21-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికీ సేవ చేస్తారో, అనేకమందిని తమ సమానంగా తయారుచేస్తారో, విశ్రాంతి ప్రియులు కానివారో, వారే నిజాయితీపరులు ''
ప్రశ్న :-
బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ మాటలు ఎప్పటికీ మాట్లాడలేరు ?
జవాబు :-
బ్రహ్మతో మాకు ఎలాంటి సంబంధము లేదు, మేము నేరుగా శివబాబానే స్మృతి చేస్తామని బ్రాహ్మణులైన మీరు ఎప్పటికీ అనలేరు. బ్రహ్మాబాబా లేకుండా బ్రాహ్మణులని పిలువబడలేరు. ఎవరికైతే బ్రహ్మతో సంబంధం లేదో వారు బ్రహ్మ ముఖవంశావళి వారు కాదు, శూద్రులు. శూద్రులు ఎప్పటికీ దేవతలుగా అవ్వలేరు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చుని దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు - పిల్లలు ప్రదర్శినీ లేక మ్యూజియమ్ ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు కానీ బేహద్ తండ్రి ఎప్పుడో ప్రారంభోత్సవం చేసేశారు. ఇప్పుడు శాఖలు వెలువడ్తూ ఉంటాయి. పాఠశాలలు చాలా కావాలి కదా. తండ్రి ఉన్న ఈ పాఠశాలకు మధువనము అని పేరు పెట్టారు. మధువనములో సదా మురళి మ్రోగుతూ ఉంటుందని పిల్లలకు తెలుసు. ఎవరి మురళి? భగవంతునిది. భగవంతుడు నిరాకారుడు. సాకార రథము ద్వారా మురళీ మ్రోగిస్తారు. అతనికి భాగ్యశాలి రథము అని పేరు ఉంచారు. ఇది ఎవరైనా అర్థము చేసుకోగలరు. ఇతనిలో తండ్రి ప్రవేశించారని పిల్లలైన మీకే అర్థమవుతుంది. మరెవ్వరికీ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలు తెలియదు. గొప్ప వ్యక్తులైన గవర్నర్ మొదలైన వారితో ఉద్ఘాటన(ప్రారంభోత్సవం) చేయిస్తారు. ఎవరి చేత ఉద్ఘాటన చేయిస్తున్నారో వారికి మొదట కొత్త ప్రపంచమును తండ్రి ఎలా స్థాపిస్తున్నారనే పరిచయమును ఇవ్వాలని తండ్రి ఎప్పుడూ వ్రాస్తుంటారు. శాఖలు తెరవబడుతూ ఉన్నాయి. ఎవరో ఒకరి ద్వారా తెరిపిస్తూ ఉంటే వారి కళ్యాణము జరుగుతుంది. తండ్రి వచ్చారని కొంచెమైనా తెలుస్తుంది. విశ్వములో శాంతిమయ రాజ్యము లేక ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము బ్రహ్మ ద్వారా స్థాపించబడుతోంది. దాని ఉద్ఘాటనైతే జరిగిపోయింది. ఇప్పుడు శాఖలు తెరవబడ్తున్నాయి. ఎలాగైతే బ్యాంకుకు సంబంధించిన శాఖలు తెరుస్తూ ఉంటారో, అలా ఇక్కడ కూడా తెరవబడ్తున్నాయి. తండ్రియే వచ్చి జ్ఞానము ఇవ్వాలి. ఈ జ్ఞానము పరమపిత పరమాత్మలో మాత్రమే ఉంటుంది. అందువలన వారినే జ్ఞానసాగరులని అంటారు. ఆత్మిక తండ్రిలోనే ఆత్మిక జ్ఞానముంది. కావున వారే వచ్చి ఆ జ్ఞానాన్ని ఆత్మలకు ఇస్తారు. ఓ పిల్లలారా! ఓ ఆత్మలారా! మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థం చేయిస్తారు. ఆత్మ అను పేరైతే సాధారణమైనదే. మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు. కావున ఆత్మలకు పరమపిత పరమాత్ముడైన తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఎందుకు వస్తారు? తప్పకుండా పిల్లలకు వారసత్వము ఇచ్చేందుకు వస్తారు. మళ్లీ సతోప్రధానమైన క్రొత్త ప్రపంచములోకి రావాలి. ప్రపంచ చరిత్ర-భూగోళము పునరావృతమవుతుందని అంటారు. కొత్త లేక పాత ప్రపంచము మనుష్యులదే. కొత్త ప్రపంచాన్ని రచించేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మనుష్యులు లేకుండా ప్రపంచముండదు. కొత్త ప్రపంచములో దేవీ దేవతల రాజ్యముండేది. ఇప్పుడు మళ్లీ అదే రాజ్యము స్థాపన అవుతూ ఉంది. పిల్లలైన మీరిప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్లీ మిమ్ములను బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు అని మీరు వినిపించగలరు. మీరు కొత్త ప్రపంచములోకి ఎలా వెళ్లగలరు? ఇప్పుడు మీ ఆత్మలు పతితంగా, వికారిగా ఉన్నాయి. కనుక మళ్లీ ఇప్పుడు నిర్వికారులుగా తయారవ్వాలి. జన్మ-జన్మల పాప భారము తల పై ఉంది. పాపం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? తండ్రి ఎన్ని సంవత్సరాల వరకు పుణ్యాత్మలుగా చేస్తారు? ఇది కూడా పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. 21 జన్మల వరకు పుణ్యాత్మలుగా ఉంటారు, తర్వాత మీరు పాపాత్మలుగా అవుతారు. ఎక్కడ పాపముంటుందో అక్కడ దు:ఖము ఉండనే ఉంటుంది. పాపమంటే ఏమిటో కూడా తండ్రి తెలియజేస్తున్నారు. ఒకటేమో మీరు ధర్మగ్లాని చేస్తారు. మీరు ఎంతో పతితమైపోయారు. ''ఓ పతితపావనా! రండి'' అని మీరు నన్ను పిలుస్తూ వచ్చారు, కావున నేను ఇప్పుడు వచ్చాను. పావనంగా తయారు చేసే తండ్రిని మీరు నిందించారు, అవమానించారు. అందువలన మీరు పాపాత్మలుగా అయ్యారు. ''ఓ ప్రభూ, జన్మ-జన్మల నుండి నేను పాపిగా ఉన్నాను, వచ్చి పావనంగా చేయండి'' అని కూడా అంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నారో వారి అనేక జన్మల అంత్యములో నేను ప్రవేశిస్తాను. అనేక జన్మలని బాబా దేనిని అంటారు? పిల్లల 84 జన్మలను అనేక జన్మలని బాబా అంటారు. మొట్టమొదట వచ్చినవారే 84 జన్మలు తీసుకుంటారు. మొదట ఈ లక్ష్మీనారాయణులే వస్తారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వస్తారు. సత్యనారాయణ కథను కూడా వినిపిస్తారు. ఎప్పుడైనా, ఎవరైనా సీతా-రాములుగా అయ్యే కథను వినిపించారా? వారిని నిందించారు. నరుని నారాయణునిగా, నారిని లక్ష్మిగా తండ్రి తయారుచేస్తారు. వీరిని ఎప్పుడూ ఎవ్వరూ నిందించరు. నేను రాజయోగాన్ని నేర్పిస్తానని తండ్రి చెప్తారు. విష్ణువు రెండు రూపాలే ఈ లక్ష్మీనారాయణులు. చిన్నతనములోనే వీరే రాధా-కృష్ణులు. వీరు సోదర-సోదరీలు కాదు, వేరు వేరు రాజులకు పిల్లలుగా ఉంటారు. ఆ మహారాజకుమార-మహారాజకుమారీగా ఉన్నవారిని వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులని పిలుస్తారు. ఈ విషయాలన్నీ ఏ మనుష్యులకూ తెలియదు. కల్పక్రితము ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలోనైతే కూర్చున్నాయో, ఇప్పుడు కూడా వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. ఈ లక్ష్మీ నారాయణులు, రాధా-కృష్ణులు మొదలైన వారందరి మందిరాలు ఉన్నాయి. విష్ణువుకు కూడా మందిరముంది, దీనినే నర - నారాయణ మందిరము అని అంటారు. లక్ష్మీనారాయణులకు వేరు వేరు మందిరాలు కూడా ఉన్నాయి. బ్రహ్మకు కూడా మందిరముంది. బ్రహ్మ దేవతాయ నమ: అన్న తర్వాత శివపరమాత్మాయ నమ: అని అంటారు. కావున వారు వేరుగా ఉన్నట్లే కదా. దేవతలను భగవంతుడని ఎప్పుడూ అనరు. విశ్వములో శాంతి స్థాపన చేసేందుకు భగవంతుడు పునాది వేసేశారని ఎవరి ద్వారా ఉద్ఘాటన చేయిస్తారో వారికి మొదట ఈ విషయము అర్థము చేయించాలని తండ్రి చెప్తున్నారు. లక్ష్మీనారాయణులు రాజ్యమును పరిపాలించినప్పుడు విశ్వమంతటా శాంతి ఉండేది కదా. వీరు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారు కదా. కావున ఇది మానవులను నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మ్మిగా తయారు చేయు పెద్ద ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. చాలా మంది విశ్వ విద్యాలయము అని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి అవి ఏవీ విశ్వ విద్యాలయాలు కావు. సార్వత్రికంగా అయితే విశ్వమంతటా ఉండాలి. విశ్వమంతటా ఒకే కళాశాలను అనంతమైన తండ్రి తెరుస్తారు. విశ్వములో పావనంగా అయ్యే విశ్వవిద్యాలయము ఇది ఒక్కటే అని దానిని తండ్రి స్థాపిస్తున్నారని మీకు తెలుసు. విశ్వమంతటినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్తారు. అందువలన దీనిని ఈశ్వరీయ విశ్వ విద్యాలయమని అంటారు. ఈశ్వరుడు వచ్చి విశ్వమంతటికీ ముక్తి-జీవన్ముక్తుల వారసత్వమునిస్తారు. తండ్రి చెప్పే విషయమెక్కడ? వారంతా చెప్పే విశ్వ విద్యాలయము ఎక్కడ? విశ్వ విద్యాలయము అనగా ప్రపంచమంతటినీ పరివర్తన చేయడం, ఈ కర్తవ్యము తండ్రిదే. మనలను ఈ పేరు పెట్టుకోనివ్వరు, ప్రభుత్వమైతే తానే స్వయంగా పెట్టుకుంటుంది. దీనిని మీరు అర్థము చేయించాలి. అది కూడా మొదటే అర్థం చేయించరు. మా పేరే బ్రహ్మకుమార- బ్రహ్మకుమారీలని చెప్పండి. తండ్రి వచ్చి రథముగా తయారు చేసుకున్నప్పుడే బ్రహ్మ అని పేరు పెట్టారు. ప్రజాపిత అను పేరు ప్రసిద్ధి చెందింది కదా! అతడు ఎక్కడ నుండి వచ్చాడు? అతని తండ్రి పేరేమిటి? బ్రహ్మను దేవతగా చూపిస్తారు కదా. దేవతలకు పరమపితయే తప్పకుండా తండ్రిగా ఉంటారు. వారు రచయిత, బ్రహ్మను మొట్టమొదట రచించారని చెప్తారు. వారి తండ్రి శివబాబా, నేను ఇతనిలో ప్రవేశించి ఇతని గురించి మీకు తెలియజేస్తానని శివబాబా చెప్తున్నారు.
ఇది ఈశ్వరీయ మ్యూజియమ్ అని పిల్లలు అర్థం చేయించాలి. ఓ పతితపావనా! రండి, వచ్చి పతితులను పావనంగా చేయండి అని నన్ను పిలిచారు. ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా! మీరు మీ తండ్రిని స్మృతి చేస్తే పతితులుగా ఉన్నవారు పావనంగా అవుతారు. మన్మనాభవ అను పదము గీతలోనిదే. జ్ఞానసాగరులైన పతితపావనుడు భగవంతుడు ఒక్కరే. కృష్ణుడు పతితపావనుడు కాదు. అతడు పతిత ప్రపంచములోకి రాలేడు. పతిత ప్రపంచములోకి పతిత పావనుడైన తండ్రియే వస్తాడు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే పాపము భస్మమవుతుంది. ఎంత సహజమైన విషయము! భగవానువాచ అను పదము తప్పకుండా చెప్పాలి. '' కామము మహాశత్రువు '' అని పరమపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట నిర్వికారి ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు వికారి ప్రపంచంగా ఉంది. ఇక్కడే దు:ఖమే దు:ఖముంది. నిర్వికారులుగా ఉంటే మళ్లీ సుఖమే సుఖము ఉంటుంది. భగవానువాచ - కామము మహాశత్రువు అని అందరికీ తెలియజేయాలి. దీనిని జయిస్తే మీరు జగత్తును జయిస్తారు. ఒక్క తండ్రిని స్మృతి చేయండి. మేము కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని చెప్పండి. ఏదైనా కాలేజిని తెరుస్తున్నప్పుడు దానిని కూడా ఉద్ఘాటన చేయిస్తారు కదా. ఇది కూడా కళాశాల, చాలా సేవాకేంద్రాలున్నాయి. సేవాకేంద్రాలలో టీచర్లను నియమించారు. టీచర్లు కూడా తప్పకుండా ఆలోచించాలి. బాబా కొత్త కొత్త సేవాకేంద్రాలలో మంచి మంచి బ్రాహ్మణీల(టీచర్స్)ను ఉంచుతారు. అందువలన త్వర త్వరగా తమ సమానంగా ఇతరులను తయారుచేసి తర్వాత ఇతర క్రొత్త క్రొత్త సేవాకేంద్రాలకు సర్వీసు చేసేందుకు పరుగెత్తాలి. ఎవరెవరు మురళిని బాగా చదివి వినిపిస్తారో, అర్థం చేయిస్తారో వారిని చూసి మీరిక్కడ ఉండి క్లాస్ చేయమని చెప్తారు. ఈ విధంగా అభ్యాసము చేయించి వారిని కూర్చోపెట్టి ఇతర సేవాకేంద్రాలను స్థాపించేందుకు వెళ్లిపోవాలి. ఒక సేవాకేంద్రాన్ని తయారుచేసి తర్వాత వెళ్లి మరొక సేవాకేంద్రాన్ని తెరవడం బ్రాహ్మణీల కర్తవ్యము. ఒక్కొక్క టీచర్ 10-20 సేవాకేంద్రాలను స్థాపన చేయాలి. చాలా సర్వీసు చేయాలి. దుకాణాలు తెరుస్తూ తమ సమానంగా తయారు చేసి ఎవరినైనా పెడ్తూ వెళ్లాలి. ఎవరినైనా తమ సమానంగా తయారుచేసి ఇతర సేవాకేంద్రాలను తెరవాలని మనసులో ఉండాలి. కానీ ఇంత నిజాయితీగా ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. విశ్వమంతటికీ సేవ చేయువారినే నిజాయితీపరులని అంటారు. ఒక సేవాకేంద్రాన్ని తెరచి, తమ సమానంగా తయారుచేసిన తర్వాత మరొక స్థానములో సేవ చేయాలి. ఒకే స్థానములో అతుక్కొని ఉండరాదు. ఒకవేళ ఎవరికైనా అర్థము చేయించలేకపోతే ఇతర సేవలు చేయండి. ఇందులో దేహాభిమానము ఉండరాదు. నేను గొప్పింటి అమ్మాయిని, ఈ పని ఎలా చేసేది,............... మాకు బాధ కలుగుతుంది, కొద్దిగా పని చేసినా చాలా దు:ఖిస్తారు(ఒళ్లు నొప్పులు అని బాధపడుతుంటారు), దీనిని దేహాభిమానము అని అంటారు. కొద్దిగా కూడా అర్థము చేసుకోరు, ఇతరులకు సర్వీసు చేయాలి కదా. బాబా, ఫలానావారు మాకు అర్థం చేయించారు, మా జీవితము బాగుపడిందని వారు కూడా బాబాకు వ్రాయాలి. సర్వీసు చేసినందుకు ఋజువు లభించాలి. ప్రతి ఒక్కరు టీచరుగా తయారవ్వాలి. బాబా, మా తర్వాత చాలామంది నిర్వహించే వారున్నారు, మేము చాలామందిని మా సమానంగా తయారుచేశాము, మేము సేవాకేంద్రాలను తెరుస్తూ వెళ్తాము అని పిల్లలు వారే స్వయంగా వ్రాయాలి. అలాంటి పిల్లలను పుష్పాలు అని అంటారు. సర్వీసే చేయకుంటే పుష్పాలుగా ఎలా అవుతారు? పూల తోట కూడా ఉంది కదా?
ఉద్ఘాటన చేసేవారికి కూడా అర్థం చేయించాలి - మేము బ్రహ్మకుమార - కుమారీలము. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యి దేవతలుగా అవుతాము. తండ్రి ఈ బ్రాహ్మణ కులమును మరియు సూర్య వంశము - చంద్ర వంశ కులమును స్థాపన చేస్తారు. ఈ సమయములో అందరూ శూద్ర వర్ణానికి చెందినవారు. సత్యయుగములో దేవతా వర్ణానికి చెందిన వారుండేవారు. తర్వాత క్షత్రియ, వైశ్య వర్ణమువారిగా అయ్యారు. పిల్లలు చాలా పాయింట్లు మర్చిపోతారని తండ్రికి తెలుసు. మొట్టమొదట బ్రాహ్మణ వర్ణము, ప్రజాపిత బ్రహ్మ సంతానము,........... బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? ఇక్కడ బ్రహ్మ కూర్చుని ఉన్నాడు కదా. చాలా బాగా అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారా స్థాపన, ఎవరి స్థాపన ? బ్రాహ్మణుల స్థాపన. తర్వాత వారికి శిక్షణనిచ్చి దేవతలుగా చేస్తారు. మనము తండ్రి ద్వారా చదువుకుంటున్నాము. వారు అర్జునునికి భగవానువాచ అని వ్రాసేశారు. అయితే అర్జునుడు ఎవరో ఎవ్వరికీ తెలియదు. మనము బ్రహ్మవంశస్థులైన బ్రాహ్మణులమని మీకు తెలుసు. ఒకవేళ మేము శివబాబాకు పిల్లలము, బ్రహ్మతో మాకు సంబంధము లేదని ఎవరైనా చెప్తే వారు దేవతలుగా ఎలా అవుతారు ? బ్రహ్మ ద్వారానే తయారవుతారు కదా. శివబాబా మీకు ''నన్ను స్మృతి చేయండి'' అని ఎవరి ద్వారా చెప్పారు ? బ్రహ్మ ద్వారా స్మృతి చేయమని చెప్పారు కదా. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా ఉన్నారు కదా. బ్రహ్మకుమార - కుమారీలు అని పిలువబడుతున్నారు. మనము బ్రహ్మ సంతానము. కావున తప్పకుండా బ్రహ్మ గుర్తుకు వస్తాడు. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా చదివిస్తారు. బ్రహ్మాబాబా మధ్యలో ఉన్నారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? నేను ఏ రథములో వస్తానో అతనిని కూడా తెలుసుకోవాలి. బ్రాహ్మణులుగా తయారవ్వాలి. బ్రహ్మను బాబా అని పిలవకపోతే పిల్లలుగా ఎలా అవుతారు? స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించకుంటే శూద్రులుగా ఉన్నట్లే. శూద్రుల నుండి వెంటనే దేవతలుగా అవ్వడం చాలా కష్టము. బ్రాహ్మణులుగా అయ్యి శివబాబాను స్మృతి చేయకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? ఇందులో తికమక పడే అవసరము కూడా లేదు. తండ్రి ద్వారా ఉద్ఘాటన జరిగిపోయిందని, ఉద్ఘాటన చేసేవారికి కూడా అర్థం చేయించాలి. కేవలం తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయని మీకు కూడా తెలుపుతున్నాము. ఆ తండ్రియే పతితపావనుడు. మీరు మళ్లీ పావనమై, దేవతలుగా అవుతారు. పిల్లలు చాలా సర్వీసు చేయగలరు. మేము తండ్రి సందేశమును ఇస్తున్నామని చెప్పండి. ఇప్పుడు చేయండి, చేయకపోండి మీ ఇష్టము. మేము సందేశమును ఇచ్చి వెళ్తాము. మరే విధంగా పావనంగా అవ్వనే అవ్వరు. తీరిక ఉన్నప్పుడు సర్వీసు చేయండి. సమయమైతే చాలా లభిస్తుంది అని వారికి చెప్పండి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కొత్త కొత్త సేవాకేంద్రాలను వృద్ధి చేసేందుకు, ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేయాలి. సేవాకేంద్రాలను తెరుస్తూ వెళ్లాలి. ఒకే స్థానములో కూర్చుండిపోరాదు.
2. పూలతోటను తయారు చేయాలి. ప్రతి ఒక్కరు పుష్పంగా తయారై ఇతరులను తమ సమానం పుష్పాలుగా తయారు చేయాలి. ఏ సేవలోనూ దేహాభిమానము రాకూడదు.
వరదానము :-
'' దినచర్యలో ఏ కర్మ చేస్తున్నా యధార్థంగా యుక్తియుక్తంగా నడిచే పూజ్య పవిత్ర ఆత్మా భవ ''
పూజ్య, పవిత్రమైన ఆత్మకు గుర్తు - వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ, స్వప్నముతో సహా యధార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటుంది. ప్రతి సంకల్పంలో అర్థముంటుంది. అంతేగాని ఏదో మాట్లాడేశాను, అనేశాను(వచ్చేసింది), చేసేశాను, అయిపోయింది అని కాదు. పవిత్ర ఆత్మ దినచర్యలోని ప్రతి కర్మ సదా యధార్థంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. అందువలన వారు చేసే ప్రతి కర్మకు కూడా పూజ జరుగుతుంది అనగా వారి పూర్తి దినచర్యకు పూజ జరుగుతుంది. నిదురలేచినప్పటి నుండి రాత్రి నిదురించునంతవరకు భిన్న భిన్న కర్మల దర్శనము జరుగుతుంది.
స్లోగన్ :-
'' సూర్యవంశీయులుగా అవ్వాలంటే, సదా విజయీ స్థితిని, ఏకరస స్థితిని తయారు చేసుకోండి. ''