15-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇప్పటివరకు ఏదైతే చదివారో, అదంతా మర్చిపోండి. ఒక్కసారిగా బాల్యములోకి వెళ్లిపోండి. అప్పుడే ఈ ఆత్మీయ చదువులో ఉత్తీర్ణులు అవ్వగలరు.''

ప్రశ్న :-

దివ్యబుద్ధి లభించిన పిల్లల గుర్తులేవి ?

జవాబు :-

ఆ పిల్లలు ఈ పురాతన ప్రపంచాన్ని ఈ కళ్లతో చూస్తున్నా చూడకుండా ఉంటారు. ఈ పురాతన ప్రపంచము ఇప్పుడు సమప్తమయ్యే ఉందని వారి బుద్ధిలో సదా ఉంటుంది. ఈ శరీరము కూడా పురాతనమైనది, తమోప్రధానమైనది. అలాగే ఆత్మ కూడా తమోప్రధానమైపోయింది. కనుక వీటి పై ప్రీతిని ఎందుకు ఉంచుకోవాలి? ఈ విధమైన దివ్య బుద్ధిగల పిల్లలతోనే తండ్రి మనసు కూడా లగ్నమవుతుంది. ఈ విధమైన పిల్లలే నిరంతరము తండ్రి స్మృతిలో ఉండగలరు. సేవలో కూడా ముందుకు వెళ్లగలరు.

ఓంశాంతి.

అత్యంత మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - హద్దులోని సన్యాసులు ఇల్లు-వాకిళ్లను వదిలేస్తారు. ఎందుకంటే వారు బ్రహ్మ తత్వములో లీనమైపోతామని అందువల్ల ప్రపంచము పై ఆసక్తిని వదిలేయాలని భావిస్తారు. ఆ విధమైన అభ్యాసమునే చేస్తూ ఉంటారు. వెళ్లి ఏకాంతములో ఉంటారు. వారు హఠయోగులు, తత్వజ్ఞానులు. బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు. అందుకే మమత్వాన్ని తొలగించుకునేందుకు ఇల్లు - వాకిళ్లను వదిలేస్తారు. వైరాగ్యము వచ్చేస్తుంది. అయితే తక్షణమే మమత్వము నశించదు. భార్య, పిల్లలు మొదలైనవారు గుర్తు వస్తూ ఉంటారు. ఇక్కడైతే పిల్లలైన మీరు జ్ఞాన బుద్ధి ద్వారా సర్వస్వము మర్చిపోవలసి ఉంటుంది. ఏ వస్తువునూ త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు మీరు ఈ బేహద్‌ సన్యాసము చేస్తారు. స్మృతి సన్యాసులకు కూడా ఉంటుంది. కాని మేము బ్రహ్మ తత్వములో లీనమైపోవాలని, అందువల్ల మేము దేహ భ్రాంతిని ఉంచుకోరాదని బుద్ధి ద్వారా భావిస్తారు. అది హఠయోగ మార్గము. ఈ శరీరాన్ని వదిలి వెళ్లి బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు. శాంతిధామములోకి ఎలా వెళ్లాలో వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. విదేశాల నుండి తిరిగి వచ్చునప్పుడు మేము వయా బొంబాయి వెళ్లాలని........ భావిస్తారు కదా. అలాగే ఇప్పుడు పిల్లలైన మీకు కూడా ధృఢ నిశ్చయముంది. చాలా మంది వీరి పవిత్రత బాగుంది, ఈ జ్ఞానము బాగుంది, ఈ సంస్థ బాగుంది అని అంటారు. మాతలు చాలా శ్రమ చేస్తారు. ఎందుకంటే అలసిపోనివారుగా(అథక్‌గా) అయ్యి ఇతరులకు అర్థం చేయిస్తారు. తమ తనువు-మనసు-ధనములను సేవలో వినియోగిస్తారు కనుక వారికి బాగుందనిపిస్తుంది. అయితే మేము కూడా ఈ విధమైన అభ్యాసము చేయాలనే ఆలోచన కూడా రాదు. అతికష్టము మీద చాలా తక్కువ మంది వెలువడ్తారు. తండ్రి కూడా చెప్తారు - కోటిలో కొందరే మీ వద్దకు వస్తారు. వారిలో కూడా ఏ ఒక్కరో వెలువడ్తారు. ఇక ఈ పురాతన ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. సాక్షాత్కారము జరిగినా, జరగకపోయినా అనంతమైన తండ్రి వచ్చారని వివేకము చెప్తుంది. తండ్రి ఒక్కరేనని, వారే పారలౌకిక తండ్రి, జ్ఞానసాగరులని మీకు తెలుసు. లౌకిక తండ్రిని ఎప్పుడూ జ్ఞానసాగరుడని అనరు. తండ్రియే వచ్చి పిల్లలైన మీకు తన పరిచయమును ఇస్తారు. ఇప్పుడు పురాతన ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. మేము 84 జన్మల చక్రమును పూర్తి చేశాము. ఇప్పుడు వాపస్‌ సుఖధామానికి వయా శాంతిధామము వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. శాంతిధామానికైతే తప్పకుండా వెళ్లాలి. అక్కడి నుండి మళ్లీ ఇక్కడికి రావాలి. మనుష్యులు ఈ విషయాలలో తికమక చెంది ఉన్నారు. ఎవరైనా మరణిస్తే వైకుంఠానికి వెళ్లారని భావిస్తారు. అయితే వైకుంఠము ఎక్కడ ఉంది? వైకుంఠమనే ఈ పేరు భారతవాసులకు మాత్రమే తెలుసు. ఇతర ధర్మాలవారికి తెలియదు. కేవలం పేరు విన్నారు. చిత్రాలను చూశారు. దేవతల మందిరాలు మొదలైనవాటిని చాలా చూశారు. ఉదాహరణకు ఈ దిల్‌వాడా మందిరము ఉంది. లక్షల-కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మించారు. ఇలా నిర్మిస్తూనే ఉంటారు. దేవీదేవతలను వైష్ణవులని అంటారు. వారు విష్ణు వంశావళి వారు, పవిత్రమైనవారు. సత్యయుగాన్ని పావన ప్రపంచమని అంటారు. ఇది పతిత ప్రపంచము. సత్యయుగ వైభవాలు మొదలైనవి ఇక్కడ ఉండవు. ఇక్కడ ధాన్యము మొదలైనవన్నీ తమోప్రధానంగా అయిపోతాయి. ఇక్కడ రుచులు కూడా తమోప్రధానమైపోయాయి. పిల్లలు ధ్యానములోకి వెళ్లినప్పుడు ''మేము శూబీ రసము తాగి వచ్చామని, అది ఎంతో రుచిగా ఉంది'' అని చెప్పేవారు. ఇక్కడ కూడా మీ చేతుల ద్వారా తయారు చేయబడిన భోజనము తిన్నప్పుడు అది ఎంతో రుచిగా ఉందని అంటారు. ఎందుకంటే మీరు మంచి రీతిలో తయారుచేస్తారు. అందరూ తృప్తిగా భుజిస్తారు. మీరు యోగములో ఉండి తయారు చేస్తారు కనుక రుచిగా ఉంటుందని కాదు. ఇది కూడా ఒక అభ్యాసమే అవుతుంది. కొందరు భోజనాన్ని చాలా బాగా తయారు చేస్తారు. అక్కడైతే ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. అందువలన అందులో చాలా శక్తి ఉంటుంది. ఇక్కడ తమోప్రధానంగా ఉన్నందువలన శక్తి తక్కువైపోతుంది. ఆ భోజనాన్ని భుజించుట వలన అనేక రోగాలు, దు:ఖాలు మొదలైనవి వస్తూ ఉంటాయి. దీని పేరే దు:ఖధామము. సుఖధామంలో దు:ఖము మాటే ఉండదు. మనము ఎంతటి సుఖములోనికి వెళ్తామంటే దానిని స్వర్గ సుఖమని అంటారు. కేవలం మీరు పవిత్రంగా అవ్వాలి. అది కూడా ఈ ఒక్క జన్మ కొరకే. గతమును గురించి ఆలోచించకండి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవ్వండి. అసలు ఈ విషయాలు చెప్తున్నదెవరు? అని ఆలోచించండి. బేహద్‌ తండ్రి పరిచయమును ఇవ్వవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తాడు. బుద్ధి పైకి పరంధామానికి వెళ్లిపోతుంది. పిల్లలైన మీలో నిశ్చయబుద్ధి కలిగి పక్కాగా ఉన్నవారికి లోపల ఇలా ఉంటుంది - ఈ ప్రపంచంలో మనము ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఈ శరీరము గవ్వ తుల్యమైనది. ఆత్మ కూడా గవ్వ వలె అయిపోయింది...... ఇలా ఆలోచించుటనే వైరాగ్యము అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామాను గురించి తెలుసుకున్నారు. భక్తిమార్గపు పాత్ర నడవవలసిందే. అందరూ భక్తిలో ఉన్నారు. అందువల్ల అసహ్యించుకోవలసిన అవసరము లేదు. సన్యాసులు ఆ విధంగా అసహ్యించుకునేలా చేస్తారు. ఇంటిలో అందరూ దు:ఖితులైపోతారు. వారు వెళ్ళిపోయి తమను తాము కొద్దిగా సుఖవంతము చేసుకుంటారు. వాపస్‌ ముక్తిలోకి వవ్వరూ వెళ్లలేరు. ఇంతవరకు ఎవరెవరు వచ్చారో, వారెవ్వరూ తిరిగి వెళ్లలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా నిర్వాణధామము లేదా బ్రహ్మ తత్వములోకి వెళ్లలేదు. ఫలానావారు బ్రహ్మములో లీనమైపోయారని వారు భావిస్తారు. ఇదంతా భక్తిమార్గములోని శాస్త్రాలలో ఉంది. తండ్రి చెప్తున్నారు - ఈ శాస్త్రాలు మొదలైన వాటిలో ఉన్నదంతా భక్తిమార్గానికి చెందినది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభిస్తూ ఉంది. అందువల్ల మీరు ఏమీ చదవవలసిన అవసరము లేదు. కాని కొందరిలో నవలలు మొదలైనవి చదివే అలవాటు ఉంటుంది. వారిలో పూర్తి జ్ఞానముండదు. అటువంటి వారిని కుక్కడ్‌ జ్ఞానులు(ఇతరులను మేల్కొలుపుతూ స్వయం అజ్ఞాన నిద్రలో నిదురించువారు) అంటారు. రాత్రి నవల చదివి నిదురిస్తే వారి గతి ఎలా ఉంటుంది? ఇక్కడైతే ఇంతవరకు ఏదైతే చదివారో, అదంతా మర్చిపోండి, ఈ ఆత్మిక చదువులో నిమగ్నమవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మీరు 21 జన్మల కొరకు దేవతలుగా అవుతారు. ఇక మిగిలింది ఏవేవి చదివి ఉన్నారో వాటన్నిటిని మర్చిపోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా బాల్యములోకిి వెళ్ళిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. భలే ఈ కళ్ళతో చూస్తున్నా చూడకుండా ఉండండి. మీకు దివ్యదృష్టి, దివ్యబుద్ధి లభించాయి. కనుక ఇదంతా పురాతన ప్రపంచమని, ఇది సమాప్తమవ్వనున్నదని భావిస్తారు. వీరందరూ శ్మశానవాసులే. వారి పై మనసు ఎందుకు ఉంచాలి. ఇప్పుడు స్వర్గవాసులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు శ్మశానము మరియు స్వర్గము రెండిటి మధ్యలో కూర్చున్నారు. ఇప్పుడు స్వర్గము తయారవుతూ ఉంది. ప్రస్తుతము పురాతన ప్రపంచములోనే కూర్చుని ఉన్నా మధ్యలో బుద్ధియోగము అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కొత్త ప్రపంచము కొరకే పురుషార్థము చేస్తున్నారు. పురుషోత్తములుగా అయ్యేందుకు ఇప్పుడు మధ్యలో కూర్చొని ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగమును గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరముల అర్థము కూడా తెలియదు. పురుషోత్తమ సంగమయుగానికి చాలా తక్కువ సమయం లభించింది. యూనివర్సిటీలోకి ఆలస్యంగా వచ్చినట్లయితే చాలా శ్రమ చేయవలసి పడ్తుంది. స్మృతి చాలా కష్టము మీద నిలుస్తుంది. మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ పురాతన ప్రపంచము సమాప్తమవ్వనున్నదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి భలే ఇక్కడే కూర్చుని చూస్తున్నా ఇదంతా సమాప్తమవ్వనున్నదని ఏమియూ మిగలదని వారి బుద్ధిలో ఉంది. ఈ పురాతన ప్రపంచము పై వైరాగ్యము కలగాలి. శరీరధారులందరూ పాతవారే. శరీరము పాతదిగా, తమోప్రధానంగా అయ్యింది కనుక ఆత్మ కూడా తమోప్రధానమైనదే. అటువంటి దానిని మనము చూచి ఏం చేయాలి? ఇక్కడ ఉన్నదంతా ఏదియూ ఉండదు. కనుక ఈ ప్రపంచము పట్ల ప్రీతి ఉండదు. పిల్లలలో కూడా ఎవరు మంచిరీతిలో తండ్రిని స్మృతి చేస్తారో మరియు బాగా సేవ చేస్తారో వారి పట్లనే తండ్రికి హృదయపూర్వకమైన ప్రీతి కలుగుతుంది. కాని అందరూ పిల్లలే కదా. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. అందరూ చూడరు కూడా. ప్రజాపిత బ్రహ్మ గురించి అయితే తెలియనే తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అనే పేరును విన్నారేగాని వారి నుండి ఏమి లభిస్తుందో ఏ మాత్రము తెలియదు. బ్రహ్మ మందిరములో బ్రహ్మను గడ్డము ఉన్నవారిగా చూపించారు. కాని అతడిని ఎవరూ స్మృతి చేయరు. ఎందుకంటే అతడి నుండి ఆస్తి లభించదు. ఆత్మలకు వారసత్వము ఒకటేమో లౌకిక తండ్రి నుండి, రెండవది పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది అద్భుతము! తండ్రి అయ్యి ఉండి ఆస్తిని ఇవ్వడం లేదంటే అతడు అలౌకిక తండ్రి అయినట్లే కదా! ఆస్తి హద్దు మరియు బేహద్దు అని రెండు రకాలుగా ఉంటుంది. వాటి మధ్యలో ఏ ఆస్తి ఉండదు. భలే ప్రజాపిత అని అంటారు. కాని ఆస్తి లభించదు. ఈ అలౌకిక తండ్రికి కూడా ఆ పారలౌకిక తండ్రి నుండే ఆస్తి లభిస్తుందన్నప్పుడు ఇక అతడు మాత్రము ఎలా ఇస్తాడు? ఆ పారలౌకిక తండ్రి ఇతని ద్వారా ఇస్తారు. ఇతడు రథము. ఇతనిని ఎందుకు స్మృతి చెయ్యాలి? స్వయం ఇతడు కూడా ఆ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. బి.కె.లు ఈ బ్రహ్మనే పరమాత్మగా భావిస్తున్నారని ప్రజలు భావిస్తారు. అయితే మనకు ఇతని నుండి ఆస్తి లభించదు. వారసత్వము శివబాబా నుండే లభిస్తుంది. ఇతడు మధ్యవర్తి(దళారి). ఇతను కూడా మన వంటి విదార్థియే. ఇందులో భయపడే విషయమే లేదు.

ఈ సమయములో ఈ ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది, మీరు యోగబలము ద్వారా సతోప్రధానంగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. లౌకిక తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ బుద్ధిని బేహద్‌లో జోడించాలి. ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి ఏమీ లభించదు. భలే దేవతలైనా వారి నుండి కూడా ఏమీ లభించదు. ఈ సమయములో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. లౌకిక తండ్రి నుండి వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. అది హద్దులోనిది. ఈ లక్ష్మీనారాయణుల నుండి మీరు ఏమి కోరుకుంటారు? వీరు అమరులని, ఎప్పటికీ మరణించరని ఎప్పుడూ తమోప్రధానంగా అవ్వరని జనులు భావిస్తారు. కాని ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారే మళ్లీ తమోప్రధానములోకి వస్తారని మీకు తెలుసు. శ్రీ కృష్ణుని లక్ష్మీనారాయణుల కంటే ఉన్నతమైనవారిగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీనారాయణులు వివాహము చేసుకున్నారు. కృష్ణుడు జన్మత: పవిత్రము. అందువల్లనే కృష్ణుడికి చాలా మహిమ ఉంది. కృష్ణుని ఊయలలో ఊగుతున్నట్లు చూపిస్తారు. జయంతి కూడా కృష్ణునిదే జరుపుతారు. లక్ష్మీనారాయణుల జయంతి ఎందుకు జరుపరు? జ్ఞానము లేని కారణంగా కృష్ణుని ద్వాపర యుగములోకి తీసుకెళ్ళారు. గీతా జ్ఞానాన్ని ద్వాపర యుగములో ఇచ్చారని అంటారు. ఎవరికైనా అర్థము చేయించడం ఎంత కష్టము! జ్ఞానము పరంపరగా నడుస్తూ వస్తోందని వారు అంటారు. కాని పరంపర అనగా ఎప్పటి నుండి? ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో కూడా వారికి తెలియదు. అందుకే రచయిత మరియు సృష్టి ఆది-మధ్య-అంత్యముల గూర్చి మాకు తెలియదని అంటారు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు అనడంతో పరంపర అని అనేస్తారు. తిథి-తారీఖులు ఏవియూ తెలియదు. లక్ష్మీనారాయణుల జన్మ దినము కూడా జరుపుకోరు. దీనినే అజ్ఞాన అంధకారము అని అంటారు. మీలో కూడా కొందరికి ఈ విషయాలను గురించి యధార్థంగా తెలియదు. అందువల్లనే మహారథీ - అశ్వారూఢులు - కాలినడక వారు అని అంటారు. ఏనుగును మొసలి తిన్నట్లుగా చూపుతారు. మొసలి చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కసారిగా మింగేస్తుంది. సర్పము కప్పలను మింగినట్లు మింగేస్తుంది.

భగవంతుని తోటమాలి, తోట యజామాని, నావికుడు అని ఎందుకంటారు? ఇది కూడా ఇప్పుడే మీరు అర్థము చేసుకున్నారు. తండ్రి వచ్చి విషయ సాగరము నుండి ఆవలి తీరానికి తీసుకెళ్తారు. ఇందుకే నా నావను తీరానికి చేర్చు ప్రభూ! అని అంటారు. మనము ఎలా ఆవలి వెళ్తున్నామో మీకు కూడా ఇప్పుడే తెలిసింది. బాబా మనలను క్షీరసాగరములోకి తీసుకెళ్తున్నారు. అక్కడ దు:ఖము - నొప్పి వంటి మాటలే ఉండవు. మీరు విని ఇతరులకు కూడా చెప్తారు. నావను తీరానికి చేర్చు నావికుడు చెప్తున్నారు - ఓ పిల్లలారా! ఇప్పుడు మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు మొదట క్షీరసాగరములో ఉండేవారు. ఇప్పుడు విషయ సాగరములోకి వచ్చేశారు. మొదట మీరు దేవతలుగా ఉండేవారు. స్వర్గము వండర్‌ ఆఫ్‌ వరల్డ్‌. ప్రపంచమంతటిలో ఆత్మిక అద్భుతము స్వర్గము. పేరు వినగానే సంతోషము కలుగుతుంది. మీరు స్వర్గములో ఉంటారు. ఈ ప్రపంచములో 7(ఏడు) అద్భుతాలను చూపిస్తారు. ఈ తాజ్‌మహల్‌ను కూడా అద్భుతము(వండర్‌) అని అంటారు. అయితే అందులో ఏమైనా నివసించగలరా! మీరు వండర్‌ ఆఫ్‌ వరల్డ్‌కు యజమానులుగా అవుతారు. మీరు నివసించేందుకు తండ్రి ఎంత అద్భుతమైన వైకుంఠాన్ని తయారు చేశారు. 21 జన్మల కొరకు మీరు పదమాపదమ్‌పతులుగా అవుతారు. పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి! మనము ఆ తీరానికి వెళ్తున్నాము. పిల్లలైన మీరు అనేకసార్లు స్వర్గములోనికి వెళ్లి ఉంటారు. మీరు ఈ చక్రములో తిరుగుతూనే ఉంటారు. కొత్త ప్రపంచములో మొట్టమొదట వచ్చేందుకు పురుషార్థము చేయాలి. పాత ఇంటిలోకి వెళ్ళేందుకు మనసు రాదు(ఇష్టము కాదు). పురుషార్థము చేసి కొత్త ప్రపంచములోనికి వెళ్ళమని బాబా ఉత్సాహపరుస్తూ ఉంటారు. బాబా మనలను వండర్‌ ఆఫ్‌ వరల్డ్‌కు యజమానులుగా తయారు చేస్తారు. మరి ఇటువంటి తండ్రిని మనము ఎందుకు స్మృతి చేయరాదు. చాలా శ్రమ పడాలి. ఇతడిని చూస్తున్నా చూడరాదు. బుద్ధి ద్వారా శివబాబానే చూడాలి. తండ్రి చెప్తున్నారు - నేను భలే చూస్తాను కాని నేను కొద్ది రోజుల యాత్రికుడిని మాత్రమే అను జ్ఞానము నాలో ఉంది. అలాగే మీరు కూడా ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు. కనుక ఈ ప్రపంచము నుండి మమత్వమును తొలగించి వేయండి. అచ్ఛా! (మంచిది!)

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి. ఎప్పుడూ నవలలు మొదలైన వాటిని చదివే చెడ్డ అలవాటు పడరాదు. ఇంతవరకు చదివినదానినంతా మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి.

2. ఈ పాత ప్రపంచములో స్వయంను అతిధిగా భావిస్తూ ఉండాలి. దీని పై ప్రీతి ఉంచుకోరాదు. చూస్తూ కూడా చూడకుండా ఉండాలి.

వరదానము :-

''అధికారులుగా అయ్యి సమస్యలను ఆట్లాడుకుంటూ దాటుకునే హీరో పాత్రధారీ భవ''

ఎటువంటి పరిస్థితులు, సమస్యలు వచ్చినా వాటికి అధీనులుగా అవ్వకుండా అధికారులుగా అయ్యి ఆట్లాడుకుంటూ దాటుకుంటున్నట్లు దాటుకోండి. వెలుపలికి ఏడ్వవలసిన పాత్ర చేయవలసి ఉండినా, లోపల ఇదంతా ఒక ఆట అని ఉండాలి. దీనిని డ్రామా అని అంటారు. ఈ డ్రామాలో నేను హీరో పాత్రధారిని అని భావించాలి. హీరో పాత్రధారి అనగా తన పాత్రను ఆక్యురేట్‌గా(ఖచ్ఛితంగా) అభినయించేవారు. అందువలన కఠినమైన సమస్యను కూడా ఆటగా భావించి తేలికగా చేసుకోండి, ఎలాంటి బరువు ఉండరాదు.

స్లోగన్‌ :-

''సదా జ్ఞాన స్మరణలో ఉంటే సదా హర్షితంగా ఉంటారు, మాయ ఆకర్షణ నుండి రక్షింపబడ్తారు''