05-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు ఈ చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది. కావున తండ్రి ద్వారా లభించే జ్ఞానాన్ని గ్రహించండి.''
ప్రశ్న :-
అర్హులైన బ్రాహ్మణులని ఎవరిని అంటారు? వారి గుర్తులు వినిపించండి ?
సమా :-
అర్హులైన బ్రాహ్మణులనగా - 1. ఎవరి నోటి ద్వారా బాబా తెలిపిన గీతా జ్ఞానము కంఠస్థముగా వినబడ్తుందో,........ 2. అనేకమందిని తమ సమానంగా చేయువారు. 3. అనేకమందికి జ్ఞాన ధనాన్ని దానపుణ్యము చేస్తారు. 4. పరస్పరములో ఒకరికొకరు అభిప్రాయబేధములోకి రానివారు. 5. ఏ దేహధారిలోనూ బుద్ధి తగులుకోకుండా ఉండేవారు. 6. ఆంతరికములో ఏ భూతమూ లేనివారు. 7. దేహ అహంకారము వదిలి దేహీ-అభిమానులుగా ఉండేందుకు పురుషార్థము చేయువారు.
ఓంశాంతి.
తండ్రి ఏమో తమ పరిచయమును, సృష్టి చక్ర పరిచయమును ఇచ్చేశారు. సృష్టి చక్రము ఉన్నది ఉన్నట్లు పునరావృతము అవుతుందని పిల్లల బుద్ధిలో నిలిచిపోయింది. నాటకములో మాడల్స్ తయారు చేస్తారు కదా. అవి మళ్లీ పునరావృతమవుతాయి. ఈ చక్రము పిల్లలైన మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మీ పేరు కూడా స్వదర్శన చక్రధారులు కావున బుద్ధిలో జ్ఞానము తిరుగుతూ ఉండాలి. తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని గ్రహించాలి. ఎంత బాగా గ్రహించాలంటే చివరిలో తండ్రి, రచనల ఆది-మధ్య-అంతములు గుర్తుండాలి. పిల్లలు చాలా బాగా పురుషార్థము చేయాలి. ఇది చదువు. ఈ చదువు బ్రాహ్మణులైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియదని పిల్లలైన మీకు తెలుసు. వర్ణాలలో తేడా ఉంది కదా. మనమందరమూ కలిసి ఒక్కటిగా అవ్వాలని మానవులు తలుస్తారు. ఇంత పెద్ద ప్రపంచము ఇప్పుడు ఒక్కటిగా అవ్వలేదు. ఇచ్చట విశ్వమంతటిలో ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాషగా ఉంటే, అలా జరుగుతుంది. అది సత్యయుగములో ఉండేది. విశ్వ సామ్రాజ్యముండేది. దానికి అధికారులు - లక్ష్మీనారాయణులు. విశ్వములో శాంతియుత రాజ్యముండేది మీరు తెలిపించాలి. కేవలం ఇది భారతదేశ విషయమే. వీరి రాజ్యమున్నప్పుడు సమస్త విశ్వములో శాంతి నెలకొల్పబడుతుంది. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. అందరూ భక్తులుగా ఉన్నారు. తేడా కూడా మీరు చూస్తున్నారు. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తి చేయకుంటే భూత, ప్రేతాలు తినిపోతాయని అనుకోకండి. అలా జరగదు. మీరు తండ్రి వారుగా అయ్యారు. మీలో ఉన్న భూతాలన్నీ తొలగిపోవాలి. మొదటి నంబరు భూతము దేహ అహంకారము. దీనిని తొలగించేందుకు తండ్రి దేహీ-అభిమానులుగా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే ఏ భూతమూ మీ ముందుకు రాదు. 21 జన్మలు ఏ భూతము మీ వద్దకు రాదు. ఈ 5 భూతాలు రావణ సంప్రదాయానికి చెందినవి. దీనిని రావణ రాజ్యమని అంటారు. రామ రాజ్యము వేరు, రావణ రాజ్యము వేరు. రావణ రాజ్యములో భ్రష్ఠాచారులు, రామ రాజ్యములో శ్రేష్ఠాచారులు ఉంటారు. ఈ రెండింటికి గల వ్యత్యాసము మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మీలో కూడా ఎవరైతే తెలివైనవారు, నిపుణులుగా ఉన్నారో వారు చాలా బాగా అర్థము చేసుకుంటారు. మాయా పిల్లి తక్కువైనది కాదు. అప్పుడప్పుడు చదువు వదిలేస్తారు. సెంటరుకు వెళ్ళరు. దైవీ గుణాలు ధారణ చేయరు. కళ్ళు కూడా మోసపుచ్చుతాయి. ఏదైనా మంచి పదార్థమును చూస్తూనే తినేస్తారు. కావున ఇప్పుడు పిల్లలైన మీ లక్ష్యము ఈ లక్ష్మీనారాయణులని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు వీరి వలె తయారవ్వాలి. ఇటువంటి దైవీ గుణాలు ధారణ చేయాలి. యథా రాజా - రాణి తథా ప్రజా అచ్చట అందరిలో దైవీ గుణాలుంటాయి. అక్కడ ఆసురీ గుణాలుండవు. అసురులు ఉండనే ఉండరు. ఈ విషయాలను బి.కె. లైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేసుకోరు. మీకు శుద్ధ అహంకారముంది. మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే మీరు మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఏ దేహధారులూ రాజయోగ జ్ఞానమును గాని, స్మృతి యాత్రను గాని నేర్పించలేరని కూడా మీకు తెలుసు. ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. మీరు నేర్చుకొని మళ్లీ ఇతరులకు నేర్పిస్తారు. మీకు దీనిని ఎవరు నేర్పించారు? మీ గురువెవరు? అని మిమ్ములను అడుగుతారు. ఎందుకంటే టీచరు ఆధ్యాత్మిక విషయాలను నేర్పించరు. దీనిని గురువు మాత్రమే నేర్పిస్తారు. మనకు నేర్పించినవారు సాధారణ గురువు కాదని సద్గురువని వారిని సుప్రీమ్ అని కూడా అంటారని పిల్లలైన మీకు తెలుసు. డ్రామానుసారము ఆ సద్గురువు స్వయంగా వచ్చి తమ పరిచయమునిస్తున్నారు. వారు వినిపించేదంతా సత్యమునే అర్థం చేయిస్తారు. సత్య ఖండములోకి తీసుకెళ్తారు. సత్యమైనవారు వారొక్కరే. ఇతర దేహధారులను స్మృతి చేయడం అసత్యము. ఇక్కడ మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మలన్నీ ఎలాగైతే జ్యోతిర్బిందువులో, అలా తండ్రి కూడా జ్యోతిర్బిందువే. మిగిలిన ఆత్మల సంస్కారాలు, కర్మలు వవరివి వారివే. ఒకే విధమైన సంస్కారముండజాలదు. ఒకవేళ ఒకే విధమైన సంస్కారముంటే ఫీచర్స్(రూపురేఖలు) కూడా ఒక్కటిగానే ఉండాలి. ఎప్పుడూ అలా ఉండవు. కొంచమైనా తేడా తప్పకుండా ఉంటుంది.
ఇది ఒకే నాటకము. సృష్టి కూడా ఒక్కటే. అనేకము కాదు. పైన, క్రింద ప్రపంచాలున్నాయని అసత్యాలు చెప్తుంటారు. నక్షత్రాలలో ప్రపంచముందని అంటారు. తండ్రి అడుగుతున్నారు - ఇది మీకు ఎవరు చెప్పారు? అలా అడిగితే శాస్త్రాలలో ఉందని చెప్తారు. శాస్త్రాలు తప్పకుండా మనుష్యులే వ్రాసి ఉంటారు కదా. ఇది తయారైన ఆట అని మీకు తెలుసు. సెకండు సెకండు ఏదైతే ప్రపంచ పాత్ర జరుగుతూ ఉందో, అది కూడా డ్రామాలో తయారైన ఆట. ఈ చక్రము ఎలా తిరుగుతోందో, మానవమాత్రులందరూ ఎలా పాత్ర అభినయిస్తున్నారో పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చేసింది. సత్యయుగములో కేవలం మీ పాత్ర మాత్రమే ఉంటుందని బాబా తెలిపించారు. పాత్రను అభినయించేందుకు నెంబరువారుగా వస్తారు. బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి. పెద్ద పెద్ద సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప మనుష్యులు అచ్చటకు వస్తారు. పేదవారు కూడా వస్తారు. తరచుగా పేదల బుద్ధిలో వెంటనే నిలబడ్తుంది. గొప్ప గొప్ప వారు భలే వస్తారు కానీ పని పడినంతనే తీరిక లేదంటారు. మేము బాగా చదువుకుంటామని, ప్రతిజ్ఞ చేసిన తర్వాత చదవకుంటే నష్టము జరుగుతుంది. మాయ ఇంకా తనవైపుకు ఆకర్షించుకుంటుంది. చాలామంది పిల్లలు చదవడం మానేస్తారు. చదువు తప్పిస్తుంటే తప్పకుండా ఫెయిల్ అవుతారు. పాఠశాలలోని మంచి మంచి పిల్లలు ఎప్పుడూ వివాహము మొదలైనవాటికి వెళ్లేందుకు శెలవు తీసుకోరు. బాగా చదువుకొని స్కాలర్షిప్ పొందాలని వారి బుద్ధిలో ఉంటుంది. అందుకే బాగా చదువుతారు. మిస్ చేసే ఆలోచనే ఉండదు. చదువు తప్ప ఏదియూ వారికి మధురంగా అనిపించదు. ఊరకే వృథాగా సమయము వ్యర్థమవుతుందని భావిస్తారు. ఇచ్చట ఒకే టీచరు చదివిస్తారు కనుక ఎప్పుడూ చదువు మిస్ చేయరాదు. ఇందులో కూడా నెంబరువారు పురుషార్థనుసారముగా ఉన్నారు. చదువుకునే వారు బాగుంటే చదివించేవారు కూడా హృదయపూర్వకంగా చదివిస్తారు. టీచరు పేరు ప్రసిద్ధము అవుతుంది. వారి గ్రేడు పెరుగుతుంది. ఉన్నత పదవి లభిస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఒకే తరగతిలో చదివినవారు కొంతమంది ఉన్నత పదవిని పొందుతారు, కొంతమంది తక్కువ పదవిని పొందుతారు. అందరి సంపాదన ఒకే విధంగా ఉండదు. ఆధారమంతా బుద్ధిని బట్టే ఉంటుంది. అచ్చట మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. బేహద్ తండ్రి మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. కావున చాలా బాగా చదువుకోవాలి. అజాగ్రత్తగా ఉండరాదు. చదువును విడిచి పెట్టరాదు. ఒకరికొకరు ఉల్టా - సుల్టా మాటలు వినిపించి ద్రోహులుగా అవుతారు. పరమతమును అనుసరించరాదు. శ్రీమతమును గురించి ఎవరు ఏమి మాట్లాడినా, తండ్రి మమ్ములను చదివిస్తున్నారని, ఈ చదువు వదలరాదని మీకు నిశ్చయముంది. పిల్లలు నెంబరువారుగా ఉన్నారు. తండ్రి ఏమో మొదటి నంబరులో ఉన్నారు. ఈ చదువు వదిలి ఇంకెక్కడికి వెళ్తారు? మరెక్కడా ఈ చదువు మీకు లభించదు. శివబాబా ద్వారా చదువుకోవాలి. వ్యాపారము కూడా శివబాబాతో చేయాలి. తప్పుడు(ఉల్టా-సుల్టా) మాటలు వినిపించి కొంతమంది ఇతరుల ముఖమును తిప్పేస్తారు. ఇది శివబాబా బ్యాంకు. బయట ఎవరైనా సత్సంగమును ప్రారంభించారనుకోండి. అప్పుడు వారు మేము శివబాబా బ్యాంకులో జమ చేసుకోవాలనుకుంటున్నాము, ఎలా చేసుకోవాలి? అని అడుగుతారు. ఇచ్చటకు వచ్చే పిల్లలు శివబాబా భండారములో వేస్తారు. ఒక్క పైసా ఇచ్చినా, అది వంద రెట్లుగా లభిస్తుంది. మీకు దీనికి బదులు గొప్ప భవనాలు లభిస్తాయని శివబాబా అంటారు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తము అవ్వనున్నది. మంచి మంచి కుటుంబాల నుండి చాలామంది ధనవంతులు వస్తారు. మేము శివబాబా భండారము నుండి పోషింపబడుట లేదని ఎవ్వరూ అనరు. అందరి పాలన జరుగుతూ ఉంది. కొంతమంది పేదవారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు. ధనవంతుల ద్వారా పేదవారు పోషింపబడ్తారు. ఇందులో భయపడే మాటే లేదు. మేము బాబా వారిగా తయారవుతామని చాలామంది కోరుకుంటారు. కాని అర్హులుగా కూడా ఉండాలి. ఆరోగ్యవంతులుగా కూడా ఉండాలి. జ్ఞానము కూడా ఇతరులకు ఇవ్వగలగాలి. ప్రభుత్వము వారు కూడా చాలా పరీక్షించి తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతా గమనించబడ్తుంది. సేవ చేయగలరు. నంబరువారుగా ఉన్నారు. అందరూ తమ తమ పురుషార్థము చేస్తున్నారు. కొంతమంది మంచి పురుషార్థము చేస్తూ చేస్తూ గైరుహాజరు అవుతారు. కారణాలు ఉండినా, ఏ కారణము లేకపోయినా రావడం మానేస్తారు. తర్వాత ఆరోగ్యము కూడా అలాగే అవుతుంది. సదా ఆరోగ్యవంతముగా అయ్యేందుకు ఇవన్నీ నేర్పించబడ్తాయి. ఎవరికి ఆసక్తి ఉందో, వారు స్మృతి ద్వారానే మా పాపాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. వారు చాలామంచి రీతిగా పురుషార్థము చేస్తారు. కొంతమంది విధి లేక వచ్చి సమయము గడుపుతున్నారు. తమంతకు తామే చెక్ చేసుకోవాలి. తప్పులు, పొరపాట్లు చేసి అజాగ్రత్తగా ఉంటే అటువంటివారు ఎవ్వరినీ చదివించలేరని తెలిసిపోతుందని తండ్రి తెలుపుచున్నారు.
తండ్రి అంటున్నారు - 7 రోజులలో మీరు అర్హులైన బ్రాహ్మణ - బ్రాహ్మణీలుగా అవ్వాలి. కేవలం నామధారి బ్రాహ్మణ - బ్రాహ్మణీలుగా అవ్వరాదు. బ్రాహ్మణ - బ్రాహ్మణీలు అనగా వారి నోటి ద్వారా సదా బాబా తెలిపిన గీతా జ్ఞానము కంఠస్థమై వినబడుతూ ఉండాలి. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉండనే ఉంటారు. ఇచ్చట కూడా అలాగే ఉన్నారు. చదువు పై గమనము లేకుంటే అచ్చట ఏమిగా తయారవుతారు. ప్రతి ఒక్కరు తమ పురుషార్థము చేస్తూ ఉండాలి. సేవకు ఋజువునివ్వాలి. అప్పుడు వీరు ఫలానా పదవి పొందుతారని అర్థమవుతుంది. ఆ పదవి కల్ప -కల్పాంతరాలకు అలాగే ఉంటుంది. చదివి చదివించకపోతే నేను పూర్తిగా చదవలేదు. అందుకనే ఇతరులను చదివించడం లేదని ఆంతరికములో తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు - చదివించేందుకు అర్హులుగా ఎందుకు తయారవ్వరు! ఎంతవరకు బ్రాహ్మణీని పంపుతారు! మీ సమానంగా తయారు చేయలేదు! ఎవరు బాగా చదువుతారో వారికి సహాయపడాలి. చాలామందికి పరస్పరములో అభిప్రాయ బేధాలుంటాయి. ఒకరిలో ఒకరు ఆకర్షణకు లోనై చదువును వదిలేస్తారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఇతరుల మాటలలో కల్పించుకొని మీరు చదువును ఎందుకు వదిలేస్తారు? ఇది కూడా డ్రామాయే. భాగ్యములో లేదు. రోజురోజుకు చదువు జోరు పెరుగుతూ పోతుంది. సెంటర్లు తెరుస్తూ ఉంటారు. ఇది శివబాబా ఖర్చు కాదు. ఇదంతా పిల్లల ఖర్చే. ఈ దానము అన్నింటికంటే మంచిది. ఆ దానము ద్వారా అల్పకాల సుఖము లభిస్తుంది. దీని ద్వారా 21 జన్మలకు ప్రాలబ్ధము లభిస్తుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మనమిచ్చటకు వస్తున్నామని మీకు తెలుసు. అందువలన ఎవరు బాగా చదువుకుంటారో, వారిని అనుసరించండి. ఎంతో రెగ్యులర్గా చదవాలి. వారే కోపగించుకొని నిందించుకుంటారు. అందుకే మాతలది మెజారిటీగా ఉంది. మాతల పేరే ప్రసిద్ధమవుతుంది. డ్రామాలో మాతల ఉన్నతి జరగాలని నిర్ణయింపబడి ఉంది.
తండ్రి మధురాతి మధురమైన పిల్లలతో అంటున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆత్మ-అభిమానులుగా ఉండండి. శరీరమే లేకుంటే ఇతరుల మాటను ఎలా వింటారు? నేను ఆత్మను, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని పక్కాగా అభ్యాసము చేయండి. తండ్రి చెప్తున్నారు - ఇవన్నీ త్యాగము చేయండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆధారమంతా దీని పైనే ఉంది. తండ్రి చెప్తున్నారు - భలే వ్యాపారము మొదలైనవి చేస్తూ ఉండండి 8 గంటలు వృత్తి - వ్యాపారాలు, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు ఈ ప్రభుత్వము(ఈశ్వరీయ) సర్వీసు చేయండి. ఇది కూడా నా కొరకు కాదు. పూర్తి విశ్వానికి సేవ చేస్తారు. ఇందుకొరకు సమయము కేటాయించండి. ముఖ్యమైనది స్మృతియాత్ర. సమయము వృథా చేయరాదు. ఆ ప్రభుత్వానికి 8 గంటలు సర్వీసు చేస్తారు. వారి ద్వారా ఏం లభిస్తుంది? వెయ్యి ఇస్తారు. 5 వేలు ఇస్తారు,......... ఈ ఈశ్వరీయ సర్వీసు చేసినందున మీరు పదమాపదమ్ పతులుగా అవుతారు. కావున ఎంత హృదయపూర్వకంగా సేవ చేయాలి! అష్ట రత్నాలుగా తయారైనారంటే వారు తప్పకుండా 8 గంటలు బాబాను స్మృతి చేసి ఉంటారు. భక్తి మార్గములో చాలా స్మృతి చేస్తారు. సమయాన్ని పోగొట్టుకుంటారు. ఏమియూ లభించదు. గంగా స్నానము, జప తపాలు మొదలైనవి చేయడం వలన వారసత్వమును పొందుకునేందుకు తండ్రి లభించరు. ఇక్కడ మీకు తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. అచ్ఛా! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శ్రీమతము వదిలి ఎప్పుడూ పరమతమును అనుసరించరాదు. ఉల్టా-సుల్టా మాటలు విని చదువు నుండి ముఖము తిప్పుకోరాదు. మత బేధములోకి రారాదు.
2. స్వయాన్ని - ''నేను ఎక్కడా పొరపాటు చేయలేదు కదా! అజాగ్రత్తగా లేను కదా! నాకు చదువు పై పూర్తి గమనముందా? వ్యర్థంగా సమయము పోగొట్టుకోలేదు కదా? ఆత్మాభిమానిగా అయ్యానా? ఆత్మిక సేవ హృదయపూర్వకముగా చేస్తున్నానా? అని చెక్ చేసుకోవాలి.
వరదానము :-
''పాత సంస్కారాలు మరియు పాత ప్రపంచములోని సంబంధాల ఆకర్షణ నుండి ముక్తముగా ఉండే డబల్లైట్ ఫరిస్తా భవ''
ఫరిస్తాలు అనగా పాత ప్రపంచములోని ఆకర్షణల నుండి ముక్తులు. సంబంధాల రూపములో కూడా ఆకర్షణ ఉండరాదు. తమ దేహము లేక దేహధారి వ్యక్తి లేక వస్తువు వైపు కూడా ఆకర్షణ ఉండరాదు. అలాగే పాత సంస్కారాల ఆకర్షణ నుండి కూడా ముక్తులు - సంకల్పము, వృత్తి లేక వాచా రూపంలో కూడా ఎలాంటి సంస్కారాల ఆకర్షణ ఉండరాదు. ఎప్పుడైతే ఇలాంటి ఆకర్షణలన్నిటి నుండి అనగా వ్యర్థ సమయం, వ్యర్థ సాంగత్యము, వ్యర్థ వాతావరణము నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు వారిని డబల్లైట్ ఫరిస్తాలని అంటారు.
స్లోగన్ :-
''శాంతిశక్తి ద్వారా ఆత్మలందరినీ పాలన చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు''