28-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీకు ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామములోకి వెళ్ళేందుకు ఆధారము లభించింది, మీరు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా, కర్మాతీతంగా అయ్యి మీ శాంతిధామములోకి వెళ్లిపోతారు ''
ప్రశ్న :-
తండ్రి ఏ పిల్లలను బుజ్జగిస్తారు(ముద్దు చేస్తారు)? పిల్లలు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేస్తారు?
జవాబు :-
ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులుగా, సేవాధారులుగా, చాలా మధురంగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరో అటువంటి పిల్లలకే బాబా నుండి బుజ్జగింపు(ప్రేమ) లభిస్తుంది. పిల్లలైన మీకు పరస్పరములో చాలా ప్రేమ ఉన్నప్పుడు, మీ ద్వారా ఏ తప్పులూ జరగనప్పుడు, మీ నోటి నుండి దు:ఖమునిచ్చే మాటలు వెలువడనప్పుడు, సదా సోదర భావము యొక్క ఆత్మిక ప్రేమ ఉన్నప్పుడు తండ్రిని ప్రత్యక్షము చేయగలరు.
పాట :-
నాకు ఆధారమునిచ్చే వారు........... (ముఝ్కో సహారా దేనేవాలే..............) 
ఓంశాంతి.
ఈ పాటను పిల్లలు ఎన్నోసార్లు విన్నారు. ఈ ఆవాగమనము(వచ్చి పోవుట)లో తాము ఎంతగా భ్రమించారో, పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామా ప్లాను అనుసారము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకున్నారు. సుఖధామములో తామంతకు తామే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకునేవారు. ఇప్పుడు తండ్రి శరీరాన్ని సంతోషంగా వదిలేందుకు విధానాన్ని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనము పరంధామము నుండి వచ్చామని, ఇక్కడ పాత్రలు అభినయము చేస్తున్నామని పిల్లలు అర్థము చేసుకున్నారు. మొట్టమొదట ఆత్మలైన మనము అవినాశి అని నిశ్చయము ఉండాలి. ఆధారమును ఇచ్చేవారు, సహాయము చేసేవారు ఒక్క తండ్రియేనని పిల్లలకు అర్థము చేయించబడింది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా చాలా సంతోషము కలుగుతుంది. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. మొదట అందరూ శాంతిధామములో ఉంటారు. తర్వాత మొదట సుఖధామములోకి వస్తారు. తండ్రి మీకు ఆశ్రయమును ఇస్తారు. పిల్లలూ! మీ శాంతిధామము, సుఖధామములు రానే వచ్చేస్తాయి. ఆత్మలైన మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటామనే నిశ్చయమేమో ఉంది. అవినాశి పాత్ర ముందే లభించి ఉంది. మీరు ఈ 84 జన్మల పాత్రను అభినయించాలి. తండ్రి పిల్లలతోనే మాట్లాడ్తారు ఎందుకంటే ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి మార్గాన్ని తెలుపుతారు. ఆత్మకు ఏ విధమైన భయం ఉండరాదు. మనం చాలా ఉన్నతమైన పదవి పొందుతాము. మీరు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు. ఇది అంతిమ జన్మ. శాంతిధామము, సుఖధామములోకి వెళ్ళేందుకు నాకు ఆధారము లభించిందని ఆత్మ అర్థం చేసుకుంది. కావున సంతోషంగా వెళ్లాలి. కాని ఇప్పుడు ఆత్మ పతితంగా ఉందని, ఆత్మ రెక్కలు విరిగిపోయాయని జ్ఞానము లభించింది. మాయ రెక్కలను విరిచేస్తుంది. అందువలన వాపస్ వెళ్లలేదు. తప్పకుండా పావనంగా అవ్వాలి. అక్కడి నుండి క్రిందికేమో వచ్చేశారు కానీ ఇప్పుడు తమకు తాముగా వాపస్ వెళ్లలేరు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించవలసిందే. మనం చాలా ఉన్నతమైన కులానికి చెందినవారమని మీరు కూడా అర్థము చేసుకోవాలి. ఇప్పుడు మాకు మళ్లీ చాలా ఉన్నతమైన వంశములో రాజ్యభాగ్యం లభిస్తుంది. అటువంటప్పుడు ఈ శరీరాన్ని ఏమి చేసుకుంటాము? అక్కడ మాకు కొత్త శరీరము లభిస్తుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి. తండ్రి తన పరిచయమును కూడా ఇచ్చారు. అలాగే ఈ రచన ఆది-మధ్య-అంత్యముల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. ఆత్మయే సతోప్రధానము, సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మయే పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి అని బాబా చెప్తున్నారు. ధన-సంపత్తులు, ఇల్లూ, పిల్లలు మొదలైన వాటిలోకి బుద్ధి వెళ్లినట్లయితే కర్మాతీత స్థితిని పొందలేరు. అప్పుడు పదవి తగ్గిపోతుంది. శిక్షలను కూడా అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మనము తిరిగి వెళ్లనున్నాము. పావనంగా అయ్యి తిరిగి వెళ్ళాలి. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కావున మనం సంతోషంగా ఆ తండ్రిని ఎందుకు స్మృతి చేయరాదు! తద్వారా మన వికర్మలు వినాశనమౌతాయి. స్వయం స్మృతి చేస్తూ ఇతరులకు తెలిపిస్తే వారికి కూడా బాణం తగులుతుంది. దీనిని విచార సాగర మథనము అని అంటారు. ఉదయాన్నే విచార సాగర మథనము బాగా నడుస్తుంది. ఎందుకంటే బుద్ధి మంచిరీతిగా ఉంటుంది. విచార సాగర మథనము వలన రిఫ్రెష్ అవుతారు. భక్తి కూడా ఆ సమయంలోనే జరుగుతుంది. ప్రభాతవేళలో రాముడిని స్మృతి చేయి నా మనసా! అన్న పాట కూడా ఉంది. భక్తి మార్గములో అయితే కేవలం పాడేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉదయము ఉదయమే లేచి నన్ను స్మృతి చేయండి అని ఆదేశమునిస్తున్నారు. సత్యయుగములో రాముని స్మరించరు. ఇదంతా తయారైన డ్రామా. తండ్రి వచ్చి జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకు ముందు మీకు తెలియదు. అందుకే మిమ్ములను రాతిబుద్ధి గలవారని అంటారు. సత్యయుగములో అలా అనరు. ఈశ్వరుడు మీకు మంచి బుద్ధిని ఇవ్వాలి అని ఈ సమయంలోనే అంటారు. ఇక్కడి ఈ గాయనమే భక్తిమార్గములో కొనసాగుతుంది. తండ్రి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు - '' పిల్లలూ! మీరు అనంతమైన తండ్రినైన నన్ను మర్చిపోయారు. మీకు అర్ధకల్పం కొరకు నేనే అనంతమైన వారసత్వమును ఇచ్చాను. మీ చేత అనంతమైన సన్యాసము నేనే చేయించాను. ఈ పురాతన ప్రపంచమంతా శ్మశాన యోగ్యముగా అవ్వనున్నదని నేనే చెప్పాను. మరి మీరు ఆ అంతమవ్వనున్న దానిని ఎందుకు స్మృతి చేస్తున్నారు? ''బాబా, మమ్ములను పతిత ప్రపంచము నుండి విడిపించి పావన ప్రపంచములోకి తీసుకు వెళ్ళండి'' అని నన్నే పిలుస్తారు. పతిత ప్రపంచములో కోట్లాది మంది మానవులున్నారు, పావన ప్రపంచములో చాలా కొద్దిమందే ఉంటారు. కావున మృత్యువులకు మృత్యువైన ఆ మహాకాలుడిని పిలుస్తారు కదా! మీరు వచ్చి భక్తికి ఫలితమును ఇవ్వండి అని భక్తులు భగవంతుని పిలిచారు. మేము ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నామని అంటారు. అర్ధకల్పము నుండి అలవాటయ్యింది. కావున దానిని వదిలేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలు నంబరువారు పురుషార్థానుసారము కల్పక్రితము వలె తమ కర్మాతీత స్థితిని పొందుతారు. మళ్లీ వినాశనం అయిపోతుంది. ఇప్పుడైతే ఉండేందుకే చోటు లేదు. ధాన్యము లేదు. మరి ఎలా తింటారు! అమెరికాలో కూడా కోట్లాది మనుష్యులు ఆకలితో మరణిస్తారని చెప్తారు. ఈ ప్రాకృతిక వైపరీత్యాలు అయితే సంభవించివలసిందే. యుద్ధము ప్రారంభమైతే ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? యుద్ధము కూడా చాలా భయంకరంగా జరుగుతుంది. వారి వద్ద తయారుగా ఉన్న సామానంతటినీ(బాంబులు మొదలైనవి) బయటికి తీస్తారు. వాటికి ప్రకృతి వైపరీత్యాలు కూడా తోడు అవుతాయి. అంతకుముందే కర్మాతీత స్థితిని పొందాలి. నలుపు(అపవిత్రము) నుండి సుందరంగా (పవిత్రంగా) అవ్వాలి. కామచితి పై కూర్చొని నల్లగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి సుందరమైనవారిగా తయారుచేస్తారు. ఆత్మలు ఉండే స్థానం ఒక్కటే కదా. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. మీరు రామరాజ్యమును, రావణ రాజ్యమును రెండిటిని దాటుతారు.
ఇప్పుడిది పాత ప్రపంచము అంతమయ్యే సమయము, నేను అంతిమ సమయంలోనే పిల్లలు పిలిచినప్పుడే వస్తానని తండ్రి తెలిపించారు. పురాతన ప్రపంచము తప్పకుండా వినాశనమవ్వనున్నది. వేటగానికి వేట, వేటకు మృత్యువు(మిరువా మౌత్ మలూకా శికార్......... పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం.....) అన్న గాయనము కూడా ఉంది. కాని తండ్రి ఇచ్చిన శ్రీమతమును అనుసరించకపోతే ఆ సంతోషము ఉండదు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి అమరపురిలోకి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. మీ పేరే శక్తి దళము, శివశక్తులు తర్వాత మీరు ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలు, శివునికేమో అందరూ పుత్రులే తర్వాత సోదర-సోదరీలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచించడం జరుగుతుంది. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ఫాదర్(తాతలకు తాత ముత్తాత) అని అంటారు. కావున తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే శరీరము ద్వారా అన్ని పనులు చేస్తుంది. శరీరాన్ని కొట్టినప్పుడు ఆత్మయే - ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా ఫలానా ఆత్మ యొక్క శరీరాన్ని కొట్టానని అంటుంది. ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా ఈ పొరపాటు చేశానని పిల్లలు ఉత్తారాలలో వ్రాస్తారు. శ్రమ కలుగుతుంది కదా. ఈ విషయములో విచార సాగర మథనము చేయాలి. పురుషులకు ఇది చాలా సహజము. బొంబాయిలో ఉదయం విహరించేందుకు(వాకింగ్కు) ఎందరో వెళ్తూ ఉంటారు. కాని మీరు ఏకాంతములో విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. బాబాను మహిమ చేస్తూ ఉండండి - బాబా! మీ కర్తవ్యము అద్భుతము. దేహధారుల మహిమ గానం చేయబడదు. ఉన్నతోన్నతుడు భగవంతుడు. వారు విదేహి. వారు ఎప్పుడూ దేహాన్ని ధరించరు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని వారు స్వయం తెలియజేశారు. ఇతనికి తన జన్మలను గూర్చి తెలియదు. మీకు కూడా తెలియదు. ఇప్పుడు ఇతను నా ద్వారా తెలుసుకున్నారు. అలాగే మీరు కూడా తెలుసుకున్నారు. కావున ఇది కూడా ఒక అభ్యాసమే. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీకు చాలా సంతోషము కలుగుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఆత్మనే చూస్తూ ఉంటారు. అప్పుడు వికారాల విషయమేదీ ఉత్పన్నమవ్వదు. అశరీరి భవ! అని తండ్రి అంటారు. అలాంటప్పుడు వికారి(క్రిమినల్, నేర ప్రవృత్తి గల) ఆలోచనలు ఎందుకు ఉత్పన్నమౌతాయి? శరీరాన్ని చూచుట వలన క్రింద పడిపోతారు. ఆత్మనే చూడాలి. నేను ఒక ఆత్మను, నేను ఈ పాత్రను అభినయించాను. ఇప్పుడు తండ్రి 'అశరీరి భవ' అని అంటున్నారు. నన్ను స్మృతి చేసినట్లైతే మీ పాపాలు అంతమైపోతాయి. అంతేకాక స్మృతియాత్రలో ఉండడం ద్వారా సంపాదన జమ అవుతుంది. ఉదయంవేళ చాలా మంచిది. కేవలం బాబాను తప్ప ఇంకెవ్వరినీ చూడకండి. ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యము. మన్మనాభవ, మధ్యాజీభవ అన్న పదాల అర్థము ఎవ్వరికీ తెలియదు.
భక్తి ప్రవృత్తి మార్గం వారి కోసమే అని మీరు అర్థం చేయించవచ్చు. ఆ నివృత్తి మార్గం వారు అడవిలో ఏ భక్తిని చేస్తారు? ఇంతకు ముందు వారు కూడా సతోప్రధానంగా ఉండేవారు. ఆ సమయంలో వారికి అన్నీ అడవిలోకి, వారి వద్దకే వచ్చి చేరేవి. ఇప్పుడు ఆ కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే తమోప్రధానమైనందున ఇప్పుడు వారి వద్దకు ఏమీ వచ్చి చేరుకోవు. భక్తులకు వారి పై శ్రద్ధ లేదు. ఆ కారణంగానే (నివృత్తి మార్గము వారు) ఇప్పుడు వ్యాపారాలలో నిమగ్నమైపోయారు. కోటీశ్వరులుగా, పదమపతులుగా ఉన్నారు. ఇప్పుడు అదంతా అంతమవ్వనున్నది. అంతేకాని ఈ బంగారము ద్వారా భవనాలు మొదలైనవి తయారవుతాయని కాదు. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. ధాన్యం కూడా కొత్తగా ఉంటుంది. కొత్త ప్రపంచములో అన్ని వస్తువులూ ఫస్ట్క్లాస్గా ఉంటాయి. ఇప్పుడైతే భూమి పాడైపోయింది. కావున ధాన్యం కూడా పూర్తిగా పండుట లేదు. అక్కడ భూమి, సాగరము అన్నియు మీవిగా ఉంటాయి. అక్కడ ఎంతో శుద్ధమైన భోజనాన్ని తింటారు. ఇక్కడ చూడండి - జంతువులను కూడా వండుకొని తింటారు. అక్కడ అసలు ఇటువంటి విషయమేదీ ఉండదు. కావున పిల్లలైన మీరు బాబాకు ఎంతో కృతజ్ఞతలు తెలపాలి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. నేను సాధారణ వృద్ధ మానవుని శరీరములో ఇతని వానప్రస్థావస్థలో ప్రవేశిస్తాను - ఈ విషయాన్ని తండ్రియే చెప్పారని ఇతరులకు కూడా తెలియచేస్తారు. వానప్రస్థావస్థలోనే వాపసు వెళ్లాలి. ఇది కూడా ఒక నియమము. భక్తిలో కూడా ఇదే ఆచారం నడుస్తుంది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. కొందరు బాగా వ్రాసుకొని ధారణ చేసి ఇతరులకు కూడా వినిపిస్తారు. వినడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధారము లభించింది.
ప్రతి ఆత్మ భృకుటి సింహాసనము పై విరాజమానమై ఉందని మీకు తెలుసు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన తార మెరుస్తూ ఉంటుంది..........(భృకుటి కే బీచ్ చమక్తా హై అజబ్ సితారా......) అని ఆత్మను గూర్చే అంటారు. పరమపిత పరమాత్మ శివుడు మెరుస్తారని అనరు కాని మెరిసేది ఆత్మయే, ఆత్మలు పరస్పరములో సోదరులు. అందుకే హిందువులు, ముస్లింలు, బౌద్ధులు పరస్పరం సోదరులు అని అంటారు. కాని సోదరులు అనే దానికి అర్థము తెలియదు. పరస్పరములో ఎంతగా ప్రేమ ఉండాలి! సత్యయుగంలో జంతువుల మధ్య కూడా పరస్పరం ప్రేమ ఉంటుంది. మీరంతా సోదరులు కనుక మీకు ఎంతటి ప్రేమ ఉండాలి! కాని దేహాభిమానంలోకి రావడం వలన పరస్పరం ఒకరితో ఒకరు ఎంతో విసుగు చెందుతారు. మళ్లీ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు పరస్పరం ఎంతో క్షీర ఖండము(పాలు - పంచదార) వలె నడుచుకోవాలి. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థమైతే చేస్తున్నారో దాని వల్ల 21 జన్మలు క్షీర ఖండముగా నడుస్తారు. ఏదైనా తప్పు పదము నోటి నుండి వెలువడినట్లైతే నన్ను క్షమించండి (ఐ యామ్ సారి) అని అనాలి. ఎందుకంటే చాలా మధురంగా ఉండాలని బాబా ఆజ్ఞాపించారు. ఆజ్ఞను పాటించని వారిని ఈశ్వరుని ఆజ్ఞాపరులు కాని వారు అని అనడం జరుగుతుంది. ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు. సిపాయి పని చేసేవారు. దానికి న్యాయం చేకూర్చేందుకు ఎవరినైనా చంపవలసి ఉంటుందని కూడా బాబాకు తెలుసు. మిలిట్రీ వారు(సైనికులు) యుద్ధం కూడా చెయ్యవలసి ఉంటుంది. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లైతే మీ నావ తీరాన్ని చేరుకుంటుంది. ఈ పాత ప్రపంచాన్ని చూసేదేముంది? మనమైతే కొత్త ప్రపంచాన్నే చూడాలి. ఇప్పుడు శ్రీమతము ద్వారా క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. టీచర్ ఎప్పుడూ ఆశీర్వదించరు, చదివిస్తారు. ఎవరు ఎంతగా చదువుతారో మంచి నడవడికను ధారణ చేస్తారో అంత మంచి పదవిని పొందుతారు. ఇక్కడ కూడా అంతే మేము ఎలా నడుస్తున్నామని మీ రిజిష్టరును మీరే చూసుకోవాలి. కొందరు చాలా మధురంగా నడుచుకుంటారు. ప్రతి విషయములోనూ రాజీగా ఉంటారు. బ్రాహ్మణీలు పరస్పరము ఏ పొరపాట్లు జరగడం లేదు కదా! అని కచేరి జరపండి అని బాబా అన్నారు. కచేరి చేసేవారు కూడా నేను ఒక ఆత్మను, ఈ శరీరము ద్వారా ఏ పొరపాటు జరగలేదు కదా, ఎవ్వరికీ దు:ఖమునివ్వలేదు కదా అని సోదర ఆత్మను అడుగుతున్నాను అని భావించాలి. తండ్రి ఎప్పుడూ దు:ఖమునివ్వరు. సుఖధామానికి అధిపతులుగా చేస్తారు. తండ్రి దు:ఖహర్త-సుఖకర్త కావున మీరు కూడా అందరికీ సుఖమునివ్వాలి. ఎప్పుడూ తప్పుగా మాట్లాడరాదు. ఎప్పుడూ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోరాదు. రిపోర్ట్ చేయడమే మీ పని. చాలా మధురంగా అవ్వాలి. ఎంత మధురంగా అవుతారో అంతగా తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. బాబా ప్రేమసాగరులు, మీరు కూడా ప్రేమగా అర్థం చేయిస్తే మీకు విజయము కలుగుతుంది. నా ప్రియమైన పిల్లలూ! ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదని బాబా అంటారు. పొరపాట్లు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. చాడీలు చెప్పడం, ఈర్ష్య పడడం, పరిహాసం చేయడం...... ఇవన్నీ వికర్మలే కదా!
విశ్వాసపాత్రులైన, సేవాధారులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు నాకు తప్పకుండా ప్రియంగా అనిపిస్తారు. వారిని ముద్దు చేస్తాను కూడా. ఇతరులను అలా ముద్దు చేయను. అప్పుడు అతడు గొప్ప వ్యక్తి కదా! అందుకే విశేషంగా వారికి పాలన జరుగుతుందని అంటారు. ఈ విధంగా చాలా నష్టము కలిగిస్తారు. ఏవో తప్పుడు పనులు చేసి దోషాన్ని మోపుతారు. ఫలానావారు బీడి వదలడం లేదు..... అని సమాచారం వస్తుంది. అప్పుడు నీవు యోగబలము ద్వారా విశ్వాన్ని పావనంగా చేసే ఆత్మవు, మరి ఈ బీడిని వదలలేవా? అని అతనికి అర్థం చేయించాలని బాబా చెప్తారు. బాబాను స్మృతి చేయండి, బాబా అవినాశి సర్జన్, వారు ఎలాంటి మందునిస్తారంటే దానితో అన్ని దు:ఖాలూ దూరమైపోతాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు విసిగించుకోరాదు. ప్రతి విషయంలోనూ రాజీగా ఉండాలి. ఎప్పుడూ ఎవరి పైనా చాడీలు చెప్పరాదు, పరిహసించరాదు, ఈర్ష్య పడరాదు. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. పరస్పరం చాలా మధురంగా, క్షీర ఖండముగా ఉండాలి.
2. ఉదయము ఉదయమే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. విచార సాగర మథనం చేస్తూ బాబాకు ధన్యవాదాలు తెలపాలి.
వరదానము :-
'' దిల్ ఔర్ దిమాగ్ (మనస్సు, బుద్ధి) రెండిటి బ్యాలన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతా మూర్త్ భవ ''
చాలాసార్లు పిల్లలు సేవలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తారు. కాని మనసు, బుద్ధి రెండిటిని కలిపి సేవ చేయండి. అప్పుడు సేవలో సఫలతామూర్తులుగా అవుతారు. ఎవరైతే కేవలం బుద్ధి ద్వారా సేవ చేస్తారో వారి బుద్ధిలో ''చేయించేవారు బబాయే కదా'' అని కొంత సమయం గుర్తుంటుంది కాని తర్వాత మళ్లీ 'నేను, నాది (మైపన్)' గుర్తు వచ్చేస్తుంది. ఎవరైతే మనసుతో చేస్తారో వారి హృదయంలో బాబా స్మృతి సదా ఉంటుంది. మనసుతో సేవ చేసిన ఫలితము తప్పకుండా లభిస్తుంది. రెండిటి బ్యాలన్స్ ఉంటే సదా సఫలత ఉంటుంది.
స్లోగన్ :-
'' బేహద్లో (అనంతంలో) ఉంటే హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి. ''
బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఎలాగైతే తండ్రి(బ్రహ్మాబాబా) మాస్టర్ జ్ఞానసూర్యునిగా అయ్యి జ్ఞాన ప్రకాశాన్ని
ఇవ్వడంతో పాటు యోగ కిరణాల శక్తి ద్వారా ప్రతి ఆత్మలోని పాత సంస్కారాలనే
కీటాణువులను(బ్యాక్టీరియా) నాశనం చేసే కర్తవ్యాన్ని చేశాడో, అలా పిల్లలైన మీరు
నడుస్తూ, తిరుగుతూ మీ మస్తిష్కం ద్వారా లైట్ గోళం కనిపించాలి, వాచా ద్వారా జ్ఞాన
శక్తి అనే గోళము కనిపించాలి అనగా బీజము కనిపించాలి. మాస్టర్ బీజరూపంగా, లైట్ -
మైట్ల గోళంగా అవ్వండి అప్పుడు సాక్షాత్ లేక సాక్షాత్కార మూర్తులుగా అవ్వగలరు.