18-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - సదా ఇదే నషాలో ఉండండి - మాది పదమాపదమ్‌ భాగ్యము, స్వయం పతితపావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాము, వారి నుండి మాకు అనంతమైన సుఖ వారసత్వము లభిస్తుంది.''

ప్రశ్న :-

పిల్లలైన మీరు ఏ ధర్మాన్ని కూడా తిరస్కరించరాదు, ద్వేషించరాదు ఎందుకు?

జవాబు :-

ఎందుకంటే మీకు బీజము, వృక్షము గురించి తెలుసు. ఇది మానవ సృష్టిరూపి అనంతమైన వృక్షమని మీకు తెలుసు. ఇందులో ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర ఉంది. నాటకములో పాత్రధారులెవ్వరూ ఒకరినొకరు ద్వేషించుకోరు. ఈ నాటకములో మనము హీరో - హీరోయిన్‌ పాత్రను అభినయించామని మీకు తెలుసు. మనము చవి చూసిన సుఖమును ఇతరులెవ్వరూ చూడలేరు. పూర్తి విశ్వము పై మేము రాజ్యపాలన చేసేవారమని మీకు అపారమైన సంతోషముంది.

ఓంశాంతి.

ఓంశాంతి అంటూనే ఇంతవరకు లభించిన జ్ఞానమంతా పిల్లల బుద్ధిలోకి వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానముంది? ఇది మానవ సృష్టి రూపి వృక్షము. దీనిని కల్పవృక్షమని కూడా అంటారు, దీని ఉత్పత్తి, పాలన, వినాశనము ఎలా జరుగుతుందో అదంతా మీ బుద్ధిలోకి రావాలి. ఈ చైతన్య వృక్షము కూడా ఆ జడ వృక్షము వంటిదే. ఈ వృక్ష బీజము కూడా చైతన్యమైనదే. సత్యము, చైతన్యము అని వారిని కూడా మహిమ చేస్తారు అనగా వృక్షం ఆది-మధ్య-అంత్య రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. వారి కర్తవ్యము ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ కర్తవ్యమును కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మను ఎవ్వరూ స్మృతి చేయరు, వారి గురించి తెలియనే తెలియదు. అజ్మీర్‌లో బ్రహ్మ దేవాలయముంది. త్రిమూర్తి చిత్రములో బ్రహ్మ-విష్ణు-శంకరుల చిత్రాలను అచ్చు వేయిస్తారు. అందులో బ్రహ్మ, విష్ణువు, శంకరులంటారు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. ఈ సమయములో ఉన్న బ్రహ్మను దేవత అని అనరని, సంపూర్ణమైనప్పుడు దేవత అని అంటారని, సంపూర్ణమై సూక్ష్మవతనానికి వెళ్లిపోతారని పిల్లలైన మీకు తెలుసు.

మీ తండ్రి పేరు ఏమిటి? అని బాబా అడుగుతారు. ఎవరిని అడుగుతారు? ఆత్మను. ఆత్మ ''నా బాబా'' అని అంటుంది. జవాబు తెలియనివారు ప్రశ్న అడగలేరు. ఇప్పుడు అందరికీ ఇద్దరు తండ్రులున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇతను శివబాబా రథమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా ఈ రథము ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒకటేమో ఇది - శరీరము గల బ్రహ్మ ఆత్మకు రథము, రెండవది - శరీరము లేని ఆత్మిక తండ్రికి కూడా రథము. ఆత్మి తండ్రికి సుఖసాగరులు, శాంతిసాగరులు.......... అని మహిమ ఉంది. మొదట వీరు బేహద్‌ తండ్రి అని, వీరి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుందని బుద్ధిలో ఉంది. మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. పతితపావనా! రండి అని నిరాకార తండ్రిని పిలుస్తారు. పిలిచేది ఆత్మనే. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు తండ్రిని పిలువరు. పతితంగా ఉన్నప్పుడు పిలుస్తారు. ఆ పతితపావనుడైన తండ్రి ఈ శరీరములో వచ్చారని ఆత్మలైన మీకు తెలుసు. మనము వారికి చెందినవారిగా అయ్యామని మర్చిపోరాదు. ఇది సౌభాగ్యమే కాదు, పదమ్‌ భాగ్యపు విషయము. అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? ఈ సమయములో తండ్రి వచ్చారు - ఇది క్రొత్త మాట. శివజయంతి కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. మరి వారు ఒక్కసారి తప్పకుండా వస్తారు కదా. లక్ష్మీనారాయణులు సత్యయుగములో ఉండేవారు. ఈ సమయములో వారు లేరు. వారు పునర్జన్మ తీసుకొని ఉంటారని అర్థం చేయించాలి. 16 కళల నుండి 14-12 కళలకు వచ్చి ఉంటారు. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. సత్యయుగమని నూతన ప్రపంచమును అంటారు. అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి. దేవతా ధర్మము అను పేరు కూడా మహిమ చేయబడ్తుంది. ఆ దేవతలే వామమార్గములోకి(వేద విరుద్ధమైన తంత్ర - మంత్రములతో కూడి మద్య, మాంస, మైధునాలకు తావిచ్చెడి విధానములోకి) పోయినప్పుడు, వారిని క్రొత్తవారు అని కూడా పిలువరు, దేవతలని కూడా పిలువరు. మేము వారి వంశావళి అని కూడా ఎవ్వరూ అనరు. స్వయాన్ని వారి వంశావళి అని భావిస్తే వారిని మహిమ చేస్తూ స్వయాన్ని ఎందుకు నిందించుకుంటారు? దేవతలను మహిమ చేస్తున్నారంటే, వారిని పవిత్రంగా భావిస్తూ, స్వయాన్ని అపవిత్ర పతితులుగా భావిస్తున్నారు. పావనము నుండి పతితులుగా అవుతారు, పునర్జన్మ తీసుకుంటారు. మొట్టమొదట ఎవరు పావనంగా ఉన్నారో తర్వాత వారే పతితులుగా అయ్యారు. పావనము నుండి పతితంగా అయ్యామని మీకు తెలుసు. మీరు పాఠశాలలో చదువుతున్నారు. నంబరువారుగా ప్రథమ, ద్వితీయ తరగతులు ఉంటాయి కదా.

ఇప్పుడు మనలను తండ్రి చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. కనుకనే వారు వస్తారు కదా. లేకుంటే ఇక్కడకు వచ్చే అవసరము ఏముంది? ఇతను ఎలాంటి గురువు, మహాత్మ, మహాపురుషుడు కాదు. ఇతడిది కూడా సాధారణ మానవ శరీరమే. అది కూడా చాలా పాతది. అనేక జన్మల అంతిమములో ప్రవేశిస్తాను. అంతకంటే ఇతనికి(బ్రహ్మ) ఏ మహిమా లేదు. కేవలం ఇతడిలోనే ప్రవేశిస్తాను. నేను ప్రవేశించినప్పుడే ఇతనికి ఈ పేరు ఉంటుంది. లేకుంటే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? మనుష్యులు తప్పకుండా తికమకపడ్తారు కదా. తండ్రి మీకు అర్థం చేయించినందునే మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. బ్రహ్మకు తండ్రి ఎవరు? బ్రహ్మ, విష్ణువు, శంకరుల రచయిత ఈ శివబాబా. బుద్ధి పైకి వెళ్లిపోతుంది. ఇది పరంధామములో ఉన్న పరమపిత పరమాత్ముని రచన. బ్రహ్మ, విష్ణువు, శంకరుల కర్తవ్యాలు వేరు వేరుగా ఉన్నాయి. ఎవరైనా ముగ్గురు, నలుగురు కలిసి ఉన్నా ఎవరి పని వారికుంటుంది. ఎవరి పాత్ర వారిదే. ఎన్ని కోట్ల ఆత్మలున్నాయి - కానీ ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఈ అద్భుతమైన విషయాలన్నీ అర్థం చేయించబడ్తాయి. అనేకమంది మనుష్యులున్నారు. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. ఇది అంతిమ సమయము కదా. అందరూ వాపసు వెళ్లిపోతారు. మళ్లీ చక్రము పునరావృతము అవుతుంది. తండ్రి ఈ విషయాలన్నీ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. క్రొత్త విషయము కాదు. కల్పక్రితము కూడా అర్థము చేయించానని అంటున్నారు. వారు అత్యంత ప్రియమైన తండ్రి. అటువంటి తండ్రిని చాలా ప్రీతితో స్మృతి చేయాలి. మీరు కూడా తండ్రికి ప్రియమైన పిల్లలు కదా. తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. మొదట అందరూ ఒక్కరినే పూజించేవారు. భేదభావము ఉండేది కాదు. ఇప్పుడు అనేక భేద భావాలు ఏర్పడ్డాయి. వీరు రాముని భక్తులు, వారు కృష్ణుని భక్తులు. రాముని భక్తులు ధూపము వెలిగిస్తే, కృష్ణుని భక్తులు ముక్కు మూసుకుంటారు. ఇటువంటి మాటలు కూడా కొన్ని శాస్త్రాలలో ఉన్నాయి. వారు మా భగవంతుడు గొప్పవారు అని అంటారు. వీరు నా భగవంతుడు గొప్పవారు అని అంటారు, ఇద్దరు భగవంతులు ఉన్నారని భావిస్తారు. ఇది తప్పు భావమైనందున అన్నీ తప్పు పనులే, అన్యాయమైన పనులే చేస్తూ ఉంటారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! భక్తి భక్తే, జ్ఞానము జ్ఞానమే. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారంతా భక్తిసాగరులు. జ్ఞానము వలన సద్గతి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానవంతులుగా అయ్యారు. తండ్రి మీకు తమ పరిచయమును, పూర్తి చక్రము యొక్క పరిచయమును ఇచ్చారు. దీనిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. అందువలన తండ్రి అంటున్నారు - '' పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులు, పరమపిత పరమాత్మ అయితే ఒక్కరే. '' మిగిలిన వారంతా పిల్లలే. పరమపిత పరమాత్మ అని స్వయాన్ని ఎవ్వరూ చెప్పుకోలేరు. మంచి తెలివిగల మానవులు ఇది ఎంతో గొప్ప డ్రామా అని అర్థము చేసుకుంటారు. ఇందులోని పాత్రధారులందరూ అవినాశి పాత్రను అభినయిస్తారు. అక్కడ వినాశమయ్యే చిన్న నాటకాలుంటాయి. ఇది అనాది అవినాశి నాటకము. ఎప్పుడూ సమాప్తమయ్యేది కాదు. ఇంత చిన్న ఆత్మకు ఇంత పెద్ద పాత్ర లభించింది. శరీరము తీసుకోవడం, వదలడం, పాత్ర చేయడం ఈ విషయాలు ఏ శాస్త్ర్రాలలోనూ లేవు. దీనిని ఎవరైనా గురువులు వినిపించి ఉంటే వారికి ఇంకా చాలామంది శిష్యులయ్యేవారు కదా. కేవలం ఒక్క శిష్యుడుంటే దేనికి పనికి వస్తాడు? శిష్యుడు అనగా పూర్తిగా అనుసరించేవాడు. ఇతని డ్రస్సు మొదలైనవేవీ వారిలా లేవు. మరి ఇతడిని శిష్యుడు అని ఎవరంటారు? ఇక్కడ తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. ఆ తండ్రినే అనుసరించాలి. ఉదాహరణానికి మగపెళ్ళి వారి ఊరేగింపు ఉంటుంది కదా. అలాగే శివుని ఊరేగింపు అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - ఇది నా పెళ్ళి గుంపు. మీరందరూ భక్తులు, నేను భగవంతుడను. మీరంతా ప్రేయసులు, మిమ్ములను అలంకరించి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మరి మీకు ఎంత సంతోషముండాలి! ఇప్పుడు మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయిపోతారు. పవిత్రంగా అయినందున పవిత్రరాజ్యము లభిస్తుంది. నేను వచ్చేది అంత్యములో అని తండ్రి అర్థం చేయిస్తారు. నన్ను పిలిచేదే పావన ప్రపంచ స్థాపన చేసేందుకు, పతిత ప్రపంచ వినాశనము చేయించేందుకే. అందుకే నన్ను మహాకాలుడని కూడా అంటారు. మహాకాలుని మందిరము కూడా ఉంటుంది. కాలుని మందిరాలు చూస్తున్నారు కదా. శివుని కాలుడని అంటారు కదా. వచ్చి పావనంగా చేయమని వారిని పిలుస్తారు. వారు ఆత్మలను తీసుకెళ్తారు. అనంతమైన తండ్రి అనేక ఆత్మలను తీసుకెళ్లేందుకు వచ్చారు. వారు కాలులకు కాలుడు మహాకాలుడు. ఆత్మలన్నిటిని పవిత్రంగా, సుగంధభరిత పుష్పాలుగా మార్చి తీసుకెళ్తారు. సుగంధ పుష్పాలుగా అయితే తండ్రి కూడా ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. పవిత్రంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. భేదమైతే ఉంటుంది కదా. పాపము మిగిలి ఉంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా అలాగే ఉంటుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! చాలా చాలా మధురంగా అవ్వండి. కృష్ణుడు అందరికీ మధురమనిపిస్తాడు కదా. కృష్ణుని ఊయలలో ఎంత ప్రేమగా ఊపుతారు. ధ్యానములో కృష్ణుని చిన్న బాలునిగా చూసిన వెంటనే ఒడిలోకి తీసుకొని ప్రీతినిస్తారు. వైకుంఠములోకి వెళ్లిపోతారు. అక్కడ కృష్ణుని చైతన్య రూపములో చూస్తారు. నిజంగానే వైకుంఠము వస్తూ ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనము భవిష్యత్తులో ఇలా అవుతాము. శ్రీ కృష్ణునికి కళంకము ఆపాదిస్తారు. అదంతా తప్పే. పిల్లలైన మీకు మొదట నషా పెరగాలి. ప్రారంభములో చాలా సాక్షాత్కారాలు జరిగాయి. మళ్లీ చివర్లో చాలా అవుతాయి. ఈ జ్ఞానము ఎంతో రమణీకమైనది. ఎంత సంతోషముంటుంది! భక్తిమార్గములో సంతోషము ఏ మాత్రము ఉండదు. జ్ఞానములో ఎంత సుఖముందో భక్తిమార్గములోని వారికి తెలియనే తెలియదు. దానికి దీనికి పోలికే లేదు. పిల్లలైన మీకు మొదట ఈ నషా పెరగాలి. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఏ ఋషులు, మునులకు మొదలైన వారెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక గురువులు ఎవ్వరికీ ముక్తి-జీవన్ముక్తికి మార్గమును తెలుపలేరు. ఓ ఆత్మలారా! ఓ పిల్లలారా! నేను మీకు అర్థం చేయిస్తున్నానని ఏ మనుష్య గురువు కూడా అనలేరని మీకు తెలుసు. తండ్రికైతే పిల్లలూ! పిల్లలూ! అనే అలవాటు ఉంటుంది. ఈ పిల్లలు నా రచన అని వారికి తెలుసు. ఈ తండ్రికి కూడా నేను అందరి రచయితనని అంటారు. మీరంతా సోదరులు. వారికి పాత్ర లభించింది. ఎలా లభించిందో వారు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిండి ఉంది. ఏ మనిషి వచ్చినా 84 జన్మలలో ఒకే విధమైన రూపురేఖలు ఎప్పుడూ ఉండజాలవు. కొద్ది కొద్దిగా మార్పులు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. తత్వాలు కూడా సతో, రజో, తమోగా అవుతూ ఉంటాయి. ప్రతి జన్మలోని రూపురేఖలు ఒక దానితో ఒకటి కలవవు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - మధురమైన పిల్లలూ! తండ్రి పై ఎప్పుడూ సంశయముండరాదు. సంశయము, నిశ్చయము అను రెండు పదాలు ఉన్నాయి కదా. తండ్రి అనగా తండ్రి. ఇందులో సంశయము ఉండరాదు. తండ్రిని నేను స్మృతి చేయలేనని కొడుకు అనలేడు. మీరు పదే పదే యోగము కుదరదని అంటుంటారు. యోగమనే పదము సరియైనది కాదు. మీరేమో రాజఋషులు. ఋషి అనే పదము పవిత్రతకు సంబంధించినది. మీరు రాజఋషులు కావున తప్పకుండా పవిత్రంగా ఉంటారు. చిన్న విషయాల్లో ఫెయిల్‌ అయినా రాజ్య పదవి లభించదు. ప్రజలలోకి వెళ్లిపోతారు. ఎంతో నష్టపోతారు. పదవులు నంబరువారుగా ఉంటాయి కదా. ఒకరి పదవి మరొకరితో సమానంగా ఉండదు. ఇది అనంతమైన తయారు చేయబడిన డ్రామా. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ దీనిని అర్థం చేయించలేరు. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషముంటుంది! తండ్రి బుద్ధిలో ఎలాగైతే మొత్తం జ్ఞానమంతా ఉందో అలా మీ బుద్ధిలో కూడా ఉంది. బీజము, వృక్షమును గురించి అర్థము చేసుకోవాలి. ఇది మానవ సృష్టి రూపి వృక్షము. దీనిని మఱ్ఱి వృక్షముతో పోల్చడం చాలా సబబుగా ఉంది. మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు కాండము ప్రాయ: లోపమై పోయిందని బుద్ధి కూడా చెప్తుంది. మిగిలిన అన్ని ధర్మాల కొమ్మ-రెమ్మలు మొదలైనవన్నీ నిలిచి ఉన్నాయి. డ్రామానుసారము ఇదంతా జరిగే తీరాలి. ఇందులో ఏవగింపు రాదు. నాటకములోని పాత్రధారులకు ఎప్పుడైనా ద్వేషము కలుగుతుందా? తండ్రి చెప్తున్నారు - మీరు పతితమైపోయారు మళ్లీ పావనంగా అవ్వాలి. మీరు చూసినంత సుఖము మరెవ్వరూ చూడరు. మీరు హీరో- హీరోయిన్‌లు. విశ్వరాజ్యాన్ని పొందుకునేవారు. కనుక అపారమైన సంతోషముండాలి కదా. భగవంతుడు చదివిస్తున్నారంటే ఎంత రెగ్యులర్‌గా చదవాలి! ఎంత సంతోషముండాలి! మమ్ములను అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఆ తండ్రే రాజయోగమును కూడా నేర్పిస్తున్నారు. ఏ శరీరధారీ నేర్పించలేరు. తండ్రి ఆత్మలకు నేర్పించారు. ఆత్మయే ధారణ చేస్తుంది. తండ్రి పాత్ర చేసేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆత్మయే పాత్ర చేసి ఒక శరీరము వదిలి మరొక శరీరము తీసుకుంటుంది. ఆత్మలను తండ్రి చదివిస్తారు. దేవతలను చదివించరు. అక్కడ దేవతలే చదివిస్తారు. సంగమ యుగములో పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రియే చదివిస్తారు. మీరే చదువుతారు. మీరు పురుషోత్తములుగా తయారయ్యేది ఈ సంగమ యుగములోనే. సత్యంగా తయారు చేయువారు, సత్యయుగమును స్థాపన చేయువారు ఒక్క సత్యమైన తండ్రి మాత్రమే. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సంగమ యుగములో నేరుగా భగవంతుని నుండి చదువు చదివి, జ్ఞానవంతులుగా, ఆస్తికులుగా తయారవ్వాలి, ఇతరులను తయారు చేయాలి. ఎప్పుడూ తండ్రిలో, చదువులో సంశయపడరాదు.

2. తండ్రి సమానంగా లవ్‌లీగా (ప్రియంగా) తయారవ్వాలి. భగవంతుడు మనలను అలంకరిస్తున్నారనే సంతోషంలో ఉండాలి. ఏ పాత్రధారి పైనా తిరస్కార భావన, అసహ్య భావన ఉండరాదు. ప్రతి ఒక్కరికి డ్రామాలో ఖచ్ఛితమైన పాత్ర ఉంది.

వరదానము :-

'' స్మృతి మరియు సేవల శక్తిశాలి ఆధారము ద్వారా తీవ్ర వేగంతో ముందుకు వెళ్లే మాయాజీత్‌ భవ ''

బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ. ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సేవ ఎక్కువగా, స్మృతి బలహీనంగా లేక స్మృతి చాలా బాగా, సేవ బలహీనంగా ఉన్నా తీవ్ర వేగము ఉండజాలదు. స్మృతి మరియు సేవ రెండిటిలో తీవ్ర వేగం ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థమైన సేవ జత జతలో ఉంటే మాయజీతులుగా అవ్వడం సులభము. ప్రతి కర్మలో, కర్మ సమాప్తం అవ్వక ముందే సదా విజయం కనిపిస్తుంది.

స్లోగన్‌ :-

'' ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా, పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మలుగా భావించి నడుచుకోండి ''