08-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - పావనంగా అయ్యేందుకు స్మృతియాత్ర చాలా అవసరము. ఇదే ముఖ్యమైన సబ్జెక్టు. ఈ యోగబలము ద్వారా మీరు సేవాధారులుగా, గుణవంతులుగా అవ్వగలరు''
ప్రశ్న :-
పిల్లలైన మీరు ఏ యోగమైతే నేర్చుకుంటున్నారో అదే అన్నిటికంటే సాటిలేనిది, అద్భుతమైనది ఎలా?
జవాబు :-
ఇంతవరకు ఏ యోగాలైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో అవన్నీ మనుష్యులు, మనుష్యుల జతలో యోగాన్ని జోడించడం జరిగింది. కాని ఇప్పుడు మనము నిరాకారునితో యోగము జోడిస్తాము. నిరాకార ఆత్మ నిరాకార తండ్రిని స్మృతి చేయడమే అన్నిటికంటే విలక్షణమైన విషయము. ప్రపంచములోని వారెవరైనా ఒకవేళ భగవంతుని స్మృతి చేసినా పరిచయము లేకుండా స్మృతి చేస్తున్నారు. కర్తవ్యము తెలియకుండా ఎవరినైనా స్మృతి చేయడాన్ని భక్తి అని అంటారు. జ్ఞానవంతులైన పిల్లలు పరిచయ సహితంగా స్మృతి చేస్తారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు మొట్టమొదట తండ్రి పరిచయము లభించింది. బిడ్డ జన్మిస్తూనే ఆ చిన్నబిడ్డకు మొట్టమొదట తల్లిదండ్రుల పరిచయము లభిస్తుంది. మీలో కూడా రచయిత అయిన తండ్రి పరిచయము లభించినవారు నెంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. అత్యంత ఉన్నతమైనవారు తండ్రియేనని, వారి మహిమనే అందరికీ తెలపాలని కూడా పిల్లలకు తెలుసు. శివాయ నమ: అని కూడా వారి మహిమను గానము చేస్తారు. అయితే బ్రహ్మాయ నమ: విష్ణువే నమ: అనే పదాలు శోభించవు. శివాయ నమ: బాగా శోభిస్తుంది. బ్రహ్మ దేవతాయ నమ: విష్ణు దేవతాయ నమ: అనే పదాలు శోభిస్తాయి. వారిని దేవతలు అని అనవలసి వస్తుంది. భగవంతుడు అత్యంత ఉన్నతమైనవారు. ఎవరైనా వస్తే మొట్టమొదట వారికి తండ్రి మహిమను తప్పకుండా తెలపాలి. వారు సుప్రీమ్ తండ్రి. తండ్రి మహిమను ఎలా వినిపించాలో పిల్లలు మర్చిపోతారు. మొదట వీరు సుప్రీమ్ తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారని అర్థము చేయించాలి. ముగ్గురిని స్మృతి చేయవలసి వస్తుంది. వాస్తవానికి శివబాబా ఒక్కరినే మూడు రూపాలలో స్మృతి చేయాలి. ఇది పక్కా చేసుకోవాలి. మీకు తండ్రి మహిమ తెలుసు. అందుకే వారిని మహిమ చేస్తారు. వారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని రాయి-రప్పలలో ఉన్నారని అనేశారు. మనుష్యులలో కూడా వారు ఉన్నారని అంటారు. కాని మానవ శరీరములో సదా ఉండలేరు కదా. వారు కేవలం అప్పుగా తీసుకుంటారు. వారు స్వయంగా చెప్తున్నారు - నేను ఇతని శరీరాన్ని అప్పుగా(ఆధారంగా) తీసుకుంటాను. కావున మొట్టమొదటి విషయము - తండ్రి సదా సత్యమని పక్కా చేయాలి. వారే సత్యనారాయణ కథను వినిపిస్తారు. ఆ సత్యమైన తండ్రియే నరుని నుండి నారాయణునిగా తయారుచేశారు. సత్యయుగములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమే ఉండేది. అది ఎలా తయారయ్యింది? ఎవరు తయారు చేశారు? కథ ఎప్పుడు వినిపించారు? రాజయోగము ఎప్పుడు నేర్పించారు? ఇవన్నీ మీరు ఇప్పుడు అర్థము చేసుకున్నారు. మిగిలిన అన్ని యోగములు మనుష్యులను మనుష్యులతో జోడిస్తాయి. మనుష్యుల యోగము పరిచయ సహితంగా నిరాకారుని జతలో జోడింపచేసే యోగము మరొకటి లేదు. ఈ రోజులలో భలే శివునితో యోగము జోడిస్తారు, పూజిస్తారు. అయితే వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఈ సాకార ప్రపంచములోనే ఉంటారని కూడా అర్థము చేసుకోరు. తికమకపడి ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ అయితే మొట్టమొదట సత్యయుగములో ఉండాలని వారు భావిస్తారు. ఒకవేళ సత్యయుగములో ప్రజాపిత బ్రహ్మ ఉండి ఉంటే సూక్ష్మవతనములో ఎందుకు చూపించారు? వారికి అర్థము తెలియదు. ఈ సాకార బ్రహ్మ కర్మ బంధనములో ఉన్నారు. ఆ సూక్ష్మ బ్రహ్మ కర్మాతీతుడు. ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. జ్ఞానము ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు ఎప్పుడు వచ్చి జ్ఞానము ఇస్తారో అప్పుడు మీరు ఇతరులకు వినిపిస్తారు. తండ్రి పరిచయము ఎవరికైనా ఇవ్వడం చాలా సులభము. ఆ ఒక్కరిని(అల్ఫ్) గురించే అర్థము చేయించాలి. వారు సర్వాత్మలకు అనంతమైన తండ్రి. ఎవరికైనా పరిచయము ఇవ్వడంలో ఏ కష్టమూ లేదు. చాలా సులభము. అయితే నిశ్చయము లేకుంటే, అభ్యాసము లేకుంటే ఎవరికీ అర్థము చేయించలేరు. జ్ఞానము ఎవ్వరికీ ఇవ్వకపోతే అజ్ఞానులని అర్థము. జ్ఞానము లేకుంటే భక్తి ఉంటుంది కదా. అనగా దేహాభిమానముంది. దేహీ-అభిమానులలోనే జ్ఞానముంటుంది. మనము ఆత్మలము. మన తండ్రి పరమపిత పరమాత్మ. వారే తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు కదా. తండ్రి, ప్రజాపిత బ్రహ్మ కర్తవ్యము కూడా తెలిపించారు. అంతేకాక తమ కర్తవ్యమును కూడా తెలిపారు. మనుష్యులైతే శివ-శంకరులను కలిపిి ఒక్కటిగా చేసేశారు. శంకరుడు మూడవ కన్ను తెరుస్తూనే వినాశనమైపోయిందని అంటారు. ఇప్పుడు బాంబుల ద్వారా ప్రకృతి భీభత్సాల ద్వారా వినాశనము జరుగుతుంది. శివశంకర మహాదేవ అని అంటారు. ఈ చిత్రము యదార్థమైనది కాదు. ఇవన్నీ భక్తిమార్గములోని చిత్రాలు. అక్కడ ఇటువంటి విషయాలేవీ లేవు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఒక దేహధారి. ఎంతోమంది పిల్లలున్నారు! కనుక ఈ చిత్రాలన్నీ పూజించుటకే ఉన్నాయి. ఇతను వ్యక్తమని, అతను అవ్యక్తమని తండ్రి అర్థము చేయించారు. అవ్యక్తమైనప్పుడు ఫరిస్తా(సూక్ష్మ దేవత)గా అవుతారు. మూలవతనము, సూక్ష్మవతనము రెండూ తప్పకుండా ఉన్నాయి. సూక్ష్మ వతనములోకి కూడా వెళ్తారు. ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఇప్పుడు మనిషిగా ఉన్నారో వారే ఫరిస్తాగా అవుతారు. రాజ్యము కూడా చిత్రాలలో చూపించారు. మళ్లీ ఇతడు రాజ్యపాలన చేస్తాడు. సూక్ష్మవతనము యొక్క చిత్రము లేకుంటే ఇతరులకు అర్థము చేయించడం కష్టమయ్యేది. వాస్తవానికి విష్ణువుకు చతుర్భుజ రూపము లేనే లేదు. ఇది భక్తిమార్గములోని చిత్రము. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఆత్మయే పతితము నుండి పావనంగా అవుతుంది. పవిత్రమై తన ధామానికి వెళ్లిపోతుంది. ఆత్మలు నిరాకార ప్రపంచములో ఉంటాయి. ఇక్కడ సాకారులు ఉన్నారు. పోతే సూక్ష్మవతనము గురించిన ముఖ్యమైన కథ ఏదీ లేదు. సూక్ష్మవతన రహస్యమును కూడా తండ్రి ఇప్పుడే అర్థము చేయిస్తారు. కనుక మూలవతనము, సూక్ష్మవతనము తర్వాత స్థూలవతనము ఉన్నాయి. మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి. భక్తిమార్గములో కూడా బాబాను ఓ భగవంతుడా! ఓ ప్రభువా! అని అంటారు. అయితే వారెవరో తెలియదు. ఎల్లప్పుడూ శివ పరమాత్మాయ నమ: అని అంటారు. శివదేవతా అని ఎప్పుడూ అనరు. బ్రహ్మ దేవత అని అంటారు. శివుని పరమపిత పరమాత్మ అనే అంటారు. శివ దేవతా అని ఎప్పుడూ అనరు. శివపరమాత్మ అనే అంటారు. వారిని సర్వవ్యాపి అని అనరు. పతితులను పావనంగా తయారు చేసే కర్తవ్యము చేయాలంటే రాయి, రప్పలలో ఉండి చేస్తారా? దీనినే గాఢాంధకారము అని అంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారు - యదా యదాహి ధర్మస్య గ్లాని............ ఎవరి గ్లాని? వారు శ్లోకమును చదివి అర్థము వినిపిస్తారు. పిల్లలైన మీరు అచ్చటకు వెళ్లి చూడాలి. మేము దీని అర్థము వివరిస్తామని వారితో చెప్పాలి. ఆ తర్వాత వెంటనే కూర్చుని వినిపించాలి. వీరు బి.కెలని వారు అనుకోరు. భలే తెల్ల డ్రస్సు ఉన్నా వీరికి ఆ ముద్ర ఏమీ పడలేదు అని భావిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్లి వినిపించవచ్చు. అంతేకాక దీని అర్థము తెలిపించమని అడగవచ్చు. వారు ఏమి చెప్తారో గమనించండి. పోతే ఈ చిత్రాలన్నీ వివరంగా అర్థము చేసుకునేందుకు తయారు చేయబడినవి. ఇది అపారమైన జ్ఞానము. సముద్రాన్ని ఇంకుగా చేసుకొని,.......... వ్రాసినా అంతము కాదు. అయినా సెకండులో తెలిపే విధానము కూడా వినిపించాను. కేవలం తండ్రి పరిచయమునివ్వాలి. అనంతమైన ఆ తండ్రియే స్వర్గ రచయిత. మనమందరము వారి పిల్లలము. పరస్పరము సోదరులము. కనుక మనకు కూడా తప్పకుండా స్వర్గ రాజ్యముండాలి. అయితే అందరికీ లభించదు. తండ్రి భారతదేశములోనే వస్తారు. భారతవాసులేే స్వర్గవాసులుగా అవుతారు. ఇతరులందరూ వారి వెనుక వస్తారు. ఇది చాలా సులభము. అయితే అర్థము చేసుకోరు. బాబాకైతే ఆశ్చర్యము కలుగుతుంది. ఒకానొక రోజు వేశ్యలు మొదలైన వారందరు కూడా వచ్చి వింటారు. వెనుక వచ్చేవారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. అక్కడికి(వేశ్యలున్నచోట) కూడా ఎవరైనా వెళ్ళి సేవ చేయవచ్చు. దేహాభిమానము ఉన్నందువలన చాలా మందికి అచ్చటికి వెళ్ళాలంటే సిగ్గు అవుతుంది. బాబా వేశ్యలకు కూడా అర్థము చేయించండి అని చెప్తున్నారు. భారతదేశ పేరు ప్రతిష్టలను వారే క్రింద పడేశారు. ఇందులో ముఖ్యంగా యోగబలము కావాలి. పూర్తి పతితంగా ఉన్నారు. పావనంగా అయ్యేందుకు స్మృతియాత్ర చేయాలి. ఇప్పుడు ఆ యోగబలము కొంత తక్కువగా ఉంది. కొంతమందిలో జ్ఞానముంది కాని యోగము తక్కువగా ఉంది. ఇది కష్టమైన సబ్జెక్టు. ఇందులో పాస్ అయినప్పుడు వేశ్యలను ఉద్ధరించగలరు. మంచి మంచి అనుభవీ మాతలు వెళ్లి అర్థము చేయించాలి. కన్యలకు అయితే అనుభవము ఉండదు. మాతలు అర్థము చేయించగలరు. తండ్రి చెప్తున్నారు - పవిత్రంగా అయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ మొత్తము ప్రపంచమే శివాలయమైపోతుంది. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అక్కడ అపారమైన సుఖముంది. వేశ్యలకు కూడా ఇలా తెలపండి, తండ్రి చెప్తున్నారు - పవిత్రంగా అవుతామని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి. ఇటువంటి పతితులను పావనంగా చేసే ఖడ్గము చాలా పదునుగా ఉండాలి. బహుశా దీనికి ఇంకా కొంత ఆలస్యముంది. అర్థము చేయించేవారు కూడా నెంబరువారుగా ఉన్నారు. సేవాకేంద్రాలలో ఉంటారు. అందరూ ఏకరసంగా లేరని బాబాకు తెలుసు. సర్వీసు చేసేందుకు ఎవరైతే వెళ్తారో వారిలో రాత్రికి పగలుకు ఉన్నంత వ్యతాసముంది. కనుక ఎవరికైనా అర్థం చేయించునప్పుడు మొదట తండ్రి పరిచయమునే ఇవ్వండి. తండ్రినే మహిమ చేయండి. ఇన్ని గుణాలు తండ్రిలో తప్ప ఇతరులెవ్వరిలో ఉండజాలవు. వారే మనలను గుణవంతులుగా చేస్తారు. తండ్రియే సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడిది సంగమ యుగము. ఈ సమయములోనే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. ఆత్మలైన మీకు కూర్చుని అర్థము చేయిస్తారు. శరీరము ఆత్మదేనని అర్థము చేయిస్తారు. ఎంతవరకు అర్థము చేసుకుంటున్నారో వారి ముఖము చూస్తూనే తెలిసిపోతుంది. ఎవరైనా ఉదాసీనంగా ఉంటే వారి ముఖమే మారిపోతుంది. ఆత్మగా భావించి కూర్చుంటే ముఖము కూడా బాగుంటుంది. ఇది కూడా అభ్యాసమవుతుంది. గృహస్థ వ్యవహారములో ఉండేవారు ఇంత ఉత్సాహంగా ఉండలేరు. ఎందుకంటే ఎన్నో చిక్కు వ్యవహారాలలో తగుల్కొని ఉంటారు. పూర్తిగా అభ్యాసము చేసినప్పుడు నడుస్తూ - తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ పక్కాగా ఉంటారు. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఆత్మ ఎంతగా యోగములో ఉంటుందో అంత పావనంగా అవుతుంది. సత్యయుగములో మీరు సతోప్రధానంగా ఉండేవారు. కావున చాలా సంతోషముండేది.
ఇప్పుడు సంగమ యుగములో మీరు నవ్వుతూ, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అనంతమైన తండ్రి లభించారు. ఇంకేం కావాలి! తండ్రి పై సమర్పణ అవ్వాలి. ధనవంతులు ఎవ్వరో ఒకరు అతికష్టము మీద వస్తారు. పేదవారికి మాత్రమే ఈ జ్ఞానము లభిస్తుంది. నాటకమే అలా తయారై ఉంది. నెమ్మది - నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. కోట్లలో ఏ ఒక్కరో విజయ మాలలోని మణిగా అవుతారు. పోతే ప్రజలు నెంబరువారుగా తయారయ్యే తీరాలి. అనేకమంది తయారైపోతారు. ధనవంతులు, పేదవారు అందరూ ఉంటారు. పూర్తి రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. మిగిలినవారంతా తమ- తమ విభాగాల(సెక్షన్ల)లోకి వెళ్లిపోతారు. కనుక తండ్రి అర్థము చేయిస్తున్నారు - పిల్లలూ! దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. మీ ఆహార-పానీయాలు కూడా బాగుండాలి. నేను ఫలాని వస్తువు తినాలనే ఆశ ఎప్పుడూ ఉంచుకోరాదు. ఈ ఆశలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా పెద్ద-పెద్ద వానప్రస్థుల ఆశ్రమాలు చూచారు. చాలా శాంతిగా ఉంటారు. ఇక్కడైతే ఈ అనంతమైన విషయాలన్నీ తండ్రి అర్థము చేయిస్తారు. చివరిలో వచ్చే వేశ్యలు, గణికలు మీ కంటే తీక్షణమైపోతారు. చాలా ఫస్ట్క్లాసు పాటలు పాడ్తారు. ఆ పాటలు వింటూనే ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇలా క్రిందపడిన వారికి అర్థము చేయించి శ్రేష్ఠంగా చేస్తారో అప్పుడు మీ పేరు కూడా చాలా ఉన్నతమైపోతుంది. వీరు వేశ్యలను కూడా ఇంత శ్రేష్ఠంగా తయారుచేస్తారని అందరూ అంటారు. మీరు స్వయంగా ఇలా అంటారు - మేము శూద్రులుగా ఉండేవారము. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత మేమే దేవతలుగా, క్షత్రియులుగా,........... అవుతాము. వీరేమైనా కొంత ఉన్నతిని పొందుకుంటారా లేదా?,.......... అని బాబా ప్రతి ఒక్కరిని గమనించి తెలుసుకోగలరు. వెనుక వచ్చేవారు ముందువారి కంటే ముందుగా పైకి ఎక్కిపోతారు. పోను పోను మీరు ఈ విషయాలన్నీ చూస్తారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు. క్రొత్త పిల్లలు సర్వీసులో ఎంతో ఉత్సాహంతో ఎగురుతూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. పతితులను పావనంగా చేసే సేవ చేయండి. గణికలకు, వేశ్యలకు జ్ఞానము ఇవ్వండి. క్రిందపడిన వారిని లేవనెత్తండి. (క్రింది స్థాయిలో ఉన్నవారికి కూడా జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతంగా చేయండి) వారిని ఉద్ధరించండి. అప్పుడు పేరు ప్రసిద్ధమవుతుంది.
2. స్వీయ దృష్టిని పవిత్రంగా చేసుకునేందుకు నడుస్తూ - తిరుగుతూ మేము ఆత్మలము, ఆత్మలతో మాట్లాడుతున్నామని అభ్యాసము చేయండి. తండ్రి స్మృతిలో ఉంటే పావనంగా అవుతారు.
వరదానము :-
''ఒక నిముషం ఏకాగ్రతా స్థితి ద్వారా శక్తిశాలి అనుభవం చేసి చేయించే ఏకాంతవాసీ భవ''
ఏకాంతవాసిగా అవ్వడం అనగా ఏదో ఒక శక్తిశాలి స్థితిలో స్థితమవ్వడం. బీజరూప స్థితిలో అయినా స్థితమవ్వండి, లైట్ - మైట్ హౌస్ స్థితిలో స్థితమై విశ్వానికి లైట్-మైట్ అయినా ఇవ్వండి. ఫరిస్తా స్థితి ద్వారా ఇతరులకు అవ్యక్త స్థితిని అనుభవం చేయిం.చండి. ఒక నిముషం లేక ఒక సెకండయినా ఈ స్థితిలో ఏకాగ్రంగా స్థితమైతే స్వయానికి, ఇతర ఆత్మలకు చాలా లాభం చేకూర్చగలరు. కేవలం ఇది అభ్యాసం చేయాలి.
స్లోగన్ :-
''ఎవరి ప్రతి సంకల్పము, ప్రతి మాటలో పవిత్రత వైబ్రేషన్లు ఇమిడి (నిండి) ఉన్నాయో, వారే బ్రహ్మచారులు.''
బ్రహ్మబాబా సమానంగా
అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా స్థితిని అనుభవం చేయించేందుకు కర్మలు చేస్తూ మధ్య మధ్యలో
నిరాకారి స్వరూపాన్ని, ఫరిస్తా స్వరూపాన్ని ధరించే మానసిక ఎక్సర్సైజు చేయండి.
ఉదాహరణానికి బ్రహ్మబాబాను సాకార రూపంలో చూశారు, సదా డబల్లైట్గా ఉన్నారు. సేవను
గురించిన బరువు కూడా లేదు. అలా, తండ్రిని అనుసరిస్తే సహజంగానే బాప్సమాన్గా
అవుతారు.