29-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీరు శాంతి-సుఖముల శిఖరము పైకి వెళ్లాలి, కావున మీ స్వభావము, నడవడికలను సరిదిద్దుకుంటూ ఉండండి. పాతవాటిని పరివర్తన చేసుకోండి.''

ప్రశ్న :-

బుద్ధి సదా రిఫ్రెష్‌గా ఉండేందుకు యుక్తి ఏది?

జవాబు :-

బాబా ఏదైతే వినిపిస్తారో దానిని మథనము చేయండి. విచార సాగర మథనము చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్‌ అయిపోతుంది. ఎవరైతే సదా రిఫ్రెష్‌గా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలరు. వారి బ్యాటరి సదా చార్జ్‌ అవుతూ ఉంటుంది ఎందుకంటే విచార సాగర మథనము చేయడము ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో సంబంధము జోడింపబడి ఉంటుంది.

పాట :-

నయన హీనులకు దారి చూపించు ప్రభూ! .........(నయన్‌హీన్‌ కో రాహ్‌దిఖావో ప్రభూ...........)

ఓంశాంతి.

ఈ పాట కూడా మనుష్యులచే గానం చేయబడిందే. కాని దాని అర్థము వారికి తెలియదు. ఎలాగైతే ఇతర ప్రార్థనలు చేస్తారో అలాగే ఇది కూడా ఒక ప్రార్థన వంటిది. కాని వారికి పరమాత్మను గురించి తెలియదు. పరమాత్మను గురించి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లే. కేవలం పరమాత్మ అని అనేస్తారు కాని వారి జీవితాన్ని గురించి ఏమీ తెలియదు. కావున నయన హీనులయినట్లే కదా! ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది కావున మిమ్ములను త్రినేత్ర్రి అని అంటారు. ప్రపంచములో మనుష్యులు త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి,............ అన్న పదాలను వాడినా దాని అర్థమును గూర్చి వారికేమీ తెలియదు. ఉదాహరణానికి సైన్స్‌(విజ్ఞానము), సైలెన్స్‌ (శాంతి)లకు పరస్పరములో గల సంబంధమేమిటో కూడా తెలియదు. ప్రశ్నిస్తారు కాని జవాబేమిటో స్వయం వారికి కూడా తెలియదు. విశ్వశాంతి కావాలని అంటారు కాని అది ఎప్పుడు ఉండేదో, ఆ శాంతిని ఎవరు స్థాపించారో కొంచెం కూడా తెలియదు. కేవలం అడుగుతూ ఉంటారు. కాని తెలిసినవారుంటే కదా తెలిపించేందుకు. ఇదంతా ఒక ఆటగా రచింపబడి ఉందని పిల్లలైన మీకు బాబా అర్థము చేయించారు. టవర్‌ ఆఫ్‌ పీస్‌(శాంతి స్తంభము), టవర్‌ ఆఫ్‌ ప్రాస్పరిటీ(సుఖము నిచ్చు స్తంభము) అన్నింటికి శిఖరములుంటాయి. శాంతికి శిఖరము(టవర్‌) మూలవతనము. అక్కడ ఆత్మలైన మనము ఉంటాము. దానిని టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ అని కూడా అంటారు. తర్వాత మళ్లీ సత్యయుగములో ఉన్నతమైన సుఖము, శాంతి, సంపదలు ఉంటాయి. ముక్తిధామము ఆత్మలైన మన ఇల్లు అని ఇంకెవ్వరూ అనరు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తున్నారు. టీచరంటే ఇలా ఉండాలి. వారు జ్ఞాన శిఖరము (టవర్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌). మిమ్ములను కూడా శాంతి-సుఖాల శిఖరము పైకి తీసుకువెళ్తారు. ఇది దు:ఖధామ శిఖరము. ప్రతి విషయములోనూ దివాలా తీసి ఉన్నారు. పవిత్రత, సుఖ-శాంతుల వారసత్వమును మీరు ఈ సమయంలోనే పొందుతారు. బలిహారమంతా(గొప్పతనమంతా) ఈ పురుషోత్తమ సంగమయుగానిదే. దీనిని కళ్యాణకారి యుగమని అంటారు. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము ఉంటుంది. అది సుఖ స్తంభము, అది శాంతి స్తంభము, ఇప్పుడిది దు:ఖ స్తంభము. ఇక్కడ అపారమైన దు:ఖముంది. ఇక్కడ అన్నీ దు:ఖాలే ఉన్నాయి. దు:ఖ పర్వతాలు విరిగి పడనున్నాయని అంటారు కదా! భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు ఎంతగానో త్రాహి-త్రాహి(అయ్యో రక్షించండి, రక్షించండి) అని అంటారు!

ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పిల్లలకు స్మృతియాత్రలో సమయం పడుతుందని తండ్రి అర్థము చేయించారు. పూర్తిగా అర్థము చేసుకోనివారు చాలామంది ఉన్నారు, బిందువుగా భావించాలా లేక ఎలా భావించాలి? అని అడుగుతారు. అరే! ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే ఉంటారు. ఆత్మను గూర్చి తెలుసు కదా! అది అదృష్ట నక్షత్రము(లక్కీ సితారా) చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ కనుల ద్వారా దానిని చూడలేరు. కావున ఈ విషయాలన్నీ తండ్రి అర్థము చేయిస్తారు. ఇటువంటి విషయాల పై విచార సాగర మథనము చేయడము ద్వారా కూడా బుద్ధి రిఫ్రెష్‌ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా, కొత్త ప్రపంచములో శాంతి స్తంభము, సుఖ స్తంభము, పవిత్రతా స్తంభాలు ఉంటాయని అర్థము చేయిస్తారు. పాత స్వభావాలను, నడవడికలను సరిదిద్ది తండ్రి కొత్త ప్రపంచానికి అధిపతులుగా చేస్తారు. భలే వేదశాస్త్రాలు, గీత మొదలైనవి చదువుతారు కాని వారేమీ అర్థము చేసుకోరు. మెట్లు(తాపలు) క్రిందకు దిగుతూనే వస్తారు. భలే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావించినా, వారు క్రిందకు దిగాల్సిందే. మొదట అందరి ఆత్మ సతోప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్ల-మెల్లగా బ్యాటరీలోని శక్తి తగ్గిపోతుంది. ఈ సమయంలో అందరి బ్యాటరీలు శక్తిహీనంగా ఉన్నాయి. ఇప్పుడు బ్యాటరీ మళ్లీ చార్జ్‌ అవుతుంది, బాబా - మన్మనాభవ అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి సర్వశక్తివంతులు. వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. మళ్లీ మీ బ్యాటరీ నిండుతుంది. మీ బ్యాటరీ నిండుతూ ఉందని మీరిప్పుడు అనుభవం చేస్తున్నారు. కొందరి బ్యాటరీ నిండదు కూడా! బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. బాబా! మేము ఎప్పుడూ వికారలలోకి వెళ్లము, మీ నుండి 21 జన్మల వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని కూడా ప్రతిజ్ఞ చేస్తారు. అయినా మళ్లీ పడిపోతారు. బాబా చెప్తున్నారు - కామ వికారము పై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్‌జీతులుగా అవుతారు. మళ్లీ వికారాలలోకి వెళ్ళినట్లైతే మీ తెలివి నశిస్తుంది. ఈ కామము మహాశత్రువు. ఒకరినొకరు చూచుకోవడం ద్వారా కామాగ్ని రగులుకుంటుంది. మీరు కామచితి పై కూర్చొని అపవిత్రులు(నల్ల)గా అయిపోయారు. ఇప్పుడు ఇక మిమ్ములను నేను పవిత్రంగా (తెల్లగా) తయారు చేస్తానని బాబా అంటారు. ఇది తండ్రియే పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. చదువు ద్వారా మీ బుద్ధి వికసిస్తుంది. వృక్షమును వర్ణన చేస్తారు. ఇది కల్పవృక్షము, ఇది మనుష్య సృష్టి వెరైటీ వృక్షము, దీనిని తలక్రిందుల వృక్షము అని కూడా అంటారు. ఎన్ని వెరైటీ ధర్మాలున్నాయి! ఇన్ని కోట్లాది ఆత్మలకు అవినాశి పాత్ర లభించి ఉంది. ఏ ఇరువురికీ ఒకే విధమైన పాత్ర ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆలోచించండి! చేపల బొమ్మ ఒకటి ఉంటుంది, అందులో అది తీగ వెంబడి మెల్లగా క్రిందకు దిగుతుంది, అలాగే ఇది కూడా అంతే, మనం కూడా డ్రామా దారంలో బంధింపబడి ఉన్నాము. ఈ విధంగా దిగుతూ-దిగుతూ కల్పాంతము వచ్చేసింది. మళ్లీ మనం పైకి వెళ్తాము. ఇప్పుడు పిల్లలకు ఈ వివేకం కూడా లభించింది. పై నుండి ఆత్మలు వస్తాయి. నెంబరువారుగా కలుస్తూ ఉంటాయి. ఈ ఆటలో మీరు పాత్రధారులు, ముఖ్య రచయిత, డైరక్టర్‌, నటుడు ఉంటారు కదా! ముఖ్యమైనవారు శివబాబాయే, ఆ తర్వాత నటులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులు. భక్తిమార్గం వారు అనేక చిత్రాలను తయారు చేశారు కాని వాటి అర్థమును గూర్చి ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి పూర్తి జ్ఞానమునిస్తారు. సత్యయుగములో మనకు ఈ జ్ఞానము ఉండదని మీరు అర్థము చేసుకున్నారు. ఎలాగైతే ఇక్కడ ఈ కార్య వ్యవహారాలు నడుస్తాయో అలాగే అక్కడ పవిత్రత, సుఖ-శాంతుల రాజధాని నడుస్తుంది. తండ్రి కూడా అద్భుతమైనవారే! వారు చాలా చిన్న బిందువు! ఎలాగైతే మీ ఆత్మ తండ్రి నుండి జ్ఞానము తీసుకుంటుందో, అలా ఇతడి ఆత్మ కూడా తండ్రి నుండి జ్ఞానము తీసుకుంటూ ఉంది. బాబా పరిమాణంలో పెద్దగా ఏమీ ఉండరు. వారు కూడా బిందువే. బిందువుగా ఉన్న మీ ఆత్మలో కూడా జ్ఞాన ధారణ జరుగుతోంది. ఈ జ్ఞానము కల్పము తర్వాత తండ్రి మళ్లీ ఇస్తారు. రికార్డు చేసి ఉంచింది మళ్లీ రిపీటౌతుంది కదా. అలాగే ఆత్మలో కూడా పాత్ర అంతా నిండి ఉంది. ఏదైనా చాలా అద్భుతమైన విషయం ఉంటే దానిని ప్రకృతి సిద్ధమైనదని అంటారు. ఈ అనాది అయిన డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే బాగా అర్థం చేసుకొని ధారణ చేస్తారో వారి సంతోష పాదరస మట్టము పైకి ఎక్కుతుంది. మీకు ఎంత పెద్ద స్కాలర్‌షిప్‌ లభిస్తుంది! కావున మంచిరీతిగా పురుషార్థము చేయాలి. మీ సమానంగా తయారు చేయాలి. మీరందరూ టీచర్లే. టీచర్‌ మిమ్ములను చదివించి తమ సమానంగా టీచరుగా తయారు చేస్తారు. అలాగని గురువుగా అవ్వాలని కాదు. మీరు టీచర్‌గా అవుతారు. ఎందుకంటే రాజయోగాన్ని నేర్పిస్తారు ఆ తర్వాత మీరు వెళ్లిపోతారు. ఇది కూడా మీరు అర్థము చేసుకుంటారు. వారికి ఇవేవీ తెలియవు. సద్గతిని కూడా ఇవ్వలేరు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే కదా. ముక్తిప్రదాత మరియు మార్గదర్శకుడు కూడా వారే. అక్కడి నుండి మీరు వచ్చేటప్పుడు తండ్రి మార్గదర్శకులుగా ఉండరు. తండ్రి మార్గదర్శకునిగా ఇప్పుడే అవుతారు. ఎప్పుడైతే మీరు ఇంటి నుండి వస్తారో అప్పుడు మీరు ఇంటినే మర్చిపోతారు. ఇప్పుడు మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యారు. అందరికీ దారిని చూపిస్తారు. అశరీరి భవ! మీకు పాండవ సేన అన్న పేరు కూడా ఉంది. శరీరధారులుగా ఉన్నారు కదా! ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యమని అనరు. శరీరముతో పాటు ఎప్పుడైతే మాయ పై విజయాన్ని పొందుతారో అప్పుడు మిమ్ములను సైన్యమని అంటారు. దీనిని వారు యుద్ధముగా వ్రాసేశారు. ఇది అనంతమైన విషయము. వారు సమ్మేళనాలు మొదలైనవి చేస్తారు. సంస్కృతము మొదలైనవాటి కాలేజీలను తెరుస్తారు. ఎంతగా ఖర్చు చేస్తారు! ఖర్చు చేస్తూ చేస్తూ ఖాళీ అయిపోయారు. వెండి, బంగారు, వజ్రాలు అన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్లీ మీ కొరకు అన్నీ కొత్తగా వెలువడ్తాయి. కావున పిల్లలైన మీరు నడుస్తూ - తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉండాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మీ పాత్ర నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ ఆగిపోదు. మీకు మీ జన్మలను గూర్చి తెలియదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల లెక్కను కూడా మొట్టమొదట వచ్చిన ఇతడికి తెలియజేస్తారు. పిల్లలైన మీకు అపారమైన సుఖము లభిస్తుంది. ఆరోగ్యము, సంపద, ఆనందముల శిఖరంగా ఉంటుంది. మరి ఎంతటి నషా ఉండాలి! తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. వృక్షము వృద్ధి కూడా చెందనున్నది. వృక్షాలు దృఢంగా లేకుంటే తుఫానులు రావడంతో పడిపోతాయి. ఇది జరగవలసిందే, మీ లక్ష్యము, ఉద్ధేశ్యాల చిత్రము మీ ముందు ఉంది. మీరు ఇంకే చిత్రమునూ ఉంచుకోరాదు. భక్తిమార్గములో మనుష్యులు లెక్కలేనన్ని చిత్రాలను ఉంచుతారు. జ్ఞానమార్గములో ఒకే చిత్రముంటుంది. ఆ జ్ఞానము కూడా మీ బుద్ధిలో ఉంది. బిందువు చిత్రమును ఏమి చూపించగలరు? ఆత్మ ఒక నక్షత్రము కదా! ఇవి కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేరు. బాబా - మాకు సాక్షాత్కారము జరగాలి. వైకుంఠాన్ని చూడాలని చాలామంది అంటారు. కాని అలా చూడడం ద్వారా దానికి అధిపతులుగా అవ్వరు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని మనుష్యులుంటారు కాని ఆ స్వర్గము ఎక్కడ ఉందో వారికేమీ తెలియదు. ఏ ఆత్మలైతే స్వర్గములోకి వెళ్తారో వారే చెప్తారు. ఆత్మకు అన్నీ గుర్తుంటాయి కదా! ఇప్పుడు మిమ్ములను ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. మీరు ఉన్నతోన్నతమైన పదవిని నెంబరువారు పురుషార్థానుసారముగా పొందుకుంటున్నారు - నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవుతారు.

ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అర్థం చేయించడం మీ కర్తవ్యము. చాలా మంది వీరు ఖచ్చితంగా చెప్తున్నారని కూడా అర్థము చేసుకుంటారు. కుమారీల ద్వారా భీష్మపితామహులు మొదలైన వారి పై బాణాలను వేయించారని వ్రాయబడి ఉంది కదా. ఆ సమయము కూడా ఇప్పుడు వస్తుంది. అంతేకాని అర్జునుడు బాణం వేయగానే గంగ వచ్చింది అనేదేమీ లేదు. ఇటువంటి మాటలను విని అక్కడి నుండి గంగ వెలువడిందని అంటారు. గోముఖాన్ని కూడా తయారు చేశారు. మీ స్మృతి చిహ్నాలు కూడా ఉండుటను ఇప్పుడు పిల్లలైన మీరు చూస్తున్నారు. అది జడమైన దిల్వాడా మందిరము. ఇది చైతన్యమైనది. అందులో పైన వైకుంఠాన్ని చూపించారు. క్రింద తపస్సు చేస్తున్నారు. పైన రాజ్యంలోని చిత్రాలు ఉన్నాయి. అందుకే మనుష్యులు స్వర్గం పైన ఉందని భావిస్తారు. బాంబులు తయారు చేసేవారు ఇవన్నీ మా వినాశం కొరకే తయారవుతున్నాయని స్వయం కూడా భావిస్తారు. ఇలా చేసినట్లైతే తప్పకుండా వినాశనమవుతుందని అంటారు. మహాభారత యుద్ధంలో సర్వమూ సమాప్తమైపోయిందని వ్రాసి కూడా ఉన్నారు. సత్యయుగములో ఒకే ఒక ధర్మము ఉంటుంది. కనుక మిగిలిన ధర్మాలన్నీ తప్పకుండా సమాప్తమైపోతాయి. భక్తి చేస్తూ చేస్తూ డ్రామానుసారము క్రిందకు దిగుతూనే వస్తారని కూడా పిల్లలకు తెలుసు. వాస్తవానికి ఇక్కడ ఆశీర్వాదాలు మొదలైనవాటి విషయమేదీ లేదు. డ్రామాలో ఏదైతే తయారై ఉందో అదే జరుగుతుంది. ఏదైనా జరిగితే మనుష్యులు ఈశ్వరేచ్ఛ అని అంటారు. కాని మీరు అలా అనరు. అది డ్రామాలో నిశ్చితమై ఉందని మీరు అంటారు. మీరు ఈశ్వరేచ్ఛ అని అనరు. ఈశ్వరునికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. సృష్టి చక్రమెలా తిరుగుతుందో అది కూడా తండ్రియే అర్థం చేయించగలరు. తండ్రియే జ్ఞానసాగరులు. వారికి అందరి హృదయాలను గూర్చి తెలుసు అని మనుష్యులు భావిస్తారు. కాని మనమేదైతే చేస్తామో దాని శిక్ష మనకు తప్పకుండా లభిస్తుంది. తండ్రి కూర్చొని శిక్షలను ఏమీ ఇవ్వరు. ఇదంతా దానంతకదే తయారై ఉన్న డ్రామా. అది ఇలా నడుస్తూనే ఉంటుంది. దీని ఆది-మధ్య-అంతముల రహస్యాన్ని తండ్రియే అర్థము చేయిస్తారు. మళ్లీ మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలూ! ఇప్పుడు మీ స్థితి ఎలా ఉండాలంటే, చివరిలో మీకు ఇంకేమీ గుర్తు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము

సమయానుసారము ఇప్పుడు బ్రహ్మాబాబా సమానంగా సదా అచల్‌-అడోల్‌గా (స్థిరంగా) సర్వ ఖజానాలతో సంపన్నమవ్వండి. కొద్దిగా కదిలినా, విచలితమైనా అన్ని ఖజానాలు అనుభవమవ్వవు. తండ్రి ద్వారా ఎన్ని ఖజానాలు లభించాయి! ఆ ఖజానాలను సదా స్థిరంగా ఉంచుకునే సాధనం - సదా అచల్‌ అడోల్‌గా ఉండడం. అచలంగా ఉంటే సదా సంతోషం అనుభవమవుతూ ఉంటుంది.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. స్కాలర్‌షిప్‌ను తీసుకునేందకు బాగా పురుషార్థము చేయండి. టీచర్‌గా అయ్యి ఇతరులకు రాజయోగాన్ని నేర్పించండి. మార్గదర్శకులై అందరికీ ఇంటికి వెళ్ళే దారిని చూపే సేవను చేయండి.

2. సర్వశక్తివంతులైన తండ్రి స్మృతి ద్వారా మీ బ్యాటరీని చార్జ్‌ చేసుకోవాలి. తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడూ కామము వలన దెబ్బ తినరాదు.

వరదానము :-

'' హజూర్‌(బాబా)ను సదా జతలో ఉంచుకొని కంబైండ్‌ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారీ భవ ''

పిల్లలు మనస్ఫూర్తిగా దిలారాం(హృదయాభిరాముడు) హాజరవుతాడని ఎందుకు చెప్తారంటే హజూర్‌ హాజరుగా ఉన్నాడు, విశేష ఆత్మలు కంబైండ్‌గా ఉండనే ఉన్నారు. జనులు ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు ఉన్నావని అంటారు. పిల్లలైన మీరు, మేము ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడకు వెళ్లినా తండ్రి మా జతలోనే ఉన్నాడని అంటారు. కరన్‌ కరావన్‌హార్‌(చేసి చేయించేవారని) అని అంటారు. కనుక చేసేవారు, చేయించేవారు కంబైండుగా అయిపోతారు. ఈ స్మృతిలో ఉండి పాత్రను అభినయించే వారు విశేష పాత్రధారులుగా అవుతారు.

స్లోగన్‌ :-

'' స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో అతిథిగా భావించి ఉంటే పాత సంస్కారాలను, సంకల్పాలను పారదోలగలరు.''