్గములోకైతే అందరూ వెళ్ళలేరు. కావున మధురాతి-మధురమైన పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. ఇక్కడ కృత్రిమమైన సంతోషము నడవదు. బయటి నుండి రకరకాల పిల్లలు బాబా వద్దకు వచ్చేవారు, పవిత్రంగా ఉండేవారు కాదు. వికారాలలోకి వెళ్తున్నప్పుడు మరి నీవు ఇక్కడకు ఎందుకు వస్తున్నావని బాబా అడిగితే, నేను ఏమి చేయాలి, రాకుండా ఉండలేను, ఎప్పుడో ఒకప్పుడు ఇలా బాణము తగులుతుందేమోనని నేను రోజూ వస్తున్నాను, మీరు తప్ప ఇంకెవ్వరు సద్గతినిస్తారు అని అంటూ వచ్చి కూర్చుండిపోయేవారు. మాయ చాలా శక్తివంతమైనది. బాబా మనల్ని పతితుల నుండి పావనంగా, పుష్పాలుగా తయారుచేస్తున్నారని నిశ్చయము కూడా ఉంటుంది. కానీ ఏమి చేయాలి, ఎంతైనా సత్యమైతే చెప్పేవాడు కదా - ఇప్పుడు తప్పకుండా తను బాగుపడి ఉంటాడు. వీరి ద్వారానే నేను బాగుపడతాను అని అతనికి నిశ్చయముండేది.
ఈ సమయంలో ఎంతమంది పాత్రధారులున్నారు. ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు. మళ్ళీ కల్పము తర్వాత అవే ముఖ కవళికలతో పాత్రను రిపీట్ చేస్తారు. ఆత్మలందరూ ఫిక్స్ కదా. పాత్రధారులందరూ పూర్తిగా ఏక్యురేట్ పాత్రను అభినయిస్తూ ఉంటారు. కొద్దిగా కూడా తేడా ఉండదు. ఆత్మలన్నీ అవినాశీ. వాటిలోని పాత్ర కూడా అవినాశీగా రచింపబడింది. ఇవి ఎంతగా అర్థము చేయించవలసిన విషయాలు. ఎంతో అర్థం చేయించినా కూడా మర్చిపోతారు. అర్థము చేయించలేరు. ఇది కూడా డ్రామాలో జరగవలసి ఉంది. ప్రతి కల్పము రాజ్య స్థాపన జరుగుతుంది. సత్యయుగంలో కొద్దిమంది మాత్రమే వస్తారు - అది కూడా నంబరువారుగా వస్తారు. ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు కదా. ఎవరి పాత్ర గురించి ఎవరికి వారికే తెలుస్తుంది, ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి.
2. జ్ఞానాన్ని ధారణ చేసి వివేకవంతులుగా అవ్వాలి. లోలోపల అపారమైన సంతోషంలో ఉండాలి. శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేసి సంతోషాన్ని దూరం చేసుకోకూడదు.