23-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతియాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది. నష్టము నుండి లాభములోకి వస్తారు, విశ్వాధిపతులుగా అవుతారు.''
ప్రశ్న :-
సత్యమైన సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది (సత్ కా సంగ్ తారే, కుసంగ్ బోరే) - దీని అర్థమేమి ?
జవాబు :-
పిల్లలైన మీకు సత్యమైన సాంగత్యము అనగా తండ్రి సాంగత్యము లభించినప్పుడు మీరు ఉన్నతి చెందే కళలోకి వస్తారు. రావణుని సాంగత్యము చెడ్డది, అతని సాంగత్యము ద్వారా మీరు క్రిందికి దిగజారుతారు అనగా రావణుడు మిమ్ములను ముంచేస్తాడు, తండ్రి తీరానికిి చేరుస్తాడు. క్షణములోనే మీకు సద్గతి లభించే విధంగా తండ్రి తమ సాంగత్యము ద్వారా అద్భుతము చేస్తారు. అందువల్లనే వారిని జాదూగర్(ఇంద్రజాలికుడు) అని కూడా అంటారు.
ఓంశాంతి.
పిల్లలు స్మృతిలో కూర్చుని ఉన్నారు దీనినే స్మృతియాత్ర అని అంటారు. యోగము అనే పదమును ఉపయోగించవద్దని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి. వారు సర్వాత్మలకు తండ్రి, పరమపిత, పతితపావనుడు. ఆ పతితపావనుడినే స్మృతి చేయాలి. దేహ సంబంధములన్నీ వదిలి తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచము మరణించినట్లే...........(ఆప్ ముయే మర్ గయీ దునియా........) అని అంటారు కదా. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్మృతి చేయకండి. తండ్రి ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలన్నీ కాలిపోతాయి. మీరు జన్మ-జన్మల నుండి పాపాత్మలుగా ఉన్నారు కదా. ఇది పాపాత్మల ప్రపంచము. సత్యయుగము పుణ్యాత్మల ప్రపంచము. ఇప్పుడు పాపాలన్నీ సమాప్తమై పుణ్యమును ఎలా జమ చేసుకోవాలి? తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జమ అవుతుంది. ఆత్మలో మనస్సు-బుద్ధి ఉన్నాయి కదా. కావున ఆత్మ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. మీకున్న బంధు-మిత్రులందరినీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. వారందరూ పరస్పరము ఒకరికొకరు దు:ఖమునిస్తారు. కామ ఖడ్గమును ఉపయోగించడం మొదటి పాపము, రెండవ పాపము ఏది? సర్వులకు సద్గతిదాత అయిన తండ్రి పిల్లలకు బేహద్ సుఖమునిస్తారు అనగా స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. అలాంటి తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పాఠశాల. మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మినారాయణులుగా తయారవ్వడమే మీ లక్ష్యము-ఉద్ధేశ్యము. మరెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మనమిప్పుడు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని మీకు తెలుసు. మనమే విశ్వానికి అధికారులుగా ఉండేవారము. పూర్తిగా 5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. దేవీదేవతలు విశ్వానికి అధికారులు కదా. ఎంత ఉన్నతమైన పదవి! వారిని ఇంత గొప్పగా తయారు చేసింది తండ్రియే. ఆ తండ్రినే పరమాత్మ అని అంటారు, వారి వాస్తవిక నామము 'శివ'. వారికి చాలా పేర్లు పెట్టేశారు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరముంది అనగా వారు ముళ్ల అడవిని పూలతోటగా తయారు చేసేవారు. లేకుంటే వారి వాస్తవిక పేరు ఒక్క 'శివుడే.' ఇతనిలో ప్రవేశించినా, వారికి శివ అనే పేరే ఉంటుంది. మీరు ఈ బ్రహ్మను స్మృతి చేయరాదు. ఇతను దేహధారి. మీరు విదేహిని స్మృతి చేయాలి. మీ ఆత్మలు పతితంగా అయ్యాయి, ఇప్పుడు వాటిని పావనంగా చేయాలి. మహాన్ ఆత్మ, పాపాత్మ అని కూడా అంటారు. మహాన్ పరమాత్మ అని అనరు. స్వయాన్ని పరమాత్మ లేక ఈశ్వరుడని కూడా ఎవ్వరూ అనలేరు. మహాన్ ఆత్మ, పవిత్ర ఆత్మ అని కూడా అంటారు. సన్యాసులు సన్యసిస్తారు, అందువలన పవిత్రాత్మలుగా ఉంటారు. వారందరు కూడా పునర్జన్మలు తీసుకుంటారని తండ్రి తెలియజేస్తున్నారు. దేహధారులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. వికారాల ద్వారా జన్మించి పెరిగి పెద్దవారై యుక్త వయస్కులైనప్పుడు సన్యసిస్తారు. దేవతలైతే ఇలా చేయరు. వారు సదా పవిత్రంగా ఉంటారు. అసురులుగా ఉన్న మిమ్ములను ఇప్పుడు తండ్రి దేవతలుగా చేస్తారు. దైవీ గుణాలు ధారణ చేయడం ద్వారా దైవీ సంప్రదాయస్థులుగా అవుతారు. సత్యయుగంలో దైవీ సంప్రదాయస్థులు ఉంటారు. కలియుగములో ఆసురీ(అసురుల) సంప్రదాయస్థులు ఉంటారు. ఇప్పుడిది సంగమ యుగము. మీకిప్పుడు తండ్రి లభించారు, మళ్లీ మీరిప్పుడు దైవీ సంప్రదాయస్థులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. దైవీ సంప్రదాయస్థులుగా అయ్యేందుకే మీరిక్కడకు వచ్చారు. దైవీ సంప్రదాయస్థులకు అపారమైన సుఖముంటుంది. దీనిని హింసాయుత ప్రపంచమని అంటారు, దేవతలు అహింసకులుగా ఉంటారు.
తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, తండ్రిని స్మృతి చేయండి. మీకున్న గురువులందరూ దేహధారులే. ఆత్మలైన మీరిప్పుడు తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయాలి. మీరు పుణ్యాత్మలుగా అయినప్పుడు సుఖము లభిస్తుంది. 84 జన్మల తర్వాతనే మీరు పాపాత్మలుగా అవుతారు. మీరిప్పుడు పుణ్యమును జమ చేసుకుంటున్నారు. యోగబలము ద్వారా పాపాలను సమాప్తము చేసుకుంటారు. ఈ స్మృతియాత్ర ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు. మీరు విశ్వధికారులుగా ఉండేవారనుట సత్యమే కదా. మరి వారు ఎక్కడకు వెళ్లారో ఇది కూడా తండ్రియే తెలుపుతారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు, సూర్యవంశీ చంద్రవంశీయులుగా అయ్యారు. భక్తి ఫలితమును భగవంతుడు ఇస్తారని కూడా అంటారు. ఏ దేహధారినీ భగవంతుడు అని అనరు. వారు నిరాకారుడైన శివుడు. వారి శివరాత్రిని జరుపుకుంటారు కనుక తప్పకుండా వస్తారు కదా. కాని మీరు తీసుకున్న విధంగా జన్మ తీసుకోను, నేను శరీరమును అప్పుగా తీసుకోవలసి వస్తుందని చెప్తున్నారు. నాకు నా శరీరము లేదు. ఒకవేళ ఉంటే దానికి ఒక పేరు ఉండేది. ఇతనికి బ్రహ్మ అను పేరు ఉంది. వీరు సన్యసించినప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టాను. మీరు బ్రహ్మకుమార-కుమారీలు. బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు! బ్రహ్మ శివుని పుత్రుడు. శివబాబా తన పుత్రుడైన బ్రహ్మలో ప్రవేశించి మీకు జ్ఞానము ఇస్తున్నారు. బ్రహ్మ-విష్ణు-శంకరులు కూడా వీరి సంతానమే. నిరాకారులైన తండ్రి పిల్లలందరూ నిరాకారులే. ఆత్మలు ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాయి. పతితులను పావనంగా తయారు చేసేందుకే నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. నేను ఈ శరీరమును అప్పుగా తీసుకుంటాను. శివ భగవానువాచ కదా. కృష్ణుడినైతే భగవంతుడని అనజాలరు. భగవంతుడైతే ఒక్కరే. కృష్ణుని మహిమ భిన్నంగా ఉంటుంది. మొదటి నెంబరు దేవతలు రాధా-కృష్ణులు. వారి స్వయంవరము జరిగిన తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, కాని ఇది ఎవ్వరికీ తెలియదు. రాధా-కృష్ణుల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కాని వారు ఎక్కడకు వెళ్ళిపోతారు? రాధా-కృష్ణులే స్వయంవరము తర్వాత మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇరువురు వేరు వేరు మహారాజుల పిల్లలు. అక్కడ అపవిత్రత పేరే ఉండదు. ఎందుకంటే అక్కడ పంచ వికారాల రావణుడే ఉండడు, అక్కడ ఉండేదే రామరాజ్యము. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమౌతాయని ఆత్మలకు తండ్రి ఇప్పుడు తెలియజేస్తున్నారు. మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. నష్టము వాటిల్లింది కావున మళ్లీ జమ చేసుకోవాలి. భగవంతుడిని వ్యాపారి అని కూడా అంటారు. వారితో అరుదుగా ఎవరో ఒకరు వ్యాపారము చేస్తారు. వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు, వారు అద్భుతము చేస్తారు. వారు ప్రపంచానికంతటికి సద్గతినిస్తారు. అందరికి ముక్తి-జీవన్ముక్తిని ఇస్తారు. ఇంద్రజాలపు ఆట కదా. మానవులు మానవులకు ఇవ్వలేరు. మీరు 63 జన్మల నుండి భక్తి చేస్తూ వచ్చారు. ఈ భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా? సద్గతినిచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరికీ సాధ్యము కాదు. ఒక్కరు కూడా వాపస్ వెళ్లలేరు. అనంతమైన తండ్రియే వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు. కలియుగములో అనేకమంది రాజులున్నారు. అక్కడ మీరు కొద్దిమందే రాజ్య పాలన చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములోకి వెళ్లిపోతాయి. మీరు ముక్తిధామము ద్వారా జీవన్ముక్తికి వెళ్తారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆత్మలైన మీకిప్పుడు ఈ సృష్టిచక్రము యొక్క రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల దర్శనమయ్యింది. ఈ జ్ఞానము ద్వారా మీరే నరుని నుండి నారాయణునిగా అవుతారు. దేవతల రాజధాని స్థాపన జరిగిన తర్వాత మీకు జ్ఞానము అవసరముండదు. భగవంతుడు భక్తులకు అర్ధకల్పము వరకు సుఖమును ఫలితంగా ఇచ్చారు, తర్వాత మళ్లీ రావణరాజ్యములో దు:ఖము ప్రారంభమవుతుంది. నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతారు. సత్యయుగములో ఒక రోజు గడిచినా మెట్లు దిగినట్లే. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు, తర్వాత మెట్లు దిగుతూనే ఉంటారు. క్షణ క్షణము టిక్-టిక్ అని గడిచిపోతూనే ఉంటుంది. క్రిందికి దిగుతూనే ఉంటారు. సమయము గడిచిపోతూ గడిచిపోతూ ఈ స్థానములోకి వచ్చి చేరుకున్నారు. అక్కడ కూడా ఈ విధంగానే క్షణాలు గడుస్తూ ఉంటాయి. మనము ఒకేసారి మెట్లు ఎక్కేస్తాము. తర్వాత మళ్లీ పెేను వలె మెల్లగా దిగాల్సిందే.
తండ్రి చెెప్తున్నారు - నేను అందరికి సద్గతినిచ్చేవాడను. మానవులు మానవులకు సద్గతినివ్వలేరు. ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు, పతితులు. వాస్తవానికి కృష్ణుడినే సత్యమైన మహాత్మ అని అనగలరు. ఇక్కడ మహాత్ములుగా ఉండినా వికారాల ద్వారా జన్మించి తర్వాత సన్యసిస్తారు. వారైతే దేవతలు. దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు. వారిలో ఏ వికారమూ ఉండదు. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. దీనిని వికారి ప్రపంచమని అంటారు, పవిత్రత లేదు. నడవడిక ఎంత చెడుగా ఉంది! దేవతల నడవడికలైతే చాలా బాగుంటాయి. అందరూ వారికి నమస్కరిస్తారు. వారి గుణాలు చాలా మంచివి. అందుకే అపవిత్రమైన మానవులు పవిత్రమైన దేవతల ఎదుట వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. ఇప్పుడైతే ఎన్ని విధాలుగా జగడాలు - కొట్లాటలు జరుగుతున్నాయి! చాలా గలాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఉండేందుకు కూడా జాగా లేదు. మానవులు జనాభా తగ్గిపోవాలని కోరుతారు. కానీ ఈ కర్తవ్యము తండ్రిదే. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఇంతమంది శరీరాలన్నీ కాలిపోతాయి. మిగిలిన ఆత్మలన్నీ తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి. తప్పకుండా నెంబరువారుగా శిక్షలను అనుభవిస్తారు. పూర్తిగా పురుషార్థము చేసి విజయమాలలో మణిగా తయారైనవారు శిక్షల నుండి విడుదలైపోతారు. మాల ఒక్కరిదే ఉండదు. అలా వారిని తయారు చేసినవారు పుష్పము(బాబా). తర్వాత జంట పూసలు, ఇది ప్రవృత్తి మార్గము కదా. కావున జంటల మాల. సింగల్(ఒంటరి) మాల ఉండదు. సన్యాసులకు మాల ఉండదు. వారు నివృత్తి మార్గములోని వారు. వారు ప్రవృత్తి మార్గములోని వారికి జ్ఞానమును ఇవ్వలేరు. పవిత్రంగా అయ్యేందుకు వారు హద్దు సన్యాసము చేస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు తండ్రి మీకు రాజయోగమును నేర్పిస్తారు. తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు. మీరు అర్ధకల్పము వరకు సుఖముగా రాజ్యమును పరిపాలిస్తారు. తర్వాత రావణ రాజ్యములో మెల్ల మెల్లగా దు:ఖితులైపోతారు. దీనిని సుఖ-దు:ఖముల ఆట అని అంటారు. పాండవులైన మీకు విజయమును కలుగజేస్తారు. మీరు ఇప్పుడు మార్గదర్శకులు. ఇంటికి వెళ్లే యాత్ర చేయిస్తారు. ఆ యాత్రలనైతే మనుష్యులు జన్మ-జన్మల నుండి చేస్తూ వచ్చారు. మీరిప్పుడు ఇంటికి వెళ్లే యాత్ర చేస్తున్నారు. తండ్రి వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులకు మార్గమును తెలుపుతారు. మీరు జీవన్ముక్తికి, మిగిలిన వారందరూ ముక్తికి వెళ్లిపోతారు. హాహాకారాల తర్వాత మళ్లీ జయ జయ ధ్వనులు జరుగుతాయి. ఇప్పుడు కలియుగము అంతిమ సమయము. ఆపదలైతే చాలా రానున్నాయి. ఆ సమయములో మీరు స్మృతియాత్రలో ఉండలేరు. ఎందుకంటే చాలా గలాటాలు జరుగుతాయి. అందువలన ఇప్పుడు స్మృతియాత్రను పెంచుకుంటూ ఉంటే పాపము భస్మమైపోతుంది మరియు సంపాదనను జమ కూడా చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. సతోప్రధానంగా అవ్వండి. నేను కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములో వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇది బ్రాహ్మణుల చాలా చిన్న యుగము. బ్రాహ్మణులకు చిహ్నముగా శిఖ ఉంటుంది. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియలు, వైశ్యులు, శూద్రులు - ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణులది చాలా చిన్న కులము, ఇంత చిన్న యుగములో తండ్రి వచ్చి మిమ్ములను చదివిస్తారు. పిల్లలైన మీరు విద్యార్థులుగా కూడా ఉన్నారు, అనుచరులుగా కూడా ఉన్నారు. ఒక్కరివారిగానే ఉన్నారు. ఈ తండ్రి వలె, శిక్షణ ఇచ్చే టీచరుగా, సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమును ఇచ్చి తనతో పాటు తీసుకెళ్ళేవారిగా ఏ మనిషీ ఉండడు. ఈ విషయాలు మీరిప్పుడే అర్థం చేసుకున్నారు. సత్యయుగములో కూడా మొట్టమొదట వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. తండ్రిని సర్వుల సద్గతిదాత అని అంటారు. ఓ పతితపావనా! తండ్రీ! రండి అని తండ్రిని పిలుస్తారు. మరొకవైపు పరమాత్మ కుక్కలో, పిల్లిలో, రాయి-రప్పలలో అన్నిటిలో ఉన్నారని అంటారు. బేహద్ తండ్రికి అపకారము చేస్తారు. విశ్వాధికారులుగా చేసే తండ్రిని అవమానిస్తారు. దీనినే రావణుని సాంగత్య దోషము అని అంటారు. సత్యమైన సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది. రావణరాజ్యము ప్రారంభమైనప్పుడు మీరు క్రిందపడుట మొదలవుతుంది. తండ్రి వచ్చి మిమ్ములను ఉన్నతి చెందే కళకు చేర్పుతారు. తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా చేస్తారు కావున అందరికి మేలు జరుగుతుంది. ఇప్పుడైతే అందరూ ఇక్కడే ఉన్నారు. మిగిలినవారు కూడా వస్తూ ఉంటారు. నిరాకార ప్రపంచము నుండి ఆత్మలంతా వచ్చునంత వరకు మీరు పరీక్షలో కూడా నంబరువారుగా పాస్ అవుతూ ఉంటారు. దీనిని ఆత్మిక కళాశాల(కాలేజి) అని అంటారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను చదివించేందుకు వస్తారు. రావణ రాజ్యంలో శరీరాన్ని వదిలి అపవిత్రమైన రాజులుగా అవుతారు మరియు పవిత్రమైన దేవతల ఎదుట తల వంచి నమస్కరిస్తారు. పతితంగా లేక పావనంగా ఆత్మయే అవుతుంది. ఆత్మ పతితమైతే శరీరము కూడా పతితమైనదే లభిస్తుంది. సత్యమైన బంగారులో మలినము కలిస్తే ఆభరణాలు కూడా మలినయుక్తంగా అవుతాయి. ఇప్పుడు ఆత్మలోని మచ్చను(మలినము) ఎలా తొలగించాలి? యోగాగ్ని కావాలి. దీని ద్వారా మీరు చేసిన వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలలో వెండి, రాగి, ఇనుము కలిశాయి. ఇదే మచ్చ లేక మలినము. ఆత్మ సత్యమైన బంగారము. ఇప్పుడు అసత్యంగా అయ్యింది. ఇప్పుడు ఆ మలినము ఎలా తొలగిపోవాలి? ఇది యోగాగ్ని, జ్ఞానచితి పైన కూర్చున్నారు. ఇంతకు ముందు కామచితి పై కూర్చుని ఉండేవారు. తండ్రి జ్ఞానచితి పై కూర్చోపెడ్తారు. జ్ఞానసాగరులైన తండ్రి తప్ప మరెవ్వరూ జ్ఞానచితి పై కూర్చోపెట్టలేరు. భక్తిమార్గములో మనుష్యులు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ ఎవ్వరి గురించీ తెలియదు. మీరిప్పుడు అందరి గురించి తెలుసుకున్నారు. మీరందరూ దేవతలుగా అవుతారు. తర్వాత పూజ చేయడమే సమాప్తమైపోతుంది. రావణరాజ్యము ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని పూసగా తయారయ్యే పురుషార్థము చేయాలి, ఆత్మిక మార్గదర్శకులై అందరితో శాంతిధామమైన ఇంటికి యాత్ర చేయించాలి.
2. స్మృతియాత్రను పెంచుకుంటూ పెంచుకుంటూ పాపాలన్నిటి నుండి ముక్తులుగా అవ్వాలి. యోగాగ్ని ద్వారా ఆత్మను సత్యమైన బంగారుగా చేసుకోవాలి, సతోప్రధానంగా అవ్వాలి.
వరదానము :-
'' ప్రతి కర్మలో తండ్రితో భిన్న - భిన్న సంబంధాల ద్వారా స్మృతి స్వరూపులుగా అయ్యే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ ''
మొత్తం రోజంతా చేసే ప్రతి కర్మలో ఒకప్పుడు భగవంతుని 'సఖ లేక సఖి' రూపాన్ని, ఒకప్పుడు 'జీవన సాథీ' రూపాన్ని ఒకప్పుడు ముద్దు బిడ్డ రూపాన్ని, ఎప్పుడైనా వ్యాకులత చెందినప్పుడు సర్వ శక్తివాన్ స్వరూపము ద్వారా మాస్టర్ సర్వశక్తివాన్ స్మృతి స్వరూపాన్ని ఎమర్జ్ చేస్తే మనసు సంతోషపడ్తుంది. అంతేకాక స్వతహాగా తండ్రి తోడు అనుభవం చేస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణ జీవితము సదా అమూల్యమైనదిగా, శ్రేష్ఠ భాగ్యవంతమైనదిగా అనుభవమవుతూ ఉంటుంది.
స్లోగన్ :-
'' బ్రహ్మాబాబా సమానంగా అవ్వడమనగా సంపూర్ణతా గమ్యానికి చేరుకొనుట. ''