11-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీరెప్పుడూ విఘ్నరూపంగా అవ్వరాదు. మీలో ఏవైనా లోపాలుంటే వాటిని తొలగించి వేయండి. సత్యమైన వజ్రంగా తయారయ్యేందుకు ఇదే మంచి సమయము.''

ప్రశ్న :-

ఏ విషయములో లోపము(డిఫెక్ట్‌) ఉంటే ఆత్మ విలువ తగ్గుతూ ఉంటుంది?

జవాబు :-

మొదటి లోపము అపవిత్రత. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడు(స్థాయి) చాలా ఉన్నతంగా ఉంటుంది. అది అమూల్యమైన రత్నము. నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది. అపవిత్రత ఎంత కొద్దిగా ఉండినా, అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సమానము సదా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి. మిమ్ములను తన సమానము పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పవిత్రంగా ఉన్న పిల్లలకు మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తూ ఉంటుంది(లాగుతూ ఉంటుంది). వారు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరు. చాలా మధురంగా ఉంటారు.

ఓంశాంతి.

డబల్‌ ఓంశాంతి అని కూడా అనవచ్చు. ఇది పిల్లలకూ తెలుసు, బాప్‌దాదాకు కూడా తెలుసు. ఓంశాంతికి అర్థము - ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అంతేకాక నేను శాంతిసాగరులు, సుఖసాగరులు, పవిత్రతా సాగరులైన తండ్రి సంతానాన్ని అని కూడా అర్థము. మొట్టమొదట తండ్రి పవిత్రతా సాగరులు. పవిత్రంగా తయారవ్వడంలోనే మనుష్యులకు చాలా కష్టము కలుగుతుంది. పవిత్రంగా అవ్వడంలో చాలా గ్రేడులున్నాయి. ఈ గ్రేడ్లు కూడా పెరుగుతూ ఉంటాయని పిల్లలందరూ అర్థం చేసుకోగలరు. ఇంకా మనము సంపూర్ణమవ్వలేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైన లోపము తప్పకుండా ఉంది. పవిత్రతలో, యోగములో..... ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధమైన లోపముంది. దేహాభిమాన కారణంగానే లోపాలు ఏర్పడ్తాయి. కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో తక్కువగా లోపాలుంటాయి. రకరకాల వజ్రాలుంటాయి. వాటిని భూతద్దముతో(మాగ్నిఫైయింగ్‌ గ్లాస్‌తో) పరిశీలిస్తారు. ఎలాగైతే తండ్రి ఆత్మను (పరమాత్మను) అర్థము చేసుకుంటారో అలాగే ఆత్మల(పిల్లలు)ను కూడా అర్థము చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రత్నము కదా. రత్నము కూడా అందరూ నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది. ముత్యము, మాణిక్యము, పుష్యరాగము మొదలైనవి నమస్కరించేందుకు అర్హత కలవి. అందుకే అన్ని రకాల వజ్రాలు వేసుకుంటారు. నంబరువారు పురుషార్థానుసారము ఉంటారు కదా. అనంతమైన తండ్రి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారి. ఈ వ్యాపారము చేయువారు వారు ఒక్కరే. వారిని వజ్రాల వ్యాపారి అని కూడా అంటారు. జ్ఞాన రత్నములిస్తారు కదా. అంతేకాక వారి రథము కూడా వజ్రాల వ్యాపారే. అతనికి కూడా రత్నాల విలువ తెలుసు. వజ్రాలను భూతద్దము ద్వారా చాలా బాగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ వజ్రములో ఏ లోపముంది? ఇది ఎటువంటి రత్నము? అని పరిశీలిస్తారు. ఎంతవరకు సేవాధారులుగా ఉన్నారు? అని చూస్తారు. రత్నాలను చూచేందుకు ఇష్టపడతాము. మంచి రత్నములైతే వాటిని చాలా ప్రీతిగా చూస్తారు. ఇది చాలా బాగుంది అని అంటారు. దీనిని బంగారు భరిణలో ఉంచాలని భావిస్తారు. పుష్యరాగము మొదలైన వాటిని బంగారు భరిణలో ఉంచరు. అలాగే ఇక్కడ కూడా అటువంటి బేహద్‌ రత్నాలుగా అవుతారు. ప్రతి ఒక్కరు నేను ఎటువంటి రత్నమును? అని వారి హృదయానికి తెలుసుకుంటారు. మాలో ఏ లోపమూ లేదు కదా? రత్నాలను, మణులను ఎలాగైతే చాలా పరిశీలించి చూస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవలసి ఉంటుంది. మీరు చైతన్య రత్నాలు. కావున ప్రతి ఒక్కరు తమను తాము పరిశీలించుకోవాలి - నేను ఎంతవరకు పచ్చను, నీలమణిగా అయ్యాను. పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీ, కొన్ని గులాబి, కొన్ని ఎలాగో ఉంటాయి. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని గురించి చాలా బాగా తెలుసుకోగలరు. రోజంతటిలో నేను ఏమి చేశాను? అని మీ అంతకు మీరు చూసుకోండి. బాబాను ఎంత సమయము స్మృతి చేశాను? గృహస్థ వ్యవహారములో ఉంటూ తండ్రిని స్మృతి చేయమని కూడా బాబా చెప్పారు. నారదునికి కూడా నీ ముఖము చూసుకో,........... అని బాబా చెప్పారు. ఇది కేవలం ఒక ఉదాహరణ. పిల్లలైన మీరు ఒక్కొక్కరు తమకు తామే చాలా బాగా పరిశీలించుకోవాలి. ఏ తండ్రి ద్వారా మేము వజ్రాలుగా తయారౌతున్నామో వారి పై మాకు ఎంతవరకు ప్రేమ ఉంది? ఎంతవరకు నాలో దైవీ స్వభావాలున్నాయి? స్వభావాలు కూడా మానవులను చాలా సతాయిస్తాయి. ప్రతి ఒక్కరికి మూడవ నేత్రము లభించింది. దాని ద్వారా స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎంతవరకు నేను తండ్రిని స్మృతి చేస్తున్నాను? నా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతున్నది? వారి స్మృతిలో రోమాంచితమవ్వాలి. ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచుకోవాలి. కానీ తండ్రి స్వయంగా చెప్తున్నారు - మాయ వేసే విఘ్నాలు సంతోషములోకి రాకుండా అడ్డుకుంటాయి. ఇప్పుడు మనము పురుషార్థము చేస్తున్నామని పిల్లలకు తెలుసు. చివర్లో ఫలితము వెలువడ్తుంది. స్వయం మీకు మీరు పరిశీలించుకోండి. లోపాలు ఇప్పుడు మీరు తొలగించుకోవచ్చు. సంపూర్ణ పవిత్ర వజ్రంగా తయారవ్వాలి. ఏ కొద్ది లోపమున్నా విలువ తగ్గిపోతుందని భావిస్తారు. మీరు రత్నాలు కదా. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, సదా పవిత్రంగా, విలువైన వజ్రాలుగా అవ్వాలి. పురుషార్థము చేయించేందుకు బాబా భిన్న-భిన్న ప్రకారాలుగా అర్థము చేయిస్తారు.

(ఈ రోజు యోగము చేయించే సమయములో బాప్‌దాదా గద్దె నుండి లేచి సభ మధ్యలో తిరిగారు. పిల్లలందరిని నయనాలతో కలుసుకున్నారు). బాబా ఈ రోజు ఎందుకు లేచారు? పిల్లలలో సేవాధారి పిల్లలెవరో చూచేందుకు లేచారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చుని ఉంటారు. కావున బాబా లేచి ఒక్కొక్కరిలో ఏ గుణాలున్నాయో స్వయంగా చూచారు. అలాగే ఎంత ప్రేమ ఉందో కూడా చూచారు. పిల్లలందరూ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. కనుక చాలా ప్రియంగా అనిపిస్తారు. కానీ నంబరువారు పురుషార్థానుసారముగానే ప్రియంగా ఉంటారు. ఎవరిలో ఏ లోపముందో తండ్రికి తెలుసు. ఎందుకంటే ఏ శరీరములో తండ్రి ప్రవేశించారో అతడు కూడా తనను తాను పరిశీలించుకుంటాడు. బాప్‌దాదా ఇరువురూ కలిసే ఉన్నారు కదా. అందువలన ఎవరైతే ఇతరులకు ఎంతెంత సఖమునిస్తారో, ఎవరికీ దు:ఖమివ్వకుండా ఉంటారో వారు గుప్తంగా ఉండలేరు. గులాబీలు, మల్లెపూలు ఎప్పుడూ గుప్తంగా ఉండలేవు. బాబా పిల్లలకు పూర్తిగా అర్థము చేయించి - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీలోని తుప్పు వదిలిపోతుందని అంటారు. స్మృతి చేసే సమయములో రోజంతా ఏమేమి చేశారో దానిని కూడా పరిశీలించుకోవాలి. నాలో ఏ అవగుణముంది? ఏ అవగుణము తండ్రి హృదయము పై నన్ను కూర్చోనీకుండా చేస్తోంది? అని చూచుకోవాలి. అందుకే తండ్రి లేచి పిల్లలను చూస్తారు. నా హృదయ సింహాసనం పై కూర్చునేవారు ఎవరు? అని గమనిస్తారు. సమయము సమీపానికి వచ్చినప్పుడు మేము ఎంతవరకు పాసౌతామని వెంటనే పిల్లలకు తెలిసిపోతుంది. పాస్‌ అవ్వలేని వారికి ముందే తెలిసిపోతుంది. నాకు పాస్‌ మార్కులు రావు అని తెలుస్తుంది. మాకు మార్కులు లభించనున్నాయని మీరు కూడా భావిస్తారు. మనము ఎవరి విద్యార్థులము? భగవంతుని విద్యార్థులము. ఈ దాదా ద్వారా మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. కావున మీకు ఎంత సంతోషముండాలి! బాబా మనలను ఎంత ప్రేమిస్తున్నారు! ఎంత మధురమైనవారు! వారు మనకు ఏ కష్టమునివ్వరు. కేవలం చక్రమును స్మృతి చేయండని అంటారు. ఇది కష్టమైన చదువేమీ కాదు. లక్ష్యము మీ ముందే నిలబడి ఉంది. మనము ఇలా తయారవ్వాలని స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్యము దైవీ గుణాలకు సంబంధించినది. మీరు దైవీ గుణాలను ధారణ చేసి వీరి వలె పవిత్రంగా అవుతారు. అప్పుడే మాలలో కూర్చబడ్తారు. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారు. సంతోషముంటుంది కదా. బాబా మనలను తప్పకుండా తమ సమానంగా పవిత్రంగా, జ్ఞాన పూర్ణులుగా తయారు చేస్తారు. ఇందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడింకా ఎవ్వరూ పరిపూర్ణులుగా అవ్వలేదు. అంతములో అవుతారు. దాని కొరకు పురుషార్థము చేయాలి. తండ్రిని అందరూ ప్రేమిస్తారు. బాబా అంటూనే హృదయము వికసిస్తుంది. తండ్రి నుండి లభించే వారసత్వము ఎంత గొప్పది? ఒక్క తండ్రి పై తప్ప మరెక్కడా మనసు పోరాదు. తండ్రి స్మృతి చాలా సతాయిస్తూ ఉండాలి. బాబా, బాబా, బాబా అంటూ అత్యంత ప్రేమతో తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది. రాజు కుమారుడైతే అతనికి రాజరికపు నషా ఉంటుంది కదా. ఇప్పుడైతే రాజులకు గౌరవము లేదు. బ్రిటిష్‌ ప్రభుత్వమున్నప్పుడు వారికి చాలా గౌరవము లభించేది. వారికి ఒక్క వైస్‌రాయ్‌ తప్ప అందరూ నమస్కరించేవారు(సలాం చేసేవారు). మిగిలినవారంతా రాజులకు నమస్కరించేవారు. ఇప్పుడు వారి గతి ఏమైపోయిందో చూడండి. ఇప్పుడెవ్వరూ రాజ్యపదవి కోరుకోరని కూడా మీకు తెలుసు.

నేను పేదల పెన్నిధినని బాబా అర్థం చేయించారు. పెేదవారు వెంటనే తండ్రిని తెలుసుకుంటారు. ఇదంతా వారిదేనని భావిస్తారు. వారి శ్రీమతముననుసరించే అన్నీ చేస్తామని భావిస్తారు. ధనవంతులకైతే వారి ధనము గురించిన నషా ఉంటుంది. అందుకే పేదవారు పురుషార్థము చేసినట్లు వారు చేయలేరు. అందువలన నేను పేదల పెన్నిధినని తండ్రి చెప్తున్నారు. అయితే గొప్పవారిని కూడా ఉన్నతి చేయాలి. ఎందుకంటే వారి కారణంగా పేదలు కూడా వెంటనే వచ్చేస్తారు. ఇంత గొప్పవారే ఇచ్చటకు పోతున్నారు అని మిగిలినవారు కూడా వచ్చేస్తారు. కానీ పాపం పేదవారు చాలా భయపడ్తారు. ఒకానొక రోజు వారు కూడా మీ వద్దకు వచ్చేస్తారు. ఆ రోజు కూడా వస్తుంది. అప్పుడు వారికి మీరు తెలుపుతే చాలా సంతోషిస్తారు. ఒక్కసారిగా అతుక్కొనిపోతారు. వారి కొరకు కూడా మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. మేమందిరినీ ఉద్ధరించాలని పిల్లల హృదయములో ఉంటుంది. వారు కూడా చదువుకుని పెద్ద ఆఫీసర్లు మొదలైనవారుగా అవుతారు కదా. మీది ఈశ్వరీయ మిషన్‌(సంస్థ). మీరు అందరినీ ఉద్ధరించాలి. కోయజాతి స్త్రీ(శబరి) ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నాడని గాయనము కూడా ఉంది కదా. వివేకము కూడా పేదలకే దానము చెయ్యాలని, ధనవంతులకు కాదని చెప్తుంది. మీరు ముందు ముందు ఇవన్నీ చెయ్యాలి. ఇందులో యోగబలముండాలి. దాని వలన వారు ఆకర్షింపబడ్తారు. యోగబలము దేహాభిమాన కారణంగా తక్కువగా ఉంది. మాకు తండ్రి స్మృతి ఎంతవరకు ఉంది? అని ప్రతి ఒక్కరు వారి వారి మనస్సులను ప్రశ్నించుకోండి. ఎక్కడా మేము చిక్కుకోవడం లేదు కదా? ఎవరిని చూచినా చలించకుండా ఉండు స్థితి తెచ్చుకోవాలి. దేహాభిమానులుగా అవ్వకండని బాబా ఆజ్ఞాపిస్తున్నారు. అందరినీ మీ సోదరులుగా భావించండి. మనమంతా సోదరులమని ఆత్మకు తెలుసు. దేహ ధర్మాలన్నీ వదిలేయాలి. అంతములో ఏ మాత్రమైనా గుర్తు వస్తే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. మీ స్థితిని ఇంత స్థిరంగా చేసుకోవాలి. అంతేకాక సేవ కూడా చేయాలి. ఇటువంటి స్థితిని తయారు చేసుకున్నప్పుడు ఈ పదవి లభిస్తుందని లోలోపల భావించాలి. తండ్రి చాలా బాగా అర్థము చేయిస్తారు. చేయవలసిన సేవ చాలా మిగిలి ఉంది. మీలో కూడా శక్తి ఉంటే వారికి ఆకర్షణ కలుగుతుంది. అనేక జన్మల తుప్పు పట్టి ఉంది. బ్రాహ్మణులైన మీరు ఈ విధంగా ఆలోచించాలి. ఆత్మలందరినీ పవిత్రంగా చేయాలి. ఇది మానవ మాత్రులెవ్వరికీ తెలియదు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారము తెలుసు. తండ్రి అన్ని విషయాలు చాలా బాగా అర్థము చేయిస్తున్నారు. ఎవరికి వారు పరిశీలించుకోవాలి. బాబా ఎలాగైతే అనంతములో నిలబడి ఉన్నారో అలా పిల్లలు కూడా అనంతమైన ఆలోచనలు చేయాలి. తండ్రికి ఆత్మల పై ఎంత ప్రేమ ఉంది! ఇంత కాలము ప్రేమ ఎందుకు లేదు?ఎందుకంటే అనేక లోపాలుండేవి. పతితాత్మలను ఏం ప్రేమిస్తారు? ఇప్పుడు తండ్రి అందరినీ పతితము నుండి పావనంగా చేసేందుకు వచ్చారు. కావున అత్యంత ప్రియంగా అవ్వవలసి వస్తుంది. బాబా అత్యంత ప్రియమైనవారు. పిల్లలను చాలా ఆకర్షిస్తారు. రోజురోజుకు ఎంత పవిత్రంగా అవుతారో అంత మీకు ఆకర్షణ లుగుతుంది. బాబాలో చాలా ఆకర్షణ ఉంటుంది. ఎంత ఆకర్షిస్తారంటే మీరు ఆకర్షింపబడకుండా ఉండలేరు. మీ స్థితి నంబరువారు పురుషార్థానుసారము ఆ విధంగా అయిపోతుంది. ఇక్కడ తండ్రిని చూస్తూ ఉంటే ఇప్పుడే వెళ్లి కలుసుకుంటామని అనిపిస్తుంది. ఇటువంటి బాబా నుండి ఎప్పుడూ విడిపోము అని అంటారు. అప్పుడు బాబాకు కూడా పిల్లల పై చాలా ఆకర్షణ కలుగుతుంది. ఈ పుత్రుడు చాలా అద్భుతమైనవాడు, చాలా సేవ చేస్తాడు అని అనుకుంటాడు. కొన్ని లోపాలున్నా సమయానికి చాలా గొప్ప సేవ చేస్తాడని బాబా అర్థము చేసుకుంటారు. ఎవ్వరికీ దు:ఖమిచ్చే ఆసామి కాదని తెలుస్తుంది. జబ్బులు మొదలైనవి వస్తే అది కర్మభోగము. ఎంతవరకు ఇక్కడ ఉంటామో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని మీకు తెలుసు. ఇది నా రథము. కానీ చివరివరకు కర్మభోగము అనుభవించవలసిందే. నేను ఇతనికి ప్రత్యేక ఆశీర్వాదాలేమీ ఇవ్వను. ఇతను కూడా తన పురుషార్థము చేయాలి. రథము ఇచ్చింది నిజమే. దాని కొరకు ఏదో ఒక బహుమతిని ఇచ్చేస్తాను. బంధనములో ఉన్న చాలా మంది స్త్రీలు ఏదో ఒక విధంగా కష్టపడి వస్తారు. యుక్తితో తప్పించుకొని వస్తారు. వారికున్నంత ప్రేమ మరెవ్వరికీ లేదు. చాలామందికి ప్రేమ లేనే లేదు. బంధనములో ఉన్నవారి ప్రేమతో ఎవ్వరినీ పోల్చలేము. వారి యోగము తక్కువగా ఉంటుందని ఎప్పుడూ భావించరాదు. చాలా స్మృతిలో ఏడుస్తూ ఉంటారు. బాబా, ఓ బాబా, మేము మిమ్ములను ఎప్పుడు కలుసుకుంటాము? బాబా, విశ్వానికి అధికారులుగా తయారుచేసే బాబా, మీతో మేము ఎలా కలవాలి? అని వాపోతూ ఉంటారు. ఇటువంటి బంధనములో ఉన్నవారు ప్రేమ బాష్పాలు ప్రవహింపజేస్తూ ఉంటారు. అవి దు:ఖముతో వచ్చు కన్నీరు కాదు. వారి ప్రేమ బాష్పాలు ముత్యాలుగా అవుతాయి. అందువలన బంధనములో ఉన్న స్త్రీల యోగము తక్కువైనదేమీ కాదు. స్మృతిలో చాలా తపించిపోతూ ఉంటారు. ఓ బాబా, మేము మీతో ఎప్పుడు కలవాలి? సర్వ దు:ఖాలు నశింపజేసే బాబా! ఎంతసేపు మీరు స్మృతిలో ఉంటారో, సేవ కూడా చేస్తారో, బంధనములో ఉండినా, స్వయం సేవ చేయలేకపోయినా, వారి స్మృతి ద్వారా వారికి బలము లభిస్తుంది. అన్నీ స్మృతిలోనే ఇమిడి ఉన్నాయి. అలమటిస్తూ ఉంటారు. బాబా మిమ్ములను కలుసుకునేందుకు మాకు అవకాశము ఎప్పుడు లభిస్తుంది? అని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. పోను పోను మీకు తీవ్రమైన ఆకర్షణ కలుగుతుంది. స్నానము చేస్తూ, కర్మలు చేస్తూ స్మృతిలో ఉంటారు. బాబా, ఈ బంధనాలు తొలిగే రోజు ఎప్పుడు వస్తుంది? అని అడుగుతూ ఉంటారు. బాబా, ఇతడు మమ్ములను చాలా విసిగిస్తున్నాడు, ఏం చేయాలి? పిల్లలను కొట్టవచ్చా? అలా కొడితే పాపం కాదా? అని అడుగుతారు. బాబా చెప్తున్నారు - ఇప్పటి పిల్లలు ఎటువంటివారంటే వర్ణించనలవి కాదు. కొంతమందికి పతి ద్వారా దు:ఖము కలుగుతూ ఉంటుంది. అందువలన ఈ బంధనము తొలగిపోతే మేము బాబాతో కలుసుకుంటాము అని లోలోపల ఆలోచిస్తూ ఉంటారు. బాబా, ఇది చాలా కఠినమైన బంధనము, ఏం చేయాలి? ఈ పతి బంధనము ఎప్పుడు వదులుతుంది? ఈ విధంగా బాబా, బాబా అని అంటూ ఉంటారు. వారి పై ఆకర్షణ కలుగుతుంది కదా. అబలలు చాలా సహిస్తారు. బాబా పిల్లలకు ధైర్యము చెప్తున్నారు. పిల్లలూ! మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మాలో ఏ అవగుణము లేదు కదా? మా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతోంది? మా స్వభావాలు దైవీ స్వభావాలుగా ఉన్నాయా? వృత్తి ఇతర వైపులకు వెళ్లడం లేదు కదా? అని స్వయాన్ని చెక్‌ చేసుకోవాలి.

2. తండ్రిని ఆకర్షించేటంత ప్రియంగా అవ్వాలి. అందరికీ సుఖమునివ్వాలి. అత్యంత ప్రీతితో తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము :-

'' వ్యర్థ సంకల్పాలనే పిల్లర్లను(స్తంభాలను) ఆధారంగా చేసుకునేందుకు బదులు సర్వసంబంధాల అనుభవాన్ని పెంచుకునే సత్యమైన స్నేహీ భవ ''

మాయ, బలహీన సంకల్పాలను దృఢంగా చేసేందుకు చాలా రాయల్‌ పిల్లర్లను ఉపయోగిస్తుంది. మాటిమాటికి ఇలా జరుగుతూనే ఉంటుంది, పెద్ద పెద్ద వారు కూడా ఇలా చేస్తున్నారు, ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు, ఏదో ఒక బలహీనత ఉండనే ఉంటుంది...... అనే సంకల్పాలను ఇస్తూ ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలనే పిల్లర్లు బలహీనతను ఇంకా గట్టిగా చేసేస్తాయి. ఇప్పుడు అటువంటి పిల్లర్ల ఆధారాన్ని తీసుకునేందుకు బదులు సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచండి. సాకార రూపంలో తోడును అనుభవం చేస్తూ సత్యమైన స్నేహీలుగా అవ్వండి

స్లోగన్‌ :-

'' సంతుష్టత (తృప్తి) అన్నిటికంటే గొప్ప గుణము. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో, వారే ప్రభు ప్రియులు, లోక ప్రియులు, స్వంత ప్రియులుగా ఉంటారు. ''