06-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు అశరీరులుగా అయ్యి ఇంటికి వెళ్లాలి కనుక ఎవరితో మాట్లాడుతున్నా ఆత్మ భాయీ - భాయీ అని భావిస్తూ మాట్లాడండి, దేహీ-అభిమానులుగా ఉండే శ్రమ చేయండి''
ప్రశ్న :-
భవిష్యత్తులో రాజ్యతిలకము పొందేందుకు ఆధారమేది ?
జవాబు :-
చదువు. ప్రతి ఒక్కరూ చదువుకొని రాజ్యతిలకాన్ని తీసుకోవాలి. చదివించే కర్తవ్యము తండ్రిది. ఇందులో ఆశీర్వాదాల మాట లేదు. సంపూర్ణ నిశ్చయము ఉంటే శ్రీమతమును అనుసరిస్తూ వెళ్లండి. తప్పులు చేయరాదు. అభిప్రాయ(మత) బేధములతో చదువు వదలేస్తే పాస్ అవ్వలేరు. అందువలన బాబా చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! మీ పై దయ చూపుకోండి. ఆశీర్వాదాలు అడగరాదు. చదువు పై గమనముంచాలి.
ఓంశాంతి.
అత్యంత ఉన్నతమైన(సుప్రీమ్) టీచరు పిల్లలను చదివిస్తున్నారు. పరమపిత పరమాత్మ తండ్రియే కాక టీచరు కూడా అయినారని పిల్లలకు తెలుసు. ఇతరులెవ్వరూ చదివించలేనంత బాగా మిమ్ములను చదివిస్తున్నారు. శివబాబా మమ్ములను చదివిస్తున్నారని మీరంటారు. ఇప్పుడు ఈ బాబా ఏ ఒక్కరి వారు కాదు. మన్మనాభవ, మధ్యాజీభవల అర్థము తెలిపిస్తున్నారు - ''నన్ను స్మృతి చేయండి.'' పిల్లలిప్పుడు వివేకవంతులుగా అయ్యారు. మీకు తప్పకుండా వారసత్వము ఉండనే ఉందని బేహద్ తండ్రి చెప్తున్నారు. దీనిని ఎప్పుడూ మర్చిపోరాదు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడ్తారు. ఇప్పుడు మీరు జీవాత్మలు కదా! బేహద్ తండ్రి కూడా నిరాకారులు. ఈ శరీరము ద్వారా వారు మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇతరులెవ్వరూ ఈ విధంగా భావించలేరు. పాఠశాలలో టీచరు చదువు చదివిస్తుంటే, లౌకిక టీచరు లౌకిక విద్యార్థులను చదివిస్తున్నారని అంటారు. కాని వీరు పారలౌకిక సుప్రీమ్ టీచరు, పారలౌకిక పిల్లలను చదివిస్తారు. మీరు కూడా పారలౌకికము (లౌకిక రీతి-పద్ధతులకు భిన్నంగా ఉన్నవారు) మూలవతనములో నివసించేవారు. తండ్రి కూడా పరలోకములోనే ఉంటారు. తండ్రి చెప్తున్నారు - నేను కూడా శాంతిధామ నివాసినే, మీరు కూడా అచ్చట నివసించేవారే, మనమంతా ఒకే స్థానములో నివసించేవారము. మీరు స్వయాన్ని ఆత్మ అని భావించండి. నేను పరమాత్మను. ఇప్పుడు మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు మీరు పతితులైపోయారు. ఇదంతా అనంతమైన రంగస్థలము, ఇందులో నాటకము జరుగుతుంది. ఈ సృష్టి అంతా కర్మక్షేత్రము. ఇందులో ఆట జరుగుతూ ఉంది. ఇది బేహద్ నాటకమని మీకు మాత్రమే తెలుసు. ఇందులో రాత్రి-పగలు కూడా ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు ఎంతో అనంతమైన కాంతినిస్తారు. ఇవన్నీ బేహద్ విషయాలు. ఇప్పుడు మీకు జ్ఞానము కూడా ఉంది. సృష్టికర్తయే స్వయంగా వచ్చి రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంత్యముల పరిచయమునిస్తారు. మీకు ఈ రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపించేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. ఇది పాఠశాల. చదివించేవారు అభోక్త. ఈ విధంగా నేను అభోక్తనని ఎవ్వరూ చెప్పరు. అహ్మదాబాదులో ఒక సాధువు ఇలా చెప్పేవాడు. కాని తర్వాత అతడి మోసము పట్టుబడింది. ఇప్పుడు ఇలాంటి మోసములెన్నో జరుగుతున్నాయి. వేషధారులు చాలామంది ఉన్నారు. కాని వీరికి ఏ వేషమూ లేదు. కృష్ణుడు వచ్చి గీతను వినిపించారని మానవులు భావిస్తారు. ఈనాడు కృష్ణులు అనేకమంది తయారయ్యారు (గీతను వినిపించేవారు). ఇప్పుడు ఇంతమంది కృష్ణులు ఉండనే ఉండరు. కాని మీకు శివబాబాయే నేరుగా వచ్చి చదివిస్తున్నారు. ఆత్మలకు వినిపిస్తున్నారు.
స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ సోదరులకు వినిపించండని మీకు పదే పదే చెప్పబడింది. బాబా తెలిపిన జ్ఞానాన్ని మేము సోదరులకు తెలుపుతున్నామని బుద్ధిలో ఉండాలి. స్త్రీ-పురుషులు అందరూ సోదరులే. అందుకే మీరందరూ నా వారసత్వానికి హక్కుదారులేనని బాబా చెప్తున్నారు. అక్కడ ఆడపిల్లలకు వారసత్వము లభించదు. ఎందుకంటే వారు అత్తవారింటికి వెళ్లాలి. కాని ఇచ్చట అందరూ ఆత్మలే. అశరీరులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు లభించే జ్ఞాన రత్నాలు అవినాశి రత్నాలుగా అవుతాయి. ఆత్మయే జ్ఞాన సాగరంగా అవుతుంది కదా! అన్ని కర్తవ్యాలు నిర్వహించేది ఆత్మయే. అయితే మానవులు దేహాభిమానములో ఉన్నందున దేహీ-అభిమానులుగా అవ్వరు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా తయారై ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. కొంత శ్రమ చేయాలి కదా! లౌకిక గురువులను ఎంతగానో స్మృతి చేస్తారు. వారి మూర్తులను కూడా ఉంచుకుంటారు. శివుని చిత్రమెక్కడ, మానవుల చిత్రాలెక్కడ! రాత్రి పగలుకున్నంత వ్యత్యాసముంది. ఆ గురువుల ఫోటోలను మెడలో కూడా ధరిస్తారు. ఈ విధంగా ఇతరుల ఫోటోలను స్త్రీలు తమ మెడలో ధరించడం ఆ స్త్రీల పతులకు ఇష్టముండదు. అయితే శివుని చిత్రము ధరిస్తే అది అందరికీ బాగుంటుంది. ఎందుకంటే తాను పరమపిత కదా! వారి చిత్రము తప్పకుండా ఉండాల్సిందే. ఇది కంఠహారంగా చేసే చిత్రము. మీరు రుద్రమాలలోని ముత్యాలుగా అవుతారు. వాస్తవానికి ప్రపంచమంతా రుద్రమాలయే. ప్రజాపిత బ్రహ్మ మాల కూడా ఉంది. పైన వంశ వృక్షముంది. ప్రపంచములోనివి హద్దు వంశ వృక్షాలు, ఇది బేహద్ పంశ వృక్షము. మనుష్యమాత్రులెవరు ఉన్నారో వారందరి మాల ఉంది. ఆత్మ అత్యంత చిన్న బిందువు. చాలా చిన్న బిందువు. అలా బిందువులు ఉంచుతూ పోతే లెక్కలేనన్ని అవుతాయి. వాటిని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు. కాని ఆత్మల వృక్షము ఎంత చిన్నదో చూడండి. బ్రహ్మతత్వంలో చాలా చిన్న స్థలములో ఆత్మల వృక్షముంటుంది. ఆ ఆత్మలు ఇచ్చట పాత్రను అభినయించేందుకు వస్తాయి. అప్పుడు ఇక్కడ చాలా విశాలమైన(పొడవు, వెడల్పు గల) ప్రపంచంగా తయారవుతుంది. విమానాలలో ఎక్కడెక్కడో తిరుగుతారు. అచ్చట(పరంధామంలో) విమానాలు మొదలైనవాటి అవసరముండదు. ఆత్మల వృక్షము చాలా చిన్నది. ఇచ్చట మానవుల వృక్షము ఎంత పెద్దది!
వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానము. ఇతనిని కొంతమంది ఏడమ్ అని, మరికొంతమంది ఆది దేవుడని అంటారు. ఇక్కడ స్త్రీ-పురుషులైతే తప్పకుండా ఉన్నారు. మీది ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గమువారి ఆట ఉండదు. ఒక చేతితో ఏం జరుగుతుంది? (బండికి) రెండు చక్రాలు ఉండాలి. రెండూ ఉంటే పరస్పరములో రేస్ చేస్తారు. రెండవ చక్రము తోడునివ్వకపోతే బలహీనమైపోతారు. కాని ఒకరి కారణంగా మరొకరు ఆగిపోరాదు. మొట్టమొదట పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. ఆ తర్వాత అపవిత్రమౌతుంది. క్రిందికి దిగజారుతూనే పోతారు. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుందో, ఎలా ఎడిషన్ అవుతూ ఉంటుందో మీకు తెలుసు. ఇలాంటి వృక్షమును ఎవ్వరూ తయారుచేయలేరు. ఎవరి బుద్ధిలోనూ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము లేనే లేదు. అందుకే మేము రచయిత ద్వారా రచయిత మరియు రచనల జ్ఞానమంతా గ్రహించామని వ్రాయాలని బాబా అంటారు. వారికి రచయితను గురించి గాని, రచనను గురించి గాని తెలియదు. ఈ జ్ఞానము పరంపర నుండి నడుస్తూ వస్తూ ఉంటే ఎవరైనా చెప్పగలిగి ఉండాలి కదా! బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలైన మీరు తప్ప దీనిని గురించి వేరెవ్వరూ తెలపలేరు. బ్రాహ్మణులైన మనకే పరంపిత పరమాత్మ చదివిస్తారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మనదే అత్యంత ఉన్నతమైన ధర్మము. చిత్రాలు కూడా తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. చిత్రాలు లేకుండా బుద్ధిలో జ్ఞానము ఎప్పుడూ కూర్చోదు. చిత్రాలు పెద్ద పెద్దవిగా ఉండాలి. అనేక ధర్మాల వృక్షము ఎలా పెరుగుతుందో కూడా అర్థం చేయించారు. ఆత్మయే పరమాత్మ అని, పరమాత్మయే ఆత్మ(ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ సో ఆత్మ) అని ఇంతకుముందు అనేవారు. ఇప్పుడు దీని అర్థము కూడా బాబా స్పష్టంగా తెలిపిస్తున్నారు - ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్న మనమే నూతన ప్రపంచములో దేవతలుగా అవుతాము. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నాము అనగా ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. రచయిత, రచనల అర్థము హమ్ సో యొక్క అర్థము మీరు అందరికీ ఇప్పుడు బాగా అర్థం చేయించవచ్చు. ఓం అనగా మొదట నేను ఆత్మను, తర్వాత ఈ శరీరముంది. ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశి. మనము ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాము. దీనిని ఆత్మ-అభిమాని అంటారు. ఆత్మలమైన మనము ఫలానా పాత్రను చేస్తున్నాము. నేను ఆత్మ ఈ కర్తవ్యము చేస్తున్నాను. మనము ఆత్మలము పరమాత్ముని సంతానము. ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానము! ఈ జ్ఞానము తండ్రిలో మాత్రమే ఉంది. అందుకే తండ్రినే పిలుస్తారు.
తండ్రి జ్ఞానసాగరులు, వారితో పోలిస్తే మిగిలిన వారందరూ అజ్ఞాన సాగరులు, అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము అజ్ఞానము, జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. జ్ఞానమనగా రచయిత ద్వారా రచనను తెలుసుకోవడం. కావున జ్ఞానముండేది ఒక్క రచయితలో మాత్రమే కదా! అందుకే వారిని సృష్టికర్త(క్రియేటర్) అని అంటారు. మానవులు సృష్టికర్తయే ఈ రచనను రచించారని భావిస్తారు. ఇది అనాదిగా తయారైన డ్రామా అని తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఓ పతితపావనా! రండి అని పిలుస్తారు. అప్పుడు రచయిత అని వారిని ఎలా అంటారు. ప్రళయమై మళ్లీ రచిస్తే అప్పుడు రచయిత అని అంటారు. తండ్రి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. కావున ఈ విశ్వమనే వృక్షమంతటి ఆదిమధ్యాంతాలను గురించి మధురాతి మధురమైన పిల్లలకు మాత్రమే తెలుసు. ఉదాహరణానికి తోటమాలికి ప్రతి బీజము గురించి మరియు వృక్షము గురించి తెలుస్తుంది కదా! విత్తనాన్ని చూస్తూనే అతనికి వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వీరు మానవ సృష్టి(మానవకోటి/హ్యూమనిటీ)కి బీజము, వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ సృష్టికి బీజమని మహిమ కూడా చేస్తారు. వారు సచ్చిదానంద(సత్-చిత్-ఆనంద) స్వరూపులు, సుఖ, శాంతి, పవిత్రతా సాగరులు. ఈ జ్ఞానమంతా పరమపిత పరమాత్మ ఈ శరీరము ద్వారా ఇస్తున్నారని మీకు తెలుసు. కావున తప్పకుండా ఇక్కడకు వస్తారు కదా! కేవలం ప్రేరణ ద్వారా పతితులను పావనంగా ఎలా చేస్తారు? కావున తండ్రి ఇక్కడకు వచ్చి అందరినీ పావనంగా తయారు చేసి తీసుకెళ్తారు. ఆ తండ్రియే మీకు పాఠము చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషుడు(ఆత్మ) తమోప్రధానము నుండి శ్రేష్ఠ సతోప్రధానంగా ఎలా అవుతారో మీరు ఉపన్యసించవచ్చు. మీ వద్ద అనేక టాపిక్లు (విషయాలు) ఉన్నాయి. ఈ పతిత తమోప్రధాన ప్రపంచము సతోప్రధానంగా ఎలా అవుతుందో కూడా తెలుసుకోదగినది. పోను పోను మీ ఈ జ్ఞానమును వింటారు. ఒకవేళ మధ్యలో వదలి వెళ్ళినా మళ్లీ ఇక్కడకే వస్తారు. ఎందుకంటే గతి సద్గతినిచ్చే దుకాణము ఇది ఒక్కటి మాత్రమే. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే అని మీరు చెప్పవచ్చు. వారిని శ్రీ శ్రీ అని అంటారు. పరమపిత పరమాత్మ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన(శ్రీ శ్రీ) వారు, వారు మనలను శ్రేష్ఠంగా తయారుచేస్తారు. సత్యయుగము శ్రేష్ఠమైనది. ఈ కలియుగము భ్రష్టముగా ఉంది. భ్రష్ఠాచారులని కూడా అంటారు. కాని స్వయం భ్రష్ఠమయ్యామని అర్థము చేసుకోరు. పతిత ప్రపంచములో శ్రేష్ఠమైనవారు ఒక్కరు కూడా లేరు. శ్రీ శ్రీ వచ్చినప్పుడే శ్రీగా తయారుచేస్తారు. శ్రీ అనే టైటిల్ సత్యయుగము ఆదిలో దేవతలకు వర్తించేది. ఇక్కడ అందరినీ శ్రీ శ్రీ అనేస్తారు. వాస్తవానికి శ్రీ అనే పదము పవిత్రతకు వర్తిస్తుంది. ఇతర ధర్మము వారెవ్వరూ స్వయాన్ని శ్రీ అని చెప్పుకోరు. శ్రీ అని పోప్ను ఏమైనా అంటారా? ఇచ్చట అయితే అందరినీ శ్రీ అంటూ ఉంటారు. ముత్యాలను స్వీకరించే హంస ఎక్కడ, మురికిని భుజించే కొంగ ఎక్కడ? వ్యత్యాసముంది కదా! ఈ దేవతలు సుంగంధ పుష్పాలు, సత్యయుగము భగవంతుని పూలతోట(గార్డన్ ఆఫ్ అల్లా). తండ్రి మిమ్ములను పుష్పాలుగా చేస్తున్నారు. అయితే పుష్పాలు రకరకాలైనవి ఉన్నాయి. అన్నిటికంటే మంచి పుష్పము రాజా పుష్పము(కింగ్ ఫ్లవర్). ఈ లక్ష్మీనారాయణులను నూతన ప్రపంచ రాజాపుష్పము, రాణి పుష్పము అని అంటారు.
పిల్లలైన మీకు ఆంతరిక సంతోషముండాలి. ఇందులో బాహ్యముగా చేయవలసిందేమీ లేదు. ఈ దీపాలు, లైట్లు వెలిగించేందుకు కూడా అంతరార్థముండాలి. శివజయంతికి వెలిగించాలా లేక దీపావళికా? దీపావళి పండుగ నాడు లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఆమెను ధనమునిమ్మని వేడుకుంటారు. కాని భండారమును నింపువారు శివ భోలా భండారి. శివబాబా ద్వారా మనకు తరగని ఖజానా నిండుతుందని మీకు తెలుసు. ఇది జ్ఞానరత్నాల ధనము. అక్కడ కూడా మీ వద్ద అపారమైన ధనరాసులుంటాయి. నూతన ప్రపంచములో మీరు మాలామాల్గా(సంపన్నులుగా) అవుతారు. సత్యయుగములో లెక్కలేనన్ని వజ్రవైఢూర్యాలు ఉంటాయి. మళ్లీ అవే ఉంటాయి. కాని మానవులు తికమకపడ్తారు. ఇదంతా సమాప్తమైపోతుంది కదా. మళ్లీ ఎక్కడి నుండి వస్తాయి? గనులన్నీ త్రవ్వబడి ఖాళీ అయిపోయాయి. కొండలన్నీ విరిగి పడిపోయాయి. మళ్లీ ధనరాసులెలా తయారౌతాయి? అని ప్రశ్నిస్తారు. చరిత్ర మళ్లీ పునరావృతము అవుతుంది కదా! ఇంతకు ముందు ఎలా ఉండినదో మరలా అలాగే పునరావృతము అవుతుందని చెప్పండి. పిల్లలైన మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. స్వర్గ చరిత్ర-భూగోళాలు మళ్లీ రిపీట్ అవుతాయి. మీరు సమస్త సృష్టిని, పూర్తి సముద్రాన్ని, పృథ్వినంతటిని మాకిచ్చేశారు. మా నుండి ఎవ్వరూ వీటిని దోచుకోలేరనే పాట కూడా ఉంది కదా! దానితో పోల్చుకుంటే ఇప్పుడు మీ వద్ద ఏముంది? భూమి కోసము, నీటి కోసము, భాష కోసము యుద్ధము చేసుకుంటున్నారు.
స్వర్గ రచయిత అయిన బాబా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. వారే తప్పకుండా స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మిమ్ములను ఆ తండ్రి చదివిస్తున్నారు. మీరు ఈ శరీర నామ-రూపాల నుండి భిన్నమై స్వయాన్ని ఆత్మగా భావించండి. యోగబలముతో గాని, శిక్షలను అనుభవించి గాని మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. శిక్షలను అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. మేము ఫలానా పదవి పొందుకుంటామని విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా! టీచరు అంత బాగా చదివించారని భావిస్తారు. కావున టీచరుకు కూడా బహుమతినిస్తారు కదా! ఈ తండ్రి మిమ్ములను విశ్వానికే అధికారులుగా చేస్తారు. అందుకే మళ్లీ భక్తిమార్గములో వారిని స్మృతి చేస్తూ ఉంటారు. అంతేగాని తండ్రికి మీరు ఏ బహుమతినిస్తారు? మీరిప్పుడు ఏమేమి చూస్తున్నారో అదేదీ మిగలదు. ఇది పాత ఛీ-ఛీ(పాడైపోయిన) ప్రపంచము. అందుకే మీరు నన్ను పిలుస్తారు. తండ్రి మిమ్ములను పతితుల నుండి పావనంగా చేస్తారు. ఈ ఆటను స్మృతి చేయాలి. నాలో రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. దానినంతా మీకు వినిపిస్తాను. కాని మీరిప్పుడు విని, తర్వాత అంతా మర్చిపోతారు. 5 వేల సంవత్సరాల తర్వాత చక్రము మళ్లీ పూర్తవుతుంది. ఇందులో మీ పాత్ర చాలా ప్రియమైనది. మీరు సతోప్రధానంగా, ప్రియంగా అవుతారు. మళ్లీ తమోప్రధానంగా కూడా మీరే అవుతారు. బాబా! రండి అని మీరే పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. ఒకవేళ నిశ్చయము ఉన్నట్లైతే శ్రీమతమును అనుసరించాలి. తప్పులు(పొరపాట్లు) చేయరాదు. చాలామంది పిల్లలు అభిప్రాయ భేదాలతో ఈ చదువును వదిలేస్తారు. శ్రీమతమును అనుసరించరు. చదవకుంటే మీరే పాస్ అవ్వలేరు. మీ పై మీరు దయ చూపుకోమని తండ్రి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకొని స్వయం రాజ్యతిలకము దిద్దుకోండి. చదివించే కర్తవ్యము తండ్రిది. అంతేగాని ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. అలా ఆశీర్వదిస్తే అందరినీ ఆశీర్వదించాల్సి వస్తుంది. కృప మొదలైనవి చూపమని భక్తిమార్గములో వేడుకుంటారు. ఇచ్చట అటువంటి మాటే లేదు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ప్రవృత్తి మార్గములో ఉంటూ పరస్పరము పోటీ(రేస్) పడాలి. కాని ఏ కారణంగానైనా ఒక చక్రము బలహీనమైతే మీరు వారి కొరకు నిలిచిపోరాదు. స్వయంను రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు యోగ్యంగా తయారు చేసుకోవాలి.
2. శివజయంతిని చాలా వైభవోపేతంగా జరుపుకోవాలి. ఎందుకంటే శివబాబా ఏ జ్ఞాన రత్నాలనిస్తారో వాటి ద్వారానే మీరు నూతన ప్రపంచములో మాలామాల్గా అవుతారు. మీ భండారాలన్నీ నిండిపోతాయి.
వరదానము :-
''అన్ని పదార్థాల పై ఆసక్తి నుండి, అతీతంగా, అనాసక్తంగా ఉండు ప్రకృతిజీత్ భవ''
ఏదైనా పదార్థము కర్మేంద్రియాలను విచలితము చేస్తే అనగా ఆసక్తి భావము ఉత్పన్నమైనా అతీతంగా అవ్వలేరు. కోరికలే ఆసక్తుల రూపము. చాలామంది కోరిక(ఇచ్ఛ) లేదు గాని బాగుందనిపిస్తోంది(అచ్ఛా హై) అని అంటారు. ఇది కూడా సూక్ష్మమైన ఆసక్తి. దానిని చాలా సూక్ష్మ రూపంలో అనగా ఈ పదార్థాలు లేక అల్పకాలిక సుఖ సాధనాలు ఆకర్షించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఈ పదార్థాలన్నీ ప్రకృతి సాధనాలు. ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తము అనగా అతీతంగా అవుతారో అప్పుడు ప్రకృతిజీతులుగా అవుతారు.
స్లోగన్ :-
'''నాది, నాది' అనే చిక్కులను వదిలి బేహద్లో ఉండండి, అప్పుడు విశ్వకళ్యాణకారులని అంటారు''