08-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - విచార సాగర మథనము చేసి అన్ని స్థానాలలో ఒకే విషయము పై భాషణ జరిగే విధంగా విషయాన్ని ఎంచుకోండి. ఇదే మీ ఐక్యత''

ప్రశ్న :-

పిల్లలైన మీరు ఎలాంటి శ్రమ చేస్తూ చేస్తూ గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు అవ్వగలరు ?

సమా :-

కర్మబంధనాల నుండి అతీతంగా అవ్వండి. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడునప్పుడు ఆత్మ భాయి - భాయి అనే దృష్టితో చూడండి. తండ్రి ద్వారా వినునప్పుడు కూడా తండ్రిని భృకుటి స్థానములో చూడండి. భాయి - భాయి అను దృష్టి ద్వారా ఆ స్నేహము, సంబంధము స్థిరమైపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. దీని ద్వారానే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులౌతారు. ఉన్నతపదవి పొందే పిల్లలు ఈ పురుషార్థము తప్పకుండా చేస్తారు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన పిల్లలకు ఇది మృత్యులోకమని అర్థం చేయించబడింది. దానితో పోల్చేందుకు అమరలోకము కూడా ఉంది. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని భక్తిమార్గములో చెప్తారు. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్తారు. శంకరుడు కథను వినిపించరు. కథను వినిపించేవారు జ్ఞానసాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. కథను వినిపించేందుకు శంకరుడు జ్ఞానసాగరుడు కాదు. ఇలాంటి విషయాల పై పిల్లలైన మీరు అర్థము చేయించాలి. '' మృత్యువు పై విజయము ఎలా పొందవచ్చు'', ''ఈ జ్ఞానము అమరులుగా చేస్తుంది'', ''దీని ద్వారా ఆయుష్షు వృద్ధి అవుతుంది'', అక్కడ మృత్యువు ఉండదు. ఇక్కడ మీరు 5 వికారాలు లేక రావణుని పై విజయము పొందడం ద్వారా రామరాజ్యము లేక అమరలోకానికి అధికారులుగా అవుతారు. మృత్యులోకములో రావణరాజ్యముంటుంది. అమరలోకములో రామ రాజ్యముంటుంది. దేవతలను ఎప్పుడూ మృత్యువు కబళించదు. అక్కడ కాలుని యమదూతలుండరు. ''మనుష్యులు మృత్యువు పైన విజయము ఎలా పొందుకోవచ్చు'' అను ఈ టాపిక్‌(విషయము) కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. భారతదేశము అమరలోకముగా ఉండేది. ఎంతో పెద్ద ఆయువు ఉండేది. సర్ప ఉదాహరణ కూడా సత్యయుగము కొరకే. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటారు. దీనిని బేహద్‌ వైరాగ్యము అని అంటారు. ప్రపంచమంతా వినాశనము అవ్వనున్నదని తెలుసు. ఈ పాత శరీరమును కూడా వదలాలి. ఇది 84 జన్మల పాత శరీరము. అమరలోకములో ఇలా ఉండదు. ఇప్పుడు శరీరము వృద్ధాప్య స్థితికి వచ్చింది, శిథిలావస్థకు వచ్చేసింది, దీనిని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటామని అక్కడ(సత్యముగములో) తెలుస్తుంది. తర్వాత సాక్షాత్కారము కూడా అవుతుంది. జ్ఞానమునే సాక్షాత్కారమని అంటారు. ఇప్పుడు మన కొత్త శరీరము తయారయ్యింది. ఇప్పుడు పాత శరీరాన్ని వదిలిపెట్టాలి. అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. దానిని అమరలోకము అని అంటారు. అక్కడ మృత్యువే రాదు. సమయము ఆసన్నమైనప్పుడు తమంతకు తామే శరీరాన్ని వదిలేస్తారు. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడిదే. కర్మ పూర్తి అయిన తర్వాత అది అంతర్ముఖమైపోతుంది. (అవయవాలను ముడుచుకుంటుంది). ఈ సమయములోని ఉదాహరణను భక్తిమార్గములో కాపీ చేస్తారు. అయితే కేవలం మాటల వరకే. ఏమీ అర్థము చేసుకోరు. రాఖీ ఉత్సవము, దశరా, దీపావళి, హోలీ మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే అని మీరు అర్థము చేసుకున్నారు. ఇవన్నీ భక్తిమార్గములో నడుస్తాయి. కానీ ఇవి సత్యయుగములో ఉండవు. ఇలాంటి విషయాలను(టాపిక్స్‌) వ్రాయండి. ''మానవులు మృత్యువు పైన విజయమును ఎలా పొందగలరు?'' ''మృత్యులోకము నుండి అమరలోకానికి ఎలా వెళ్ళగలరు?'' ఇలాంటి విషయాలను గురించి అర్థం చేయించేందుకు మొదట వ్రాయవలసి ఉంటుంది. ఈ రోజు ఫలానా నాటకము ఉంటుంది అని నాటకాల కథను వ్రాస్తారు కదా. ఈ రోజు ఈ విషయము గురించి అర్థం చేయించబడ్తుంది అని మీ వద్ద కూడా పాయింట్ల లిస్ట్‌ ఉండాలి. రావణ రాజ్యము నుండి దైవీరాజ్యములోకి ఎలా వెళ్లగలరు? జ్ఞానమంతా ఒక్కటే. కానీ రకరకాలైన విషయాలను వినడం వలన అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము ఎలా లభిస్తుంది అని ఖుషీ కలుగుతుంది. ''ఈ రోజు 125వ యజ్ఞము రచిస్తారు, అందులో వీటిని గురించి వినిపిస్తారు'' అని సన్యాసుల గురించి పేపర్లో వేస్తారు కదా. ఇక్కడ తండ్రి చెప్తున్నారు - ''నేను ఒక్కసారి మాత్రమే యజ్ఞమును రచిస్తాను. అందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది''. వారు చాలా యజ్ఞాలను రచిస్తారు. ఊరేగింపులు మొదలైనవి చేస్తారు. ఇచ్చట- ఇది రుద్రుడైన శివబాబా గారి ఒకే ఒక యజ్ఞమని మీకు తెలుసు. ఇందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. నూతన ప్రపంచము స్థాపన జరిగిపోతుంది. మీరు వెళ్ళి దేవతలుగా అవుతారు. దీనిని కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు. రచయిత అయిన తండ్రే వచ్చి రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంత్యముల సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తారు. అంతేకాక రాజయోగమును కూడా నేర్పిస్తారు. సత్యయుగములో పవిత్ర దేవతలు మాత్రమే ఉంటారు. వారే రాజ్యము కూడా చేస్తారు. దానినే ఆది సనాతన దేవీదేవతా ధర్మము అని అంటారు. ''ఆది సనాతన సత్యయుగీ దేవీ దేవతా ధర్మ స్థాపన ఎలా జరుగుతూ ఉందో, విశ్వములో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండి'' అనే టాపిక్‌ కూడా పెట్టవచ్చు. విశ్వములో శాంతి స్థాపన చేసేందుకు సలహా ఒక్క పరమపిత పరమాత్ముడు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. సలహాను ఇచ్చేవారికి కూడా బహుమతి లభిస్తుంది. ''విశ్వములో శాంతి స్థాపన చేసే బహుమతి ఎలా మరియు ఎవరు ఇస్తారు.'' ఇది కూడా ఒక టాపిక్‌గా ఉంచుకోండి. ఇలా విచార సాగర మథనము చేసి టాపిక్‌లు తయారుచేయాలి. అన్ని స్థానాల్లో ఒకే విషయము ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అందరితో సంబంధముంటుంది. ఇలాంటి లిస్ట్‌ను తయారుచేసి మొదట సూచన ఇవ్వాలి. తర్వాత సమాచారము డిల్లీకి రావాలి. అన్ని స్థానాల్లో ఇలాంటి భాషణ జరిగింది అని అందరికీ తెలియాలి. దీనినే ఐకమత్యము అని అంటారు. ప్రపంచమంతా అనైక్యత ఉంది. రామరాజ్యములో ఆవు, పులి కలిసి నీరు త్రాగుతాయి అని గాయనముంది. త్రేతాయుగానికే ఇలాంటి మహిమ ఉన్నప్పుడు సత్యయుగములో లేనిది ఏముంటుంది! శాస్త్రాలలో అయితే అనేక కథలు వ్రాసేశారు. మీరు తండ్రి ద్వారా ఒకే కథను వింటున్నారు. ప్రపంచములోనివారు అనేక కథలను తయారుచేస్తూ ఉంటారు. ద్వాపర యుగము నుండి కలియుగము వరకు ఏ శాస్త్రాలు మొదలైనవి నడుస్తాయో, అక్కడ(సత్యయుగములో) అవి ఉండవు. భక్తిమార్గము యొక్క అన్ని విషయాలు పూర్తవుతాయి. ఇక్కడ మీరు ఏది చూస్తున్నారో, అవన్నీ చెడ్డవే. వాటిని చూస్తూ కూడా చూడకండి. వింటూ కూడా వినకండి. ఇప్పుడు తండ్రి ఏదైతే తెలియజేస్తారో, అవి మాత్రమే బుద్ధిలో ఉంచుకోండి.

ఈ సంగమయుగీ బ్రాహ్మణులమైన మనము ఎంత శ్రేష్ఠమైనవారము! దేవతల కంటే శ్రేష్ఠమైనవారము! మనము ఈ సమయములో ఈశ్వరీయ సంతానము. మెల్ల మెల్లగా వృద్ధి చెందుతూ ఉంటాము. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవ్వరి బుద్ధిలోకి రావు. మనము ఈశ్వరీయ సంతానము కనుక తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవ్వాలి. ఎందుకంటే ఆ తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. కోట్ల సంవత్సరాలు అని అనడము వల్ల ఏ విషయమూ జ్ఞాపకముండదు. ఇది 5 వేల సంవత్సరాల మాట అని తండ్రి వచ్చి జ్ఞాపకము చేయిస్తున్నారు. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ మిమ్ములను అలాగే చేస్తారు. సన్ముఖములో వినుట వలన ఎంత ఖుషీ మరియు తాజాతనము కలుగుతుంది! వివేకవంతులైన పిల్లల బుద్ధిలో మేము తండ్రి నుండి ఆస్తి తప్పకుండా తీసుకోవాలి అని ఉంటుంది. తండ్రి కొత్త ప్రపంచమును రచిస్తున్నారు కనుక మనము కూడా తప్పకుండా కొత్త ప్రపంచములో ఉండాలి. అందరూ ఒకే తండ్రి పిల్లలు, అందరి ధర్మము, అందరి నివాసస్థానము, రాకపోకలు అన్నీ భిన్న-భిన్న ప్రకారాలుగా ఉంటాయి. ఎలా వెళ్ళి మూలవతనములో నివసిస్తారు అనునది కూడా బుద్ధిలో ఉంది. మూలవతనములో వంశ వృక్షము ఉంటుంది. సూక్ష్మవతనములో వంశమును చూపించలేరు. అక్కడ ఏమేమి చూపిస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలు. ఇవన్నీ డ్రామాలో రచింపబడినవి. మళ్లీ సూక్ష్మవతనానికి కూడా వెళ్తారు. అచ్చట మూవీ(మూగసైగలతో నడిచే డ్రామా) నడుస్తుంది. మధ్యలో మూవీ డ్రామా కూడా ఉండేది. తర్వాత టాకీ(సంభాషణలతో కూడినది) తయారయ్యింది. సైలెన్స్‌ డ్రామా అయితే తయారవ్వలేదు. మేము శాంతిగా(సైలెన్స్‌గా) ఎలా ఉంటాము అనునది పిల్లలకు తెలుసు. ఎలా అక్కడ ఆత్మల వంశము ఉంటుందో అలా ఇక్కడ మనుష్యుల వంశము ఉంటుంది. ఇలాంటి విషయాలను బుద్ధిలో ఉంచుకొని మీరు ఉపన్యసించవచ్చు. అయినా చదువులో సమయము పడ్తుంది. ఇది కూడా అర్థము చేసుకోవచ్చు. కానీ ధారణ చేసేందుకు, సంతోషము కలిగేందుకు స్మృతియాత్ర ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు యథార్థ రీతిలో యోగమును నేర్చుకుంటున్నారు. అందరినీ సోదరులుగా చూడండని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇది ఆత్మ సింహాసనము కనుక భగీరథుడైన బాబా సింహాసనము కూడా ప్రసిద్ధమయింది. ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించునప్పుడు నేను నా సోదరునికి అర్థం చేయిస్తున్నానని భావించండి. ఇదే దృష్టి ఉండాలి. ఇందులోనే చాలా కష్టముంది. శ్రమ వలన ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి కూడా ఇలాగే చూస్తారు. తండ్రి దృష్టి కూడా భృకుటి మధ్య భాగములోకే వెళ్తుంది. ఆత్మ ఏమో చాలా చిన్న బిందువు. వినేది కూడా ఆత్మనే. మీరు తండ్రిని కూడా భృకుటి మధ్యలోనే చూస్తారు. బాబా కూడా ఇక్కడే ఉన్నారు. సోదరుని ఆత్మ(బ్రహ్మ ఆత్మ) కూడా ఇక్కడేే ఉంది. ఇది బుద్ధిలో ఉండుట వలన జ్ఞానసాగరుని సంతానమైన మీరు కూడా(మాస్టర్‌) జ్ఞానసాగరులుగా అవుతారు. మీకు ఇది చాలా సహజము. గృహస్థ వ్యవహారములో ఉండేవారికి ఈ స్థితి కొంచెము కష్టము. విని ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ వాతావరణమే వేరుగా ఉంటుంది. ఇక్కడ సహజము. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి, బాబాను స్మృతి చేయండి అని బాబా యుక్తులను చాలా సహజంగా తెలియజేస్తారు. వీరు కూడా సోదరులే అను ఈ దృష్టి ద్వారా కర్మబంధనాల నుండి అతీతులుగా అవుతారు. శరీరము కూడా మర్చిపోతారు. కేవలం తండ్రి మాత్రము గుర్తు ఉంటారు. ఇందులో శ్రమ చేస్తూ ఉంటే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. అరుదుగా కొందరు మాత్రమే ఇలాంటి స్థితిలో ఉంటారు. వారే విశ్వానికి మాలికులుగా అవుతారు. 8 రత్నాల మాల ఉంది కదా కనుక పురుషార్థము చేయాలి. ఉన్నత పదవి పొందేవారు ఎలాగైనా తప్పకుండా పురుషార్థము చేస్తూ ఉంటారు. ఇందులో ఇతర విషయాలేవీ వెలువడవు. సోదర దృష్టి, స్నేహము మరియు సంబంధాలు ఏర్పడ్తాయి. అదే దృష్టి స్థిరపడ్తుంది. కనుక తండ్రి చెప్తున్నారు - మీకు చాలా గుహ్యమైన విషయాలు తెలియజేస్తాను. ఇది అభ్యాసము చేయడం శ్రమతో కూడిన పని. ఇక్కడ కూర్చునప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనే వింటుంది. వినే ఆత్మను మీరు చూస్తారు. మనుష్యులైతే ఆత్మ నిర్లేపి అని అంటారు. మరి శరీరమేమైనా వింటుందా? ఇది తప్పు. తండ్రి మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలు శ్రమపడవలసి ఉంటుంది. కల్పక్రితము ఎవరు తయారయ్యారో వారు తప్పకుండా శ్రమ చేస్తారు. ఇలా మేము వింటూ - వినిపిస్తూ ఉంటాము, అలవాటైపోయింది అని అనుభవము కూడా చెప్తారు. మన్మనాభవ అని ఆత్మకే వినిపిస్తారు. మళ్లీ వారు మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి చెప్తారు - మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి చేయండి. ఇది గుప్తమైన శ్రమ. చదువును కూడా ఏకాంతములో చెట్ల క్రిందకు వెళ్ళి చదువుతారు. అది స్థూలమైనది. ఇది ప్రాక్టికల్‌గా చేయవలసిన విషయము. రోజురోజుకు మీ ఈ సాధన వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కొత్త కొత్త విషయాలను వింటున్నారు కదా. ఇప్పుడు మీరు ఏది వింటున్నారో దానిని కొత్త కొత్తవారు వచ్చి వింటారు. మేము ఆలస్యంగా వచ్చామని కొందరు అంటారు. అరే! మీరు ఇంకా ఫస్ట్‌ క్లాస్‌ అయిన, గుహ్యాతి గుహ్యమైన విషయాలను వింటారు. పురుషార్థము చేయడం ద్వారానే ఉన్నతి పదవి లభిస్తుంది. ఇంకా మంచిది. మాయ అయితే చివరివరకు వదలదు. మీరు విజయము పొందే వరకు మాయతో యుద్ధము నడుస్తూ ఉంటుంది. తర్వాత సులభంగా మీరు వెళ్ళిపోతారు. ఎవరు ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంతంత మేము శరీరము వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నామని అర్థము చేసుకుంటారు. బ్రహ్మతత్వములో లీనమయ్యే లక్ష్యాన్ని ఉంచుకున్నవారు శరీరాన్ని వదిలినప్పుడు నిశ్శబ్ధము ఆవరించడాన్ని ఈ బాబా చూశారు. అయితే మోక్షాన్ని ఎవ్వరూ పొందలేరు. వాపస్‌ కూడా వెళ్ళలేరు. నాటకములో అయితే పాత్రధారులందరూ కావాలి కదా. చివర్లో అందరూ వచ్చేస్తారు. ఎప్పుడైతే ఒక్కరు కూడా మిగిలి ఉండరో అప్పుడు వాపస్‌ వెళ్తారు. మనుష్యమాత్రులందరూ వెళ్ళిపోతారు. కొందరు మాత్రమే మిగులుతారు. అందరికీ వీడ్కోలు ఇచ్చామని వారు చెప్తారు. ఈ సమయములో సత్యయుగ స్థాపన జరుగుతోంది. ఎన్ని కోట్లమంది మనుష్యులున్నారు. అందరికీ మనము వీడ్కోలిచ్చి మళ్లీ మన రాజధానికి వెళ్ళిపోతాము. వారు 40-50 మందికి వీడ్కోలు ఇవ్వవచ్చు. మీరు ఎంతమందికి వీడ్కోలు ఇస్తారు. ఆత్మలందరూ దోమల వలె శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు మీ జతలో తీసుకెళ్లేందుకు మరియు అందరినీ పంపేందుకు వచ్చారు. మీ మాటలు అద్భుతమైనవి. ఇన్ని కోట్లమంది మనుష్యులు వెళ్తారు. వారికి వీడ్కోలు ఇస్తారు. అందరూ వాపస్‌ మూలవతనములోకి వెళ్తారు. ఇక్కడ కూడా మీ బుద్ధియే పని చేస్తుంది. మెల్ల మెల్లగా వంశము వృద్ధి చెందుతుంది. తర్వాత రుండమాల, రుద్రమాల తయారైపోతుంది. రుద్రమాల, రుండమాల ఎలా తయారవుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా విశాల బుద్ధి గలవారే ఈ విషయాన్ని అర్థము చేసుకోగలరు. స్మృతి చేయుట కొరకు తండ్రి అనేక విధాలుగా తెలియజేస్తూ ఉంటారు. మనము రుద్రమాలలోకి వెళ్ళి రుండ మాల(విష్ణుమాల)లోకి వస్తాము. మళ్లీ నంబరువారుగా వస్తూ ఉంటారు. ఎంతో పెద్ద రుద్రమాల తయారవుతుంది. ఈ జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రారంభము నుండి ఈ జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఈ సంగమ యుగాన్ని స్మృతి చేసినట్లయితే జ్ఞానము పూర్తిగా బుద్ధిలోకి వచ్చేస్తుంది.

మీరు లైట్‌హౌస్‌లు. అందరినీ గమ్యానికి చేర్చేవారు. మీరు మంచి లైట్‌హౌస్‌గా ఎలా తయారవుతారు? మీకు అన్వయించని విషయమేదీ లేదు. మీరు సర్జన్‌ కూడా అయ్యారు. నగల వ్యాపారి కూడా అయినారు. ధోబీ(చాకలి) కూడా అయినారు. అన్ని విశేషతలు మీలో వచ్చేస్తాయి. మహిమ మీకు కూడా జరుగుతుంది. కానీ నెంబరువారు పురుషార్థానుసారము జరుగుతుంది. ఎలాంటెలాంటి కర్తవ్యాలను చేస్తారో అలాంటి గాయనము(మహిమ) జరుగుతుంది. బాబా ఆదేశాలనిస్తారు. వాటిని గురించి ఆలోచించడము, సెమినార్లు చేయడము పిల్లలైన మీ కర్తవ్యము. బాబా ఏమియూ నిరాకరించరు. మంచిది. చాలా వినిపించడం వలన ఏం లాభము? తండ్రి చెప్తారు - ''మన్మనాభవ!'' బాబా మీకు ఎంతటి తాజా ఆహారాన్ని తినిపిస్తున్నారు. అచ్ఛా! (మంచిది!)

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సంగమయుగీ బ్రాహ్మణులైన మేము దేవతలకంటే ఉన్నతమైన వారమనే నషా సదా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానము, మాస్టర్‌ జ్ఞానసాగరులము, అన్ని విశేషతలు ఈ సమయంలో మాలో నిండుతూ ఉన్నాయి అని నషా ఉండాలి.

2. తండ్రి ఏదైతే అర్థము చేయిస్తున్నారో అదే బుద్ధిలో ఉండాలి. మిగిలింది ఏది విన్నా విననట్లుండాలి, చూస్తూ చూడనట్లుండాలి. చెడును వినరాదు. చెడును చూడరాదు.

వరదానము :-

''మాయ నీడ నుండి బయటపడి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే నిశ్చింత చక్రవర్తి భవ''

ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ క్రింద ఉంటారో, వారు స్వయాన్ని సదా సురక్షితంగా అనుభవం చేస్తారు. మాయ నీడ నుండి రక్షించుకునే సాధనం తండ్రి ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండేవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా చింత ఉంటే సంతోషం మాయమైపోతుంది. సంతోషం మాయమయ్యింది, బలహీనమైనారంటే మాయ నీడ యొక్క ప్రభావము పడ్తుంది. ఎందుకంటే బలహీనతే మయను ఆహ్వానిస్తుంది. మాయ నీడ స్వప్నములో అయినా పడిందంటే చాలా వ్యాకుల పరుస్తుంది. అందువలన సదా ఛత్రఛాయ క్రింద ఉండండి.

స్లోగన్‌ :-

''జ్ఞానమనే స్క్రూ డ్రైవర్‌ తో నిర్లక్ష్యమనే లూజ్‌ స్క్రూను టైట్‌ చేసి సదా అలర్ట్‌గా (హెచ్చరికగా) ఉండండి.''