27-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఇప్పుడు తండ్రి మిమ్ములను పాలన చేస్తున్నారు, చదివిస్తున్నారు, మీ ఇంటిలోనే కూర్చోబెట్టి సలహానిస్తున్నారు, కనుక అడుగడుగునా సలహా తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది"

ప్రశ్న:-

శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఏ పురుషార్థము చాలా కాలము చేయాలి?

జవాబు:-

నష్టోమోహులుగా అయ్యే పురుషార్థము. ఎవరి పైనా మమకారముండరాదు. మీ మనస్సులో మీరే ప్రశ్నించుకోండి - "మాకు ఎవరి పైనా మోహము లేదు కదా?" అంతిమ సమయంలో ఏ పాత సంబంధమూ గుర్తు రాకూడదు. యోగబలముతో అన్ని లెక్కాచారాలు సమాప్తము చేసుకోవాలి. అప్పుడే శిక్షలు లేకుండా ఉన్నత పదవి లభిస్తుంది.

ఓంశాంతి. ఇప్పుడు మీరు ఎవరి సన్ముఖములో కూర్చొని ఉన్నారు? బాప్ దాదా సన్ముఖములో. తండ్రి అని కూడా అనాలి, దాదా అని కూడా అనాలి. తండ్రి కూడా ఈ దాదా ద్వారా మీ ఎదుట కూర్చొని ఉన్నారు. మీరు బయట ఉండి ఉంటే అక్కడ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఉత్తరం వ్రాయవలసి వస్తుంది. ఇక్కడ మీరు సన్ముఖములో ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? బాప్ దాదాతో. వీరిరువురు ఉన్నతాతి ఉన్నతమైన రెండు అథారిటీలు. బ్రహ్మా సాకారులు, శివుడు నిరాకారులు. ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన అథారిటీ అయిన తండ్రితో ఎలా కలవాలో మీకు తెలుసు. అనంతమైన తండ్రి, ఎవరినైతే పతితపావనులని పిలుస్తారో ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రి, పిల్లలైన మిమ్ములను పాలన చేస్తున్నారు, చదివిస్తున్నారు. మీరు ఇంట్లో కూర్చొని ఉన్నా, ఇంట్లో ఎలా నడచుకోవాలో పిల్లలైన మీకు సలహా లభిస్తుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడిస్తే శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అవుతారు. మేము ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి సలహాతో ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందుతామని పిల్లలకు తెలుసు. మానవ సృష్టిలో అత్యంత ఉన్నత పదవి - ఈ లక్ష్మీనారాయణుల పదవి. వీరు గతంలో ఉండి వెళ్లినవారు. మనుష్యులు వెళ్లి ఈ ఉన్నతమైన వారికి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయము - పవిత్రత. మనుష్యులు మనుష్యులే. కానీ విశ్వానికి యజమానులైన వారెక్కడ? ఇప్పటి మనుష్యులెక్కడ? భారతదేశము 5 వేల సంవత్సరాల క్రితము ఇలా ఉండేదని, మనము కూడా విశ్వానికి యజమానులుగా ఉండేవారమని మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాం లేదు. వీరికి కూడా ఏ మాత్రము తెలియదు. పూర్తిగా గాఢాంధకారములో ఉండేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి బ్రహ్మా సో విష్ణు, విష్ణు సో బ్రహ్మా ఎలా అవుతారో అర్థము చేయించారు. ఇవి చాలా గుహ్యమైన రమణీకమైన విషయములు. ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థము చేసుకోలేరు. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ చదివించలేరు. నిరాకారుడైన తండ్రి వచ్చి చదివిస్తారు. కృష్ణ భగవానువాచ కాదు. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను చదివించి సుఖవంతంగా చేస్తాను. తర్వాత మళ్లీ నేను నా నిర్వాణధామానికి వెళ్లిపోతాను. ఇప్పుడు పిల్లలైన మీరు సతోప్రధానంగా అవుతున్నారు. ఇందులో కొంచెము కూడా ఖర్చు లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. పైసా కూడా ఖర్చు కాకుండా 21 జన్మలకు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అతి స్వల్ప ధనాన్ని పంపిస్తారు, అది కూడా మీ భవిష్యత్తును తయారు చేసుకునేందుకు. కల్పక్రితము ఎవరు ఎంత ఖజానాలో వేశారో, ఇప్పుడు కూడా అంతే వేస్తారు. ఎక్కువా వెయ్యలేరు, తక్కువా వెయ్యలేరు. బుద్ధిలో ఈ జ్ఞానముంది. కనుక చింతించే విషయమేదీ ఉండదు. ఏ చింతా లేకుండా మనము మన రాజధానిని గుప్తంగా స్థాపన చేస్తున్నాము. ఇది బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి. పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి. అంతేకాక నష్టోమోహులుగా కూడా అవ్వాలి. ఇక్కడ నష్టోమోహులుగా అవ్వడం వలన అక్కడ మీరు మోహజీత్ రాజా-రాణులుగా అవుతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుందని, మనము తిరిగి ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు, కనుక ఇందులో మమత్వము ఎందుకు పెట్టుకోవాలి? ఎవరికైనా జబ్బు చేస్తే, డాక్టరు ఇది చాలా హోప్లెస్ కేస్ అన్నారంటే, వారి పై మమకారము తొలగిపోతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని భావిస్తారు. ఆత్మ అవినాశి కదా. ఆత్మ వెళ్లిపోయింది, శరీరము సమాప్తమైపోయింది, ఇక వారిని తల్చుకుని లాభమేమిటి? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు నష్టోమోహులుగా అవ్వండి. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నాకు ఎవరిపైన అయినా మోహము అయితే లేదు కదా? లేదంటే చివర్లో తప్పకుండా వారే గుర్తుకొస్తారు. నష్టోమోహులుగా అయినట్లయితే ఈ పదవిని పొందుతారు. స్వర్గములోకి అయితే అందరూ వస్తారు, అదేమంత గొప్ప విషయమేమీ కాదు. శిక్షలు అనుభవించకుండా ఉన్నత పదవి పొందడం గొప్ప విషయము. యోగబలముతో లెక్కాచారము సమాప్తము చేసుకుంటే, శిక్షలు అనుభవించరు. పాత సంబంధీకులు కూడా గుర్తు రాకూడదు. ఇప్పుడైతే మనకు బ్రాహ్మణులతో సంబంధముంది, తర్వాత మనకు దేవతలతో సంబంధముంటుంది. ఇప్పటి మన సంబంధము అన్నిటికంటే ఉన్నతమైనది.

ఇప్పుడు మీరు జ్ఞానసాగరులైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఇంతకుముందు ఈ సృష్టి చక్రమెలా తిరుగుతూ ఉందో మీకు తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. అందుకే కదా తండ్రి పై ప్రేమ ఉంది. తండ్రి ద్వారా స్వర్గ సామ్రాజ్యము లభిస్తుంది. వారికి ఈ రథము నిశ్చయింపబడింది. భారతదేశములోనే భగీరథుడు అనే గాయనముంది. తండ్రి భారతదేశములోనే వస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు 84 జన్మల మెట్ల యొక్క జ్ఞానముంది. ఈ 84 జన్మల చక్రములో మేము తిరిగి తీరాలని మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. 84 జన్మల చక్రము నుండి విడుదల అవ్వలేరు. మెట్లు దిగేందుకు చాలా సమయము పడ్తుందని, పైకెక్కడంలో కేవలం ఈ అంతిమ జన్మ పడుతుందని మీకిప్పుడు తెలుసు. అందుకే మీరు త్రిలోకనాథులుగా, త్రికాలదర్శులుగా అవుతారని అంటారు. ఇంతకు ముందు - మేము త్రిలోకనాథులుగా అవుతామని మీకు తెలుసా? ఇప్పుడు తండ్రి లభించి శిక్షణనిస్తున్నారు కనుక మీరు తెలుసుకున్నారు. బాబా వద్దకు ఎవరైనా వస్తే - "ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఇదే డ్రస్సులో, ఇదే ఇంటిలో నన్ను కలుసుకున్నారా?" అని అడుగుతారు. అందుకు "అవును బాబా, కల్ప-కల్పము కలుస్తాము" అని చెప్తారు. అలా చెప్తే బ్రహ్మాకుమారి బాగా అర్థము చేయించారని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గ వృక్షాన్ని మీ ఎదుట చూస్తున్నారు. సమీపంగా ఉన్నారు కదా. తండ్రి నామ-రూపాలకు అతీతులని మనుష్యులు అంటారు. అలాగైతే పిల్లలు ఎక్కడ నుండి వస్తారు? వారు కూడా నామ రూపాలకు అతీతమైపోవాలి! వారు చెప్తున్న పదాలు పూర్తిగా తప్పు. కల్పక్రితము ఎవరు అర్థము చేసుకున్నారో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. ప్రదర్శినీలో ఎటువంటివారు వస్తారో చూడండి. కొంతమంది విని, వినిపించిన మాటలను నమ్మి ఇదంతా కల్పన అని వ్రాసేస్తారు. అటువంటివారు మన కులమువారు కాదని భావించాలి. అనేక విధములైన మనుష్యులున్నారు. మీ బుద్ధిలో మొత్తము వృక్షము, డ్రామా, 84 జన్మల చక్రము అంతా వచ్చేసింది. ఇప్పుడు పురుషార్థము చేయాలి. అది కూడా డ్రామానుసారమే జరుగుతుంది. డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అలాగని డ్రామాలో పురుషార్థము చేయాలని ఉంటే చేస్తాము అని అనడం తప్పు. డ్రామాను పూర్తిగా అర్థము చేసుకోకుంటే వారిని నాస్తికులని అంటారు. వారు తండ్రి పై ప్రీతినుంచలేరు. డ్రామా రహస్యమును తప్పుగా అర్థము చేసుకుంటే క్రింద పడిపోతారు. వారి భాగ్యములో లేదని భావించవలసి వస్తుంది. అనేక రకాలైన విఘ్నాలైతే వస్తాయి. వాటిని పట్టించుకోకూడదు. తండ్రి చెప్తున్నారు - మంచి మాటలు ఏవైతే మీకు వినిపిస్తున్నామో అవి వినండి. తండ్రిని స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు. 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని, ఇప్పుడు ఇంటికి వెళ్లాలని మీ బుద్ధిలో ఉంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. పతితులైన మీరు అయితే వెళ్లలేరు. ముందు ప్రియుడు తప్పకుండా ఉండాలి, వారి వెనుక ఊరేగింపు ఉంటుంది. భోళానాథుని ఊరేగింపు అను గాయనం కూడా చేయబడింది. అందరూ నంబరువారుగా వెళ్లేదే ఉంది, ఇన్ని ఆత్మల గుంపు నంబరువారుగా ఎలా వెళ్తుంది! మానవులు ఈ భూమి పై ఎంత స్థానము తీసుకుంటారు? ఎంత ఫర్నీచరు, భూములు మొదలైనవి కావాలో చూడండి. ఆత్మ అయితే ఒక బిందువే. ఆత్మకు ఏం కావాలి? ఏమీ అవసరం లేదు. ఆత్మ ఎంత తక్కువ స్థలం తీసుకుంటుంది. ఈ సాకార వృక్షానికి, నిరాకార వృక్షానికి ఎంత తేడా ఉంది! అది బిందువుల వృక్షము. ఈ విషయాలన్నీ తండ్రి మీ బుద్ధిలో కూర్చోబెడ్తారు. మీరు తప్ప ఈ ప్రపంచములో ఈ విషయాలను ఇతరులెవ్వరు వినలేరు. తండ్రి ఇప్పుడు మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతినిప్పిస్తారు. పిల్లలైన మీరు రచయితను తెలుసుకున్నందుకు సృష్టి చక్రము యొక్క ఆది-మధ్య-అంత్యములు తెలుసుకున్నారు. మీరు త్రికాలదర్శులుగా, ఆస్తికులుగా అయ్యారు. ప్రపంచమంతటిలో ఆస్తికులెవ్వరూ లేరు. అది హద్దు చదువు. ఇది అనంతమైన చదువు. అక్కడ అనేక మంది టీచర్లు చదివిస్తారు, ఇక్కడ చదివించేది ఒకే టీచరు. వీరు అద్భుతమైనవారు. వీరు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. మొత్తము ప్రపంచానికంతా టీచరు వీరే. కానీ అందరూ చదవరు. తండ్రిని అందరూ తెలుసుకుంటే అందరూ బాప్దాదాను చూసేందుకు పరుగెత్తి వస్తారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆడమ్ లో బాబా వచ్చారు అని తెలుసుకుంటే అందరూ ఒక్కసారిగా పరుగెత్తి వస్తారు. యుద్ధము ప్రారంభమైనప్పుడు తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. కానీ అప్పుడు ఎవ్వరూ రాలేరు. ఈ అనేక ధర్మాల వినాశనము జరగాలని కూడా మీకు తెలుసు. మొట్టమొదట ఒక్క భారతదేశము మాత్రమే ఉండేది. ఇతర ఏ ఖండమూ ఉండేది కాదు. ఇప్పుడు మీ బుద్ధిలో భక్తి మార్గములోని విషయాలు కూడా ఉన్నాయి. బుద్ధి ద్వారా ఏమీ మర్చిపోరు. అవన్నీ గుర్తున్నా, భక్తి పాత్ర పూర్తి అయ్యిందని, మనమిప్పుడు తిరిగి ఇంటికి వెళ్లాలని, ఈ పతిత ప్రపంచములో ఇక ఉండేది లేదనే జ్ఞానముంది. ఇంటికి వెళ్ళాలంటే సంతోషం ఉండాలి కదా. ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి అని పిల్లలైన మీకు తెలుపబడింది. ఈ రాజధానిని స్థాపన చేయడంలో మీరు మీ వద్ద గల రెండు పైసలు ఉపయోగిస్తారు. అది కూడా కల్పక్రితము చేసినట్లే చేస్తారు. మీరు కూడా కల్పక్రితములోని వారే. బాబా, మీరు కూడా కల్పక్రితము వారే అని మీరంటారు. మనము కల్ప-కల్పము బాబా ద్వారా చదువుకుంటాము. శ్రీమతముపై నడుచుకుని శ్రేష్ఠంగా అవ్వాలి. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మా రాజధానిని శ్రీమతము ఆధారంగా స్థాపన చేస్తున్నామని మీకు సంతోషంగా ఉంది. తండ్రి కేవలం పవిత్రులుగా అవ్వండి అని చెప్తున్నారు. మీరు పవిత్రంగా అయితే ప్రపంచమంతా పవిత్రమవుతుంది. అందరూ తిరిగి వెళ్లిపోతారు. మిగిలిన విషయాలను గురించి మనమెందుకు చింతించాలి? శిక్షలెలా అనుభవిస్తారు? ఏమవుతుంది? వీటిని గురించి మనకెందుకు? మనకు మన గురించిన చింత ఉండాలి. ఇతర ధర్మాలకు చెందినవారి గురించి మనకెందుకు? మనము ఆదిసనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారము. వాస్తవానికి దీని పేరు భారతదేశము. కాని తర్వాత దీనికి హిందుస్థాన్ అని పేరు పెట్టారు. 'హిందు' అనేది ఏ ధర్మమూ కాదు. మనము దేవతా ధర్మము వారమని వ్రాసినా, వారు హిందువులని వ్రాసుకుంటారు. ఎందుకంటే దేవీ దేవతా ధర్మము ఎప్పుడుండేదో వారికి తెలియదు. ఎవ్వరికీ అర్థము కాదు. ఇప్పుడింత మంది బి.కె.లున్నారు, ఇది ఒక కుటుంబమయింది కదా. ఇల్లు అయింది కదా! బ్రహ్మా ప్రజాపిత, వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మొట్టమొదట మీరు బ్రాహ్మణులుగా అవుతారు, తర్వాత మిగిలిన వర్ణాలలోకి వస్తారు.

ఇది మీ కాలేజి, యూనివర్సిటీ, ఆసుపత్రి కూడా. జ్ఞానాంజనము సద్గురువిస్తూనే అజ్ఞాన అంధకారము వినాశనము........ అని మహిమ కూడా ఉంది. యోగబలముతో మీరు ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్డీ(సదా ఆరోగ్యవంతులు, సదా ఐశ్వర్యవంతులుగా) అవుతారు. ప్రకృతి చికిత్స చేయిస్తారు కదా. మీ ఆత్మ ఇప్పుడు నయమైతే శరీరము కూడా నయమవుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రకృతి చికిత్స. 21 జన్మలకు ఆరోగ్యము, సంపద, సంతోషం లభిస్తాయి. బోర్డు పైన ఆత్మిక ప్రకృతి చికిత్స అని వ్రాయండి. మానవులను పవిత్రంగా చేసేందుకు యుక్తులు వ్రాయడంలో ఏ నష్టమూ లేదు. పతితమయింది ఆత్మనే. అందుకే కదా పిలుస్తూ ఉంది. ఆత్మ మొదట సతోప్రధానంగా, పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రమైపోయింది, మళ్లీ పవిత్రంగా ఎలా అవ్వాలి? భగవానువాచ - మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు పవిత్రమైపోతారు. బాబా ఎన్నో యుక్తులు తెలుపుతారు - ఇలా ఇలా బోర్డులో వ్రాయండని చెప్తారు. కానీ ఎవ్వరూ ఇటువంటి బోర్డు పెట్టలేదు. ముఖ్యమైన చిత్రాలు పెట్టారు. లోపలకు ఎవరైనా వస్తే చెప్పండి - మీరు ఆత్మ, పరంధామములో ఉండేవారు, ఇక్కడ ఈ ఇంద్రియాలు పాత్రను అభినయించేందుకు లభించాయి. ఈ శరీరము వినాశనమయ్యేది కదా. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి. ఇప్పుడు మీ ఆత్మ అపవిత్రంగా ఉంది. పవిత్రమైతే ఇంటికి వెళ్లిపోతారు. అర్థం చేయించడం చాలా సులభము. కల్పక్రితము వారే వచ్చి పుష్పాలుగా అవుతారు. ఇందులో భయపడే మాటే లేదు. మీరేమో మంచి మాటలు వ్రాస్తారు. ఆ గురువులు కూడా మంత్రమిస్తారు కదా. తండ్రి కూడా "మన్మనాభవ ” మంత్రమునిచ్చి, రచయిత-రచనల రహస్యమంతా అర్థం చేయిస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలము తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కూడా తండ్రి పరిచయమివ్వండి. లైట్ హౌస్ గా కూడా అవ్వండి.

పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అయ్యేందుకు గుప్త శ్రమ చాలా చేయాలి. నేను ఆత్మలను చదివిస్తున్నానని తండ్రికెలా తెలుసో, అలా పిల్లలైన మీరు కూడా ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయండి. నోటితో 'శివ, శివ' అని పలికే అవసరము కూడా లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, ఎందుకంటే తల పై పాపాల భారము చాలా ఉంది. స్మృతి ద్వారా మాత్రమే మీరు పావనంగా అవుతారు. కల్పక్రితము ఎలా ఎలా ఎవరెవరు వారసత్వము తీసుకొని ఉంటారో వారే తమ తమ సమయానుసారముగా మళ్లీ తీసుకుంటారు. మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. ముఖ్యమైన విషయము - దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే మాయతో చెంపదెబ్బలు తినరు. దేహాభిమానంలోకి వచ్చినట్లయితే ఏదో ఒక వికర్మ జరుగుతుంది, తర్వాత అది 100 రెట్లు పాపంగా అవుతుంది. మెట్లు దిగడంలో 84 జన్మలు పట్టాయి. ఇప్పుడు మళ్లీ ఎక్కే కళ ఒక్క జన్మలోనే జరుగుతుంది. బాబా వచ్చారు కనుక లిఫ్ట్ కూడా కనుగొన్నారు. పూర్వము నడుముకు చేతిని ఆధారమిచ్చి మెట్లు ఎక్కేవారు. ఇప్పుడు సులభంగా వెళ్లేందుకు లిఫ్ట్ కనుగొన్నారు. ముక్తి-జీవన్ముక్తులకు ఒక్క సెకండులో వెళ్లేందుకు ఇది కూడా ఒక లిఫ్ట్. జీవన బంధనములోకి వచ్చేందుకు 5 వేల సంవత్సరాలు, 84 జన్మలు పట్టాయి. జీవన్ముక్తిలోకి వెళ్లేందుకు ఒక్క జన్మ పడుతుంది. ఎంత సులభము! మీకన్నా కూడా ఎవరైతే వెనుక వస్తారో వారు కూడా వెంటనే ఎక్కేస్తారు. పోగొట్టుకున్న వస్తువును ఇచ్చేందుకు తండ్రి వచ్చారని అర్థము చేసుకుంటారు. వారి మతమును తప్పకుండా నడుస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అత్మిక పిల్లలకు మాత - పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎలాంటి చింతా లేకుండా మీ గుప్త రాజధానిని శ్రీమతము ఆధారంగా స్థాపన చేయాలి. విఘ్నాలను పట్టించుకోకూడదు. కల్పక్రితము ఎవరైతే సహాయము చేశారో వారే ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారని బుద్ధిలో ఉండాలి. చింతించే పనే లేదు.

2. ఇప్పుడు మాది వానప్రస్థ అవస్థ, తిరిగి ఇంటికి వెళ్తున్నామని సదా సంతోషంగా ఉండాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు గుప్త శ్రమ చాలా చేయాలి. ఏ వికర్మలు చేయరాదు.

వరదానము:-

స్నేహము మరియు సహయోగము యొక్క విధి ద్వారా యజ్ఞ సహయోగులుగా అయ్యే సహజయోగి భవ

బాప్ దాదాకు పిల్లల స్నేహమే ఇష్టము. ఎవరైతే యజ్ఞ స్నేహీలుగా, సహయోగులుగా అవుతారో వారే స్వతహాగా సహజయోగులుగా అవుతారు. సహయోగమే సహజయోగము. హృదయము కలిగిన తండ్రికి హృదయపూర్వక స్నేహము మరియు హృదయపూర్వక సహయోగాలే ప్రియమైనవి. చిన్న హృదయము గలవారు చిన్న వ్యాపారము చేసి సంతోషిస్తారు. విశాల హృదయం గలవారు అనంతమైన వ్యాపారము చేస్తారు. విలువ స్నేహానికి ఉంది, వస్తువుకు కాదు. అందుకే కుచేలుని అటుకులు మహిమ చేయబడ్డాయి. ఎవరు ఎంత ఇచ్చినా స్నేహం లేకుంటే జమ కాదు. స్నేహంతో కొంచెం జమ చేస్తే అది పదమాలు అయిపోతుంది.

స్లోగన్:-

సమయము మరియు శక్తులు వ్యర్థమవ్వకుండా ఉండేందుకు మొదట ఆలోచించండి, తర్వాత చేయండి.