05-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు డబుల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలనుకుంటే బాగా సర్వీసు చేయండి, ప్రజలను తయారు చేయండి. సంగమ యుగములో మీరు సర్వీసే చేయాలి, ఇందులోనే కళ్యాణముంది ''
ప్రశ్న :-
పాత ప్రపంచ వినాశనానికి ముందు ప్రతి ఒక్కరూ ఏ విధమైన అలంకారము చేసుకోవాలి?
జవాబు :-
పిల్లలైన మీరు యోగబలము ద్వారా స్వయాన్ని అలంకరించుకోండి. ఈ యోగబలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరిప్పుడు వానప్రస్థములోకి వెళ్ళాలి, అందువలన ఈ శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది దమ్మిడికి కూడా పనికి రాని శరీరము (వర్త్ నాట్ ఏ పెన్నీ). దీని పై మమత్వాన్ని తొలగించి వేయండి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరించండి. గుడ్డివారికి ఊతకర్రగా అవ్వండి.
ఓంశాంతి.
తండ్రి పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలిపేందుకు వచ్చారని పిల్లలకు బాగా అర్థమయ్యింది. మమ్ములను పతితుల నుండి పావనంగా తయారు చేయమనే విషయము గురించే తండ్రిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పావన ప్రపంచము గతించిపోయింది. ఇప్పుడిది పతిత ప్రపంచము. పావన ప్రపంచము గడచిపోయి ఎంత సమయమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. తండ్రి మళ్లీ ఈ తనువులో వచ్చారన్న విషయము పిల్లలైన మీకు తెలుసు. పావనంగా ఎలా అవ్వాలో మార్గాన్ని మాకు వచ్చి చెప్పండి బాబా! అని మీరే నన్ను పిలిచారు. మనము పావన ప్రపంచములో ఉండేవారమని ఇప్పుడు పతిత ప్రపంచములో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచము పరివర్తన అవుతూ ఉంది. కొత్త ప్రపంచ ఆయుష్షు ఎంతో, పాత ప్రపంచ ఆయుష్షు ఎంతో ఎవ్వరికీ తెలియదు. పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇంత ఉంటుందని అంటారు. కచ్ఛా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇంతే ఉంటుందని అంటారు. ఎన్ని సంవత్సరాలుండేదీ అర్థం చేసుకోగలరు. అయితే మొత్తం ప్రపంచపు ఆయుష్షు ఎంత ఉంటుందో మనుష్యులకు తెలియదు. అందువలన తప్పకుండా తండ్రియే వచ్చి తెలుపవలసి వచ్చింది. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచము సమాప్తమవ్వనున్నది, కొత్త ప్రపంచము స్థాపన అవుతూ ఉంది. కొత్త ప్రపంచములో చాలా కొద్దిమంది మాత్రమే మనుష్యులుండేవారు. కొత్త ప్రపంచము సత్యయుగము. దీనిని సుఖధామమని అంటారు. ఇది దు:ఖధామము. ఇది తప్పకుండా అంతమవుతుంది. మళ్లీ సుఖధామ చరిత్ర పునరావృతమవుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, అంతేకాక ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలపండి అని తండ్రి ఆదేశిస్తున్నారు. లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు, పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. కూర్మావతారము, మత్సావతారము లేక 84 లక్షల యోనులలోకి తీసుకెళ్లారు. ప్రపంచములో ఎవ్వరికీ తండ్రిని గురించి తెలియదు. తండ్రిని గుర్తించినప్పుడే అర్థము చేసుకుంటారు. ఒకవేళ రాయి-రప్పలలో ఉన్నట్లైతే వారసత్వమనే మాటే ఉండదు. దేవతలను కూడా పూజిస్తారు కానీ ఎవరి కర్తవ్యము గురించి కూడా తెలియదు. ఈ విషయములో పూర్తిగా అపరిచితులుగా, అవగాహన రహితులుగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ముఖ్య విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. అమాయక మానవులకు తండ్రిని గురించీ తెలియదు, రచనను గురించీ తెలియదు. ప్రారంభము నుండి ఈ రచన ఎలా రచించారో తెలియదు. పూజిస్తున్న దేవతల గురించి గానీ, వారి రాజ్యము ఎప్పుడు ఉండేదని గానీ కొద్దిగా కూడా తెలియదు. లక్షల సంవత్సరాలు సూర్యవంశీ రాజ్యపాలన జరిగిందని, తర్వాత లక్షల సంవత్సరాలు చంద్రవంశీయుల రాజ్యము నడిచిందని అంటారు. దీనినే అజ్ఞానమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి - మీరు మళ్లీ దానిని రిపీట్(పునరావృతము) చేస్తారని అర్థము చేయిస్తున్నారు. ''ఇలా అర్థం చేయించండి, సందేశమునివ్వండి అని తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా! లేకపోతే రాజధాని ఎలా స్థాపనవుతుంది? ఇక్కడ కూర్చుండిపోతే జరగదు. ఇంట్లో కూర్చునేవారు కూడా కావాలి. వారైతే డ్రామానుసారము కూర్చుని ఉన్నారు. యజ్ఞమును సంభాళన చేసేవారు కూడా కావాలి. మిలనము చేసేందుకు ఎంతోమంది పిల్లలు తండ్రి వద్దకు వస్తారు ఎందుకంటే శివబాబా ద్వారానే వారసత్వము తీసుకోవాలి. లౌకిక తండ్రికి కుమారుడు జన్మిస్తే తాను తండ్రి నుండి వారసత్వమును తీసుకోవాలని అర్థం చేసుకుంటాడు. కుమార్తె అయితే వెళ్ళి ఒకరికి అర్థాంగిగా అవుతుంది. సత్యయుగములో ఆస్తి తగాదాలు, కొట్లాటలు మొదలైనవేవీ జరగవు. ఇక్కడైతే కామ వికారము గురించి గొడవలు జరుగుతాయి. అక్కడ ఈ 5 భూతాలు(వికారాలు) ఉండవు. దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఒకప్పుడు స్వర్గముండేదని, అది గడచిపోయిందని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకిప్పుడే వస్తాయి. ఈ చక్రము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పునరావృతమౌతుందని మీకు తెలుసు. సూర్యవంశము - చంద్రవంశ పరివారము 2500 సంవత్సరాలు జరిగిందని శాస్త్రాలలో ఎవ్వరూ వ్రాయలేదు. బడౌదా(బరోడా) రాజభవనములో రామాయణము వింటున్నారని వార్తాపత్రికలలో వచ్చింది. ఏ ఆపదలు వచ్చినా భగవంతుని రాజీ చేసుకునేందుకు మానవులు భక్తిలో మునిగిపోతారు. ఈ విధంగా భగవంతుడు రాజీ అవ్వరు కానీ ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. భక్తి ద్వారా భగవంతుడు ఎప్పటికీ రాజీ అవ్వరు. అర్ధకల్పము భక్తి జరుగుతుందని భక్తులే దు:ఖాలు పొందుతూ ఉంటారని పిల్లలకు తెలుసు. భక్తి చేస్తూ చేస్తూ మొత్తం ధనమునంతా పోగొట్టుకుంటారు. సర్వీసులో ఉన్న ఏ కొద్దిమంది పిల్లలే ఈ విషయాలను అర్థము చేసుకుంటారు. వారు సమాచారము కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ పరివారమని అర్థం చేయించబడ్తుంది. ఈశ్వరుడు దాతగా ఉన్నారు. వారు తీసుకునేవారు కాదు. వారికైతే ఎవ్వరూ ఇవ్వరు. ఇంకా వ్యర్థంగా పాడు చేస్తూ ఉంటారు.
మీకు ఎంత ధనమునిచ్చాను! మిమ్ములను స్వర్గాధికారులుగా చేశాను, మరి అదంతా ఏమయ్యింది? నిరుపేదలుగా ఎలా అయ్యారు? అని తండ్రి పిల్లలైన మిమ్ములను అడుగుతున్నారు. మళ్లీ నేనిప్పుడు వచ్చాను. మీరెంతటి పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతున్నారు. మానవులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు ఈ పాత ప్రపంచములో ఇక్కడ ఉండేది లేదని మీకు తెలుసు. ఇది సమాప్తమవ్వనున్నది. మానవుల వద్ద ఉన్న ధనమంతా ఎవరి చేతికీ దక్కదు. వినాశనమైనప్పుడు అంతా సమాప్తమైపోతుంది. మైళ్ళ పొడవునా ఎంత పెద్ద పెద్ద భవనాలను నిర్మించి ఉన్నారు! లెక్కలేనన్ని ఆస్తులన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే మన రాజ్యమున్నప్పుడు మరెవ్వరూ ఉండరు అని మీకు తెలుసు. అక్కడ లెక్కలేనంత ధనముండేది. మున్ముందు ఏమేమి జరుగుతుందో మీరే చూస్తారు. వారి వద్ద ఎంత బంగారము, ఎంత వెండి, నోట్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయో అదంతా బడ్జెట్(ఆదాయ వ్యయ పట్టికల)లో వెలువడ్తుంది. ఇంత ఆదాయముంటే ఇంత ఖర్చు ఉందని ప్రకటిస్తారు. తుపాకి మందు కొరకు ఎంతో ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఇంత ఖర్చు చేశారు అని బడ్జెట్ చూపిస్తారు. దీని ద్వారా ఆదాయమేమీ లేదు. ఇది నిలువ ఉంచుకునే వస్తువులు కావు. బంగారము మరియు వెండిని నిల్వ దాచుకోవచ్చు. బంగారు ప్రపంచమున్నప్పుడు బంగారు నాణెములుంటాయి. వెండియుగ కాలములో వెండి ఉండేది, అక్కడ అపారమైన ధనముండేది. తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చూడండి. ఏమున్నాయి! కాగితపు నోట్లు. విదేశాలలో కూడా కాగితము నోట్లే ఉన్నాయి. కాగితము పనికొచ్చే వస్తువేమీ కాదు. మరి ఇంకేం ఉంటాయి? ఈ పెద్ద పెద్ద భవనాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. అందువలన తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా ! కళ్ళతో ఏమేమి చూస్తున్నారో అవేవీ లేవని భావించండి. ఇవన్నీ సమాప్తమైపోనున్నాయి. శరీరము పాతదైపోయి పైసాకు కూడా పనికి రాకుండా పోయింది. ఎవరు ఎంత సుందరంగా ఉన్నా అది కూడా విలువ లేనిదే. ఈ ప్రపంచము ఇక కొద్ది సమయము మాత్రమే ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఉన్నట్లుండి మానవులేమౌతారు? గుండెపోటు వస్తుంది. మనిషి గురించి ఏ నమ్మము లేదు. సత్యయుగములో ఇలా జరగదు. అక్కడైతే శరీరము యోగబలముతో కల్పతరువు సమానంగా కల్పకాయముగా ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు తండ్రి లభించారు. ఈ ప్రపంచములో మీరుండేది లేదని చెప్తున్నారు. ఇది ఛీ - ఛీ అసహ్యమైన ప్రపంచము. ఇప్పుడు యోగబలము ద్వారా తాము అలంకరించుకోవాలి. అక్కడైతే పిల్లలు కూడా యోగబలము ద్వారా జన్మిస్తారు. వికారాల మాటయే అక్కడ ఉండదు. యోగబలము ద్వారా మీరు మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారు చేస్తున్నప్పుడు మిగిలినవి ఏమంత పెద్ద విషయాలు? మన వంశానికి చెందినవారే ఈ విషయాలను అర్థము చేసుకుంటారు. మిగిలిన వారందరు శాంతిధామములోకి వెళ్ళాలి. అది మన ఇల్లు. కానీ మానవులు దానిని ఇంటిగా కూడా భావించరు. వారు ఒక ఆత్మ వెళ్ళిన తర్వాత మరొక ఆత్మ వస్తూ ఉంటుందని భావిస్తారు. సృష్టి వృద్ధి అవుతూ ఉంటుందని అంటారు. రచయిత - రచనల గురించి అయితే మీకు తెలుసు. అందువలన ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. ఈ జ్ఞానము అర్థం చేసుకొని వీరు బాబా విద్యార్థులుగా అవ్వాలి, అంతా తెలుసుకోవాలి, ఖుషీగా ఉండాలని భావిస్తారు. మనమిప్పుడు అమరలోకములోకి వెళ్తాము. అర్ధకల్పము నుండి అసత్య కథలు విన్నాము. అమరలోకానికి మనము వెళ్తామని ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. ఈ మృత్యులోకము ఇప్పుడు అంతము అవ్వనున్నది. మనమిక్కడి నుండే ఖుషీ ఖజానాను నింపుకొని వెళ్తాము. కావున ఈ సంపాదనలో, జోలెను నింపుకోవడంలో బాగా లగ్నమై ఉండాలి. సమయము వృథా చేయరాదు. ఇప్పుడు మనము ఇతరులకు సర్వీసు చేయాలి, జోలెను నింపుకోవాలి, అంతే. దయాహృదయులుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు. గ్రుడ్డివారికి చేతి ఊతకర్రగా అవ్వండి. స్వర్గమెక్కడ ఉంది? నరకమెక్కడ ఉంది? అని సన్యాసులు, విద్వాంసులు మొదలైనవారెవ్వరూ ఈ ప్రశ్నను అడగలేరు. వారికి స్వర్గము, నరకము ఎక్కడుంటాయో తెలియదు. ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా, విమానాలకు ఛీఫ్ (ఆదేశములనిచ్చు అధికారి) అయినా కానీ యుద్ధములో ఛీఫ్కమాండర్ అయినా కానీ స్టీమర్కు కమాండర్ఛీఫ్ అయినా, మీ ఎదుట వారెంత? ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని మీకు తెలుసు. స్వర్గము గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుత సమయములో అన్ని వైపులా అల్లకల్లోల్లాలు, కొట్లాటలు జరుగుతున్నాయి. మళ్లీ వారికి విమానాలు లేక సైన్యము అవసరముండదు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. కొంతమంది మనుష్యులు మాత్రమే మిగిలి ఉంటారు. ఈ దీపాలు (లైట్లు) విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి. కానీ ప్రపంచము ఎంతో చిన్నదిగా ఉంటుంది, భారతదేశము మాత్రమే ఉంటుంది. ఉదాహరణానికి నమూనాను(మాడల్) చిన్న సైజులో తయారు చేస్తారు కదా. చివరికి మృత్యువు ఎలా వస్తుందో ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మృత్యువు ఎదుటే నిలబడి ఉందని మీకు తెలుసు. మేము కూర్చొని ఇక్కడ నుండే బాంబులు వదులతామని వారు అంటారు. బాంబులు ఎక్కడెక్కడ పడతాయో అక్కడంతా సమాప్తమైపోతుంది. సైన్యము మొదలైనవాటి అవసరము లేదు. ఒక్కొక్క విమానము కొరకు కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందరి దగ్గర ఎంత బంగారముంటుంది! టన్నుల కొద్దీ ఉంటుంది. అదంతా సముద్రములోకి వెళ్లిపోతుంది.
ఈ మొత్తం రావణ రాజ్యమంతా ద్వీపము వంటిది. లెక్కలేనంతమంది మానవులున్నారు. మీరందరూ మీ రాజ్యమును స్థాపన చేస్తున్నారు. కనుక సర్వీసులో బిజీగా ఉండాలి. వరదలెక్కడైనా వచ్చినప్పుడు, అందరికీ ఆహారాన్ని చేర్చే సేవలో ఎంత బిజీగా అవుతారో చూడండి. నీరు వస్తే ముందే పరిగెత్తడం ప్రారంభిస్తారు. కావున అంతా ఎలా సమాప్తమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సాగరముంది, వినాశనమైనప్పుడు అంతా జలమయమైపోతుంది. ఎక్కడ చూసినా నీరే నీరు ఉంటుంది. మన రాజ్యమున్నప్పుడు ఈ బొంబాయి - కరాచీ మొదలైనవి ఉండేవి కావని బుద్ధిలో ఉంటుంది. భారతదేశము ఎంతో చిన్నదిగా ఉంటుంది. అది కూడా మంచినీటి తీరాలలో ఉంటుంది. అక్కడ బావులు మొదలైనవాటి అవసరము ఉండదు. చాలా శుద్ధమైన మంచినీరు తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద ఆటలు - పాటలు చేస్తారు. మురికి విషయమే ఉండదు. దాని పేరే స్వర్గము, అమరలోకము. పేరు వినగానే త్వరత్వరగా తండ్రి ద్వారా పూర్తిగా చదువుకొని వారసత్వాన్ని తీసుకోవాలని మనసవుతుంది. చదువుకుని మళ్లీ ఇతరులను చదివించాలి. అందరికీ సందేశమునివ్వాలి. కల్పక్రితము ఎవరెవరు వారసత్వము తీసుకున్నారో వారు తీసుకుంటారు. పురుషార్థము చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమాయకులు. తండ్రిని గురించి తెలియదు. పవిత్రులుగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. ఎవరికైతే అరచేతిలో స్వర్గము లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకు ఉండరు? మాకు విశ్వరాజ్యము లభిస్తూ ఉంటే, ఒక్క జన్మకు పవిత్రంగా ఎందుకు అవ్వము?! అని చెప్పండి. భగవానువాచ - మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతేే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకు అధికారులుగా అవుతారు. కేవలం ఈ ఒక్క జన్మ మాత్రము నా శ్రీమతానుసారము నడవండి. రక్షాబంధనము(రాఖీ) కూడా దీని చిహ్నమే. కావున మేము పవిత్రంగా ఎందుకు ఉండలేము? బేహద్ తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు - తండ్రి భారతదేశానికి స్వర్గ వారసత్వమును ఇచ్చారు, దానిని సుఖధామమని అంటారు. అపారమైన సుఖముండేది. ఇది దు:ఖధామము. పెద్దవారికెవరైనా ఈ విధంగా అర్థం చేయిస్తే మిగిలినవారంతా వింటూ ఉంటారు. యోగ స్థితిలో ఉండి తెలిపితే అందరూ సమయము మొదలైనవి మర్చిపోవాలి. ఎవ్వరూ ఏమీ అనలేరు. 15-20 నిముషాలకు బదులు గంట సేపు కూడా వింటారు. కానీ ఆ శక్తి ఉండాలి. దేహాభిమానములో ఉండరాదు. ఇక్కడైతే సర్వీసు చేస్తూనే ఉండాలి. అప్పుడే కళ్యాణము జరుగుతుంది. రాజుగా అవ్వాలంటే ప్రజలనెక్కడ తయారు చేశారు? తండ్రి అలాగే తల పై కిరీటము పెట్టేస్తారా? ప్రజలేమైనా డబుల్ కిరీటధారులుగా అవుతారా? డబుల్ కిరీటధారులుగా అవ్వడమే మీ లక్ష్యము - ఉద్ధేశ్యము. తండ్రి అయితే పిల్లలకు ఉమంగ-ఉత్సాహాలను ఇప్పిస్తారు. జన్మ-జన్మాంతరాల పాపము తల పై ఉరది. అది యోగబలము ద్వారానే తొలగిపోతుంది. ఈ జన్మలో ఏమేమి చేశారో వాటిని మీరు అర్థము చేసుకోగలరు కదా. పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు యోగము మొదలైనవి నేర్పించబడ్తాయి. పోతే ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే యుక్తిని తండ్రి కూర్చొని తెలియజేస్తారు. పోతే దయ, కృపలు కావాలంటే సాధువుల దగ్గరకు వెళ్ళి వేడుకోండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అమరలోకములోకి వెళ్ళాలంటే సంగమ యుగములో ఖుషీ ఖజానాను నింపుకోవాలి. సమయమును వృథా చేయరాదు. తమ జోలెను నింపుకొని దయా హృదయులై గ్రుడ్డి వారికి చేతికర్రగా అవ్వాలి.
2. అరచేతిలో స్వర్గమును తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునే యుక్తిని రచించి తమ పై తాము కృప చూపించుకోవాలి. యోగబలమును జమ చేసుకోవాలి.
వరదానము :-
''మాటలనే మేఘాలను చూసి గాభరా పడేందుకు బదులు సెకండులో దాటుకునే సిద్ధిస్వరూప భవ ''
చాలామంది పిల్లలు శాస్త్రవాదుల వలె మాటలు చెప్పడంలో చాలా తెలివిగలవారు. ఎటువంటి మాటలంటే అవి వింటూనే తండ్రికి కూడా నవ్వు వస్తుంది. కాని ఇతరులు ప్రభావితులవుతారు. అనేక విధాలైన వ్యర్థ విషయాలు, వ్యర్థ రిజిస్టర్ రోలును తయరు చేస్తూ ఉంటాయి. అందువలన దీని నుండి తీవ్రంగా ఎగిరిపోండి, అమాయకంగా అవ్వండి. తండ్రిని చూడండి, మాటలను చూడకండి. ఈ మాటలే మేఘాలు. వీటిని సెండులో దాటుకునే విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి.
స్లోగన్ :-
''ఏ విషయంలోనైనా ప్రశ్న తలెత్తడం అనగా వ్యర్థ ఖాతా ప్రారంభమవ్వడం.''