29-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - నిశ్శబ్ధావస్థ అనగా అశరీరిగా తయారయ్యే సమయమిదే, ఇదే స్థితిలో ఉండే అభ్యాసము చేయండి ''

ప్రశ్న :-

అన్నిటికంటే ఉన్నతమైన గమ్యమేది ? అది ఎలా ప్రాప్తిస్తుంది ?

జవాబు :-

సంపూర్ణ పావనంగా అవ్వడమే ఉన్నతమైన గమ్యము. కర్మేంద్రియాలలో ఏ మాత్రము చంచలత్వము రాకూడదు. అప్పుడే సంపూర్ణ పావనంగా అవుతారు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే విశ్వ రాజ్యము లభిస్తుంది. పైకి ఎక్కితే వైకుంఠ రసము గ్రోలవచ్చు, దిగజారితే,................ అని మహిమ కూడా ఉంది అనగా రాజాధి రాజులుగా అవుతారు లేకపోతే ప్రజలుగా అవుతారు. ఇప్పుడు నా వృత్తి ఎలా ఉంది? ఎలాంటి తప్పులు జరగడం లేదు కదా? అని పరిశీలించుకోండి.

ఓంశాంతి.

ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సత్యయుగములో ఆత్మాభిమానులుగా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా? అని బాబా ఆల్‌రౌండర్‌ను అడుగుతున్నారు. అక్కడైతే వారంతట వారే(ఆటోమేటిక్‌గా) ఆత్మాభిమానులుగా ఉంటారు, క్షణ-క్షణము స్మృతి చేసే అవసరముండదు. ఇప్పుడు ఈ శరీరము పెద్దదిగా, పాతదిగా అయ్యింది, దీనిని వదిలి మరొకటి కొత్తది తీసుకోవాలని అక్కడ భావిస్తారు. సర్పము వలె ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలనిచ్చి అర్థం చేయిస్తారు. మీరు మనుష్యులందరికీ జ్ఞాన భూ-భూ చేసి తమ సమానంగా జ్ఞానవంతులుగా చేయాలి. దీని ద్వారా స్వర్గములోని నిర్వికారీ దేవతలుగా అవుతారు. మానవుల నుండి దేవతలుగా చేసేదే ఉన్నతాతి ఉన్నతమైన విద్య. మానవులను దేవతలుగా చేశారనే మహిమ కూడా ఉంది. ఎవరు చేశారు? దేవతలు కాదు, భగవంతుడే మానవులను దేవతలుగా తయారు చేస్తారు. ఈ విషయాలు మనుష్యులకు తెలియదు. మీ లక్ష్యమేమిటని అన్ని చోట్ల అడుగుతారు. కాబట్టి లక్ష్యమును గురించి వివరిస్తూ చిన్న కాగితములో ఎందుకు ముద్రించకూడదు? ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రమును ఇస్తే వారు చదివి అర్థము చేసుకుంటారు. ఇప్పుడీ కలియుగీ పతిత ప్రపంచములో మహా అపారమైన దు:ఖముందని బాబా చాలా బాగా అర్థం చేయించారు. ఇప్పుడు మానవులైన మనకు సత్యయుగీ పావనమైన మహా సుఖధామములోకి తీసుకెళ్లే సర్వీసు చేస్తున్నారు లేక మార్గమును చూపిస్తున్నాము. అద్వైత జ్ఞానమును ఇవ్వడం లేదు. వారు శాస్త్రాల జ్ఞానమును అద్వైత జ్ఞానమని భావిస్తారు. వాస్తవానికి అది అద్వైత జ్ఞానమేమీ కాదు. అద్వైత జ్ఞానమని వ్రాయడం కూడా తప్పే. వీరి ఉద్ధేశ్యమేమిటని వెంటనే అర్థమయ్యే విధంగా ముద్రించబడిన కరపత్రము ఉండాలి. కలియుగీ పతిత భ్రష్టాచారీ మనుష్యులను మేము అపార దు:ఖము నుండి వెలికి తీసి సత్యయుగీ పవిత్ర శ్రేష్ఠాచారీ అపార సుఖ ప్రపంచములోకి తీసుకెళ్తాము. బాబా ఇలాంటి వ్యాసాలను పిల్లలకు ఇస్తారు. ఇలా స్పష్టంగా వ్రాయాలి. అన్ని చోట్లా ఇలా వ్రాసినవి ఉంచాలి. వచ్చినవారికి వెంటనే ఆ కరపత్రాలు ఇస్తే వారికి మేము దు:ఖధామములో, మురికిలో పడి ఉన్నామని అర్థము చేసుకుంటారు. మేము కలియుగీ పతితులుగా, దు:ఖధామములోని మనుష్యులుగా ఉన్నాము. వీరు మిమ్ములను అపార సుఖములోకి తీసుకెళ్తారని మనుష్యులు అర్థం చేసుకోరు. కాబట్టి ఇలాంటి ఒక మంచి కరపత్రము తయారు చేయాలి. మీరు సత్యయుగం వారా లేక కలియుగం వారా? అని ఈ బాబా కూడా ఒక కరపత్రము ముద్రించారు. కానీ మానవులు అర్థము చేసుకోరు. రత్నాలను కూడా రాళ్లని భావించి పడేస్తారు. ఇవి జ్ఞాన రత్నాలు. వారు శాస్త్ర్రాలలో రత్నాలున్నాయని భావిస్తారు. ఇక్కడ అపారమైన దు:ఖముందని తెలుసుకునే విధంగా మీరు స్పష్టంగా చెప్పండి. దు:ఖముల పట్టీ(లిస్టు) కూడా ఉండాలి. అందులో కనీసము 101 దు:ఖాలు తప్పకుండా ఉండాలి. ఈ దు:ఖధామములో అపారమైన దు:ఖముంది. ఇదంతా వ్రాయండి. మొత్తం లిస్టునంతా తీయండి. మరొకవైపు మళ్లీ అపారమైన సుఖము ఉంటుంది, అక్కడ దు:ఖమనే పేరు కూడా ఉండదు, మేము ఆ రాజ్యమును లేక సుఖధామాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పగానే వెంటనే మానవులు నోరు మూసుకోవాలి. ఇప్పుడిది దు:ఖధామమని ఎవ్వరూ అర్థము చేసుకోరు. దీనినే స్వర్గముగా భావించి కూర్చుని ఉన్నారు. పెద్ద పెద్ద మహళ్లు, కొత్త కొత్త మందిరాలు మొదలైనవి తయారుచేస్తూ ఉంటారు. ఇవన్నీ సమాప్తము అవ్వనున్నాయని ఎవ్వరికీ తెలియదు. వారికి లంచం డబ్బు చాలా లభిస్తుంది. అన్నీ మాయకు సంబంధించిన సైన్సు అహంకారము. మోటార్లు, విమానాలు ఇవన్నీ మాయ ప్రదర్శనలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి స్వర్గ స్థాపన చేస్తే మాయ కూడా తన వైభవాన్ని చూపిస్తుంది అనే నియమము కూడా ఉంది. దీనినే మాయ ఆడంబరము అని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటా శాంతిని స్థాపన చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా మాయ ప్రవేశిస్తే పిల్లల మనసు లోలోపల తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇతరుల నామ-రూపాలలో చిక్కుకుంటే వీరు వికారులు అని తండ్రి అర్థం చేయిస్తారు. కలియుగములో అంతా అనాగరికతే. సత్యయుగములో నాగరికత. దేవతల సన్ముఖములో మీరు నిర్వికారులు, మేము వికారులమని అందరూ తల వంచి నమస్కరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోండని తండ్రి చెప్తున్నారు. గొప్ప-గొప్ప మంచి మహారథులు కూడా మా బుద్ధి ఎవరి నామ-రూపాలలో వెళ్లడం లేదు కదా? అని స్వయంలో చూసుకోవాలి. ఫలానివారు చాలా బాగున్నారు, ఇది చేస్తాము అని లోలోపల అనిపిస్తుందా? ఈ సమయంలో సంపూర్ణ పవిత్రులు ఎవ్వరూ లేరని బాబాకు తెలుసు. ఏ మాత్రము చంచలము అవ్వకుండా ఉండడం చాలా కష్టము. ఇలా ఎవరో అరుదుగా ఉంటారు. కళ్లు ఎంతో కొంత తప్పకుండా మోసము చేస్తాయి. డ్రామా ఎవ్వరినీ త్వరగా నిర్వికారులుగా తయారు కానివ్వదు. మన కళ్లు ఎక్కడా మోసపోవడం లేదు కదా? అని బాగా పురుషార్థము చేసి తమను పరిశీలించుకోవాలి. విశ్వానికి మాలికులుగా అవ్వడం చాలా ఉన్నతమైన గమ్యము. ఎక్కితే వైకుంఠ రసము గ్రోలుతారు,................ అనగా ఎక్కితే రాజాధి రాజులుగా అవుతారు, క్రింద పడితే ప్రజలలోకి వెళ్లిపోతారు. ఈనాడు దీనిని వికారి ప్రపంచమని అంటారు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా మహారాణి అయినా ఎవరెక్కడ మమ్ములను చంపేస్తారో అని లోలోపల భయము ఉంటుంది. ప్రతి మనిషిలో అశాంతి ఉంది. కొంతమంది పిల్లలు కూడా చాలా అశాంతిని వ్యాపింపజేస్తారు. మీరు శాంతిని స్థాపన చేస్తున్నారు. కాబట్టి మొదట స్వయం శాంతిగా ఉండండి. అప్పుడు ఇతరులలో కూడా ఆ బలము నిండుతుంది. అక్కడైతే చాలా శాంతిగా రాజ్యము నడుస్తుంది. కళ్లు పవిత్రంగా తయారవుతాయి. ఈ రోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది అని పరిశీలించుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఇందులో చాలా శ్రమ ఉంది. తమను తాము సంభాళించుకుంటూ ఉండాలి. అనంతమైన తండ్రికి కూడా ఎప్పుడూ సత్యము చెప్పరు. అడుగడుగునా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఏ మాత్రము చెడు(క్రిమినల్‌) దృష్టితో చూసినా తప్పు జరిగినా వెంటనే నోట్‌ చేసుకోండి. పూర్తిగా సరిదిద్దుకునే వరకు 10-20 తప్పులు రోజూ చేస్తూనే ఉంటారు. కానీ సత్యము ఎవ్వరూ చెప్పరు. దేహాభిమానం ద్వారా ఏదో ఒక పాపము తప్పకుండా జరుగుతుంది. అది లోలోపల తింటూ ఉంటుంది. తప్పు అని దేనినంటారో కూడా కొందరికి అర్థము కాదు. జంతువులకేమైనా అర్థమవుతుందా? మీరు కూడా ఈ జ్ఞానము తెలియక ముందు కోతి బుద్ధి గలవారిగా ఉండేవారు. ఇప్పుడు కొందరు 50 శాతము, కొందరు 10 శాతము, కొందరు కొంత శాతము పరివర్తన అవుతూ ఉంటారు. ఈ కళ్ళు అయితే చాలా మోసము చేస్తూ ఉంటాయి. అన్నిటికంటే కళ్ళు తీవ్రమైనవి (చురుకైనవి).
ఆత్మలైన మీరు శరీరము లేకుండా వచ్చారని తండ్రి చెప్తున్నారు. అప్పుడు శరీరము లేదు. ఇప్పుడు ఏ శరీరము తీసుకుంటామో, ఏ సంబంధములోకి వెళ్తమో మీకు తెలుసా? ఏమీ తెలియదు. గర్భములో మౌనంగా, నిశ్శబ్ధం(స్థబ్ధము)గా ఉంటుంది. ఆత్మ పూర్తిగా మౌనంగా అయిపోతుంది. శరీరము పెద్దదైన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు అలా తయారై వెళ్లాలి. ఈ పాత శరీరాన్ని వదిలి మనము ఇంటికి వెళ్లాలి అంతే. మళ్లీ శరీరాన్ని తీసుకుంటే స్వర్గములో తమ పాత్ర చేస్తారు. మౌనంగా అయ్యే సమయమిదే. భలే ఆత్మ సంస్కారము తీసుకెళ్తుంది. శరీరము పెద్దదైనప్పుడు సంస్కారము కనిపిస్తుంది. మీరిప్పుడు ఇంటికెళ్లాలి కాబట్టి పాత ప్రపంచమును, ఈ శరీర స్మృతిని వదిలేయాలి. ఏమీ గుర్తుండరాదు. చాలా పథ్యముండాలి. ఆంతరికములో ఏముంటుందో అదే బయటకు వస్తుంది. శివబాబాలో కూడా జ్ఞానముంది, నా పాత్ర కూడా ఉంది. జ్ఞాన సాగరా!................ అని నా గురించే మహిమ చేస్తూ ఉంటారు. కాని అర్థమేమీ తెలియదు. మీరిప్పుడు అర్థ సహితంగా తెలుసుకున్నారు. మిగిలిన ఆత్మల బుద్ధి పైసకు పనికి రాకుండా పోతుంది. తండ్రి ఇప్పుడు ఎంత బుద్ధివంతులుగా తయారుచేస్తారు! మానవుల వద్ద కోట్ల కొలది లెక్కలేనంత ధనముంది. ఇది మాయ డాంభికము కదా. విజ్ఞానములో మనకు పనికి వచ్చే వస్తువులు అక్కడ కూడా ఉంటాయి. తయారు చేయువారు అక్కడకు కూడా వెళ్తారు. వారు రాజులుగా అయితే అవ్వరు. చివరిలో వీరు మీ వద్దకు వచ్చి ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి ద్వారా మీరు ఎంతో నేర్చుకుంటారు. ఒక్క తండ్రియే ఎలాంటి ప్రపంచాన్ని ఎలా తయారు చేస్తారు! క్రొత్త వస్తువులను మొదట ఒకరు కనుగొని తర్వాత వ్యాపింపజేస్తారు. బాంబులు తయారు చేసేవారు కూడా మొదట ఒక్కరే ఉండేవారు. వీటి ద్వారా ప్రపంచము వినాశనము అవుతుందని భావించాడు తర్వాత ఇంకా తయారు చేయడం ప్రారంభించారు. అక్కడ కూడా విజ్ఞానము కావాలి కదా. ఇంకా సమయముంది. నేర్చుకుని తెలివైనవారిగా అవుతారు. తండ్రిని గుర్తిస్తారు, తర్వాత స్వర్గములోకి వచ్చి నౌకర్లు - చౌకర్లుగా అవుతారు. అక్కడ అన్నీ సుఖమిచ్చేవే ఉంటాయి. సుఖధామములో ఉండేది మళ్లీ వస్తుంది. అక్కడ ఎలాంటి దు:ఖము, రోగాలు ఉండవు. ఇక్కడైతే అపారమైన దు:ఖముంది. అక్కడ అపారమైన సుఖముంటుంది. మనమిప్పుడు దానిని స్థాపన చేస్తున్నాము. ఒక్క తండ్రి మాత్రమే దు:ఖహర్త-సుఖకర్త. మొదట ఇలాంటి స్థితి స్వయంలో ఉండాలి. కేవలం పాండిత్యము కాదు. అటువంటి పండితుని కథ ఒకటుంది, రామ నామము జపిస్తే దాటిపోతారు,.............. అని చెప్తాడు. అది ఇప్పటి విషయమే. మీరు తండ్రి స్మృతి ద్వారా విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి వెళ్లిపోతారు. ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగుండాలి. యోగబలము లేకుండా చెడు దృష్టి ఉంటే వారి బాణము తగలదు. కనులు పవిత్రంగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండి ఎవరికైనా జ్ఞానమిస్తే బాణము తగులుతుంది. జ్ఞాన ఖడ్గానికి యోగమనే పదును ఉండాలి. జ్ఞానము ద్వారా ధన సంపాదన జరుగుతుంది. శక్తి అంటే స్మృతిదే. చాలామంది పిల్లలు అసలు స్మృతే చేయరు. తెలియనే తెలియదు. ఇది దు:ఖ ధామము. సత్యయుగము సుఖధామము అని మనుష్యులకు అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. కలియుగములో సుఖమను పేరే లేదు, ఒకవేళ ఉండినా కాకిరెట్టకు సమానమైన సుఖముంది. సత్యయుగములో అయితే అపారమైన సుఖముంటుంది. మానవులు అర్థము చేసుకోరు. ముక్తి కొరకే తల కొట్టుకుంటూ ఉంటారు. జీవన్ముక్తిని గురించి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి జ్ఞానము కూడా ఎలా ఇవ్వగలరు. వారు వచ్చేదే రజోప్రధాన సమయములో. మరి వారు రాజయోగమును ఎలా నేర్పిస్తారు. ఇక్కడైతే సుఖము కాకిరెట్టతో సమానంగా ఉంది. రాజయోగము ద్వారా ఏమి జరిగిందో కూడా తెలియదు. ఇదంతా డ్రామాలో జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. వార్తాపత్రికలలో కూడా మిమ్ములను నిందిస్తూ వ్రాస్తారు. ఇది కూడా జరగాల్సిందే. స్త్రీల పై అనేక రకాలైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచములో అనేక రకాల దు:ఖముంది. ఇప్పుడు ఎవ్వరూ సుఖంగా లేరు. భలే ఎంత గొప్ప ధనవంతులైనా జబ్బుపడితే, గ్రుడ్డివాడైౖతే దు:ఖముంటుంది కదా. దు:ఖాల లిస్టులో ఇవన్నీ వ్రాయండి. రావణ రాజ్యము, కలియుగ అంతిమ సమయములో ఇవన్నీ ఉంటాయి. సత్యయుగములో దు:ఖమిచ్చే విషయం ఒక్కటి కూడా ఉండదు. సత్యయుగమైతే ఒకప్పుడు ఉండి వెళ్లిపోయింది కదా. ఇప్పుడిది సంగమ యుగము. తండ్రి కూడా సంగమ యుగములోనే వస్తారు. 5 వేల సంవత్సరాలలో మనము ఏ ఏ జన్మలు తీసుకుంటామో కూడా మీకు తెలుసు. సుఖము నుండి మళ్లీ దు:ఖములోకి ఎలా వస్తామో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఎవరి బుద్ధిలో జ్ఞానమంతా ఉందో, ధారణ చేస్తారో వారు అర్థము చేసుకుంటారు. తండ్రి పిల్లలైన మీ జోలెను నింపుతారు. ధనము దానము చేస్తే ధనము తరగదు అని మహిమ కూడా ఉంది. ధనము దానము చేయకుంటే వారి వద్ద లేనట్లే. తర్వాత లభించను కూడా లభించదు. ఇదంతా లెక్కాచారము కదా. ఇవ్వనే ఇవ్వకపోతే ఎక్కడి నుండి లభిస్తుంది. ఎక్కడి నుండి వృద్ధి అవుతుంది. ఇవన్నీ అవినాశి జ్ఞాన రత్నాలు. ప్రతి విషయములో నంబరువార్‌గా అయితే ఉంటారు కదా. ఇదంతా మీ ఆత్మిక సైన్యము. కొన్ని ఆత్మలు వెళ్లి ఉన్నత పదవి పొందుతాయి. కొందరి ఆత్మలు ప్రజా పదవిని పొందుతాయి. కల్పము ముందు పొందుకున్న విధంగా పొందుతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారము మాత - పిత, బాప్‌దాదాల హ్రృదయపూర్వక ప్రేమతో ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌,
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తమను తాము సంభాళించుకునేందుకు అడుగడుగునా పరిశీలించుకోవలసిన విషయాలు - (అ) ఈ రోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? (ఆ) కళ్ళు పవిత్రంగా ఉన్నాయా? (ఇ) దేహాభిమానానికి వశమై ఏ పాపము జరిగింది?

2. బుద్ధిలో అవినాశి జ్ఞాన ధనాన్ని ధారణ చేసి ఇతరులకు దానము చేయాలి. జ్ఞాన ఖడ్గములో స్మృతి అనే పదును తప్పకుండా నింపాలి.

వరదానము :-

'' సంగమ యుగ మహత్వాన్ని తెలుసుకొని ప్రతి సమయము విశేషమైన అటెన్షన్‌ ఉంచే హీరో పాత్రధారి భవ ''

ఏ కర్మ చేస్తున్నా సదా ''నేను హీరో పాత్రధారిని'' అనే వరదానము స్మృతిలో ఉంటే మీరు చేసే ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది. ప్రతి సెకండు, ప్రతి సమయము, ప్రతి సంకల్పము శ్రేష్ఠంగా ఉంటుంది. కేవలం ఈ 5 నిముషాలే సాధారణంగా గడిచింది అని అనజాలరు. సంగమ యుగములో 5 నిముషాలు కూడా చాలా మహత్వపూర్ణమైనవి. 5 నిముషాలు 5 సంవత్సరాల కంటే ఎక్కువైనవి. అందువలన ప్రతి సమయం అంత అప్రమత్తంగా(అటెన్షన్‌) ఉండాలి. సదా కొరకు రాజ్య భాగ్యము ప్రాప్తి చేసుకోవాలంటే అటెన్షన్‌ సదా కాలముండాలి.

స్లోగన్‌ :-

'' ఎవరి సంకల్పములో దృఢతా శక్తి ఉందో, వారికి ప్ర్రతి కార్యము సంభవమే. ''