28-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీరు పరస్పరము ఆత్మిక సోదరులు, ఒకరి పై ఒకరికి చాలా ప్రేమ ఉండాలి, మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి, ఎప్పుడూ కొట్లాడుకోరాదు, జగడాలాడుకోరాదు.''

ప్రశ్న :-

ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రియమనిపిస్తారు ?

జవాబు :-

1. ఎవరైతే శ్రీమతముననుసరించి విశ్వమంతటికి కళ్యాణము చేయువారు 2. ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, ఎప్పుడూ ఎవరికీ ముళ్ళు గుచ్చరో, పరస్పరము చాలా చాలా ప్రీతితో ఉంటారో, ఎప్పుడూ అలగరో ఇటువంటి పిల్లలు తండ్రికి చాలా చాలా ప్రియమనిపిస్తారు. ఎవరైతే దేహాభిమానులుగా అయ్యి పరస్పరము పోట్లాడుకుంటారో, ఉప్పు-నీరుగా అవుతారో వారు తండ్రి పరువును పోగొడ్తారు. అటువంటివారు తండ్రిని నిందలపాలు చేసే నిందకులు.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు ఎలా ప్రియమనిపిస్తారో, అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రియమనిపిస్తారు ఎందుకంటే శ్రీమతముననుసరించి విశ్వమంతటికి కళ్యాణము చేస్తున్నారు. కళ్యాణకారులందరూ ప్రియమనిపిస్తారు. మీరు కూడా పరస్పరము సోదరులు. అందువలన మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. ఒకే తండ్రి పిల్లలకు పరస్పరము ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ బయటివారితో ఉండదు. మీకు కూడా పరస్పరము చాలా చాలా ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదర-సోదరులే ఇక్కడే పోట్లాడుకుంటూ, వాదులాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకుంటే, వారు సోదరులు కానట్లే. పరస్పరములో మీకు ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా. అందువలన ఆత్మలకు కూడా పరస్పరములో చాలా ప్రేమ ఉండాలి. సత్యయుగములో ఆత్మలంతా ఒకరికొకరు చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే వారి దేహాభిమానము తొలగిపోతుంది. సోదరులైన మీరంతా ఒక్క తండ్రి స్మృతి ద్వారా విశ్వమంతటికీ కళ్యాణము చేస్తారు, స్వయం మీ కళ్యాణము కూడా చేసుకుంటారు. మీరు మీ సోదరుల కళ్యాణము కూడా చేయాలి. అందుకు తండ్రి దేహాభిమానము నుండి దేహీ-అభిమానులుగా చేస్తున్నారు. లౌకిక సోదరులు పరస్పరము ధనము కొరకు, వాటాల కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇచ్చట పోట్లాడుకునే మాట కాని, జగడాలాడే మాట కాని లేదు. ప్రతి ఒక్కరూ తండ్రితో నేరుగా సంబంధము ఉంచుకోవలసి వస్తుంది. ఇది అనంతమైన విషయము. యోగబలము ద్వారా తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి స్థూల వారసత్వము తీసుకుంటారు. కానీ ఇది ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు లభించే ఆత్మిక వారసత్వము. ప్రతి ఒక్కరు తండ్రి నుండి నేరుగా వారసత్వము తీసుకోవాలి. వ్యక్తిగతంగా తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత వారసత్వము లభిస్తుంది. పరస్పరము పోట్లాడుకోవడం తండ్రి చూస్తే మీరేమైనా అనాథలా? అని అడుగుతారు. ఆత్మిక సోదరులు జగడాలాడరాదు. సోదరులై ఉండి పరస్పరములో పోట్లాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకుంటే రావణుని సంతతిగా అయినట్లే. వారంతా అసురీ సంతానము. అప్పుడు దైవీ సంతానానికి, ఆసురీ సంతానానికి తేడా ఉండదు. ఎందుకంటే దేహాభిమానులుగా అయితేనే పోట్లాడుకుంటారు. ఆత్మ, ఆత్మతో పోట్లాడదు. అందువలన తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, పరస్పరము ఉప్పు నీరుగా అవ్వకండి. అలా అయినప్పుడే తండ్రి అర్థం చేయిస్తారు. వీరు దేహాభిమానములోని పిల్లలు, రావణుని పిల్లలు, నా పిల్లలు కాదు, ఎందుకంటే పరస్పరము ఉప్పు-నీరుగా ఉంటున్నారు. మీరు 21 జన్మలు పాలు-పంచదార వలె కలిసి ఉంటారు. ఈ సమయంలో దేహీ-అభిమానులుగా ఉండాలి. పరస్పరము కలవకపోతే ఆ సమయములో రావణ సంప్రదాయానికి చెందినవారని భావించాలి. పరస్పరము ఉప్పునీరుగా అయితే తండ్రి గౌరవాన్ని పోగొడ్తారు. భలే ఈశ్వరీయ సంతానమని అంటారు కాని ఆసురీ గుణాలు ఉంటే, దేహాభిమానులుగా ఉన్నట్లే. దేహీ-అభిమానులలో ఈశ్వరీయ గుణాలుంటాయి. ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలు ధారణ చేస్తేనే తండ్రి తన వెంట తీసుకెళ్తారు. మళ్లీ అవే సంస్కారాలు మీ వెంట వస్తాయి. పిల్లలు దేహాభిమానములో ఉప్పునీరుగా అవుతారని తండ్రికి తెలుస్తుంది. అటువంటివారు ఈశ్వరీయ సంతానము అని అనబడరు. స్వయాన్ని ఎంతో నష్టపరుచుకుంటారు. మాయకు వశమైపోతారు. పరస్పరము ఉప్పునీరు(మతబేధము)లా అయిపోతారు. ప్రపంచమంతా ఉప్పునీరుగా ఉంది. కాని ఈశ్వరీయ సంతానమైన తర్వాత కూడా ఉప్పునీరుగానే ఉంటే మీకు వారికి భేదమేముంది? వారు తండ్రిని నిందలపాలు చేస్తారు. తండ్రిని నిందింపచేయువారు, ఉప్పునీరుగా అయ్యేవారు స్వర్గములో స్థానము పొందలేరు. వారిని నాస్తికులని కూడా అనవచ్చు. ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు. మీరు పరస్పరము పోట్లాడరాదు. ప్రేమగా మెలగడం ఇక్కడే నేర్చుకోవాలి. దాని వలన 21 జన్మలు పరస్పరములో ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలని పిలువబడుతూ, సోదరులుగా అవ్వకుంటే వారు ఆసురీ సంతానంగా అయినట్లే. తండ్రి పిల్లలకు అర్థం చేయించేందుకు మురళీలో వినిపిస్తారు. కాని దేహాభిమానము కారణంగా, బాబా తమను గురించే చెప్తున్నారని కూడా వారు తెలుసుకోలేరు. మాయ చాలా తీవ్రమైనది. ఎలాగైతే ఎలుక కొరికితే తెలియనే తెలియదో అలా మాయ కూడా మధురంగా తీయగా ఊదుతూ కొరుకుతుంది. తెలియను కూడా తెలియదు. పరస్పరము అలుగుట మొదలైనవి ఆసురీ సంప్రదాయస్థుల పని. చాలా సేవాకేంద్ర్రాలలో ఉప్పునీరుగా ఉంటారు. ఇప్పుడింకా ఎవ్వరూ దోష రహితంగా అవ్వలేదు. మాయ యుద్ధము చేస్తూ ఉంటుంది. మాయ తలను ఎలా తిప్పేస్తుందంటే అసలు అది తెలియనే తెలియదు. మాలో పరస్పరము (ఒకరి పై ఒకరికి) ప్రేమ ఉందా, లేదా? అని హృదయములో ప్రశ్నించుకోండి. ప్రేమసాగరుని పిల్లలైతే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. పోట్లాడుకోవడం, జగడాలాడడం, ఉల్టా-సుల్టాగా(తప్పుగా) మాట్లాడడం, వీటికన్నా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. చెడు వినకండి,.......... ఒకవేళ ఎవరిలోనైనా అంశమాత్రము క్రోధముంటే ఇక ఆ ప్రేమ ఉండదు. అందుకే బాబా చెప్తున్నారు - ప్రతి రోజూ మీ లెక్కాచారము చూసుకోండి. ఆసురీ నడవడిక బాగుపడకపోతే ఫలితమెలా ఉంటుంది? ఏ పదవి పొందుతారు? తండ్రి తెలుపుతున్నారు - ఏ సేవా చేయకుంటే, ఫలితము ఎలా ఉంటుంది? పదవి తగ్గిపోతుంది. అందరికీ సాక్షాత్కారము జరగాల్సిందే. మీకు కూడా మీ చదువు సాక్షాత్కారమవుతుంది. సాక్షాత్కారమైన తర్వాతనే మీరు బదిలీ అవుతారు. బదిలీ అయ్యి మీరు నూతన ప్రపంచములోకి వచ్చేస్తారు. ఎవరెవరు ఎన్ని మార్కులతో పాసయ్యారు? అని చివరిలో అన్నీ సాక్షాత్కారమవుతాయి. అప్పుడు మీరు ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, శిక్షలు కూడా అనుభవిస్తారు. బాబా చెప్పిన మాటలు వినలేదే అని పశ్చాత్తాపపడ్తారు. బాబా ఏమో, ఎలాంటి ఆసురీ గుణాలుండరాదని పదే పదే అర్థం చేయించారు. ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానంగా తయారు చేయాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము ''అల్ఫ్‌ మరియు బే''. ''అల్ఫ్‌'' అనగా తండ్రి. ''బే'' అనగా ''సార్వభౌమత్వము''. కావున పిల్లలకు నషా ఉండాలి. పరస్పరము ఉప్పునీరుగా ఉంటే ఈశ్వరీయ సంతానమని ఎలా భావిస్తారు? వీరు ఆసురీ సంతానమని, మాయ వీరి ముక్కు పట్టుకుందని తండ్రి భావిస్తారు. వారికి తెలియను కూడా తెలియదు. స్థితి చంచలమవుతుంది, అల్లకల్లోలమవుతుంది. పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీరు వారికి ప్రేమతో నేర్పించేందుకే ప్రయత్నము చేయాలి. దృష్టి ప్రేమభరితంగా ఉండాలి. తండ్రి ప్రేమసాగరులైనందున పిల్లలను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా. కావున మీరు కూడా ప్రేమసాగరులుగా అవ్వాలి.

తండ్రి పిల్లలకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు - మంచి మతము(సలహా)నిస్తారు. ఈశ్వరీయ మతము లభించినందున మీరు పుష్పాలుగా అవుతారు. వారు మీకు అన్ని గుణాలు ఇచ్చేస్తారు. దేవతలలో ప్రేమ ఉంది కదా. అటువంటి స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి. ఈ సమయములో మీకు జ్ఞానముంది, మళ్లీ దేవతలుగా అయితే ఆ జ్ఞానముండదు. అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. అందువలన పిల్లలు ఇప్పుడు దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇప్పుడు సంగమ యుగములో ఉన్నారు. తండ్రి కూడా భారతదేశములో వస్తారు, శివజయంతి పండుగ జరుపుతారు. కానీ వారు ఎవరు, ఎలా ఎప్పుడు వస్తారు? ఏం చేస్తారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారము తెలుసు. ఎవరు తెలుసుకోరో వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. అందువలన పదవి తగ్గిపోతుంది. పాఠశాలలో చదువు చదివే వారిలో కొంతమంది నడవడిక బాగుండదు. కొంతమంది నడవడిక సదా మంచిగా ఉంటుంది. కొంతమంది హాజరవుతారు, కొంతమంది గైరుహాజరు అవుతారు. ఎవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉంటారో, వారు ఇక్కడ హాజరుగా ఉన్నట్లు. తండ్రి అంటున్నారు - లేస్తూ, కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి. మర్చిపోయారంటే ఆబ్సెంట్‌ అయిపోతారు. సదా హాజరైనప్పుడే ఉన్నత పదవి పొందుతారు. మర్చిపోయినట్లయితే తక్కువ పదవి పొందుతారు. ఇప్పుడింకా సమయముందని తండ్రికి తెలుసు. ఉన్నత పదవి పొందేవారి బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉండవచ్చు. శివబాబా స్మృతి ఉండి, నోట్లో జ్ఞానామృతమున్నప్పుడు ప్రాణము శరీరము నుండి వెళ్లిపోవాలని అంటారు. ఏదైనా వస్తువు పై ప్రీతి ఉంటే చివరి సమయములో అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆహారము పై లోభముంటే మరణించునప్పుడు అదే వస్తువు గుర్తుకు వస్తూ ఉంటుంది. అది తినాలనిపిస్తూ ఉంటుంది. దీని వలన పదవి భ్రష్టమైపోతుంది. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మరణించండి, ఇంకేదీ గుర్తు రాకూడదని తండ్రి అంటారు. ఆత్మ ఎలాగైతే ఎవరితోనూ సంబంధము లేకుండా ఒంటరిగా వచ్చిందో అలాగే వెళ్లిపోవాలి. లోభము కూడా తక్కువైనదేమీ కాదు. దేని పై లోభముంటుందో చివరికి అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు. కనుక పిల్లలైన మీలో లోభము మొదలైనవేవీ ఉండరాదు. తండ్రి అయితే చాలా అర్థము చేయిస్తున్నారు కాని అర్థము చేసుకునేవారు అర్థము చేసుకోవాలి కదా. ''బాబా, ఓహో! బాబా'' అంటూ తండ్రి స్మృతిని ఒక్కసారిగా హృదయానికి హత్తుకోండి. అలాగని 'బాబా-బాబా' అని నోటితో కూడా అనరాదు. అజపాజపము మనసులో కొనసాగుతూ ఉండాలి. తండ్రి స్మృతిలో, కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదిలితే ఉన్నత పదవిని పొందగలరు.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు

'' ఈ సంగమ యుగములో మహాభారతము ప్రాక్టికల్‌గా రిపీట్‌ అవుతూ ఉంది ''

కురుక్షేత్రములో కౌరవులు, పాండవుల మధ్య యుద్ధము జరిగిందని మనుష్యులంటారు. పాండవులకు డైరక్షన్‌ ఇచ్చి తోడుగా ఉన్నవారు శ్రీకృష్ణుడని చెప్తారు. కనుక ఏ వైపు స్వయం ప్రకృతిపతి ఉంటారో వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. చూడండి - అన్ని విషయాలు కలిపి కలగాపులగం చేసేశారు. ప్రకృతిపతి కృష్ణుడు కాదని మొదట అర్థం చేసుకోండి. ప్రకృతిపతి అని పరమ ఆత్మను అంటారు. కృష్ణుడు సత్యయుగములోని మొదటి దేవత. అతడిని భగవంతుడని అనజాలరు. కనుక పాండవుల సారథి పరమాత్ముడే గాని శ్రీకృష్ణుడు కాదు. పరమాత్మ తన పిల్లలైన మనకు ఎప్పుడూ హింస చేయడం నేర్పించరు. పాండవులు హింసా యుద్ధము చేసి స్వరాజ్యము తీసుకోనూ లేదు. ఈ ప్రపంచము కర్మక్షేత్రము. ఇందులో మనుష్యులు ఎలాంటి కర్మలు చేసి బీజము నాటుతారో అటువంటి మంచి, చెడు ఫలమును భోగిస్తారు. ఈ కర్మక్షేత్రములో పాండవులు అనగా భారతమాత శక్తి అవతారము కూడా ఉంది. పరమ ఆత్మ భారత ఖండములోనే వస్తారు. అందువలన భరత ఖండమును అవినాశి అని అంటారు. పరమాత్మ అవతరణ భారత ఖండములోనే జరిగింది. ఎందుకంటే అధర్మము కూడా భారత ఖండము నుండే వృద్ధి చెందింది. అక్కడే పరమాత్మ యోగబలము ద్వారా కౌరవ రాజ్యాన్ని సమాప్తము చేసి పాండవ రాజ్యమును స్థాపించారు. కనుక పరమాత్మ వచ్చి ధర్మ రాజ్యమును స్థాపన చేశారు. కాని భారతవాసులు తమ మహోన్నత పవిత్ర ధర్మమును, శ్రేష్ఠ కర్మను మర్చిపోయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. పాపం వారు తమ ధర్మమేదో తెలియనందున ఇతర ధర్మాలలో చేరిపోయారు. ఈ బేహద్‌ జ్ఞానాన్ని స్వయం బేహద్‌ యజమానియే తెలుపుతారు. వారు తమ స్వధర్మాన్ని మర్చిపోయి హద్దులో చిక్కుకుపోయారు. దీనినే అతిధర్మగ్లాని అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు కాని మొదట స్వధర్మముండాలి. కనుక ప్రతి ఒక్కరి స్వధర్మము - 'నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని.' తర్వాత మన ప్రకృతి ధర్మము దేవతా ధర్మము. 33 కోట్ల భారతవాసులైన దేవతలున్నారు. అందుకే అనేక దేహ ధర్మములన్నీ త్యాగము చెయ్యండి, సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య.......... అని పరమాత్మ చెప్తున్నారు. ఈ హద్దు ధర్మాలలో ఎన్నో ఆందోళనలు జరిగిపోయాయి. కనుక ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బేహద్‌లోకి వెళ్లాలి. ఆ బేహద్‌ తండ్రి, సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగము జోడించాలి. అందువలన సర్వశక్తివంతుడైన ప్రకృతిపతి పరమాత్మయే కాని కృష్ణుడు కాదు. కనుక కల్పక్రితము కూడా సాక్షాత్‌ ప్రకృతి పతి పరపమాత్మ ఏ వైపు ఉన్నారో వారి విజయము మహిమ చేయబడింది. అచ్ఛా.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. అందరి పట్ల ప్రేమభరితమైన దృష్టిని ఉంచాలి. ఎప్పుడూ నోటి ద్వారా వ్యతిరేక మాటలు మాట్లాడరాదు.

2. ఏ వస్తువులోనూ లోభముంచుకోరాదు. స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఉండాలి. చివరి సమయంలో ఏ వస్తువూ గుర్తు రాకుండా ఉండగలిగే అభ్యాసము చేయాలి.

వరదానము :-

'' బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠ స్థితి అనే మెడల్‌ను పాప్తి చేసుకునే చింతలేని పురానికి చక్రవర్తి భవ ''

మీరందరూ మీ స్వ స్థితిని అత్యంత మంచిగా చేసుకునేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠమైన స్థితియే మీ ఆస్తి. ఇదే బ్రాహ్మణ జీవితానికి మెడల్‌. ఎవరైతే ఈ మెడల్‌ను ప్రాప్తి చేసుకుంటారో వారు సదా అచల్‌ అడోల్‌(స్థిరమైన) ఏకరస స్థితిలో ఉంటారు, సదా నిశ్చింతగా చింతలేని పురానికి(స్వర్గానికి) చక్రవర్తులుగా అవుతారు. వారు అన్ని కోరికల నుండి ముక్తులుగా, ఇచ్ఛా మాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు.

స్లోగన్‌ :-

'' దేహాభిమానాన్ని తొలగిస్తే ,పరిస్థితులన్నీ స్వతహాగా తొలగిపోతాయి ''