25-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - '' బాబా మిమ్ములను ఎలా అలంకరిస్తున్నారో, అలా మీరు కూడా ఇతరులను అలంకరించాలి, రోజంతా సేవ చేయండి. ఎవరు వస్తే వారికి చింతించవలసిన విషయమేదీ లేదు అని అర్థం చేయించండి.''

ప్రశ్న :-

ఈ జ్ఞానము కోట్ల మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు లేక ధారణ చేస్తారు - అలా ఎందుకు ?

జవాబు :-

ఎందుకంటే మీరు అన్నీ క్రొత్త విషయాలనే వినిపిస్తారు. పరమాత్మ ఒక బిందువు వలె ఉన్నారని మీరు అంటారు, అది విని వారు తికమకపడ్తారు. శాస్త్రాలలో ఈ విషయాలేవీ విననే వినలేదు. ఇంత సమయము వారు చేసిన భక్తి ఏదైతే ఉందో, అది వారిని లాగుతూ ఉంటుంది. అందుకే త్వరగా అర్థం చేసుకోరు. బాబా! మేము విశ్వానికి అధిపతులుగా తప్పకుండా అవుతామనే, దీపము పై బలి అయ్యే దీపపు పురుగుల వంటి వారు కూడా కొందరు వెలువడ్తారు. మాకు ఇంత మంచి తండ్రి లభించారు, అటువంటి తండ్రిని మేము ఎలా వదలగలము! వారిలో తమ సర్వస్వము తండ్రికి అర్పణ చేసే భావన ఉప్పొంగుతూ ఉంటుంది.

పాట :-

దూరదేశపు వాసి....................... (దూరదేశ్‌ కా రహనేవాలా.........................)   

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తాము యాత్రికులమని, ఇది మన దేశము కాదని బాగా తెలుసు. ఇది ఈ అనంతమైన నాటకమునకు చాలా పెద్ద రంగ స్థలము. ఎంత పెెద్ద పెద్ద లైట్లు ఉన్నాయో చూడండి! అవి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. మనమంతా నటులమని, నెంబరువారుగా మన పాత్ర అనుసారముగా ఖచ్చితమైన సమయానికి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తామని ఆత్మకు తెలుసు. మొట్టమొదట మీరు వాపస్‌ ఇంటికి వెళ్ళి మళ్లీ ఇక్కడకు వస్తారు. ఇది బాగా అర్థం చేసుకొని, ధారణ చేయవలసిన విషయము. నాటకంలో నటులుగా ఉంటూ, పరస్పరం ఒకరి పాత్రను మరొకరు తెలుసుకోకపోతే వారిని ఏమంటారు? డ్రామా ఆది-మధ్య-అంత్యాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా (లక్ష్మీ నారాయణులుగా) అవుతారు. కావున ఈ చదువు అన్నిటికంటే భిన్నమైనది. తండ్రి బీజరూపులు, జ్ఞాన సాగరులు. ఉదాహరణానికి ఆ సాధారణ బీజము, వృక్షముల గురించి తెలుసు కదా. అందులో మొదట చిన్న చిన్న ఆకులు వెలువడ్తాయి. ఆ తర్వాత పెద్దగా పెరుగుతూ పెరుగుతూ వృక్షము ఎంత వృద్ధి పొందుతుందో దానికెంత సమయం పడుతుందో మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి అయితే ఒక్కసారి మాత్రమే వస్తారు. మధురాతి మధురమైన పిల్లలూ! ఇది అనాది అవినాశి డ్రామా. తండ్రి స్వర్గ రచయిత. వారిని హెవిన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. స్వర్గ స్థాపన చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది. దూరదేశపు నివాసి పరాయి దేశంలోకి వచ్చారు,.......... అన్న గాయనము కూడా ఉంది. ఈ రావణరాజ్యము పరాయి దేశము. రావణరాజ్యంలోకి రాముడు రావలసి ఉంటుంది. మీ బుద్ధిలో మాత్రమే ఈ జ్ఞానముంది. కావున మీరందరూ యాత్రికులని తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. మీరందరూ కలిసి పాత్రాభినయము చేసేందుకు ఒకేసారి రారు. మొట్టమొదట దేవతలుంటారని ఆ సమయంలో ఇంకెవ్వరూ ఉండరని మీకు తెలుసు. అప్పుడు చాలా కొద్దిమందే ఉంటారు. ఆ తర్వాత వృద్ధి చెందుతారు. ఆత్మలైన మీరు శరీరాలను వదలి అందరూ అక్కడకు వస్తారు. ఈ విషయాలను గురించిన జ్ఞానమును తండ్ర్రియే ఇచ్చారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము లభించింది. మనకు బీజము మరియు వృక్షము ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. బీజము పైన ఉంది, క్రింద మొత్తం వృక్షమంతా వ్యాపించి ఉంది, ఇప్పుడు వృక్షము పూర్తిగా శిథిలావస్థలో ఉంది, పిల్లలైన మీరు ఈ వృక్షముల ఆదిమధ్యాంతములను తెలుసుకున్నారు. మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతములను గూర్చి తెలుసా? అని అంతకుముందు ఋషులు-మునులను అడిగితే, వారు నేతి-నేతి(తెలియదు, తెలియదు) అని అనేవారు. మరి వారికే తెలియనప్పుడు ఇది పరంపరగా ఎలా రాగలదు? ఈ విషయాలన్నీ బాగా ధారణ చేయాలి. మర్చిపోరాదు. ఈ చదువునైతే చదవాల్సిందే, చదువు మరియు యోగశక్తి ద్వారానే మీరు పదవిని పొందుతారు. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రి తప్ప ఇంకెవ్వరూ పవిత్రంగా తయారు చేయలేరు. వినాశీ ధనాన్ని దానం చేస్తే రాజుల కులములో లేక మంచి కులములో జన్మ తీసుకుంటారు. పిల్లలైన మీకు చాలా గొప్ప ఇంట్లో జన్మ లభిస్తుంది. కొత్త ప్రపంచమైతే చాలా చిన్నదిగా ఉంటుంది. సత్యయుగములో దేవతల నివాసము ఒక చిన్న గ్రామము వలె ఉంటుంది. ప్రారంభములో బొంబాయి ఎంతో చిన్నదిగా ఉండేది. ఇప్పుడు అది ఎంతగా వృద్ధి చెందిందో చూడండి! ఆత్మలందరూ తమ - తమ పాత్రలు అభినయిస్తారు. అందరూ యాత్రికులే. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చే యాత్రికుడు. మీరు కూడా ఒకేసారి వస్తారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాత్రను అభినయిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్ళేందుకు అమరకథను వింటారు. దాని ద్వారా 21జన్మలు ఉన్నత పదవిని పొందుతారు. 21 తరాలు అని అంటారు కదా! తరము అనగా వృద్ధాప్యము వరకు. తర్వాత ఇంకొక శరీరాన్ని తమకు తామే తీసుకుంటారు. అకాల మృత్యువులు ఉండవు. అది అమరలోకము. అక్కడ మృత్యువు అన్న మాటే ఉండదు, ఉన్నట్లుండి (అకస్మాత్తుగా) మృత్యువు రాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. దు:ఖపడే విషయమేదీ ఉండదు. సర్పానికి తన కుబుసాన్ని వదిలేటప్పుడు ఏమైనా దు:ఖముంటుందా? దానికి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీకు ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. బుద్ధి ఆత్మలోనే ఉంది. శరీరము పూర్తిగా వేరు. అందులో ఆత్మ లేకపోతే శరీరము నడవజాలదు. శరీరము ఎలా తయారవుతుంది? ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది? ఈ విషయాలన్నీ అద్భుతమైనవి.

తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! మీ స్వర్గం చాలా అద్భుతమైన ప్రపంచము. రావణ రాజ్యంలో 7 అద్భుతాలను చూపిస్తారు. రామరాజ్యంలో అద్భుతము ఒక్కటే, అది స్వర్గము. అది అర్ధకల్పము స్థిరంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూడకున్నా అందరి నోటి నుండి స్వర్గము అన్న పేరు తప్పకుండా వెలువడ్తుంది. ఇప్పుడు మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. కొందరు సాక్షాత్కారములో కూడా చూశారు. బాబా కూడా వినాశనాన్ని, తమ రాజధానిని చూశారు. అర్జునునికి కూడా సాక్షాత్కారములో చూపించారు. ఇప్పుడు ఇది తప్పకుండా ఆ గీతా అధ్యాయమే(గీతా ఎపిసోడ్‌). బాబా తెలుపుతున్నారు - '' పిల్లలూ, ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఈ సమయంలో నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మరియు ఇంత ఉన్నతంగా తయారు చేస్తాను.'' ప్రపంచంలో ఈ విషయాలను గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక్కడ మనుష్యులు మరణిస్తే ఆ ఆత్మకు అంధకారం ఉండరాదని దీపాన్ని వెలిగిస్తారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. సత్యయుగములో అందరి దీపాలు వెలిగి ఉంటాయి. ఇంటింటిలో వెలుగు ఉంటుంది. ఇక్కడ మనుష్యులు ప్రతి ఇంటిలో లైట్లు వెలిగిస్తారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చేయాలని తండ్రి అంటారు. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ ఉండండి. ఇంత సమయము మేము రాజ్యపాలన చేశామని మీకు తెలుసు. ఎవరైతే చాలా కాలము విడిపోయి ఉన్నారో వారితోనే తండ్రి మాట్లాడ్తారు, చదివిస్తారు. ఈ సమయంలోని ఈ విషయాల గుర్తుగానే పండుగలు జరుపుతారని పిల్లలకు తెలుసు. శివజయంతిని భారతదేశంలోనే జరుపుతారు. శివుడు సర్వోన్నతుడైన భగవంతుడు. వారు భారతదేశంలోకి ఎలా వస్తారో వారే స్వయంగా తెలియజేశారు - నేను ప్రకృతి ఆధారమును తీసుకొని రావలసి ఉంటుంది. అప్పుడే నేను మాట్లాడగలను లేకపోతే పిల్లలకు నేను జ్ఞానముతో ఎలా అలంకరించాలి? ఇప్పుడు మీ అలంకారము జరుగుతోంది. తర్వాత మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే అలంకారము ఇతరులకు చేస్తున్నారు. ఇది చాలా సులభము. కాని మనుష్యుల బుద్ధి ఎంత డల్‌గా అయిపోయిందంటే వారు ఏమీ అర్థం చేసుకోరు. సమయం తీసుకుంటారు. మీరు ప్రదర్శనీలో అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఎవరు వచ్చినా ఎలా అర్థం చేయించినా అంతా డ్రామాయే. చింతించవలసిన విషయమేదీ లేదు. బాబా మేమెంతో కష్టపడ్తాము అయినా కోటికొక్కరు మాత్రమే వెలువడ్తారని పిల్లలంటారు. అలాగే జరుగుతుంది. మీరైతే పరమాత్మ బిందువు అని అంటారు కాని శాస్త్రాలలో అటువంటి విషయమేదీ లేదు. అందుకే తికమకపడ్తారు. మీరు కూడా మొదట అంగీకరించేవారు కాదు. కొందరికైతే అర్థం చేసుకునేందుకు రెండు సంవత్సరాలు కూడా పట్టింది, వెళ్ళిపోతారు మళ్లీ వస్తారు. భక్తి అంత సులభంగా వదలదు. అది తనవైపుకు ఆకర్షిస్తుంది. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. దీనిని గూర్చి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. విరాట రూపానికి కూడా అర్థము తెలిపించారు. అది మీ పిల్లి-మొగ్గల ఆట(పల్టీల ఆట) వంటిది. మీరు చక్రమును చుట్టి వస్తూ ఉంటారు. దీనిని విరాట నాటకము అని అంటారు. దీని జ్ఞానము కూడా మీకు ఉంది. ఆ కాలేేజీలలో అయితే ఏవేవో చదువుతూ ఉంటారు. ఇక్కడ ఆ విషయమేదీ లేదు. సైన్స్‌ వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని ద్వారా వినాశనం జరగనున్నది. ఇప్పుడు మీరు అర్థం చేయించినా ఇది చాలా మంచి విషయము అని అనేవారు ఏ ఒక్కరో ఉంటారు. దీనిని రోజూ అర్థం చేయించాలి. ఎంత పని ఉన్నా మేము బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని అంటారు. ఇది అపారమైన లెక్కలేనంత సంపాదన.

బాబా చెప్తున్నారు - '' పిల్లలూ! నా బుద్ధిలో మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది, దానిని ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు.'' తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది చాలా ఖచ్చితమైనది. ఇందులో ఒక సెకండు, మరొక సెకండుతో కలవదు. ఇందులో ఎంత సూక్ష్మము ఉంది! మీరు ఎన్నోసార్లు చక్రము చుట్టి వచ్చారు. ఈ డ్రామా ఒక పేను వలె మెల్లగా నడుస్తుంది. ఒక్క చక్రానికే 5 వేల సంవత్సరాలు పడ్తుంది, అందులోనే ఆటంతా నడుస్తుంది. దానినే తెలుసుకోవాలి. అక్కడ గోవులు కూడా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి. మీ పదవి ఎంత గొప్పగా ఉంటుందో మీ ఫర్నిచర్‌, భవనాలు చాలా వైభవోపేతంగా ఉంటాయి. సంతోషం కూడా ఆత్మకే కలుగుతుంది. నా ఆత్మ తృప్తి చెందిందని అంటారు. తృప్త పరమాత్మ అని అనడం జరగదు. మీ ఆత్మ తృప్తి చెందిందా? అనే అడుగుతారు. ''అవును బాబా తృప్తి చెందింది'' అని అంటారు. కావున ఈ ఆట అంతా నడుస్తూ వచ్చింది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది కూడా డ్రామా వంటిదే. ఇప్పుడు తండ్రి మిమ్ములను పునరుత్తేజితులుగా(బాల్యమును కలిగించుట/నూతనంగా మార్చుట) చేస్తారు. మీ శరీరము కల్పవృక్షము సమానంగా అయిపోతుంది. దాని పేరే అమరలోకము. ఆత్మ కూడా అమరమైనదే. దానిని మృత్యువు కబళించలేదు. బాబా మీ ఆత్మలతో మాట్లాడ్తారు. అకాల ఆత్మ ఏదైతే ఈ సింహాసనం పై కూర్చుందో దానితో వారు మాట్లాడ్తారు. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. ఆత్మలైన మనలను చదివించేందుకే తండ్రి వచ్చారు. తండ్రి దృష్టి ఎల్లప్పుడూ ఆత్మల పైనే ఉంటుంది. ఎల్లప్పుడూ సోదర దృష్టినే ఉంచండి అని బాబా మీకు కూడా అర్థం చేయిస్తారు. నేను సోదరునితో మాట్లాడుతున్నానని భావిస్తే క్రిమినల్‌(అశుద్ధ) దృష్టి వెళ్లజాలదు. ఈ అభ్యాసము చాలా బాగా ఉండాలి. మనము ఆత్మలము, మనము ఇన్ని జన్మలు తీసుకొని పాత్రను అభియించాము. మనం పుణ్యాత్మలుగా ఉండేవారము, మనమే పవిత్ర ఆత్మలుగా అయ్యాము. బంగారంలోనే మలినాలు కలుస్తాయి. ఏ ఆత్మలైతే చివరిలో వస్తాయో వాటిని ఏమంటారు? అందులో కొంత శాతమే బంగారము ఉంటుంది. భలే వారు పవిత్రంగా అయ్యి వెళ్ళినా వారిలో శక్తి తక్కువగానే ఉంది కదా. ఏదో ఒకటి - రెండు జన్మలు తీసుకున్నా అందులో ఏముంది?

బాబా మురళి ఏదైతే నడుపుతారో, అది ఖజానా. ఎప్పటివరకైతే తండ్రి ఇస్తూ ఉంటారో అప్పటివరకూ మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి ద్వారానే మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. కేవలం మౌనంగా కూర్చున్నా అందులో చాలా లాభముంది. మన్మనాభవ, దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే ప్రతి మాటకు అర్థమును వివరిస్తారు. ఇక్కడ అంతా అనర్థమే. ఒకరి పై ఒకరు కామ వికారమును జరపడమే అన్నింటికన్నా పెద్ద అనర్థము. దాని ద్వారా ఆదిమధ్యాంతాలు దు:ఖము పొందుతారు. అన్నింటికన్నా ఛీ-ఛీ హింస ఇదే. అందుకే దీనిని నరకము అని అంటారు. స్వర్గము మరియు నరకము యొక్క అర్థమును కూడా ఎవ్వరూ తెలుసుకోరు. స్వర్గము నెంబర్‌వన్‌ మరియు నరకము లాస్ట్‌ నంబర్‌. మనం ఈ విశ్వ నాటకములోని నటులమని మీకు తెలుసు. మీరు నేతి-నేతి అని అనరు. మీరు శ్రీమతము ద్వారా ఎన్నో మంచి చిత్రాలను తయారు చేస్తారు. వాటిని చూడగానే మనుష్యులు ఎంతో సంతోషిస్తారు. సహజంగానే అర్థం చేసుకుంటారు. ఈ చిత్రాలను తయారు చేయడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. చివరిలో మీరు స్మృతిలోనే ఉంటారు. సృష్టి చక్రము కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు మరియు పాత ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు? ఇవన్నీ మీకు మాత్రమే తెలుసు. సతో, రజో, తమోలలోకి అందరూ రావలసిందే. ఇప్పుడిది కలియుగము. తండ్రి వచ్చి మనలను స్వర్గాధిపతులుగా తయారుచేస్తారని ఎవ్వరికీ తెలియదు. అది ఎవరి ఆలోచనలోకి కూడా రాదు. ఇప్పుడు మీకు మొత్తం సృష్టి అంతటి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. రచయితైన తండ్రి ఇతనిలో కూర్చుని అర్థము చేయిస్తారు - నేను ఆత్మలైన మీ తండ్రిని. నేను అనంతమైన టీచరును. ఈ సంగమ యుగము పురుషోత్తమ యుగము, సత్యయుగాన్ని, కలియుగాన్ని పురుషోత్తమము అని అనరు. సంగమ యుగములోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. అప్పుడు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. రోజురోజుకు పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది, దీపము పై అర్పణ అయ్యేందుకు చాలా దీపపు పురుగులు వస్తాయి. ఇటువంటి తండ్రిని ఎవరు వదులుతారు! బాబా, మేము మీ వద్దనే కూర్చొని ఉంటాము. ఈ సర్వస్వమూ మీదే. ఇటువంటి ఉన్నతమైన తండ్రిని మేమెందుకు వదలాలని అంటారు. ఎంతోమందికి ఈ ఉత్సాహము వస్తుంది. బాబా ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. మరి మనం ఎందుకు వదిలి వెళ్లాలి? ఇక్కడ మనం స్వర్గంలో కూర్చొని ఉన్నాము. ఇక్కడకు మృత్యువు కూడా రాజాలదు. కాని తండ్రి శ్రీమతాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇలా చేయకూడదని తండ్రి అంటారు. ఉత్సాహమైతే వస్తుంది కాని డ్రామాలో అందరూ ఇక్కడే కూర్చుండి పోవడమనేది లేదు. ఉత్సాహము కలుగుతుంది ఎందుకంటే ఇదంతా అంతమైపోనున్నదని తెలుసు. ఎవరికైతే పాత్ర ఉంటుందో, వారు వింటూ ఉంటారు. మీరు ఎల్‌. ఎల్‌.బి, ఐ.సి.ఎస్‌ మొదలైనవి చదువుతారు కాని వాటి ద్వారా మీకు లభించిందేమిటి? రేపు శరీరము వదిలితే ఏం లభిస్తుంది? ఏమీ లభించదు. అది వినాశీ విద్య. ఇది అవినాశీ విద్య. దీనిని అవినాశి తండ్రియే ఇస్తారు. సమయం చాలా కొద్దిగా ఉంది. తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఈ జన్మలోనే అవ్వాలి. స్మృతి ద్వారానే అవుతారు. మిగిలిన దేహ ధర్మాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. శరీరము పై ఏ నమ్మకమూ లేదు. చదువుతూ చదువుతూ చనిపోతారు! అర్థం చేయించడం తండ్రి పని. ఆ చదువులో ఏ సంపాదన ఉంది? ఈ చదువులో ఏ సంపాదన ఉందో మీకు తెలుసు. శివబాబా భండారము ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. ఎంతోమంది పిల్లలు పాలన తీసుకుంటూ ఉంటారు. చింతించవలసిన విషయమేదీ లేదు. ఆకలితో చనిపోయేది లేదు. లౌకిక తండ్రి పిల్లలకు తిండి దొరకడం లేదు అని గమనిస్తే తాను స్వయం కూడా తినడు. పిల్లల దు:ఖమును తండ్రి సహించలేరు. మొదట పిల్లలు, ఆ తర్వాత తండ్రి, తల్లి అందరికన్నా చివరిలో తింటుంది, మిగిలిపోయిన రసహీనమైనది తింటుంది. మీ భండారి కూడా అటువంటిదే. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. భాయి-భాయి(సోదర) దృష్టిని పక్కా చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, సోదరుడైన ఆత్మతో మాట్లాడుతున్నానని అభ్యాసము చేస్తూ అశుద్ధమైన(క్రిమినల్‌) దృష్టిని పరివర్తన చేయాలి.

2. తండ్రి జ్ఞాన ఖజానాను ఇచ్చునపుడు స్మృతిలో కూర్చొని బుద్ధి రూపి జోలెలో ఖజానాను నింపుకోవాలి. మౌనంగా కూర్చొని అవినాశి సంపాదన జమ చేసుకోవాలి.

వరదానము :-

''త్రికాలదర్శి సీటు పై కూర్చొని(సెట్‌ అయ్యి) ప్రతి కర్మను చేసే శక్తిశాలి ఆత్మా భవ''

ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీటు పై సెట్‌ అయ్యి ప్రతి సమయంలో ప్రతి కర్మ చేస్తారో, వారికి మాటలైతే అనేకం వస్తాయి, జరుగుతాయి. స్వయం ద్వారా కాని, ఇతరుల ద్వారా కాని, మాయ లేక ప్రకృతి ద్వారా అన్ని విధాలైన పరిస్థితులైతే వస్తాయి. అవి రావాల్సిందే. కాని మీ స్వ స్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి లెక్కలోకే రాదు. కేవలం పని చేసేందుకు ముందు దాని ఆది-మధ్య-అంతము మూడు కాలాలను చెక్‌ చేసి అర్థము చేసుకున్న తర్వాత ఏ పనినైనా చేయండి. అలా చేస్తే శక్తిశాలురుగా అయ్యి, పరిస్థితులను దాటుకుంటారు.

స్లోగన్‌ :-

''సర్వశక్తి సంపన్నంగా, జ్ఞాన సంపన్నంగా అవ్వడమే సంగమయుగ ప్రాలబ్ధము.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఎలాగైతే బ్రహ్మబాబా విస్తారాన్ని సారములో ఇమిడ్చి స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నాడో, అలా సార స్వరూప స్థితిలో స్థితులై అనేక ఆత్మలలో సమయం మరియు తండ్రి పరిచయాలనే బీజము వేయండి. అలా చేస్తే ఆ బీజము యొక్క ఫలము చాలా మంచిగా, సహజంగా వెలువడ్తుంది.