09-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - బాబాను ప్రీతిగా స్మృతి చేస్తూ ఉండండి. సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. చదువు పై పూర్తి గమనముంచండి. అప్పుడు మిమ్ములను అందరూ గౌరవిస్తారు.''

ప్రశ్న :-

అతీంద్రియ సుఖము ఏ పిల్లలకు అనుభవము అవుతుంది ?

జవాబు :-

1. ఎవరైతే దేహీ-అభిమానులుగా ఉంటారో వారికి అతీంద్రియ సుఖము అనుభవమౌతుంది. దేహీ-అభిమానిగా అయ్యేందుకు ఎవరితోనైనా మాట్లాడునప్పుడు లేక జ్ఞానము అర్థము చేయించునప్పుడు నేను ఆత్మను, సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను................. అని భావించండి. భాయి- భాయి (సోదర) దృష్టిని పక్కా చేసుకుంటే దేహీ-అభిమానులుగా అవుతూ ఉంటారు. 2. '' మేము భగవంతుని విద్యార్థులము'' అనే నషా ఎవరికైతే ఉంటుందో వారికి అతీంద్రియ సుఖము అనుభవమౌతుంది.''

పాట:-

నా మనోద్వారము వద్దకు ఎవరు వచ్చారు?.................. ..(కౌన్‌ ఆయా మేరే మన్‌కే ద్వారే...........)   

ఓంశాంతి.

తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. తండ్రి తన పిల్లలకు అర్థము చేయిస్తున్నారని ఏ ఇతర సంస్థలో చెప్పరు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరేనని పిల్లలైన మీకు తెలుసు. అందరమూ సోదరులమే, ఆ తండ్రి నుండి పిల్లలకు తప్పకుండా వారసత్వము లభిస్తుంది. ఇది సంగమయుగము. ఈ సంగమ యుగములోనే ముక్తి - జీవన్ముక్తులు లభిస్తాయని మీరు సృష్టిచక్ర చిత్రమును చూపి బాగా అర్థము చేయించవచ్చు. పిల్లలైన మీరు జీవన్ముక్తికి వెళ్తారు. మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్తారు. సద్గతిదాత, ముక్తిదాత (లిబరేటర్‌), మార్గదర్మకుడు (గైడ్‌) అని వారినే అంటారు. రావణ రాజ్యములో లెక్కలేనంత మంది మనుష్యులున్నారు. రామరాజ్యములో ఒకే ఆదిసనాతన దేవీదేవతా ధర్మముండేది. వారిని ఆర్యులని, వీరిని అనార్యులని అంటారు. ఆర్యులనగా పరివర్తన చెంది బాగుపడినవారు. అనార్యులనగా పరివర్తన అవ్వని వారు. ఆర్యుల నుండి అనార్యులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఆర్య అనేది ఏ ధర్మమూ కాదు. ఆర్యులనగా పరివర్తన చెందిన దేవతలు. వారే 84 జన్మలు తీసుకున్న తర్వాత అనార్యులుగా అవుతారు. ఎవరైతే అత్యంత ఉన్నతులైన పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు. '' హమ్‌ సో '' అర్థము కూడా తండ్రియే అర్థము చేయిస్తున్నారు. సీఢీ(మెట్ల) చిత్రం ద్వారా అర్థము చేయించడం చాలా బాగుంటుంది. ఆత్మయే పరమాత్మ. పరమాత్మయే ఆత్మ అని అనడం తప్పు. ఇది చాలా పెద్ద(విరాట్‌) నాటకము. మనమే పూజ్యులుగా ఉండి పూజారులుగా అయ్యామని మీకు తెలుసు అనగా మనమే (హం సో) దేవతలుగా ఉండేవారము. దేవతల నుండి క్షత్రియులు.......గా అవుతాము. మెట్లు తప్పకుండా దిగుతాము కదా. ఇది కూడా ఒక గణన(లెక్క). 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? మీకు మీ జన్మల గురించి తెలియదని, నేనే మీకు తెలుపుతానని తండ్రి చెప్తున్నారు. ఇది చక్రము. ఇందులో మనమే దేవతలు, క్షత్రియులు మొదలైనవారుగా అవుతాము. 21 జన్మలు అను మాట ప్రసిద్ధి చెందింది. మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియనే తెలియదు. తమోప్రధానముగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానము పూర్తిగా లభిస్తోంది. అయితే కొంతమంది మాత్రమే కష్టం మీద అర్థము చేసుకుంటారు అందుకే కోట్ల మందిలో ఏ ఒక్కరో వచ్చి ఈ జ్ఞానము తీసుకొని దేవతా ధర్మమువారిగా అవుతారని మీరు అంటారు. ఇందులో ఆశ్చర్యపడే అవసరము లేదు. చక్రము చిత్రమును చూపి అర్థము చేయించడం సులభము - ఇది సత్యయుగము, ఇది కలియుగము.......... అని చెప్పండి. ఎందుకంటే సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. వృక్షము చిన్నదిగా ఉంటుంది. తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ వృక్షము గురించి ఎవ్వరికీ తెలియదు. అంతేకాక బ్రహ్మను గురించి కూడా అతికష్టము మీద అర్థము చేసుకుంటారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా అని చెప్పండి. ఈ బ్రాహ్మణులు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఆ బ్రాహ్మణులు గర్భజనితులు (కుఖవంశావళి). వీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. ఇది పరాయి రావణ రాజ్యము. తండ్రి వచ్చి రామరాజ్యము స్థాపన చేయవలసి వస్తుంది. కావున వారు ఎవరి శరీరములోనో ప్రవేశిస్తారు కదా. ఈ వృక్షము చిత్రము చూడండి - ఈ బ్రహ్మ చిట్టచివరిలో నిలబడి ఉన్నారు. వృక్షము శిథిలావస్థలో ఉంది. తండ్రి చెప్తున్నారు - నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. ఇది ఇతని అంతిమ 84వ జన్మ. వృక్షము క్రింది భాగములో తపస్సు చేస్తున్నారు. మనము ఇతనిని భగవంతుడని అనము. ప్రపంచములోనివారు భగవంతుని సర్వవ్యాపిగా చేసి రాయి-రప్పలలో ఉన్నారని అనేశారు. అందుకే స్వయంవారు కూడా పూర్తిగా రాతిబుద్ధి గలవారిగా (రాయిగా) తయారై పోయారు. దేవతల విషయమే భిన్నమైనది. ఇప్పుడు మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. ఈ దేవతలను భగవాన్‌ - భగవతి అని కూడా అంటారు. ఎందుకంటే మీరు పవిత్రులు. అంతేకాక స్వయం భగవంతుని ద్వారానే ఈ ధర్మస్థాపన జరిగింది. కావున తప్పకుండా భగవాన్‌ - భగవతిగా అయ్యి ఉండాలి. కాని వారిని మహారాజా - మహారాణి అని అంటారు. ఇకపోతే శ్రీ లక్ష్మీ నారాయణులను భగవాన్‌ - భగవతి అనడం కూడా ఒక అంధ విశ్వాసము ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కదా. మీరు శివ-శంకరులను కూడా వేరు చేసి తెలుపుతారు. ఇది విని వారు దేవతలను కూడా వీరు ఎత్తేస్తారని, గౌరవించరని అంటారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది అయితే మహారథులైనవారు మాత్రమే దీనిని బాగా అర్థము చేయించగలరు. చాలామంది భలే వింటారు కాని వారి బుద్ధిలో నిలువదు. అటువంటివారు ఏ పదవిని పొందుతారు? అతితక్కువ విలువ గల దాస-దాసీలుగా అవుతారు. పోను పోను మీకు సాక్షాత్కారాలు అవుతాయి. అయితే ఆ సమయములో ఏమీ చేయలేరు. సమయము పూర్తి అయిపోయిన తర్వాత ఇంకేం చేయగలరు? కావున బాబా అప్రమత్తము చేస్తూ ఉంటారు. అయితే అందరూ పైకి ఎక్కిపోవడం అనగా గొప్ప పదవిని పొందడం జరిగే పని కాదు. బుద్ధి రూపి పాత్ర శుద్ధంగా లేదు. బుద్ధిలో చెత్తా చెదారము నిండి ఉంది. ఇందులో పురుషార్థము చాలా బాగుండాలి. చిత్రాలను చూపి అర్థము చేయించేందుకు చాలా మంచి అభ్యాసముండాలి లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఇప్పుడిక్కడ ఆత్మకు భోజనము లభిస్తూ ఉంది. ఇవన్నీ అందరికీ అర్థము చేయించవలసిన విషయాలు. ఇందులో భయపడే విషయమేదీ లేదు. పెద్ద పెద్ద నగరాలలో, స్థానాలలో ప్రదర్మనీలు, మ్యూజియంలు ఉంటే పేరు ప్రసిద్ధి చెందుతుంది. అందరి వద్ద వారి అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా వ్రాయించి, వాటిని కూడా అచ్చు వేయించాలని బాబా చెప్తున్నారు. పిల్లలు చాలా సేవ చేయాలి. వీరు అర్థము చేసుకునేవారా? కాదా? అని కూడా చాలా పరీక్షించాలి. చిత్రము చూపించి ఇది నూతన ప్రపంచము, ఇది పాత ప్రపంచము అని అర్థం చేయించాలి. ఈ విషయాన్ని ఎవరైనా అర్థము చేసుకోగలరు. కేవలం సమయాన్ని చాలా ఎక్కువ చేసేశారు. అందువలన మనుష్యులు భ్రమలో పడి ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఎవరైతే దేహీ-అభిమానులుగా ఉంటారో వారికి మాత్రమే అతీంద్రియ సుఖము ఉండగలదు. కేవలం ఉపన్యాసము వలన పని జరగదు. ఉపన్యసించునప్పుడు కూడా నేను ఆత్మిక సోదరుడను. సోదర ఆత్మకు అర్థము చేయిస్తున్నాను........ అని భావించాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. కాని పిల్లలు క్షణ-క్షణము మర్చిపోతారు. తండ్రియే వచ్చి పిల్లలకు అర్థము చేయిస్తారు. ఆత్మలు - పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినారు......(ఆత్మా, పరమాత్మ అలగ్‌ రహే బహుకాల్‌............) అనే గాయనము కూడా ఉంది. దీని అర్థము కూడా మీకు మాత్రమే తెలుసు. మహారథులైనవారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చాలా ఎక్కువగా చేయాలి. అప్పుడే స్వయాన్ని శక్తివంతులుగా భావిస్తారు. ఎవరైతే స్వయాన్ని ఆత్మ అనే భావించరో వారింకేమి ధారణ చేయగలరు! స్మృతి ద్వారానే మీలో శక్తి నిండుతుంది. జ్ఞానాన్ని శక్తి అని అనరు. యోగశక్తి లేక యోగబలము అని అంటారు. యోగబలము ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు మీరు చాలా మందిని మీ సమానముగా తయారు చేయాలి. ఎంతవరకు మీ సమానంగా తయారు చేయరో అంతవరకు వినాశనము జరగదు. పెద్ద యుద్ధము మొదలైనా, అది నిలిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వద్ద బాంబులున్నాయి. ఈ బాంబులు అలాగే ఉంచుకునే వస్తువులు కాదు. పాత ప్రపంచ వినాశనము మరియు ఒకే ఒక ఆది సనాతన ధర్మ స్థాపన జరిగే తీరాలి. కొంత సమయము తర్వాత అందరూ ఇది అదే మహాభారత యుద్ధము అని అంటారు. భగవంతుడు కూడా ఉన్నారు. మీ వద్దకు ఎప్పుడైతే చాలా మంది వస్తారో అప్పుడు అందరూ అంగీకరించడం మొదలు పెడ్తారు. ఈ సంస్థ చాలా వృద్ధి చెందుతూ ఉందని, ఇందులో చాలా శక్తి ఉందని ఒప్పుకుంటారు. మీరు స్మృతిలో ఎంత ఎక్కువగా ఉంటారో అంత ఎక్కువగా మీలో శక్తి నిండుతుంది. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మీరు ఇతరులకు ప్రకాశాన్ని ఇస్తారు. ఈ దాదా(బ్రహ్మ) కూడా - ఈ పిల్లలు నా కంటే చాలా బాగా సర్వీసు చేస్తారని అంటారు. ఇప్పుడింకా కొంత సమయము(ఆలస్యము) ఉంది. యోగములో ఎవ్వరూ యదార్థ రీతిలో ఉండలేరు. యోగములో తక్కువగా ఉన్నాము కనుక ఖచ్ఛితంగా బాణము తగలడము లేదని స్వయం మీరు కూడా ఫీల్‌ చేస్తారు. భగవంతుడు కుమారీలలో జ్ఞాన బాణాలు నింపుతారు. మీరు ప్రజాపిత బ్రహ్మాకుమారులు, కుమారీలు కదా. ఇతడు బ్రహ్మ. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. సృష్టికర్త ఒకే ఒకరు. మిగిలిన వారందరూ చదువుకుంటున్నారు. వారిలో ఈ బ్రహ్మ కూడా వస్తారు. కావున ఈ బ్రహ్మ రచన అయ్యారు కదా. మీరు దేవతలుగా అయ్యేవారు. దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. అచ్చటచ్చట రెండు చక్రాలు(దంపతులు) జ్ఞానములో నడవలేరు. ఇసుకలో నిలబడినట్లు ఉంటారు. బాబా పేర్లు చెప్పరు. అయితే బాబా సత్యమే చెప్తున్నారని భావించాలి. పిల్లలు కూడా ఎవరికైతే పరస్పరము ఒకరితో ఒకరికి పని ఉంటుందో, వారు ఒకరి స్వభావాన్ని మరొకరు తెలుసుకోగలరు.

మనమే తలమానికంగా, శిరోకిరీటంగా(సిర్‌తాజ్‌గా) ఉంటిమని, ఇప్పుడు మళ్లీ అలా అవుతామని పిల్లలు భావిస్తారు. మీరు ఎవరికైనా ఈ జ్ఞానము అర్థము చేయిస్తే మొదట వారు అంగీకరించేందుకు తయారుగా ఉండరు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా అర్థము చేసుకుంటారు. దీనికి చాలా బుద్ధి కావాలి. ఆత్మలో బుద్ధి ఉంది. ఆత్మ సత్‌-చిత్‌-ఆనంద స్వరూపము. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను దేహీ-అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవ్వరూ దేహీ-అభిమానులుగా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి ఆత్మాభిమాని భవ! అని చెప్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే నా నుండి శక్తి లభిస్తుంది. ఈ ధర్మము చాలా శక్తివంతమైనది. మొత్తము విశ్వము పై రాజ్యపాలన చేస్తారు. ఇది ఏమైనా తక్కువ విషయమా? తండ్రితో యోగము జోడించడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. ఇది క్రొత్త విషయము. దీనిని మంచిరీతిగా అర్థము చేయించవలసి ఉంటుంది. ఆత్మల అనంతమైన తండ్రి వారే. వారే నూతన ప్రపంచ రచయిత కావున శివుడు వచ్చి ఏమి చేస్తారో వారి కర్తవ్యమేమిటో అందరికీ అర్థం చేయించండి. కృష్ణజయంతి, శివజయంతి రెండింటినీ ఆచరిస్తారు. ఇప్పుడు వీరిరువురిలో పెద్దవారు ఎవరు? అత్యంత ఉన్నతమైన వారు నిరాకారుడు. ఆయన ఏమి చేశారని శివజయంతిని ఆచరించడము జరుగుతుంది? కృష్ణుడు ఏమి చేశాడు? పరమపిత పరమాత్మ సాధారణ వృద్ధ శరీరములో వచ్చి స్థాపన చేస్తారని వ్రాయబడి ఉంది. అనేక రకాలైన మతమతాంతరాలు(అభిప్రాయాలు) ఉన్నాయి. శ్రీమతమైతే ఒక్కటే. దాని ద్వారా మీరు శ్రేష్ఠంగా అవుతారు. మానవ మతము ద్వారా శ్రేష్ఠంగా ఎలా అవుతారు? ఈ ఈశ్వరీయ మతము మీకు ఒక్కసారి మాత్రమే సంగమ యుగములో లభిస్తుంది. దేవతలైతే వారి మతమును ఇవ్వరు. మనుష్యులు నుండి దేవతలుగా అవుతారు. అంతే. అంతటితో సమాప్తము. అచ్చట గురువులు మొదలైనవారిని కూడా ఆశ్రయించరు. ఇక్కడ మనుష్యులు గురువుల నుండి మతము(సలహా) తీసుకుంటారు. కావున మేము రాజయోగులమని వారికి యుక్తిగా అర్థము చేయించాలి. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. తీర్థ యాత్రలకు ప్రవృత్తి మార్గమువారే వెళ్లవలసి ఉంటుంది.

పిల్లలైన మీరు ఏ విషయములోనూ భ్రమపడరాదు, సంశయపడరాదు. ఇది తయారైన డ్రామా. ఇది అనేకమార్లు పునరావృతమౌతూ ఉంటుంది. మీ సర్వీసు కూడా కల్పక్రితము వలె జరుగుతుంది. డ్రామాయే మీతో పురుషార్థము చేయిస్తుంది. అది కూడా మీరు కల్పక్రితము వలె చేస్తారు. పురుషార్థము చేసేవారి నడవడికల ద్వారా మీరు అర్థము చేసుకోగలరు. అప్పుడే ప్రదర్శినీలో వచ్చు గ్రూపును చూసి వారికి తగినట్లు గైడు(మార్గదర్శకుడు)ను ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మంచిరీతిలో అర్థము చేయించగలరు. చదివించే తండ్రికి పురుషార్థము ఎవరు మంచి రీతిగా చేస్తున్నారో బాగా తెలుసు. ఎంతో విశాలమైన బేహద్‌ బుద్ధి గలవారిగా తయారు చేస్తారు. '' మేము ఎవరి పిల్లలము! '' అనే నషా పిల్లలైన మీకు ఉండాలి. స్వయం భగవంతుడే మనలను చదివిస్తున్నారు. ఎవరైనా చదవలేకుంటే పారిపోతారు. వీరు నా పిల్లలు కారని భగవంతుడు కూడా అర్థము చేసుకుంటాడు. భగవంతుని పిల్లలు ఎవరైతే ఒకప్పుడు చదువుకునేవారో వారు పారిపోయి ఆ తర్వాత కొంత అర్థమౌతే మళ్లీ చదువుకోవడం మొదలు పెట్టడం మీరు గమనిస్తారు. మళ్లీ యోగములో బాగా ఉన్నట్లయితే ఉన్నత పదవి పొందగలరు. ఇటువంటి పాఠశాలను వదలిపెట్టి మేము చాలా సమయము వృథా చేశామని అర్థము చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి నుండి తప్పకుండా వారసత్వము తీసుకుంటామని భావిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లేక బాబా బాబా అంటూ రోమాంచితమైపోవాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. మనము ఎంతో భాగ్యశాలురము. ఘడియ-ఘడియ తండ్రి స్మృతిలో ఉండి, వారి ఆదేశానుసారము నడుస్తూ ఉంటే చాలా ఉన్నతి జరుగగలదు. అప్పుడు మళ్లీ వారిని అందరూ చాలా గౌరవిస్తారు. బాబా చెప్తున్నారు - చదువుకున్నవారి ముందు చదువుకోనివారు బరువులు మోస్తారు. దేహాభిమానములో ఉన్నవారికి దైవీ గుణాల ధారణ జరగదు. మీ ముఖము ఫస్ట్‌క్లాసుగా ఉండాలి. ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో వారిని అతీంద్రియ సుఖమును గురించి అడగమని అంటారు. చదువు పై ఎంతో అటెన్షన్‌ ఇవ్వాలి. శ్రీమతమును అనుసరించాలి. మీ యోగశక్తి వలన విశ్వము కూడా పవిత్రమైపోతుంది. మీరు యోగము ద్వారా విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు. ఇది అద్భుతము కదా! గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తాలి. ఈ ఛీ-ఛీ(పాడైపోయిన) ప్రపంచమును ఎవరు పవిత్రంగా చేశారో వారి గుర్తే గోవర్థన పర్వతమును ఎత్తుట. అచ్ఛా!. (మంచిది)

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకునేందుకు బుద్ధి రూపి పాత్రను శుద్ధముగా, స్వచ్ఛముగా తయారు చేసుకోవాలి. వ్యర్థ మాటలను బుద్ధి నుండి తొలగించి వేయాలి.

2. దైవీ గుణాల ధారణ, చదువుల పై పూర్తి గమనమిచ్చి అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయాలి. మేము భగవంతుని పిల్లలము, వారే మమ్ములను చదివిస్తున్నారను నషా సదా ఉండాలి.

వరదానము :-

''ప్రాప్తి స్వరూపలుగా అయ్యి ఎందుకు, ఏమి అనే ప్రశ్నల నుండి అతీతంగా అయ్యే సదా ప్రసన్నచిత్త్‌ భవ''

ఎవరైతే ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలుగా ఉన్నారో వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. వారి ముఖములో, నడవడికలో ప్రసన్నతా పర్సనాలిటి కనిపిస్తుంది. దీనినే సంతుష్టత(తృప్తి) అని అంటారు. ప్రసన్నత తక్కువగా ఉంటే అందుకు కారణం - తక్కువ ప్రాప్తి. అందుకు కారణం ఏదో ఒక కోరిక(ఇచ్ఛ). చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపు లాగుతాయి. అందువలన అల్పకాల కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అయితే సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు.

స్లోగన్‌ :-

''పరమాత్మ ప్రేమలో లవ్‌లీన్‌గా ఉంటే మాయ ఆకర్షణ సమాప్తమైపోతుంది.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము

బ్రహ్మబాబాను నడుస్తూ - తిరుగుతూ ఉన్న ఫరిస్తాగా అనుభవం చేశారు, దేహ భావ రహితంగా ఉన్నారని అనుభవం చేశారు. కర్మలు చేస్తూ, మాట్లాడుతూ, ఆదేశాలు ఇస్తూ, ఉమంగ ఉత్సాహాలను పెంచుతూ దేహము నుండి భిన్నంగా, సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభవం చేయించాడో అలా తండ్రిని అనుసరించండి. సదా దేహ భావం నుండి భిన్నంగా (అతీతంగా) ఉండండి, అందరికి మీ న్యారా రూపము కనిపించాలి, దీనినే దేహంలో ఉంటున్నా ఫరిస్తా స్థితి అని అంటారు.