20-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇది అనంతమైన బేహద్ వేదిక. ఇందులో ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు బంధితులై ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది ''
ప్రశ్న :-
కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొను పురుషార్థము ఏది?
జవాబు :-
కర్మాతీతంగా అవ్వాలంటే సంపూర్ణ సమర్పణ కావలసి వస్తుంది. ''నాది'' అనునది ఏమీ ఉండరాదు. అన్నిటిని మర్చిపోయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు. ధన, సంపదలు, పిల్లలు మొదలైనవన్నీ గుర్తుకు వస్తుంటే కర్మాతీతంగా అవ్వలేరు. అందుకే ''నేను పేదల పెన్నిధిని'' అని బాబా అంటారు. పేద పిల్లలే త్వరగా సమర్పణ అవుతారు. సహజంగా అన్నింటిని మరచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలరు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్లాలని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంది. భక్తుల బుద్ధిలో ఉండదు. ఈ 84 జన్మల చక్రము పూర్తయ్యిందని మీకు తెలుసు. ఇది చాలా గొప్ప బేహద్ మండపము అనగా వేదిక. అనంతమైన వేదిక. ఈ పాత మండపాన్ని వదిలి ఇంటికి వెళ్లాలి. అపవిత్రమైన ఆత్మలైతే వాపస్ వెళ్లలేరు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు ఈ ఆట అంత్యమవుతుంది. చివర్లో అపారమైన దు:ఖాలు రానున్నాయి. ఈ సమయములో ఇదంతా మాయవీ వైభవము. దీనిని మానవులు స్వర్గంగా భావిస్తారు. ఎన్ని మహళ్లు, అంతస్తులు, మోటర్లు మొదలైనవి ఉన్నాయి! దీనిని మాయ యొక్క పోటీ అని అంటారు. నరకము స్వర్గముతో పోటీ పడ్తుంది. అల్పకాలిక సుఖముంది. ఇవి డ్రామానుసారము మాయావీ ఆటలు. ఎంతోమంది మానవులున్నారు. మొదట కేవలం ఆది సనాతన దేవీదేవతా ధర్మము ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఈ మండపము(రంగస్థలము) పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడీ చక్రము పూర్తి అవుతుంది. అందరూ తమోప్రధానంగా ఉన్నారు. సృష్టి కూడా తమోప్రధానంగా ఉంది. మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. సృష్టి అంతా కొత్తదిగా అవ్వాలి కదా. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా ఇలా లెక్కలేనన్ని సార్లు జరుగుతూ వచ్చింది. ఇది అనాది ఆట. ఎప్పుడు ప్రారంభమయ్యిందో చెప్పలేరు. అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఈ విషయము మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానము లభించక ముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. దేవతలకు కూడా తెలియదు. కేవలం పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది. తండ్ర్రి సుఖధామానికి అధికారులుగా చేశారు, ఇంతకంటే ఏం కావాలి? తండ్రి ద్వారా ఏది పొందాలో అది పొందుకున్నాము, ఇక పొందుకోవలసింది ఏమీ లేదు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, మీరే అందరికంటే ఎక్కువగా పతితంగా అయ్యారు. మొట్టమొదట పాత్ర చేసేందుకు మీరే వచ్చారు. మీరే ముందు వెళ్లవలసి ఉంటుంది. ఇది చక్రము కదా. మొట్టమొదట మీరే మాలలో కూర్చబడ్తారు. ఇది రుద్రమాల కదా. దారములో మొత్తం ప్రపంచములోని మానవులంతా కూర్చబడి ఉన్నారు. దారము నుండి తొలగి పరంధామానికి వెళ్తారు. మళ్లీ అదే విధంగా దారములో కూర్చబడ్తారు. మాల చాలా పెద్దది. శివబాబాకు ఎంతమంది పిల్లలున్నారు! మొట్టమొదట దేవతలైన మీరు వస్తారు. ఇది బేహద్ మాల. ఇందులో మణుల వలె అందరూ కూర్చబడి ఉన్నారు. రుద్రమాల, విష్ణుమాలకు గాయనముంది. ప్రజాపిత బ్రహ్మకు మాల లేదు. బ్రహ్మకుమార-కుమారీలైన మీ మాల ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కుతూ, దిగుతూ, ఓడిపోతూ ఉంటారు. క్షణ-క్షణము మాయ క్రింద పడేస్తుంది. అందువలన బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది. వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మకు కూడా వంశముంది. మీరు పాసైనప్పుడు బ్రహ్మకు కూడా మాల ఉందని చెప్తారు. వంశము తయారుచేయబడి ఉంది. ఈ సమయములో మాల తయారవ్వదు. ఎందుకంటే ఈ రోజు పవిత్రంగా అవుతారు, రేపు మళ్లీ మాయ చెంపదెబ్బ కొట్టి కళలన్నీ తీసేస్తుంది. అప్పుడు సంపాదనంతా సమాప్తమైపోతుంది, ముక్కలైపోతారు. ఎక్కడి నుండి పడిపోతారో ఆలోచించండి. తండ్రి అయితే విశ్వానికి అధికారులుగా చేస్తారు. తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ మీరు ఉన్నత పదవి పొందగలరు. ఓడిపోతే సమాప్తమైపోతారు. కామ వికారము మహాశత్రువు. దానితో ఓడిపోరాదు. మిగతా వికారాలన్నీ చిన్న పిల్లలవంటివి. కామ వికారము చాలా పెద్ద శత్రువు. దాని పైనే విజయము పొందాలి. కామము పై విజయము పొందుకుంటే మీరు జగత్జీతులుగా అవుతారు. ఈ పంచ వికారాలు అర్ధకల్పము నుండి శత్రువులుగా ఉన్నాయి. అవి కూడా వదిలిపెట్టవు. కోపము చేసుకోవలసి వస్తుందని అందరూ కేకలు పెడతారు కానీ దాని అవసరమేముంది? ప్రేమతో కూడా పని జరుగుతుంది. దొంగకు కూడా ప్రేమతో అర్థం చేయిస్తే అతడు వెంటనే సత్యము చెప్పేస్తాడు. తండ్రి చెప్తున్నారు - నేను ప్రేమసాగరుడను కదా, కావున పిల్లలైన మీరు కూడా ఏ హోదాలో ఉన్నా ప్రేమగా పని తీసుకోవాలి. బాబా వద్దకు మిలట్రీవారు కూడా వస్తారు. బాబా వారికి కూడా, మీరు స్వర్గానికి వెళ్లాలంటే కేవలం శివాబాబానే స్మృతి చేయండి అని చెప్తారు. మీరు యుద్ధ మైదానములో మరణిస్తే స్వర్గానికి వెళ్తారని వారికి చెప్పబడ్తుంది. వాస్తవానికి ఇదే యుద్ధ మైదానము. వారు యుద్ధము చేస్తూ చేస్తూ మరణిస్తే మళ్లీ అక్కడికే వెళ్లి జన్మ తీసుకుంటారు. ఎందుకంటే సంస్కారాన్ని తీసుకెళ్తారు. స్వర్గములోకి అయితే వెళ్లలేరు. శివబాబాను స్మృతి చేస్తే మీరు స్వర్గములోకి వెళ్లగలరు ఎందుకంటే స్వర్గ స్థాపన జరుగుతూ ఉందని బాబా వారికి తెలియజేశారు. శివబాబా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశమవుతాయి. కొద్దిగానైనా ఈ జ్ఞ్ఞానము లభించింది కదా, కావున అవినాశి జ్ఞానము వినాశమవ్వదు. పిల్లలైన మీరు మేళాలు మొదలైనవి చేసినప్పుడు ఎంతమంది ప్రజలు తయారౌతారు! మీరు ఆత్మిక సైన్యము కదా! ఇందులో కమాండరు, మేజరు మొదలైనవారు కొద్దిమందే ఉంటారు. ప్రజలైతే చాలామంది తయారౌతారు. ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు ఏదో ఒక మంచి పదవిని పొందుతారు. వారిలో కూడా ఫస్ట్, సెకండు, థర్డ్ గ్రేడులు ఉంటాయి. మీరు శిక్షణ ఇస్తూ ఉంటారు. కొందరైతే పూర్తిగా మీ సమానంగా తయారౌతారు. కొందరు అందరికంటే ఉన్నతంగా కూడా వెళ్లగలరు. ఒకరికంటే ఒకరు ఉన్నతంగా తయారవ్వడం చూస్తూ ఉంటారు. కొత్త కొత్తవారు పాతవారి కంటే వేగంగా వెళ్లిపోతారు. తండ్రితో పూర్తిగా యోగము జోడించబడితే చాలా ఉన్నత స్థితికి వెళ్లిపోతారు. ఆధారమంతా యోగము పైనే ఉంది. జ్ఞానమైతే చాలా సహజమని మీరు అనుభవము చేస్తూ ఉండవచ్చు. తండ్రిని స్మృతి చేయునప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటాయి. భోజనము కూడా స్మృతిలోనే చేయమని తండ్రి చెప్తారు. కానీ కొందరు 2-5 నిముషాలు స్మృతి చేస్తారు. భోజనము చేయు సమయమంతా స్మృతి చేయడం చాలా కష్టము. మాయ ఏదో ఒక విధంగా మరిపిస్తుంది. తండ్రి తప్ప మర్వెవరూ స్మృతిలో లేనప్పుడే కర్మాతీత స్థితి లుగుతుంది. ఒకవేళ నాది అనునది ఏదైనా ఉంటే, అది తప్పకుండా గుర్తుకొస్తుంది. ఏదీ స్మృతిలోకి రాకూడదు. దీనికి బాబా ఉదాహరణగా ఉన్నారు. ఇతనికి ఏం గుర్తుకొస్తుంది? ఎవరైనా పిల్లాపాపలు, ధనము మొదలైనవి ఏవైనా ఉన్నాయా? కేవలం పిల్లలైన మీరే గుర్తుకొస్తారు. తండ్రికి తప్పకుండా మీరే గుర్తుకు వస్తారు. ఎందుకంటే కళ్యాణము చేసేందుకే తండ్రి వచ్చారు. వారు అందరినీ స్మృతి చేస్తారు. అయినా బుద్ధి పుష్పాల వైపుకే పోతుంది. పుష్పాలు అనేక రకాలు ఉంటాయి. కొన్ని సువాసన లేని పుష్పాలు కూడా ఉంటాయి. ఇది ఒక తోట కదా. తండ్రిని తోట యజమాని, తోటమాలి అని కూడా అంటారు. క్రోధములోకి వచ్చి మనుష్యులు ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారో మీకు తెలుసు. దేహాభిమానము చాలా ఉంది. తండ్రి చెప్తున్నారు - ఎప్పుడైనా, ఎవరైనా కోపగించుకుంటే శాంతిగా ఉండాలి. క్రోధమనేది భూతము కదా. భూతానికి శాంతిగా సమాధానమివ్వాలి.
సర్వ శాస్త్ర శిరోమణి శ్రీమద్భగవద్గీత ఈశ్వరీయ మతమునకు చెందినది. ఈశ్వరీయ మతము, ఆసురీ మతము మరియు దైవీ మతమును గురించి ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలిపిస్తారు. వారు రాజయోగ జ్ఞానమును ఇస్తారు. మళ్లీ ఈ జ్ఞానము మాయమైపోతుంది. రాజాధి రాజులుగా తయారైన తర్వాత ఈ జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు? 21 జన్మల వరకు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఇది ఈ పురుషార్థ ఫలితమని వారికి అక్కడ తెలియదు. అనేకసార్లు మీరు సత్యయుగానికి వెళ్లారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. జ్ఞాన ఫలము సత్య-త్రేతా యుగాలు. అక్కడ జ్ఞానము లభిస్తుందని కాదు. తండ్రి వచ్చి భక్తికి ఫలితంగా జ్ఞానమునిస్తారు. మీరు ఎక్కువ భక్తి చేశారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. రచన ఆదిమధ్యాంతాలను స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు. భగవంతుడు తమ పిల్లలను భగవాన్-భగవతిగా చేస్తారు కదా. కానీ దేహధారిని భగవాన్-భగవతి అని అనడం తప్పు. బ్రహ్మ, విష్ణువు మరియు శివునికి ఎంత సంబంధముంది! ఈ బ్రహ్మ మళ్లీ విష్ణువుగా అవుతాడు. ఇతనిలో శివుడు ప్రవేశిస్తారు. సూక్ష్మవతనములో ఉన్నవారిని సూక్ష్మదేవతలని(ఫరిస్తాలని) అంటారు. మీరు ఫరిస్తాలుగా అవ్వాలి. అక్కడ సాక్షాత్కారమవుతుంది అంతకుమించి ఏమీ లేదు. సైలెన్స్, మూవీ, ఇక్కడ టాకీ. ఇదే విస్తారము. సంక్షిప్తంగా అయితే మన్మనాభవ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, సృష్టి చక్రమును స్మృతి చేయండి అని చెప్తారు. ఇక్కడ కూర్చొని ఉన్నా శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయండి. ఈ పురాతనమైన దు:ఖధామమును మర్చిపోండి. ఇది బుద్ధి ద్వారా చేయవలసిన బేహద్ సన్యాసము. వారిది హద్దు సన్యాసము. ఆ నివృత్తి మార్గములోని వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానమును ఇవ్వలేరు. రాజా-రాణిగా తయారవ్వడం ప్రవృత్తి మార్గము. అక్కడ సుఖమే ఉంటుంది. వారైతే సుఖమునే ఒప్పుకోరు. సన్యాసులు కూడా సుమారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారికి పోషణ లేక సంపాదన గృహస్థుల ద్వారా జరుగుతుంది. మీరైతే దానధర్మాలు చేయడంలో ఖర్చు పెట్టారు, మళ్లీ పాపముతో కూడిన కర్తవ్యాలు చేశారు కనుక పాపాత్మలుగా అయ్యారు. పిల్లలైన మీరిప్పుడు అవినాశి జ్ఞాన రత్నాలను ఇచ్చి పుచ్చుకుంటారు. వారు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తే మరుసటి జన్మలో మంచి ఫలితము లభిస్తుంది. వీరు బేహద్ తండ్రి. ఇక్కడ ప్రత్యక్షంగా, అక్కడ పరోక్షంగా ఈశ్వరార్పణము చేస్తారు. వాస్తవానికి ఇరువురికీ ఆకలి లేనే లేదు. శివబాబా అయితే దాత. వారికి ఆకలి అవుతుందా? శ్రీ కృష్ణుడు దాత కాదు. తండ్రి అయితే అందరికీ ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు. ఒకటి ఇస్తారు, పది పొందుతారు. పేదలు రెండు రూపాయలు ఇస్తే సుదాముని వలె పదమమంత లభిస్తుంది. భారతదేశము బంగారు పిచుక వలె ఉండేది కదా. తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేశారు! సోమనాథ మందిరములో ఎంత అంతులేని ధనముండేది! దానిని ఎంతో లూటీ చేసుకొని పోయారు. పెద్ద పెద్ద వజ్ర వైఢూర్యములుండేవి. ఇప్పుడు మచ్చుకు కూడా లేవు. మళ్లీ చరిత్ర పునరావృతమౌతుంది. అక్కడ గనులన్నీ మీ కొరకు నిండుగా అవుతాయి. వజ్ర వైఢూర్యాలు అక్కడ రాళ్ల వలె ఎక్కువగా ఉంటాయి. తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలనిస్తారు. దీనితో మీరు అపారమైన ధనవంతులుగా అవుతారు. కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంత సంతోషముండాలి! ఎంత బాగా చదువుకుంటూ ఉంటే అంత ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతూ ఉంటుంది. చాలా పెద్ద పరీక్ష పాస్ అయితే, నేను పాసైన తర్వాత ఈ విధంగా ఉంటాను, ఈ పని చేస్తానని బుద్ధిలో ఉంటుంది కదా. దేవతలుగా తయారవుతామని మీకు కూడా తెలుసు. ఇక్కడైతే జడ చిత్రాలున్నాయి. అక్కడ మనము చైతన్యంగా ఉంటాము. మీరు తయారుచేసిన ఈ చిత్రాలు ఎలా వచ్చాయి? దివ్యదృష్టి ద్వారా మీరు చూసి వచ్చారు. చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మ తయారు చేశారని కొందరు అనుకుంటారు. ఎవరితోనైనా నేర్చుకొని ఉంటే కేవలం ఒకరు మాత్రమే నేర్చుకొని ఉండరు. వేరేవారు కూడా నేర్చుకొని ఉంటారు కదా. నేనేమీ నేర్చుకోలేదని వీరు చెప్తారు. ఈ చిత్రాలను తండ్రి దివ్యదృష్టి ద్వారా తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ శ్రీమతానుసారము తయారు చేయబడినవి, మానవ మతానుసారంగా కాదు. ఇవన్నీ సమాప్తమవుతాయి. నామ-రూపాలు కూడా ఉండవు. ఈ సృష్టియే అంతిమ స్థితిలో ఉంది. భక్తిలో ఎంత సామాగ్రి ఉంది! తర్వాత ఇవేవీ ఉండవు. కొత్త ప్రపంచములో అన్నీ కొత్తగా ఉంటాయి. అనేకసార్లు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యారు. మళ్లీ మాయ ఓడించింది. ధనమును మాయ అని అనరు. వికారాలను మాయ అని అంటారు. పిల్లలైన మీరు రావణుని సంకెళ్లలో అర్ధకల్పము వరకు చిక్కుకొని ఉన్నారు. రావణుడు అందరికంటే పాత శత్రువు. అర్ధకల్పము రావణుని రాజ్యము నడుస్తుంది. లక్షల సంవత్సరాలని చెప్పినందువలన లెక్కాచారములో సగము సగము కూడా చేయలేరు. ఎంత తేడా ఉంది! మొత్తం కల్పమంతటి ఆయువు 5 వేల సంవత్సరాలే అని తండ్రి మీకు తెలిపించారు. 84 లక్షల యోనులు లేనే లేవు. ఇది చాలా పెద్ద పుకారు. సూర్యవంశీ, చంద్రవంశీ దేవీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యము చేస్తూ ఉండినారా? బుద్ధి పని చేయడం లేదు. మాది తప్పు అని ఒప్పుకుంటే మా అనుచరులందరూ మమ్ములను వదిలేస్తారని సన్యాసులు భయపడ్తారు. తిరుగుబాటు జరుగుతుంది కనుక వారిప్పుడే మీ మతమును అనుసరించి తమ రాజ్యమును వదిలిపెట్టరు. ఇప్పుడు ఏమీ అర్థము చేసుకోరు. తర్వాత చివరిలో అర్థము చేసుకుంటారు. షాహుకార్లు అసలు జ్ఞానమే తీసుకోరు. నేను పేదల పెన్నిధిని అని తండ్రి అంటారు. షాహుకార్లు ఎప్పుడూ సమర్పణై కర్మాతీత స్థితిని పొందలేరు. తండ్రి అయితే చాలా మంచి నగల వ్యాపారి. పేదవారిదే తీసుకుంటారు. షాహుకార్లది తీసుకుంటే మళ్లీ అంత ఇవ్వవలసి ఉంటుంది. షాహుకార్లు చాలా కష్టంగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ మర్చిపోవలసి వస్తుంది. మీ వద్ద ఏమీ లేనప్పుడే కర్మాతీత స్థితి వస్తుంది. షాహుకార్లయితే మర్చిపోలేరు. కల్పక్రితము వారసత్వము తీసుకున్నవారే ఇప్పుడు తీసుకుంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఎలాగైతే ప్రేమసాగరులో అలా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి ప్రేమతో పని చేయించాలి, కోపపడరాదు. ఎవరైనా కోపగించుకున్నా మీరు శాంతిగా ఉండాలి.
2. ఈ పాత దు:ఖమయమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి బేహద్ సన్యాసులుగా అవ్వాలి. శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చి పుచ్చుకోవాలి.
వరదానము :-
'' ' మన్మనాభవ ' తో పాటు ' మధ్యాజీభవ ' మంత్ర స్వరూపంలో స్థితులై ఉండే మహాన్ ఆత్మా భవ ''
పిల్లలైన మీకు 'మన్మనాభ' తో పాటు 'మధ్యాజీభవ' అనే వరదానము కూడా ఉంది. మీ స్వర్గ స్వరూపము స్మృతిలో ఉండడమే 'మధ్యాజీభవ.' ఎవరైతే తమ శ్రేష్ఠమైన ప్రాప్తుల నశాలో ఉంటారో వారే 'మధ్యాజీభవ' మంత్ర స్వరూపంలో స్థితులై ఉండగలరు. ఎవరైతే మధ్యాజీభవగా ఉంటారో వారు 'మన్మనాభవ' గా ఉండనే ఉంటారు. ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ మహాన్గా అవుతాయి. స్మృతిస్వరూపంగా అవ్వడం అనగా మహాన్ ఆత్మగా అవ్వడం.
స్లోగన్ :-
'' సంతోషము మీ స్పెషల్ ఖజానా. ఈ ఖజానాను ఎప్పుడూ వదలరాదు ''