20-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. అన్నిటికంటే పెద్ద ముల్లు దేహాభిమానము. అందుకే అన్ని వికారాలు వచ్చేస్తాయి. కనుకనే ఆత్మాభిమానులుగా అవ్వండి.''

ప్రశ్న :-

భక్తులు తండ్రి ఏ కర్తవ్యాన్ని అర్థము చేసుకోని కారణంగా తండ్రిని సర్వవ్యాపి అని అనేశారు?

జవాబు :-

తండ్రి బహురూపి. ఎక్కడ అవశ్యకత ఉంటే అక్కడకు క్షణములో ఏ బిడ్డలోనైనా ప్రవేశించి ఎదురుగా ఉన్న ఆత్మ కళ్యాణము చేసేస్తారు. భక్తులకు సాక్షాత్కారము చేయిస్తారు. వారు సర్వవ్యాపి కాదు, కానీ చాలా తీవ్రమైన రాకెట్‌. తండ్రి వచ్చేందుకు, వెళ్లేందుకు సమయము పట్టదు. ఈ విషయాన్ని అర్థము చేసుకోని కారణము వలన భక్తులు భగవంతుని సర్వవ్యాపి అని అనేస్తారు.

ఓంశాంతి.

స్వర్గమని, అడవిని నరకమని అంటారు. తండ్రి కూడా అర్థము చేయిస్తున్నారు - ఇది పతిత ముళ్ళ అడవి, అది పూల తోట. ఒకప్పుడు పూలతోట ఉండేది, అది ఇప్పుడు ముళ్ళ అడవిగా అయ్యింది. దేహాభిమానము అన్నిటికంటే పెద్ద ముల్లు. దాని తర్వాతనే మిగిలిన వికారాలన్నీ వస్తాయి. అక్కడైతే(స్వర్గములో) మీరు దేహీ-అభిమానులుగా ఉంటారు. ఆత్మలో జ్ఞానముంటుంది - ''ఇప్పుడు నా ఆయువు పూర్తి అవుతుంది, ఇప్పుడు నేను ఈ పాత శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను, నేను గర్భ మహలులోకి వెళ్లి విరాజమానమవుతాను'' అని సాక్షత్కారమౌతుంది. మళ్లీ మొగ్గగా అయ్యి మొగ్గ నుండి పుష్పంగా అవుతాను అనే జ్ఞానము ఆత్మకు ఉంటుంది. అక్కడ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానముండదు. కేవలం ఇది పాత శరీరము, దీనిని ఇప్పుడు మార్చాలి అన్న జ్ఞానముంటుంది. ఆంతరికములో ఖుషీ ఉంటుంది. కలియుగ ప్రపంచపు ఏ ఆచారాలు మొదలైనవేవీ అక్కడ ఉండవు. ఇక్కడ లోక మర్యాదలు(నియమాలు), కుల మర్యాదలు(పద్ధతులు) ఉంటాయి. తేడా ఉంది కదా. అక్కడి మర్యాదలను సత్య మర్యాదలని అంటారు. ఇక్కడుండేవి అసత్య మర్యాదలు. సృష్టి అయితే ఉంది కదా. ఆసురీ సంప్రదాయమైనప్పుడే తండ్రి వస్తారు. అందులోనే దైవీ సంప్రదాయము స్థాపనైనప్పుడు, ఆసురీ సంప్రదాయము వినాశనం జరుగుతుంది. కావున ఆసురీ సంప్రదాయములోనే దైవీగుణాల సంప్రదాయ స్థాపన జరుగుతోంది.

యోగబలము ద్వారా మీ జన్మ-జన్మల పాపాలు నశిస్తాయని కూడా తండ్రి అర్థము చేయించారు. ఈ జన్మలో చేసిన పాపాలను కూడా తెలిపించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా వికారాల విషయాన్ని తప్పకుండా తెలియజేయాలి. స్మృతిలోనే బలముంది. తండ్రి సర్వశక్తివంతులు. సర్వుల తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగము జోడిస్తే పాపాలు భస్మమౌతాయని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు సర్వశక్తివంతులు కదా! పూర్తి సృష్టి పై వీరి రాజ్యముంటుంది. అది నూతన ప్రపంచము. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది. ఇప్పుడైతే భూమి కూడా బీడుబారి పోయింది. పిల్లలైన మీరిప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మరి అంత ఖుషీ కూడా ఉండాలి. ఎటువంటి విద్యార్థులో అంత సంతోషము కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ సర్వ శేష్ఠ్ర విశ్వ విద్యాలయము. చదివించువారు సర్వ శేష్ఠ్రులు. సర్వ శేష్ఠ్రులుగా అయ్యేందుకే పిల్లలు చదువుతారు. మీరెంత నీచంగా ఉండేవారు! పూర్తి నీచము నుండి మళ్లీ ఉన్నతంగా అవుతారు. మీరిప్పుడు స్వర్గానికి అర్హులుగా లేరు. అపవిత్రులు అక్కడకు వెళ్లలేరు. కనిష్టంగా ఉన్నందునే శ్రేష్ఠ దేవతల ముందుకు వెళ్లి వారిని మహిమ చేస్తారు. మందిరాలకు వెళ్లి తమ నీచత్వమును, దేవతల శ్రేష్ఠత్వమును వర్ణిస్తారు. మీరు దయ చూపితే మేము కూడా శ్రేష్ఠులుగా అయ్యి ఇలా ఉన్నతంగా అవుతామని అంటారు. వారి ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు. వారు కూడా మనుష్యులే కానీ వారిలో దైవీ గుణాలున్నాయి. మందిరాలకు వెళ్లి మేము కూడా వారి వలె అవ్వాలని పూజలు చేస్తారు. అయితే వారిని అలా ఎవరు తయారుచేశారో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ దైవీ వృక్షానికి అంటు ఎలా కట్టబడుతుందో మొత్తం డ్రామా జ్ఞానమంతా ఉంది. బాబా సంగమ యుగములో వస్తారు. ఇది పతిత ప్రపంచము. అందుకే మీరు వచ్చి మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. మీరిప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ ముగించుకొని శాంతిధామానికి వెళ్లిపోతారు. తండ్రి ఇచ్చే 'మన్మనాభవ' మంత్రము ముఖ్యమైనది. గురువులైతే అనేకమంది ఉన్నారు. వారు లెక్కలేనన్ని మంత్రాలను ఇస్తారు. తండ్రిది ఒకే ఒక మంత్రము. తండ్రి భారతదేశములో వచ్చి ఇచ్చిన మంత్రము ద్వారానే మీరు దేవీ దేవతలుగా అయ్యారు. భగవానువాచ కదా. వారు భలే శ్లోకాలు మొదలైనవి వల్లిస్తారు కానీ వారికి అర్థమేమీ తెలియదు. మీరు అర్థమును వివరించి చెప్పగలరు. కుంభమేళాకు వెళ్లి అక్కడ కూడా మీరు అందరికి అర్థము చేయించవచ్చు. ఇది పతిత ప్రపంచము, నరకము. సత్యయుగము పావన ప్రపంచంగా ఉండేది. దానినే స్వర్గమని అంటారు. పతిత ప్రపంచములో పావనులు ఎవ్వరూ ఉండలేరు. మనుష్యులు పావనంగా అవ్వాలని గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. ఎందుకంటే వారు శరీరమునే పావనంగా చేసుకోవాలని భావిస్తారు. ఆత్మ సదా పావనంగానే ఉంటుంది, ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ జ్ఞాన స్నానము ద్వారా పవిత్రమౌతుందే కానీ నీటి స్నానము ద్వారా పావనమవ్వదు అని మీరు వ్రాయవచ్చు. నీటితో అయితే ప్రతి రోజూ స్నానం చేస్తూనే ఉంటారు. ఉన్న నదులలో ప్రతిరోజూ స్నానము చేస్తూనే ఉంటారు. అదే నీటిని త్రాగుతూ ఉంటారు. నీటితోనే అన్నీ చేయడం జరుగుతుంది. ఎంతో సహజమైన ఈ విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకీ రావు.

జ్ఞానము ద్వారానే ఒక్క సెకండులో సద్గతి జరుగుతుంది. జ్ఞానము ఎంత అనంతమైనదంటే మొత్తం సాగరాన్నంతా సిరాగా చేసుకొని, పూర్తి అడవినంతా కలముగా చేసుకుని, మొత్తము భూమిని కాగితంగా చేసుకుని వాస్రినా అంతము కాదు. తండ్రి ప్రతి రోజు భిన్న-భిన్న పాయింట్లను అర్థము చేయిస్తూ ఉంటారు. ఈ రోజు మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నానని తండ్రి చెప్తూ ఉంటారు. మొదటే ఎందుకు వినిపించలేదని పిల్లలంటారు. అరే! ముందే ఎలా వినిపిస్తాను? కథ అన్న తర్వాత ప్రారంభము నుండి చివరి వరకు క్రమ పద్ధతిలో వినిపిస్తారు కదా. చివరిలో వచ్చే పాత్రను మొదటే ఎలా వినిపిస్తారు? ఇవన్నీ తండ్రి వినిపిస్తూ ఉంటారు. ఈ సృష్టిచక్రపు ఆదిమధ్యాంతాల రహస్యము మీకు తెలుసు. మిమ్ములను ఎవరు అడిగినా మీరు వెంటనే బదులు(జవాబు) చెప్పగలరు. పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారుగా కూర్చున్నది. మీ వద్దకు వచ్చినప్పుడు పూర్తి సమాధానము లభించకపోతే వెలుపలికి వెళ్లి ఇక్కడ పూర్తి వివరణ లభించదు, తప్పుడు చిత్రాలను పెట్టుకుని ఉన్నారని అనేస్తారు. కావున వారికి అర్థము చేయించేవారు చాలా బాగుండాలి. లేకుంటే వారు కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. అర్థము చేయించేవారు అర్థము చేయించలేకపోతే ఎలాంటివారికి అలాంటివారే చిక్కారని భావిస్తారు. అక్కడక్కడ వచ్చిన జిజ్ఞాసువు చాలా వివేకవంతుడైతే, అర్థము చేయించే పిల్లలు అంత తెలివైనవారిగా లేకపోవడం గమనిస్తే బాబాయే వారిలో ప్రవేశించి సహయోగము చేస్తారు. ఎందుకంటే తండ్రి చాలా సూక్ష్మమైన రాకెట్‌ వంటివారు. వచ్చి, వెళ్లేందుకు వారికి పెద్ద సమయము పట్టదు. అందుకే వారు తండ్రిని బహురూపి లేక సర్వవ్యాపి అని అనేశారు. ఇది పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. మంచి మంచి గొప్ప వ్యక్తులకు అర్థము చేయించేవారు కూడా ఆ విధంగా ఉండాలి. ఈ రోజుల్లో కొందరు బాల్యము నుండే శాస్త్రాలను కంఠస్థము చేసేస్తారు. ఎందుకంటే ఆత్మ సంస్కారాన్ని తీసుకొస్తుంది. ఎక్కడ జన్మ తీసుకున్నా అక్కడ తిరిగి అవే వేదశాస్త్రాలు మొదలైనవి చదవడం ప్రారంభిస్తారు. అంతిమతి సోగతి అయిపోతుంది కదా. ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది కదా. చివరికి ఈ స్వర్గ ద్వారాలు వాస్తవంగా తెరవబడే ఆ రోజు రానే వచ్చిందని.... పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది. స్వర్గము నూతన ప్రపంచములో ఉంటుందని కూడా మనుష్యులకు తెలియదు. మేము సత్య-సత్యనారాయణ కథ లేక అమరకథ వింటున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఉన్న కథ ఒక్కటే. దానిని వినిపించినవారు కూడా ఒక్కరే. తర్వాత వాటి శాస్త్రాలను తయారు చేస్తారు. ఉదాహరణములన్నీ మీవే. వాటినే భక్తిమార్గములో ఉపయోగిస్తారు. కావున సంగమ యుగములో తండ్రే వచ్చి అన్ని విషయాలను అర్థము చేయిస్తారు. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇందులో మొదట సత్య- త్రేతా యుగాలలో రామరాజ్యము ఉంటుంది. తర్వాత మళ్లీ రావణరాజ్యము వస్తుంది. ఇది రచింపబడిన (తయారు చేయబడిన) డ్రామా. దీనిని అనాది-అవినాశి డ్రామా అని అంటారు. మనమంతా ఆత్మలమని తండ్రి ఇచ్చిన జ్ఞానము వేరెవ్వరి వద్ద లేదు. ఆత్మలందరి పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరి పాత్ర ఎప్పుడుంటుందో వారు అప్పుడే వస్తారు. వృద్ధి చెందుతూ ఉంటారు.

పతితుల నుండి పావనంగా అవ్వడమే పిల్లలకు ముఖ్యమైన విషయము. ''ఓ పతితపావనా! రండి'' అని కూడా పిలుస్తారు. పిల్లలే పిలుస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు - నా పిల్లలు కామచితి పై కూర్చుని భస్మమైపోయారు. ఇవి యదార్థమైన విషయాలు. ఇది అవినాశి ఆత్మకు సింహాసనము. ఇది అప్పుగా తీసుకోబడింది. బ్రహ్మను గురించి మిమ్ములను ఇతడు ఎవరు? అని ప్రశ్నిస్తారు. వారికి భగవానువాచ - ''నేను సాధారణ తనువులో వస్తాను'' అని వ్రాయబడింది చూడండని చెప్పండి. ఆ అలంకృతమూర్తియైన శ్రీ కృష్ణుడే 84 జన్మలు తీసుకుని అంతిమములో సాధరణంగా అవుతారు. ఈ సాధరణమైనవారే మళ్లీ కృష్ణునిగా అవుతారు అని చెప్పండి. క్రింద తపస్సు చేస్తున్నారు. మేమిలా అవుతున్నామని వారికి తెలుసు. త్రిమూర్తి చిత్రమునైతే ఎంతోమంది చూశారు. కానీ దాని అర్థము కూడా తెలిసి ఉండాలి కదా. స్థాపన చేయువారే తిరిగి పాలన కూడా చేస్తారు. స్థాపన సమయములోని నామ-రూప-దేశ-కాలాదులు మరియు పాలన సమయములోని నామ-రూప-దేశ-కాలాదులు వేరు వేరుగా ఉంటాయి. ఇవి అర్థము చేయించేందుకు కూడా చాలా సహజమే ఇతను క్రింద కూర్చుని తపస్సు చేస్తున్నారు మళ్లీ ఈ విధంగా అవుతారు. ఇతనే 84 జన్మలు తీసుకుని ఇలా అవుతారు. ఎంత సహజమైన, క్షణములో అర్థము చేసుకునే జ్ఞానము! మేము ఇటువంటి దేవతలుగా అవుతామని బుద్ధిలో జ్ఞానముంది. 84 జన్మలు కూడా ఈ దేవతలే తీసుకుంటారు. మరి ఇంకెవరైనా తీసుకుంటారా? - తీసుకోరు. 84 జన్మల రహస్యము కూడా పిల్లలకు అర్థము చేయించారు. దేవతలే మొట్టమొదట వస్తారు. తీగె పై చేప బొమ్మలుంటాయి కదా. చేప క్రిందకు దిగి వచ్చి మళ్లీ పైకి వెళ్తుంది. అది కూడా మెట్ల వంటిదే. భ్రమరి, తాబేలు మొదలైనవాటి ఉదాహరణలన్నీ ఇప్పటివే. భ్రమరిలో కూడా ఎంత తెలివి ఉందో చూడండి. మనుష్యులు తమను తాము ఎంతో తెలివైనవారుగా భావిస్తారు. కానీ మనిషిలో భ్రమరికున్నంత తెలివి కూడా లేదని బాబా చెప్తారు. సర్పమూ పాత చర్మపు పొర (కుబుసము)ను వదిలి క్రొత్తది తీసుకుంటుంది. పిల్లలను ఎంత తెలివైనవారిగా తయారు చేయడం జరుగుతుంది! తెలివైనవారిగా, అర్హులుగా తయారు చేయబడ్తారు. ఆత్మ అపవిత్రమైనందున అర్హముగా లేదు. కావున దానిని పవిత్రంగా చేసి యోగ్యంగా తయారు చేస్తారు. అది యోగ్య ప్రపంచము. పూర్తి సృష్టిని నరకము నుండి స్వర్గముగా చేయు కర్తవ్యము తండ్రి ఒక్కరిదే. స్వర్గము ఎలా ఉంటుందో మనుష్యులకు తెలియదు. దేవీ-దేవతల రాజధానిని స్వర్గమని అంటారు. సత్యయుగములో దేవీదేవతల రాజ్యముంటుంది. సత్యయుగ నూతన ప్రపంచములో మనమే రాజ్యము చేస్తూ ఉండేవారమని మీరు తెలుసుకున్నారు. 84 జన్మలు కూడా మనమే తీసుకుని ఉంటాము. ఎన్నిసార్లు రాజ్యము తీసుకున్నామో, పోగొట్టుకున్నామో కూడా మీకు తెలుసు. రాముని మతము ద్వారా మీరు రాజ్యమును తీసుకున్నారు. రావణ మతము ద్వారా రాజ్యము పోగొట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి పైకి ఎక్కేందుకు మీకు రాముని మతము లభిస్తోంది, దిగజారడానికి కాదు. తెలిపించడము ఎంత బాగా తెలిపించినా భక్తిమార్గపు బుద్ధి చాలా కష్టంగా పరివర్తనౌతుంది. భక్తిమార్గపు ఆడంబరము చాలా ఉంది. అది ఊబి వంటిది. గొంతు వరకు అందులో కూరుకుపోతారు. ఎప్పుడైతే అందరి అంతము జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. అందరినీ జ్ఞానము ద్వారా దాటిస్తాను. నేను వచ్చి ఈ పిల్లల ద్వారా ఈ కార్యమును చేయిస్తాను. బాబాతో పాటు సేవ చేయు పిల్లలు బ్రాహ్మణులైన మీరే. మిమ్ములను ఈశ్వరీయ సేవాధారులు(ఖుదాఈ ఖిద్‌మత్‌గార్‌) అని అంటారు. ఇది అన్నింటికంటే చాలా శ్రేష్ఠమైన సేవ. ఇలా ఇలా చేయండని పిల్లలకు శ్రీమతము లభిస్తుంది. మళ్లీ అందులో నుండి ఏ కొందరో ఎన్నుకోబడి వెలువడ్తారు. ఇది కూడా క్రొత్త విషయము కాదు. కల్పక్రితము కూడా ఎంతమంది దేవీదేవతలు వెలువడినారో మళ్లీ వారే వెలువడ్తారు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. మీరు కేవలం సందేశాన్ని చేర్చాలి. ఇది చాలా సహజము. భక్తిమార్గములో పూర్తి హడావుడి ఉన్నప్పుడు, కల్పపు సంగమ యుగములోనే భగవంతుడు వస్తారని మీకు తెలుసు. తండ్రి వచ్చి అందరినీ తీసుకెళ్తారు. ఇప్పుడు మీ పై బృహస్పతి దశ ఉంది. అందరూ స్వర్గములోకి వెళ్తారు. అయినా చదువులో నంబరువారుగా ఉంటారు. కొందరి పై మంగళదశ, కొందరి పై రాహుదశ కూర్చుంటుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. యోగ్యులు మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. పూర్తి ప్రపంచాన్ని నరకము నుండి స్వర్గంగా చేసేందుకు బాబా(తండ్రి) జతలో సర్వీసు చేయాలి, ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి.

2. కలియుగ ప్రపంచపు ఆచార వ్యవహారాలు, లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి. దైవీగుణాలతో సంపన్నమై దైవీ సంప్రదాయాన్ని స్థాపించాలి.

వరదానము :-

'' తుఫాన్లను తోఫా(బహుమతి)గా భావించి సహజంగా దాటుకునే సంపూర్ణ సంపన్న భవ ''

అందరి లక్ష్యము 'సంపూర్ణంగా సంపన్నంగా అవ్వడం' అయినప్పుడు చిన్న చిన్న విషయాలలో భయపడకండి. ఎందుకంటే పూజ్య మూర్తులుగా అవుతున్నారంటే కొన్ని సుత్తి దెబ్బలు తగుల్తాయి. ఎవరు ఎంత ముందు ఉంటారో వారు తుఫాన్లను కూడా అందరికంటే ఎక్కువగా దాటుకోవాల్సి(ఎదుర్కోవలసి) ఉంటుంది. కానీ ఆ తుఫాన్లు వారికి తుఫాన్లుగా అనిపించవు, బహుమతులుగా అనిపిస్తాయి. ఈ తుఫాన్లను కూడా అనుభవీలుగా అయ్యే కానుకలుగా అవుతాయి. అందువలన విఘ్నాలను ఆహ్వానించండి, అనుభవీలుగా అవుతూ ముందుకు సాగుతూ ఉండండి.

స్లోగన్‌ :-

'' నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయాలంటే స్వ చింతనలో ఉంటూ స్వయాన్ని చెక్‌ చేసుకోండి ''