24-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


ప్రాతః కాల క్లాసులో వినిపించేందుకు మాతేశ్వరి గారి మధురమైన మహావాక్యాలు

పాట - యహ్‌ మేరా ఛోటా సా సంసార్‌ హై............. ( ఇది నా చిన్న ప్రపంచము,.......... )

ఓంశాంతి. జ్ఞానసాగరులైన బేహద్‌ తండ్రి ఆత్మలతో మాట్లాడ్తున్నారు. ఆత్మల ఒరిజినల్‌ (వాస్తవిక) స్థితి ఏదైతే ఉందో ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. ఆత్మ సదా ఒకే స్థితిలో ఉంటుందని అనము. ఆత్మ భలే అనాది, అయినా దాని స్థితి పరివర్తనవుతూ ఉంటుంది. సమయము గడిచే కొలది దాని స్థితి పరివర్తనవుతూ ఉంటుంది. ఆత్మ ఏమో అనాది, అవినాశి. కానీ ఆత్మ ఎటువంటి కర్మ చేస్తుందో, అటువంటి ఫలము పొందుతుంది. కనుక చేసేది బాధ్యత గల ఆత్మ కనుక ఇప్పుడు తండ్రి కూడా ఆత్మలతోనే మాట్లాడ్తారు. ఆత్మల తండ్రి పరమాత్మ అని అందరి బుద్ధిలో ఉంది.

తండ్రి అని పిలిచినప్పుడు మనమందరము తప్పకుండా వారికి పుత్రులవుతాము. అంతేగాని వారు తండ్రి అయితే మనము కూడా తండ్రులము కాదు. ఒకవేళ ఆత్మయే పరమాత్మ అన్నట్లయితే, ఆత్మను కూడా పరమాత్మ అని పిలవాలి. అయితే తండ్రి పుత్రుల సంబంధములో తండ్రి అని పిలుస్తారు. ఒకవేళ మనమందరమూ తండ్రులమే అయితే ఇక తండ్రి అని పిలిచేదెవరు! కనుక తండ్రి, పుత్రులు ఇరువురూ వేరు వేరు. తండ్రి అన్నందున ఆ సంబంధము పుత్రునితో ఉంటుంది. పుత్రుని సంబంధములోనే తండ్రి సంబంధము వస్తుంది. కనుక వారిని పరమపిత పరమాత్మ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీరు ఉన్న స్థితికి, మొదట మీరున్న స్థితికి వ్యత్యాసముంది. ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని తొలగించేందుకు నేను వచ్చాను. తండ్రి జ్ఞానమిచ్చి అర్థము చేయిస్తున్నారు - మీ ఒరిజినల్‌ స్థితి ఏదైతే ఉండేదో ఇప్పుడు దానిని పట్టుకోండి. ఎలా పటుకోవాలో అందుకు కావలసిన జ్ఞానము కూడా ఇస్తున్నారు. అంతేకాక బలము కూడా ఇస్తున్నారు. వారు చెప్తున్నారు - మీరు నన్ను స్మృతి చేస్తే శ్రేష్ఠ కర్మలు చేసే బలము వస్తుంది. లేకుంటే మీ కర్మలు శ్రేష్ఠంగా ఉండవు. చాలామంది ఇలా అంటారు - మేము మంచి కర్మలు చేయాలనుకుంటాము కానీ ఏమి జరుగుతుందో మాకే తెలియదు. దాని వలన మా మనసు మంచివైపుకు లగ్నమవ్వదు, మరోవైపు లగ్నమైపోతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే ఆత్మలో మంచి కర్మలు చేసే బలము లేదు. మన స్థితి తమోప్రధానమైనందున దాని ప్రభావము ఇప్పుడు తీవ్రంగా ఉంది. ఆ ప్రభావము మనలను మంచి చేయకుండా అణిచివేస్తుంది. కనుక బుద్ధి త్వరగా ఆ వైపుకే వెళ్ళిపోతుంది. బుద్ధి మంచి వైపుకు వెళ్లడంలో ఆటంకము ఏర్పడ్తుంది. కనుక తండ్రి చెప్తున్నారు - నాతో యోగము జోడించండి. నేను ఏ జ్ఞానము ఇస్తున్నానో దాని ఆధారముతో మీ పాప భారాన్ని, బంధనాలను, ఎదురు వచ్చే ఆటంకాలను తొలగించి మీ దారిని ఆటంకరహితంగా(సాఫ్‌ లేక శుభ్రముగా) చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తూ ఉంటే మీలో ఎటువంటి సతోప్రధాన శక్తి వస్తుందంటే దాని ఆధారముతో మీరు మళ్లీ మీ వాస్తవిక స్థితిని ప్రాప్తి చేసుకుంటారు.

తర్వాత ఆత్మ ఎలా ఉంటుందో అలాంటి శరీరము లభిస్తుంది. ప్రపంచము కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు పరమపిత పరమాత్మ అలాంటి ప్రపంచాన్ని తయారు చేస్తారు. అందుకే వారిని సృష్టికర్త(వరల్డ్‌ క్రియేటర్‌) అని అంటారు. కానీ వారు కూర్చొని తయారు చేసేందుకు ఈ ప్రపంచము లేని(ఉండని) సమయమంటూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు చేస్తున్నట్లు ఈ పద్ధతిలో ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇతరులెవ్వరినీ ప్రపంచాన్ని తయారు చేసేవారని అనరు. ఏసుక్రీస్తు వచ్చారు, బుద్ధుడు వచ్చారు కానీ వారు తమ నూతన ధర్మాన్ని మాత్రమే స్థాపన చేశారు. కానీ ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసి మరో ప్రపంచాన్ని తయారు చేసే పని సృష్టికర్తదే. వారు వరల్డ్‌ క్రియేటర్‌, వరల్డ్‌ ఆల్‌మైటీ అథారిటీ(సర్వశక్తివంతులు) కనుక వారి కర్తవ్యము అన్ని ఆత్మల కర్తవ్యము కంటే భిన్నమని అర్థము చేసుకోవాలి. అయితే వారు కూడా తమ కర్తవ్యాన్ని లేక పనిని ఇతర ఆత్మల వలె ఈ మానవ సృష్టిలోకి వచ్చే చేస్తారు. పోతే ప్రతి ఆత్మ కర్తవ్యము ఎవరిది వారిదే. అంతేకాని ఆత్మలు చేసే పనులన్నీ పరమాత్మయే చేస్తారని కాదు. ప్రతి ఆత్మకు తమ తమ కర్మల ఖాతా నడుస్తుంది. ఎవరు ఎలా చేస్తారో అలా పొందుతారు. అందులో కొన్ని మంచి ఆత్మలు కూడా ఉన్నాయి. ఉదాహరణానికి ఏసుక్రీస్తు, బుద్ధుడు, ఇస్లామి, గాంధీ మొదలైన మంచి-మంచి ఆత్మలు ఎవరైతే వచ్చారో వారందరూ తమ తమ పాత్రలను అభినయించి వెళ్ళిపోయారు. ఇదే విధంగా ఆత్మలైన మీకు కూడా చాలా జన్మల పాత్ర ఉంది. ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఎన్ని జన్మల లెక్క ఉంటుందో దాని ప్రకారము ఆత్మ ఆ పాత్రను అభినయిస్తుంది. ఆత్మలో మొత్తం రికార్డు అంతా నిండి ఉంటుంది. ఆ రికార్డు అనుసారము అది పాత్రను అభినయిస్తుంది. ఇది పాత్రను అభినయించే స్థానము అందువలన దీనిని నాటకమని, డ్రామా అని కూడా అంటారు. ఇందులో ఒకే ఒక్కసారి పరమాత్ముని పాత్ర కూడా ఉంది. అందుకే వారి కర్తవ్యము సర్వ శ్రేష్ఠమైనది. అయితే ఎందులో శ్రేష్ఠమైనది(ఉన్నతమైనది)? వారు వచ్చి మన ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు.

ఇది కర్మ క్షేత్రము. ఇక్కడ ప్రతి మనుష్య ఆత్మ తమ తమ పాత్రను అభినయిస్తుంది. ఇందులో పరమాత్మ పాత్ర కూడా ఉంది కానీ వారు ఆత్మల వలె జనన-మరణాలలోకి రారు. ఆత్మల వలె వారి కర్మల ఖాతా ఉల్టా(వ్యతిరేకము)గా అవ్వదు. వారంటున్నారు - నేను కేవలం ఆత్మలైన మిమ్ములను విడుదల(లిబరేట్‌) చేసేందుకు వస్తాను. అందుకే నన్ను లిబరేటర్‌, బంధనాల నుండి విడుదల చేసే గతి-సద్గతిదాత అని అంటారు.

ఆత్మ పై ఏర్పడిన మాయా బంధనాన్ని తొలగించి పవిత్రంగా చేస్తారు. వారు చెప్తున్నారు - ఆత్మలను సర్వ బంధనాల నుండి విడిపించి వాపస్‌ తీసుకెళ్లడం నా కర్తవ్యము. కనుక సృష్టిలో ఉన్న అనాది నియమాలను, చట్టాలను కూడా అర్థము చేసుకోవాలి. అంతేకాక ఈ మానవ సృష్టి ఎలా వృద్ధి చెందుతుందో తర్వాత తగ్గిపోయే సమయము ఎలా వస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. అంతేగాని వృద్ధి చెందుతుంది అంటే అలా చెందుతూనే ఉంటుందని కాదు. తగ్గిపోతుంది కూడా. కావున సృష్టిలో ప్రతి వస్తువుకు నియమము ఉంది. మన శరీరాలకు కూడా నియమముంది. మొదట బాల్య స్థితి తర్వాత కిశోర స్థితి తర్వాత యువ ఆ తర్వాత వృద్ధాప్యము కనుక వృద్ధాప్యము కూడా త్వరగా రాదు. వృద్ధి చెందుతూ చెందుతూ శిథిలావస్థకు చేరుకుంటుంది. కనుక ప్రతి విషయము పెరిగి అది సమాప్తమవ్వడం కూడా ఒక నియమము. ఇదే విధంగా సృష్టిలోని వంశాలకు కూడా నియమముంది. అలాగే ఒక జీవితములో కూడా కొన్ని స్టేజ్‌లు ఉన్నాయి. అంతేకాక జన్మలకు కూడా స్టేజీలు ఉన్నాయి. అలాగే వంశాలు ఏవైతే వస్తున్నాయో వాటికి కూడా స్టేజీలు ఉన్నాయి. అదే విధంగా అన్ని ధర్మాలకు కూడా స్టేజీలు ఉన్నాయి. మొట్టమొదటి ధర్మము అన్నిటికంటే శక్తి కలిగిన ధర్మము. తర్వాత నెమ్మది నెమ్మదిగా వచ్చే ధర్మాల బలము తగ్గిపోతూ వస్తుంది. కనుక ధర్మాల వ్యాప్తి, ధర్మాల కొనసాగింపు మొదలైన విషయాలన్నీ నియమానుసారము జరుగుతాయి. ఈ విషయాలన్నీ అర్థము చేసుకోవాలి.

ఇదే లెక్కలో తండ్రి కూడా చెప్తున్నారు - నాకు కూడా ఇందులో పాత్ర ఉంది. నేను కూడా ఒక ఆత్మనే. నేను భగవంతుడను. అయితే వేరే ఏదో ప్రత్యేకమైన వస్తువును కాను. నేను కూడా మీలాగా ఒక ఆత్మనే అయితే నా కర్తవ్యము చాలా గొప్పది, శ్రేష్ఠమైనది. అందుకే నన్ను భగవంతుడు(గాడ్‌) అని అంటారు. ఆత్మలైన మీరు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను. ఉదాహరణానికి మీ పిల్లలు కూడా మీ వలె మనుష్యులే కదా, అందులో ఏ వ్యత్యాసము లేదు కదా. కనుక నేను కూడా మీలాగా ఆత్మనే. ఆత్మ, ఆత్మకు రూపములో ఏ వ్యత్యాసము లేదు. కానీ కర్తవ్యములో చాలా గొప్ప వ్యత్యాసముంది. అందుకే నా కర్తవ్యము ఏదైతో ఉందో అది అన్నిటికంటే భిన్నమైనదని అంటారు. నేను హద్దులోని ఏ ధర్మస్థాపకుడను కాను. నేను ఈ ప్రపంచ సృష్టికర్తను. వారు వారి ధర్మాలకు సృష్టికర్తలు. ఎలాగైతే ఆ ఆత్మలు తమ కర్తవ్యాన్ని తమ సమయానికి వచ్చి చేస్తారో అలా నేను కూడా నా సమయానికి వస్తాను. నా కర్తవ్యము చాలా విశాలమైనది, మహోన్నతమైనది, అంతేకాక అన్నిటికంటే అపూర్వమైనది. అందుకే మీ కర్తవ్యము సాటిలేనిదని అంటారు. వారిని సర్వశక్తివంతులు అని కూడా అంటారు. ఆత్మలను మాయ బంధనాల నుండి విడిపించి నూతన ప్రపంచానికి అంటు కట్టడము అన్నిటికంటే గొప్ప కర్తవ్యము. అందువలన వారిని ఆంగ్లములో హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. ఏసుక్రీస్తును క్రైస్తవ మతానికి తండ్రి అని అంటారు. వారిని హెవెన్లీ గాడ్‌ ఫాదర్‌(స్వర్గస్థాపకుడు) అని అనరు. స్వర్గమును స్థాపించువారు పరమాత్మ కనుక స్వర్గము అనునది ప్రపంచము కదా. అంతేగాని స్వర్గము ఏదో ఒక ధర్మము కాదు. కనుక వారు ప్రపంచ స్థాపకులు అయ్యారు. ఆ ప్రపంచములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. తత్వాలు మొదలైనవన్నీ పరివర్తనైపోతాయి. అందుకే తండ్రిని హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు.

రెండవది గాడ్‌ ఈజ్‌ టూత్ర్‌(భగవంతుడు సత్యమైనవారు) అని అంటారు. ట్రూత్‌ అనగా ఏమి? ఎందులో (ట్రూత్‌) సత్యము? ఇది కూడా అర్థము చేసుకోవలసిన విషయము. ఎవరు సత్యము చెప్తారో వారే భగవంతుడని కొంతమంది భావిస్తారు. భగవంతుడు ఎక్కడో లేరు, వారు మరో వస్తువు కాదని సత్యము చేప్తే చాలు అని అంటారు. కానీ అలా కాదు. గాడ్‌ ఈజ్‌ ట్రూత్ అనగా వారే వచ్చి అన్ని విషయాల గురించి సత్యము తెలుపుతారు అని అర్థము. గాడ్‌ ఈజ్‌ టూత్ర్‌ అనగా భగవంతుడు ఒక్కరే సత్యము తెలుపుతారు. వారిలో మాత్రమే సత్యము ఉందని అర్థము. అందుకే వారిని జ్ఞానసాగరులు అని అంటారు. జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, భగవంతునికే తెలుసు,............. అని అంటారు కనుక వారికి ఏదైనా విశేషమైన విషయము తెలిసి ఉండాలి కదా. అయితే ఆ విశేషమైన జ్ఞానము ఏది? అలాగని ఇతను దొంగతనము చేశాడా, లేదా అది భగవంతునికే తెలుసు! అని అనుకోరాదు. భలే వారికి అన్ని విషయాలు తెలుసు. కానీ వారి మహిమ ఏదైతే ఉందో అది ఏదంటే - మన ప్రపంచము ఏదైతే నీచ స్థితికి దిగజారిపోయిందో అది ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో, ఈ చక్రములోని విషయాలు వారికి మాత్రమే తెలుసు. అందుకే భగవంతునికే తెలుసు అని అంటారు. కనుక పరమాత్ముని మహిమ ఆ విధంగా వస్తుంది. ఆ మహిమ మనుష్యుల మహిమ కంటే భిన్నమైనది. ఎందుకంటే వారికి తెలిసింది అన్నిటికంటే అతీతమైనది. మనుష్యులకు తెలిసింది పరిమితము(హద్దు). అందుకే మనుష్యులను అల్పజ్ఞులని, పరమాత్మను సర్వజ్ఞులని అంటారు. దీనినే ఇంగ్లీషులో నాలెడ్జ్‌ఫుల్‌ అని అంటారు. అనగా సర్వమూ తెలిసివారని అర్థము. కనుక ఎవరు సర్వజ్ఞులో వారే సత్యమును తెలుసుకోగలరు. యధార్థ విషయ జ్ఞానము ఎవరి వద్ద ఉంటుందో వారు తప్పకుండా అందరికీ ఇస్తారు కదా. తెలిసినవారు ఇతరులకు ఇవ్వకుంటే దాని వలన మనకేం లాభము! వారికి తెలిస్తే తెలియనీ అని కాదు. వారి జ్ఞానము వలన ఏదైనా లాభము లభిస్తే అప్పుడు మనము వారి అర్హతలను గానము చేస్తాము. వారి వెనుక పడ్తాము. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఓ భగవంతుడా! ఇప్పుడు ఇది మీరు చేయండి! నాకు మంచి చేయండి, దయ చూపించండి, నా దుఃఖము దూరము చేయండి అని మనము వారిని వేడుకుంటాము కదా. అనగా వారితో ఏదో సంబంధముంది కదా. అందుకే ఈ విధంగా స్మృతి చేస్తాము. మన పైన ఏదో దయ చూపుతారన్నట్లుగా మనము వారిని వేడుకుంటాము. ఒకవేళ ఎప్పుడూ మేలు చేయకుంటే మనము వారికి సాష్టాంగ నమస్కారము ఎందుకు చేస్తాము? ఎవరైనా కష్ట సమయములో సహాయము చేస్తే మన మనస్సులో వీరు చాలా కష్ట సమయములో నాకు సహాయము చేశారని గుర్తు వస్తుంది కదా. సమయానికి నన్ను రక్షించారు అని గుర్తు చేసుకుంటారు. కనుక వారి పట్ల హృదయములో ప్రేమ ఉంటుంది. అందుకే పరమాత్మ పట్ల కూడా ఇటువంటి ప్రేమయే మనకు ఉంటుంది. ఎందుకంటే వారు సమయానికి మనకు సహాయము చేశారు. అయితే ఎవరికైనా మంచి జరిగినప్పుడు భగవంతుడు నాకు ఈ మంచి చేశారు,...... వారు ఎప్పుడు ఇలాగే చేస్తారు అని అనుకోరాదు. కానీ వారి గొప్ప కర్తవ్యము, ప్రపంచమంతటికీ సంబంధించిన విషయము అంతేగాని ఎవరికైనా కొంత ధనము లభించిందంటే భగవంతుడు చేశారని కాదు. మంచి కర్మలు చేసినందున దాని ఫలితము మనకు లభించిందని అర్థము. మంచి కర్మలకు గానీ, చెడు కర్మలకు గానీ దాని లెక్కాచారము నడుస్తూ ఉంటుంది, వాటి ఫలితము కూడా మనము పొందుతూ ఉంటాము. కానీ పరమాత్మ వచ్చి మనకు నేర్పించిన కర్మల ఫలితము వేరుగా ఉంటుంది. అల్పకాలిక సుఖము మన బుద్ధి ఆధారము పై కూడా లభిస్తుంది. అయితే భగవంతుడు మనకు ఏ జ్ఞానమిచ్చారో దాని వలన మనము సదా సుఖమును పొందుతాము. కనుక పరమాత్ముని కర్తవ్యము భిన్నమైనది కదా. అందుకే వారంటున్నారు - నేనే వచ్చి కర్మల యదార్థ జ్ఞానాన్ని మీకు నేర్పిస్తాను. దీనినే శ్రేష్ఠమైన కర్మయోగము అని అంటారు. ఇందులో కర్మలను గానీ, ఇళ్లు-వాకిళ్లను గానీ వదిలే అవసరము లేదు. కేవలం మీరు మీ కర్మలను పవిత్రంగా ఎలా చేసుకోవాలో దాని జ్ఞానము మీకు తెలుపుతాను. కనుక కర్మలను పవిత్రంగా చేసుకోవాలి. కర్మలు చేయడం వదిలేయరాదు. కర్మ అనాది, ఈ కర్మ క్షేత్రము కూడా అనాది. మనుష్యులు ఉన్నారంటే కర్మలు కూడా ఉన్నాయి. అయితే ఆ కర్మలను మీరు శ్రేష్ఠంగా ఎలా చేసుకోవాలో ఆ విధానాన్ని నేను వచ్చి నేర్పిస్తాను. దాని ద్వారా మీ కర్మల ఖాతా మళ్లీ అకర్మగా ఉంటుంది. అకర్మ అనగా ఏ విధమైన చెడు ఖాతా తయారు కాదు.

ఇటువంటి బాప్‌దాదా మరియు మమ్మాల మధురాతి మధురమైన చాలా మంచి పిల్లలు,

హెచ్చరికగా ఉండే పిల్లల పట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము :-

'' సదా ఉమంగ - ఉత్సాహంలో ఉండి మనసులో సంతోషంగా పాటలు పాడుకునే అవినాశి భాగ్యశాలి భవ ''

భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసులో సదా వాహ్‌ వాహ్‌ అని సంతోషపు పాటలు మ్రోగుతూ ఉంటాయి. వాహ్‌ బాబా! వాహ్‌ నా భాగ్యము! వాహ్‌ నా మధురమైన పరివారము! వాహ్‌ శ్రేష్ఠమైన సంగమయుగ మనోహరమైన సమయము! ప్రతి కర్మ వాహ్‌ వాహ్‌!. అందువలన మీరు అవినాశి భాగ్యశాలురు. మీ మనసులో ఎప్పుడూ 'ఎందుకు', 'నేను' అనే మాటలు రాజాలవు. ఎందుకు బదులుగా వాహ్‌ వాహ్‌, నేను అనేదానికి బదులుగా బాబా - బాబా అనే శబ్ధాలే వస్తాయి.

స్లోగన్‌ :-

'' ఏ సంకల్పము చేస్తారో, దానికి అవినాశి గవర్నమెంటు స్టాంపు వేస్తే కదలకుండా ఉంటారు ''