22-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - బ్రాహ్మణులైన మేము సర్వోత్తమైనవారము, పురుషోత్తములుగా తయారవుతున్నామని సదా గుర్తుంచుకుంటే హర్షితంగా ఉంటారు. మీతో మీరు మాట్లాడడం నేర్చుకుంటే అపారమైన సంతోషముంటుంది''
ప్రశ్న :-
తండ్రి శరణు(ఆశ్రయము)లోకి ఎవరు రాగలరు? తండ్రి ఎవరికి ఆశ్రయమిస్తారు?
జవాబు :-
పూర్తి నిర్మోహులుగా ఉన్నవారే తండ్రి శరణులోకి రాగలరు. వారి బుద్ధియోగము అన్నివైపుల నుండి తెగిపోయి ఉండాలి. బంధు-మిత్రులు మొదలైనవారి వైపు బుద్ధి ఆకర్షింపబడరాదు. '' నాకు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు '' అని బుద్ధిలో ఉండాలి. ఇటువంటి పిల్లలే సర్వీస్ చెయ్యగలరు. ఇటువంటి పిల్లలకే తండ్రి శరణునిస్తారు.
ఓంశాంతి.
వీరు ఆత్మిక తండ్రి, టీచరు, గురువు. ప్రపంచములోని వారికి ఈ విషయాలు తెలియవని పిల్లలు బాగా అర్థము చేసుకున్నారు. సన్యాసులు శివోహమ్ అని అంటారు. కాని మేము తండ్రి, టీచరు, గురువని చెప్పుకోరు. వారు కేవలం శివోహం అని, తత్త్వం అని అంటారు. పరమాత్మ సర్వవ్యాపి అయితే ప్రతి ఒక్కరూ తండ్రి, టీచరు, గురువుగా అయిపోవాలి. కాని అలా ఎవ్వరూ భావించడం కూడా లేదు. మనుష్యులు స్వయాన్ని భగవంతుడు పరమాత్మ అని పిలిపించుకోవడం పూర్తిగా తప్పు. తండ్రి తెలిపే విషయాలు పిల్లల బుద్ధిలో ధారణ అవుతాయి కదా. అక్కడ ఆ చదువులో చాలా సబ్జక్టులుంటాయి. అన్ని సబ్జక్టులు బుద్ధిలో ఉండవు. ఇక్కడ తండ్రి చదివించే విషయాలు ఒక్క సెకండులో పిల్లల బుద్ధిలోకి వచ్చేస్తాయి. మీరు రచయిత-రచనల ఆది-మధ్య-అంత్యముల జ్ఞానమును వినిపిస్తారు. మీరే త్రికాలదర్శులుగా లేక స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఆ భౌతిక చదువులోని సబ్జక్టులు పూర్తి వేరుగా ఉంటాయి. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియేనని మీరు నిరూపించి అర్థం చేయిస్తారు. ఆత్మలందరూ పరమాత్మనే స్మృతి చేస్తారు. ఓ గాడ్ఫాదర్ అని అంటారు. కనుక తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభించి ఉంటుంది. ఆ వారసత్వాన్ని పోగొట్టుకున్నందున దు:ఖములోకి వచ్చేస్తారు. ఇది సుఖ-దు:ఖాల ఆట. ఈ సమయములో అందరూ పతితులుగా, దు:ఖితులుగా ఉన్నారు. పవిత్రమవుతే తప్పకుండా సుఖము లభిస్తుంది. తండ్రి సుఖ ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రేనని, ఆ తండ్రే మాకు అర్థం చేయిస్తున్నారని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. సృష్టి ఆది-మధ్య-అంత్య జ్ఞానములను ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇతర ధర్మములన్నీ ఏవైతే స్థాపనయ్యాయో అవన్నీ తమ-తమ సమయాలలో వస్తాయి. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు. తండ్రి ఈ చదువును పిల్లలైన మీకు చాలా సులభము చేశారు. కేవలం కొంచెం విస్తారంగా అర్థము చేయిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. యోగానికి చాలా మహిమ ఉంది. ప్రాచీన భారతదేశ యోగము మహిమ చేయబడింది. అయితే ఆ యోగము ద్వారా ఏ లాభము జరిగిందో ఎవ్వరికీ తెలియదు. నిరాకార భగవానుడు నేర్పించే ఈ యోగమే గీతలోని యోగము. మిగిలినవన్నీ మనుష్యులు నేర్పిస్తారు, దేవతల వద్ద యోగమనే మాటే లేదు. ఈ హఠయోగము మొదలైనవన్నీ మనుష్యులు నేర్పిస్తారు. దేవతలు నేర్చుకోరు, ఎవ్వరికీ నేర్పించరు. దైవీ ప్రపంచములో యోగమను మాట ఉండదు. యోగము ద్వారా అందరూ పావనమైపోతారు. అలా పావనంగా ఇక్కడే తయారవుతారు. తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు సంగమయుగములో వస్తారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి బదిలీ అవుతున్నారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం కూడా అద్భుతము. బ్రాహ్మణులైన మనము సర్వోత్తమమైనవారము. సత్యయుగము కలియుగముల మధ్య సర్వోత్తమ బ్రాహ్మణులుంటారు. దీనినే సంగమ యుగమని అంటారు. ఈ యుగములో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. మనము పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లల బుద్ధిలో ఉంటే సదా హర్షితంగా ఉంటారు. ఎంత సేవ చేస్తారో అంత హర్షితంగా ఉంటారు. సంపాదించాలి, ఇతరులచే చేయించాలి. ప్రదర్శినీలో ఎంత సేవ చేస్తారో అంత వినేవారికి కూడా సుఖము లభిస్తుంది. మీ కళ్యాణము జరుగుతుంది, ఇతరుల కళ్యాణము కూడా జరుగుతుంది. చిన్న సేవకేంద్రాలలో కూడా 5-6 ముఖ్యమైన చిత్రాలుండాలి. చిత్రాల ద్వారా అర్థము చేయించడం సులభము. రోజంతా సర్వీసే సర్వీసు చేయండి. బంధు-మిత్రుల వైపు ఎలాంటి ఆకర్షణ ఉండరాదు. ఈ కనులతో చూచేదంతా వినాశనమవుతుంది. పోతే దివ్యదృష్టి ద్వారా ఏదైతే చూస్తున్నారో అది స్థాపనవుతూ ఉంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటే మీరు పక్కా అయిపోతారు. అనంతమైన తండ్రిని కలుస్తున్నామనే సంతోషం ఉండాలి. ఎవరైనా రాజుల వద్ద జన్మ తీసుకుంటే వారికెంత నషా ఉంటుంది! పిల్లలైన మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కొరకు కృషి చేస్తున్నారు. కామచితి పై కూర్చుని మీరు నల్లగా(అపవిత్రమై) అయిపోయారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానచితి పై కూర్చుంటే తెల్లగా(పవిత్రంగా) అయిపోతారు. బుద్ధిలో ఇదే చింతన జరుగుతూ ఉండాలి. భలే ఆఫీసులో పని చేస్తున్నా, స్మృతి చేస్తూ ఉండండి. తీరిక లేదని అనరాదు. ఎంత తీరిక దొరికితే అంత ఆత్మిక సంపాదన చెయ్యండి. ఇది చాలా గొప్ప సంపాదన. ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ ఒకేసారి లభిస్తాయి. అర్జునుడు, ఆటవికుడు(ఏకలవ్యడు/భీల్) గురించి ఒక కథ ఉంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ జ్ఞాన-యోగాలలో, లోపల ఉండు వారి కంటే తీక్షణముగా ముందుకు వెళ్లగలరు. అంతా స్మృతి పై ఆధారపడి ఉంది. ఇక్కడ అందరూ వచ్చి కూర్చుండిపోతే సేవ ఎలా చేస్తారు? రిఫ్రెష్ అయ్యి సేవలో లగ్నమైపోవాలి. సేవ పై గమనముంచాలి. బాబా అయితే ప్రదర్శినికి వెళ్లలేరు. ఎందుకంటే బాప్దాదా ఇరువురూ కలిసే ఉన్నారు. బాబా ఆత్మ మరియు ఇతని ఆత్మ రెండూ కలిసి ఉన్నాయి. వీరిది అద్భుతమైన జంట(యుగల్). ఈ జంటను గురించి పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. స్వయాన్ని యుగల్ అని కూడా భావిస్తారు. అయితే నేను ఒక్కరినే బాబాకు అపురూపమైన బిడ్డను అని భావిస్తారు. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూచి చాలా సంతోషమవుతుంది. ఇది నా మరుసటి జన్మ. నేను తప్పకుండా సింహాసనము పై కూర్చుంటాను. మీరు కూడా రాజయోగము నేర్చుకుంటున్నారు. లక్ష్యము - ఉద్ధేశ్యము మీ ముందే ఉంది. నేను బాబాకు అపురూపమైన పుత్రుడనని ఇతను సంతోషపడ్తూ ఉంటాడు. అయినా స్మృతి సదా నిలువదు. ఆలోచనలు వేరే వేరే వైపుకు వెళ్తూ ఉంటాయి. ఒక్కసారే పూర్తిగా స్మృతి నిలిచిపోయి(స్థిరపడి) ఏ ఇతర ఆలోచనలు రాకుండా ఉండు నియమము డ్రామాలో లేదు. మాయ తుఫానులు స్మృతి చెయ్యనివ్వవు. నాకు(బ్రహ్మ) చాలా సులభమని తెలుసు. ఎందుకంటే నా శరీరములో బాబా ప్రవేశించి ఉన్నారు. నేను బాబాకు నంబర్వన్ అపురూపమైన పుత్రుడను. మొదటి నంబరు రాకుమారునిగా అవుతాను. అయినా స్మృతి మర్చిపోతూ ఉంటాను. అనేక విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది మాయ. ఈ బాబాకు అనుభవమైనప్పుడే, పిల్లలైన మీకు అర్థము చేయించగలడు. కర్మాతీత అవస్థ వచ్చినప్పుడు ఈ ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఆత్మ సంపూర్ణమైపోతే ఈ శరీరము ఉండదు. శివబాబా అయితే సదా పవిత్రులే. పతిత ప్రపంచము మరియు పతిత శరీరములోకి వచ్చి పావనంగా చేసే పాత్ర కూడా వీరిదే. డ్రామాలో బంధింపబడి ఉన్నాడు. మీరు పావనమైతే మీకు కొత్త శరీరము కావాలి. శివబాబాకు తన శరీరమైతే లేదు. ఈ శరీరములో ఈ ఆత్మకు మహిమ ఉంది. వారిదేముంది? మురళి చెప్పి వెళ్లిపోతారు, ఫ్రీగా ఉంటారు. ఎప్పుడు ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లిపోతారు. శివబాబా మురళి నడిపిస్తున్నారని పిల్లలకు అనుభవమవుతుంది(తెలుస్తుంది). తండ్రికి సహాయము చేసేందుకు ఈశ్వరీయ సేవ చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. నేను కూడా నా స్వీట్హోం(మధురమైన ఇంటిని) వదిలి వచ్చానని తండ్రి చెప్తున్నారు. పరంధామమనగా అత్యంత పైన ఉన్న ధామము - మూలవతనము. కాని డ్రామా అంతా సృష్టి పై జరుగుతుంది. ఇది అద్భుతమైన డ్రామా(ఆట) అని మీకు తెలుసు. అయితే ప్రపంచమేమో ఒక్కటే.
వారు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సైన్సు బలము. సైలెన్స్ బలముతో మనము సైన్సు పై విజయము పొందినప్పుడు సైన్సు కూడా సుఖమునిచ్చేది(సుఖధామం)గా అవుతుంది. ఇక్కడ సైన్సు సుఖమూ ఇస్తుంది, దు:ఖమూ ఇస్తుంది. అక్కడ సుఖమే సుఖముంటుంది. దు:ఖము అను పేరే ఉండదు. ఇటువంటి విషయాలు రోజంతా బుద్ధిలో ఉండాలి. బంధనములో ఉన్న మాతలు విషమును గురించి ఎన్నో దెబ్బలు తింటూ ఉంటారని బాబాకు చాలా ఆలోచనలు నడుస్తుంటాయి. కొంతమంది మళ్లీ మోహ వశమై ఇరుక్కుపోతారు. నిశ్చయ బుద్ధి గలవారు వెంటనే మేము అమృతము త్రాగాలని అంటారు. ఇందులో నిర్మోహులుగా ఉండాలి. పాత ప్రపంచము నుండి మనసు విరిగిపోవాలి. ఇటువంటి సేవాధారులే బాబా హృదయాన్ని అధిరోహించగలరు. అటువంటివారికి ఆశ్రయమివ్వవచ్చు. కన్య పతి ఆశ్రయములోకి వెళ్తుంది. విషము లేకుండా పతి తన వద్ద ఉంచుకోడు. అప్పుడు తండ్రి శరణులోకి రావలసి వస్తుంది. కాని పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. పతులకు పతి లభించారు. ఇప్పుడు వారితో మనము బుద్ధియోగముతో నిశ్చితార్థము జరుపుకుంటాము. నాకు ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఎలాగైతే కన్య ప్రీతి తన పతితో తగుల్కుంటుందో, అలా ఆత్మల ప్రీతి పరమాత్మతో ఏర్పడ్తుంది. ఆ పతితో దు:ఖము లభిస్తుంది. ఈ పతితో సుఖము లభిస్తుంది. ఇది సంగమ యుగము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు ఎంత సంతోషముండాలి - మనకు నావికుడు లేక తోటమాలి లభించారు. వారు నన్ను పూలతోటలోకి తీసుకెళ్తారని సంతోషముండాలి. ఈ సమయములో మనుష్యులందరూ ముళ్ల వలె తయారై ఉన్నారు. అన్నిటికంటే పెద్ద ముల్లు కామ వికారము. మొదట మీరు నిర్వికార పుష్పాలుగా ఉండేవారు. మెల్ల మెల్లగా కళలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెద్ద ముళ్లుగా అయిపోయారు. బాబాను బబుల్నాథ్ అని కూడా అంటారు. వారి అసలు పేరు శివుడని మీకు తెలుసు. ముళ్లను పుష్పాలుగా చేస్తారు కనుక వారిని బబుల్నాథ్ అని పిలుస్తారు. భక్తిమార్గములో చాలా పేర్లు ఉంచుతారు. వాస్తవానికి వారి పేరు శివుడు ఒక్కటే. రుద్ర జ్ఞాన యజ్ఞమన్నా లేక శివజ్ఞాన యజ్ఞమన్నా ఒక్కటే. రుద్ర యజ్ఞము ద్వారా వినాశ జ్వాల వెలువడింది, శ్రీ కృష్ణపురి లేక ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. మీరు ఈ యజ్ఞము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలు కూడా అద్భుతమైనవి తయారు చేస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. నిశ్చయంగా బ్రహ్మ-సరస్వతులే, లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణులే 84 జన్మల తర్వాత బ్రహ్మ-సరస్వతులుగా అవుతారు. మనుష్యులైతే ఇటువంటి మాటలు విని ఆశ్చర్యపడ్తారు. సంతోషిస్తూ కూడా ఉంటారు. కాని మాయ తక్కువైనది కాదు. కామము మహాశత్రువు. మాయ నామ-రూపాలలో ఇరికించి క్రిందపడేస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు. తర్వాత ఆ సంతోషము తగ్గిపోతుంది. మేము చాలామందికి అర్థం చేయిస్తున్నామని సంతోషపడరాదు. మొదట బాబాను ఎంత సమయము స్మృతి చేస్తున్నాను? రాత్రి పూట తండ్రిని స్మృతి చేసి పడుకుంటున్నానా? లేక మర్చిపోతున్నానా? అని పరిశీలించుకోవాలి. కొంతమంది పిల్లలు పక్కా ధర్మానిష్ఠాపరులు(నేమీలు) కూడా ఉన్నారు.
పిల్లలైన మీరు చాలా అదృష్టవంతులు. తండ్రి పై చాలా భారముంది. అయినా రథానికి కొంత మినహాయింపు లభిస్తుంది. జ్ఞాన-యోగాలు కూడా చేస్తున్నారు. అవి లేకుండా లక్ష్మీనారాయణ పదవి ఎలా పొందగలరు. నేను తండ్రికి ఏకైక పుత్రుడనని సంతోషమూ ఉంటుంది, నాకు అనేకమంది పిల్లలున్నారనే నషా కూడా ఉంటుంది. మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది. పిల్లలకు కూడా మాయ విఘ్నాలు వస్తూ ఉంటాయి. పోను పోను కర్మాతీత అవస్థ వస్తుంది. ఈ శరీరములో బాప్దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలూ! అని అంటారు. తండ్రి అయితే ప్రేమసాగరులు. ఇతని ఆత్మ తండ్రి ఆత్మతో కలిసి ఉంది. ఇతడు కూడా పిల్లలను ప్రేమిస్తాడు. నేనెటువంటి కర్మలు చేస్తానో నన్ను చూచి ఇతరులు కూడా చేస్తారని భావిస్తాడు. చాలా మధురంగా ఉండాలి. పిల్లలు చాలా వివేకవంతులుగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణులలో ఎంత వివేకముందో చూడండి. వివేకముతో విశ్వ రాజ్యము తీసుకున్నారు. ప్రదర్శినీ ద్వారా చాలామంది ప్రజలు తయారవుతారు. భారతదేశము చాలా పెద్దది, చాలా సర్వీసు చెయ్యాలి. స్మృతిలో ఉండి వికర్మలు కూడా వినాశనము చేసుకోవాలి. ఇది చాలా పెద్ద చింత మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి? ఇందులో శ్రమ ఉంది. సేవ చేసేందుకు చాలా అవకాశాలున్నాయి. రైలులో బ్యాడ్జి పై సేవ చేయవచ్చు. వీరు బాబా, ఇది వారిచ్చు వారసత్వము అని అర్థం చేయించవచ్చు. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. వారి రాజ్యము మళ్లీ తప్పకుండా వస్తుంది. మేము బాబా స్మృతి ద్వారా పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాము. రైలులో చాలా సర్వీసు జరుగుతుంది. ఒక పెట్టెలో సేవ చేసి మరో పెట్టెలోకి వెళ్లాలి. ఇలా సేవ చేసేవారే హృదయమును అధిరోహించగలరు. మీకు సంతోషకరమైన వార్త చెప్తామని వారికి చెప్పండి. మీరు పూజ్య దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పూజ్యులుగా అవ్వండి. మెట్ల చిత్రము బాగుంది. ఈ చిత్రము ద్వారా సతో, రజో, తమో స్థితులను నిరూపించాలి. పాఠశాలలో చివర్లో గ్యాలప్ చేసేందుకు ఆసక్తి వస్తుంది. ఇక్కడ కూడా సమయాన్ని వృథా చేసినవారికి గ్యాలప్ చేసి సేవలో లగ్నమైపోవాలని తెలిపించబడ్తుంది. సేవ చేసేందుకు అవకాశము చాలా ఉంది. బాబా ఎక్కడైనా పంపుటకు సేవాధారి పిల్లలు చాలామంది రావాలి. మందిరాలలో సేవ బాగా జరుగుతుంది. దేవతా ధర్మానికి చెందినవారు వెంటనే అర్థము చేసుకుంటారు. గంగా నదీ తీరములో కూడా మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ హృదయానికి తప్పకుండా తగుల్కుంటుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సదా హర్షితంగా ఉండేందుకు ఆత్మిక సేవ చెయ్యాలి, సత్యమైన సంపాదన చెయ్యాలి, ఇతరులతో చేయించాలి. మీ కళ్యాణముతో పాటు ఇతరుల కళ్యాణము కూడా చెయ్యాలి. రైలులో కూడా బ్యాడ్జి ద్వారా సేవ చేయాలి.
2. పాత ప్రపంచాన్ని హృదయము నుండి తొలగించి వేయాలి. నిర్మోహులుగా అవ్వాలి. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతినుంచాలి.
వరదానము :-
''కర్మ మరియు యోగాల బ్యాలన్స్ ద్వారా ఆశీర్వాదాలను అనుభవం చేసే కర్మయోగీ భవ''
కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి. కర్మయోగీ ఆత్మలు సదా కర్మతో పాటు యోగము చేస్తారు అనగా బ్యాలన్స్ ఉంచేవారిగా ఉంటారు. కర్మ మరియు యోగముల బ్యాలన్స్ ఉండుట వలన ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్(ఆశీర్వాదము) లభిస్తూనే ఉంటుంది. అంతేకాక ఎవరి సంబంధ - సంపర్కములోకి వస్తారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మంచి పనులు చేస్తే వారి కొరకు, ఇతరుల హృదయము నుండి వీరు చాలా మంచివారని ఆశీర్వాదాలు వెలువడ్తాయి. చాలా మంచివారు అని అంగీకరించడమే ఆశీర్వాదాలు.
స్లోగన్ :-
''ఒక్క సెకండులో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థకు సమీపంగా తీసుకొస్తుంది''