27-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ ఎందుకంటే మీరు శబ్ధము నుండి అతీతంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అందువలన స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వండి.''
ప్రశ్న :-
ఉన్నతమైన గమ్యానికి చేరుకునేందుకు ఏ విషయము పై తప్పకుండా గమనముంచాలి? సంభాళించుకోవాలి?
జవాబు :-
కళ్ళను సంభాళించుకోండి - ఇవి చాలా మోసము చేస్తాయి. వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది. అందువలన వీలైనంత ఎక్కువగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. సోదర-సోదర(భాయి-భాయి) దృష్టిని అభ్యాసము చేయండి. ఉదయము ఉదయమే లేచి ఏకాంతములో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి. భగవంతుని ఆజ్ఞ - '' మధురమైన పిల్లలారా! కామమనే మహాశత్రువుతో జాగ్రత్తగా, హెచ్చరికగా ఉండండి.''
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇక్కడ చదివించేది భగవంతుడే అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ విషయము అర్థము చేసుకున్నవారే ఇక్కడకు రాగలరు. ఇక్కడ చదివించేది మానవులు కాదు. ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. భగవంతుడంటే ఎవరో వారి పరిచయము తెలుసుకోవాలి. భగవంతుడనే పేరు ఎంతో గొప్పగా ఉంది కానీ వారికి నామ-రూపాలే లేవని అంటారు. నామ-రూపములకు భిన్నము అని అంటారు. వాస్తవానికి ఆయన భిన్నంగానే ఉన్నారు. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు. ఆత్మ నక్షత్రమని కూడా అంటారు. వాస్తవానికి ఆ నక్షత్రాలు చిన్నవేమీ కావు. కానీ ఈ ఆత్మ నక్షత్రము సత్యముగానే అత్యంత చిన్నది. తండ్రి కూడా బిందువే. తండ్రి సదా పవిత్రంగా ఉంటారు. వారికి - జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు......... అని మహిమ కూడా ఉంది. ఇందులో సంశయపడే మాటే లేదు. ముఖ్యమైనది పవిత్రంగా అవ్వడం. వికారాల విషయములోనే జగడాలు జరుగుతాయి. పవిత్రంగా అయ్యేందుకు పతితపావనులైన తండ్రిని పిలుస్తారు. అందువలన తప్పకుండా పవిత్రంగా అవ్వాలి కదా. ఇందులో సంశయపడరాదు, తికమకపడరాదు. ఏదైతే గతించిపోయిందో, విఘ్నాలు మొదలైనవి వచ్చాయో, అవేమీ కొత్త విషయాలు కావు. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. ఇతర సత్సంగాలలో ఇలాంటి విషయాలు జరగవు. ఎక్కడా గలాటాలు జరగవు. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయములోనే గలాటాలు జరుగుతాయి. తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తే, ఎంత హంగామా జరుగుతోంది. తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - నేను వానప్రస్థ అవస్థలోనే వస్తాను. వానప్రస్థ అవస్థ అనే నియమము(పద్ధతి) కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. వానప్రస్థ అవస్థలోని వారు తప్పకుండా వానప్రస్థములోనే ఉంటారు. శబ్ధము నుండి అతీతంగా వెళ్లేందుకు తండ్రిని బాగా స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యే మార్గము ఇది ఒక్కటే. వాపస్ వెళ్లాలంటే పవిత్రంగా అయ్యే తీరాలి. అందరూ వాపస్ వెళ్లాల్సిందే. ఇద్దరో - నలుగురో వెళ్లేందుకు వీలు లేదు. అలా వెళ్లలేరు. మొత్తము పతిత ప్రపంచమంతా పరివర్తన అవ్వనున్నది. ఈ డ్రామాను గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. సత్యయుగము నుండి కలియుగము వరకు ఈ డ్రామా చక్రము వలె తిరుగుతూ ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి, అప్పుడే మీరు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళగలరని తండ్రి చెప్తున్నారు. గతి-సద్గతిదాత ఒక్కరేనని మహిమ కూడా ఉంది. సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు, పవిత్రంగా ఉంటారు. కలియుగములో అనేక ధర్మాలున్నాయి. అందరూ అపవిత్రమైపోయారు. ఇది చాలా సహజ విషయము. తండ్రి మొదటి నుండి ఈ విషయము తెలుపుతూనే ఉన్నారు. హంగామా తప్పకుండా జరుగుతుందని, గలాటాలు అవుతాయని తండ్రికి ముందే తెలుసు. తెలియకపోతే, జ్ఞానామృతము స్వీకరించేందుకు పెద్దవారి నుండి లెటరు తీసుకొని రమ్మని బాబా ఎందుకు చెప్తారు? ఈ జగడాలు జరగడం కూడా డ్రామాలో నిర్ణయింపబడే ఉందని కూడా తెలుసు. ఆశ్చర్యపడునట్లు బాగా గుర్తించి జ్ఞానము బాగా తెలుసుకుంటారు. ఇతరులకు కూడా జ్ఞానమిస్తారు. అయినా అహో మాయ! ఇటువంటి వారిని కూడా నీ వైపు లాక్కొని తీసుకెళ్తావు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయింపబడ్డాయి. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మానవులు కేవలం నాటకమని అంటారు కానీ దాని అర్థము వారికి తెలియదు. పిల్లలూ! ఇది చాలా ఉన్నతమైన చదువు, కళ్ళు ఎంత మోసపుచ్చుతాయంటే మాటలలో చెప్పలేము. ఇది తమోప్రధానమైన ప్రపంచము. కాలేజీలలో కూడా చాలా చెడిపోతారు. విదేశాల మాటైతే, చెప్పనవసరము లేదు. సత్యయుగములో ఇటువంటి విషయాలుండవు. వారు సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. తండ్రి చెప్తున్నారు - నిన్న మీకు రాజ్యభాగ్యము ఇచ్చిపోయాను. అంతా పోగొట్టుకున్నారు. లౌకికములో కూడా తండ్రి, నేను ఇంత ఆస్తినిచ్చాను, అంతా పోగొట్టావు అని అంటాడు. ఒక్క దెబ్బతో ఆస్తినంతా నాశనము చేసే పిల్లలు కూడా పుడ్తారు. అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు - నేను మీకు ఎంతో ధనమిచ్చి వెళ్ళాను. ఎంతో మిమ్ములను అర్హులుగా చేసి ఈ విశ్వానికే యజమానులుగా చేశాను. ఇప్పుడు డ్రామానుసారము మీకు ఏ గతి పట్టింది? మీరు ఆ పిల్లలే కదా. ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఈ అనంతమైన విషయాలను మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ప్రతి రోజూ పులి వచ్చింది, పులి వచ్చింది........ (నాన్న, పులి కథ) అని అరిచేవాడు. కానీ పులి వచ్చేది కాదు. అయితే ఒక రోజు నిజంగానే పులి వచ్చేసింది. మీరు కూడా మృత్యువు తప్పకుండా వస్తుంది, రానే వస్తుంది.......... ఇది విని మీరు ప్రతి రోజూ వినాశనము వస్తుంది వస్తుంది అని చెప్తూ ఉంటారు కానీ వినాశనము కానే కాదు అని ప్రపంచములోనివారు అంటారు, ఏదో ఒక రోజు వినాశనము తప్పకుండా అవుతుందని మీకు తెలుసు. దీనినే వారు కథగా చేసేశారు. వారి దోషము ఏమీ లేదని, కల్పక్రితము కూడా ఇదే జరిగిందని అనంతమైన తండ్రి చెప్తున్నారు. 5 వేల సంవత్సరాలనాటి విషయము, బాబా ఏమో అనేకసార్లు చెప్పారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా భారతదేశములో దేవీ దేవతా ధర్మ స్థాపన చేసేందుకు ఇటువంటి మ్యూజియము తెరిచామని కూడా మీరు వ్రాయండి. ఈ విషయాలు స్పష్టంగా వ్రాస్తే, అందరూ వచ్చి తెలుసుకుంటారు. బాబా వచ్చి ఉన్నారు. స్వర్గ చక్రవర్తి పదవి వారిచ్చే వారసత్వము. భారతదేశము స్వర్గముగా ఉండేది. మొట్టమొదట నూతన ప్రపంచములో నూతన భారతదేశము స్వర్గముగా ఉండేది. ఆ స్వర్గమే ఇప్పుడు నరకమైపోయింది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా, ఇందులో అందరూ పాత్రధారులే. 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు మళ్లీ మనము వాపస్ వెళ్తాము. మొదట మనము యజమానులుగా ఉండేవారము. తర్వాత నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ బాబా శ్రీమతమును అనుసరించి యజమానులుగా అవుతాము. మనము శ్రీమతమును అనుసరించి కల్ప-కల్పము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తామని మీకు తెలుసు. ఇందుకు తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రంగా అయ్యే కారణంగా అత్యాచారాలు జరుగుతాయి. బాబా పిల్లలకు ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ వెలుపలకు వెళ్తూనే తెలివిహీనులుగా అయిపోతారు, ఆశ్చర్యపడునట్లు వింటారు. వర్ణిస్తారు, జ్ఞానము ఇస్తారు. కానీ అహో నా మాయ! ఎలా ఉండేవారు అలాగే ఉండిపోతారు. అంతకంటే హీనంగా కూడా అయిపోతారు. కామ వికారానికి లోనై క్రిందపడిపోతారు. కామ వికారములో చిక్కుకొని క్రింద పడిపోతారు.
శివబాబా ఈ భారతదేశాన్ని శివాలయంగా చేస్తారు. దాని కొరకు పిల్లలు కూడా పురుషార్థము చేయాలి. ఈ అనంతమైన తండ్రి చాలా మధురమైన తండ్రి. ఈ మధురత అందరికీ తెలిస్తే లెక్క లేనంతమంది వచ్చేస్తారు, చదువుకోలేరు. చదువు కొరకు అయితే ఏకాంతము కావాలి. అమృతవేళ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తాము. స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? ఇదే చింత పట్టుకుని ఉంది. ఇదే ధ్యాసలో ఉండాలి. ఇప్పుడు పతితులుగా, నిరుపేదలుగా అయ్యారు మళ్లీ పావనంగా, కిరీటధారులుగా ఎలా అవ్వాలి? తండ్రి ఏమో అతి సులభంగా ఈ విషయాలు అర్థం చేయిస్తారు. గలాటాలు తప్పకుండా జరుగుతాయి. భయపడే విషయమేదీ లేదు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. వారు ధరించే దుస్తులు మొదలైనవి కూడా సాధారణమే. తేడా ఏమీ లేదు. సన్యాసులైతే ఇల్లు-వాకిళ్ళు వదిలి కాషాయ వస్త్రాలు ధరిస్తారు కానీ వీరు అదే దుస్తులు ధరిస్తారు. కేవలం వీరిలో తండ్రి ప్రవేశించారు. అంతే తప్ప ఇక ఏ విధమైన తేడా లేదు. ఎలాగైతే తండ్రి తన పిల్లలను ప్రేమతో సంభాళిస్తారో, పాలన పోషణ చేస్తారో, అలాగే ఈ తండ్రి కూడా అదే చేస్తారు. ఎలాంటి అహంకారము లేదు. చాలా సాధారణంగా గడుపుతారు. పోతే పిల్లలు ఉండేందుకు ఇల్లు కట్టించవలసి వచ్చింది. అది కూడా సాధారణమైనదే. మిమ్ములను చదివించేది అనంతమైన తండ్రి. ఈ తండ్రి గొప్ప అయస్కాంతము. తక్కువైనవారా! పిల్లలు పవిత్రంగా అయితే చాలా సుఖము లభిస్తుంది. వారు ఏదో శక్తి ఉంది అని అంటారు కానీ శక్తి అంటే ఏమో కూడా వారికి తెలియదు. తండ్రి సర్వశక్తివంతులు. వారు అందరినీ అదే విధంగా(తమ సమానంగా) చేస్తారు కానీ అందరూ ఒకే విధంగా అవ్వలేరు. అలా అయితే అందరి రూపురేఖలు కూడా ఒకే విధంగా(అచ్చుపోసినట్లు) అయిపోతాయి. పదవి కూడా అందరికీ ఒక్కటిగానే ఉంటుంది. ఇది తయారుచేయబడిన డ్రామా. 84 జన్మలలో మీకు మళ్లీ మళ్లీ అవే 84 రూపురేఖలు(ఫీచర్స్) కల్పక్రితము లభించినవే లభిస్తాయి. ఇక మీద కూడా మళ్లీ అవే ఫీచర్స్ లభిస్తాయి. ఇందులో ఎలాంటి వ్యత్యాసముండదు. ఇవన్నీ చాలా అర్థము చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. వినాశనమేమో తప్పకుండా జరగనున్నది. విశ్వములో శాంతి ఇప్పట్లో జరగదు. పరస్పరము యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మృత్యువు తల పై సిద్ధంగా ఉంది. డ్రామానుసారము ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనము జరగనున్నది. ఆటంబాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. పెద్ద పెద్ద రాళ్ళు క్రిందకు దొర్లుతాయి. వాటి వలన ఇండ్లు మొదలైనవన్నీ నేలమట్టమవుతాయి. ఎంత దృఢమైన భవనాలైనా, పునాది పక్కాగా నిర్మించినా ఏమీ మిగలవు. భూకంపాలకు కూడా ఈ భవనాలు పడవని వారు భావిస్తారు. కానీ ఎంత చేసినా 100 అంతస్థులు నిర్మించినా తప్పకుండా వినాశనమవుతాయి. ఇవేవీ ఉండవు.
పిల్లలైన మీరు స్వర్గ వారసత్వము పొందుకునేందుకు ఇక్కడకు వచ్చారు. విదేశాలలో ఏమేమి జరుగుతోందో గమనించండి. దీనిని రావణుని ఆడంబరము అని అంటారు. మాయ నేను కూడా తక్కువేమీ కాదు అని అంటుంది. అక్కడ మనకు వజ్రవైఢూర్యాల మహళ్ళుంటాయి. అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తుల భవనాలు నిర్మించే అవసరముండదు. భూమి కొరకు కూడా ఖర్చు చేయవలసిన పని ఉండదు. అన్నీ సిద్ధంగా లభిస్తాయి. కనుక పిల్లలు చాలా పురుషార్థము చేయాలి. అందరికీ సందేశమునివ్వాలి. మంచి-మంచి మార్గదర్శకులై రిఫ్రెష్(సేద తీర్చుకునేందుకు) పిల్లలు ఇక్కడకు వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మళ్లీ ఇలాగే వస్తారు. చాలా మంది వచ్చారు. వీరందరినీ మళ్లీ చూస్తానో లేదో తెలియదు. వీరందరూ నిలువగలరా లేదా? వచ్చేందుకేమో అనేకమంది వచ్చారు. ఆశ్చర్యపడునట్లు పారిపోయారు. బాబా మేము క్రింద పడిపోయామని వ్రాస్తారు. అరే! చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకొన్నారు! ఇప్పట్లో మళ్లీ అంత ఉన్నతికి పోలేరు. ఇది చాలా పెద్ద అవజ్ఞ(ఆజ్ఞను ఉల్లంఘించుట). ఆ ప్రభుత్వము వారు - ఫలానా సమయములో ఎవ్వరూ వెలుపలికి రాకూడదు, అలా వస్తే కాల్చేస్తాము అని ఆర్డినెన్స్ జారీ చేస్తారు అలాగే తండ్రి కూడా చెప్తున్నారు - వికారాలకు వశమైతే తుపాకి గుండ్లు తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది భగవంతుని ఆజ్ఞ కదా. ఖబర్దార్(హెచ్చరికగా)గా ఉండండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ రోజుల్లో విషవాయువులు మొదలైనవి అనేక పదార్థాలు ఎలాంటివి తయారయ్యాయంటే వాటి ద్వారా మానవులు అలా కూర్చునే క్షణములో సమాప్తమైపోతారు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఎందుకంటే చివర్లో ఆస్పత్రులు మొదలైనవి ఉండవు. ఆత్మ క్షణములో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దు:ఖము, క్లేశము మొదలైనవన్నీ తొలగిపోతాయి. అక్కడ క్లేశము మొదలైనవేవీ ఉండనే ఉండవు. ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. ఆయువు పూర్తి అవుతూనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అక్కడ కాలుడు లేక మృత్యువు ఉండదు. రావణుడే లేకుంటే మృత్యువు ఎక్కడ నుండి వస్తుంది. ఇక్కడ రావణ దూతలున్నారు. భగవంతుని దూతలు లేరు. భగవంతునికి పిల్లలంటే చాలా ప్రేమ తండ్రి ఎప్పుడూ పిల్లలు దు:ఖపడుతూ ఉంటే సహించలేరు. డ్రామానుసారము కల్పములో 3 భాగాలు మీరు సుఖంగా ఉంటారు. ఏ తండ్రి అయితే ఇంత సుఖమును ఇస్తారో వారి శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్తున్నారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. జన్మ-జన్మాంతరాల పాప భారము తల పై ఉంది. తమోప్రధానము నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి సర్వశక్తివంతులైన అథారిటీ. చాలామంది తాము ఏవైతే శాస్త్రాలు అధ్యయనము చేశారో, వాటికి అథారిటీగా భావించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అన్నిటికీ అథారిటీ నేనే అని చెప్తున్నారు. నేనే ఈ బ్రహ్మ ద్వారా వచ్చి సర్వ శాస్త్ర్రాల సారమును వినిపిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే పాపాలు నాశనమవుతాయి. అంతేకాని నీటిలో స్నానము చేస్తే పావనంగా ఎలా అవుతారు! దోసిలంత(చాలా తక్కువ) నీరు ఉన్నా దానిని తీర్థమని భావించి అందులో కూడా స్నానము చేస్తారు. దీనిని తమోప్రధాన నిశ్చయము అని అంటారు. కానీ మీకిప్పుడు సతోప్రధాన నిశ్చయముంది. ఇందులో భయపడే విషయమేదీ లేదని తండ్రి అర్థం చేయిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. భగవంతుడు పవిత్రంగా అవ్వమని ఏదైతే ఆజ్ఞాపించారో దానిని ఎప్పుడూ ఉల్లంఘించరాదు. చాలా చాలా ఖబర్దార్(హెచ్చరిక)గా ఉండాలి. బాప్దాదా ఇరువురి పాలనకు రిటర్న్గా (బదులుగా) పవిత్రంగా అయ్యి చూపించాలి.
2. డ్రామాలో నిర్ణయించిబడిన దానిని ఎవ్వరూ మార్చలేరు. ఇది తెలుసుకొని సదా నిశ్చింతగా ఉండాలి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి.
వరదానము :-
'''' బాబా '' శబ్ధ స్మృతి ద్వారా తలంపు మరియు సేవలో ఉండే సత్యమైన యోగీ, సత్యమైన సేవాధారీ భవ''
పిల్లలైన మీరు నోటి ద్వారా లేక మనసు ద్వారా పదే పదే బాబా అనే శబ్ధము గుర్తు చేసుకోవడం, లేక బాబా అని అనుకోవడమే యోగము. నోటి ద్వారా మాటిమాటికి బాబా ఇలా చెప్తున్నారు, బాబా ఇలా చెప్పారు అని అనడమే సేవ. కానీ ఈ బాబా అనే శబ్ధాన్ని కొంతమంది హృదయపూర్వకంగా అంటారు, కొంతమంది జ్ఞాన బుద్ధితో అంటారు. ఎవరైతే హృదయపూర్వకంగా అంటారో వారి హృదయంలో సదా ప్రత్యక్ష ప్రాప్తి రూపంలో సంతోషము మరియు శక్తి లభిస్తాయి. బుద్ధితో బాబా అని అనేవారికి ఆ సమయంలో మాత్రమే సంతోషము లభిస్తుంది, సదా కొరకు కాదు.
స్లోగన్ :-
''పరమాత్మ అనే దీపము పై బలి అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు''