26-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి తోటయజమాని, ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధభరిత పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి ''

ప్రశ్న :-

తండ్రి దృష్టి ఏ పిల్లల పై పడ్తుంది, ఎవరి పై పడదు ?

జవాబు :-

మంచి సుగంధమునిచ్చే పుష్పాల పై, అనేక ముళ్లను పుష్పాలుగా మార్చు సేవ చేయువారి పై తండి దృష్టి ఉంటుంది. వారిని అదే పనిగా చూస్తూ తండి చాలా సంతోషిస్తారు. తండి దృష్టి అంతా ఇటువంటి వారి పైకే వెళ్తుంది. ఎవరి వృత్తి అయితే మలినంగా ఉంటుందో, ఎవరి కనులు మోసము చేస్తూ ఉంటాయో, వారి పై తండ్రి దృష్టి కూడా పడదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ! పుష్పాలుగా అయ్యి అనేకమందిని పుష్పాలుగా తయారు చేయండి అప్పుడు చురుకైన తోటమాలులు అని పిలువబడ్తారు.

ఓంశాంతి.

తోటయజమాని అయిన తండ్రి కూర్చొని తన పుష్పాలను చూస్తున్నారు, ఎందుకంటే ఇతర అన్ని సేవకేంద్రాలలో పుష్పాలు, తోటమాలులు ఉంటారు కానీ ఇక్కడ పుష్పాలైన మీరు నేరుగా తోటయజమాని వద్దకు మీ సుగంధమునిచ్చేందుకు వచ్చారు. మీరు పుష్పాలు కదా. ముళ్ళ అడవికి బీజరూపము రావణుడని మీకూ తెలుసు, తండ్రికి కూడా తెలుసు. నిజానికి వృక్షానికంతటికి బీజము ఒక్కరే. కానీ పూలతోటను ముళ్ళ అడవిగా చేసేవాడు కూడా తప్పకుండా ఉంటాడు. అలా మార్చేవాడు రావణుడు. తండ్రి సరిగ్గా, సత్యమే అర్థం చేయిస్తున్నారా లేదా? అని మీరే నిర్ణయించండి. దేవతలనే పూలతోటకు బీజరూపుడు తండ్రి. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు కదా. స్వయం నేను ఎలాంటి పుష్పాన్ని? అని ప్రతి ఒక్కరికీ తెలుసు. పుష్పాలను చూచేందుకు తోటయజమాని కూడా ఇక్కడకే వస్తారు. వారందరూ తోటమాలులు. తోటమాలులలో కూడా అనేక రకాలవారు ఉన్నారు. ఆ తోటలకు కూడా రకరకాల తోట మాలులు ఉంటారు కదా. కొంతమందికి 5 వందలు, కొంతమందికి వెయ్యి, మరికొంతమందికి రెండు వేల జీతము ఉంటుంది. మొగల్‌ గార్డన్‌(ఢిల్లీ) తోటమాలి చాలా నేర్పరిగా ఉంటాడు. అతని జీతము కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది చాలా పెద్దదైన బేహద్‌ తోట. అందులో కూడా అనేక రకాల నంబరువారు తోటమాలులు ఉన్నారు. మంచి తోటమాలి తోటను చాలా శోభాయమానంగా తయారు చేస్తాడు. మంచి పూల మొక్కలను నాటుతాడు. ప్రభుత్వము వారి మొగల్‌ గార్డన్‌ ఎంత బాగుంది! ఇది అనంతమైన తోట. తోట యజమాని ఒక్కరే. ముళ్ళ అడవికి బీజము రావణుడు. పుష్పాల తోటకు బీజము శివబాబా. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. రావణుని నుండి వారసత్వము లభించదు. రావణుడు శాపమిస్తాడు. శాపగ్రస్తులైనప్పుడు ఎవరు సుఖమిస్తారో, వారిని అందరూ స్మృతి చేస్తారు ఎందుకంటే తాను సుఖదాత, సదా సుఖమునిచ్చేవాడు. రకరకాల తోటమాలులు ఉంటారు. తోట యజమాని వచ్చి తోటమాలులను, వారు తయారుచేసిన చిన్న-పెద్ద తోటలను పరిశీలిస్తారు. ఏ ఏ పుష్పాలు ఉన్నాయో కూడా చూస్తారు. అప్పుడప్పుడు మంచి మంచి తోటమాలులు కూడా వస్తారు. వారి పూల అలంకరణ కూడా తరచుగా బాగానే ఉంటుంది. కావున అహో! ఈ తోటమాలులు చాలా మంచివారు, మంచి-మంచి పుప్పాలను తీసుకొచ్చారని తోటయజమానికి కూడా సంతోషము కలుగుతుంది. వీరు అనంతమైన తండ్రి. వీరు అనంతమైన విషయాలు తెలుపుతారు. బాబా చెప్పేదంతా సంపూర్ణ సత్యమని పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పము రావణ రాజ్యము నడుస్తుంది. పుష్పాల తోటను ముళ్ళ అడవిగా చేసేది రావణుడు. అడవిలో ఎక్కడ చూచినా ముండ్లే ఉంటాయి. చాలా దుఃఖమునిస్తాయి. తోట మధ్యలో ముళ్ళు ఉండవు. ఒక్క ముల్లు కూడా ఉండదు. ఈ విషయాలు పిల్లలకు తెలుసు. రావణుడు దేహాభిమానములో తీసుకొస్తాడు. అన్నిటికన్నా పెద్ద ముల్లు దేహాభిమానము.

కొంతమందికి కాముక దృష్టి ఉంటుందని, మరికొంతమందికి సెమీ కామ దృష్టి ఉంటుందని బాబా రాత్రి క్లాసులో కూడా అర్థం చేయించారు. కొంతమంది కొత్తవారు కూడా మొదట చాలా బాగా నడుచుకుంటారు. ఎప్పుడూ వికారాల జోలికి వెళ్లము, పవిత్రంగా ఉంటామని భావిస్తారు. ఆ సమయములో వారికి శ్మశాన వైరాగ్యము వస్తుంది. మళ్లీ ఇంటికి వెళ్లగానే చెడిపోతారు. దృష్టి మలినంగా అయిపోతుంది. కొందరిని మంచి-మంచి పుష్పాలుగా భావించి తోటయజమాని వద్దకు తీసుకొచ్చి ''బాబా, వీరు ఫలానా పుష్పము, వీరు మంచి-మంచి పుష్పాలు'' అని చెవిలో చెప్తారు. తోటమాలి తప్పకుండా తెలుపుతాడు కదా. బాబా అంతర్యామి అని అనుకోరాదు. తోటమాలి ప్రతి ఒక్కరి నడవడిక గురించి తెలుపుతాడు. వీరి దృష్టి సరిగ్గా లేదు, వీరి నడవడిక రాయల్‌గా లేదు, వీరు10-20 శాతము చక్కబడ్డారని చెప్తుంటారు. ముఖ్యమైనవి కనులు, ఇవి చాలా మోసగిస్తాయి. తోటమాలి వచ్చి యజమానికి అన్ని విషయాలు తెలుపుతాడు. మీరు ఎటువంటి పుష్పాలను తెచ్చారు? అని ఒక్కొక్క మాలిని అడుగుతారు. కొంతమంది గులాబీలను, కొంతమంది మల్లెలను, కొంతమంది జిల్లెడు పుష్పాలను కూడా తీసుకొస్తారు. ఇక్కడ చాలా హెచ్చరిక(జాగ్రత్త)తో ఉంటారు. అడవిలోకి వెళ్తూనే మళ్లీ వాడిపోతారు. వీరు ఎటువంటి పుష్పాలు అని బాబా గమనిస్తారు. మాయ కూడా ఎటువంటిదంటే తోటమాలులకు కూడా జోరుగా చెంపదెబ్బలు వేస్తుంది. ఆ దెబ్బకు తోటమాలులు కూడా ముళ్ళుగా అయిపోతారు. తోటయజమాని వస్తూనే మొట్టమొదట తోటను చూస్తారు. తర్వాత తండ్రి కూర్చుని వారిని అలంకరిస్తారు. పిల్లలూ! జాగ్రత్తగా ఉండండి, లోపాలను తొలగిస్తూ వెళ్లండి లేకుంటే తర్వాత చాలా పశ్చాత్తాపపడ్తారు. లక్ష్మీనారాయణులుగా చేసేందుకు బాబా వచ్చారు. అలా అవ్వకుండా మనము నౌకరులుగా అవుతామా! అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఈ విధంగా(లక్ష్మీనారాయణులుగా) ఉన్నతంగా, అర్హులుగా అవుతున్నామా? ముళ్ళ అడవికి బీజము రావణుడు. పుష్పాల తోటకు బీజము రాముడు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని తెలిపిస్తున్నారు. అయినా బాబా పాఠశాల విద్యను మహిమ చేస్తారు - ఆ చదువు కూడా మంచిదే ఎందుకంటే అది సంపాదనకు మూలము. లక్ష్యము కూడా ఉంది. ఇది కూడా ఒక పాఠశాల, ఇందులో లక్ష్యముంది. మిగిలినవాటిలో లక్ష్యమంటూ ఏదీ ఉండదు. నరుని నుండి నారాయణునిగా తయారవ్వడమే మీ ఏకైక లక్ష్యము. భక్తిమార్గములో సత్యనారాయణ కథను చాలా ఎక్కువగా వింటారు. ప్రతి మాసము బ్రాహ్మణుని పిలుస్తారు. అతడు గీతను వినిపిస్తాడు. ఈ రోజులలో గీతను అందరూ వినిపిస్తారు. సత్యమైన బ్రాహ్మణులైతే ఒక్కరు కూడా లేరు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. సత్యమైన తండ్రికి పిల్లలు. మీరు సత్య-సత్యమైన కథను వినిపిస్తారు. సత్యనారాయణ కథ, అమర కథ, తీజిరీ కథ కూడా ఉంది. భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. వారు గీతనైతే వినిపిస్తూ వచ్చారు అయితే రాజులుగా ఎవరైనా అయ్యారా? నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను కానీ నేను స్వయంగా అలా అవ్వను అని అనేవారు ఇంకెవరైనా ఉన్నారా? అలా అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ఒక్క తండ్రి మాత్రమే కూర్చొని పిల్లలకు ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు. తోటమాలి వద్దకు తాజాగా (రిఫ్రెష్‌) అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. పుప్పాలుగా అవుతారు, మాలిగా కూడా అవుతారు. మాలిగా తప్పకుండా తయారవ్వాలి. రకరకాల తోటమాలులు ఉన్నారు. సేవ చేయకపోతే మంచి పుష్పాలుగా ఎలా తయారవుతారు? ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి పుష్పాన్ని? ఎటువంటి తోటమాలిని? అని హృదయములో ప్రశ్నించుకోండి. పిల్లలు విచార సాగర మథనము చేయాలి. మాలులు కూడా రకరకాలుగా ఉంటారని బ్రాహ్మణీలకు తెలుసు. కొంతమంది మంచి-మంచి తోటమాలులు కూడా వస్తారు. వారికి చాలా మంచి తోట ఉంటుంది. తోటమాలి బాగుంటే తోటను కూడా చాలా బాగా తయారుచేస్తాడు. మంచి - మంచి పుష్పాలను తీసుకొస్తారు. వాటిని చూస్తూనే హృదయము సంతోషిస్తుంది. కొంతమంది తేలికైన పుష్పాలను తీసుకొస్తారు. వీరు(పుష్పాలు) ఏ ఏ పదవిని పొందుతారో తోటయజమాని అర్థము చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా సమయముంది. ఒక్కొక్క ముల్లును పుష్పంగా చేసేందుకు శ్రమ కలుగుతుంది. కొంతమంది పుష్పాలుగా అవ్వాలని అనుకోరు. ముల్లుగా ఉండేందుకే ఇష్టపడ్తారు. వారి కనులలోని భావము చాలా అశుద్ధంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినా వారి నుండి సుగంధము రాదు. నా ముందు పుష్పాలే కూర్చుంటే బాగుంటుందని తోటయజమాని అనుకుంటారు. ఆ పుష్పాలను చూచి సంతోషిస్తాను. వారి భావము (వృత్తి) ఎలా ఉందో గమనిస్తాను. బాగలేకుంటే వారిని చూడను కూడా చూడను. అందుకే ఒక్కొక్కరిని నా ఈ పుష్పము ఎటువంటిది? ఎంత సుగంధము ఇస్తుంది? ముల్లు నుండి పుష్పంగా అయ్యిందా? లేదా? అని గమనిస్తాను. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు పుష్పంగా అయ్యాను? పురుషార్థము చేస్తున్నానా? అని తెలుసుకోగలరు. మాటిమాటికి - ''బాబా మేము మిమ్ములను మర్చిపోతూ ఉంటామని, యోగములో ఉండలేకున్నాము అని అంటారు.'' అరే! స్మృతి చేయకుండా ఉంటే పుష్పాలుగా ఎలా అవుతారు? స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి, అప్పుడు పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా పుష్పాలుగా చేస్తారు. అప్పుడు తోటమాలి అని అనిపించుకోగలరు. ఎవరైనా తోటమాలి ఉన్నారా? అని బాబా అడుగుతూ ఉంటారు. తోటమాలిగా ఎందుకు అవ్వలేదు? బంధనాలను వదిలిపెట్టాలి. ఆంతరికములో ఆవేశము రావాలి, సేవ చేసే ఉల్లాసము ఉండాలి. మీ రెక్కలను స్వతంత్రము చేసుకునేందుకు శ్రమ చేయాలి. ఎవరి పైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని వదిలి పెటాల్సి వస్తుందా? తండ్రి సేవ కొరకు ఎంతవరకు పుష్పాలుగా అవ్వరో, ఇతరులను పుష్పాలుగా తయారు చేయరో అంతవరకు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? ఇది 21 జన్మలకు ఉన్నతపదవి. మహారాజులు, రాజులు, గొప్ప-గొప్ప ధనవంతులు కూడా ఉన్నారు. అంతేకాక నంబరువారుగా తక్కువ ధనవంతులు, ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము ఎలా తయారవ్వాలి? ఇప్పుడు పురుషార్థము ఎవరు చేస్తారో వారు కల్ప-కల్పాంతరాలకు అలా అవుతారు. అయితే ఇప్పుడు పూర్తిగా సంపూర్ణ శక్తులనుపయోగించి పురుషార్థము చేయాలి. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి, ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో వారు అమలుపరుస్తారు. ప్రతి రోజూ లాభ-నష్టాలు చూసుకోవాల్సి ఉంటుంది. 12 మాసాలకు ఒకసారి కాదు, ప్రతి రోజు మీ లాభ-నష్టాలు చూసుకోవాలి, నష్టపోరాదు. నష్టపోతే తృతీయ శ్రేణికి(థర్డ్‌ క్లాసుకు) వెళ్లిపోతారు. పాఠశాలలో కూడా నంబరువారుగా ఉంటారు కదా.

మధురాతి మధురమైన పిల్లలకు - ''మా బీజము వృక్షపతి అని, వారు వస్తూనే మా పై బృహస్పతి దశ కూర్చుంటుందని తెలుసు.'' మళ్ళీ రావణరాజ్యము వచ్చినప్పుడు రాహుదశ కూర్చుంటుంది. మొదటిదేమో అత్యంత ఉన్నతము, ఇది అత్యంత నీచము. ఒక్కసారిగా శివాలయము నుండి వేశ్యాలయంగా చేసేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ పై బృహస్పతి దశ ఉంది. మొదట వృక్షము కొత్తదిగా ఉంటుంది. అర్ధకల్పము నుండి పాతదిగా అవ్వడం మొదలవుతుంది. తోటయజమాని కూడా ఉన్నారు, తోటమాలులు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. యజమాని వద్దకు తీసుకొస్తారు. ప్రతి తోటమాలి పుష్పాలను తీసుకొస్తారు. కొంతమంది మంచి పుష్పాలను తీసుకొస్తారు. మంచిపుష్పాలు బాబా వద్దకు పోవాలని తపిస్తూ ఉంటారు. రకరకాల యుక్తులతో పిల్లలు ఇక్కడకు వస్తారు. చాలా మంచి పుష్పాలను తీసుకొచ్చారని బాబా మెచ్చుకుంటారు. భలే మాలి రెండవ తరగతి వారైనా, మాలి కంటే పుష్పాలు బాగుంటాయి. శివబాబా వద్దకు పోవాలని, వారు మమ్ములను ఇంత ఉన్నతంగా, విశ్వానికి అధికారులుగా చేస్తారని తపిస్తూ ఉంటారు. ఇంట్లో దెబ్బలు తింటున్నా శివబాబా మమ్ములను రక్షించండి అంటూ వేడుకుంటారు. వారినే సత్యమైన ద్రౌపదులు అని అంటారు. ఏదైతే గతించిందో అది మళ్లీ పునరావృతము(రిపీట్‌) అవ్వాలి. నిన్న మీరు పిలిచారు కదా. ఈ రోజు రక్షించేందుకు బాబా వచ్చారు. ఈ విధంగా భూ - భూ చేయమని బాబా యుక్తులు తెలియచేస్తారు. మీరు భ్రమరీలు, వారు పేడ పురుగులు. వాటిని గూటిలో ఉంచి భూ-భూ చేస్తూ ఉండండి. భగవానువాచ - కామము మహాశత్రువు, దానిని జయిస్తే విశ్వానికి అధికారులుగా అవుతారు అని వారికి చెప్పండి. ఏదో ఒక సమయములో అబలల మాటలు హృదయాలకు తగిలి వారు చల్లబడిపోతారు. అప్పుడు వారు సరే! నీవు సెంటరుకు వెళ్ళు అని అంటారు. ఈ విధంగా తయారు చేసేవారి వద్దకు వెళ్ళు, నాకు అదృష్టము లేదు, నీవైనా వెళ్ళు అని అంటారు. ఈ విధంగా ద్రౌపదులు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. బాబా భూ-భూ చేయమని వ్రాస్తారు. కొంతమంది స్త్రీలు కూడా శూర్పణఖలు, పూతనలుగా ఉంటారు. పురుషులు వారికి భూ-భూ చేస్తూ ఉంటారు. వారు పేడపురుగులైపోతారు. వికారాలు లేకుండా ఉండలేరు. తోటయజమాని వద్దకు రకరకాల వారు వస్తారు. వారిని గురించి వర్ణించలేము. కొంతమంది కన్యలు కూడా ముళ్లుగా అవుతారు. అందుకే మీ జాతకాలు తెలపమని బాబా అంటారు. తండ్రికి వినిపించక, దాచిపెడ్తే అది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. అసత్యము చెల్లదు. మీ వృత్తులు ఇంకా ఎక్కువగా చెడిపోతాయి. తండ్రికి వినిపిస్తే మీరు రక్షించబడ్తారు. సత్యము తెలపాలి. తెలుపకుంటే పూర్తి మహారోగిగా అవుతారు. వికారులుగా అయిన వారి ముఖము నల్లగా మాడిపోతుందని తండ్రి చెప్తారు. పతితులనగా నల్ల ముఖము. కృష్ణుని కూడా శ్యామ సుందరుడు అని అంటారు. కృష్ణుని నల్లగా చేసేశారు. రాముడిని, నారాయణుని కూడా నల్లగా చూపిస్తారు. కొంచెము కూడా అర్థము తెలియదు. మీ వద్ద ఉన్న నారాయణుని చిత్రము తెల్లగా ఉంది. మీ లక్ష్యమే ఈ చిత్రము. మీరు నల్లని నారాయణులుగా అవ్వరాదు. నిర్మించిన మందిరాలలో ఉన్న మూర్తి వలె ఉండరు. వికారాల వశమైనందున ముఖము నల్లగా అయిపోతుంది. ఆత్మ నల్లగా అయిపోయింది. ఇనుప యుగము నుండి బంగారు యుగములోకి వెళ్లాలి. బంగారు పిచుకగా అవ్వాలి. కలకత్తా కాళి అని అంటారు. కాళి ముఖమును ఎంత భయంకరంగా చూపిస్తారు! ఎంత భయంకరమో చెప్పలేము! తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, ఇదంతా భక్తిమార్గము. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ రెక్కలను స్వతంత్రము చేసుకునేందుకు శ్రమ చేయాలి. బంధనాల నుండి ముక్తులుగా అయ్యి తెలివి గల తోటమాలిగా తయారవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి.

2. ''నేను ఎంతవరకు సుగందభరితమైన పుష్పంగా అయ్యాను''? నా వృత్తి శుద్ధంగా ఉందా? కనులు మోసగించడం లేదు కదా? అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. మీ నడవడికల లెక్కాచారాన్ని ఉంచుకొని లోపాలను తొలగించుకోవాలి.

వరదానము :-

'' శ్రేష్ఠమైన పవిత్రతను ధారణ చేయుట ద్వారా ఏక ధర్మ సంస్కారము గల సమర్థ సామ్రాట్‌ భవ ''

మీ స్వరాజ్య ధర్మము అనగా ధారణ - పవిత్రత. ఒక ధర్మము అనగా ఒక ధారణ. స్వప్నము లేక సంకల్పములో కూడా అపవిత్రత అనగా రెండవ ధర్మము ఉండరాదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉందో, అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పాల నామ-రూపాలే ఉండవు. ఇటువంటి సంపూర్ణ పవిత్రతా సంస్కారాన్ని నింపుకునేవారే సమర్థ సామ్రాట్‌లు. ఇప్పటి శ్రేష్ఠమైన సంస్కారాల ఆధారముతోనే భవిష్య ప్రపంచము తయారవుతుంది. ఇప్పటి సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది.

స్లోగన్‌ :-

'' ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో, వారే విజయీ రత్నాలుగా అవుతారు ''