24-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీ జీవితము దేవతల జీవితము కంటే శ్రేష్ఠమైనది, ఎందుకనగా మీరు ఇప్పుడు రచయిత, రచనలను యదార్థంగా తెలుసుకొని ఆస్తికులుగా అయ్యారు ''
ప్రశ్న :-
పూర్తి కల్పములోనే లేని సంగమయుగీ ఈశ్వరీయ పరివారపు విశేషత ఏది ?
జవాబు :-
ఈ సమయములో ఈశ్వరుడే స్వయంగా తండ్రి అయ్యి పిల్లలైన మిమ్ములను సంభాళన చేస్తారు. టీచరై విద్య నేర్పిస్తారు, సద్గురువై మిమ్ములను పుష్పాలుగా తయారు చేసి జతలో తీసుకెళ్తారు. సత్యయుగములో దైవీ పరివారముంటుంది కానీ ఇలాంటి ఈశ్వరీయ పరివారము ఉండదు. పిల్లలైన మీరిప్పుడు అనంతమైన సన్యాసులు, రాజయోగులు కూడా అయ్యారు. రాజ్యము కొరకు చదువుకుంటున్నారు.
ఓంశాంతి.
ఇది స్కూలు లేక పాఠశాల. ఎవరి పాఠశాల? ఆత్మల పాఠశాల. ఆత్మ శరీరము లేకుండా ఏమీ వినలేదనేది వాస్తవము. ఆత్మల పాఠశాల అని అన్నప్పుడు - ఆత్మ శరీరము లేకుండా ఏమీ అర్థము చేసుకోలేదని తెలుసుకోవాలి. కనుక జీవాత్మ అని చెప్పబడ్తుంది. ఇప్పుడున్నవన్నీ జీవాత్మల పాఠశాలలే అందుకే దీనిని ఆత్మల పాఠశాల అని అంటారు. పరమపిత పరమాత్మ వచ్చి చదువు నేర్పిస్తారు. అది శారీరిక చదువు, ఇది ఆత్మిక చదువు. దీనిని అనంతమైన తండ్రి చదివిస్తారు. కనుక ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవానువాచ కదా. ఇది భక్తి మార్గము కాదు. ఇది ఒక చదువు. స్కూలులో చదివిస్తారు. భక్తి, మందిరాలు మొదలైన స్థానాలలో జరుగుతుంది. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? - భగవానువాచ. వేరే ఏ పాఠశాలలోనూ భగవానువాచ ఉండనే ఉండదు. కేవలం ఈ ఒక్క స్థానములోనే భగవానువాచ ఉంటుంది. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన భగవంతుడినే జ్ఞానసాగరులని అంటారు. వారే జ్ఞానాన్నివ్వగలరు. మిగిలినదంతా భక్తి. దాని ద్వారా ఎలాంటి సద్గతి లభించదని తండ్రి భక్తి గురించి చెప్పారు. సర్వుల సద్గతిదాత ఒక్క పరమాత్మయే. వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. మిగిలిన ఏ జ్ఞానము మొదలైనవాటిలో భగవానువాచ ఉండనే ఉండదు. భారతదేశములోనే శివజయంతిని కూడా ఆచరిస్తారు. భగవంతుడు నిరాకారి కదా మరి శివజయంతిని ఎలా ఆచరిస్తారు? ఎప్పుడు శరీరములో ప్రవేశిస్తారో అప్పుడే జయంతిని ఆచరిస్తారు. తండ్రి చెప్తున్నారు - నేనైతే ఎప్పుడూ గర్భములో ప్రవేశించను, మీరంతా గర్భములో ప్రవేశిస్తారు, 84 జన్మలు తీసుకుంటారు. అందరికంటే ఎక్కువ జన్మలు ఈ లక్ష్మీనారాయణులే తీసుకుంటారు. 84 జన్మలు తీసుకొని తర్వాత నల్లగా, పల్లె పిల్లలుగా అవుతారు. లక్ష్మీనారాయణులని అనండి లేక రాధా-కృష్ణులని అనండి. రాధా-కృష్ణులు బాల్యంలోనివారు. వారు స్వర్గములో జన్మ తీసుకుంటారు. దానిని వైకుంఠము అని కూడా అంటారు. మొట్టమొదటి నెంబరు జన్మ ఇతనిదే. కనుక 84 జన్మలు కూడా ఇతడే తీసుకుంటాడు. శ్యామము మరియు సుందరము, సుందరము నుండి మరలా శ్యామము. కృష్ణుడు అందరికీ ప్రియమనిపిస్తాడు. కృష్ణుని జన్మ కొత్త ప్రపంచములో జరుగుతుంది. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాత ప్రపంచములోకి వచ్చి చేరుకుంటాడు. అప్పుడు శ్యామంగా అవుతాడు. ఈ ఆటనే అలా ఉంది. భారతదేశము మొదట సతోప్రధానంగా, సుందరంగా ఉండేది. ఇప్పుడు నల్లగా(అపవిత్రంగా) అయిపోయింది. ఈ ఆత్మలన్నీ నా సంతానమేనని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడందరూ కామచితి పై కూర్చుని కాలి నల్లగా అయిపోయారు. నేను(శివబాబా) వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తాను. ఈ సృష్టిచక్రమే అలా ఉంది. ఆ పుష్పాల తోట మళ్లీ ముళ్ల అడవిగా అవుతుంది. పిల్లలైన మీరు ఎంత సుందరంగా, విశ్వాధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అలా అవుతున్నారని తండ్రి చెప్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు. 84 జన్మలు అనుభవించి మళ్లీ విశ్వాధికారులుగా అవుతున్నారు అనగా వీరి ఆత్మ ఇప్పుడు చదువుకుంటూ ఉంది.
సత్యయుగములో అపారమైన సుఖముంటుంది కనుక ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదని మీకు తెలుసు. దు:ఖములో అందరూ స్మృతి చేస్తారని గాయనముంది. ఎవరిని స్మరిస్తారు? తండ్రిని. ఇంతమందిని స్మరణ చేయరాదు. భక్తిలో ఎంతగా స్మరణ చేస్తారు! కానీ వారికి ఏమీ తెలియదు. కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో, అతడు ఎవరో ఏమీ తెలియదు. కృష్ణుడు, నారాయణులకు గల భేదము కూడా తెలియదు. శివబాబా సర్వ శ్రేష్ఠమైనవారు, తర్వాత వారి క్రింద బ్రహ్మ-విష్ణు-శంకరులు,........ వారిని దేవతలని అంటారు. మనుష్యులైతే అందరినీ భగవంతుడని అంటూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. ప్రతి ఒక్కరిలో మాయావీ పంచ వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయని తండ్రి చెప్తారు. సత్యయుగములో ఏ వికారమూ ఉండదు. ముక్తిధామములో కూడా ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. అపవిత్రత అను మాటే ఉండదు. రచయిత అయిన తండ్రియే వచ్చి తమ పరిచయమును ఇస్తారు. ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియచేస్తారు. దీని ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. మీరు ఒక్కసారి మాత్రమే ఆస్తికులుగా అవుతారు. మీ ఈ జీవితము దేవతల కంటే ఉత్తమమైనది. మానవ జన్మ దుర్లభమని గాయనము కూడా ఉంది. ఎప్పుడు పురుషోత్తమ సంగమ యుగము వస్తుందో అప్పుడు జీవితము వజ్ర సమానంగా అవుతుంది. లక్ష్మీనారాయణుల జీవితాన్ని వజ్ర సమానమని అనరు. మీది వజ్ర సమానమైన జన్మ. మీరు ఈశ్వరీయ సంతానము, వీరు (లక్ష్మినారాయణులు) దైవీ సంతానము. ఇప్పుడు మీరు - మేము ఈశ్వరీయ సంతానము, ఈశ్వరుడు మా తండ్రి, వారు మమ్ములను చదివిస్తున్నారు, ఎందుకంటే వారు జ్ఞానసాగరులు కదా, మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని అంటారు. ఈ జ్ఞానము ఒకేసారి పురుషోత్తమ సంగమ యుగములో లభిస్తుంది. ఇది సర్వోన్నతమైన పురుషులుగా తయారయ్యే యుగము. దీనిని గురించి ప్రపంచానికి తెలియదు. అందరూ కుంభకర్ణుని అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు. అందరి వినాశనము సమీపములోనే ఉంది. కనుక ఇప్పుడు పిల్లలు ఎవరితోనూ సంబంధాన్ని ఉంచుకోరాదు. అంతిమ సమయములో ఎవరు స్త్రీని స్మృతి చేస్తారో........... అని అంటారు. అంతిమ సమయములో శివబాబాను స్మరించినట్లైతే నారాయణుని వంశములో వస్తారు. ఈ సీఢీ (మెట్ల చిత్రము) చాలా బాగుంది, మనమే దేవతలు, మళ్లీ క్షత్రియులు,............. మొదలైనవారిగా అవుతామని వ్రాయబడింది. ఈ సమయములో ఇది రావణ రాజ్యము. ఇప్పుడు తమ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని మరచి ఇతర ధర్మాలలో చిక్కుకొని ఉన్నారు. ఈ ప్రపంచమంతా లంకయే. అంతేకాని స్వర్ణిమ లంక అంటూ ఏదీ లేదు. మీరు మీ కంటే ఎక్కువగా నన్ను గ్లాని చేశారు. మీ కొరకు 84 లక్షల యోనులలో జన్మిస్తారని, నేను కణ-కణములో ఉంటానని అన్నారు. అలాంటి అపకారులకు కూడా నేను ఉపకారము చేస్తాను. మీ దోషమేమీ లేదు. ఇది డ్రామా ఆట అని తండ్రి చెప్తున్నారు. సత్యయుగము ఆది నుండి కలియుగ అంతము వరకు ఇది ఒక ఆట. ఇది మళ్లీ తిరగాల్సిందే. దీనిని గురించి తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. మీరంతా బ్రహ్మకుమార-కుమారీలు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మీరు ఈశ్వరీయ పరివారములో కూర్చుని ఉన్నారు. సత్యయుగములో దైవీ పరివారముంటుంది. ఈ ఈశ్వరీయ పరివారములో తండ్రి మిమ్ములను సంభాళన చేస్తారు, చదివిస్తారు అంతేకాక పుష్పాలుగా చేసి జతలో కూడా తీసుకెళ్తారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. సిక్కుల గ్రంథములో కూడా మనుష్యులను దేవతలుగా చేశారు......... అని ఉంది. అందుకే పరమాత్మను 'ఇంద్రజాలికుడు' అని అంటారు. నరకమును స్వర్గముగా చేయడము ఇంద్రజాలమే కదా. స్వర్గము నుండి నరకంగా అయ్యేందుకు 84 జన్మలు మళ్లీ నరకము నుండి స్వర్గంగా అయ్యేందుకు ఒక్క సెకండులో అవుతుంది. క్షణములో జీవన్ముక్తి. 'నేను ఆత్మను' అని ఆత్మను తెలుసుకున్నారు, తండ్రిని కూడా తెలుసుకున్నారు. వేరే ఏ మనుష్యులకు ఆత్మ అంటే ఏమిటో తెలియదు. గురువులు అనేకమంది ఉన్నారు, సద్గురువు ఒక్కరే. సద్గురువు అకాల్ అని అంటారు. పరమపిత పరమాత్మ ఒక్కరే సద్గురువు. కానీ గురువులైతే అనేకమంది ఉన్నారు. నిర్వికారులుగా ఎవ్వరూ లేరు, అందరూ వికారాలతోనే జన్మిస్తారు.
ఇప్పుడు రాజధాని స్థాపనవుతూ ఉంది. మీరంతా ఇక్కడ రాజ్యము కొరకే చదువుకుంటున్నారు. మీరు రాజయోగులు, అనంతమైన సన్యాసులు. ఆ హఠయోగులు, హద్దులోని సన్యాసులు. తండ్రి వచ్చి అందరికీ సద్గతినిచ్చి సుఖీలుగా చేస్తారు. సద్గురువు అకాలమూర్త్ అని నన్ను ఒక్కరినే అంటారు. అక్కడ మనము క్షణ-క్షణము శరీరాన్ని వదులుతూ తీసుకుంటూ ఉండము. మృత్యువు కబళించదు. మీ ఆత్మ కూడా అవినాశి కానీ పతితంగా మరియు పావనంగా అవుతుంది. నిర్లేపి కాదు. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయిస్తారు. రచయితయే రచన యొక్క ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థము చేయించగలరు కదా. జ్ఞానసాగరులు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. వారే మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా, డబల్ కిరీటధారులుగా చేస్తారు. మీ జన్మ గవ్వ సమానంగా ఉండేది, ఇప్పుడు మీరు వజ్ర సమానంగా అవుతున్నారు. తండ్రి హమ్ సో, సో హమ్ మంత్రమును గురించి కూడా అర్థం చేయించారు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ(హం సో, సో హమ్) అని వారు అంటారు. ఆత్మనే పరమాత్మగా ఎలా అవ్వగలదు? అని తండ్రి అంటారు. ఆత్మలైన మనము ఈ సమయములో బ్రాహ్మణులుగా ఉన్నాము. మరలా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము, మళ్లీ మనమే క్షత్రియులుగా, శూద్రులుగా మరియు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము అని తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మీది అందరికంటే శ్రేష్ఠమైన జన్మ. ఇది ఈశ్వరీయ పరివారము. మీరు ఎవరి వద్ద కూర్చుని ఉన్నారు? మాతా-పితల వద్ద. అందరూ సోదరీ-సోదరులే. తండ్రి ఆత్మలకు శిక్షణనిస్తారు. మీరంతా నా పిల్లలు, ఆస్తికి హక్కుదారులు. కనుక పరమాత్మ తండ్రి నుండి ప్రతి ఒక్కరు వారసత్వాన్ని తీసుకోగలరు. వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయని పిల్లలకు కూడా అర్థం చేయించండి. భక్తిమార్గములోని వారు ఈ మాటలను ఏ మాత్రము అర్థము చేసుకోలేరు. మంచిది.
రాత్రి క్లాసు :-
పిల్లలు తండ్రిని గుర్తించారు, తండ్రి చదివిస్తున్నారు, వారి నుండి బేహద్ వారసత్వము లభిస్తుందని కూడా అర్థము చేసుకున్నారు. కానీ కష్టమేమంటే మాయ మరిపింపజేస్తుంది. ఏదో ఒక విఘ్నము కలుగజేస్తుంది. ఇందువలన పిల్లలు భయపడ్తారు. అందులో కూడా మొదటి నంబరు వికారములో పడిపోతారు. కన్నులు మోసము చేస్తాయి. కళ్ళు తీసేసే మాటైతే లేదు. తండ్రి జ్ఞాన నేతమును ఇస్తారు. జ్ఞాన-అజ్ఞానాల యుద్ధము నడుస్తుంది. జ్ఞానమంటే తండ్రి, అజ్ఞానమంటే మాయ. వీరి యుద్ధము చాలా తీవ్రమైనది. పడిపోయినట్లైతే అర్థము కాదు. తర్వాత నేను పడిపోయాను, నేను స్వయానికి చాలా అకళ్యాణము చేసుకున్నానని అర్థం చేసుకుంటారు. మాయ ఒక్కసారి ఓడించింది అంటే మళ్లీ ఉన్నతి అవ్వడం కష్టమౌతుంది. మేము ధ్యానములో వెళ్తామని చాలామంది పిల్లలు చెప్తారు, కానీ అందులో కూడా మాయ ప్రవేశము జరుగుతుంది. తెలియను కూడా తెలియదు. మాయ దొంగతనము చేయిస్తుంది, అసత్యము చెప్పిస్తుంది. మాయ ఏమి చేయించదు! చెప్పనలవి కాదు. మురికిగా తయారు చేస్తుంది. పుష్పాలుగా అవుతూ అవుతూ మళ్లీ ఛీ-ఛీ(అసహ్యము)గా అవుతారు. మాయ ఎంత శక్తిశాలి అంటే క్షణ-క్షణము క్రింద పడేస్తుంది.
బాబా, మేము క్షణ-క్షణము మర్చిపోతామని పిల్లలు అంటారు. పురుషార్థము చేయించేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. కానీ భాగ్యములో లేకుంటే వారు పురుషార్థము కూడా చేయలేరు. ఇందులో ఎవరి గురించి కూడా బాబా ప్రత్యేక శ్రద్ధ తీసుకోరు. ఎవరిని కూడా అదనంగా చదివించరు. ఆ చదువులో అయితే అదనంగా చదువుకునేందుకు టీచరును పిలుస్తారు. ఇక్కడ భాగ్యమును తయారుచేసేందుకు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఒక్కొక్కరిని వేరు వేరుగా ఎంతవరకు చదివించగలరు? ఎంతమంది పిల్లలున్నారు! ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలుంటే అధిక ఖర్చు చేయగలరు కనుక వారిని అదనంగా చదివిస్తారు(చదువు చెప్తారు). వీరు మంద బుద్ధి గలవారని టీచరుకు తెలుస్తుంది. కనుక చదివించి వారిని స్కాలర్షిప్కు యోగ్యులుగా చేస్తారు. ఈ తండ్రి అలా చేయరు. వీరు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. అక్కడ టీచరు అదనపు పురుషార్థం చేయిస్తారు. అనగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ ఇక్కడ వీరు అదనపు పురుషార్థము ఎవ్వరికీ వేరుగా చేయించరు. అదనపు పురుషార్థము అనగా టీచరు కొంత కృప చూపిస్తారు. డబ్బు తీసుకుంటారు, ప్రత్యేకంగా సమయాన్నిచ్చి చదివిస్తారు. దాని ద్వారా వారు ఎక్కువగా చదివి తెలివైనవారుగా అవుతారు. ఇక్కడ ఎక్కువగా చదివే విషయమేదీ లేదు. వీరి మాట ఒక్కటే. ''మన్మనాభవ'' అనే మహామంత్రమును ఇస్తారు. స్మృతి ద్వారా ఏమి జరుగుతుందో పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రియే పతితపావనులు. వారిని స్మృతి చేయడము ద్వారానే మనము పావనంగా అవుతామని మీకు తెలుసు. మంచిది. శుభరాత్రి. గుడ్నైట్.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము -
1. పూర్తి ప్రపంచమంతా ఇప్పుడు శ్మశానంగా అవ్వనున్నది. వినాశనము సమీపములో ఉంది కనుక ఎవ్వరితోనూ సంబంధము ఉంచుకోరాదు. అంతిమ సమయములో ఒక్క తండ్రి మాత్రమే గుర్తుండాలి.
2. ఇది శ్యామము నుండి సుందరంగా, పతితము నుండి పావనంగా అయ్యే పురుషోత్తమ సంగమ యుగము. ఉత్తమ పురుషులుగా అయ్యే సమయము ఇదే. సదా ఈ స్మృతిలో ఉంటూ స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసుకోవాలి.
వరదా నము :-
'' ఇతరుల వ్యర్థ సమాచారాన్ని వినేందుకు ఇష్టాన్ని పెంచుకునేందుకు బదులు ఫుల్స్టాప్ ఉంచే పరమతం నుండి ముక్త్ భవ ''
చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ శ్రీమతముతో ఆత్మల పరమతాన్ని కలిపేస్తారు. ఎవరైనా బ్రాహ్మణ ప్రపంచ సమాచారాన్ని వినిపిస్తే చాలా ఇష్టంగా వింటారు. ఏమీ చేయలేరు కానీ విన్న సమాచారము బుద్ధిలోకి వెళ్తుంది. దాని వల్ల సమయం వృథా అవుతుంది. అందువలన వింటున్నా వినకండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వినిపించినా మీరు దానికి ఫుల్స్టాప్ పెట్టేయండి. ఎవరిని గురించి విన్నారో వారి పట్ల దృష్టి లేక సంకల్పములో కూడా ఘృణా భావము ఉండరాదు. అప్పుడు పరమతము నుండి ముక్తులని అంటారు.
స్లోగన్ :-
'' ఎవరి హృదయము విశాలంగా ఉంటుందో, వారి స్వప్నములో కూడా హద్దు సంస్కారాలు ఉత్పన్నమవ్వజాలవు. ''