30-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - దు:ఖహర్త - సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేస్తే మీ దు:ఖాలన్నీ దూరమవుతాయి. 'అంతమతి సో గతి' అయిపోతుంది ''

ప్రశ్న :-

పిల్లలైన మీరు నడుస్తూ - తిరుగుతూ స్మృతిలో ఉండే ఆదేశమును తండ్రి ఎందుకు ఇచ్చారు?

జవాబు :-

1. ఎందుకంటే స్మృతి ద్వారానే జన్మ-జన్మాంతరాల పాప భారము దిగిపోతుంది. 2. స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. 3. ఇప్పటి నుండే స్మృతిలో ఉండే అభ్యాసము ఉంటే అంతిమ సమయములో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండగలరు. అంతిమ సమయములో ఎవరైతే స్త్రీని స్మరణ చేస్తారో............ అని అంతిమ స్థితికే గాయనముంది. 4. తండ్రిని స్మృతి చేస్తే 21 జన్మల సుఖము మీ ముందుకు వచ్చేస్తుంది. తండ్రిలాంటి మధురమైనవారు ప్రపంచములో మరెవ్వరూ లేరు. అందువలన పిల్లలారా, నడుస్తూ - తిరుగుతూ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆదేశిస్తున్నారు.

ఓంశాంతి.

ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఇది ఒక్కరితో ఉన్న అతిప్రియమైన సంబంధము. వారు అందరినీ దు:ఖాల నుండి విడిపించేవారు. తండ్రి పిల్లలను చూస్తే అన్ని పాపాలు సమాప్తమైతూ పోతాయి. ఆత్మ సతోప్రధానత వైపుకు వెళ్తూ ఉంది. అపారమైన దు:ఖముంది కదా! దు:ఖహర్త - సుఖకర్త అని మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను నిజంగానే అన్ని దు:ఖాల నుండి విడిపించేందుకు వచ్చారు. స్వర్గములో దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరము. తండ్రికి పిల్లల పై ప్రేమ ఉంటుంది కదా! తండ్రికి ఏ ఏ పిల్లల పై ప్రేమ ఉంటుందో మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహముగా భావించకండి అని పిల్లలకు అర్థము చేయించారు. మంచి రత్నాలుగా ఎవరైతే ఉన్నారో వారు తండ్రిని నడుస్తూ - తిరుగుతూ స్మృతి చేస్తారు. ఈ మాట కూడా ఎందుకు అంటారు? ఎందుకంటే జన్మ-జన్మాంతరాల మీ పాపాల భాండము నిండి ఉంది. కనుక ఈ స్మృతియాత్ర ద్వారానే మీరు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అయిపోతారు. ఇది పురాతన శరీరమని కూడా పిల్లలైన మీకు తెలుసు. దు:ఖము ఆత్మకే లభిస్తుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఆత్మకు దు:ఖము అనుభవమవుతుంది. నేను రోగిని. దు:ఖీగా ఉన్నానని ఆత్మ అంటుంది. ఇది దు:ఖ ప్రపంచము. ఎక్కడికి వెళ్లినా దు:ఖమే దు:ఖముంది. సుఖధామములో అయితే కొద్దిగా కూడా దు:ఖముండదు. దు:ఖము అనే మాట ఉందంటే మీరు దు:ఖధామములో ఉన్నట్లే. సమయము కూడా ఇక కొద్దిగానే మిగిలి ఉంది. ఇందులో తండ్రిని స్మృతి చేసే పురుషార్థమును పూర్తిగా చేయాలి. ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంత సతోప్రధానంగా అవుతూ ఉంటారు. పురుషార్థము చేసి చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకుండునట్లు మీ స్థితిని తయారు చేసుకోవాలి. అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో............ అని ఒక పాట కూడా ఉంది. మరి ఇది అంత్యకాలమే కదా! ఇది పురాతన ప్రపంచమైన దు:ఖధామపు అంతిమ సమయం. ఇప్పుడు మీరు సుఖధామములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తారు. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది గుర్తుండాలి కదా. శూద్రులకు దు:ఖముంటుంది. మనము దు:ఖాల నుండి బయటపడి మళ్లీ ఇప్పుడు శిఖరాగ్రం పైకి వెళ్తున్నాము. కావున ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అతిప్రియమైనవారు తండ్రియే. వారికన్నా మధురమైనవారు ఇంకెవరైనా ఉంటారా? ఆత్మ ఆ పరమపిత పరమాత్మనే స్మృతి చేస్తుంది కదా! వారు సర్వాత్మలకు తండ్రి. వారికంటే మధురమైన వస్తువు ఈ ప్రపంచములో ఇంకేదీ ఉండజాలదు. ఎంతోమంది పిల్లలున్నారు. ఎంత సమయానికి గుర్తుకు వస్తుంది? ఒక్క క్షణములో. మంచిది, మొత్తం సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది? అది కూడా పిల్లలైన మీ బుద్ధిలో అర్థ సహితంగా ఉంది. ఏదైనా డ్రామా చూసి వచ్చినప్పుడు డ్రామా గుర్తుందా? అని ఎవరైనా అడిగితే, గుర్తుందని అనడంతోనే ప్రారంభము నుండి చివరివరకు మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది. కానీ దానిని వర్ణన చేసి వినిపించేందుకు సమయము పడ్తుంది. తండ్రి అనంతమైనవారు. వారిని స్మృతి చేయడంతోనే 21 జన్మల సుఖము ముందుకు వచ్చేస్తుంది. తండ్రి ద్వారా ఈ ఆస్తి లభిస్తుంది. క్షణములో పిల్లల ముందుకు తండ్రి వారసత్వము వచ్చేస్తుంది. పిల్లలు జన్మిస్తూనే వారసుడు జన్మించాడని తండ్రికి తెలిసిపోతుంది. మొత్తం ఆస్తి అంతా గుర్తుకు వచ్చేస్తుంది. పిల్లలైన మీరు కూడా ఒంటరిగా వేరు వేరుగా ఉన్నారు. వారసత్వము వేరు వేరుగా లభిస్తుంది కదా! మీరు వేరు వేరుగా స్మృతి చేస్తారు. మనము అనంతమైన తండ్రి వారసులము. సత్యయుగములో ఒకే ఒక కొడుకు ఉంటాడు. అతడు మొత్తం ఆస్తికంతా వారసుడవుతాడు. పిల్లలకు తండ్రి లభించాడు, దానితో ఒక్క క్షణములో విశ్వాధిపతులుగా అయిపోయారు. సమయం పట్టదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. స్త్రీగా భావించకండి. ఆత్మ అయితే కొడుకే కదా! బాబా అంటారు - నాకు పిల్లలందరూ గుర్తుకు వస్తారు. ఆత్మలందరూ భాయీ-భాయీ(సోదరులు). సర్వ ధర్మాలవారు ఎవరైతే వస్తారో, వారు అన్ని ధర్మాల వారు సోదరులు(భాయి-భాయి) అని అంటారు కానీ అర్థము చేసుకోరు. మనము తండ్రికి అతిప్రియమైన పిల్లలమని ఇప్పుడు అర్థము చేసుకున్నారు. తండ్రి నుండి పూర్తి అనంతమైన వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఎలా తీసుకుంటారు? అది కూడా పిల్లలైన మీకు క్షణములో గుర్తుకు వచ్చేస్తుంది. మనము సతోప్రధానంగా ఉండేవారము. మళ్లీ తమోప్రధానంగా అయ్యాము. మరలా ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి నుండి మనము స్వర్గ సుఖాల వారసత్వాన్ని తీసుకోవాలని మీకు తెలుసు.

స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము నశ్వరమైనది అని తండ్రి చెప్తారు. ఆత్మయే శరీరాన్ని వదిలి వెళ్లిపోతుంది. మళ్లీ వెళ్లి ఇంకొక కొత్త శరీరాన్ని గర్భములో తీసుకుంటుంది. ఎప్పుడైతే శిశువు తయారవుతుందో అప్పుడు ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. కానీ తాను రావణునికి వశమై ఉంటుంది. వికారాలకు వశమై జైల్లోకి వెళ్తారు. అక్కడైతే రావణుడే ఉండడు. దు:ఖమనే మాటే ఉండదు. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక శరీరములో ప్రవేశిస్తామని తెలుస్తుంది. అక్కడైతే భయపడే విషయమేదీ ఉండదు. ఇక్కడైతే ఎంతగా భయపడ్తారు. అక్కడ నిర్భయులుగా ఉంటారు! తండి వచ్చి పిల్లలైన మిమ్ములను అపారమైన సుఖాలలోకి తీసుకెళ్తారు. సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. కలియుగములో అపారమైన దు:ఖముంది. అందుకే దీనిని దు:ఖధామమని అంటారు. తండ్రి అయితే ఎలాంటి కష్టమునివ్వరు. భలే గృహస్థ వ్యవహారములో ఉండండి. పిల్లలను సంభాళించండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. గురువులు, మఠాధిపతులు అందరినీ వదిలేయండి. నేను(శివబాబా) గురువులందరికన్నా పెద్దవాడిని కదా! వారంతా నా రచనయే. నన్ను తప్ప మరెవ్వరినీ పతితపావనా! అని అనరు. బ్రహ్మ, విష్ణు, శంరులను పతితపావనులని అంటారా? లేదు. నన్ను తప్ప దేవతలను కూడా అలా అనలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు గంగను పతితపావని అని అంటారా? ఈ నీటి నదులైతే ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. గంగ, బ్రహ్మపుత్ర మొదలైనవి కూడా మొదటి నుండి ఉన్నాయి. అందులో స్నానము చేస్తూనే ఉంటారు. వర్షాలు బాగా కురిస్తే వరదలు వచ్చేస్తాయి. అది కూడా దు:ఖమే కదా! అపారమైన దు:ఖాలు ఉన్నాయి. వరదల్లో ఎంతమంది మనుష్యులు మరణించారో చూడండి. సత్యయుగములో దు:ఖమనే మాటే ఉండదు. జంతువులకు కూడా దు:ఖముండదు. వాటికి కూడా అకాల మృత్యువు ఉండదు. ఈ డ్రామాయే ఇలా రచింపబడి ఉంది. భక్తిలో ''బాబా! మీరు వచ్చినప్పుడు మేము మీ వారిగానే అవుతామని పాడ్తారు. వారు వస్తారు కదా. దు:ఖధామ అంతిమము, సుఖధామము ఆది ఈ రెండింటి మధ్యలోనే వారు వస్తారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఆయువు ఎంత ఉంటుందో కూడా తెలియదు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. సృష్టి చక్రము ఆయువు 5 వేల సంవత్సరాలని ఇంతకు ముందు మీకు తెలుసా? వారైతే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుందని ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. స్వస్తిక్‌లో పూర్తిగా నాలుగు భాగాలను చూపిస్తారు, కొద్దిగా కూడా వ్యత్యాసము ఉండదు. ఖచ్చితమ్తెన లెక్క ఉండాలని వివేకము కూడా చెప్తుంది. పూరీలో కూడా కుండలో అన్నం వండుతారు. అది దానంతట అదే ఖచ్ఛితంగా నాలుగు భాగాలుగా అయిపోతుంది. అటువంటి యుక్తిని రచించారు. అక్కడ అన్నం చాలా తింటారు. జగన్నాథ్‌ అనండి లేక శ్రీనాథ్‌ అనండి, రెండూ ఒక్కటే ఇరువురిని నల్లగా చూపిస్తారు. శ్రీనాథుని మందిరములో నేతి భండారాలు ఉంటాయి. అక్కడ నేతిలో వేయించిన మంచి, మంచి వస్తువులు లభిస్తాయి. బయట దుకాణాలు ఉంటాయి. ఎంత నైవేద్యము పెడుతూ ఉంటారు. యాత్రికులందరూ దుకాణదారుల నుండి తీసుకుంటారు. జగన్నాథ్‌లో కేవలం అన్నమే అన్నము ఉంటుంది. అతడు జగన్నాథుడు, ఇతడు శ్రీనాథుడు. సుఖధామాన్ని మరియు దు:ఖధామాన్ని చూపిస్తారు. శ్రీనాథుడు సుఖధామానికి చెందినవాడు, ఇతడు దు:ఖధామానికి చెందినవాడు. కామచితి పైకి ఎక్కి ఈ సమయములో నల్లగా అయిపోయాడు. జగన్నాథునికి కేవలం అన్నము నైవేద్యంగా పెడ్తారు. ఇతడిని పేదవాడిగా, అతడిని షాహుకారుగా చూపిస్తారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. భక్తిని ఆజ్ఞానము అని అంటారు. దాని ద్వారా ఏమీ లభించదు. అక్కడ కేవలం గురువుల సంపాదన ఎంతగానో జరుగుతూ ఉంటుంది. ఎవరైనా తెలివైనవారి వద్ద ఏదైనా నేర్చుకుంటే అతడు మా గురువని, మాకు ఇది నేర్పించారని అంటారు. వారందరూ దైహికమైనవారు, జన్మలు తీసుకునేవారు.

ఇప్పుడు మీ జతలో ఎవరున్నారు? విచిత్రుడైన తండ్రి. ఇది నా శరీరము కాదు, ఇది మీ దాదా శరీరము అని వారు అంటారు. ఇతడు పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు. ఇతని అనేక జన్మల అంతిమములో నేను ఇతడిలోకి మిమ్ములను సుఖధామములోనికి తీసుకెళ్లేందుకు ప్రవేశిస్తాను. ఇతనిని గోముఖము అని కూడా అంటారు. గోముఖమును దర్శించేందుకు చాలా దూర-దూరాల నుండి వస్తారు. ఇక్కడ కూడా గోముఖము ఉంది. పర్వతాల నుండి నీరేమో తప్పకుండా వస్తుంది. బావిలోకి కూడా రోజూ నీళ్ళు పర్వతాల నుండే వస్తాయి. అవి ఎప్పుడూ ఆగిపోవు. నీరు వస్తూనే ఉంటుంది. ఎక్కడనుండైనా కాలువ వెలువడిందంటే దానిని గంగాజలము అని అనేస్తారు. అక్కడికి వెళ్లి స్నానాలు చేస్తారు. గంగా జలంగా భావిస్తారు. కాని ఈ నీటి ద్వారా పతితుల నుండి పావనంగా అవ్వరు. పతిత పావనుడను నేనే. హే ఆత్మలారా! నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలనూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. తండ్రి మిమ్ములను జన్మ-జన్మాంతరాల పాపాల నుండి విడిపిస్తారు. ఈ సమయములో ప్రపంచములో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. ఇది కర్మభోగము కదా! గత జన్మలో పాపాలు చేశారు. ఇవి 63 జన్మల లెక్కాచారాలు. కొద్ది కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణానికి చంద్రుని కళలు తగ్గుతూ తగ్గుతూ ఉంటాయి కదా. అలాగే ఇది అనంతమైన పగలు మరియు రాత్రి. ఇప్పుడు ప్రంపంచమంతటి పై, అందులోనూ ముఖ్యంగా భారతదేశము పై రాహు దశ కూర్చుని ఉంది. రాహువు గ్రహణం పట్టింది. ఇప్పుడు పిల్లలైన మీరు శ్యామము నుండి సుందరంగా అవుతున్నారు. అందుకే కృష్ణుడిని కూడా శ్యామ సుందరుడని అంటారు. వారు నిజంగానే నల్లగా చేసేస్తారు. కామచితి పైకి ఎక్కినందుకు గుర్తుగా అలా చూపించారు. కాని మానవుల బుద్ధి ఏమీ పని చేయదు. ఒకటి చామన ఛాయ(నలుపు), రెండవది సుందరముగా (తెలుపు) చేస్తారు. ఇప్పుడు మీరు తెల్లగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేస్తేనే అలా అవుతారు కదా. ఇందులో కష్టపడే విషయం ఏదీ లేదు. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఇది మళ్లీ ప్రాయ: లోపమైపోతుంది. భలే గీతను చదివి వినిపిస్తారు. కాని ఈ జ్ఞానమునైతే వినిపించలేరు. అవి భక్తిమార్గము కొరకు పుస్తకాలు. భక్తిమార్గము కొరకు ఎంతో సామాగ్రి ఉంది. ఎన్నో శాస్త్రాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు. ఏమేమో చేస్తూ ఉంటారు. రాముని మందిరాలకు కూడా వెళ్తారు. రాముడిని కూడా నల్లగా చేసేశారు. 'అలా నల్లగా ఎందుకు చేస్తారు' అని ఆలోచించాలి. కలకత్తా కాళి కూడా ఉంది. తల్లీ-తల్లీ అంటూ హైరానా(గాభరా) పడిపోతారు. వారిని అందరికన్నా నల్లగా, చాలా భయంకరంగా చూపిస్తారు. ఆమెను మాత అని కూడా అంటారు. మీకు ఈ జ్ఞాన బాణాలు, జ్ఞాన ఖడ్గాలు మొదలైనవి ఉన్నాయి. వారికి ఆయుధాలు ధరింపజేశారు. వాస్తవానికి ఇంతకు ముందు కాళి ఎదుట మనుష్యులను బలి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం దానిని ఆపేసింది. ఇంతకు ముందు సింధ్‌లో దేవీ మందిరము ఉండేది కాదు. బాంబు ప్రేలినప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు కాళి కనిపించింది, ఇక్కడ నా మందిరము లేదు, త్వరగా నిర్మించండి లేకపోతే ఇంకా బాంబులు పేలుతాయని చెప్పినట్లు అన్నాడు. అంతే. లెక్కలేనంత ధనము ప్రోగయ్యింది. మందిరము తయారయ్యింది. ఇప్పుడు చూస్తే ఎన్నో మందిరములు ఉన్నాయి. ఎన్నో చోట్ల భ్రమిస్తూ ఉంటారు! తండ్రి మిమ్ములను వీటన్నింటి నుండి విముక్తులుగా చేసేందుకు అర్థము చేయిస్తారు. అంతేకాని ఎవ్వరినీ నిందించరు. తండ్రి డ్రామాను అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తయారయ్యిందో చెప్తారు. మీరు దేనినైతే చూశారో అదంతా మళ్లీ జరుగుతుంది. ఏ వస్తువైతే లేదో అది మళ్లీ తయారవుతుంది. మా రాజ్యముండేది, దానిని మేము పోగొట్టుకున్నామని మీరు అర్థము చేసుకున్నారు. పిల్లలూ! నరుని నుండి నారాయణునిగా అవ్వాలంటే పురుషార్థము చేయండి అని తండ్రి అంటారు. భక్తిమార్గములో మీరు చాలా కథలు వింటూ వచ్చారు. అమరకథను కూడా విన్నారు. కానీ ఎవరైనా అమరులుగా అయ్యారా? ఎవరికైనా జ్ఞాన మూడవ నేత్రము లభించిందా? ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. ఈ కనుల ద్వారా ఎటువంటి అశుద్ధతనూ, చెడును చూడకండి. మంచి దృష్టితో చూడండి. అశుద్ధ దృష్టితో కాదు. ఈ పాత ప్రపంచాన్ని చూడకండి. ఇది సమాప్తమైపోతుంది. మధురాతి మధురమైన పిల్లలూ, నేను మీకు 21 జన్మల కొరకు రాజ్యమును ఇచ్చి వెళ్తాను. అక్కడ మరెవ్వరి రాజ్యమూ ఉండదు. దు:ఖమను మాటే ఉండదు. మీరు చాలా సుఖంగా మరియు ధనవంతులుగా ఉంటారు. ఇక్కడైతే మనుష్యులు ఆకలితో మరణిస్తూ ఉంటారు. అక్కడైతే విశ్వమంతటి పై మీరు రాజ్యము చేస్తారు. దానికి ఎంత కొద్ది భూమి కావాలి! చిన్నతోట మళ్లీ వృద్ధి చెందుతూ చెందుతూ కలియుగాంతము వరకు ఎంత పెద్దదిగా అయిపోతుంది! పంచ వికారాలు ప్రవేశించిన కారణంగా అది ముళ్ళ అడవిగా అయిపోతుంది. కామము మహాశత్రువు. దీని వలన మీరు ఆదిమధ్యాంతాలు దు:ఖాన్ని పొందుతారని తండ్రి అంటారు. జ్ఞానమును మరియు భక్తిని కూడా ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. వినాశనము మీ ముందు ఉంది. కావున ఇప్పుడు ఇక త్వర త్వరగా పురుషార్థము చేయాలి, లేకపోతే పాపాలు భస్మము అవ్వవు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతాయి. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. కల్ప పూర్వము ఎవరైతే పురుషార్థము చేశారో వారు తప్పకుండా చేసి చూపిస్తారు. చల్లబడకండి! ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. అందరూ దు:ఖమునిచ్చేవారే. ఎవరైతే సదా సుఖమును ఇస్తారో వారిని గుర్తుంచుకోండి. ఇందులో పొరపాటు చేయరాదు. స్మృతి చేయకపోతే పావనంగా ఎలా అవుతారు? అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ కళ్లతో చెడును(ఈవిల్‌) చూడరాదు. తండ్రి ఇచ్చిన జ్ఞాన మూడవ నేత్రము(పవిత్ర నేత్రము) ద్వారానే చూడాలి. సతోప్రధానంగా అయ్యే పురుషార్థము పూర్తిగా చేయాలి.

2. గృహస్థ వ్యవహారమును నిర్వహిస్తూ ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. చివరి సమయములో తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి.

వరదానము :-

'' అటెన్షన్‌ మరియు చెకింగ్‌ ద్వారా స్వ సేవను చేసుకునే సంపన్న మరియు సంపూర్ణ భవ ''

స్వ సేవ అనగా సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యేందుకు స్వయం పై సదా అటెన్షన్‌ ఉంచుకోవడం. చదువులోని ముఖ్యమైన సబ్జెక్టులలో స్వయాన్ని గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులుగా చేసుకోవడం. జ్ఞాన స్వరూపులు, స్మృతిస్వరూపులు మరియు ధారణా స్వరూపులుగా అవ్వడం. ఈ 'స్వ సేవ' సదా బుద్ధిలో ఉంటే ఈ సేవ స్వతహాగా తమ సంపన్న స్వరూపం ద్వారా అనేకమందికి సేవ చేయిస్తూ ఉంటుంది. అయితే ఇందుకు విధి - అటెన్షన్‌ మరియు చెకింగ్‌. స్వయాన్ని చెక్‌ చేసుకోవాలి, ఇతరులను కాదు.

స్లోగన్‌ :-

'' ఎక్కువగా మాట్లాడుట ద్వారా బుద్ధి శక్తి తగ్గిపోతుంది, అందువలన క్లుప్తంగా మధురంగా మాట్లాడండి. ''