17-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది, ఏ పిల్లలైతే ప్రీతిగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. ''

ప్రశ్న :-

మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏది? ఆ స్థితిని పొందేందుకు పురుషార్థము ఏది?

జవాబు :-

పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలూ జరగవు. స్థితి నిశ్చలంగా, స్థిరంగా అవుతుంది. ఈ సమయంలో ఉన్న నిశ్చల స్థితి ద్వారా 21 జన్మలకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఈ స్థితిని పొందేందుకు మిమ్ములను మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నోట్‌ చేసుకుంటే అప్రమత్తంగా ఉంటారు. యోగబలము ద్వారానే కర్మేంద్రియాలను వశపరచుకోవాలి. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది.

ఓంశాంతి.

ఇది స్మృతియాత్ర. పిల్లలంతా ఈ యాత్ర చేస్తూ ఉంటారు. మీరు కేవలం ఇక్కడ సమీపంగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తే వారు స్వతహాగా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు. ఉదాహరణానికి చంద్రుని ముందు కొన్ని నక్షత్రాలు చాలా సమీపంగా ఉంటాయి, కొన్ని చాలా ప్రకాశిస్తూ ఉంటాయి, కొన్ని సమీపంగా, కొన్ని దూరంగా కూడా ఉంటాయి. చూచేందుకు ఈ నక్షత్రము చాలా ప్రకాశిస్తోందని అనిపిస్తుంది. ఇది చాలా సమీపంగా ఉంది, ఇది మెరవడమే లేదు అని అనిపిస్తుంది. అలా మీకు కూడా గాయనముంది. మీరు జ్ఞాన-యోగాల నక్షత్రాలు. పిల్లలకు జ్ఞాన-సూర్యుడు లభించారు. తండ్రి సేవాధారి(సర్వీసెబుల్‌) పిల్లలనే స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతులు. ఆ తండిన్రే స్మృతి చేస్తూ ఉంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాధారి పిల్లలు ఉంటారో జ్ఞానసూర్యులైన తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు. పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేయని పిల్లలను తండ్రి కూడా స్మృతి చేయరు. వారికి తండ్రి స్మృతి కూడా చేరుకోదు. స్మృతి చేయడం వలన స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి చేయాలి. ''బాబా, మీరు మమ్ములను స్మృతి చేస్తారా?'' అని అడుగుతారు. తండ్రి అంటున్నారు - ఎందుకు చేయను, ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చేయరు! ఎవరు ఎక్కువ పవిత్రంగా ఉంటారో, తండ్రి పై ఎవరికి ఎంత ప్రేమ ఉందో, వారు తండ్రిని కూడా అంతగా ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము? అని ప్రశ్నించుకోండి. ఒక్కరి స్మృతిలోనే ఉండడం వలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్లి వారిని కలుసుకుంటారు. ఇప్పుడు కలుసుకునే సమయము వచ్చేసింది. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి వచ్చి పిల్లలను తన ఆత్మిక పిల్లలుగా చేసుకుంటారు. పతితుల నుండి పావనమయ్యే విధానాన్ని నేర్పిస్తారు. తండ్రి అయితే ఒక్కరే, వారినే అందరూ స్మృతి చేస్తారు కానీ అందరికీ వారి వారి పురుషార్థానుసారమే నెంబరువారుగా వారి నుండి స్మృతి లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే వారు సన్ముఖములో నిల్చున్నట్లే ఉంటారు. కర్మాతీత స్థితి కూడా ఇలాగే తయారవుతుంది. ఎంత స్మృతి చేస్తారో కర్మేందియ్రాలు అంత చంచలమవ్వవు. కర్మేంద్రియాలు చాలా చంచలము అవుతాయి కదా. దీనినే మాయ అని అంటారు. కర్మేంద్రియాల ద్వారా ఏ చెడు కర్మలు జరగరాదు. ఇక్కడ యోగబలము ద్వారా కర్మేంద్రియాలను వశపరచుకోవాలి. వారు(సన్యాసులు) ఔషధాల ద్వారా కర్మేంద్రియాలను వశము చేసుకుంటారు. బాబా! ''ఇవి ఎందుకు మా వశము కావు?'' అని పిల్లలు అడుగుతారు. తండి చెప్తున్నారు - ''మీరు ఎంత స్మృతి చేస్తారో అంత కర్మేందియ్రాలు వశమైపోతాయి.'' దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఈ స్థితి కేవలం స్మృతియాత ద్వారానే జరుగుతుంది. అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది. దానిని భగవంతుడే నేర్పిస్తారు. భగవంతుడు తన పిల్లలకు నేర్పిస్తారు. మీరు ఈ వికారి కర్మేంద్రియాల పై యోగబలము ద్వారా విజయము పొందే పురుషార్థము చేయాలి. చివరిలో సంపూర్ణంగా అవుతారు. పరిపక్వ దశ వచ్చినప్పుడు ఏ కర్మేంద్రియాలూ చంచలమవ్వవు. ఇప్పుడు చంచలత సమాప్తమౌతే 21 జన్మల వరకు ఏ కర్మేంద్రియమూ మోసగించదు. 21 జన్మల వరకు కర్మేంద్రియాలు మీ వశమైపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కామము. స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశమౌతూ ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలను వశపరచుకోవడం ద్వారా అర్ధకల్పము కొరకు బహుమతి లభిస్తుంది. వశము చేసుకోలేకపోతే ఇంకా పాపము మిగిలి ఉంటుంది. మీ పాపాలు యోగబలము ద్వారా నశిస్తూ ఉంటాయి. మీరు పవిత్రమౌతూ ఉంటారు. ఇది నెంబరువన్‌ సబ్జెకు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకే వారిని పిలుస్తారు. కావున తండ్రే వచ్చి పవిత్రంగా చేస్తారు.

తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే. ఒకటేమో యోగమును గురించిన జ్ఞానము. రెండవది 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానము. రెండు జ్ఞానాలున్నాయి. వీటిలో దైవీగుణాలు ఇమిడి ఉన్నాయి. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము కనుక దైవీగుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలని పిల్లలకు తెలుసు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. నోట్‌ చేసుకున్నందున మీ పై మీకు గమనముంటుంది. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉంటే ఎలాంటి తప్పులూ జరగవు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ''నన్ను ఒక్కరినే స్మృతి చేయండి(మామేకమ్‌ యాద్‌ కరో).'' మీరే నన్ను పిలిచారు ఎందుకంటే బాబా పతితపావనులని మీకు తెలుసు. వారు వచ్చినప్పుడే ఈ ఆదేశమునిస్తారు. ఇప్పుడు వారిచ్చే ఆదేశాలను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తున్నారు. కావున తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరములో రావలసి వచ్చింది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రము ఎంత స్పష్టంగా ఉంది. బ్రహ్మ తపస్సు చేసి ఈ(విష్ణు) విధంగా అవుతాడు. మళ్లీ 84 జన్మల తర్వాత ఇతని(బ్రహ్మ)గా అవుతాడు. ఇది కూడా బుద్ధిలో గుర్తుండాలి - ''బ్రాహ్మణులైన మేమే దేవతలుగా ఉండేవారము, 84 జన్మల చక్రమును పూర్తి చేశాము. ఇప్పుడు మళ్లీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము.'' దేవతల వంశము పూర్తి అయినప్పుడు భక్తిమార్గములో కూడా వారిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తాము. ఇప్పుడా తండ్రి ఈ పదవి ప్రాప్తి చేసుకునేందుకు మీకు యుక్తి తెలుపుతారు. స్మృతి కూడా చాలా సులభము. కేవలం బంగారు పాత్ర కావాలి. ఎంత పురుషార్థము చేస్తారో అన్ని పాయింట్లు ఉత్పన్నమౌతూ ఉంటాయి. జ్ఞానము కూడా బాగా వినిపిస్తూ ఉంటారు. బాబా మనలో ప్రవేశమై మురళి వినిపిస్తున్నట్లు భావిస్తారు. బాబా కూడా చాలా సహాయము చేస్తారు. ఇతరులకు కూడా కళ్యాణము చేయాలి. అది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. సమయము గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు........ ఎలా గడిచిపోయాయి, ప్రారంభము నుండి సమయము గడిచిపోతూనే ఉంది. ఈ సెకండు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత పునరావృతమౌతుంది. ఇది కూడా బాగా అర్థము చేసుకోవాలి అంతేకాక తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశమౌతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. ఇంతకాలము ఏమి చేస్తూ వచ్చారో అదంతా భక్తి. భక్తికి భగవంతుడు ఫలితమిస్తాడని అంటారు. ఏ ఫలమునిస్తారు? ఎప్పుడు ఎలా ఇస్తారు? దీనిని గురించి ఏ మాత్రము తెలియదు. తండ్రి ఫలితమునిచ్చేందుకు వచ్చినప్పుడు, అప్పుడు తీసుకునేవారు, ఇచ్చేవారు కలుస్తారు. డ్రామా పాత్ర ముందుకు నడుస్తూ ఉంటుంది. మొత్తం డ్రామాలో ఇది చివరి జీవితము. కొంతమంది శరీరాన్ని కూడా వదలవచ్చు. ఇంకా పాత్ర చేయాలని ఉంటే మళ్లీ జన్మ కూడా తీసుకుంటారు. ఎవరి లెక్కాచారాలు ఎక్కువగా ఉంటాయో మళ్లీ జన్మ కూడా తీసుకోవచ్చు. చాలా పాపాలున్న వారు మాటిమాటికి ఒక్క జన్మ తీసుకుని, వెంటనే రెండవ జన్మ మళ్లీ మూడవ జన్మ తీసుకుంటూ విడుస్తూ ఉంటారు. గర్భములోకి వెళ్లి దు:ఖమును భోగించి, జన్మించి ఆ శరీరము వదిలి మరో జన్మ తీసుకుంటారు. కాశీకల్వట్‌(కాశీలోని కత్తుల బావిలో దుమికి శివునికి ప్రాణాలర్పించుట)లో కూడా ఇదే జరుగుతుంది. తల పై చాలా పాప భారముంది. యోగబలము లేనే లేదు. కాశీకల్వట్‌ తినడం - ఇది తమ శరీరాన్ని తామే హత్య చేసుకోవడం. ఇది హతమార్చుకొనుట అని ఆత్మకు కూడా తెలుసు. బాబా మీరు వస్తే మేము మీ పై సమర్పణౌతాము, బలి అవుతామని కూడా అంటారు. భక్తిమార్గములో స్థూలంగా బలి అవుతారు. అది భక్తి అవుతుంది. దానము, పుణ్యము, తీర్థస్థానాలు మొదలైనవి ఏమేమి చేశారో అందులో ఎవరితో ఇచ్చి పుచ్చుకుంటారు? - పాపాత్మలతో. ఇది రావణ రాజ్యము కదా. తండ్రి అంటున్నారు - చాలా జాగ్రత్తగా ఇచ్చి పుచ్చుకొను వ్యవహారము చేయాలి. ఏదైనా చెడు పనిలో ఉపయోగిస్తే తల పై పాప భారము పెరుగుతుంది. దానము, పుణ్యము కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. పేదలకు అన్నము, వస్త్రములు దానమివ్వడం జరుగుతుంది లేక ఈ కాలములో ధర్మసత్రాలు మొదలైనవి కట్టించి ఇస్తారు. ధనవంతులకైతే పెద్ద - పెద్ద మహళ్ళు ఉన్నాయి. పేదలకు గుడిసెలు ఉన్నాయి. వారు మురికి కాలువల పక్క నివసిస్తున్నారు. ఆ మురికి నుండి ఎరువు తయారౌతుంది, అది అమ్మబడుతుంది. దానిని ఉపయోగించి వ్యవసాయము మొదలైనవి చేస్తారు. సత్యయుగములో ఇటువంటి మురికితో వ్యవసాయము చేయరు. అక్కడున్న మట్టి కొత్తది. దాని పేరే స్వర్గము(ప్యారడైజ్‌). పుష్యరాగము, పచ్చ....... మొదలైన రత్నాలున్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తారు. కొంతమంది మేము సేవ చేయలేమని అంటారు. అందరూ బాబా రత్నాలే. కానీ వారిలో కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. వారే తర్వాత పూజింపబడ్తారు. దేవతలను పూజిస్తారు. భక్తిమార్గములో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని చూస్తే మజా వస్తుంది. మనము పాత్రధారులము. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది. మీరు చాలా సంతోషిస్తారు. భక్తి కూడా ఉందని మీకు తెలుసు. భక్తిలో కూడా చాలా సంతోషిస్తారు. గురువు మాల త్రిప్పమని అంటారు. చెప్పిందే చాలని సంతోషంతో తిప్పుతూ ఉంటారు. అర్థము కొంచెము కూడా తెలియదు.

శివుడు నిరాకారుడు, వారికి పాలతో, నీటితో మొదలగు వాటితో అభిషేకము ఎందుకు చేస్తారు? విగ్రహాలకు భోగ్‌(నైవేద్యము) పెడ్తారు. ఆ విగ్రహాలు ఏమో తినవు. భక్తి విస్తారము ఎంతగా ఉంది. భక్తి వృక్షము, జ్ఞానము బీజము. రచయిత, రచనల గురించి పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కొంతమంది పిల్లలైతే తమ ఎముకలను కూడా ఈ సేవలో స్వాహా చేసేవారున్నారు. ఇది మీ కల్పన అని కొంతమంది అంటారు. అవే ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమౌతాయి. కల్పన ఎప్పుడూ రిపీట్‌ అవ్వదు. ఇది జ్ఞానము. నూతన ప్రపంచము కొరకు ఇవి నూతన విషయాలు. భగవానువాచ. భగవంతుడు కూడా కొత్తవారే. వారి మహావాక్యాలు కూడా నూతనమైనవే. వారు కృష్ణ భగవానువాచ అని అంటారు, మీరు శివభగవానువాచ అని అంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి మాటలు వేరు వేరుగా ఉంటాయి. ఒకరి మాటలు మరొకరితో కలవవు, సమానముగా ఉండవు. ఇది చదువు, పాఠశాలలో చదువుతున్నారు. కల్పన అనే మాటే లేదు. తండ్రి జ్ఞానసాగరులు, నాలెడ్జ్‌ఫుల్‌. ఋషులు, మునులు కూడా మాకు రచయిత-రచనల గురించి తెలియదని అంటారు. వారు ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందిన వారే కాదు. కావున వారికి జ్ఞానము ఎలా లభిస్తుంది? ఎవరు తెలుసుకుంటారో వారు పదవి పొందారు. మళ్లీ సంగమ యుగములో వచ్చినప్పుడు తండ్రి వచ్చి మళ్లీ అర్థం చేయిస్తారు. క్రొత్తవారు ఈ మాటలు విని తికమకపడ్తారు. వారంటారు - చాల్లే, మీ కొద్దిమంది మాత్రమే రైటు, మిగిలినవారంతా తప్పా, అసత్యమా? అని అంటారు. సర్వ వేదశాస్త్రాలకు తల్లి-తండ్రి అయిన గీతనే ఖండన చేసేశారని మీరు అర్థం చేయిస్తారు. మిగిలినవన్నీ దాని రచనయే. రచన ద్వారా వారసత్వము లభించదు. వేదశాస్త్రాలలో రచయిత-రచనల జ్ఞానము లేదు. అసలు వేదముల ద్వారా ఏ ధర్మ స్థాపన జరిగిందో చెప్పమని అడగండి. ఉన్న ధర్మాలే నాలుగు. ప్రతి ధర్మానికి ధర్మశాస్త్రము ఒక్కటే ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులమును స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే తర్వాత సూర్య వంశీయుల, చంద్ర వంశీయుల కులములో తమ పదవిని పొందుతారు. తండ్రి వచ్చి మీకు సన్ముఖములో ఈ రథము ద్వారా అర్థము చేయిస్తారు. రథము తప్పకుండా కావాల్సిందే. ఆత్మ ఏమో నిరాకారము. దానికి సాకార శరీరము లభిస్తుంది. ఆత్మ అనేది ఏమిటి? దానిని గురించే తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలరు? తండ్రి ఒక్కరే సత్యమును వినిపిస్తారు. మిగిలినవారంతా చెప్పేది అసత్యము. దాని వలన ఏ లాభమూ లేదు. ఎవరి మాలను స్మరిస్తారు? ఏమీ తెలియదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయమునిస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి. భక్తి రావణరాజ్యము నుండి ప్రారంభమౌతుంది. భక్తి వలన మెట్లు దిగుతూ దిగుతూ తమోప్రధానంగా అయ్యారు. ఎవరి కర్తవ్యము గురించి కూడా తెలియదు. భగవంతుని ఎంతగానో పూజిస్తారు. కానీ భగవంతుడెవరో ఏ మాత్రము తెలియదు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇంత ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో శ్రమ ఉంది. ఎవరైనా మందబుద్ధి గలవారిగా ఉంటే మందబుద్ధితోనే తలంపు చేయండి. కానీ ఒక్కరినే స్మృతి చేయాలి. బాబా మీరు వస్తే మీతోనే బుద్ధియోగము జోడిస్తామని పాటలు కూడా పాడ్తారు. ఇప్పుడు తండ్రి కూడా వచ్చేశారు. మీరంతా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానమిచ్చే వారితో కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మలను అమరలోకానికి తీసుకెళ్తారు. కాలుని పై విజయము కలిగిస్తాను, మిమ్ములను అమరలోకానికి తీసుకెళ్తానని తండ్రి అర్థం చేయించారు. అమరకథను పార్వతికి వినిపించినట్లు చూపిస్తారు కదా. అమరకథ ఒక్కటే, అమరనాథుడూ ఒక్కరే. హిమాలయ పర్వతము పై కూర్చుని కథ వినిపించరు. భక్తిమార్గములోని ప్రతి విషయము ఆశ్చర్యమనిపిస్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. యోగబలము ద్వారా కర్మేంద్రియాలను జయించి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఈ స్థితిని పొందేందుకు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.

2. మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము, ఇప్పుడు మళ్లీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో ఉండాలి. కావున అత్యంత జాగ్రత్త వహించి పాప-పుణ్యాలను అర్థము చేసుకుని ఇచ్చి పుచుకొను వ్యవహారము చేయాలి.

వరదానము :-

'' సర్వ ప్రాప్తులను స్మృతిలో ఎమర్జ్‌గా ఉంచుకొని (గుర్తుంచుకొని) సదా సంపన్నంగా ఉండే సంతుష్ట ఆత్మా భవ ''

సంగమ యుగములో బాప్‌దాదా ద్వారా ఏమేమి ప్రాప్తించాయో వాటి స్మృతి ఎమర్జ్‌ రూపంలో ఉండాలి. అప్పుడు ప్రాప్తుల సంతోషము ఎప్పుడూ క్రిందికి ఆందోళనలోకి తీసుకురాదు. సదా అచలంగా ఉంటారు. సంపన్నత అచలంగా చేస్తుంది. హల్‌చల్‌(ఆందోళన) నుండి విడిపిస్తుంది. ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా రాజీగా, సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అన్నిటికంటే పెద్ద ఖజానా. ఎవరి వద్ద సంతుష్టత(తృప్తి) ఉంటుందో వారి వద్ద అన్నీ ఉంటాయి. వారు ''పొందాల్సినదంతా పొందాను(జో పానా థా పాలియా)'' అనే పాట పాడుతూ ఉంటారు.

స్లోగన్‌ :-

'' ప్రేమ ( మొహబ్బత్‌ ) అనే ఊయలలో కూర్చుంటే శ్రమ (మెహనత్‌)దానంతకదే వదిలిపోతుంది ''