04-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి. స్మృతిలో ఉంటే చాలా రమణీయంగా, మధురంగా ఉంటారు, సంతోషంగా ఉండి సేవ చేస్తారు.''

ప్రశ్న :-

జ్ఞాన మస్తీతో పాటు ఏ పరిశీలన(చెకింగ్‌) చేసుకోవడం చాలా అవసరము?

జవాబు :-

జ్ఞానమస్తీ ఉండనే ఉంటుంది కానీ దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యానని పరిశీలించుకోండి. జ్ఞానమేమో చాలా సులభము కాని యోగములోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది. గృహస్థ వ్యవహారములో అనాసక్తులుగా ఉండాలి. ఎలుక రూపీ మాయ లోలోపల కొరుకుతూ ఉండినా బయటకు ఏమీ తెలియకుండా ఉండడం కాదు. బాబా పై మాకు గాఢమైన ప్రేమ ఉందా? ఎంత సమయము మేము స్మృతిలో ఉంటున్నాము? అని మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి.

పాట :-

ఓ దీపపు పురుగా! ఎందుకు కాలిపోలేదు!...... (జలే క్యోం నా పర్వానా......)   

ఓంశాంతి.

మధురాతి మధురమైన పిల్లలు పాటలోని ఒక చరణము విన్నారు. తండ్రి ఇంత ప్రభావము చూపుతున్నప్పుడు మీరు ఇంత అందంగా తయారవుతున్నప్పుడు అటువంటి తండ్రివారిగా ఎందుకు అవ్వరాదు? ఆ తండ్రి మిమ్ములను శ్యామము(నలుపు) నుండి సుందరంగా చేస్తున్నారు. మనము నలుపు(అపవిత్రము) నుండి తెలుపు(పవిత్రము)గా అవుతామని పిల్లలకు తెలుసు. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. వారు కృష్ణుని శ్యామసుందరుడని అంటారు. కృష్ణుని చిత్రము కూడా అలాగే తయారు చేస్తారు. కొన్ని చిత్రాలు సుందరముగా, కొన్ని చిత్రాలు శ్యామంగా(నల్లగా) తయారు చేస్తారు. ఇది ఎలా సాధ్యమో మనుష్యులు అర్థము చేసుకోలేరు. సత్యయుగములోని రాకుమారుడు నల్లగా(అపవిత్రంగా) ఎలా ఉంటాడు? కృష్ణుని వంటి పుత్రుడు కావాలని, కృష్ణుని వంటి భర్త లభించాలని అందరూ కోరుకుంటారు. అలాంటప్పుడు అతడు నల్లగా ఎలా ఉంటాడు? కొంచెము కూడా అర్థము చేసుకోరు. కృష్ణుని నల్లగా ఎందుకు తయారు చేశారో కారణము తెలియదు. సర్పము పై నృత్యము చేసినట్లు చూపిన సంఘటన జరిగేందుకు వీలు లేదు. శాస్త్రాల నుండి ఇటువంటి మాటలు విని, అలాగే అందరికీ చెప్తూ ఉంటారు. వాస్తవానికి అటువంటి విషయమేదీ లేదు. శేషనాగు శయ్య పై నారాయణుడు కూర్చున్నట్లు చిత్రాలలో చూపిస్తారు. వాస్తవానికి అటువంటి సర్ప శయ్య మొదలైనవేవీ ఉండవు. ఇన్ని వందల నోర్లు ఉంటాయా? కూర్చుని వారికి ఇష్టమొచ్చిన ఇలాంటి చిత్రాలు తయారు చేశారు. వీటిలో ఏ సారము లేదని ఇవన్నీ భక్తిమార్గములోని చిత్రాలని తండ్రి అర్థము చేయిస్తున్నారు. అయితే ఇదంతా డ్రామాలో నిశ్చయమై ఉంది. ప్రారంభము నుండి ఇప్పటివరకు ఏ నాటకము చిత్రీకరించబడిందో అది మళ్లీ రిపీట్‌ అవుతుంది. కేవలం భక్తిలో ఏమేం చేస్తారో వాటిని గురించి అర్థము చేయించబడ్తుంది. ఎంతో ఖర్చు చేస్తారు. రకరకాల చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. జ్ఞానము తెలియక ముందు ఈ చిత్రాలు చూస్తున్నా ఇంత ఆశ్చర్యపడేవారు కాదు. ఎప్పుడైతే తండ్రి అన్నిటి అర్థము తెలిపించారో, ఇవన్నీ భక్తిమార్గములోని విషయాలని బుద్ధిలోకి వస్తుంది. భక్తిలో ఏమేమి జరుగుతుందో అదంతా మళ్లీ తప్పకుండా జరుగుతుంది. మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థము చేసుకోలేరు. డ్రామాలో మొదట ఏదైతే నిశ్చితమై ఉందో మళ్లీ అదే జరుగుతూ ఉంటుందని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఇందులో గొప్ప కళ్యాణముంది.

ఇప్పుడు మీరు ప్రార్థన చేయడం మొదలైనవేవీ చేయరు. భగవంతుని నుండి ఫలము పొందేందుకు అవన్నీ చేస్తారు. ఫలమనగా జీవన్ముక్తి. ఇప్పుడు ఈ విషయములన్నీ అర్థము చేయించబడ్తాయి. ఇక్కడ ప్రజల పై ప్రజా రాజ్యముంది. గీతలో భారతవాసులైన కౌరవులు, పాండవులు ఏమి చేశారు? యాదవులు, ముసలము(మిసైల్స్‌) తయారు చేసి తమ కులమును నాశనము చేసుకున్నారు. వీరందరూ పరస్పరము శత్రువులు. మీరు వార్తలు మొదలైనవి వినరు. ఎవరు వింటారో వారు బాగా అర్థము చేసుకోగలరు. రోజురోజుకు లోలోపల చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అందరూ క్రైస్తవులే కాని లోపల చాలా గొడవలున్నాయి. ఇంటిలో కూర్చునే ఒకరినొకరు చంపుకుంటారు, మారణాయుధాలను వినియోగించి మరణించేలా చేస్తారు. మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. కావున రాజ్యపాలన చేసేందుకు పాత ప్రపంచము తప్పకుండా శుభ్రపడాలి. మళ్లీ కొత్త ప్రపంచములో అన్నీ కొత్తవిగా ఉంటాయి. అచ్చట 5 తత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. అచ్చట ఉప్పొంగి నష్టపరిచే శక్తి సముద్రానికి ఉండదు. ఇప్పుడైతే 5 తత్వాలు ఎంతగా నష్టపరుస్తున్నాయో చూడండి. అక్కడ మొత్తం ప్రకృతి అంతా దాసిగా అయిపోతుంది. అందువలన దు:ఖమనే మాటే ఉండదు. ఇది కూడా తయారైన డ్రామా ఆట. స్వర్గమని సత్యయుగమును అంటారు. క్రైస్తవులు కూడా మొదట స్వర్గముండేదని అంటారు. భారతదేశము అవినాశి ఖండము. అయితే వారికి కేవలం మనకు ముక్తినిచ్చే తండ్రి భారతదేశములో వస్తారనేది మాత్రము తెలియదు. శివజయంతిని కూడా ఆచరిస్తారు. అయినా అర్థము చేసుకోలేరు. భారతదేశములో శివజయంతి జరుపుతున్నారంటే శివబాబా తప్పకుండా భారతదేశములోనే వచ్చి స్వర్గము తయారు చేశారని, ఇప్పుడు మళ్లీ తయారు చేస్తున్నారని మీరు అర్థము చేయిస్తారు. ఎవరైతే ప్రజలుగా అవుతారో వారి బుద్ధిలో ఏ మాత్రమూ కూర్చోదు. ఎవరైతే రాజకుటుంబములో వస్తారో వారు మేము శివబాబా పిల్లలమని తప్పకుండా అర్థము చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా వారి నుండే ముక్తి పొందుతాడు. ముక్తిదాత, జ్ఞానసాగరులు స్వయం ఆ తండ్రియే. బ్రహ్మను అలా అనరు. బ్రహ్మ కూడా వారి ద్వారా ముక్తి పొందుతాడు. అందరినీ ముక్తము చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఈ విధంగా లోపల విచార సాగర మథనము జరగాలి. మనుష్యులు వెంటనే అర్థము చేసుకునే విధంగా మురళి నడపాలి. పిల్లలు నంబరువారుగా ఉండనే ఉన్నారు. ఇది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ప్రతి రోజు అధ్యయనము చేయాలి. భయపడి చదువు మానేయడం సరి కాదు. అలా చేస్తే అది కర్మబంధనమని అంటారు. ప్రారంభములో ఎంతోమంది వారి పరివారముల నుండి వెలుపలికి వచ్చారు. తర్వాత చాలామంది వెళ్లిపోయారు కూడా. 'సింధు'లో చాలా మంది కన్యలు వచ్చారు కాని గలాటాల కారణంగా ఎంతోమంది శత్రువులుగా అయిపోయారు. మొదట వారికి జ్ఞానము చాలా బాగుందని అనిపించేది. వీరికి భగవంతుడి ద్వారా వరము(డాత్‌) లభించిందని భావించేవారు. ఇప్పుడు కూడా ఏదో శక్తి ఉందని భావిస్తారు. కాని పరమాత్మ ప్రవేశించారని అర్థము చేసుకోరు. ఈ రోజులలో క్షుద్రవిద్యల శక్తి చాలామందిలో ఉంది. గీతను చేతికి తీసుకొని వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తిమార్గములోని పుస్తకాలని తండ్రి చెప్తున్నారు. జ్ఞానసాగరుడను నేనే. భక్తిమార్గములో అందరూ నన్నే స్మృతి చేస్తారు. డ్రామా ప్లాను అనుసారము ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తిమార్గములోని వారిని కూడా సంతోషపెడ్తారు. జ్ఞానము తీసుకోకుంటే వారికి భక్తి అయినా మంచిదే. మనుష్యులు భక్తి ద్వారా ఎంతో కొంత అయినా బాగుపడ్తారు కదా. దొంగతనాలు మొదలైనవి చేయరు. భగవంతుని భజన చేసేవారిని గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. ఎంతైనా వారు భక్తులే కదా. ఈ రోజులలో భలే భక్తులుగా ఉన్నా చాలామంది దివాలా తీస్తారు. అలాగని శివబాబా పిల్లలుగా అయితే దివాలా తీయరని కాదు. గత కర్మలు అలా ఉంటే తప్పకుండా దివాలా తీస్తారు. జ్ఞానములోకి వచ్చాక కూడా దివాలా తీస్తారు. ఇందులో జ్ఞానానికి ఏ సంబంధము లేదు.

ఇప్పుడు పిల్లలైన మీరు సర్వీసు చేయడంలో లగ్నమై ఉన్నారు. శ్రీమతముననుసరించి సేవలో లగ్నమైతే ఫలము పొందుతామని తెలుసుకున్నారు. మన సర్వస్వము అక్కడికి బదిలీ చేయాలి. మీ బ్యాగ్‌-బ్యాగేజి అంతటినీ ట్రాన్స్‌ఫర్‌ చేసేయాలి. బాబాకు ప్రారంభములో ఎంతో ఆనందము కలిగింది. అక్కడ నుండి వస్తూనే నషాలో ఒక పాట తయారు చేశారు - అల్ఫ్‌కు అల్లా లభించారు, అతడికి సామ్రాజ్యము లభించింది(అల్ఫ్‌ కో అల్లా మిలా, బే కో బాద్‌షాహీ......). శ్రీ కృష్ణుని సాక్షాత్కారము, చతుర్భుజుని సాక్షాత్కారము జరిగింది. అప్పుడు ద్వారికకు చక్రవర్తిగా అవుతానని అర్థము చేసుకున్నారు. ఈ విధముగా నషా ఎక్కుతూ ఉండేది. అందువలన ఇప్పుడు ఈ వినాశి ధనము ఏమి చేసుకోను? అని అనిపించింది. కావున పిల్లలైన మీకు కూడా బాబా మాకు స్వర్గములో చక్రవర్తి పదవిని ఇస్తున్నారని సంతోషము కలగాలి. కాని పిల్లలు పురుషార్థమే చేయరు. నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు. మంచి మంచి పిల్లలు బాబాకు నిమంత్రణ ఇచ్చేవారు కూడా బాబాను స్మృతి చేయరు. బాబా మేము చాలా సంతోషంగా ఉన్నామని, మీ స్మృతిలో మస్త్‌గా ఉంటామని బాబా వద్దకు ఉత్తరాలు రావాలి. ఎప్పుడూ బాబాను స్మృతి చేయనివారు చాలా మంది ఉన్నారు. స్మృతియాత్ర ద్వారా మాత్రమే ఖుషీ జోరుగా పెరుగుతుంది. జ్ఞానములో ఎంతో మస్త్‌గా ఉంటారు. కాని దేహాభిమానము చాలా ఉంది. దేహీ-అభిమాన స్థితి ఎక్కడుంది? జ్ఞానమైతే చాలా సులభము. యోగములోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. గృహస్థ వ్యవహారములో కూడా అనాసక్తులుగా ఉండాలి. మాయ దెబ్బ తీసే విధంగా ఉండరాదు. మాయ ఎలుక కొరికినట్లు కొరుకుతూ ఉంటుంది. రక్తము బయటకు వస్తున్నా తెలియకుండా ఉండులాగా కొరుకుతుంది. అలాగే దేహాభిమానము వలన ఎంత నష్టము కలుగుతుందో పిల్లలకు తెలియదు. ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మమ్మా-బాబాల వలె మనము కూడా సింహాసనాధికారులుగా అవ్వాలి. తండ్రి హృదయాన్ని తీసుకొనేవారు. దిల్‌వాడా మందిరములో కూడా స్మృతిచిహ్నాలు పూర్తిగా ఉన్నాయి. లోపల ఏనుగుల పై మహారథులు కూర్చుని ఉన్నారు. మీలో కూడా మహారథులు, అశ్వారూఢులు, పదాతి దళమువారు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ-తమ నాడిని చూసుకోవాలి. బాబా ఎందుకు చూడాలి? మీరు స్వయాన్ని ''మేము బాబాను స్మృతి చేస్తున్నామా, బాబా వలె సేవ చేస్తున్నామా? నాకు బాబా జతలో యోగము ఉందా? రాత్రి మేల్కొని తండ్రిని స్మృతి చేస్తున్నానా? అనేకమందికి సేవ చేస్తున్నానా?'' అని పరిశీలించుకోండి. బాబాను ఎంత గాఢంగా స్మృతి చేస్తున్నానని చార్టు పెట్టాలి. మేము నిరంతరము స్మృతి చేస్తున్నామని కొంతమంది భావిస్తారు. ఇది ఎవ్వరికీ సాధ్యపడదు. కొంతమంది మేము బాబా పిల్లలుగా అయ్యాము, ఇక చాలు అని భావిస్తారు. కాని స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. బాబా స్మృతి లేకుండా ఏ పని చేసినా, అది బాబాను స్మృతి చేయనట్లే. బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి. స్మృతిలో ఉండేవారు సదా రమణీకంగా, హర్షితముఖులుగా ఉంటారు. ఇతరులకకు చాలా ఖుషీగా, రమణీకంగా అర్థము చేయిస్తారు. సేవ పై చాలా ఆసక్తి గలవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చిత్రాల పై అర్థము చేయించడం చాలా సులభము. వీరు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. వారి తర్వాత వారి రచన అయిన ఆత్మలమైన మనము. పరస్పరము భాయి - భాయి (సోదరులము). ఇది సోదరత్వము. కాని వారు అందరూ తండ్రులే(ఫాదర్‌హుడ్‌) అని అనేశారు. మొదట శివబాబా చిత్రము చూపించి వారు సర్వాత్మల తండ్రి అని, పరమపిత పరమాత్మ నిరాకారుడని, ఆత్మలమైన మనము కూడా నిరాకారులమేనని అర్థము చేయించాలి. భృకుటి మధ్యలో ఉంటాము శివబాబా కూడా ఒక నక్షత్ర రూపమే. అయితే నక్షత్రాన్ని ఎలా పూజించాలి? కావున పెద్దదిగా తయారు చేశారు. పోతే ఆత్మ ఎప్పుడూ 84 లక్షల జన్మలు తీసుకోదు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది. తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. సతోప్రధాన ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇనుప యుగములోకి వచ్చేస్తుంది. తర్వాత వచ్చువారు 84 జన్మలు తీసుకోరు. అందరూ 84 జన్మలు తీసుకోలేరు. ఆత్మయే ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటుంది. నామ, రూప, దేశ, కాలాదులు అన్నీ మారిపోతాయి. ఈ విధంగా ఉపన్యసించాలి. స్వయాన్ని తెలుసుకోవాలి లేక సెల్ఫ్‌ రియలైజేషన్‌ అని అంటారు. కాని ఎవరు చేయించాలి? ఆత్మయే పరమాత్మ అని అనడం వలన సెల్ఫ్‌ రియలైజేషన్‌ అవుతుందా? ఇది నూతన జ్ఞానము. జ్ఞానసాగరులు, పతితపావనులు, సర్వుల సద్గతిదాత అయిన వారే కూర్చుని అర్థము చేయిస్తున్నారు. తర్వాత వారిని ఎంతగానో మహిమ చేయండి. వారి మహిమను వినండి? మొదట ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు. ఇప్పుడు పరమాత్మ పరిచయము కూడా తెలుపుతారు. వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. వారు చిన్నగా, పెద్దగా అవ్వలేరు. పరమపిత పరమాత్మ అనగా సుప్రీమ్‌ సోల్‌. సోల్‌ అనగా ఆత్మ. పరమాత్మ అయితే అత్యంత పైన ఉండువారు. వారు పునర్జన్మలలోకి రారు. అందువలన వారిని పరమపిత అని అంటారు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర నిండి ఉంది. పతితపావనుడు అని కూడా వారినే అంటారు. వారి పేరు ఎల్లప్పుడూ శివబాబాయే(సదా శివుడు), రుద్రబాబా కాదు. భక్తిమార్గములో అనేక పేర్లు ఉంచారు. వారిని అందరూ ''ఓ పతితపావనా వచ్చి పావనంగా చేయమని స్మృతి చేస్తారు.'' కావున తప్పకుండా రావలసి వచ్చింది. ఒకే ధర్మమును స్థాపన చేయవలసి వచ్చినప్పుడు వారు ఇచ్చటకు వస్తారు. అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇప్పుడిది కలియుగము. లెక్కలేనంతమంది మనుష్యులున్నారు. సత్యయుగములో చాలా కొద్ది మంది మాత్రమే మనుష్యులుంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము...... అని కూడా గాయనముంది. గీత ద్వారానే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. కేవలం అందులో కూడా పొరపాటున కేవలం కృష్ణుని పేరు వ్రాసేశారు. తండ్రి చెప్తున్నారు - కృష్ణుడైతే పునర్జన్మలోనికి వస్తారు, నేను పునర్జన్మ రహితుడను. కావున ఇప్పుడు పరమపిత పరమాత్మ నిరాకార శివుడా? లేక శ్రీ కృష్ణుడా? అని మీరే జడ్జ్‌(నిర్ణయము) చేయండి. గీతా భగవానుడు ఎవరు? భగవంతుడని ఒక్కరినే అంటారు. ఈ విషయాలు ఎవరైనా అంగీకరించకపోతే వారు మన ధర్మానికి చెందినవారు కాదని భావించాలి. సత్యయుగములోకి వచ్చేవారు వెంటనే అంగీకరించి పురుషార్థము చేయడంలో నిమగ్నమవుతారు. ఇదే ముఖ్యమైన విషయము. ఇందులోనే మీకు విజయం ఉంది. అయితే దేహీ-అభిమాని స్థితి ఎక్కడుంది? పరస్పరము నామ-రూపాలలో చిక్కుకొని ఉంటారు. భక్తిమార్గములో కూడా పరబ్రహ్మములో నివసించే పరమాత్మ గురించిన చింత ఉండేది. ఇక భయం దేనికి? అని అనేవారు. ఇందుకు చాలా ధైర్యము కావాలి. ఉపన్యసించేవారు ఆత్మ జ్ఞానాన్ని ఎంతో మస్తీగా(నషాతో) ఇవ్వాలి. తర్వాత పరమాత్మ అంటే ఎవరు? - ఈ టాపిక్‌ పై కూడా అర్థము చేయించాలి. తండ్రి మహిమ - ప్రేమసాగరులు, జ్ఞానసాగరులు...... పిల్లల మహిమ కూడా అదే. ఎవరినైనా కోపగించుకోవడం అనగా చట్టము చేతికి తీసుకోవడం. బాబా ఎంత మధురమైనవారు! పిల్లలు ఎవరైనా పని చేయకపోతే, సేవ చేసేందుకు అంగీకరించకపోతే(నటాతే) నటవరుని(శ్రీ కృష్ణుని)గా అవ్వలేరు. చాలా మధురంగా అవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ యాత్ర కొరకు మీ సామాగ్రి అంతా ట్రాన్స్‌ఫర్‌(బదిలీ) చేసి చాలా ఖుషీగా, నషా(మస్తీ)గా ఉండాలి. మమ్మా-బాబాల సమానంగా సింహసనాధికారులుగా అవ్వాలి. అత్యంత ప్రీతికరమైన(జిగరీ) స్మృతిలో ఉండాలి.

2. ఎవరికో భయపడి చదువును ఎప్పుడూ వదిలేయరాదు. స్మృతి ద్వారా మీ కర్మ బంధనాలను తేలిక చేసుకోవాలి. ఎప్పుడూ క్రోధములోకి వచ్చి చట్టము చేతికి తీసుకోరాదు. ఏ సేవకూ 'కాదు, లేదు' అని అనరాదు.

వరదానము :-

''బ్రాహ్మణ జీవితములోని ఆస్తి మరియు వ్యక్తిత్వాన్ని అనుభవం చేసి చేయించే విశేష ఆత్మా భవ''

బాప్‌దాదా బ్రాహ్మణ పిల్లలందరికి స్మృతినిప్పిస్తున్నారు - బ్రాహ్మణులుగా అయ్యారు అది గొప్ప సౌభాగ్యము. కాని బ్రాహ్మణ జీవితములో వారసత్వము, ఆస్తి - సంతుష్టత(తృప్తి), బ్రాహ్మణ జీవితములో పర్సనాలిటీ(వ్యక్తిత్వము) ప్రసన్నత. ఈ అనుభవంతో ఎప్పుడూ వంచితులుగా ఉండరాదు. మీరు అధికారులు. ఎప్పుడైతే దాత, వరదాత విశాల హృదయంతో ప్రాప్తుల ఖజానాను ఇస్తున్నారో ఆ ఖజానాను అనుభవం చేయండి, ఇతరులను కూడా అనుభవీలుగా చేయండి. అప్పుడు విశేష ఆత్మ అని అంటారు.

స్లోగన్‌ :-

''చివరి సమయం గురించి ఆలోచించేందుకు బదులు చివరి స్థితిని గురించి ఆలోచించండి.''

బ్రహ్మాబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
సేవకు ప్రత్యక్ష ఫలము చూపించేందుకు ఎలాగైతే బ్రహ్మబాబా తన ఆత్మిక స్థితి ద్వారా సేవ చేశారో, అలా పిల్లలైన మీరు కూడా ఇప్పుడు మీ ఆత్మిక స్థితిని ప్రత్యక్షం చేయండి. 'రూహ్‌' అని ఆత్మనూ అంటారు, ఎస్సెన్స్‌ను కూడా రూహ్‌ అని అంటారు. కనుక ఆత్మిక స్థితిలో ఉండుట వలన రెండూ అయిపోతాయి. దివ్యగుణాల ఆకర్షణ అనగా ఎస్సెన్స్‌. అది రూహ్‌ కూడా అవుతుంది. ఆత్మిక స్వరూపం కూడా కనిపిస్తుంది.