16-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - స్వయాన్ని ఆత్మ భాయీ-భాయీ( సోదర ఆత్మ)గా భావించి పరస్పరము ఆత్మిక ప్రేమ కలిగి ఉండండి. సతోప్రధానంగా అవ్వాలంటే ఎవ్వరి లోపాలూ (బలహీనతలు) చూడకండి.''

ప్రశ్న :-

ఏ ఆధారముతో తండ్రి నుండి పదమాల వారసత్వము తీసుకోగలరు ?

జవాబు :-

తండ్రి నుండి పదమాల వారసత్వము తీసుకునేందుకు స్మృతియాత్రలో ఉండండి. ఒక్క తండ్రి తప్ప ఇతర విషయాలన్నీ మర్చిపోతూ ఉండండి. ఫలానావారు ఇలా చేస్తారు, వారు ఇటువంటివారు...... మొదలైన విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. గమ్యము చాలా గొప్పది. అందువలన సదా సతోప్రధానంగా అవ్వాలనే లక్ష్యముంచుకోండి. తండ్రి ప్రేమలో హత్తుకొని ఉండండి, స్వయాన్ని సూక్ష్మంగా చెక్‌ చేసుకుంటూ ఉండండి. అప్పుడు వారసత్వమును పూర్తిగా తీసుకోగలరు.

ఓంశాంతి.

అనంతమైన తండ్రి మళ్లీ సతోప్రధానంగా తయారు చేస్తున్నారని ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీకు తెలుసు. అందుకు ముఖ్యమైన యుక్తి - స్వయాన్ని ఆత్మ అని, అందరూ నా సోదర ఆత్మలని భావించండి. మీకు పరస్పరములో చాలా ఆత్మిక ప్రేమ ఉండాలని ముఖ్య శిక్షణనిస్తున్నారు. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. మూలవతనములో ప్రేమ అనే మాట ఉండదు. కనుక అనంతమైన తండ్రి వచ్చి శిక్షణనిస్తున్నారు - ఈ రోజు, రేపు అంటూ సమయము గడచిపోతూ ఉంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడచిపోతున్నాయి. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా ఉండేవారని తండ్రి తెలిపించారు. అలా మిమ్ములను ఎవరు తయారుచేశారు? మీరు క్రిందికి ఎలా దిగజారారో కూడా తండ్రి తెలిపించారు. పై నుండి క్రిందకు దిగుతూ దిగుతూ సమయం గడచిపోతూ ఉంది. ఆ రోజులు పోయాయి, మాసాలూ పోయాయి, సంవత్సరాలూ పోయాయి. సమయమూ పోయింది. మొట్టమొదట మనము సతోప్రధానంగా ఉండేవారమని మీకు తెలుసు. పరస్పరములో మనకు చాలా ప్రేమ ఉండేది. సోదరులైన మీకు పరస్పరములో చాలా ప్రేమ ఉండాలని, సోదరులైన మీ అందరికీ తండ్రి శిక్షణనిచ్చారు. నేను మీ తండ్రిని, నేను మిమ్ములను చాలా ప్రేమతో సంభాళిస్తాను. మిమ్ములను తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తాను. సతోప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యము - ఉద్ధేశ్యము. మనము ఎంతెంత సతోప్రధానంగా అవుతూ ఉంటామో అంత సంతోషంగా కూడా ఉంటాము. మనము సతోప్రధానంగా ఉండేవారము. మనమంతా సోదరులము, పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారము. దేవతలమైన మనము పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారమని తండ్రి ద్వారా మనకు తెలిసింది. ఈ దేవతలకు, స్వర్గానికి చాలా మహిమ ఉంది. మీరు కూడా స్వర్గములో నివసించేవారు. తర్వాత రోజులు గడుస్తూ గడుస్తూ క్రిందికి వచ్చేశారు. ఒకటవ తేది నుండి ఈనాటి వరకు 5 వేల సంవత్సరాలు అయ్యేందుకు ఇక కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. ప్రారంభము నుండి మీరు పాత్రనెలా చేస్తూ వచ్చారో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు దేహాభిమానములో ఉన్నందున పరస్పరము ఆ ప్రేమ లేదు. పరస్పరము ఒకరి లోపాలు ఒకరు వెతుకుతూ ఉంటారు. ఫలానావారు ఇలా ఉన్నారు..... అని అంటూ ఉంటారు. దేహీ-అభిమానులుగా ఉన్నప్పుడు ఎవరి దోషాలూ చూచేవారు కాదు. పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అదే స్థితిని ధారణ చెయ్యాలి. ఇక్కడ పరస్పరము ఏ దృష్టితో చూస్తారంటే కొట్లాడుకుంటూ - జగడాలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడిది ఎలా సమాప్తమవ్వాలి? పిల్లలూ, మీరే సతోప్రధాన పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారని కూడా తండ్రి అర్థము చేయిస్తున్నారు. తర్వాత మెల్ల-మెల్లగా క్రిందికి దిగజారుతూ తమోప్రధానంగా అయ్యారు. మీరు ఎంత మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ ఇంత మధురంగా అవ్వండి. మీరు సుఖదాయులుగా ఉండేవారు, ఇప్పుడు దు:ఖదాయులుగా అయ్యారు. రావణ రాజ్యములో ఒకరికొకరు దు:ఖమిచ్చేందుకు కామ ఖడ్గమును ఉపయోగించసాగారు. సతోప్రధానంగా ఉన్నప్పుడు కామ ఖడ్గమును ఉపయోగించేవారు కాదు. ఈ 5 వికారాలు మీకు పెద్ద శత్రువులు. ఇది వికారీ ప్రపంచము. రామరాజ్యమని దేనినంటారో, రావణ రాజ్యమని దేనినంటారో కూడా మీకు తెలుసు. రోజులు గడుస్తూ గడుస్తూ సత్యయుగము, త్రేతా, ద్వాపర యుగాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు కలియుగము కూడా పూర్తి కానున్నది. మీరే సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మిక సంతోషము అదృశ్యమైపోయింది. మీ ఆయువు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను వచ్చాను. మిమ్ములను తప్పకుండా సతోప్రధానంగా చేస్తాను. పతితపావనా రమ్మని మీరే నన్ను పిలిచారు. 5 వేల సంవత్సరాల తర్వాత సంగమ యుగము వచ్చినప్పుడు నేను వస్తానని తండ్రి అర్థము చేయించారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీలోని లోపాలు తొలగిపోతూ ఉంటాయి. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీలో ఎలాంటి దోషాలూ లేవు. మీరు దేవీ దేవతలని పిలిపించుకునేవారు. ఇప్పుడు ఆ లోపాలు ఎలా తొలగిపోతాయి? ఆత్మకే అశాంతి కలుగుతుంది. మేము అశాంతిగా ఎందుకయ్యాము అని స్వయాన్ని చెక్‌ చేసుకోండి. మనము భాయీ-భాయీగా ఉన్నప్పుడు మనకు చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే తండ్రి వచ్చారు. స్వయాన్ని ఆత్మలుగా, భాయీ-భాయీగా(సోదర ఆత్మలుగా) భావించమని చెప్తున్నారు. పరస్పరము ప్రేమగా ఉండండి. దేహాభిమానములోకి వచ్చినందున పరస్పరము లోపాలు వెతుకుతూ ఉన్నారు. ఉన్నతపదవి పొందేందుకు పురుషార్థము చెయ్యమని తండ్రి చెప్తున్నారు. మనలను సంపన్నంగా చేసే వారసత్వమును మనకు తండ్రి ఇచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చారు. కనుక మనము వారి మతముననుసరించి మళ్లీ పూర్తి వారసత్వమునెందుకు తీసుకోరాదు? మనమే దేవతలుగా ఉండి మళ్లీ 84 జన్మలు తీసుకున్నాము.

మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఎంత స్థిరంగా ఉండేవారు! ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండేవి కావు. ఎవ్వరినీ నిందించేవారు కాదు. ఇప్పుడింకా ఏవో కొన్ని లోపాలున్నాయి. వాటన్నిటిని తొలగించి వేయాలి. మనమంతా సోదరులమే. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇప్పుడు సతోప్రధానంగా ఎలా అవ్వాలనే చింత మీకుంది. ఫలానావారు ఇలా ఉన్నారు, ఇతనిలా చేశారు...... ఇలాంటి విషయాలన్నీ మర్చిపోవాలి. ఇవన్నీ వదిలేసి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యండి. దేహాభిమానములోకి వచ్చినందునే అవగుణాలను చూస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చెయ్యండి. ఆత్మ, ఆత్మను(భాయీ-భాయీ) చూస్తూ ఉంటే గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా చేసేందుకు ప్రయత్నించండి. ఎవరు ఎలాంటి ఉల్టా-సుల్టా(తప్పుడు) మాటలు మాట్లాడినా, ఏమి చేసినా లెక్క చేయకండి. తమోగుణిగా, రజోప్రధానంగా ఉన్నందున వారి నడవడిక అలాగే ఉంటుందని భావించండి. అందరికంటే గుణవంతులు తండ్రియే. కనుక తండ్రి నుండే గుణాలు గ్రహించండి. ఇతర విషయాలన్నీ వదిలేయండి. అవగుణాలు వదిలేయండి, గుణాలను ధారణ చెయ్యండి. తండ్రి ఎంతో గుణవంతులుగా చేస్తారు. పిల్లలైన మీరు కూడా గుణవంతులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. తండ్రి సుఖమునిచ్చేవారు. మనము కూడా సుఖదాయులుగా అవ్వాలి. మనము సతోప్రధానంగా అవ్వాలని చింత ఉండాలి. ఏ ఇతర మాటలు వినకండి. ఎవ్వరినీ నిందించకండి. అందరిలోనూ ఏదో ఒక లోపము ఉంటుంది. ఆ లోపమును వారు అర్థము చేసుకోలేరు. కానీ వీరిలో ఈ లోపముందని ఇతరులకు అర్థమవుతుంది. స్వయాన్ని చాలా మంచివారమని భావిస్తారు. కానీ ఎక్కడో ఒక చోట తప్పు మాటలు వెలువడుతూ ఉంటాయి. సతోప్రధాన స్థితిలో ఇటువంటి మాటలు ఉండవు. ఇక్కడ లోపాలున్నాయి. కానీ తెలుసుకోనందున మాకంతా తెలుసునని(మియామిట్టూనని) భావిస్తారు. అన్నీ తెలిసిన వాడను నేనొక్కరినే అని తండి చెప్తున్నారు. మీ అందరినీ మధురంగా చేసేందుకు వచ్చాను. అవగుణాలు మొదలైనవన్నీ వదిలేయండి. నేను మధురాతి మధురమైన తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తున్నాము అని మీ నాడిని కూడా చూసుకోండి. నేను ఎంత అర్థము చేసుకున్నాను, ఇతరులకు ఎంత అర్థము చేయిస్తున్నాను అని చెక్‌ చేసుకోండి. దేహాభిమానములోకి వచ్చినందున ఎలాంటి లాభము లేదు. ముఖ్యంగా ఈ ప్రపంచము తమోప్రధానంగా ఉందని అర్థము చేయించాలి. సతోప్రధానంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యముండేది. ఇప్పుడు ఆ దేవతలు 84 జన్మలు భోగించి తమోప్రధానమైపోయారు. భారతవాసులే పూర్తి తమోప్రధానమైపోయారు, మళ్లీ వారే సతోప్రధానంగా కూడా అవుతారు. ఇతరులెవ్వరినీ సతోప్రధానమని అనలేరు. సత్యయుగములో ఏ ధర్మమూ ఉండదు. మీరు అనేకసార్లు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వండి. శ్రీమతముననుసరించి నన్ను స్మృతి చేయండి. ఇదే చింత ఉండాలి. తల పై చాలా పాప భారముంది, తండ్రి ఇప్పుడు మేల్కొలిపారు. దేవతల ముందుకెళ్లి ''మేము వికారులము'' అని అంటారు. ఎందుకంటే దేవతలలో పవిత్రతా శక్తి(ఆకర్షణ) ఉంది. అందువలన వారి ముందుకెళ్లి వికారులమని చెప్తారు, ఇంటికి వెళ్తూనే మర్చిపోతారు. దేవతల ముందుకెళ్లినప్పుడు స్వయం పై ఘృణ(అసహ్యము) కలుగుతుంది. ఇంటికెళ్తే ఎలాంటి ఘృణ ఉండదు. దేవతలను ఇలా చేసిందెవరు? అని కూడా ఆలోచించరు. దేవతలుగా అవ్వాలంటే ఈ చదువును తప్పకుండా చదవండి. శ్రీమతమును అనుసరించాల్సి వస్తుంది. మొట్టమొదట సతోప్రధానంగా అవ్వాలి. అందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. వ్యర్థ పనులు చేయకండి అని తండ్రి చెప్తున్నారు. మేము ఇలా తయారవ్వాలనే చింత ఉంచుకోండి. మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారిగా ఉండేవారు, అయితే తర్వాత ఏం జరిగింది, ఎక్కడికెళ్లారు! వీరి 84 జన్మల కథే వ్రాయబడింది. ఇప్పుడు మనమలా తయారవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. భాయీ-భాయీ(సోదరులము) అని భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రినైన నన్ను నింద-స్తుతి చేస్తూ వచ్చామని బుద్ధిలోకి రావాలి. వాస్తవానికి నన్ను స్తుతి చెయ్యలేదు, నిందిస్తూ వచ్చారు. ఒకవైపు ఎవరిని స్తుతి చేశారో, వారినే మరోవైపు నింద కూడా చేశారు. ఎందుకంటే వారిని గురించి తెలియనే తెలియదు. ఒకవైపు తండ్రిని మహిమ చేస్తారు, మరోవైపు సర్వవ్యాపి అని అనేస్తారు. రాయి-రప్పలలో పరమాత్మ ఉన్నారని అన్నందున వారి నుండి విముఖులైపోయారు. వినాశ కాలములో విపరీత, విముఖ బుద్ధి గలవారు నశిస్తారు. వినాశ కాలములో ప్రీతి, సన్ముఖ బుద్ధి గలవారు విజయులవుతారు.

సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నించాలి. ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు, అయితే అది వ్యభిచారి స్మృతి. అనగా చాలామందిని స్మృతి చేసేవారు. ఇప్పుడు అవ్యభిచారి స్మృతిలో ఉండండి తండ్రి చెప్తున్నారు - కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. భక్తిమార్గములో అనేక చిత్రాలున్నాయి. మీరు ఆ చిత్రాలను కూడా స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. అక్కడ స్మృతి చేసేందుకు భక్తిమార్గము లేనే లేదు. ఇప్పుడు సతోప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఉంచుకోండి. ఈ సృష్టి చక్రమెలా తిరుగుతూ ఉందో ఆ జ్ఞానమిప్పుడు మీకు లభించింది. అదేమో చాలా సులభము. నోటి ద్వారా తెలుపకపోయినా మనమిప్పుడు సతోప్రధానము నుండి తమోప్రధానంగా ఎలా అయ్యామో బుద్ధి ద్వారా అర్థము చేసుకోగలరు. ఇప్పుడు మళ్లీ తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఎవరైనా మాట్లాడలేకుంటే వారి భాగ్యము అంతే అని అంటారు. దానిని భావి(విధి) అని కూడా అంటారు. బ్యాడ్జి ద్వారా అర్థము చేయించే సులభమైన ఉపాయమును తండ్రి తెలిపించారు. వీరు అనంతమైన తండ్రి అని, వీరి ద్వారానే ఈ వారసత్వము లభిస్తుందని బ్యాడ్జి చూపించి చెప్పండి. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. అది ఇక్కడే చేస్తారు. శివజయంతి అనగా స్వర్గ జయంతి. స్వర్గములో దేవీ దేవతలుంటారు. అయితే వారెలా తయారవుతారు? ఈ పురుషోత్తమ సంగమ యుగములో చదువు ద్వారా తయారవుతారు. పిల్లలైన మీకు కూడా జ్ఞానము లభించింది, మీరు ఇతరులకు కూడా ఈ జ్ఞానమునివ్వాలి. మీది సహజ జ్ఞానము, సహజ యోగము, సహజ వారసత్వము. అయితే ఇక్కడ చాలా తక్కువ వారసత్వమును తీసుకునేవారు కూడా ఉన్నారు, పదమాల(అనంతమైన) వారసత్వమును తీసుకునేవారు కూడా ఉన్నారు. ఇదంతా చదువు పై, స్మృతి యాత్ర పై ఆధారపడి ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ మర్చిపోండి. ఫలానావారిలా..... ఇందులో సమయము వృథా చేయకండి. గమ్యము చాలా శ్రేష్ఠమైనది, గొప్పది. సతోప్రధానమవ్వడంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది, చదువులో కలిగించదు. మాలో ఎంత ప్రేమ ఉంది అని స్వయాన్ని చూసుకోండి. తండ్రిని హత్తుకొని ఉండునంత ప్రేమ ఉండాలి. నేర్పించేవారు తండ్రి. ఈ బ్రహ్మ ఆత్మ నేర్పించదు, ఇతని ఆత్మ కూడా నేర్చుకుంటూ ఉంది. బాబా, మీరు మమ్ములనెంత వివేకవంతులుగా చేస్తున్నారు! మీరు అత్యంత ఉన్నతులు, మానవ సృష్టిలో మీరు మమ్ములనెంత ఉన్నతంగా చేస్తారు! ఈ విధంగా లోలోపల తండ్రి మహిమ చెయ్యండి. బాబా మీరెంత అద్భుతము చేస్తున్నారు! '' పిల్లలూ, మీరు మళ్లీ మీ రాజ్యమును తీసుకోండి, నన్నొక్కరినే స్మృతి చేయండి, సంతోషంగా ఉండండి'' అని తండ్రి చెప్తున్నారు. '' మేము బాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సంతోషము వంటి బలమైన ఆహారము(ఖురాక్‌) ఏదీ లేదని అంటారు. '' కనుక తండ్రితో మిలనము చేసేందుకు కూడా పిల్లలకు సంతోషముండాలి. కానీ పిల్లలలో అంత ఖుషీ ఉండడము లేదు. లేకుంటే చాలా చాలా సంతోషముండాలని వివేకము చెప్తుంది. ఈ చదువు ద్వారా మేము రాజులుగా అయ్యేవారము, మేము అనంతమైన తండ్రి పిల్లలము, సుప్రీమ్‌ తండ్రి మమ్ములను చదివిస్తున్నారు అని లోలోపల మననము చేయాలి. బాబా ఎంత దయాహృదయులు! వారు కూర్చొని పిల్లలైన మీకు కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఇతరులెవ్వరి బుద్ధిలో లేని కొత్త కొత్త విషయాలున్నాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఆత్మాభిమాని స్థితిని ధారణ చేసి సుఖదాయులుగా అవ్వాలి. ఎవ్వరిలోనూ లోపాలను వెతకరాదు. పరస్పరము చాలా చాలా ప్రేమతో ఉండాలి, అభిప్రాయ బేధములుండరాదు.

2. ఇతర విషయాలన్నీ వదిలి ఒక్క తండ్రి నుండి మాత్రమే గుణాలను గ్రహించాలి. సతోప్రధానంగా అవ్వాలన్న చింత ఉండాలి. ఎవ్వరి విషయాలు వినరాదు, ఎవ్వరినీ నిందించరాదు. అంతా నాకే తెలుసునని అనుకోరాదు(మియామిట్టూగా అవ్వరాదు).

వరదానము :-

''లైటు ఆధారముతో జ్ఞాన-యోగాల శక్తులను ప్రయోగించే ప్రయోగశాలీ ఆత్మా భవ!''

ఎలాగైతే ప్రకృతి యొక్క లైటు సైన్సులో అనేక ప్రయోగాలను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తుందో, అలా మీరు అవినాశి పరమాత్మ లైటు, ఆత్మిక లైటు, వీటితో పాటు ప్రాక్టికల్‌ స్థితి యొక్క లైటు ద్వారా జ్ఞాన-యోగాల శక్తులను ప్రయోగించండి. స్మృతి మరియు స్వరూపమనే డబల్‌లైట్‌ ఉంటే ప్రయోగములో సఫలత చాలా సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు స్వయం పట్ల ప్రయోగములో లగ్నమౌతారో అప్పుడు ప్రయోగశాలీ ఆత్మల శక్తిశాలి సంఘటన తయారవుతుంది.

స్లోగన్‌ :-

''విఘ్నాల అంశ, వంశాన్ని సమాప్తం చేయువారే విఘ్నవినాశకులు.''