15-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - స్మృతిలో ఉండి భోజనము తయారుచేస్తే తినేవారి హృదయము శుద్ధమైపోతుంది. బ్రాహ్మణులైన మీ భోజనము చాలా శుద్ధంగా ఉండాలి. ''

ప్రశ్న :-

సత్యయుగములో మృత్యువు ఎప్పుడూ మీ గడప వద్దకు రాదు, ఎందుకు?

జవాబు :-

ఎందుకంటే సంగమ యుగములో పిల్లలైన మీరు తండ్రి ద్వారా జీవించి ఉండే మరణించడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరైతే జీవించి ఉండే మరణిస్తారో, వారి గడప వద్దకు ఎప్పుడూ కాలుడు (యముడు) రాలేడు. మరణించడం నేర్చుకునేందుకు మీరు ఇచ్చటకు వచ్చారు. సత్యయుగాన్ని అమరలోకమని అంటారు. అక్కడ మృత్యువు ఎవ్వరినీ కబళించదు. రావణరాజ్యము మృత్యులోకము. అందుకే ఇక్కడ అందరూ అకాలమృత్యువు పాలౌతూ ఉంటారు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శిని చూచి వస్తే బుద్ధిలో అరతా గుర్తుండాలి. మనము ఎలాంటి శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్లీ దేవతలుగా, సూర్య వంశీయులు, చంద్ర వంశీయులుగా అవుతామని బుద్ధిలో ఉండాలి. సత్యయుగము, కలియుగముల మధ్యలో ఇప్పుడిది సంగమ యుగము. అందువలన సంగమయుగపు నమూనా(మాడల్‌) మధ్యలో 15-20 మంది శ్వేత వస్త్రాలు ధరించిన వారిని తపస్సులో కూర్చోబెట్టాలి. ఎలాగైతే సూర్యవంశీయులను చూపిస్తారో, అలా చంద్రవంశీయులను కూడా చూపించాల్సి ఉంటుంది. నమూనా ఎలా చూపించాలంటే దానిని చూచినవారు ఈ సంగమ యుగములో తపస్సు చేసినవారే అలా అవుతారని అర్థము చేసుకోవాలి. యజ్ఞ ప్రారంభములో మీరు తపస్సు చేసే సాధారణ చిత్రాలు, భవిష్యత్తులో రాజ్యపదవి పొందుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈ నమూనాను కూడా తయారు చేయాలి. అప్పుడు వీరే వారవుతారని మీరు అర్థము చేయించవచ్చు. చాలా ఖచ్ఛితంగా చూపించాలి. బ్రహ్మకుమార-కుమారీలైన మనము రాజయోగము నేర్చుకొని ఇలా అవుతాము. అందువలన సంగమయుగము కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు చూచి వస్తే రోజంతా ఆ జ్ఞానము బుద్ధిలో నిల్చిపోవాలి. అప్పుడే జ్ఞానసాగరుని పిల్లలైన మీరు మాస్టర్‌ జ్ఞానసాగరులని పిలువబడ్తారు. జ్ఞానమే బుద్ధిలో లేకుంటే మాస్టర్‌ జ్ఞానసాగరులని అనరు. రోజంతా బుద్ధి ఇందులోనే తగుల్కొని ఉండాలి. అప్పుడు బంధనాలు కూడా తెగిపోతాయి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము తర్వాత దేవతలుగా అవుతాము. మంచిరీతిగా పురుషార్థము చేయకుంటే క్షత్రియ కులములోకి వెళ్తారు. వైకుంఠాన్ని కనీసము చూడను కూడా చూడలేరు. ముఖ్యమైనది వైకుంఠమే కదా. ప్రపంచములోని అద్భుతము(వండర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌) అని సత్యయుగమునే అంటారు. దాని కొరకే పురుషార్థము చేయాలి. మీ రెండు చిత్రాలూ ఉండాలి. ఒకటేమో రంగు బట్టలు, నగలు మొదలైనవాటితో అలంకరింపబడి ఉండాలి. రెండవది తపస్సు చేసే చిత్రము. అప్పుడు వారికి, వీరే సూక్ష్మవతనములో కూర్చుని ఉన్నారని అర్థమవుతుంది. డ్రస్సు అయితే మార్పు చేసుకోవచ్చు. కానీ రూపురేఖలు మార్చుకోలేము. అదేమో అపవిత్ర ప్రవృత్తి మార్గము. ఇది పవిత్ర ప్రవృత్తి మార్గము. దీని ద్వారా ఇది స్థాపన చేస్తున్నారని అర్థమౌతుంది. వీరే మళ్లీ ఆ విధంగా అవుతారు. శ్రమ చేసినవారే పొందుతారు. బ్రాహ్మణులుగా అయ్యే వారైతే చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. రోజురోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. మొత్తం సృష్టి చక్రమంతా ఎలా తిరుగుతూ ఉందో బుద్ధిలో ఉంది. మనము ఇప్పుడు తపస్సు చేస్తున్నాము. తర్వాత మళ్లీ ఇలా తయారవుతామని కూడా మీకు తెలుసు. దీనినే స్వదర్శన చక్రధారులై కూర్చోవడం అని అంటారు. ఎందుకంటే బుద్ధిలో జ్ఞానమంతా నిండి ఉంది. మనము ఎలా ఉండేవారమో, ఇప్పుడు మళ్లీ ఎలా తయారవుతామో మీ బుద్ధిలో ఉంది. విద్యార్థులు టీచరును తప్పకుండా స్మృతి చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతియాత్ర ద్వారానే పాపాలు నశిస్తాయి. ఆత్మ పవిత్రంగా అవుతే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్లీ దేవతలుగా అవుతారు. దీని నమూనా(మాడల్‌) ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిది ఎందుకంటే సంగమ యుగములో పురుషోత్తములుగా తయారయ్యే బ్రాహ్మణులు అని వ్రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మిమ్ములను తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. పై భాగములో శివబాబా చిత్రము కూడా ఉంది. మిమ్ములను చదివించేది వారే. మీరు ఇలా తయారౌతారు. ఈ బ్రహ్మ కూడా మీతో పాటు ఉన్నారు. అతడు కూడా శ్వేత వస్త్ర్రాలు ధరించిన విద్యార్థియే. మానవులు రామరాజ్యమును కూడా ఒప్పుకోరు. రాజూ రాముడే, ప్రజలూ రాములే....... అని గాయనము కూడా ఉంది. సత్యయుగములో ధర్మరాజ్యము ఉండనే ఉంది. పోతే త్రేతా యుగములో క్షత్రియులను గ్లాని చేశారు. సూర్యవంశీయులను గ్లాని చేయలేదు. కావున ఇది కూడా వ్రాయవలసి వస్తుంది. రాజూ రాముడే, ప్రజలూ రాములే......... ఇది ధర్మము వలన కలిగే ఉపకారము. త్రేతా కూడా సెమీ స్వర్గము ఎందుకంటే 14 కళలు ఉంటాయి కదా. అక్కడ ఇటువంటి గ్లాని చేసే విషయాలు ఉండవు. మనము ఎలా తయారౌతున్నామో వారికి స్పష్టంగా తెలపండి. మేమే మా కొరకు స్వరాజ్య స్థాపన చేస్తున్నాము. విశ్వములో అందరూ కోరుకునే శాంతిపూర్వకమైన ఒకే స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని వారికి తెలపాలి.

ప్రదర్శినీలు మొదలైనవి చూచినప్పుడు బాబాకు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు ఇంటికి పోతూనే ఇవన్నీ మర్చిపోతారు. కానీ ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తుండాలి. ప్రదర్శిని నుండి వెలుపలికి వస్తూనే సమాప్తమైపోవడం కాదు. పురుషార్థము చేసే మంచి మంచి పిల్లల బుద్ధిలో ఇవి మెదులుతూ ఉండాలి. బాబాకు ఎల్లప్పుడూ మెదులుతూ ఉంటుంది కదా. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటే బాబా స్మృతి కూడా ఉంటుంది. ఉన్నతి చెందుతూ ఉంటారు. ఒకవేళ సతోప్రధానంగా అవ్వకుంటే మళ్లీ సత్యయుగములోకి వెళ్లరు. అందువలన స్మృతియాత్రలో స్వయాన్ని పక్కాగా ఉంచుకోవాలి. మీరు రాజయోగులు. మీకందరికీ చాలా పెద్ద-పెద్ద జడలున్నాయి. గొప్పతనమంతా మాతలదే. మీకున్న జడలు స్వాభావికమైనవి. రాజయోగులు, యోగినీలను సత్యమైన తపస్వీ రూపములో చూపిస్తారు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. తండ్రి చెప్తున్నారు - సర్వ దేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. మిగిలిన దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. వారు మిమ్ములను చాలా ధనవంతులుగా చేస్తారు. జీవించి ఉండే మరణించండి. తండ్రి వచ్చి జీవించి ఉండే మరణించడం నేర్పిస్తారు. ''నేను కాలులకు కాలుడను'' అని తండ్రి చెప్తున్నారు. మీ గడప దగ్గరకు కాలుడే రాకుండా ఇప్పుడు మీకు మరణించడం నేర్పిస్తాను. అచ్చట రావణ రాజ్యమే ఉండదు. సత్యయుగములో మృత్యువు ఎప్పుడూ కబళించదు. దానిని అమరపురమని అంటారు. బాబా మిమ్ములను అమరపురికి అధికారులుగా తయారు చేస్తారు. ఇది మృత్యు లోకము. అది అమర పురము. ఇది రాజయోగము. ప్రాచీన భారత రాజయోగము మళ్లీ నేర్పించబడ్తుంది అని మీరు వ్రాయండి. ప్రదర్శినీ మొదలైనవి చూచినప్పుడు మనుష్యులు ఖచ్ఛితంగా అర్థము చేసుకునేందుకు ఇంకా ఏమి చేయాలో, ఏమి వ్రాయాలో ఆలోచించాలి. ప్రాక్టికల్‌గా చాలా బాగా అర్థం చేయించాలి. యథా రాజా - రాణి తథా ప్రజ అన్నది ఇందులో రానే వస్తుంది. తండ్రి ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దీనికే ఎక్కువ ప్రాముఖ్యము ఇవ్వాలి. విశ్వములో పవిత్రత, సుఖము, శాంతి ఎలా స్థాపనవుతూ ఉందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. మీరు మీ కొరకే చేస్తున్నారు. ఎంత శ్రమ చేస్తారో అంత గొప్ప పదవి లభిస్తుంది. అది కూడా నంబరువారుగా లభిస్తుంది. నంబరువారుగా ఎలా అవుతారో కూడా చూపించండి. ప్రజలను కూడా చూపించండి. అందులో షావుకారు ప్రజలు, రెండవ గ్రేడు ప్రజలు, మూడవ గ్రేడు ప్రజలను కూడా చూపించండి. ఈ విధంగా చాలా బాగా అర్థము చేసుకునే విధంగా ఖచ్ఛితంగా తయారు చేయండి. కష్టపడవలసి ఉంటుంది. చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ జ్ఞానము మీ కొరకే ఉంది. మీరు ప్రదర్శినిలో ఎలా అర్థం చేయించాలంటే తద్వారా మేము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అప్పుడే మనము ఈ విధంగా అవ్వగలము అని మనుష్యులు అర్థము చేసుకోగలగాలి. లేకుంటే మళ్లీ భక్తిమార్గములోకి వచ్చేస్తారు.

మీరు మహారథి పిల్లలు కనుక మీ బుద్ధి బాగా పని చేస్తుంది. పురుషులు కూడా చాలా మంచి మంచివారున్నారు. నంబరువన్‌ జగదీష్‌. ఇతడు మ్యాగజైన్లు తయారు చేస్తాడు. బృజమోహన్‌కు కూడా వ్రాయడంలో మంచి ఆసక్తి ఉంది. మూడవవారు కూడా ఎవరైనా వెలువడవచ్చు. రోజులు గడుచు కొలది ప్రతి విషయాన్ని మీరు స్పష్టం చేస్తూ ఉంటారు. తండ్రి జ్ఞానసాగరులు. ఆ పరమాత్మలో జ్ఞానమంతా నిండి ఉంది. తండ్రి వద్ద ఉన్న సరుకంతా(జ్ఞానమంతా) డ్రామానుసారము లభిస్తూ ఉంటుంది. ఇది పిల్లల బుద్ధిలో నడుస్తూ ఉండాలి. భలే పని పాటలు చేసుకుంటున్నా, మీ చేతులతో భోజనము తయారు చేస్తున్నా బుద్ధి శివబాబా వద్ద ఉండాలి. బ్రహ్మాభోజనము కూడా పవిత్రంగా ఉండాలి. బ్రహ్మాభోజనము, బ్రాహ్మణుల భోజనము. బ్రాహ్మణులు ఎంత యోగములో ఉండి భోజనము తయారుచేస్తారో అంతగా ఆ భోజనములోకి శక్తి వస్తుంది. దేవతలు కూడా బ్రహ్మాభోజనాన్ని చాలా మహిమ చేస్తారని దాని ద్వారా హృదయము శుద్ధమౌతుందని గాయనముంది. దాని ద్వారా హృదయము శుద్ధమౌతుంది. అందువలన బ్రాహ్మణులు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఆ విధంగా లేరు. ఇప్పుడలా తయారౌతే మీ సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అయితే డ్రామానుసారము చాలా నెమ్మదిగా వృద్ధి పొందవలసి ఉంది. మేము బాబా స్మృతిలో ఉండి భోజనము తయారు చేస్తాము అనే బ్రాహ్మణులు కూడా వెలువడ్తారు. బాబా ఛాలెంజ్‌ చేస్తారు కదా. యోగములో ఉంటూ భోజనము తయారుచేయు బ్రాహ్మణులుగా ఉండాలి. భోజనము పవిత్రంగా ఉండాలి. భోజనము పై చాలా ఆధారపడి ఉంది. పిల్లలకు వెలుపల లభించదు అందుకే ఇక్కడకు వస్తారు. పిల్లలు భోజనము ద్వారా కూడా రిఫ్రెష్‌(తాజాగా) అవుతారు. యోగము చేయువారు జ్ఞానులుగా కూడా ఉంటారు. అందువలన వారిని సేవ చేసేందుకు పంపిస్తారు. చాలామంది అవుతే తర్వాత ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను ఉంచుతారు. లేకుంటే యోగయుక్తంగా భోజనము తయారయ్యేందుకు మహారథులే ఉండవలసి వస్తుంది. మేము కూడా బ్రహ్మభోజనము భుజించి దేవతలుగా తయారయ్యామని దేవతలు కూడా భావిస్తారు. అప్పుడు చాలా ఇష్టముతో మిమ్ములను కలుసుకునేందుకు మీ వద్దకు వస్తారు. మిమ్ములను ఎలా కలుస్తారో అది కూడా డ్రామాలో ఉంది. సూక్ష్మవతనములో వారూ, వీరు కలుసుకుంటారు. ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారము. ఇది అద్భుతమైన జ్ఞానము కదా. కావున ఈ సాక్షాత్కారం కూడా అర్థ సహితంగా అద్భుతంగా ఉంది. భక్తిమార్గములో సాక్షాత్కారాలు చాలా శ్రమ చేసిన తర్వాత జరుగుతాయి. కేవలం సాక్షాత్కారము కొరకు నవ విధముల భక్తి చేస్తారు. సాక్షాత్కారమౌతే ముక్తి పొందుతామని భావిస్తారు. ఈ చదువు ద్వారా అలా అయ్యారని వారికి తెలియదు. ఈ సూర్యవంశీయులు, చంద్ర వంశీయులు ఈ చదువు ద్వారానే తయారయ్యారు. పోతే వారు అనేక చిత్రాలనేవైతే తయారుచేశారో నిజానికి ఆ చిత్రాల వలె ఎవ్వరూ లేరు. అదంతా భక్తిమార్గపు విస్తారము. చాలా పెద్ద వ్యవహారము. ఇప్పుడు జ్ఞానము, భక్తి ఈ రెండింటి రహస్యము మీరు అర్థం చేసుకోగలరు. ఇదంతా తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు స్పిరిచువల్‌(ఆత్మల) తండ్రి. వారే జ్ఞానసాగరులు. కల్ప-కల్పము పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా తయారుచేయడం, రాజయోగమును నేర్పించడం ఆ తండ్రి కర్తవ్యమే. కానీ గీతలో పేరు మార్చేశారు. ఇది కూడా కల్ప-కల్పము జరిగే డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తారు. మనము ఇంటి నుండి పాత్రను అభినయించేందుకు ఇచ్చటకు వస్తాము. కల్పవృక్షము పై కూడా మీ బుద్ధి పని చేయాలి. ఎవరెవరికి ఎలా చెప్పాలో ఆలోచించాలి. మేము స్వర్గములోకి రామా? అని మనలను ఎవరైనా అడుగుతారు. మీ ధర్మస్థాపకులే స్వర్గములోకి రారని చెప్పండి. వారు స్వర్గములోకి వచ్చినప్పుడు మీరు కూడా రండి అని చెప్పండి. ప్రతి ఒక్క ధర్మము తమ-తమ సమయములలో పాత్ర చేస్తుంది. ఇది వెరైటీ ధర్మాల తయారైన నాటకము. ఎప్పుడో తయారు చేయబడిన ఆట. ఇందులో ఏ మాత్రము ప్రశ్నించే అవసరమే ఉండదు. ముఖ్యమైన ధర్మాలు చూపించారు. పిల్లలకు వీటిని గురించి తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా కొత్తవేమీ కాదు. కల్ప-కల్పము ఇదే విధంగా ఉన్నదున్నట్లు జరుగుతూ వస్తుంది. అనేక విధాలైన విఘ్నాలు కూడా ఏర్పడ్తాయి. కొట్లాటలు, దెబ్బలు మొదలైన వాటి ద్వారా కూడా విఘ్నాలు ఏర్పడ్తాయి కదా. ఎంతో యుక్తిగా పిల్లలకు అర్థం చేయించబడ్తుంది. భగవానువాచ, కామము మహాశత్రువు అని అందరికి చెప్పండి. ఇప్పుడీ కలియుగ ప్రపంచము వినాశనమౌతుంది. దేవతా ధర్మ స్థాపన జరుగుతూ ఉంది. అందుకే తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీరు పవిత్రంగా అవ్వండి, కామమును జయించండి. దీని పైననే జగడాలు జరుగుతాయి. మీరు చాలా గొప్పవారికి అర్థం చేయిస్తారు. గవర్నర్‌ పేరు విని అందరూ వస్తారు. దాని కొరకు యుక్తులు రచించడం జరుగుతుంది. వచ్చేవారిలో కొంతమంది బాగా అర్థము చేసుకోవచ్చు. గొప్పవారి పేరు విని ఎంతోమంది వచ్చేస్తారు. ఎవరైనా గొప్పవారు కూడా రావచ్చు. వచ్చే అవకాశముంది. ఇది కష్టమైన పనే. పిల్లలారా, ఎవరితో ప్రారంభోత్సవము చేయిస్తున్నారో మొదట వారికి మనుష్యుల నుండి ఇలాంటి దేవతలుగా తయారవ్వగలరని తప్పకుండా తెలపమని, విశ్వములో శాంతి నెలకొంటుందని చెప్పండి అని బాబా ఎన్నోసార్లు వ్రాస్తూ ఉంటారు. స్వర్గములోనే ఈ విశ్వములో సుఖ-శాంతులుండేవి. ఇటువంటి విషయాలను ఇలా ఉపన్యసించండి. ఇవన్నీ వార్తాపత్రికలలో పడాలి. అప్పుడు మీ వద్దకు ఎంత మంది వస్తారంటే వారు మిమ్ములను నిద్ర కూడా పోనివ్వరు. నిద్ర కూడా త్యాగము చెయ్యాల్సి వస్తుంది. సేవ ద్వారా, యోగము ద్వారా శక్తి కూడా వస్తుంది. ఎందుకంటే మీకు సంపాదన జరుగుతుంది. సంపాదన చేసుకునేవారికి ఎప్పుడూ ఆవళింతలు రావు. ఎప్పుడూ తూగరు. సంపాదన ద్వారా కడుపు నిండిపోతుంది. తర్వాత నిద్ర రాదు. ఇది రెగ్యులర్‌ అయిపోతుంది. మీరు కూడా చాలా గొప్ప సంపాదన చేస్తారు. దివాలా తీయువారు ఆవళిస్తూ ఉంటారు. ఎవరు బాగా అర్థము చేసుకుంటారో, స్మృతిలో ఉంటారో వారికి ఆవళింతలు రావు. బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తు వస్తే ఆవులింతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకునేందుకు గుర్తులు. స్వర్గములో మీకు ఆవళింతలు మొదలైనవి ఎప్పుడూ రానే రావు. తండ్రి వారసత్వమును పొందుకుంటే అక్కడ నిద్రించడం, నిద్ర మేల్కోవడం, కూర్చోవడం అన్నీ నియమానుసారము జరుగుతాయి.చాలా ఖచ్ఛితముగా ఆత్మ లివర్‌ గడియారము వలె తయారౌతుంది. ఇప్పుడు సిలిండర్‌ గడియారము వలె ఉంది. దానిని లివర్‌ గడియారము వలె ఖచ్ఛితంగా తయారు చెయ్యాలి. కొంతమంది తయారు చేయగలరు, కొంతమంది తయారు చేయలేరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. బంధన ముక్తులుగా తయారయ్యేందుకు లేక స్వయం మీ ఉన్నతి చేసుకునేందుకు బుద్ధిని సదా జ్ఞానముతో భర్‌పూర్‌గా(నిండుగా) ఉంచుకోవాలి. మాస్టర్‌ జ్ఞానసాగరులుగా అయ్యి స్వదర్శన చక్రధారులుగా అయ్యి స్మృతిలో కూర్చోవాలి.

2. నిద్రను జయించేవారిగా అయ్యి స్మృతి మరియు సేవల బలమును జమ చేసుకోవాలి. సంపాదనలో ఎప్పుడూ సోమరితనము చూపరాదు, బద్ధకించరాదు. తూగి కునికిపాట్లు పడరాదు.

వరదానము :-

'' అందరి పట్ల ప్రేమ భావన మరియు ప్రేమ దృష్టిని ఉంచే అందరికి ప్రియమైన ఫరిస్తా భవ ''

స్వప్నములో కూడా ఎవరి వద్దకైనా ఫరిస్తా వస్తే ఎంత సంతోషిస్తారు! ఫరిస్తాలు అనగా అందరికి ప్రియమైనవారు. హద్దు ప్రేమ కాదు, బేహద్‌(అనంతమైన) ప్రియమైనవారు. ఎవరు ప్రేమిస్తే వారికి మాత్రమే కాదు, అందరికీ ప్రియమైనవారు. ఎటువంటి ఆత్మ అయినా మీ దృష్టి, మీ భావన ప్రియంగా ఉండాలి - అటువంటివారినే అందరికి ప్రియమైనవారని అంటారు. ఎవరైనా అవమాన పరచినా, కోపగించుకున్నా, వారి పట్ల కూడా ప్రేమ భావన లేక కళ్యాణ భావన ఉత్పన్నమవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో వారు పరవశమై ఉన్నారు.

స్లోగన్‌ :-

'' ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో, వారే సదా హర్షితంగా, సదా సుఖంగా ఉండే అదృష్టవంతులు.''