17-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - '' మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు! వారికి ఏ ఆశా లేదు మరియు వారు ఎంతో గొప్ప(జబర్దస్త్) దాత! వారికి తీసుకోవాలనే కోరిక ఏ మాత్రమూ లేదు!'' - అని మీకు ఆశ్చర్యము కలగాలి.''
ప్రశ్న :-
తండ్రి అద్భుతమైన పాత్ర ఏది? 100 శాతము నిష్కాముడైన తండ్రి ఏ కోరికతో ఈ సృష్టి పైకి వచ్చారు?
జవాబు :-
బాబా అద్భుతమైన పాత్ర - 'చదివించడం.' వారు సేవ చేసేందుకే వస్తారు, పాలన చేస్తారు. '' మధురమైన పిల్లలూ! ఇది చేయండి.............'' అని బుజ్జగించి చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు కాని ఏమీ తీసుకోరు. 100 శాతము నిష్కాముడైౖన తండ్రికి - '' నేను వెళ్లి నా పిల్లలకు మార్గాన్ని తెలియజేయాలి, సృష్టి ఆది-మధ్య-అంత్యముల సమాచారాన్ని వినిపించాలి'' అన్న కోరిక కలిగింది. పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అన్నదే తండ్రి అభిలాష.
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఏ విధమైన తండ్రి లభించారంటే - వారు ఏమీ తీసుకోరు, ఏదీ భుజించరు, ఏమీ తాగరు. వారికి ఏ విధమైన ఆశ గాని లేక కోరిక గాని లేదు. ఇతర మనుష్యులకైతే '' మేము ధనవంతులుగా అవ్వాలి, మేము ఫలానాగా అవ్వాలి..........'' ఇలా తప్పకుండా ఏదో ఒక ఆశ ఉంటుంది. కాని వారికి(శివబాబాకు) ఏ ఆశ లేదు. వారు '' అభోక్త '' '' నేను ఏమీ తినను, త్రాగను........'' అని ఒక సాధువు అనేవారని మీరు విని ఉంటారు. ఇది తండ్రిని కాపీ చేయుట వంటిదే. విశ్వమంతటిలోనూ ఏమీ తీసుకోనివారు, ఏమీ చేయనివారు ఒక్క తండ్రి మాత్రమే. అందువల్ల '' మేము ఎవరి పిల్లలము'' అని ఆలోచించాలి. తండ్రి ఏ విధంగా వచ్చి ఇతనిలో (బ్రహ్మాబాబాలో) ప్రవేశించారో చూడండి. వారికి స్వయం గురించి ఏ కోరికా లేదు. స్వయం తాను గుప్తమైనారు. వారి జీవనగాథను గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా వారిని గురించి పూర్తిగా రీతిలో అర్థము చేసుకున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మనస్సులో ఇటువంటి ఆలోచన కలగాలి - ''ఏమీ తినని, ఏమీ తాగని, ఏదీ తీసుకోని తండ్రి మాకు లభించారు. వారికి ఏమీ అవసరము లేదు. ఇటువంటి వారెవ్వరూ ఉండరు.'' ఒక్క నిరాకారులే సర్వోన్నతమైన భగవంతునిగా మహిమ చేయబడ్డారు. అందరూ వారినే స్మృతి చేస్తారు. మీ ఆ తండ్రి కూడా అభోక్త, శిక్షకుడు(టీచరు) కూడా అభోక్తయే. అలాగే సద్గురువు కూడా అభోక్తయే. వారు ఏమీ స్వీకరించరు. వారు తీసుకొని ఏమి చేస్తారు? వీరు అద్భుతమైన తండ్రి. తన కొరకు ఏ మాత్రం ఆశ లేదు. ఈ విధమైన మనుష్యులెవ్వరూ ఉండరు. మనుష్యులకైతే భోజనము, వస్త్రాలు........... మొదలైనవన్నీ కావాలి. నాకు ఏమీ అవసరము లేదు. '' వచ్చి పతితులను పావనంగా చేయండి - అని నన్ను పిలుస్తారు. నేను నిరాకారుడను, నేనేమీ తీసుకోను. నాకైతే నా ఆకారము కూడా లేదు, నేను కేవలం ఇతనిలో ప్రవేశిస్తాను. పోతే భుజించేది, తాగేది ఇతని ఆత్మయే. నా ఆత్మకైతే ఏ ఆశా లేదు. నేను సర్వీసు చేసేందుకే వస్తాను.'' ఆలోచించాలి - '' ఇది ఏ విధమైన అద్భుతమైన ఆట! ఒక్క తండ్రియే సర్వులకు ప్రియమైనారు! వారికి కొంచెం కూడా ఆశ లేదు! కేవలం వచ్చి చదివిస్తారు, పాలన చేస్తారు. '' మధురమైన పిల్లలూ! ఇది చేయండి.....''- అని బుజ్జగించి (ముద్దు చేసి) చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారే కాని ఏమీ తీసుకోరు. చేసి చేయించువారు (కరన్-కరావన్హార్) తండ్రియే. శివబాబాకు ఏదైనా ఇచ్చారనుకోండి వారేం చేస్తారు? టోలి (ప్రసాదము) తీసుకొని తింటారా? శివబాబాకు శరీరమే లేదు. కనుక ఎలా తీసుకుంటారు? ఇక ఎంత సర్వీసు చేస్తారో చూడండి! అందరికీ అత్యంత మంచి మతమును ఇచ్చి సుందరమైన పుష్పాలుగా చేస్తారు. పిల్లలకు ఆశ్చర్యము కలగాలి. తండ్రి అయితే దాతగా ఉన్నారు. అందులో కూడా వారు ఎంతో జబర్దస్త్ దాత. వారికి ఎటువంటి కోరికా లేదు. భలే '' ఇంతమంది పిల్లలను సంభాళన చేయాలి, తినిపించాలి, త్రాగించాలి.... '' అని బ్రహ్మకు చింత ఉంటుంది. ధనమేదైతే వస్తుందో, అదంతా శివబాబా కొరకే వస్తుంది. నేనైతే(బ్రహ్మాబాబా) నా సర్వస్వాన్ని స్వాహా చేసేశాను. తండ్రి శ్రీమతమును అనుసరించి మన సర్వస్వము సఫలము చేసుకొని భవిష్యత్తును తయారు చేసుకుంటాము. కాని తండ్రి అయితే 100 శాతము నిష్కామి. వారికి కేవలం ఇదే చింత ఉంటుంది - '' వెళ్లి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఇంకెవ్వరికీ తెలియదు, కనుక సృష్టి ఆది-మధ్య-అంత్యముల సమాచారమంతా వినిపించాలి.'' పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి టీచరు రూపములో చదివిస్తారు. ఫీజు మొదలైనవేమీ తీసుకోరు. మీరు శివబాబా పేరు మీద ఇస్తారు. దానికి ప్రతిఫలము అక్కడ లభిస్తుంది. తాను నరుని నుండి నారాయణుడిగా అవ్వాలనే కోరికేమైనా తండ్రికి ఉందా? తండ్రి డ్రామానుసారము చదివిస్తారే కాని వారికి సర్వోన్నతమైన సింహాసనాధికారిగా అవ్వాలని ఆశ అయితే లేదు. ఆధారమంతా చదువు, దివ్యగుణాల మీదనే ఉంది. అంతేకాకుండా తర్వాత ఇతరులను కూడా చదివించాలి. తండ్రి గమనిస్తారు. డ్రామానుసారము కల్పక్రితము వలె వీరిది ఏ కర్తవ్యము నడుస్తోందో సాక్షి అయ్యి చూస్తారు. మీరు కూడా సాక్షిగా ఉండి చూడండి అని పిల్లలకు కూడా చెప్తారు. స్వయాన్ని కూడా ఇలా పరిశీలించుకోండి - ''మేము చదువుకుంటున్నామా? లేదా? శ్రీమతానుసారము నడుస్తున్నామా, లేదా? ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేస్తున్నామా లేదా? '' తండ్రి అయితే ఇతడి నోటిని అప్పుగా తీసుకొని మాట్లాడ్తారు. ఆత్మ అయితే చైతన్యమైనది కదా! శవములో వచ్చినట్లయితే మాట్లాడలేరు. తప్పకుండా చైతన్యమైనవారిలోనే వస్తారు కదా! కనుక తండ్రి ఎంతటి నిష్కామి! వారికి ఎటువంటి ఆశా లేదు. లౌకిక తండ్రి అయితే '' పిల్లలు పెద్దవారై తనను పోషిస్తారు'' అని భావిస్తాడు. వీరికైతే ఏ కోరికా లేదు. తనకు డ్రామాలో ఇదేే పాత్ర ఉందని వారికి(శివబాబాకు) తెలుసు. కేవలం వచ్చి చదివిస్తాను. ఇది కూడా రచింపబడి ఉంది. మనుష్యులకు డ్రామాను గురించి బొత్తిగా తెలియదు.
పిల్లలైన మీకు ఈ నిశ్చయముంది - తండ్రియే మమ్ములను చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. తప్పకుండా ఇతడు అందరికంటే బాగా చదువుతూ ఉండవచ్చు! ఇతడు కూడా శివబాబాకు చాలా మంచి సహాయకారి. నా వద్ద అయితే ఏ మాత్రం ధనము లేదు. పిల్లలే ధనమునిస్తారు, తీసుకుంటారు. రెండు పిడికెళ్లు ఇస్తారు, భవిష్యత్తులో తీసుకుంటారు. ఎవరి వద్ద అయినా ఏమీ లేకపోతే వారేమీ ఇవ్వరు. పోతే వారు మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి పదవి పొందుతారు. '' మేము నూతన ప్రపంచము కొరకు చదువుకుంటున్నాము '' అనేది గుర్తున్నవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది జ్ఞాపకమున్నా అది మన్మనాభవయే. కాని చాలా మంది ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటారు. బాబా ఏమి చదివిస్తారు? ఏ విధంగా చదివిస్తారు? ఎంత ఉన్నత పదవిని పొందాలి? ఇవన్నీ మర్చిపోతారు. పరస్పరములోనే కొట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. ఎవరైతే పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులవుతారో, వారెప్పుడూ తమ సమయాన్ని వృథా చేయరు. వారు బాగా చదువుకుంటారు. శ్రీమతమును అనుసరిస్తారు. శ్రీమతానుసారము నడచుకోవలసి ఉంటుంది కదా! అలా నడుచుకోనివారిని '' మీరు ఆజ్ఞానువర్తులు కారు. తండ్రిని స్మృతి చేయండని శ్రీమతము ఇస్తే మీరు మరచిపోతారా!'' అని తండ్రి అంటారు. దీనిని బలహీనత అని అంటారు. మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకుని, కాటు వేసి శిరస్సు పై కూర్చుంటుంది. ఇది యుద్ధ మైదానము కదా! మంచి మంచి పిల్లల పై మాయ విజయము పొందుతుంది. మరి అప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? శివబాబాకు. గురువుకు నింద కలుగజేసిన వారికి(గురు నిందకులకు) ముల్లోకాలలోనూ స్థానము లభించదని గాయనము కూడా ఉంది. ఈ విధంగా మాయతో ఓడిపోయేవారు స్థానాన్ని ఎలా పొందగలరు? ''మేము ఏ పురుషార్థము చేసి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి? మంచి మంచి మహారథుల వలె తయారై వెళ్ళి అందరికి మార్గాన్ని తెలిపించాలి'' అని స్వ కళ్యాణము కొరకు బుద్ధిని నడిపించాలి. బాబా సర్వీసు చేసేందుకు చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తారు. తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారని నేను వచ్చి చెప్తున్నాను. పావన ప్రపంచ చిత్రాలున్నాయి కదా! ఇది ముఖ్యమైన విషయము. ఇక్కడ లక్ష్యము - ఉద్ధేశ్యాలు ఉంచబడ్తాయి. అంతేకాని వైద్యశాస్త్రము చదవవలసి ఉంటే, వైద్యుని స్మృతి చేయాలి. బ్యారిష్టరు విద్యను చదివేందుకు బ్యారిష్టరును స్మృతి చేయాలని కాదు. తండ్రి చెప్తున్నారు - '' నన్నొక్కరినే స్మృతి చేయండి, మీ సర్వ మనోకామనలను పూర్ణము చేయువాడను నేనే.'' భలే మాయ మిమ్ములను ఎంత కలవరపరచినా మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇది యుద్ధము కదా! అలాగని వెంటనే విజయము పొందుతామని కాదు. ఇంతవరకు ఒక్కరు కూడా మాయ పై విజయము పొందలేదు. ఒకవేళ విజయము పొందితే జగత్తు పై విజయము పొందినవారుగా ఉండాలి. '' నేను మీ సేవకుడిని, నేను మీ బానిసను.......'' అని పాడ్తారు. కాని ఇక్కడైతే మాయను బానిసగా చేసుకోవాలి. అక్కడ మాయ ఎప్పుడూ దు:ఖమునివ్వదు. ఈ రోజుల్లో అయితే ప్రపంచము చాలా మురికిగా ఉంది. ఒకరికొకరు దు:ఖమును ఇచ్చుకుంటూనే ఉంటారు. మరి వీరు ఎంత మధురమైన బాబా! వారికి తనకొరకు ఏ కోరికా లేదు. ఈ విధమైన తండ్రిని స్మృతి చేయరు. కొంతమంది '' మేము బ్రహ్మాబాబాను అంగీకరించము, శివబాబాను మాత్రమే అంగీకరిస్తాము'' అని అంటారు. కాని వీరిద్దరూ కలిసే ఉన్నారు. దళారి(మధ్యవర్తి) లేకుండా వ్యాపారము జరగదు. ఇతడు బాబాకు రథము. వీరి పేరే - '' భాగ్యశాలీ రథము.'' అందరికంటే ప్రప్రథమ ఉన్నతమైనవారు వీరేనని కూడా తెలుసుకున్నారు. క్లాసులో విద్యార్థుల క్లాసు లీడరుకు కూడా గౌరవము ఉంటుంది కదా! గౌరవిస్తారు. నెంబరువన్ అపురూపమైన పుత్రుడు ఇతడే కదా! అక్కడ కూడా రాజులందరూ వీరిని(శ్రీ నారాయణుని) గౌరవించవలసిందే. దీనిని అర్థము చేసుకున్నప్పుడే గౌరవించాలనే తెలివి వస్తుంది. ఇక్కడ గౌరవించడం నేర్చుకున్నప్పుడే అక్కడ కూడా గౌరవిస్తారు. అలా కానిచో ఏం లభిస్తుంది? శివబాబాను స్మృతి కూడా చేయలేరు. తండ్రి చెప్తున్నారు - స్మృతి ద్వారానే మీ నావ తీరానికి చేరుతుంది అనగా మీరు బాధల నుండి విముక్తులవుతారు. అనంతమైన రాజ్యభాగ్యమును ఇస్తారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! లోలోపల ఎంత ప్రేమ ఉండాలి! తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉందో! ఇతనిని చూడండి, ప్రేమ ఉంది కనుకనే బంగారు పాత్రగా అయ్యాడు. ఎవరి బుద్ధిరూపి పాత్ర బంగారుదై ఉంటుందో వారి నడవడిక చాలా ఫస్ట్క్లాస్గా ఉంటుంది. డ్రామానుసారము రాజధాని స్థాపన అవ్వాలి. అందులో అన్ని రకాల వారు ఉండాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీకు ఎప్పుడూ కోపము రాకూడదు. ఒకవేళ సర్వీసు చేయడం లేదంటే సమయాన్ని వ్యర్థము చేస్తున్నారని అర్థము చేసుకోవాలి. శివబాబా యజ్ఞ సేవ ఏదీ చేయకపోతే ఏమి లభిస్తుంది? సేవాధారులే ఉన్నత పదవి పొందుతారు. తమ కళ్యాణమును చేసుకునేందుకు ఆసక్తి ఉండాలి. అలా కళ్యాణము చేసుకోకుంటే పదవి భ్రష్ఠమవుతుంది. విద్యార్థులు బాగా చదువుకుంటే టీచరు కూడా సంతోషిస్తారు. వీరు నా పేరును ప్రసిద్ధము చేస్తారు, వీరి కారణంగా నాకు బహుమతి లభిస్తుందని భావిస్తారు. తండ్రి మరియు టీచరు మొదలైనవారంతా సంతోషిస్తారు. మంచి సుపుత్రులైన పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా సమర్పణవుతారు. చాలా బాగా సర్వీసు చేయువారి గురించి విని తండ్రి కూడా సంతోషిస్తారు. ఎవరైతే అనేకమందికి సేవ చేస్తారో వారికి తప్పకుండా మంచి పేరు లభిస్తుంది. ఉన్నత పదవి కూడా వారే పొందగలరు. వారికి పగలు-రాత్రి సేవను గురించే చింత ఉంటుంది. ఆహార పానీయాలను గురించిన చింత ఉండదు. ఇతరులకు అర్థం చేయిస్తూ చేయిస్తూ గొంతు ఎండిపోతుంది. ఈ విధమైన అపురూపమైన అల్లారు ముద్దు సేవాధారి పిల్లలే ఉన్నత పదవి పొందుతారు. ఇది 21 జన్మల విషయము. అది కూడా కల్ప-కల్పాంతరముల కొరకు లభిస్తుంది. ఫలితము వెలువడినప్పుడు ఎవరు ఎంత సేవ చేశారు? ఎంతమందికి మార్గమును తెలియజేశారు? అని తెలుస్తుంది. నడవడికను(క్యారెక్టర్ను) కూడా తప్పకుండా సరిదిద్దుకోవాలి. అశ్వారూఢులు, మహారథులు, పదాతిదళము.......... అని పేర్లు అయితే ఉన్నాయి కదా. సర్వీసు చేయకపోతే వారు ''మేము పదాతిదళము వారము'' అని భావించాలి. మేము ధన సహయోగము చేశాము. మాకు ఉన్నత పదవి లభిస్తుందని ఎవ్వరూ భావించరాదు. ఇది పూర్తిగా తప్పు. మొత్తం ఆధారమంతా సేవ పై మరియు చదువు పై ఉంటుంది. తండ్రి అయితే చాలా బాగా అర్థము చేయిస్తూ ఉంటారు. పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందాలని అనుకుంటారు. కల్ప-కల్పముల కొరకు స్వయాన్ని నష్టపరచుకోకండి. బాబా గమనిస్తారు - వీరు స్వయాన్ని నష్టపరచుకుంటున్నారు, వీరికి తెలియడం లేదు. మేము ధనమునిచ్చాము కనుక మేము మాలలో సమీపంగా వస్తామని భావించి అందులోనే సంతోషపడ్తూ ఉంటారు. కాని భలే ధనమును ఇచ్చినా జ్ఞాన ధారణ చేయలేదు కదా. యోగములో ఉండడం లేదంటే వారు దేనికి పనికి వస్తారు? ఒకవేళ దయ చూపలేదంటే ఇక వారు తండ్రిని ఏం అనుసరిస్తారు? తండ్రి వచ్చిందే పిల్లలను సుందరమైన సుగంధ పుష్పాలుగా తయారు చేసేందుకు. ఎవరైతే అనేక మందిని అలా చేస్తారో, వారి పై తండ్రి కూడా బలిహారమవుతారు. స్థూల సేవ కూడా చాలా ఉంది. ఉదాహరణకు వంట చేయువారిని చాలా మహిమ చేస్తారు. వారికి చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరు ఎంత సేవ చేస్తారో, వారు అంత తమ కళ్యాణమునే చేసుకుంటారు. తమ ఎముకలు అరిగేటట్లు సేవ చేస్తారు. తామే సంపాదన చేసుకుంటారు. చాలా గాఢమైన ప్రేమతో సేవ చేస్తారు. ఎవరైతే గొడవలు చేస్తారో వారు తమ అదృష్టమునే పాడు చేసుకుంటారు. ఎవరిలో లోభము ఉంటుందో, అది వారినే సతాయిస్తుంది. మీరంతా వానప్రస్థులు. అందరూ శబ్ధము నుండి అతీతంగా వెళ్ళాలి. రోజంతటిలో మేము ఎంత సేవ చేస్తున్నాము? - అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చాలామంది పిల్లలకు సర్వీసు చేయకుంటే సుఖము ఉండదు. కొందరికి గ్రహచారము బుద్ధి పైన గాని లేదా చదువులో గాని కూర్చుంటుంది. బాబా అయితే అందరినీ ఒకే రకంగా చదివిస్తారు. కొందరి బుద్ధి ఒక రకంగా, మరి కొందరిది మరొక రకంగా ఉంటుంది. అయినా పురుషార్థమైతే చేయాలి. లేనిచో కల్ప-కల్పాంతరాలకు పదవి ఈ విధంగానే అయిపోతుంది. చివర్లో ఫలితము వెలువడినప్పుడు అందరికీ సాక్షాత్కారమవుతుంది. సాక్షాత్కారము చేసుకున్న తర్వాత బదిలీ అయిపోతారు. శాస్త్రాలలో కూడా వ్యర్థంగా సమయము పోగొట్టుకున్నామని, కల్ప-కల్పాంతరముల కొరకు చాలా మోసపోయామని చివర్లో చాలా పశ్చాత్తాప పడినట్లుగా చూపబడింది. తండ్రి ఏమో అప్రమత్తము చేస్తూనే ఉంటారు. శివబాబాకైతే ఇదే కోరిక ఉంది - '' పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందుకోవాలి.'' వారికి ఏ ఇతర కోరికా లేదు. ఏ వస్తువు కూడా వారికి పనికి రాదు. పిల్లలూ! అంతర్ముఖులుగా అవ్వండి - అని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రపంచమంతా బాహ్యముఖతలో ఉంది. మీరు అంతర్ముఖులుగా ఉన్నారు. మీ అవస్థను పరిశీలించుకోవాలి, స్వయాన్ని సరిదిద్దుకొనే పురుషార్థము కూడా చేయాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము బాగా చదువుకొని ఇతరులను చదివిస్తున్నామా లేదా? మా సమానంగా తయారు చేయు సేవ చేస్తున్నామా? - అని సాక్షిగా అయ్యి స్వయం మీ పాత్రను చూచుకోవాలి. మీ సమయాన్ని ప్రాపంచిక విషయాలలో నష్టపరచుకోకండి.
2. అంతర్ముఖులై స్వయంను స్వయమే సరిదిద్దుకోవాలి. స్వ-కళ్యాణము కొరకు ఆసక్తిని ఉంచుకోవాలి. సర్వీసులో బిజీగా ఉండాలి. తండ్రి సమానము తప్పకుండా దయా హృదయులుగా అవ్వాలి.
వరదానము :-
''సఫలం చేయు విధి ద్వారా సఫలతా వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వరదానీ మూర్త్ భవ''
సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వముతో పాటు ''సఫలం చేయండి, సఫలతను పొందండి'' అను వరదానము కూడా ఉంది. సఫలం చేయడం బీజము వంటిది, సఫలత ఫలము వంటిది. బీజము బాగుంటే ఫలము లభించకుండా ఉండడం జరగదు. కనుక ఎలాగైతే ఇతరులకు సమయం, సంకల్పము, సంపద అన్నీ సఫలము చేసుకోండి అని చెప్తారో, అలా మీ సర్వ ఖజానాల లిస్టులో ఏ ఖజానా సఫలమయ్యింది, ఏ ఖజానా వ్యర్థమయ్యింది అని చెక్ చేసుకోండి. సఫలము చేస్తూ ఉంటే సర్వ ఖజానాలతో సంపన్నమైన వరదానీ మూర్తులుగా అవుతారు.
స్లోగన్ :-
''పరమాత్మ అవార్డును తీసుకునేందుకు వ్యర్థమును, నెగటివ్ను అవాయిడ్ చేయండి (మానుకోండి)''
బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
బ్రహ్మబాబా సమానం ఏ విషయాన్ని గురించి విస్తారంలోకి వెళ్లకుండా, విస్తారానికి
బిందువు ఉంచి బిందువులో ఇమిడ్చి వేయండి, బిందువుగా అయిపోండి, బిందువు పెట్టండి,
బిందువులో ఇమిడిపోండి. అప్పుడు మొత్తం విస్తారమంతా, వల అంతా ఒక సెకండులో
ఇమిడిపోతుంది, సమయం మిగిలిపోతుంది, శ్రమ పడుట నుండి విడుదల అవుతారు. బిందువుగా అయ్యి,
బిందువులో లవలీనమైపోతారు.