29-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఈ గొప్ప బాబా, గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు. కేవలం రెండు అక్షరాలు తండ్రి(అల్ఫ్) మరియు వారసత్వము(బే)ను స్మృతి చేయండి. ''
ప్రశ్న :-
ఆత్మిక తండ్రికి మజా(ఆనందము) కలిగించే వారి ముఖ్యమైన కర్తవ్యమేది?
జవాబు :-
పతితులను పావనంగా చేయడమే ఆత్మిక తండ్రి ముఖ్యమైన కర్తవ్యము. పావనంగా చేయడంలోనే తండ్రికి చాలా మహిమ వస్తుంది. పిల్లలకు సద్గతినిచ్చేందుకే, సర్వులను సతోప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్లాలి. కేవలం ' నేను దేహమును కాదు, ఆత్మను' అనే పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి. ఈ పాఠము ద్వారా తండ్రి స్మృతి ఉంటుంది, పావనంగా కూడా అవుతారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మిమ్ములను పవిత్రంగా చేయడంలో తండ్రికి కూడా చాలా మజా వస్తుంది. అందువలన పతితపావనులైన తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. సర్వులకు సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే, మరెవ్వరూ లేరు. ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్లాలని కూడా ఇప్పుడు మీకు తెలుసు. పురుషార్థము ఎక్కువ చేసేందుకు స్మృతి యాత్ర అవసరమని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత చదువు. మొదట అల్ఫ్ అయిన తండ్రిని స్మృతి చేయండి, తర్వాత రాజ్యమును స్మృతి చేయండి. ఇందుకొరకు మీకు ఆదేశాలనిస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో, సతోప్రధానము నుండి తమోప్రధానంగా అవుతారో మీకు తెలుసు. మెట్లు క్రిందికి దిగవలసి వస్తుంది. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. సత్యయుగము పావన ప్రపంచము. అక్కడ ఒక్కరు కూడా పతితులు ఉండరు. సత్యయుగములో ఈ విషయాలే ఉండవు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. అప్పుడే కొత్త ప్రపంచములోకి వస్తారు. అంతేకాక రాజ్య పాలన చేసేందుకు అర్హులుగా అవుతారు. అందరూ పావనంగా అవ్వాల్సిందే. అక్కడ పతితులు ఉండనే ఉండరు. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము ఎవరు చేస్తారో, వారే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ముఖ్యమైన విషయము ఒక్కటే. తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి ఎక్కువ కష్టపెట్టరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మొదట నేను దేహమును కాదు, ఆత్మనని పక్కా చేసుకుంటే చాలని బాబా మాటిమాటికి చెప్తుంటారు. గొప్ప వ్యక్తులు ఎక్కువగా చదవరు, రెండు మాటలలోనే వినిపిస్తారు. గొప్ప వ్యక్తులకు కష్టమునివ్వరు. సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అవ్వడంలో ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు. 63 జన్మలని అనరు, 84 జన్మలు పట్టాయి. మనము సతోప్రధానంగా, స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి అధికారులుగా ఉండేవారమని నిశ్చయముంది కదా, సుఖధామముండేది. దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అంటారు. అయితే వారు కూడా మానవులే. కేవలం దైవీగుణాలు కలిగినవారిగా ఉండేవారు. ఈ సమయములో ఆసురీ గుణాలు గల మనుష్యులుగా ఉన్నారు. అసురులు మరియు దేవతలకు యుద్ధము జరిగినప్పుడు దేవతల రాజ్యము స్థాపించబడిందని శాస్త్రాలలో వ్రాసేశారు. మీరు మొదట అసురులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా చేసి, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. పోతే అసురులు మరియు దేవతల మధ్య యుద్ధము విషయమే లేదు. అహింసయే దేవతల పరమ ధర్మమని అంటారు. దేవతలు ఎప్పుడూ యుద్ధము చెయ్యరు. హింస అను మాటే ఉండజాలదు. సత్యయుగములో, దైవీరాజ్యములో యుద్ధము ఎక్కడి నుండి వచ్చింది! సత్యయుగములోని దేవతలు ఇక్కడికి వచ్చి అసురులతో యుద్ధము చేస్తారా లేక అసురులు దేవతల వద్దకు వెళ్లి యుద్ధము చేస్తారా? ఇలా హింస జరిగేందుకు వీలు లేదు. ఇది పాత ప్రపంచము, అది క్రొత్త ప్రపంచము మరి యుద్ధమెలా జరుగుతుంది? భక్తిమార్గములో అయితే మానవులు ఏది వింటారో దానికంతా సత్యమని అంటూ ఉంటారు. కొందరి బుద్ధి పని చేయదు. పూర్తి రాతిబుద్ధిగా ఉన్నారు. కలియుగములో రాతిబుద్ధి, సత్యయుగములో పారస బుద్ధి గలవారు ఉంటారు. రాజ్యమే పారసనాథునిది. ఇక్కడ రాజ్యమే లేదు. ద్వాపర యుగములోని రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు. రత్నజడిత కిరీటము ఉండేది. ప్రకాశ కిరీటము అనగా పవిత్రతా కిరీటము ఉండేది కాదు. అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అలాగని వారి పైన ఏదో ఒక లైటు ఉండేదని కాదు. చిత్రాలలో పవిత్రతకు గుర్తుగా ప్రకాశాన్ని చూపించారు. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవుతారు. కాని మీకు ప్రకాశము(లైట్/కూఱస్త్రష్ట్ర్) ఎక్కడ ఉంది? తండ్రితో యోగము చేసి పవిత్రముగా తయారవుతున్నారు. అక్కడ వికారాలనే మాటే లేదు. వికారాల రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. ఇప్పుడు రావణ రాజ్యముందని ఋజువు చేసేందుకు ఇక్కడ రావణుని చూపిస్తారు. రావణుని ప్రతి సంవత్సరము తగులబెట్తారు, కానీ కాలిపోడు. మీరు రావణుని పై విజయమును పొందుతారు. తర్వాత ఈ రావణుడు ఉండనే ఉండడు.
మీరు అహింసకులు. యోగబలము ద్వారా మీకు విజయము కలుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ-జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనమవుతాయి. జన్మ-జన్మాంతరాలంటే ఎప్పటి నుండి? వికర్మలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారు. సూర్యవంశము తర్వాత చంద్రవంశములో రెండు కళలు తగ్గిపోతాయి. తరువాత నెమ్మది నెమ్మదిగా కళలు తక్కువవుతూ పోతాయి. తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. ఎవరైతే కల్పక్రితము సతోప్రధానంగా అయ్యారో వారే అవుతారు. నెంబరువారుగా వస్తూ ఉంటారు. మళ్లీ డ్రామానుసారము వచ్చినప్పుడు కూడా నెంబరువారుగా ఇలాగే వస్తారు. వచ్చి జన్మ తీసుకుంటారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారయిందో తెలుసుకునేందుకు కూడా వివేకము ఉండాలి. ఎలాగైతే మీరు క్రిందికి దిగారో ఇప్పుడు మళ్లీ పైకెక్కాలి. నెంబర్వారుగానే పాస్ అవుతారు. మళ్లీ నెంబరువారుగా క్రిందకు వస్తారు. సతోప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యము. అందరూ ఫుల్గా పాస్ అవ్వలేరు. 100 మార్కుల నుండి తక్కువవుతూ వస్తాయి. అందువలన చాలా పురుషార్థము చేయాలి. ఈ పురుషార్థములోనే ఫెయిల్ అవుతారు. సర్వీసు చేయడమేమో సహజము. మ్యూజియమ్లో మీరు ఎలా అర్థం చేయిస్తారో అది ప్రతి ఒక్కరి చదువును బట్టి తెలిసిపోతుంది. వీరు సరిగ్గా అర్థము చేయించడం లేదని గమనిస్తే, పెద్ద(హెడ్) టీచరు స్వయంగా వెళ్లి అర్థము చేయిస్తారు. వచ్చి సహాయము చేస్తారు. ఒకరిద్దరు గార్డులను నియమించడం జరుగుతుంది. వీరు సరిగ్గా అర్థము చేయిస్తున్నారా లేదా కదా? అని గమనిస్తారు. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు తికమక అవ్వడం లేదు కదా? అని కూడా గమనిస్తారు. సేవాకేంద్రములో చేయు సర్వీసు కంటే ప్రదర్శిని ద్వారా చేయు సర్వీసు బాగా జరుగుతుంది. ప్రదర్శినీ కంటే మ్యూజియమ్లలో సర్వీసు బాగా జరుగుతుంది. మ్యూజియమ్ను బాగా ఆకర్షణీయంగా తయారు చేస్తే చూసినవారు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇది చివరివరకు నడుస్తూ ఉంటుంది.
ఈశ్వరీయ విశ్వవిద్యాలయమనే పేరు బాగుంది. ఇందులో మనుష్యుల పేరే లేదు. దీనిని ఎవరు ఉద్ఘాటన చేస్తారు? తండ్రి చెప్తారు - మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో ఉద్ఘాటన చేయిస్తే, వారి పేరు విని చాలామంది వస్తారు. ఆ ఒక్కరి వెనుక చాలామంది వస్తారు. అందువలన బాబా గొప్ప - గొప్ప వ్యక్తుల అభిప్రాయాలను అచ్చు వేయించండి అని ఢిల్లీవారికి వ్రాశారు. అది చూసి వీరి వద్దకు ఇంత గొప్ప-గొప్ప వ్యక్తులు వస్తారా! అని మనుష్యులు గమనిస్తారు. గొప్పవారు చాలా మంచి అభిప్రాయమును వ్రాస్తారు. కావున వాటిని ముద్రిస్తే బాగుంటుంది. ఇందులో మరే మాయా మంత్రము లేదు. అందువలన బాబా అభిప్రాయాల పుస్తకము ఉండాలని వ్రాస్తారు. ఇక్కడ కూడా పంచి పెట్టాలి. అసత్య కాయము, అసత్య మాయ,............ (ఝూఠీÄ కాయ, ఝూఠీ మాయా,......) అని పాడ్తారు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఇది రావణ రాజ్యము. రాక్షస రాజ్యమని చాలామంది అంటారు. ఇంతకుముందు ఎవరి రాజ్యముండేదో వారికి తోచాలి. పతితులైన మమ్ములను పావనంగా చేయండని అంటారు. కావున పతితత్వము అనుదానిలో అన్నీ వచ్చేస్తాయి. అందరూ ఓ పతితపావనా! రండి,............... అని పాడుతూ ఉన్నారంటే తప్పకుండా పతితంగా ఉన్నారనే అర్థము.
పతితపావన పరమపిత పరమాత్మయా? లేక అన్నీ నదులు, కాలువలా? అనే చిత్రమును కూడా మీరు బాగా తయారు చేశారు. అమృత్సర్లో కూడా సరోవరముంది. నీరంతా మురికిగా అవుతుంది. వారు దానిని అమృతసరోవరముగా భావిస్తారు. గొప్ప-గొప్ప వ్యక్తులు అమృతమని భావించి సరోవరమును శుభ్రము చేస్తారు. అందువలన దానికి అమృత్సర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు గంగను కూడా అమృతమని అంటారు. నీళ్లు ఎంత మురికిగా అవుతాయంటే చెప్పనలవి కాదు. ఈ నదులలో ఈ బాబా(బ్రహ్మాబాబా) కూడా స్నానము చేశారు. నీరు చాలా మురికిగా ఉంటుంది. మళ్లీ మట్టిని తీసుకుని రుద్దుకుంటారు. బాబా అనుభవీ కదా! శరీరము కూడా పాతది, అనుభవయుక్తమైనది తీసుకున్నారు. వీరిలాంటి అనుభవీలు ఎవ్వరూ ఉండరు. గొప్ప-గొప్ప వ్యక్తులైన రాజప్రతినిధులు రాజులు, మొదలైన వారితో కలిసి మాట్లాడే అనుభవముండేది. జొన్నలు, సజ్జలను కూడా అమ్మేవాడు. చిన్నతనములో 4-6 అణాలు సంపాదిస్తే చాలు, ఖుషీగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయాడు? పల్లె పిల్లవాడు తర్వాత ఎలా అయ్యాడు? నేను సాధారణ తనువులో వస్తానని తండ్రి కూడా చెప్తారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. 84 జన్మలు తీసుకున్న తర్వాత చివర్లో పిల్లవాడిగా ఎలా అయ్యాడో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చరిత్ర కృష్ణునికీ లేదు, కంసునికీ లేదు. కుండ పగులగొట్టడం మొదలైనవన్నీ కృష్ణుని గురించి అసత్యము చెప్తారు. తండ్రిని చూడండి, మధురాతి మధురమైన పిల్లలూ, లేస్తూ - కూర్చుంటూ మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఎంత సింపుల్గా చెప్తారు! నేను ఆత్మలందరికీ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రిని మనమంతా పరస్పరము సోదరులము. వారు మన తండ్రి అని మీకు తెలుసు. సోదరులమైన మనందరము ఒకే తండ్రిని స్మృతి చేస్తాము. వారేమో ఓ భగవంతుడా! ఓ ఈశ్వరా! అని అంటారు. కాని వారిని గురించి ఏమీ తెలియదు. తండ్రి ఇప్పుడు తన పరిచయమిచ్చారు. డ్రామా ప్లాను అనుసారము దీనిని గీతా యుగమని అంటారు. ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానము వినిపిస్తారు. దీని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఉచ్ఛరిస్తుంది. తండ్రి కూడా దివ్యమైన అలౌకిక కర్తవ్యాన్ని చేయాలంటే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. అర్ధకల్పము నుండి మానవులు దు:ఖితులైనప్పుడు మళ్లీ పిలుస్తారు. తండ్రి కల్పములో ఒక్కసారి మాత్రమే వస్త్తారు. మీరైతే ప్రతిసారి పాత్ర చేస్తారు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మము. ఇప్పుడు ఆ పునాది లేనే లేదు. వారి చిత్రాలు మాత్రమే మిగిలాయి. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలని తండ్రి కూడా అంటారు. లక్ష్యము ఎదురుగానే ఉంది. ఇది ఆది సనాతన దేవీదేవతా ధర్మము. ఇక హిందూ ధర్మమంటూ ఏదీ లేదు. హిందు అనునది హిందుస్థాన్ పేరు. సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైన బ్రహ్మతత్వమునే భగవంతుడు అని అంటారో అదే విధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని(హిందూస్థాన్ను) తమ ధర్మముగా చెప్తారు. ఆది సనాతనమనునది హిందూ ధర్మము కాదు. హిందువులు దేవతల ఎదురుగా వెళ్లి వారికి నమస్కరిస్తారు, వారిని మహిమ చేస్తారు. దేవతలుగా ఉండేవారే హిందువులుగా అయ్యారు. ధర్మ భ్రష్ఠులు, కర్మ భ్రష్ఠులుగా అయిపోయారు. మిగిలిన ధర్మములన్నీ స్థిరంగా ఉన్నాయి. ఈ దేవతా ధర్మమొక్కటే ప్రాయ: లోపమైపోయింది. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్లీ పూజారులుగా అయ్యి దేవతలను పూజిస్తారు. ఎన్ని విధాలుగా అర్థం చేయించవలసి వస్తుంది. కృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతను స్వర్గములోని ప్రప్రథమ రాకుమారుడు, కావున 84 జన్మలు కూడా వారి నుండే ప్రారంభమవుతాయి. అనేక జన్మల తర్వాత, అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. కావున ఆ లెక్కాచారమును తప్పకుండా తెలుపుతారు కదా. ఈ లక్ష్మీ - నారాయణులే నెంబర్వన్గా వచ్చారు. కావున ఎవరు ముందు వచ్చారో వారే మళ్లీ చివర్లో వెళ్తారు. కృష్ణుడు ఒక్కడే లేడు కదా. ఇంకా విష్ణువంశము వారు కూడా ఉండేవారు. ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్నారు. వీటిని మళ్లీ మర్చిపోరాదు. ఇప్పుడు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు. చాలా తెరవబడ్తాయి. చాలామంది వస్తారు. ఎలాగైతే మందిరానికి వెళ్లి తల వంచి నమస్కరిస్తారో అలా మీ వద్ద కూడా లక్ష్మీనారాయణుల చిత్రాలుంటే భక్తులు వారి ఎదుట పైసలు ఉంచుతారు. అప్పుడు మీరు మొదట ఈ విషయాలను అర్థము చేసుకోండి. పైసలు ఉంచే అవసరము లేదని వారికి చెప్తారు. మీరిప్పుడు శివాలయానికి వెళ్తే పైసలు ఉంచుతారా? శివుడనగా ఎవరో అర్థం చేయించాలనే ఉద్ధేశ్యముతో వెళ్తారు. ఎందుకంటే మీకు వీరి చరిత్ర తెలుసు. మందిరాలైతే చాలా ఉన్నాయి. ముఖ్యమైనది శివాలయము. అక్కడ ఇతర దేవతా మూర్తులను ఎందుకుంచుతారు? అందరి వద్ద పైసలు ఉంచుతూ వెళ్తే ఆదాయము ఉంటుంది. కనుక దానిని శివాలయమంటారా లేక శివుని పరివారము యొక్క మందిరమంటారా? ఈ పరివారాన్ని శివబాబా స్థాపన చేశారా? బ్రాహ్మణులదే సత్యమైన పరివారము. శివబాబా పరివారమైతే సాలిగ్రామాలు. తర్వాత సోదర-సోదరీమణులైన మనము పరివారంగా అవుతాము. మొదట సోదరులుగా(భాయీ భాయీగా) ఉండేవారము. తండ్రి వస్తే సోదర-సోదరీలుగా అవుతాము. మళ్లీ మీరు సత్యయుగములో వస్తారు. అక్కడ పరివారము ఇంకా పెరుగుతుంది. అక్కడ కూడా వివాహము జరిగితే పరివారము ఇంకా వృద్ధి అవుతుంది. ఇల్లు అనగా శాంతిధామములో ఉన్నప్పుడు మనమందరము పరస్పరములో సోదరులుగా ఒక్క తండ్రి పిల్లలుగా ఉండేవారము. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు సంతానమైన సోదర - సోదరీలుగా ఉన్నాము. మరే సంబంధమూ లేదు. మళ్లీ రావణ రాజ్యములో చాలా వృద్ధి అవుతూ పోతుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తే జన్మ - జన్మల పాప భారము దిగిపోతుంది. చదువు ద్వారా పాప భారము సమాప్తమవ్వదు. తండ్రి స్మృతియే ముఖ్యమైనది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఫుల్ మార్కులతో ఉత్తీర్ణులవ్వాలంటే తమ బుద్ధిని సతోప్రధానంగా, పారసంగా(పరశువేదిగా) చేసుకోవాలి. మందబుద్ధి నుండి సూక్ష్మబుద్ధిగా అయ్యి డ్రామాలోని విచిత్రమైన రహస్యాన్ని అర్థము చేసుకోవాలి.
2. ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన, అలౌకిక కర్మలు చేయాలి. డబుల్ అహింసకులుగా అయ్యి యోగబలము ద్వారా తమ వికర్మలను వినాశనము చేసుకోవాలి.
వరదానము :-
'' ఈ బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ఆశీర్వాదాల పాలనను ప్రాప్తి చేసుకొను మహాన్ ఆత్మా భవ ''
ఈ బ్రాహ్మణ జీవితంలో పరమాత్ముని ఆశీర్వాదాలు, బ్రాహ్మణ పరివారము ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి(లభిస్తాయి). ఈ చిన్న యుగము సర్వ ప్రాప్తులను, సదాకాలానికి ప్రాప్తి చేసుకునే యుగము. స్వయం తండ్రియే ప్రతి శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ సంకల్పము ఆధారంతో ప్రతి బ్రాహ్మణ పుత్రునికి ప్రతి సమయం హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ సర్వ ఆశీర్వాదాలు తీసుకునే ఆధారము స్మృతి మరియు సేవల బ్యాలన్స్. ఈ మహత్వాన్ని తెలుసుకొని మహాన్ ఆత్మగా అవ్వండి.
స్లోగన్ :-
'' విశాల హృదయం గలవారై ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల కానుక పంచుటే శుభ భావన, శుభ కామన. ''