10-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి వారిగా అయ్యి తండ్రి పేరును ప్రసిద్ధము చేయండి. సంపూర్ణ పవిత్రంగా అవుతే పేరు ప్రసిద్ధమవుతుంది. మీరు సంపూర్ణ తియ్యగా కూడా అవ్వాలి.''
ప్రశ్న :-
పిల్లలైన మీకు సత్యయుగములో ఉండని ఏ చింత సంగమ యుగములో ఉంది?
జవాబు :-
మీకు సంగమయుగములో పవిత్రంగా అవ్వాలనే చింత ఉంది. తండ్రి మిమ్ములను ఇతర విషయాలన్నిటి నుండి నిశ్చింతులుగా చేసేశారు. ఈ పాత శరీరాన్ని ఖుషీ ఖుషీగా వదిలి వెళ్లేందుకు మీరు పురుషార్థము చేస్తారు. పాత వస్త్రాన్ని వదిలి, కొత్తది తీసుకుంటామని మీకు తెలుసు. మాకు ఎంత ఖుషీ ఉంది. మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి.
ఓంశాంతి.
మధురాతి మధురమైన అపురూప పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు - వారు మనలను చదివించి అర్థము కూడా తెలుపుతారు. రచయిత, రచనల ఆదిమధ్యాంతాల రహస్యమును చదివిస్తారు. సర్వ గుణ సంపన్నంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి అని అర్థము చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూ మీరు సతోప్రధానమైపోతారు. ఈ సమయములో ఇది తమోప్రధాన సృష్టి అని, ఒకప్పుడు సతోప్రధానంగా ఉండేదని ఈ సృష్టి 5 వేల సంవత్సరాలలో తమోప్రధానంగా అయ్యిందని మీకు తెలుసు. ఇది పాత ప్రపంచము. ఇలా అందరి గురించి అంటారు కదా. వీరు కొత్త ప్రపంచములో ఉండేవారని లేక శాంతిధామములో ఉండేవారు. తండ్రి కూర్చుని ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు -''ఓ ఆత్మిక పిల్లలారా! మీరు తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము తీసుకోవాలి. తండ్రినైన నన్ను తప్పకుండా స్మృతి చేయాలి.'' లౌకిక పిల్లలు కూడా స్మృతి చేస్తారు. ఎంత పెద్దవారుగా అవుతూ ఉంటారో అంత హద్దులోని వారసత్వాన్ని పొందేందుకు హక్కుధారులుగా అవుతూ ఉంటారు. మీరు అనంతమైన తండ్రి పిల్లలు. తండ్రి నుండి అనంతమైన వారసత్వము తీసుకోవాలి. ఇప్పుడు భక్తి, పూజలు మొదలైనవి చేసే అవసరము లేదు. ఇది ఒక విశ్వవిద్యాలయము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. మనుష్య మాత్రులందరూ చదువుకోవాలి. విశాలమైన(బేహద్) బుద్ధిని ధారణ చేయాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవ్వనున్నది. ఏదైతే ఇప్పుడు తమోప్రధానంగా ఉందో అది సతోప్రధానంగా అవుతుంది. ఈ సమయంలో మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వము పొందుతున్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము ఒకే ఒక ఆత్మిక తండ్రి మతమునే అనుసరించాలి. ఈ ఆత్మిక స్మృతియాత్ర ద్వారానే ఆత్మలైన మీరు సతోప్రధానమౌతూ ఉంటారు. మళ్లీ సతోప్రధాన ప్రపంచములోకి వెళ్ళాలి. మనము బ్రాహ్మణులమని మీ బుద్ధిలోకి వస్తుంది. మనము తండ్రికి చెందిన వారిగా అయ్యాము. చదువు చదువుకుంటున్నాము. ఇలా చదువుకోవడాన్ని జ్ఞానమని అంటారు. భక్తి దీనికి వేరుగా ఉంటుంది. బ్రాహ్మణులైన మీకు తండ్రి జ్ఞానము వినిపిస్తారు. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానమును గురించి తెలియదు. జ్ఞానసాగరులైన తండ్రి, టీచరై ఎలా చదవిస్తున్నారో వారికి తెలియదు. బాబా ఈ జ్ఞానములో చాలా టాపిక్స్ అర్థము చేయిస్తూ ఉంటారు. మొదటిది - తండ్రివారిగా తయారై తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి, సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి, సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి. ఇది ఈశ్వరీయ విద్య. ఎందుకంటే స్వయం భగవంతుడే కూర్చుని చదివిస్తున్నారు. అత్యంత ఉన్నతమైన ఆ తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేయడం ఒక సెకండు విషయమే. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనము శాంతిధామములో నివసిస్తూ పాత్ర చేసేందుకు ఇచ్చటకు వచ్చామని మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. నెంబరువారుగా 84 జన్మల పాత్ర మనము ఇప్పుడు పూర్తి చేశాము. ఈ చదువును కూడా అర్థము చేసుకోవాలి. పాత్రను కూడా అర్థము చేసుకోవాలి. డ్రామా రహస్యము కూడా బుద్ధిలో ఉంది. ఇది మన అంతిమ జన్మ అని ఈ జన్మలో తండ్రి లభించారని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తి చేసినప్పుడు పాత ప్రపంచము పరివర్తన అవుతుంది. మీరు ఈ బేహద్ డ్రామాను, 84 జన్మలను, ఈ చదువును తెలుసుకున్నారు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు చివరికి వచ్చి చేరారు. ఇప్పుడు చదువుతున్నారు, తర్వాత మళ్లీ కొత్త ప్రపంచములోకి వెళ్తారు. క్రొత్త క్రొత్త వారు వస్తూ ఉంటారు. వారికి ఏదో ఒక నిశ్చయము ఏర్పడ్తూ ఉంటుంది. కొంతమంది ఈ చదువులో లగ్నమైపోతారు. మనము సతోప్రధానంగా, పవిత్రంగా అవుతూ ఉన్నామని మీ బుద్ధిలో ఉంది. మనము పవిత్రమవుతూ అవుతూ ఉన్నతిని పొందుతూ ఉంటాము.
బాబా అర్థము చేయిస్తున్నారు - మీరు ఎంతగా స్మృతి చేస్తారో, మీ ఆత్మ అంత పవిత్రంగా అవుతూ ఉంటుంది. పిల్లల బుద్ధిలో మొత్తము డ్రామా అంతా కూర్చొని ఉంది. ఈ ప్రపంచములో సర్వస్వాన్ని వదలుకొని వచ్చారని కూడా మీకు తెలుసు. ఈ కనులకు కనపడేదంతా చూడదగింది కాదు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇతరులెవ్వరికీ ఈ అనంతమైన డ్రామాను గురించి తెలియదు. ఇప్పుడు మీకు మొత్తం చక్రము గురించి తెలుసు. మిమ్ములను తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. అక్కడ 12 మాసముల తర్వాత ఎలాగైతే పరీక్షలు జరుగుతాయో అలా మీ స్మృతియాత్ర కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మీకు అనేక విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పోను పోను పక్కా అవుతూ పోతే ఏమీ గుర్తు రాదు. ఆత్మ అశరీరిగా వచ్చింది, అశరీరిగా వెళ్లాలి. మీకు ఈ మొత్తం సృష్టిలోని మనుష్యమాత్రుల పాత్రలను గురించి తెలుసు. మనుష్యుల సంఖ్య ఎంతో పెరుగుతూ ఉంటుంది. మనుష్యులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సత్యయుగములో మనము చాలా కొద్దిమంది మాత్రమే ఉంటాము. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇతర ధర్మాల మఠాలు - మార్గాలు, కొమ్మలు - రెమ్మలు పెరుగుతూ పెరుగుతూ వృక్షము చాలా పెద్దదైపోయింది. ఆది సనాతన దేవీదేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయింది. మనమే దేవీదేవతా ధర్మములో ఉండేవారము. సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు ఆ ధర్మమే తమోప్రధానమైపోయింది. అది మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. అందుకే మనము ఇప్పుడు చదువుకుంటున్నాము. ఎంత బాగా చదువుకొని ఇతరులను చదివిస్తామో, అంత చాలా మందికి కళ్యాణము జరుగుతుంది. చాలా ప్రీతిగా అర్థము చేయించాలి. విమానము నుండి కరపత్రాలు అన్ని వైపులకు వెదజల్లాలి. అందులో కూడా మీరు జన్మ-జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారని అర్థము చేయించాలి. గీతా పఠనం కూడా భక్తిమార్గమే. గీతను చదివినందువలన ఎవ్వరూ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వలేరు. డ్రామానుసారము తండ్రి వచ్చినప్పుడే సతోప్రధానంగా అయ్యే యుక్తి తెలుపుతారు. దాని వలన మళ్లీ సతోప్రధాన పదవి లభిస్తుంది.
ఈ చదువు ద్వారా మనము ఇలా(లక్ష్మీనారాయణులు) తయారవ్వనున్నామని మీకు తెలుసు. ఇది ఈశ్వరీయ పాఠశాల. భగవంతుడు చదివించి మిమ్ములను నరుని నుండి నారాయణునిగా చేస్తారు. మనము స్వర్గములో సతోప్రధానంగా ఉండేవారము. తమోప్రధానమైనప్పుడు అదే నరకమైపోయింది. మళ్లీ చక్రము తిరుగుతుంది. తండ్రియే స్వయంగా వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అయ్యే పురుషార్థమును చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి. దైవీగుణాలు ధారణ చేయాలి. కొట్లాడరాదు, జగడాలాడరాదు. దేవతలు ఎప్పుడూ కొట్లాడరు, జగడాలాడరు. మీరు కూడా అలా అవ్వాలి. మీరే ఇలాంటి సర్వ గుణసంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ శ్రీమతమును అనుసరించి అలా తయారవ్వాలి. మాకు ఎంతవరకు సంతోషముంది, ఎంతవరకు నిశ్చయముందని మీరు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈ విషయాలు రోజంతా స్మృతిలో ఉండాలి. కాని మాయ ఎటువంటిదంటే అది మరపింపజేస్తుంది. తండ్రి జతలో మనము విశ్వ సేవాధారులమని మీకు తెలుసు. ఇంతకుముందు మీరు హద్దులోని చదువును చదివేవారు. ఇప్పుడు అనంతమైన చదువును, అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నారు. ఇది పాత శరీరము. తన సమయానికి వదలిపోవాలి. దానంతట అది వదిలిపోరాదు. మనము ఖుషీ ఖుషీగా ఈ శరీరాన్ని వదలాలి. మనము ఈ ఛీ - ఛీ శరీరాన్ని వదలి, పాత ప్రపంచమును కూడా వదలి సంతోషంగా వెళ్ళిపోతాము. ఏదైనా మంచి పండుగ రోజు లేదా గొప్ప పండుగ రోజు అయితే సంతోషంగా కొత్త వస్త్రాలు ధరిస్తాము కదా! అలాగే ఇచ్చట మనకు నూతన ప్రపంచములో నూతన శరీరము లభిస్తుందని మీకు తెలుసు. పవిత్రంగా అవ్వాలనే ఏకైక చింత తప్ప ఇతర చింతలన్నింటి నుండి మనము విడుదల అవుతాము. ఇవన్నీ సమాప్తము కానున్నవి. ఇక దేనిని గురించి చింతించాలి? అర్ధకల్పము మనము భక్తిమార్గములో చింతలలో ఉన్నాము. ఇప్పుడు మళ్లీ అర్ధకల్పము ఏ చింతా ఉండదు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. పావనమవ్వాలి అన్న కొద్ది చింత మాత్రముంది. తర్వాత ఒక్క చింత కూడా ఉండదు. ఇది సుఖ-దు:ఖముల ఆట. సత్యయుగములో సుఖముంటుంది. కలియుగములో దు:ఖముంటుంది. బాబా అర్థము చేయిస్తున్నారు - ఎవరైనా వస్తే మీరు సత్యయుగ సుఖధామ నివాసులా? లేక కలియుగ దు:ఖధామ నివాసులా? అని వారిని అడగవచ్చు. ఇచ్చట మీరు వారికి కొత్త-కొత్త విషయాలు వినిపిస్తారు. అప్పుడు వారు తప్పకుండా దు:ఖధామ నివాసులమని చెప్తారు. ఈ విషయాలు చాలా ప్రీతిగా, మనుష్యులు వారంతకు వారే అర్థము చేసుకునే విధంగా ప్రశ్నించాలి. వారు ఎక్కడ నివసిస్తున్నారో వారికి తెలిసిపోవాలి. అప్పుడు వారు వీరు చాలా యుక్తిగా ప్రశ్నిస్తారని అంటారు. వారు ఎంత గొప్పవారు గాని, ధనవంతులు గాని నివసించేది నరకములోనే కదా! స్వర్గమని నూతన ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడిది పాత కలియుగ ప్రపంచము. ఈ ప్రశ్న చాలా బాగుంది. మెట్ల చిత్రములో కూడా(సీఢి) స్పష్టంగా ఉంది. మీరు సుఖధామములో ఉన్నారా లేక దు:ఖధామములో ఉన్నారా? అని చిత్రము చూపించి అడగండి. ఇది నరకమా ; స్వర్గమా? మీరు దేవతలా, అసురులా(దెయ్యాలా)? అని అడగాలి. వారు సత్యయుగాన్ని దైవీ ప్రపంచమని తప్పకుండా ఒప్పుకుంటారు. కలియుగమును నరకమని, దెయ్యాల ప్రపంచమని అంటారు. ఈ విషయాలు చెప్పిన తర్వాత మీరు సత్యయుగ స్వర్గ దైవీ ప్రపంచ నివాసులా? లేక కలియుగ ఆసురీ ప్రపంచ నివాసులా? అని అడగాలి. భలే ఎంతటి ధనవంతులైనా ఎక్కడి నివాసులు? ఇప్పుడు మీలోకి జ్ఞానము వచ్చింది. మొదట ఈ విషయాలు మీ ఆలోచనలలో కూడా లేవు. మనము ఇప్పుడు సంగమ యుగములో ఉన్నామని మీరు అర్థము చేసుకున్నారు. కలియుగములో ఉన్నవారు పతిత నరకవాసులు. ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలి. అందుకే ఓ పతిత పావనా! రండి, వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు. ఇది కూడా అర్థము చేయించాలి. మీ వద్దకు లెక్కలేనంతమంది మనుష్యులు వస్తారు. అయినా కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. నేను ఎవరో, ఎలా ఉన్నానో, ఎలా నేర్పిస్తున్నానో - అలా ఏ ఒక్కరో నడుస్తారు. ప్రభాత ప్రదక్షిణలో కూడా మేము ఈ చదువు ద్వారా స్వర్గవాసులుగా అవుతూ ఉన్నామని చూపండి. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగ,....... చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. మీరు మళ్లీ సుఖధామ-శాంతిధామాలకు అధిపతులుగా అవుతారు. సుఖధామములో దు:ఖమనే పేరు కూడా ఉండదు. ఒకవేళ పూర్తిగా చదవనట్లయితే, పదవి కూడా తక్కువది పొందుతారు. ఇది సాధారణ విషయము. అందువలన అనంతమైన చదువు చదివి అనంతమైన వారసత్వము తీసుకోండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా చాలా మధురమైనవారు. వారి ఆదేశమేమంటే - దేహ సహితము దేహ బంధనాలన్నీ సమాప్తము చేసేయండి. ఆత్మ ఏమో అవినాశి. ఇప్పుడిప్పుడే శరీరము తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే వదిలేస్తుంది. ఆలస్యము ఏమాత్రము ఉండదు. ఈ సమయములో రోజురోజుకు అందరూ, అన్నీ తమోప్రధానంగా అవుతూ ఉంటాయి. మనము సతోప్రధానంగా ఉన్నప్పుడు మన ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారము. అప్పుడు మరో ధర్మము లేనే లేదు. మీ ఆయువు ఇప్పటి మీ పురుషార్థము ద్వారానే పెరుగుతుంది. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో, మీ ఆయువు అంత వృద్ధి చెందుతుంది. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత ఎంత కిందకు దిగుతూ వచ్చారో అంత ఆయువు తగ్గిపోతూ వచ్చింది. రజోలోకి వస్తూనే ఆయువు కొద్దిగా తగ్గింది. తమోలోకి వస్తూనే ఇంకా తగ్గిపోయింది. ఏతము(నార్-రహట్/మోట బావి నుండి నీరు బయటకు తీయు మోట అనగా తోలు తిత్తి లేక డబ్బా) నింపబడి ఖాళీ అవుతూ ఉంటుందో అలా ఇది కూడా ఒక అనంతమైన ఏతము. ఇప్పుడు మీరు నింపుకుంటున్నారు. నిండుతూ - నిండుతూ పూర్తిగా నిండిన తర్వాత మళ్లీ మెల్ల మెల్లగా ఖాళీ అవుతారు. దీనిని బ్యాటరీతో కూడా పోల్చవచ్చు. ఇప్పుడు మనము సతోప్రధానంగా అయ్యి వెళ్లిపోతాము. మళ్లీ 84 జన్మలు తీసుకుంటాము. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమౌతుంది. రావణ రాజ్యములో అందరినీ నరకవాసులని అంటారు. ఎవరైతే చివరిలో వస్తారో, వారు నరకములోనే వస్తారు. మొదట మీరు స్వర్గములోకి వెళ్తారు. భక్తికి ఫలితంగా ఈ స్వర్గము మీకు తండ్రి నుండి లభిస్తుంది. చాలా భక్తి చేసినందున జ్ఞానము కూడా తీసుకుంటారని భావించడం జరుగుతుంది. ఈ రహస్యాలన్నీ మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు వీటిని మళ్లీ ఇతరులకు అర్థము చేయించాలి. మనుష్యులు అనేక విధములైన పాపాలు చేశారు. ఇప్పుడు తండ్రి వచ్చి మీకు జ్ఞానమిస్తున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే మిమ్ములను చదివిస్తారు. ఇంతవరకు మీకు ఈ విషయాలు తెలియనే తెలియవు. పాపాత్మలుగా అవుతూ వచ్చారు. పుణ్యాత్మలుగా ఎలా అవుతారు? మళ్లీ పాపాత్మలుగా ఎలా అవుతారు? ఎవరు సత్యయుగ నివాసులుగా అవుతారు? ఎవరు కలియుగ నివాసులుగా అవుతారు?............ మొదలైన విషయాలను గురించి కొద్దిగా కూడా మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి అన్నీ అర్థము చేయించారు. తండ్రిని దీపమని కూడా అంటారు. వారిలో లైటు కూడా ఉంది, మైటు(శక్తి) కూడా ఉంది. లైటులోకి వస్తారు అనగా మేలుకుంటారు. అప్పుడు మీకు మైటు వచ్చేస్తుంది. మీ ఆయువు కూడా వృద్ధి అవుతుంది. మిమ్ములను అక్కడ మృత్యువు కబళించదు. మీరు సర్పము వలె సంతోషంగా ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటారు. దు:ఖపడే విషయమే ఉండదు. ఒక ఆట వలె ఉంటుంది. మీరు సత్యయుగము నుండి కలియుగము వరకు పాత్రను అభినయించారు. ఇది మీ బుద్ధిలో కూర్చుంది.
బాబా మీకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ఇది పిల్లలు మాత్రమే నంబరువారు పురుషార్థానుసారము తెలుసుకుంటారు. పునర్జన్మను గురించి కూడా అనగా మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారో కూడా అర్థము చేసుకున్నారు. బ్రాహ్మణ ధర్మములో మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఒక జన్మ, కొంతమంది రెండు, మూడు జన్మలు కూడా తీసుకుంటారు. ఎవరైనా శరీరాన్ని వదిలారనుకోండి, వారు బ్రాహ్మణ సంస్కారాన్ని తీసుకెళ్తారు. కావున సంస్కారము బ్రాహ్మణులది కాబట్టి మళ్లీ సత్య-సత్యమైన బ్రాహ్మణ కులములోకి వచ్చేస్తారు. బ్రాహ్మణ కులములోని ఆత్మలు వృద్ధి అవుతూ ఉంటాయి. బ్రాహ్మణ కుల సంస్కారమును తీసుకెళ్తారు కదా. ఏదైనా లెక్కాచారము ఉంటే సంగమ యుగములోనే రెండు-మూడు జన్మలు కూడా తీసుకుంటారు. ఒక శరీరాన్ని వదిలి రెండవది తీసుకుంటారు. ఆత్మ బ్రాహ్మణ కులము నుండి దైవీ కులములోకి పోతుంది. ఇది శరీర విషయము కానే కాదు. ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఈశ్వరీయ సంతానులే కాక, ప్రజాపిత బ్రహ్మ సంతానులుగా కూడా అయ్యారు. ఈ సంబంధము తప్ప మీకు ఏ ఇతర సంబంధమేదీ లేదు. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవ్వడం తక్కువ విషయమేమీ కాదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. కేవలం ఆ గొప్ప తండ్రిని మీరు తెలుసుకుంటే చాలు. మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి-1. నాకు సంతోషము ఎంతవరకు ఉంటుంది? 2. సర్వ గుణ సంపన్నులుగా ఉండేవారము, ఇప్పుడు శ్రీమతముననుసరించి మళ్లీ అలా అవుతున్నామనే నిశ్చయము నాకు ఎంతవరకు ఉంది? 3. నేను సతోప్రధానంగా ఎంతవరకు అయ్యాను. రాత్రింబవళ్ళు సతోప్రధానంగా(పావనంగా) అవ్వాలనే చింత ఉంటుందా?
2. అనంతమైన తండ్రితో కలిసి విశ్వ సేవ చేయాలి. అనంతమైన చదువును చదివి ఇతరులను చదివించాలి. దేహ సహితము ఏ ఏ బంధనాలు ఉన్నాయో వాటిని తండ్రి స్మృతి ద్వారా అంతము చేసెయ్యాలి.
వరదానము :-
''సేవలో కీర్తి ప్రతిష్ఠలనే కచ్ఛా(అపరిపక్వ) ఫలాన్నిత్యాగము చేసి సదా ప్రసన్నచిత్తులుగా ఉండే అభిమానముక్త్ భవ''
రాయల్ రూపంలోని కోరికకు స్వరూపము - పేరు, ప్రతిష్ఠలు మరియు కీర్తి. ఎవరైతే పేరు కొరకు సేవ చేస్తారో, వారి పేరు అల్పకాలము కొరకు ప్రసిద్ధమవుతుంది. కాని ఉన్నతమైన పదవి పొందుటలో పేరు వెనుకకు పోతుంది ఎందుకంటే కచ్ఛా ఫలాన్ని తినేశారు. చాలామంది పిల్లలు సేవ చేసినందుకు నాకు పేరు, గౌరవము లభించాలని అనుకుంటారు. కాని ఇది గౌరవము కాదు, అభిమానము. ఎక్కడైతే అభిమానముంటుందో, అక్కడ ప్రసన్నత ఉండజాలదు. అందువలన అభిమాన ముక్తులుగా అయి సదా ప్రసన్నతను అనుభవం చేయండి.
స్లోగన్ :-
''పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉంటే దు:ఖపు అల రాజాలదు.''
బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
నంబరువన్ బ్రహ్మ ఆత్మతో పాటు మీరందరు కూడా ఫరిస్తాలుగా అయ్యి వతనములోకి వెళ్లి
అక్కడ నుండి పరంధామములోకి వెళ్లాలి. అలా వెళ్లేందుకు మానసిక ఏకాగ్రత పై విశేషమైన
అటెన్షన్ ఇవ్వండి. మీ ఆజ్ఞానుసారము మనసును నడిపించండి. ప్రతి విషయంలో, వృత్తిలో,
దృష్టిలో, కర్మలో భిన్నత్వము అనుభవమవ్వాలి. ఫరిస్తా స్థితిని స్వయం మీరు కూడా అనుభవం
చేయండి, ఇతరులకు కూడా చేయించండి.