05-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మతో మాట్లాడండి, ఈ విధమైన దృష్టిని పక్కా చేసుకుంటేే భూతాలు(వికారాలు) ప్రవేశించవు, ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాలున్నట్లు గమనిస్తే వారి నుండి మీరు దూరంగా వెళ్లిపోండి.''

ప్రశ్న :-

తండ్రి వారిగా అయిన తర్వాత కూడా ఆస్తిక పిల్లలు మరియు నాస్తిక పిల్లలుగా ఉన్నారు ఎలా?

జవాబు :-

1. ఆస్తికులనగా ఈశ్వరీయ నియమాలను పాలన చేయువారు. దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము చేస్తారు. నాస్తికులనగా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరము కొట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ ఉంటారు. 2. ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధియోగమును తొలగించి పరస్పరము భాయి-భాయిగా సోదరులుగా భావిస్తారు. నాస్తికులు దేహాభిమానములో ఉంటారు.

ఓంశాంతి.

మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - ఓ పిల్లలారా! బుద్ధిలో సదా శివబాబా, మాకు సుప్రీమ్‌ తండ్రి, సుప్రీమ్‌ శిక్షకుడు మరియు సుప్రీమ్‌ సద్గురువు కూడా అయినారని గుర్తుంచుకోండి. మొట్టమొదట ఇది బుద్ధిలో తప్పకుండా రావాలి. మా బుద్ధిలో ఈ విషయము స్ఫురించిందా లేదా? అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమకు తాము తెలుసుకోగలరు. ఈ విషయము ఎవరి బుద్ధిలో గుర్తు ఉంటుందో వారు ఆస్తికులు, లేనివారు నాస్తికులు. టీచరు వచ్చారని తక్షణమే విద్యార్థుల బుద్ధిలోకి రావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఈ విషయము మర్చిపోతారు. మా పరమపిత వచ్చారనే ఆత్మిక నషాతో అతికష్టంగా కొంతమంది మాత్రమే గ్రహించగలరు. వారు టీచరే కాక వాపస్‌ తీసుకు వెళ్ళే సద్గురువు కూడా అయినారు. ఇది గుర్తు రాగానే ఖుషీ పాదరస మీటరు పైకెక్కుతుంది. గుర్తు రాకుంటే దు:ఖపూరిత బాధాకరమైన ప్రపంచములోని ఛీ-ఛీ విషయాలలో రకరకాల ఆలోచనలలో మునిగి ఉంటారు. రెండవ విషయము వినాశనానికి ఇంకా ఎంత సమయముంది? అని పిల్లలను చాలామంది అడుగుతారు. ఇది ప్రశ్నించదగ్గ విషయము కాదని వారికి చెప్పండి. మొట్టమొదట దీనిని గురించి మాకు ఎవరు అర్థము చేయించారో వారిని గురించి తెలుసుకోండి. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అలవాటై ఉంటే అర్థము చేయిస్తారు. లేకపోతే మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడండి అని తండ్రి ఎంతగా చెప్తున్నారు! కాని ఆ దృష్టి ఇప్పటికీ నిలవడం లేదు. రూపాయిలో ఒక అణా వంతు కూడా అతికష్టము మీద కూర్చుంటుంది. బుద్ధిలో నిలబడినట్లే ఉండదు. ఈ విధంగా తండ్రేమీ శపించడము లేదు. జ్ఞానము చాలా ఉన్నతమైనదని తండ్రి అర్థము చేయిస్తారు. రాజధాని స్థాపన అవుతుంది. పేదవారి నుండి గొప్పవారి వరకు ఇక్కడే తయారవుతారు. రాజులుగా కొద్దిమంది మాత్రమే తయారవుతారు. ఇక ప్రజలలో నంబరువారుగా ఉంటారు. కనిష్ఠ నెంబరు(లాస్ట్‌) తీసుకొనువారి బుద్ధిలో ఎప్పుడూ ఏ విషయమూ కూర్చోదు. కనుక ఎవరికైనా అర్థము చేయించునప్పుడు మొదట శివబాబాగారి 32 గుణాలు కలిగిన చిత్రము పై అర్థము చేయించాలి. అందులో కూడా సుప్రీమ్‌ ఫాదర్‌, సుప్రీమ్‌ టీచర్‌, సద్గురువు(పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు) అని వ్రాయబడి ఉంది.

ఇక్కడ అర్థము చేయించేవారు సుప్రీమ్‌ ఫాదర్‌ అని నిశ్చయము కలిగితే వారు సంశయాలు ఉత్పన్నము చేయరు. తండ్రి తప్ప ఈ స్థాపనా కార్యము ఇంకెవ్వరూ చేయలేరు. ఇక్కడ స్థాపన జరుగుతోందని మీరు ఇతరులకు అర్థము చేయించినప్పుడు వీరికి అర్థము చేయించేవారు ఎవరో ఉన్నారని వారి బుద్ధిలోనికి తప్పకుండా రావాలి. రాజ్యస్థాపన జరుగుతూ ఉందని ఏ మనుష్యమాత్రులు చెప్పలేరు. అందువలన మొట్టమొదట తండ్రి పట్ల నిశ్చయము పక్కా చేయించాలి - మమ్ములను చదివించువారు తండ్రైన పరమాత్మ, ఇది ఏ మనుష్య మతము కాదు, ఈశ్వరీయ మతము. క్రొత్త ప్రపంచమైతే తప్పకుండా తండ్రి ద్వారానే స్థాపన అవుతుంది. పాత ప్రపంచ వినాశనము చేయించడం కూడా తండ్రి కర్తవ్యమే. ఈ నిశ్చయము కలగనంతవరకు అదెలా జరుగుతుందని వారు ప్రశ్నిస్తూనే ఉంటారు. కావున మొట్టమొదట శ్రీమతమును గురించి బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. అప్పుడే వారు మనము తర్వాత చెప్పబోయే అంశాలను అర్థము చేసుకుంటారు. అలా కానిచో ఇది మనుష్య మతమని భావిస్తారు. ప్రతి మనిషి మతము వేరు వేరుగా ఉంటుంది. మనుష్యుల మతము ఒక్కటిగా ఉండజాలదు. ఈ సమయములో మీకు మతమును ఇచ్చేవారు ఒక్కరే. వారి శ్రీమతము పై నియమానుసారము నడవడం కూడా చాలా కష్టము. దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మనము ఆత్మలము సోదర ఆత్మతో మాట్లాడుతున్నామని భావించినట్లైతే, ఏ విధమైన కొట్లాటలు, పోట్లాటలు జరగవు. దేహాభిమానములోకి వచ్చారంటే వారు నాస్తికులని భావించండి. దేహీ-అభిమానులుగా కాలేదంటే వారు నాస్తికులు. దేహీ-అభిమానులుగా అయ్యారంటే వారు ఆస్తికులని భావించండి. దేహాభిమానము చాలా నష్టమును కలుగజేస్తుంది. కొద్దిగానైనా కొట్లాడుతూ, పోట్లాడుతూ ఉన్నారంటే వారిని నాస్తికులని భావించండి. తండ్రిని గురించి తెలియనే తెలియదు. క్రోధ భూతముంటే వారు నాస్తికులని అర్థము. తండ్రి పిల్లలలో భూతాలు ఎక్కడి నుండి వచ్చాయి? అలాంటివారు ఆస్తికులు కారు. మాకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది అని వారు ఎంత చెప్పినా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా మాట్లాడినట్లైతే వారిని రావణ సంప్రదాయానికి చెందినవారని భావించాలి. దేహాభిమానములో ఉంటారు. ఎవరిలోనైనా భూతముందని గమనించినా లేదా ఎవరి దృష్టి అయినా చెడుగా ఉన్నట్లు గమనించితే వారి నుండి దూరంగా వెళ్లిపోవాలి. భూతము ఎదుట నిలబడితే మీలో కూడా భూత ప్రవేశము జరుగుతుంది. భూతము భూతముతో కొట్లాడుతుంది. భూతము వచ్చిందంటే పూర్తి నాస్తికులని అర్థము, దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉంటారు. గుణాలు లేనివారు నాస్తికులు. నాస్తికులు వారసత్వాన్ని కొద్దిగా కూడా తీసుకోలేరు. ఏ మాత్రము లోపముండరాదు. అలా కానిచో చాలా శిక్షలు అనుభవించి ప్రజలలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. భూతాల నుండి దూరంగా ఉండాలి. భూతమును ఎదుర్కుంటే ఆ భూతము మీలోకి వచ్చేస్తుంది. అందువల్ల భూతాన్ని ఎప్పుడూ ఎదుర్కోరాదు. వారితో ఎక్కువగా మాటలు కూడా మాట్లాడరాదు. తండ్రి చెప్తున్నారు - ఇది భూతాల ప్రపంచము. భూతాలు తొలగిపోనంత వరకు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పదవిని కూడా పొందలేరు. యుద్ధమైతే ఒక్కటే, కొందరు రాజులుగా అవుతారు, మరికొందరు ప్రజలైపోతారు. రాజుల ప్రపంచముండేది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య ప్రపంచము (ప్రజల పై ప్రజలు రాజ్యము చేయుట). అందరిలో ఇప్పుడు భూతాలున్నాయి. భూతాలను తొలగించేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. బాబా మురళిలో చాలా అర్థము చేయిస్తూ ఉంటారు. రకరకాల స్వభావము కలిగినవారు ఉంటారు. దానిని గురించి వర్ణించనలవి కాదు.

కనుక ప్రదర్శిని మొదలైనవాటిలో మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. తండ్రి ఎంత ప్రియమైనవారు! వారు మనలను ఈ విధమైన దేవతలుగా(లక్ష్మీనారాయణులుగా) తయారు చేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయువారి మహిమ వర్ణించలేము.....(మనుష్య్‌ సే దేవతా కియే కరత్‌ నా లాగీ వార్‌.....) అని గాయనము కూడా ఉంది. సత్యయుగములో దేవతలు ఉండేవారు అంటే తప్పకుండా సత్యయుగము కంటే ముందు కలియుగముండేది. ఈ సృష్టి చక్ర జ్ఞానము కూడా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అక్కడ ఈ జ్ఞానము దేవతలలో ఉండదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్‌ఫుల్‌(జ్ఞాన సంపన్నులు)గా అవుతారు. తర్వాత పదవి లభిస్తుంది. అప్పుడు జ్ఞానము అవసరమే లేదు. వీరు అనంతమైన తండ్రి, వీరి నుండి 21తరాలు మీకు స్వర్గ వారసత్వము లభిస్తుంది. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. శివబాబాయే మాకు అర్థము చేయిస్తున్నారని సదా భావించమని బాబా(బ్రహ్మాబాబా) ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటారు. శివబాబా ఈ రథము ద్వారా మనలను చదివిస్తున్నారు. వారు మనకు తండ్రి, టీచరు, గురువు. ఇది అనంతమైన చదువు. ఇంతకు ముందు మీరు తుచ్చ బుద్ధి గలవారిగా ఉండేవారని మీకు తెలుసు. ఈ కాలేజీని గురించి ఎవ్వరికీ కొంచెము కూడా తెలియదు. అందువల్ల ఇతరులకు అర్థము చేయించే సమయములో మంచి రీతిలో వారి మనస్సుకు పట్టునట్లు నూరి, నూరిపోయాలి. కృష్ణుని గురించిన మాటే లేదు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - కృష్ణునికి ఎలాంటి చరిత్ర(గొప్పతనము) లేదు. చరిత్ర అంతా శివబాబాదే. బ్రహ్మ-విష్ణు-శంకరులకు కూడా చరిత్ర లేదు. ఉన్న చరిత్ర మనుష్యులను దేవతలుగా తయారు చేసే ఒక్క శివబాబాదే. వారు విశ్వాన్ని స్వర్గముగా చేస్తారు. మీరు ఆ తండ్రి శ్రీమతమును అనుసరిస్తారు. ఆ తండ్రికి సహాయకారులుగా ఉన్నారు. తండ్రి రాకుంటే మీరు ఏమీ చేయలేరు. పైసాకు కొరగాని వారి నుండి మీరు ఇప్పుడు విలువైనవారిగా తయారౌతున్నారు. ఇప్పుడు నంబరువారు పురుషార్థం అనుసారము మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు. కనుక మొట్టమొదట ముఖ్యమైనది తండ్రి పరిచయము. కృష్ణుడైతే చిన్న బాలుడు. సత్యయుగములో అతనికి అనంతమైన సామ్రాజ్యముంటుంది. వారి రాజ్యములో ఇతరులెవ్వరూ లేరు. ఇప్పుడిది కలియుగము. ఇక్కడ లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. ఈ ఆది సనాతన దేవీదేవతా ధర్మము ఎప్పుడు స్థాపన అయ్యిందో ఎవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారము ఉంది. కనుక మొదట తండ్రి మహిమను గురించి మంచిరీతిగా అర్థము చేయించాలి. తండ్రి ద్వారానే తండ్రి పరిచయము లభించిందని మనకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - సర్వుల సద్గతిదాత కూడా నేనే. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని పిల్లలైన మీకు కల్ప-కల్పము నేను వచ్చి సలహానిస్తాను. అప్పుడు ఆత్మ పతితము నుండి పావనంగా అవుతుంది. ''ఆత్మాభిమాని భవ!'' ఇతరులను కూడా ఆత్మ అని భావించడం ద్వారా మీకు వికారీ దృష్టి ఉండదు. ఆత్మయే శరీరము ద్వారా కర్మ చేస్తుంది. నేను ఆత్మ, వీరు కూడా ఆత్మ - ఇది పక్కా చేసుకోవాలి. మొట్టమొదట మనము నూటికి నూరు శాతము పావనంగా ఉండేవారము, తర్వాత పతితులుగా అయ్యామని మీకు తెలుసు. బాబా! రండి - అని ఆత్మయే పిలుస్తుంది. ఆత్మాభిమానిగా పక్కాగా ఉండాలి. ఇతర సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఆత్మలమైన మనము మధురమైన ఇంటిలో ఉండేవారము. ఇక్కడకు పాత్ర్రను అభినయించేందుకు వచ్చాము. ఇది కూడా పిల్లలైన మీరే అర్థము చేసుకున్నారు. మీలో కూడా ఈ స్మృతి నంబరువారుగా ఉంటుంది. భగవంతుడే చదివిస్తున్నారని ఎంత ఖుషీ ఉండాలి! భగవంతుడు మన తండ్రి, టీచరు మరియు సద్గురువు కూడా అయినారు. మేము వారిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయమని మీరంటారు. తండ్రి చెప్తున్నారు - దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి(మామేకమ్‌ యాద్‌ కరో). మీరందరూ సోదరులు. కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అంగీకరించనివారిని నాస్తికులని భావించండి. మనము శివబాబా పిల్లలము కనుక పావనంగా ఉండాలి. తండ్రిని - ''బాబా, మీరు వచ్చి మమ్ములను పావన విశ్వానికి అధిపతులుగా తయారు చేయండి అని పిలుస్తారు. సత్యయుగములో అయితే పావనంగా అయ్యే విషయమే లేదు. మొదట ఇది అర్థము చేసుకోండి - ''వీరు శివబాబా, వీరి ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది.'' ఒకవేళ వినాశనము ఎప్పుడు జరుగుతుంది? అని ఎవరైనా ప్రశ్నిస్తే, వారికి మొదట అల్ఫ్‌ను(భగవంతుడు, తండ్రి) గురించి అర్థము చేసుకోండి అని చెప్పండి. అల్ఫ్‌ గురించి తెలుసుకోకపోతే ఇక ఆ తర్వాత అర్థము చేయించే అంశాలు వారి బుద్ధిలోకి ఎలా వస్తాయి? మనము సత్యమైన తండ్రి పిల్లలము, సత్యమునే పలుకుతాము. మనము ఏ మనుష్యులకు సంతానము కాదు. మనము శివబాబా సంతానము, భగవానువాచ! సోదరులందరి తండ్రి భగవంతుడని అంటారు. మనుష్యులు స్వయాన్ని భగవంతుడని చెప్పుకోలేరు. భగవంతుడైతే నిరాకారుడు. వారే తండ్రి, టీచరు మరియు సద్గురువు, మనుష్యులు ఎవ్వరూ తండ్రి, టీచరు, సద్గురువుగా అవ్వలేరు. ఏ మనిషి కూడా ఇతరులకు సద్గతిని కలుగజేయలేరు. మనుష్యులు భగవంతునిగా అవ్వలేరు.

బాబా పతితపావనుడు. పతితులుగా చేసేది రావణుడు. మిగిలినవారంతా భక్తి మార్గములోని గురువులు. ఇది కూడా మీరు అర్థము చేసుకుంటారు - ఇక్కడికి ఎవరు వస్తారో వారు ఆస్తికులుగా అయితే అవుతారు. అనంతమైన తండ్రి వద్దకు వచ్చి - వీరు మన తండ్రి, టీచరు, గురువు అని నిశ్చయము చేసుకుంటారు. దివ్యగుణాలు పూర్తిగా అలవడినప్పుడు యుద్ధము కూడా ప్రారంభమవుతుంది. సయమానుసారము ఇప్పుడు మేము కర్మాతీత అవస్థను చేరుకుంటున్నామని మీరే స్వయంగా అర్థము చేసుకుంటారు. ఇప్పుడింకా కర్మాతీత అవస్థ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది. చాలామందికి సందేశమునివ్వాలి. తండ్రి నుండి వారసత్వమును తీసుకునేందుకు అందరికీ అధికారముంది. ఇప్పుడు యుద్ధము చాలా తీక్షణంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇక ఈ ఆసుపత్రులు, డాక్టర్లు మొదలైన వారెవ్వరూ ఉండరు. పిల్లలైన మీకు సన్ముఖములో అర్థము చేయిస్తున్నారు - '' మీ ఆత్మ శరీరము ద్వారా 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. కొందరికి 70 లేక 80 జన్మలు కూడా ఉంటాయి. అయితే అందరూ వాపసు వెళ్ళవలసినదే. వినాశనము జరగాల్సిందే. అపవిత్ర ఆత్మలు పరంధామానికి వెళ్ళలేవు. పావనముగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అవ్వాలి. ఇది ఏమైనా చిన్న విషయమా! మనుష్యులైతే ఫలానావారు స్వర్గస్థులైనారని అనేస్తారు. అరే! స్వర్గము ఎక్కడుంది? ఏ మాత్రము అర్థము చేసుకోరు. భగవంతుడే చదివించి మమ్ములను విశ్వానికి అధిపతులుగా తయారుచేస్తారని పిల్లలైన మీకు చాలా ఖుషీ(సంతోషము) ఉండాలి. ఒకటేమో స్థిరంగా ఉండే ఖుషీ, మరొకటి అల్పకాలిక ఖుషీ. చదువుకొని చదివించలేదంటే ఎలా కలుగు సంతోషము ఎలా కలుగుతుంది? ఆసురీ గుణాలను పారద్రోలాలి. కర్మభోగమెంత ఉందో తండ్రి ఎంతగానో అర్థము చేయిస్తారు. ఇంకా కర్మాతీత అవస్థ రాలేదనేందుకు గుర్తు కర్మభోగము. ఇప్పుడు శ్రమ చేయాలి. మాయా తుఫానులు ఏవీ రాకూడదు. తండ్రి మనలను అనేకసార్లు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేశారని పిల్లలకు నిశ్చయముంది. ఇది బుద్ధిలోకి వచ్చినా అహో సౌభాగ్యము! ఇది అనంతమైన పెద్ద పాఠశాల. అక్కడ హద్దులో చిన్న పాఠశాలలుంటాయి. తండ్రికైతే నేను వెళ్లి అర్థము చేయించాలని చాలా దయ కలుగుతుంది. కొందరి నుండి అయితే ఇప్పటివరకు భూతాలు తొలగిపోలేదు. వారికి ఎలా అర్థము చేయించాలని తండ్రికి చాలా జాలి కలుగుతుంది. హృదయములో స్థానాన్ని పొందేందుకు బదులు క్రింద పడిపోతారు. కొందరు పుత్రికలు అనేకమందికి కళ్యాణము చేసేందుకు తయారవుతూ ఉన్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయరాదు. ఎవరిలోనైనా ఒకవేళ భూతము ప్రవేశించి ఉంటే లేక వారి దృష్టి చెడుగా ఉంటే వారి ఎదుట నుండి తొలగిపోవాలి. వారితో ఎక్కువగా మాట్లాడరాదు.

2. స్థిరమైన ఖుషీలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి గమనముంచాలి. ఆసురీ గుణాలను తొలగించి దైవీగుణాలను ధారణ చేసి అస్తికులుగా అవ్వాలి.

వరదానము :-

'' ప్రతి సెకండులో చేసే ప్రతి సంకల్పము మహత్వాన్ని తెలుసుకొని జమ ఖాతాను పూర్తిగా నింపుకునే(భర్‌పూర్‌ చేసుకునే) సమర్థ ఆత్మా భవ ''

సంగమ యుగంలో అవినాశీ తండ్రి ద్వారా ప్రతి సమయం అవినాశి ప్రాప్తులు లభిస్తాయి. మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే సమయం ఇదొక్కటే. అందువలన మీ స్లోగన్‌ ''ఇప్పుడు లేకుంటే ఎప్పుడూ లేదు(అబ్‌ నహీ తో కభీ నహీ)''. ఏ శ్రేష్ఠమైన కార్యాన్ని చేయాలో అది ఇప్పుడే చేయాలి. ఈ స్మృతి ద్వారా ఎప్పుడూ సమయము, సంకల్పము, కర్మలు వ్యర్థంగా పోగొట్టుకోరు. సమర్థ సంకల్పాల ద్వారా జమ ఖాతా పూర్తిగా నిండిపోతుంది. ఆత్మ సమర్థమైపోతుంది.

స్లోగన్‌ :-

''ప్రతి మాట, ప్రతి కర్మలోని అలౌకితయే పవిత్రత; సాధారణాన్ని అలౌకితలోకి పరివర్తన చేయాలి.''

బ్రహ్మాబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
లౌకికతలో అలౌకికత గుర్తుండాలి. లౌకికంలో ఉంటున్నా మనము జనుల నుండి భిన్నంగా ఉన్నాము. స్వయాన్ని ఆత్మిక రూపంలో భిన్నంగా భావించాలి. కర్తవ్యము నుండి న్యారాగా అవ్వడం అనగా కర్తవ్యము చేయకుండా ఉండటం సులభము. తద్వారా ప్రపంచానికి ప్రియంగా అనిపించదు. కాని ఎప్పుడైతే శరీరము నుండి భిన్నంగా ఆత్మ రూపంలో పనులు చేస్తారో, అందరికి ప్రియంగా అనిపిస్తారు. ఈ స్థితినే అలౌకిక స్థితి అని అంటారు.