08-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - నేను సదా శబ్ధానికి అతీతంగా ఉంటాను. పిల్లలైన మిమ్ములను కూడా ఉపరాంగా(అతీతంగా) చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మీ అందరిదీ వానప్రస్థ అవస్థ, ఇప్పుడు శబ్ధము నుండి దూరంగా ఇంటికి వెళ్లాలి ''

ప్రశ్న :-

మంచి పురుషార్థము చేసే విద్యార్థి అని ఎవరిని అంటారు? వారి ముఖ్యమైన గుర్తులు వినిపించండి ?

జవాబు :-

1. వారికి స్వయంతో స్వయం మాట్లాడుకోవడం తెలుసు. సూక్ష్మంగా అధ్యయనము చేస్తారు. 2. పురుషార్థము చేసే విద్యార్థి సదా తనంతకు తాను '' నాలో ఏ ఆసురీ స్వభావము లేదు కదా! '' అని చెక్‌ చేసుకుంటూ ఉంటాడు. 3. దైవీ గుణాలు నాలో ఎంతవరకు ధారణ చేశాను? 4. నాలో సోదర దృష్టి సదా ఉందా? అని రిజిస్టరు ఉంచుకుంటాడు. 5. వికారీ ఆలోచనలు రావడము లేదు కదా? ఈ విధంగా పరిశీలన చేసుకొను వారే మంచి పురుషార్థము చేసే విద్యార్థులు.

ఓంశాంతి.

శబ్ధము నుండి దూరంగా వెళ్లేందుకు అనగా ఇంటికి వెళ్లేందుకు పురుషార్థము చేసే ఆత్మిక పిల్లలకు బాబా చెప్తున్నారు - అది ఆత్మలందరి ఇల్లు. మనమిప్పుడు ఈ శరీరాలను వదిలి ఆ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. మిమ్ములను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. అందుకే ఈ దేహము, దేహ సంబంధములన్నిటి నుండి అతీతంగా అవ్వాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచము. ఇప్పుడు వెళ్ళాలని కూడా ఆత్మలకు తెలుసు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మళ్లీ మనము పావన ప్రపంచానికి వెళ్ళాలి. ఈ విధంగా లోలోపల విచార సాగర మథనము జరుగుతూ ఉండాలి. ఇతరులెవ్వరికీ ఇటువంటి ఆలోచనలు రావు. మనము స్వయం మనస్ఫూర్తిగా ఈ శరీరాన్ని వదలి ఇంటికి వెళ్లి మళ్లీ నూతన ప్రపంచములో నూతన సంబంధములోకి వస్తామని మీకు తెలుసు. ఈ స్మృతి కూడా చాలా కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొదలైనవారందరూ ఇంటికి వెళ్లి మళ్లీ నూతన ప్రపంచములో పవిత్ర సంబంధములోకి రావాలని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని పదే పదే మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. ఎవరు చేస్తారో వారే వెంట వస్తారు. ఎవరైతే ఇప్పుడు ఈశ్వరార్థము చేస్తారో, వారే నూతన ప్రపంచములో పదమాపదమ్‌ పతులుగా అవుతారు. వారు ఈ పాత ప్రపంచములో అపరోక్షంగా చేస్తారు. ఈశ్వరుడు ఇందుకు ప్రతిఫలము ఇస్తారని భావిస్తారు. వారికి అల్పకాలిక క్షణభంగుర సుఖము లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మీకు సలహా ఇస్తున్నాను - ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తారో అది మీకు 21 జన్మలకు పదమారెట్లుగా అయ్యి లభిస్తుంది. గొప్ప ఇంటిలో జన్మ తీసుకుంటామని, నారాయణునిగా లేక లక్ష్మీగా అవుతామని మీరు భావిస్తారు. మరి అంత శ్రమ చేయాలి కదా! మనము ఈ పాత ఛీ-ఛీ ప్రపంచము నుండి వెళ్లేందుకు తయారవుతున్నాము. ఈ పాత ప్రపంచాన్ని, ఈ పాత శరీరాన్ని వదలాలి. చివరిలో ఎవరూ గుర్తు రానంతగా తయారవ్వాలి. ఒకవేళ పాత ప్రపంచము బంధు-మిత్రులు మొదలైనవారు స్మృతిలోకి వస్తే మీ గతి ఏమౌతుంది? అంతిమ సమయములో ఎవరు స్త్రీని స్మృతి చేస్తారో........ అని అంటారు కదా! కావున తండ్రిని అనుసరించాలి. బాబా వృద్ధుడు అందుకే శరీరాన్ని వదిలే తీరాలని భావిస్తున్నారని మీరు అనుకోకండి. వారొక్కరే కాదు మీరందరూ వృద్ధులే. అందరిదీ వానప్రస్థ అవస్థనే. అందరూ వాపస్‌ ఇంటికి వెళ్ళే తీరాలి. కావున తండ్రి చెప్తున్నారు - ఈ పాత ప్రపంచము నుండి మీ బుద్ధి యోగమును తొలగించండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లాలి. ఆ తర్వాత అచ్చట ఎంత కాలము ఉండాలో అంతకాలము ఉంటారు. పాత్ర ఎంత చివర్లో ఉంటుందో అంత ఆలస్యంగా శరీరమును ధరించి పాత్ర చేస్తారు. కొంతమంది వంద సంవత్సరాలు తక్కువ 5 వేల సంవత్సరాలు(4900) కూడా శాంతిధామములోనే ఉంటారు. చివరిలో వస్తారు. ఎలాగైతే కాశీకల్వట్‌లో పడే వారి పాపాలన్నీ వెంటనే సమాప్తమైపోతాయో అలా చివర్లో వచ్చే వారిలో పాపాలు ఏముంటాయి! వస్తారు వెంటనే వెళ్లిపోతారు. అంతేకాని సంపూర్ణ మోక్షము ఎవ్వరికీ లభించదు. అచ్చట ఉండి ఏం చేస్తారు? పాత్ర తప్పకుండా అభినయించే తీరాలి. మొదటి నుంచి వచ్చే పాత్ర మీది. కావున తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉండండి. ఇప్పుడు వెళ్లిపోవాలి, 84 జన్మలు పాత్ర పూర్తి అయ్యింది. మీరు పతితులైపోయారు. ఇప్పుడు మళ్లీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దైవీగుణాలు కూడా ధారణ చేయండి.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. మాలో ఏ ఆసురీ స్వభావము లేదు కదా! అని చెక్‌ చేసుకుంటూ ఉండండి. మీది దైవీ స్వభావంగా ఉండాలి. దాని కొరకు చార్టు ఉంచితే పక్కాగా అవుతూ ఉంటారు. కాని మాయ చార్టు పెట్టనివ్వదు. 2-4 రోజులు వ్రాసి మళ్లీ వదిలేస్తారు. ఎందుకంటే అదృష్టములో లేదు. అదృష్టములో ఉంటే రిజిస్టరు చాలా బాగా ఉంచుకుంటారు. పాఠశాలలో రిజిష్టర్‌ తప్పకుండా ఉంచుతారు. ఇచ్చట కూడా అన్ని సేవాస్థానాలలో అందరి చార్టును, రిజిస్టర్‌ను ఉంచాలి. ప్రతి రోజూ వెళ్తున్నామా? దైవీ గుణాలు ధారణ చేస్తున్నామా? అని చూసుకోవాలి. సోదర-సోదరీ సంబంధము కంటే ఉన్నతంగా వెళ్లాలి. కేవలం ఆత్మిక దృష్టి సోదర దృష్టి ఉండాలి. మనమందరమూ ఆత్మలము. వికారి దృష్టి ఏ మాత్రము ఉండరాదు. ఎందుకంటే మీరు బ్రహ్మకుమార-కుమారీలు ఒకే తండ్రి పిల్లలు, ఈ సంగమ యుగములోనే మీ సంబంధము సోదర-సోదరీలది. కావున వికారి దృష్టి సమాప్తమైపోవాలి. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. శబ్ధము నుండి కూడా అతీతంగా వెళ్లాలి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇది అత్యంత సూక్ష్మమైన అధ్యయనము. ఇందులో శబ్ధము చేసే అవసరము లేదు. పిల్లలకు అర్థం చేయించేందుకు శబ్ధములోకి రావలసి వచ్చింది. శబ్ధము నుండి దూరంగా వెళ్లాలని కూడా అర్థం చేయించవలసి వచ్చింది. ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్లాలి. బాబా మీరు వచ్చి వెంట తీసుకెళ్లండి, మేము పతితులము వాపస్‌ వెళ్లలేమని తండ్రిని పిలిచారు. పతిత ప్రపంచములో పావనవంగా ఎవరు చేస్తారు? సాధువులు - సన్యాసులు మొదలైనవారెవ్వరూ పావనంగా చెయ్యలేరు. పావనంగా అయ్యేందుకు వారే గంగా స్నానము చేస్తూ ఉంటారు. తండ్రిని గురించి వారికి తెలియదు. కల్పక్రితము తెలుసుకున్నవారే ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. ఈ పురుషార్థము కూడా తండ్రి తప్ప మరెవ్వరూ చేయించలేరు. అందరికంటే ఉన్నతమైన తండ్రియే వారు. అటువంటి తండ్రిని రాయి-రప్పల్లో ఉన్నారని అన్నందున మనుష్యుల గతి ఏమయ్యిందో చూడండి! మెట్లు దిగుతూనే వచ్చారు. సంపూర్ణ నిర్వికారులైన వారెక్కడ, సంపూర్ణ వికారీలైన వీరెక్కడ? ఈ విషయాలు కల్పక్రితము ఒప్పుకున్నవారే ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు. ఎవరు వచ్చినా వారికి తండ్రి ఆజ్ఞను తెలుపుట మీ కర్తవ్యము. మెట్ల(సీఢీ) చిత్రమును చూపించి అందరికీ అర్థం చేయించండి. ఇప్పుడందరిదీ వానప్రస్థ అవస్థ. అందరూ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్లిపోతారు. బుద్ధి యోగబలము ద్వారా సంపూర్ణ పవిత్రమైనవారు మాత్రమే సుఖధామానికి పోతారు. భారతదేశపు ప్రాచీన యోగము కూడా మహిమ చేయబడింది. మనము మొట్టమొదటే వచ్చామని ఆత్మలైన మనకు గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్లాలి. మీకు మీ పాత్ర గుర్తుకొస్తుంది. ఈ కులానికి చెందినవారు కాకుంటే వారికి పవిత్రంగా అవ్వాలని కూడా గుర్తుండదు. పవిత్రంగా అయ్యేందుకే శ్రమ చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే వికర్మాజీత్‌లు అవుతారని, సోదర-సోదరీలమని భావిస్తే దృష్టి మారిపోతుందని తండ్రి చెప్తున్నారు. సత్యయుగములో చెడు(వికారి) దృష్టి ఉండదు. పిల్లలూ, మేము సత్యయుగీ దేవతలమా లేక కలియుగములోని మానవులమా? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి అని తండ్రి తెలుపుతున్నారు. పిల్లలైన మీరు మంచి-మంచి చిత్రాలు, మంచి-మంచి స్లోగన్‌లు మొదలైనవి తయారు చేయాలి. మీలో ఎవరైనా ఒకరు సత్యయుగానికి చెందినవారా? లేక కలియుగానికి చెందినవారా? అని ప్రశ్నించాలి. అదే విధంగా మరొకరు రెండవ ప్రశ్న అడగాలి. ఈ విధంగా అన్ని వైపులా సందడి చేసి ఆడంబరము చేయండి.

పతితులను పావనంగా తయారు చేసేందుకు బాబా శ్రీమతమునిస్తున్నారు. ఇతర వ్యాపారాలు మొదలైనవాటి గురించి నాకేం తెలుసు? మానవులను దేవతలుగా తయారు చేసేందుకే కదా తండ్రిని పిలిచారు. నేను వచ్చి ఆ మార్గమునే తెలుపుతాను. ఎంతో సాధారణ(సింపుల్‌) విషయము. సూచన కూడా చాలా సహజమైనది ''మన్మనాభవ''. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. అర్థము చేసుకోనందున గంగను పతితపావనిగా భావించారు. పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు అందరి కయామత్‌(వినాశ) సమయము. లెక్కాచారాలన్నీ చుక్తా చేయించి వాపస్‌ తీసుకెళ్తారు. తండ్రి అర్థం చేయించినప్పుడు అర్థము చేసుకుంటారు. కాని అదృష్టములో లేకుంటే క్రింద పడిపోతారు. తండ్రి చెప్తున్నారు - సోదర - సోదరీలము అని భావించండి. ఎప్పుడూ చెడు దృష్టి వెళ్లదు. కొంతమందికి కామ భూతము, కొంతమందికి లోభ భూతము వచ్చేస్తుంది. మంచి రుచికరమైన భోజనము చూస్తూనే తినాలని ఆసక్తి కలుగుతుంది. శనగలు అమ్మేవారిని చూస్తూనే మనసు తినాలని అనుకుంటుంది. అలా తింటే కచ్ఛా అయినందున త్వరగా దాని ప్రభావము పడ్తుంది. బుద్ధ్ది భ్రష్టమైపోతుంది. తల్లి-తండ్రి అనన్య పిల్లలు, ఎవరికైతే సర్టిఫికెట్‌ లభిస్తుందో వారిని అనుసరించాలి. యజ్ఞములో లభించిన దానిని మధురాతి మధురమైనదని భావించి భుజించాలి. నాలుక తినాలని ఆశ పడరాదు. యోగము కూడా ఉండాలి. యోగము లేకుంటే ఫలానా వస్తువు తినాలని తినకపోతే రోగగ్రస్థులుగా అవుతామని అంటారు. మనము దేవతలుగా అయ్యేందుకు వచ్చామని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనము ఇంటికి వాపస్‌ వెళ్లాలి. మళ్లీ చిన్న పిల్లలుగా అయ్యి తల్లి ఒడిలోకి వస్తాము. తల్లి ఆహార పానీయాల ప్రభావము శిశువు పై కూడా పడుతంది. అచ్చట ఈ విషయాలేవీ ఉండవు. అచ్చట అన్ని వస్తువులు ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి. మన కొరకు మన తల్లి కూడా మంచి ఫస్ట్‌క్లాస్‌ వస్తువులే భుజిస్తుంది. వాటి సారమే మన కడుపులోకి వస్తుంది. అచ్చట లభించేవన్నీ ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి. జన్మించినప్పటి నుండి ఆహార-పానీయాలన్నీ చాలా శుద్ధంగా ఉంటాయి. కావున అటువంటి స్వర్గములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకావాలి కదా! తండ్రిని స్మృతి చేయాలి.

తండ్రి వచ్చి రిజ్యువనేట్‌(తిరిగి బాల్యావస్థను, సతోప్రధానతను కలుగజేయడం) చేస్తారు. సైన్స్‌వారు కోతులలోని కొన్ని గ్రంథులను మనుష్యులలో ప్రవేశపెడ్తారు. దీని ద్వారా వారు యువకులుగా అయిపోతామని భావిస్తారు. ఎలా ఆపరేషన్‌ ద్వారా పాత గుండెను తీసి, కొత్త గుండెను వేస్తారో అలా తండ్రి వేరే గుండె వేయరు. తండ్రి వచ్చి పరివర్తన చేస్తారు. మిగిలినవన్నీ సైన్స్‌ మాత్రమే. దీని ద్వారా బాంబులు మొదలైనవి తయారుచేస్తారు. ఇవి ప్రపంచాన్నే వినాశనము చేసే వస్తువులు. తమోప్రధానమైన బుద్ధి కదా. ఇది కూడా భవిష్యత్తు భాగ్యమని వారు ఆనందపడ్తారు. బాంబులు తప్పకుండా తయారుచేయవలసిందే. కడుపు నుండి ముసలము వెలువడినట్లు తర్వాత వినాశనము జరిగినట్లు శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. ఇవన్నీ భక్తిమార్గములోని విషయాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేనే రాజయోగమును నేర్పించాను. వింటూ వింటూ ఇటువంటి పరిస్థితి అయ్యిందని అదొక కథ వలె తయారయ్యింది. ఇప్పుడు తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను, మూడవ నేత్రము(తీజరి) కథను, అమరనాథ కథను వినిపిస్తున్నారు. ఈ చదువు ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు. అంతేకాని స్వదర్శన చక్రముతో అందరినీ చంపారని శాస్త్రాలలో చెప్పినట్లుగా కృష్ణుడు మొదలైనవారు ఉండరు. నేను కేవలం రాజయోగమును నేర్పించి మిమ్ములను పావనంగా చేస్తాను. వారు కృష్ణునికి చక్రము మొదలైనవి చూపించారు. స్వదర్శన చక్రము ఏ విధంగా త్రిప్పుతారు? ఇందులో గారడి ఏదీ లేదు. ఇవన్నీ నిందలు కదా. ఇది మళ్లీ అర్ధకల్పము నడుస్తుంది. ఎంత అద్భుతమైన నాటకము. ఇప్పుడు చిన్నవారైనా, పెద్దవారైనా అందరిదీ వానప్రస్థ అవస్థ. ఇప్పుడు మనము వెళ్లాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి. ఇంకేవీ గుర్తు రాకూడదు. అలాంటి అవస్థ ఉన్నప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలరు. నా రిజిస్టర్‌ ఎంతవరకు బాగుంది? అని మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి. వీరు రోజూ చదువుతారా, లేదా? అనేది రిజిస్టర్‌ ద్వారా తెలుస్తుంది. కొందరు అసత్యము కూడా చెప్పేస్తారు. సత్యమునే చెప్పమని తండ్రి అంటారు. చెప్పకపోతే మీ రిజిస్టరే చెడిపోతుంది. భగవంతునితో మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి, ప్రతిజ్ఞ పైన నిలువకపోతే మీ గతి ఏమవుతుంది? వికారాలలో పడిపోయారంటే ఆట సమాప్తమైపోతుంది. మొదటి నెంబరు శత్రువు దేహాభిమానము తర్వాత కామము, క్రోధము. దేహాభిమానములోకి రావడం నుండే వృత్తి చెడిపోతుంది. అందుకే 'దేహీ - అభిమాని భవ' అని తండ్రి చెప్తున్నారు. అర్జునుడు కూడా ఇతడే కదా. అది కృష్ణుని ఆత్మయే. అర్జునుడు అనే పేరేదీ లేదు. పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మ మరో శరీరములో ప్రవేశించినప్పుడు పేరు మారుతుంది. ఈ వృక్షము మొదలైనవన్నీ మీ కల్పన అని మనుష్యులు అంటారు. మనుష్యులు ఏది కల్పన చేస్తారో అది కనిపిస్తుంది. ఇప్పుడు మేము వెళ్లి స్వర్గములో చిన్న బాలునిగా అవుతామని పిల్లలైన మీకు చాలా సంతోషము కలగాలి. తర్వాత నామ, రూప, దేశ, కాలములన్నీ కొత్తవి ఉంటాయి. ఇది అనంతమైన నాటకము. తయారు చేయబడి తయారవుతున్న డ్రామా. జరగాల్సే ఉన్నప్పుడు ఇక మనము ఎందుకు చింతించాలి? ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా రహస్యము ఉంది. ఇది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ప్రపంచములో ఈ సమయములో అందరూ పూజారులే. పూజారులున్న చోట ఒక్కరు కూడా పూజ్యులు ఉండరు. పూజ్యులు సత్య, త్రేతా యుగాలలో ఉంటారు. కలియుగములో పూజారులు ఉన్నారు. మరి మీరు మిమ్ములను పూజ్యులని ఎలా చెప్పుకుంటారు? పూజ్యులైతే దేవీ దేవతలే, మనుష్యులు పూజారులు. పావనంగా తయారవ్వాలంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయమనే ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. డ్రామా అనుసారము ఎవరు ఎంత పురుషార్థము చేశారో వారు అంతే చేస్త్తారు అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ చదువును తెలిపే రిజిస్టరును ఉంచుకోవాలి. మాకు సోదర-సోదర దృష్టి ఎంతవరకు ఉంటుంది? నా స్వభావము దైవీ స్వభావంగా తయారయ్యిందా? అని తమ చార్టును పరిశీలించుకోవాలి.

2. తమ నాలుక పై చాలా నియంత్రణ ఉంచుకోవాలి. మేము దేవతలుగా తయారవుతున్నాము. అందువల్ల ఆహార-పానీయాల పై చాలా గమనముంచుకోవాలని బుద్ధిలో ఉండాలి. నాలుక చంచలము కారాదు. మాత-పితలను అనుసరించాలి.

వరదానము :-

''ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావించి సదా ఎవర్‌రెడీగా ఉండే తీవ్ర పురుషార్థీ భవ''

మీ అంతిమ ఘడియ ఏదో నమ్మకంగా ఎవ్వరూ చెప్పలేరు. అందువలన ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావించి ఎవర్‌రెడీగా ఉండండి. ఎవర్‌రెడీ అంటే తీవ్ర పురుషార్థులు. ఇప్పుడింకా వినాశనమయ్యేందుకు కొంత సమయం పడ్తుందని, అప్పటికి తయారైపోతామని భావించకండి. అలా కాదు. ప్రతి ఘడియ అంతిమ ఘడియయే. అందువలన సదా నిర్మోహులుగా, నిర్వికల్పముగా, నిర్వ్యర్థంగా...... అవ్వండి. అప్పుడు ఎవర్‌రెడీ అని అంటారు. ఏ కార్యము మిగిలి ఉన్నా, మీ స్థితి సదా ఉపరాంగా ఉండాలి. అంతా మంచే జరుగుతుంది.

స్లోగన్‌ :-

''మీ చేతికి చట్టాన్ని తీసుకోవడం కూడా క్రోధము యొక్క అంశమే''