27-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్లాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి. సదా ఉన్నతిని గురించే ఆలోచించండి ''
ప్రశ్న :-
చదువులో రోజురోజుకు ముందడుగు వేస్తున్నారా లేక వెనుకకు వెళ్తున్నారా అని తెలుసుకునేందుకు గుర్తు ఏమిటి ?
జవాబు :-
చదువులో ఒకవేళ ముందుకు వెళ్తుంటే తేలికతనము అనుభవమవుతుంది. ఈ శరీరము ఛీ-ఛీ(అశుద్ధము) అయినది, దీనిని వదిలి మనమిప్పుడు ఇంటికి వెళ్లాలని బుద్ధిలో ఉంటుంది. దైవీగుణాలను ధారణ చేస్తూ ఉంటారు. ఒకవేళ వెనుకకు వెళ్తుంటే నడవడికలో ఆసురీ గుణాలు కనిపిస్తాయి. నడుస్తూ, తిరుగుతూ తండ్రి స్మృతి ఉండదు. వారు పుష్పాల సమానమై అందరికీ సుఖమునివ్వలేరు. ఇలాంటి పిల్లలకు మున్ముందు సాక్షాత్కారాలు అవుతాయి(తాము చేసిన చెడు కర్మల). చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది.
ఓంశాంతి.
మనము సతోప్రధానంగా వచ్చామనే ఆలోచన బుద్ధిలో ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారందరిలో కొందరు దేహాభిమానములో, కొందరు ఆత్మాభిమానములో ఉంటారని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కొందరు క్షణములో దేహాభిమానులుగా, మరు క్షణములో ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. పూర్తి సమయము ఆత్మాభిమానులుగా ఉన్నామని ఎవ్వరూ చెప్పలేరు. అలా ఉండరు. కాసేపు ఆత్మాభిమానములో, కాసేపు దేహాభిమానములో ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తామని పిల్లలకిప్పుడు తెలుసు. చాలా సంతోషంగా వెళ్లాలి. తండ్రి మార్గమును చూపించారు కనుక మనము శాంతిధామానికి వెళ్లాలనే చింతన రోజంతా చేస్తూ ఉంటారు ఇతరులెప్పుడూ ఇలా ఆలోచిస్తూ కూర్చోరు. ఈ శిక్షణ ఎవ్వరికీ లభించనే లభించదు. ఆలోచన కూడా ఉండదు. ఇది దు:ఖధామమని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఇప్పుడు సుఖధామములోకి వెళ్లే మార్గమును తెలిపించారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత సంపూర్ణంగా అయ్యి యథాయోగ్యంగా శాంతిధామములోకి వెళ్తారు. దానినే ముక్తి అని అంటారు. ఈ ముక్తి కొరకే మానవులు గురువుల వద్దకు వెళ్తారు. కానీ మానవులకు ముక్తి-జీవన్ముక్తి అంటే ఏమిటో ఏ మాత్రము తెలియదు. ఎందుకంటే ఇది కొత్త విషయము. మనము ఇప్పుడు ఇంటికి వెళ్లాలని పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మీరు మొట్టమొదట వచ్చినప్పుడు శ్రేష్ఠచార ప్రపంచములో సతోప్రధానంగా ఉండేవారు. ఆత్మ సతోప్రధానంగా ఉండేది. ఇతరులతో సంబంధము కూడా తర్వాత ఏర్పడ్తుంది. గర్భములోకి వెళ్లినప్పుడు సంబంధములోకి వస్తారు. ఇది చివరి జన్మ అని మీకు తెలుసు. మనము వాపస్ ఇంటికి వెళ్లాలి. పవిత్రమవ్వకుండా వెళ్లలేము. ఈ విధంగా లోలోపల మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము సతోప్రధానంగా వచ్చాము, ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్లాలి. కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ ఇవే ఆలోచనలు చేస్తూ ఉండాలని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి ఎందుకంటే తండ్రియే పతితపావనుడు. మీరు పావనంగా ఎలా తయారవ్వగలరో తండ్రి యుక్తి తెలుపుతున్నారు. మొత్తము సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తండ్రికి మాత్రమే తెలుసు. ఈ రహస్యము తెలిసిన అథారిటి గలవారు ఇంకెవ్వరూ లేరు. తండ్రియే మానవ సృష్టికి బీజరూపుడు. భక్తి ఎంతవరకు జరుగుతుందో కూడా తండ్రి అర్థం చేయించారు. ఇంత సమయము జ్ఞానమార్గము, ఇంత సమయము భక్తిమార్గమని తెలిపించారు. ఈ మొత్తం జ్ఞానమంతా లోపల మెదులుతూ ఉండాలి. ఎలాగైతే తండ్రి ఆత్మలో జ్ఞానముందో అలా మీ ఆత్మలో కూడా జ్ఞానముంది. శరీరము ద్వారా వింటూ, వినిపిస్తూ ఉంటారు. శరీరము లేకుండా ఆత్మ మాట్లాడలేదు. ఇందులో ప్రేరణ లేక ఆకాశవాణి అనే మాట లేదు. భగవానువాచ అని ఉంది. కనుక తప్పకుండా నోరు కావాలి, రథము కావాలి. గాడిద-గుఱ్ఱాల రథాలు అవసరము లేదు. కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలు నడవాలని మీరు కూడా ఇంతకుముందు భావించేవారు. అజ్ఞాన నిద్రలో నిదురిస్తూ ఉండేవారు. ఇప్పుడు బాబా మేల్కొల్పారు. మీరు కూడా అజ్ఞానములో ఉండేవారు. ఇప్పుడు జ్ఞానము లభించింది. భక్తిని అజ్ఞానమని అంటారు.
మనమెలా ఉన్నతమవ్వాలి, ఉన్నత పదవి ఎలా పొందాలి అని పిల్లలైన మీరిప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లి మళ్లీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవి పొందాలి. ఇందుకొరకు స్మృతియాత్ర ఉంది. స్వయాన్ని తప్పకుండా ఆత్మగా భావించాలి. ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ. ఇది చాలా సరళమైన విషయం. కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా మనుష్యులు అర్థము చేసుకోరు. ఇది రావణ రాజ్యము కాబట్టి మీ బుద్ధి భ్రష్ఠాచారమైపోయిందని మీరు అర్థం చేయించవచ్చు. సన్యాసుల వలె వికారాలలోకి వెళ్లనివారు పావనులని మానవులు భావిస్తారు. వారు అల్పకాలానికి పావనంగా అవుతారని తండ్రి చెప్తారు. అయినా ప్రపంచము పతితంగానే ఉంది కదా. సత్యయుగమే పావన ప్రపంచము. సత్యయుగము వంటి పావనులు పతిత ప్రపంచములో ఎవ్వరూ ఉండరు. అక్కడ రావణ రాజ్యమే లేదు. వికారాలనే మాటే లేదు. నడుస్తూ, తిరుగుతూ చక్రము తిప్పుతూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి. బాబాలో ఈ జ్ఞానముంది కదా. జ్ఞానసాగరులైతే జ్ఞానము తప్పకుండా మెదులుతూ ఉంటుంది. మీరు కూడా జ్ఞానసాగరుని ద్వారా వెలువడిన నదులు. వారకు ఎప్పటికీ సాగరులుగానే ఉంటారు. మీరలా సదా సాగరులుగా ఉండరు. మనమంతా సోదరులమని పిల్లలైన మీరు భావిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. వాస్తవానికి నదులు మొదలైన మాటే లేదు. నదులంటే గంగ, యమున మొదలైనవని భావిస్తారు. మీరిప్పుడు బేహద్లో నిల్చొని ఉన్నారు. ఆత్మలమైన మనమంతా ఒకే తండ్రి పిల్లలైన సోదరులము. మనమిప్పుడు వాపస్ ఇంటికి వెళ్లాలి. అక్కడి నుండే వచ్చి శరీర రూపీ సింహాసనము పై విరాజమానమౌతారు. ఆత్మ చాలా చిన్నది. ఆత్మ సాక్షాత్కారమైతే అర్థము చేసుకోలేరు. ఆత్మ వెళ్లిపోతే తల నుండి వెళ్లిందని, కళ్ల నుండి, నోటి నుండి వెళ్లిపోయిందని........ అంటారు. నోరు తెరుచుకుంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లిపోతే శరీరము జడమైపోతుంది. ఇది జ్ఞానము. విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదువే ఉంటుంది. మీలో కూడా మొత్తం రోజంతా చదువుకు సంబంధించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి. మంచి మంచి విద్యార్థుల చేతిలో సదా ఏదో ఒక పుస్తకముంటుంది. చదువుతూ ఉంటారు.
తండ్రి చెప్తున్నారు - ఇది మీ అంతిమ జన్మ. చక్రమంతా తిరిగి చివరికి వచ్చారు. కనుక బుద్ధిలో సదా ఈ స్మృతే ఉండాలి. ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించాలి. కొందరికైతే ధారణ అవ్వనే అవ్వదు. పాఠశాలలో కూడా విద్యార్థులు నంబరువారీగా ఉంటారు. సబ్జక్టులు కూడా చాలా ఉంటాయి. ఇక్కడైతే ఒకే సబ్జక్టు. దేవతలుగా అవ్వాలి. చదువుకు సంబంధించిన ఈ విషయాల గురించే చింతన నడుస్తూ ఉండాలి. చదువును మర్చిపోయి మిగతా ఇతర ఆలోచనలు నడస్తూ ఉండరాదు. వ్యాపారస్థులు తమ వ్యాపారము గురించేే ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులు చదువులోనే మునిగి ఉంటారు. పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే ఉండాలి.
''అంతర్జాతీయ యోగ సమ్మేళనము'' గురించి నిన్న ఒక ఆహ్వాన పత్రము వచ్చింది. వారికి మీరు ఏ విధంగా వ్రాయాలంటే - ''మీది హఠయోగము, దాని లక్ష్యము ఏమిటి? దాని వలన లాభమేమిటి? మేము రాజయోగము నేర్చుకుంటున్నాము. రచయిత, జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ మాకు స్వయాన్ని గురించి, వారి రచన గురించిన జ్ఞానమును వినిపిస్తున్నారు. మేమిప్పుడు వాపస్ ఇంటికి వెళ్లాలి. 'మన్మనాభవ' అనేదే మా మంత్రము. మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా లభించిన వారసత్వమును స్మృతి చేస్తాము. మీరు హఠయోగము మొదలైనవి చేస్తూ ఉన్నారు, దీని లక్ష్యమేమి? మేము నేర్చుకుంటున్న దాని గురించి మీకు చెప్పాము. మీరు చేసే హఠయోగము ద్వారా ఏం లభిస్తుంది? ఈ విధంగా సంక్షిప్తంగా జవాబు వ్రాయాలి. ఇలాంటి ఆహ్వానాలు మీ దగ్గరకు చాలానే వస్తాయి. అఖిల భారత ధార్మిక మహాసమ్మేళనము వారి నుండి మీ లక్ష్యమేమిటని అడుగుతూ ఆహ్వానము వస్తే, ఇప్పుడు మేమిది నేర్చుకుంటున్నామని, మీ గురించి తప్పకుండా తెలపాలి. రాజయోగమును మీరెందుకు నేర్చుకుంటున్నారని ఎవరైనా అడిగితే ''మేము చదువుకుంటున్నాము, మమ్ములను చదివించేవారు భగవంతుడు, మనమంతా సోదరులము, మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమౌతాయి'' అని బేహద్ తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి. ఇలాంటి లేఖలను చాలా బాగా వ్రాసి ముద్రించి ఉంచుకోండి. మళ్లీ ఎక్కడెక్కడ సమావేశాలు జరుగుతాయో అక్కడికి అవి పంపండి. మీరు చాలా మంచి ఆచారాలను(నియమాలను) నేర్చుకుంటున్నారని అంటారు. ఈ రాజయోగము ద్వారా రాజాధి రాజులుగా, విశ్వానికి అధిపతులుగా అవుతారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనము దేవతలుగా అవుతాము. మళ్లీ మనుష్యులుగా అవుతాము. ఇలా విచార సాగర మథనము చేసి ఫస్ట్క్లాస్ లేఖలను తయారుచేయాలి. మీ ఉద్ధేశ్యమేమిటని అడుగుతారు. మా లక్ష్యము ఇది అని ముద్రించి ఉంచుకోండి. ఇలా వ్రాయుట ద్వారా ఆకర్షణ(టెంప్టేషన్) ఉంటుంది. ఇందులో ఎలాంటి హఠయోగము లేక శాస్త్రవాదము చేయవలసిన విషయము లేదు. వారికి శాస్త్రాలు మొదలైన వాటి గురించి ఎంతో అహంకారముంటుంది. వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. వాస్తవానికైతే వారు పూజారులు. పూజ్యులను అధికారులని(అథారిటి) అంటారు. పూజారులను ఏమంటారు? కనుక మనము ఏం నేర్చుకుంటున్నామనేది స్పష్టంగా వ్రాయాలి. బ్రహ్మకుమారీల పేరైతే ప్రసిద్ధమైపోయింది.
యోగము రెండు రకాలు. ఒకటి-హఠయోగము, రెండవది-సహజయోగము. దీనిని ఏ మనుష్యమాత్రులు నేర్పించలేరు. రాజయోగమును ఒక్క పరమాత్మ మాత్రమే నేర్పిస్తారు. మిగిలిన అన్ని రకాల యోగాలు మానవ మతమనుసారంగా ఉన్నాయి. అక్కడ దేవతలకైతే ఏ మతమూ అవసరము లేదు. ఎందుకంటే వారికి వారసత్వము లభించే ఉంది. వారు దేవతలు అనగా దైవీగుణాలు కలిగినవారు. ఇలాంటి గుణాలు లేని వారిని అసురులు అని అంటారు. దేవతల రాజ్యముండేది, అది ఎక్కడికి వెళ్లింది? 84 జన్మలు ఎలా తీసుకున్నారు? ఈ విషయాలు మెట్ల చిత్రము చూపించి అర్థము చేయించాలి. మెట్ల చిత్రము చాలా బాగుంది. మీ మనస్సులో ఉండేది ఈ చిత్రములో ఉంది. ఆధారమంతా చదువు పైననే ఉంది. సంపాదనకు ఆధారము చదువు. ఇది అన్నిటికంటే ఉన్నతమైన(ది బెస్ట్) చదువు. బెస్ట్ చదువు ఏదో ప్రపంచానికి తెలియదు. ఈ చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా, డబల్ కిరీటధారులుగా అవుతారు. మీరిప్పుడు డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఒకే చదువు ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అవుతారు. ఆశ్చర్యం. ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది. రాజులుగానూ అవుతారు, సామాన్యులు గానూ అవుతారు. పోతే అక్కడ దు:ఖమను మాటే ఉండదు. కానీ పదవులు ఉంటాయి కదా. ఇక్కడ అనేక రకాల దు:ఖాలున్నాయి. కరువు-కాటకాలు, జబ్బులు వస్తాయి. ధాన్యము మొదలైనవి లభించవు. వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి. భలే లక్షాధికారులు, కోటీశ్వరులు కావచ్చు కానీ వికారాలతోనే జన్మ ఉంటుంది కదా. దెబ్బలు తగలడం, దోమలు కుట్టడం ఇవన్నీ దు:ఖమే కదా. పేరే భయంకరమైన (రౌరవ) నరకము. అయినా ఫలానావారు స్వర్గానికి వెళ్లారని చెప్తారు. అరే! ఇప్పుడు స్వర్గము రానున్నది. కనుక స్వర్గానికి ఎలా వెళ్లారు? ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు బాబా ఇలాంటి వ్యాస రచన ఇచ్చారు. వ్రాయడం పిల్లల పని. ధారణ చేస్తే తప్పకుండా వ్రాస్తారు. ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు వాపస్ వెళ్లాలని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మనము సతోప్రధానంగా ఉన్నప్పుడు అపారమైన సంతోషముండేది. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యాము. ఇది ఎంత సహజమైనది! బాబా చాలా పాయింట్లు చెప్తూ ఉంటారు కనుక కూర్చుని ఇతరులకు బాగా అర్థం చేయించాలి. ఒప్పుకోకపోతే మన కులస్థులు కారని అర్థం చేసుకోవాలి. చదువులో రోజురోజుకు ముందుకు వెళ్లాలి. వెనుకకు వెళ్లరాదు. దైవీగుణాల బదులు ఆసురీ గుణాలు ధారణ చేస్తే వెనుకకు వెళ్లినట్లే కదా. వికారాలను వదులుతూ ఉండండి. దైవీగుణాలను ధారణ చెయ్యండి. చాలా తేలికగా ఉండాలి. ఇది ఛీ-ఛీ శరీరము. దీనిని వదిలేయాలి. ఇప్పుడు మనం ఇక ఇంటికి వెళ్లాలని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వలేరు. చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మున్ముందు మీకు సాక్షాత్కారమౌతాయి. మీరు ఏ సేవ చేశారని మిమ్ములను అడుగుతారు. మీరెప్పుడూ కోర్టుకు వెళ్లలేదు. బాబా అయితే అన్నీ చూశారు. దొంగలను ఎలా పట్టుకుంటారో, కేసు ఎలా పెడ్తారో అన్నీ చూశారు. అలాగే అక్కడ కూడా అన్నీ సాక్షాత్కారము చేయిస్తూ ఉంటారు. శిక్షలు అనుభవించి మళ్లీ పైసా(అతి తక్కువ) పదవిని పొందుతారు. వీరు పాస్ అవ్వరని టీచరుకు దయ కలుగుతుంది. తండ్రిని స్మృతి చేసే సబ్జక్టు అన్నిటికంటే మంచిది. దీని ద్వారా పాపాలు తొలగుతూ ఉంటాయి. బాబా మనలను చదివిస్తున్నారు. ఇదే స్మరణ చేస్తూ చక్రము తిప్పుతూ ఉండాలి. విద్యార్థులు టీచరును స్మృతి కూడా చేస్తారు, వారి బుద్ధిలో చదువు కూడా ఉంటుంది. టీచరుతో యోగమైతే తప్పకుండా ఉంటుంది కదా. మన సోదరులందరి టీచరు ఒక్కరేనని, వారు సుప్రీమ్ టీచరని బుద్ధిలో ఉండాలి. పోను పోను చాలామందికి తెలుస్తుంది. అహో ప్రభు! మీ లీలలు అపారము,.................... అని మహిమ చేస్తూ మరణిస్తారు. అయితే ఏమీ పొందలేరు. దేహాభిమానములో వచ్చినందున ఉల్టా పనులు చేస్తారు. ఆత్మాభిమానులుగా ఉంటే మంచి పనులు చేస్తారు. ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి అని తండ్రి చెప్తున్నారు. వాపస్ తప్పకుండా వెళ్లవలసి వస్తుంది. లెక్కాచారము చుక్తా చేసుకొని అందరూ వెళ్లాల్సిందే. ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా వెళ్లాలి. ప్రపంచమంతా చాలా భాగము ఖాళీ అయ్యే రోజు కూడా వస్తుంది. కేవలం భారతదేశము మాత్రమే ఉంటుంది. అర్ధకల్పం కేవలం భారతదేశమే ఉంటుంది అంటే ప్రపంచము ఎంత ఖాళీగా ఉంటుంది! మీకు తప్ప ఇలాంటి ఆలోచనలు ఎవరి బుద్ధిలోనూ ఉండవు. మీకు శత్రువులు కూడా ఎవ్వరూ ఉండరు. శత్రువులు ఎందుకు వస్తారు? ధనము కొరకు. భారతదేశములోకి ఇంతమంది ముసల్మానులు, ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు? ధనము చూసి వచ్చారు. ధనము చాలా ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఎవ్వరూ లేరు. ధనము తీసుకొని ఖాళీ చేసి వెళ్లిపోయారు. డ్రామా ప్లాను అనుసారంగా ధనమును మీకు మీరే సమాప్తము చేసుకున్నారని బాబా చెప్తున్నారు. మానవులకు ఇది తెలియదు. బేహద్ తండ్రి వద్దకు వచ్చామని మీకు నిశ్చయముంది. ఇది ఈశ్వరీయ పరివారము అనే ఆలోచన కూడా ఎప్పుడూ ఎవ్వరికీ ఉండదు. అచ్ఛా
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో చదువును గురించి చింతన చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా బుద్ధిలో సదా జ్ఞానము మెదులుతూ ఉండాలి. ఇది అత్యుత్తమమైన(ది బెస్ట్) చదువు. దీనిని చదువుకొని డబల్ కిరీటధారులుగా అవ్వాలి.
2. మనము ఆత్మలము సోదరులమని(భాయీ-భాయీ) అభ్యాసము చెయ్యాలి. దేహాభిమానములోకి రావడం వలన ఉల్టా పనులు జరుగుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆత్మాభిమానులుగా ఉండాలి.
వరదానము :-
'' సంబంధ - సంపర్కములోకి వస్తూ డైమండ్గా అయ్యి డైమండ్ను చూచే మచ్చలేని డైమండ్ భవ ''
డైమండ్గా అయ్యి డైమండ్ను చూడమని బాప్దాదా శ్రీమతము. ఎవరైనా ఆత్మ నల్లని బొగ్గు వలె, పూర్తి తమోగుణము గలవారిగా ఉన్నా, మీ దృష్టి పడ్తూనే వారి నలుపుతనము తగ్గిపోవాలి. అమృతవేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంబంధ-సంపర్కములోకి వచ్చినా కేవలం డైమండ్గా అయ్యి డైమండ్నే చూస్తూ ఉండండి. ఎలాంటి విఘ్నము లేక స్వభావానికి వశమై డైమండ్ పై మచ్చ ఏర్పడరాదు. అనేక ప్రకారాలైన పరిస్థితుల ద్వారా ఎన్ని విఘ్నాలు వచ్చినా, వాటి ప్రభావము పడనంత శక్తిశాలురుగా(పవర్ఫుల్గా) అవ్వండి.
స్లోగన్ :-
'' మనసు మరియు బుద్ధిని మన్మతము నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు. ''