12-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - అంతర్ముఖులై స్మృతి చేసే అభ్యాసము చేయండి, మేము ఎంత సమయము ఆత్మాభిమానిగా మరియు పరమాత్మాభిమానిగా ఉంటాము'' అని చెక్‌ చేసుకోండి''

ప్రశ్న :

ఏకాంతములోకి వెళ్లి ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చేసే పిల్లల గుర్తులు ఏమిటి?

జవాబు :-

1. వారి నోటి ద్వారా ఎప్పుడూ ఉల్టా-సుల్టా(తప్పు) మాటలు వెలువడవు. 2. పరస్పరములో చాలా సోదర(భాయి-భాయి) ప్రీతి ఉంటుంది. సదా పాలు, పంచదారగా కలిసి ఉంటారు. 3. ధారణ చాలా బాగుంటుంది. వారి ద్వారా ఏ వికర్మలు జరగవు 4. వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది. వారికి ఎప్పుడూ దేహాభిమానము రాదు. 5. ఎవ్వరికీ దు:ఖమునివ్వరు.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలను కేవలం ఆత్మ అని అన్నట్లయితే జీవము(శరీరము) దూరమౌతుంది. కనుక ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి తెలియచేస్తున్నారు - స్వయాన్ని ఆత్మ అని భావించాలి. ఆత్మలమైన మనకు తండ్రి ద్వారా ఈ జ్ఞానము లభిస్తుంది. పిల్లలు ఆత్మాభిమానులై ఉండాలి. తండ్రి పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చారు. మీరు సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారు కాని పరమాత్మాభిమానులుగా ఉండరు. ఇక్కడ మీరు ఆత్మాభిమానులుగా అవుతారు అంతేకాక పరమాత్మాభిమానులుగా కూడా అవుతారు అనగా మనము తండ్రి సంతానము. ఇక్కడకు, అక్కడకు చాలా వ్యత్యాసముంది. ఇక్కడ చదువు ఉంటుంది. అక్కడ చదువు మాటే ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మరియు బాబా మనలను చదివిస్తున్నారనే నిశ్చయముతో వింటారు కనుక ధారణ చాలా బాగా జరుగుతుంది. ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. ఈ స్థితిలో స్థితమయ్యే గమ్యము చాలా గొప్పది. వినేందుకు చాలా సులభమనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి, ఇతరులను కూడా ఆత్మగా భావించి ఎలా మాట్లాడ్తాము అనే అనుభవాన్ని పిల్లలైన మీరు వినిపించాలి. ఆత్మలనే చదివిస్తాను. భక్తిమార్గములో కూడా ఆత్మ పాత్రాభినయము చేస్తూ వచ్చింది. పాత్ర చేస్తూ చేస్తూ పతితమయ్యింది. ఇప్పుడు ఆత్మ మళ్లీ పవిత్రంగా అవ్వాలి. అయితే ఎప్పటివరకు తండ్రిని పరమాత్మగా తెలుసుకొని స్మృతి చేయరో అప్పటివరకు పవిత్రంగా ఎలా అవుతారు. దీనిని గురించి పిల్లలు చాలా అంతర్ముఖులుగా అయ్యి స్మృతి చేసే అభ్యాసము చేయాలి. జ్ఞానము సహజమైనది. ఆత్మలమైన మేము చదువుకుంటున్నాము, బాబా మమ్ములను చదివిస్తున్నారు అనే నిశ్చయము పక్కాగా ఉన్నప్పుడే ధారణ జరుగుతుంది అంతేకాక ఏ వికర్మలూ జరగవు. ఈ సమయములో మన ద్వారా ఏ వికర్మలు జరగడం లేదని చెప్పలేము. చివరి సమయములో వికర్మాజీతులుగా అవుతారు. సోదర దృష్టి చాలా మధురంగా ఉంటుంది. ఇందులో ఎప్పుడూ దేహాభిమానము రాదు. బాబా జ్ఞానము చాలా లోతైనదని పిల్లలు అర్థం చేసుకున్నారు. అత్యంత ఉన్నతంగా అవ్వాలంటే దీనిని చాలా బాగా అభ్యాసము చేయవలసి వస్తుంది. దీని పై బాగా ఆలోచించవలసి ఉంటుంది. అంతర్ముఖులుగా అయ్యేందుకు ఏకాంతము కూడా కావాలి. ఇక్కడ ఉన్న ఏకాంతము ఇంటిలో, వ్యాపార వ్యవహారాలలో లభించదు. ఇక్కడ మీరు చాలా బాగా అభ్యాసము చేయవచ్చు. ఆత్మనే చూడాల్సి వస్తుంది. స్వయాన్ని కూడా ఆత్మ అని భావించాలి. ఈ సాధన ఇక్కడ చేయడం వలన అదే అలవాటైపోతుంది. ఎంతవరకు ఆత్మాభిమానులుగా అయ్యామని చార్టు కూడా ఉంచుకోవాలి. మేము ఆత్మలకే వినిపిస్తున్నాము, ఆత్మలతోనే మాట్లాడుతున్నాము అని బాగా అభ్యాసము చేయాలి. ఈ మాట సరైనదని పిల్లలు అర్థము చేసుకొని ఉంటారు. దేహాభిమానము దూరమవ్వాలి, ఆత్మాభిమానులుగా అవ్వాలి. దీనిని ధారణ చేస్తూ, చేయిస్తూ ఉండాలి. ప్రయత్నము చేసి స్వయాన్ని ఆత్మ అని భావించి బాబాను స్మృతి చేయాలి. ఈ చార్టు చాలా లోతైనది. బాబా ప్రతి రోజూ విచార సాగర మథనము చేసేందుకు ఏ సబ్జెక్టు ఇస్తారో అవి చాలా గొప్ప పాయింట్లు అని పెద్ద పెద్ద మహారథులు కూడా అర్థం చేసుకొని ఉంటారు. అలా చేస్తే ఎప్పుడూ నోటి ద్వారా ఉల్టా-సుల్టా మాటలు వెలువడవు. సోదరులకు పరస్పరములో చాలా ప్రేమ కలుగుతుంది. మనమంతా ఈశ్వరుని సంతానము. తండ్రి మహిమ ఏమిటో తెలుసుకునే ఉన్నారు. కృష్ణుని మహిమ వేరు. వారిని సర్వగుణ సంపన్నులు....... అని మహిమ చేస్తారు. కాని కృష్ణునికి ఆ గుణాలు ఎలా వచ్చాయి? వారి మహిమ వేరుగా ఉండొచ్చు, కాని జ్ఞానసాగరులైన తండ్రి ద్వారానే సర్వ గుణ సంపన్నులుగా అయ్యారు కదా. కనుక స్వయాన్ని చాలా పరిశీలించుకోవాలి. అడుగడుగులో పూర్తి లెక్కాచారాన్ని చూసుకోవాలి. వ్యాపారస్థులు పూర్తి లెక్కాచారమును ప్రతిరోజు రాత్రి చూసుకుంటారు. మీది కూడా వ్యాపారమే కదా. మేము అందరినీ సోదరులు అని భావించి మాట్లాడినామా? ఎవరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? అని ప్రతి రోజు రాత్రి చెక్‌ చేసుకోవాలి. ఎందుకంటే సోదరులైన మనమంతా క్షీరసాగరము వైపు వెళ్తున్నామని మీకు తెలుసు. ఇది విషయ సాగరము. ఇప్పుడు మీరు రావణ రాజ్యములోనూ లేరు, రామరాజ్యములోనూ లేరు. మీరు మధ్యలో ఉన్నారు కనుక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఎంతవరకు మాకు ఆ సోదర దృష్టి స్థితి ఉంది? అని చూసుకోవాలి. ఆత్మలైన మనమంతా పరస్పరములో సోదరులము. మనము ఈ శరీరము ద్వారా పాత్ర చేస్తాము. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. మనము 84 జన్మల పాత్రను అభినయించాము. ఇప్పుడు తండ్రి వచ్చి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఆత్మ అని తెలుసుకోవడం వల్ల సోదరులుగా అయిపోతారు. ఇది స్వయం తండ్రే అర్థం చేయిస్తున్నారు. తండ్రికి తప్ప వేరెవ్వరికీ ఈ పాత్ర లేదు. ప్రేరణ మొదలైనవి లేవు. ఎలాగైతే టీచరు కూర్చొని అర్థం చేయిస్తారో అలా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇవి ఆలోచించవలసిన విషయాలు. అందుకు సమయము కూడా ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి వ్యాపారము మొదలైనవి చేసుకోవచ్చు అని చెప్పారు. కాని స్మృతియాత్ర కూడా అవసరము. దాని కొరకు కూడా సమయాన్ని కేటాయించాలి. అందరి సర్వీసు కూడా వేరు వేరుగా ఉంటుంది. కొందరు ఎక్కువ సమయము కేటాయించగలరు. పత్రికలలో కూడా చాలా యుక్తిగా వ్రాయాలి. ఇక్కడ ఇలాంటి తండ్రిని స్మృతి చేయడం జరుగుతుంది. పరస్పరము సోదరులమని భావించాల్సి ఉంటుంది అని వ్రాయాలి.

తండ్రి వచ్చి ఆత్మలందరిని చదివిస్తున్నారు. ఆత్మలో దైవీగుణాల సంస్కారాన్ని ఇప్పుడే నింపుకోవాలి. భారతదేశ ప్రాచీన యోగమేది? అని అడుగుతారు. మీరు తెలిపించగలరు కాని ఇప్పుడు మీరు కొద్దిమందే ఉన్నారు. మీ పేరు ఇంకా ప్రసిద్ధి చెందలేదు. ఈశ్వరుడు యోగము నేర్పిస్తారు. తప్పకుండా వారికి పిల్లలు కూడా ఉంటారు. ఇది ఎవ్వరికీ తెలియదని వారికి కూడా తెలిసి ఉంటుంది. నిరాకార తండ్రి ఎలా వచ్చి చదివిస్తారు. నేను కల్ప-కల్పము సంగమ యుగములో వస్తానని, స్వయంగా నేనే తెలుపుతానని వారే వచ్చి స్వయంగా చెప్తున్నారు. ఎవరి తనువులో వస్తానో కూడా తెలుపుతాను. ఇందులో తికమక పడవలసిందేమీ లేదు. ఇది తయారైన డ్రామా. ఒక్కరిలోనే వస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాను. అతడే మొట్టమొదటి ముద్దు బిడ్డగా అవుతాడు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తారు. మళ్లీ వారే మొదటి నంబరులో వస్తారు. ఈ చిత్రము గురించి అర్థం చేయించడం చాలా మంచిది. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారో ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. అర్థము చేయించే యుక్తి కావాలి. బాబా దేవతా ధర్మమును ఎలా స్థాపన చేస్తున్నారు? చక్రము ఎలా తిరుగుతూ ఉంది? ఈ విషయాలు పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. కనుక ఇలాంటి విషయాలను యుక్తిగా వ్రాయండని బాబా అంటున్నారు. యదార్థమైన యోగాన్ని ఎవరు నేర్పించగలరో తెలుసుకుంటే మీ వద్దకు చాలామంది వస్తారు. ఇంత పెద్ద ఆశ్రమాలున్నాయి. అన్నీ కదలడం మొదలవుతుంది. ఇది చివర్లో జరుగుతుంది తర్వాత ఆశ్చర్యపడ్తారు. భక్తిమార్గపు సంస్థలు అనేకమున్నాయి. జ్ఞాన మార్గముది ఒక్కటి కూడా లేదు. అప్పుడే మీకు విజయము లభిస్తుంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారని మీకు తెలుసు. తండ్రి ద్వారా మీరు నేర్చుకుంటున్నారు, ఇతరులకు నేర్పిస్తున్నారు. ఇతరులకు వ్రాత పూర్వకంగా ఎలా తెలియచేయాలనే యుక్తులు కల్ప-కల్పము వెలువడ్తాయి. ఇవి చాలామందికి తెలుస్తాయి. ఒక్క తండ్రి తప్ప ఏకధర్మ స్థాపన వేరెవ్వరూ చేయలేరు. ఆ వైపు రావణుడు, మీ వైపు రాముడు ఉన్నాడని మీకు తెలుసు. రావణుని పై మీరు విజయము పొందుతారు. వారంతా రావణ సంప్రదాయానికి చెందినవారు. ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. భక్తిలో ఎంత ఆడంబరముంది! ఎక్కడెక్కడ నీరు(నది) ఉంటుందో అక్కడ మేళా జరుగుతుంది. ఎంత ఖర్చు చేస్తారు. ఎంతోమంది మునిగి మరణిస్తారు. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. అయినా తండ్రి చెప్తారు - ఆశ్చర్యకరంగా నన్ను గుర్తిస్తారు, వింటారు, వినిపిస్తారు, పవిత్రంగా ఉంటారు, అహో మాయ! నీ ద్వారా ఓటమిని చవి చూస్తారు. కల్ప-కల్పము ఇలా జరుగుతుంది. ఓటమి పాలు కూడా అవుతూ ఉంటారు. మాయతో యుద్ధము జరుగుతుంది. మాయ ప్రభావము కూడా ఉంది. భక్తి కదలనే కదలాలి. అర్ధకల్పము మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. మళ్లీ రావణ రాజ్యము నుండి భక్తి ప్రారంభమవుతుంది. దాని గుర్తులు కూడా స్థిరంగా ఉన్నాయి. వికారాలలోకి వెళ్తారు. తర్వాత దేవతలుండరు. వికారులుగా ఎలా అవుతారో ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. వామమార్గములో వెళ్లారని శాస్త్రాలలో వ్రాసేశారు. ఎప్పుడు వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ బాగా అర్థము చేసుకొని, ఇతరులకు అర్థం చేయించాలి. నిశ్చయబుద్ధి ఉన్నప్పుడే అర్థము చేసుకోగలరు. వారికి ఆకర్షణ కలుగుతుంది. ఇటువంటి తండ్రితో మమ్ములను కలపండి అని అంటారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ నషా ఉంటుందా? నిశ్చయ బుద్ధి ఉందా? అని మొదట చూసుకోవాలి. మీరు మా సత్యమైన తండ్రి, మీ ద్వారా ఉన్నతమైన ఆస్తి లభిస్తుంది, మిమ్ములను కలవకుండా ఉండలేమని జ్ఞాపకము సతాయిస్తూ పత్రము వ్రాస్తూ ఉండాలి. నిశ్చితార్థమైన తర్వాతనే మిలనము జరుగుతుంది. నిశ్చితార్థము తర్వాతనే తపన ఉంటుంది. వీరు మన అనంతమైన తండ్రి, టీచరు, ప్రియతముడు సర్వస్వమూ అని మీకు తెలుసు. మిగిలిన అందరి నుండి దు:ఖమే లభించింది. అందుకు ఫలితంగా తండ్రి సుఖాన్నిస్తున్నారు. అక్కడ కూడా అందరూ సుఖాన్నిస్తారు. ఈ సమయములో మీరు సుఖ సంబంధములో బంధింపబడ్తున్నారు.

ఇది పురుషోత్తములుగా అయ్యే పురుషోత్తమ యుగము. స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని ప్రేమతో స్మృతి చేయడము ముఖ్యమైన విషయము. స్మృతి ద్వారా అపారమైన సంతోషము కలుగుతుంది. మనమే అందరికన్నా ఎక్కువ భక్తి చేశాము, చాలా ఎదురుదెబ్బలు తిన్నాము. ఇప్పుడు వాపస్‌ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. కనుక తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. మొత్తం రోజంతటిలో ఎంతమందికి తండ్రి పరిచయమిచ్చాను? అని లెక్కాచారాన్ని ఉంచుకోవాలి. తండ్రి పరిచయమును ఇవ్వకుండా సుఖము లభించదు. తపిస్తూ ఉంటారు. యజ్ఞములో చాలా విఘ్నాలు కూడా వస్తాయి. దెబ్బలు కూడా తింటారు. పవిత్రంగా ఉండాలని తెలిపే సత్సంగాలు ఏవీ లేవు. ఇక్కడ మీరు పవిత్రంగా అవుతారు. కనుక అసురులు విఘ్నాలు వేస్తారు. పావనంగా అయ్యి ఇంటికి వెళ్లాలి. ఆత్మనే సంస్కారాన్ని తీసుకెళ్తుంది. యుద్ధ మైదానములో మరణిస్తే స్వర్గానికి వెళ్తారని అంటారు. కనుక యుద్ధానికి సంతోషంగా వెళ్తారు. మీ వద్దకు కమాండర్లు, మేజర్లు, సిపాయిలు మొదలైనవారు ఎక్కడెక్కడి నుండో వస్తారు. స్వర్గానికి ఎలా వెళ్తారు? యుద్ధ మైదానములో బంధు-మిత్రులు జ్ఞాపకము వస్తారు. ఇప్పుడు అందరూ వాపస్‌ వెళ్లాలని తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. భాయి-భాయి అని భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. మేము పరస్పరము సోదరులమని వారు కూడా అంటారు. కాని వారికి అర్థము తెలియదు. వారికి తండ్రి ఎవరో కూడా తెలియదు.

మేము నిష్కామ సేవ చేస్తాము, మాకు ఫలాపేక్ష లేదు అని మనుష్యులు అనుకుంటారు. కాని ఫలము తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవ ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. తండ్రిని ఎంతగా నిందించామో పిల్లలకు తెలుసు. దేవతలను కూడా నిందించాము. దేవతలు ఎవ్వరినీ హింసించరు. ఇక్కడైతే మీరు డబల్‌ అహింసకులుగా అవుతారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించరాదు, కోపము చేసుకోరాదు. కోపము కూడా పెద్ద వికారము. పిల్లల పై చాలా కోపము చేసుకున్నామని అంటారు. చెంపదెబ్బ మొదలైనవి ఎప్పుడూ కొట్టరాదని తండ్రి చెప్తారు. వారు కూడా సోదరులే. వారిలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా ఉండదు. మీ కొడుకు కాదు కానీ చిన్న సోదరుడు, ఆత్మ అని భావించాలి. ఆత్మ అని తెలుసుకోవాలి. చిన్న తమ్ముడిని కొట్టరాదు. కనుకనే కృష్ణుని రోలుకు బంధించినట్లు చూపిస్తారు. వాస్తవానికి అలాంటి మాటేమీ లేదు. ఇవి భిన్న భిన్నమైన శిక్షణలు. కృష్ణునికి వెన్న దొంగిలించే అవసరము ఏమి వచ్చింది. వారు దొంగతనమును కూడా మహిమగా వర్ణిస్తారు. వారు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని మీరు సరైన మహిమ చేస్తారు. కాని ఈ నింద కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు అందరూ తమోప్రధానమైపోయారు. తండ్రి వచ్చి సతోప్రధానంగా చేస్తారు. చదివించేవారు అనంతమైన తండ్రి. వారి మతానుసారము నడవవలసి వస్తుంది. ఇది కష్టమైన సబ్జక్టు. మీరు చాలా ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. ఒకవేళ సహజమైనట్లయితే అందరూ ఈ పరీక్షలో నిమగ్నమవుతారు. ఇందులో చాలా శ్రమ ఉంది. దేహాభిమానములోకి రావడం వలన వికర్మలు జరుగుతాయి. దీనికి అత్తిపత్తి(తాకగానే ముడుచుకొని పోవు మొక్క) దృష్టాంతముగా ఉంది. తండ్రిని స్మృతి చేసినందున మీరు దృఢంగా నిలబడ్తారు. మర్చిపోవడం వలన ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షణ అయితే అందరికీ ఇచ్చారు. ఈ శిక్షణే తర్వాత గీతగా తయారు చేయబడింది. గరుడ పురాణములో మనుష్యులకు భయము కలిగించే భయంకరమైన విషయాలను వ్రాశారు. రావణ రాజ్యములో పాపము జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ముళ్ల అడవి. దృష్టిని కూడా పరివర్తన చేసుకోవాలి. చాలా సమయము నుండి అలవాటు పడి ఉన్నారు. కనుక శరీరము పై ప్రేమ కలుగుతుంది. వినాశీ వస్తువుల పైన ప్రేమ ఉంచుకోవడము వల్ల లాభమేముంది? అవినాశి పై ప్రేమ ఉంచుకున్నట్లయితే అవినాశిగా అవుతారు. కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండని పిల్లలకు తండ్రి ఆదేశమునిస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శరీరము వినాశి, దాని పై గల ప్రేమను తొలగించి అవినాశి ఆత్మను ప్రేమించాలి. అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలు సోదరులు, మేము సోదరులతో మాట్లాడుతున్నామని అభ్యాసము చేయాలి.

2. విచార సాగర మథనము చేసి నోటి ద్వారా ఎప్పుడూ ఎలాంటి ఉల్టా-సుల్టా మాటలు వెలువడని విధంగా మీ స్థితిని తయారు చేసుకోవాలి. అడుగడుగులో మీ లెక్కాచారాన్ని చెక్‌ చేసుకోవాలి.

వరదానము :-

''ఈశ్వరీయ సాంగత్యములో ఉండి వ్యతిరేక (ఉల్టా) సాంగత్యపు దాడి నుండి రక్షించుకునే సదాకాలపు సత్సంగీ భవ''

ఎటువంటి చెడు సాంగత్యమైనా, మీ శ్రేష్ఠమైన సాంగత్యము దాని కంటే అనేకరెట్లు శక్తిశాలి ఈశ్వరీయ సాంగత్యము ముందు ఆ సాంగత్యము ఏ పాటిది? ఏమియూ లేదు. అందరూ బలహీనంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే స్వయం మీరు బలహీనంగా అవుతారో అప్పుడు వ్యతిరేక సాంగత్య రంగు దాడి జరుగుతుంది. ఎవరైనా సదా ఒక్క తండ్రి సాంగత్యములో ఉంటారో అనగా సదా సత్సంగీయులుగా ఉంటారో వారు ఏ ఇతర సాంగత్య రంగుకు ప్రభావితం అవ్వజాలరు. వ్యర్థ మాటలు, వ్యర్థ సాంగత్యము అనగా చెడు సాంగత్యము వారిని ఆకర్షించలేదు.

స్లోగన్‌ :-

''చెడును కూడా మంచిలోకి పరివర్తన చేయువారే ప్రసన్నచిత్తులుగా ఉండగలరు''