12-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మొత్తం ప్రపంచములోని హాహాకారాలన్నీ తొలగించి జయ - జయ ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు - పాత ప్రపంచములో హాహాకారాలున్నాయి, నూతన ప్రపంచములో జయ జయ ధ్వనులు ఉంటాయి''

ప్రశ్న :-

పేదవారే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోగలరు, షాహుకార్లు తీసుకోలేరు. దీనికి సంబంధించిన ఈశ్వరీయ నియమము ఏది ?

జవాబు :-

పూర్తి (భిక్షుకులుగా) నిరుపేదలుగా అయిపోండి. ఏదైతే ఉందో దానినంతా మర్చిపోండి - ఇదే ఈశ్వరీయ నియమము. కనుక పేద పిల్లలు సహజంగానే మర్చిపోతారు. కానీ షాహుకార్లు ఎవరైతే తాము స్వర్గములోనే ఉన్నామని భావిస్తారో వారు బుద్ధి ద్వారా ఏమీ మర్చిపోలేరు. కావున ఎవరికైతే ధనము, సంపద, బంధు - మిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారు సత్యమైన యోగులుగా అవ్వనే అవ్వజాలరు. వారికి స్వర్గములో శ్రేష్ఠ పదవి లభించదు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన నిశ్చయ బుద్ధి గల పిల్లలకు, తండ్రి పూర్తి ప్రపంచములోని జగడాలను తొలగించేందుకు వచ్చారని బాగా తెలుసు. ఈ తనువులో తండ్రి వచ్చి ఉన్నారని, వారి పేరు శివబాబా అని తెలివైన, బుద్ధివంతులైన పిల్లలకు తెలుసు. ఎందుకు వచ్చారు? హాహాకారాలను తొలగించి జయ జయ ధ్వనులను చేయించేందుకు వచ్చారు. మృత్యులోకములో ఎన్ని జగడాలు మొదలైనవి ఉన్నాయి. అందరూ లెక్కాచారాలను చుక్తా చేసుకొని వెళ్లాలి. అమరలోకములో జగడాల మాటే ఉండదు. ఇక్కడ ఎన్ని హంగామాలు(హాహాకారాలు) జరుగుతున్నాయి. ఎన్ని కోర్టులు, ఎంతమంది జడ్జీలు మొదలైనవారున్నారు. మారణహోమాలు జరుగుతున్నాయి. విదేశాలలో కూడా ఎన్ని హాహాకారాలున్నాయో చూడండి. పూర్తి ప్రపంచమంతటా చాలా గొడవలున్నాయి. దీనిని పాత తమోప్రధాన ప్రపంచమని అంటారు. ఎక్కడ చూసినా మలినమే మలినముంది. అడవే అడవి ఉంది. బేహద్‌ తండ్రి వీటన్నిటిని అంతం చేసేందుకు వచ్చారు. ఇప్పుడు పిల్లలు చాలా తెలివైనవారుగా అవ్వాలి. ఒకవేళ పిల్లలలోనే జగడాలు, కొట్లాటలు జరుగుతూ ఉంటే తండ్రికి సహయోగులుగా ఎలా అవుతారు? బాబాకైతే చాలా సహయోగి పిల్లలు కావాలి. బుద్ధివంతులు, నేర్పరులు, లోపాలు లేనివారు కావాలి. ఇది పాత ప్రపంచమని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది తమోప్రధాన వికారీ ప్రపంచము. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది. పతిత పాత ప్రపంచములో జగడాలే జగడాలున్నాయి. ఈ జగడాలన్నిటిని సమాప్తము చేసి, జయ జయ ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు. ఈ ప్రపంచములో ఎంత దు:ఖము, అశాంతి ఉందో అందరికీ తెలుసు. అందుకే విశ్వములో శాంతి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు పూర్తి విశ్వములో సంపూర్ణ శాంతిని మానవ మాత్రులెలా స్థాపించగలరు? అనంతమైన తండ్రిని రాళ్ళు-రప్పలలో చూపించారు. ఇది కూడా ఆటనే. కావున తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ధృఢంగా నిలబడండి. తండ్రికి సహయోగులుగా అవ్వండి. తండ్రి నుండి తమ రాజ్య భాగ్యమును తీసుకోండి. ఇది తక్కువేమీ కాదు. అనంతమైన సుఖముంది. తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా! డ్రామానుసారము అనంతమైన తండ్రి మిమ్ములను పదమాపదమ్‌ భాగ్యశాలురుగా చేసేందుకు వచ్చారు. భారతదేశములో ఈ లక్ష్మీనారాయణులు రాజ్యము చేసేవారు. భారతదేశము స్వర్గముగా ఉండేది. స్వర్గమునే వండర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అని అంటారు. త్రేతా యుగాన్ని కూడా అలా అనరు. అటువంటి స్వర్గములోకి వచ్చేందుకు పిల్లలు పురుషార్థము చేయాలి. మొట్టమొదట్లోనే రావాలి. మేము స్వర్గములో రావాలని, లక్ష్మీ లేక నారాయణునిగా అవ్వాలని పిల్లలు అనుకుంటారు కూడా. ఇప్పుడు ఈ పాత ప్రపంచములో చాలా హాహాకారాలు జరగనున్నాయి. రక్తపు నదులు ప్రవహించనున్నాయి. రక్తనదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి. దానిని క్షీరసాగరమని అంటారు. ఇక్కడ కూడా పెద్ద చెరువులు కొన్ని సరోవరాలలో, విశేష రోజులలో పాలు పోస్తారు. అందులో స్నానాలు చేస్తారు. శివలింగము పై కూడా పాలతో అభిషేకము చేస్తారు. అక్కడ పాలు, నేతి నదులు ప్రవహిస్తాయని సత్యయుగానికి ఒక మహిమ ఉంది. కానీ అలాంటిదేమీ లేదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఈ సమయములో మీరు బానిసలుగా ఉన్నారు. తర్వాత మళ్లీ మీరే చక్రవర్తులుగా అవుతారు. సమస్త ప్రకృతి మీకు దాసిగా అయిపోతుంది. అక్కడ ఎటువంటి నియమ విరుద్ధంగా వర్షాలు కానీ నదులు ఉప్పొంగడం కానీ జరగదు, ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయో చూడండి. అక్కడ పక్కా వైష్ణవులు ఉంటారు. వికారీ వైష్ణవులు ఉండరు. ఇక్కడ ఎవరైనా శాఖాహారులుగా ఉంటే వారిని వైష్ణవులని అంటారు. కానీ అలా కాదు. వికారాలతో పరస్పరము చాలా దు:ఖమిచ్చుకుంటారు. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు. పల్లె పిల్లవాడని గాయనము కూడా ఉంది. కానీ కృష్ణుడు పల్లెవాడు కాజాలడు. అతడు వైకుంఠానికి అధికారి. తర్వాత 84 జన్మలు తీసుకుంటాడు.

మనం భక్తిలో ఎన్ని దెబ్బలు తిన్నామో, ఎంత ధనమును నష్టపరచామో కూడా మీకిప్పుడు తెలుసు. బాబా ప్రశ్నిస్తున్నారు - నేను మీకు ఎంత ధనమిచ్చాను! రాజ్యభాగ్యమునిచ్చాను. అంతా ఎక్కడ పోయింది? మిమ్ములను విశ్వాధికారులుగా చేశాను. కానీ మీరేం చేశారు? తండ్రికి డ్రామా గురించి తెలుసు. నూతన ప్రపంచము పాతదిగా, పాత ప్రపంచము కొత్తదిగా అవుతుంది. ఇది చక్రము. గడచిపోయినదంతా అది మళ్లీ పునరావృతమౌతుంది. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు చాలా కొద్ది సమయముంది. పురుషార్థము చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి. పాత ప్రపంచానికి సంబంధించినదంతా మట్టిలో కలిసిపోతుంది. షాహుకార్లు ఈ జ్ఞానమును తీసుకోరు. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. పేదవారే అక్కడ షాహుకార్లుగా అవుతారు. ధనవంతులు అక్కడ పేదవారిగా అవుతారు. ఇప్పుడు చాలామంది పదమాపతులున్నారు. వారు వస్తారు కానీ అక్కడ పేదవారిగా అవుతారు. వారు తమను తాము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. అది బుద్ధి నుండి తొలగిపోదు. ఇక్కడ తండ్రి అన్నీ మర్చిపొమ్మని చెప్తున్నారు. ఖాళీగా, భికారులుగా అయిపోండి అని అంటారు. ఈ రోజుల్లో కిలోగ్రాములు, కిలోమీటర్లు మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి. సింహాసనం పై ఏ రాజు కూర్చుంటారో వారు ఆ భాషను అమలుచేస్తారు. విదేశీయులను అనుకరిస్తారు. తమ తెలివిని ఉపయోగించరు. తమోప్రధానంగా ఉన్నారు. అమెరికా మొదలైన దేశాలలో వినాశ సామగ్రి కొరకు ఎంత ధనమును వినియోగిస్తున్నారో చూడండి. విమానాల నుండి బాంబులు మొదలైనవాటిని పడేస్తారు. అగ్ని అంటుకోనున్నది. తండ్రి వినాశనము మరియు స్థాపన చేసేందుకే వచ్చారని పిల్లలకు తెలుసు. మీలో కూడా అర్థం చేయించేవారు నెంబరువారుగా ఉన్నారు. అందరిలో ఒకేలాగ నిశ్చయబుద్ధి లేదు. బాబా ఎలా చేశారో, అదే విధంగా తండ్రిని అనుసరించాలి. పాత ప్రపంచములో ఈ పనికిరాని ధనమును ఏం చేస్తారు. ఈ రోజులలో కాగితపు నోట్లు వెలువడ్డాయి. అక్కడైతే మొహరీలు(బంగారు నాణెములు) ఉంటాయి. బంగారపు మహళ్ళే తయారౌతున్నప్పుడు బంగారు నాణెములకు అక్కడేం విలువ ఉంటుంది. సతోప్రధాన భూమి అయిన కారణంగా అన్నీ ఉచితంగా లభిస్తాయి. ఇప్పుడంతా పాతదైపోయింది కదా. అది సతోప్రధాన నూతన ప్రపంచము. పూర్తి కొత్త భూమి. మీరు సూక్ష్మవతనములోకి వెళ్లి శూబీరసము మొదలైనవి త్రాగుతారు కానీ సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవేవీ లేవు. మూలవతనములో కూడా లేవు. మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు అక్కడ మీకు అన్నీ లభిస్తాయి. బుద్ధిని ఉపయోగించి పని చేయండి. సూక్ష్మవతనములో వృక్షాలు ఉండవు. వృక్షాలు భూమి పై ఉంటాయి, ఆకాశములో ఉండవు. భలే బ్రహ్మమహాతత్వమని పేరు ఉంది కానీ అదంతా శూన్యము. ఎలా ఈ నక్షత్రాలు ఆకాశములో నిలిచి ఉన్నాయో, అలా మీరు చాలా చిన్న-చిన్న ఆత్మలు ఎందరో నిలిచి ఉన్నారు. నక్షత్రాలు చూచేందుకు పెద్దవిగా ఉంటాయి. అలాగని బ్రహ్మతత్వములో పెద్ద పెద్ద ఆత్మలుంటాయని కాదు. ఇది బుద్ధితో అర్థము చేసుకోవాలి. విచార సాగర మథనము చేయాలి. కనుక ఆత్మలు కూడా పైన నిలుస్తాయి. సూక్ష్మమైన బిందువులు. ఈ విషయాలన్నీ మీరు ధారణ చేయాలి. అప్పుడే ఇతరులతో ధారణ చేయించగలరు. టీచరుకు స్వయం తెలిసినప్పుడు మాత్రమే ఇతరులను చదివించగలరు. లేకుంటే టీచరెలా అవుతారు. కానీ ఇక్కడ టీచర్లు కూడా నెంబరువారుగా ఉన్నారు. పిల్లలైన మీరు వైకుంఠమును కూడా అర్థము చేసుకోగలరు. అలాగని మీరు వైకుంఠాన్ని చూశారని కాదు. అనేకమంది పిల్లలు సాక్షాత్కారము చేసుకున్నారు. అక్కడ స్వయంవరం ఎలా జరుగుతుందో, ఏ భాష ఉంటుందో, అంతా చూశారు. చివరిలో కూడా ఎవరు యోగయుక్తులుగా ఉంటారో వారు సాక్షాత్కారంలో చూస్తారు. మరి ఎవరికైతే తమ బంధు-మిత్రులు, ధనము, సంపద గుర్తు వస్తూ ఉంటాయో వారేం చూడగలరు? సత్య-సత్యమైన యోగులే చివరి వరకు ఉంటారు. వారిని తండ్రి చూసి సంతోషిస్తారు. పూల ద్వారానే తోట తయారవుతుంది. చాలామంది 10-15 సంవత్సరాలు జ్ఞానములో ఉండి కూడా వెళ్లిపోతారు. వారిని జిల్లేడు పువ్వులని అంటారు. చాలా మంచి మంచి పిల్లలు, ఎవరైతే మమ్మా-బాబాకు కూడా ఆదేశాలను తీసుకొచ్చేవారో, డ్రిల్లు చేయిస్తూ ఉండేవారో, అటువంటివారు ఈ రోజు లేనే లేరు. మాయ చాలా ప్రబలమైనదని పిల్లలకు తెలుసు మరియు బాప్‌దాదాకు కూడా తెలుసు. ఇది మాయతో గుప్త యుద్ధము, గుప్త తుఫాను. బాబా చెప్తున్నారు - మాయ మిమ్ములను చాలా భయపెడ్తుంది. ఇది ఓటమి-గెలుపుల తయారైన డ్రామా. మీరు ఆయుధాలతో యుద్ధము చేయరు. ఈ భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఈ యోగబలము ద్వారా మీరిలా లక్ష్మినారాయణులుగా అవుతారు. బాహుబలముతో ఎవ్వరూ విశ్వ చక్రవర్తులుగా అవ్వలేరు. ఆట చాలా అద్భుతమైనది. రెండు పిల్లులు కొట్లాడుకుంటే వెన్న................... అని కథ కూడా ఉంది. క్షణములో విశ్వచక్రవర్తి పదవి అని కూడా చెప్పబడ్తుంది. పిల్లలు సాక్షాత్కారము చేసుకుంటారు. కృష్ణుని నోటిలో వెన్న ఉందని చెప్తారు. వాస్తవానికి కృష్ణుని నోటిలో నూతన ప్రపంచమును చూస్తారు. యోగబలముతో మీరు విశ్వచకవ్రర్తిత్వమనే వెన్నను తీసుకుంటారు. రాజ్యము కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతాయి! ఎంతమంది యుద్ధములో సమాప్తమైపోతారు. ఆ పాత ప్రపంచ లెక్కాచారము సమాప్తమవ్వాలి. ఈ ప్రపంచములోని ఏ వస్తువూ మిగలదు. తండ్రి శ్రీమతము - పిల్లలారా! చెడు వినకండి, చెడు చూడకండి.............. వారు కోతుల చిత్రాన్ని తయారు చేశారు. ఈ రోజుల్లో మనుష్యులది కూడా తయారు చేస్తారు. ఇంతకు ముందు చైనా నుండి ఏనుగు దంతముతో చేసిన వస్తువులు వచ్చేవి. గాజులు కూడా గాజువి ధరించేవారు. ఇక్కడ ఆభరణాలు మొదలైనవి అలంకరించుకునేందుకు ముక్కు, చెవులకు రంధ్రాలు పెట్టుకుంటారు. కానీ సత్యయుగములో ముక్కు-చెవులకు రంధ్రములుంచే అవసరము లేదు(కుట్టించుకోరు). ఇక్కడ మాయ ఎలాంటిదంటే అందరి ముక్కు, చెవులను కోసేస్తుంది. పిల్లలైన మీరిప్పుడు స్వచ్ఛంగా అవుతారు. అక్కడ సహజ సౌందర్యముంటుంది. ఏ ఆభరణాన్ని ధరించవలసిన అవసరముండదు. ఇక్కడ శరీరము కూడా తమోప్రధాన తత్వాలతో తయారవుతూ ఉన్నందున జబ్బులు మొదలైనవి వస్తాయి. అక్కడ ఇలాంటి విషయాలేవీ ఉండవు. ఇప్పుడు అనంతమైన తండ్రి మమ్ములను చదివించి నరుని నుండి నారాయణునిగా లేక అమరపురికి అధికారులుగా చేస్తున్నారని మీ ఆత్మకు చాలా సంతోషము ఉంది. అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని గాయనముంది. భక్తులకు ఈ విషయాలు తెలియవు. మీలో కూడా సదా ఖుషీగా ఉండి ఇటువంటి విషయాలను స్మరించే పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. అబలల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. ఏదైతే ద్రౌపదిని గురించిన గాయనముందో అదంతా వాస్తవికంగా నడుస్తోంది. ద్రౌపది ఎందుకు పిలిచిందో మనుష్యులకు తెలియదు. తండ్రి అర్థం చేయించారు - మీరంతా ద్రౌపదులు. స్త్రీ సదా స్త్రీగానే పుడ్తుందని కాదు. రెండుసార్లు స్త్రీగా పుట్టవచ్చు, ఎక్కువసార్లు కాదు. మాతలు దీనంగా పిలుస్తున్నారు - బాబా! రక్షించండి, ఈ దుశ్శాసనులు వికారము కొరకు మమ్ములను సతాయిస్తున్నారు. దీనిని వేశ్యాలయమని అంటారు. స్వర్గమును శివాలయమని అంటారు. వేశ్యాలయము రావణుని స్థాపన. శివాలయము శివబాబా స్థాపన మరియు మీకు జ్ఞానమును కూడా ఇస్తారు. తండ్రిని నాలెడ్జ్‌ఫుల్‌ అని కూడా అంటారు. అలాగని నాలెడ్జ్‌ఫుల్‌ అంటే అందరి హృదయాలలో ఏముందో ఎరిగినవాడని కాదు. దాని వలన లాభమేమి? ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమును నేను తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని బాబా చెప్తున్నారు. నేనే కూర్చుని మిమ్ములను చదివిస్తాను. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. అక్కడ భక్తి ప్రాలబ్ధముంటుంది. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండదు. చదువు ద్వారానే రాజధాని స్థాపన అవుతుంది. అధ్యక్షుడు మొదలైనవారి వద్ద ఎంతమంది మంత్రులుంటారో చూడండి. సలహాలు ఇచ్చేందుకు మంత్రులను నియమించుకుంటారు. సత్యయుగములో మంత్రుల అవసరముండదు. ఇప్పుడు తండ్రి మిమ్ములను తెలివైనవారిగా చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత తెలివైనవారో చూడండి. అనంతమైన చక్రవర్తి పదవి తండ్రి నుండి లభిస్తుంది. తండ్రి జన్మ దినమును శివజయంతిగా ఆచరిస్తారు. అంటే తప్పకుండా శివబాబా భారతదేశములోకి వచ్చి విశ్వాధికారులుగా తయారుచేసి వెళ్లారు. ఇది లక్షల సంవత్సరాల మాట కాదు. నిన్నటి మాటే. మంచిది. ఇంతకంటే ఎక్కువేమి తెలపాలి? బాబా చెప్తున్నారు - ''మన్మనాభవ.'' వాస్తవానికి ఇది సైగలతో చదువుకునే చదువు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రికి పూర్తి సహయోగులుగా అయ్యేందుకు నేర్పరులుగా, తెలివైనవారిగా అవ్వాలి. ఆంతరికములో ఎటువంటి గొడవలు ఉండరాదు.

2. స్థాపన మరియు వినాశనముల కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయబుద్ధి గలవారై తండ్రిని ఫాలో చేయాలి. పాత ప్రపంచములోని పైసల(ధనము) నుండి బుద్ధిని తొలగించి పూర్తి భికారులుగా అవ్వాలి. బంధు-మిత్రులు, ధన-సంపదలు మొదలైనవన్నీ మర్చిపోవాలి.

వరదానము :-

''తండ్రి ఆజ్ఞను అర్థము చేసుకొని ప్రేమతో ప్రతి విషయాన్ని సహనం చేసే సహనశీల్‌ భవ''

చాలామంది పిల్లలు - మేము రైటుగా ఉన్నా మేమే సహించవలసి వస్తుంది, మేమే చావాల్సి వస్తుంది అని అంటారు. కానీ ఈ సహించడమే లేక చావడమే ధారణ సబ్జెక్టులో నంబరు తీసుకోవడం. అందువలన సహనం చేసేందుకు భయపడకండి. చాలామంది పిల్లలు సహనం చేస్తారు కానీ విధి లేక సహిస్తారు. విధి లేక సహించుటకు, ప్రేమతో సహించుటకు చాలా వ్యత్యాసముంది. మాటల కారణంగా కాదు, తండ్రి ఆజ్ఞానుసారము సహనశీలురుగా అవ్వండి. కనుక ఆజ్ఞగా భావించి ప్రేమగా సహించాలి అనగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. దీనికే మార్కులుంటాయి.

స్లోగన్‌ :-

''ఎవరైతే సంతోషమనే ఖురాక్‌ (పౌష్ఠిక ఆహారము) తింటారో, వారు ఆరోగ్యంగా ఉంటారు''