05-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ముళ్లను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రికి ముళ్ల పై కూడా ప్రేమ ఉంది, పుష్పాల పై కూడా ప్రేమ ఉంది. ముళ్ళనే పుష్పాలుగా తయారు చేసే శ్రమ చేస్తారు.''

ప్రశ్న :-

ఏ పిల్లలలో జ్ఞాన ధారణ జరుగుతుందో, వారి గుర్తులు వినిపించండి ?

జవాబు :-

జ్ఞాన ధారణ జరిగే పిల్లలు అద్భుతము చేసి చూపిస్తారు. వారు తమతో పాటు ఇతరుల కళ్యాణము చేయకుండా ఉండలేరు. బాణము తగిలినట్లైతే నిర్మోహులుగా అయ్యి ఆత్మిక సేవలో లగ్నమవుతారు. వారి అవస్థ ఏకరసంగా, నిశ్చలంగా మరియు స్థిరంగా(అచల్‌-అడోల్‌గా) ఉంటుంది. వారు ఎప్పుడూ తెలివి తక్కువ పని చేయరు. ఎవ్వరికీ దు:ఖమునివ్వరు. అవగుణాల రూపీ ముళ్ళను తొలిగించుకుంటూ ఉంటారు.

ఓంశాంతి.

తండ్రి అతిపెద్ద లివర్‌ గడియారమని పిల్లలకు తెలుసు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు పూర్తి ఖచ్ఛితమైన సమయములో వస్తారు. ఒక్క సెకండు కూడా తక్కువ - ఎక్కువగా ఉండదు. కొంచెం వ్యత్యాసము కూడా రాదు. ఈ సమయములో కలియుగ ముళ్ళ అడవి ఉందని అత్యంత మధురమైన పిల్లలకు తెలుసు. కనుక పుష్పాలుగా అయ్యేవారికి తాము పుష్పాలుగా తయారవుతున్నామని అనుభూతి కలగాలి. మొదట మనమందరము ముళ్ళుగా ఉండేవారము. అందులో కొందరు చిన్న ముళ్ళు, కొందరు పెద్ద ముళ్ళుగా ఉండేవారము. కొందరు చాలా దు:ఖమునిస్తే, కొందరు తక్కువ దు:ఖమునిస్తారు. ఇప్పుడు తండ్రికి అందరి పట్ల ప్రేమ ఉంది. ముళ్ళ పైనా ప్రేమ ఉంది, పుష్పాల పైనా ప్రేమ ఉంది........ అని మహిమ కూడా ఉంది. మొదట ఎవరి పై ప్రేమ ఉంది? తప్పకుండా ముళ్ళతోనే ప్రేమ ఉంటుంది. ఎంతటి ప్రేమ ఉందంటే శ్రమ చేసి వారిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు. వారు వచ్చేది ముళ్ళ ప్రపంచములోనే, ఇందులో సర్వవ్యాపి అను విషయమే ఉండదు. ఒక్కరిదే మహిమ జరుగుతుంది. ఆత్మకు మహిమ జరుగుతుంది. ఆత్మ శరీరమును ధారణ చేసినప్పుడే పాత్రనభినయిస్తుంది. శ్రేష్ఠాచారిగా, భ్రష్టాచారిగా ఆత్మయే అవుతుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఎలాంటి ఎలాంటి కర్మ చేస్తుందో, దాని అనుసారము కుకర్మీ (చెడు కర్మలు చేయు సంస్కారము గల ఆత్మ), సుకర్మీ (మంచి కర్మలు చేయు సంస్కారము గల ఆత్మ) అని పిలువబడ్తుంది. ఆత్మయే మంచి - చెడు కర్మలు చేస్తుంది. సత్యయుగ దైవీ పుష్పాలమా? లేక కలియుగ ఆసురీ ముళ్ళుగా ఉన్నామా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సత్యయుగమెక్కడ, కలియుగమెక్కడ! దైవత్వమెక్కడ, అసురత్వమెక్కడ! ఎంత వ్యత్యాసముంటుంది! ఎవరు ముళ్ళుగా ఉన్నారో వారు స్వయాన్ని పుష్పాలమని చెప్పుకోలేరు. పుష్పాలు సత్యయుగములో ఉంటాయే కాని కలియుగములో ఉండవు. ఇప్పుడిది సంగమ యుగము. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. టీచరు పాఠము(లెస్సన్‌) చెప్తారు. దానిని రిఫైన్‌ చేసి తెలపడం విద్యార్థుల పని. ''పుష్పాలుగా అవ్వాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి, పుష్పాలుగా తయారుచేసే పరమపిత పరమాత్మను స్మృతి చేసినట్లైతే మీ అవగుణాలు తొలగిపోతాయి, మీరు సతోప్రధానంగా అవుతారు'' అని కూడా వ్రాయండి. బాబా వ్యాసమును (నిబంధము) ఇస్తారు. దానిని సరిచేసి ముద్రించడం పిల్లల పని. అప్పుడు మనుష్యులందరూ ఆలోచనలో పడ్తారు. ఇది చదువు. బాబా మీకు బేహద్‌ హిస్టరీ-జాగ్రఫీని చదివిస్తారు. ఆ పాఠశాలల్లో అయితే పాత ప్రపంచ చరిత్ర-భూగోళ శాస్త్ర్రాలను చదివిస్తారు. నూతన ప్రపంచ చరిత్ర-భూగోళ శాస్త్రములైతే ఎవ్వరికీ తెలియనే తెలియదు. కనుక ఇది చదువు కూడా అయ్యింది, జ్ఞానము కూడా అయ్యింది. ఏదేని ఛీ-ఛీ(చెడు) పని చేయడం అవివేకము. అప్పుడు దు:ఖమునిచ్చే ఈ వికారీ పని చేయరాదని తెలియజేయబడ్తుంది. దు:ఖహర్త - సుఖకర్త అనేది తండ్రి మహిమ కదా. ఎవ్వరికీ దు:ఖమివ్వరాదని ఇక్కడ మీరు కూడా నేర్చుకుంటున్నారు. సదా సుఖమునిస్తూ ఉండమని తండ్రి శిక్షణనిస్తున్నారు. ఈ అవస్థ అంత త్వరగా తయారవ్వదు. ఒక్క క్షణములో తండ్రి నుండి వారసత్వమును తీసుకోగలరు. అయితే యోగ్యులుగా తయారవ్వడంలో సమయము పడ్తుంది. బేహద్‌ తండ్రి ఇచ్చే వారసత్వము స్వర్గ రాజ్య భాగ్యమని అర్థము చేసుకుంటారు. పారలౌకిక తండ్రి నుండి భారతదేశానికి విశ్వరాజ్య భాగ్యము లభించిందని మీరు ఇతరులకు అర్థము చేయిస్తారు. మీరందరూ విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇలా పిల్లలైన మీ లోపల ఖుషీ ఉండాలి. ఇది నిన్నటి మాటయే. అప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. లక్షల సంవత్సరాలని మనుష్యులంటారు. ఒక్కొక్క యుగము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పడం ఎక్కడ, కల్పమంతటి ఆయువు 5 వేల సంవత్సరాలని చెప్పడం ఎక్కడ? ఎంత వ్యత్యాసముంది!

జ్ఞానసాగరులు ఒక్క బేహద్‌ తండ్రియే. వారి నుండి దైవీ గుణాలు ధారణ చేయాలి. ఈ ప్రపంచములోని మనుష్యులు రోజురోజుకు తమోప్రధానంగా అవుతూ పోతారు. అవగుణాలను ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఇంతటి లంచగొండితనము, కల్తీ, భ్రష్టాచారము ఉండేది కాదు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మీరు తండ్రి స్మృతి బలముతో సతోప్రధానంగా అవుతూ ఉన్నారు. క్రిందికి ఎలా దిగుతారో, అలాగే తిరిగి వెళ్లాలి. మొదట తండ్రి లభించారనే సంతోషము ఉంటుంది, సంబంధము జోడించబడిన తర్వాతే స్మృతి యాత్ర జరుగుతుంది. ఎవరు భక్తి ఎక్కువగా చేశారో వారి స్మృతియాత్ర ఎక్కువగా ఉంటుంది. చాలామంది పిల్లలు - ''బాబా! స్మృతి నిలవడం లేదని అంటారు.'' భక్తిలో కూడా ఇలాగే జరుగుతుంది. కథ వినేందుకు కూర్చుంటారు కాని బుద్ధి ఇతర వైపులకు పరుగెడుతుంది. వినిపించేవారు గమనించి అకస్మాత్తుగా మేమేమి వినిపించామో చెప్పమని ప్రశ్నిస్తే, తికమకపడ్తారు. కొందరు వెంటనే చెప్పేస్తారు. అందరూ ఒకే విధంగా ఉండరు. భలే ఇక్కడ కూర్చున్నా, ధారణ ఏమీ లేదు. ఒకవేళ ధారణ ఉన్నట్లైతే అద్భుతము చేసి చూపిస్తారు. వారు స్వయానికి మరియు ఇతరులకు కళ్యాణము చేయకుండా ఉండలేరు. భలే ఎవరికైనా ఇంటిలో చాలా సుఖము ఉంది, గొప్ప భవనము, కార్లు........ మొదలైనవి ఉన్నా, ఒక్కసారి(జ్ఞాన) బాణము తగిలినట్లైతే ఇక వారు పతితో - ఇక మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నామని అంటారు. కాని మాయ చాలా బలశాలి. అలా చేయనివ్వదు. మోహముంటుంది కదా. ఇన్ని భవనాలు, ఇంతటి సుఖమును ఎలా వదలాలి? అరే! మొదట ఇంతమంది ఎవరైతే వచ్చారో వారు గొప్ప-గొప్ప లక్షాధికారుల, కోటీశ్వరుల ఇళ్ళకు చెందినవారు, అన్నింటినీ వదిలిపెట్టి వచ్చారు. వదిలే శక్తి లేదంటే అది అదృష్టము ఎంత ఉందో చూపిస్తుంది. రావణుని సంకెళ్లలో బంధించబడి ఉన్నారు. ఇవి బుద్ధికి సంబంధించిన బంధనాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - అరే! మీరు స్వర్గానికి యజమానులైన పూజ్యులుగా అవుతారు. మీకు 21 జన్మల వరకు ఏ రోగాలు రాకుండా, సదా ఆరోగ్యవంతులుగా ఉంటారని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. మీరు భలే పతి వద్దనే ఉండండి, కేవలం పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా చేస్తానని అనుమతిని పొందండి. తండ్రిని స్మృతి చేయడం మీ కర్తవ్యము, దీని ద్వారా అపార సుఖము లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇవి ఎంతగానో అర్థము చేసుకోవలసిన విషయాలు. శరీరము పైన ఏ విధమైన నమ్మకం లేదు. మొదట తండ్రివారిగా అవ్వండి. వారిలాంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు. తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత కావాలంటే అంత సతోప్రధానంగా అవ్వండి అని అంటారు. మీరు అపారమైన సుఖమును చూస్తారు. బాబా ఈ స్త్రీల ద్వారా స్వర్గ ద్వారాలను తెరిపిస్తారు. మాతల పైననే జ్ఞాన కలశాన్ని ఉంచడం జరుగుతుంది. బాబా మాతలనే నిమిత్తంగా చేశారు. సర్వస్వమూ మాతలైన మీరే సంభాళన చేయండి. ఇతడి ద్వారా కలశమును ఉంచారు కదా. అక్కడ వారు శాస్త్రాలలో సాగరమును చిలికినప్పుడు అమృత కలశము వెలువడినట్లు, దానిని లక్ష్మికి ఇచ్చినట్లు వ్రాశారు. బాబా మాతల ద్వారా స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మరి మనమెందుకు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోరాదు. విజయమాలలో కూర్చబడి మహావీరులుగా ఎందుకు అవ్వరాదు? బేహద్‌ తండ్రి పిల్లలను తన ఒడిలోకి ఎందుకు తీసుకున్నారు? స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు, ఒక్కసారిగా ముళ్ల వంటి వారికి కూర్చుని శిక్షణ ఇస్తారు. ముళ్ల పైన కూడా ప్రేమ ఉన్నట్లే కదా. అందుకే కదా వారిని పుష్పాలుగా తయారుచేస్తున్నారు. తండ్రిని పతిత ప్రపంచము మరియు పతిత శరీరములోకే పిలుస్తారు. నిర్వాణధామమును వదిలి ఇక్కడికి రమ్మంటారు. తండ్రి చెప్తున్నారు - డ్రామానుసారము నేను ముళ్ల ప్రపంచములోకే రావలసి ఉంటుంది. కనుక తప్పకుండా ప్రేమ ఉన్నట్లే కదా. ప్రేమ లేకపోతే పుష్పాలుగా ఎలా తయారుచేస్తారు? ఇప్పుడు మీరు కలియుగీ ముళ్ల నుండి సత్యయుగీ దైవీ సతోప్రధాన విశ్వాధికారులుగా అవ్వండి. ఎంతో ప్రేమతో అర్థం చేయించడం జరుగుతుంది. కుమారి పుష్పము వంటిది కనుకనే అందరూ వారి చరణాల పై పడ్తారు. ఆమె ఎప్పుడు ముల్లుగా(పతితముగా) అవుతుందో అప్పుడు అందరికీ తల వంచి నమస్కరించాల్సి వస్తుంది. కనుక ఏం చేయాలి? పుష్పము పుష్పముగానే ఉండాలనుకుంటే సదా పుష్పముగా అవుతుంది. జన్మ భలే వికారాల నుండి తీసుకున్నా, కుమారీ అయితే నిర్వికారిగా ఉంటుంది కదా. సన్యాసులు కూడా వికారాల నుండి జన్మ తీసుకుంటారు కదా. వివాహము చేసుకొని మళ్లీ ఇల్లూ-వ్యవహారాలను వదలి వెళ్లిపోతారు. అయినా వారిని మహాత్మ అని అంటారు. ఆ సత్యయుగ విశ్వానికి అధిపతులైన ఆ మహాత్మలెక్కడ(దేవతలు), ఈ కలియుగ మహాత్ములెక్కడ! అందుకే మీరు కలియుగ ముళ్లా లేక సత్యయుగ పుష్పాలా? భ్రష్టాచారులా లేక శ్రేష్ఠాచారులా? అనే ప్రశ్న వ్రాయమని బాబా చెప్పారు.

ఇది భ్రష్టాచారీ ప్రపంచము. ఇప్పుడిది రావణ రాజ్యము. ఇది ఆసురీ రాజ్యము, రాక్షస రాజ్యమని అంటారు. కాని స్వయాన్ని అలా ఎవ్వరూ భావించరు. పిల్లలైన మీరు యుక్తితో ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా తాము కామ, క్రోధము, లోభములు గలవారమని అర్థం చేసుకుంటారు. ప్రదర్శనిలో కూడా ఈ విధంగా వ్రాసినట్లైతే వారికి తాము కలియుగ ముళ్ళుగా ఉన్నామనే భావన కలుగుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. బాబా అయితే సదా పుష్పమే. శివబాబా ఎప్పుడూ ముల్లుగా అవ్వరు. మిగిలిన వారందరూ ముళ్లుగా అవుతారు. ఆ పుష్పము చెప్తున్నారు - మిమ్ములను కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తాను. మీరు నన్ను స్మృతి చేయండి. మాయ ఎంత ప్రబలమైనది! మరి మీరు మాయకు చెందినవారిగా అవుతారా? తండ్రి మిమ్ములను తనవైపు ఆకర్షిస్తారు, మాయ తనవైపు ఆకర్షిస్తుంది. ఇది పాత చెప్పు(శరీరము). ఆత్మకు మొదట నూతన చెప్పు(శరీరము) లభిస్తుంది. తర్వాత అది మళ్లీ పాతదౌతుంది. ఈ సమయములో అన్ని చెప్పులు(శరీరాలు) తమోప్రధానంగా ఉన్నాయి. నేను మిమ్ములను మఖ్‌మల్‌ చెప్పులుగా తయారుచేస్తాను. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉండే కారణంగా శరీరము కూడా మఖ్‌మల్‌దిగా ఉంటుంది. ఏ మాత్రము లోపము ఉండదు. ఇక్కడైతే చాలా లోపాలున్నాయి. అక్కడి రూపురేఖలు ఎంత సుందరమైనవిగా ఉన్నాయో చూడండి. ఆ రూపురేఖలతో కూడిన చిత్రమును ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. నేను మిమ్ములను ఎంత శ్రేష్ఠమైనవారిగా తయారు చేస్తానని తండ్రి కూడా ఇప్పుడు చెప్తున్నారు. గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ఇక జన్మ-జన్మాంతరాల నుండి ఆత్మకు పట్టిన త్రుప్పును తొలగించుకునేందుకు యోగాగ్ని అవసరము. ఇందులో పాపాలన్నీ భస్మమైపోతాయి. మీరు సత్యమైన బంగారంగా అవుతారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండని తుప్పును తొలగించుకునే మంచి యుక్తిని తెలియజేస్తారు. మామేకమ్‌ యాజ్‌ కరో(నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి). మీ బుద్ధిలో ఈ జ్ఞానముంది. ఆత్మ కూడా చాలా చిన్నది. ఒకవేళ పెద్దదైతే ఈ శరీరములో ప్రవేశించలేదు. ఎలా చేస్తుంది? ఆత్మను చూచేందుకు డాక్టర్లు చాలా తలలు బ్రద్ధలు కొట్టుకుంటారు(చాలా శోధిస్తారు), కాని కనిపించదు. సాక్షాత్కారమవుతుంది కాని సాక్షాత్కారము వల్ల ఏ విధమైన లాభము కలగదు. మీకు వైకుంఠము సాక్షాత్కారమయిందనుకోండి, దాని వల్ల లాభమేముంది? వైకుంఠవాసులుగా అయితే ఈ పురాతన ప్రపంచము సమాప్తమైనప్పుడే అవుతారు. దీని కొరకు మీరు యోగమును అభ్యాసము చేయండి.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మొదట ముళ్ల పైననే ప్రేమ ఉంటుంది. అందరికంటే ఎక్కువ ప్రేమ సాగరులు తండ్రి. పిల్లలైన మీరు కూడా మధురంగా అవుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మ అని భావించి భాయీ - భాయీ(సోదర) దృష్టితో చూసినట్లైతే వికారీ ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయి. సోదర-సోదరీ సంబంధముతో కూడా బుద్ధి చంచలమౌతుంది. అందువల్లనే భాయీ-భాయీగా చూడండి. అక్కడైతే శరీరమే లేదు. ఇక శారీరిక భావము వచ్చేందుకు లేక మోహము కలిగేందుకు అవకాశమే లేదు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. కనుక మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరము వినాశి, దీని పై మనస్సునేం పెట్టాలి? సత్యయుగములో శరీరము పై ప్రీతి ఉండదు. మోహము పై విజయము పొందిన రాజు కథను విన్నారు కదా! ఆత్మ ఒక శరీరాన్ని వదలి వెళ్ళి మరొక శరరమును తీసుకుంటుందని, పాత్ర లభించింది, ఇక మోహమును ఎందుకు ఉంచుకోవాలని చెప్పాడు. అందుకే తండ్రి కూడా చెప్తున్నారు - గమనముతో ఉండండి. తల్లి మరణించినా, భార్య మరణించినా హల్వా తినండి(సంతోషంగా ఉండండి). ఎవరు మరణించినా మేము ఏడ్వము అని ప్రతిజ్ఞ చేయండి. మీరు మీ తండ్రిని స్మృతి చెయ్యండి, సతోప్రధానంగా అవ్వండి. సతోప్రధానులుగా అయ్యేందుకు మరో మార్గము లేదు. పురుషార్థము ద్వారానేే విజయ మాలలోని మణులుగా అవుతారు. పురుషార్థము ద్వారా ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వగలరు. కల్పక్రితము ఎవరెంతగా పురుషార్థము చేశారో, వారు ఇప్పుడు కూడా అంతే చేస్తారని తండ్రి చెప్తున్నారు. తండ్రి పేదలపెన్నిధి. దానము కూడా పేదలకే ఇవ్వబడ్తుంది. నేను కూడా సాధారణ తనువులోకే వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. పేదవారు కాదు, షాహుకారు కాదు. పిల్లలైన మీరే తండ్రిని గురించి తెలుసుకున్నారు. మిగిలిన ప్రపంచమంతా తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి ఎటువంటి ధర్మమును స్థాపన చేస్తారంటే అక్కడ దు:ఖమనే పేరే ఉండదు.

భక్తిమార్గములో మనుష్యులు ఆశీర్వాదాలను వేడుకుంటారు. ఇక్కడైతే కృప చూపే మాటే లేదు. ఎవరికి తల వంచి నమస్కరిస్తారు? తండ్రి బిందువు కదా. పెద్ద వస్తువైతే నమస్కరించేందుకు వీలౌతుంది. చిన్నదైన వస్తువుకు తల వంచి నమస్కరించలేరు. చేతులు ఎవరికి జోడిస్తారు? ఈ భక్తిమార్గములోని గుర్తులన్నీ మాయమైపోతాయి. చేతులు జోడించడం భక్తి మార్గమైపోతుంది. సోదర - సోదరీలు ఇంట్లో ఏమైనా చేతులు జోడించి నమస్కరించుకుంటారా? వారసులుగా తయారు చేసుకునేందుకే కొడుకును కోరుకుంటారు. పిల్లలు అనగా యజమానులు కదా. అందువల్లనే తండ్రి పిల్లలకు నమస్కరిస్తారు. తండ్రి పిల్లలకు సేవకుడు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. వినాశీ శరీరము పై మీరు మనసును లగ్నము చేయరాదు. మోహజీతులుగా అవ్వాలి. ఎవరు శరీరాన్ని వదిలినా మేము ఎప్పుడూ ఏడ్వమని ప్రతిజ్ఞ చేయండి.

2. తండ్రి సమానంగా, మధురంగా అవ్వాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎవరికీ దు:ఖాన్ని ఇవ్వరాదు. ముళ్ళను పుష్పాలుగా చేసే సేవ చేయాలి. స్వ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి.

వరదానము :-

''దేహ భావము నుండి భిన్నంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనధారీ భవ ''

కమల ఆసనము బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలు ఈ దేహ భావము నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. వారిని శరీర భావము తన వైపు ఆకర్షించదు. ఎలాగైతే బ్రహ్మాబాబాకు నడుస్తూ, తిరుగుతూ ఉన్నా ఫరిస్తా రూపము లేక దేవతా రూపము సదా స్మృతిలో ఉండేదో, అలా న్యాచురల్‌ దేహి - అభిమాని స్థితి సదా ఉండాలి. దీనినే దేహ భావముతో అతీతము(భిన్నము) అని అంటారు. ఇటువంటి దేహ భావముతో భిన్నముగా ఉండువారే పరమాత్మ ప్రియంగా అవుతారు.

స్లోగన్‌ :-

''మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదము. వాటిని 'నావి' అని అనుకోవడమే దేహాభిమానము''