12-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
' మధురమైన పిల్లలారా - మీరిచ్చటికి చదువుకునేందుకు వచ్చారు. మీరు కళ్ళు మూసుకునే అవసరము లేదు. చదువును కళ్ళు తెరిచి చదువుకుంటారు ''
ప్రశ్న :-
భక్తిమార్గములో భక్తులకు ఏ అలవాటు ఉంటుంది, ఆ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీకు ఉండరాదు ?
జవాబు :-
భక్తిమార్గములో ఏ దేవతామూర్తి దగ్గరకు వెళ్లినా వారిని ఏదో ఒకటి వేడుకుంటూ ఉంటారు. వారికి యాచించడమే అలవాటైపోతుంది. లక్ష్మీదేవి ఎదురుగా వెళ్లినప్పుడు ధనమును వేడుకుంటారు కానీ ఏమీ లభించదు. పిల్లలైన మీకిప్పుడు ఆ అలవాటు లేదు. మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు. పిల్లలైన మీరు సత్యమైన విచిత్రమైన తండ్రిని చూస్తూ ఉండండి. ఇందులోనే మీకు సత్యమైన సంపాదన ఉంది.
ఓంశాంతి.
ఇది పాఠశాల అని ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరి చిత్రమును అనగా దేహధారిని చూడరాదు. ఇక్కడ చూస్తున్నా, చితమ్రు లేనివారి వైపు బుద్ధి వెళ్లాలి. పాఠశాలలో పిల్లలకు ఎప్పటికీ టీచరు పైనే గమనముంటుంది. ఎందుకంటే వారు చదివిస్తున్నప్పుడు తప్పకుండా వారు చెప్పేది విని తర్వాత బదులు ఇవ్వాలి. టీచరు ప్రశ్న అడిగినప్పుడు, నేను చెప్తానని సైగ చేస్తారు కదా. ఇక్కడ ఇది విచిత్రమైన పాఠశాల. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. చదివించేవారికి ఏ చిత్రమూ లేదు. కావున చదువునప్పుడు కళ్లు తెరుచుకునే కూర్చోవాలి కదా. పాఠశాలలో టీచరు ఎదురుగా ఎప్పుడైనా కళ్లు మూసుకుని కూర్చుంటారా! భక్తిమార్గములో కళ్లు మూసుకుని మాలను జపించడము మొదలైన వాటికి....... అలవాటు పడిపోయారు. సాధువులు కూడా కళ్లు మూసుకుని కూర్చుంటారు. వారైతే మనసు చంచలమవ్వరాదని స్త్రీలను చూడను కూడా చూడరు. కానీ నేటి ప్రపంచము తమోప్రధానంగా ఉంది. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ మీరు శరీరమును చూస్తుంటారు కానీ బుద్ధి ఆ విచిత్రమును స్మృతి చేస్తూ ఉంటుంది. శరీరాన్ని చూస్తూ విచిత్రమైన తండ్రిని స్మృతి చేసే సాధువులు, సన్యాసులు ఎవ్వరూ ఉండరు. ఈ రథములో ఆ తండ్రి వచ్చి మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు చెప్తున్నారు - అన్ని కర్మలు ఆత్మయే చేస్తుంది. శరీరము ఏమీ చేయదు. ఆత్మ వింటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము లేక దైహిక(భౌతిక) జ్ఞానమును ఆత్మయే వింటుంది, వినిపిస్తుంది. ఆత్మ దైహిక టీచరుగా అవుతుంది. శరీరము ద్వారా చదివే దైహిక చదువును కూడా ఆత్మయే చదువుతుంది. మంచి లేక చెడు సంస్కారాలను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది. శరీరమైతే బూడిదైపోతుంది. ఇది కూడా మానవులెవ్వరికీ తెలియదు. నేను ఫలానా, నేను ప్రధానమంత్రిని అని వారికి దేహాభిమానము ఉంటుంది. నేను ఆత్మ ఈ ప్రధానమంత్రి శరీరమును తీసుకున్నానని చెప్పరు. ఇది కూడా మీరు అర్థము చేసుకుంటారు. అన్నీ ఆత్మయే చేస్తుంది. ఆత్మ అవినాశి కేవలం పాత్ర చేసేందుకు ఇక్కడ శరీరము లభించింది. ఒకవేళ ఇందులో ఆత్మ లేకపోతే శరీరము ఏమీ చేయలేదు. ఆత్మ శరీరము నుండి వెళ్లిపోతే ఒక శవము వలె పడి ఉంటుంది. ఆత్మను ఈ కళ్లతో చూడలేరు. అది సూక్ష్మమైనది. కావున బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. వీరి ద్వారా శివబాబా మనలను చదివిస్తున్నారని మీ బుద్ధిలో కూడా ఉంది. ఇవి కూడా సూక్ష్మంగా అర్థము చేసుకోవాలి. ఈ విషయాలు కొంతమంది బాగా అర్థము చేసుకుంటారు. కొందరైతే కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. అల్ఫ్ అనగా భగవంతుడు, బాబా అని అర్థము. కేవలం భగవంతుడని లేక ఈశ్వరుడని చెప్పినంత మాత్రాన తండ్రి సంబంధము ఉండదు. ఈ సమయములో అందరూ రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు. ఎందుకంటే రచయిత తండ్రి మరియు రచన ఆదిమధ్యాంతాలను గురించి తెలియదు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమౌతూ ఉంటాయి. ఇప్పుడిది సంగమ యుగమని ఎవ్వరికీ తెలియదు. ఇంతకు ముందు మనకు కూడా తెలియదని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మిమ్ములను ఇక్కడ జ్ఞానముతో అలంకరిస్తున్నారు. ఇక్కడ నుండి వెలుపలికి వెళ్తూనే మాయ మట్టిని పూసుకొని జ్ఞాన అలంకారమునంతా చెడిపేసుకుంటారు. తండ్రి అలంకరిస్తారు కానీ మీరు పురుషార్థము కూడా చేయాలి. కొంతమంది పిల్లలైతే అలంకారమే చెయ్యని విధంగా ఆటవికుల వలె మాట్లాడ్తారు. అన్నీ మర్చిపోతారు. చివరిలో కూర్చున్న విద్యార్థులకు చదువు పై అంతగా మనసు పోదు. ఫ్యాక్టరీ మొదలైన వాటికెళ్లి సర్వీసు చేసి షాహుకార్లుగా అవుతారు. ఏమీ చదువుకోలేరు. కానీ ఇది చాలా ఉన్నతమైన చదువు. చదువుకోకుండా భవిష్యత్తులో పదవి లభించదు. ధనవంతులుగా అవ్వాలని ఇక్కడ మీరు ఏ ఫ్యాక్టరీలో కూర్చుని పని చేసే అవసరం లేదు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. అవినాశి సంపాదన మాత్రమే జతలో వస్తుంది. మనుష్యులు మరణించినప్పుడు వట్టి చేతులతో వెళ్తారని మీకు తెలుసు. జతలో ఏమీ తీసుకెళ్లరు. మీరు నిండిన చేతులతో వెళ్తారు. దీనినే సత్యమైన సంపాదన అని అంటారు. మీరు సంపాదించే సత్యమైన సంపాదన 21 జన్మల వరకు ఉంటుంది. అనంతమైన తండ్రియే సత్యమైన సంపాదన చేయిస్తారు.
పిల్లలైన మీరు ఈ చిత్రమును చూస్తున్నారు కానీ విచిత్రమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే మీరు కూడా ఆత్మలే. కావున ఆత్మ తన తండ్రినే చూస్తుంది. వారి ద్వారా చదువుకుంటుంది. ఆత్మను మరియు పరమాత్మను మీరు చూడలేరు కానీ బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మలమైన మనము అవినాశి. ఈ శరీరము వినాశమవుతుంది. ఈ తండ్రి కూడా ఎదురుగా ఉన్న పిల్లలైన మిమ్ములను చూస్తారు కానీ ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అనే విషయము వారి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నేర్పించేదంతా సత్యమే సత్యము. ఇందులో అసత్యము కొంచెము కూడా లేదు. మీరు సత్యమైన ఖండానికి అధికారులుగా అవుతారు. ఇది అసత్యమైన ఖండము. కలియుగము అసత్యమైన ఖండము, సత్యయుగము సత్యమైన ఖండము. సత్యయుగానికి, కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. సత్యయుగములో దు:ఖకరమైన విషయాలేవీ ఉండవు. దాని పేరే సుఖధామము. ఆ సుఖధామానికి అధికారులుగా అనంతమైన తండ్రియే చేస్తారు. వారికి ఏ చిత్రమూ లేదు. మిగిలిన వారందరికీ చిత్రాలున్నాయి(శరీరాలున్నాయి). వారి ఆత్మ పేరు మారుతూ ఉంటుందా? వారి పేరే శివ. ఇతరులందరి ఆత్మను ఆత్మ అనే అంటారు. శరీరానికైతే పేరు ఉంటుంది. శివలింగము నిరాకారమైనది. జ్ఞానసాగరులు, శాంతిసాగరులు,............... ఇది శివుని మహిమ. వారు తండ్రి కూడా అయినారు. కావున తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వము లభించాలి. రచనకు రచన ద్వారా వారసత్వము లభించదు. రచయిత తమ పిల్లలకు వారసత్వమునిస్తారు, తమ పిల్లలకు ఇవ్వకుండా, సోదరుని(తమ్ముడు) పిల్లలకు ఆస్తిని ఇస్తారా? బేహద్ తండ్రి తమ బేహద్ పిల్లలకు వారసత్వమునిస్తారు. ఇది చదువు కదా. మనుష్యులు చదువుకొని న్యాయవాది మొదలైనవారిగా అవుతారు. చదివించేవారితో మరియు చదువుతో యోగముంటుంది. ఇక్కడ చదివించేవారు విచిత్రమైనవారు, ఆత్మలైన మీరు కూడా విచిత్రులే. నేను ఆత్మలను చదివిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. మీరు కూడా మనలను తండ్రి చదివిస్తున్నారని భావించండి. తండ్రి ఒక్కసారే వచ్చి చదివిస్తారు. చదివేది ఆత్మయే కదా. సుఖ-దు:ఖాలను శరీరము ద్వారానే ఆత్మ అనుభవిస్తుంది. ఆత్మ వెళ్లిపోతే శరీరాన్ని ఎంత కొట్టినా మట్టిని కొట్టినట్లుంటుంది. కావున తండ్రి మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని తెలియజేస్తున్నారు. నంబరువారుగా ధారణ చేస్తారని బాబాకు తెలుసు. కొందరైతే పూర్తిగా బుద్ధిహీనుల వలె ఉంటారు. ఏమీ అర్థము చేసుకోరు. జ్ఞానమైతే చాలా సహజము. గ్రుడ్డివారు, వికలాంగులు, కుంటివారు కూడా అర్థము చేసుకోగలరు. ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించబడ్తుంది కదా. ఆత్మ వికలాంగునిగా, కుంటిగా ఉండదు. శరీరమైతే అలా ఉంటుంది. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. కానీ భక్తిమార్గములో కళ్లు మూసుకొని కూర్చోవడం అలవాటైపోయింది. కనుక ఇక్కడ కూడా కళ్లు మూసుకొని ఇష్టము వచ్చినట్లు కూర్చుంటారు. కానీ కళ్లు మూసుకోరాదని తండ్రి చెప్తున్నారు. ఎదురుగా చూస్తున్నా బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశమౌతాయి. ఎంత సహజము! అయినా బాబా, ''మేము స్మృతి చేయలేము'' అని చెప్తారు. అరే, హద్దు వారసత్వమునిచ్చే లౌకిక తండ్రిని కూడా మరణించే వరకు స్మృతి చేస్తారు. వీరైతే సర్వాత్మల బేహద్ తండ్రి. మీరు వారిని స్మృతి చేయలేరా! ఓ భగవంతుడా, మాకు మార్గమును చూపించండి అని ఆ తండ్ర్రిని పిలిచారు కూడా. వాస్తవానికి ఇలా అనడము కూడా తప్పే. తండ్రి కేవలం ఒక్కరికే మార్గదర్శి కాదు. వారు అనంతమైన మార్గదర్శకులు. ఒక్కరికే ముక్తినివ్వరు. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. అందరినీ శాంతిధామానికి పంపించేందుకే నేను వచ్చాను. ఇక్కడ అడిగే అవసరమే లేదు. వీరు బేహద్ తండ్రి కదా. వారైతే హద్దులో వచ్చి నాకు - నాకు అని అంటూ ఉంటారు. ఓ పరమాత్మా! మాకు సుఖమునివ్వండి, దు:ఖమును పోగొట్టండి.......... మేము పాపులము, నీచులము, మీరు దయ చూపండి అని అంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ బేహద్ పాత సృష్టిని కొత్తదిగా చేసేందుకు వచ్చాను. నూతన సృష్టిలో దేవతలు ఉంటారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీరు పూర్తిగా పతితమైనప్పుడు నేను వస్తాను. ఇది ఆసురీ సంప్రదాయము. సత్యము చెప్పేవారు ఒక్క సద్గురువు మాత్రమే. వారే తండ్రి, టీచరు, సద్గురువు కూడా. తండ్రి చెప్తున్నారు - స్వర్గ ద్వారాలను ఈ మాతలే తెరుస్తారు. స్వర్గానికి దారి అని కూడా వ్రాయబడింది. కాని ఇది కూడా మానవులు అర్థము చేసుకోలేరు. నరకములో పడి ఉన్నారు కదా. అందుకే పిలుస్తారు. ఇప్పుడు బాబా మీకు స్వర్గములోకి వెళ్లేందుకు మార్గము తెలుపుతున్నారు. పతితులను పావనంగా చేసేందుకు, వాపస్ తీసుకెళ్లేందుకు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. ''ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి.'' మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారనే ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. నేను మీ అందరినీ విశ్వాధికారులుగా అయ్యే మార్గాన్ని తెలుపుతాను. లక్ష్మిని దీపావళి రోజు పూజిస్తారు. ధనము కావాలని వారిని వేడుకుంటారు. ఆరోగ్యమును బాగు చెయ్యమని, ఆయువు పెంచమని అడగరు. మీరైతే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు. ఆయువు చాలా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నిటిని ఇచ్చేస్తారు. వారైతే లక్ష్మిదేవితో కేవలం మట్టి పెంకులను(కాసులను) వేడుకుంటారు. అవి కూడా లభించవు. ఇలా అడగడం అలవాటైపోయింది. దేవతల వద్దకు వేడుకునేందుకు వెళ్తారు. ఇక్కడైతే మీరు తండ్రిని ఏమీ అడగరాదు. తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు అధికారులుగా అవుతారు, సృష్టి చక్రమును తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఇందులో ఏమీ మాట్లాడే అవసరముండదు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుంది. మీరిప్పుడింకా వీరిని పూజిస్తారా! మనమే అలా అవుతామని మీకు తెలుసు. కనుక పంచ తత్వాలను ఏమని పూజిస్తారు? మనకు విశ్వ రాజ్యము లభిస్తూ ఉంటే పూజ ఎందుకు చేస్తాము? మీరిప్పుడు మందిరాలు మొదలైనవాటికి వెళ్లరు. తండ్రి చెప్తున్నారు - ఇదంతా భక్తిమార్గములోని సామాగ్రి. జ్ఞానములో అయితే నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఒకే వాక్యముంది. అంతే, స్మృతి ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి, సతోప్రధానంగా అవుతారు. మీరే సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. మళ్లీ కావాల్సిపడ్తుంది. ఇది కూడా అర్థము చేసుకోరు. రాతిబుద్ధి గలవారితో తండ్రి ఎంతగా తల కొట్టుకోవలసి వస్తుంది. దీని పైన నిశ్చయముండాలి. తండ్రి తప్ప ఈ విషయాలు ఏ సాధు, సత్పురుషులు తెలుపలేరు. ఇతడు ఈశ్వరుడేమీ కాడు. ఇతడు అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. ఎవరైతే మొత్తం 84 జన్మలు పూర్తి చేశారో, పల్లె బాలునిగా ఉండినారో వారిలోనే నేను ప్రవేశిస్తాను. తర్వాత ఇతడు శ్యామసుందరునిగా అవుతాడు. ఇతడు పూర్తిగా పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. తర్వాత సాధారణంగా తయారైనప్పుడు బాబా ప్రవేశించారు. ఎందుకంటే ఇంత భట్టి తయారవ్వాల్సి ఉండినది. వీరందరికి తినిపించేవారెవరు? తప్పకుండా సాధారణంగా కూడా ఉండాలి కదా. ఇవన్నీ అర్థము చేసుకోవాల్సిన విషయాలు. స్వయంగా తండ్రి చెప్తున్నారు - నేను వీరి అనేక జన్మల అంతములో ప్రవేశిస్తాను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమయ్యాడు. మళ్లీ అందరికంటే ఎక్కువ పావనంగా కూడా ఇతడే అవుతాడు. ఇతడు 84 జన్మలు తీసుకున్నాడు. తతత్వమ్. ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు కదా. సూర్యవంశీ, చంద్రవంశీయులుగా అయ్యేవారే ఇక్కడకు నంబరువారు పురుషార్థానుసారంగా వస్తారు. మిగిలిన వారు నిలబడలేరు. ఆలస్యంగా వచ్చేవారు జ్ఞానమును కూడా కొద్దిగానే వింటారు. మళ్లీ వారు ఆలస్యంగానే వస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బాబా చేసిన జ్ఞాన అలంకారాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు పురుషార్థము చేయాలి. మాయావి దుమ్ములో పడి జ్ఞాన అలంకారాన్ని చెరిపేసుకోరాదు. బాగా చదువుకొని అవినాశి సంపాదన చేసుకోవాలి.
2. ఈ చిత్రాన్ని అనగా దేహధారిని ఎదురుగా చూస్తున్నా బుద్ధి ద్వారా విచిత్రమైన (విదేహి అయిన) తండ్రిని స్మృతి చేయాలి. కళ్లు మూసుకుని కూర్చునే అలవాటు చేసుకోరాదు. అనంతమైన తండ్రిని ఏమీ వేడుకోరాదు.
వరదానము :-
'' సాక్షిగా ఉండి కర్మేంద్రియాలతో కర్మలు చేయించే, కర్తవ్య భారము నుండి ముక్తులుగా ఉండే అశరీరి భవ ''
ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరములోకి రండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరులుగా అవ్వండి. ఏదైనా కర్మ చేయాల్సినప్పుడు కర్మేంద్రియాల ఆధారమును తీసుకోండి, కానీ ఆధారము తీసుకునే నేను ఆత్మను అని మర్చిపోకండి. నేను చేసేదానిని కాను, చేయించేదానిని అని గుర్తుంచుకోండి. ఎలాగైతే ఇతరులతో పని చేయించు సమయంలో స్వయాన్ని వేరుగా భావిస్తారో అలా సాక్షిగా ఉండి కర్మేంద్రియాలతో కర్మలు చేయించండి. అలా చేయిస్తే కర్తవ్య భారము నుండి ముక్తులుగా అయ్యి అశరీరులుగా అవుతారు. కర్మలు చేయునప్పుడు మధ్య మధ్యలో ఒకటి రెండు నిముషాలైనా అశరీరులుగా అయ్యే అభ్యాసము చేస్తే చివరి సమయంలో చాలా సహాయము లభిస్తుంది.
స్లోగన్ :-
'' విశ్వ రాజులుగా అవ్వాలంటే, విశ్వానికి సకాశ్ ఇచ్చేవారిగా అవ్వండి. ''