01-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీ మోహపు నరాలు(బంధనాలు) ఇప్పుడు తెగిపోవాలి, ఎందుకంటే ఈ ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది. ఈ పురాతన ప్రపంచములోని ఏ వస్తువు పైనా ఆసక్తి ఉండరాదు''

ప్రశ్న :-

ఏ పిల్లలకైతే ఆత్మిక మస్తీ(నషా) ఎక్కి ఉంటుందో, వారి టైటిల్‌(బిరుదు) ఏమిటి? ఏ పిల్లలకు నషా ఎక్కుతుంది ?

జవాబు :-

ఆత్మిక మస్తీలో ఉండే పిల్లలను '' మస్త్‌కలందర్‌(ఆనంద డోలికల్లో ఊగుతున్న యోగి)'' అని అంటారు. వారే ''నెమలి పించధారి(తల పై నెమలి పింఛమును ధరించినవారు/కలంగీధర్‌)'' గా అవుతారు. వారికి రాజ్యభాగ్యపు నషా ఎక్కి ఉంటుంది. ఇప్పుడు మేము ''ఫకీరుల (పేదవారి)'' నుండి ''అమీరులు(ధనవంతులు)''గా అవుతామని బుద్ధిలో ఉంటుంది. రుద్రమాలలో కూర్చబడే వారికే నషా ఎక్కుతుంది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్లాలని, తర్వాత నూతన ప్రపంచములోకి రావాలనే నిశ్చయము ఉండే పిల్లలకే నషా ఎక్కి ఉంటుంది.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. దీనిని ''ఆత్మల కొరకు ఆత్మిక జ్ఞానము'' అని అంటారు. ఆత్మ జ్ఞాన సాగరము, మనుష్యులు ఎప్పటికీ జ్ఞానసాగరులుగా అవ్వలేరు. ''మనుష్యులు భక్తి సాగరులు''. అందరూ మనుష్యులే. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు జ్ఞాన సాగరుని నుండి జ్ఞానము తీసుకొని ''మాస్టర్‌ జ్ఞాన సాగరులుగా'' అవుతారు. ఆ తర్వాత దేవతలలో భక్తీ ఉండదు, జ్ఞానమూ ఉండదు. దేవతలకు ఈ జ్ఞానము తెలియదు. జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే, అందుకే వారిని వజ్రము వంటి వారని అంటారు. వారే వచ్చి గవ్వ తుల్యముగా ఉన్న వారిని వజ్రములాగా, రాతి బుద్ధి గలవారి నుండి పారసబుద్ధి గలవారిగా తయారు చేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. దేవతలే మళ్లీ వచ్చి మనుష్యులుగా అవుతారు. శ్రీమతము ద్వారానే దేవతలుగా అయ్యారు. ఇక అర్ధకల్పము పాటు అక్కడ ఎవ్వరి మతమూ అవసరముండదు. ఇక్కడైతే అనేకమంది గురువుల మతమును తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సద్గురువు నుండి శ్రీమతము లభిస్తుందని తండ్రి అర్థం చేయించారు. ఖాల్సే(సిక్కు ధర్మానికి చెందిన ఒక తెగ) ప్రజలు ' సద్గురు అకాల్‌ ' అని అంటారు. దాని అర్థము కూడా వారికి తెలియదు. సద్గురు అకాలమూర్త్‌ అని పిలుస్తారు అనగా సద్గతినిచ్చే అకాలమూర్తి అని అర్థము. అకాలమూర్తి అని పరమపిత పరమాత్మనే అంటారు. సద్గురువు మరియు గురువులకు రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. అందుకే వారు బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అన్నప్పుడు తప్పకుండా బ్రహ్మ పునర్జన్మ తీసుకుంటారని బాబా అంటారు. బ్రహ్మయే ఈ దేవత(విష్ణువు)గా అవుతాడు. మీరు శివబాబాను మహిమ చేస్తారు. వారిది వజ్ర తుల్యమైన జన్మ.

ఇప్పుడు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పావనంగా అవుతారు. మీరు పవిత్రమై మళ్లీ ఈ జ్ఞానమును ధారణ చేయాలి. కుమారీలకైతే ఏ బంధనమూ లేదు. వారికి కేవలం మాత-పిత లేక సోదర-సోదరీల స్మృతి ఉంటుంది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత రెండు పరివారములవుతాయి. అశరీరులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు. ఇప్పుడు మీరందరూ వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా అయ్యేందుకు మీకు యుక్తిని కూడా తెలియజేస్తాను. నేనే పతిత-పావనుడను, మీరు నన్ను స్మృతి చేసినట్లైతే ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ-జన్మాంతరాల పాపము భస్మమైపోతుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎలాగైతే పాత బంగారాన్ని అగ్నిలో వేసినందున దానిలోని మలినము తొలగిపోయి సత్యమైన బంగారము మిగిలిపోతుందో అలా ఇది కూడా యోగాగ్ని. ఈ సంగమ యుగములోనే బాబా ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే వారికి చాలా మహిమ ఉంది. ఏ రాజయోగమును భగవంతుడు నేర్పించారో, దానిని అందరూ నేర్చుకోవాలనుకుంటారు. విదేశాల నుండి కూడా సన్యాసులు చాలామందిని తీసుకొస్తారు. ఆ సన్యాసులను చూచి వీరు సన్యాసము తీసుకున్నారని విదేశీయులు భావిస్తారు. ఇప్పుడు మీరు కూడా సన్యాసులే కాని బేహద్‌ సన్యాసమును గురించి ఎవ్వరికీ తెలియదు. బేహద్‌ సన్యాసమును ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఈ పురాతన ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ ప్రపంచములోని ఏ వస్తువు పట్ల కూడా మీకు ఆసక్తి ఉండదు. ఫలానావారు శరీరాన్ని వదిలారంటే వెళ్లి ఇంకొక చోట పాత్రను అభినయించేందుకు మరొక శరీరాన్ని తీసుకుంటారు. కనుక మనము ఎందుకు ఏడ్వాలి! మోహపు నరాలు తొలగిపోతాయి. మన సంబంధము ఇప్పుడు కొత్త ప్రపంచముతో జోడింపబడి ఉంది. ఈ విధమైన పిల్లలు దృఢమైన మస్త్‌ కలంగీధర్‌(నెమలి పించధారులు)గా అవుతారు. మీలో రాజ్యభాగ్యపు నషా ఉంది. బాబాలో కూడా ''నేను వెళ్లి నెమలి పింఛధారుడు(కృష్ణుడు)గా అవుతాను, ఫకీరు నుండి అమీరుగా అవుతాను'' అని నషా ఉండేది కదా! లోలోపల నషా ఎక్కి ఉంది, అందువల్లనే అటువంటి వారిని మస్త్‌కలంధర్‌(ఆనంద డోలికల్లో ఊగుతున్న యోగి) అని అంటారు. ఇతడు సాక్షాత్కారమును కూడా పొందుతాడు. ఎలాగైతే ఇతనికి నషా ఎక్కి ఉందో, అలా మీకు కూడా నషా ఎక్కాలి. మీరు కూడా రుద్రమాలలో కూర్చబడేవారు. ఎవరికి దృఢమైన నిశ్చయముంటుందో వారికి నషా ఎక్కుతుంది. ఆత్మలమైన మనము ఇప్పుడు ఇంటికి వెళ్లి మళ్లీ కొత్త ప్రపంచములోకి వస్తాము. ఈ నిశ్చయముతో ఎవరైనా ఇతడిని చూసినట్లైతే, వారికి చిన్న బాలుడు(శ్రీకృష్ణుడు) కనిపిస్తాడు. ఎంతో శోభాయమానంగా ఉంటాడు. కృష్ణుడైతే ఇక్కడ లేడు. అతనిని గురించి చాలా వాదోపవాదాలు జరుగుతాయి. ఊయలను తయారు చేస్తారు. అతనికి పాలు తాపిస్తారు అయితే అవి జడ చిత్రాలు, కాని వీరు నిజమైన కృష్ణుడిగా అయ్యేవారు కదా. నేను వెళ్లి బాలునిగా(శ్రీ కృష్ణునిగా) అవుతానని ఇతనికి కూడా నషా ఉంది. పిల్లలైన మీరు కూడా దివ్యదృష్టిలో చిన్న బాలుని చూస్తారు. ఈ కళ్ళ ద్వారా అయితే చూడలేరు. ఆత్మకు దివ్య దృష్టి లభించినప్పుడు శరీర భ్రాంతి ఉండదు. ఆ సమయములో స్వయాన్ని మహారాణిగా మరియు అతడిని బాలునిగా భావిస్తారు. ఈ సమయములో ఈ సాక్షాత్కారాలు కూడా చాలామందికి జరుగుతాయి. శ్వేత వస్త్రధారి సాక్షాత్కారము కూడా చాలామందికి జరుగుతుంది. మీరు ఇతని వద్దకు వెళ్లి జ్ఞానాన్ని తీసుకుంటే ఇటువంటి రాజకుమారునిగా అవుతారని చెప్తారు. ఇది గారడి కదా. మంచి వ్యాపారము కూడా చేస్తారు. గవ్వలను తీసుకొని వజ్రాలు, ముత్యాలు ఇస్తారు. మీరు వజ్ర సమానంగా అవుతారు. శివబాబా మిమ్ములను వజ్ర సమానంగా చేస్తారు. అందువల్ల బలిహారి(సమర్పణ/త్యాగము) వారిదే. మనుష్యులు అర్థము చేసుకోని కారణంగా గారడి, గారడి అని అంటూ ఉంటారు. ఎవరైతే ఆశ్చర్యముగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్లిపోతారో వారు వెళ్లి ఏవేవో వ్యతిరేక మాటలు వినిపిస్తారు. ఈ విధంగా చాలామంది ద్రోహులుగా అవుతారు. ఇలా ద్రోహులుగా అయ్యేవారు ఉన్నతపదవి పొందలేరు. వారిని గురించి గురువుకు నింద కలుగజేయు వారికి నిలువస్థానము దొరకదని అంటారు. వీరు సత్యమైన తండ్రి కదా. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థము చేసుకున్నారు. వారు యుగయుగానికి వస్తారని మనుష్యులంటారు. అచ్ఛా! నాలుగు యుగాలున్నాయి మరి 24 అవతారాలని ఎలా చెప్తారు? మరొకవైపు ''రాళ్ళు-రప్పలు, కణ-కణములో పరమాత్ముడున్నాడు'' అని అంటారు అనగా అందరూ పరమాత్మలే అయిపోయినట్లు కదా. తండ్రి చెప్తున్నారు - నేను గవ్వల నుండి వజ్రాలుగా మిమ్ములను తయారుచేసేవాడిని, నన్ను మీరు రాళ్లు-రప్పలలోకి తోసేశారు. సర్వవ్యాపి అంటే అన్నింటిలో ఉన్నట్లు అనగా ఇక ఏమీ విలువలేనట్లే. నాకు ఎలా అపకారము చేస్తున్నారో చూడండి! ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉందని బాబా చెప్తారు. ఈ విధంగా తయారై పోయినప్పుడే తండ్రి వచ్చి ఉపకారము చేస్తారు అనగా మనుష్యులను దేవతలుగా చేస్తారు.

ప్రపంచ చరిత్ర-భూగోళాలు మళ్లీ పునరావృతమవుతాయి. సత్యయుగములో మళ్లీ ఈ లక్ష్మీనారాయణులే వస్తారు. అక్కడ కేవలం భారతదేశము మాత్రమే ఉంటుంది. ప్రారంభములో చాలా కొద్దిమంది దేవతలు మాత్రమే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ 5000 సంవత్సరాలలో ఎంత ఎక్కువ జనాభా అయ్యిందో చూడండి! ఇప్పుడు ఈ జ్ఞానము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. మిగిలినదంతా భక్తి, దేవతల చిత్రాల మహిమను పాడుతారే కాని వారు చైతన్యములో ఉండేవారని, తర్వాత ఎక్కడికెళ్ళారని గాని అర్థం చేసుకోరు. చిత్రాలను పూజిస్తున్నారు కాని వారు ఎక్కడున్నారు? వారు కూడా తమోప్రధానంగా అయ్యి మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. ఇది ఎవరి బుద్ధికీ తోచదు. ఈ విధమైన తమోప్రధానంగా ఉన్న బుద్ధిని మళ్లీ సతోప్రధానంగా తయారుచేయడం తండ్రి కర్తవ్యమే. ఈ లక్ష్మీనారాయణులు ఉండి వెళ్ళిపోయారు అనగా గతంలో ఉండేవారు, అందువల్లనే వారికి మహిమ ఉంది. సర్వోన్నతుడు ఒక్క భగవంతుడే. మిగిలిన వారంతా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. సర్వోన్నతమైన తండ్రియే సర్వులకు ముక్తి-జీవన్ముక్తిని ఇస్తారు. ఒకవేళ తండ్రి రాకుంటే ఇంకనూ పైసకు కొరగాని వారిగా(వర్త్‌ నాట్‌ ఎ పెన్నీ) తమోప్రధానంగా అయిపోయి ఉండేవారు. వీరు(లక్ష్మీనారాయణులు) రాజ్యము చేయునప్పుడు అత్యంత విలువైనవారి(వర్త్‌ పౌండ్‌)గా ఉండేవారు. అక్కడ ఎవ్వరూ పూజలు మొదలైనవేవీ చేసేవారు కాదు. పూజ్య దేవీ దేవతలే పూజారులుగా అయ్యారు. వామమార్గములోకి వెళ్లి వికారులుగా తయారైపోయారు. వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలను గురించి బ్రాహ్మణులైన మీలో కూడా నెంబరువారుగానే అర్థం చేసుకున్నారు. స్వయమే సరిగ్గా అర్థం చేసుకోలేదంటే ఇక ఇతరులకెలా అర్థం చేయించగలరు? పేరేమో బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. ఒకవేళ అర్థం చేయించలేకపోతే ఇంకా ఎక్కువగా నష్టము కలుగజేస్తారు. అటువంటి సమయములో మీరు ఎవరికి అర్థం చేయిస్తున్నారో వారితో ఇలా యుక్తిగా చెప్పండి - మేము మా పెద్ద సోదరిని పిలుస్తాము, వారు మీకు సరిగ్గా అర్థం చేయిస్తారు. భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడు గవ్వ తుల్యంగా ఉంది. నిరుపేద భారతదేశాన్ని తలమానికంగా, శిరోధార్యంగా ఎవరు తయారు చేస్తారు? లక్ష్మీనారాయణులు ఇప్పుడు ఎక్కడున్నారు? లెక్క చెప్పండి? అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. వారు భక్తిసాగరులు. వారికి అదే నషా ఎక్కి ఉంది. మీరు జ్ఞాన సాగరులు. వారైతే శాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు. శాస్త్రాలలో భక్తి సాంప్రదాయ - పద్ధతులున్నాయని తండ్రి చెప్తున్నారు. మీలో ఎంతెంత జ్ఞాన శక్తి నిండుతూ పోతుందో అంత మీరు అయస్కాంతము వలె తయారవుతారు. ఇప్పుడు అందరూ మీ వైపు ఆకర్షింపబడ్తారు. ఇప్పుడు ఆ ఆకర్షణ లేదు. అయినా యథా యోగము, యథా శక్తులనుసారము ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది. సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారని కాదు. అలాగైతే ఈ శరీరము కూడా ఉండదు. ఇప్పుడు ఇంకా అనేక మందికి సందేశమునివ్వాలి. సందేశకులుగా అవ్వాలి. పిల్లలైన మీరే సందేశకులుగా అవుతారు. ఇంకెవ్వరూ అవ్వరు. క్రీస్తు మొదలైనవారు వచ్చి ధర్మస్థాపన చేస్తారు. వారిని సందేశకులని అనరు. కేవలం క్రిష్టియన్‌ ధర్మమును స్థాపన చేశారే కాని ఇంకేమీ చేయలేదు. క్రీస్తు ఆత్మ వేరే ఒకరి శరీరములో వచ్చింది. తర్వాత అతని వెనుక మిగిలినవారు వస్తారు. ఇక్కడైతే మీ రాజధాని స్థాపనవుతూ ఉంది. ముందు ముందు మీరు ఏమేమిగా అవుతారో, ఏ ఏ వికర్మలు చేశారో మీ అందరికీ సాక్షాత్కారమవుతుంది. సాక్షాత్కారాలు అవ్వడంలో ఆలస్యమేమీ కాదు. కాశీలోని కత్తుల బావిలో దూకి శివుడికి అర్పణమయ్యేవారు. అప్పుడు ఒక్కసారిగా నిలబడి బావిలోకి దూకేవారు. ఇప్పుడు ప్రభుత్వము వారు ఆ బావిని మూసేశారు. ఆ విధంగా అర్పణయ్యేవారు, తాము ముక్తిని పొందుతామని భావిస్తారు. ఎవ్వరూ ముక్తి పొందలేరని తండ్రి చెప్తున్నారు. కొద్ది సమయములోనే అనేక జన్మల శిక్షలు లభించినట్లవుతుంది. తర్వాత మళ్లీ కొత్త లెక్కాచారము ప్రారంభమవుతుంది. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. వెళ్లి ఎక్కడ ఉంటారు? ఆత్మల వంశ వృక్షమే చెడిపోతుంది. నెంబరువారుగా వస్తారు మళ్లీ వెళ్తారు. పిల్లలకు సాక్షాత్కారము జరుగుతుంది. అప్పుడే వారు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. 84 జన్మల పూర్తి సృష్టి చక్ర ఆది-మధ్య-అంత్యముల జ్ఞానమంతా మీకు లభించింది. మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. కొందరు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కొందరు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఎవ్వరూ 100 మార్కులు పొందలేరు. 100 శాతమైతే ఒక్క తండ్రివే. ఆ విధంగా ఇంకెవ్వరూ తయారవ్వలేరు. కొంచెం కొంచెం వ్యత్యాసము ఏర్పడ్తుంది. ఒకే విధంగా కూడా అవ్వలేరు. లెక్కలేనంతమంది మనుష్యులున్నారు. అందరి రూపు రేఖలు వేరు వేరుగా ఉంటాయి. ఆత్మలన్నీ ఎంతో సూక్ష్మమైన బిందువులే. మనుష్యులు ఎంతో పెద్ద పెద్దగా ఉంటారు. కాని ఒకరి రూపురేఖలు మరొకరితో కలువవు. ఎన్ని ఆత్మలు ఉన్నాయో అన్నే మళ్లీ ఇంటిలో కూడా ఉంటాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇందులో ఏ మాత్రము వ్యత్యాసము ఉండదు. ఒకసారి ఏది చిత్రీకరించబడుతుందో అదే మళ్లీ చూస్తారు. 5000 సంవత్సరాల క్రితము కూడా మేము ఇలా కలిసి ఉండేవారమని మీరంటారు. ఒక్క సెకండు కూడా తక్కువ-ఎక్కువ కాదు. ఇది నాటకము కదా! ఎవరి బుద్ధిలో ఈ రచయిత-రచనల జ్ఞానము ఉంటుందో వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. తండ్రి నుండే ఈ జ్ఞానము లభిస్తుంది. మనుష్యులు మనుష్యులకు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. మనుష్యులు భక్తిని నేర్పిస్తారు. జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. మళ్లీ మీరు జ్ఞాన నదులుగా అవుతారు. జ్ఞానసాగరుడు, జ్ఞాన నదుల ద్వారానే ముక్తి-జీవన్ముక్తులు లభిస్తాయి. అవేమో నీటి నదులు. నీరు ఎప్పటికీ ఉండనే ఉంది. జ్ఞానము సంగమ యుగములో మాత్రమే లభిస్తుంది. నీటి నదులైతే భారతదేశములో ప్రవహిస్తూనే ఉంటాయి. మిగిలిన పట్టణాలన్నీ సమాప్తమైపోతాయి. ఏ ఖండాలూ ఉండవు. వర్షము కురుస్తూనే ఉంటుంది. నీరు వెళ్లి నీటిలో కలుస్తుంది. ఈ భారతదేశమే ఉంటుంది.

ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఇది జ్ఞానము, మిగిలినదంతా భక్తి. వజ్ర సమానమైనవారు ఒక్క శివబాబాయే. వారి జయంతి జరుపుతారు. శివబాబా ఏమి చేశారు? అని ప్రశ్నించాలి. వారు వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారు. ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము వినిపిస్తారు. అందుకే జ్ఞానసూర్యుడు ప్రగటితమైనప్పుడు అజ్ఞాన అంధకారము తొలగిపోతుంది........ అని గాయనము చేయబడి ఉంది. జ్ఞానము ద్వారా పగలు(సత్యయుగము), భక్తి ద్వారా రాత్రి (ద్వాపర, కలియుగాలు) అవుతాయి. ఇప్పుడు మీరు మీ 84 జన్మలను పూర్తి చేశారని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయడం ద్వారా పావనంగా అవుతారు. మళ్లీ శరీరము కూడా పావనమైనదే లభిస్తుంది. మీరందరూ నెంబరువారుగా పావనంగా అవుతారు. ఎంత సహజమైన విషయము! ముఖ్యమైన విషయము స్మృతి. చాలామందికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం కూడా రాదు. కాని తండ్రికి పిల్లలైనందున స్వర్గములోకి తప్పకుండా వస్తారు. ఈ సమయములోని పురుషార్థానుసారముగా రాజ్య స్థాపన జరుగుతుంది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మేము మాస్టర్‌ జ్ఞానసాగరులము అనే నషాలో సదా ఉండాలి. స్వయములో జ్ఞాన శక్తిని నింపుకొని అయస్కాంతముగా అవ్వాలి. ఆత్మిక సందేశకులుగా అవ్వాలి.

2. సద్గురు తండ్రి పేరుకు అప్రతిష్ఠ కలుగజేసే కర్మలేవీ చేయరాదు. ఏమి జరిగినా, ఎప్పుడూ ఏడ్వరాదు.

వరదానము :-

''జ్ఞానముతో పాటు గుణాలను ఎమర్జ్‌ చేసి (ఉత్పన్నము చేసి) సంపన్నంగా అయ్యే గుణమూర్త్‌ భవ''

జ్ఞానము ప్రతి ఒక్కరిలో చాలా ఉంది. కాని ఇప్పుడు గుణాలను ఎమర్జ్‌ చేసే అవసరం ఉంది. అందువలన విశేషమైన కర్మల ద్వారా గుణదాతలుగా అవ్వండి. నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా చేసే కర్తవ్యములో తత్పరులై ఉండాలని సంకల్పము చేయండి. తద్వారా వ్యర్థాన్ని చూచే, వినే లేక చేసే ఫుర్సత్తు లభించదు. ఈ విధానం ద్వారా స్వయంలోని లేక సర్వులలోని బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. కనుక ఇందులో ప్రతి ఒక్కరు స్వయాన్ని నంబరువన్‌గా భావించి సర్వగుణ సంపన్నంగా అయ్యే, ఇతరులను తయారుచేసే ఉదాహరణంగా అవ్వండి.

స్లోగన్‌ :-

''మనసు ద్వారా యోగదానము, వాచా ద్వారా జ్ఞాన దానము, కర్మల ద్వారా గుణాల దానము చేయండి.''