16-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - దు:ఖహర్త - సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. వారే మీ దు:ఖాలన్నీ దూరము చేస్తారు. మానవులు ఎవ్వరి దు:ఖాలనూ దూరం చేయలేరు. ''

ప్రశ్న :-

విశ్వములో అశాంతికి కారణమేమి? శాంతి స్థాపన ఎలా జరుగుతుంది ?

జవాబు :-

విశ్వములో అశాంతికి కారణము - అనేక అనేక ధర్మాలు. కలియుగ అంతిమ సమయములో ఎప్పుడైతే అనేకత ఏర్పడ్తుందో అప్పుడు అశాంతి నెలకొంటుంది. తండ్రి వచ్చి ఒకే సత్య ధర్మ స్థాపన చేస్తారు. అక్కడ శాంతి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో శాంతి ఉండేదని మీరు అర్థము చేసుకోగలరు. పవిత్ర ధర్మము, పవిత్ర కర్మలు ఉండేవి. కళ్యాణకారి తండ్రి మళ్లీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అక్కడ అశాంతి అన్న మాటే ఉండదు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రినే జ్ఞాన సాగరులని అంటారు. ఇది పిల్లలకు అర్థం చేయించబడింది. బొంబాయిలో కూడా చాలామంది సంఘసేవకులున్నారు. వారి సమావేశాలు(మీటింగులు) జరుగుతూ ఉంటాయి. బొంబాయిలో విశేషంగా సమావేశాలు జరుపుకునే భవనము పేరు భారతీయ విద్యా భవనము. విద్య రెండు విధాలు. మొదటిది - స్కూళ్ళు(పాఠశాల), కాలేజీలలో ఇచ్చే దేహ సంబంధమైన విద్య. ఇప్పుడు దానిని విద్యా భవనము అని అంటున్నారు. అంటే అక్కడ తప్పకుండా మరొకటేదో ఉంటుంది. విద్య అని దేనినంటారో మానవులకు తెలియనే తెలియదు. దీనిని ఆత్మిక విద్యా భవనమని అనాలి. ఆత్మిక విద్య లేక మార్గము ఒక్కటే ఉంటుంది. జ్ఞానమును విద్య అని అంటారు. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరులు. కృష్ణుని జ్ఞానసాగరుడని అనరు. శివబాబా మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు. భారతవాసులు తికమక పడి ఉన్నారు. గీతా భగవానుడు కృష్ణుడని భావించి విద్యా భవనాలు మొదలైన వాటిని తెరుస్తూ ఉంటారు. వారు అర్థము చేసుకోరు. గీతా జ్ఞానమే విద్య. ఆ జ్ఞానము ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. వారినే జ్ఞానసాగరులని అంటారు. వారిని గురించి మానవమాత్రులకు తెలియదు. వాస్తవానికి సర్వ శాస్త్రాల శిరోమణి అయిన భగవద్గీత ఒక్కటే భారతీయుల ధర్మ శాస్త్రము. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? ఈ సమయములో భారతీయులెవ్వరికీ ఈ విషయము కూడా తెలియదు. కృష్ణుడిని, రాముడిని లేక తమను తామే పరమాత్మ అని చెప్పుకుంటారు. ఇప్పుడు సమయము కూడా తమోప్రధానంగా ఉంది. ఇది రావణ రాజ్యము కదా.

పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించునప్పుడు శివభగవానువాచ అని చెప్పి ప్రారంభించండి. మొదట జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మయే అని, వారి పేరు శివ అని వారు అర్థము చేసుకోవాలి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ ఎవ్వరికీ అర్థము కాదు. శివుడు తప్పకుండా వచ్చారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటున్నారు. కానీ శివుడు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. అందరికీ భగవంతుడు ఒక్కరే అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలందరూ సోదరులే (భాయీ-భాయీ). ఆత్మలందరి తండ్రి పరమపిత పరమాత్మ ఒక్కరే. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. దేవతలలో ఈ జ్ఞానము లేనే లేదు. ఏ జ్ఞానము? రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఏ మానవమాత్రులకు లేదు. ప్రాచీన ఋషులు, మునులు కూడా మాకు తెలియదు అని చెప్పేశారు. ప్రాచీనమను పదానికి అర్థము కూడా తెలియదు. సత్య-త్రేతా యుగాలు ప్రాచీనమైనవి. సత్యయుగము కొత్త ప్రపంచము. అక్కడైతే ఋషులు, మునులు లేనే లేరు. ఈ ఋషులు, మునులు మొదలైన వారందరూ తర్వాత వచ్చారు. వారికి కూడా ఈ జ్ఞానము తెలియదు. తెలియదు - తెలియదు(నేతి-నేతి) అని అంటారు. వారికే తెలియకపోతే ఇప్పుడు తమోగుణీలైన భారతీయులు ఎలా తెలుసుకోగలరు?

ఈ సమయంలో సైన్సు(విజ్ఞానము) గర్వము ఎంతగా ఉంది! ఈ సైన్సు ద్వారా భారతదేశము స్వర్గంగా తయారయ్యిందని భావిస్తారు. దీనిని మాయ ప్రదర్శన అని అంటారు. దీని పై ''ఫాల్‌ ఆఫ్‌ పాంప్‌(ఖీaశ్రీశ్రీ ూట ూaఎజూ)'' అను ఒక నాటకము కూడా ఉంది. ఈ సమయంలో భారతదేశము పతనమవుతూ ఉందని కూడా అంటారు. సత్యయుగములో ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు పతనమైపోయింది. ఇది స్వర్గమేమీ కాదు. ఇది మాయ ఢాంబికము. ఇది పతనము అవ్వవలసిందే. విమానాలున్నాయి, పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి, విద్యుత్తు అన్నీ ఉన్నాయి, కనుక ఇదే స్వర్గమని మనుష్యులు భావిస్తారు. ఎవరైనా మరణించినా స్వర్గవాసులైనారని అంటారు. స్వర్గానికి వెళ్లారంటే, తప్పకుండా స్వర్గము మరొకటేదో ఉందని కదా. ఇది కూడా అర్థము చేసుకోరు. ఇది రావణుని ఆడంబరము, బేహద్‌ తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ సమయములో మాయకు - ఈశ్వరునికి, ఆసురీ ప్రపంచానికి - ఈశ్వరీయ ప్రపంచానికి మధ్య పోటీ లేక యుద్ధము అని అంటారు. ఇది కూడా భారతీయులకు అర్థము చేయించవలసి వస్తుంది. ఇప్పుడు దు:ఖాలు ఇంకా ఎక్కువగా రానున్నవి. అపారమైన దు:ఖము రానున్నది. స్వర్గమైతే సత్యయుగములోనే ఉంటుంది. కలియుగములో ఉండజాలదు. పురుషోత్తమ సంగమ యుగమని దేనిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానము అనగా పగలు, భక్తి అనగా రాత్రి అని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. అంధకారములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతునితో మిలనము చేసేందుకు ఎన్నో వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. బ్రహ్మ రాత్రి మరియు పగలే బ్రాహ్మణుల రాత్రి మరియు పగలు. మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు కలియుగ కుఖవంశావళి బ్రాహ్మణులు. మీరు పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకున్నప్పుడే మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. సతోప్రధానంగా ఉన్న భారతదేశమును స్వర్గమని అంటారు. కావున తప్పకుండా ఇది నరకమే. అప్పుడే నరకము నుండి స్వర్గానికి వెళ్తారు. అక్కడ శాంతి కూడా ఉంది, సుఖము కూడా ఉంది. అది లక్ష్మీనారాయణుల రాజ్యము కదా. మనుష్యుల వృద్ధి ఎలా తక్కువ అవ్వగలదో, అశాంతి ఎలా తగ్గుతుందో మీరు అర్థం చేయించవచ్చు. కలియుగీ పాత ప్రపంచములో అశాంతి ఉంది. శాంతి కొత్త ప్రపంచములోనే ఉంటుంది. స్వర్గములో శాంతి ఉంటుంది కదా. దానినే ఆది సనాతనా దేవీ దేవతా ధర్మమని అంటారు. హిందూ ధర్మము ఇప్పటిది. దానిని ఆది సనాతన ధర్మమని అనజాలరు. హిందూస్థానము అన్న పేరు వల్ల హిందువులు అని అనేస్తారు. ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. అక్కడ సంపూర్ణ పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాము, హే పతిత పావనా! మీరు రండి అని పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, పతితపావనుడు ఎవరు? కృష్ణుని పతితపావనుడని అనరు. పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. వారే వచ్చి చదివిస్తారు. జ్ఞానాన్ని చదువు అని అంటారు. ఆధారమంతా గీత పైనే ఉంది. మీరిప్పుడు ప్రదర్శిని, మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు. కానీ ఇంతవరకు వారికి బి.కె.ల అర్థమే తెలియదు. ఇదేదో కొత్త ధర్మమని భావిస్తారు. వింటారు కానీ అర్థము చేసుకోవడం లేదు. పూర్తిగా తమోప్రధానమైన రాతిబుద్ధిగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. ఈ సమయములో సైన్సు గర్వితులు కూడా చాలా మంది తయారయ్యారు. సైన్సు ద్వారానే తమ వినాశము తామే చేసుకుంటూ ఉంటే, వారిని రాతి బుద్ధి అని అంటారు కదా. వారిని పారసబుద్ధి అని అనరు. తమ వినాశము కొరకే బాంబులు మొదలైనవి తయారు చేస్తారు. అంతేకాని శంకరుడు వినాశనమేమీ చేయడు. వీరు తమ వినాశము కొరకే అన్నీ తయారు చేశారు. కానీ తమోప్రధానమైన రాతిబుద్ధి గలవారు అర్థము చేసుకోరు. తయారు చేసేవన్నీ ఈ పాత సృష్టి వినాశనము కొరకే. వినాశనమైనప్పుడే కొత్త ప్రపంచపు జయ - జయ ధ్వనులు వినిపిస్తాయి. స్త్రీల దు:ఖమును ఎలా దూరము చేయాలని వారు ఆలోచిస్తారు. కానీ మానవులెవ్వరూ ఎవరి దు:ఖమునూ దూరము చేయలేరు. తండ్రి ఒక్కరే దు:ఖహర్త - సుఖకర్త. దేవతలను కూడా అలా అనరు. కృష్ణుడు కూడా దేవతయే. అతడిని భగవంతుడు అని అనలేరు. ఇది కూడా అర్థము చేసుకోరు. ఎవరు అర్థము చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా అయ్యి ఇతరులకు కూడా అర్థము చేయిస్తూ ఉంటారు. ఎవరైతే రాజ్య పదవికి అర్హులో లేక ఆది సనాతన దేవతా ధర్మానికి చెందినవారో వారు వస్తారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఎలా అయ్యారు? వారు ఏ కర్మ చేసి విశ్వానికి అధిపతులుగా అయ్యారు? ఈ కలియుగ అంతిమ సమయములో అనేకానేక ధర్మాలున్నాయి. అందుకే అశాంతి ఉంది. కొత్త ప్రపంచములో ఇలా ఉండదు. ఇప్పుడిది సంగమ యుగము. తండ్రి వచ్చి రాజయోగమును నేర్పిస్తారు. తండ్రియే కర్మ - అకర్మ - వికర్మల జ్ఞానము వినిపిస్తారు. ఆత్మ శరీరము తీసుకొని కర్మ చేసేందుకు వస్తుంది. సత్యయుగములో చేసిన కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ వికర్మ జరగదు, దు:ఖము ఉండనే ఉండదు. కర్మ, వికర్మ, అకర్మల గతిని తండ్రియే వచ్చి చివరి సమయములో వినిపిస్తారు. నేను ఇతని అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కూడా చివరి సమయములో వస్తాను. ఈ రథములో ప్రవేశిస్తాను. అకాల(అవినాశి)మూర్తి ఆత్మకు ఇది రథము. కేవలం ఒక్క అమృత్‌సర్‌లోనే కాదు. మానవులందరికీ అవినాశి(అకాల) సింహాసనముంది. ఆత్మ అకాలమూర్తి. ఈ శరీరము మాట్లాడ్తుంది, నడుస్తుంది. అవినాశి ఆత్మకు ఇది చైతన్య సింహాసనము. అందరూ అకాలమూర్తులే. పోతే శరీరమును కాలుడు(మృత్యువు) తినేస్తాడు. ఆత్మ అవినాశి. సింహాసనాన్ని (శరీరమును) సమాప్తము చేస్తారు. సత్యయుగములో చాలా కొన్ని సింహాసనాలు మాత్రమే ఉంటాయి. ఈ సమయములో కోట్లకొలది ఆత్మలకు సింహాసనాలున్నాయి. అవినాశి(అకాల్‌) అని ఆత్మను అంటారు. ఆత్మయే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతుంది. నేనైతే సదా పవిత్రంగా, సతోప్రధానంగా ఉంటాను. ప్రాచీన భారత యోగమని అంటారు. కానీ వారు అది కూడా కృష్ణుడు నేర్పించాడని భావిస్తారు. భగవద్గీతనే ఖండితము చేసేశారు. జీవిత కథలో పేరు మార్చేశారు. తండ్రికి బదులు పుత్రుని పేరు పెట్టేశారు. శివరాత్రి పండుగను జరుపుకుంటారు కానీ శివుడు ఎలా వచ్చారో ఎవ్వరికీ తెలియదు. శివుడే పరమాత్మ. వారి మహిమ పూర్తిగా భిన్నమైనది. ఆత్మల మహిమ వేరు. రాధా-కృష్ణులే లక్ష్మీనారాయణులని పిల్లలకు తెలుసు. లక్ష్మీ - నారాయణుల ఇరువురి రూపమునే విష్ణువు అని అంటారు. తేడా ఏమీ లేదు. పోతే 4 భుజాలు, 8 భుజాలు కలిగిన మనిషి ఎవ్వరూ ఉండరు. దేవతలకు ఎన్ని భుజాలను ఇచ్చేశారు! అర్థము చేసుకునేందుకు సమయము పడ్తుంది.

నేను పేదల పెన్నిధినని తండ్రి చెప్తున్నారు. భారతదేశము పెేదదిగా అయినప్పుడే నేను వస్తాను. రాహు గ్రహణము వచ్చి కూర్చుంటుంది. బృహస్పతి దశ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు రాహు గ్రహణము భారతదేశములోనే కాదు ప్రపంచమంతటి పై ఉంది. అందువలన తండ్రి మళ్లీ భారతదేశములో వస్తారు. వచ్చి క్రొత్త ప్రపంచమును స్థాపన చేస్తారు. దానినే స్వర్గమని అంటారు. భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులుగా, డబుల్‌ కిరీటధారులుగా, స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము 5 వేల సంవత్సరాల క్రితము ఉండేది. ఇప్పుడది లేనే లేదు. తమోప్రధానమైపోయింది. స్వయం తండ్రియే తమ, అనగా రచయిత, రచనల పరిచయమును ఇస్తారు. మీ ప్రదర్శనలు, మ్యూజియంలకు చాలా మంది వస్తారు. కానీ ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. చాలా అరుదుగా ఎవరో ఒకరు అర్థము చేసుకొని కోర్సు తీసుకుంటారు. రచయిత మరియు రచనను తెలుసుకుంటారు. రచయిత బేహద్‌ తండ్రి. వారి ద్వారా బేహద్‌ వారసత్వము లభిస్తుంది. ఈ జ్ఞానము తండ్రియే ఇస్తున్నారు. తర్వాత రాజ్యము లభిస్తే, అచ్చట జ్ఞానము అవసరమే లేదు. కొత్త ప్రపంచమైన స్వర్గమును సద్గతి అని అంటారు. పాత ప్రపంచమైన నరకమును దుర్గతి అని అంటారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అలాగే అర్థం చేయించాలి. లక్ష్మీ - నారాయణుల చిత్రమును చూపించాలి. ఇప్పుడు విశ్వములో శాంతి స్థాపన జరుగుతూ ఉంది. పునాది అయిన ఆది సనాతన దేవీదేవతా ధర్మము లేనే లేదు. దానిని తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. దేవతల ధర్మము, కర్మలు పవిత్రంగా ఉండేవి. ఇప్పుడిది వికారి ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచమని శివాలయమని అంటారు. ఇప్పుడు వారికి అర్థం చేయిస్తే వారికి కొంత కళ్యాణము జరుగుతుంది. తండ్రినే కళ్యాణకారి అని అంటారు. వారు పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తారు. కళ్యాణకారీ యుగములో కళ్యాణకారి తండ్రి వచ్చి అందరికీ కళ్యాణము చేస్తారు. పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. సమయాన్ని తీసుకుని దీని గురించి రోజూ అర్థం చేయించవచ్చు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి మాకే తెలుసు అని చెప్పండి. ఇప్పుడు గీతా అధ్యాయము జరుగుతూ ఉంది. ఇందులో భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, డబుల్‌ కిరీటధారులుగా చేశారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా రాజయోగము ద్వారా ఇలా అయ్యారు. వారు ఈ పురుషోత్తమ సంగమ యుగములో తండ్రి ద్వారా రాజయోగమును నేర్చుకుంటారు. ప్రతి విషయాన్ని బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. రాజయోగ విద్య - సంపాదనకు ఆధారము. ఎందుకంటే దీని ద్వారానే మనము రాజాధి రాజులుగా అవుతాము. ఈ ఆధ్యాత్మిక చదువును ప్రతి రోజూ చదవాలి, చదివించాలి.

2. మనము సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులము అనే నషాలో సదా ఉండాలి. మనము కలియుగీ రాత్రి నుండి వెలుగులోకి వచ్చాము. ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగము. ఈ యుగములో తమ కళ్యాణము చేసుకోవాలి, సర్వుల కళ్యాణము చేయాలి.

వరదానము :-

'' భూమిని, నాడిని, సమయాన్ని చూచి సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షము చేసే నాలెజ్డ్‌ ఫుల్‌ భవ ''

బాబా ఇచ్చే ఈ జ్ఞానము కొత్తది మరియు సత్యమైనది. ఈ కొత్త జ్ఞానము ద్వారానే కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. ఇది అథారిటి మరియు నశా స్వరూపంలో ఎమర్జ్‌ అవ్వాలి. అలాగని ఎవరైనా వస్తూనే వారికి కొత్త జ్ఞానములోని కొత్త విషయాలను వినిపించి తికమక చెందరాదు. భూమిని, నాడిని, సమాయన్ని అన్నీ చూచి జ్ఞానమునివ్వాలి. ఇది నాలెడ్జ్‌ఫుల్‌కు గుర్తు. ఆత్మ ఇష్టాన్ని, కోరికను చూడండి, నాడిని చూడండి, భూమిని తయారు చేయండి. అయితే మీలో సత్యత వలన లభించిన నిర్భయతా శక్తి తప్పకుండా ఉండాలి. అప్పుడు సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షము చేయగలరు.

స్లోగన్‌ :-

'' '' నాది '' అని అన్నారంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం, ''నీది'' అని అన్నారంటే కొండంత పెద్ద విషయాన్ని దూదిగా చేసుకోవడం.