23-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతి ద్వారానే బ్యాటరీ చార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతోప్రధానంగా తయారవుతుంది, అందువలన స్మృతియాత్ర పై విశేష గమనముంచండి ''
ప్రశ్న :-
తండ్రి ఒక్కరి పైనే ప్రేమ కలిగిన పిల్లల చిహ్నాలు ఎలా ఉంటాయి ?
జవాబు :-
1. ఒకవేళ ఒక్క తండ్రి పైనే ప్రేమ ఉంటే తండ్రి దృష్టి వారిని పరివర్తన చేసేస్తుంది(తృప్తి పరుస్తుంది). 2. వారు పూర్తిగా నిర్మోహులుగా ఉంటారు. 3. ఎవరైతే అనంతమైన తండ్రి ప్రేమను ఇష్టపడ్తారో, వారు మరెవ్వరి ప్రేమలో చిక్కుకోరు. 4. అసత్య దేశములోని అసత్య మానవులతో వారి బుద్ధి తెగిపోతుంది. బాబా మీకు ఇప్పుడిచ్చే ప్రేమ అవినాశిగా అయిపోతుంది. సత్యయుగంలో కూడా మీరు పరస్పరము చాలా ప్రేమగా ఉంటారు.
ఓంశాంతి.
అనంతమైన తండ్రి ప్రేమ పిల్లలైన మీకు ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ ప్రేమను భక్తిలో కూడా చాలా గుర్తు చేసుకుంటారు. బాబా, మీ ఒక్కరి ప్రేమయే కావాలి. మీరే తల్లి, తండ్రి....... మీరే మా సర్వస్వము అని పాడ్తారు. ఒక్కరి ద్వారానే అర్ధకల్పము వరకు ప్రేమ లభిస్తుంది. మీరిచ్చే ఈ ఆత్మిక ప్రేమకు గల మహిమ అపారమైనది. పిల్లలైన మిమ్ములను తండ్రియే శాంతిధామానికి అధిపతులుగా చేస్తున్నారు. మీరిప్పుడు దు:ఖధామములో ఉన్నారు అశాంతి మరియు దు:ఖముతో అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎవ్వరికీి నాథులు లేరు. అందువలన భక్తిమార్గములో స్మృతి చేస్తారు కానీ నియమానుసారంగా భక్తి సమయం కూడా అర్ధకల్పము ఉంటుంది.
తండ్రి అంతర్యామి కాదు అని పిల్లలకు అర్థము చేయించబడింది. అందరి మనస్సులో ఏముందో తండ్రి తెలుసుకునే అవసరము లేదు. అక్కడ ఆలోచనలు చదివేవారు(థాట్ రీడర్లు) కొందరుంటారు. దానిని కూడా ఒక విద్యగా నేర్చుకుంటారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఇప్పుడు తండ్రి వస్తారు, తండ్రి మరియు పిల్లలే ఈ పాత్రనంతా అభినయిస్తారు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో అందులో పిల్లలు ఎలా పాత్ర చేస్తున్నారో తండ్రికి తెలుసు. అంతేగాని వారు ప్రతి ఒక్కరి మనస్సును తెలుసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరిలో వికారాలే ఉన్నాయని, మానవులు చాలా ఛీ-ఛీగా (అశుద్ధంగా) ఉన్నారని రాత్రి కూడా అర్థం చేయించారు. తండ్రి వచ్చి పుష్పాల సమానంగా చేస్తారు. ఈ తండ్రి ప్రేమ పిల్లలైన మీకు ఒక్కసారే లభిస్తుంది. అది మళ్లీ అవినాశిగా అయిపోతుంది. అక్కడ మీరు ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మీరిప్పుడు మోహజీతులుగా అవుతున్నారు. సత్యయుగ రాజ్యాన్ని యథా మోహజీత్ రాజా రాణి తథా ప్రజల రాజ్యమని అంటారు. అక్కడ ఎవ్వరూ, ఎప్పుడూ ఏడ్వరు. దు:ఖమను మాటే ఉండదు. ఒకప్పుడు భారతదేశములో ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు ఆనందము ఉండేవని మీకు తెలుసు. ఇప్పుడవి లేవు. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇందులో అందరు దు:ఖమును అనుభవిస్తున్నారు. తండ్రీ! మీరు వచ్చి సుఖము, శాంతిని ఇవ్వండి, దయ చూపండి అని తండ్రిని పిలుస్తారు. అనంతమైన తండ్రి దయాహృదయులు. రావణుడు నిర్దయుడు, దు:ఖమిచ్చు మార్గమును చూపించేవాడు. మానవులందరూ దు:ఖమార్గములో నడుస్తున్నారు. అన్నిటికంటే చాలా ఎక్కువగా దు:ఖమిచ్చేది కామ వికారము. అందువలన తండ్రి చెప్తున్నారు - ''మధురాతి మధురమైన పిల్లలారా, కామ వికారాన్ని జయిస్తే జగజ్జీత్లుగా అవుతారు.'' ఈ లక్ష్మీనారాయణులను జగత్జీతులని అంటారు. మీకెదురుగా లక్ష్యము నిల్చొని ఉంది. మందిరాలకు వెళ్తారు. కానీ వారి జీవిత చరిత్ర గురించి ఏమీ తెలియదు. బొమ్మలకు పూజ చేసినట్లు దేవతలకు పూజ చేస్తారు, తయారు చేసి బాగా అలంకరించి చేసి నైవేద్యము మొదలైనవి అర్పిస్తారు. కానీ ఆ విగ్రహాలైతే తినవు. బ్రాహ్మణులే తింటారు. విగ్రహాలను తయారు చేసి, పాలన చేసి వినాశనము చేస్తారు. దీనిని మూఢ నమ్మకము అని అంటారు. సత్యయుగములో ఇలాంటి విషయాలు ఉండవు. ఈ ఆచారాలు, పద్ధతులు కలియుగములో వెలువడ్తాయి. మీరు మొట్టమొదట శివబాబా ఒక్కరినే పూజిస్తారు. ఇది అవ్యభిచారి సత్యమైన పూజ. తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది. బాబా అని అనగానే పరివారపు సుగంధము అనుభవమవుతుంది. మీరు కూడా - మీరే తల్లి-తండ్రి,........ మీరు ఈ జ్ఞానమునిచ్చే కృప చూపించడం ద్వారా మాకు అపారమైన సుఖము లభిస్తుందని అంటారు కదా. మనము మొట్టమొదట మూలవతనములో ఉండేవారమని బుద్ధిలో గుర్తుంది. శరీరాన్ని ధరించి పాత్ర చేసేందుకు అక్కడి నుండి ఇక్కడికి వస్తాము. మొట్టమొదట మనము దైవీ శరీరాన్ని తీసుకుంటాము అనగా దేవతలని పిలువబడ్తాము. తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలోకి వస్తూ భిన్న - భిన్న పాత్రలను చేస్తాము. ఈ విషయాలు మీకు ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇచ్చారు. నేను ఈ శరీరములో ప్రవేశిస్తానని తండ్రికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా వారే ఇచ్చారు. ఇతనికి తన 84 జన్మల గురించి తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. శ్యామసుందరుని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. శ్రీ కృష్ణుడు క్రొత్త ప్రపంచపు మొదటి రాకుమారుడు, రాధ రెండవ నంబరులో ఉంది. ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాల తేడా ఉంటుంది. సృష్టి ఆదిలో వీరిని మొదటివారు అని అంటారు. అందువలన అందరూ కృష్ణుని ప్రేమిస్తారు. కృష్ణుని శ్యామసుందరుడు అని అంటారు. స్వర్గములో అయితే అందరూ సుందరంగానే ఉండేవారు. ఇప్పుడా స్వర్గము ఎక్కడుంది? చక్రము తిరుగుతూనే ఉంటుంది. అంతేకాని సముద్రములోకి వెళ్లదు. లంక, ద్వారక సముద్రము క్రిందికి వెళ్లిపోయాయని చెప్తారు. అలా జరగదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రమును తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి మహారాజ, మహారాణిగా విశ్వానికి అధిపతులుగా అవుతారు. ప్రజలు కూడా తమను తాము మాలికులని అనుకుంటారు. ఇది మా రాజ్యము అని అంటారు. భారతవాసులు కూడా ఇది మా రాజ్యమని అంటారు. భారతదేశము అను పేరు ఉంది(రైట్) హిందుస్థాన్ అను పేరు తప్పు. వాస్తవంగా అదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. కానీ ధర్మ భ్రష్టము, కర్మ భ్రష్టమైనందున స్వయాన్ని దేవతలు అని చెప్పుకోలేరు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. లేకపోతే తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మమును మళ్లీ ఎలా స్థాపన చేయగలరు? ఇంతకుముందు ఈ విషయాలన్నీ మీకు కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయించారు.
ఇలాంటి మధురమైన బాబాను కూడా మీరు మర్చిపోతారు! అందరికంటే బాబా మధురమైనవారు కదా. పోతే రావణ రాజ్యములో మీకు అందరూ దు:ఖమునే ఇస్తారు. అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. హే ప్రియతమా, ప్రేయసులైన మాతో వచ్చి ఎప్పుడు కలుసుకుంటారు అంటూ వారి స్మృతిలో ప్రేమతో కన్నీరు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే మీరందరూ భక్తులు. భక్తులకు భగవంతుడు పతి. భగవంతుడు వచ్చి భక్తికి ఫలితమును ఇస్తారు, దారి చూపిస్తారు. అంతేకాక ఇది 5 వేల సంవత్సరాల ఆట అని అర్థము చేయిస్తారు. రచయిత మరియు రచనల ఆది-మధ్యాంతాల గురించి మానవ మాత్రులెవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకు మాత్రమే తెలుసు. మానవులెవ్వరికీ తెలియదు. దేవతలకు కూడా తెలియదు. దీనిని గురించి ఆత్మిక తండ్రికి మాత్రమే తెలుసు. వారు కూర్చొని తమ పిల్లలకు అర్థం చేయిస్తారు. మరే దేహధారి వద్ద ఈ రచయిత, రచనల ఆదిమధ్యాంత జ్ఞానము లేదు. ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి వద్దే ఉంటుంది. వారినే జ్ఞాన - జ్ఞానేశ్వరుడు అని అంటారు. జ్ఞాన-జ్ఞానేశ్వరుడు మిమ్ములను రాజరాజేశ్వరులుగా చేసేందుకు జ్ఞానమునిస్తారు. అందువలన దీనిని రాజయోగమని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. హఠయోగుల చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. సన్యాసులు వచ్చినప్పుడు వారు హఠయోగమును నేర్పిస్తారు. వారి ధర్మము చాలా వృద్ధి జరిగిన తర్వాత హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను సంగమ యుగములోనే వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను, స్థాపన ఇక్కడే చేస్తారు. సత్యయుగములో చేయరు. సత్యయుగ ప్రారంభములో రాజ్యము ఉంటుంది కనుక అది తప్పకుండా సంగమ యుగములోనే స్థాపనవుతుంది. ఇక్కడ కలియుగములో అందరూ పూజారులుగా ఉన్నారు. సత్యయుగములో అందరూ పూజ్యులుగా ఉంటారు. కావున పూజ్యులుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. రావణుడు పూజారిగా చేస్తాడు. ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇది ఉన్నతాతి ఉన్నతమైన చదువు. ఈ టీచరు గురించి ఎవ్వరికీ తెలియదు. వారు పరమపిత పరమ శిక్షకులు, పరమ సద్గురువు కూడా. ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి తమ పూర్తి పరిచయమును ఇస్తారు. స్వయంగా వారే పిల్లలను చదివించి మళ్లీ తనతో పాటు తీసుకెళ్తారు. అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తే మరెవ్వరి ప్రేమను ఇష్టపడరు. ఈ సమయములో ఇదంతా అసత్య ఖండము, అసత్య మాయ, అసత్య శరీరము,....... భారతదేశమిప్పుడు అసత్య ఖండముగా ఉంది. సత్యయుగములో మళ్లీ సత్య ఖండముగా ఉంటుంది. భారతదేశము ఎప్పటికి వినాశనమవ్వదు. ఇది అన్నిటికంటే గొప్ప తీర్థ స్థానము. ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని సృష్టి ఆదిమధ్యాంతాలు అర్థం చేయిస్తున్నారు. అంతేకాక అందరికీ సద్గతినిస్తారు. ఇది చాలా గొప్ప తీర్థ స్థానము. భారతదేశ మహిమ అపారమైనది. భారతదేశము ప్రపంచములో అద్భుతమైనది(వండర్ ఆఫ్ ది వరల్డ్) అని కూడా మీరు అర్థము చేసుకుంటారు. అక్కడుండేవి మాయకు చెందిన 7 అద్భుతాలు. ఈశ్వరుని అద్భుతము ఒక్కటే. తండ్రి ఒక్కరే, వారు రచించిన అద్భుతమైన స్వర్గము కూడా ఒక్కటే. దానినే హెవెన్, ప్యారడైజ్(స్వర్గము) అని అంటారు. సత్యమైన పేరు ఒక్కటే. అది స్వర్గము, ఇది నరకము. బ్రాహ్మణులైన మీరే చక్రమంతా చుట్టి వస్తారు. మనమే బ్రాహ్మణులము, తర్వాత దేవతలము,......... ఎక్కేకళ, దిగేకళ. మీరు ఎక్కేకళలో ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. విశ్వములో శాంతి ఉండాలి, సుఖము కూడా ఉండాలని భారతీయులే కోరుకుంటారు. స్వర్గములో సుఖమే ఉంటుంది. దు:ఖమను పేరే ఉండదు. దానిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. సత్యయుగములో సూర్యవంశము, తర్వాత రెండవ గ్రేడులో చంద్రవంశము ఉంటుంది. మీరు ఆస్తికులు, వారు నాస్తికులు. మీరు(ధని) నాథునికి చెందినవారైన ధనవంతులు. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేస్తున్నారు. మాయతో గుప్తంగా మీకు యుద్ధము జరుగుతుంది. రాత్రివేళలో తండ్రి వస్తారు. శివరాత్రి ఉంది కదా. కాని శివుని రాత్రికి అర్థము కూడా తెలియదు. బ్రహ్మరాత్రి పూర్తి అవుతోంది. పగలు ప్రారంభమవుతుంది. వారు కృష్ణ భగవానువాచ అని అంటారు. ఇది శివ భగవానువాచ. ఇప్పుడు రైటు ఎవరు? కృష్ణుడు అయితే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. నేను సాధారణ వృద్ధ శరీరములో వస్తానని తండ్రి చెప్తారు. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు. చాలా జన్మల తర్వాత చివరిలో పతితమైనప్పుడు పతిత సృష్టి, పతిత రాజ్యములో నేను వస్తాను. పతిత ప్రపంచములో అనేక రాజ్యాలుంటాయి, పావన ప్రపంచములో ఒకే రాజ్యముంటుంది. లెక్క ఉంది కదా. భక్తి మార్గములో చాలా నౌధా(నవవిధ) భక్తి చేసినప్పుడు ఎప్పుడైతే శిరస్సు ఛేదించుకునేందుకు సిద్ధపడతారో, అప్పుడు వారు వస్తారు, వారి మనోకామనలు పూర్తి అవుతాయి. కానీ అందులో ఏమీ లేదు. దానిని నవ విధాల భక్తి అని అంటారు. రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి భక్తిలోని కర్మకాండకు సంబంధించిన విషయాలను మానవులు చదువుతూ చదువుతూ క్రిందికి వచ్చేస్తారు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారు చేశాడని అంటారు. కూర్చొని ఏమేమో వ్రాసేశారు. భక్తి, జ్ఞానాల రహస్యము పిల్లలైన మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. మెట్ల(సీఢీ) చిత్రము మరియు వృక్షము చిత్రములో వీటన్నిటి జ్ఞానముంది. అందులో 84 జన్మలను కూడా చూపించారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రారంభములో వచ్చినవారే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తున్న ఈ జ్ఞానము సంపాదనకు ఆధారమవుతుంది. 21 జన్మల వరకు ఏ వస్తువూ లోటుగా ఉండదు. అక్కడ ప్రాప్తి కొరకు పురుషార్థము చేయాల్సిన పని ఉండదు. అది తండ్రి రచించిన ఏకైక అద్భుతము. దానిని స్వర్గమని అంటారు. దాని పేరే ప్యారడైజ్(స్వర్గము). ఆ స్వర్గానికి అధికారులుగా తండ్రి తయారుచేస్తున్నారు. వారైతే కేవలం అద్భుతాలను చూపిస్తారు. కానీ మిమ్ములను దానికి అధికారులుగా తయారు చేస్తారు. అందువలన ఇప్పుడు నిరంతరము నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. స్మరిస్తూ స్మరిస్తూ సుఖమును పొందండి. తనువుకు సంబంధించిన కలహ క్లేశాలను తొలగించుకుని జీవన్ముక్తిని పొందండి. పవిత్రంగా అయ్యేందుకు స్మృతియాత్ర కూడా చాలా అవసరము. మన్మనాభవ, తద్వారా అంతమతి సో గతి అయిపోతుంది. శాంతిధామాన్ని గతి అని అంటారు. సద్గతి ఇక్కడే జరుగుతుంది. సద్గతికి వ్యతిరేకము దుర్గతి.
మీరిప్పుడు తండ్రిని మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు తండ్రి ప్రేమ లభిస్తుంది. తండ్రి దృష్టి ద్వారా తృప్తి పరుస్తారు. వారు సన్ముఖములో వచ్చి జ్ఞానము వినిపిస్తారు కదా. ఇందులో ప్రేరణ మాటే లేదు. స్మృతి చేస్తే శక్తి ఎలా లభిస్తుందో, తండ్రి సూచనలను ఇస్తారు. బ్యాటరీ చార్ట్ అవుతుంది కదా. ఇది(ఆత్మ) మోటరు. దీని బ్యాటరీ చార్జి తగ్గిపోయింది. ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి ద్వారా యోగము చేస్తే మళ్లీ మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు. మీ బ్యాటరీ చార్జ్ అయిపోతుంది. తండ్రే వచ్చి అందరి బ్యాటరీని చార్జ్ చేస్తారు. తండ్రి ఒక్కరే సర్వశక్తివంతులు. ఈ మధురాతి మధురమైన విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. భక్తిలోని శాస్త్రాలను జన్మ-జన్మల నుండి చదువుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని ధర్మాల వారికి ఒకే విషయమును చెప్తున్నారు - ''స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమౌతాయి.'' ఇప్పుడు స్మృతి చేయడం పిల్లలైన మీ పని. ఇందులో భ్రమపడే విషయమేదీ లేదు. పతితపావనుడు తండ్రి ఒక్కరే. మళ్లీ పావనమై అందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఈ జ్ఞానము అందరి కొరకు, ఇది సహజ రాజయోగము, సహజ జ్ఞానము. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగమును జోడించి వారి ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. స్మృతియాత్రలో ఎప్పుడూ తికమక పడరాదు.
2. చదువును బాగా చదువుకుని మీ పై మీరే దయ చూపుకోవాలి. తండ్రి సమానము ప్రేమసాగరులుగా అవ్వాలి. తండ్రి ప్రేమ ఎలాగైతే అవినాశిగా ఉంటుందో, అలాగే అందరితో అవినాశి సత్యమైన ప్రేమను ఉంచుకోవాలి, మోహజీతులుగా అవ్వాలి.
వరదానము :-
'' దృఢతా శక్తి ద్వారా మనసు - బుద్ధిని, సీటు పై సెట్ చేసే సహజయోగీ భవ ''
పిల్లలకు తండ్రి పై ప్రేమ ఉంది. అందువలన స్మృతిలో శక్తిశాలిగా అయ్యి కూర్చోవడం, నడవడం, సేవ చేయడం పై చాలా గమనమిస్తారు. కానీ ఒకవేళ మనసు పై పూర్తిగా కంట్రోల్ లేకుంటే, మనసు ఆర్డర్లో లేకుంటే కొంత సేపు బాగా కూర్చుంటారు, తర్వాత కదలడం ప్రారంభిస్తారు. ఒక్కోసారి సెట్ అవుతారు, ఒక్కోసారి అప్సెట్ అవుతారు. కానీ ఏకాగ్రతా శక్తి లేక దృఢతా శక్తి ద్వారా మనసు - బుద్ధిని ఏకరస స్థితి అనే సీటు పై సెట్ చేస్తే సహజయోగులుగా అవుతారు.
స్లోగన్ :-
'' ఏవైతే శక్తులున్నాయో వాటిని సమయం వచ్చినపుడు ఉపయోగిస్తే చాలా మంచి మంచి అనుభవాలు అవుతాయి. ''