02-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - యదార్థమైన డ్రామా జ్ఞానము ద్వారానే మీరు అచంచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండగలరు, మాయావీ తుఫానులు మిమ్ములను కదిలించలేవు. ''

ప్రశ్న :-

దేవతలలో ఉన్న ముఖ్యమైన ఏ గుణము పిల్లలైన మీలో సదా కనిపించాలి ?

జవాబు :-

హర్షితంగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు. అలాగే పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి. ఏమి జరిగినా చిరునవ్వుతో ఉండండి. ఎప్పుడూ ఉదాసీనత లేక కోపము రాకూడదు. తండ్రి ఎలాగైతే తప్పొప్పుల జ్ఞానమునిస్తారో, ఎప్పుడూ కోపపడరో, ఉదాసీనంగా అవ్వరో, అలాగే మీరు కూడా ఉదాసీనులుగా అవ్వరాదు.

ఓంశాంతి.

అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. లౌకిక తండ్రి ఇలా అనరు. వారికైతే 5-6 మంది పిల్లలుండవచ్చు. ఇప్పుడున్న ఆత్మలందరూ పరస్పరములో సోదరులు. వారందరికీ తండ్రి తప్పకుండా ఉంటారు. మనమంతా సోదరులమని కూడా అంటారు. వచ్చినవారికి కూడా మనమంతా సోదరులమని చెప్తారు. డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు, దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది తెలియకపోవడము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, దానిని తండ్రే వచ్చి వినిపిస్తున్నారు. కథలు మొదలైనవి కూర్చుని వినిపించునప్పుడు ''పరమపిత పరమాత్మాయ నమ: '' అని అంటారు. అయితే ఆ పరమాత్మ ఎవరో తెలియదు. బ్రహ్మ దేవతాయ నమ: విష్ణు దేవతాయ నమ: శంకర దేవతాయ నమ: అని అంటారు కానీ అర్థము చేసుకొని చెప్పరు. వాస్తవంగా బ్రహ్మను దేవత అని అనరాదు, విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలియదు. విష్ణు దేవత అనేది సరియైనది. శంకరునికి అయితే ఏ పాత్రా లేదు. వారికి స్వీయ చరిత్ర (బయోగ్రఫిలదీఱశీస్త్రతీaజూష్ట్రవ) లేదు, శివబాబాకైతే స్వీయచరిత్ర ఉంది. వారు పతితులను పావనంగా చేసేందుకు, నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. ఇప్పుడు ఒకే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన, సర్వ ధర్మాల వినాశనము జరుగుతుంది. అందరూ ఎక్కడికెళ్తారు? శాంతిధామానికి వెళ్తారు. అందరి శరీరాలు వినాశనమవుతాయి. కొత్త ప్రపంచములో కేవలం మీరు మాత్రమే ఉంటారు. ముఖ్యమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకున్నారు. అన్నిటి పేర్లు అయితే చెప్పలేము. చిన్న చిన్న కొమ్మలు రెమ్మలైతే చాలా ఉన్నాయి. మొట్టమొదటిది దేవతా ధర్మము(డీటీయిజమ్‌లణవఱ్‌వఱరఎ), తర్వాత ఇస్లామ్‌ ధర్మము. ఈ విషయాలన్నీ మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ప్రాయ: లోపమయ్యింది. కాబట్టి మఱ్ఱి చెట్టును ఉదాహరణంగా ఇస్తారు. వృక్షమంతా నిలబడి ఉంది, కానీ పునాది(కాండము) లేనే లేదు. అన్నింటికంటే ఎక్కువ ఆయువు ఈ మఱ్ఱి చెట్టుకే ఉంటుంది. ఇందులో ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అన్నిటికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. అది ప్రాయ: లోపమైనప్పుడు తండ్రి వచ్చి ఇప్పుడు ఏక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము అవ్వాలని చెప్తారు, అందుకు త్రిమూర్తులను కూడా తయారుచేశారు కానీ అర్థము తెలుసుకోరు. అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు, తర్వాత బ్రహ్మ-విష్ణు-శంకరులు, తర్వాత సృష్టి పైకి వస్తే దేవీదేవతా ధర్మము తప్ప మరొకటి లేదు. భక్తిమార్గము కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మొదట శివుని భక్తి చేస్తారు, తర్వాత దేవతల భక్తి చేస్తారు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయమే. మిగిలిన వారికి తమ తమ ధర్మాలు, మఠాలు, మార్గాలు ఎప్పుడు స్థాపన అవుతాయో తెలుసు. మేము పురాతనమైనవారమని ఆర్యులు చెప్తారు కదా. వాస్తవానికి ఆది సనాతన దేవీదేవతా ధర్మము అన్నింటికంటే పురాతనమైనది. మీరు వృక్షము గురించి ఇతరులకు అర్థము చేయించునప్పుడు మన ధర్మము ఫలానా సమయములో వస్తుందని స్వయం వారే అర్థం చేసుకుంటారు. అందరికి అనాది అవినాశిగా ఏ పాత్ర అయితే లభించిందో ఆ పాత్ర చేయాలి, ఇందులో ఎవ్వరి దోషమూ లేక ఎవరి తప్పూ లేదు. ఇందులో కేవలం పాపాత్మలుగా ఎందుకు అయ్యారనే విషయాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. మనమంతా అనంతమైన తండ్రికి పిల్లలమైనప్పుడు, పరస్పరము సోదరులము కదా, సత్యయుగములో అందరూ ఎందుకు లేరు? అని మనుష్యులు అడుగుతారు కానీ డ్రామాలో వారి పాత్రయే లేదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇందులో నిశ్చయముంచుకోండి అని చెప్పండి. వేరే విషయాలు చెప్పకండి. చక్రము కూడా ఎలా తిరుగుతూ ఉందో చూపించారు. కల్పవృక్ష చిత్రము కూడా ఉంది. కానీ దీని ఆయువు ఎంతో ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎవ్వరినీ నిందించరు. మీరెంత పావనంగా ఉండేవారో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు కాబట్టి ఓ పతితపావనా రండి! అని పిలుస్తారు. మొదట మీరందరూ పావనంగా అవ్వాలి. మళ్లీ నంబరువారుగా పాత్ర చేసేందుకు రావాలి. ఆత్మలన్నీ పైన ఉంటాయి. తండ్రి కూడా పైన ఉంటారు, వారిని 'రండి' అని మళ్లీ పిలుస్తారు. కానీ అలా పిలిచినంత మాత్రాన వారు రారు. నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడి ఉందని తండ్రి చెప్తున్నారు. ఎలాగైతే హద్దు డ్రామాలో కూడా పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో, అలా ఇది బేహద్‌(అనంతమైన) డ్రామా. అందరూ డ్రామా బంధనములో బంధితులై ఉన్నారు. దీని అర్థము దారాలలో బంధింపబడి ఉన్నారని కాదు. అది జడమైన వృక్షము, ఒకవేళ బీజము చైతన్యమైనదైతే ఈ వృక్షమెలా పెరిగి ఫలములెలా ఇస్తుందో తెలిసి ఉంటుంది. వీరు మానవ సృష్టి రూపి వృక్షానికి చైతన్య బీజము, దీనిని ఉల్టా(తలక్రిందులుగా ఉన్న) వృక్షము అని అంటారు. తండ్రి అయితే జ్ఞానసాగరులు. వారికి వృక్షమంతటి జ్ఞానము పూర్తిగా ఉంది. ఇది అదే గీతా జ్ఞానము. కొత్త విషయమేమీ కాదు. ఇక్కడ బాబా ఏ శ్లోకము మొదలైన వాటిని ఉచ్ఛరించరు. వారు గ్రంథము చదివి తర్వాత అర్థమును తెలియజేస్తారు. ఇది చదువు, ఇందులో శ్లోకాలు మొదలైనవాటి అవసరము లేదని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ శాస్త్రాల చదువులో ఏ లక్ష్యము-ఉద్ధేశ్యము(ఎయిమ్‌ ఆబ్జెక్టులూఱఎ డ ూపయవష్‌) ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని కూడా అంటారు. ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది. సన్యాసులది హద్దు వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. శంకరాచార్యులు వచ్చినప్పుడు గృహస్థము నుండి వైరాగ్యము పొందడం నేర్పిస్తారు. ప్రారంభములో వారు కూడా శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు. చాలా వృద్ధి చెంది శాస్త్రాలను తయారుచేయడం ప్రారంభిస్తారు. మొట్టమొదట ధర్మస్థాపన చేయువారు ఒక్కరే ఉంటారు, తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇది కూడా అర్థము చేసుకోవాలి. సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మముండేది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది, దానిని స్వర్గము(హెవన్‌లనవaఙవఅ) అని అంటారు. పిల్లలైన మీరు రచయిత - రచనలను తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అవుతారు. నాస్తికులుగా ఉంటే ఎంత దు:ఖము అనుభవించవలసి వస్తుంది, అనాథలైపోతారు, పరస్పరములో జగడాలాడుతూ పోట్లాడుకుంటూ ఉంటారు. మీరు పరస్పరములో ఎప్పుడూ కొట్లాడుతూ ఉంటారు, మిమ్ములను అడిగే నాథుడే లేరా? అని అంటారు కదా. ఈ సమయములో అందరూ అనాథలైపోతారు. నూతన ప్రపంచములో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి, అపారమైన సుఖముండేది. ఇక్కడ అపారమైన దు:ఖముంది. అది సత్యయుగము, ఇది కలియుగము, మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగము ఒక్కటే ఉంటుంది. సత్య-త్రేతా యుగాల సంగమాన్ని పురుషోత్తమ సంగమమని అనరు. ఇక్కడ అసురులున్నారు, అక్కడ దేవతలుంటారు. ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు. రావణుని తల పై గాడిద తలను చూపిస్తారు. గాడిదను ఎంత శుభ్రంగా చేసి దాని పైన బట్టలనుంచినా, మళ్లీ గాడిద మట్టిలో పడుకుని వస్త్ర్రాలను పాడు చేస్తుంది. మీ వస్త్ర్రాలను తీసుకొచ్చి స్వచ్ఛంగా పుష్పాల వలె తయారు చేస్తారు, మళ్లీ రావణ రాజ్యములో పొర్లాడి అపవిత్రంగా అవుతారు. ఆత్మ మరియు శరీరము రెండూ అపవిత్రమవుతాయి. మొత్తం అలంకారమంతటినీ పోగొట్టినారని తండ్రి అంటున్నారు. తండ్రిని పతితపావనుడని అంటారు. ఒకప్పుడు మనము బంగారు యుగములో ఎంతగా అలంకరించబడి ఉండేవారము, ఎంత మంచి రాజ్య భాగ్యముండేది, మళ్లీ మాయ రూపి ధూళిలో పొర్లాడి మలినమైనామని నిండు సభలో కూడా చెప్పవచ్చు.

ఇది అంధకారమైన నగరమని(అంధేరీ నగరి) తండ్రి చెప్తున్నారు. భగవంతుని సర్వవ్యాపి అని చెప్పేశారు. ఏమి జరిగిందో అది మళ్లీ పునరావృతము అవుతూ ఉంటుంది. ఇందులో తికమక చెందే అవసరము లేదు. 5 వేల సంవత్సరాలలో ఎన్ని నిముషాలు, గంటలు, సెకన్లున్నాయి? అని ఒక పుత్రుడు అన్ని ధర్మాలవారి గురించి లెక్కించి పంపించాడు. ఇందులో కూడా బుద్ధి వ్యర్థమవుతుంది. ప్రపంచమెలా నడుస్తోందో బాబా అలాగే అర్థం చేయిస్తారు.

ప్రజాపిత బ్రహ్మ గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌, వారి కర్తవ్యాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. విరాట రూపములో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేశారు. తండ్రి మరియు బ్రహ్మ గురించి యదార్థంగా తెలియదు. వారిని ఆదిదేవుడని కూడా అంటారు. నేను ఈ వృక్షానికి చైతన్య బీజరూపుడను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఉల్టా(తలక్రిందుల) వృక్షము. తండ్రి ఎవరైతే సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులో వారినే మహిమ చేస్తారు. ఆత్మ లేకపోతే అటు-ఇటు కూడా నడవలేదు. గర్భములో కూడా 5-6 నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది. ఆత్మ వెళ్లిపోతే అంతా సమాప్తం. ఆత్మ అవినాశి, అది పాత్ర చేస్తుందని తండ్రి వచ్చి అవగాహన చేయిస్తారు. ఆత్మ అయిన ఇంత చిన్న బిందువులో అవినాశి పాత్ర నిండి ఉంది. పరమపిత కూడా ఆత్మయే, వారిని జ్ఞానసాగరులని అంటారు. వారే ఆత్మ గురించి అనుభవము చేయిస్తారు. వారు కేవలం పరమపిత సర్వశక్తివంతులు, వెయ్యి సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారని చెప్తారు, కానీ ఏమీ అర్థము చేసుకోరు. అవన్నీ భక్తి మార్గములో వర్ణించబడినవని, శాస్త్రాలలో లిఖించారని బాబా చెప్తున్నారు. అర్జునునికి సాక్షాత్కారము అయినప్పుడు నేనింత తేజస్సును సహించలేకున్నానని అంటాడు. కాబట్టి ఆ విషయము మానవుల బుద్ధిలో కూర్చుండిపోయింది. ఇంకా తేజోమయము ఎవరిలోనైనా ప్రవేశిస్తే పగిలిపోతారు. జ్ఞానము లేదు కాబట్టి పరమాత్మ వేయి సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారు, మాకు సాక్షాత్కారము అవ్వాలని కోరుకుంటారు. భక్తి భావము కూర్చుని ఉంది కనుక వారికి సాక్షాత్కారము కూడా అవుతుంది. ప్రారంభములో మీ వద్ద కూడా చాలామందికి సాక్షాత్కారమయ్యేవారు, కళ్ళు ఎర్రగా అవుతూ ఉండేవి. సాక్షాత్కారమైనవారు ఈ రోజు ఎక్కడున్నారు? అవన్నీ భక్తిమార్గములోని విషయాలు. ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో నిందించే విషయమేదీ లేదు. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. నన్ను ఎంత నిందించినా(తిట్టినా) నేనేం చేశాను? నాకు కోపమేమైనా వస్తుందా? డ్రామానుసారంగా వీరందరూ భక్తిమార్గములో చిక్కుకుని ఉన్నారని భావిస్తాను. కోపపడే మాటే లేదు. డ్రామా ఈ విధంగా తయారయ్యింది. ప్రేమగా అర్థం చేయించాల్సి వస్తుంది. పాపం వారు అజ్ఞాన అంధకారములో ఉన్నారు, అర్థము చేసుకోరు. కాబట్టి జాలి కూడా కలుగుతుంది. సదా చిరునవ్వుతూ ఉండాలి. వీరంతా స్వర్గ ద్వారానికి రాలేరు, మీరంతా శాంతిధామానికి వెళ్లేవారు. అందరూ శాంతినే కోరుకుంటారు కాబట్టి తండ్రియే సత్యాన్ని(నిజాన్ని) అర్థం చేయిస్తారు. ఈ ఆట తయారు చేయబడిందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. డ్రామాలో ప్రతి ఒక్కరికీ పాత్ర లభించింది. ఇందులో చాలా అచంచలమైన, స్థిరమైన బుద్ధి ఉండాలి. ఎంతవరకు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి ఉండదో అంతవరకు పురుషార్థమెలా చేస్తారు. ఏమైనా జరగనీ, భలే తుఫానులు వచ్చినా స్థిరంగా ఉండాలి. మాయావి తుఫానులైతే చాలా వస్తాయి, చివరి వరకు వస్తూనే ఉంటాయి. స్థితి దృఢంగా ఉండాలి. ఇది గుప్తమైన శ్రమ. చాలామంది పిల్లలు పురుషార్థము చేసి తుఫానులను ప్రక్కకు తోసేస్తూ పారద్రోలుతూ ఉంటారు. ఎవరెంత ఉత్తీర్ణులవుతారో అంత ఉన్నత పదవి పొందుతారు. రాజధానిలో చాలా పదవులుంటాయి కదా.

అన్నింటికంటే త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్ష చిత్రాలు బాగున్నాయి. ఇవి ప్రారంభములో తయారయ్యాయి. సర్వీసు కొరకు విదేశాలకు కూడా ఈ రెండు చిత్రాలు తీసుకెళ్లాలి. వారు వీటిని బాగా అర్థము చేసుకోగలరు. నెమ్మది నెమ్మదిగా ఈ చిత్రాలు వస్త్రాల పై ఉండాలని బాబా కోరుకుంటారు, అది కూడా జరుగుతుంది. ఇది ఎలా స్థాపన అవుతూ ఉందో మీరు అర్థం చేయిస్తారు. ఇది అర్థం చేసుకుంటే మీరు కూడా మీ ధర్మములో ఉన్నత పదవి పొందుతారు, క్రైస్తవ ధర్మములో మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే దీనిని బాగా అర్థము చేసుకోండని మీరు వాళ్ళకు చెప్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ పురుషోత్తమ సంగమ యుగములో పవిత్రంగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడూ మాయా ధూళిలో పొర్లాడి అలంకారాన్ని పాడు చేసుకోరాదు.

2. ఈ డ్రామాను యదార్థంగా అర్థం చేసుకొని తమ స్థితిని అచంచలంగా, అడోలంగా, స్థిరంగా చేసుకోవాలి. ఎప్పుడూ తికమకపడరాదు. సదా హర్షితంగా ఉండాలి.

వరదానము :-

'' సంకల్పము, మాట మరియు కర్మల వ్యర్థమును సమర్థంగా పరివర్తన చేసే హోలీహంస భవ ''

హోలీహంసలంటే సంకల్పము, మాట, కర్మలలోని వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేసేవారు. ఎందుకంటే వ్యర్థము రాయి వంటిది. రాయికి ఏ విలువా లేదు. రత్నానికి విలువ ఉంటుంది. హోలీ హంస వెంటనే ఇది పనికిరాని వస్తువని, ఇది పనికి వచ్చేదని గుర్తిస్తుంది. కర్మలు చేస్తూ కేవలం 'మేము నాలెడ్జ్‌ఫుల్‌ రాజయోగీ ఆత్మలము, రూలింగ్‌ పవర్‌, కంట్రోలింగ్‌ పవర్‌ కలిగిన వారమని' స్మృతిలో ఉండాలి. అప్పుడా కర్మలు వ్యర్థంగా ఉండవు. ఈ స్మృతి హోలీహంసలుగా చేస్తుంది.

స్లోగన్‌ :-

'' ఎవరైతే స్వయాన్ని ఈ దేహమనే గృహంలో అతిథిగా (మెహమాన్‌గా) భావిస్తారో , వారే నిర్మోహులుగా ఉండగలరు. ''