01-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - లక్ష్యమును సదా ముందుంచుకుంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వయాన్ని సంభాళించుకోవాలి, ఆసురీ గుణాలను తొలగించి దైవీగుణాలను ధారణ చేయాలి ''

ప్రశ్న :-

''ఆయుష్మాన్‌ భవ'' అను వరదానము లభించినా, ఆయువు ఎక్కువగా ఉండేందుకు ఏ శ్రమ చేయాలి?

జవాబు :-

దీర్ఘాయువు కొరకు తమోధ్రానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు శ్రమ చేయండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా అవుతారు. అంతేకాక ఆయువు పెరుగుతుంది, మృత్యు భయము తొలగిపోతుంది. స్మృతి ద్వారా దుఃఖము దూరమైపోతుంది. మీరు పుష్పాలుగా అవుతారు. స్మృతిలోనే గుప్త సంపాదన ఉంది. స్మృతి వలన పాపాలు తొలగిపోతాయి. ఆత్మ తేలికైపోతుంది, ఆయువు పెరుగుతుంది.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, చదివిస్తూ కూడా ఉన్నారు. ఏం అర్థం చేయిస్తున్నారు? మధురమైన పిల్లలూ! మీకు ఒకటేమో దీర్ఘాయువు కావాలి. ఎందుకంటే మీ ఆయువు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. 150 సంవత్సరాల ఆయువు ఉండేది, ఇప్పుడు అంత దీర్ఘాయువు ఎలా లభిస్తుంది? తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వడం వలన లభిస్తుంది. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు. మనము తమోప్రధానంగా అయినందున మన ఆయువు తగ్గిపోయిందని మీకు తెలుసు. ఆరోగ్యము కూడా బాగుండదు. పూర్తి రోగులుగా అయిపోయారు. ఇది పాత జీవితము, క్రొత్త జీవితముతో ఇది పోల్చబడ్తుంది. ఇప్పుడు తండ్రి మనకు దీర్ఘాయువును తయారు చేసుకునేందుకు యుక్తులు తెలుపుతున్నారు. మధురాతి మధురమైన పిల్లలూ! నన్ను మీరు స్మృతి చేస్తే, మొదట ఎంత సతోప్రధానంగా ఉండేవారో, ఎంత దీర్ఘాయువు గలవారిగా ఉండేవారో, ఎంత ఆరోగ్యవంతులుగా ఉండేవారో మళ్లీ అలాగే అవుతారు. ఆయువు తగ్గిపోయినందున మృత్యు భయముంటుంది. సత్యయుగములో ఇలా అకస్మాత్తుగా ఎప్పుడూ మరణించరని మీకు గ్యారంటీ(హామీ) లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆయువు వృద్ధి చెందుతుంది. అంతేకాక అన్ని దుఃఖాలూ దూరమైపోతాయి. ఎలాంటి దుఃఖమూ ఉండదు. ఇంతకంటే మీకు ఏం కావాలి? ఉన్నత పదవి కూడా కావాలని మీరు అంటారు. ఇటువంటి పదవి లభించగలదని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు ఇలా చేయండి అని తండ్రి యుక్తి తెలుపుతున్నారు. లక్ష్యము మీ ఎదుటే ఉంది. మీరు ఇటువంటి(లక్ష్మీనారాయణ) పదవి పొందగలరు. అందుకు మీరు ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేయాలి. నాలో ఏ అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సిగరెట్టు కాల్చడం, ఛీ-ఛీ వస్తువులు(అసహ్యకరమైన) తినడం - ఇవి కూడా అవగుణాలే. అన్నిటికంటే పెద్ద అవగుణము వికారము. దీనినే చెడు స్వభావము అని అంటారు. తండ్రి అంటున్నారు - మీరు వికారులుగా అయ్యారు. ఇప్పుడు నిర్వికారులుగా అయ్యేందుకు మీకు యుక్తులు తెలుపుతున్నాను. ఇందులో ఈ వికారాలను, అవగుణాలను వదిలేయాలి. ఎప్పుడూ వికారులుగా కారాదు. ఈ జన్మలో సంస్కరించబడితే, ఆ సంస్కారము 21 జన్మల వరకు కొనసాగుతుంది. చాలా ముఖ్యమైన విషయము - నిర్వికారులుగా అవ్వడం. జన్మ-జన్మాంతరాల భారము ఏదైతే తల పై ఎక్కి ఉందో అది యోగబలము ద్వారానే దిగిపోతుంది. జన్మ-జన్మాంతరాలుగా మనము వికారులుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. ఇక మీదట ఎప్పుడూ వికారులుగా అవ్వమని తండ్రితో మనము ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాము. పతితులుగా అయితే వందరెట్లు దండన కూడా అనుభవించవలసి వస్తుంది, అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుందని తండ్రి అంటున్నారు. ఎందుకంటే నిందింపజేశారు కదా అనగా వికారి మనుష్యుల వైపుకు వెళ్లిపోయారు. ఈ విధంగా చాలామంది అటువైపుకు వెళ్లిపోతారు అనగా ఓడిపోతారు. ఈ వికారీ వ్యాపారము చేయరాదని ఇంతకుముందు మీకు తెలియదు. కొంతమంది చాలా మంచి పిల్లలు ఉంటారు, మేము బ్రహ్మచర్యమును పాటిస్తామని అంటారు. సన్యాసులను చూచి పవిత్రత మంచిదని భావిస్తారు. పవిత్రత మరియు అపవిత్రత. ప్రపంచములో అపవిత్రులైతే చాలామంది ఉన్నారు. మలవిసర్జనకు వెళ్లడం కూడా అపవిత్రంగా అవ్వడం. కనుక వెంటనే స్నానము చేయాలి. అనేక ప్రకారాలైన అపవిత్రత ఉంటుంది. ఎవరికైనా దుఃఖమివ్వడం పోట్లాడడం, జగడాలాడడం కూడా అపవిత్ర కర్తవ్యములే. తండ్రి చెప్తున్నారు - జన్మ-జన్మాంతరాలుగా మీరు పాపాలు చేశారు. ఆ అలవాట్లన్నీ ఇప్పుడు నిర్మూలించి వేయాలి. ఇప్పుడు మీరు సత్య-సత్యమైన మహాన్‌ ఆత్మలుగా అవ్వాలి. సత్య-సత్యమైన మహాత్మలు ఈ లక్ష్మీనారాయణులే. ఇతరులెవ్వరూ ఇక్కడ అలా అవ్వలేరు ఎందుకంటే అందరూ తమోప్రధానంగా ఉన్నారు. చాలా గ్లాని కూడా చేస్తారు కదా. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఒకటి గుప్త పాపాలు, రెండవది ప్రత్యక్ష పాపాలు కూడా జరుగుతాయి. ఇది తమోప్రధానమైన ప్రపంచము. తండ్రి మనల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు, అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పావనంగా తయారవ్వాలి, అంతేకాక గుణాలు కూడా కావాలి అనే మంచి జ్ఞానము మీకు లభిస్తుంది. దేవతల ముందు మీరు ఏ మహిమనైతే చేస్తూ వచ్చారో ఇప్పుడు మీరు ఈ ఆ విధంగా దేవతల వలె తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! మీరు ఎంత మధురాతి మధురమైన సుగంధ పుష్పాలుగా ఉండేవారు, తర్వాత మీరే ముళ్లుగా తయారయ్యారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీ ఆయువు పెరుగుతుంది. పాపాలు కూడా భస్మమైపోతాయి. తల పైనున్న భారము తేలికవుతుంది. మిమ్ములను మీరే సంభాళించుకోవాలి. మీలో ఏ ఏ అవగుణాలున్నాయో వాటిని తొలగించుకోవాలి. ఉదాహరణానికి నీకు అర్హత ఉందా? అని నారదుని అడిగారు. నారదుడు తనకు అర్హత లేదని తెలుసుకున్నాడు. తండ్రి మిమ్ములను ఉన్నతంగా తయారుచేస్తారు. తండ్రికి మీరు పిల్లలు కదా. ఎవరి తండ్రి అయినా మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజు అని అంటాడు కదా. బాబా చాలా సుఖమునిచ్చేవారు. మంచి స్వభావమున్న మహారాజులకు కోపము ఎప్పుడూ రాదు. ఇప్పుడు మెల్ల-మెల్లగా అందరి కళలు తగ్గిపోతూ వచ్చాయి. అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి. కళలు తగ్గిపోతూ వచ్చాయి. తమోగా అయిపోయారు. తమోప్రధానత కూడా అంత్యానికి చేరుకుంది. ఎంత దుఃఖితులుగా అయిపోయారు! మీరు ఎంతో సహించవలసి వస్తుంది. ఇప్పుడు అవినాశి సర్జన్‌ ద్వారా మీకు చికిత్స జరుగుతోంది. పంచ వికారాలు మిమ్ములను క్షణ-క్షణము సతాయిస్తాయి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థము ఎంతగా చేస్తారో అంత మాయ మిమ్ములను క్రింద పడవేసేందుకు ప్రయత్నిస్తుంది. మాయ తుఫాన్లు కదలించ లేనంతగా మీ స్థితి శక్తిశాలిగా ఉండాలి. రావణుడంటే ఏ వస్తువూ కాదు, ఏ మనిషీ కాదు. పంచ వికారాల రూపమైన రావణుడినే మాయ అని అంటారు. ఆసురీ రావణ సంప్రదాయములోనివారు, అసలు మీరు ఎవరో గుర్తించనే గుర్తించరు. అసలు వీరు ఎవరు? అని అడుగుతారు. ఈ బి.కె.లు ఏం అర్థం చేయిస్తున్నారు? అని అడుగుతారు. యధార్థము ఎవ్వరికీ తెలియదు. బి.కె.లని వీరు ఎందుకు పిలువబడుతున్నారు? బ్రహ్మ ఎవరి సంతానము? - ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మనము వాపస్‌ ఇంటికి వెళ్లాలని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఈ శిక్షణ ఇస్తున్నారు. 'ఆయుష్మాన్‌ భవ, ధనవాన్‌ భవ'........ మీ కోరికలన్నీ పూర్తి చేస్తారు. వరదానములిస్తారు కానీ కేవలం వరదానాలతో ఏ పనీ జరగదు. శ్రమించాలి. ప్రతి విషయాన్ని బాగా అర్థము చేసుకోవాలి. స్వయానికి రాజ్య తిలకము దిద్దుకునేందుకు అధికారిగా అవ్వాలి. తండ్రి అధికారులుగా చేస్తారు. ఇలా ఇలా చేయమని పిల్లలైన మీకు శిక్షణ ఇస్తున్నారు. మొదటి నంబరు శిక్షణ - 'నన్ను ఒక్కరినే స్మృతి చేయండి.' మనుష్యులు స్మృతి చేయరు, ఎందుకంటే వారికి తెలియనే తెలియదు. కావున వారి స్మృతి కూడా తప్పే(రాంగ్‌). ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. అలాంటప్పుడు శివబాబాను ఎలా స్మృతి చేస్తారు! శివాలయానికి వెళ్లి పూజ చేస్తారు, వీరి కర్తవ్యము ఏమిటి? అని వారిని అడగండి. వెంటనే భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. దయ చూపమని వేడుకుంటారు, పూజిస్తారు. పరమాత్ముడు ఎక్కడున్నారని ఎవరైనా అడిగితే వెంటనే సర్వవ్యాపి అని అంటారు. చిత్రాల ఎదురుగా ఏమి చేస్తారు? చిత్రము ఎదురుగా లేనప్పుడు అన్ని కళలు సమాప్తమైపోతాయి. భక్తిమార్గములో ఎన్నో తప్పులు చేస్తారు. అయినా భక్తి అంటే చాలా ప్రియము. కృష్ణుని కొరకు ఎన్నో నిర్జల ఉపవాసాలు మొదలైనవి చేస్తారు. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు. భక్తులు ఏమేమి చేస్తున్నారో చూసి మీకిప్పుడు నవ్వు వస్తుంది. డ్రామానుసారంగా భక్తి చేస్తూ క్రిందకే దిగుతూ వచ్చారు. పైకి ఎవరూ ఎక్కలేదు.

ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. టీచరు విద్యార్థికి సేవకునిగా ఉంటాడు కదా. విద్యార్థులకు సేవ చేస్తాడు. టీచరు గవర్నమెంటు సర్వెంట్‌ కదా కావున విద్యార్థులకు కూడా సేవకుడు. తండ్రి కూడా మీకు నేను సేవ చేస్తాను, మిమ్ములను చదివించను కూడా చదివిస్తాను అని అంటున్నారు. వారు సర్వాత్మలకు తండ్రి. టీచర్‌గా కూడా అయ్యి సృష్టి ఆది-మధ్య-అంత్య జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానము ఇక ఏ మనుష్యులలోనూ లేదు. ఎవ్వరూ నేర్పించలేరు. మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తారు. ప్రపంచములో మానవులు ఎంతో తమోప్రధాన బుద్ధి గలవారిగా ఉన్నారు. ఇది చాలా భయంకరమైన ప్రపంచము. ఏ పనులైతే మనుష్యులు చేయరాదో అవి చేస్తున్నారు. ఎన్నో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు మొదలైనవి చేస్తున్నారు. చేయనిదంటూ లేనే లేదు. నూరు శాతము తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మీరు మళ్లీ 100% సతోప్రధానంగా అవుతున్నారు. అలా అయ్యేందుకు యుక్తి స్మృతియాత్ర. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనము అవుతాయి. వెళ్లి తండ్రితో కలుస్తారు. తండ్రి అయిన భగవంతుడు ఎలా వస్తారో మీకిప్పుడు తెలుసు. ఈ రథములో వచ్చారు. బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. దానిని మీరు ధారణ చేసి ఇతరులకు వినిపిస్తే వారికి కూడా నేరుగా వచ్చి వినాలనిపిస్తుంది. తండ్రి పరివారములోకి వెళ్లాలనిపిస్తుంది. ఇక్కడ తండ్రి, తల్లి, పిల్లలు కూడా ఉన్నారు. పరివారములోకి వచ్చేస్తారు. ఆ ప్రపంచమే ఆసురీ ప్రపంచము. ఆ ఆసురీ పరివారముతో విసిగి వ్యాపారాలు మొదలైనవి వదిలి రిఫ్రెష్‌ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. బ్రాహ్మణులే ఇక్కడ ఉంటారు కావున ఈ పరివారములోకి వచ్చి కూర్చుంటారు. ఇంటికి పోతే ఇలాంటి పరివారము అక్కడ ఉండదు. అక్కడ దేహధారులుగా అయిపోతారు, చిక్కు పనుల నుండి మీరు బయటపడి మీరు ఇక్కడకు వస్తారు. ఇప్పుడు తండ్రి దేహ సంబంధాలన్నీ వదిలేయండి, సుగంధభరిత పుష్పాలుగా అవ్వండి అని అంటున్నారు. పుష్పాలలో సుగంధముంటుంది. అందరూ తీసుకొని వాసన చూస్తారు. జిల్లేడు పూలను ఎవ్వరూ తీసుకోరు. అందువలన సుగంధ పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. అందుకే బాబా కూడా అలా అవ్వాలని ఎప్పుడూ పుష్పాలనే తీసుకొస్తారు. గృహస్థములో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఈ దేహ సంబంధీకులందరూ సమాప్తమైపోతారని మీకు తెలుసు. మీరు ఇక్కడ గుప్తమైన సంపాదన చేస్తున్నారు. మీరు శరీరాలను వదిలేయాలి. సంపాదన చేసి చాలా సంతోషంగా హర్షితముఖులుగా అయ్యి శరీరమును వదలాలి. తిరుగుతూ నడుస్తూ తండ్రినే స్మృతి చేస్తే అలసటే ఉండదు. తండ్రి స్మృతిలో అశరీరులుగా అయ్యి ఎంత తిరిగినా, ఇక్కడి నుండి క్రింద ఆబూరోడ్‌ వరకు వెళ్ళినా అలసట ఉండదు. పాపాలు తొలగిపోతాయి. తేలికైపోతారు. పిల్లలైన మీకెంత లాభము కలుగుతుందో ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. ''ఓ పతితపావనా! వచ్చి పావనంగా చేయమని ప్రపంచములోని మానవులందరూ పిలుస్తారు. అటువంటి మానవులను మహాత్ములని ఎలా అంటారు? పతితులకు తల వంచి నమస్కారము చేయరాదు. పవిత్రంగా ఉన్నవారి ముందే తల వంచాలి. కన్య వికారీగా అవుతూనే అందరి ముందు తల వంచుతుంది. మళ్లీ పతితపావనా! రండి అని పిలుస్తుంది. అరే పతితులుగా ఎందుకు అవ్వాలి, ఎందుకు పిలవాలి? అందరి శరీరాలు వికారాలతోనే జన్మించాయి కదా. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇప్పుడు మీరు రావణుని నుండి వెలుపలికి వచ్చేశారు. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. రామరాజ్యంలోకి వెళ్లేందుకు మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. సత్యయుగమంటే రామ రాజ్యము. కేవలం త్రేతా యుగమునే రామరాజ్యమని అంటే సూర్యవంశీ లక్ష్మీనారాయణుల రాజ్యము ఏమైపోయింది? ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకిప్పుడు లభిస్తోంది. క్రొత్త - క్రొత్తవారు కూడా వస్తారు వారికి మీరు జ్ఞానమిస్తారు. అర్హులుగా చేస్తారు. అర్హులైనవారిని అనర్హులుగా తయారుచేసే కొంతమంది సాంగత్యము లభిస్తుంది. తండ్రి పవిత్రంగా చేస్తారు కావున ఇప్పుడు పతితంగా అవ్వనే అవ్వరాదు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు మాయ శక్తివంతమై పతితంగా చేసి ఓడిస్తుంది. ''బాబా రక్షించండి'' అని పిలుస్తారు. యుద్ధ మైదానములో చాలామంది మరణిస్తారు అప్పుడు రక్షిస్తారా! మాయ తుపాకి గుండు, ఈ తుపాకిగుండు కంటే కూడా చాలా కఠినమైనది. కామ వికారపు దెబ్బ తగిలితే పై నుండి క్రింద పడినట్లు అవుతుంది. సత్యయుగములో అందరూ పవిత్ర గృహస్థ ధర్మములో ఉంటారు. వారిని దేవతలు అని అంటారు. తండ్రి ఎలా వచ్చారో, ఎక్కడ ఉంటారో, ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. అర్జునుని రథము పై కూర్చొని జ్ఞానమిచ్చినట్లు చూపిస్తారు. మరి వారిని సర్వవ్యాపి అని ఎందుకంటారు? స్వర్గ స్థాపన చేసే తండ్రినే మర్చిపోయారు. ఇప్పుడు వారే తన పరిచయాన్ని ఇస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మహాన్‌ ఆత్మగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. దుఃఖమివ్వడం, పోట్లాడడం, జగడాలాడడం,............ ఇవన్నీ మీరు చేయకూడని అపవిత్ర కర్తవ్యాలు. స్వయానికి రాజ్యతిలకము దిదుకునేందుకు అధికారిగా చేసుకోవాలి.

2. బుద్ధిని అన్ని చిక్కు సమస్యల నుండి, దేహధారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. గుప్త సంపాదన జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి.

వరదానము :-

'' బేహద్‌ దృష్టి, వృత్తి, స్థితి ద్వారా సర్వులకు ప్రియంగా అయ్యే డబల్‌ లైట్‌ ఫరిస్తా భవ ''

ఫరిస్తాలు అందరికీ చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే ఫరిస్తాలు అందరికీ చెందినవారు, ఒకరికో ఇద్దరికో కాదు. అనంతమైన(బేహద్‌) దృష్టి, వృత్తి, స్థితి కలిగిన ఫరిస్తాలు సర్వ ఆత్మలకు పరమాత్మ సందేశ వాహకులు. ఫరిస్తా అనగా డబల్‌లైట్‌. అందరి సంబంధము ఒక్క తండ్రితో జోడించేవారు - దేహము మరియు దేహ సంబంధీకులతో భిన్నమైనవారు, స్వయాన్ని మరియు సర్వులను తమ చలనము మరియు ముఖము ద్వారా తండ్రి సమానంగా చేయువారు, అందరి పట్ల కళ్యాణకారులు. ఇటువంటి ఫరిస్తాలే అందరికి ప్రియమైనవారు.

స్లోగన్‌ :-

'' ఎప్పుడైతే మీ ముఖము(సూరత్‌) ద్వారా తండ్రి గుణాలు (సీరత్‌) కనిపిస్తాయో అప్పుడు సమాప్తమౌతుంది. ''