06-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - బాబా 21 జన్మల కొరకు మీ మనస్సును ఎంతగా ఆహ్లాదపరుస్తారంటే, మీరు మనోరంజనము కొరకు మేళాలు - జాతర్లు మొదలైన వాటికి వెళ్ళవలసిన అవసరము లేదు''
ప్రశ్న :-
ఇప్పుడు ఏ పిల్లలైతే తండ్రికి సహయోగులుగా అవుతారో వారికి ఏ గ్యారెంటీ ఉంది ?
జవాబు :-
శ్రీమతానుసారము రాజధానిని స్థాపన చేసే కార్యములో సహయోగులుగా ఉన్న పిల్లలను మృత్యువు ఎప్పుడూ కబళించలేదు అన్న గ్యారంటీ ఉంది. సత్యయుగ రాజధానిలో ఎప్పుడూ అకాలమృత్యువే రాజాలదు. సహయోగి పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి బహుమతి లభిస్తుందంటే 21 తరాల వరకు వారు అమరులైపోతారు.
ఓంశాంతి.
తయారు చేయబడిన సృష్టి చక్రమును అనుసరించి కల్పక్రితము వలె శివభగవానువాచ - పిల్లలకిప్పుడు తమ పరిచయమైతే లభించింది. తండ్రి పరిచయము కూడా లభించింది. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు. నంబరువారు పురుషార్థానుసారము కొందరు బాగా అర్థము చేసుకుని ఇతరులకు అర్థము చేయించగలరు. కొందరు సగము, కొందరు ఇంకా తక్కువగా తెలుసుకొని, తెలిపిస్తారు. యుద్ధ మైదానములో కూడా కొందరు ఛీఫ్కమాండర్లుగా అవుతారు, కొందరు కెప్టన్లు, కొందరు ఇంకేమో అవుతారు. రాజ్యమాలలో కూడా కొందరు షాహుకారు ప్రజలు, కొందరు పేద ప్రజలుగా నెంబరువారుగా ఉంటారు. శ్రీమతానుసారము సృష్టిలో శ్రేష్ఠ రాజధానిని మేమే స్థాపిస్తున్నామని పిల్లలకు తెలుసు. ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంతంత తండ్రి నుండి బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలిచ్చువారికి కూడా బహుమతి లభిస్తుంది. పిల్లలైన మీకు కూడా బహుమతి లభిస్తుంది. అది(మీకు లభించే బహుమతి) వారికి లభించదు. వారికి ప్రతి వస్తువు అల్పకాలము కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతమనుసారము మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. అది కూడా 21 జన్మలకు, 21 తరాలకు గ్యారంటీగా ఉంటుంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యువు కబళించదు. ఎక్కడైతే మన స్మృతిచిహ్నాలు నిలిచి ఉన్నాయో ఆ స్థానములోనే వచ్చి కూర్చుంటామని మనస్సులో గానీ, చిత్తములో గానీ లేదు. ఎక్కడైతే 5 వేల సంవత్సరాల క్రితము కూడా సేవ చేశారో, ఎక్కడైతే దిల్వాలా మందిరము, అచల్ఘర్, గురుశిఖరము స్మృతిచిహ్నాలుగా ఉన్నాయో అక్కడకు వచ్చాము. సర్వశ్రేష్ఠులైన సద్గురువు లభించిన దానికి కూడా స్మృతిచిహ్నము తయారు చేయబడి ఉంది. అచల్ఘర్ రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. మీరు మీ పురుషార్థము ద్వారా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. ఇది మీ అద్భుతమైన జడ స్మృతిచిహ్నము. అక్కడే మీరిప్పుడు చైతన్యములో వచ్చి కూర్చుని ఉన్నారు. కల్పక్రితము వలె నడుస్తున్న ఆత్మిక పాలనా వ్యవహారము యొక్క పూర్తి స్మృతిచిహ్నము ఇక్కడ ఉంది. ఇది నెంబర్వన్ స్మృతిచిహ్నము. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులైతే వారికి ఆంతరికముగా సంతోషము, మెరుపు వచ్చేస్తుంది. ఫర్నీచర్, డ్రస్ మొదలైనవన్నీ ఎంతో బాగా పెట్టుకుంటారు. మీరైతే విశ్వాధికారులుగా అవుతారు. మీతో ఎవ్వరినీ పోల్చలేము. ఇది కూడా పాఠశాలే. చదివించేవారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవానువాచ, భక్తిమార్గములోని వారికి వారు ఎవరిని స్మృతి చేస్తున్నారో, పూజిస్తున్నారో ఏమీ తెలియదు. తండ్రియే సన్ముఖములో వచ్చి రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే ఈ స్మృతిచిహ్నాలన్నీ మీ చివరి స్థితికి చెందినవి. ఇప్పుడు ఇంకా ఫలితము వెలువడలేదు. మీ స్థితి సంపూర్ణమైనప్పుడు భక్తిమార్గములో మీ స్మృతిచిహ్నాలు మళ్లీ తయారవుతాయి. ఉదాహరణానికి రక్షాబంధనానికి స్మృతిచిహ్నముంది. పూర్తి పక్కా రాఖీని ట్టుకొని మనము మన రాజ్యభాగ్యము తీసుకున్నప్పుడు స్మృతి పండుగను ఆచరించము. ఈ సమయములో మీకు అన్ని మంత్రాల రహస్యాన్ని అర్థం చేయించారు. ఓం యొక్క అర్థమును కూడా అర్థం చేయించారు. ఓం అర్థము పొడవైనదేమీ కాదు. ఓం అంటే అర్థము(అహమ్ ఆత్మ మమ్(నా) శరీరము) నేను ఆత్మను, ఈ శరీరము నాది. అజ్ఞానకాలములో కూడా మీరు దేహాభిమానములో ఉన్నప్పుడు స్వయాన్ని శరీరమని భావిస్తారు. రోజురోజుకు భక్తిలో క్రిందకు దిగుతూనే వచ్చారు. తమోప్రధానంగా అవుతూ పోతుంది. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతోప్రధానంగా ఉండేది. అప్పుడు ఒకే సత్యమైన శివబాబాను స్మృతి చేస్తూ ఉండేవారు. అతి కొద్దిమందే ఉండేవారు. రోజురోజుకు ఎంతో వృద్ధి జరుగుతుంది. విదేశాలలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వారికి బహుమతినిస్తారు. తండ్రి చెప్తున్నారు - 'కామము మహాశత్రువు' సృష్టి ఎంతగానో వృద్ధి అయిపోయింది. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. సత్యయుగములో భక్తికి నామ-రూపాలుండవు. ఇప్పుడు ఎంత ఆడంబరంగా వైభవాలు జరుగుతున్నాయి! మేళాలు, జాతరలు మొదలైనవి అనేకము జరుగుతూ ఉంటాయి. అవి మనుష్యులకు మనోరంజనము కలిగిస్తాయి. తండ్రి వచ్చి మీ మనస్సును 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తున్నారు. మీరు సదా సంతోషంగా ఉంటారు. మీకు మేళాలు మొదలైనవాటికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. మనుష్యులు ఎక్కడికైనా సుఖము కొరకే వెళ్తారు. మీరు పర్వతాల పైకి వెళ్ళవలసిన అవసరము లేదు. ఇక్కడ మనుష్యులు ఎలా మరణిస్తారో చూడండి. మనుష్యులకు సత్య-కలియుగాలు, స్వర్గ-నరకాల గురించి కూడా తెలియదు. పిల్లలైన మీకైతే మొత్తం జ్ఞానమంతా లభించింది. నా జతలోనే ఉండాలని తండ్రి చెప్పరు. మీరు మీ ఇల్లు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు తండ్రి వద్దకు వచ్చేస్తారు. అయినా మీరు తండ్రి జతలో ఉండలేరు. అందరూ సతోప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో స్థితి, కొందరు రజో, కొందరు ఇంకా తమో స్థితిలోనే ఉన్నారు. అందరూ ఒక్కటిగా ఉండలేరు. ఇప్పుడు రాజధాని తయారవుతూ ఉంది. ఎవరు ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో, దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు. ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడము. తండ్రి స్వయంగా కూర్చుని డ్రిల్లు నేర్పిస్తున్నారు. ఇది డెడ్ సైలెన్స్(శ్మశాన నిశ్శబ్ధము). ఇక్కడ మీకేదైతే కనిపిస్తోందో అది చూడరాదు. దేహ సహితంగా అన్నిటినీ త్యాగము చేయాలి. మీరేం చూస్తారు? ఒకటేమో మీ ఇల్లు మరియు చదువు అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సత్యయుగ రాజ్యమును గురించి కూడా మీకు మాత్రమే తెలుసు. సత్యయుగమున్నప్పుడు త్రేతా యుగము లేదు, త్రేతా ఉన్నప్పుడు ద్వాపర యుగము లేదు, ద్వాపర యుగము ఉన్నప్పుడు కలియుగము లేదు. ఇప్పుడైతే కలియుగమూ ఉంది, సంగమ యుగము కూడా ఉంది. భలే మీరు పాత ప్రపంచములో కూర్చుని ఉన్నా బుద్ధి ద్వారా మేము సంగమ యుగములో ఉన్నామని భావిస్తారు. సంగమ యుగమని దేనినంటారో కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ మాసము, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే ఉంటాయి. పురుషోత్తములయ్యే క్షణము కూడా ఈ పురుషోత్తమ యుగములోనే ఉంటుంది. ఇది అతి చిన్న లీప్ యుగము. మీరు పల్టీలాట (బాజోలి) ఆడుతున్నారు. దీని ద్వారా మీరు స్వర్గములోకి వెళ్తారు. భక్తిమార్గములో సాధు-సన్యాసులు యాత్రలలో బాజోలి ఆడుతూ యాత్రకు వెళ్లడం ఈ బాబా చూశారు. ఎంతో కష్టపడ్తారు. ఇక్కడ ఎటువంటి కష్టమూ లేదు. ఇవి యోగబలపు విషయాలు. స్మృతియాత్ర పిల్లలైన మీకు కష్టమనిపిస్తుందా? విని భయపడకుండా పేరేమో చాలా సహజమైనదే పెట్టారు. బాబా మేము యోగములో ఉండలేమని అంటారు. బాబా తిరిగి ఈ విషయాన్ని సహజపరుస్తారు. ఇది తండ్రి స్మృతి. అన్ని వస్తువులు గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పిల్లలు కదా. వీరు మీ తండ్రి, ప్రియుడు కూడా. ప్రేయసులందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రి అనే ఒక్క పదమే చాలు. భక్తిమార్గములో మీరు బంధు-మిత్రులను స్మృతి చేస్తారు. అయినా ఓ ప్రభూ! ఓ ఈశ్వరా! అని తప్పకుండా అంటారు. కేవలం ఆ ప్రభువెవ్వరో తెలియదు. ఆత్మల తండ్రి పరమాత్మ. ఈ శరీరానికి తండ్రి దేహధారి. ఆత్మల తండ్రి అశరీరి. వారు ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు. ఇతరులందరూ పునర్జన్మలలోకి వస్తారు, అందుకే తండ్రిని స్మృతి చేస్తారు అంటే తప్పకుండా ఎప్పుడో సుఖమిచ్చి ఉంటారు. వారిని దు:ఖహర్త - సుఖకర్త అని అంటారు. కానీ వారి నామ, రూప, దేశ, కాలాల గురించి తెలియదు. ఎంతమంది మనుష్యులున్నారో అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అనేక మతములైపోయాయి.
బాబా ఎంత ప్రేమతో చదివిస్తున్నారు! వారు ఈశ్వరుడు. శాంతినిచ్చేవారు, వారి నుండి ఎంతో సుఖము లభిస్తుంది. గీతను వినిపించి పతితులను పావనంగా చేసేస్తారు. ప్రవృత్తి మార్గము కూడా కావాలి కదా. మనుష్యులు కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని అనేశారు అంటే లెక్కలేనంత మంది మనుష్యులైపోతారు. ఎంత తప్పు చేసేశారు. ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తుంది. తర్వాత ప్రాయ: లోపమైపోతుంది. పూజింపబడే చిత్రాలేమో ఉన్నాయి. కానీ స్వయాన్ని దేవతా ధర్మము వారమని భావించరు. ఎవరు ఎవరి పూజ చేస్తారో, వారు ఆ ధర్మానికి చెందినవారే కదా. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారమని అర్థము చేసుకోరు. మీరు వారి వంశావళియే. ఈ విషయాలు తండ్రే అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - మీరు మొదట పావనంగా ఉండేవారు, తర్వాత తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పావనంగా సతోప్రధానంగా అవ్వాలి. గంగా స్నానముతో పావనంగా అవుతారా? పతితపావనులు ఒక్క తండ్రియే. వారు వచ్చి మార్గమును తెలియచేసినప్పుడే పావనంగా అవుతారు. పిలుస్తూ ఉంటారు కానీ వారికేమీ తెలియదు. ఆత్మ 'ఓ పతితపావనా తండ్రీ!, వచ్చి మమ్ములను పావనంగా చేయండి' అని కర్మేంద్రియాల ద్వారా పిలుస్తుంది. అందరూ పతితులుగానే ఉన్నారు. కామచితి పై కాలుతూ ఉంటారు. ఈ ఆటనే అలా తయారై ఉంది. తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేసేస్తారు. ఈ విషయాలు తండ్రి సంగమ యుగంలోనే అర్థం చేయిస్తారు. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది. మిగిలిన వారంతా వాపస్ వెళ్ళిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ రచన ఆదిమధ్యాంతాలు ఏవి, దీని గడువు ఎంత? అను విషయాలు మీకు మాత్రమే తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీకు కూడా నెంబరువారు పురుషార్థానుసారము తెలుసు. ఎవరైనా తప్పులు చేస్తే, అజాగ్రత్తగా ఉంటే వారి రిజిష్టరు ద్వారా వీరు తక్కువగా చదివారని తెలుస్తుంది. నడవడికలకు సంబంధించిన రిజిష్టరు ఉంటుంది. ఇక్కడ కూడా రిజిష్టరు ఉండాలి. ఇది స్మృతి యాత్ర. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్టు(విషయము) స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ నోటితో చెప్తుంది - నేను ఒక శరీరమును వదిలి మరొక శరీరమును తీసుకుంటాను. ఈ విషయాలన్నీ బ్రహ్మాబాబా అర్థం చేయించరు. కానీ జ్ఞానసాగరులైన పరమపిత పరమాత్మ ఈ రథములో కూర్చుని వినిపిస్తారు. ఇది గోముఖమని చెప్పబడ్తుంది. మందిరము కూడా ఇక్కడ తయారు చేయబడింది. అక్కడే మీరు కూర్చుని ఉన్నారు. మీ మెట్లు(తాపలు) ఉన్నట్లే అక్కడ కూడా మెట్లు ఉన్నాయి. మీకు మెట్లు ఎక్కడంలో అలసట రాదు.
తండ్రి వద్ద చదువుకుని రిఫ్రెష్ అవ్వడానికే ఇచ్చటకు వచ్చారు. అక్కడ అనేకమైన చిక్కు పనులు, కార్యవ్యవహారాలు చాలా ఉంటాయి. శాంతిగా వినను కూడా వినలేరు. సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎవ్వరూ చూడకుండా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత చింత ఉంటుంది! ఇక్కడ ఏ చింతా లేదు. హాస్టల్లో ఉన్నట్లే ఉంటారు. ఇక్కడ ఈశ్వరీయ పరివారముంది. శాంతిధామములో అందరూ సోదరులుంటారు. ఇక్కడ సోదరీ-సోదరులుంటారు ఎందుకంటే ఇక్కడ పాత్రను చేయాలంటే సోదర-సోదరీలు కావాలి. సత్యయుగములో కూడా మీరు పరస్పరములో సోదర-సోదరీలుగా ఉండేవారు. దానిని అద్వైత రాజధాని అని అంటారు. అక్కడ యుద్ధాలు, కొట్లాటలు ఏవీ ఉండవు. మేము 84 జన్మలు పూర్తిగా తీసుకున్నామని పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారి లెక్కాచారాన్ని కూడా తండ్రి తెలియచేశారు. మీరే శివుని అవ్యభిచారి భక్తిని చేయడం ప్రారంభిస్తారు, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. అదంతా భక్తిమార్గము. జ్ఞానమైతే ఒక్కటే ఉంటుంది. మనలను శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు. ఈ బ్రహ్మకు ఏమీ తెలిసేది కాదు. ఇతడిని సృష్టిలో అతిచివరి పుత్రుడని అంటారు. ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా(తాతలకు తాతగా) ఉండేవారో వారు ఈ సమయములో ఇలా అయ్యారు, తర్వాత మళ్లీ అధికారిగా అవుతారు, తతత్వమ్. మాలికులుగా ఒక్కరు మాత్రమే అవ్వరు కదా. మీరు కూడా పురుషార్థము చేస్తారు. ఇది అనంతమైన పాఠశాల. దీని శాఖలు లెక్కలేనన్ని అవుతాయి. వీధి - వీధిలో, ఇంటింటిలో ఈ శాఖ ఉంటుంది. మేము మా ఇంటిలో చిత్రాలనుంచాము, బంధు-మిత్రులు మొదలైనవారు వస్తే అర్థం చేయిస్తామని అంటారు. ఈ వృక్షానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు. వారి కళ్యాణము కొరకు మీరు సేవ చేస్తారు. చిత్రాల పై అర్థం చేయించడం సహజమవుతుంది. శాస్త్రాలైతే లెక్కలేనన్ని చదివారు. ఇప్పుడవన్నీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి. వారే సత్యమైన జ్ఞానమును వినిస్తారు. అచ్చా! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సంపూర్ణ నిశ్శబ్ధంతో డ్రిల్ చేసేందుకు ఇక్కడ ఈ కనులకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూడరాదు. దేహ సహితంగా బుద్ధి ద్వారా అన్నీ త్యాగము చేసి తమ ఇల్లు మరియు రాజ్యముల స్మృతిలో ఉండాలి.
2. తమ స్వభావ, నడవడికల(క్యారెక్టర్) రిజిష్టరును ఉంచాలి. చదువులో ఎలాంటి ఏమరుపాట్లు చేయరాదు. ఈ పురుషోత్తమ సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యి ఇతరులను తయారు చేయాలి.
వరదానము :-
'' తండ్రి ఆజ్ఞానుసారము బుద్ధిని ఖాళీగా ఉంచుకుని వ్యర్థము లేక వికారీ స్వప్నాల నుండి కూడా ముక్త్ భవ ''
నిదురించునప్పుడు మంచిని గానీ, చెడును గానీ అన్నీ తండ్రికి అప్పగించి బుద్ధిని ఖాళీ చేసుకోండి అని తండ్రి ఆజ్ఞాపించారు. అంతా తండ్రికి ఇచ్చేసి తండ్రి జతలో(ఒడిలో) నిదురపోండి, ఒంటరిగా కాదు. ఒంటరిగా నిదురించినా లేక వ్యర్థ విషయాలు వర్ణిస్తూ వర్ణిస్తూ నిదురిస్తే వ్యర్థము లేక వికారి స్వప్నాలు వస్తాయి. ఇది కూడా నిర్లక్ష్యమే. ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఆజ్ఞానుసారము నడిస్తే వ్యర్థము లేక వికారి స్వప్నాల నుండి ముక్తులవుతారు.
స్లోగన్ :-
''భాగ్యశాలీ ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారు ''