23-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇది పూర్తి శాంతియుతమైన జ్ఞానము. ఇందులో ఏమీ మాట్లాడరాదు. కేవలం శాంతిసాగరులైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి"
ప్రశ్న :-
ఉన్నతికి ఆధారమేది ? తండ్రి ఇచ్చిన శిక్షణలను ఎప్పుడు ధారణ చెయ్యగలరు ?
జవాబు :-
ఉన్నతికి ఆధారము '' ప్రేమ '' ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ ఉండాలి. దగ్గరగా ఉంటున్నా ఉన్నతి జరగలేదంటే ప్రేమ తక్కువగా ఉంది అని అర్థము, ప్రేమ ఉంటే తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేసినందున తండ్రి తెలిపిన అన్ని శిక్షణలను ధారణ చేయగలరు. ఉన్నతి కొరకు సత్య-సత్యమైన చార్టు వ్రాయండి. బాబా నుండి ఏ విషయమూ దాచకండి. ఆత్మాభిమానులుగా అయ్యి స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి.
ఓంశాంతి.
పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చొండి, తండ్రిని స్మృతి చేయండి. సభలో ఉపన్యసించునప్పుడు పదే పదే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? లేక దేహమని భావిస్తున్నారా? అని అడుగుతారు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇక్కడ కూర్చోండి. ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనమవుతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినందున మీ పాపాలు నశిస్తాయి. మీరు పవిత్రంగా అవుతారు. తర్వాత మళ్లీ మీరు ముక్తి - జీవన్ముక్తిని పొందుతారు. అందరూ ముక్తి తర్వాత జీవన్ముక్తిలోకి తప్పకుండా రావాల్సిందే. కనుక పదే పదే స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని కూర్చోండి అని చెప్పవలసి వస్తుంది. సోదరీ - సోదరుల్లారా! - స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి - ఇది స్వయం తండ్రియే ఇచ్చిన ఆజ్ఞ. ఇది స్మృతియాత్ర. తండ్రి చెప్తున్నారు - నాతో బుద్ధి యోగమును జోడిస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఈ విషయాన్ని క్షణ-క్షణము మీరు అందరికీ స్మృతినిప్పిస్తారు, అర్థము చేయిస్తారు. అప్పుడు ఆత్మ అవినాశి అని, దేహము వినాశి అని ప్రజలు అర్థము చేసుకుంటారు. అవినాశి ఆత్మయే, వినాశి దేహాన్ని ధరించి పాత్రను అభినయించి ఒక శరీరాన్ని వదిలి మరో శరీరము తీసుకుంటుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ప్రపంచములోని వారికి తమ స్వధర్మము గురించి కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమౌతాయి. ఇదే ముఖ్యమైన విషయము. మొట్టమొదట పిల్లలైన మీరు చేయవలసిన శ్రమ ఇదే. అనంతమైన తండ్రి ఆత్మలకు చెప్తున్నారు - ఇందులో ఏ శాస్త్ర్రాలు ఉదహరించే పని లేదు. మీరు గీతను ఉదాహరణంగా ఇచ్చినా కేవలం గీత గురించే చెప్తారు. వేదాల గురించి మీరు ఎందుకు చెప్పరు? అని అడుగుతారు, అటువంటి వారిని వేదాలు ఏ ధర్మానికి చెందినవి? అని అడగమని బాబా చెప్తున్నారు.
(ఆర్య ధర్మానికి చెందినవని చెప్తారు) ఆర్యులని ఎవరిని అంటారు? హిందూ ధర్మమైతే కాదు. ఆది సనాతన ధర్మమంటే దేవీదేవతా ధర్మము. మరి ఆర్య ధర్మము - ఏ ధర్మము? ఆర్య ధర్మమంటే ఆర్య సమాజపు వారిదై ఉంటుంది. ఆర్య ధర్మమనే పేరే లేదు. ఆర్య ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? వాస్తవానికి మీరు గీతను కూడా తీసుకోరాదు. ముఖ్యమైన విషయము - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. ఈ సమయములో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వాలి. మహిమ కూడా తండ్రినే చేయాలి. స్వయం మీరు తండ్రిని స్మృతి చేస్తున్నప్పుడే ఈ విషయాన్ని చెప్పగలరు. ఈ విషయములోనే పిల్లలు బలహీనంగా ఉన్నారు.
స్మృతియాత్ర చార్టును ఉంచమని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. మేము ఎంతవరకు స్మృతి చేస్తున్నాము? అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. పిల్లలైన మీ హృదయాలలో అపారమైన సంతోషముండాలి. మీకు ఆంతరంగిక ఖుషీ ఉంటే ఇతరులకు కూడా అర్థము చేయించినప్పుడు ప్రభావముంటుంది. ముఖ్యంగా సోదరీ-సోదరులారా, స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పాలి. ఈ విధంగా ఏ ఇతర సత్సంగాలలో చెప్పరు. వాస్తవానికి సత్సంగము ఒక్కటి కూడా లేదు. సత్యమైన సాంగత్యము ఒక్కటి మాత్రమే ఉంది. మిగిలినవన్నీ చెడు సాంగత్యాలు. ఇక్కడ అన్నీ పూర్తిగా నూతన విషయాలు. వేదాల ద్వారా ఏ ధర్మ స్థాపన జరగనే లేదు. కావున మనము వేదాలను ఎందుకు ఉదహరించాలి? ఎవ్వరిలోనూ ఈ జ్ఞానము లేనే లేదు. వారే స్వయంగా నేతి-నేతి అనగా మాకు తెలియదు అని అంటారు అనగా వారు నాస్తికులు కదా. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు - ఆస్తికులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విషయాలు గీతలో కొద్దిగా ఉన్నాయి. వేదాలలో ఈ విషయాలే లేవు. వేదాలు, ఉపనిషత్తులైతే అనేకమున్నాయి. ఇవన్నీ ఏ ధర్మానికి సంబంధించిన శాస్త్ర్రాలు? మనుష్యులు తమ మాటలే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ ఇతరుల మాట వినరాదు. తండ్రి సులభంగా అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనమైపోతారు. అలా అయ్యేందుకు ప్రపంచ చరిత్ర-భూగోళాలను గురించి తెలుసుకోవాలి. మీకు ఈ త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రాల చిత్రాలు ముఖ్యమైనవి. ఇందులో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మము. త్రిమూర్తి, సృష్టి చక్రముల చిత్రాలు పెద్ద పెద్దవి తయారు చేసి ఢిల్లీలో ముఖ్య ముఖ్య స్థానాలలో ఎక్కువగా జనసందడి ఉన్న చోట ఉంచండని బాబా చెప్తున్నారు. రేకు షీటు పైన ఈ చిత్రాలు వ్రాయించండి. మెటికల(సీఢీ) చిత్రములో ఇతర ధర్మాల గురించి రాదు. ఈ రెండు చిత్రాలు చాలా ముఖ్యమైనవి. వీటిని చూపించి అందరికీ అర్థం చేయించండి. మొట్టమొదటిది - తండ్రి పరిచయము. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఈ విషయాలను నిశ్చయము చేయించకుండా మీరు ఏమి చెప్పినా ఎవ్వరూ ఏమీ అర్థము చేసుకోలేరు. తండ్రినే తెలుసుకోకుంటే ఇతర చిత్రాల వద్దకు తీసుకెళ్లడం వ్యర్థము(దండగ). పరమాత్మను అర్థం చేసుకోకుంటే ఏమీ అర్థము చేసుకోలేరు. తండ్రి పరిచయము లేకుండా ఇతర విషయాలేవీ మాట్లాడకండి. తండ్రి నుండే అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇంత చిన్న సులభమైన విషయము ఎందుకు అర్థము కాదని బాబా ఆలోచిస్తారు. ఆత్మలైన మీకు తండ్రి ఆ శివుడు. వారి నుండే మీకు వారసత్వము లభిస్తుంది. మీరందరూ పరస్పరములో సోదరులు. ఆ విషయము మర్చిపోయినప్పుడు తమోప్రధానంగా అవుతారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. ముఖ్యమైన విషయము - రచయిత, రచనల గురించి తెలుసుకోవడం. వీటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఋషులు - మునులకు కూడా తెలియదు. కనుక మొదట తండ్రి పరిచయమునిచ్చి అందరినీ ఆస్తికులుగా తయారు చేయాలి. తండ్రి చెప్తున్నారు - నన్ను తెలుసుకుంటే మీరు సర్వస్వమూ తెలుసుకుంటారు. నన్ను తెలుసుకోకుంటే మీకు ఏమీ అర్థము కాదు. అనవసరంగా మీ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటారు. చిత్రాలు మొదలైనవి డ్రామానుసారము తయారయ్యాయి. అవి సరిగ్గా ఉన్నాయి, బాగున్నాయి. అయితే మీరు ఎంత శ్రమ చేస్తున్నా ఎవరి బుద్ధిలోనూ నిలవదు. బాబా మేము ఇతరులకు అర్థం చేయించడంలో తప్పులు ఏమైనా ఉన్నాయా? అని పిల్లలు అడుగుతారు. బాబా వెంటనే అవును, తప్పులున్నాయి అని చెప్తారు. అల్ఫ్(పరమాత్మ)ను గురించే అర్థము చేసుకోకుంటే వారిని వెంటనే పంపించి వేయండి. తండ్రిని తెలుసుకోనంతవరకు మీ బుద్ధిలో ఏదీ కూర్చోదు అని వారికి చెప్పండి. మీరు కూడా దేహీ-అభిమాని స్థితిలో లేకుంటే మీ దృష్టి వికారమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తే మీ దృష్టి పవిత్రంగా(సివిల్) అవుతుంది. దేహీ-అభిమానిగా ఉంటే మీ కనులు మిమ్ములను మోసపుచ్చవు. దేహీ-అభిమానులుగా లేకుంటే మాయ మోసపుచ్చుతూ ఉంటుంది. కావున మొట్టమొదట ఆత్మాభిమానులుగా అవ్వాలి. మీ చార్టు చూస్తే తెలిసిపోతుంది. మీరు ఇంతవరకు అసత్యము చెప్తూ, పాపము చేస్తూ, కోపపడ్తూ ఉంటే మిమ్ములను మీరే సర్వ నాశనము చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. బాబా చార్టు చూసి పిల్లలు సత్యము వ్రాశారా లేక చార్టు అర్థమే తెలియదా? అని అర్థం చేసుకుంటారు. పిల్లలందరికీ బాబా చార్టు వ్రాయమని చెప్తున్నారు. ఏ పిల్లలైతే యోగము చేయరో, వారు అంత సేవ కూడా చేయలేరు. పదును ఉండదు. కోటిలో ఏ ఒక్కరో వస్తారని బాబా అంటారు. అయితే మీరే స్వయంగా యోగములో ఉండలేకుంటే ఇతరులకు ఎలా చెప్తారు?
సుఖము కాకిరెట్టకు సమానమని సన్యాసులంటారు. వారు సుఖము పేరే ఎత్తరు. భక్తి చాలా విశాలమని మీకు తెలుసు. అందులో ఎన్నో శబ్ధాలు ఉంటాయి. మీ జ్ఞానము చాలా శాంతిగా ఉంటుంది. శాంతిసాగరులు తండ్రి అని అందరికీ చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు - ''మన్మనాభవ''. ఈ పదము కూడా నోటితో చెప్పే పని లేదు. హిందూ దేశములోని భాష హింది. మరి సంస్కృత భాష ఎందుకు? ఇప్పుడు ఈ భాషలన్నీ వదిలేయండి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించమని మీ ఉపన్యాసము మొదలు పెట్టండి. స్వయాన్ని ఆత్మ అని భావించనివారు, స్మృతి చేయనివారు చాలామంది ఉన్నారు. వారు స్వయం నష్టపోతున్నామని తెలుసుకోరు. తండ్రి స్మృతి చేయడంలోనే కళ్యాణముంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఏ ఇతర సత్సంగాలలో చెప్పరు. పిల్లలు తమ తండ్రిని ఎక్కడో ఒక చోట కూర్చొని స్మృతి చేస్తారా? లేస్తూ - కూర్చుంటూ తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా. ఆత్మ-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి. మీరు చాలా ఎక్కువగా మాట్లాడ్తారు. ఇంత మాట్లాడరాదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర, యోగాగ్ని ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇప్పుడు అందరూ దు:ఖములో ఉన్నారు. పావనంగా అయితే సుఖము లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా ఉండి ఎవరికి అర్థం చేయించినా వారికి బాణము తగులుతుంది. స్వయం వికారిగా ఉండి ఇతరులను నిర్వికారులుగా అవ్వమని చెప్తే వారికి బాణమే తగలదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, మీరు స్వయం స్మృతి యాత్రలో లేనందున మీ బాణము కూడా తగలదు.
ఇప్పుడు తండి చెప్తున్నారు - అయిపోయిందేదో అయిపోయింది(గతం గత:) మొదట స్వయాన్ని చక్కదిద్దుకోండి. మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి ఎంత స్మృతి చేస్తున్నాము? అని స్వయాన్ని పశ్న్రించుకోండి. ఆ తండ్రి మనలను విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు. మనము శివబాబా పిల్లలము కనుక మనము తప్పకుండా ఈ విశ్వానికి అధికారులుగా అవ్వాలి. అటువంటి ప్రియుడు వచ్చి మీ ముందు నిల్చొని ఉన్నారు. కావున వారిని అత్యంత అధికంగా ప్రేమించాలి. ప్రేమ అనగా స్మృతి. వివాహమైతే స్త్రీకి తన పతి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. మీది కూడా నిశ్చితార్థము జరిగిపోయింది. వివాహము కాలేదు. అది విష్ణుపురిలో జరుగుతుంది. మొదట శివబాబా వద్దకు వెళ్తారు. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్తారు. నిశ్చితార్థపు సంతోషము తక్కువగా ఉంటుందా? నిశ్చితార్థము అయిన వెంటనే స్మృతి పక్కా అవుతుంది. సత్యయుగములో కూడా నిశ్చితార్థము జరుగుతుంది. కానీ అచ్చట జరిగే నిశ్చితార్థము ఎప్పుడూ తెగిపోదు. అకాలమృత్యువులు సంభవించవు. ఇక్కడ అలా జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. కొందరు చాలా సమీపంగానే ఉంటారు. కానీ ఉన్నతి జరగదు. ఎవరు అత్యంత పేమ్రతో బాబా వద్దకు వస్తారో, వారు చాలా ఉన్నతి అవుతారు. స్మృతే లేకుంటే పేమ్ర కూడా ఉండదు. కావున వారి శిక్షణలను కూడా ధారణ చేయలేరు.
భగవానువాచ - కామము మహాశత్రువు, ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుందని అందరికీ సందేశమునివ్వండి. మీరు పవిత్ర సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు క్రిందికి దిగజారి వికారులై మురికిగా అయ్యారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ, మళ్లీ మీరు పవిత్రంగా అవ్వండి. కామచితి పై కూర్చునే కంకణాన్ని తుంచేయండి. పిల్లలైన మీరు యోగయుక్తంగా చెప్పినప్పుడు ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుంది. జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును ఉండాలి. ముఖ్యమైనది ఈ ఒక్క మాట. బాబా మేము చాలా శ్రమ చేస్తున్నాము. అత్యంత కష్టముతో ఏ ఒక్కరో వెలువడ్తారని పిల్లలంటారు. బాబా చెప్తున్నారు - యోగయుక్తంగా ఉండి అర్థం చేయించండి. స్మృతి యాత్రకై శ్రమ చేయండి. రావణునితో ఓటమి చెంది వికారులుగా అయ్యారు. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారా మీ మనోకామనలన్నీ పూర్ణమైపోతాయి. బాబా మనలను స్వర్గానికి అధికారులుగా చేస్తారు. బాబా ఆదేశాలనైతే చాలా ఇస్తున్నారు. కానీ పిల్లలు వాటిని మంచిరీతిగా గ్రహించడం లేదు. ఇతర విషయాలలోకి వెళ్ళిపోతారు. ముఖ్యమైనది తండ్రి సందేశమును అందరికీ ఇవ్వండి. కానీ స్వయం మీరే స్మృతి చేయకుంటే ఇతరులకు ఎలా చెప్తారు? మోసము చాలాకాలము నడవదు. వికారాలలోకి వెళ్లకండి అని ఇతరులకు చెప్తూ స్వయం వికారాలకు లోబడితే తప్పకుండా లోపల మనసు తింటూ ఉంటుంది. ఇటువంటి మోసము కూడా ఉంది. అందువలన బాబా చెప్తున్నారు - ముఖ్యమైనది - అల్ఫ్ (పరమాత్మ). అల్ఫ్ను తెలుసుకుంటే మీరు సర్వమూ తెలుసుకుంటారు. అల్ఫ్ను తెలుసుకోకుంటే మీరు ఏమీ తెలుసుకోలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఆంతరికంగా తండ్రిని స్మృతి చేయు ఖుషీలో ఉంటూ ఇతరులకు తండ్రి పరిచయమును ఇవ్వాలి, అందరికీ ఒక్క తండ్రి మహిమను వినిపించాలి.
2. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా అభ్యాసము చెయ్యాలి. ఎక్కువగా మాట్లాడరాదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది (బీతీ సో బీతి) అని వదిలేసి మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి. స్మృతి యాత్రను తెలిపే సత్యమైన చార్టును ఉంచుకోవాలి.
వరదానము :-
''సంకల్పాలను శుద్ధంగా, జ్ఞాన స్వరూపంగా, శక్తి స్వరూపంగా చేసుకునే సంపూర్ణ పవిత్ర భవ''
తండ్రి సమానంగా అయ్యేందుకు పవిత్రతా పునాదిని పక్కాగా చేసుకోండి. పునాదిలో బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయడం సాధారణ విషయం. కేవలం ఇందులోనే సంతోషించకండి. దృష్టి, వృత్తుల పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేయండి. వాటితో పాటు మీ సంకల్పాలను శుద్ధంగా, జ్ఞాన స్వరూపంగా, శక్తి స్వరూపంగా చేసుకోండి. ఇప్పుడు సంకల్పాలలో చాలా బలహీనంగా ఉన్నారు. ఈ బలహీనతను కూడా సమాప్తం చేయండి. అప్పుడు మిమ్ములను సంపూర్ణ ఆత్మలని అంటారు.
స్లోగన్ :-
''దృష్టిలో అందరి పట్ల దయా భావన, శుభ భావన ఉండాలి. అభిమానము, అవమానాల అంశము కూడా రాకూడదు.''