12-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇక్కడ శిక్షకుడు (టీచర్‌) విదేహీ కనుక స్మృతి చేసేందుకు శ్రమ చేయాలి, స్మృతి చేస్తూ చేస్తూ పరీక్ష పూర్తి అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారు.''

ప్రశ్న :-

పిల్లలు స్మృతిలో ఉండేందుకు కష్టపడాలి, ఎప్పుడూ ఏ మోసములోకి రాకూడదు?

జవాబు :-

ఆత్మ సాక్షాత్కారమయ్యింది, మిరుమిట్లు గొలుపు కాంతిని చూచాను........ ఇటువంటి వాటి వల్ల ఏ విధమైన లాభమూ లేదు. సాక్షాత్కారము వలన లేక బాబా దృష్టి పడుట వలన ఏ విధమైన పాపము తొలగిపోదు లేక ముక్తి లభించదు. ఇంకా ఎక్కువగా మోసపోతూ ఉంటారు. స్మృతి చేసే శ్రమ చేయండి. శ్రమ ద్వారానే కర్మాతీత అవస్థను పొందుతారు. బాబా దృష్టినిచ్చినట్లైతే మీరు పావనంగా అవుతారని కాదు. శ్రమ చేయాలి.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, చదివిస్తున్నారు, యోగము నేర్పిస్తున్నారు. యోగమేమీ గొప్ప విషయము కాదు. విద్యార్థులు చదువుకునేటప్పుడు - ఫలానా టీచరు తన సమానంగా చేసేందుకు మమ్ములను చదివిస్తున్నారని తప్పక టీచరుతో వారి యోగము తప్పకుండా జోడించబడి ఉంటుంది. లక్ష్యము - ఉద్ధేశ్యము(ఎయిమ్‌ - ఆబ్జెక్ట్‌) లుంటాయి. ఫలానా తరగతిలో చదువుతున్నామని భావిస్తారు. నాతో యోగము జోడించమని విద్యార్థులకు టీచరు చెప్పవలసిన అవసరము లేదు. స్వతహాగా చదివించేవారి జతలో యోగము జోడించబడి ఉంటుంది. రోజంతా చదివించరు కదా! ఆ చదువును జన్మ-జన్మాంతరాల నుండి చదువుకుంటూనే వస్తున్నారు, అభ్యాసమైపోతుంది. కాని ఇక్కడ మీది పూర్తిగా కొత్త అభ్యాసము. ఇక్కడ చదివించేది దేహధారి టీచరు కాదు. వీరు విదేహి టీచరు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీకు లభిస్తారు. వారు స్వయంగా ''నేను మీ దేహధారి టీచరును కాను అని చెప్తున్నారు.'' అందువల్లనే వీరి స్మృతి నిలువదు. స్వయాన్ని ఆత్మగా భావించవలసి ఉంటుంది. మమ్ములను పరమపిత పరమాత్మ శిక్షకులై(టీచరై) చదివిస్తున్నారని భావించాలి. పరీక్షలో ఉత్తీర్ణులయ్యేంత(పాస్‌) వరకు టీచరును తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటికి వెళ్లిపోతారు. పరీక్ష పూర్తి అవ్వగానే నాటకము సమాప్తమైపోతుంది. ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర నిండి ఉందని, దానిని మీరు అభినయించాలని పిల్లలకు తెలుసు. అది కూడా ఇప్పుడే తెలిసింది. తర్వాత అక్కడ(సత్యయుగములో) ఇది గుర్తుండదు. ఇక్కడ మీకు సంపూర్ణ జ్ఞానము లభిస్తుంది. టీచరు కూర్చొని సంపూర్ణ జ్ఞానాన్ని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. దీనిని అర్థం చేసుకుంటూ ఉండాలి. స్మృతిలో కూడా తప్పకుండా ఉండాలి. ''మన్మనాభవ'' అని తండ్రి ఘడియ-ఘడియ చెప్తున్నారు. మన్మనాభవ అను దానికి తప్పకుండా అర్థము కూడా ఉంది. ఈ పదము సరైనదేనని పిల్లలకు తెలుసు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - మీరు నన్ను స్మృతి చేసినట్లైతే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇందులో సమయము పడ్తుంది కదా. తమను తాము పరిశీలించుకోవాలి. ఆ చదువులో చరిత్ర, గణితము, విజ్ఞాన శాస్త్రము,........ మొదలైన సబ్జక్టులు ఉంటాయి. తామెంతవరకు ఉత్తీర్ణులు అవ్వగలరో, విద్యార్థులు అర్థము చేసుకోగలరు. మీరు ఎన్ని మార్కులతో ఉత్తీర్ణులు అవ్వగలరనేది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము బాబాను మర్చిపోవడం లేదు కదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. బాబా! మాయ క్షణ-క్షణానికి మరిపింపజేస్త్తోంది, చాలా తుఫాన్లను తీసుకొేస్త్తోంది, ఎన్నో వికల్పాలు వస్తున్నాయని చాలామంది వ్రాస్తారు. అర్థమవ్వని కారణంగా ఇందులో మాకు పాపము అంటదు కదా! రకరకాల సంకల్ప-వికల్పాలు వస్తున్నాయని వ్రాస్తారు. చూచినందున ఇలా చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఇందులో పాపము అంటదు కదా? అని పిల్లలు అడుగుతారు. అలా జరగదని, కర్మేంద్రియాల ద్వారా వికర్మ జరిగినప్పుడే పాపము అంటుతుందని తండ్రి చెప్తున్నారు.

బాబా పలుమార్లు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానమైతే ఉంది. విష్ణువుకు, కృష్ణునికి స్వదర్శన చక్రమును ఎందుకు చూపారో కూడా పిల్లలకు తెలుసు. అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని చంపినట్లు చూపిస్తారు. ఇప్పుడు చంపే విషయమే లేదు. ఇదైతే స్వయంలోని పాపాలు తెగిపోయే విషయము. శివబాబాను కూడా స్వదర్శన చక్రధారి అని అంటారు కదా! వారికి మొత్తం చక్రమంతటి జ్ఞానము ఉంది. ఆత్మకు తండ్రి ద్వారా ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుందనే జ్ఞానము లభించింది. స్వదర్శన చక్రమును ధారణ చేసి తమ పాపాలను భస్మము చేసుకోవాలి. జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము శ్రమ చేయాల్సి ఉంటుంది. తండ్రి కూర్చొని దృష్టినిచ్చినట్లయితే వీరి పాపాలు నశిస్తాయని కాదు. తండ్రి కూర్చొని ఈ వ్యాపారమేమీ చేయరు. సాధారణంగా వారు అందరినీ చూస్తారు. వారు చూడటం ద్వారా లేక జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా వికర్మలేమీ వినాశనమవ్వవు. ఇలా ఇలా చేసినట్లైతే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి మార్గాన్ని తెలియజేస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. తండ్రి వస్తారు, ఆత్మలని భావించి దృష్టినిస్తారనుకోండి, అంతమాత్రాన మన పాపాలు తొలగిపోవు. మనము స్మృతిలో ఉండే శ్రమ చేయడం ద్వారానే పాపాలు కట్‌ అవుతాయి. ఒకవేళ ఈ విధంగా తండ్రి కూర్చొని(పాపాలను తొలగిపోయేటట్లు) చేసినట్లైతే, అదొక వ్యాపారమైపోతుంది. మీరు ఇలా ఇలా మీ తండ్రిని స్మృతి చేయమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి శ్రీమతమునిచ్చేవారు. ఎవరికి వారు శ్రమ చేయాలి. ఫలానా సాధువు, సన్యాసుల దృష్టి పడితే చాలు అని చాలామంది భావిస్తారు. ఈ విధంగా కృప, ఆశీర్వాదాలను తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికి దిగజారుతూనే ఉంటారు. వారేమి కృప చూపుతారు? వారైతే తమ బ్రహ్మ మహాతత్వమునే స్మృతి చేస్తారు. పిల్లలూ! మీరు ఇలా ఇలా చేయండని తండ్రి స్పష్టమైన మార్గమును తెలిపిస్తారు. నగ్నంగా వచ్చింది, నగ్నంగానే వెళ్ళాలని గాయనము కూడా చేస్తారు. ఈ గాయనము కూడా ఈ సమయములోదే. తండ్రి చెప్పే మహావాక్యాలు మళ్లీ భక్తిలో పనికి వస్తాయి. నన్ను స్మృతి చేసినట్లైతే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - తండ్రి శ్రీమతాన్నిస్తారు. ఇది కూడా నాటకములో వారి పాత్రయే. దీనినే సహాయము అని కూడా అనవచ్చు. డ్రామానుసారము శ్రీమతము గాయనము చేయబడింది. తండ్రి మతాన్ని ఇవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. అంతేకాని వారు సహాయము చేసి కర్మాతీత అవస్థలోనికి తీసుకెళ్తారని కాదు. సమయము పడ్తుంది. చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మ అని భావించే అభ్యాసము చాలా బాగా చేయాలి. వాస్తవానికి మాతలకు చాలా సమయము లభిస్తుంది. పురుషులకు వ్యాపారాలను గురించిన చింత ఉంటుంది. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లాటరీ తీసుకోవాలి. దీని ద్వారా మీకు పట్టిన తుప్పు అంతా తొలగిపోతుంది. ఫలానావారు మంచి పురుషార్థులని, చార్టు ఉంచుతారని అనుభూతి కలుగుతుంది. భక్తిలో 2-3 గంటలు కూడా భక్తి చేస్తూ కూర్చుండిపోతారు కదా. వానప్రస్థులు గురువుల వద్దకు వెళ్ళి చాలా శిష్యరికము చేస్తారు. కాని దేవతలను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆ గురువులను స్మృతి చేయరు. వాస్తవానికి దేవతలను స్మృతి చేయరాదు. ఎప్పుడూ స్మృతి చెయ్యమని దేవతలు నేర్పించరు.

పిల్లలైన మీ కొరకు ఇది కొత్త విషయమేమీ కాదు. లక్షల సంవత్సరాల మాటే లేదు. స్థాపన మరియు వినాశన కార్యము చేయవలసినప్పుడు తండ్రి వస్తారు. ఈ వినాశనమైతే కల్ప-కల్పము జరుగుతూనే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితము కూడా జరిగింది. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఇలా జరిగిందని మీరు వ్రాస్తూ ఉంటారు. తండ్రి తనతో కలిసేందుకు మార్గాన్ని తెలియజేయడం కొత్త విషయమేమీ కాదు. నేను కల్ప-కల్పము వచ్చి మార్గాన్ని తెలియజేస్తానని తండ్రి చెప్తున్నారు. మీ రాజ్యస్థాపన జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఏ దేవతలనైతే పూజిస్తున్నారో మళ్లీ వారి రాజ్య స్థాపన జరుగుతోంది. 5 వేల సంవత్సరాల ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది విని మనుష్యులు తికమకపడ్తారు, ఆశ్చర్యపడ్తారు. అందరూ మాయ మతము పై నడుస్తున్నారు. రావణుని ఎందుకు తగులబెడ్తారో దాని అర్థము కొద్దిగా కూడా తెలియదు. మీ పేరే స్వదర్శన చక్రధారి. లక్ష్యము-ఉద్ధేశ్యము మీ ఎదురుగానే నిలిచి ఉంది. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో అది ఆత్మలకు ఇచ్చారు. డ్రామా చక్రము పూర్తి అవ్వవలసి ఉన్నప్పుడే తండ్రి వచ్చి జ్ఞానమును ఇస్తారు. తండ్రియే వచ్చి ఈ కర్మలు నేర్పిస్తారు. తర్వాత వామమార్గములోకి వెళ్ళడం ద్వారా రాత్రి ప్రారంభమైపోతుంది. తర్వాత మనము క్రిందికి దిగుతూనే వస్తాము. సుఖము తగ్గుతూ వస్తుంది. తండ్రి బుద్ధిలో ఎలాగైతే సంపూర్ణ చక్ర జ్ఞానముందో, అలాగే ఉన్నది ఉన్నట్లుగా మీ బుద్ధిలో కూడా ఉంది అయితే మీరు పావనంగా అయ్యేందుకు శ్రమ చేయవలసి పడ్తుంది. అందువల్లనే ''బాబా! మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయండి'' అని పిలుస్తారు. తర్వాత జ్ఞానము కూడా కావాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వస్తారు, ఇతరులకు నేర్పించేందుకు కాదు. బాబా! వచ్చి మనుష్యులను పావనంగా తయారుచేయండి అని పతితపావనులైన తండ్రినే పిలుస్తారు. ఇప్పుడు మీరు పుణ్యాత్మలుగా అవుతున్నారు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు మళ్లీ రిపీట్‌ అవుతున్నాయి. ఇవి ఎంతో గుహ్యమైన విషయాలు! మనుష్యులకు ఆత్మను గురించి గాని, పరమాత్మను గురించి గాని తెలియదు. ఆత్మ ఎవరు? ఎలా ఉంది? దాని పాత్ర ఎలా ఉంటుంది? అనే విషయాలు కూడా తండ్రియే తెలియజేస్తారు. అతిచిన్న ఆత్మలో ఏమేమో పాత్ర నిండి ఉంది, ఇది అద్భుతము. వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కొందరికి ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది. ఆత్మలు మినుకు మినుకుమంటూ కనిపిస్తాయి. కాని దాని వల్ల లాభమేముంది? ఇక్కడైతే యోగమును జోడించాలి. సాక్షాత్కారమవ్వగానే ముక్తి లభించిందని, పాపాలు భస్మమైపోయాయని మనుష్యులు భావిస్తారు. ఇది ఒక రకంగా ఇంకా ఎక్కువగా మోసపోవడమే. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తూనే ఉంటారు. మీకు గుహ్యమైన విషయాలు వినిపిస్తానని అంటారు. మీ బుద్ధిలో మొత్తం చక్ర జ్ఞానమంతా ఉంది. బాబాను, చక్రమును స్మృతి చేస్తే చాలు. టీచరును కూడా స్మృతి చేయాలి. జ్ఞానాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. స్మృతి చేస్తూ చేస్తూ డ్రామానుసారంగా కర్మాతీత అవస్థను పొందుతారు. ఎలాగైతే ఆత్మ నగ్నంగా వచ్చిందో అలా నగ్నంగానే వెళ్లాలి. మీరు దైవీ సంస్కారాలను తీసుకెళ్తారు. అక్కడ ఏ జ్ఞానమూ ఉండదు. దీనినే సహజ స్మృతి అని అంటారు. యోగము అనే పదమును ఉపయోగించడం ద్వారా మనుష్యులు తికమకపడ్తారు. వారు హఠయోగులు, సహజ యోగమును తండ్రియే నేర్పిస్తారు. గీతా భగవానుడు సహజయోగమును నేర్పించారని ఇంతకు మునుపు మీరు వినేవారు. కాని ఆ భగవంతుని గురించి తెలియదు. నూటికి నూరు శాతము అనర్థమైపోయింది. దాని వల్లనే మనుష్యులు పతితమైపోయారు. అనేక మతాలున్నాయి. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటారో వారి కొరకే ఈ గీతా శాస్త్రముంది. మీరు ప్రవృత్తి మార్గములోనివారు. మొదట మీది పవిత్ర ప్రవృత్త్తి మార్గముగా ఉండేది. ఇప్పుడు అపవిత్రమైపోయింది. మళ్లీ ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. తండ్రి అయితే సదా పవిత్రమైనవారు (ఎవర్‌ప్యూర్‌). వారు శ్రీమతమును ఇచ్చేందుకే వస్తారు.

ఈ సమయములో అందరూ తమోప్రధానంగా అయిపోయారని తండ్రి చెప్తున్నారు. మొదట సతోప్రధానంగా ఉండేవారు. మనము ఏ విధంగా మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత మళ్లీ తమోప్రధానంగా అయ్యామో అలాగే పోప్‌ ఫాదర్‌ మొదలైన వారందరూ ఎవరైతే వస్తారో వారు కూడా మొదట సతోప్రధానంగా ఉంటారు. తర్వాత ఎడిషన్‌ అవుతూ అవుతూ(వృద్ధి చెందుతూ) వృక్షమంతా తమోప్రధానమైపోతుంది. ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది. పిల్లలైన మేమే సతోప్రధానంగా ఉండేవారమని తర్వాత నంబరువారుగా, తమోప్రధానంగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. డ్రామానుసారముగానే నంబరువారుగా అవుతూ ఉంటారు. విస్తారమైతే చాలా ఉంది. వృక్షము ఎలా వెలువడ్తుందో బీజానికి తెలుస్తుంది. ఈ మనుష్య సృష్టి రహస్యాన్ని తండ్రియే తెలిపిస్తారు. తోటమాలి(బాగవాన్‌) కూడా వారే. తమ తోట ఎంత సుందరంగా ఉండేదో వారికి తెలుసు. తండ్రికైతే జ్ఞానముంది కదా. భగవంతుని పూల తోట ఎంతో ఫస్ట్‌క్లాస్‌గా ఉండేది. ఇప్పుడు సైతాన్‌ తోటగా అయిపోయింది. రావణ రాజ్యాన్ని సైతాన్‌ అని అంటారు. ఎక్కడ చూసినా యుద్ధాలు, మారణహోమాలే ఉన్నాయి. ఇప్పుడు అణుబాంబులు మొదలైన వాటిని కూడా తయారు చేసుకొని కూర్చుని ఉన్నారు. ఇవేమీ అలా ఊరకే ఉంచుకునే వస్తువులు కావని, వాటి ద్వారా తప్పకుండా వినాశనమవుతుందని అందరికీ తెలుసు. ఒకవేళ వినాశనము జరగకపోతే సత్యయుగము ఎలా వస్తుంది? మహాభారత యుద్ధము జరిగినట్లు, పంచ పాండవులు మిగిలినట్లు ఏదైతే చూపిస్తారో, అది పూర్తి స్పష్టంగా ఉంది. వారు కూడా తర్వాత కరిగి మరణించారు. అయితే ఫలితమేమీ లేదు. ఇది కూడా తయారైన డ్రామా. దీనిని తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. భారతదేశమునే దోచుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారు రిటర్న్‌ ఇస్తున్నారు. చివరివరకు ఇస్తూనే ఉంటారు. వినాశనములో అన్నీ సమాప్తమైపోతాయని కూడా మీకు తెలుసు. మన రాజ్యమున్నప్పుడు ఇంకెవ్వరి రాజ్యము లేదు. చరిత్ర తప్పకుండా పునరావృతమవ్వాలి(హిస్టరీ మస్ట్‌ రిపీట్‌). భారతదేశము మళ్లీ స్వర్గంగా అవుతుంది. లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. అక్కడ ఇతర ఖండాల పేర్లు కూడా ఉండవు. ఇప్పుడిది కలియుగ అంతిమ సమయము. మళ్లీ ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. మనము మళ్లీ ఇలా తయారవుతాము. నేను రాజయోగమును నేర్పించేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పాంతరాలుగా అనేకసార్లు మీరు యజమానులుగా అయ్యారు. పూర్తి విశ్వములో వీరి రాజధాని ఉండేది. వారు చాలా వివేకవంతులుగా ఉండేవారు. అక్కడ వారు మంత్రులు మొదలైన వారి నుండి సలహా తీసుకునే అవసరముండదు. ఇది తయారైన డ్రామా. మళ్లీ పునరావృతమవుతుంది. కృష్ణుని మందిరాన్ని సుఖధామమని అంటారు. శివబాబా వచ్చి సుఖధామమును స్థాపన చేస్తారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేదని ప్రపంచములోని వారు స్వయంగా అంటారు. మొదట ఒక్క ధర్మమే ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. బాబా ఏ విధంగా మనకు సామ్రాజ్యమునిస్తున్నారని పిల్లలకు ఆశ్చర్యము కలగాలి. తండ్రి వచ్చి భక్తికి ఫలమును ఇస్తారు. ఎంత సహజము! కాని కల్పక్రితము ఎవరైతే అర్థము చేసుకున్నారో, వారే నంబరువారు పురుషార్థానుసారము మళ్లీ వచ్చి అర్థం చేసుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. స్వదర్శన చక్రమును ధారణ చేసి తమ పాపాలను భస్మము చేసుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి పాప కర్మ జరగకుండా జాగ్రత్త వహించాలి. కర్మాతీతులుగా అయ్యేందుకు స్వయం శ్రమ చేయండి.

2. సాక్షాత్కారాల ఆశ ఉంచుకోరాదు. సాక్షాత్కారాలు పొందడం ద్వారా ముక్తి లభించదు. పాపాలు తొలగిపోవు. సాక్షాత్కారాల వల్ల ఏ లాభమూ లేదు. తండ్రి మరియు తండ్రి ఇచ్చే జ్ఞానాన్ని స్మృతి చేయుట ద్వారానే తుప్పు తొలగిపోతుంది.

వరదానము :-

''స్వయాన్ని నిమిత్తంగా భావించి వ్యర్థసంకల్పాల నుండి, వ్యర్థ వృత్తి నుండి ముక్తంగా ఉండే విశ్వకళ్యాణకారీ భవ''

''నేను విశ్వకళ్యాణ కార్యార్థము నిమిత్తంగా ఉన్నాను '' - ఈ బాధ్యత స్మృతిలో ఉంటే ఎప్పుడూ ఎవ్వరి పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ వృత్తి ఉండజాలదు. బాధ్యత గల ఆత్మలు ఒక్క అకళ్యాణకారి సంకల్పము కూడా చేయజాలరు. ఒక సెకండు కూడా వ్యర్థమైన వృత్తిని చేసుకోజాలరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవుతుంది. అందువలన అందరి పట్ల వారికి శుభ భావన, శుభ కామనలు స్వతహాగా ఉంటాయి.

స్లోగన్‌ :-

''క్రోధము అజ్ఞాన శక్తి, శాంతి జ్ఞాన శక్తి.''