20-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - విచార సాగర మథనము చేసేందుకు అలవాటు పడండి, ఉదయము ఉదయమే ఏకాంతములో విచార సాగర మథనము చేస్తే అనేక క్రొత్త - క్రొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి''

ప్రశ్న :-

పిల్లలు తమ స్థితిని ఫస్ట్‌క్లాస్‌గా తయారు చేసుకునేందుకు ఏ ఏ విషయాల పై సదా గమనముంచాలి?

జవాబు :-

తండ్రి ఏది వినిపిస్తారో, అది మాత్రమే వినండి. ఈ ప్రపంచములోని ఏ ఇతర విషయాలను కొద్దిగా కూడా వినకండి. సాంగత్యమును గురించి గమనముంచండి. ఎవరైతే మంచిరీతిగా(బాగా) చదువుకుంటారో, ధారణ చేస్తారో వారి సాంగత్యములో ఉండండి. అప్పుడు మీ స్థితి ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది. చాలా మంది పిల్లల స్థితిని చూచి డ్రామాలో ఏదైనా పరివర్తన జరిగితే బాగుండును అని బాబాకు ఆలోచన కలుగుతుంది. అయితే రాజధాని స్థాపనలో ఇది కూడా ఒక భాగమని వారే చెప్తారు.

ఓంశాంతి.

అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన పిల్లలకు కూర్చుని అర్థము చేయిస్తారు లేక చదివిస్తారు. మిగిలిన మనుష్యులు ఏదైతే చదువుతారో, వింటారో దానిని మీరు చదవరాదు, వినరాదు. ఎందుకంటే ఇదొక్కటే ఈశ్వరీయ చదువు అని, ఇప్పుడు దానినే చదువుకోవాలని మీరు అర్థము చేసుకున్నారు. మీరు కేవలం ఒక్క ఈశ్వరుని ద్వారానే చదువుకోవాలి. తండి ఏదైతే చదివిస్తారో, నేర్పిస్తారో అదంతా నోటి ద్వారా(ఓరల్‌గా) చదువుకోవాలి, నేర్చుకోవాలి. ప్రపంచములోని వారు అనేక విధాలైన పుస్తకాలు వ్రాస్తారు. వాటిని ప్రపంచమంతా చదువుతుంది. లెక్కలేనన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒక్కరితోనే వినమని, దానినే ఇతరులకు వినిపించమని పిల్లలైన మీరు మాత్రమే చెప్తారు. ఎందుకంటే వారి ద్వారా ఏదైతే వింటారో అందులోనే కళ్యాణముంది. పోతే లెక్కలేనన్ని పుస్తకాలున్నాయి. క్రొత్త క్రొత్త పుస్తకాలు వెలువడుతూనే ఉంటాయి. సత్యమైనది ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారని మీకు తెలుసు. కావున వారొక్కరి ద్వారా వింటే చాలు. తండ్రి పిల్లలకు చాలా కొద్దిగా అర్థము చేయిస్తారు. ఆ విషయాన్నే విస్తారంగా అర్థము చేయించి మళ్లీ మళ్లీ అదే విషయం పైకి వచ్చేస్తారు. మన్మనాభవ అనే పదము రైటే(సరైనదే)నని బాబా చెప్తారు. కానీ బాబా ఆ విధంగా చెప్పలేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, సృష్టి ఆదిమధ్యాంతముల జ్ఞానమును ఏదైతే నేను వినిపిస్తున్నానో దానిని ధారణ చేయండి అని తండ్రి చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే దేవతలుగా అవుతారో వారే తర్వాత వృద్ధి చెందుతారని కూడా మీకు తెలుసు. పిల్లలకు మూలవతనము కూడా గుర్తుంది. నూతన ప్రపంచము కూడా గుర్తుంది.

మొట్టమొదటివారు ఉన్నతోన్నతమైన తండ్రి, ఆ తర్వాత ముఖ్యమైనది ఈ నూతన ప్రపంచము. అందులో ఈ అత్యంత శ్రేష్ఠమైన ఈ లక్ష్మీనారాయణులు అత్యత శ్రేష్ఠంగా రాజ్యపాలన చేస్తారు. చిత్రములైతే తప్పకుండా ఉండాల్సిందే. వారి గుర్తులు మాత్రము మిగిలిపోయాయి. ఇదే ఆ చిత్రము, రాముని చిత్రము కూడా ఉంది. కానీ రామరాజ్యమును స్వర్గమని అనరు. అది సగము(సెమి) స్వర్గము మాత్రమే. ఇప్పుడు అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువులో పుస్తకాలు మొదలైనవేవీ అవసరము లేదు. ఈ పుస్తకాలు మొదలైనవి మరుసటి జన్మలో చదువుకునేందుకు పనికి వచ్చేవి కాదు. ఈ చదువు ఈ ఒక్క జన్మకు మాత్రమే పనికి వస్తుంది. అమరకథ ఇదే. నూతన ప్రపంచము కొరకు నరుని నుండి నారాయణునిగా చేసే శిక్షణ కూడా తండ్రి ఇస్తారు. పిల్లలు 84 జన్మల చక్రము గురించి కూడా తెలుసుకున్నారు. ఇది చదువుకునే సమయము. బుద్ధిలో విచార సాగర మథనము జరుగుతూ ఉండాలి. మీరు ఇతరులను కూడా చదివించాలి. ఉదయమే లేచి విచార సాగర మథనము చేయాలి. ఎందుకంటే ఉదయము పూట విచార సాగర మథనము చక్కగా(బాగా) జరుగుతుంది. మాట్లాడవలసిన విషయాలు(టాపిక్స్‌), పాయింట్స్‌ మొదలైనవి మథనము చేస్తూ ఉంటారు. భక్తికి సంబంధించిన విషయాలు జన్మ-జన్మాంతరాలుగా విన్నారు. ఈ జ్ఞానము జన్మ-జన్మాంతరాలు వినరు. ఈ జ్ఞానాన్ని తండ్రి ఒక్కసారి మాత్రమే వినిపిస్తారు. తర్వాత ఈ జ్ఞానాన్ని మీరు కూడా మర్చిపోతారు. భక్తిమార్గములో అనేక పుస్తకాలున్నాయి. విదేశాల నుండి కూడా వస్తాయి. ఇవన్నీ సమాప్తమవుతాయి. సత్యయుగములో అయితే ఎలాంటి పుస్తకాలు మొదలైనవేవీ అవసరము లేదు. ఇవన్నీ కలియుగపు సామాగ్రి. ఇచ్చట మీరు ఏమేమి చూస్తున్నారో అనగా ఆస్పత్రులు, జైళ్ళు, కోర్టులు మొదలైనవేవీ అచ్చట ఉండవు. ఆ ప్రపంచమే మరో ప్రపంచము. ప్రపంచమైతే ఇదే కానీ కొత్తదానికి, పాతదానికి వ్యత్యాసము తప్పకుండా ఉంటుంది కదా. దానిని స్వర్గమని అంటారు. ఆ ప్రపంచమే మళ్లీ నరకంగా అవుతుంది. ఫలానావారు స్వర్గస్థులయ్యారని నోటితో చెప్తారు. సన్యాసులకైతే బ్రహ్మలో లీనమైనారని నిర్వాణ ధామానికి వెళ్ళారని అంటారు. కానీ నిర్వాణములోకి ఎవ్వరూ వెళ్లలేరు. ఈ రుద్రమాల ఎలా తయారవుతుందో మీకు తెలుసు. రుండమాల కూడా ఉంది. విష్ణు రాజధానిలోనికి వచ్చేవారి మాల తయారవుతుంది. ఈ మాల రహస్యము గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నెంబరువారు చదువు అనుసారమే మాలలో కూర్చబడ్తారు. మొట్టమొదట ఇది ఈశ్వరీయ చదువని, వారు సుప్రీమ్‌ తండ్రే కాక సుప్రీం శిక్షకులు అని నిశ్చయముండాలి. మీ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో, దానినే ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. విచార సాగర మథనము చేయాలి. వార్తాపత్రికలు కూడా ఉదయమే వెలువడ్తాయి. అది సాధారణ విషయము. కానీ ఈ జ్ఞానములోని ఒక్కొక్క విషయము లక్షల రూపాయల విలువ గలది. కొంతమంది మంచి రీతిగా అర్థము చేసుకుంటారు, కొంతమంది తక్కువగా అర్థము చేసుకుంటారు. అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించిన దానిని బట్టే నూతన ప్రపంచములో పదవి లభిస్తుంది. విచార సాగర మథనము చేసేందుకు మంచి ఏకాంతము అవసరము, రామతీర్థుడు తన శిష్యులకు ఇలా చెప్పేవాడు - నేను వ్రాసేటప్పుడు రెండు మైళ్ళ దూరము వెళ్ళండి. వెళ్ళకుంటే వైబ్రేషన్లు వస్తాయి.

మీరు ఇప్పుడు దోష రహితంగా తయారవుతున్నారు. ప్రపంచములోని వారి అందరి బుద్ధి డిఫెక్టడ్‌(లోపభూయిష్ట) బుద్ధి. ఈ చదువు ద్వారా మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు! అయితే నంబరువారుగా కూర్చోబెట్టలేరు. లాస్టులో కూర్చోబెట్తే ఆవళిస్తారు, తూగుతారు. ఫంక్‌ అవుతారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. వాస్తవానికి నంబరువారుగా కూర్చోబెట్టాలని చట్టం చెప్తుంది అయితే ఈ విషయాలన్నీ బాబాకు తెలుసు. బాబా ఉన్న సంచికి (గుడ్‌ జానే గుడ్‌కీ గోథరీ జానే,...... బెల్లానికి, బెల్లం సంచికి తెలుసు,......) తెలుసు అంటే శివబాబాకు తెలుసు, వారు ప్రవేశించిన బ్రహ్మబాబాకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. మీకు వేరు వేరుగా క్లాసులు చేయలేరు. వాస్తవానికి మీరు క్లాసులో ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. మైకు ద్వారా చాలా దూరము వరకు శబ్ధము వినగలరు. తండ్రి చెప్తున్నారు - ఈ ప్రపంచములో ఇక ఏ ఇతర విషయాలు వినకండి, చదవకండి. వారి సాంగత్యము కూడా చేయకండి. ఎవరు బాగా చదువుకుంటారో వారి స్నేహమే చేయాలి. ఎక్కడ మంచి సేవ ఉంటుందో, ఉదాహరణానికి ఎక్కడ మ్యూజియాలు మొదలైనవి ఉన్నాయో అచ్చట చాలా తీక్షణమైన, యోగయుక్తమైన పిల్లలు కావాలి.

ఇది తయారైన డ్రామా అని తండ్రి అర్థము చేయిస్తారు. ఈ డ్రామాలో మార్పు జరిగితే బాగుంటుందని అప్పుడప్పుడు తండ్రి అనుకుంటారు. కానీ అలా మార్పు జరగజాలదు. ఇది తయారైన డ్రామా, పిల్లల స్థితిని చూచి కొంత మార్పు జరగాలని బాబాకు ఆలోచన కలుగుతుంది. కానీ ఇటువంటివారు స్వర్గానికి వెళ్ళగలరా? అని భావిస్తారు. వెంటనే స్వర్గ రాజధానిలోనికి రకరకాలవారు కావాలి కదా అని కూడా ఆలోచన వస్తుంది. కొంతమంది దాస-దాసీలు, ఛండాలురు మొదలైన వారందరూ కూడా ఉంటారు కదా. డ్రామాలో ఏ మార్పు చేయుటకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా అని భగవంతుడు చెప్తున్నారు. దీనిలో నేను కూడా మార్పులు చేయలేదు. భగవంతుని కంటే ఉన్నతమైనవారు మరెవ్వరూ లేరు. భగవంతుడు అనుకుంటే ఏమైనా చేస్తారని మనుష్యులంటారు, వారు చేయలేనిది ఏముంది! అని అంటారు. కానీ భగవంతుడే స్వయంగా చెప్తున్నారు - నేను ఏమీ చేయలేను. ఇది తయారైన డ్రామా, విఘ్నాలు తప్పక వస్తాయి, ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. డ్రామాలో రచింపబడి ఉంది. నేనేం చేయగలను? చాలామంది పిల్లలు - బాబా! అపవిత్రమవ్వడం నుండి మమ్ములను రక్షించండి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి ఏమి చేయగలరు? ఇదంతా డ్రామాలో నిర్ణయించబడిందని మాత్రమే తండ్రి అంటారు. ఇది తయారైన డ్రామా. భగవంతుడు నిర్ణయించింది అని భావించకండి, భగవంతుని చేతిలో ఉంటే ఎవరైనా అత్యంత ముఖ్యులు, అనన్యమైనవారు శరీరము వదిలితే వారిని మళ్లీ బ్రతికించేవారు. ఇటువంటి సందేహాలు చాలామందికి వస్తాయి. భగవంతుడు చదివిస్తున్నారు! భగవంతుని బిడ్డలను తన బిడ్డలను తాను బ్రతికించుకోలేడా? అని అంటారు. చాలా ఫిర్యాదులు చేస్తారు. ఫలానా సాధువు ఫలానావారి ప్రాణాలను రక్షించగలిగారు, మళ్లీ ప్రాణాలు వచ్చేస్తాయి, చితి పై నుండి లేచి కూర్చున్నారని అంటారు. కానీ వెంటనే ఈశ్వరుడు మళ్లీ వాపస్‌ పంపినారు, కాలుడు తీసుకెళ్లాడు, అతని పై ప్రభువు దయ చూపించారు అని కూడా అంటారు. తండి అర్థము చేయిస్తున్నారు - డ్రామాలో ఏం నిర్ణయించబడిందో అదే జరుగుతుంది. తండి కూడా ఏమీ చేయలేరు. దీనిని డామ్రాలోని నిర్ణయము అని అంటారు. డామ్రా గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏం జరగాలో అది జరిగింది, చింత ఎందుకు అని వారంటారు. మిమ్ములను చింతలు లేకుండా తయారు చేస్తారు. సెకండు సెకండు ఏమి జరుగుతూ ఉందో అదంతా డ్రామాయే అని తెలుసుకోండి. ఆత్మ ఒక శరీరమును వదిలి మరో పాత్రను అభినయిస్తుంది. అనాదిలోని పాత్రను మీరెలా మార్పు చేయగలరు! ఇప్పుడు ఇంకా స్థితి కొంత కచ్ఛాగా ఉంది. కొద్దో గొప్పో దు:ఖము, ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఇదంతా రచింపబడింది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రజలు ఏం మాట్లాడుతున్నా మన బుద్ధిలో డ్రామా రహస్యముంది. పాత్రను అభినయించే తీరాలి. చింతించే మాటే లేదు. ఎంతవరకు స్థితి కచ్ఛాగా ఉంటుందో అంతవరకు కొద్దో - గొప్పో అలలు వస్తూనే ఉంటాయి.

ఈ సమయములో మీరు అందరూ చదువుకుంటున్నారు. మీరందరూ దేహధారులు, నేను ఒక్కరిని మాత్రమే విదేహిని. దేహధారులందరికీ నేర్పిస్తాను. అప్పుడప్పుడు పిల్లలైన మీకు ఈ బ్రహ్మ కూడా వినిపిస్తారని తండ్రి తెలిపిస్తున్నారు. ఈ తండ్రి పాత్ర, ప్రజాపిత బ్రహ్మ పాత్ర చాలా అద్భుతమైనది. ఈ తండ్రి(బ్రహ్మ) విచార సాగర మథనము చేసి మీకు వినిపిస్తూ ఉంటారు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము! బుద్ధిని ఎంతగానో ఉపయోగించవలసి వస్తుంది. అమృతవేళలో బాబాకు విచార సాగర మథనము నడుస్తుంది. మీరు కూడా టీచరు వలె అదే విధంగా తయారవ్వాలి. అయినా వ్యత్యాసము తప్పకుండా ఉంటుంది. టీచరు విద్యార్థులకు ఎప్పుడూ నూటికి నూరు మార్కులు ఇవ్వరు. కొన్ని మార్కులు తగ్గిస్తారు. వారు అత్యంత ఉన్నతులు, మనమందరమూ దేహధారులము. అందువలన బాబా వలె నూటికి నూరు శాతము ఎలా తయారవుతాము? ఇవన్నీ చాలా నిగూఢమైన విషయాలు. వీటిని విని ఎవరైనా ధారణ చేస్తే సంతోషము కలుగుతుంది. కొంతమంది బాబా ఒకే రకమైన వాణి నడుపుతారని మాటి మాటికి అదే పాయింట్లు ఉంటాయని అంటారు. కొంతమంది క్రొత్త - క్రొత్త పిల్లలు వస్తారు. కావున నేను మళ్లీ పాత పాయింట్లు చెప్పవలసి వస్తుంది. ఇతరులకు అర్థము చేయించేందుకు కొన్ని కొత్త పాయింట్లు కూడా వస్తాయి. పిల్లలైన మీరు తండ్రికి సహాయము చేయవలసి వస్తుంది. మ్యాగజైన్లు వెలువడ్తాయి. కల్పక్రితము కూడా ఇదే విధంగా వ్రాసి(మ్యాగజైన్లు) ఉంటారు. ఒకవేళ మన వార్తాపత్రికలు వెలువడితే వాటి పై చాలా గమనము ఇవ్వవలసి వస్తుంది. అవి మనుష్యులు చదివి కోపపడునట్లు ఉండరాదు. మీరు కూడా మ్యాగజైన్లు చదువుతారు. వాటిలో అచ్చటచ్చట సంపూర్ణత చెందని(కచ్చీ, పక్కీ) విషయాలు ఉండవచ్చు, ఎందుకంటే వ్రాసేవారు ఇంతవరకు సంపూర్ణము కాలేదని చెప్తారు. ఖచ్చితంగా 16 కళా సంపూర్ణంగా అయ్యేందుకు ఇంకా సమయము పడ్తుంది. ఇప్పుడింకా చాలా సేవ చేయాలి. అనేకమంది ప్రజలను తయారు చేయాలి. మార్కులు అనేక విధాలుగా ఉంటాయని కూడా తండ్రి అర్థము చేయించారు. అనేకమంది జ్ఞానము తీసుకునేందుకు ఏర్పాట్లు చేయువారు కొంతమంది నిమిత్తంగా ఉంటారు. అటువంటి వారికి కూడా ఫలితము లభిస్తుంది. ఇప్పుడు పాత ప్రపంచము సమాప్తము కానున్నది. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము, జబ్బులు మొదలైనవి అందరికీ వస్తాయి. ఈ బాబా అన్ని విషయాలను అనుభవించినవారు, ప్రాపంచిక విషయాలు కూడా అర్థము చేయిస్తారు. బాబా చెప్పారు - వార్తాపత్రికలలో, మ్యాగజైన్‌లలో ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయండి. అవి చదివి బ్రహ్మకుమారీలు ఈ విషయాలు చాలా సరిగ్గా వ్రాశారు అని అనుకోవాలి. ఈ యుద్ధము ఉన్నదున్నట్లుగా 5 వేల సంవత్సరాల క్రితము కూడా జరిగింది. అది ఎలా జరిగిందో? వచ్చి తెలుసుకోండి..... అని ప్రకటించండి. అందులో మీ పేరు కూడా ఉంటుంది. ఈ విషయాలు మనుష్యులు విని సంతోషిస్తారు కూడా. ఇవి చాలా గొప్ప విషయాలు! అని భావిస్తారు. కానీ వారి బుద్ధిలో కూర్చోవాలి. ఎవరు వ్రాస్తారో వారు ఇతరులకు అర్థము చేయించాలి కూడా. అలా అర్థము చేయించుటకు వచ్చి ఉండదు, కావున వ్రాయను కూడా వ్రాయరు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో, ఏది చదివిస్తారో వాటిని మాత్రమే వినండి, చదవండి, మిగిలినవేవీ చదివే అవసరము లేదు, వినే అవసరము లేదు. సాంగత్య విషయములో చాలా చాలా గమనముంచాలి. అమృతవేళలో ఏకాంతంగా కూర్చొని విచార సాగర మథనము చేయండి.

2. డ్రామాలో నిర్ణయము ముందే నిశ్చయింపబడింది. కావున సదా నిశ్చింతులుగా ఉండండి. ఏ విషయములోనూ సంశయపడకండి. మనుష్యులు ఏమంటున్నా డ్రామా పై స్థిరంగా ఉండండి.

వరదానము :-

''హోలీ శబ్ధము యొక్క అర్థ స్వరూపంలో స్థితమై ఉండి సత్యమైన హోలీ జరుపుకునే తీవ్ర పురుషార్థీ భవ ''

హోలీ జరుపుకోవడమనగా ఏ విషయం అయిపోయిందో, జరిగిపోయిందో దానిని పూర్తిగా సమాప్తం చేసే ప్రతిజ్ఞ చేయాలి. జరిగిపోయిన విషయము, ఏదో చాలా పాత జన్మలోని విషయమని అనుభవమవ్వాలి. ఇటువంటి స్థితి ఉంటే పురుషార్థ వేగము తీవ్రమవుతుంది. జరిగిపోయిన మీ విషయాల గురించి గానీ, ఇతరుల విషయాల గురించి గానీ చింతన చేయరాదు, వాటిని చిత్తములో ఉంచుకోరాదు. ఇదే సత్యమైన హోలీ జరుపుకోవడం అనగా పక్కాగా రంగు వేసుకోవడం.

స్లోగన్‌ :-

''ఎవరికైతే డైరక్టు భగవంతుని ద్వారా పాలన, చదువు, శ్రేష్ఠ జీవితానికి శ్రీమతము లభిస్తుందో, వారి భాగ్యము అందరికంటే శ్రేష్ఠమైనది.''