18-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ పురుషోత్తమ సంగమయుగమే గీతా అధ్యాయము ఇందులోనే మీరు పురుషార్థము చేసి ఉత్తమ పురుషులుగా అనగా దేవతలుగా అవ్వాలి ''
ప్రశ్న :-
తండ్రి చెప్పే ఏ ఒక్క విషయము పై సదా గమనముంటే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది?
జవాబు :-
మేము సదా ఈశ్వరీయ సాంగత్యములో ఉండాలని గమనముంటే నావ తీరానికి చేరుతుంది. ఒకవేళ సాంగత్య దోషమునకు వశమై సంశయము వస్తే, నావ విషయ సాగరములో మునిగిపోతుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయము రాకూడదు. తండ్రి తన పిల్లలైన మిమ్ములను తన సమానము పవిత్రంగా మరియు జ్ఞానసాగరులుగా చేసేందుకు వచ్చారు. తండ్రి సాంగత్యములోనే ఉండాలి.
ఓంశాంతి.
భగవానువాచ - 5 వేల సంవత్సరాల క్రితము తండ్రి ఏ రాజయోగాన్ని నేర్పించారో, అదే రాజయోగమును ఇప్పుడు మళ్లీ నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. గీతా భగవానుడు ఎవరో పిల్లలకు తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు. అందువలన గీతాభగవానుడు ఎప్పుడు వచ్చారు? అని ప్రశ్నించాలి. నేను రాజయోగమును నేర్పించి మిమ్ములను రాజాధిరాజులుగా చేస్తానని భగవంతుడు ఏదైతే చెప్పారో, ఆ గీతా అధ్యాయము ఎప్పుడు జరిగిందని ప్రశ్నించాలి. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటున్నారు. కలియుగ అంతము మరియు సత్యయుగము ఆదికి మధ్యలోనే గీతా అధ్యాయము జరగాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన తప్పకుండా సంగమ యుగములోనే వచ్చి చేస్తారు. ఇప్పుడిది తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగము. భలే పురుషోత్తమ సంవత్సరమని గానము చేస్తారే కానీ అదేమిటో పాపం వారికి తెలియదు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు - ఉత్తమ పురుషులుగా చేసేందుకు లేక మనుష్యులను ఉత్తమ దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి చదివిస్తారు. మనుష్యులలో ఉత్తమ పురుషులు ఈ దేవతలు(లక్ష్మీనారాయణులు). మనుష్యులను దేవతలుగా ఈ సంగమ యుగములోనే తయారు చేశారు. దేవతలు తప్పకుండా సత్యయుగములోనే ఉంటారు. ఇప్పుడు అందరూ కలియుగములో ఉన్నారు అయితే మనము సంగమయుగీ బ్రాహ్మణులమని పిల్లలైన మీకు తెలుసు. ఇది పక్కా పక్కాగా స్మృతి చేయాలి లేకుంటే వాస్తవానికి ఎవ్వరూ తమ కులమును మర్చిపోరు, కానీ ఇక్కడ మాయ మరపింపజేస్తుంది. మనము బ్రాహ్మణ కులములో ఉన్నాము తర్వాత మళ్లీ దేవతా కులమువారిగా అవుతాము. ఇది స్మృతిలో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు రాజయోగ చదువును చదువుచున్నారు. ఇప్పుడు మళ్లీ భగవంతుడు గీతా జ్ఞానమును వినిపిస్తున్నారని, భారతవాసులకు ప్రాచీన యోగము కూడా నేర్పిస్తున్నారని మీకు తెలుసు. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. తండ్రి చెప్తున్నారు - కామము మహాశత్రువు, దీని పై విజయము పొందడం వలన మీరు జగత్జీతులుగా అవుతారు. పవిత్రత విషయములో ఎంతో వాదవివాదాలు చేస్తారు. మనుష్యులకు వికారాలు ఒక ఖజానా వలె ఉన్నాయి అనగా వాటిని వదిలిపెట్టరు. లౌకిక తండ్రితో ఈ వారసత్వము లభించింది. పిల్లలుగా జన్మిస్తూనే మొట్టమొదట తండ్రి నుండి ఈ వికారి వారసత్వము లభిస్తుంది. వివాహము సర్వ నాశనము చేయిస్తుంది. అనంతమైన తండ్రి చెప్తున్నారు - కామము మహాశత్రువు కనుక కామ వికారాన్ని జయించినందునే తప్పకుండా జగత్జీతులుగా అవుతారు. తండ్రి తప్పకుండా సంగమ యుగములోనే వచ్చి ఉంటారు. మహాభారీ మహాభారత యుద్ధము కూడా ఉంది. మనము కూడా ఇక్కడే ఉన్నాము. అలాగని అందరూ తక్షణమే కామము పై విజయము పొందుతారని కాదు. ప్రతి విషయములో సమయము పడ్తుంది. ముఖ్యంగా పిల్లలు ఈ విషయమే వ్రాస్తారు. బాబా! మేము విషయవైతరణీ నదిలో పడిపోయాము అందువలన తప్పకుండా ఏదో సుగ్రీవాజ్ఞ(ఆర్డినెన్స్) ఇవ్వాలి. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - కామమును జయించడం వలన మీరు జగత్జీతులుగా అవుతారు. అంతేకాని జగత్జీతులై మళ్లీ వికారాలలోకి వెళ్తారని కాదు. ఈ లక్ష్మీనారాయణులు జగత్జీతులు. వీరిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. దేవతలను అందరూ నిర్వికారులని అంటారు. వారి రాజ్యమును మీరు రామరాజ్యమని అంటారు. అది నిర్వికారి ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. అపవిత్ర గృహస్థ ఆశ్రమము. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమములో ఉండేవారని ఇప్పుడు 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రమయ్యారని బాబా అర్థం చేయించారు. ఇదే 84 జన్మల కథ. నూతన ప్రపంచము తప్పకుండా ఇటువంటి నిర్వికారి ప్రపంచముగా ఉండాలి. పవిత్రతాసాగరులైన భగవంతుడే దీనిని స్థాపన చేస్తారు మళ్లీ రామరాజ్యము కూడా తప్పకుండా వస్తుంది. వీటి పేరే రామరాజ్యము, రావణరాజ్యము. రావణ రాజ్యమంటే ఆసురీ రాజ్యము ఇప్పుడు మీరు ఆసురీ రాజ్యములో కూర్చుని ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు దైవీ రాజ్యపు గుర్తులు.
పిల్లలైన మీరు ప్రభాత ప్రదక్షిణలు(శాంతియాత్రలు, ఫేరీ) మొదలైనవి చేస్తారు. ప్రభాతము అనగా ఉదయము. ఆ సమయములో మనుష్యులు నిదురించి ఉంటారు. కనుక ఆలస్యంగా శాంతియాత్ర చేస్తారు. సేవాకేంద్రమున్న స్థానాలలో ప్రదర్శిని పెడ్తే ఇంకా బాగుంటుంది. అక్కడకు వచ్చి కామము మహాశత్రువని, దాని పై విజయము పొందడం వలన జగత్జీతులుగా అవుతారని మనుష్యులు అర్థం చేసుకోగలరు. లక్ష్మీనారాయణుల ట్రాన్స్లైట్ చిత్రము తప్పకుండా జతలో ఉండాలి. వీటిని ఎప్పుడూ మర్చిపోరాదు. ఒకటేమో ఈ చిత్రము, మరొకటి సీఢీ(మెట్ల) చిత్రము. ట్రక్కులో దేవతలను అలంకరించి ఊరేగించినట్లు మీరు కూడా 2-3 ట్రక్కులను అలంకరించి అందులో ముఖ్యమైన చిత్రాలను పెట్టి ఊరేగిస్తే బాగుంటుంది. రోజురోజుకు చిత్రాలు కూడా వృద్ధి చెందుతూ పోతాయి. మీ జ్ఞానము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది, పిల్లలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. అందులో పేదవారు, ధనికులు అందరూ వచ్చేస్తారు. శివబాబా భండారము నిండుతూ ఉంటుంది. ఎవరైతే భండారాన్ని నింపుతారో వారికి అక్కడ(సత్యయుగములో) ఎన్నో రెట్లు లభిస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీరు పదమాపదమపతులుగా, అది కూడా 21 జన్మలకు తయారయ్యేవారు. బాబా స్వయంగా చెప్తున్నారు - మీరు 21 తరాలకు ఈ జగత్తుకంతా అధికారులుగా అవుతారు. స్వయం నేనే నేరుగా వచ్చాను. మీ కొరకు అరచేతిలో స్వర్గము తీసుకొచ్చాను. పిల్లలు జన్మించగానే తండ్రి వారసత్వము వారి అరచేతిలో ఉన్నట్లే. ఆ లౌకిక తండ్రి ఈ ఇల్లువాకిళ్ళు మొదలైనవన్నీ నీవే అని చెప్తాడు. అలాగే ఈ అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు - ఎవరైతే నావారిగా అవుతారో, 21 తరాలకు స్వర్గ చక్రవర్తి పదవి వారిదే అవుతుంది ఎందుకంటే మీరు మృత్యువు పై విజయము పొందుతారు. అందుకే తండ్రిని మహాకాలుడని అంటారు. మహాకాలుడంటే సంహరించేవాడు కాదు, వారి మహిమ చేయబడ్తుంది. భగవంతుడు యమదూతలను పంపి రప్పించుకున్నాడని భావిస్తారు కానీ అలాంటిదేమీ లేదు. ఇవన్నీ భక్తిమార్గములోని విషయాలు. తండ్రి చెప్తున్నారు - నేను మృత్యువులకు మృత్యువును. కొండ ప్రాంతములో నివసించువారు మహాకాలుని కూడా చాలా పూజిస్తారు. చాలా గౌరవిస్తారు. మహాకాలుని మందిరము కూడా ఉంది. అటువంటి జండాలను కూడా ఎగురవేసి ఉంటారు. కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇది కరెక్టు విషయమని కూడా మీకు అర్థమయ్యింది. తండ్రిని స్మృతి చేస్తేనే జన్మ-జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. కనుక దీనిని ప్రచారము చేయాలి. కుంభమేళాలు మొదలైనవి చాలా జరుగుతాయి. పుణ్యస్నానము చేయుటకు కూడా చాలా మహత్వమును ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానామృతము 5 వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది. వాస్తవానికి దీనికి అమృతము అను పేరు లేదు. ఇది చదువు. ఇవన్నీ భక్తిమార్గములోని పేర్లు. అమృతము అనే పేరు విని చిత్రాలలో నీటిని చూపించారు. తండ్రి చెప్తున్నారు - నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. చదువు ద్వారానే ఉన్నతపదవి లభిస్తుంది. అది కూడా మిమ్ములను నేను స్వయంగా చదివిస్తాను. భగవంతునికి ఇటువంటి అలంకరింపబడిన రూపము లేనే లేదు. ఇతనిలో తండ్రి ప్రవేశించి చదివిస్తారు. చదివించి ఆత్మలను తన సమానంగా చేస్తారు. లక్ష్మీనారాయణులు తమ సమానంగా తయారు చేయలేరు. ఆత్మ చదువుతుంది. ఆత్మలను తమ సమానంగా జ్ఞాన సంపన్నంగా తండ్రి తయారు చేస్తారు. అలాగని భగవాన్, భగవతీగా తయారు చేస్తారని కాదు. వారు కృష్ణుని చూపించారు. వారు ఎలా చదివిస్తారు? సత్యయుగములో పతితులు ఉండనే ఉండరు, కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. తర్వాత ఎప్పుడూ మీరు కృష్ణుని చూడరు. డ్రామాలో పునర్జన్మలోని ప్రతి ఒక్కరి చిత్రము(దేహము) పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది సహజమైన(ప్రాకృతిక) డ్రామా. తయారై తయారు చేయబడిన డ్రామా (బనీ బనాయీ బన్ రహీ). తండ్రి కూడా చెప్తున్నారు - మీరు కల్ప-కల్పము ఇదే దుస్తులలో, ఇవే రూపురేఖలలో చదువుతూ వస్తారు. ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్లీ కల్పక్రితము ఏ శరీరమైతే తీసుకున్నదో అదే శరీరాన్ని తీసుకుంటుంది. డ్రామాలో కొద్దిగా కూడా వ్యత్యాసముండదు. అవి హద్దులోని విషయాలు, ఇవి అనంతమైన విషయాలు. వీటిని అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇందులో సంశయానికి తావే లేదు. నిశ్చయబుద్ధి గలవారిగా అవుతారు, మళ్లీ ఏదో ఒక సంశయము వచ్చేస్తుంది. సాంగత్య రంగు అంటుకుంటుంది. ఈశ్వరీయ సాంగత్యములో నడుస్తూ ఉంటే తీరానికి చేరిపోతారు. వదిలేస్తే విషయ సాగరములో మునిగిపోతారు. ఒకవైపు క్షీరసాగరము, మరోవైపు విషయసాగరము. జ్ఞానాన్ని అమృతమని కూడా అంటారు. తండ్రి జ్ఞానసాగరులు, వారి మహిమ కూడా ఉంది. వారికి ఏ మహిమైతే ఉందో ఆ మహిమను లక్ష్మీనారాయణులకు ఇవ్వలేరు. కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు. తండ్రి పవిత్రతాసాగరులు. భలే ఆ దేవతలు సత్య-త్రేతా యుగాలలో పవిత్రంగా ఉంటారు. కానీ సదా కొరకైతే పవిత్రంగా ఉండరు. మళ్లీ అర్ధకల్పము తర్వాత క్రిందికి దిగుజారుతారు. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. ఒక్క నేను మాత్రమే సద్గతిదాతను. మీరు సద్గతిలోకి వెళ్తారు. తర్వాత ఈ విషయాలు ఉండనే ఉండవు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖములో కూర్చుని ఉన్నారు. మీరు కూడా శివబాబా ద్వారా చదువుకొని టీచర్లుగా అయ్యారు. ముఖ్యమైన ప్రధానోపాధ్యాయుడు(ప్రిన్స్పల్) వారే. మీరు వారి వద్దకే వస్తారు. మేము శివబాబా వద్దకు వచ్చామని అంటారు. అరే! వారు నిరాకారులు. అయితే వారు ఇతని శరీరములో వస్తారు. అందుకే బాప్దాదా వద్దకు పోతున్నామని అంటారు. ఈ బాబా, శివబాబాకు రథము. ఇతని పైనే వారు సవారీ అయ్యి ఉన్నారు. ఇతనిని రథము, గుర్రము, అశ్వము అని కూడా అంటారు. దీని పై కూడా దక్షప్రజాపిత యజ్ఞము రచించారని ఒక కథ ఉంది. కథ వ్రాసేశారు. ఇది అలా కానే కాదు. అలా జరగనే లేదు.
శివ భగవానువాచ - భారతదేశములో అతి ధర్మగ్లాని జరిగినప్పుడు నేను వస్తాను. గీతావాదులు భలే యదాయదాహి........ అని అంటారు కానీ దీని అర్థము వారికి తెలియదు. ఇది మీ ధర్మము యొక్క చాలా చిన్న వృక్షము, దీనికి తుఫానులు కూడా వస్తాయి. క్రొత్త వృక్షము కదా. ఇది పునాది కూడా అయ్యింది. అనేక ధర్మాల మధ్యలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు అంటు కడ్తారు. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. ఇతర ధర్మ స్థాపకులకు ఇంత శ్రమ ఉండదు. వారు పై నుండి వస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే సత్య-త్రేతా యుగాలలో వచ్చేవారో, వారి ఆత్మలే కూర్చుని చదువుతాయి. పతితులైన వారిని పావన దేవతలుగా చేసేందుకు తండ్రి కూర్చుని చదివిస్తారు. ఇతడు కూడా గీతను చదివేవాడు. ఇప్పుడు ఎలాగైతే ఆత్మలను స్మృతి చేసి దృష్టి ఇవ్వబడ్తుందో, వారి పాపాలు నశిస్తాయో అలా భక్తిమార్గములో కూడా గీత ముందు జలము నుంచి చదివేవారు. పితృలు ఉద్ధరింపబడతారని అందువలన పితృలను స్మృతి చేస్తారు. భక్తిమార్గములో గీతను చాలా గౌరవించేవారు. అరే! బాబా ఏమైనా తక్కువ భక్తునిగా ఉండేవాడా! రామాయణము మొదలైనవన్నీ చదివేవారు. చాలా సంతోషము కలిగేది. ఇవన్నీ గతించిపోయాయి.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - గతించిన దానిని గురించి చింతించకండి. బుద్ధి నుండి అన్నీ తీసేయండి. బాబా స్థాపన, వినాశనము మరియు రాజధానిని సాక్షాత్కారము చేయించారు. ఇప్పుడు వారు పక్కా అయిపోయాడు. అంతకు ముందు ఇదంతా వినాశనమైపోతుందని తెలియనే తెలియదు. బాబా - ఇదంతా జరిగి తీరుతుంది, ఆలస్యము లేదు, నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతానని పూర్తిగా అర్థం చేసుకున్నారు, విశ్వసించారు. బాబా ఏమేమి ఆలోచించేవారో తెలియదు. శివబాబా ప్రవేశత ఎలా జరిగిందో పిల్లలైన మీకు తెలుసు. మొదట ఈ విషయాలు మీకు కూడా తెలియదు. బ్రహ్మ-విష్ణు-శంకరుల పేర్లు అయితే తీసుకుంటారు. కానీ ఈ ముగ్గురిలో భగవంతుడు ఎవరిలో ప్రవేశమవుతారో, ఎవ్వరికీ తెలియదు. వారు విష్ణువు పేరు తీసుకుంటారు. వారేమో దేవత అని ఇప్పుడు మీకు తెలుసు. దేవత ఎలా చదివిస్తారు? బాబా స్వయంగా తెలుపుతున్నారు - నేను ఇతనిలో ప్రవేశిస్తాను అందుకే బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపించారు. అది విష్ణువు ద్వారా పాలన, అది శంకరుని ద్వారా వినాశనము. ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. భగవానువాచ - నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. ఆ భగవానుడు ఎప్పుడు వచ్చారు! రాజయోగమును ఎలా నేర్పించారు! రాజ్య పదవిని ఎలా ఇప్పించారు! ఈ విషయాలు మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. 84 జన్మల రహస్యము కూడా అర్థం చేయించారు. పూజ్యులు - పూజారులు, వీటిని గురించి కూడా అర్థం చేయించారు. ప్రపంచమంతా కోరుకునే శాంతిరాజ్యము ఈ లక్ష్మీ-నారాయణులది. అది విశ్వములో ఉండేదని మీకు తెలుసు. లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండినప్పుడు మిగిలిన అందరూ శాంతిధామములోఉండేవారు. ఇప్పుడు మనము శ్రీమతమును అనుసరించి ఈ కార్యము చేస్తున్నాము. అనేకసార్లు చేశాము, చేస్తూనే ఉంటాము. ఇది కూడా మీకు తెలుసు - కోట్లలో ఏ కొంతమంది మాత్రమే వస్తారు. దేవీదేవతా ధర్మము వారికి మాత్రమే టచ్ అవుతుంది. ఇది భారతదేశానికి చెందిన విషయము. ఎవరైతే ఈ కులానికి చెందినవారుగా ఉంటారో, వారే వస్తారు. తర్వాత కూడా వస్తూ ఉంటారు. మీరు ఎలాగైతే వచ్చారో అలా ఇతర ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు మంచి పదవిని పొందుతారు. ముఖ్యమైనవి - జ్ఞాన-యోగాలు. యోగము కొరకు కూడా జ్ఞానము కావాలి. తర్వాత పవర్హౌస్తో యోగముండాలి. యోగము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా అవుతారు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు కూడా అవుతారు. అచ్ఛా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. గడచిపోయిన విషయాలను గురించి చింతన చేయరాదు. ఇంతవరకు చదివిందంతా మర్చిపోవాలి. ఒక్క తండ్రితోనే వినాలి. మీది బ్రాహ్మణ కులమని సదా గుర్తుంచుకోవాలి.
2. పూర్తి నిశ్చయబుద్ధి కలిగి ఉండాలి. ఏ విషయములోనూ సంశయము రాకూడదు. ఈశ్వరీయ సాంగత్యాన్ని, చదువును ఎప్పుడూ వదిలి పెట్టరాదు.
వరదానము :-
''వరదాత ద్వారా సర్వ శ్రేష్ఠమైన సంపదను ప్రాప్తి చేసుకొను సంపత్తివాన్ భవ''
ఎవరి వద్ద అయినా కేవలం స్థూల సంపద ఉన్నా, సదా సంతుష్టంగా (తృప్తిగా) ఉండలేరు. స్థూల సంపదతో పాటు సర్వ గుణాల సంపద, సర్వ శక్తుల సంపద, శ్రేష్ఠమైన జ్ఞాన సంపద లేకుంటే సంతుష్టత సదా ఉండదు. మీ అందరి వద్ద ఈ శ్రేష్ఠమైన సంపదలన్నీ ఉన్నాయి. ప్రపంచములోని వారు కేవలం స్థూలమైన సంపద గలవారినే సంపన్నులని భావిస్తారు. కాని వరదాత అయిన తండ్రి ద్వారా పిల్లలైన మీకు '' సర్వశ్రేష్ఠ సంపత్తివాన్ భవ '' అనే వరదానం లభిస్తుంది.
స్లోగన్ :-
''సత్యమైన సాధన ద్వారా 'అయ్యో - అయ్యో (హాయ్, హాయ్)' అనుటను 'వాహ్-వాహ్' లోకి పరివర్తన చేయండి.''