30-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి సమానం దయా హృదయులుగా అవ్వండి, దయాహృదయులైన పిల్లలు అందరినీ దు:ఖముల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారుచేయు సేవ చేస్తారు ''

ప్రశ్న :-

ప్రపంచమంతటి కోరిక ఏమిటి? ఆ కోరికను తండ్రి తప్ప మరెవ్వరూ పూర్తి చేయలేరు ?

జవాబు :-

మొత్తం ప్రపంచమంతా శాంతి-సుఖము లభించాలని కోరుతూ ఉంది. పిల్లలందరి పిలుపు విని తండ్రి వస్తారు. బాబా అనంతమైనవారు. అందువలన దు:ఖితులుగా ఉన్న నా పిల్లలు, సుఖీలుగా ఎలా అవ్వాలి? అనే చింత వారికుంటుంది. బాబా చెప్తున్నారు - పిల్లలూ, పాత ప్రపంచము కూడా నాదే, పిల్లలందరూ నా వారే, నేను అందరిని దు:ఖము నుండి విడిపించేందుకు వచ్చాను. నేను ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని. కనుక దీనిని నేనే పతితము నుండి పావనంగా తయారు చేయాలి.

ఓంశాంతి.

తండ్రి పిల్లలను పావనంగా చేస్తున్నారు. అందువలన తండ్రిని చాలా ప్రేమించాలి. సోదరుల మధ్య(ఆత్మలు) పరస్పరము ప్రేమ కలిగి ఉండడము మంచిదే. ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరము సోదరులే. కానీ పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది. తండ్రి చెప్తున్నారు - '' పిల్లలూ! నన్ను ఒక్కరినే స్మృతి చేయండి.'' మీరు పరస్పరము సోదరులైనందున తప్పకుండా పాలు పంచదార వలె ఉంటారు. ఇది మంచిదే. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. ఆత్మలోనే ఇంత ప్రేమ ఉంటుంది. దేవతా పదవి ప్రాప్తి చేసుకునే మీకు పరస్పరము చాలా ప్రీతి ఉండాలి. మనము సోదరులుగా అవుతాము. తండ్రి నుండి వారసత్వము తీసుకుంటాము. తండ్రి వచ్చి మనకు నేర్పిస్తున్నారు. అర్థము చేసుకునేవారు ఇది పాఠశాల లేక పెద్ద విశ్వవిద్యాలయమని అర్థము చేసుకుంటారు. తండ్రి అందరికీ దృష్టినిస్తారు లేక అందరినీ స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రిని ప్రపంచములోని మానవాత్మలందరూ స్మృతి చేస్తారు. ఈ ప్రపంచమంతా ఆ తండ్రిదే. కొత్తదైనా, పాతదైనా అంతా ఆ తండ్రిదే. నూతన ప్రపంచము తండ్రిదైతే పాత ప్రపంచము కాదా? ఆ తండ్రి ఒక్కరే అందరినీ పావనంగా చేస్తారు. పాత ప్రపంచము కూడా నాదే. ఈ మొత్తము ప్రపంచానికి అధిపతిని నేనే. భలే నూతన ప్రపంచములో నేను రాజ్యము చేయను, అయినా అది కూడా నాదే కదా. నా పిల్లలు ఈ పెద్ద ఇంటిలో కూడా చాలా సుఖంగా ఉంటారు. తర్వాత దు:ఖము కూడా పొందుతారు. ఇది ఒక డ్రామా. ఈ మొత్తము అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు. ఇది ఒక పెద్ద రంగస్థలము కదా. ఇల్లంతా నా పిల్లలే ఉన్నారని తండ్రికి తెలుసు. ప్రపంచమంతటినీ బాబా చూస్తారు. అందరూ చైతన్యంగా ఉన్నారు. పిల్లలందరూ ఇప్పుడు దు:ఖములో ఉన్నారు. అందుకే ''బాబా ఈ దు:ఖమయ ఛీ-ఛీ ప్రపంచము నుండి శాంతి ప్రపంచములోకి తీసుకెళ్ళండి, ఓ శాంతిదేవా! రండి'' అని పిల్లలు పిలుస్తారు. తండ్రినే పిలుస్తారు. దేవతలను అలా పిలువరు. అందరికీ తండ్రి వారొక్కరే. వారికి ఈ మొత్తము సృష్టిని గురించిన చింత ఉంటుంది. ఇది అనంతమైన ఇల్లు, ఈ అనంతమైన ఇంటిలో అందరూ ఈ సమయములో దు:ఖితులై ఉన్నారని తండ్రికి తెలుసు. అందుకే శాంతిదేవా, సుఖదేవా! అని పిలుస్తూ ఉంటారు. రెండింటినీ కోరుతూ ఉంటారు కదా. మనము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వము తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి మనకు సుఖము, శాంతి రెండూ ఇస్తారు. సుఖ-శాంతులనిచ్చేవారు ఇతరులెవ్వరూ లేనే లేరు. తండ్రికే దయ కలుగుతుంది. వారు అనంతమైన తండ్రి. మనమంతా వారి పిల్లలము, పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు అపవిత్రమైనందున దు:ఖములో మునిగిపోయి ఉన్నాము. కామచితి పై కూర్చుని నల్లగా పతితులుగా అయిపోతారు. ముఖ్యమైన విషయము తండ్రిని మర్చిపోవడం. ఏ తండ్రి నుండి మీరు ఉన్నతపదవి పొందుతున్నారో ఆ తండ్రినే మర్చిపోతారు. మీరే తల్లి, తండ్రి అపార సుఖము ఇచ్చారని పాటలు కూడా పాడ్తారు కదా. ఇప్పుడు మళ్లీ మీరు సుఖమును తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అపార దు:ఖములో ఉన్నారు. ఇది తమోప్రధానమైన ప్రపంచము. విషయ సాగరములో మునుగుతూ ఉంటారు. కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఇప్పుడు మీకు వివేకము కలిగింది. ఇది రౌరవ నరకమని మీరు అర్థం చేసుకున్నారు.

తండ్రి పిల్లలను - ఇప్పుడు మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా? అని అడుగుతున్నారు. ఎవరైనా మరణిస్తే వెంటనే స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు. ఎందుకంటే అన్ని దు:ఖాల నుండి దూరమయ్యారు. మళ్లీ వారికి నరకములోని వస్తువులనే ఎందుకు తినిపిస్తారు? ఇది కూడా అర్థము చేసుకోరు. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు రాజయోగము నేర్పిస్తారు. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, నేను మీకు ఈ జ్ఞానము వినిపిస్తాను. ఈ జ్ఞానము నాలో మాత్రమే ఉంది. నేను జ్ఞానసాగరుడను. కొంతమంది ఈ శాస్త్రాలకు నేను అథారిటీ అని అంటారు. కానీ వారు కూడా ఆత్మలే కదా. ఇంతమాత్రము కూడా అర్థము చేసుకోరు. తండ్రి అడ్రస్సే తెలియదు. ఈ విశ్వానికి అథికారిగా తయారు చేసే తండ్రిని రాయి-రప్పలలో అన్నిటిలో ఉన్నారని అంటారు. వ్యాసభగవానుడు రకరకాల మాటలు వ్రాసేశారు. మనుష్యులకు ఏ మాత్రము తెలియదు. పూర్తిగా అనాథలైపోయారు. పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. రచయిత అయిన తండ్రిని గురించి, వారి రచనను గురించిన ఆదిమధ్యాంతములు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి తనను గురించి, తన రచనను గురించిన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. ఎవరినైతే ఈశ్వరుడు, భగవంతుడు, రచయిత అని అంటారో వారిని గురించి మీకు తెలుసా? అని ఎవరినైనా అడగండి. రాయి-రప్పలలో ఈశ్వరుడు ఉన్నాడని అనడమే వారిని తెలుసుకోవడమా? మొట్టమొదట స్వయాన్ని గురించి తెలుసుకోండి. మనుష్యులు తమోప్రధానంగా ఉన్నారు. అందుకే జంతువులు మొదలైనవి కూడా తమోప్రధానంగా ఉన్నాయి. మానవులు సతోప్రధానంగా ఉంటే అన్నీ సుఖవంతంగా అయిపోతాయి. మానవులు ఎలా ఉంటారో వారి ఫర్నీచరు కూడా అలాగే ఉంటుంది. ధనవంతుల ఫర్నీచరు కూడా చాలా బాగుంటుంది. మీరు చాలా సుఖప్రదంగా, విశ్వాధికారులుగా అవుతారు. కావున మీ వద్ద ఉన్న ప్రతి వస్తువు సుఖప్రదంగా ఉంటుంది. అక్కడ దు:ఖమునిచ్చే వస్తువేదీ ఉండదు. ఈ నరకము చాలా మురికి ప్రపంచము.

తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - భగవంతుడు ఒక్కరే. వారే పతితపావనులు, స్వర్గ స్థాపన చేస్తారు. దేవతల మహిమను కూడా సర్వ గుణ సంపన్నులు....... అని పాడుతూ ఉంటారు. మందిరాలకు వెళ్ళి దేవతలతో పోల్చుకొని తమను తాము నిందించుకుంటారు. ఎందుకంటే అందరూ భ్రష్ఠాచారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్ఠాచారులు, స్వర్గవాసులు. వారిని అందరూ పూజిస్తారు. సన్యాసులు కూడా పూజిస్తారు. సత్యయుగములో ఇలా జరగదు. మీ సన్యాసము అనంతమైనది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసమును చేయిస్తారు. వారిది హఠయోగము, హద్దు సన్యాసము. ఆ ధర్మమే వేరు. తండ్రి చెప్తున్నారు - మీరు మీ ధర్మమును మర్చిపోయి అనేక ధర్మాలలో చొచ్చుకొని పోయారు. భారతదేశము పేరును కూడా హిందూస్థానమని మార్చేశారు. వాస్తవానికి హిందూ ధర్మమును ఎవ్వరూ స్థాపించలేదు. ముఖ్యమైన ధర్మములుండేది నాలుగే - దేవీ దేవతా, ఇస్లామ్‌, బౌద్ధ, క్రైస్తవ. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమని, ఇందులో ఉండేది రావణ రాజ్యమని మీకు తెలుసు. రావణున్ని ఎవరైనా చూశారా? అతనిని మాటిమాటికి తగులబెడ్తారు ఎందుకంటే రావణుడు చాలా పాత శత్రువు. కానీ ఎందుకు తగులబెడ్తున్నారో కూడా తెలియదు. రావణుడెవరో తెలుసుకోవాలి కదా? ఎప్పటి నుండి కాలుస్తూ వచ్చారు? పరంపరము నుండి అని భావిస్తారు. దానికి కూడా ఏదో లెక్కాచారము ఉండాలి కదా. మిమ్ములను గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. మీరు బ్రహ్మ పిల్లలు. మీరు ఎవరి పిల్లలని ఎవరైనా అడుగుతారు? మేము బ్రహ్మకుమార -కుమారీలము, కావున బ్రహ్మ పిల్లలము కదా అని చెప్పండి. బ్రహ్మ ఎవరి కొడుకు? శివబాబా కొడుకు. మేము శివబాబాకు పౌత్రులము. ఆత్మలందరూ అతని సంతానమే. శరీరము ద్వారా మొదట బ్రాహ్మణులుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా. ఇంతమంది ప్రజలను ఎలా రచిస్తారో మీకు తెలుసు. ఇది దత్తు స్వీకారము. శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. జాతర కూడా జరుగుతుంది. వాస్తవానికి బ్రహ్మపుత్ర నది సముద్రములో కలియు చోట ఉత్సవము జరగాలి. ఆ సంగమ స్థానములో జాతర చేయాలి. ఈ కలయిక ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మ కూర్చుని ఉన్నాడు. ఈ బ్రహ్మ తండ్రి కూడా అయ్యారు, పెద్ద తల్లి కూడా అయ్యారు. కానీ పురుషుడైనందున మమ్మాను నిమిత్తంగా చేయడం జరిగింది. ఈ మాతలనందరినీ సంభాళన చేయమని మమ్మాకు అప్పగించారు. నేను మీకు సద్గతినిస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ దేవతలు డబుల్‌ అహింసకులు అని మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు. భక్తి ద్వారా రాత్రి, జ్ఞానము ద్వారా పగలు వస్తాయి. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. కానీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రే వచ్చి తన పిల్లలకు మాత్రమే అర్థము చేయిస్తారు. శివభగవానువాచ కదా. శివజయంతిని జరుపుకుంటారు. కావున తప్పకుండా ఎవరిలోనో వచ్చి ఉంటారు. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని అంటారు. నేను చిన్న బాలుని ఆధారమునేమీ తీసుకోను. కృష్ణుడు చిన్న బాలుడు కదా. నేను అతని అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా వానప్రస్థ అవస్థలో ప్ర్రవేశిస్తాను. వానప్రస్థ అవస్థ తర్వాతనే మానవులు భగవంతుని స్మృతి చేస్తారు. అయితే భగవంతుడెవరో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - యదా యదాహి ........... నేను భారదేశములోనే వస్తాను. భారతదేశపు మహిమ అపారమైనది.

మానవులకు దేహ అహంకారము ఎంత ఉందో చూడండి - నేను ఫలానా, నాకు ఈ పదవి ఉంది అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను దేహీ-అభిమానులుగా చేస్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని జ్ఞాన రహస్యాలన్నీ తెలిపిస్తున్నారు. ఇది పాత ప్రపంచము. సత్యయుగము నూతన ప్రపంచము. సత్యయుగములో ఆది సనాతన దేవీ దేవతా ధర్మమొక్కటే ఉండేది. ఇది 5 వేల సంవత్సరాల నాటి మాట. శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షలాది సంవత్సరాలని వ్రాసేశారు. వాస్తవానికి కల్పమంటే 5 వేల సంవత్సరాలు. మనుష్యులు పూర్తి అజ్ఞానములో, కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఇప్పుడు మీ మాటలు క్రొత్త వారెవరైనా వింటే వారికేమీ అర్థము కాదు. అందుకే చెప్తున్నారు - నేను నా పిల్లలతో మాత్రమే మాట్లాడ్తాను. భక్తిమార్గము కూడా మొదట మీరే ప్రారంభిస్తారు. మీకు మీరే చెంపదెబ్బలు వేసుకున్నారు. తండ్రి మిమ్ములను పూజ్యులుగా తయారుచేశారు. తర్వాత మీరు పూజారులుగా అవుతారు. ఇది కూడా డ్రామాయే. కొంతమంది మనుష్యులు సున్నిత హృదయము గలవారిగా ఉంటే నాటకము చూసి కూడా ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు. సత్యయుగములో ఏడ్చే మాటే ఉండదు. ఇక్కడ కూడా ఏడ్వరాదని తండ్రి చెప్తున్నారు. ద్వాపర కలియుగాలలో ఏడుస్తారు. సత్యయుగములో ఎప్పుడూ ఏడ్వరు. చివరిలో కనీసము ఏడ్చేందుకు కూడా ఫుర్సత్తు ఉండదు. అకస్మాత్తుగా మరణిస్తారు. అయ్యో రామ అని కూడా అనలేరు. కొంచెము కూడా దు:ఖ పడకుండా వినాశనమౌతుంది. ఎందుకంటే ఆస్పత్రులు మొదలైనవి ఉండనే ఉండవు. దాని కొరకు అటువంటి సామాగ్రిని తయారు చేస్తున్నారు. అందుకే తండ్రి చెప్తున్నారు - కోతులుగా ఉన్న మీ సైన్యమునే రావణుని పై విజయము పొందేందుకు నేను తీసుకుంటాను. ఇప్పుడు రావణున్ని ఎలా జయించాలో తండ్రి మీకు యుక్తి తెలుపుతున్నారు. సీతలందరినీ రావణుని సంకెళ్ళ నుండి విడిపించాలి. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. భగవానువాచ, తన పిల్లలకు మాత్రమే తండ్రి చెప్తున్నారు - చెడు వినకు,............. ఏ మాటల ద్వారా మీకు ఏ లాభమూ లేదో ఆ మాటలను వినకుండా మీ చెవులు మూసుకోండి. ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తూ ఉంది. మీరే శ్రేష్ఠంగా అవుతారు. ఇక్కడ అందరికీ శ్రీ శ్రీ అనే బిరుదు ఇచ్చేశారు. మంచిద.ే అయినా తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, ఇది ఎంతో అద్భుతమైన గెలుపు - ఓటముల అనంతమైన డ్రామా. దీనిని గురించి ఒక్క తండ్రి మాత్రమే అర్థము చేయిస్తారు. అచ్ఛా! మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి సమానంగా దయా హృదయులుగా అవ్వాలి. అందరినీ దు:ఖము నుండి విడిపించి పతితుల నుండి పావనంగా చేయు సేవ చేయాలి. పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రినే చాలా చాలా ప్రేమించాలి.

2. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని(జిన్‌ రోయా, తిన్‌ ఖోయా) తండ్రి చెప్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఏడ్వరాదు.

వరదానము :-

'' పరమ పూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమకు అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మా భవ ''

నేను పూజ్య ఆత్మను, ఈ శరీరమనే మందిరంలో విరాజమానమై ఉన్నాననే స్మృతిని సదా జీవితంలో తీసుకు రండి. ఇటువంటి పూజ్య ఆత్మలే అందరికీ ప్రియమైనవారు. వారి జడమూర్తులు కూడా అందరికీ ప్రియమనిపిస్తాయి. ఎవరైనా పరస్పరము కొట్లాడుకున్నా మూర్తిని(విగ్రహాన్ని) ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది. కనుక స్వయాన్ని - ''నా మనసు, బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా అయ్యిందా, కొంచెం కూడా అస్వచ్ఛత మిక్స్‌ అవ్వలేదు కదా?'' అని ప్రశ్నించుకోండి. ఎవరైతే ఇంత సంపూర్ణ స్వచ్ఛంగా ఉంటారో వారే పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు.

స్లోగన్‌ :-

'' జ్ఞాన ఖజానాలను స్వయంలో ధారణ చేసి ప్రతి సమయంలో ప్రతి కర్మను తెలివితో చేసేవారే జ్ఞానయుక్త ఆత్మలు ''