09-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - అనుక్షణము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి ఆత్మిక సర్జన్. మీరు నిరోగులుగా తయారయ్యే ఒకే ఒక ఔషధాన్ని తెలుపుతున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేయండి.''
ప్రశ్న :-
మీతో మీరే ఏ మాటలు మాట్లాడుకుంటే చాలా సంతోషము(మజా) కలుగుతుంది ?
సమా :-
మీతో మీరే ఇలా మాట్లాడుకోండి - ఈ కళ్ళ ద్వారా ఏవైతే చూస్తూన్నామో అవన్నీ సమాప్తమౌతాయి. మనము మరియు బాబా మాత్రమే ఉంటాము. మధురమైన బాబా మనలను స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. ఏకాంతములోకి వెళ్ళిపోతే చాలా మజా వస్తుంది.
ఓంశాంతి.
పరమపిత శివభగవానువాచ - మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమయుగములో అడుగడుగునా బాబా స్మృతి ఉండాలి. ఇది కూడా నంబరువారు పురుషార్థానుసారము పిలలైన మీకు మాత్రమే తెలుసు. మనమిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో పురుషోత్తములుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉండాలి. ఈ రావణుని పంజరము నుండి బాబా మనలను విడుదల చేసేందుకు వచ్చారు. ఏ పక్షినైనా పంజరము నుండి వెలికి తీసినట్లైతే అది ఖుషీగా ఎగురుతూ సుఖము పొందుతుంది. ఇది రావణుని పంజరము. ఇందులో అనేక రకాలైన దు:ఖములున్నాయని మీకు తెలుసు. ఈ పంజరము నుండి వెలికి తీసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. ఉన్నవారంతా మనుష్యులే. దేవతలకు, అసురులకు యుద్ధము జరిగింది. దేవతలు విజయము పొందారు అని శాస్త్రాలలో వ్రాయబడింది. ఇప్పుడు యుద్ధము మాటే లేదు. మీరిప్పుడు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఆసురీ రావణుడు అనగా 5 వికారాల పై విజయము పొందుతారు. రావణ సంప్రదాయము పై కాదు. 5 వికారాలనే రావణుడని అంటారు. అంతేకాని ఎవరినో తగులబెట్టడం మొదలైనవి కాదు. పిల్లలైన మీరు చాలా సంతోషిస్తారు. మీరిప్పుడు ఎలాంటి ప్రపంచానికి వెళ్తున్నారంటే అక్కడ వేడి ఉండదు, చలి ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. సత్యయుగ స్వర్గము అనే వసంత ఋతువు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ వసంత ఋతువు కొంత సమయము మాత్రమే ఉంటుంది. ఆ వసంత ఋతువు మీ కొరకు అర్ధకల్పానికి వస్తుంది. అక్కడ వేడి మొదలైనవి ఉండవు. వేడి ద్వారా కూడా మానవులకు దు:ఖము కలుగుతుంది. మరణిస్తారు. ఈ దు:ఖాలన్నిటి నుండి విడుదల అయ్యేందుకు అవినాశి సర్జన్ మనకు చాలా సహజమైన ఔషధమునిస్తారు. ఆ సర్జన్ వద్దకు వెళ్ళినట్లైతే అనేక ఔషధాలు మొదలైనవి జ్ఞాపకము వస్తాయి. ఇక్కడ ఈ సర్జన్ వద్ద ఏ ఔషధమూ లేదు. కేవలం వారిని స్మృతి చేయడం ద్వారా అన్ని రోగాలు దూరమైపోతాయి. వేరే ఔషధాలు మొదలైనవేవీ లేవు.
చార్టు ఎలా వ్రాయాలి? బాబాను ఎలా స్మృతి చేయాలి? - ఈ విషయము పై ఈ రోజు సెమినార్ చేస్తామని పిల్లలు అనేవారు. ఇప్పుడు తండ్రి మీరు కూర్చుని వ్రాయండి, కాగితము పై వ్రాయండి, కాగితాలు పాడు చేయమని కష్టమునివ్వరు. అనగా మీకు వ్రాసే అవసరమే లేదు. కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. అజ్ఞానకాలములో తండ్రిని స్మృతి చేసేందుకు చార్టు తయారు చేయబడేదా! ఇందులో చదువుకునే అవసరమేమీ లేదు. బాబా మేము మిమ్ములను మర్చిపోతాము అని తండ్రికి చెప్తారు. ఎవరైనా వింటే ఏమంటారు? జీవించి ఉండగానే మీ వారమయ్యామని అంటారు కదా. ఎందుకయ్యారు? తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని వారసత్వముగా తీసుకునేందుకు. మరి అటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతారు? ఏ తండ్రి నుండైతే ఇంత గొప్ప వారసత్వము లభిస్తుందో, వారిని మీరు స్మృతి చేయలేరా! ఎన్నోసార్లు మీరు వారసత్వము తీసుకున్నారు. అయినా మర్చిపోతారు. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలంటే స్మృతి కూడా చేయాలి, దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. ఏమి వ్రాయాలి?(వ్రాసే పనిలేదు). ఇలా ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి. నారదుని ఉదాహరణ కూడా ఉంది. గొప్ప భక్తుడనని స్వయం చెప్పుకునేవాడు. మనము జన్మ-జన్మాంతరాల పాత భక్తులమని మీకు కూడా తెలుసు. మనము మధురమైన తండ్రిని స్మృతి చేసి ఎంతో సంతోషిస్తాము. ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు లక్ష్మీనారాయణులను వరించేందుకు అంత యోగ్యులుగా అవుతారు. ఎవరైనా పేదవారి పుత్రుడు ధనవంతులకు దత్తు వెళ్ళినప్పుడు ఎంత సంతోషిస్తాడు! తండ్రిని మరియు ఆస్తినే స్మృతి చేస్తాడు. ఇక్కడ అనంతమైన తండ్రివారిగా అయ్యి రాజ్యము పొందుకొనే వివేకము లేనివారు చాలా మంది ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయము - ఏ తండ్రి స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారో వారిని స్మృతి చేయలేరు. తండ్రి పిల్లలను దత్తు తీసుకుంటారు. అలాంటి తండ్రిని స్మృతి చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయము. క్షణ-క్షణము తండ్రి మరియు వారసత్వము జ్ఞాపకము రావాలి.
తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన అపురూప పిల్లలారా! నాకు దత్తత వచ్చేందుకే మీరు నన్ను పిలిచారు. తండ్రిని పిలుస్తారు కదా. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు. స్వర్గ వారసత్వమును ఇస్తారు. బాబా! పతితులమైన మమ్ములను వచ్చి ఒడిలోకి తీసుకోండి అని మీరు పిలుస్తారు. మేము పతితులము, భికారులము, ఛీ-ఛీ విలువలేని వారము(పైసకు కొరగాని వారము)అని మీరే చెప్తారు. అనంతమైన తండ్రిని మీరు భక్తిమార్గములో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - భక్తిమార్గములో కూడా మీకు ఇంత దు:ఖముండేది కాదు. ఇప్పుడు మనుష్యులకు ఎంత దు:ఖము ఉంది! తండ్రి వచ్చారు అంటే తప్పకుండా వినాశనము కూడా ఆసన్నమయ్యిందని అర్థము. ఈ యుద్ధము తర్వాత ఎన్ని జన్మలు, ఎన్ని సంవత్సరాలు యుద్ధము మాటే ఉండదో మీకు తెలుసు. ఎప్పుడూ యుద్ధము జరగదు. ఎలాంటి దు:ఖము గానీ ఎలాంటి రోగము మొదలైన వాటిపేర్లే ఉండవు. ఇప్పుడు ఎన్ని జబ్బులున్నాయి! తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా! మిమ్ములను నేను అన్ని దు:ఖముల నుండి విడుదల చేస్తాను. హే భగవంతుడా! వచ్చి దు:ఖమును హరించండి. సుఖ-శాంతులను ఇవ్వండి అని మీరు నన్ను స్మృతి కూడా చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ రెండింటిని వేడుకుంటారు. ఇక్కడ అశాంతి ఉంది. శాంతి కొరకు ఎవరు సలహా ఇస్తారో వారికి బహుమతి కూడా లభిస్తూ ఉంటుంది. పాపం వారికి శాంతి అని దేనినంటారో కూడా తెలియదు. శాంతి మధురమైన తండ్రి ద్వారా తప్ప వేరెవ్వరి ద్వారా లభించదు. మీరు అర్థం చేయించేందుకు ఎంత శ్రమ చేస్తారు! అయినా అర్థము చేసుకోరు. మీరు ప్రభుత్వానికి కూడా - ''మీరు అనవసరంగా ఎందుకు ధనాన్ని వ్యర్థము చేస్తారు? శాంతిసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే, వారే విశ్వములో శాంతిని స్థాపన చేస్తారు'' అని వ్రాయవచ్చు. ప్రభుత్వములోని ఉన్నతాధికారులకు మంచి మంచి కాగితాల పై రాయల్గా లెటరు వ్రాయాలి. మంచి కాగితమును చూసి ఇది బహుశా ఎవరో గొప్పవారు వ్రాసిన లేఖ అని భావిస్తారు. విశ్వములో శాంతి అని మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇంతకు ముందు ఎప్పుడు ఉండేది? అది మళ్లీ ఇప్పుడు ఎలా లభిస్తుందో చెప్పండి, తప్పకుండా ఎప్పుడో లభించి ఉంటుంది అని వ్రాయండి. ఇది పిల్లలైన మీకు తెలుసు. మీరు తిథి, తారీఖులు అన్నీ వ్రాయగలరు. తండ్రియే వచ్చి విశ్వములో సుఖ-శాంతుల స్థాపన చేశారు. అది సత్యయుగ సమయము. ఈ లక్ష్మీనారాయణులు ఆ రాజ్యానికి గుర్తు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ పాత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ముఖ్యమైన పాత్ర బ్రహ్మదే కదా. అతడే రథముగా అవుతాడు. ఆ రథము ద్వారా తండ్రి ఇంత గొప్ప కార్యము చేస్తారు. అతని పేరే పదమాపదమ్ భాగ్యశాలీ రథము. ఎవరికి ఎలా అర్థం చేయించాలని ఆలోచించండి. మనుష్యులకు ఎంత నషా ఉంది! ఇప్పుడు మీరు తండ్రి పరిచయమునే ఇవ్వాలి. కేవలం జ్ఞానసాగరులైన తండ్రి వద్ద మాత్రమే జ్ఞానముంది. వారు ఎప్పుడు వస్తారో అప్పుడే ఇస్తారు. అంతవరకు జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తినైతే భక్తులందరూ చేస్తూనే ఉంటారు. జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. జ్ఞానము తెలిపే స్థిరమైన పుస్తము ఏదీ తయారవ్వదు. జ్ఞానము చెవుల ద్వారానే వినాలి. ఈ పుస్తకాలు మొదలైనవి ఏవైతే మీరు ఉంచుకుంటారో అవన్ని తాత్కాలికమైనవి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు నోట్స్ వ్రాసుకుంటారు. ఇవి కూడా సమాప్తమవుతాయి. నోట్సు కేవలం మీ పురుషార్థము కొరకే. టాపిక్ల లిస్ట్ తయారు చేయండి. అప్పుడు జ్ఞాపకము వస్తుంది అని బాబా చెప్తారు. కానీ ఈ పుస్తకాలు మొదలైనవి ఏవీ ఉండవని మీకు తెలుసు. మీ బుద్ధిలో కేవలం స్మృతి మాత్రమే కొనసాగుతుంది. ఆత్మ పూర్తిగా తండ్రి సమానము సంపన్నమైపోతుంది. మిగిలిన పాత వస్తువులు ఏవైతే మీరు ఈ కళ్ళతో చూస్తున్నారో అవి కూడా సమాప్తమైపోతాయి. చివర్లో ఏవీ మిగలవు.
తండ్రి అవినాశి సర్జన్. ఆత్మ కూడా అవినాశి. ఒక శరీరము వదిలి మరొక శరీరము తీసుకుంటుంది. రోజురోజుకు ఏ శరీరాలు లభిస్తాయో అవన్నీ ఛీ - ఛీ శరీరాలే లభిస్తాయి. మనము శ్రేష్ఠాచారులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రే తయారు చేస్తారు. సాధు-సత్పురుషులు మొదలైనవారు తయారుచేయరు. తండ్రి మిమ్ములను శ్రేష్ఠాచారులుగా చేస్తారు. తండ్రి చెప్తారు - మధురమైన పిల్లలారా! నేను మిమ్ములను నా కనుల పై కూర్చోపెట్టుకొని తీసుకెళ్తాను. ఆత్మ కూడా ఇక్కడ కనుల పైనే కూర్చుంటుంది. తండ్రి చెప్తారు - హే ఆత్మల్లారా! నేను మిమ్ములనందరినీ సంతృప్తి పరచి తీసుకెళ్తాను. కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు శ్రమ చేయండి. మీ మనసును ప్రశ్నించుకోండి - మధురమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను? ''హీర్ - రాంఝా''ల ప్రేమ వికారాల కొరకు కాదు(లైలా, మజ్నూల ప్రేమ వంటిది). శారీరిక ప్రేమ ఉండేది. శరీరమును స్మృతి చేసేవారు. ఎదురుగా వచ్చేసేవారు. ఇరువురు పరస్పరములో కలుసుకునేవారు. మీరు కూడా అలా తయారవ్వండి అని బాబా చెప్తున్నారు. వారు ఒక్క జన్మకు ప్రేయసీ-ప్రియులు. మీరు జన్మ-జన్మాంతరాల ప్రేయసీ -ప్రియులు. ఈ విషయాలన్నీ ఈ సమయములోనివే. ప్రేయసీ-ప్రియులు అనే పదాలు కూడా స్వర్గములో ఉండవు. వారు కూడా పవిత్రంగా ఉంటారు. మనసులో సంకల్పము వస్తూనే ఎదురుగా చూస్తారు. సంతోషిస్తారు. పిల్లలైన మీకు చూడదగిన వస్తువు ఏదీ లేదు. ఈ సమయములో కేవలం మీరు స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. ప్రియతముడైన తండ్రిని స్మృతి చేయండి. ఆత్మ అని తెలుసుకొని తండ్రిని చాలా ఖుషీగా స్మృతి చేయాలి. భక్తిమార్గములో ఎలాంటి ప్రేయసులుగా ఉండేవారంటే ప్రియతమునికి బలిహారి అయ్యేవారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. హే ప్రియతమా! మీరు వస్తే మేము మీకు అర్పణ అవుతాము అని అనేవారు. ఇప్పుడు అందరినీ సుందరంగా, పవిత్రంగా చేసేందుకు ఆ ప్రియతముడు వచ్చాడు. ఎవరు ఎలా ఉన్నారో అలా తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు పవిత్రంగా అయినప్పుడు శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. మలినము ఆత్మలోనే ఏర్పడ్తుంది. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మలినము తొలగిపోతుంది. పిల్లలైన మీరు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఏకాంతము చాలా బాగుంటుంది. ఫాదరీలు కూడా కాలినడకన వెళ్తారు. పూర్తి సైలెన్స్గా ఉంటారు. మాల చేతిలో ఉంటుంది. ఎవ్వరినీ చూడరు. మెల్ల మెల్లగా నడుస్తూ ఉంటారు. వారు ఏసుక్రీస్తును స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి గురించి తెలియనే తెలియదు. నామ-రూపాలకు భిన్నమైనవారని నా గురించి చెప్తారు. ఇప్పుడు బిందువైతే వారు చూడగలరా? బిందువును ఎలా స్మృతి చేయాలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది కనుక మీరు ఇక్కడకు వస్తారు. మధువనానికి మహిమ ఉంది. మీరు వచ్చిన ఈ స్థానము సత్య-సత్యమైన మధువనము. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత మీరు ఏకాంతములో స్మృతి చేయండి. ఎవ్వరినీ చూడకండి. ఇంటి పై కప్పులు ఉన్నాయి కదా. బాబాను స్మృతి చేస్తూ ఉదయమే అక్కడకు వెళ్ళండి. చాలా మజా వస్తుంది. రాత్రి 1 - 2 గంటలకు మేల్కొనే ప్రయత్నము చేయండి. నిద్రాజీతులైన మీరు ప్రసిద్ధమైనవారు. రాత్రి త్వరగా నిదురించండి. మళ్లీ 1-2 గంటలకు లేచి మిద్దె పై ఏకాంతములో స్మృతియాత్ర చేస్తూ ఉండండి. చాలా జమ చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ, తండ్రి మహిమను చేయండి. పరస్పరములో కూడా ఇదే సలహాను ఇవ్వండి. బాబా ఎంత మధురమైనవారు! వారిని స్మృతి చేయడం ద్వారానే పాపము సమాప్తమవుతుంది. ఇక్కడ చాలా జమ చేసుకోవచ్చు. ఈ అవకాశము కూడా ఇక్కడ బాగా లభిస్తుంది. ఇంట్లో మీరు చేయలేరు. తీరిక ఎక్కడ ఉంటుంది? ప్రపంచములోని వైబ్రేషన్లు, వాతావరణము చాలా చెడుగా ఉంటాయి. అక్కడ ఇంత స్మృతి యాత్ర జరగదు. ఇప్పుడు ఇందులో వ్రాయవలసిందేముంది? ప్రేయసీ - ప్రియులు ఏమైనా వ్రాస్తారా! మేము ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా! మేము ఎంతమందికి స్మృతిని ఇప్పించాము అని స్వయాన్ని చూసుకోండి. ఇక్కడకు మనము జమ చేసుకునేందుకు వస్తాము కనుక ఇప్పుడు ఆ ప్రయత్నము చేయండి. ఇంట మిద్దె పై ఏకాంతముగా వెళ్ళి కూర్చోండి. ఖజానాలు జమ చేసుకోండి. ఈ సమయము జమ చేసుకునే సమయము. 7 రోజులు, 5 రోజులు వస్తారు. మురళి విని అక్కడకు వెళ్ళి ఏకాంతములో కూర్చోండి. ఇక్కడ ఇంట్లో కూర్చుని ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీకు కొంత జమ అవుతుంది. చాలామంది మాతలు బంధనములో ఉన్నారు. శివబాబా, బంధనము నుండి విడుదల చెయ్యమని స్మృతి చేస్తారు. వికారాల కొరకు ఎంతగా కొట్తారు. ద్రౌపది వస్త్రాలను హరించారనే ఆట చూపించారు కదా. మీరందరూ ద్రౌపదులే కదా. కావున తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. బాబా అనేక యుక్తులను తెలియజేస్తారు. ఇందులో స్నానము చేసే మొదలైన నియమాల విషయము కూడా ఏదీ లేదు. లెట్రిన్కు వెళ్ళినప్పుడు మాత్రము తప్పకుండా స్నానము చేసి తీరాలి. మనుష్యులు స్నానము చేసే సమయములో కూడా ఎవరైనా దేవత లేక భగవంతుని స్మృతి చేస్తారు. ముఖ్యమైన విషయము స్మృతియే. జ్ఞానమేమో చాలా లభించిది. 84 జన్మల చక్రము గురించిన జ్ఞానము కూడా ఉంది. ఆంతరికముగా మిమ్ములను మీరు చూసుకోండి. స్వయాన్ని ప్రశ్నించుకోండి - మమ్ములను స్వర్గానికి అధికారులుగా చేసే ఇలాంటి మధురాతి మధురమైన బాబాను పూర్తి రోజులో ఎంత సమయము స్మృతి చేశాము? మనసు ఎక్కడికీ పరుగెత్తడం లేదు కదా! ఎక్కడకు పరుగెత్తుతుంది? ఇక ఈ ప్రపంచము లేనే లేదు. ఇదంతా సమాప్తము అవ్వనున్నది. మనము మరియు బాబా మాత్రమే మిగిలి ఉంటాము. ఇలా ఆంతరికంగా మాట్లాడుకున్నప్పుడు చాలా మజా(సంతోషము) వస్తుంది. ఎవరెవరు ఇక్కడికి వస్తారో, వారు చాలా పాత భక్తులు. ఎవరు ఇచ్చటకు రారో వారు ఇప్పటి భక్తులు అని భావించండి. వారు ఆలస్యంగా వస్తారు. ప్రారంభము నుండి భక్తి చేసేవారు తప్పకుండా బాబా నుండి వారసత్వము తీసుకునేందుకు వస్తారు. ఇది గుప్తంగా చేసే శ్రమ. ఎవరు ధారణ చేయరో, వారు కొంచెము కూడా శ్రమ చేయరు. ఇక్కడికి మీరు రిఫ్రెష్ (తాజా) అగుటకే వస్తారు. స్వయంలో శ్రమ చేయండి. అక్కడ 12 నెలలలో జమ చేసుకోలేని సంపాదన ఇక్కడ ఒక వారములోనే జమ చేసుకోగలరు. ఇక్కడ 7 రోజులలో, లోపల ఉన్న మలినాలన్నిటినీ తొలగించుకోగలరు. అందుకు బాబా సలహానిస్తారు. అచ్ఛా! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏకాంతములో కూర్చుని బాబాను స్మృతి చేసి సంపాదన జమ చేసుకోవాలి. స్మృతి చేయు సమయములో మనసు పరిగెత్తడం లేదు కదా! నేను ఎంత సమయము మధురమైన తండ్రిని స్మృతి చేశాను? అని ఆంతరికములో చెక్ చేసుకోవాలి.
2. మమ్ములను బాబా రావణుని పంజరము నుండి ముక్తులుగా చేశారు. ఇప్పుడు ఎక్కడ వేడి ఉండదో, చలి ఉండదో అలాంటి ప్రపంచములోకి మేము వెళ్తున్నాము. అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది అని సదా సంతోషంగా ఉండాలి.
వరదానము :-
'' ఆత్మిక నశా ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య అధికారి నుండి విశ్వ రాజ్యాధికారి భవ ''
సంగమ యుగములో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారో, వారే స్వరాజ్యానికి, విశ్వ రాజ్యానికి అధికారులుగా అవుతారు. ఈ రోజు స్వరాజ్యముంది, రేపు విశ్వరాజ్యముంటుంది. ఇది ఈరోజు రేపటి విషయమే. ఇటువంటి అధికారి ఆత్మ, ఆత్మిక నశాలో ఉంటుంది. ఈ ఆత్మిక నశా పాత ప్రపంచాన్ని సులభంగా మరపింపజేస్తుంది. అధికారులు ఎప్పుడూ ఏ వస్తువు, వ్యక్తి, సంస్కారానికి అధీనులుగా అవ్వజాలరు. వారు హద్దు విషయాలను వదలాల్సిన పని ఉండదు, వాటంతకవే వదిలిపోతాయి.
స్లోగన్ :-
''ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేయువారే సఫలతామూర్తులుగా అవుతారు.''