19-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - పవిత్రతయే మీ అసలైన సంస్కారము. రావణుని సాంగత్యములోకి వచ్చి మీరు పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి.''

ప్రశ్న :-

అశాంతికి కారణమేది ? నివారణ ఏది ?

జవాబు :-

అశాంతికి అపవిత్రతయే కారణము. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచమును తయారు చేస్తాము, నిర్వికారి దృష్టిని(సివిల్‌ ఐ) ఉంచుకుంటాము, చెడు దృష్టి(క్రిమినల్‌ ఐ) ఉంచము అని తండ్రి అయిన భగవంతునితో ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే అశాంతి దూరమవ్వగలదు. మీరు శాంతిని స్థాపించేందుకు నిమిత్తంగా ఉన్న పిల్లలైన మీరు ఎప్పటికీ అశాంతిని వ్యాపింపజేయలేరు. మీరు శాంతిగా ఉండాలి. మాయకు బానిసగా అవ్వరాదు.

ఓంశాంతి.

తండ్రి కూర్చొని గీతా భగవానుడు గీతను వినిపించారని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒకసారి వినిపించి వెళ్లిపోతారు. పిల్లలైన మీరిప్పుడు గీతా భగవంతుని ద్వారా అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు, రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు. వారైతే వ్రాయబడిన భగవద్గీతను చదువుకొని కంఠస్థము చేసిన తర్వాత మానవులకు వినిపిస్తూ ఉంటారు. వారు కూడా శరీరము వదిలిన తర్వాత మరొక జన్మలో చిన్న బిడ్డగా అయితే వినిపించలేరు. ఇప్పుడు మీరు రాజ్యమును ప్రాప్తి చేసుకునే వరకు తండ్రి గీతను వినిపిస్తూనే ఉంటారు. లౌకిక టీచరు కూడా పాఠము చదివిస్తూనే ఉంటారు. పాఠము పూర్తి అయ్యే వరకు నేర్పిస్తూనే ఉంటారు. పాఠము పూర్తి అయిన తర్వాత హద్దు సంపాదన చేయడంలో నిమగ్నమౌతారు. టీచరు ద్వారా చదువుకొని, సంపాదన చేసి వృద్ధులైన తర్వాత శరీరాన్ని వదిలి వెళ్లి మరొక శరీరాన్ని తీసుకుంటారు. వారు వినిపించే గీత ద్వారా ఇప్పుడు ఏం ప్రాప్తిస్తుందో ఎవ్వరికీ తెలియదు. గీతను వినిపించిన తర్వాత మరుజన్మలో చిన్న పిల్లలుగా అవుతే ఏమీ వినిపించలేరు. పెద్దవారై, వృద్ధులైన తర్వాత గీతను పఠించినప్పుడే వినిపిస్తారు. ఇక్కడ తండ్రి ఒక్కసారి మాత్రమే శాంతిధామము నుండి వచ్చి చదివించి మళ్లీ వెళ్లిపోతారు. మీకు రాజయోగమును నేర్పించి నేను శాంతిధామానికి, నా ఇంటికి వెళ్లిపోతానని తండ్రి చెప్తున్నారు. ఎవరినైతే నేను చదివిస్తానో వారు మళ్లీ వచ్చి తమ ప్రాలబ్ధమును అనుభవిస్తారు. తమ సంపాదన చేసుకుంటారు. నంబరువారు పురుషార్థానుసారంగా ధారణ చేసి మళ్లీ వెళ్లిపోతారు. ఎక్కడికెళ్తారు? నూతన ప్రపంచములోకి. ఈ చదువు నూతన ప్రపంచము కొరకే ఉంది. పాత ప్రపంచము సమాప్తమైన తర్వాత కొత్త ప్రపంచము స్థాపన అవుతుందని మానవులకు తెలియదు. మనము కొత్త ప్రపంచము కొరకే రాజయోగమును నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. తర్వాత ఈ పాత ప్రపంచము గానీ, పాత శరీరము గానీ ఉండవు. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మలు పవిత్రమై మళ్లీ పవిత్ర ప్రపంచములోకి వస్తారు. ప్రపంచము కొత్తదిగా ఉన్నప్పుడు దేవీదేవతల రాజ్యముండేది. దానిని స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచమును తయారు చేయువారు ఆ భగవంతుడే. వారు ఒకే ధర్మమును స్థాపన చేయిస్తారు. దేవతల ద్వారా స్థాపన చేయించరు. దేవతలు ఇక్కడ లేనే లేరు. కనుక ఎవరో ఒక మనిషి ద్వారానే జ్ఞానమునిస్తారు. ఆ మానవులే మళ్లీ దేవతలుగా అవుతారు. ఆ దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణులుగా అయ్యారు. భగవంతుడు నిరాకారుడని, వారే కొత్త ప్రపంచాన్ని రచిస్తారనే రహస్యము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడిది రావణ రాజ్యము. కలియుగములోని పతితులుగా ఉన్నారా? లేక సత్యయుగములోని పావనులుగా ఉన్నారా? అని మీరు అడుగుతారు. కాని వారు అర్థము చేసుకోరు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా నేను మీకు అర్థం చేయించానని పిల్లలైన మీకిప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు. పిల్లలైన మిమ్ములను అర్ధకల్పము వరకు సుఖీలుగా చేసేందుకే నేను వస్తాను. మళ్లీ రావణుడు వచ్చి మిమ్ములను దు:ఖితులుగా చేస్తాడు. ఇది సుఖ- దు:ఖముల ఆట. కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలు. కావున సగము సగము చేయవలసి వస్తుంది కదా. రావణ రాజ్యములో అందరూ దేహాభిమానులుగా, వికారులుగా అవుతారు. ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకు తెలియదు. కల్ప-కల్పము ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే అర్థము చేసుకుంటారు. దేవతలుగా అవ్వలేని వారు ఇక్కడకు రానే రారు. మీరు దేవతా ధర్మానికి అంటును కడ్తున్నారు. దేవతలు ఎప్పుడైతే తమోప్రధాన అసురులుగా అవుతారో అప్పుడు వారిని దైవీ వృక్షమునకు చెందినవారని అనరు. కొత్తదిగా ఉన్నపుడు వృక్షము కూడా సతోప్రధానంగా ఉండేది. మనము ఆ వృక్షానికి ఆకులైన దేవీదేవతలుగా ఉండేవారము. తర్వాత రజో, తమో గుణములోకి వచ్చి పాత పతితులైన శూద్రులుగా అయిపోయాము. పాత ప్రపంచములో పాత మానవులే ఉంటారు. పాతదానిని మళ్లీ కొత్తదిగా చేయవలసి వస్తుంది. దేవీదేవతా ధర్మమిప్పుడు ప్రాయ: లోపమైపోయింది. తండ్రి కూడా చెప్తున్నారు - ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో.......... ఏ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు అని ప్రశ్నిస్తారు? అప్పుడు నేను స్థాపించిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని తప్పకుండా చెప్తారు. ఆ ధర్మమే ప్రాయ: లోపమైపోయింది. దానికి బదులు అధర్మమైపోయింది. కనుక ధర్మము నశించి అధర్మము వృద్ధి చెందినప్పుడు తండ్రి వస్తారు. ధర్మము వృద్ధి అయ్యిందని చెప్పరు, ధర్మమైతే ప్రాయ: లోపమైపోయింది, అధర్మము వృద్ధి చెందింది. అన్ని ధర్మాల వృద్ధి జరుగుతుంది. ఏసుక్రీస్తు ఒక్కరి ద్వారానే క్రైస్తవ ధర్మము ఎంత వృద్ధి చెందింది! దేవ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయింది. పతితంగా అయినందువలన వారిని వారే అవమానపరచుకుంటారు. నేను స్థాపించిన ధర్మమొక్కటే అధర్మమైపోతుంది. మిగిలిన ధర్మాలన్నీ బాగానే నడుస్తున్నాయి. అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మమనుసారము స్థిరంగా ఉంటారు. నిర్వికారులుగా ఉన్న ఆది సనాతన దేవీదేవతా ధర్మములోని వారే వికారులుగా అయ్యారు. మేము పావన ప్రపంచాన్ని స్థాపన చేశాము, తర్వాత ఆ ధర్మము వారే పతితులుగా, శూద్రులుగా అవుతారు. అనగా ఆ ధర్మ గ్లాని జరుగుతుంది. అపవిత్రంగా అయితే తమను తాము అగౌరవపరచుకుంటారు. వికారాలలోకి వెళ్లడం వలన పతితంగా అవుతారు. తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. స్వర్గము నరకంగా మారిపోయింది. కావున ఎవ్వరూ శభాష్‌ శభాష్‌గా(పావనంగా) లేరు. మీరు ఎంత ఛీ-ఛీ పతితంగా అయిపోయారు! తండ్రి చెప్తున్నారు - మిమ్ములను వాహ్‌! వాహ్‌! పుష్పాలుగా తయారుచేశాను, తర్వాత మళ్లీ రావణుడు మిమ్ములను ముళ్లుగా చేశాడు. పావనంగా ఉన్నవారు పతితంగా అయిపోయారు. మీ ధర్మానికి పట్టిన గతిని మీరే చూసుకోవాలి. మేమెంత పతితులుగా అయ్యామో, మా పరిస్థితి చూడండి, మళ్లీ మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు. పతితంగా ఉన్నవారిని పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. కనుక పావనంగా అవ్వాలి, ఇతరులను కూడా పావనంగా చెయ్యాలి.
సర్వగుణ సంపన్నులుగా అయ్యామా? మా నడవడిక దేవతల వలె ఉందా? అని పిల్లలైన మీరు స్వయాన్ని చూసుకుంటూ ఉండండి. దేవతల రాజ్యములో విశ్వమంతటా శాంతి ఉండేది. మళ్లీ ఇప్పుడు విశ్వములో శాంతిని ఎలా స్థాపించాలో మీకు నేర్పించేందుకు వచ్చాను. కావున మీరు కూడా శాంతిగా ఉండవలసి వస్తుంది. నన్ను స్మృతి చేస్తే మీరు శాంతిగా ఉంటారు, శాంతిధామానికి వెళ్లిపోతారు. శాంతిగా ఉండే యుక్తిని తెలుపుతున్నాను. కొంతమంది పిల్లలైతే శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిగా ఉండడం నేర్పిస్తారు. కొంతమంది అశాంతిని కలుగజేస్తారు. స్వయం అశాంతిగా ఉంటే ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు. శాంతికి అర్థమేమిటో తెలియదు. శాంతి నేర్చుకునేందుకు ఇక్కడకు వస్తారు, మళ్లీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అవుతారు. అపవిత్రత కారణంగానే అశాంతిగా అవుతారు. ఇక్కడకు వచ్చి మళ్లీ బాబా, మేము మీ వారమే, మీ ద్వారా విశ్వరాజ్య చక్రవర్తి పదవిని తీసుకోవాలి, మేము పవిత్రులుగా ఉంటూ మళ్లీ విశ్వాధికారులుగా తప్పకుండా అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. మళ్లీ ఇంటికి వెళ్లారంటే మాయ తుఫానులను తీసుకొస్తుంది. యుద్ధము జరుగుతుంది కదా. మళ్లీ మాయకు బానిసలై పతితంగా అవ్వాలనుకుంటారు. మేము పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మళ్లీ మాయతో యుద్ధము చేయడం వలన ప్రతిజ్ఞను మర్చిపోయి అబలల పై అత్యాచారము చేస్తారు. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటాము, నిర్వికారి దృష్టి ఉంచుకుంటాము, చెడు దృష్టి ఉంచుకోము, వికారాలలోకి వెళ్లము, వికారి దృష్టిని వదిలిపెడ్తామని భగవంతునితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మాయా రావణునితో ఓడిపోతారు. కావున ఎవరైతే నిర్వికారులుగా అవ్వాలనుకుంటారో వారిని కష్టపెడ్తారు. అందువలన అబలల పై అత్యాచారము జరుగుతుందని చెప్తారు. పురుషులైతే బలవంతులుగా ఉంటారు, స్త్రీలు నిర్బలురుగా ఉంటారు. యుద్ధమునకు కూడా పురుషులే వెళ్తారు ఎందుకంటే శక్తివంతముగా ఉంటారు. స్త్రీలు నాజూకుగా ఉంటారు. వారి కర్తవ్యమే వేరుగా ఉంది. వారు ఇంటిని సంభాళిస్తారు. పిల్లలకు జన్మనిచ్చి వారిని పాలన చేస్తూ ఉంటారు. అక్కడ ఒకే కుమారుడు ఉంటాడు అయినా వికారమనే మాటే ఉండదు. ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక్క కొడుకైనా తప్పకుండా ఉండాలని గృహస్థులకు చెప్తూ ఉంటారు. చెడు దృష్టి ఉన్న మోసగాళ్లు ఇలాంటి శిక్షణలు ఇస్తారు. నేటి పిల్లలు దేనికి పనికి వస్తారు, వినాశనము ఎదురుగా ఉంది. అంతా సమాప్తమైపోతుంది. ఈ పాత ప్రపంచాన్ని వినాశనము చేసేందుకే నేను ఇప్పుడు వచ్చానని తండ్రి చెప్తున్నారు. అది సన్యాసుల మాట, వారికి వినాశము గురించి తెలియనే తెలియదు. వినాశనము జరుగుతుందని బేహద్‌ తండ్రి మీకిప్పుడు అర్థం చేయిస్తున్నారు. మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు. మా కులపు గుర్తు నిలిచి ఉండాలని కోరుకుంటారు కానీ పతిత ప్రపంచపు ఏ గుర్తు కూడా మిగలదు. ఒకప్పుడు పావన ప్రపంచముండేదని మీకు తెలుసు. మానవులు కూడా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే పావన ప్రపంచము ఒకప్పుడు ఉండి వెళ్లిపోయింది. దానిని స్వర్గమని అంటారు. కానీ ఇప్పుడు తమోప్రధానమైపోయినందు వలన అర్థము చేసుకోలేరు. వారి దృష్టియే వికారిగా(క్రిమినల్‌గా) ఉంది. దీనిని ధర్మగ్లాని అని అంటారు. ఆది సనాతన ధర్మములో ఇలాంటి విషయాలుండవు. ''పతితపావనా! రండి'' పతితులుగా, దు:ఖీలుగా ఉన్నామని పిలుస్తారు. నేను మిమ్ములను పావనంగా తయారు చేశాను. మళ్లీ మాయా రావణుని వలన పతితంగా అయ్యారు, ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వండి అని తండ్రి తెలియజేస్తున్నారు. పావనంగా అవుతారు, మళ్లీ మాయతో యుద్ధము జరుగుతుంది. తండ్రి ద్వారా వారసత్వము తీసుకునే పురుషార్థమును చేస్తూ మళ్లీ అపవిత్రంగా అయితే వారసత్వమునెలా పొందుతారు. సుందరంగా(పవిత్రంగా) చేసేందుకే తండ్రి వస్తారు. సుందరంగా ఉన్న దేవతలే నల్లగా అయ్యారు. దేవతల శరీరాలనే నల్లగా తయారు చేస్తారు, ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలైనవారిని ఎప్పుడైనా నల్లగా చూశారా? దేవీదేవతల చిత్రాలను నల్లగా చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన పరమపిత పరమాత్మ సర్వులకు తండ్రి. మమ్ములను విముక్తి చేయండి అని వారినే పిలుస్తూ ఉంటారు. వారు నల్లగా(అపవిత్రంగా) ఉండజాలరు. వారైతే సదా తెల్లగా, నిరంతరము పవిత్రంగా ఉంటారు. కృష్ణుడైతే మరొక శరీరాన్ని తీసుకున్నా పవిత్రంగా ఉంటాడు కదా. దేవతలనే మహాన్‌ ఆత్మలని అంటారు. కావున కృష్ణుడు దేవుడే. ఇప్పుడిది కలియుగము. కలియుగములో మహానాత్మలు ఎక్కడి నుండి వస్తారు. శ్రీకృష్ణుడైతే సత్యయుగపు ప్రథమ రాకుమారుడు. అతనిలో దైవీగుణాలుండేవి. ఇప్పుడైతే దేవతలెవ్వరూ లేరు. సాధుసత్పురుషులు పవిత్రంగా అవుతారు అయినా వికారాల ద్వారానే పునర్జన్మలు తీసుకుంటారు. మళ్లీ సన్యాసాన్ని ధారణ చేయాల్సి వస్తుంది. దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు. ఇక్కడ రావణ రాజ్యముంది. రావణునికి 10 తలలు చూపిస్తారు - 5 తలలు స్త్రీల సూచకము, 5 తలలు పురుషుల సూచకము. 5 వికారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి అని కూడా తెలుసుకున్నారు. దేవతలలో వికారాలు ఉన్నాయని అనరు కదా. అది సుఖధామము. అక్కడ కూడా రావణుడుంటే అది దు:ఖధామమైపోతుంది. దేవతలు కూడా పిల్లలకు జన్మనిస్తారు. కావున వారు కూడా వికారులే అని మనుష్యులు భావిస్తారు. దేవతలకు సంపూర్ణ నిర్వికారులని గాయనముందని అందువల్లనే వారికి పూజ జరుగుతుందని వారికి తెలియనే తెలియదు. సన్యాసుల మిషన్‌(ఉద్యమము) కూడా ఉంది. వారు కేవలం పురుషులనే సన్యాసులుగా చేసి మిషన్‌ను వృద్ధి చేస్తారు. తర్వాత తండ్రి ప్రవృత్తి మార్గపు కొత్త మిషన్‌ను తయారు చేస్తారు. గృహస్థములో జంటగా ఉన్నవారినే పవిత్రంగా తయారుచేస్తారు. మళ్లీ మీరే వెళ్లి దేవతలుగా అవుతారు. మీరిక్కడకు సన్యాసులుగా అయ్యేందుకు రాలేదు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు. వారైతే మళ్లీ గృహస్థములోకి వెళ్లి జన్మ తీసుకుంటారు, మళ్లీ సన్యసించి బయట పడ్తారు. పవిత్రతయే మీ సంస్కారము, ఇప్పుడు అపవిత్రమైపోయారు. మళ్లీ పవిత్రంగా అవ్వాలి. తండ్రి పవిత్రమైన గృహస్థ ఆశ్రమమును తయారు చేస్తారు. పావన ప్రపంచమును సత్యయుగమని, పతిత ప్రపంచమును కలియుగమని అంటారు. ఇక్కడ ఎంతమంది పాపాత్మలు ఉన్నారు! సత్యయుగములో ఈ విషయాలేవీ ఉండవు. భారతదేశములో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అనగా దేవీదేవతా ధర్మములోని వారు పతితమైనప్పుడు తమను తామే గ్లాని చేసుకుంటారని తండ్ర్రి చెప్తారు. నేను మిమ్ములను పావనంగా తయారుచేశాను. తర్వాత మీరు మళ్లీ పతితులుగా అయ్యారు, దేనికీ పనికిరాకుండా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా పతితమైనప్పుడు మళ్లీ పావనంగా చేసేందుకు నేనే రావలసి వస్తుంది. ఈ డ్రామా చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్వర్గములోకి వెళ్లేందుకు దైవీగుణాలు కూడా కావాలి. క్రోధము ఉండరాదు. క్రోధమున్నవారిని కూడా అసురులని అంటారు. ఎంతో ప్రశాంతచిత్త స్థితి ఉండాలి. క్రోధము చేసుకున్నవారిని చూసి వీరిలో క్రోధ భూతముందని అంటారు. క్రోధమున్నవారెవరైనా దేవతలుగా అవ్వలేరు. నరుని నుండి నారాయణులుగా అవ్వలేరు. దేవతలు నిర్వికారముగా ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజలు కూడా నిర్వికారులుగానే ఉంటారు. భగవంతుడైన తండ్రియే వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా చేస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రితో పవిత్రతా ప్రతిజ్ఞ చేశారు కనుక స్వయాన్ని మాయ దాడుల నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మాయకు బానిసలుగా అవ్వరాదు. ఇప్పుడు పావన ప్రపంచములోకి వెళ్లాలి కనుక ఈ ప్రతిజ్ఞను మర్చిపోరాదు.

2. దేవతలుగా అయ్యేందుకు అవస్థను చాలా చాలా శాంతచిత్తంగా చేసుకోవాలి. ఏ భూతమునూ ప్రవేశంపనీయరాదు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి.

వరదానము :-

'' ముఖము ద్వారా సర్వ శ్రేష్ఠమైన ప్రాప్తులను అనుభవం చేయించే సర్వ ప్రాప్తి సంపన్న భవ ''

సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు లభించిన వరదానం - ''సర్వ ప్రాప్తి సంపన్న భవ'' ఇటువంటి వరదాని ఆత్మలు కష్టపడాల్సిన అవసరముండదు. వారి ముఖములోని మెరుపు ''వీరు ఏదో పొందుకున్నారు, వీరు ప్రాప్తి స్వరూప ఆత్మలు'' అని తెలుపుతుంది. కొంతమంది పిల్లల ముఖాన్ని చూచి జనులు ''వీరు చాలా గొప్ప త్యాగము చేశారు, వీరి త్యాగము చాలా ఉన్నతమైనదని'' అంటారు. త్యాగము కనిపిస్తుంది కానీ భాగ్యము కన్పించదు. ఎప్పుడైతే సర్వ ప్రాప్తుల నశాలో ఉండి మీ భాగ్యాన్ని చూపిస్తారో అప్పుడు సహజంగా ఆకర్షితులై వస్తారు.

స్లోగన్‌ :-

'' ఎక్కడైతే ఉమంగ - ఉత్సాహాలు మరియు ఏకమత సంగఠన ఉంటుందో, అక్కడ సఫలత ఇమిడి ఉంటుంది. ''