27-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - గృహస్థ వ్యవహారములో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి, కావున మీ సర్వస్వాన్ని బదిలీ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారము. ''

ప్రశ్న :-

ఏ విషయములో డ్రామా జ్ఞానము పిల్లలైన మీకు చాలా సహాయము చేస్తుంది ?

జవాబు :-

ఏదైనా శారీరిక జబ్బు వచ్చినప్పుడు డ్రామా జ్ఞానము పిల్లలకు చాలా సహాయము చేస్తుంది. ఎందుకంటే ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లే పునరావృతమౌతుందని మీకు తెలుసు. ఇందులో ఏడ్వవలసిన, రొమ్ములు బాదుకునే పని లేదు. కర్మల లెక్కాచారము చుక్తా కావాలి. 21 జన్మల సుఖము ముందు ఈ దు:ఖము లెక్కలోకి రాదు. జ్ఞానము పూర్తిగా లేకుంటే చాలా వ్యాకులపడ్తారు, తపిస్తారు.

ఓంశాంతి.

భగవానువాచ. వవరికి తమ స్వంత శరీరము లేదో వారిని భగవంతుడని అంటారు. భగవంతునికి నామ, రూప, దేశ, కాలాలు లేవని కాదు. అలా కాదు. భగవంతునికి శరీరము లేదు. మిగిలిన ఆత్మలన్నింటికి తమ-తమ శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మయే వింటుంది, పాత్రను అభినయము చేస్తుంది. శరీరము ద్వారా కర్మ చేస్తుంది. సంస్కారాలను ఆత్మ తీసుకెళ్తుంది. మంచి-చెడు కర్మల ఫలమును కూడా ఆత్మనే శరీరముతో అనుభవిస్తుంది. శరీరము లేకుండా ఏమీ అనుభవించలేదు. అయితే తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. బాబా మనకు వినిపిస్తున్నారు. దానిని ఈ శరీరము ద్వారా ఆత్మలైన మనము వింటున్నాము. భగవానువాచ - 'మన్మనాభవ.' దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ విషయాన్ని గీతా భగవంతుడైన తండ్రి ఒక్కరే చెప్తారు. భగవంతుడు అంటే జనన-మరణ రహితులు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నా జన్మ అలౌకికమైనది. నేను ఇతనిలో ప్రవేశించినట్లు ఎవ్వరూ జన్మ తీసుకోరు. ఇది బాగా స్మృతి చేయాలి. అంతా భగవంతుడే చేస్తారని కాదు. పూజ్యులు, పూజారులు, రాళ్ళు - రప్పలు అన్నీ భగవంతుడని కాదు. 24 అవతారాలు, మీనావతారము, కూర్మావతారము, పరశురామావతారాలను చూపిస్తారు. భగవంతుడు పరశురామ అవతారమును ధరించి గొడ్డలి తీసుకొని హింస చేస్తారా! ఇది తప్పు! పరమాత్మను సర్వవ్యాపి అని అనడం, కల్పాయువును లక్షల సంవత్సరాలని వ్రాయడం - దీనినే గాఢాంధకారమని అంటారు అనగా జ్ఞానము లేదు అని అర్థము. జ్ఞానము ద్వారా ప్రకాశము అవుతుంది. ఇప్పుడు అజ్ఞానమనే గాఢాంధకారముంది. ఇప్పుడు పిల్లలైన మీరు భవ్యమైన ప్రకాశములో ఉన్నారు. మీకు అన్ని విషయాలు బాగా తెలుసు. తెలియనివారు పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అన్నీ తెలుసుకున్నందున పూజ చేయవలసిన అవసరము లేదు. ఇప్పుడు మీరు పూజారితనము నుండి ముక్తులుగా అయ్యారు. పూజ్య దేవీదేవతలుగా అయ్యేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు. మీరే పూజ్య దేవీదేవతలుగా ఉండేవారు. తర్వాత మీరే పూజారి మనుష్యులుగా అయ్యారు. మనుష్యులలో ఆసురీ గుణాలున్నందు వల్లనే, మనుష్యులను దేవతలుగా తయారు చేశారనే గాయనముంది. మనుష్యులను దేవతలుగా చేసేవారి గొప్పతనాన్ని వర్ణించనలవి కాదు.............. ఒక్క క్షణములో దేవతలుగా చేసేస్తారు. తండ్రిని గుర్తించగానే శివబాబా అని అనసాగారు. బాబా అనగానే మనస్సులో మేము విశ్వానికి, స్వర్గానికి అధికారులుగా అవుతామని అనిపిస్తుంది. వీరు అనంతమైన తండ్రి. మీరు వెంటనే వచ్చి పారలౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి చెప్తారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వమును తీసుకోండి. లౌకిక వారసత్వాన్ని మీరు తీసుకుంటూనే వచ్చారు. కాని ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వముతో మార్చుకోండి. ఇది ఎంత మంచి వ్యాపారము! లౌకిక వారసత్వములో ఏముంటుంది? ఇది అనంతమైన వారసత్వము. దీనిని పేదవారు వెంటనే తీసుకుంటారు. పేదవారిని దత్తు తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పెన్నిధి కదా. నేను పేదల పెన్నిధినని గాయనము కూడా ఉంది. భారతదేశము అన్నింటికంటే పేద దేశము. నేను భారతదేశములోనే వస్తాను. వచ్చి వీరిని ధనవంతంగా చేస్తాను. భారతదేశ మహిమ చాలా గొప్పది. ఇది అన్నింటికంటే పెద్ద తీర్థ స్థానము. కానీ కల్పాయువును పెద్దదిగా చేసినందున పూర్తిగా మర్చిపోయారు. భారతదేశము చాలా సంపన్నంగా ఉండేదని ఇప్పుడు పేదదై పోయిందని అర్థం చేసుకుంటారు. పూర్వము ధాన్యము మొదలైనవన్నీ ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళేవి. కాని ఇప్పుడు భారతదేశము చాలా పేద దేశమని భావించి సహాయము చేస్తారు. ఎవరైనా పెద్ద ఆసాములు(వ్యాపారస్థులు) జీవితములో ఓడిపోయి దీనస్థితిలో ఉన్నప్పుడు పరస్పరములో అంతా కలిసి వారికి సహాయము చేస్తారు. ఈ భారతదేశము అన్నిటికంటే ప్రాచీనమైనది. భారతదేశమే స్వర్గముగా ఉండేది. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది. కానీ సమయము చాలా ఎక్కువగా చేసేసినందున తికమకపడ్తారు. భారతదేశానికి ఎంతో సహాయము కూడా చేస్తారు. తండ్రి కూడా భారతదేశములోనే రావాలి.

మనము తండ్రి ద్వారా వారసత్వమును తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఈ బ్రహ్మ చేసిన విధంగా లౌకిక తండ్రి ఆస్తినిచ్చి పారలౌకిక తండ్రిగారి ఆస్తిని తీసుకుంటున్నాము. పారలౌకిక తండ్రి నుండి కిరీటము, సింహాసనము ప్రాప్తిస్తాయని గమనించారు. ఆ చక్రవర్తి పదవి ఎక్కడ, ఈ తుచ్ఛమైన గాడిద బరువు ఎక్కడ! తండ్రిని అనుసరించండని చెప్పబడ్తుంది. ఆకలితో మరణించే మాటే లేదు. తండ్రి చెప్తున్నారు - నిమిత్తులుగా ఉండి(ట్రస్టీలై) సంభాళించండి. తండ్రి వచ్చి సహజ మార్గాన్ని తెలియజేస్తారు. పిల్లలు చాలా కష్టపడ్డారు. అందుకే తండ్రిని - 'ఓ పరమపిత పరమాత్మా! దయ చూపండి' అని పిలుస్తారు. దు:ఖములో అందరూ స్మరిస్తారు. సుఖములో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. ఎలా స్మృతి చేయాలో తండ్రి ఇప్పుడు తెలియచేస్తున్నారు. మీకు స్మృతి చేయడం కూడా రాదు. నేనే వచ్చి మీకు తెలియచేస్తాను. పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు కట్‌ అయిపోతాయి. స్మరణ చేసి చేసి సుఖమును పొందండి. తనువు యొక్క కలహ క్లేశములన్నీ తొలగిపోతాయి. శారీరిక దు:ఖములన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా అవుతాయి. మీరు అటువంటి కంచనంగా ఉండేవారు. తర్వాత మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఆత్మ పై తుప్పు ఏర్పడ్తుంది. తర్వాత బంగారములో కల్తీ చేసినట్లుగా శరీరము కూడా పాతదే లభిస్తుంది. స్వచ్ఛమైన(పవిత్రమైన) బంగారముతో తయారయ్యే ఆభరణము కూడా స్వచ్ఛంగా (పవిత్రంగా) ఉంటుంది. అందులో మెరుపు ఉంటుంది. కల్తీ బంగారముతో తయారైన ఆభరణము నల్లగా అయిపోతుంది. తరడ్రి చెప్తున్నారు - మీలో కూడా మలినము చేరి ఉంది. ఇప్పుడు ఆ మలినాన్ని తొలగించాలి. అయితే ఎలా తొలగుతుంది? తండ్రితో యోగము జోడించండి. చదివించేవారితో యోగము జోడించాలి కదా. వీరు తండ్రి, టీచరు, సద్గురువు మరియు సర్వస్వము. వారిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయి. అంతేకాక వారు మిమ్ములను చదివిస్తారు కూడా. పతితపావనులు, సర్వశక్తివంతులు అని మీరు నన్నే అంటారు. కల్ప-కల్పము తండ్రి ఇలాగే అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా! మీరు 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలిశారు. అందుకే మిమ్ములను అపురూపమైనవారని అంటారు. ఇప్పుడు ఈ దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేని ఆత్మ జ్ఞానమును కూడా ఇచ్చారు. ఆత్మ జ్ఞానమును తండ్రి తప్ప మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. సన్యాసులు, ఉదాసులు, గురు - గోసాయిలు మొదలైనవారెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆ శక్తి లేదు. సర్వుల శక్తి తగ్గిపోయింది. మొత్తం వృక్షమంతా శిథిలావ్థను పొందింది. ఇప్పుడు తిరిగి కొత్తగా స్థాపన అవుతుంది. తండ్రి వచ్చి వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మొదట మీరు రామరాజ్యములో ఉండేవారు. మీరు ఎప్పుడైతే వామమార్గములోకి వెళ్తారో అప్పుడు రావణరాజ్యము ప్రారంభమౌతుందని చెప్తారు. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. భక్తిమార్గము ప్రారంభమౌతుంది. ఇంతకు ముందు మీకు తెలిసేది కాదు. మీకు రచయిత - రచనల ఆదిమధ్యాంతాలను గురించి మీకు తెలుసా? అని అడిగితే ఎవ్వరూ తెలుపలేరు. తండ్రి భక్తులకు చెప్తున్నారు - మీరిప్పుడు నిర్ణయించుకోండి. బోర్డు పై కూడా వ్రాయండి. పాత్రధారియై ఉండి, డ్రామా దర్శకుడు, రచయిత మరియు ముఖ్యపాత్రధారి ఎవరో తెలుసుకోలేదంటే అటువంటి పాత్రధారిని ఏమంటారు? మనము ఆత్మలము. భిన్న-భిన్న శరీరాలను ధరించి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తున్నామంటే తప్పకుండా ఇది నాటకమే కదా.

గీత తల్లి, శివుడు తండ్రి. మిగిలినవారంతా రచన. గీత నూతన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నూతన ప్రపంచాన్ని ఎలా స్థాపిస్తారో ఎవ్వరికీ తెలియదు. నూతన ప్రపంచములో మొట్టమొదట మీరే ఉంటారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగ ప్రపంచము. ఇది పాత ప్రంచము కూడా కాదు, నూతన ప్రపంచము కూడా కాదు. ఇది సంగమ యుగము. ఇది బ్రాహ్మణుల శిఖ(పిలక). విరాట రూపములో శివబాబాను కూడా చూపించరు, శిఖ అయిన బ్రాహ్మణులను కూడా చూపించరు. మీరు పైన శిఖను కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూర్చుని ఉన్నారు. దేవతల తర్వాత క్షత్రియులు. ద్వాపరములో కడుపు నింపుకొనే పూజారులు, తర్వాత శూద్రులుగా అవుతారు. ఇది పల్టీలాట. మీరు కేవలం ఆ పల్టీ అటను స్మృతి చేయండి. ఇదే మీ కొరకు 84 జన్మల యాత్ర. క్షణములో అంతా గుర్తుకు వచ్చేస్తుంది. మనము అలా చక్రములో తిరిగి వస్తాము. ఇది కరెక్టు చిత్రము. అది తప్పు చిత్రము. తండ్రి తప్ప మరెవ్వరూ సరైన చిత్రమును తయారు చేయించలేరు. ఇతని ద్వారా తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఇలాంటి పల్టీ ఆట ఆడుతున్నారు. మీది క్షణములో జరిగే యాత్ర. కష్టమనే మాటే లేదు. తండ్రి మనలను చదివిస్తున్నారని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఇది సత్యమైన తండ్రితో సత్సంగము. అవి అసత్య సాంగత్యాలు. సత్యమైన ఖండాన్ని తండ్రి స్థాపన చేస్తారు. మనుష్యులకు అంత శక్తి లేదు. భగవంతుడే చేయగలడు. భగవంతుడినే జ్ఞానసాగరులని అంటారు. ఇది పరమాత్ముని మహిమ అని సాధు సన్యాసులకు తెలియదు. ఆ శాంతిసాగురలు మీకు శాంతినిస్తున్నారు. ఉదయాన్నే మీరు డ్రిల్లు చేస్తారు. శరీరము నుండి భిన్నమై తండ్రి స్మృతిలో ఉంటారు. ఇక్కడ మీరు జీవించి ఉండి మరణించేందుకు వచ్చారు. తండ్రి పై బలిహారమౌతారు. ఇది పాత ప్రపంచము, పాత శరీరము. దీని పై అసహస్యము కలిగి వదిలేసి వెళ్లాలనిపిస్తుంది. ఏదీ గుర్తు రాకూడదు. అంతా మర్చిపోవాలి. భగవంతుడే అంతా ఇచ్చారని అంటారు కనుక తిరిగి వారికే ఇచ్చేయండి. భగవంతుడు చెప్తున్నారు - మీరు ట్రస్టీలుగా అవ్వండి. భగవంతుడు ట్రస్టీగా అవ్వరు. మీరు ట్రస్టీలుగా అవుతారు. ఆ తర్వాత పాపము చేయరు. ఇంతకు ముందు పాపాత్మలైన మీరు పాపాత్మలతోనే ఇచ్చి-పుచ్చుకుంటూ ఉండేవారు. ఇప్పుడు సంగమ యుగములో మీరు పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకునేది లేదు. పాపాత్మలకు దానము చేస్తే పాపము తల పై కూర్చుంటుంది. ఈశ్వరార్థమని చెప్తూ పాపాత్మలకు దానమిస్తారు. తండ్రి ఏమీ తీసుకోరు. మీరు వెళ్లి సేవాకేంద్రమును తెరచినట్లయితే అనేమంది కళ్యాణము జరుగుతుందని తండ్రి చెప్తారు.

డ్రామానుసారము ప్రతి ఒక్కటి పునరావృతమౌతూనే ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తారు. మరి ఇందులో విలపించవలసిన, ఏడ్వవలసిన విషయమేదీ లేదు. కర్మల లెక్కాచారము చుక్త అవ్వడం మంచిదే కదా. రోగమంతా బయట పడ్తుందని వైద్యులు కూడా అంటారు. తండ్రి కూడా చెప్తున్నారు - మిగిలి ఉన్న లెక్కాచారమంతా చుక్తా అవ్వాలి. యోగముతో గానీ, శిక్షలతో గానీ చుక్తా చేసుకోవలసి ఉంటుంది. శిక్షలు చాలా కఠినమైనవి. దానికంటే జబ్బులు మొదలైన రూపములో చుక్తా అయితే చాలా మంచిది కదా. 21 జన్మల అనంతమైన సుఖముల ముందు ఈ దు:ఖము లెక్కలోకి రాదు. జ్ఞానము పూర్తిగా లేకుంటే వ్యాధులున్న సమయములో చాలా వ్యాకులపడ్తారు. వ్యాధిగ్రస్థమైనప్పుడు భగవంతుని చాలా స్మృతి చేస్తారు. అది కూడా మంచిదే. ఒక్కరినే స్మృతి చేయాలి. అది కూడా తెలియచేస్తూ ఉంటారు. వారంతా గురువులను స్మృతి చేస్తారు. అనేకమంది గురువులున్నారు. సద్గురువు మీకు మాత్రమే తెలుసు. వారు సర్వశక్తివంతులు. తండ్రి చెప్తున్నారు - నాకు ఈ వేద శాస్త్రాలు, గ్రంథాలు మొదలైనవన్నీ తెలుసు. ఇది భక్తి సామగ్రి. వీటి ద్వారా నన్ను ఎవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. తండ్రి పాపాత్మల ప్రపంచములోనే వస్తారు. పుణ్యాత్మలు ఇక్కడ ఎక్కడ నుండి వస్తారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారి శరీరములో వస్తాను. మొట్టమొదట ఇతడే వింటాడు. ఇక్కడ మీ స్మృతి యాత్ర బాగా జరుగుతుందని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ భలే తుఫాన్లు కూడా వస్తాయి కాని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ''స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.'' కల్పక్రితము కూడా మీరు ఇలాగే జ్ఞానమును విన్నారు. ప్రతి రోజూ మీరు వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతూ ఉంటుంది. పాత ప్రపంచం వినాశనము కూడా అవ్వనే అవ్వాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఉదయము ఉదయమే లేచి శరీరము నుండి అతీతమయ్యే డ్రిల్లు చేయాలి. పాత ప్రపంచము, పాత శరీరము ఏదీ గుర్తుకు రాకూడదు. అన్నీ మర్చిపోయి ఉండాలి.

2. సంగమ యుగములో పాపాత్మలతో ఇచ్చి-పుచ్చుకోవడం చేయరాదు. కర్మల లెక్కాచారాన్ని సంతోషంగా చుక్తా చేసుకోవాలి, విలపించరాదు. సర్వము తండ్రికి సమర్పించి నిమిత్తంగా అయి సంభాళించాలి.

వరదానము :-

'' ఏ విషయాన్ని అయినా కళ్యాణ భావనతో వినగలిగే, చూడగలిగే పరదర్శన ముక్త్‌ భవ ''

సంఘటన (సమూహము) ఎంత పెరుగుతూ ఉంటుందో, మాటలు (సమస్యలు) కూడా అంత పెద్దవిగా అవుతాయి. కానీ మీరు చూచినా చూడకుండా, విన్నా వినకుండా ఉన్నప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు. మీరు మీ స్వచింతనలో ఉండండి. స్వచింతన చేసే ఆత్మలు పరదర్శన నుండి ముక్తులుగా అవుతారు. ఒకవేళ ఏ కారణంగా అయినా వినవలసి వస్తే స్వయాన్ని బాధ్యులుగా భావిస్తే మొదట మీ బ్రేకును శక్తిశాలిగా చేసుకోండి. చూచారు, విన్నారు, వీలైనంత కళ్యాణము చేసి ఫుల్‌స్టాప్‌ పెట్టండి.

స్లోగన్‌ :-

'' తమ తృప్తికరమైన, సుందరమైన జీవనము ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాధారులు. ''