11-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - జ్ఞాన ఖడ్గానికి యోగమనే పదును ఉన్నప్పుడే విజయము లభిస్తుంది, జ్ఞానము జతలో యోగశక్తి ఉన్నట్లైతే దాని ప్రభావము తప్పకుండా ఉంటుంది''
ప్రశ్న :-
మీరు ఈశ్వరీయ సందేశకులు కనుక మీరు ప్రపంచమంతటికి ఏ సందేశమును ఇవ్వాలి ?
జవాబు :-
ప్రపంచానికంతటికి ఈ సందేశమును ఇవ్వండి - ''భగవంతుడు చెప్పారు - మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానము వదలండి. తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేసినట్లైతే మీ తల పై ఉన్న పాపాల భారము దిగిపోతుంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అయిపోతారు.'' అంతర్ముఖులైన పిల్లలే ఈ సందేశమును అందరికీ ఇవ్వగలరు.
ఓంశాంతి.
మనుష్యమాత్రులెవ్వరినీ, భలే దైవీ గుణాలు కలిగిన వారినైనా లేక ఆసురీ గుణాలు గలవారినైనా భగవంతుడని అనేందుకు వీలు లేదని తండ్రి అర్థం చేయించారు. దైవీ గుణాలు కలిగిన వారు సత్యయుగములో ఉంటారని, ఆసురీ గుణాలు కలిగిన వారు కలియుగములో ఉంటారని పిల్లలకు తెలుసు. అందువల్లనే మీరు దైవీ గుణాలు కలిగి ఉన్నారా? లేక ఆసురీ గుణాలు కలిగి ఉన్నారా? సత్యయుగానికి చెందినవారా లేక కలియుగానికి చెందినవారా? అని వ్రాతపూర్వకమైన ఒక పత్రమును కూడా తయారు చేయించారు. ఈ విషయాలన్నీ అతికష్టము మీద మనుష్యులకు అర్థమవుతాయి. మీరు మెట్ల చిత్రము గురించి మంచి రీతిలో అర్థము చేయించవచ్చు. మీ జ్ఞాన బాణాలు చాలా బాగున్నాయి కాని వాటికి పదును అవసరము. ఉదాహరణానికి ఖడ్గానికి కూడా పదును ఉంటుంది కదా! కొన్ని చాలా పదును కలిగినవిగా ఉంటాయి. ఉదాహరణానికి గురుగోవింద్ సింగ్ ఖడ్గము విదేశాలకు వెళ్లింది. ఆ ఖడ్గమును తీసుకొని పరిక్రమణ(ప్రదక్షిణ) చేస్తారు. చాలా శుభ్రంగా ఉంచుతారు. కొన్ని అతితక్కువ విలువ గల ఖడ్గాలు కూడా ఉంటాయి. దేనికి పదును ఉంటుందో అది చాలా తీక్షణంగా ఉంటుంది. దానికి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలలో కూడా అలాగే ఉన్నారు. కొందరిలో జ్ఞానము చాలా ఉంది కాని యోగము అనే పదును తక్కువగా ఉంది. ఎవరైతే బంధనములో ఉన్నారో, పేదవారుగా ఉన్నారో వారు శివబాబాను చాలా స్మృతి చేస్తారు. వారిలో భలే జ్ఞానము తక్కువగా ఉంటుంది. అయితే యోగమనే పదును చాలా ఉంది. వారు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతున్నారు. ఉదాహరణకు అర్జునుని, ఆటవికుని(ఏకలవ్యుని) చూపుతారు కదా! అర్జునుని కంటే ఆ ఆటవికుడే బాణాలు వేయడంలో చురుకుగా అయ్యాడు. అర్జునుడు అనగా ఇంట్లో(బాబా ఇంటిలో) ఉండి ప్రతి రోజూ మురళి వినేవారు. వారి కంటే బాహ్యములో ఉండేవారే తీక్షణమైపోతారు. ఎవరిలో జ్ఞాన పదును ఉందో అటువంటివారికి వారు(ఇక్కడ ఉండి జ్ఞానములో తీక్షణముగా లేనివారు) సేవ చేయవలసి ఉంటుంది. అయితే అది డ్రామాలో నిశ్చితమై ఉందని అంటారు. కొందరు ఫెయిల్ అవుతారు లేదా కొందరు వ్యాపారములో దివాలా తీసినప్పుడు తమ దురదృష్టము అని భావిస్తూ చేతిని నుదుటి పై(వ్రాత పై) ఉంచుకుంటారు. జ్ఞానము జతలో యోగమనే పదును కూడా తప్పకుండా అవసరము. పదును లేనిచో వారిని కంఠాపాఠి అంటారు(ధారణ లేకుండా కేవలం నేర్చుకొని చెప్పేవారు). పిల్లలు కూడా అనుభవం చేసుకుంటారు. కొందరికి పతి పై, కొందరికి ఇంకెవ్వరి పైనో ప్రేమ ఉంటుంది. జ్ఞానములో చాలా తీక్షణంగా ఉంటారు కాని లోలోపల చాలా గందరగోళం ఉంటుంది. ఇక్కడైతే పూర్తి సాధారణంగా ఉండాలి.
అన్నీ చూస్తున్నా ఏమీ చూడనట్లుగా ఉండాలి. తండ్రి పైనే ప్రీతి ఉండాలి. అప్పుడే చేతుల ద్వారా పని చేస్తూ మనసు ద్వారా స్మృతి చేస్తున్నారు......(కమ్ కార్ డే దిల్ యార్ డే) అని గాయనము చేయబడ్తుంది. ఆఫీసు కార్యవ్యవహారాలు మొదలైనవాటిలో పని చేస్తున్నా బుద్ధిలో నేను ఆత్మను అనే స్మృతి ఉండాలి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి ఆజ్ఞాపించారు. భక్తిమార్గములో కూడా పని-పాటలు చేసుకుంటున్నా మనసు ద్వారా ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. కాని వారు గుర్తు చేసుకునేది రాతి విగ్రహాన్ని. అందులో ఆత్మ అయితే లేదు కదా! లక్ష్మీనారాయణులు కూడా పూజింపబడ్తారు. అయితే అవి కూడా రాతి విగ్రహాలే కదా! వీరి ఆత్మ ఎక్కడ ఉంది? అని అడగండి. వారు ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక నామ-రూపాలతో ఉంటారని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్లీ యోగబలము ద్వారా పావన దేవతలుగా అవుతున్నారు. లక్ష్యము- ఉద్ధేశ్యము కూడా ఇదే కదా! ఇంకొక విషయము - జ్ఞాన సాగరుడు మరియు జ్ఞానగంగలు ఈ పురుషోత్తమ సంగమ యుగములో మాత్రమే ఉంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక్క ఈ సమయములో మాత్రమే ఉంటారు. జ్ఞానసాగరుడు కల్పములో ఒక్కసారి ఈ పురుషోత్తమ సంగమ యుగములో మాత్రమే వస్తారు. జ్ఞానసాగరుడు నిరాకార పరమపిత పరమాత్మ శివుడు, వారికి తప్పకుండా శరీరము కావాలి. అప్పుడే వారు మాట్లాడగలరు. అంతేకాని నీటికి సంబంధించిన విషయమేదీ లేదు. మీకు ఈ జ్ఞానము సంగమ యుగములోనే లభిస్తుంది. మిగిలినవారందరి వద్ద ఉండేది భక్తి. భక్తిమార్గము వారు గంగానది నీటిని కూడా పూజిస్తూ ఉంటారు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా పురాతన ప్రపంచము పరివర్తన చెందవలసి ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు దీనిని ఎవరికైనా అర్థము చేయించేందుకు కూడా బుద్ధ్ది అవసరము. దీని కొరకు ఏకాంతములో విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మ శివుడేనని మనుష్యులు అర్థం చేసుకునేలా ఏమని వ్రాయాలి? దీనిని గురించి ఆలోచించాలి. వారు వచ్చినప్పుడు, వారి పిల్లలైన బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీలుగా ఎవరైతే అవుతారో వారు జ్ఞాన ధారణ చేసి జ్ఞాన గంగలుగా అవుతారు. అనేకమంది జ్ఞాన గంగలు ఉన్నారు. వారంతా జ్ఞానమును వినిపిస్తూ ఉంటారు. వారే సద్గతిని కలిగించగలరు. అంతేకాని నీటిలో స్నానము చేయడం ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరు. ఈ జ్ఞానము సంగమ యుగములోనే ఉంటుంది. దీనిని అర్థము చేయించేందుకు యుక్తి అవసరము. చాలా అంతర్ముఖత ఉండాలి. శరీర అభిమానము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ సమయములో మేము పురుషార్థులము అని అంటారు. స్మృతి చేస్తూ చేస్తూ పాపాలన్నీ సమాప్తమైనప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. అంతలో అందరికీ సందేశము లభించాలి. సందేశమును శివబాబాయే ఇస్తారు. భగవంతుని సందేశకుడు(పైగంబర్) అని అంటారు కదా. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మ జతలో యోగమును జోడించినట్లైతే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారని మీరు అందరికీ సందేశమును చేరుస్తారు. దీనిని తండ్రి కూర్చొని బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. నీటి గంగ ఎలా అర్థము చేయిస్తుంది? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు - సత్యయుగములో మీరు ఎంతో సుఖంగా, సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు దు:ఖితులుగా, నిరుపేదలుగా అయిపోయారు. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇక ఈ చిత్రాలు(విగ్రహాలు) మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. భక్తిమార్గములో ఈ సామగ్రి కూడా తయారవ్వాల్సిందే. శాస్త్రాలు చదవడం, పూజలు చేయడం ఇదంతా భక్తిమార్గము కదా! నేను శాస్త్రాలు మొదలైనవాటిని చదివించను. నేనైతే మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మ అని భావించమనే జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు ఆత్మ మరియు శరీరము రెండూ పతితమై ఉన్నాయి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లైతే మీరు ఈ దేవతలుగా అవుతారు. పాత దేహ సంబంధాలన్నిటి నుండి మమత్వాన్ని తొలగించాలి. మీరు వచ్చినట్లైతే మేము ఇతరులు చెప్పేదేదీ వినము. మీ ఒక్కరితోనే మా సంబంధాన్ని జోడిస్తాము. మిగిలిన దేహధారులందరిని మర్చిపోతాము....... అని పాడ్తారు. తండ్రి ఇప్పుడు మీకు ఆ ప్రతిజ్ఞను జ్ఞాపకము చేస్తున్నారు. నా జతలో యోగాన్ని జోడించడం ద్వారానే మీ వికర్మలన్నీ వినాశనమవుతాయి. మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ముఖ్యమైన లక్ష్యము - ఉద్ధేశ్యము అని తండ్రి చెప్తున్నారు. రాజులతో పాటు ప్రజలు కూడా తప్పకుండా తయారవ్వాలి. రాజులకు దాస-దాసీలు కూడా కావాలి. తండ్రి అన్ని విషయాలను అర్థము చేయిస్తూ ఉంటారు. యోగములో బాగా లేనట్లైతే, దైవీ గుణాలను ధారణ చేయకపోతే ఉన్నత పదవిని ఎలా పొందగలరు? ఇంటిలో ఏదో ఒక విషయమై జగడాలు, కలహాలు జరుగుతూనే ఉంటాయి కదా! మీ ఇంట్లో కలహాలున్నాయి కనుక జ్ఞానము నిలవడం లేదని తండ్రి వ్రాసేస్తారు. స్త్రీ - పురుషులు ఇరువురూ సరిగ్గా నడుచుకుంటున్నారా? అని బాబా అడుగుతారు. నడవడిక చాలా బాగుండాలి. క్రోధము అంశ మాత్రము కూడా ఉండరాదు. ఇప్పుడైతే ప్రపంచములో ఎన్నో గలాటాలు మరియు అశాంతి ఉంది. మీలో చాలా మంది జ్ఞాన-యోగాలలో తీక్షణంగా ముందుకు వెళ్తే ఇతరులు కూడా చాలా మంది స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీకు కూడా బాగా అభ్యాసమవుతుంది. మీ బుద్ధి కూడా విశాలమైపోతుంది.
బాబాకు చిన్న-చిన్న చిత్రాలు అంతగా ఇష్టముండవు. అన్నీ పెద్ద-పెద్ద చిత్రాలే ఉండాలి. వాటిని బయట ముఖ్య స్థానాలలో ఉంచండి. ఉదాహరణకు నాటకము యొక్క పెద్ద-పెద్ద చిత్రాలను ఉంచుతారు కదా! ఏ మాత్రం చెడిపోకుండా ఉండే మంచి-మంచి చిత్రాలను తయారు చేయండి. అందరి దృష్టి పడే స్థానాలలో పెద్ద-పెద్ద మెట్ల చిత్రాలను(సీఢీ) తయారుచేసి ఉంచాలి. ఆ చిత్రాలకు వేసే రంగు వర్షము వల్ల గాని, ఎండ వల్లగాని చెడిపోరాదు. ముఖ్య స్థానాలలో ఉంచండి లేదా ఎక్కడైనా ప్రదర్శినీ జరిగే చోట ముఖ్యమైన రెండు, మూడు పెద్ద-పెద్ద చిత్రాలు ఉన్నా చాలు. వాస్తవానికి ఈ చక్రము చిత్రము ఇంటి గోడ అంత పెద్దది తయారుచేయాలి. భలే 8-10 మంది దానిని ఎత్తి ఆ స్థానములో ఉంచినా పర్వాలేదు. ఎవరైనా దూరము నుండి చూడగానే పూర్తి స్పష్టంగా తెలిసే విధంగా ఉండాలి. సత్యయుగములో అయితే ఇన్ని ధర్మాలు ఉండవు. అవి తర్వాత వస్తాయి. స్వర్గములో మొదట చాలా తక్కువ మంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడిది స్వర్గమా లేక నరకమా? మీరు ఈ విషయము గురించి చాలా బాగా అర్థము చేయించగలరు. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. పాండవుల పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేస్తారు కదా! పాండవులంటే మీరే కదా.
శివబాబా సంగమ యుగములో చదివిస్తారు. ఆ శ్రీ కృష్ణుడు సత్యయుగములో మొదటి రాకుమారుడు. మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ అర్థం చేయిస్తూ మీ రాజ్యస్థాపన చేసుకుంటారు. కొందరు చదువుతూ చదువుతూ మధ్యలో వదిలేస్తారు. ఆ పాఠశాలలో కూడా చదవలేనివారు చదువును వదిలేస్తారు. ఇక్కడ కూడా చాలామంది ఈ చదువును వదిలేశారు. అయితే వారు స్వర్గములోకి రారా? నేను విశ్వానికి యజమానిని మరి నా ద్వారా రెండు మాటలు విన్నా వారు తప్పకుండా స్వర్గములోకి వస్తారు. మున్ముందు చాలా మంది వచ్చి వింటారు. పూర్తి రాజధాని కల్పక్రితము వలె స్థాపనవుతుంది. మేము అనేకసార్లు రాజ్యము తీసుకున్నాము మళ్లీ పోగొట్టుకున్నామని పిల్లలకు తెలుసు. వజ్ర సమానంగా ఉండేవారు గవ్వ తుల్యంగా అయిపోయారు. భారతదేశము వజ్ర తుల్యంగా ఉండేది. మరి ఇప్పుడు ఏమయ్యింది? భారతదేశమైతే అదే ఉంటుంది కదా! ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. సర్వోత్తమ పురుషులు కూడా ఉన్నారు. మిగిలినవారంతా కనిష్టమైనవారు. పూజ్యులుగా ఉన్నవారే మళ్లీ పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు తీసుకుంటారు. ఆ శరీరాలు కూడా సమాప్తమైపోయాయి. ఆత్మ కూడా తమోప్రధానమైపోయింది. సతోప్రధానంగా ఉన్నప్పుడు ఎవ్వరినీ పూజించరు. చైతన్యములో స్వయం దేవతలుగా ఉంటారు. ఇప్పుడు మీరు చైతన్యములో శివబాబాను స్మృతి చేస్తారు. తర్వాత పూజారులుగా అయినప్పుడు రాతి విగ్రహాలను పూజిస్తారు. ఇప్పుడైతే బాబా చైతన్యములో ఉన్నారు కదా! తర్వాత వారి రాతి మూర్తిని తయారుచేసి పూజిస్తారు. రావణ రాజ్యములో భక్తి ప్రారంభమవుతుంది. ఆత్మలేమో అవే కాని భిన్న-భిన్న శరీరాలను ధారణ చేస్తూ వచ్చారు. క్రింద పడినంతనే భక్తి ప్రారంభమవుతుంది. బాబా మళ్లీ వచ్చి జ్ఞానమునిచ్చినప్పుడు పగలు ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఇప్పుడు దేవతలని అనరు. బ్రహ్మ సత్యయుగములో ఉండరు. ఇక్కడ బ్రహ్మ తపస్సు చేస్తున్నారు, మనిషి కదా! శివబాబానైతే శివుడనే అంటారు. వీరిలో ఉన్నప్పటికీ వారిని శివబాబా అనే అంటారు. వారికి వేరే పేర్లు ఏవీ ఉంచరు. వీరిలో శివబాబా వస్తారు. వారు జ్ఞానసాగరులు. ఈ బ్రహ్మ తనువు ద్వారా జ్ఞానమునిస్తారు. అందువల్ల చిత్రాలు మొదలైనవాటిని చాలా వివేకముతో తయారుచేయాలి. ఇందులో వ్రాయబడినదే పనికి వస్తుంది. పతిత పావనుడు ఆ నీటి సాగరమా లేక నీటి నదులా? లేక జ్ఞానసాగరుడు మరియు వారి ద్వారా వెలువడిన జ్ఞాన గంగలైన బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలా? తండ్రి వీరికే జ్ఞానమునిస్తారు. బ్రహ్మ ద్వారా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే తర్వాత మళ్లీ దేవతలుగా అవుతారు. విరాట రూప చిత్రము కూడా చాలా పెద్దదిగా చూపించాలి. ఇది ముఖ్యమైన చిత్రము.
మధురమైన పిల్లలారా! మీరు మీ బుద్ధిని శుద్ధంగా చేసుకోవాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీరిలో చెడు దృష్టి ఉందని బాబా గమనించినప్పుడు ఇక వీరు జ్ఞానములో నడవలేరని తండ్రి భావిస్తారు. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా తయారయ్యింది. దీనిని ఏ ఒక్కరో అర్థము చేసుకుంటారు. చాలా తెలివిహీనులుగా ఉన్నారు. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందులో అందరూ అవసరమే. చివర్లో అంతా సాక్షాత్కారమవుతుంది. ఫస్ట్క్లాస్ దాస-దాసీలు కూడా తయారవుతారు. ఫస్ట్క్లాసు దాసీ కృష్ణుని పాలన చేస్తుంది. పాత్రలను శుభ్రపరిచేవారు, భోజనము వడ్డించేవారు, శుభ్రము చేసేవారు మొదలైనవారందరూ ఉంటారు. అందరూ ఇక్కడి నుండే తయారవుతారు. ఫస్ట్ నంబర్లోని వారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. ఇది తెలిసిపోతుంది. వీరు మంచిగా మురళీని నడిపిస్తారు అయితే యోగము తక్కువగా ఉందని తండ్రికి తెలుస్తుంది. కొందరు స్త్రీలు పురుషుల కంటే తీక్షణంగా ముందుకు వెళ్తారు. ఒకరు జ్ఞానములో ఉండి మరొకరు లేకుంటే అప్పుడు - బాబా! రెండవ చక్రము సరిగ్గా నడవటం లేదు అని అంటారు. పరస్పరములో ఒకరు మరొకరిని అప్రమత్తము చేసుకోవాలి. ప్రకృతి మార్గము కదా! ఒకే విధమైన జంట(జోడి) ఉండాలి. తమ సమానంగా తయారు చేయాలి. చివర్లో మీరు ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. మేము హంసలము, వీరు కొంగలు అని భావిస్తారు కదా! కొందరిలో ఒక రకమైన అవగుణాలు, మరి కొందరిలో మరొక రకమైన అవగుణాలు ఉన్నాయి. గొడవలు కూడా నడుస్తాయి. ఇందులో శ్రమ చాలా ఉంది. చాలా సహజము కూడా. క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది. చిల్లిగవ్వ కూడా ఖర్చు అవ్వకుండా ఉన్నత పదవిని పొందుతారు. పేదవారు బాగా సేవ చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఖాళీ చేతులతో వచ్చారో కూడా తెలుసు కదా! చాలా ధనము తెచ్చినవారు ఈ రోజు లేనే లేరు. పేదలు చాలా ఉన్నత పదవిని పొందుతున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును నింపేందుకు కర్మ చేస్తూ అంతర్ముఖులుగా అయ్యి - నేను ఆత్మనని అభ్యాసము చేయాలి. నిరంతరము నన్ను స్మృతి చేయండి. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంచుకోండి. దేహము మరియు దేహ సంబంధాలన్నిటి నుండి మమకారాన్ని తొలగించి వేయండి అని ఆత్మనైన నాకు తండ్రి నుండి ఆజ్ఞ లభించింది.
2. ప్రవృత్తిలో ఉంటూ పరస్పరము ఒకరినొకరు సావధానవరచుకుంటూ (అప్రమత్తము చేసుకుంటూ) హంసలుగా తయారై ఉన్నత పదవిని తీసుకోవాలి. అంశమాత్రము క్రోధమును కూడా తొలగించుకోవాలి. బుద్ధిని పవిత్రంగా చేసుకోవాలి.
వరదానము :-
''తీవ్ర పురుషార్థము ద్వారా అన్ని బంధనాలను దాటుకొని మనోరంజనాన్ని అనుభవం చేసే డబల్లైట్ భవ''
చాలామంది పిల్లలు నేను బాగానే ఉన్నాను కాని సంస్కారాలు, వ్యక్తులు, వాయుమండలాల బంధనముంది,...... అని అంటారు. కాని కారణం ఏదైనా, ఎలా ఉన్నా తీవ్ర పురుషార్థులు, ఇవన్నీ నన్ను ఏమీ చేయలేవు, నాకు లెక్కలోకే రావు అన్నట్లు దాటుకుంటారు. వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితిని ఎగిరేకళ అని అంటారు. ఎగిరేకళకు గుర్తు - డబల్లైట్. ఎలాటి బరువైనా వారిని ఆందోళనలోకి తీసుకురాలేదు.
స్లోగన్ :-
''ప్రతి గుణాన్ని మరియు జ్ఞాన విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి ''