05-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ- మీరు ఈ పాత ప్రపంచము నుండి, పాత శరీరం నుండి జీవిస్తూనే మరణించి ఇంటికి వెళ్ళాలి, కావున దేహాభిమానాన్ని వదిలి దేహీఅభిమానులుగా అవ్వండి.’’

ప్రశ్న:-

మంచి మంచి పురుషార్థీ పిల్లల గుర్తులు ఏమిటి?

జవాబు:-

మంచి పురుషార్థం చేసే పిల్లలు ఉదయమే లేచి దేహీ అభిమానిగా ఉండే అభ్యాసం చేస్తారు. వారు ఒక్క బాబానే స్మృతిచేసే పురుషార్థం చేస్తారు, ఇక ఏ దేహధారుల స్మృతి రాకూడదని, నిరంతరము బాబా మరియు 84 జన్మల చక్రము గుర్తుండాలి అనే లక్ష్యము వారిలో ఉంటుంది. ఇది కూడా అహో సౌభాగ్యము అంటాము.

ఓంశాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు జీవిస్తూ మరణించారు. ఎలా మరణించారు? దేహ అభిమానాన్ని వదిలేస్తే ఇక ఆత్మమాత్రమే మిగులుతుంది. శరీరము నశిస్తుంది కానీ ఆత్మ నశించదు, జీవిస్తూ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పరంపిత పరమాత్మతో మీ బుద్ధియోగాన్ని జోడించండి, తద్వారా ఆత్మ పవిత్రముగా అయిపోతుందని బాబా తెలియచేస్తున్నారు. ఎప్పటివరకైతే ఆత్మ పూర్తిగా పవిత్రముగా అవ్వదో అప్పటివరకూ ఆత్మకు పవిత్ర శరీరము లభించదు. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఈ పాత శరీరము దానంతట అదే తొలగిపోతుంది. సర్పము తన కుబుసాన్ని వదిలేసినప్పుడు, ఆ పాత శరీరంపై తనకున్న మమత్వం తొలగిపోతుంది. ఈ శరీరాన్ని వదిలితే క్రొత్తది లభిస్తుంది అని దానికి తెలుసు. ప్రతీ జీవికి తన బుద్ధి ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీకు, మేము జీవిస్తూ ఈ పాత శరీరం నుండి, పాత ప్రపంచం నుండి మరణించామని తెలుసు. ఆత్మలైన మీరు శరీరాన్ని వదిలి ఎక్కడకు వెళతారు? మీ ఇంటికి వెళతారు. అన్నిటికన్నా ముందు నేను ఒక ఆత్మను, ఈ శరీరాన్ని కాను అన్న విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి. బాబా, మేము మీ వారిగా అయ్యాము, జీవిస్తూ మరణించాము అని ఆత్మయే అంటుంది. తండ్రినైన నన్ను స్మృతి చేయడము ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారని ఇప్పుడు ఆత్మలకు ఆజ్ఞ లభించింది. ఈ స్మృతి అభ్యాసమును పక్కా చేసుకోవాలి. బాబా, మీరు వస్తే మేము మీ వారిగా అవుతాము అని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, స్త్రీ కాదు, ఎల్లప్పుడూ భాయీ, భాయీ అనే అంటారు. అంతేకానీ మనమందరమూ సోదరీలమని అనరు. పిల్లలందరికీ వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని బాలికగా భావించినట్లయితే వారసత్వము ఎలా లభిస్తుంది, ఆత్మలందరూ సోదరులే, ఆత్మిక పిల్లలారా నన్ను స్మృతి చేయండి అని బాబా అందరికీ చెబుతున్నారు. ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. పిల్లలకు స్మృతి అంతగా నిలవదు. సన్యాసులు ఒక దష్టాంతాన్ని ఇస్తారు- నేను ఎద్దును, నేను ఎద్దును అని భావించడం ద్వారా ఎద్దులా అయిపోతారు అని అంటారు. కానీ, వాస్తవానికి ఎవరూ ఎద్దులా తయారవరు. బాబా ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. ఈ ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానము ఎవరిలోనూ లేదు. కావుననే వారు ఇటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. నేను ఒక ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లి కొత్త శరీరాన్ని ధరించాలి అని గుర్తుంచుకోవాలి. మనుష్యులు ఆత్మ ఒక బిందువని, భ్రుకుటి మధ్యలో ఉంటుందని అంటారు. కానీ, మళ్ళీ ఆత్మ ఒక ఆంగుష్ఠ రూపంలో ఉంటుందని అంటారు, వాస్తవానికి ఒక బిందువు ఎక్కడ! అంగుష్ట రూపము ఎక్కడ! అలాగే మట్టితో సాలిగ్రామాలను తయారుచేస్తారు. ఆత్మ ఇంత పెద్దగా అయితే ఉండదు కదా. మనుష్యులు దేహాభిమానులు కదా, కావుననే వాటిని పెద్దగా తయారుచేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మనుష్యులు ఏకాంతంలో, గదిలో కూర్చుని భక్తి చేస్తూ ఉంటారు. కానీ, మీరు గహస్థ వ్యవహారాలలో ఉంటూ, వ్యాపారాలూ మొదలైనవి చేసుకుంటూ, నేను ఒక ఆత్మను అని బుద్ధిలో పక్కా చేసుకోవాలి. నేను మీ అందరికీ తండ్రిని, ఒక చిన్న బిందువును అని బాబా తెలియచేస్తున్నారు. నాలో జ్ఞానమంతా ఉంది, అలాగని నేను పెద్దగా ఉంటానని కాదు. ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరూ ఒకేలా ఉంటారు. కేవలం అతనిని సుప్రీం అనగా పరమాత్మ అని అంటారు. డ్రామాలో ఈ విధంగా ఉంది, నేను అమరుడిని అని బాబా అంటున్నారు. నేను అమరుణ్ణి కానట్లయితే మిమ్మల్ని పావనముగా ఎలా తయారుచేస్తాను? మిమ్మల్ని మధురమైన పిల్లలూ, అని ఎలా అంటాను? ఆత్మయే అన్నీ చేస్తుంది. బాబా వచ్చి దేహీ అభిమానిగా తయారుచేస్తారు. ఇందులోనే శ్రమపడవలసి ఉంటుంది. కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇంకెవరినీ స్మృతి చేయకండి అని బాబా అంటారు. ప్రపంచంలో యోగులు ఎంతోమంది ఉన్నారు. నిశ్చితార్థము అయినతరువాత కన్యకు తన పతితో యోగము లగ్నమౌతుంది. పతిని చూసిన తరువాత అతడి స్మృతిలో ఉంటుంది. ఇంతకుముందు ఈ స్మృతి లేదుకదా, ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. దీని అభ్యాసం చాలా బాగా ఉండాలి. మంచి మంచి పురుషార్థీ పిల్లలు ఉదయమే లేచి దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేస్తారు. భక్తి కూడా ఉదయమే చేస్తారు. వారి వారి ఇష్ట దేవతలను స్మృతి చేస్తూ ఉంటారు. హనుమంతుడిని కూడా ఎంతగా పూజిస్తూ ఉంటారు? కానీ, వారికి ఏమీ తెలియదు. మీ బుద్ధి కోతిబుద్ధిలా అయిపోయిందని బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు దేవతలుగా తయారౌతున్నారు. ఇప్పుడు ఇది పతిత తమోప్రధాన ప్రపంచము. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. నేను పునర్జన్మ రహితుడను, ఈ శరీరము ఈ దాదాది, నాకు ఎటువంటి శరీరపు పేరు లేదు. నా పేరు కళ్యాణకారి శివ. కళ్యాణకారి అయిన శివబాబా వచ్చి నరకాన్ని స్వర్గముగా చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఎంత కళ్యాణము చేస్తారు! నరకాన్ని పూర్తిగా వినాశనం చేసేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఇది ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి. ఒకరికొకరు మన్మనాభవ అని సావధానపరుచుకోవాలి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెబుతున్నారు. పతితపావనుడైతే తండ్రి కదా, ‘‘భగవానువాచ’’కి బదులుగా ‘‘కృష్ణభగవానువాచ’’ అని వారు తప్పుగా వ్రాశారు. భగవంతుడు నిరాకారుడు, అతడిని పరంపిత పరమాత్మ అని అంటారు. అతని పేరు శివ, శివుని పూజ కూడా చాలా జరుగుతూ ఉంటుంది. శివకాశీ, శివకాశీ అని అంటూ ఉంటారు. భక్తిమార్గములో అనేక రకాల పేర్లు పెట్టేశారు. సంపాదన కోసము అనేక మందిరాలను నిర్మించారు. అసలు నామము శివ, తరువాత సోమనాథుడు అని పేరు పెట్టారు, సోమనాథుడు సోమరసమును త్రాగిస్తాడు, జ్ఞానధనమును ఇస్తారు. తిరిగి పూజారిగా తయారైన తరువాత అతని మందిరాలను నిర్మించడానికి ఎంత ఖర్చుచేశారు! ఎందుకంటే సోమరసము ఇచ్చారు కదా! సోమనాథుడితో పాటు సోమనాథిని కూడా ఉండాలి. యథారాజా తథాప్రజా అందరూ సోమనాథ సోమనాథినులే. మీరు స్వర్ణిమ ప్రపంచములోకి వెళతారు అక్కడ బంగారపు ఇటుకలు ఉంటాయి. లేకపోతే అక్కడ గోడలు ఎలా తయారౌతాయి! అక్కడ చాలా బంగారము ఉంటుంది. అందుకే దానిని స్వర్ణిమ ప్రపంచము అని అంటారు. ఇది రాళ్ళ మరియు లోహపు ప్రపంచము. స్వర్గము పేరు వినగానే అందరికీ నోరూరుతుంది. విష్ణువు రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు వేరువేరుగా అవుతారు కదా. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు మీరు రావణపురిలో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెబుతున్నారు. తండ్రి కూడా పరంధామములోనే ఉంటారు. ఆత్మలైన మీరు కూడా పరంధామములోనే ఉంటారు. మీకు ఎటువంటి కష్టమునూ ఇవ్వను అని తండ్రి చెబుతున్నారు. ఇది చాలా సహజము. కానీ, ఈ రావణుడు అనే శత్రువు మీ ముందు నిల్చొని ఉన్నాడు. ఇతడు విఘ్నాలను సృష్టిస్తాడు. జ్ఞానములో విఘ్నమైతే రాదు, స్మృతిలోనే విఘ్నము వస్తూ ఉంటుంది. ఘడియ ఘడియ ఈ మాయ స్మృతిని మరపింపచేస్తుంది. దేహాభిమానములోకి తీసుకువస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు, ఈ యుద్ధము జరుగుతూ ఉంటుంది. మీరు కర్మయోగులు కదా! అని బాబా చెబుతున్నారు. మరి దినములో స్మృతిచేయలేకపోతే రాత్రిలోనైనా స్మృతి చేయాలి. రాత్రి చేసిన అభ్యాసము దినములో కూడా ఉపయోగ పడుతుంది.

నిరంతరం స్మృతిలో ఉండాలి - విశ్వానికి యజమానులుగా చేసే తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి మరియు 84 జన్మల చక్రము స్మృతిలో ఉంటే అదే మహా సౌభాగ్యము. సోదరీసోదరులారా, ఇప్పుడు కలియుగము అంతమైపోయి సత్యయుగము వస్తుంది అని అందరికీ వినిపించాలి. సత్యయుగములోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కలియుగము తరువాత సత్యయుగము రావాలి. ఒక్క తండ్రి స్మృతి తప్పితే ఇంక ఎవరి స్మృతి ఉండకూడదు. వానప్రస్థులు సన్యాసుల వద్దకు వెళ్ళి వారి సాంగత్యము చేస్తారు. వానప్రస్థములో వాణి యొక్క అవసరము లేదు. ఆత్మ శాంతిలో ఉంటుంది కానీ, లీనమైతే కాదు. డ్రామా నుండి ఏ నటుడూ బయటకు వెళ్ళలేరు. ఒక్క బాబాను తప్ప ఇంకెవరినీ స్మృతి చేయకూడదని బాబా అర్థం చేయించారు. అందరినీ చూస్తున్నా ఎవరినీ స్మృతి చేయకూడదు. ఈ పాత ప్రపంచము వినాశనమైపోతుంది, ఇది ఒక స్మశానము కదా. శవాలను ఎవరన్నా స్మృతి చేస్తారా, వీరందరూ చనిపోయి ఉన్నారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి పతితులను పావనముగా చేసి నాతో తీసుకొని వెళతాను. ఇక్కడివన్నీ నాశనమైపోతాయి. ఈరోజుల్లో బాంబులు మొదలైనవి ఏవైతే తయారుచేస్తున్నారో అవన్నీ చాలా శక్తివంతంగా తయారుచేస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఎవరిమీదైతే వేయాలని అనుకుంటామో అవి వెళ్ళి వారి మీదే పడతాయి అని వారు అంటారు. ఇదంతా రచింపబడే ఉంది. మళ్ళీ వినాశనము జరుగనుంది. ఇప్పుడు భగవంతుడు వచ్చి క్రొత్త ప్రపంచము కోసము రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. శాస్త్రాలలో గాయనము చేయబడ్డ మహాభారత యుద్ధము ఇదే. తప్పకుండా భగవంతుడు స్థాపన మరియు వినాశనము చేసేందుకు వస్తారు. చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మేము ఈ విధంగా తయారౌతాము అని మీరు సాక్షాత్కారము పొందుతారు. ఆ తరువాత ఇక్కడి ఈ చదువు పూర్తవుతుంది. అక్కడ బారిస్టర్లు మరియు డాక్టర్ల అవసరము ఉండదు. మీరు ఇక్కడి వారసత్వాన్ని తీసుకొని వెళతారు. నైపుణ్యం అన్నీ కూడా ఇక్కడి నుండే తీసుకొని వెళతారు. భవనాలు మొదలైనవి తయారుచేసేవారు ఫస్ట్క్లాస్గా ఉన్నట్లయితే వారు అక్కడ కూడా తయారుచేస్తారు. అక్కడ బజారులు మొదలైనవి కూడా ఉంటాయి కదా. అన్ని పనులూ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేర్చుకొన్న తెలివిని అక్కడకు తీసుకొని వెళతారు. విజ్ఞానము నుండి కూడా మంచి తెలివిని నేర్చుకుంటారు. ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి. వారు ప్రజల్లోకి వెళతారు, కానీ, పిల్లలైన మీరు ప్రజల్లోకి రాకూడదు. మీరు బాబా మరియు మమ్మాల సింహాసనాన్ని పొందేందుకే ఇక్కడకు వచ్చారు. బాబా ఇచ్చే శ్రీమతముపైన నడవాలి. నన్ను స్మృతి చేయండి అనే ఫస్ట్క్లాస్ అయిన శ్రీమతాన్ని బాబా ఇస్తారు. కొందరి భాగ్యము అనాయాసముగా కూడా తెరుచుకొంటుంది. ఏదో ఒక కారణము నిమిత్తంగా అవుతుంది. పెళ్ళిచేసుకోవడము స్వయాన్ని నాశనము చేసుకోవడము వంటిదని, ఈ బురదలో పడకండి అని బాబా కుమారీలకు తెలియచేస్తున్నారు. మీరు బాబా చెప్పిన మాటను వినరా? స్వర్గ మహారాణులుగా అవ్వరా! మేము ఆ ప్రపంచములోకి ఎన్నడూ వెళ్ళమని, ఆ ప్రపంచాన్ని అసలు స్మృతి చేయమని స్వయంలో ప్రతిజ్ఞ చేసుకోవాలి. స్మశానాన్ని ఎవరన్నా స్మృతి చేస్తారా? ఈ శరీరం వదలుతూనే మేము మా స్వర్గానికి వెళతాము అని మీరు ఇక్కడ అంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి మనం తిరిగి మన ఇంటికి వెళతాము. ఇతరులకు కూడా ఈ విషయాన్ని వినిపించండి, బాబా తప్ప ఇంకెవరూ సత్యయుగరాజ్యాన్ని ఇవ్వలేరని కూడా మీరు అర్థం చేసుకున్నారు.

ఈ రథానికి కూడా తన కర్మభోగము ఉంటుంది కదా! బాప్దాదా మధ్య కూడా పరస్పరం ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంటుంది. బాబా, ఆశీర్వదించండి, ఈ దగ్గుకి ఏదైనా మందు ఇవ్వండి లేక దీనిని మాయం చేయండి అని బ్రహ్మా బాబా అంటారు. కానీ అలా వీలులేదని, దీనిని అనుభవించవలసిందేనని బాబా అంటారు. నేను నీ రథాన్ని తీసుకుంటాను కావున దానికి అద్దెను ఇస్తాను, ఇక ఇది నీ లెక్కాచారానికి సంబంధించినది. అంతిమము వరకూ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. నిన్ను ఆశీర్వదించినట్లయితే మరి అందరినీ ఆశీర్వదించవలసి ఉంటుంది కదా! ఈ రోజు ఈ కన్య ఇక్కడ కూర్చుంది, మళ్ళీ రైల్లో వెళ్లేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగి మరణించినట్లయితే, బాబా దానిని డ్రామా అని అంటారు. మరి బాబా ముందే ఎందుకు చెప్పలేదు అని అనడానికి వీలులేదు, ఎందుకంటే అలా చెప్పడము ‘లా’లో లేదు. నేను పతితుల నుండి పావనముగా తయారుచేసేందుకు వస్తానే కానీ, ఇవన్నీ చెప్పేందుకు కాదు. ఈ లెక్కాచారాలన్నింటినీ మీకు మీరే సమాప్తం చేసుకోవాలి. ఇందులో ఆశీర్వాదము విషయమే లేదు. కావాలంటే దీనికోసం సన్యాసుల వద్దకు వెళ్ళండి. బాబా అయితే ఒకే విషయాన్ని తెలియజేస్తారు. నరకము నుండి స్వర్గములోకి తీసుకెళ్ళేందుకే నన్ను మీరందరూ పిలిచారు. పతితపావనా సీతారాం అని కూడా పాడతారు కానీ, దానికి తప్పుడు అర్థాన్ని చూపించారు. శ్రీరాముడిని రఘుపతి రాఘవ రాజారాం అని మహిమ చేస్తూ ఉంటారు. ఈ భక్తిమార్గములో మీరు ఎంత ధనాన్ని వ్యర్థం చేశారు! ఒక గీతము కూడా ఉంది కదా, దేవతల మూర్తులను తయారుచేసి, వాటిని పూజించి, మళ్ళీ సముద్రములో ముంచేస్తారు. ఎంత తెలివి తక్కువవారిగా అయ్యారో ఇప్పుడు అర్థమౌతుంది. ఎంత ధనమును వ్యర్థము చేస్తూ ఉంటారు. మళ్ళీ కూడా ఇలా జరుగుతుంది. సత్యయుగములో ఇటువంటివేమీ ఉండవు. ఘడియ ఘడియ డ్రామాలో నిర్ణయింపబడి ఉంది.కల్పము తరువాత తిరిగి ఇదే విషయము పునరావృతమవుతుంది.డ్రామాని చాలా బాగా అర్థం చేసుకోవాలి. మరి ఎవరైనా ఎక్కువగా గుర్తుంచుకోలేకపోతే కేవలము బాబాను మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకోండి అని బాబా చెబుతున్నారు. మేము ఆత్మలము, 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాము అని లోలోపల ఇదే చింతన ఉండాలి. చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజము, ఇది ఆత్మిక పిల్లలతో బాబా చేసే ఆత్మిక సంభాషణ, బాబా తన పిల్లలతోనే ఈ ఆత్మిక సంభాషణ చేస్తారు, ఇంకెవ్వరితోనూ చెయ్యరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. మీరు 84 జన్మలు తీసుకున్నారని బాబా గుర్తు చేస్తున్నారు. మనుష్యులుగానే అయ్యారు. . ఏవిధంగానైతే బాబా వికారాలలోకి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించారో, అలాగే ఎవ్వరూ ఏడవకూడదు అని కూడా ఆజ్ఞాపించారు. సత్య త్రేతాయుగాలలో ఎవ్వరూ ఏడవరు,అక్కడ చిన్నపిల్లలు కూడా ఏడవరు. ఏడ్చేందుకు అనుమతి లేదు.ఆ ప్రపంచమే హర్షితంగా ఉండే ప్రపంచము.హర్షితంగా ఉండేందుకు ఇక్కడే పూర్తి అభ్యాసము చేయాలి. అచ్ఛా!

మధురాతిమధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్దాదాల ప్రియస్మతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రిని ఆశీర్వాదము అడిగేందుకు బదులుగా స్మృతియాత్ర ద్వారా మీ లెక్కాచారాలన్నింటిని అంతం చేసుకోవాలి. పావనంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి.

2. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా స్మృతి చేయకూడదు. కర్మయోగిగా అవ్వాలి, సదా హర్షితంగా ఉండే అభ్యాసం చెయ్యాలి, ఎప్పుడూ ఏడవకూడదు.

వరదానము:-

సర్వులపట్ల శుభభావము మరియు శ్రేష్ఠభావనను ధారణచేసే హంసబుద్ధీ హోలీ హంస భవ.

హంస బుద్ధి కలవారు అనగా సదా ప్రతి ఆత్మపట్ల శ్రేష్ఠంగా మరియు శుభముగా ఆలోచించేవారు. వారు మొదట ప్రతి ఆత్మ యొక్క భావమును పరిశీలించి ధారణ చేస్తారు. ఎప్పుడూ బుద్ధిలో ఏ ఆత్మపట్ల అశుభమైన మరియు సాధారణమైన భావము ధారణ అవ్వకూడదు. సదా శుభభావనను మరియు శుభభావమును ఉంచేవారే హోలీ హంసలు. వారు ఏ ఆత్మ యొక్క అకళ్యాణ విషయాలనైనా వింటూ చూస్తూ కూడా ఆ అకళ్యాణమును కళ్యాణ వృత్తితో మార్చివేస్తారు. వారి దృష్టి ప్రతి ఆత్మపట్ల శ్రేష్ఠముగా మరియు శుద్ధ స్నేహంతో కూడుకున్నదై ఉంటుంది.

స్లోగన్:-

ప్రేమతో నిండుగా ఉన్న ఎటువంటి గంగలుగా అవ్వాలంటే మీ ద్వారా ప్రేమసాగరుడైన బాబా కనిపించాలి.