13-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీరు యోగబలము ద్వారా ఈ ఉప్పునీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి, కనుక ఎక్కడకు వెళ్ళాలో, ఆ లోకాన్ని స్మృతి చేయండి, ఇప్పుడు మేము ఫకీర్ల (నిరుపేదల) నుండి అమీరుల(ధనవంతులు)మవుతున్నామనే ఖుషీలో ఉండండి.''

ప్రశ్న :-

దైవీగుణాల సబ్జెక్టు పై ఏ పిల్లలకు గమనముంటుందో వారి గుర్తులు తెలపండి ?

జవాబు :-

మేము ఎలాంటి కర్మలు చేస్తామో, మమ్ములను చూసి ఇతరులు చేస్తారు అని వారి బుద్ధిలో ఉంటుంది. వారు ఎప్పుడూ, ఎవ్వరినీ సతాయించరు. వారి నోటి నుండి ఎప్పుడూ ఉల్టా - సుల్టా(తప్పుడు, వ్యర్థపు) మాటలు వెలువడవు. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమివ్వరు. తండ్రి సమానంగా సుఖాన్నిచ్చే లక్ష్యమే ఉంటుంది. ఇటువంటివారికే దైవీగుణాల సబ్జెక్టు పై గమనముందని అంటారు.

ఓంశాంతి.

ఇక్కడ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్మృతియాత్ర కూడా నేర్పిస్తున్నారు. స్మృతియాత్రకు అర్థమును కూడా పిల్లలు తెలుసుకుని ఉంటారు. భక్తిమార్గములో కూడా దేవతలందరినీ, శివబాబాను స్మృతి చేస్తారు. కానీ స్మృతి ద్వారా వికర్మలు వినాశమవుతాయని తెలియదు. బాబా పతితపావనులు, పావనంగా తయారు చేసే యుక్తులను వారు మాత్రమే తెలియజేస్తారని పిల్లలకు తెలుసు. ఆత్మనే పావనంగా అవ్వాలి ఎందుకంటే ఆత్మనే పతితంగా అవుతుంది, భారతదేశములోనే తండ్రి వచ్చి స్మృతియాత్ర నేర్పిస్తారు. ఇంకెక్కడా నేర్పించరని పిల్లలకు తెలుసు. శారీరిక యాత్రలైతే పిల్లలు చాలా చేశారు. ఈ యాత్ర కేవలం ఒక్క తండ్రి మాత్రమే నేర్పించగలరు. మాయ కారణంగా అందరి బుద్ధికి అవివేకమనే తాళము వేయబడిందని పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు మనము ఎంతో బుద్ధివంతులుగా, ధనవంతులుగా, పవిత్రంగా ఉండేవారిమని తండ్రి ద్వారా మీకు తెలిసింది. మనము మొత్తం విశ్వానికంతా అధికారులుగా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ అలా తయారవుతున్నాము. తండ్రి ఎంతో గొప్ప అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తారు. లౌకిక తండ్రి ఇస్తే, లక్ష రూపాయలో, కోటి రూపాయలో ఇస్తారు. ఇక్కడ మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. అందుకే మీరు ఇక్కడ చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు? అనంతమైన తండ్రి వద్దకు, బాబా అను పదము మమ్మా అను పదముకన్నా మధురమైనది. భలే మమ్మా పాలన చేస్తారు కానీ తండ్రి ఎంతైనా తండ్రియే. వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. మీరు సదా సుఖీలుగా, నిత్య సౌభాగ్యవంతులుగా అవుతున్నారు. బాబా మనలను మళ్లీ ఎలా తయారు చేస్తున్నారో చూడండి! ఇదేమీ క్రొత్త మాట కాదు. ఉదయము ధనవంతులుగా ఉండేవారు, రాత్రయ్యేసరికి పేదవారిగా అయిపోయారు........... (సుబహ్‌ కో అమీర్‌ థా, రాత్‌ కో ఫకీర్‌ థా............) అనే గాయనము కూడా ఉంది. మీరు కూడా ఉదయము ధనవంతులు మళ్లీ అనంతమైన రాత్రిలో పేదవారిగా అయిపోతారు. పిల్లలారా! నిన్న మీరు విశ్వాధికారులుగా, ధనవంతులుగా ఉండేవారు, ఈ రోజు మీరు ఫకీరులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఉదయము వస్తోంది. కనుక మీరు ధనవంతులుగా అవుతారని బాబా ప్రతి రోజు జ్ఞాపకము చేయిస్తున్నారు. ఇది ఎంత సహజమైన విషయము! మేము ధనవంతులుగా అవుతున్నామనే ఖుషీ పిల్లలైన మీలో చాలా ఉండాలి. బ్రాహ్మణుల పగలు - బ్రాహ్మణుల రాత్రి. పగలులో మీరు ధనవంతులుగా అవుతున్నారు, తప్పకుండా అవుతారు కూడా కానీ నంబరువారు పురుషార్థానుసారముగానే అవుతారు. ఇది యోగబలము ద్వారా మీరు మాత్రమే దాటగల ఉప్పునీటి కాలువ అని బాబా చెప్తున్నారు. ఎక్కడకు వెళ్ళాలో దాని స్మృతి ఉండాలి. మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మనలను తీసుకెెళ్లేందుకు బాబా స్వయంగా వచ్చారు. చాలా ప్రియంగా అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలారా! - మీరే పావనంగా ఉండేవారు, 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అయ్యారు, మళ్లీ మీరే పావనంగా అవ్వాలి. పావనంగా అయ్యేందుకు వేరే ఉపాయమేదీ లేదు. పతితపావనులు వస్తారు, వారి మతమును అనుసరించి మీరు పావనంగా అవుతారని మీకు తెలుసు. మేము ఇలాంటి(లక్ష్మీ-నారాయణుల) పదవి పొందుతామని పిల్లలైన మీకు చాలా ఖుషీ ఉంటుంది. 21 జన్మలకు మీరు సదా సుఖీలుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. తండ్రి సుఖధామ వారసత్వమును ఇస్తారు, రావణుడు దు:ఖధామ వారసత్వమును ఇస్తాడు. రావణుడు మా పాత శత్రువని, మమ్ములను పంచ వికారాలనే పంజరములో బంధించాడని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి రక్షించి వెలుపలికి తీస్తారు. తండ్రిని ఎవరు ఎంత స్మృతి చేస్తారో, వారు అంత ఇతరులకు కూడా తండ్రి పరిచయమును ఇస్తారు. స్మృతి చేయనివారు దేహాభిమానములో ఉంటారు. వారు తండ్రినీ స్మృతి చేయలేరు, బాబా పరిచయమునూ ఇవ్వలేరు. ఆత్మలైన మనము సోదరులము, భిన్న-భిన్నమైన పాత్రలను అభినయము చేసేందుకు ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము. పూర్తి పాత్ర అంతా ఎలా నడుస్తుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికి గట్టి నిశ్చయముంటుందో వారు ఇక్కడకు వచ్చి రిఫ్రెష్‌ అవుతారు. ఇది మీరు టీచరు జతలోనే ఉండి చదవవలసిన చదువు కాదు. మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదవవచ్చు. కేవలం ఒక వారము వచ్చి బాగా అర్థం చేసుకోండి. తర్వాత బ్రాహ్మణీలు కొందరిని ఒక్క మాసానికే, మరి కొందరిని 6 మాసాలకు, కొందరిని 12 మాసాల తర్వాత ఇచ్చటకు తీసుకొస్తారు. నిశ్చయము కలిగిన వెంటనే పరిగెత్తి వచ్చేస్తారని బాబా అంటారు.

మేము వికారాలకు వశము అవ్వమని రాఖీని కూడా కట్టుకోవాలి. మనము శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. శివబాబా చెప్తున్నారు - పిల్లలారా, మీరు తప్పకుండా నిర్వికారులుగా అవ్వాలి, ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లైతే, చేసుకున్న సంపాదంతా సమాప్తమైపోతుంది. నూరురెట్లు శిక్ష పడ్తుంది. 63 జన్మలుగా మీరు మోసపోయారు, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, మీ పాపాలు భస్మమవుతాయి. ఆత్మలంతా పరస్పరములో సోదరులు(ఆత్మ ఆత్మ భాయి - భాయి) ఎవరి నామ-రూపాలలో చిక్కుకోరాదు. ఎవరైనా ఒకవేళ రెగ్యులర్‌గా చదవడం లేదంటే, త్వరపడి వారిని ఇచ్చటకు తీసుకు రాకూడదు. భలే బాబా చెప్తారు - ఒక్క రోజులోనే బాణము తగులవచ్చు, కానీ వివేకముతో పని చేయాలి. బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉత్తమమైనవారు, మీది సర్వోన్నతమైన కులము, అక్కడ ఏ సత్సంగాలు మొదలైనవేవీ ఉండవు. సత్సంగాలు భక్తిమార్గములో ఉంటాయి. సత్యమైన సాంగత్యము రక్షిస్తుందని మీకు తెలుసు (సత్‌ కా సంగ్‌ తారే..........). సత్యయుగ స్థాపన ఎప్పుడు జరగవలసి ఉంటుందో అప్పుడు సత్యమైన సాంగత్యము లభిస్తుందని మీకు తెలుసు. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు ఎందుకంటే బుద్ధికి తాళము వేయబడి ఉంది. ఇప్పుడు సత్యయుగములోకి వెళ్ళాలి. ఈ సత్యమైన సాంగత్యము పురుషోత్తమ సంగమ యుగములో మాత్రమే లభిస్తుంది. ఆ గురువులు సంగమ యుగవాసులు కారు. బాబా ఎప్పుడు వస్తారో, అప్పుడు బేటా బేటా అని పిలుస్తారు. ఆ గురువులను మీరు బాబా అని పిలువరు. పూర్తిగా బుద్ధికి గోద్రెజ్‌ తాళము వేయబడి ఉంది, బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. మనుష్యులు వజ్ర సమాన జీవితమును తయారు చేసుకునేందుకు బాబా ఎన్ని యుక్తులు రచించారో వచ్చి చూడండి. మ్యాగ్జెన్‌(పత్రిక)లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణము జరిగినప్పుడు అనేకుల నుండి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ప్రజలను తయారు చేసుకునే పురుషార్థము చేయాలి. స్వయాన్ని బంధన ముక్తులుగా చేసుకోవాలి. శరీర నిర్వహణార్థము సర్వీసు కూడా తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయము, సాయంకాలము మాత్రమే ఉంటుంది. ఆ సమయములో అందరికీ ఫుర్సత్తు ఉంటుంది. ఎవరి జతలో మీరు లౌకిక సేవ చేస్తారో, వారికి కూడా ఇద్దరు తండ్రుల పరిచయము ఇస్తూ ఉండండి. లౌకిక తండ్రి అందరికీ వేరుగా ఉంటారు, పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారే సుప్రీమ్‌(పరమాత్మ), నా పాత్ర కూడా ఉందని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు ఇప్పుడు నా పరిచయమును తెలుసుకున్నారు. ఆత్మను కూడా మీరు తెలుసుకున్నారు. భృకుటి మధ్యలో మెరుస్తున్న ఆద్భుతమైన నక్షత్రము.......... అని ఆత్మ గురించి చెప్తారు. భృకుటిని '' అకాల సింహాసనము'' (అకాల్‌ తక్త్‌) అని కూడా అంటారు. ఆత్మను ఎప్పుడూ మృత్యువు కబళించలేదు. అది కేవలం మలినంగా మరియు స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది. ఆత్మ సింహాసనము భృకుటి మధ్యలో శోభిస్తుంది. తిలకము గుర్తును కూడా ఈ స్థానములోనే చూపిస్తారు. మిమ్ములను మీరే రాజతిలకమునకు యోగ్యులుగా తయారు చేసుకోండి అని బాబా చెప్తున్నారు. నేను అందరికీ రాజతిలకమును ఇస్తానని కాదు, మీకు మీరే ఇచ్చుకోండి. ఎక్కువ సర్వీసు ఎవరు చేస్తారో బాబాకు తెలుసు. మ్యాగజైన్‌లో కూడా చాలా మంచి లేఖలు వస్తాయి. జతజతలో మీ వికర్మలు వినాశనమయ్యేందుకు యోగం చేసే శ్రమ కూడా చేయవలసి ఉంటుంది. రోజురోజుకు మీరు మంచి రాజయోగులుగా అవుతూ ఉంటారు, ఇప్పుడు శరీరము వదిలి వెళ్ళిపోవలసి వస్తుందని అర్థం చేసుకుంటారు. సూక్ష్మవతనము వరకు పిల్లలు వెళ్తారు. మూలవతనము ఆత్మలైన మన ఇల్లు అని కూడా బాగా తెలుసుకున్నారు. మనుష్యులు శాంతిధామము కొరకే భక్తి చేస్తారు. సుఖధామము గురించి వారికి తెలియనే తెలియదు. స్వర్గములోకి వెళ్లేందుకు శిక్షణ బాబా తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ప్రవృత్తి మార్గము. ఇరువురూ(పతి, పత్ని) ముక్తిధామానికి వెళ్ళాలి. వారు ఉల్టా(వ్యతిరేక) మార్గమును చూపిస్తారు. ఎవ్వరూ వెళ్ళలేరు. చివరి సమయములో బాబా అందరినీ తీసుకెళ్తారు. ఇది వారి కర్తవ్యము. కొందరు బాగా చదువుకొని రాజ్యభాగ్యమును తీసుకుంటారు. మిగిలినవారంతా ఎలా చదవగలరు? వారు నంబరువారుగా ఎలా వస్తారో, అలాగే నంబరువారుగా వెళ్తారు. ఈ విషయాల పై ఎక్కువ సమయమును వ్యర్థము చేయకండి.

కొందరు బాబాను స్మృతి చేసేందుకు కూడా సమయము దొరకదని చెప్తారు. అటువంటప్పుడు ఈ మాటలలో సమయము ఎందుకు వ్యర్థము చేస్తారు? తండ్రి అనంతమైన తండ్రియే కాక టీచరు, గురువు కూడా అయ్యారనే నిశ్చయము మీకు ఉంది. కావున ఇతరులెవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరము మీకు ఉండదు. కల్పక్రితము కూడా శ్రీమతానుసారము నడచుకుని పావనమయ్యామని మీకు తెలుసు. ఘడియ ఘడియ చక్రమును కూడా త్రిప్పుతూ ఉండండి. మీ పేరు స్వదర్శన చక్రధారులు. (బావిలోని నీటిని చేంతాడుతో తోడుకునే చక్రము) జ్ఞానసాగరుని నుండి నింపుకునేందుకు మీకు ఎక్కువ సమయము పట్టదు, కానీ ఖాళీ చేసుకునేందుకు చాలా సమయము పడ్తుంది. మీరు మధురమైన అపురూపమైన పిల్లలు ఎందుకంటే కల్పము తర్వాత వచ్చి కలిశారు. ఈ పక్కా నిశ్చయము మీకు అవసరము - మనము '' 84 జన్మల తర్వాత మళ్లీ వచ్చి తండ్రితో కలిశాము.'' మొట్టమొదట ఎవరు భక్తి చేశారో, వారే మొట్టమొదట జ్ఞానము తీసుకునేందుకు కూడా యోగ్యులుగా అవుతారు ఎందుకంటే భక్తికి ఫలము కావాలి కదా అని బాబా చెప్తున్నారు. అందువలన సదా మీ ఫలమును లేక వారసత్వమును స్మృతి చేస్తూ ఉండండి. ఫలము అనే శబ్ధము భక్తిమార్గానికి చెందినది, వారసత్వము(జ్ఞాన మార్గ శబ్ధము) సరియైనది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వము లభిస్తుంది. అందుకు ఏ ఇతర ఉపాయమూ లేదు. భారతదేశ ప్రాచీనయోగము ప్రసిద్ధమైనది, భారతదేశపు ప్రాచీన యోగమును నేర్చుకున్నామని వారు భావిస్తారు. డ్రామానుసారము వారు హఠయోగులుగా అవుతారని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడిది సంగమ యుగము. వారి(సన్యాసుల) ధర్మము వేరు. వాస్తవానికి వారు గురువులను ఆశ్రయించరాదు కానీ డ్రామానుసారము తప్పకుండా గురువులను చేసుకుంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు ధర్మసమ్మతముగా అవ్వాలి. ఎందుకంటే ధర్మములోనే శక్తి(రిలీజన్‌ ఈజ్‌ మైట్‌) ఉంది. మిమ్ములను నేను ఏ దేవీదేవతలుగా తయారు చేస్తానో, ఆ దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిస్తుంది. నాతో ఎవరు యోగమును జోడిస్తారో, వారికి నా శక్తి కూడా లభిస్తుంది కనుక తండ్రి స్వయంగా ఏ ధర్మమును స్థాపిస్తారో, అందులో చాలా శక్తి ఉంది. మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. ఈ ధర్మములో చాలా శక్తి ఉందని తండ్రి మహిమ చేస్తారు. సర్వశక్తివంతులైన బాబా నుండి అనేకమందికి శక్తి లభిస్తుంది. వాస్తవానికి శక్తి అందరికి లభిస్తుంది కానీ నంబరువారుగా లభిస్తుంది. మీకు ఎంత కావాలో అంత శక్తిని బాబా నుండి తీసుకోండి. అంతేకాక దైవీ గుణాల సబ్జెక్టు కూడా అవసరము. ఎవరిని కూడా విసిగించరాదు, దు:ఖపరచరాదు. ఇతడు(బ్రహ్మాబాబా) ఎవ్వరి గురించి కూడా, ఎప్పుడూ ఉల్టా - సుల్టా శబ్ధము అనలేదు. నేను ఎలాంటి కర్మ చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారని తెలుసు. ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి రావాలి. మేము ఎవ్వరికీ దు:ఖము ఇవ్వడం లేదు కదా? అని గమనించుకుంటూ ఉండాలి. ఎవ్వరికీ దు:ఖమును ఇవ్వనివారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఏవో కొన్ని తప్పులు తప్పకుండా జరుగుతాయి. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దు:ఖమివ్వని ఆ స్థితి చివరి సమయములో వస్తుంది. ఇప్పుడు మనము పురుషార్థీ స్థితిలో ఉన్నాము. ప్రతి విషయము నంబరువారు పురుషార్థానుసారంగా జరుగుతుంది. అందరూ సుఖము కొరకే పురుషార్థము చేస్తారు కానీ సుఖమును ఇచ్చువారు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. సోమనాథ మందిరములో ఎన్ని వజ్రవైడూర్యాలు పొదగబడి ఉండేవి! అవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి! ఎలా ఐశ్వర్యవంతులుగా అయ్యారు అని గమనించబడ్తుంది. రోజంతా ఈ చదువును గురించిన చింతనలోనే ఉండాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మీరు ఇటువంటి పురుషార్థము చేశారు అందుకే మాల తయారయ్యింది. కల్పకల్పము తయారవుతూ ఉంటుంది. మాల ఎవరి స్మృతిచిహ్నమో మీకు తెలుసు. వారు మాలను స్మరణ చేసి చాలా తన్మయత్వము పొందుతారు. భక్తిలో ఏం జరిగేది? జ్ఞానములో ఏం జరిగేది - ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మీరు ఇతరులెవ్వరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థము చేస్తూ చేస్తూ చివరి సమయములో చివరి రిజల్టు కల్పక్రితము వలె వెలువడ్తుంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మేము ఇలా అవ్వాలని మీరు అనుకుంటారు. పురుషార్థము చేసేందుకు అవకాశము లభించింది. నంబరువారు పురుషార్థానుసారము బాబా కూడా మిమ్ములను స్వాగతము చేస్తారు. పిల్లలైన మీరు ఎలా స్వాగతము చేస్తారో, దాని కంటే ఎక్కువగా బాబా మిమ్ములను స్వాగతము చేస్తారు. మిమ్ములను స్వాగతము చేయుటే బాబా యొక్క కర్తవ్యము. స్వాగతము అనగా సద్గతి. ఇది సర్వ శ్రేష్ఠమైన స్వాగతము. మిమ్ములనందరినీ ఆహ్వానించేందుకు తండ్రి వచ్చారు. అచ్ఛా! మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అనేమంది నుండి ఆశీర్వాదాలు పొందేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తున్నా స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని ఉదయము, సాయంకాలము తప్పకుండా ఈశ్వరీయ సేవ చేయాలి.

2. ఇతర విషయాలలో మీ సమయాన్ని వ్యర్థము చేయకుండా తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకోవాలి. సత్యమైన సాంగత్యములోనే ఉండాలి. మనసా-వాచా-కర్మణా అందరికీ సుఖమునిచ్చే పురుషార్థమే చేయాలి.

వరదానము :-

''హద్దు కోరికలను వదిలి అచ్ఛా(మంచిగా)గా అయ్యే ఇచ్ఛా మాత్రం అవిద్యా భవ (కోరిక అంటే ఏమో తెలియని వారిగా అవ్వండి)''

మనసులో ఏదైనా హద్దు కోరిక ఉంటే అది మంచిగా కానివ్వదు. ఎండలో నడుస్తున్నప్పుడు మీ నీడ మీ కంటే ముందు వెళ్తుంది. ఆ నీడను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పట్టుకోలేరు, వెనుకకు తిరిగి వచ్చేస్తే నీడ మీ వెనుకే వస్తుంది. అలాగే కోరిక మిమ్ములను ఆకర్షించి ఏడిపించేది, దానిని వదిలేస్తే అది మీ వెనుకే వస్తుంది. అడుక్కునేవారు ఎప్పుడూ సంపన్నంగా అవ్వలేరు. ఏదైనా హద్దు కోరికల వెంట పరుగెత్తడం, ఎండమావుల వెంట పరుగెత్తడం వంటిది. దీని నుండి సదా రక్షింపబడి ఉంటే ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవుతారు అనగా కోరిక అంటే తెలియనివారిగా అవుతారు.

స్లోగన్‌ :-

''మీ శ్రేష్ఠ కర్మలు లేక శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకుంటే పర్వతమంతటి విషయం కూడా దూది సమానంగా అనుభవమవుతుంది''