15-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే, తండ్రి చేసే నిష్కామ సేవ ఇతరులెవ్వరూ చేయలేరు''

ప్రశ్న :-

నూతన ప్రపంచ స్థాపన చేయడంలో తండ్రి ఎటువంటి శ్రమ చేయవలసి వస్తుంది ?

జవాబు :-

పూర్తి ఆజామిళుని వంటి పాపులను మళ్లీ లక్ష్మీనారాయణుల వంటి పూజ్య దేవతలుగా తయారు చేసే శ్రమ బాబా చేయవలసి ఉంటుంది. తండ్రి, తన పిల్లలైన మిమ్ములను దేవతలుగా చేసే శ్రమ చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ వాపస్‌ శాంతిధామానికి వెళ్తాయి. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాన్ని సమాప్తము చేసుకొని యోగ్యులై వాపస్‌ ఇంటికి వెళ్ళాలి.

పాట :-

ఈ పాప ప్రపంచము నుండి,..............(ఇస్‌ పాప్‌ కీ దునియా సే కహీ ఔర్‌ లే చల్‌,.........)   

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఇది పాప ప్రపంచమని పిల్లలకు తెలుసు. నూతన ప్రపంచము పుణ్య ప్రపంచంగా ఉంటుంది, అక్కడ పాపముండదు. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. ఈ రావణ రాజ్యములో అందరూ పతితులు, దు:ఖితులుగా ఉన్నారు, అందుకే ఓ పతితపావనా! వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు. ఓ గాడ్‌ఫాదర్‌! మీరు వచ్చి మార్గదర్శకులై మమ్ములను ముక్తము చేయండి అని అన్ని ధర్మాల వారు పిలుస్తారు అనగా తండ్రి వచ్చినప్పుడు ఈ మొత్తం సృష్టిలో ఏ ఏ ధర్మాల వారున్నారో అందరినీ తీసుకెళ్తారు. ఈ సమయములో అందరూ రావణ రాజ్యములో ఉన్నారు. అన్ని ధర్మాల వారిని వాపస్‌ శాంతిధామానికి తీసుకెళ్తారు. అందరి వినాశనము జరిగే తీరాలి. తండ్రి ఇక్కడకు వచ్చి తన పిల్లలను సుఖధామానికి అర్హులుగా చేస్తారు. అందరి కళ్యాణము చేస్తారు. అందువలన వారొక్కరినే సర్వుల సద్గతిదాత అని, సర్వుల కళ్యాణము చేయువారని అంటారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు వాపస్‌ వెళ్ళాలి, అన్ని ధర్మాలవారు శాంతిధామానికి, నిర్వాణధామానికి వెళ్ళాలి. అక్కడ ఆత్మలన్నీ శాంతిలో ఉంటాయి. రచయిత అయిన అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి అందరికీ ముక్తి - జీవన్ముక్తులను ఇస్తారు. అందువలన మహిమ కూడా ఆ ఒక్క గాడ్‌ఫాదర్‌నే చేయవలసి ఉంటుంది. ఎవరైతే వచ్చి అందరికి సేవ చేస్తారో వారినే స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా తెలియజేస్తున్నారు - నేను దూరదేశమైన పరంధామ నివాసిని, మొట్టమొదట ఏ ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఉండేదో ఆ ధర్మము ఇప్పుడు లేనే లేదు, అందుకే నన్ను అందరూ పిలుస్తున్నారు. నేను వచ్చి పిల్లలందరినీ వాపస్‌ తీసుకెళ్తాను. హిందూ ధర్మము అనునది ధర్మమే కాదు. అసలు ధర్మము దేవీదేవతా ధర్మము, కానీ పవిత్రంగా లేనందున స్వయాన్ని దేవతలకు బదులు హిందువులము అని అనేశారు. హిందూ ధర్మస్థాపకులు ఎవ్వరూ లేరు. గీత సర్వశాస్త్ర్రాల శిరోమణి అని భగవంతునిదే గానము చేయబడింది. భగవంతుడని ఒక్కరిని మాత్రమే అంటారు - వారే గాడ్‌ఫాదర్‌, శ్రీ కృష్ణుని గానీ, లక్ష్మీనారాయణులను గానీ గాడ్‌ఫాదర్‌ లేక పతితపావనులు అని అనరు. వీరు రాజు-రాణి మాత్రమే అయితే వీరిని ఇలా తయారు చేసిన వారెవరు? అనంతమైన తండ్రి. తండ్రి మొట్టమొదట నూతన ప్రపంచాన్ని రచిస్తారు, ఆ ప్రపంచానికి వీరు అధికారులుగా అవుతారు. ఎలా అయ్యారో మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప లక్షాధికారులు వీరికి మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వరాజ్యాన్ని ఎలా పొందారు? ఎలా అధికారులుగా అయ్యారు? అని వారిని అడగండి. ఎప్పుడూ ఎవ్వరూ తెలుపలేరు. ఎటువంటి కర్మలు చేసి ఇంత ఫలమును పొందుకున్నారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు మీ ధర్మమునే మర్చిపోయారు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మము గురించి తెలియనందున అందరూ వేరు వేరు ధర్మాలలోకి పరివర్తనైపోయారు. వారు మళ్లీ తమ తమ ధర్మాలలోకి వాపస్‌ వచ్చేస్తారు. ఎవరైతే ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారో వారు తమ ధర్మములోకి వాపస్‌ వచ్చేస్తారు. క్రైస్తవ ధర్మానికి చెందినవారుగా ఉంటే వారు మళ్లీ క్రైస్తవ ధర్మములోకే వస్తారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మము అంటు(స్యాప్లింగ్‌) కట్టబడ్తున్నది. ఎవరెవరు ఏ ధర్మానికి చెందినవారో వారు తమ తమ ధర్మాలలోకి రావలసి వస్తుంది. ఇది సృష్టి వృక్షము, దీనికి మూడు కొమ్మలున్నాయి. వాటి నుండి ఇంకా వృద్ధి అవుతూ పోతుంది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీ మీ ధర్మములోకి వచ్చేయండి. కొంతమంది చెప్తారు - నేను సన్యాస ధర్మములోకి వెళ్తాను, నేను సన్యాసి అయిన రామకృష్ణ పరమహంస అనుచరుడను. వారు నివృత్తి మార్గానికి చెందినవారు, మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు, గృహస్థ మార్గములోని వారు నివృత్తి మార్గానికి చెందినవారి అనుచరులుగా ఎలా అవ్వగలరు! మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రంగా ఉండేవారు, తర్వాత రావణుని ద్వారా మీరు అపవిత్రమైపోయారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థము చేయిస్తున్నారు. మీరు గృహస్థాశ్రమానికి చెందినవారు, మీరు భక్తి కూడా చేెశారు. తండ్రి వచ్చి భక్తికి ఫలము సద్గతినిస్తారు. ధర్మాన్ని శక్తి(రిలీజన్‌ ఈజ్‌ మైట్‌ ) అని అంటారు. తండ్రి ధర్మస్థాపన చేస్తారు, మీరు విశ్వమంతటికి అధికారులుగా అవుతారు. తండ్రి నుండి మీకు ఎంతో శక్తి లభిస్తుంది. ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. ఇతరులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు, సద్గతిని పొందలేరు. ఇచ్చటనే వృద్ధి చెందుతూ ఉంటారు, వాపస్‌ ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి చెప్తున్నారు - నేను అన్ని ధర్మాల వారి సేవకుడను. నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు, ముక్తి శాంతిధామములో ఉంటుంది. కావున అందరికంటే గొప్ప వారెవరు? తండ్రి చెప్తున్నారు - ఓ ఆత్మలారా! మీరందరూ సోదరులు, అందరికీ తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. నేను వచ్చి అందరినీ తమ తమ సెక్షన్ల(విభాగముల)లోకి పంపేందుకు అర్హులుగా చేస్తాను. అర్హులుగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. లెక్కాచారము చుక్తా చేసుకొని మళ్లీ వాపస్‌ వెళ్తారు. అది శాంతిధామము, అది సుఖధామము.

తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఇందులో శ్రమ చేయవలసి వస్తుంది. పూర్తి అజామిళుని వంటి పాపులను నేను వచ్చి ఇటువంటి(లక్ష్మినారాయణులుగా) దేవీ దేవతలుగా తయారుచేస్తాను. మీరు ఎప్పటి నుండి వామమార్గము(మాంసము, మదిరము, వికారాలకు వశమయ్యే దిగజార్చే మార్గము)లోకి వెళ్ళారో అప్పటి నుండి సీఢీ(తాపలు, మెట్లు) క్రిందకు దిగుతూ వచ్చారు. ఈ 84 జన్మల నిచ్చెన క్రిందికి దిగే నిచ్చెన. సతోప్రధానము నుండి, సతో, రజో, తమో....... అవుతూ వస్తారు. ఇప్పుడిది సంగమ యుగము. నేను ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి చెప్తున్నారు. నేను ఇబ్రహీమ్‌ శరీరములోనో లేక బుద్ధుని శరీరములోనో రాను. నేను పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తాను. ఇప్పుడు ఫాలోఫాదర్‌(తండ్రిని అనుసరించండి) అని మీకు చెప్పబడ్తుంది. తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరందరూ నన్ను ఒక్కరినే అనుసరించండి. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు యోగాగ్నిలో భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. మీరు సత్య-సత్యమైన బ్రాహ్మణులు. మీరు కామచితి నుండి క్రిందికి దిగి జ్ఞానచితి పై కూర్చుంటారు. ఈ విషయాలు ఒక్క తండ్రి మాత్రమే అర్థము చేయిస్తారు. ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారందరూ ఆ ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తారు. అయితే వారిని గురించి యధార్థంగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. రచయిత, రచనల గురించి మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఋషులు, మునులు మొదలైన వారందరూ నేతి-నేతి, మాకు తెలియదు తెలియదు అని అంటూ వచ్చారు. స్వర్గము సత్యమైన ఖండము. అచ్చట దు:ఖమను పదమే ఉండదు. ఇచ్చట ఎంత దు:ఖముంది! ఆయువు కూడా చాలా తక్కువ. దేవతల ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. వారు పవిత్రమైన యోగులు, ఇచ్చట అందరూ అపవిత్రమైన భోగులున్నారు. సీఢీ(మెట్లు) దిగుతూ దిగుతూ ఆయువు తగ్గిపోతూ వచ్చింది. అకాలమృత్యువు కూడా జరుగుతూ ఉంటుంది. తండ్రి మిమ్ములను 21 జన్మలు ఎప్పుడూ జబ్బు పడకుండా తయారుచేస్తారు. ఇప్పుడు అటువంటి తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఆత్మ ఎంతో వివేకవంతంగా తయారవ్వాలి. ఎక్కడ దు:ఖముండదో అటువంటి వారసత్వాన్ని తండ్రి మీకు ఇస్తారు. మీ ఏడ్పులు - అరుపులు అన్నీ సమాప్తమైపోతాయి. అందరూ పాత్రధారులే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది కూడా డ్రామాయే. బాబా కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయిస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు చివర్లో మళ్లీ అదే జ్ఞానాన్ని వింటూ ఉంది. బ్రహ్మరాత్రి, బ్రహ్మపగలు మహిమ చేయబడ్డాయి. బ్రహ్మ రాత్రి - పగలే, బ్రాహ్మణుల రాత్రి - పగలు, ఇప్పుడు మీకు పగలు రానున్నది. మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తి అయ్యి జ్ఞాన ఉదయము జరుగుతుంది. ఇప్పుడిది సంగమ యుగము. ఇప్పుడు మీరు మళ్లీ స్వర్గవారసులుగా అవుతున్నారు. అంధకారమయమైన రాత్రిలో ఎదురుదెబ్బలు కూడా తిన్నారు. నుదురు కూడా అరగదీసుకున్నారు. ధనము కూడా సమాప్తము చేసుకున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు - ఇప్పుడు నేను మిమ్ములను శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు సుఖధామములో నివసించేవారు. 84 జన్మల తర్వాత దు:ఖధామములోకి వచ్చి పడ్డారు. బాబా! మీరు ఈ పాత ప్రపంచములోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచము కాదు, మీరు ఇప్పుడు యోగబలముతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు డబల్‌ అహింసకులుగా అవ్వాలి. కామఖడ్గమును ఉపయోగించరాదు, జగడాలాడరాదు, కొట్లాడరాదు. తండ్రి చెప్తున్నారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. ఇది 5 వేల సంవత్సరాల కల్పము, లక్షల సంవత్సరాలు కాదు. ఒకవేళ లక్షల సంవత్సరాలైతే ఇచ్చట జనాభా ఎక్కువగా ఉండేది, ఎన్నో వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు. కావున తండ్రి చెప్తున్నారు - నేను కల్ప-కల్పము వస్తాను, నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేను ఏమీ చేయలేను. నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను. సరియైన సమయములో వస్తాను. మన్మనాభవ అని చెప్తాను కానీ దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే అందరూ పావనమైపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసే శ్రమ చేస్తూ ఉంటారు.

ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇటువంటి విద్యాలయము మరెక్కడా ఉండదు. ఇక్కడ ఈశ్వరుడైన తండ్రి వచ్చి విశ్వమంతటినీ పరివర్తన చేస్తారు. నరకము నుండి స్వర్గంగా తయారు చేస్తారు. మీరు దాని పై రాజ్యపాలన చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇది బాబా భాగ్యశాలీ రథము. ఇందులో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. శివజయంతి గురించి ఎవ్వరికీ తెలియదు. వారు పరమాత్మ నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. అరే! నామ-రూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఇది ఆకాశము అని అంటారు. మరి ఇది పేరే కదా! భలే శూన్యము(పోలార్‌)గా ఉండవచ్చు కానీ పేరు ఉంది కదా. ఇప్పుడు బాబా పేరు కూడా కళ్యాణకారి, భక్తిమార్గములో అనేక పేర్లు ఉంచారు. బాబురినాథ్‌ అని కూడా అంటారు. వారు వచ్చి కామఖడ్గము నుండి విడిపించి పావనంగా చేస్తారు. నివృత్తి మార్గము వారు బ్రహ్మతత్వమునే పరమాత్మ అని అంగీకరిస్తారు. దానినే స్మృతి చేస్తారు. బ్రహ్మయోగులు, తత్వయోగులని పిలవబడ్తారు. కానీ అది నివాస స్థానము. దానిని బ్రహ్మాండమని అంటారు. వారు (సన్యాసులు) బ్రహ్మతత్వమునే భగవంతునిగా భావిస్తారు. మేము లీనమైపోతామని భావిస్తారు. అనగా ఆత్మను వినాశిగా చేస్తారు. బాబా చెప్తారు - నేనే స్వయంగా వచ్చి అందరికీ సద్గతినిస్తాను. కావున ఒక్క శివబాబా జయంతియే వజ్ర తుల్యమైనది. మిగిలిన జయంతులన్నీ గవ్వ సమానమైనవి. శివబాబా ఒక్కరే సర్వులకు సద్గతినిచ్చేవారు. కావున ఆ జయంతి వజ్ర సమానమైనది. వారే మిమ్ములను స్వర్ణ యుగములోకి తీసుకెళ్తారు. ఈ జ్ఞానము తండ్రియే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు దేవీ దేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానము లోపించిపోతుంది. ఈ లక్ష్మీ నారాయణులకు రచయిత-రచనల జ్ఞానము లేదు.

పిల్లలు పాట విన్నారు - శాంతి, సుఖము ఉన్న చోటుకి తీసుకెళ్ళమని అంటారు. అది శాంతిధామము తర్వాత అక్కడ నుండి సుఖధామానికి వస్తారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. సుఖ-శాంతుల ప్రపంచములోకి పిల్లలను తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మంచిది.

రాత్రి క్లాసు :-

ఇప్పుడు సూర్యవంశి, చంద్రవంశి రెండు రాజధానులు తయారవుతాయి. మీరు ఎంత తెలుసుకుంటారో, ఎంత పవిత్రంగా అవుతారో అంత వేరెవ్వరూ తెలుసుకోలేరు. పవిత్రంగా అవ్వలేరు. కానీ తండ్రి వచ్చారు అని వింటారు. కావున తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. పోను పోను మీరు ఈ జ్ఞానాన్ని లక్షలు, కోట్లమంది తెలుసుకోవడం చూస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. అంతిమ యుద్ధములో అందరూ నిరాశులైపోతారు(హోప్‌లెస్‌). అందరికీ టచ్‌(తోచుట) అవుతుంది. మీ ధ్వని వినిపిస్తుంది. స్వర్గ స్థాపన జరుగుతూ ఉందని మీ శబ్ధము కూడా వ్యాపిస్తుంది. మిగిలిన వారందరి మృత్యువు రెడీగా ఉంది. కానీ అప్పుడు మీకు కనీసము తూగేందుకు కూడా సమయము ఉండదు. ఎవరెవరుంటారో వారిలో చాలామంది అర్థము చేసుకుంటారు. అయితే ఆ సమయములో వీరందరూ ఉంటారని కూడా కాదు. కొంతమంది మరణిస్తారు కూడా. కల్ప-కల్పము ఎవరుండినారో వారు మాత్రమే ఉంటారు. ఆ సమయములో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారు. శబ్ధము కూడా తగ్గిపోతుంది. మళ్లీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీరందరూ సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. అత్యంత భయంకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వినాశనము అవ్వనున్నదని అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచము పరివర్తన కానున్నది. ఎప్పుడైతే బాంబులు పడ్తాయో అప్పుడు వినాశనమవుతుందని వివేకము చెప్తుంది. ఇప్పుడింకా పరస్పరములో - మేము బాంబులు వేయమని ప్రమాణము చేసుకుంటూ ఉంటారు. ఈ వస్తువులన్నీ వినాశనము కొరకే తయారై ఉన్నాయి.

పిల్లలైన మీకు చాలా ఖుషీ కూడా ఉండాలి. నూతన ప్రపంచము తయారవుతూ ఉందని మీకు తెలుసు. తండ్రియే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని అర్థము చేసుకున్నారు. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. దాని పేరే స్వర్గము. మీకు ఎలాగైతే నిశ్చయముందో అలా పోను పోను చాలా మందికి నిశ్చయము అవుతుంది. ఎవరైతే అనుభవము చేయాలని అనుకుంటారో వారు పోను పోను చాలా పొందుకుంటారు. అంతిమ సమయములో స్మృతియాత్రలో కూడా చాలా మంది మునిగి ఉంటారు. ఇప్పుడింకా సమయముంది. పురుషార్థము పూర్తిగా చేయకుంటే పదవి తగ్గిపోతుంది. పురుషార్థము చేస్తే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఆ సమయములో మీ స్థితి కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. కల్ప-కల్పము ఎలా వినాశనము జరిగిందో అలాగే జరుగుతుంది. ఎవరిలో నిశ్చయముంటుందో, సృష్టి చక్ర జ్ఞానముంటుందో వారు ఖుషీగా ఉంటారు. మంచిది. రూహానీ బచ్చే గుడ్‌నైట్‌(ఆత్మిక పిల్లలారా! శుభరాత్రి).

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. డబుల్‌ అహింసకులుగా అయ్యి యోగబలము ద్వారా ఈ నరకాన్ని స్వర్గంగా తయారుచేయాలి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి.

2. ఒక్క తండ్రినే పూర్తిగా అనుసరించాలి. సత్య-సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధము చేయాలి. అందరినీ కామచితి నుండి దించి జ్ఞానచితి పై కూర్చోబెట్టాలి.

వరదానము :-

''అల్ఫ్‌ను(బాబాను) తెలుసుకొని స్వధర్మమైన పవిత్రతను స్వంతము చేసుకునే విశేష ఆత్మా భవ''

'' నా ఒక్కొక్క పుత్రుడు, వృద్ధులు కావచ్చు, చదువు రాని వారు కావచ్చు, చిన్న పిల్లలు గానీ, యుక్త వయసు గలవారు గానీ, ప్రవృత్తి మార్గములోని వారు గానీ విశ్వము ముందు విశేష ఆత్మలు '' అని బాప్‌దాదాకు సంతోషము కలుగుతుంది. ప్రపంచములో ఎవరు ఎంత గొప్ప నాయకులు గానీ, అభినేతలు గానీ(నటులు గానీ), వైజ్ఞానికులు గానీ తండ్రి ఎవరో తెలుసుకోకపోతే ఏం తెలుసుకున్నట్లు! మీరు నిశ్చయబుద్ధి కలిగినవారై నషాతో ''మీరు వెతుకుతూ ఉండండి, మేము పొందుకున్నాము'' అని అంటారు. ప్రవృత్తిలో ఉంటూ స్వధర్మమైన పవిత్రతను స్వంతము చేసుకున్నారంటే ఆ పవిత్ర ఆత్మలు విశేష ఆత్మలుగా అయ్యారు.

స్లోగన్‌ :-

''ఎవరైతే సదా ఖుశ్‌హాల్‌గా ఉంటారో, వారే స్వయానికి, సర్వులకు ప్రియమనిపిస్తారు''