22-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - పరస్పరములో మీరందరూ ఆత్మిక సోదరులు, మీ మధ్య ఆత్మిక ప్రేమ ఉండాలి. ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి, శరీరముతో ఉండరాదు ''

ప్రశ్న :-

తండ్రి మన ఇంటిని గురించి ఏ అద్భుతమైన విషయము వినిపించారు ?

జవాబు :-

నా ఇంటికి వచ్చే ఆత్మలన్నీ అవి తమ-తమ సెక్షన్లలో వారి నెంబరులో స్థితమై(ఫిక్స్‌) ఉంటాయి. ఆ నంబరు ఎప్పుడూ కదలదు, మారదు. అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి. అక్కడ నుండి నంబరువారుగా తమ తమ సమయానుసారము పాత్రలు అభినయించేందుకు వస్తాయి. ఈ అద్భుతమైన జ్ఞానము కల్పములో ఈ సమయములోనే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు.

ఓంశాంతి.

తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మలకు తండ్రినని తండ్రి కూడా భావిస్తారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించరు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ చెప్పరు. ఈ విషయం తండ్రి ఒక్కరే కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ జ్ఞాన ప్రాలబ్ధాన్ని మీరు నూతన ప్రపంచములో నంబరువారు పురుషార్థానుసారముగా తీసుకుంటారు. ఈ ప్రపంచము పరివర్తన చెందుతుందని అలా పరివర్తన చేయువారు తండ్రి అని కూడా వారికి తెలియదు. ఇక్కడ వారు సన్ముఖములో కూర్చుని ఉన్నారు. ఇంటికి వెళ్తే రోజంతా మీ వృత్తి వ్యాపారాదులలో నిమగ్నమైపోతారు. పిల్లలూ! ఎక్కడ ఉన్నా మీరు నన్ను స్మృతి చేయమని తండ్రి శ్రీమతమునిచ్చారు. కన్యకు తన పతిగా ఎవరు లభిస్తారో తెలియదు కానీ చిత్రము చూస్తూనే వారి స్మృతి అలాగే నిలిచిపోతుంది. ఎక్కడ ఉన్నా ఒకరినొకరు పరస్పరము స్మృతి చేసుకుంటూ ఉంటారు. దీనిని శారీరిక ప్రేమ అని అంటారు కానీ మీది ఆత్మిక ప్రేమ. ఆత్మిక ప్రేమ ఎవరితో ఉంది? పిల్లల ఆత్మిక తండ్రితో. అంతేకాక పిల్లలకు పిల్లలతో కూడా ప్రేమ ఉంది. పిల్లలైన మీకు పరస్పరములో కూడా చాలా ప్రేమ ఉండాలి అనగా ఆత్మలకు ఆత్మలతో కూడా ప్రేమ ఉండాలి. ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ప్రపంచములోని మనుష్యులకు దీనిని గురించి కొంచెం కూడా తెలియదు. మీరంతా పరస్పరము సోదరులు(భాయి-భాయి). అందువలన మీ మధ్య తప్పకుండా ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఒకే తండ్రి పిల్లలు కదా, దీనినే ఆత్మిక ప్రేమ అని అంటారు. డ్రామా ప్లాను అనుసారము కేవలం పురుషోత్తమ సంగమ యుగములోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు సన్ముఖములో అర్థం చేయిస్తారు. అలాగే తండ్రి ఇక్కడకు వచ్చారని పిల్లలకు తెలుసు. పిల్లలైన మనలను సుగంధపుష్పాలుగా, పవిత్రంగా, పతితుల నుండి పావనంగా చేసి తమ వెంట తీసుకెళ్తారు. అలాగని వారు చేయి పట్టుకుని తీసుకెళ్లరు. మిడుతల దండు వలె ఆత్మలన్నీ ఎగిరిపోతాయి. వాటికి కూడా ఒక గైడు ఉంటుంది. ఆ గైడుతో పాటు ముందు ఇతర గైడ్లు (మార్గదర్శకులు) కూడా మరికొన్ని ఉంటాయి. గుంపు అంతా కలిసి వెళ్లునప్పుడు చాలా శబ్ధము వస్తుంది. ఆ గుంపు సూర్యరశ్మిని కూడా మూసేస్తాయి. అంత పెద్ద గుంపు ఉంటుంది. ఆత్మలైన మీది కూడా చాలా పెద్ద లెక్కించలేనంత గుంపు ఉంటుంది. ఎప్పుడూ లెక్కపెట్టలేరు. ఇక్కడ మానవుల సంఖ్య కూడా లెక్కించలేరు. భలే జనాభా లెక్కను తీస్తారు కానీ అది ఖచ్ఛితమైనది కాదు. ఎంతమంది ఆత్మలున్నారో అది ఎప్పుడు లెక్క తేలేది కాదు. సత్యయుగములో ఎంతమంది మనుష్యులుంటారో సుమారుగా చెప్పవచ్చు ఎందుకంటే సత్యయుగములో కేవలం భారతదేశము ఒక్కటే మిగిలి ఉంటుంది. ఈ విశ్వానికి అధిపతులుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ శరీరములో ఉన్నప్పుడు జీవాత్మ అని అంటారు. అందువలన రెండూ కలిసి సుఖము లేక దుఃఖమును అనుభవిస్తాయి. ఆత్మయే పరమాత్మ అని చాలా మంది భావిస్తారు. అది ఎప్పుడూ దుఃఖము అనుభవించదని, నిర్లేపమని అనుకుంటారు. చాలామంది పిల్లలు మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నాము. కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలని తికమకపడ్తారు. తండ్రి పరంధామ నివాసి అని మీకు తెలుసు. తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు. ఎక్కడ నడుస్తున్నా, తిరుగుతున్నా తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఉండేది పరంధామములో, ఆత్మలైన మీరు కూడా అక్కడనే ఉండేవారు. మళ్లీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభించింది.

మీరు దేవతలుగా ఉన్నప్పుడు అక్కడ ఫలానా ఫలానా ధర్మానికి చెందిన ఆత్మలు పైన ఉన్నాయని వారికి గుర్తుండదు. పై నుండి ఇక్కడకు వచ్చి శరీర ధారణ చేసి పాత్ర చేస్తారనే చింతన కూడా అక్కడ వారికి నడవదు. తండ్రి కూడా పరంధామములో ఉంటారని అక్కడ నుండి ఇక్కడకు వచ్చి శరీరములో ప్రవేశిస్తారని ఇంతకు ముందు మీకు తెలియదు. ఇప్పుడు వారు ఏ శరీరములో ప్రవేశిస్తారో వారి చిరునామా అంతా తెలుపుతున్నారు. మీరు ఒకవేళ శివబాబా, కేరాఫ్‌ పరంధామమని వ్రాస్తే పరంధామానికి మీ జాబు చేరదు. కావున శివబాబా, ష/శీ బ్రహ్మ( కేరాఫ్‌ బ్రహ్మ ) అని వ్రాసి ఇక్కడి చిరునామా వ్రాస్తారు. ఎందుకంటే తండ్రి ఇక్కడకే వస్తారని, ఈ రథములో ప్రవేశిస్తారని మీకు తెలుసు. వాస్తవానికి ఆత్మలు కూడా ఉపరి భాగములో ఉండేవి. మీరంతా సోదరులు. వీరు ఆత్మ అని, వీరి పేరు ఫలానా అని సదా భావిస్తూ ఉండండి. ఆత్మను ఇక్కడ(భృకుటి మధ్య) చూస్తారు. కానీ మనుష్యులు దేహాభిమానములోకి వచ్చేస్తారు. తండ్రి దేహీ-అభిమానులుగా చేస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు పిల్లలకు జ్ఞానము కూడా ఇస్తానని ఇప్పుడు అందరికీ తెలుపుతున్నారు. పాత శరీరమును తీసుకున్నాను. అందులో ముఖ్యమైనది ఈ నోరు. కనులు కూడా ఉన్నాయి కానీ జ్ఞానామృతము నోటి ద్వారా లభిస్త్తుంది. గోముఖము అని అంటారు కదా కనుక ఇది మాత యొక్క ముఖము. పెద్ద మాత(బ్రహ్మ) ద్వారా మిమ్ములను దత్తత చేసుకుంటారు. ఎవరు?(శివబాబా) వారు ఇక్కడ ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. నేను మిమ్ములను ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను. అందువలన ఈ బ్రహ్మ మాత కూడా అవుతారు. మీరు మాతా-పితలు, మేము మీ బాలకులమని(తుమ్‌ మాత్‌ పితా హమ్‌ బాలక్‌ తేరే..........) మహిమ కూడా చేస్తారు. కావున వారు సర్వాత్మలకు తండ్రి. వారిని తల్లి అని అనరు. వారు కేవలం తండ్రి మాత్రమే. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మళ్లీ తల్లి కూడా కావాలి. వారు ఇక్కడకు వస్తారు. తండ్రి పైన ఉంటారని ఇప్పుడు మీకు తెలిసింది. ఆత్మలైన మనము కూడా పైననే ఉండేవారము. ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తాము. ప్రపంచానికి ఈ విషయాల గురించి కొంచెం కూడా తెలియదు. వారు రాయి, రప్పలలో పరమాత్మ ఉన్నారని అనేస్తారు. అప్పుడు ఎంతమంది పరమాత్మలుంటారు? లెక్కలేనంతమంది అవుతారు కదా. దీనిని గాఢాంధకారమని అంటారు. జ్ఞానసూర్యుడు ప్రకటమవుతూనే అజ్ఞానాంధకారము వినాశనమవుతుందని మహిమ కూడా ఉంది. ఇది రావణ రాజ్యమని ఈ సమయములో మీకు జ్ఞానముంది. అందువల్లనే అంధకారముందని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడైతే రావణరాజ్యము ఉండదు. అందుకే అక్కడ ఎలాంటి వికారము ఉండదు. దేహాభిమానము కూడా ఉండదు. అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు చిన్న బాలుడను, ఇప్పుడు యువకుడను, ఇప్పుడు శరీరము వృద్ధాప్యమయ్యిందని ఆత్మకు తెలుస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ శరీరమును వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకు తెలుస్తుంది. అక్కడ ఫలానావారు మరణించారని అనరు. అది అమరలోకము. సంతోషంగా ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడు ఆయువు పూర్తి అయ్యిందని దీనిని వదిలి కొత్తది తీసుకోవాలని భావిస్తారు. అందుకే సన్యాసులు సర్పమును ఉదాహరణంగా ఇస్తారు. వాస్తవానికి ఈ ఉదాహరణ తండ్రి ఇచ్చిందే. దానిని సన్యాసులు తమదిగా తెలుపుకుంటారు. అందుకే నేను ఇచ్చే జ్ఞానము తర్వాత ప్రాయః లోపమవుతుందని తండ్రి తెలుపుతున్నారు. తండ్రి తెలిపిన వాక్యాలు, వాటి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది. అందుకే తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు - సర్పము ఎలాగైతే పాత తొడుగును వదిలేస్తుందో వదిలిన వెంటనే క్రొత్త తొడుగును ధరిస్తుంది. కానీ సర్పము కొరకు - ఒక శరీరము వదిలి మరో శరీరములో ప్రవేశిస్తుందని చెప్పరు. తొడుగును మార్చుకోవడం ఒక్క సర్పానికి మాత్రమే చెల్లుతుంది. ఆ తొడుగు కళ్లకు కూడా కనిపిస్తుంది. వస్త్రాలు వదిలేసినట్లు సర్పాలు కూడా తొడుగును వదిలేస్తాయి. దానికి మరొకటి లభిస్తుంది. సర్పమైతే బ్రతికే ఉంటుంది అయితే సదా అమరంగా ఉంటుందని కూడా కాదు. 2-3 తొడుగులు మార్చుకున్న తర్వాత అదీ మరణిస్తుంది. అక్కడ కూడా సమయానికి మీరు ఒక శరీరమును వదిలి మరో శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మేము గర్భములో ప్రవేశించాలని అక్కడ మీకు తెలుస్తుంది. అది యోగబలపు విషయము. యోగబలము ద్వారా మీరు జన్మిస్తారు. అందుకే అమరులని అంటారు. ఇప్పుడు నేను వృద్ధుడనైనానని, శరీరము పాతదైపోయిందని ఆత్మ అంటుంది. ఇప్పుడు నేను వెళ్లి చిన్న బాలునిగా అవుతానని సాక్షాత్కారమవుతుంది. దానంతకదే శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్లి చిన్న బిడ్డలో ప్రవేశిస్తుంది. అక్కడ గర్భమును జైలు అని అనరు, మహల్‌ అని అంటారు. అనుభవించేందుకు అక్కడ పాపాలు జరగవు. గర్భమహలులో సుఖంగా ఉంటారు. దుఃఖమనే మాటే ఉండదు. రోగగ్రస్థులుగా చేసే ఎటువంటి ఎలాంటి అశుద్ధమైన వస్తువును తినిపించరు.

ఇప్పుడు తండ్రి అంటున్నారు - '' పిల్లలూ! మీరు నిర్వాణధామంలోకి వెళ్లాలి. ఈ ప్రపంచము పరివర్తన అవ్వనున్నది.'' పాతదాని నుండి మళ్లీ కొత్తదిగా అవుతుంది. ప్రతి వస్తువు మారిపోతుంది. వృక్షము నుండి విత్తనము వస్తుంది, ఆ విత్తనాన్ని నాటితే మళ్లీ దానితో ఎన్నో ఫలాలు లభిస్తాయి. ఒక్క బీజము నుండి ఎన్నో విత్తనాలు వెలువడ్తాయి. సత్యయుగములో యోగబలము ద్వారా ఒకే బాలుడు జన్మిస్తాడు. ఇక్కడ వికారాల ద్వారా 4-5 మంది పిల్లలను కంటారు. సత్యయుగానికి, కలియుగానికి చాలా తేడా ఉంది. దానిని గురించి తండ్రి విపులంగా తెలుపుతున్నారు. నూతన ప్రపంచము మళ్లీ పాతదిగా ఎలా అవుతుందో అందులో ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుందో కూడా తండ్రి అర్థం చేయించారు. ప్రతి ఆత్మ తమ తమ పాత్రను అభినయించి వాపసు వెళ్లినప్పుడు తమ తమ స్థానాలలో వెళ్లి నిల్చిపోతాయి. ఆ స్థానము మారదు. తమ తమ ధర్మాలలో, తమ స్థానాలలో నంబరువారుగా నిలుస్తాయి. మళ్లీ నంబరువారుగానే క్రిందకు రావాలి. అందుకే మూలవతనంలో చిన్న-చిన్న నమూనాలను తయారుచేసి ఉంచుతారు. అన్ని ధర్మాలవారికి వారి వారి సెక్షన్లు ప్రత్యేకంగా ఉన్నాయి. మొదటిది దేవీదేవతా ధర్మానికి చెందినవారు, తర్వాత నంబరువారుగా వస్తారు. నంబరువారుగానే వెళ్లి ఉంటారు. మీరు కూడా నంబరువారుగా పాస్‌ అవుతారు. ఈ మార్కులు అనుసారంగానే స్థానము తీసుకుంటారు. ఈ తండ్రి చదివించే ఈ చదువు కల్పములో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఆత్మలైన మీ వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ మీ వృక్షము చాలా పెద్దది. పిల్లలైన మీరు దివ్యదృష్టి ద్వారా చూచి ఇక్కడ కూర్చుని ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు. ఆత్మ చాలా చిన్నది, శరీరము చాలా పెద్దది. ఆత్మలన్నీ అక్కడకు వెళ్లి కూర్చుంటాయి. చాలా కొద్ది స్థానములో సమీపంగా వెళ్లి ఉంటారు. మానవ వృక్షము చాలా పెద్దది. మానవులు నడిచేందుకు, తిరిగేందుకు, ఆడుకునేందుకు, చదివేందుకు, ఉద్యోగము చేసేందుకు స్థలము కావాలి కదా. అన్ని పనులు చేసేందుకు స్థలము అవసరము. నిరాకార ప్రపంచములో ఆత్మలకు చాలా చిన్న స్థలముంటుంది. అందుకే చిత్రాలలో కూడా అలాగే చూపించారు. ఇది తయారైన నాటకము. శరీరాలు వదిలిన తర్వాత ఆత్మలన్నీ అక్కడికే వెళ్ళాలి. పిల్లలైన మీ బుద్ధిలో అక్కడ మనమెలా ఉంటామో, ఇతర ధర్మాల వారు ఎలా ఉంటారో మళ్లీ నంబరువారుగా ఎలా విడిపోతారో ఈ విషయాలన్నీ కల్ప-కల్పము ఒక్క తండ్రి మాత్రమే వచ్చి వినిపిస్తారు. మిగిలినదంతా శారీరిక చదువు. దానిని ఆత్మిక చదువు అని అనజాలరు.

ఇప్పుడు మనమంతా ఆత్మలమని మీకు తెలుసు. ''ఐ'' అనగా నేను ఆత్మను ''మై'' అనగా నాది. ఈ శరీరము నాది. మనుష్యులకు ఈ విషయము తెలియదు. వారు సదా దేహ సంబంధములోనే ఉంటారు. సత్యయుగములో కూడా దేహ సంబంధముంటుంది. కానీ అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. నేను ఆత్మనని, ఇప్పుడు నా శరీరానికి వృద్ధాప్యము వచ్చిందని, అందువలన ఈ శరీరమును వదిలి మరొక శరీరము తీసుకుంటామని అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇందులో ఏ తికమకపడే విషయమేదీ లేదు. పిల్లలైన మీరైతే తండ్రి నుండి రాజ్యము తీసుకోవాలి. వారు అనంతమైన తండ్రి కదా. జ్ఞానము పూర్తిగా అర్థము చేసుకోనంతవరకు మనుష్యులు అనేక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. బ్రాహ్మణులైన మీకు జ్ఞానము తెలుసు. వాస్తవములో అజ్మీరులో బ్రాహ్మణుల మందిరము కూడా ఉంది. బ్రాహ్మణులు రెండు రకాలు. మొదటి రకము వారు పుష్కరిణి బ్రాహ్మణులు. రెండవ రకము సారసిద్ధ బ్రాహ్మణులు. బ్రహ్మ మందిరాన్ని చూచేందుకు అజ్మీరుకు వెళ్తారు. మందిరములో బ్రహ్మ కూర్చొని ఉన్నాడు, గడ్డము మొదలైనవి కూడా చూపించారు. అతడిని మనుష్య రూపములో చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూడా మనుష్య రూపములోనే ఉన్నారు. బ్రాహ్మణులను దేవతలని అనరు. బ్రహ్మ సంతానమైన మీరే సత్య సత్యమైన బ్రాహ్మణులు. వారు బ్రహ్మ సంతానము కాదు. తర్వాత వచ్చేవారికి ఈ విషయాలు తెలియవు. ఇది మీ విరాట రూపము. ఇది బుద్ధిలో గుర్తుండాలి. ఈ జ్ఞానమంతా మీరు ఎవరికైనా బాగా అర్థము చేయించవచ్చు. మనము ఆత్మలము, తండ్రికి పిల్లలము, దీనిని యధార్థంగా అర్థము చేసుకొని పక్కా నిశ్చయము చేసుకోవాలి. ఇది యదార్థమైన విషయము, సర్వ ఆత్మల తండ్రి ఒక్క పరమాత్మయే. అందరూ వారినే స్మృతి చేస్తారు. '' ఓ భగవంతుడా! '' అని మానవుల నోటి నుండి తప్పకుండా వెలువడ్తుంది. పరమాత్మ ఎవరో తండ్రి వచ్చి తెలిపింతవరకు ఎవ్వరికీ తెలియదు. విశ్వానికి అధికారులుగా ఉండే లక్ష్మీనారాయణులకే తెలియకుంటే ఋషులు - మునులు ఎలా తెలుసుకోగలరు! ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఆస్తికులు. మిగిలినవారంతా నాస్తికులు. ఎందుకంటే మీకు రచయిత, రచనల ఆది-మధ్య-అంత్యములు తెలుసు. కొంతమందికి బాగా తెలుసు, కొంతమందికి తక్కువగా తెలుసు. తండ్రి సన్ముఖములో వచ్చి చదివిస్తారు. కొంతమంది బాగా ధారణ చేస్తారు. కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. ఈ చదువు చాలా సరళమైనది, గొప్పది కూడా. తండ్రిలో ఎంత అనంతమైన జ్ఞానముందంటే సముద్రాన్ని ఇంకుగా(సిరాగా) చేసుకొని వ్రాసినా అంతము కాదు. తండ్రి సరళము చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని తెలుసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇంత మాత్రము చాలు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. నడుస్తూ, తిరుగుతూ సదా స్మృతి సహజంగా ఉండేందుకు నేను ఒక ఆత్మను, పరంధామ నివాసిని, పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చానని చింతన చేయాలి. తండ్రి కూడా పరంధామములో ఉంటారు, వారు ఇప్పుడు బ్రహ్మ శరీరములో వచ్చారని చింతన చేస్తూ ఉండాలి.

2. ఆత్మిక తండ్రి పై ఆత్మకు ఎలా ప్రీతి కలదో, అలా పరస్పరము కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి కానీ శరీరముతో ఉండరాదు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసము చేయాలి.

వరదానము :-

'' పవిత్రమైన ప్రేమతో పాలన చేయుట ద్వారా అందరినీ స్నేహ సూత్రములో బంధించే మాస్టర్‌ స్నేహసాగర భవ ''

స్నేహసాగరుడు మరియు స్నేహ సంపన్న నదులు కలిసినప్పుడు నదులు కూడా తండ్రి సమానం మాస్టర్‌ స్నేహ సాగరులుగా అవుతారు. అందువలన విశ్వములోని ఆత్మలు స్నేహాన్ని అనుభవం చేయుట వలన స్వతహాగా సమీపానికి వస్తారు. పవిత్రమైన ప్రేమ లేక ఈశ్వరీయ పరివారము యొక్క పాలన అయస్కాంతము వలె ప్రతి ఒక్కరినీ స్వతహాగా సమీపంగా తీసుకొస్తుంది. ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్లే సూత్రములో బంధిస్తుంది.

స్లోగన్‌ :-

'' సంకల్పము, మాట, సమయము, గుణము మరియు శక్తుల ఖజానాలను జమ చేసుకుంటే, వీటి సహయోగము లభిస్తూ ఉంటుంది. ''