25-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదవాలి, చదివించాలి, అందరికీ శాంతిధామము, సుఖధామాలకు దారి తెలపాలి"

ప్రశ్న:-

సతోప్రధాన పురుషార్థుల గుర్తులు ఏమిటి?

జవాబు:-

వారు ఇతరులను కూడా తమ సమానంగా చేస్తారు. వారు అనేకమంది కళ్యాణము చేస్తూ ఉంటారు.జ్ఞాన ధనముతో జోలెను నింపుకొని దానము చేస్తారు. 21 జన్మలకు వారసత్వము తీసుకుంటారు, ఇతరులకు కూడా ఇప్పిస్తారు.

గీతము:-

ఓం నమఃశివాయ...

ఓంశాంతి. భక్తులు ఎవరినైతే మహిమ చేస్తారో మీరు వారి సన్ముఖములోనే కూర్చుని ఉన్నారు. కనుక మీకు ఎంత సంతోషముండాలి! వారిని ఓం నమః శివాయ అని నమస్కరిస్తారు. మీరు నమస్కరించే పని లేదు.పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు కానీ ఎప్పుడూ నమస్కరించరు. వీరు కూడా తండ్రే. వీరి ద్వారా మీకు వారసత్వము లభిస్తుంది. మీరు వారికి నమస్కరించరు, స్మృతి చేస్తారు. శరీరములోని ఆత్మ స్మృతి చేస్తుంది. తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. వారు మనకు మార్గము తెలుపుతున్నారు - తండ్రి నుండి అనంతమైన వారసత్వమును ఎలా తీసుకోవాలో తెలుపుతున్నారు. మీరు కూడా మంచిరీతిగా అర్థం చేసుకున్నారు. సత్యయుగమును సుఖధామమని అంటారు. ఆత్మలుండే చోటును శాంతిధామమని అంటారు. మనము శాంతిధామ నివాసులమని మీ బుద్ధిలో ఉంది. ఈ కలియుగాన్ని దుఃఖధామమని అంటారు. ఆత్మలమైన మనమిప్పుడు స్వర్గములోకి వెళ్లేందుకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాము. ఈ లక్ష్మీనారాయణులు దేవతలు కదా. నూతన ప్రపంచము కొరకు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. తండ్రి ద్వారా మీరు చదువుతున్నారు. చదువులో కొంతమంది పురుషార్థము చాలా తీవ్రంగా ఉంటుంది, కొంతమందిది బలహీనంగా ఉంటుంది. ఎవరైతే సతోప్రధాన పురుషార్థులుగా ఉంటారో వారు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసేందుకు నంబరువారుగా పురుషార్థము చేయిస్తారు. అనేకమందికి కళ్యాణము చేస్తారు. ధనముతో ఎంత బాగా జోలెను నింపుకొని దానము చేస్తారో అంత లాభముంటుంది. మనుష్యులు దానము చేస్తూ ఉంటారు. వారికి మరుసటి జన్మలో అల్పకాలము కొరకు ఫలము లభిస్తుంది. అందులో సుఖము స్వల్పంగా ఉంటుంది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. మీకైతే 21 జన్మలకు స్వర్గ సుఖము లభిస్తుంది. స్వర్గ సుఖము ఎక్కడ!ఈ దుఃఖము ఎక్కడ! అనంతమైన తండ్రి ద్వారా మీకు స్వర్గములో అనంతమైన సుఖము లభిస్తుంది. ఈశ్వరార్థంగా దాన-పుణ్యాలు చేస్తారు కదా. అది అప్రత్యక్ష దానము. ఇప్పుడు మీరైతే సన్ముఖములో ఉన్నారు కదా. ఇప్పుడు మీకు తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు - భక్తి మార్గములో ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేస్తే మరుసటి జన్మలో ఫలము లభిస్తుంది. మంచి పనులు చేస్తే మంచే లభిస్తుంది. చెడు పనులు, పాపాలు మొదలైనవి చేస్తే వారికి అలాగే లభిస్తుంది. ఇక్కడ ఈ కలియుగములో పాపాలే జరుగుతూ ఉంటాయి. పుణ్యము జరగనే జరగదు. ఒకవేళ లభిస్తే అల్పకాలిక సుఖము లభిస్తుంది. ఇప్పుడు మీరు భవిష్య సత్యయుగములో 21 జన్మలకు సదా సుఖవంతులుగా అవుతారు. దాని పేరే సుఖధామము. చిత్ర ప్రదర్శనలో కూడా "ఇది శాంతిధామము, సుఖధామమునకు సహజ మార్గము" అని వ్రాయవచ్చు. ఇప్పుడిది కలియుగము కదా. కలియుగము నుండి సత్యయుగము, పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి వెళ్లేందుకు పైసా ఖర్చు లేకుండా సులభమైన మార్గము - ఇలా వ్రాస్తే మనుష్యులు అర్థము చేసుకుంటారు. ఎందుకంటే రాతిబుద్ధి గలవారు కదా. తండ్రి చాలా సహజంగా చేసి అర్థం చేయిస్తున్నారు. దీని పేరే సహజ రాజయోగము, సహజ జ్ఞానము.

తండ్రి పిల్లలైన మిమ్ములను చాలా తెలివిగలవారిగా తయారుచేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు కదా. భలే కృష్ణుని గురించి ఏమేమో వ్రాసేశారు. అవన్నీ అసత్య కళంకాలు. అమ్మా నేను వెన్న తినలేదని,.... కృష్ణుడంటాడు. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. నేను వెన్న తినలేదు, అయితే ఎవరు తిన్నారు?పిల్లలకు పాలు తాగిస్తారు. పిల్లలు వెన్న తింటారా? పాలు తాగుతారా? మట్టి కుండలు పగులుకొట్టినట్లు మొదలైనవి చూపిస్తారు. అటువంటి మాటలేవీ లేవు. వారు స్వర్గములోని ప్రప్రథమ రాకుమారుడు. మహిమంతా ఒక్క శివబాబాది మాత్రమే. ప్రపంచములో ఇతరులెవ్వరికీ మహిమ లేదు. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. కాని భక్తి మార్గానికి కూడా మహిమ ఉంది. భక్తుల మాల కూడా మహిమ చేయబడింది కదా. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు ముఖ్యులుగా మహిమ చేయబడ్డారు. ఒకటేమో భక్తుల మాల, రెండవది జ్ఞానుల మాల. భక్త మాల నుండి రుద్రమాలలోని వారుగా అయ్యారు. తర్వాత రుద్రమాల నుండి విష్ణుమాల తయారవుతుంది. రుద్రమాల సంగమ యుగములోనిది. ఈ రహస్యము పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మీకు ఈ విషయాలు తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. సన్ముఖములో కూర్చున్నప్పుడు మీరు రోమాలు నిక్కపొడవాలి. అహో సౌభాగ్యము! - వంద శాతము దుర్భాగ్యశాలిగా ఉన్న మనము సౌభాగ్యశాలిగా అవుతాము. కుమారీలు కామఖడ్గముక్రిందకు వెళ్లలేదు. అది కామఖడ్గము అని తండ్రి అంటున్నారు. జ్ఞానాన్ని కూడా ఖడ్గము అని అంటారు. జ్ఞాన అస్త్ర - శస్త్రాల గురించి తండ్రి తెలిపారు. కానీ వారు దేవతలకు స్థూలమైన అస్త్ర శస్త్రాలను ఇచ్చేశారు. అవి హింసాత్మకమైన వస్తువులు. స్వదర్శన చక్రమంటే ఏమిటో మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో కృష్ణునికి కూడా స్వదర్శన చక్రమును ఇచ్చి హింస చేసినట్లు చూపించారు. వాస్తవానికి ఇవన్నీ జ్ఞాన విషయాలు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. కానీ వారు దీనిని హింసగా చూపించారు. పిల్లలైన మీకిప్పుడు స్వ అనగా చక్ర జ్ఞానము లభించింది. బాబా చెప్తున్నారు - "మీరు బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణ స్వదర్శన చక్రధారులు". దీని అర్థము కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీలో సృష్టిచక్ర జ్ఞానము, 84 జన్మల జ్ఞానము పూర్తిగా ఉంది. సత్యయుగములో మొదట ఒకే ఒక సూర్యవంశ ధర్మముండేది, ఆ తర్వాత చంద్ర వంశము - ఈ రెండింటిని కలిపి స్వర్గమనిఅంటారు. ఈ విషయాలు మీ అందరి బుద్ధిలో కూడా నంబరువారుగా ఉన్నాయి. తండ్రి ఎలా మిమ్ములను చదివించారో, మీరు తెలివిగలవారిగా అయ్యారో, మీరుఇప్పుడు అదే విధంగా ఇతరుల కళ్యాణము చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎంతవరకు బ్రహ్మాముఖ వంశావళిగా అవ్వరో అంతవరకు శివబాబా నుండి వారసత్వమెలా తీసుకుంటారు? ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. శివబాబా నుండి వారసత్వము తీసుకుంటున్నారు. ఇది మర్చిపోరాదు. పాయింట్లు నోట్ చేసుకోవాలి. ఇది 84 జన్మల మెట్ల వరుస.మెట్ల వరుసలో మెట్లు దిగడం సులభము. పైకి ఎక్కేటప్పుడు నడుమును చేతితో పట్టుకుని ఎలాగో ఒకలాగ ఎక్కుతారు. కాని లిప్టు కూడా ఉంది. ఇప్పుడు బాబా మీకు లిఫ్టు ఇవ్వడానికే వచ్చారు. ఒక్క సెకండులో మీరు పైకి ఎక్కేకళలో వెళ్తారు. ఇప్పుడు మాది పైకి ఎక్కే కళ అని పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. అత్యంత ప్రియమైన బాబా లభించారు. వారిలాంటి ప్రియమైన వస్తువు మరేదీ ఉండదు. సాధు సత్పురుషులు మొదలైనవారంతా ఆ ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. ఇప్పుడు అందరూ వారి ప్రేయసులే. అయితే వారు ఎవరో, ఎవ్వరికీ కొంచెము కూడా తెలియదు. కేవలం సర్వవ్యాపి అని అనేస్తారు.

ఇప్పుడు శివబాబా మనల్ని వీరి ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. శివబాబాకు వారి శరీరము లేనే లేదు. వారు పరమ - ఆత్మ. పరమ ఆత్మ అనగా పరమాత్మ. వారి పేరు శివ. మిగిలిన ఆత్మలందరి శరీరాలకు వేరు వేరు పేర్లున్నాయి. పరమాత్మ ఒకే ఒక్కరు. వారి పేరు శివ.కాని మనుష్యులు వారికి అనేక పేర్లు పెట్టారు. రకరకాల మందిరాలు నిర్మించారు. ఇప్పుడు మీకు వాటి అర్థము తెలుసు. బొంబాయిలో బాబురీనాథుని మందిరముంది. వారిప్పుడు మిమ్ములను ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. మీరు విశ్వాధికారులుగా అవుతారు. కావున మొదట ముఖ్యమైనది - ఆత్మలమైన మనందరి తండ్రి ఒక్కరే. వారి ద్వారానే భారతవాసులకు వారసత్వము లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు భారతదేశానికి యజమానులు కదా. చైనాకు కాదు కదా. చైనాకైతే ముఖమే వేరుగా ఉండేది. వీరు భారతదేశము వారే. మొట్టమొదట తెల్లగా తర్వాత నల్లగా అవుతారు. మలినాలు ఆత్మలోనే ఏర్పడతాయి. నల్ల(అపవిత్రము)గా అవుతారు. ఉదాహరణలన్నీ భారతదేశము పైననే ఉన్నాయి. భ్రమరము పేడ పురుగులను పరివర్తన చేసి తన సమానంగా చేస్తుంది. సన్యాసులు ఎక్కడ పరివర్తన చేస్తున్నారు! శ్వేత వస్త్రాల వారికి కాషాయ వస్త్రాలను ధరింపచేసి తల గుండు చేయిస్తారు. మీరైతే ఈ జ్ఞానము తీసుకుంటారు. లక్ష్మీనారాయణుల వలె శోభాయమానంగా అవుతారు. ఇప్పుడు ప్రకృతి కూడా తమోప్రధానంగా ఉంది. కనుక భూమి కూడా తమోప్రధానంగా ఉంది. అందువలన నష్టదాయకంగా ఉంది. ఆకాశములో తుఫానులు రేగుతున్నాయి. ఎంత నష్టపరుస్తాయి! ఉపద్రవాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రపంచములో అత్యంత దుఃఖముంది. అక్కడ పరమ సుఖముంటుంది. తండ్రి పరమ దుఃఖము నుండి పరమ సుఖములోకి తీసుకెళ్తారు. ఇది వినాశనమౌతుంది. మళ్లీ అందరూ సతోప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి తండ్రి నుండి ఎంత వారసత్వము కావాలో అంత తీసుకోండి. లేకుంటే చివరిలో పశ్చాత్తాపపడవలసి వస్తుంది. బాబా వచ్చారు కానీ మేము ఏమీ తీసుకోలేదని అనుకుంటారు. ఎండిపోయిన వెదురు అడివికి నిప్పుఅంటుకున్నప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కుంటారు అని వ్రాయబడి ఉంది. ఆ తర్వాత అయ్యో - అయ్యో అంటూ మరణిస్తారు. అయ్యో అయ్యోకు తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. కలియుగములో అందరూ అయ్యో అయ్యో అంటున్నారు కదా. ఒకరినొకరు చంపుకుంటున్నారు. అనేక మంది మరణిస్తారు. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము తప్పకుండా వస్తుంది. మధ్యలో ఇది సంగమ యుగము. దీనిని పురుషోత్తమ యుగమని అంటారు. తండ్రి తమోప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు మంచి యుక్తి తెలుపుతున్నారు. వారు కేవలం నన్ను స్మృతి చేయండని, ఇక ఏమీ చేయనవసరము లేదు అని అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తలమొదలైనవి వంచి నమస్కరించే పని లేదు. బాబాకు ఎవరైనా చేతులు జోడించి నమస్కరిస్తే బాబా అంటారు - ఆత్మ అయిన మీకూ చేతులు లేవు, తండ్రికీ చేతులు లేవు, అటువంటప్పుడు చేతులెవరి కోసం జోడిస్తారు? కలియుగములోని భక్తిమార్గపు గుర్తులు ఒక్కటి కూడా ఉండరాదు. ఓ ఆత్మా! నీవు ఎందుకు చేతులు జోడిస్తావు? కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయడమనగా చేతులు జోడించడం కాదు. మనుష్యులు సూర్యునికి కూడా చేతులు జోడిస్తారు. కొంతమంది మహాత్ములకు చేతులు జోడిస్తారు. మీరు చేతులు జోడించరాదు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరము. అయితే ఎవరైనా చేతులు జోడిస్తే దానికి బదులుగా జోడించవలసి వస్తుంది. నేను ఆత్మను, ఈ బంధనము నుండి విడుదల పొంది ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని మీరు అర్థము చేసుకోవాలి. దీని పై అసహ్యము వస్తూ ఉంది. ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. సర్పము కుబుసము వదిలినట్లు వదలాలి. భ్రమరిలో కూడా పురుగును తన సమానంగా భ్రమరిగా మార్చే తెలివి చాలా ఉంది.పిల్లలైన మీరు కూడా ఈ విషయ సాగరములో మునకలు వేస్తున్న వారిని బయటకు తీసి క్షీర సాగరములోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు శాంతిధామానికి పదండి అని తండ్రి చెప్తున్నారు. మనుష్యులు శాంతి కొరకు ఎంతగానో తలలు బాదుకుంటున్నారు. సన్యాసులకు స్వర్గమనే జీవన్ముక్తి లభించదు, ముక్తి లభిస్తుంది. దుఃఖము నుండి విడుదల పొంది శాంతిధామములో కూర్చుంటారు. అయినా ఆత్మ మొట్టమొదట జీవన్ముక్తిలోకి వస్తుంది, తర్వాత జీవన బంధనములోకి వస్తుంది. ఆత్మ సతోప్రధానంగా ఉండి తర్వాత మెట్లు క్రిందకు దిగుతుంది. మొదట సుఖమును అనుభవించి తర్వాతక్రిందకు దిగుతూ దిగుతూ తమోప్రధానమైపోయింది. ఇప్పుడు అందరినీ మళ్లీ తిరిగి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారని తండ్రి చెప్తున్నారు.

బాబా అర్థం చేయించారు, మనుష్యులు శరీరాన్ని వదిలేటప్పుడు చాలా కష్టమును అనుభవిస్తారు, ఎందుకంటే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. శివునిపై బలి అయితే ముక్తి లభిస్తుందని విన్నందుకు కత్తుల బావిలో దూకుతారు. ఇప్పుడు మీరు బలి అవుతున్నారు కదా. అందువలన భక్తిమార్గములో కూడా ఇవే మాటలు కొనసాగుతాయి. అందుకే శివునిపై బలి అవుతారు. తిరిగి ఎవ్వరూ వెళ్లలేరని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అంతగా బలి అయినందుకు పాపాలు తొలగుతాయి, మళ్లీ లెక్కాచారము క్రొత్తగా ప్రారంభమౌతుంది. మీరు ఈ సృష్టి చక్రమును గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అందరిదీ క్రిందకు దిగే కళ. నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. పతితులనైతే వెంట తీసుకెళ్ళను. అందువలన ఇప్పుడు పవిత్రమైతే మీ జ్యోతి వెలిగించబడ్తుంది. వివాహ సమయములో స్త్రీ తలపై మట్టిపాత్రలో జ్యోతి వెలిగిస్తారు. ఈ ఆచారము కూడా భారతదేశములో మాత్రమే ఉంది. స్త్రీ తలపై మట్టి పాత్రలో జ్యోతి వెలిగిస్తారు, పతి తలపై వెలిగించరు, ఎందుకంటే పతిని పరమేశ్వరుడు అని అంటారు. ఈశ్వరుని తలపై జ్యోతిని ఎలా వెలిగిస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - నా జ్యోతి ఎప్పుడూ వెలిగే ఉంటుంది. నేను మీ జ్యోతిని వెలిగిస్తాను. తండ్రిని దీపమని కూడా అంటారు. బ్రహ్మ సమాజము వారు జ్యోతికి గౌరవమిస్తారు. సదా జ్యోతి వెలిగే ఉంటుంది. దానినే స్మృతి చేస్తారు. ఆ జ్యోతినే భగవంతునిగా భావిస్తారు. కొంతమంది చిన్న జ్యోతి(ఆత్మ), పెద్ద జ్యోతి(పరమాత్మ)లో ఇమిడిపోతుందని భావిస్తారు. ఈ విధంగా అనేక మతాలున్నాయి. మీ ధర్మము అపారమైన సుఖమునిచ్చేదని తండ్రి చెప్తున్నారు. మీరు స్వర్గములో చాలా సుఖమును అనుభవిస్తారు. నూతన ప్రపంచములో మీరు దేవతలుగా అవుతారు. మీ చదువు భవిష్య నూతన ప్రపంచము కొరకు. మిగిలిన చదువులన్నీ ఈ ప్రపంచము కొరకే. ఇక్కడ మీరు చదివి భవిష్యత్తులో పదవి పొందాలి. గీతలో కూడా రాజయోగము నేర్పించారు. చివరిలో యుద్ధము జరిగినట్లు చూపించారు. ఏమీ మిగలలేదు. పాండవులకు తోడుగా ఒక కుక్కను చూపిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను దేవీదేవతలుగా తయారుచేస్తాను. ఇక్కడ అనేక రకాల దుఃఖములిచ్చే మనుష్యులున్నారు.కామ ఖడ్గమును విసురుతూ ఎంతో దుఃఖితులుగా చేస్తారు. అందువలన జ్ఞాన సాగరులైన ఈ అనంతమైన తండ్రి పిల్లలైన మమ్ములను చదివిస్తున్నారని మీకు ఎంతో సంతోషం ఉండాలి. అత్యంత ప్రియమైన ప్రియుడు. ప్రేయసులమైన మనము వారిని అర్ధకల్పము స్మృతి చేస్తాము. మీరు స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను వచ్చాను, మీరు నా మతమును అనుసరించండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు. నా స్మృతితో తప్ప ఏ ఇతర ఉపాయముతోనూ మీ పాపాలు భస్మము కావు. ప్రతి విషయములో సర్జన్ను సలహా అడుగుతూ ఉండండి. బాబా సలహానిస్తారు - ఫలానా విధంగా తోడు నిభాయించండి. సలహా ప్రకారము నడుచుకుంటే అడుగడుగులోనూ పదమాలు లభిస్తాయి. సలహా తీసుకుంటే బాధ్యత నుండి విడుదల అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు నేరుగా ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేయాలి. జ్ఞాన ధనముతో జోలెను నింపుకుని అందరికీ ఇవ్వాలి.

2. ఈ పురుషోత్తమ యుగములో స్వయాన్ని అన్ని బంధనాల నుండి ముక్తలుగా చేసుకుని జీవన్ముక్తులుగా అవ్వాలి. భ్రమరి వలె భూ-భూ చేస్తూ ఇతరులను మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.

వరదానము:-

సాధారణ కర్మలు చేస్తున్నా ఉన్నతమైన స్థితిలో స్థితియై ఉండే సదా డబల్ లైట్ భవ

తండ్రి సాధారణ శరీరాన్నే తీసుకుంటారు, మీరు మాట్లాడినట్లే మాట్లాడ్తారు. మీరు నడిచినట్లే నడుస్తారు.కానీ వారి కర్మలు భలే సాధారణంగా ఉన్నా స్థితి ఉన్నతంగా ఉంటుంది. అలా పిల్లలైన మీ స్థితి కూడా సదా ఉన్నతంగా, శ్రేష్ఠంగా ఉండాలి. డబల్ లైట్ గా అయి ఉన్నతమైన స్థితిలో స్థితియై ఏ సాధారణ కర్మలను చేసినా, సదా ఇదే స్మృతిలో ఉండాలి -నేను అవతరించి, అవతారంగా అయి శ్రేష్ఠ కర్మలు చేసేందుకు వచ్చాను అని. అప్పుడు సాధారణ కర్మలు అలౌకిక కర్మలలోకి మారిపోతాయి.

స్లోగన్:-

ఆత్మిక దృష్టి, వృత్తిని అభ్యాసము చేసేవారే పవిత్రతను సహజంగా ధారణ చేయగలరు.