24-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది, దివ్యగుణాలు వస్తాయి, కనుక ఏకాంతములో కూర్చొని నాలో ఎన్ని దైవీగుణాలు ధారణ అయ్యాయని మిములను మీరే ప్రశ్నించుకోండి. ''

ప్రశ్న :-

పిల్లలలో ఉండకూడని అన్నిటికంటే పెద్ద ఆసురీ గుణము ఏది ?

జవాబు :-

ఎవరితోనైనా రఫ్‌-టఫ్‌గా మాట్లాడడం లేక కఠినంగా మాట్లాడడం అన్నిటికంటే పెద్ద ఆసురీ అవగుణము. దీనినే భూతము అని అంటారు. ఎవరిలోనైనా ఈ భూతము ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు. కనుక వారి నుండి దూరంగా ఉండాలి. ''ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మళ్లీ నూతన రాజధానిలోకి రావాలి'' అని ఇప్పుడు వీలైనంత ఎక్కువగా అభ్యాసము చేయండి. ఈ ప్రపంచములో అన్నీ చూస్తున్నా ఏమీ కనిపించరాదు.

ఓంశాంతి.

తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. శరీరాన్ని వదిలి వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. ఇది కూడా ఒక అభ్యాసమే. ఎప్పుడైనా శరీరానికి కష్టము కలిగితే, ప్రయత్నించి శరీరాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది, అలాగే ప్రపంచాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఉదయం ఈ మర్చిపోయే అభ్యాసము జరుగుతుంది. ఇక చాలు, ఇప్పుడు ఇంటికి వాపస్‌ వెళ్ళాలి అని భావించాలి. ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభించింది. మొత్తం ప్రపంచాన్నంతా వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. జ్ఞానము ఎక్కువగా అవసరముండదు. బాగా ప్రయత్నించి అదే పట్టుదలతో ఉండాలి. శరీరానికి ఎంత కష్టము వచ్చినా, ఎలా అభ్యాసము చేయాలో పిల్లలకు అర్థం చేయిస్తారు. అసలు మీరు లేనే లేరన్నట్లుగా అభ్యాసము చేయాలి. ఇది కూడా మంచి అభ్యాసము. ఇక కొద్ది సమయమే ఉంది, ఇక ఇంటికి వెళ్ళాలి. తండ్రి సహయోగముంది అంతేకాక ఇతని సహాయము కూడా లభిస్తుంది. సహాయమైతే తప్పకుండా లభిస్తుంది అయితే పురుషార్థము కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి ఏవైతే చూస్తున్నారో అవేవీ ఉండవు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుండి మళ్లీ తమ రాజధానిలోకి రావాలి. చివరిలో ఈ రెండు విషయాలు '' వెళ్ళాలి - తిరిగి రావాలి '' మాత్రమే ఉంటాయి. ఈ స్మృతిలో ఉండడం వలన శరీరమును కష్టపెట్టే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తమంతట తామే చల్లబడుట గమనించడం జరిగింది. ఆ సంతోషము ఉంటుంది. ఖుషీ లాంటి ఆహారము లేదు. కనుక పిల్లలకు కూడా ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలూ, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. మధురమైన ఇంటికి వెళ్ళాలి. ఈ పాత ప్రపరచాన్ని మర్చిపోవాలి. దీనినే ''స్మృతి యాత్ర'' అని అంటారు. ఈ విషయము ఇప్పుడే పిల్లలకు తెలుస్తుంది. తండ్రి కల్ప-కల్పమూ వస్తారు, కల్పము తర్వాత మళ్లీ కలుసుకుంటామని వినిపిస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, ఇప్పుడు మీరు ఏమి వింటున్నారో మళ్లీ కల్పము తర్వాత కూడా ఇదే వింటారు. ఇది పిల్లలకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - మేము కల్ప-కల్పము వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియచేస్తాను. ఆ మార్గములో నడవడము పిల్లల పని అని తండ్రి వచ్చి చెప్తున్నారు. తండ్రి వచ్చి మార్గమును తెలియచేస్తారు. తమ వెంట తీసుకెళ్తారు. కేవలం మార్గము తెలపడమే కాదు, తమతో పాటు తీసుకెళ్తారు కూడా. ఇది కూడా అర్థం చేయిస్తున్నారు - ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చివరిలో ఏమీ ఉపయోగపడవు. తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చేశారు. తండ్రి ఇచ్చే వారసత్వము అనంతమైన సామ్రాజ్యమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరైతే నిన్నటి వరకు మందిరాలకు వెళ్ళేవారో, ఈ పిల్లల(లక్ష్మీనారాయణులు) మహిమను పాడేవారో, బాబా అయితే వీరిని కూడా పిల్లలు - పిల్లలు అనే అంటారు కదా. ఎవరైతే వారి ఉన్నతమైన మహిమను పాడుతూ ఉండేవారో, ఇప్పుడు మళ్లీ ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. శివబాబాకు ఇదేమీ కొత్త విషయం కాదు. పిల్లలైన మీకు ఇది కొత్త విషయము. పిల్లలు యుద్ధ మైదానములో ఉన్నారు. సంకల్ప-వికల్పాలు కూడా పిల్లలను కలత పెడ్తాయి. ఈ దగ్గు కూడా ఇతడి కర్మ లెక్కాచారమే, దీనిని ఇతడు అనుభవించాలి. బాబా అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఇతడు కర్మాతీతంగా అవ్వాలి. తండ్రి అయితే సదా కర్మాతీత స్థితిలో ఉంటారు. నా పిల్లలైన మీకు మాయా తుఫాన్లు మొదలైన కర్మభోగాలు వస్తాయి. దీనిని అర్థము చేయించాలి. తండ్రి అయితే మార్గాన్ని తెలుపుతారు. పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు. ఈ రథానికి ఏమైనా అయితే దాదాకు ఏమో అయ్యిందని మీరు బాధపడ్తారు. బాబాకు ఏమీ కాదు. ఇతడికి అవుతుంది. జ్ఞాన మార్గములో మూఢ నమ్మకమనే మాటే ఉండదు. తాను ఎవరి తనువులో ప్రవేశిస్త్తారో తండ్రి అర్థం చేయిస్తారు. అనేక జన్మల అంతిమ పతిత తనువులో నేను ప్రవేశిస్తాను. ఇతర పిల్లలెలా ఉన్నారో అలాగే నేను కూడా ఉన్నానని ఈ దాదా కూడా అర్థము చేసుకుంటాడు. దాదా పురుషార్థి. సంపూర్ణమవ్వలేదు. మీరంతా ప్రజాపిత పిల్లలైన బ్రాహ్మణులు, విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. లక్ష్మీనారాయణ అని అన్నా, విష్ణువు అని అన్నా విషయమొక్కటే. బ్రహ్మ-విష్ణు-శంకరులను గూర్చి గాని, స్వయాన్ని గురించి గాని ఇంతకుముందు తెలియదని తండ్రి అర్థం కూడా చేయించారు. ఇప్పుడైతే తండ్రిని, బ్రహ్మ, విష్ణు, శంకరులను చూడగానే ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నాడని బుద్ధిలోకి వస్తుంది. ఇదే తెల్లని డ్రస్సు. కర్మాతీత స్థితి కూడా ఇక్కడే అవుతుంది. ఈ బాబా సూక్ష్మదేవత అవుతాడని ముందుగానే మీకు సాక్షాత్కారమవుతుంది. ఈ బాబా ఫరిస్తాగా అవుతాడు. మేము కర్మాతీత స్థితిని పొంది నెంబరువారుగా ఫరిస్తాలుగా అవుతామని మీకు కూడా తెలుసు. మీరు ఫరిస్తాగా అయినప్పుడు, ఇప్పుడు యుద్ధము జరుగుతుందని మీరు అర్థము చేసుకుంటారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటము(వేటగానికి షికారు, వేటకు మృత్యువు).......... అను స్థితి చాలా ఉన్నతమైన స్థితి. పిల్లలు ధారణ చేయాలి. మనము చక్రములో తిరుగుతున్నామని కూడా మీకు నిశ్చయముంది. ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థము చేసుకోలేరు. ఈ జ్ఞానము కొత్తది. మళ్లీ పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిని నేర్పిస్తారు. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని కూడా అర్థం చేసుకున్నారు. కల్ప-కల్పము తండ్రికి పిల్లలుగా అవుతారు. 84 జన్మల చక్రము తిరిగి వచ్చారు. మీరు ఆత్మ, పరమపిత పరమాత్మ మన తండ్రి. ఇప్పుడు ఆ తండ్రిని స్మృతి చేయమని ఎవరికైనా అర్థం చేయించండి. దైవీ రాకుమారులుగా అవ్వాలంటే ఇంత పురుషార్థము చేయాలని వారి బుద్ధిలోకి వస్తుంది. వికారాలు మొదలైనవన్నీ వదిలేయాలి. పరస్పరము సోదర - సోదరీగా కూడా కాదు, సోదర-సోదరులుగా(భాయీ-భాయీగా) భావించండి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. మరే కష్టము లేదని తండ్రి తెలియచేస్తున్నారు. చివర్లో మరే ఇతర విషయాలు అవసరముండదు. కేవలం తండ్రినే స్మృతి చేయాలి. ఆస్తికులుగా అవ్వాలి. ఇలా సర్వ గుణ సంపన్నులుగా అవ్వాలి. లక్ష్మీనారాయణుల చిత్రము చాలా ఖచ్ఛితంగా ఉంది. కేవలం తండ్రిని మర్చిపోయినందున దైవీగుణాలను ధారణ చేయడము కూడా మర్చిపోతారు. పిల్లలారా! - ఏకాంతంగా కూర్చుని బాబాను స్మృతి చేసి మనము ఇలా అవ్వాలి, ఈ గుణాలను ధారణ చేయాలని ఆలోచించండి. విషయమేమో చాలా చిన్నది. పిల్లలు ఎంత శ్రమ చేయవలసి వస్తుంది! ఎంత దేహాభిమానము వచ్చేస్తుంది! తండ్రి చెప్తున్నారు - ''దేహీ-అభిమాని భవ''. తండ్రి ద్వారానే వారసత్వము తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేసినప్పుడే చెత్త తొలగిపోతుంది.
ఇప్పుడు తండ్రి వచ్చారని, బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇంత సహజమైన విషయము కూడా మీ బుద్ధ్ది నుండి జారిపోతుంది. పరమాత్మ(అల్ఫ్‌) ఒక్కరే. బేహద్‌ తండ్రి ద్వారా సామ్రాజ్యము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే కొత్త ప్రపంచము గుర్తుకు వచ్చేస్తుంది. అబలలు వికాలాంగులు(కుబ్జలు) కూడా మంచి పదవిని పొందగలరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అయితే మార్గము చూపించారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి అని చెప్తున్నారు. తండ్రి పరిచయం అయితే లభించింది. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయని ఇంటికి వెళ్ళి మళ్లీ వచ్చి స్వర్గములో పాత్ర చేస్తామని బుద్ధిలో ఉంది. ఎక్కడ స్మృతి చేయాలి? ఎలా స్మృతి చేయాలనే ప్రశ్న రాదు. తండ్రిని స్మృతి చేయాలని బుద్ధిలో ఉంది. తండ్రి ఎక్కడికి వెళ్లినా మీరు వారి పిల్లలే కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందము కలుగుతుంది. తండ్రితో సన్ముఖములో కలుసుకుంటారు. శివబాబా జయంతి ఎలా జరుగుతుందని మానవులు తికమకపడ్తారు. శివరాత్రి అని ఎందుకు అంటారో అర్థము చేసుకోరు. కృష్ణుని గురించి కూడా రాత్రి జన్మించినాడని భావిస్తారు కదా. అయితే అది ఈ రాత్రి విషయము కాదు. అది అర్ధకల్పపు రాత్రి పూర్తైనప్పుడు మళ్లీ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు రావలసి వస్తుంది. ఇది చాలా సహజమైనదని పిల్లలైన మీరు తామే స్వయంగా అర్థం చేసుకుంటారు. దైవీగుణాలు ధారణ చేయాలి లేకపోతే వంద రెట్లు పాపమౌతుంది. నన్ను నిందింపజేయువారు ఉన్నత స్థానమును పొందలేరు. తండ్రిని నిందింపజేస్తే పదభ్రష్టులుగా అయిపోతారు. చాలా మధురంగా అవ్వాలి. రఫ్‌-టఫ్‌(మొరటుగా, కఠినంగా)గా మాట్లాడడం దైవీ గుణము కాదు. ఇది ఆసురీ అవగుణము అని తెలుసుకోవాలి. ఇది మీ దైవీగుణము కాదని ప్రేమగా అర్థం చేయించాలి. ఇప్పుడు కలియుగము పూర్తవుతుందని, ఇది సంగమ యుగమని కూడా పిల్లలకు తెలుసు. మానవులకైతే ఏమీ తెలియదు. కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఇంకా 40 వేల సంవత్సరాలున్నాయని, మనము జీవించే ఉంటామని,.......... సుఖము అనుభవిస్తుంటామని అనుకుంటారు. రోజురోజుకు ఇంకా తమోప్రధానంగా అవుతుందని తెలియదు. పిల్లలైన మీరు వినాశనాన్ని కూడా సాక్షాత్కారము చేసుకున్నారు. ఇక ముందు బ్రహ్మను, కృష్ణుని కూడా సాక్షాత్కారము చేస్తూ ఉంటారు. బ్రహ్మ వద్దకు వెళ్తే మీరు స్వర్గములో ఇలాంటి రాకుమారులుగా అవుతారు. కాబట్టి తరచుగా బ్రహ్మ మరియు కృష్ణుడు ఇరువురూ సాక్షాత్కారమౌతూ ఉంటారు. కొందరికి విష్ణువు సాక్షాత్కారమౌతుంది. కానీ ఈ సాక్షాత్కారాలతో ఏమీ అర్థము చేసుకోలేరు. నారాయణుని సాక్షాత్కారము జరిగితే అర్థము చేసుకోగలరు. దేవతలుగా అయ్యేందుకే మనము ఇక్కడకు వస్తాము. కాబట్టి మీరిప్పుడు సృష్టి ఆదిమధ్యాంతాల పాఠము చదువుకుంటారు. స్మృతి కొరకే చదివిస్తున్నారు. పాఠాన్ని ఆత్మ చదువుతుంది. దేహ స్మృతి దిగిపోతుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి.
మధురాతి మధురమైన పిల్లలూ! మీరు 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు అప్పటి వారే, రూపురేఖలు కూడా అవే. 5 వేల సంవత్సరాల ముందు కూడా మీరే ఉండేవారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే మీరే 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారని మీరు కూడా అంటారు. మనము దేవతలుగా ఉండేవారము. మళ్లీ అసురులుగా అయిపోయాము. దేవతల గుణాలు మహిమ చేస్తూ వచ్చాము. స్వయంలోని అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చాము, ఇప్పుడు మళ్లీ దేవతలుగా అవ్వాలి. ఎందుకంటే దైవీ ప్రపంచములోకి వెళ్లాలి. కనుక ఇప్పుడు పురుషార్థము బాగా చేసి ఉన్నత పదవి పొందండి. టీచరైతే అందరికీ చదువుకోండి అని చెప్తారు కదా. మంచి మార్కులతో పాసైతే మా పేరు, మీ పేరు కూడా ప్రసిద్ధమవుతాయి. బాబా, మీ దగ్గరికి వస్తే నోట మాట రాదు, అంతా మర్చిపోతామని చాలామంది పిల్లలంటారు. రావడముతోనే మౌనంగా ఉండిపోతామని అంటారు. ఈ ప్రపంచము సమాప్తమైనట్లే. మళ్లీ మీరు కొత్త ప్రపంచములోకిి వస్తారు. ఇది చాలా శోభాయమానమైన నూతన ప్రపంచంగా ఉంటుంది. కొందరు శాంతిధామములో విశ్రాంతి పొందుతారు. కొందరికి విశ్రాంతి లభించదు. ఆల్‌రౌండ్‌ పాత్ర ఉంటుంది. కానీ తమోప్రధాన దు:ఖము నుండి దూరమౌతారు. అక్కడ శాంతి, సుఖము అన్నీ లభిస్తాయి. కనుక బాగా పురుషార్థము చేయాలి. అదృష్టములో ఏముంటే అదే లభిస్తుంది అని అనుకోరాదు, పురుషార్థము చేయాలి. రాజధాని స్థాపనౌతూ ఉందని అర్థం చేయించబడ్తుంది. మనము శ్రీమతమును అనుసరించి మన కొరకు రాజధానిని స్థాపన చేస్తున్నాము. శ్రీమతమును ఇచ్చే తండ్రి తానెప్పుడూ రాజు మొదలైన వారిగా అవ్వలేదు(అవ్వరు). వారి శ్రీమతము ద్వారా మనము అవుతాము. ఇది క్రొత్త విషయము కదా. ఇది ఎప్పుడూ ఎవరు వినలేదు, చూడలేదు. శ్రీమతమును అనుసరించి మనము వైకుంఠ రాజ్యమును స్థాపన చేస్తామని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనము లెక్కలేనన్నిసార్లు రాజ్యమును స్థాపన చేశాము, చేస్తాము మళ్లీ పోగొట్టుకుంటాము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఫాదరీలు(క్రైస్తవ ధర్మమువారు) విహరించునప్పుడు ఇతరులెవ్వరిని చూచూందుకు కూడా ఇష్టపడరు. కేవలం క్రీస్తు స్మృతిలోనే ఉంటారు. శాంతిగా తిరుగుతూ ఉంటారు. అర్థమయ్యింది కదా. క్రీస్తును ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారు. క్రీస్తు సాక్షాత్కారము తప్పకుండా అయ్యి ఉంటుంది. అందరూ ఫాదరీల వలె ఉండరు. కోటిలో కొందరు, మీలో కూడా నంబర్‌వారుగా ఉన్నారు. కోటిలో కొందరు ఇలాంటి స్మృతిలో ఉంటారు. ప్రయత్నించి చూడండి, ఇతరులెవ్వరినీ చూడకండి. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉండండి. మీకు అపారమైన ఖుషీ ఉంటుంది. దేవతలను శ్రేష్ఠాచారులని, మానవులను భ్రష్టాచారులని అంటారు. ఈ సమయంలో దేవతలైతే ఎవ్వరూ లేరు. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. ఇది భారతదేశానికే సంబంధించిన విషయము. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి అందరికి సద్గతినిస్తాను. మిగిలిన ధర్మాలవారు కూడా తమ-తమ సమయానుసారంగా వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందరూ వచ్చి ఈ మంత్రాన్ని తీసుకెళ్తారు. ''తండ్రిని స్మృతి చేయాలి.'' ఎవరు స్మృతి చేస్తారో, వారు తమ ధర్మములో ఉన్నత పదవిని పొందుతారు.
పిల్లలైన మీరు పురుషార్థము చేసి ఆత్మిక మ్యూజియము లేక కాలేజీని తెరవాలి. ''విశ్వము లేక స్వర్గ రాజ్యము సెకండులో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి '' అని వ్రాయండి. తండ్రిని స్మృతి చేస్తే వైకుంఠ రాజ్యము లభిస్తుందని వ్రాయండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. నడుస్తూ - తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. చూస్తూ కూడా కనిపించని విధంగా అభ్యాసము చేయాలి. ఏకాంతములో కూర్చుని మాలో దైవీ గుణాలు ఎంత వరకు అలవడినాయని పరిశీలించుకోవాలి.

2. తండ్రికి నింద వచ్చేలాంటి ఏ కర్తవ్యాన్ని చేయరాదు. దైవీగుణాలను ధారణ చేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లాలి మళ్లీ మన రాజధానికి రావాలని బుద్ధిలో ఉండాలి.

వరదానము :-

'' స్వార్థము నుండి భిన్నంగా, సంబంధాలలో ప్రియంగా అయ్యి సేవ చేసే సత్యమైన సేవాధారీ భవ ''

ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్‌ చేస్తుందో అది సేవ కాదు, స్వార్థము. ఏదో ఒక స్వార్థము నిమిత్తమవుతుంది. అప్పుడే హెచ్చు-తగ్గులుగా అవుతారు. మీ స్వార్థము గానీ, ఇతరుల స్వార్థము గానీ పూర్తి అవ్వదో అప్పుడు సేవలో డిస్టర్బెన్స్‌ జరుగుతుంది. అందువలన స్వార్థము నుండి భిన్నంగా, సర్వ సంబంధాలలో ప్రియంగా అయ్యి సేవ చేయండి. అప్పుడు సత్యమైన సేవాధారులని అంటారు. సేవ ఉమంగ - ఉత్సాహాలతో బాగా చేయండి. కానీ సేవ భారమై మీ స్థితిని హెచ్చు-తగ్గులు చేయకుండా గమనముంచండి.

స్లోగన్‌ :-

'' శుభము లేక శ్రేష్ఠమైన వైబ్రేషన్ల ద్వారా నెగటివ్‌ దృశ్యాన్ని కూడా పాజిటివ్‌గా పరివర్తన చేయండి. ''