18-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18-01-2021


18 జనవరి, పితాశ్రీ గారి పుణ్య స్మృతి దివసమున ఉదయము క్లాసులో వినిపించేందుకు - బాప్ దాదా అమూల్యమైన మహావాక్యాలు

"మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు సుప్రీమ్ గా అవ్వాలి కనుక పొరపాటున కూడా ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు”

ఓంశాంతి. మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు మీ ఇంటిని స్మృతి చేయండి అని అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్, టవర్ ఆఫ్ సుఖము అని అంటారు. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్ లోకి మీరు ఎలా వెళ్ళగలరు అన్నది కూడా టవర్ లో ఉండే తండ్రి కూర్చొని నేర్పిస్తారు, పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అది తండ్రి ఇల్లు. ఇది నడుస్తూ తిరుగుతూ అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఎవరైతే ఆత్మాభిమానులుగా అయి ఉంటారో వారినే మహావీరులని అంటారు. స్మృతి ద్వారానే మీరు మహావీరులుగా, సుప్రీమ్ గా అవుతారు. సుప్రీమ్ అంటే శక్తివంతులు.

స్వర్గానికి యజమానులుగా తయారుచేసే బాబా, విశ్వానికి యజమానులుగా చేసే బాబా మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు సంతోషముండాలి. ఆత్మ యొక్క బుద్ధి తండ్రి వైపుకు వెళ్తుంది. ఇది ఆత్మకు ఒక్క తండ్రి పట్ల ఉండే ప్రేమ. ఉదయాన్నే లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి - బాబా, మీదైతే అద్భుతము, మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారని స్వప్నములో కూడా అనుకోలేదు. బాబా, మేము మీ శిక్షణలపై తప్పకుండా నడుస్తాము. ఎలాంటి పాపపు పని చేయము. బాబా ఎటువంటి పురుషార్థం చేస్తారో, అది పిల్లలకు కూడా వినిపిస్తారు. శివాబాబాకైతే ఇంతమంది పిల్లలున్నారు, చింత అయితే ఉంటుంది కదా. ఎంతమంది పిల్లల సంభాళన జరుగుతుంది. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చున్నారు. తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము..... మధురమైన పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా వీరిలోకి వచ్చి చెప్తున్నారని మీకు తెలుసు. దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నింటినీ మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచము, పాత దేహము సమాప్తమవ్వనున్నాయి. మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమే మరణిస్తుంది అనే సామెత కూడా ఉంది. పురుషార్థము కోసం కాస్త సంగమయుగ సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎప్పటివరకు నడుస్తుంది అని పిల్లలు అడుగుతారు. ఎప్పటివరకైతే దైవీ రాజధాని స్థాపన అవ్వదో, అప్పటివరకు వినిపిస్తూనే ఉంటారు. తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరము, ఏదో ఒక కర్మభోగము ఉంటూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలి - ఈ ఆశను పెట్టుకోకూడదు. దివాలా తీశారు, అనారోగ్యం వచ్చింది - ఇవి మీ లెక్కాచారాలని తండ్రి అంటారు. అయితే, యోగంతో ఆయువు పెరుగుతుంది. మీరు శ్రమ చేయండి. కృపను అడగకండి. తండ్రిని ఎంతగానైతే స్మృతి చేస్తారో, అందులోనే కళ్యాణముంది. ఎంత వీలైతే అంత యోగబలముతో పని చేయండి. నన్ను కనురెప్పలలో దాచేయండి..... అని కూడా పాడుతారు కదా. ప్రియమైన వస్తువును కంటిరత్నము, ప్రాణప్రియము అని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైనవారు, కానీ గుప్తమైనవారు. వారిపై ఎంతగా ప్రేమ ఉండాలంటే, ఇక అడగకండి. పిల్లలైతే తండ్రిని కనురెప్పలలో దాచుకోవాల్సి ఉంటుంది. కనురెప్పలంటే ఈ కనులు ఏమీ కావు. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పతిత శరీరంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని వజ్రాల వలె తయారుచేస్తారు. ఎంత మధురమైన తండ్రి. కనుక పిల్లలు కూడా ఆ విధంగా మధురంగా అవ్వాలి. ఎంత నిరహంకారంతో బాబా పిల్లలైన మీ సేవ చేస్తారు, కనుక పిల్లలైన మీరు కూడా అంతటి సేవను చేయాలి. శ్రీమతంపై నడుచుకోవాలి. ఎక్కడైనా మీ మతాన్ని చూపించినట్లయితే భాగ్యానికి అడ్డుగీత పడుతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. బ్రహ్మా సంతానము, సోదరీ-సోదరులు. ఈశ్వరీయ మనవలు-మనవరాళ్ళు. వారి నుండి వారసత్వము తీసుకుంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో, అంతటి పదవిని పొందుతారు. ఇందులో సాక్షీగా ఉండే అభ్యాసము కూడా చాలా ఉండాలి. మధురమైన పిల్లలూ, ఓ ఆత్మలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా అంటారు. పొరపాటున కూడా తండ్రిని తప్ప ఎవ్వరినీ స్మృతి చేయకూడదు. బాబా, నాకైతే మీరొక్కరే ఉన్నారు అన్నది మీ ప్రతిజ్ఞ. నేను ఆత్మను, మీరు పరమాత్మ. మీ నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. మీ నుండే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను, దీని ద్వారా రాజ్య భాగ్యాన్ని పొందుతాను.

మధురమైన పిల్లలూ, ఇది అనాది డ్రామా అని మీకు తెలుసు. ఇందులో గెలుపు ఓటముల ఆట నడుస్తుంది. ఏదైతే జరుగుతుందో, అది సరైనది. క్రియేటర్ కు డ్రామా తప్పకుండా నచ్చుతుంది కదా కనుక క్రియేటర్ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈ డ్రామాలో తండ్రి ఒక్కసారి మాత్రమే హృదయపూర్వకంగా, అత్యంత ప్రేమతో సేవ చేసేందుకు పిల్లల వద్దకు వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైనవారే. సత్యయుగంలో కూడా అందరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువు ఏదీ ఉండదు. కనుక పిల్లలైన మీరిక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఇక్కడ తయారైనట్లయితే ఆ సంస్కారము అవినాశీగా అయిపోతుంది. కల్పక్రితం వలె మళ్ళీ అలానే ప్రియంగా తయారుచేసేందుకు వచ్చానని తండ్రి అంటారు. ఎప్పుడైనా ఏ బిడ్డ నుండైనా కోపంతో కూడిన శబ్దం వింటే, అప్పుడు తండ్రి శిక్షణనిస్తారు - పిల్లలూ, కోపం చేయటం సరి కాదు, దీనితో మీరూ దుఃఖితులుగా అవుతారు, ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు. తండ్రి సదాకాలము యొక్క సుఖమునిచ్చేవారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖమునిచ్చుకోకూడదు.

శివబాబా ఉదయం యొక్క సాయి అని పిల్లలైన మీకు తెలుసు..... రాత్రిని పగలుగా లేక ఉదయముగా చేసేవారు. సాయి అని అనంతమైన తండ్రిని అంటారు. వారొక్కరే సాయి బాబా, భోళానాథ్ శివబాబా. వారి పేరే భోళానాథుడు. అమాయకులైన కన్యలు, మాతలపై జ్ఞాన కలశాన్ని పెడతారు. వారినే విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు. ఎంత ప్రేమగా మీకు జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మను పావనంగా చేసుకునేందుకు స్మృతియాత్రలో ఉండండి. యోగము యొక్క స్నానము చేయాలి. జ్ఞానము చదువు. యోగ స్నానము ద్వారా పాపాలు భస్మమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసం చేస్తూ ఉండండి, అప్పుడు ఈ దేహ అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. యోగంతోనే పవిత్రంగా, సతోప్రధానంగా అయి బాబా వద్దకు వెళ్ళాలి. చాలామంది పిల్లలు ఈ విషయాలను మంచిరీతిగా అర్థం చేసుకోరు. సత్యాతి సత్యంగా తమ చార్టును తెలపరు. అర్ధకల్పము అసత్య ప్రపంచంలో ఉన్నారు కనుక అసత్యము లోపల పేరుకుపోయినట్లు అయిపోయింది. సత్యతతో మీ చార్టును బాబాకు తెలపాలి. నేను ముప్పావుగంట కూర్చున్నాను, ఇందులో ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసానని చెక్ చేసుకోవాలి. చాలామందికి సత్యం తెలిపేందుకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇంత సేవ చేశాను, ఇంతమందికి అర్థం చేయించాను అని వారు వెంటనే వినిపిస్తారు కానీ స్మృతి చార్టు ఎంత ఉంది అన్న సత్యాన్ని వినిపించరు. స్మృతిలో ఉండని కారణంగానే మీ బాణము ఎవరికీ తగలదు. జ్ఞాన ఖడ్గములో పదును నిండదు. కొంతమంది, మేము నిరంతరం స్మృతిలోనే ఉంటామని అంటారు, ఆ అవస్థ లేనే లేదని బాబా అంటారు. నిరంతరం స్మృతి ఉన్నట్లయితే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. జ్ఞానం యొక్క పరాకాష్ఠ కనిపించాలంటే, ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా ఊరికినే అవ్వరు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. ఈ దేహం కూడా గుర్తు రాకూడదు. ఈ అవస్థ మీకు చివర్లో వస్తుంది. స్మృతియాత్ర ద్వారానే మీకు సంపాదన జరుగుతూ ఉంటుంది. ఒకవేళ శరీరాన్ని వదిలేస్తే ఇక సంపాదన చేసుకోలేరు. ఆత్మ సంస్కారాన్ని తీసుకువెళ్తుంది కానీ మళ్ళీ స్మృతినిప్పించేందుకు టీచరు అయితే కావాలి కదా. తండ్రి పదే-పదే స్మృతినిప్పిస్తూ ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ, ఉద్యోగం మొదలైనవి కూడా చేస్తూ, ఉన్నత పదవిని పొందేందుకు శ్రీమతంపై నడుస్తూ తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు. ధనముంటే దానిని ఎలా సఫలం చేయాలని బాబా నుండి సలహా తీసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, సెంటరు తెరవండి, దానితో అనేకుల కళ్యాణము జరుగుతుంది. మనుష్యులు దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు, మరుసటి జన్మలో దాని ఫలము లభిస్తుంది. మీకు కూడా భవిష్య 21 జన్మలకు రాజ్య భాగ్యము లభిస్తుంది. ఇది మీ నంబరువన్ బ్యాంక్, ఇందులో 4 అణాలు వేస్తే భవిష్యత్తులో వెయ్యి అవుతుంది. రాయి నుండి బంగారంగా అయిపోతుంది. మీ ప్రతి వస్తువు పారసంగా అయిపోతుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలూ, ఉన్నత పదవిని పొందాలంటే మాతా-పితలను పూర్తిగా ఫాలో చేయండి మరియు మీ కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు వశములో లేకపోతే, నడవడిక బాగోలేకపోతే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. మీ నడవడికను సరిదిద్దుకోవాలి. ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు.

బాబా పిల్లలైన మీకు ఎంతగా జ్ఞాన అలంకరణను చేసి సత్యయుగ మహారాజా-మహారాణిగా చేస్తారు. ఇందులో సహనశీలత యొక్క గుణము చాలా బాగుండాలి. దేహంపై టూ మచ్ (ఎక్కువ) మోహముండకూడదు. యోగబలంతో కూడా పని చేయాలి. బాబాకు ఎంతగా దగ్గు మొదలైనవి ఉన్నా కూడా సదా సేవలో తత్పరులై ఉంటారు. జ్ఞానయోగాలతో అలంకరించి పిల్లలను అర్హులుగా చేస్తారు. మీరిప్పుడు ఈశ్వరీయ ఒడిలో, మాతా పితల ఒడిలో కూర్చున్నారు. తండ్రి బ్రహ్మా నోటి ద్వారా పిల్లలైన మీకు జన్మనిచ్చారు కనుక వీరు తల్లి అయ్యారు. కానీ మీ బుద్ధి మళ్ళీ శివబాబా వైపుకు వెళ్తుంది. నీవే మాత-పిత, మేము మీ పిల్లలము..... మీరు ఇక్కడే సర్వ గుణ సంపన్నులుగా అవ్వాలి. పదే-పదే మాయతో ఓడిపోకూడదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

అవ్యక్త మహావాక్యాలు -

అందరూ యోగయుక్త మరియు యుక్తియుక్త స్థితిలో స్థితులై ఉంటూ మీ పనులు చేసుకుంటున్నారా? ఎందుకంటే వర్తమాన సమయమనుసారంగా సంకల్పము, వాణి మరియు కర్మ, ఈ మూడూ యుక్తియుక్తంగా ఉండాలి, అప్పుడే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వగలరు. నలువైపుల యొక్క వాతావరణము యోగయుక్తముగా మరియు యుక్తియుక్తముగా ఉండాలి. యుద్ధ మైదానంలో యోధులు యుద్ధము చేసేందుకు శత్రువు ఎదుట నిలబడి ఉన్నప్పుడు, వారికి తమపై మరియు తమ శస్త్రాలపై అనగా తమ శక్తులపై ఎంత అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడైతే సమయం సమీపంగా వస్తూ ఉంది, ఇది యుద్ధ మైదానంలో ఎదురుగా వచ్చే సమయమని భావించండి. ఇటువంటి సమయంలో నలువైపులా సర్వ శక్తుల విషయంలో స్వయం పైన అటెన్షన్ ఉండాలి. ఒకవేళ ఏ మాత్రం అటెన్షన్ తక్కువైనా సరే, సమయమనుసారముగా ఏ విధంగా నలువైపులా టెన్షన్ పెరుగుతూ ఉంటుందో, అదే విధంగా నలువైపులా ఉన్న టెన్షన్ వాతావరణ ప్రభావము, యుద్ధములో ఉపస్థితులై ఉన్న ఆత్మిక పాండవ సైన్యముపై కూడా పడవచ్చు. సంపూర్ణతా సమయం రోజు రోజుకు సమీపంగా వస్తున్న కొద్ది, ప్రపంచంలో టెన్షన్ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. నలువైపులా పెనుగులాటతో కూడిన జీవితం అనుభవమవుతుంది, నలువైపుల నుండి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక వైపు ప్రకృతి యొక్క చిన్న-చిన్న ఆపదల నష్టము యొక్క టెన్షన్, రెండవ వైపు ఈ ప్రపంచపు గవర్నమెంట్ యొక్క కఠినమైన చట్టాల టెన్షన్, మూడవ వైపు వ్యవహారంలో లోపం వలన కలిగే టెన్షన్ మరియు నాల్గవ వైపు లౌకిక సంబంధీకులు మొదలైన వారితో స్నేహము మరియు స్వతంత్రత ఉన్న కారణంగా కలిగే సంతోషపు అనుభూతి ఏదైతే అల్పకాలం కోసం ఉంటుందో, అది కూడా సమాప్తమైపోయి భయం యొక్క అనుభూతి అయ్యే టెన్షన్, మనుష్యులలో నలువైపుల యొక్క టెన్షన్లు పెరగనున్నాయి. నలువైపుల టెన్షన్లలో ఆత్మలు తపిస్తాయి. ఎక్కడకు వెళ్తే అక్కడ టెన్షన్. ఏ విధంగా శరీరంలో కూడా ఏదైనా నరము లాగినట్లయితే ఎంత బాధ కలుగుతుంది. తల లాగుతున్నట్లుగా ఉంటుంది. అలా ఈ వాతావరణం పెరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి అని ఏ గమ్యము కనిపించనట్లుగా ఉంటుంది. ఒకవేళ అవును అన్నా పెనుగులాటే, కాదు అన్నా కూడా పెనుగులాటే - సంపాదించినా కష్టమే, సంపాదించకపోయినా కష్టమే. కూడబెట్టినా కష్టమే, లేకపోయినా కష్టమే. ఇటువంటి వాతావరణం తయారవుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో నలువైపులా ఉన్న టెన్షన్ ప్రభావం ఆత్మిక పాండవ సైన్యముపై పడకూడదు. స్వయం టెన్షన్ లోకి వచ్చే సమస్యలు లేకపోయినా కానీ వాతావరణ ప్రభావము బలహీన ఆత్మపై సహజంగానే పడుతుంది. ఏమవుతుంది, ఎలా అవుతుంది, అని భయంతో కూడిన ఆలోచనలు ఉంటాయి. ఈ విషయాల ప్రభావం పడకూడదు - దీని కోసం మధ్యమధ్యలో ఈశ్వరీయ స్మృతియాత్ర యొక్క ఏదో ఒక విశేషమైన ప్రోగ్రామ్ మధుబన్ ద్వారా అఫీషియల్ గా వెళ్తూ ఉండాలి, దీనితో ఆత్మల కోట దృఢంగా ఉంటుంది.

ఈ రోజులలో సేవ కూడా చాలా పెరుగుతుంది. కానీ పెరగడంతో పాటు చాలా యుక్తియుక్తంగా కూడా ఉండాలి. ఈ రోజుల్లో సంబంధం మరియు సంపర్కంలో ఉండేవారు ఎక్కువమంది వస్తారు. స్వరూపంగా తయారయ్యేవారు తక్కువగా వస్తారు. అందరూ ఒకే విధమైనవారు వెలువడరు. రోజురోజుకూ క్వాలిటీ కూడా బలహీన ఆత్మలది అనగా ప్రజల సంఖ్య ఎక్కువగా వస్తుంది, వారికి ఒక్క విషయమే బాగా అనిపిస్తుంది, రెండు నచ్చవు. అన్ని విషయాలలో నిశ్చయముండదు. కనుక సంపర్కంలో ఉండేవారికి కూడా, వారికి ఏం కావాలి అన్నదాని అనుసారముగానే వారిని సంపర్కంలో ఉంచుతూ ఉండాలి. సమయం నాజూకుగా అయ్యే కొద్దీ, సమస్యల ప్రమాణంగా కూడా, వారికి రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వడం కష్టమవుతుంది. కానీ లెక్కలేనంతమంది సంపర్కంలోకి వస్తారు ఎందుకంటే ఇది లాస్ట్ సమయం కదా. కనుక లాస్ట్ ఫోజు ఎలా ఉంటుంది? ఎలాగైతే మొదట్లో ఉల్లాసము, ఉత్సాహము, ఉప్పొంగుతూ ఉండేవో - అవి అరుదుగా ఎవరిలోనైనా ఉంటాయి. మెజారిటీ సంబంధం మరియు సంపర్కం వారే వస్తారు. కనుక ఈ అటెన్షన్ ఉండాలి. అలాగని సంపర్కంలోకి వచ్చే ఆత్మలను పరిశీలించకుండా సంపర్కము నుండి కూడా వంచితం చేయకూడదు. ఖాళీ చేతులతో ఎవ్వరూ వెళ్ళకూడదు, నియమాలపై నడవలేకపోయినా సరే, వారు స్నేహంలో ఉండాలనుకుంటారు, కనుక అటువంటి ఆత్మలపై కూడా తప్పకుండా అటెన్షన్ ఉంచాలి. ఈ విధంగా ఈ గ్రూపు వారు మూడవ స్టేజ్ వారని అర్థం చేసుకోవాలి, కనుక వారికి దాని అనుసారముగానే హ్యాండ్లింగ్ లభించాలి. అచ్ఛా. ఓం శాంతి.

వరదానము:-

స్నేహం వెనుక సర్వ బలహీనతలను బలిహారము చేసే సమర్థీ స్వరూప భవ

స్నేహానికి గుర్తు బలిహారము. స్నేహం వెనుక బలిహారము చేయడంలో ఎటువంటి కష్టము లేక అసంభవమైన విషయం కూడా సంభవంగా మరియు సహజంగా అనుభవమవుతుంది. కనుక సమర్థీ స్వరూపం యొక్క వరదానం ద్వారా సర్వ బలహీనతలను కష్టంగా కాకుండా హృదయపూర్వకంగా బలిహారము చేయండి ఎందుకంటే సత్యమైన తండ్రి వద్ద సత్యమే స్వీకరించబడుతుంది. కనుక కేవలం తండ్రి స్నేహం యొక్క పాటలను పాడకండి కానీ స్వయం తండ్రి సమానంగా అవ్యక్త స్థితి స్వరూపులుగా అవ్వండి, అప్పుడు అందరూ మీ పాటను పాడుతారు.

స్లోగన్:-

సంకల్పం మరియు స్వప్నంలో కూడా ఒక్క రాముని స్మృతియే ఉంటే, అప్పుడు సత్యమైన తపస్వీలని అంటారు.