17-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - నేను ఒక ఆత్మను అని పక్కా - పక్కాగా నిశ్చయం చేసుకోండి, ఏ కర్మనైనా ఆత్మగా భావించి ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తుకొస్తారు, ఏ పాపమూ జరగదు ''

ప్రశ్న :-

కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయవలసిన శ్రమ ఏది? కర్మాతీత స్థితికి సమీపించారని అనేందుకు గుర్తులు ఏవి?

జవాబు :-

కర్మాతీతంగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశము చేసుకునే శ్రమ చేయండి. '' నేను నిరాకార ఆత్మను, నిరాకార తండ్రి సంతానాన్ని '' - అని అభ్యాసము చేయండి, అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోవడమే చాలా పెద్ద(జబర్‌దస్త్‌) పురుషార్థము. కర్మాతీత స్థితికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో, అంత కర్మేంద్రియాలు శీతలంగా, సుగంధితంగా అవుతూ ఉంటాయి. వారి నుండి వికారీ చెడు వాసనలు తొలగిపోతాయి. అతీంద్రియ సుఖము అనుభవమవుతూ ఉంటుంది.

ఓంశాంతి.

శివభగవానువాచ. ఎవరి పట్ల చెప్పారో పిల్లలకు చెప్పనవసరము లేదు. శివబాబా జ్ఞానసాగరులని, మానవ సృష్టికి బీజరూపులని పిల్లలకు తెలుసు. అందువలన వారు తప్పకుండా ఆత్మలతోనే మాట్లాడ్తారు. శివబాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. బాబా అనే పదము ద్వారా '' పరమాత్మనే బాబా '' అని అంటారని పిల్లలు తెలుసుకున్నారు. మానవమాత్రులందరూ ఆ పరమాత్మనే తండ్రి అని అంటారు. ఆ తండ్రి పరంధామములో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలన్నీ పక్కా చేయాలి. స్వయాన్ని ఆత్మ అని దృఢంగా నిశ్చయము చేసుకోవాలి. తండ్రి వినిపించే దానిని ఆత్మయే ధారణ చేస్తుంది. పరమాత్మలో ఉన్న జ్ఞానము ఆత్మలోకి కూడా రావాలి. దానినే నోటి ద్వారా వర్ణన చేయవలసి ఉంటుంది. చదివేదంతా ఆత్మయే చదువుతుంది. ఆత్మ వెళ్లిపోతే చదువు గానీ, ఏ ఇతరము గానీ తెలియదు. ఆత్మ సంస్కారాలను తీసుకెళ్తుంది, వెళ్లి మరొక శరీరములో ప్రవేశిస్తుంది. కనుక మొదట స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించాలి. ఇప్పుడు దేహాభిమానాన్ని వదలాల్సి ఉంటుంది. ఆత్మయే వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకుంటే శరీరము కనీసము కదలను కూడా కదలలేదు. పరమాత్మ ఆత్మలమైన మనకు జ్ఞానమిస్తున్నారని పిల్లలైన మీకు నిశ్చయము పక్కాగా ఉంది. ఆత్మలమైన మనము కూడా శరీరము ద్వారా వింటున్నాము, పరమాత్మ కూడా శరీరము ద్వారా వినిపిస్తున్నారు. కానీ క్షణ-క్షణము ఈ విషయాన్ని మర్చిపోతాము. దేహము గుర్తుకు వస్తుంది. మంచి సంస్కారము గానీ, చెడు సంస్కారము గానీ ఆత్మలోనే ఉంటాయని కూడా మీకు తెలుసు. మద్యపానము, ఛీ-ఛీ మాటలు మాట్లాడడం,........... మొదలైనవి కూడా అవయముల ద్వారా చేసేది ఆత్మనే. అవయవాల ద్వారా ఇంతటి పాత్ర అభినయించేది ఆత్మనే. మొట్ట మొదటిది - ఆత్మ అభిమానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఈ జ్ఞానాన్ని ఆత్మనే తన జతలో తీసుకెళ్తుంది. అక్కడ పరమాత్మ ఎలాగైతే జ్ఞాన సహితంగా ఉంటారో అలాగే ఆత్మలైన మీరు కూడా ఈ జ్ఞానాన్ని జతలో తీసుకెళ్తారు. నేను పిల్లలైన మిమ్ములను ఈ జ్ఞాన సహితంగా తీసుకెళ్తాను. మళ్లీ ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు రావాలి. నూతన ప్రపంచములో ప్రాలబ్ధాన్ని అనుభవించే పాత్రను అభినయిస్తారు. జ్ఞానము మర్చిపోతారు. ఇవన్నీ మంచి రీతిగా ధారణ చేయాలి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ ఆని చాలా చాలా పక్కా చేసుకోవాలి. దీనిని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. వారు చాలా చాలా శ్రమ చేయాలి. విశ్వానికి అధికారిగా అవ్వాలంటే శ్రమ చేయకుండా అవ్వలేరు. క్షణ-క్షణము ఈ పాయింటునే మర్చిపోతారు ఎందుకంటే ఇది నూతన జ్ఞానము. స్వయాన్ని ఆత్మ అని మరచి దేహాభిమానములోకి వచ్చినప్పుడు ఏదో ఒక పాపకర్మ జరుగుతూ ఉంటుంది. దేహీ-అభిమానిగా అయినందున ఎప్పుడూ పాపాలు జరగవు. పాపాలు నశిస్తాయి. మళ్లీ అర్ధకల్పము వరకు ఎటువంటి పాపాలూ జరగవు. కావున మనమంతా ఆత్మలము. చదివేది ఆత్మనే, దేహము కాదు అని నిశ్చయము ఉంచుకోవాలి. ఇంతకుముందు మీకు దైహికమైన మానవుల మతము లభించేది, ఇప్పుడు నిరాకార తండ్రియే శ్రీమతమునిస్తున్నారు. ఇది పూర్తిగా నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. మీరంతా కొత్తగా అయిపోతారు. ఇందులో సంశయపడే విషయమే లేదు. అనేకానేక పర్యాయాలు మీరు పాత నుండి క్రొత్తగా, క్రొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు. కనుక మంచిరీతిగా పురుషార్థము చేయాలి.

ఆత్మలైన మనము కర్మేంద్రియాల ద్వారా కర్మలాచరిస్తాము. ఆఫీసులు మొదలైన వాటిలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాల ద్వారా పని చేస్తూ ఉంటే, నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. ఇంతకుముందు నేను సాకారమునని భావిస్తూ నిరాకారుడినే స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని ఎప్పుడూ స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఇది చాలా విచార సాగర మథనము చేయవలసిన విషయము. మేము 2 గంటలు స్మృతిలో ఉంటామని కొందరు వ్రాస్తారు. కొందరైతే మేము ఎల్లప్పుడూ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటామని వ్రాస్తారు. కానీ సదా ఎవ్వరూ స్మృతి చేయలేరు. అలా స్మృతి చేస్తూ ఉంటే మొదటే కర్మాతీత స్థితిని పొందుకొని ఉండాలి. కర్మాతీత స్థితి చాలా తీవ్రమైన శ్రమ వలన వస్తుంది. ఈ స్థితిలో వికారీ కర్మేంద్రియాలన్నీ వశమౌతాయి. సత్యయుగములో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోతాయి. అంగాంగములు సుగంధితమవుతాయి. ఇప్పుడు అంగాంగములు దుర్వాసనతో, అశుద్ధంగా ఛీ-ఛీగా ఉన్నాయి. సత్యయుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గమని, నూతన ప్రపంచమని, వైకుంఠమని అంటారు. అచ్చటి రూపురేఖలు, కిరీటము మొదలైన వాటిని ఇక్కడ ఎవ్వరూ తయారుచేయలేరు. భలే మీరు వాటిని చూచి కూడా వస్తారు. కానీ ఇక్కడ వాటిని తయారుచేయలేరు. అక్కడ సహజ సిద్ధమైన అందము(శోభ) ఉంటుంది. కనుక ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. స్మృతియాత్ర చాలా చాలా చెయ్యాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థ పొందుకుంటే అప్పుడు అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. అంగాంగములన్నీ చాలా సుగంధితమవుతాయి, దుర్గంధము ఉండదు. ఇప్పుడు అన్ని కర్మేంద్రియాలలో దుర్గంధము నిండి ఉంది. ఈ శరీరము దేనికీ పనికిరాదు. మీ ఆత్మలు ఇప్పుడు పవిత్రమవుతూ ఉన్నాయి. శరీరము పవిత్రంగా అవ్వలేదు. మీకు నూతన శరీరము లభించినప్పుడు పవిత్రమవుతుంది. అంగాంగములన్నీ దేవతలకు సుగంధపూరితముగా ఉంటాయని మహిమ ఉంది. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. తండ్రి వచ్చినందున సంతోషపు పాదరస మీటరు పెరిగిపోవాలి.

తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. గీతలోని పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బాబా ఈ విషయము కూడా తెలిపించారు - గీతను చదివే నా భక్తులు కృష్ణుని పూజారులుగా తప్పకుండా ఉంటారు. అందుకే దేవతలను పూజించే వారికి వినిపించమని బాబా చెప్తారు. మానవులు ఒకవైపు శివుని పూజిస్తారు వెంటనే సర్వవ్యాపి అని అనేస్తారు. గ్లాని చేస్తూ కూడా ప్రతి రోజూ మందిరాలకు వెళ్తారు. శివాలయానికి గుంపులు గుంపులుగా వెళ్తారు. చాలా ఎత్తుకు మెట్లు(తాపలు) ఎక్కుతూ కొండల పైకి వెళ్తారు. శివుని మందిరాలు ఎత్తైన ప్రదేశాలలోనే నిర్మిస్తారు. శివబాబా కూడా వచ్చి మెట్ల(సీఢీ) గురించి చెప్తారు కదా. వారి పేరు ఉన్నతమైనదే, వారి నివాసము కూడా ఉన్నతమైనదే (ఊంచా తేరా నామ్‌, ఊంచా తేరా ధామ్‌). ఎంత ఎత్తుకు వెళ్తారు! బదరీనాథ్‌, అమరనాథ్‌ మొదలైన చోట్ల శివాలయాలు ఉన్నాయి. ఉన్నతంగా చదివించేవారు కావున వారి మందిరాలు కూడా చాలా ఎత్తుగానే నిర్మిస్తారు. ఇక్కడ గురుశిఖర మందిరము కూడా చాలా ఎత్తైన పర్వతము పై నిర్మింపబడి ఉంది. ఉన్నతమైన తండ్రి కూర్చుని మిమ్ములను చదివిస్తారు. శివబాబా వచ్చి చదివిస్తారని ప్రపంచములో ఇతరులెవ్వరికీ తెలియదు. వారు శివబాబాను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ఎదుట లక్ష్యము - ఉద్ధేశ్యము కూడా ఉంది. ఇది మీ లక్ష్యము - ఉద్ధేశ్యము అని ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చెప్పరు. ఈ విషయాలన్నీ తండ్రియే స్వయంగా పిల్లలైన మీకు తెలిపిస్తారు. మీరు వినే కథ కూడా సత్యనారాయణ కథ. గతించిపోయిన వారి గురించి, ఇంతకుముందు ఇలా జరిగిందని కథలుగా వినిపిస్తారు. దానిని కథ అని అంటారు. ఈ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి అత్యంత పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్ములను చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది. ఇది సదా గుర్తుంచుకుని అనేకమందికి వినిపించాలి. కథను వినిపించేందుకు మీరు ప్రదర్శని లేక మ్యూజియాలను తయారు చేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము మాత్రమే ఉండేది, అందులో దేవతలు రాజ్యము చేసేవారు. ఇది సత్య-సత్యమైన కథ. ఇతరులెవ్వరూ ఈ కథను తెలుపలేరు. చైతన్య వృక్షపతి అయిన తండ్రి కూర్చుని ఈ సత్యమైన కథను వినిపిస్తున్నారు. దీని వలన మీరు దేవతలుగా అవుతారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా అవ్వకుంటే ధారణ జరగదు. పులి పాలు నింపేందుకు బంగారు పాత్ర కావాలి. అప్పుడే ధారణ జరగగలదు. ఈ చెవులు పాత్ర వలె ఉన్నాయి కదా. ఇవి బంగారు పాత్రలుగా ఉండాలి. ఇప్పుడు రాతి పాత్రల వలె ఉన్నాయి. బంగారు పాత్రగా అయితేనే ధారణ జరగగలదు. చాలా గమనముంచి వినాలి, ధారణ చేయాలి. గీతలో వ్రాయబడిన కథ చాలా సులభమైనది. వారు కథలు వినిపించి సంపాదన చేస్తారు. వినేవారి నుండి వారికి సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా సంపాదన జరుగుతుంది. రెండు సంపాదనలు నడుస్తూ ఉంటాయి. రెండూ వ్యాపారాలే. చదివించను కూడా చదివిస్తారు. 'మన్మనాభవ', పవిత్రము అవ్వండి అని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనరు. అలాగే మన్మనాభవలో కూడా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఏ మనుష్యులూ పవిత్రంగా ఉండలేరు. ఎందుకంటే వారు భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు. కలియుగాంతము వరకు రావణ రాజ్యము కొనసాగుతుంది. అందులో పావనంగా అవ్వాలి. దేవతలను పావనులని అంటారు కానీ మనుష్యులను అలా అనరు. సన్యాసులు కూడా మనుష్యులే. వారిది నివృత్తిమార్గపు ధర్మము. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రమైపోతారని తండ్రి అంటారు. భారతదేశములో ప్రవృత్తి మార్గము వారి రాజ్యమే ఉండేది. నివృత్తి మార్గము వారితో మీకు ఎలాంటి సంబంధము లేదు. ఇక్కడ స్త్రీ, పురుషులు ఇరువురూ పవిత్రంగా అవ్వాలి. రెండు చక్రాలు(పతి - పత్నులు) నడుస్తే బాగుంటుంది, లేకుంటే గొడవలు జరుగుతాయి. పవిత్రత విషయంలోనే జగడాలు జరుగుతాయి. ఏ ఇతర సత్సంగములోనూ పవిత్రత విషయములో గొడవలు జరిగాయని ఎప్పుడూ విని ఉండరు. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఈ గొడవలు జరుగుతాయి. అబలల పైన అత్యాచారాలు జరుగుతాయని ఏ సాధు సత్పురుషులు మొదలైన వారెవరైనా ఎప్పుడైనా చెప్తారా? బాబా మమ్ములను రక్షించమని ఇక్కడ నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తారు. పవిత్రత కోల్పోవడం లేదు కదా అని తండ్రి అడుగుతారు ఎందుకంటే కామము మహాశత్రువు కదా. ఒక్కసారిగా క్రిందపడి పోతారు. ఈ కామ వికారము అందరినీ పైసకు కొరగాకుండా చేసేసింది. తండ్రి చెప్తున్నారు - 63 జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటారు. ఇప్పుడు పవిత్రంగా అయ్యి శివాలయములోకి వెళ్లాలి. కనుక ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. శివబాబాను స్మృతి చేస్తే శివాలయములోకి, స్వర్గములోకి వెళ్తారు. కానీ కామ వికారము చాలా శక్తివంతమైనది. చాలా కలవరపెడ్తుంది, ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించి వేయాలి. వాపస్‌ వెళ్లాలి కనుక తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఏ టీచరూ సదా అలాగే కూర్చుని ఉండరు కదా. కొంత సమయము మాత్రమే చదువు జరుగుతుంది. బాబా ముందే అన్ని విషయాలు తెలుపుతున్నారు - ఇది నా రథము కదా. రథానికి ఆయుష్షు ఉంటుంది. నేను సదా అమరుడనని తండ్రి అంటున్నారు. నా పేరే అమరనాథ్‌. నేను పునర్జన్మ తీసుకోను. అందుకే నన్ను అమరనాథుడని అంటారు. మిమ్ములను అర్ధకల్పము వరకు అమరులుగా చేస్తాను. అయినా మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్లాలి. ముఖము అటువైపు, కాళ్లు ఇటువైపు ఉంచాలి. మళ్లీ ఈ వైపు ముఖము ఎందుకు తిప్పాలి? పిల్లలంటారు - బాబా తప్పు అయిపోయింది, ముఖము ఇటువైపు తిరిగి పోయింది అని అంటారు. అనగా ఉల్టాగా అనగా తలక్రిందులుగా అయిపోతారు.

మీరు తండ్రిని మరచి దేహాభిమానులుగా అయినప్పుడు ఉల్టా(వ్యతిరేకము)గా తయారవుతారు. తండ్రి అన్ని విషయాలు తెలుపుతారు. శక్తినివ్వండి, బలమునివ్వండి అని తండ్రిని ఏమీ వేడుకోరాదు. యోగబలము ద్వారా ఈ విధంగా తయారవ్వండి అని తండ్రి దారి తెలుపుతారు. మీరు యోగబలముతో ఎంత ధనవంతులుగా అవుతారంటే 21 జన్మలు ఎప్పుడూ ఎవ్వరినీ అడగవలసిన అవసరముండదు. తండ్రి నుండి మీరు ఇంత అధికంగా తీసుకుంటారు. బాబా లెక్కలేనంత సంపాదన చేయిస్తారని మీరు అర్థం చేసుకుంటారు. ఏది కావాలంటే, అది తీసుకోండి అని అంటారు. ఈ లక్ష్మినారాయణులు అత్యంత ఉన్నతమైనవారు. మీకేం కావాలో అదంతా తీసుకోండి. పూర్తిగా చదవకుంటే ప్రజలలోకి వెళ్లిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి. పోను పోను అనేక మ్యూజియమ్‌లు తయారవుతాయి. మీకు పెద్ద పెద్ద హాళ్లు, కాలేజీలు లభిస్తాయి, అందులో మీరు సేవ చేస్తారు. వివాహాలకు కట్టబడిన పెద్ద పెద్ద హాళ్లు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. మీరు ట్రస్టీ వద్దకు వెళ్లి శివభగవానుడు మిమ్ములను పవిత్రంగా చేస్తానని అంటున్నారని చెప్తే ట్రస్టీ హాలు ఇచ్చేస్తాడు. కామము మహాశత్రువని దాని ద్వారా దు:ఖము పొందారని భగవంతుడు చెప్పారని చెప్పండి. ఇప్పుడు పావనంగా అయ్యి పావన ప్రపంచములోకి వెళ్లాలి. మీకు హాళ్లు లభిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత చాలా ఆలస్యమైపోయింది అని అనేస్తారు. నేను అనవసరంగా తీసుకోను ఎందుకంటే నేను మళ్లీ ఇవ్వవలసి పడ్తుంది అని తండ్రి చెప్తున్నారు. పిల్లల పైసా పైసాతో సరోవరము తయారవుతుంది. మిగిలిన వారందరిదీ మట్టిలో కలిసిపోతుంది. తండ్రి అందరికంటే పెద్ద షరాఫ్‌(నగల వ్యాపారి) కూడా అయ్యారు. అంతేకాక కంసాలి(నగలు తయారు చేయువారు), చాకలి(ధోబి), శిల్పి(కారీగర్‌) కూడా అయ్యారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి వినిపించే సత్యమైన కథను బాగా ధ్యాసపెట్టి వినాలి. ధారణ కూడా చేయాలి. తండ్రిని ఏమీ అడగరాదు. 21 జన్మలకు మీ సంపాదన జమ చేసుకోవాలి.

2. వాపస్‌ ఇంటికి వెళ్లాలి కనుక యోగబలము ద్వారా శరీర ఆకర్షణను సమాప్తము చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. దేహ భావనను వదిలే పురుషార్థము చేయాలి.

వరదానము :-

'' స్వమానమనే సీటు పై సెట్‌ అయ్యి ప్రతి పరిస్థితిని దాటుకునే సదా విజయీ భవ ''

సదా ''నేను విజయీ రత్నాన్ని, మాస్టర్‌ సర్వశక్తివాన్‌ ఆత్మను'' అను స్వమానమనే సీటు పై స్థితమై ఉండండి. ఎటువంటి సీటు ఉంటే అటువంటి లక్షణాలు వస్తాయి. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఒక సెకండులో ఈ సెట్‌ పై సెట్‌ అయిపోండి. సీటు పై ఉన్నవారి ఆజ్ఞలనే పాటిస్తారు, గౌరవిస్తారు. సీటు పై ఉంటే విజయులుగా అవుతారు. సంగమ యుగానికి సదా విజయులుగా అయ్యే యుగమని వరదానముంది. కనుక వరదానులుగా అయ్యి విజయులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

'' సర్వ ఆసక్తుల పై విజయం ప్రాప్తి చేసుకునేవారే శివశక్తి పాండవ సైన్యము ''