30-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - శ్రీమతానుసారముగా మంచి సర్వీసు చేసేవారికి రాజ్య పదవి అనే బహుమతి లభిస్తుంది, పిల్లలైన మీరిప్పుడు సహయోగులుగా అయ్యారు కనుక మీకు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది ''

ప్రశ్న :-

బాబా జ్ఞాన నాట్యము ఏ పిల్లల ముందు చాలా బాగా జరుగుతుంది ?

జవాబు :-

ఎవరు జ్ఞానములో ఆసక్తిగలవారై ఉంటారో, ఎవరికైతే యోగ నషా ఉంటుందో, వారి ముందు బాబా జ్ఞాన నాట్యము చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నెంబరువారుగా ఉన్నారు. కానీ ఇది చాలా అద్భుతమైన పాఠశాల. కొందరిలో కొద్దిగా కూడా జ్ఞానము ఉండదు. కేవలం భావన మాత్రమే ఉంటుంది. ఆ భావన ఆధారము పై కూడా వారు వారసత్వానికి అధికారులుగా అవుతారు.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - దీనిని ఆత్మిక జ్ఞానము లేక ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానము కేవలం ఒక్క తండ్రిలోనే ఉంటుంది. వేరే మనుష్యమాత్రులలో ఉండదు. ఆత్మిక జ్ఞానమిచ్చేవారు ఒక్కరే, వారిని జ్ఞానసాగరులు అని అంటారు. ప్రతి మనిషిలో తమవే అయిన విశేషతలు ఉంటాయి కదా. బ్యారిష్టర్‌ బ్యారిష్టరే, డాక్టర్‌ డాక్టరే. ప్రతి ఒక్కరి కర్తవ్యము, పాత్ర వేరు వేరుగా ఉంటుంది. ప్రతి ఆత్మకు తమదే అయిన అవినాశి పార్టు లభించి ఉంటుంది. ఆత్మ ఎంతో చిన్నది, అద్భుతము కదా. భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని................ (భృకుటి కే బీచ్‌ మే చమకతా హై అజబ్‌ సితారా.......) గానము కూడా చేస్తారు. నిరాకారి ఆత్మకు ఈ శరీరము సింహాసనము అని కూడా గానము చేస్తారు. నిజానికి అది చాలా చిన్న బిందువు, అంతేకాక ఆత్మలంతా పాత్రధారులు. ఒక్క జన్మలోని రూపు రేఖలు మరొక జన్మతో కలవవు. అలాగే ఒక జన్మలోని పాత్ర మరో జన్మలోని పాత్రతో కలవదు. మేము గతములో ఏమై ఉండినామో, భవిష్యత్తులో ఎలా ఉంటామో ఎవ్వరికీ తెలియదు. తండ్రియే సంగమ యుగములో కూర్చొని అర్థం చేయిస్తారు. ఉదయము మీరు స్మృతియాత్రలో కూర్చుంటారు కనుక ఆరిపోతున్న ఆత్మ ప్రజ్వలితమవుతూ ఉంటుంది ఎందుకంటే ఆత్మకు ఎంతో తుప్పు పట్టి ఉంది. తండ్రి కంసాలి పని కూడా చేస్తారు. మలినమై ఉన్న పతిత ఆత్మలను పవిత్రంగా చేస్తారు. మలినాలు కలుస్తాయి కదా. వెండి, రాగి, లోహము(ఇనుము) మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. స్వర్ణిమ యుగము, వెండి యుగము................. సతోప్రధానము, సతో, రజో, తమో.......... ఈ విషయాలు ఏ మనుష్యులు లేక గురువులు గాని అర్థం చేయించరు. ఒక్క సద్గురువు మాత్రమే అర్థము చేయిస్తారు. సద్గురువు అకాల సింహాసనము అని చెప్తారు కదా. ఆ సద్గురువుకు కూడా సింహాసనము కావాలి కదా. ఎలా ఆత్మలైన మీకు మీ మీ ఆసనాలున్నాయో, అలా వారు కూడా ఆసనము తీసుకోవలసి ఉంటుంది. నేను ఎలాంటి ఆసనాన్ని తీసుకుంటానో ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదని తండ్రి చెప్తారు. వారు నేతి-నేతి, మాకు తెలియదని అంటూ వచ్చారు. మొదట మనకు కూడా ఏమీ తెలియదని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికి ఏమీ తెలియదో, వారిని అవివేకులు అని అంటారు. మేము చాలా బుద్ధివంతులము, విశ్వరాజ్యభాగ్యము మాదే అయ్యి ఉండేదని భారతవాసులు భావిస్తారు. ఇప్పుడు అవివేకులైపోయారు. మీరు శాస్త్రాలు మైదలైనవి ఏమి చదివి ఉన్నా, ఇప్పుడు అవన్నీ మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారములో కూడా భలే ఉండండి, సన్యాసుల అనుచరులు కూడా తమ తమ ఇళ్ళల్లో ఉంటారు. కొంతమంది సత్యమైన అనుచరులు వారితో పాటు ఉంటారు. మిగిలినవారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. దీనినే జ్ఞాన నృత్యము అని అంటారు. యోగము అనగా సైలెన్స్‌(నిస్సంకల్పము, నిశ్శబ్ధము). జ్ఞానమంటే నృత్యము. యోగములో అయితే పూర్తి శాంతిగా ఉంటారు. డెడ్‌ సైలెన్స్‌(పూర్తి నిశ్శబ్ధము) అని అంటారు కదా. మూడు నిముషాలు డెడ్‌ సైలెన్స్‌గా ఉండండి అని అంటారు. కానీ దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు శాంతి కొరకు అడవులకు వెళ్తారు, కానీ అక్కడ శాంతి లభించదు. రాణి తన హారాన్ని మెడలో ఉంచుకొని............... అనే కథ కూడా ఉంది, ఇది శాంతికి ఉదాహరణ. ఇప్పుడు తండ్రి ఏ విషయాలను అర్థం చేయిస్తున్నారో ఆ దృష్టాంతాలు మళ్లీ భక్తిమార్గములో కొనసాగుతాయి. తండ్రి ఈ సమయములో పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తారు. ఇది మీరు అర్థము చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా తమోప్రధానంగా, పతితంగా ఉంది ఎందుకంటే అందరూ వికారాల నుండి జన్మ తీసుకుంటారు. దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు. వైస్‌లెస్‌ వరల్డ్‌(నిర్వికారి ప్రపంచము) అని అంటారు కానీ దాని అర్థము తెలియదు. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. తండ్రిని గురించి ఎప్పుడూ అలా అనరు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు. మనుష్యులు కణకణములో పరమాత్మ ఉన్నారని అంటారు. భారతదేశములో ఎప్పుడెప్పుడు ఇలాంటి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు వస్తానని తండ్రి చెప్తారు. వారు కేవలం అలాగే శ్లోకాన్ని చదువుతారు కానీ దాని అర్థము వారికి కొంచెం కూడా తెలియదు. శరీరమే పతితమవుతుందని ఆత్మ పతితంగా అవ్వదని వారు భావిస్తారు.

మొదట ఆత్మ పతితంగా అయ్యిందని, అప్పుడు శరీరము కూడా పతితంగా అయ్యిందని తండ్రి అంటారు. బంగారములోనే మలినాలు కలుస్తాయి, అప్పుడు నగలు కూడా అలాగే తయారవుతాయి. కానీ అవన్నీ భక్తిమార్గములో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఆత్మ విరాజమానమై ఉందని తండ్రి అర్థము చేయిస్తారు. జీవాత్మ అని అంటారు కానీ జీవపరమాత్మ అని అనరు.అలాగే మహాన్‌ ఆత్మ అని అంటారు,మహాన్‌ పరమాత్మ అని అనరు.ఆత్మనే భిన్న-భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తుంది. యోగము పూర్తిగా నిశ్శబ్ధమైనది. ఇది జ్ఞాన నృత్యము. ఎవరు ఆసక్తి గలవారై ఉంటారో వారి ముందే బాబా జ్ఞాననృత్యము జరుగుతుంది. ఎవరిలో ఎంత జ్ఞానముందో, యోగ నషా ఎంత ఉందో తండ్రికి తెలుసు. టీచరుకు తెలిసి ఉంటుంది కదా. తండ్రికి మంచి గుణవంతులైన పిల్లలెవరో కూడా తెలుసు. మంచి మంచి పిల్లలకే అనేకచోట్ల నుండి ఆహ్వానము లభిస్తుంది. పిల్లలలో కూడా నెంబరువారుగా ఉన్నారు. ప్రజలు కూడా నెంబరువారుగా పురుషార్థానుసారము అవుతారు. ఇది స్కూలు లేక పాఠశాల కదా. పాఠశాలలో సదా నంబరువారుగా కూర్చుంటారు. ఫలానావారు చురుకైనవారు, ఫలానావారు మీడియమ్‌ అని అర్థము చేసుకోగలరు. ఇక్కడ ఇది అనంతమైన క్లాసు. ఇక్కడ ఎవ్వరినీ నెంబరువారుగా కూర్చోబెట్టలేరు. నా ఎదురుగా కూర్చున్న వారిలో కొద్దిగా కూడా జ్ఞానము లేదని, కేవలం భావన ఉందని తండ్రికి తెలుసు. జ్ఞానము లేదు, యోగము లేదు అని బాబాకు తెలుసు. వీరు తండ్రి అని, వీరి నుండి మేము వారసత్వము తీసుకోవాలనే నిశ్చయం మాత్రము ఉంది. ఆస్తి అయితే అందరికీ లభిస్తుంది. కానీ రాజ్యములో పదవులు నెంబరువారుగా ఉంటాయి. ఎవరు బాగా సర్వీసు చేస్తారో వారికి మంచి బహుమతి లభిస్తుంది. ఇక్కడ అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎవరైతే సలహాను ఇస్తారో, ఎక్కువ ఆలోచిస్తారో వారికి బహుమతి లభిస్తుంది. విశ్వములో సత్యమైన శాంతి ఎలా వస్తుందో ఇప్పుడు మీకు తెలుసు. విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది? ఎప్పుడైనా విన్నారా లేక చూశారా? ఎలాంటి శాంతిని అడుగుతున్నారు? ఎప్పుడు ఉండేది? అని వారిని అడగమని తండ్రి చెప్తున్నారు. మీరు ప్రశ్నలు అడగవచ్చు ఎందుకంటే జవాబులు మీకు తెలుసు. ప్రశ్నలు అడిగేవారికే జవాబులు తెలియకుంటే వారిని ఏమంటారు? ఏ విధమైన శాంతి కావాలి? అని మీరు వార్తాపత్రికల ద్వారా అడగండి. ఆత్మలమైన మనమంతా ఉండేది శాంతిధామములో. తండ్రి చెప్తున్నారు - ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి, రెండవది సుఖధామాన్ని స్మృతి చేయండి. సృష్టి చక్ర జ్ఞానము పూర్తిగా లేని కారణంగా అసత్యాలు, వ్యర్థ ప్రలాపాలు మొదలైనవి చేెస్తూ ఉంటారు.

మనము డబల్‌ కిరీటధారులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మనము దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ మనుష్యులుగా అయ్యాము. దేవతలను దేవతలనే అంటారు మనుష్యులని అనరు ఎందుకంటే దైవీగుణాలు కలిగినవారు కదా. ఎవరిలో అవగుణాలు ఉన్నాయో వారు గుణహీనుడినైన నాలో ఏ గుణాలు లేవని అంటారు. శాస్త్రాలలో ఏ మాటలను విన్నారో వాటిని కేవలం చిలుకకు నేర్పినట్లు అచ్యుతం కేశవమ్‌,.................. అని పాడుతూ ఉంటారు. బాబా, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని అంటారు. వాస్తవానికి బ్రహ్మలోకమును ప్రపంచమని అనరు. అక్కడ ఆత్మలైన మీరుంటారు. వాస్తవానికి పాత్రాభినయము చేసే ప్రపంచము ఇదే. అది శాంతిధామము. నేను కూర్చొని పిల్లలకు నా పరిచయాన్నిస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరికైతే తన జన్మల గురించి తెలియదో వారిలో నేను వస్తాను. ఇది కూడా ఇప్పుడే వింటారు, నేను ఇతడిలో ప్రవేశిస్తాను. ఇది పాత పతిత ప్రపంచము, రావణుని ప్రపంచము. ఎవరైతే నెంబర్‌వన్‌ పావనంగా ఉండేవాడో అతడే మళ్లీ లాస్ట్‌ నెంబర్‌ పతితంగా అయ్యాడు. అతడిని నా రథముగా చేసుకుంటాను. ఫస్ట్‌ నుండి లాస్ట్‌లోకి వచ్చాడు. మళ్లీ ఫస్టులోకిి వెళ్ళాలి. బ్రహ్మ ద్వారా నేను ఆదిసనాతన దేవీదేవతా ధర్మ స్థాపన చేస్తానని చిత్రములో కూడా అర్థము చేయించారు కానీ దేవీదేవతా ధర్మములోకి వస్తానని చెప్పలేదు. ఎవరి శరీరములో వచ్చి కూర్చుంటానో అతడే వెళ్లి మళ్లీ నారాయణునిగా అవుతాడు. విష్ణువు ఇంకెవ్వరో కాదు లక్ష్మీనారాయణులు లేక రాధాకృష్ణుల జంటయే. విష్ణువు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను మీకు వేదశాస్త్రాల, అన్ని చిత్రాలు మొదలైనవాటి రహస్యాన్ని అర్థం చేయిస్తానని తండ్రి చెప్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడే మళ్లీ ఇలా అవుతాడు. ఇది ప్రవృత్తిమార్గము కదా, ఈ బ్రహ్మ-సరస్వతి మళ్లీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇతనిలో(బ్రహ్మ) నేను ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానమునిస్తాను. అప్పుడు ఈ బ్రహ్మ కూడా వింటాడు. ఇతడు ఫస్ట్‌ నెంబరులో వింటాడు. ఇతడు పెద్ద నది అయిన బ్రహ్మపుత్ర. సాగరము మరియు బ్రహ్మపుత్ర నదుల మేళా జరుగుతుంది. సాగరము మరియు నదుల సంగమమెక్కడుంటుందో అక్కడ పెద్ద మేళా జరుగుతుంది. నేను ఇతనిలో ప్రవేశిస్తాను, ఇతడు విష్ణువుగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక్క సెకండు పడ్తుంది. నేనిలా తయరవుతానని ఇతనికి సాక్షాత్కారము జరుగుతుంది, క్షణములో నాకు నిశ్చయము కలుగుతుంది. విశ్వాధికారిగా అవుతాను కనుక ఈ తుచ్ఛమైన గాడిద బరువు ఏమి చేసుకోవాలి? అని అంతా వదిలేశాడు. మీకు కూడా మొదట బాబా వచ్చి ఉన్నారని, ఈ ప్రపంచము సమాప్తమవ్వనున్నదని తెలిసిన వెంటనే పరుగు తీశారు. బాబా ఎత్తుకుపోలేదు. అవును, భట్టి జరగవలసి ఉండినది, అందుకు వచ్చారు. కృష్ణుడు ఎత్తుకెళ్లాడని అంటారు. అది మంచిదే కదా. కృష్ణుడు తీసుకెళ్ళి పట్టపురాణులుగా చేశారు కదా. కనుక ఈ జ్ఞానము ద్వారా విశ్వమహారాజ, మహారాణులుగా అవుతారు. ఇది చాలా మంచిదే కదా. ఇందులో తిట్లు తినే అవసరము లేదు. మళ్లీ ఎప్పుడు కళంకము వస్తుందో అప్పుడే కళంగీధరులుగా అవుతారని అంటారు. కళంకము శివబాబాకే వస్తుంది, ఎంతగా గ్లాని చేస్తారు! అత్మలమైన మేమే పరమాత్మ, పరమాత్మనే అత్మ అని అంటారు. అలా కాదు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనమిప్పుడు బ్రాహ్మణులము, బ్రాహ్మణులది సర్వోత్తమ కులము. దీనిని వంశమని అనరు. రాజవంశము అనగా అందులో రాజ్యముంటుంది. ఇది మీ కులము. ఇది చాలా సులభము. బ్రాహ్మణులైన మనమే దేవతలుగా అవుతాము కనుక దైవీగుణాలు తప్పకుండా ధారణ చేయాలి. సిగరెట్లు, బీడీలు మొదలైన వాటిని దేవతలకు భోగ్‌ పెడ్తారా? శ్రీనాథ ద్వారములో చాలా నేతి పదార్థాలు తయారవుతాయి. ఎంత భోగ్‌ పెడతారంటే దుకాణాలే తయారవుతాయి, యాత్రికులు వెళ్ళి తీసుకుంటారు. మనుష్యులకు చాలా భావన ఉంటుంది. సత్యయుగములో ఇలాంటి మాటలేవీ ఉండవు. పదార్థాలను పాడు చేసే ఇలాంటి ఈగలు మొదలైనవేవీ ఉండవు. ఇలాంటి జబ్బులు కూడా అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద మంచి స్వచ్ఛత కూడా ఉంటుంది. అక్కడ అలాంటి మాటలే ఉండవు. రోగాలు మొదలైనవి ఉండవు. ఈ అనారోగ్యములన్నీ ద్వాపరము నుండి వెలువడ్తాయి. తండ్రి వచ్చి మిమ్ములను సదా ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఎవరి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారో ఆ తండ్రిని స్మృతి చేసేందుకు మీరు పురుషార్థము చేస్తారు. ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి మాటే. 150 సంవత్సరాలు ఆయువు ఉండేది కదా. ఇప్పుడైతే సగటు ఆయువు 40 - 50 సంవత్సరాలే. ఎందుకంటే వారు యోగులు, వీరు భోగులు.

మీరు రాజయోగులు, రాజఋషులు అందుకే మీరు పవిత్రంగా ఉంటారు. కానీ ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషోత్తమ మాసమూ కాదు, సంవత్సరమూ కాదు. నేను కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తానని తండ్రి చెప్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్లీ చెబుతారు - పావనంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి అను ఒక్క మాట ఎప్పుడూ మర్చిపోకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ ధర్మాలన్నీ త్యాగము చేయండి, ఇప్పుడు మీరు వాపస్‌ వెళ్ళాలి. నేను మీ ఆత్మను స్వచ్ఛంగా చేసేందుకే వచ్చాను. దీని ద్వారా మళ్లీ శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆత్మ సంపూర్ణ పవిత్రమైనప్పుడు మీరు పాత చెప్పును(శరీరము) వదిలేస్తారు, మళ్లీ కొత్తది లభిస్తుంది. వందేమాతరమ్‌ అని మీకు గాయనముంది. మీరు భూమిని కూడా పవిత్రంగా చేస్తారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాన్ని తెరుస్తారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఆత్మ రూపి జ్యోతిని ప్రజ్వలితము చేసేందుకు ఉదయం ఉదయమే స్మృతియాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే త్రుప్పు వదిలిపోతుంది. ఆత్మకు పట్టిన త్రుప్పును స్మృతి ద్వారా తొలగించి సత్యమైన బంగారుగా అవ్వాలి.

2. తండ్రి నుండి ఉన్నత పదవి అనే బహుమతి తీసుకునేందుకు భావనతో పాటు జ్ఞానవంతులు మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి.

వరదానము :-

'' ఒకే బలము, ఒకే నమ్మకము ఆధారము పై మాయను సరెండర్‌ చేయించే శక్తిశాలి ఆత్మా భవ ''

ఒకే బలము, ఒకే నమ్మకము అంటే సదా శక్తిశాలురు. ఎవరికైతే ఒకే బలము, ఒకే నమ్మకము ఉంటుందో వారిని ఏదీ కదిలించలేదు. వారి ముందు మాయ మూర్ఛపోతుంది, సరెండర్‌ అయిపోతుంది. మాయ సరెండర్‌ అయితే సదా విజయులుగా అవ్వనే అవుతారు. కనుక విజయం మా జన్మ సిద్ధ అధికారము అనే నషా ఉండాలి. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. కల్ప-కల్పము శక్తులము, పాండవులము అయిన మేమే విజయులుగా అయ్యాము, ఇప్పుడు విజయులము, ఇక ముందు కూడా విజయులుగా అవుతాము అనే స్మృతి హృదయంలో ఎమర్జ్‌ అయ్యి ఉండాలి.

స్లోగన్‌ :-

'' నూతన ప్రపంచ స్మృతి ద్వారా అన్ని గుణాలను ఆహ్వానించండి, తీవ్ర వేగముతో ముందుకు వెళ్లండి. ''