13-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - దేవతలుగా అయ్యేందుకు ముందు మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి, బ్రహ్మాముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. వారే రాజయోగ చదువు ద్వారా దేవతలుగా అవుతారు ''

ప్రశ్న :-

ఇతర అన్ని సత్సంగముల కంటే ఏ విషయములో మీ సత్సంగము విలక్షణమైనది ?

జవాబు :-

ఇతర సత్సంగాలలో ఏ లక్ష్యమూ ఉండదు. ధనము, సంపద మొదలైనవన్నీ పోగొట్టుకొని వెతుకుతూ ఉంటారు. ఈ సత్సంగములో మీరు వెతకరు. ఇది సత్సంగముతో పాటు పాఠశాల కూడా అయినది. పాఠశాలలో చదవవలసి ఉంటుంది, భ్రమించడం ఉండదు. చదువు అనగా సంపాదన. ఎంతగా మీరు చదువుకొని ధారణ చేసి, చేయిస్తారో అంత సంపాదన అవుతుంది. ఈ సత్సంగములోకి రావడం అనగా అంతా లాభమే లాభము.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తారు. ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు. బేహద్‌ తండ్రి పిల్లలకు చెప్తున్నారు - ''స్వయాన్ని ఆత్మగా భావించండి.'' ఇది పదే పదే వినడం ద్వారా బుద్ధి నలువైపులా తిరగడం, వెతకడం సమాప్తమై స్థిరమైపోతుంది. స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ కూర్చుంటారు. ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలు భావిస్తారు. మనము దత్తు పిల్లలము. అంతేకాక బ్రాహ్మణులైన మనము చదువుతాము. ఏం చదువుతాము? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఉదాహరణానికి ఎవరైనా విద్యార్థి కాలేజికి వెళ్తే ఇప్పుడు నేను చదువుకొని ఇంజినీయరు, డాక్టరు మొదలైనవారిగా అవుతామని భావిస్తారు కదా. మీరు కూడా బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామని భావిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా,..... అనే గాయనము కూడా ఉంది. అయితే అలా ఎవరు తయారవుతారు? హిందువులంతా దేవతలుగా కారు. వాస్తవానికి హిందూ అనేది ఏ ధర్మమూ కాదు. హిందూ ధర్మము ఆదిసనాతమైనది కాదు. హిందూ ధర్మమును ఎవరు స్థాపించారు? అని ఎవరిని అడిగినా తికమకపడ్తారు, చెప్పలేరు. ఈ పేరు అజ్ఞానముతో పెట్టబడింది. హిందూ దేశములోని వారు స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. వాస్తవానికి దీని పేరు భారతదేశము, హిందూ దేశము కాదు. భారత ఖండము అని అంటారు కానీ హిందూస్థాన్‌ ఖండము అని అనరు. దీని పేరే భారతదేశము. వారికి ఇది ఏ ఖండమో కూడా తెలియదు. అపవిత్రంగా అయినందున స్వయాన్ని దేవతలుగా భావించరు. దేవీదేవతలు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మము లేనే లేదు. మిగిలిన ధర్మాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. బుద్ధునిది బౌద్ధ ధర్మము, ఇబ్రహీంది ఇస్లాం, ఏసుక్రీస్తుది క్రైస్తవ ధర్మము. కానీ హిందూ ధర్మము ఎవ్వరిదీ కాదు. హిందూస్థానమని పేరు పెట్టినవారు విదేశీయులు. పతితమైన కారణంగా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - దేవీ దేవతా ధర్మము ఆది సనాతనమైనది, అత్యంత పురాతనమైనది. మొట్టమొదటి ధర్మము ఏది? దేవీ దేవతా ధర్మము, హిందూ ధర్మము కాదు. ఇప్పుడు మీరు బ్రహ్మకు దత్తు పిల్లలైన బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. అంతేకాని హిందువుల నుండి దేవతలుగా అయ్యేందుకు కాదు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది బాగా ధారణ చేయాలి. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఇంకా పెరుగూతూనే ఉంటాయి. ఎక్కడ ఉపన్యాసము మొదలైనవి చేయునప్పుడు ఈ విషయము అర్థము చేయించడం మంచిది. ఇది కలియుగము, అన్ని ధర్మాలు ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నాయి. చిత్రాలు చూపించి అర్థము చేయిస్తే నేను ఫలానా, నేను ఇంత గొప్పవాడిని..... అన్న గర్వము తొలగిపోతుంది. తమోప్రధానంగా ఉన్నామని అప్పుడు తెలుసుకుంటారు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. తర్వాత ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతుందని తెలపాలి. రోజులు గడిచే కొలది చిత్రాలు కూడా శోభాయమానంగా అవుతూ ఉంటాయి. ఎలాగైతే పాఠశాలలో మ్యాపులు పిల్లల బుద్ధిలో ఉంటాయో, అలా మీ బుద్ధిలో ఈ చిత్రాలు ఉండాలి. నంబరువన్‌ మ్యాప్‌ ఇదే. పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. రెండు గోళాలు కూడా ఉన్నాయి(సత్యయుగము, కలియుగము). ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నాము. ఈ పాత ప్రపంచము వినాశనమైపోతుంది. ఒకే ఆదిసనాతన దేవీదేవతా ధర్మము స్థాపన అవుతూ ఉంది. మీరు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మము అంటూ ఏదీ లేదు. ఎలాగైతే సన్యాసులు నివాస స్థానమైన బ్రహ్మ తత్వమునే ఈశ్వరుడని భావిస్తున్నారో, అలా హిందూ దేశములో ఉన్నవారు మాది హిందూ ధర్మమని భావించారు. వారిది కూడా తప్పే, మీది కూడా తప్పే. దేవీ దేవతలనే పేరు చాలా ఉన్నతమైనది. వీరు దేవతల వలె ఉన్నారని గౌరవముతో అంటారు కదా. ఎవరిలోనైనా మంచి గుణాలుంటే - వీరిలో దైవీ గుణాలున్నాయని అంటారు.

ఈ రాధా-కృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని, వారిని విష్ణువు అని అంటారని మీరు అర్థము చేసుకున్నారు. అందరి చిత్రాలు ఉన్నాయి. కానీ ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని ఇప్పుడు అర్థము చేయిస్తున్నారు. అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. భగవంతుడు అనే పదమును తలవని మానవుడే ఉండడు. భగవంతుడిని నిరాకారుడని అంటారు. నిరాకారానికి అర్థము కూడా తెలియదు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు. రాతి బుద్ధి గలవారి నుండి పారసబుద్ధి గలవారిగా అవుతారు. ఈ జ్ఞానము భారతీయులకు మాత్రమే, ఇతర ధర్మాలకు కాదు. ఇంత వృద్ధి ఎలా జరుగుతుందో ఇతర ఖండాలు ఎలా ఏర్పడుతూ వచ్చాయో మీరు అర్థము చేయించవచ్చు. అక్కడ భారత ఖండము తప్ప ఏ ఇతర ఖండమూ ఉండదు. ఇప్పుడు ఆ ఒక్క ధర్మము మాత్రమే లేదు. మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. వటవృక్ష ఉదాహరణము చాలా ఖచ్చితంగా ఉంటుంది. పునాది అయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు. మిగిలిన అన్ని ధర్మాలు వృక్షముంతా నిలబడి ఉంది. అందువలన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది కానీ హిందూ ధర్మము కాదు అని అంటారు. మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అయ్యేందుకు ముందు బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. శూద్ర వర్ణము, బ్రాహ్మణ వర్ణము అని అంటారు, శూద్ర వంశము అని అనరు. వంశములో రాజులు, రాణులు ఉంటారు. మొదట దేవీ దేవతలు మహారాజులు-మహారాణులుగా ఉండేవారు. ఇక్కడ హిందూ మహారాజ-మహారాణులు ఉన్నారు. భారతదేశము అయితే ఒక్కటే ఉంది. మరి వేరు వేరుగా ఎందుకున్నారు? వారి నామ-రూపములనే మాయం చేశారు, కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. నెంబర్‌ వన్‌ సూర్యవంశీయులు. రాముని సూర్యవంశీయుడని అనరు. ఇప్పుడు మీరు సూర్య వంశీయులుగా అయ్యేందుకు వచ్చారు, చంద్ర వంశీయులుగా తయారగుటకు కాదు. ఇది రాజయోగము కదా. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. బాబా మనలను మహారాజా - మహారాణులుగా చేసేందుకు చదివిస్తున్నారని మీ హృదయములో ఎంతో సంతోషము ఉంటుంది. ఇది సత్య-సత్యమైన సత్యనారాయణ కథ. ఇంతకు ముందు జన్మ-జన్మాంతరాలుగా మీరు సత్యనారాయణ కథను వింటూ వచ్చారు. కానీ అవి సత్యమైన కథలేమీ కావు. భక్తిమార్గములో ఎప్పుడూ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వలేరు. ముక్తి - జీవన్ముక్తిని పొందలేరు. మనుష్యులందరూ ముక్తి-జీవన్ముక్తులను తప్పకుండా పొందుతారు. ఇప్పుడు అందరూ బంధనములో ఉన్నారు. ఈ రోజు కూడా పై నుండి ఏ ఆత్మ వచ్చినా జీవన్ముక్తి స్థితిలోకి వస్తుందే కానీ జీవన బంధనములోకి కాదు. అర్ధ కాలము జీవన్ముక్తి, అర్ధ కాలము జీవన బంధనములోకి వెళ్తుంది. ఈ విధంగా డ్రామా తయారై ఉంది. ఈ బేహద్‌ డ్రామాలో మనమంతా పాత్రధారులము. ఇచ్చటకు వచ్చేదే పాత్ర చేసేందుకు. ఆత్మలైన మనము ఇక్కడ నివసించేవారము కాదు. అక్కడ నుండి ఎలా వస్తామో మొదలైన అన్ని విషయాలు అర్థము చేయించబడ్తాయి. కొంతమంది ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి. పిల్లలైన మీకు మొదటి నుండి చివరి వరకు మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళము అంతా బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి పైన కూర్చొని ఏమి చేస్తారో ఎవ్వరికీ ఏ మాత్రము తెలియదు. అందుకే వారిని తుచ్ఛ బుద్ధి గలవారని అంటారు. మీరు కూడా తుచ్ఛ బుద్ధి గలవారిగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు రచయిత-రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయించారు. పేదవారు, సాధారణంగా ఉండే మీకు అంతా తెలుసు. మీరు స్వచ్ఛమైన బుద్ధి గలవారు. స్వచ్ఛమైనవారని పవిత్రులను అంటారు. అపవిత్రులుగా ఉన్నవారిని తుచ్చ బుద్ధి గలవారని అంటారు. మీరు ఎలా అవుతున్నారో చూడండి! పాఠశాలలో కూడా చదువు ద్వారా ఉన్నత పదవి పొందవచ్చు. మీ చదువు అత్యంత ఉన్నతమైనది. దాని ద్వారా మీరు రాజు పదవిని పొందుతారు. వారౖేెతే దాన-పుణ్యాలు చేసినందున రాజుల వద్ద జన్మిస్తారు, తర్వాత రాజులుగా అవుతారు. కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు. పిల్లలైన మీకు నేను రాజయోగమును నేర్పిస్తున్నానని ఆ తండ్రే స్వయంగా చెప్తున్నారు. ఒక్క తండ్రి తప్ప రాజయోగమును ఇతరులెవ్వరూ నేర్పించలేరు. తండ్రి మాత్రమే మీకు రాజయోగ చదువును చదివిస్తారు. తర్వాత మీరు ఇతరులకు అర్థము చేయిస్తారు. మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఆ తండ్రి రాజయోగమును నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారు, చక్రమును తెలుసుకున్నందున సత్యయుగములో చక్రవర్తి రాజులుగా అవుతారు. దీనిని అర్థము చేయించడం చాలా సులభము. ఇప్పుడు దేవతా ధర్మానికి చెందినవారు ఒక్కరు కూడా లేరు. అందరూ ఇతర ధర్మాలలోకి మారిపోయారు. ఎవరికైనా మీరు అర్థము చేయించునప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వండి. ఇతర ధర్మాలలోకి ఎంతమంది వెళ్లిపోయారో తండ్రి అర్థము చేయిస్తారు. బౌద్ధులు, ముస్లిమ్‌లు మొదలైనవారిగా చాలా మంది బదిలీ అయినారు. ఖడ్గము బలానికి భయపడి ముస్లింలుగా బదిలీ అయ్యారు. బౌద్ధులుగా కూడా చాలామంది అయ్యారు. ఒక్కసారి ఉపన్యసించినందున వేలాది మంది బౌద్ధులుగా అయిపోయారు. క్రైస్తవులు కూడా వచ్చి ఇలా ఉపన్యసిస్తూ ఉంటారు. ఇప్పట్లో అందరికంటే ఎక్కువ జనాభా వారిదే. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే తండ్రి మిమ్ములను స్వదర్శన చక్రధారులని అంటారు. స్వదర్శన చక్రమును విష్ణువుకు చూపిస్తారు. విష్ణువుకు ఎందుకు ఇచ్చారో మనుష్యులకు తెలియదు. స్వదర్శన చక్రధారుడని కృష్ణుని అంటారా? లేక నారాయణుని అంటారా? వారిరువురికి గల సంబంధమును కూడా అర్థము చేయించాలి. ఈ ముగ్గురూ(బ్రాహ్మణులు, కృష్ణుడు, నారాయణుడు) ఒక్కరే. వాస్తవానికి ఈ స్వదర్శన చక్రము బ్రాహ్మణులైన మీ కొరకే. జ్ఞానము ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. అంతేగాని స్వదర్శన చక్రము సంహరించేందుకు, తెగవేయుటకు కాదు. ఇవన్నీ జ్ఞానమునకు సంబంధించిన విషయాలు. మీలో ఎంతగా ఈ జ్ఞాన చక్రము తిరుగుతుందో, అంతగా మీ పాపాలు భస్మమవుతాయి. అంతేగాని తలలు తెగవేసే మాటే లేదు. చక్రము హింసించేది కాదు. ఈ చక్రము మిమ్ములను అహింసకులుగా చేస్తుంది. ఎక్కడి విషయము ఎక్కడికి తీసుకెళ్లారు! తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు.

మధురాతి మధురమైన పిల్లలైన మీకు అపారమైన సంతోషము కలుగుతుంది. మనమంతా ఆత్మలమని మీరు ఇప్పుడు అర్థము చేసుకున్నారు. మొదట మీరు స్వయాన్ని ఆత్మ అని కూడా మర్చిపోయినందున ఇంటిని కూడా మర్చిపోయారు. ఆత్మను ఎప్పుడైనా ఆత్మ అనే అంటారు. కానీ పరమాత్మను రాయి-రప్పలో ఉన్నారని అనేశారు. ఆత్మల తండ్రిని ఎంతగా గ్లాని చేశారు! కానీ ఆ తండ్రే వచ్చి ఆత్మలకు జ్ఞానము ఇస్తున్నారు. ఆత్మ రాయి-రప్పలలో, కణ-కణములో ఉందని ఎప్పుడూ అనరు. జంతువుల విషయమైతే వేరు. చదువు చదువుకోవడం మొదలైనవి మానవులకు మాత్రమే ఉంటాయి. మనము ఇన్ని జన్మలు ఇలా ఇలా అయినామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. 84 జన్మలకు పూర్తి చేశారు. 84 లక్షల జన్మలు కానే కాదు. మానవులు ఎంతో అజ్ఞాన అంధకారములో ఉన్నారు. అందుకే జ్ఞానసూర్యుడు ప్రకటము కాగానే,..... అని అంటారు. అర్ధకల్పము ద్వాపర - కలియుగాలలో అంధకారము, అర్ధకల్పము సత్య-త్రేతా యుగాలలో ప్రకాశము. ఇది పగలు మరియు రాత్రి, ప్రకాశము మరియు అంధకారము. వీటిని తెలిపేదే ఈ జ్ఞానము. ఇవి బేహద్‌ విషయాలు. అంధకారములో అర్ధకల్పము ఎన్నో ఎదురుదెబ్బలు తిని హాని పొందారు, అన్ని వైపుల దిక్కు తోచక చాలా వెతికారు. పాఠశాలలో చదివేవారిని, వెతికేవారని అనరు. సత్సంగాలలో మానవులు ఎంతో వ్యర్థంగా తిరుగుతున్నారు. ఏ సంపాదనా ఉండదు, ఇంకా నష్టపోతూనే ఉంటారు. అందుకే దానిని ' భటక్‌నా (భ్రమించుట) ' అని అంటారు. అలా తిరుగుతూ తిరుగుతూ ధన, ధాన్యములన్నీ పోగొట్టుకొని దరిద్రులైపోయారు. ఇప్పుడు ఈ చదువును ఎంత బాగా ధారణ చేసి చేయిస్తారో అంత లాభమే లాభముంటుంది. బాహ్మ్రణులుగా అయినందున అందులో అంతా లాభమే లాభము. బ్రాహ్మణులైన మనమే స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు కానీ అందులో మీరు ఉన్నతపదవి పొందేందుకు పురుషార్థము చేస్తారు.

ఇప్పుడు మీ అందరిదీ వానప్రస్థ అవస్థ. మీరు స్వయంగా - ''బాబా, మమ్ములను వానప్రస్థములోకి లేక పవిత్ర ప్రపంచములోకి తీసుకెళ్ళండి'' అని అంటారు. అది ఆత్మల ప్రంచము. నిరాకార ప్రపంచము చాలా చిన్నది. ఇక్కడ తిరిగేందుకు విశాలమైన భూమి ఉంది. అక్కడ ఈ విషయమే లేదు, శరీరమూ ఉండదు, పాత్ర కూడా ఉండదు. అక్కడ ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయి. ఇది ప్రాకృతికమైన సృష్టి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలా నిలబడి ఉన్నాయి! ఆత్మలు కూడా బ్రహ్మ తత్వములో స్వాభావికంగా తమ స్వంత ఆధారముతో నిలబడి ఉన్నాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జ్ఞానమును స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రమును త్రిప్పుతూ పాపాలను తొలగించుకోవాలి. డబుల్‌ అహింసకులుగా అవ్వాలి.

2. మీ బుద్ధిని స్వచ్ఛంగా, పవిత్రంగా చేసుకొని రాజయోగ చదువును చదవాలి, ఉన్నత పదవిని పొందాలి. మేము సత్యనారాయణ సత్య-సత్యమైన కథ వింటూ మానవుల నుండి దేవతలుగా అవుతామని హృదయములో సదా సంతోషముండాలి.

వరదానము :-

'' ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖమును అనుభవం చేసే నిస్వార్థ సేవాధారీ భవ ''

సత్యయుగంలో, సంగమ యుగములోని కర్మల ఫలము లభిస్తుంది. కానీ ఇక్కడ తండ్రివారిగా అయినందున ప్రత్యక్ష ఫలము వారసత్వ రూపంలో లభిస్తుంది. సేవ చేస్తారు, సేవ చేసిన వెంటనే సంతోషము లభిస్తుంది. ఎవరైతే స్మృతిలో ఉండి నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారి సేవకు ప్రత్యక్ష ఫలము తప్పకుండా లభిస్తుంది. ప్రత్యక్ష ఫలమే తాజా ఫలము. ఈ ఫలము సదా ఆరోగ్యవంతంగా చేస్తుంది. యోగయుక్తమైన యథార్ధమైన సేవకు ఫలము - సంతోషము, అతీంద్రియ సుఖము మరియు డబల్‌ లైట్‌గా ఉండు అనుభూతి.

స్లోగన్‌ :-

''ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశాన్ని మెరుపును అనుభవం చేస్తారో, వారే విశేషమైన ఆత్మలు.''