04-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - సర్వీసు సమాచారము వినేందుకు, చదివేందుకు కూడా మీకు ఆసక్తి ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉమంగ(ఉల్లాస)-ఉత్సాహాలు పెరుగుతాయి, సర్వీసు చేయాలనే సంకల్పము ఉత్పన్నమవుతుంది."
ప్రశ్న :-
సంగమ యుగములో తండ్రి మీకు సుఖమునివ్వరు కాని సుఖమును పొందే మార్గాన్ని తెలుపుతారు, ఎందుకు ?
జవాబు :-
ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే, అందులో ఒక్కరికే సుఖమునివ్వడం కూడా బాగుండదు. లౌకిక తండ్రి ద్వారా పిల్లలందరికీ సమాన భాగము లభిస్తుంది. బేహద్ తండ్రి భాగాలు పంచరు, సుఖమును పొందే మార్గమును చూపిస్తారు. ఆ మార్గమును ఎవరు అనుసరిస్తారో, పురుషార్థము చేస్తారో, వారికి ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్థము చేయాలి, ఆధారమంతా పురుషార్థము పైనే ఉంది.
ఓంశాంతి.
తండ్రి మురళి మ్రోగిస్తారని(వినిపిస్తారని) పిల్లలకు తెలుసు. మురళి అందరి వద్దకు వెళ్తుంది, మురళి చదువుకొని సర్వీసు చేసేవారి సమాచారము మ్యాగజైన్లో వస్తుంది. ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగజైన్ చదువుతారో, వారికి సేవాకేంద్రాల సర్వీసు సమాచారము తెలుస్తుంది - ఫలానా ఫలానా స్థానములో ఇలా సర్వీసు జరుగుతోందని తెలుస్తుంది. ఎవరైతే చదవనే చదవరో వారికి ఏ సమాచారమూ తెలియదు. వారు పురుషార్థము కూడా చేయరు. సర్వీసు సమాచారము వింటే, నేను కూడా ఇలా సర్వీసు చేయాలని మనసులో కలుగుతుంది. మ్యాగజైన్ ద్వారా మన సోదరీ-సోదరులు ఎంత సర్వీసు చేస్తున్నారో తెలుస్తుంది. ఎంత సేవ చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకోగలరు. సర్వీసు కొరకు మాసపత్రికలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇదేమీ వ్యర్థము కాదు. చదవనివారికి ఇది వ్యర్థమనిపిస్తుంది. మాకు చదవడము రాదని కొందరంటారు. అరే! రామాయణము, భాగవతము, భగవద్గీత వినేందుకు వెళ్తారు కదా, ఇది కూడా వినాలి లేకుంటే సర్వీసు చేయాలనే ఉల్లాసము పెరగదు. ఫలానా స్థానములో ఈ సర్వీసు జరిగిందని తెలిస్తే, ఆసక్తి ఉంటే చదివి వినిపించమని ఎవరితోనైనా అడుగుతారు. చాలా సేవాకేంద్రాలలో మ్యాగజైన్లను చదవని వారుంటారు. చాలా మంది వద్ద సర్వీసు నామమాత్రము కూడా ఉండదు. అలాంటివారు పదవిని కూడా అలాంటిదే పొందుతారు. ఇక్కడైతే రాజధాని స్థాపనవుతూ ఉందని భావిస్తారు. ఇందులో ఎవరెంత శ్రమ చేస్తారో, అంత పదవి పొందుతారు. చదువు పై గమనముంచకపోతే ఫెయిల్ అవుతారు. మొత్తం ఆధారమంతా ఈ సమయములోని చదువు పైనే ఉంది. ఎంత చదువుతూ, చదివిస్తూ ఉంటారో అంత తామే లాభము పొందుతారు. చాలా మంది పిల్లలకు మాసపత్రిక చదవాలని ఆలోచన కూడా రాదు. వారు నయా పైసా (పాయీ పైసా, చిల్లిగవ్వకు పనికిరాని, దమ్మిడీకి విలువలేని) పదవిని పొందుతారు. వీరు పురుషార్థము చేయలేదు కాబట్టి ఈ పదవి లభించింది అన్న ఆలోచన కూడా అక్కడ ఉండదు. కర్మ-వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి.
కల్పములో ఒక్క సంగమ యుగములో మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు. అర్థము చేసుకోని వారు రాతిబుద్ధితో సమానులు. తుచ్ఛబుద్ధిగలవారిగా ఉండేవారమని మీరు కూడా భావిస్తారు. అయితే అందులో కూడా పర్సెంటేజ్ (శాతము) ఉంటుంది. ఇది కలియుగము, ఇందులో అపారమైన దు:ఖముందని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ ఈ ఫలానా దు:ఖాలున్నాయని తెలిపితే, తెలివైనవారు వీరు నిజమే చెప్తున్నారని వెంటనే అర్థము చేసుకుంటారు. నిన్న మనము ఎంత దు:ఖములో ఉండేవారమో కూడా మీకు తెలుసు. అపారమైన దు:ఖాల మధ్యలో ఉండేవారము, ఇప్పుడు మళ్లీ అపారమైన సుఖాలలోకి వెళ్తున్నాము. ఇది రావణ రాజ్యము, కలియుగమని కూడా మీకు తెలుసు. తెలిసినా, ఇతరులకు తెలియజేయకపోతే వారికేమీ తెలియదని బాబా అంటారు. సర్వీసు సమాచారము మ్యాగజైన్లో వచ్చినప్పుడే వారికి తెలిసినట్లవుతుంది. రోజురోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లు కూడా వినిపిస్తూ ఉంటారు. వారు కలియుగము ఇంకా బాల్యావస్థలోనే ఉందని భావిస్తారు. సంగమ యుగము గురించి అర్థం చేసుకుంటే సత్యయుగము మరియు కలియుగాలను పోల్చుకోగలరు. కలియుగములో అపార దు:ఖముంది, సత్యయుగములో అపార సుఖముంటుంది. తండ్రి పిల్లలైన మనకు అపారమైన సుఖమునిస్తున్నారు, దానినే మనము వర్ణిస్తున్నామని చెప్పండి. ఇతరులెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. మీరు కొత్త విషయాలను వినిపిస్తారు. మీరు స్వర్గవాసులా? లేక నరకవాసులా? అని ఎవ్వరూ అడగలేరు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోలేరు. అర్థం చేయించునప్పుడు దేహాభిమానము వచ్చేస్తుంది. ఆత్మయే వింటుంది లేక ధారణ చేస్తుంది కానీ మంచి మంచి మహారథులు కూడా ఈ విషయాలను మర్చిపోతారు. దేహాభిమానములో వచ్చి మాట్లాడ్తూ ఉంటారు. ఇలా అందరికీ జరుగుతుంది. అందరూ పురుషార్థులేనని తండ్రి చెప్తున్నారు. ఆత్మగా భావించి మాట్లాడరు. తండ్రి, ఆత్మ అని భావించి జ్ఞానమునిస్తారు. మిగిలిన సోదరులందరూ అటువంటి స్థితిలో ఉండేందుకు పురుషార్థం చేస్తున్నారు. కలియుగములో అపార దు:ఖముంది, సత్యయుగములో అపార సుఖముందని పిల్లలు కూడా ఇతరులకు అర్థం చేయించాలి. ఇప్పుడు సంగమ యుగము జరుగుతోందని తండ్రి మార్గమును తెలుపుతున్నారు. అలాగని తండ్రి సుఖమునివ్వరు. సుఖమునిచ్చే మార్గము తెలియజేస్త్తారు. రావణుడు కూడా దు:ఖమును ఇవ్వడు. దు:ఖమునిచ్చే వ్యతిరేక మార్గాన్ని తెలుపుతాడు. తండ్రి దు:ఖమునూ ఇవ్వడు, సుఖమునూ ఇవ్వడు. సుఖమును పొందే మార్గాన్ని తెలుపుతారు. తర్వాత ఎవరెంత పురుషార్థము చేస్తే అంత సుఖము లభిస్తుంది. వారు సుఖమునివ్వరు. తండ్రి శ్రీమతమును అనుసరిస్తే సుఖాన్ని పొందుతారు. తండ్రి కేవలం మార్గమును తెలుపుతారు. రావణుని ద్వారా దు:ఖానికి మార్గము లభిస్తుంది. ఒకవేళ తండ్రి ఇచ్చినట్లయితే అందరికీ ఒకే విధంగా వారసత్వం లభించాలి. లౌకిక తండ్రి వారసత్వమును పంచుతారు కదా. ఇక్కడైతే ఎంత పురుషార్థము చేస్తే అంత లభిస్తుంది. తండ్రి చాలా సులభ మార్గమును తెలుపుతారు. ఇలా ఇలా చేస్తే ఇంత ఉన్నత పదవి లభిస్తుందని తెలిపిస్తున్నారు. అందరికంటే మేము శ్రేష్ఠ పదవిని పొందాలని పిల్లలు పురుషార్థము చేయాలి. చదువుకొని అందరికంటే ఉన్నత పదవి పొందాలి. వారంతా పొందుకోనీ, నేను ఇలాగే ఉంటానని అనుకోరాదు. పురుషార్థం ముఖ్యము. డ్రామానుసారము తప్పకుండా పురుషార్థం చేయవలసి ఉంటుంది. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు, కొందరు నిదానంగా(డల్గా) చేస్తారు. మొత్తం ఆధారమంతా పురుషార్థమే. తండ్రి నన్ను స్మృతి చేయండి అని మార్గాన్ని తెలియచేశారు, ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. డ్రామా పై వదిలేయకండి, ఇది అర్థము చేసుకోవలసిన విషయము.
ప్రపంచ చరిత్ర - భూగోళము పునరావృతమవుతుంది కాబట్టి ఏ పాత్రను ఇంతకుముందు చేశారో అదే పాత్రను తప్పకుండా చేయవలసి ఉంటుంది. అన్ని ధర్మాలు సమయానుసారము మళ్లీ వస్తాయి. క్రైస్తవులు ఇప్పుడు 100 కోట్లమంది ఉంటే మళ్లీ అంతమందే పాత్ర చేసేందుకు వస్తారు. ఆత్మా నాశనమ్వదు, దాని పాత్ర కూడా ఎప్పటికీ వినాశనమవ్వదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా ఇతరులకు అర్థం చేయిస్తారు. ధనమును దానము చేస్తే ధనము తరగదు (ధన్ దియే ధన్ నా కూటే...........). ధారణ చేస్తూ ఉంటే ఇతరులను కూడా షాహుకార్లుగా తయారుచేస్తూ ఉంటారు, కానీ అదృష్టములో లేకుంటే తమకు తామే మేము నిస్సహాయులమని భావిస్తారు. ఇతరులకు చెప్పలేకపోతే మీ అదృష్టములో పైసా పదవి(చాలా చిన్న పదవి) ఉందని టీచర్ చెప్తారు. అదృష్టములో లేకుంటే పురుషార్థము(తద్బీర్, యుక్తి) ఏం చేయగలరు? ఇది బేహద్ పాఠశాల. ప్రతి టీచరుకు తమ సబ్జెక్టు ఉంటుంది. తండ్రి చదివించే పద్ధతి తండ్రికే తెలుస్తుంది మరియు పిల్లలైన మీకే తెలుస్తుంది. మరెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఎవరికైనా అర్థము చేయించాలని పిల్లలైన మీరు ఎంతగానో ప్రయత్నిస్తారు. అయినా ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా. బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. ఎంత సమీపానికి వస్తూ ఉంటారో అంత చురుకుగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యూజియమ్, ఆత్మిక కాలేజి మొదలైనవి కూడా తెరుస్తున్నారు. ఆత్మిక విశ్వ విద్యాలయము అను మీ పేరే విభిన్నమైనది. ప్రభుత్వము కూడా చూస్తుంది. మీది దైహిక విశ్వ విద్యాలయము, ఇది ఆత్మిక విశ్వ విద్యాలయము అని వారికి చెప్పండి. ఇక్కడ ఆత్మ చదువుతుంది, మొత్తం 84 జన్మల చక్రములో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. మీరు చూసే 3 గంటల సినిమా మళ్లీ అదే విధంగా రిపీట్ అవుతుంది. అలాగే 5 వేల సంవత్సరాల చక్రము కూడా ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమవుతుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. వారైతే కేవలం భక్తిలోని శాస్త్రాలు మాత్రమే యధార్థము(రైట్ అని) భావిస్తారు. మీకైతే ఏ శాస్త్ర్రాలు లేవు అని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి శాస్త్రములేవైనా చదివారా! వారైతే గీతను చదివి వినిపిస్తారు. చదివి ఉంటే తల్లి గర్భములోనే చదువుకొని రారు కదా. బేహద్ తండ్రి పాత్ర చదివించే పాత్ర. తమ పరిచయమునిస్తారు. ప్రపంచానికైతే తెలియనే తెలియదు. తండ్రి జ్ఞానసాగరుడని మహిమ కూడా చేస్తారు. కృష్ణుని జ్ఞానసాగరుడుని అనరు. ఈ లక్ష్మీనారాయణులు జ్ఞానసాగరులా? కారు. ఇదే విచిత్రము. శ్రీమతానుసారము బ్రాహ్మణులైన మనమే జ్ఞానమును వినిపిస్తాము. ఈ లెక్కతో బ్రాహ్మణులైన మనమే ప్రజాపిత సంతానమని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా అనేకసార్లు జరిగింది. మళ్లీ మనమే అవుతాము. ఇది అర్థమైనప్పుడు మనుష్యులు అంగీకరిస్తారు. కల్ప-కల్పము మనమే ప్రజాపిత బ్రహ్మచే దత్తత తీసుకోబడిన పిల్లలుగా అవుతామని మీకు తెలుసు. అర్థము చేసుకున్నవారు నిశ్చయబుద్ధి గలవారిగా కూడా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు. ప్రతి ఒక్కరి బుద్ధి పై ఆధారపడి ఉంది. స్కూలులో కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అవుతారు. మళ్లీ కొత్తగా చదవాల్సి ఉంటుంది. వికారాలలో పడిపోతే సంపాదనంతా పోతుంది, తర్వాత బుద్ధిలో ఉండదు. మనసు లోలోపల తింటూ ఉంటుంది.
ఈ జన్మలో చేసిన పాపాల గురించి అందరికీ తెలుసు. కానీ గత జన్మలలో ఏమేమి చేశారో అవి గుర్తుండవు కానీ తప్పకుండా పాపాలు చేశారు. పుణ్యాత్మలుగా ఉన్నవారే మళ్లీ పాపాత్మలుగా అవుతారు. లెక్కాచారమంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. చాలా మంది పిల్లలు మర్చిపోతారు, చదవరు. ఒకవేళ చదివితే తప్పకుండా చదివిస్తారు కూడా. కొంతమంది మందబుద్ధి గలవారు చురుకు బుద్ధి గలవారిగా అవుతారు. ఇది ఎంత గొప్ప చదువు! తండ్రి నేర్పించే ఈ చదువు ద్వారానే సూర్యవంశీ-చంద్రవంశీ పరివారములోకి వస్తారు. వారు ఈ జన్మలోనే చదువుకొని పదవిని పొందుతారు. అయితే ఈ చదువు ద్వారా పదవి కొత్త ప్రపంచములో లభిస్తుందని మీకు తెలుసు, అది ఎంతో దూరము లేదు. ఎలాగైతే దుస్తులు మార్చడం జరుగుతుందో అలా పాత ప్రపంచాన్ని వదిలి క్రొత్త ప్రపంచములోకి వెళ్లాలి. వినాశనము కూడా తప్పకుండా జరుగుతుంది. మీరిప్పుడు కొత్త ప్రపంచానికి చెందిన వారిగా తయారవుతారు. మళ్లీ ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. నంబర్వార్గా రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే స్వర్గములో మొదట వస్తారు. మిగిలినవారు వెనుక వస్తారు. స్వర్గములోకి కొద్దిమంది మాత్రమే రాగలరు. స్వర్గములోని దాస-దాసీలు కూడా హృదయములో స్థానము పొందే ఉంటారు. అందరూ వచ్చి పురుషార్థము చేస్తారు. చదువులో ఎవరైతే తీక్షణంగా ముందుకు వెళ్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. మందబుద్ధి గలవారు తక్కువ పదవి పొందుతారు. మందబుద్ధి గలవారు కూడా మున్ముందు పురుషార్థము బాగానే చేస్తూ ఉండవచ్చు, కొంతమంది వివేకవంతులు క్రిందికి కూడా వెళ్లిపోతారు. పురుషార్థము ద్వారా అర్థమవుతుంది. ఇదంతా జరుగుతూ ఉంది. ఆత్మ శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. కొత్త వస్త్రాన్ని ధరించి కొత్త పాత్రను చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రను చేస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. బయటి వారి వద్ద ఈ జ్ఞానము కొంచెం కూడా లేదు. తండ్రి వచ్చి మళ్లీ చదివించినప్పుడే జ్ఞానము లభిస్తుంది. టీచరే లేకుంటే జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? అది భక్తి. భక్తిలో చాలా దు:ఖముంది. మీరాబాయికి ఎన్ని సాక్షాత్కారములైనా సుఖము లేదు కదా? వ్యాధులు వచ్చి ఉండవా? అక్కడైతే ఏ విధమైన దు:ఖమూ లేదు. ఇక్కడ అపారమైన దు:ఖముంది, అక్కడ అపారమైన సుఖముంది. ఇక్కడ అందరూ దు:ఖితులుగా అవుతారు. దీని పేరే దు:ఖధామము. రాజులకు కూడా దు:ఖముంది కదా. దీని పేరే దు:ఖధామము. అది సుఖధామము. ఇది సంపూర్ణ దు:ఖము, సంపూర్ణ సుఖముల సంగమ యుగము. సత్యయుగములో సంపూర్ణ సుఖము, కలియుగములో సంపూర్ణ దు:ఖముంటుంది. అన్ని రకాల దు:ఖాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ముందు ముందు ఎంత దు:ఖము కలుగుతూ ఉంటుంది! దు:ఖపు కొండలు విరిగి పడనున్నాయి.
వారు మీరు మాట్లాడేందుకు సమయము చాలా తక్కువగా ఇస్తారు. రెండు నిముషాలు ఇచ్చినా, సత్యయుగములో అపార సుఖముండేదని, అది తండ్రి ఇస్తారని అర్థం చేయించండి. రావణుని ద్వారా అంతులేని దు:ఖము లభిస్తుంది. ఇప్పుడు కామాన్ని జయిస్తే జగజ్జీతులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానము వినాశనమవ్వదు. కొద్దిగా విన్నా స్వర్గములోకి వస్తారు. ప్రజలైతే చాలా మంది తయారవుతారు. రాజు ఎక్కడ, దాసీలు ఎక్కడ. ఎవరి బుద్ధి వారిదే. ఎవరైతే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు. ఈ పాఠశాల కూడా అత్యంత అసాధారణమైనది. భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు. శ్రీ కృష్ణుడైతే దైవీగుణాలు కలిగిన దేవత. తండ్రి చెప్తున్నారు - నేను దైవీగుణాలు మరియు అసురీ గుణాలకు అతీతంగా ఉన్నాను, మీ తండ్రినైన నేను మిమ్ములను చదివించేందుకు వస్తాను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమాత్మయే ఇస్తారు. గీతా జ్ఞానాన్ని ఏ దేహధారి మానవులు లేక దేవతలు ఇవ్వలేరు. విష్ణు దేవతాయ నమ: అని అంటారు, అయితే శ్రీ కృష్ణుడు ఎవరు? దేవత అయిన కృష్ణుడే విష్ణువు అని ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా కొందరు మర్చిపోతారు. స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నవారైతే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. సర్వీసు చేసి ఋజువు తీసుకొస్తే సర్వీసు చేశారని అర్థమవుతుంది. అందువలన తండ్రి చెప్తున్నారు - సమాచారము వ్రాయండి. కొందరు ప్రదర్శన చేసి సమాచారమిస్తారు. బాబాకు ప్రతి విషయము గురించిన ఫలితము కావాలి. చాలా మంది బాబా వద్దకు వస్తారు, తిరిగి వెళ్లిపోతారు. అందులో లాభమేముంది. అలాంటివారిని బాబా ఏం చేస్తారు? వారికీ లాభము లేదు, మీకూ లాభము లేదు. మీ మిషన్ వృద్ధి జరగలేదని అర్థము కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ విషయములోనూ అధీనులుగా అవ్వరాదు. స్వయంలో జ్ఞాన ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల అదృష్టాన్ని మేల్కొల్పాలి.
2. ఎవరితోనైనా మాట్లాడునప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానము రాకూడదు. తండ్రి ద్వారా లభించిన అపారమైన సుఖమును ఇతరులకు పంచాలి.
వరదానము :-
''అనాది స్వరూప స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేసి, చేయించే సంతుష్టమణి భవ''
మీ అనాది, ఆది స్వరూపాలను స్మృతిలోకి తీసుకు రండి మరియు అదే స్మృతి స్వరూపంలో స్థితులై ఉండండి. అప్పుడు మీరు స్వయంతో సంతుష్టంగా ఉండడమే కాక ఇతరులకు కూడా సంతుష్టత యొక్క విశేషతను అనుభవం చేయించగలరు. అసంతుష్టతకు(అతృప్తిని) కారణం అప్రాప్తి. మీ స్లోగనే - ''పొందాల్సినదంతా పొందాను.'' తండ్రి వారిగా అవ్వడం అనగా వారసత్వానికి అధికారులుగా అవ్వడం. ఇటువంటి అధికారి ఆత్మలు సదా భర్పూర్గా, సంతుష్టమణులుగా ఉంటారు.
స్లోగన్ :-
''తండ్రి సమానంగా అయ్యేందుకు - భావించడం, కోరడం, చేయడం ఈ మూడు సమానంగా ఉండాలి.''