02-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ పురుషోత్తమ సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయండి. వీలైనంత ఎక్కువగా స్మృతి మరియు చదువు పై గమనముంచండి.''
ప్రశ్న :-
పిల్లలైన మీరు చాలా గొప్ప వ్యాపారస్థులు. మీరు ఎల్లప్పుడూ ఏ విషయము పై గమనముంచి ఆలోచించాలి?
జవాబు :-
ఎల్లప్పుడూ లాభ, నష్టాలను గూర్చి ఆలోచించండి. వీటిని గూర్చి ఆలోచించకపోతే ప్రజలలో దాస-దాసీలుగా అవ్వవలసి వస్తుంది. తండ్రి 21 జన్మల రాజ్య వారసత్వమును ఏదైతే ఇస్తారో దానిని పోగొట్టుకుంటారు. కావున తండ్రితో పూర్తిగా వ్యాపారము చేయాలి. తండ్రి దాత. పిల్లలైన మీరు సుదాముని వలె పిడికెడు బియ్యమును(అటుకులు) ఇస్తారు. విశ్వరాజ్యాధికారమును తీసుకుంటారు.
ఓంశాంతి.
పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. ఇది ఒక స్కూలు. ఇది ఏ సత్సంగమూ కాదు. మీ ముందు మహంతులు, బ్రాహ్మణులు లేక సన్యాసులు ఎవ్వరూ లేరు. స్వామి కోపగించుకుంటారేమోనని భయపడవలసిన విషయమేదీ లేదు. భక్తిమార్గములో ఎవరైనా సాధు సన్యాసులను ఇంటికి పిలుచుకొని వస్తే, వారి కాళ్ళను కడిగి ఆ నీరు త్రాగుతారు. కానీ వీరు తండ్రి కదా! ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా తండ్రిని చూచి భయపడ్తారా? మీరైతే వారితో కలిసి తింటూ, త్రాగుతూ ఆడుకుంటారు. సన్యాసులు, గురువులు మొదలైనవారితో ఎవరైనా ఈ విధంగా చేస్తారా? అక్కడ రోజంతా గురూజీ-గురూజీ అని అంటూ ఉంటారు. ఇక్కడ అలా చేయరాదు. ఇక్కడ వీరు తండ్రి కదా. గురువు నుండి వేరుగా, టీచర్ నుండి వేరుగా వారసత్వము లభిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. కొడుకు పుట్టగానే వారసునిగా అవుతాడు. అలాగే ఇక్కడ కూడా తండ్రి పిల్లలుగా అవ్వగానే తండ్రిని గుర్తించగానే మనం స్వర్గాధిపతులుగా అయిపోతాము. తండ్రి స్వర్గ రచయిత. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గ రాజ్యమును ఎలా తీసుకున్నారో, ఎక్కడ నుండి తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. మనం ఈ విధంగా ఉండేవారము, మళ్ళీ అలాగే అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. అసలు ''వీరు ఎవరు, మేము ఎవరిని పూజిస్తున్నాము'' అని మనుష్యులు ఏ మాత్రము ఆలోచించరు. శివుని మందిరములోకి వెళ్లి కేవలం నీటితో అభిషేకము చేసి వస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మనము ఈ మృత్యులోకపు శరీరాలను వదిలి అమరలోకానికి వెళ్తామని మీకు అనుభూతి కలుగుతుంది. ఇది ఎంత గొప్ప ప్రాప్తి! భక్తిమార్గములో అసలు ఏ ప్రాప్తీ లేదు. నేను 12 మంది గురువుల వద్దకు వెళ్ళాను కాని అదంతా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే అని, ఇంకా క్రిందకు దిగజారుతూ వచ్చాననీ, ఇప్పుడు అర్థం చేసుకున్నానని ఈ బాబా కూడా చెప్తారు. కాని అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నాకు ఎవ్వరితోనూ శతృత్వము లేదు. ఇప్పుడు నాకు ఒక్క తండ్రితోనే ప్రీతి ఉంది. ఇప్పుడు మీరు క్లాసులోకి వచ్చినప్పుడు ఈ చిత్రాలను చూసి మేము ఇప్పుడు చదువుకొని ఈ విధంగా అవుతున్నామని ఎంతో సంతోషించాలి. ఈ రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుందో మీకు తెలుసు. పిల్లలూ! తికమక పడకండి అని బాబా అంటారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. అయినా ఆశ్చర్యవంతులై వింటారు. అందరికీ చెప్తారు, పారిపోతారు. మాయకు చెందినవారిగా అయిపోతారు. అటువంటివారిని ద్రోహులు అని అంటారు. వారు ఒక రాజధానిని వదిలి ఇంకొక రాజధానికి చెందినవారుగా అవుతారు. తండ్రి ఎంత బాగా పురుషార్థము చేయిస్తారు! భక్తిమార్గములో ఎంతగా భ్రమిస్తారు! దాన-పుణ్యాలు, తీర్థ యాత్రలు, వ్రతాలు, నోములు మొదలైనవెన్నో చేస్తారు. సాక్షత్కారం జరిగినా లాభమేముంది? పైకి ఎక్కే కళలోకి అయితే ఎవరూ వెళ్ళలేదు. ఇంకా క్రిందకే దిగజారారు. మీరు రోజురోజుకు పైకి ఎక్కేకళలోకి వెళ్తారు. మిగిలిన వారందరిదీ క్రిందికి దిగే కళే. జ్ఞానాన్ని బ్రహ్మకు పగలు అని, భక్తిని బ్రహ్మకు రాత్రి అని గురువులు కూడా అంటూ ఉంటారు. జ్ఞానము మరియు భక్తికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది! జ్ఞానము ద్వారా సుఖము లభిస్తుంది. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు. మళ్ళీ మీరే క్రిందకు దిగుతూ వచ్చారని తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు! కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు తండ్రి చెప్తారు. ఆత్మ వినాశనము లేనిది. హే అవినాశీ తండ్రి! నీవు వచ్చి మమ్మలను పావనంగా తయారు చేయండి అని ఆత్మ అంటుంది. ఇందులో ముక్తి-జీవన్ముక్తి అన్నీ వచ్చేస్తాయి. భక్తిలో మనకు ఏమీ తెలిసేది కాదని, కేవలం వెతుకుతూ ఉండేవారమని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. హే భగవంతుడా! దయ చూపించు అని కేవలం గానం చేసేవారు. భగవాన్ అని అనడంతో అందులో అంత రుచి అనుభవమవ్వదు. వారసత్వము గుర్తుకు రాదు. శివబాబా ఉన్నతోన్నతులని మీరు అంటారు. అప్పుడు వెంటనే వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది. ఇదంతా రావణరాజ్యమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములో రావణ రాజ్యముంటుంది. ఇప్పుడిది కలియుగము. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులే ఉండేవారు. ఒకే ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది. సుఖ-శాంతులు ఉండేవి. ఇక్కడైతే మనుష్యులు శాంతి కొరకు భ్రమిస్తూ ఉంటారు. కాన్ఫ్రెన్సులు మొదలైనవి జరపడంలో ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు! వారు శాంతి సాగరులు, పవిత్రతా సాగరులు అంతేకాక సంపదకు కూడా వారు సాగరులు. అన్నీ వారి ద్వారానే లభిస్తాయి అని మీరు వారికి వ్రాయవచ్చు.
సత్యయుగములో మనం చాలా ధనవంతులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. మిగిలిన ఆత్మలందరికీ పరంధామ ఇంట్లో శాంతి లభిస్తుంది. విశ్వంలో మనం ఒక్కరమే ఉండేవారము. అప్పుడు శాంతి-సుఖాలు అన్నీ ఉండేవి. కావున పిల్లలకు ఎంతో సంతోషముండాలి. ఇటువంటి స్వర్గమును గురించి శాస్త్రాలలో ఏవేవో వ్రాసేశారు. నేను మీకు ఎంతగా అర్థం చేయిస్తానంటే, దానితో మీరు ప్రశ్నలు మొదలైనవేవీ అడగవలసిన అవసరం కూడా లేదు అని ఇప్పుడు తండ్రి అంటారు. మొదట నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అనగా పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. కాని దాని అర్థమేమీ తెలుసుకోరు. దారము చిక్కుపడి ఉంది (బుద్ధి తికమక చెంది ఉంది). ఇప్పుడు దానిని సరి చేయవలసి ఉంటుంది. భక్తిలో ఎన్ని చిత్రాలు తయారు చేశారు! కృష్ణునికి చక్రమును ఇచ్చేశారు. దానితో అకాసురుడు, బకాసురుడు మొదలైనవారిని హతమార్చాడని అన్నారు. అరే! అతడేమైనా హింసకుడా? మళ్లీ ఫలానా, ఫలానా వారిని ఎత్తుకుపోయాడని అంటారు. అతడిని డబుల్ హింసకునిగా చేసేశారు. ఆశ్చర్యము కదా! ఎవరైతే శాస్త్రాలను తయారు చేశారో, వారి బుద్ధిదే ఆ చమత్కారమంతా. మళ్ళీ అతడిని వ్యాసభగవానుడు అని కూడా అంటారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, దైవీగుణాలను ధారణ చేయండి. ఇక ఏ కష్టమూ లేదు అని తండ్రి అంటారు. మిమ్ములను యోగములో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాబాను స్మృతి చేయనివారు చాలామంది ఉన్నారు. వారు తమ వ్యాపారాలలోనే నిమగ్నమై ఉంటారు. వారికి అసలు ఖాళీయే ఉండదు. కాని ఇందులో అయితే పనులు మొదలైనవి చేసుకుంటూ కూడా బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. మీరంతా ప్రియుడినైన నాకు ప్రేయసులు. ఇప్పుడిక ఇతర సాంగత్యాలను తెంచి నా ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి అని నేను మీతో చెప్తున్నాను. తింటూ, తిరుగుతూ కేవలం నేను ఒక ఆత్మను అని భావించే అలవాటు చేసుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి మిమ్ములను ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు! మీరు ఈ చిన్న విషయాలు కూడా వినరు. నన్ను స్మృతి చేయరు. మీ పిల్లా పాపలను స్మృతి చేస్తారు కాని నన్ను స్మృతి చేయలేరా? నిజానికి నేష్టా అన్న పదమును వాడడం తప్పు. బాబా నేరుగా వచ్చి నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. కల్ప పూర్వము కూడా తండ్రి సన్ముఖంగా అర్థం చేయించారు. మధురాతి మధురమైన పిల్లలూ! కల్పం తర్వాత కలసిన ప్రియమైన పిల్లలూ! ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తి అయ్యాయని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళేందుకు మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. వికారాలలోకి వెళ్ళిన కారణంగానే మీరు చాలా పతితులుగా అయిపోయారు. పావనంగా అవ్వకపోతే పదవి కూడా తక్కువగానే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయండి, ఇదే స్వదర్శన చక్రము. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. మీ నోటి ద్వారా జ్ఞాన శంఖాన్ని మ్రోగించాలి. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ మీ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పైకి ఎక్కే కళలోకి వెళ్తారు. ఇది ఎంత సహజమైన విషయం!
ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. ఇప్పుడు పురుషార్థం మంచిగా చేయండి. మీరు ధనం వెనుక ఎందుకు పరిగెత్తి మరణిస్తారు? అచ్ఛా! నెలకు ఒక లక్ష, రెండు లక్షలు సంపాదించినా అదంతా అంతమైపోతుంది. వాటిని తినేందుకు పిల్లా పాపలెవరూ ఉండరు! పుత్ర, పౌత్రాదులు, ఆ తర్వాతి వారు తింటారు అన్న లోభముంటుంది. పునర్జన్మలన్నీ అదే కులంలో తీసుకోరు. పునర్జన్మలు ఎక్కడెక్కడ తీసుకుంటారో ఏమీ తెలియదు. మీరైతే 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. పురుషార్థము తక్కువగా చేసినట్లయితే ప్రజలలోకి వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. కనుక ఎంత నష్టం కలుగుతుంది! కావున లాభ-నష్టాలను గురించి కూడా ఆలోచించండి. వ్యాపారస్థులు చాలా పాపాలు కూడా చేస్తారు. కనుక ధర్మార్థము ఎంతో కొంత తీస్తూ ఉంటారు. ఇది అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారము. దీనిని ఏ ఒక్కరో చేస్తారు. ఈ వ్యాపారాన్ని నేరుగా తండ్రితో చేయాలి. తండ్రి జ్ఞానరత్నాలను ఇస్తారు. వారు దాత. పిల్లలు పిడికెడు బియ్యమును(అటుకులు) ఇస్తారు. కాని తండ్రి అనంతమైన విశ్వ రాజ్యాధికారమును ఇస్తారు. దానితో పోల్చి చూస్తే ఇదంతా పిడికెడు బియ్యం వంటిదే కదా! మీరందరూ సుదాములే. మీరు ఇచ్చేదేమిటి, తీసుకునేదేమిటి? విశ్వరాజ్యాధికారాన్ని తీసుకొని విశ్వాధిపతులుగా అవుతారు. భారత ఖండము ఒక్కటే ఉంటుందని బుద్ధి చెప్తుంది. ప్రకృతి కూడా క్రొత్తగా ఉంటుంది. ఆత్మ కూడా సతోప్రధానంగా ఉంటుంది. దేవతలైన మీరు సత్యయుగములో ఉన్నప్పుడు పవిత్రమైన బంగారంగా ఉండేవారు. మళ్లీ త్రేతా యుగములో ఆత్మలో కొద్దిగా వెండి కలుస్తుంది. దానిని వెండి యుగము అని అంటారు. మెల్లగా మెట్లు దిగుతూ ఉంటారు. ఈ సమయములో మీరు చాలా ఉన్నతులు. విరాట రూపము చిత్రము కూడా ఉంది. కేవలం అర్థాన్ని తెలుసుకోరు. లెక్కలేనన్ని చిత్రాలున్నాయి! కొందరు క్రీస్తు చిత్రాన్ని పెట్టుకుంటే, కొందరు సాయిబాబా చిత్రాన్ని పెట్టుకుంటారు. ముసల్మానులు కూడా గురువు వద్దకు వెళతారు. మళ్లీ అక్కడకు వెళ్ళి మద్యము త్రాగే సభను ఏర్పాటు చేస్తారు. అది ఎంత అజ్ఞానాంధకారము! అని తండ్రి అంటారు. ఇది అంతా భక్తి అంధకారము!
సాంగత్యమును గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యమైన సాంగత్యము తీరాన్ని చేరుస్తుందని, కుసాంగత్యము ముంచేస్తుందని అంటారు కూడా. పంచ వికారాల మాయ సాంగత్యమే కుసాంగత్యము. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి సాంగత్యము లభించింది. దాని ద్వారా మీరు ఆవలి తీరానికి వెళ్తున్నారు. తండ్రి ఒక్కరే సత్యమును చెప్తారు. కల్ప-కల్పము మీకు సత్యముతో సాంగత్యము లభిస్తుంది. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణుని కుసాంగత్యము లభిస్తుంది. కల్ప పూర్వము వలె రాజధాని తప్పకుండా స్థాపితమౌతుందని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు తప్పకుండా విశ్వాధిపతులుగా అవుతారు. ఇక్కడ విభజనలు జరిగిన కారణంగా ఎన్నో గొడవలు జరుగుతాయి. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. విశ్వములో శాంతి ఉండేది. అప్పుడు దేవతల అద్వైత రాజ్యము ఉండేది. ఒకే ధర్మం ఉండేది. మరి అక్కడకు అశాంతి ఎక్కడ నుండి వస్తుంది? అది ఈశ్వరీయ రాజ్యము. ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా పరమాత్మ రాజధానిని స్థాపించారు. మరి తప్పకుండా అక్కడ సుఖమే ఉంటుంది. తండ్రికి పిల్లల పై ప్రేమ ఉంటుంది కదా! మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుందో నాకు తెలుసునని తండ్రి అంటారు. భగవంతుడు ఏదో ఒక రూపములో వస్తారని భావిస్తారు. కొన్నిసార్లు ఎద్దు పైన కూడా స్వారీ చేసినట్లుగా చూపిస్తారు. ఎక్కడైనా అలా ఎద్దు పై స్వారీ జరుగుతుందా? ఇది ఎంతటి అంధకారము! కావున పిల్లలైన మీరు ఇప్పుడు వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారని అందరికీ చెప్పండి. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. తండ్రి ఎప్పుడూ మర్రి వృక్షమును ఉదాహరణంగా ఇస్తారు. దాని కాండమేదైతే ఉందో దానిని మళ్ళీ పున: స్థాపితము చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకే ధర్మమూ ఉండదు. భారతదేశము అవినాశీ ఖండము, అవినాశీ తీర్థ స్థానము. అది తండ్రి జన్మ స్థానము కదా! బాబా మధురాతి మధురమైన పిల్లలకు ఎంతో ప్రేమగా అర్థము చేయిస్తారు. టీచరు రూపములో చదివిస్తారు! పిల్లలైన మీరు బాగా చదువుకొని నా కంటే ఉన్నతానికి వెళ్లిపోతారు. నేనైతే రాజ్యమును తీసుకోను. స్వర్గములోకి రమ్మని మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? నేను మిమ్ములను స్వర్గములోకి పంపిస్తాను. ఇది ఎంత రమ్యమైన ఆట! అచ్ఛా పిల్లలూ! జీవిస్తూ ఉండండి, నేను వానప్రస్థావస్థలోకి వెళ్లి ఉంటానని తండ్రి అంటారు.
ఇప్పుడు ఆపదలు శిరస్సు పై నిల్చొని ఉన్నాయి. కావున పురుషోత్తములుగా అయ్యేందుకు ఈ పురుషోత్తమ సంగమ యుగములో పూర్తిగా పురుషార్థము చేయాలని బాబా అంటారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమౌతాయి. ఎవరు ఎంతగా చదువుతారో వారు అంతగా ఉన్నత కులములోకి వెళ్ళి జన్మిస్తారు. మీకు మీరుగా చేస్తే ఎంతో నషా కలుగుతుంది. సదా పిల్లలకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. లౌకికములో అయితే కొడుకుకే లభిస్తుంది. కన్యను దానమివ్వడము జరుగుతుంది. ఇక్కడైతే ఆత్మలందరికీ వారసత్వము లభిస్తుంది. అందులోనూ అనంతమైన వారసత్వము లభిస్తుంది. కావున ఈ విషయము పై పూర్తి గమనము ఉంచాలి. భగవంతుడు చదివిస్తారు. కావున ఒక్క రోజు కూడా మిస్ అవ్వరాదు. నాకు ఖాళీ లేదు అని తండ్రితో అంటారా? అరే, నా ద్వారా చదివేందుకు ఆత్మకు ఖాళీ లేదు అని అనేందుకు సిగ్గు కలగడం లేదా? అచ్ఛా! (మంచిది).
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సాంగత్యము నుండి మిమ్ములను మీరు చాలా సంభళించుకోవాలి(కాపాడుకోవాలి). ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యమునే చేయాలి. పంచ వికారాల రూపి మాయ సాంగత్యము నుండి చాలా దూరంగా ఉండాలి.
2. చదువు పై పూర్తి గమనము ఉంచాలి. మీ నషాలో మీరు ఉండాలి. తమకు తాముగా చేస్తే అందులో నషా ఎక్కుతుంది(అపనీ ఘోట్తో నషా చఢే) అని అంటారు. ఒక్క రోజు కూడా చదువును మిస్ చేయకండి.
వరదానము :-
''తండ్రి సహాయముతో శూలాన్ని ముల్లుగా చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ''
పాత(వెనుకటి) లెక్కాచారము శూలము వంటిది. కాని తండ్రి సహాయముతో అది ముల్లుగా అయిపోతుంది. పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అన్నీ ఇక్కడే చుక్త(సమాప్తం) చేసుకోవాలి. కాని తండ్రి సహాయము వాటిని ముల్లుగా చేసేస్తుంది. పెద్ద విషయాన్ని చిన్నగా చేసేస్తుంది. ఎందుకంటే బడా బాప్(గొప్ప తండ్రి) జతలో ఉన్నాడు. ఈ నిశ్చయం ఆధారముతో సదా నిశ్చింతులుగా ఉండండి. ట్రస్టీగా అయ్యి 'నాది' ని 'నీది' లోకి మార్చి తేలికైపోండి. అప్పుడు అన్ని బరువులు ఒక సెకండులో సమాప్తమైపోతాయి.
స్లోగన్ :-
''శుభ భావనల స్టాక్ ద్వారా నెగటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి.''
బ్రహ్మబాబా సమానంగా
అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
అంతర్ముఖ స్థితి ద్వారా ప్రతి ఒక్కరి మనసులోని రహస్యాన్ని తెలుసుకొని వారిని
సంతోషపరచండి. అందుకు సాధారణ రూపములో అసాధారణ స్థితిని మీరూ అనుభవం చేయండి, ఇతరులకు
కూడా చేయించండి. బాహ్యముఖతలోకి వచ్చునపుడు అంతర్ముఖతా స్థితిని కూడా జతలో ఉంచుకోండి.