21-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - శరీర సహితంగా ఏవేవి కనిపిస్తున్నాయో, అవన్నీ వినాశనమవ్వనున్నాయి. ఆత్మలైన మీరు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలి. అందువలన ఈ పాత ప్ర్ర్రపంచాన్ని మర్చిపోండి ''

ప్రశ్న :-

పిల్లలైన మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశమును వినిపించవచ్చు ?

జవాబు :-

అందరికి వినిపించండి - అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు పరిమిత(హద్దు) వారసత్వ సమయము పూర్తి అయ్యింది అనగా భక్తి పూర్తి అయ్యింది. ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తమవుతుంది. మిమ్ములను రావణుని 5 వికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఇందులో మీరు పురుషార్థము చేసి దైవీగుణాలు గలవారిగా అవ్వాలి. కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థము చేసుకున్నా మీ స్థితి శ్రేష్ఠంగా అవ్వగలదు.

ఓంశాంతి.

ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? అవ్యభిచారి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఒకటి అవ్యభిచారి స్మృతి, రెండవది వ్యభిచారి స్మృతి. అవ్యభిచారి స్మృతి లేక అవ్యభిచారి భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ శివుడినే పూజిస్తారు. అత్యంత శ్రేష్ఠమైన భగవంతుడు వారే, వారు తండ్రే కాక శిక్షకుడు కూడా. వారు చదివిస్తారు. ఏం చదివిస్తారు? మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. దేవతల నుండి మనుష్యులుగా అయ్యేందుకు పిల్లలైన మీకు 84 జన్మలు పట్టాయి. మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క సెకండు పడ్తుంది. మేము తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. వీరు మన టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు. ఒక్కరి స్మృతిలోనే ఉండమని యోగము నేర్పిస్తారు. వారు స్వయంగా చెప్తున్నారు - ఓ ఆత్మల్లారా! ఓ పిల్లలారా! దేహ సర్వ సంబంధాలను వదలండి, ఇప్పుడు వాపస్‌(తిరిగి) వెళ్లాలి. ఈ పాత ప్రపంచము పరివర్తన చెందుతూ ఉంది. ఇప్పుడిక ఇచ్చట ఉండేది లేదు. పాత ప్రపంచము వినాశనము కొరకే ఈ ఫిరంగులు మొదలైన మారణాయుధాలు తయారయ్యాయి. ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు, ఇది ఆత్మకు తెలుసు. ఇప్పుడు మనము వాపసు వెళ్తున్నాము అందువలన ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహాన్ని కూడా వదిలేయాలని తండ్రి చెప్తున్నారు. దేహ సహితము ఈ ప్రపంచములో కనిపించేవన్నీ వినాశనమవుతాయి. శరీరము కూడా సమాప్తమవుతుంది. ఇప్పుడు ఆత్మలైన మనము ఇంటికి తిరిగి వెళ్లాలి. వాపస్‌ ఇంటికి వెళ్లకుండా నూతన ప్రపంచములోకి రాలేము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ దేవతలే పురుషోత్తములు. అత్యంత శ్రేష్ఠమైనవారు నిరాకార తండ్రి. తర్వాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైనవారు దేవతలు. వారు కూడా మానవులే కానీ దైవీగుణాలు గలవారు. వారే మళ్లీ ఆసురీ గుణాలు గలవారిగా అవుతారు. ఇప్పుడు మళ్లీ ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్లాల్సి ఉంటుంది. సత్యయుగములోకి వెళ్లవలసి ఉంటుంది. ఎవరు వెళ్లాలి? పిల్లలైన మీరు వెళ్లాలి. మీరు చదువుతున్నారు. ఇతరులను కూడా చదివిస్తారు. మీరు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు హద్దు వారసత్వము సమాప్తమవుతుంది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మానవులందరూ పంచ వికారాల రూపి రావణుని జైలులో ఉన్నారు. అందరూ దు:ఖమునే అనుభవిస్తున్నారు. ఎండిపోయిన రొట్టెలు లభిస్తాయి. తండ్రి వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపించి సదా సుఖీలుగా చేస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ మానవులను దేవతలుగా చేయలేరు. మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడిది కలియుగము. ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారైనాయి. స్వయం తండ్రి కూర్చుని పిల్లలైన మీకు రచయిత, రచనల పరిచయాన్ని ఇస్తారు. మీరు కేవలం ఈశ్వరా! పరమాత్మా! అని అనేవారు. వారే తండ్రి, టీచరు, గురువు కూడా అని ఇంతకుముందు మీకు తెలియదు. వారినే సద్గురువు, అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్ములను జీవాత్మలని(ఆత్మ మరియు జీవము) అంటారు. ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఈ శరీరమనే సింహాసనము పై కూర్చుని ఉన్నారు. వారు జన్మలు తీసుకోరు. ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు - నాకంటూ నా స్వంత రథము లేదు, నేను పిల్లలైన మిమ్ములను పావనంగా ఎలా చేయాలి! నాకు రథమైతే కావాలి కదా. అకాలమూర్తికి కూడా సింహాసనము కావాలి. అకాల సింహాసనము మానవులకే ఉంటుంది, మరి వేటికీ ఉండదు. మీ అందరికీ సింహాసనము కావాలి. అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది. వారు అందరికీ తండ్రి, వారిని మహాకాలుడు అని అంటారు. వారు పునర్జన్మలలోకి రారు. ఆత్మలైన మీరు పునర్జన్మలు తీసుకుంటారు. నేను కల్పములో సంగమ యుగములో వస్తాను. భక్తిని రాత్రి అని, జ్ఞానమును పగలు అని అంటారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాలు రెండు - అల్ఫ్‌, బే - తండ్రి మరియు సామ్రాజ్యము. తండ్రి వచ్చి సామ్రాజ్యాన్ని ఇస్తారు, చక్రవర్తి పదవి కొరకు చదివిస్తారు. అందుకే దీనిని పాఠశాల అని కూడా అంటారు. భగవానువాచ - భగవంతుడు నిరాకారుడు. వారికి పాత్ర కూడా ఉండాలి కదా. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు, అందరూ వారినే స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు - భక్తిమార్గములో స్మృతి చేయని మనిషి ఎవ్వరూ ఉండరు. ఓ భగవంతుడా! ఓ ముక్తిదాతా!, ఓ గాడ్‌ఫాదర్‌! అని అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు ఎందుకంటే వారు ఆత్మలందరికీ తండ్రి. వారు తప్పకుండా అనంతమైన సుఖాన్నే ఇస్తారు. హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తాడు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తున్నారు - పిల్లలూ! ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దేవీ దేవతలైన మీరు నూతన ప్రపంచములో ఉంటారని కూడా తండ్రే తెలిపించారు. అక్కడ అపారమైన సుఖముంటుంది, ఆ సుఖాలకు అంత్యము లేదు. నూతన గృహములో సదా సుఖమే ఉంటుంది. పాత ఇంట్లో దుఃఖముంటుంది. అందుకే తండ్రి పిల్లలకు క్రొత్త ఇంటిని కట్టిస్తారు. పిల్లల బుద్ధియోగము కొత్త ఇంటి వైపుకు వెళ్తుంది. ఇది హద్దులోని మాట. ఇప్పుడు అనంతమైన తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. పాత ప్రపంచములో చూసేదంతా శ్మశానవాటికగా అవుతుంది. ఇప్పుడు ఫరిస్తాన్‌(స్వర్గము) స్థాపన అవుతూ ఉంది. మీరు సంగమ యుగములో ఉన్నారు. మీరు కలియుగము వైపు కూడా చూడగలరు, అలాగే సత్యయుగము వైపు కూడా చూడగలరు. మీరు సంగమ యుగములో సాక్షిగా ఉంటూ చూస్తారు. ప్రదర్శినీ లేక మ్యూజియములోకి ఎవరైనా వస్తే, అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమ యుగము చిత్రము వద్ద నిల్చోబెట్టండి. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యయుగము, మనము మధ్యలో ఉన్నాము అని చెప్పండి. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ చాలా కొద్దిమంది మాత్రమే మానవులుంటారు. ఇతర ధర్మస్థులెవ్వరూ అక్కడికిి రారు. మొట్టమొదట మీరు మాత్రమే వస్తారు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. పావనంగా అయ్యేందుకే నన్ను ''ఓ బాబా! మమ్ములను పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్లండి'' అని పిలిచారు. శాంతిధామానికి తీసుకెళ్లమని అడగరు. పరంధామాన్ని స్వీట్‌హోమ్‌(మధురమైన ఇల్లు) అని అంటారు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్లాలి, దానిని ముక్తిధామము అని అంటారు. దాని కొరకే సన్యాసులు మొదలైనవారు శిక్షణనిస్తారు. వారు సుఖధామపు జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. ఏ ఏ ధర్మాలవారు ఎప్పుడెప్పుడు వస్తారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. మనుష్య సృష్టి రూపి వృక్షములో మీదే మొట్టమొదటి పునాది. బీజమును వృక్షపతి అని అంటారు. తండ్రి అంటున్నారు - నేను వృక్షపతిని, పైన నివసిస్తాను. ఎప్పుడైతే వృక్షము పూర్తి శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను వస్తాను. వటవృక్షము చాలా అద్భుతమైనది. పునాది లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఈ బేహద్‌ వృక్షములో కూడా ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి.

మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు. పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చారు. పిల్లలైన మీరు ఆల్‌రౌండు పాత్ర చేసేవారు. కనుక ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు. తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు. కానీ మానవులు 84 లక్షల జన్మలని అనేస్తారు. అవి కూడా ఎవరికి ఉంటాయో అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి పిల్లలైన మీరు 84 జన్మలు తీసుకుంటారని అర్థం చేయించారు. మొట్టమొదట నా నుండి దూరమైనవారు మీరే. మొట్టమొదట సత్యయుగములో దేవీ దేవతలే ఉంటారు. వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయునప్పుడు మిగిలిన ఆత్మలన్ని ఎక్కడకు వెళ్తాయి? శాంతిధామములో ఉంటాయని కూడా మీకు తెలుసు. కావున శాంతిధామము వేరు కదా. పోతే ప్రపంచమంటే ఇదే. ఇక్కడే పాత్ర చేస్తారు. నూతన ప్రపంచములో సుఖప్రదమైన పాత్ర, పాత ప్రపంచములో దుఃఖభరితమైన పాత్ర అభినయించవలసి ఉంటుంది. ఇది సుఖ-దుఃఖముల ఆట. అది రామరాజ్యము. సృష్టిచక్రమెలా తిరుగుతుందో ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. వారికి రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము గురించి తెలియదు. జ్ఞానసాగరులని ఒక్క తండ్రినే అంటారు. రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. మీకు నేను దానిని వినిపిస్తున్నాను. మళ్లీ ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. సత్యయుగములో ఈ జ్ఞానము ఉండదు. భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము మహిమ చేయబడింది. గీతలో కూడా రాజయోగము అనే మాట వస్తుంది. తండ్రి మీకు రాజయోగము నేర్పించి రాజ్య వారసత్వమునిస్తారు. రచన ద్వారా వారసత్వము లభించదు. వారసత్వము రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రతి మానవుడు రచయితయే. పిల్లలను రచిస్తాడు. అతడు హద్దు బ్రహ్మ, ఇతను అనంతమైన బ్రహ్మ. వారు నిరాకార ఆత్మల తండ్రి, ఇతను లౌకిక తండ్రి. అలాగే ఇతను ప్రజాపిత. ప్రజాపిత ఎప్పుడు ఉండాలి? సత్యయుగములోనా? కాదు. పురుషోత్తమ సంగమ యుగములో ఉండాలి. మనుష్యులకు సత్యయుగము ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. వారు సత్యయుగము, కలియుగము మొదలైన యుగాలకు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక్క యుగము అంటే 1250 సంవత్సరాలు. 84 జన్మలకు కూడా లెక్క కావాలి కదా. మెటికలు మనమెలా దిగుతామో లెక్క ఉండాలి కదా. మొట్టమొదట పునాదిలో ఉండేవారు దేవీదేవతలు. వారి తర్వాత ఇస్లాములు, బౌధ్ధులు వస్తారు. ఆ తండ్రి మనకు వృక్ష రహస్యము కూడా తెలిపించారు. తండ్రి తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు. ఈ చిత్రాలు మొదలైనవాటిని ఎలా తయారుచేశారు? మీకు ఎవరు నేర్పించారు? అని అడుగుతారు. బాబా మాకు ధ్యానములో చూపించారు, తర్వాత మేమే ఇక్కడ తయారు చేశామని చెప్పండి. ఆ తండ్రే ఈ రథములో వచ్చి, మేము తయారుచేసిన చిత్రాలను సరిదిద్దేందుకు సలహాలనిస్తారు. ఆయనే స్వయంగా సరిదిద్దుతారు అని వారికి చెప్పండి.

కృష్ణుని శ్యామసుందరుడని అంటారు. కానీ అతడిని ఎందుకలా అంటారో కూడా మనుష్యులకు తెలియదు. ఇతను వైకుంఠమునకు అధికారిగా ఉన్నప్పుడు తెల్లగా(పవిత్రంగా) ఉండేవాడు. తర్వాత గొల్లపిల్లవానిగా నల్లగా(అపవిత్రంగా) అయ్యాడు. అందుకే వారిని శ్యామసుందరుడు అని అంటారు. మొదట వచ్చేది అతనే. తతత్వమ్‌. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము నడుస్తుంది. ఆది సనాతన దేవీదేవతా ధర్మమునెవరు స్థాపించారు? ఇది కూడా ఎవ్వరికీి తెలియదు. భారతదేశమునే మరచి హిందూదేశములో నివసించు హిందువులమని చెప్పుకుంటున్నారు. నేను భారతదేశములోనే వస్తాను. భారతదేశములో దేవతల రాజ్యముండేది. అది ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది. నేను మళ్లీ స్థాపన చేసేందుకు వస్తాను. మొట్టమొదటిది ఆది సనాతన దేవీదేవతా ధర్మము. ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆకులు, మఠాలు, మార్గాలు తర్వాత వస్తాయి. వాటికి కూడా శోభ ఉంటుంది. చివర్లో వృక్షమంతా శిధిలావస్థకు వచ్చినప్పుడు నేను మళ్లీ వస్తాను. యదా యదాహీ ధర్మస్య,..... ఆత్మకు తనను గూర్చి కూడా తెలియదు అలాగే తండ్రిని గురించి కూడా తెలియదు. స్వయాన్ని కూడా నిందించుకుంటారు, తండ్రిని, దేవతలను కూడా నిందిస్తూ ఉంటారు. తమోప్రధానంగా, బుద్ధిహీనులుగా అయినప్పుడు నేను వస్తాను. పతిత ప్రపంచములోనే రావలసి వస్తుంది. వీరు మనుష్యులకు ప్రాణదానము చేస్తారు అనగా మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. అన్ని దుఃఖాల నుండి అర్ధకల్పము వరకు దూరము చేస్తారు. వందేమాతరం అని గాయనము కూడా ఉంది కదా. అలా ఏ మాతలకు వందనము చేస్తారు? మీరే ఆ మాతలు. ఈ సృష్టి అంతటిని స్వర్గంగా చేస్తారు. భలే పురుషులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాతలదే. అందుకే తండ్రి మాతలను మహిమ చేస్తారు. తండ్రి వచ్చి మిమ్ములను ఇంత మహిమకు యోగ్యులుగా చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అపారమైన సుఖాల ప్రపంచములోకి వెళ్లేందుకు సంగమ యుగములో నిల్చోవాలి. సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ బుద్ధియోగమును నూతన ప్రపంచముతో జోడించాలి. బుద్ధిలో ఇప్పుడు మనము వాపసు ఇంటికి వెళ్తున్నామని ఉండాలి.

2. అందరికీ ప్రాణదానమివ్వాలి. మానవుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి. దైవీగుణాలు ధారణ చేయాలి, చేయించాలి.

వరదానము :-

'' మీ హోదా(పొజిషన్‌) స్మృతి ద్వారా మాయ పై విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగీ భవ ''

ఎలాగైతే స్థూలమైన హోదా కలిగినవారు తమ హోదాను ఎప్పుడూ మర్చిపోరో, అలా ఇప్పుడు మీ పొజిషన్‌(హోదా) - 'మాస్టర్‌ సర్వశక్తివాన్‌.' ఈ హోదాను సదా స్మృతిలో ఉంచుకోండి. ప్రతిరోజు అమృతవేళలో ఈ స్మృతిని ఎమర్జ్‌ చేసుకుంటే(ఉత్పన్నము చేసుకుంటే) నిరంతర యోగులుగా అవుతారు, రోజంతా వారి సహయోగము లభిస్తూ ఉంటుంది. అప్పుడు మాస్టర్‌ సర్వశక్తివాన్‌ ముందుకు మాయ రాజాలదు. ఎప్పుడైతే మీరు స్మృతిలో ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు మాయ అనే చీమను జయించడం సులభమవుతుంది.

స్లోగన్‌ :-

'' ఆత్మ రూపి పురుషుని శ్రేష్ఠంగా చేసుకొనువారే సత్యమైన పురుషార్థులు. ''