29-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతి ద్వారా వికర్మలు వినాశనమౌతాయి, ట్రాన్స్ (ధ్యానము, అనంతమైన ఆనందానుభూతినిచ్చే అచేతన స్థితి) ద్వారా నశించవు. ట్రాన్స్ పైసా విలువ చేసే ఆట. అందువలన ట్రాన్స్ లోకి పోవాలనే ఆశ ఉంచుకోకండి ''
ప్రశ్న :-
భిన్న-భిన్న రూపాలలో వచ్చే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు తండ్రి, తన పిల్లలందరికీ ఏ హెచ్చరిక ఇస్తున్నారు?
జవాబు :-
మధురమైన పిల్లలారా! ట్రాన్స్లోనికి పోవాలనే ఆశ ఉంచుకోకండి. జ్ఞాన-యోగాలతో ట్రాన్స్కు ఏ సంబంధమూ లేదు. ముఖ్యమైనది చదువు. కొందరు ట్రాన్స్లోకి వెళ్లి నాలో మమ్మా ప్రవేశమయ్యింది, బాబా వచ్చారు అని అంటారు. ఇవన్నీ సూక్ష్మమైన మాయ చేయించే సంకల్పాలు. వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ కొంతమంది పిల్లలలో ప్రవేశించి తప్పు పనులు చేయిస్తుంది. అందువలన ట్రాన్స్లోకి వెళ్లాలనే ఆశను ఉంచుకోరాదు.
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు - ఒకవైపు భక్తి, రెండవ వైపు జ్ఞానము ఉందని అర్థం చేసుకున్నారు. భక్తి అమితంగా లెక్కలేనంత ఉంది. దానిని నేర్పించేవారు కూడా అనేకమంది ఉన్నారు. శాస్త్రాలు కూడా నేర్పిస్తాయి, మనుష్యులు కూడా నేర్పిస్తారు. ఇక్కడ ఏ శాస్త్రమూ లేదు, ఏ మనుష్యులూ లేరు. ఇక్కడ ఆత్మలకు నేర్పించేవారు ఒకే ఒక ఆత్మిక తండ్రియే. ఆత్మయే ధారణ చేస్తుంది. పరమపిత పరమాత్మలో ఈ జ్ఞానమంతా ఉంది. వారిలో 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానముంది. అందుకే వారిని కూడా స్వదర్శన చక్రధారి అని అనవచ్చు. వారు తన పిల్లలైన మనలను కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు. బాబా కూడా బ్రహ్మ శరీరములో ఉన్నారు. అందుకే వారిని బ్రాహ్మణుడని కూడా అనవచ్చు. మనము కూడా వారి పిల్లలము, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇప్పుడు తండ్రి కూర్చుని స్మృతియాత్ర నేర్పిస్తారు, ఇందులో హఠయోగము మొదలైన ఏ విషయాలూ లేవు. వారు హఠయోగము ద్వారా ట్రాన్స్ మొదలైన వాటిలోకి వెళ్తారు. ఇది గొప్ప విషయమేమీ కాదు. ట్రాన్స్లో గొప్పతనమేదీ లేదు. ట్రాన్స్ పైసా విలువ చేసే ఒక ఆట. మేము ట్రాన్స్లోనికి వెళ్తామని ఎప్పుడూ ఎవ్వరితోనూ అనరాదు. ఎందుకంటే ఈ రోజులలో విదేశాలలో అక్కడక్కడ అనేకమంది ట్రాన్స్లోనికి వెళ్తూ ఉంటారు. ట్రాన్స్లోకి వెళ్లినందున వారికీ లాభము లేదు, మీకు కూడా ఏ లాభమూ లేదు. బాబా జ్ఞానమిచ్చారు. ట్రాన్స్లో స్మృతియాత్రా లేదు, జ్ఞానమూ లేదు. ధ్యానము లేక ట్రాన్స్లోకి వెళ్లేవారు ఎప్పుడూ జ్ఞానము వినరు, వారి పాపాలేవీ భస్మము కావు. ట్రాన్స్కు ఏ గొప్పతనమూ లేదు. పిల్లలు చేసే యోగమును ట్రాన్స్ అని అనరు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ట్రాన్స్లో వికర్మలు వినాశనమవ్వవు. పిల్లలూ! ట్రాన్స్ పై ఆసక్తి ఉంచుకోకండి అని బాబా హెచ్చరిస్తున్నారు.
ఈ సన్యాసులు మొదలైన వారికి వినాశ సమయము వచ్చినప్పుడు జ్ఞానము లభిస్తుందని మీకు తెలుసు. మీరు వారికి ఆహ్వానమిస్తూ ఉండండి. ఈ జ్ఞానము వారి కలశములోకి త్వరగా రాదు. వినాశనము వారి ముందు కనిపించినప్పుడు వస్తారు. అప్పుడు మృత్యువు వచ్చేసిందని అర్థం చేసుకుంటారు. దగ్గరగా చూసినప్పుడు అంగీకరిస్తారు. వారి పాత్ర ఉండేదే అంతిమములో. ఇప్పుడు వినాశనము ఇక వచ్చేసిందని, మృత్యువు రాబోతుంది అని మీరు అందరికీ చెప్తారు. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు(కోతలు) అని వారు భావిస్తారు.
మీ వృక్షము చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. సన్యాసులకు కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్పాలి. కనులు మూసుకోరాదని తండ్రి అర్థము చేయించారు. కనులు మూసుకుంటే తండ్రిని ఎలా చూస్తారు? మనమంతా ఆత్మలము, పరమపిత పరమాత్మ ఎదుట కూర్చుని ఉన్నాము. వారు ఈ కనులకు కనిపించరు. కానీ ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. పరమపిత పరమాత్మ మనలను ఈ శరీరము ఆధారముతో చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. ఇందులో ధ్యానము మొదలైనవాటి మాటే లేదు. ధ్యానములోకి వెళ్లడం గొప్ప విషయమేమీ కాదు. ఈ భోగ్ మొదలైన విషయాలన్నీ డ్రామాలో నిశ్చయింపబడ్డాయి. సేవకులుగా అయ్యి భోగ్ సమర్పించి వస్తారు. ఉదాహరణానికి సేవకులు గొప్పవారికి దగ్గరుండి తినిపిస్తారు కదా. మీరు కూడా సేవకులే. దేవతలకు భోగ్ సమర్పించేందుకు వెళ్తారు. వారు ఫరిస్తాలు(సూక్ష్మదేవతలు). అక్కడ మమ్మా, బాబాలను చూస్తారు. ఆ సంపూర్ణ మూర్తులు కూడా మీ లక్ష్యాలే కదా. వారిని ఇటువంటి ఫరిస్తాలుగా ఎవరు తయారు చేసారు? ధ్యానములోకి వెళ్లడం గొప్ప విషయమేమీ కాదు. ఎలాగైతే ఇక్కడ శివబాబా మిమ్ములను చదివిస్తున్నారో, అలా అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఎంతోకొంత తెలుపుతారు. సూక్ష్మవతనములో ఏమి జరుగుతుంది? ఇది కేవలం తెలుసుకోవలసింది మాత్రమే. అంతేకాని ట్రాన్స్ మొదలైన వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వరాదు. ఎవరికైనా ట్రాన్స్ చూపించడం కూడా బాల్యచేష్టయే. బాబా అందరినీ హెచ్చరిస్తున్నారు - ట్రాన్స్లోకి వెళ్లకండి, ఇందులో కూడా చాలాసార్లు మాయ ప్రవేశిస్తుంది.
ఇది చదువు. కల్ప-కల్పమూ తండ్రి వచ్చి మిమ్ములను చదివిస్తారు. ఇది సంగమ యుగము. మీరు ఇప్పుడు బదిలీ అవ్వాలి. డ్రామా ప్లాను అనుసారము మీరు పాత్రను అభినయిస్తున్నారు. పాత్రకు గొప్పతనముంది. తండ్రి వచ్చి డ్రామానుసారము చదివిస్తారు. మీరు తండ్రి నుండి ఒక్కసారి చదువుకొని మనుష్యుల నుండి దేవతలుగా తప్పకుండా తయారవ్వాలి. దేవతలుగా అయ్యేందుకు పిల్లలకు చాలా సంతోషము కలుగుతుంది. మనము తండ్రి, రచనల ఆదిమధ్యాంతాలు కూడా తెలుసుకున్నాము. తండ్రి శిక్షణను పొంది మీరు చాలా హర్షితంగా అవ్వాలి. మీరు చదివేదే నూతన ప్రపంచము కొరకు, అక్కడ ఉండేదే దేవతల రాజ్యము. కావున పురుషోత్తమ సంగమ యుగములో తప్పకుండా చదువుకోవాలి. మీరు ఈ దు:ఖము నుండి విడుదల పొంది సుఖములోకి వెళ్తారు. ఇక్కడ తమోప్రధానంగా అయినందున మీరు అనారోగ్యము పాలవుతూ ఉంటారు. ఈ వ్యాధులన్నీ తొలగిపోతాయి. ముఖ్యమైనది చదువు. ఈ చదువుకు ట్రాన్స్ మొదలైన వాటితో ఏ సంబంధమూ లేదు. ఇది గొప్ప విషయము కాదు. చాలా చోట్ల ధ్యానములోనికి వెళ్లి నాలో మమ్మా ప్రవేశించారు, బాబా వచ్చారు అని చెప్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - అలాంటిదేమీ లేదు. ఆ తండ్రి ఒకే ఒక మాట అర్థం చేయిస్తున్నారు - మీరు అర్ధకల్పము దేహాభిమానములో ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. యోగమని అనడం వలన యాత్ర అని సిద్ధము(ఋజువు) కాదు. ఆత్మలైన మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవాలి, తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. మీరిప్పుడు యాత్ర చేస్తున్నారు. వారి యోగములో యాత్ర మాటే లేదు. హఠయోగులైతే చాలామంది ఉన్నారు. అది హఠయోగము, ఇది తండ్రిని స్మృతి చేసే యోగము. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధంగా ఇతరులెవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించలేరు. ఇది చదువు. తండ్రికి సంతానమై, తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి. మీరు మ్యూజియంలు తెరవండి, వారంతకు వారే మీ వద్దకు వస్తారు, పిలిచే కష్టముండదు అని బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానమైతే చాలా బాగుంది, ఎప్పుడూ వినలేదు అని అంటారు. దీని ద్వారా నడవడిక చక్కబడ్తుంది. ముఖ్యమైనది పవిత్రత. ఈ విషయము పైనే గలాటాలు, గొడవలు మొదలైనవి జరుగుతాయి. చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. మీ స్థితి ఎలా అవుతుందంటే - ఈ ప్రపంచములో ఉంటున్నా వారిని మీరు చూడరు. తింటూ, తాగుతూ, ఏ పని చేస్తున్నా మీ బుద్ధి అటువైపు ఉండాలి. ఉదాహరణానికి తండ్రి నూతన గృహము నిర్మిస్తే అందరి బుద్ధి కొత్త ఇంటి వైపు పోతుంది కదా. ఇప్పుడు క్రొత్త ప్రపంచము తయారవుతూ ఉంది. అనంతమైన తండ్రి, అనంతమైన ఇల్లు తయారు చేస్తున్నారు. మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు చక్రము పూర్తి అయ్యింది. ఇప్పుడు మనము ఇంటికి, అక్కడ నుండి స్వర్గానికిి వెళ్లాలి. వెళ్లాలంటే పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. స్మృతియాత్ర ద్వారా పవిత్రంగా అవ్వాలి. స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడ్తాయి. ఇందులోనే యుద్ధముంటుంది. చదువులో యుద్ధము మాట ఉండదు. చదువు చాలా సరళమైనది. 84 జన్మల చక్ర జ్ఞానము కూడా చాలా సహజమైనది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. తండ్రి అంటున్నారు - స్మృతియాత్రను మర్చిపోకండి. కనీసము 8 గంటలైనా తప్పకుండా స్మృతి చేయండి. శరీర నిర్వహణార్థము కర్మ కూడా చేయాలి, నిద్ర కూడా పోవాలి. ఇది సహజ మార్గము కదా. ఒకవేళ నిదురపోకండి అని అంటే అది హఠయోగమైపోతుంది. హఠయోగాలు చాలా ఉన్నాయి. అటువైపు చూడవద్దని తండ్రి చెప్తున్నారు. వాటి వలన ఏ లాభమూ లేదు. ఎంతోమంది హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. ఇవన్నీ మనుష్యమతాలు. మీరంతా ఆత్మలు, ఆత్మయే శరీరము ధరించి పాత్రను అభినయిస్తుంది, డాక్టరు మొదలైనవారిగా అవుతుంది. కానీ మనుష్యులు దేహాభిమానులుగా ఉన్నారు - నేను ఫలానా............ అంటూ దేహాభిమానులుగా అయిపోయారు.
ఇప్పుడు మీ బుద్ధిలో - 'మనమంతా ఆత్మలము' అని ఉంది. తండ్రి కూడా ఆత్మయే. ఈ సమయంలో ఆత్మలైన మిమ్ములను పరమపిత చదివిస్తున్నారు. అందుకే ఆత్మలు, పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు..... కల్ప-కల్పమూ కలుస్తారు.......(ఆత్మా-పరమాత్మా అలగ్ రహే బహుకాల్.............) అనే గాయనముంది. మిగిలిన ప్రపంచమంతా దేహాభిమానములో ఉండి, దేహమని భావిస్తూనే చదువుతారు, చదివిస్తారు. తండ్రి అంటున్నారు - నేను ఆత్మలను చదివిస్తాను. జడ్జి, వకీలు మొదలైనవారిగా కూడా ఆత్మయే అవుతుంది. ఆత్మలైన మీరు సతోప్రధానంగా, పవిత్రంగా ఉండేవారు. పాత్ర చేస్తూ చేస్తూ అందరూ పతితులుగా అయ్యారు. అందుకే బాబా మీరు వచ్చి మమ్ములను పవిత్ర ఆత్మలుగా చేయమని పిలుస్తారు. తండ్రి సదా పవిత్రంగానే ఉంటారు. ఈ విషయాన్ని విన్నప్పుడు ధారణ జరుగుతుంది. పిల్లలైన మీకు ధారణ జరిగినప్పుడు మీరు దేవతలుగా అవుతారు. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఇది కూర్చోదు. ఎందుకంటే ఇది కొత్త విషయము. ఇది జ్ఞానము, అది భక్తి. మీరు కూడా భక్తి చేస్తూ చేస్తూ దేహాభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలారా, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మలైన మనకు తండ్రి ఈ శరీరము ద్వారా చదివిస్తారు. ఈ ఒక్క సమయములో మాత్రమే ఆత్మలకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ చదివిస్తారని క్షణ-క్షణము జ్ఞాపముంచుకోండి. మిగిలిన సమయములో, డ్రామా మొత్తములో వీరి పాత్ర లేనే లేదు. ఈ సంగమ యుగములో మాత్రమే ఉంది. అందువలన తండ్రి మళ్లీ చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి, తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా ఉన్నతమైన యాత్ర. పైకి ఎక్కితే వైకుంఠ రసాన్ని గ్రోలుతారు........ వికారాల వశమైతే ఒక్కసారిగా చూర్ణమైపోతారు. అయినా స్వర్గములోకైతే వస్తారు, కానీ పదవి చాలా తక్కువదిగా ఉంటుంది. ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతూ ఉంది. ఇందులో తక్కువ పదవి వారు కూడా కావాలి. అందరూ జ్ఞానములో నడవలేరు. అలా అయితే బాబాకు చాలామంది పిల్లలు లభించాలి. ఒకవేళ లభించినా కొంత సమయానికే లభిస్తారు. మాతలైన మీకు చాలా మహిమ ఉంది. వందేమాతరమ్ అని గాయనము కూడా ఉంది. జగదంబకు చాలా గొప్ప మేళా జరుగుతుంది. ఎందుకంటే వారు చాలా సేవ చేశారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద రాజుగా అవుతారు. దిల్వాడా మందిరములో మీవే జ్ఞాపక చిహ్నాలున్నాయి. పిల్లలైన మీరు చాలా సమయాన్ని కేటాయించాలి. భోజనము మొదలైనవి చాలా శుద్ధంగా, స్మృతిలో కూర్చుని తయారుచేయాలి. అలా చేస్తే దానిని ఎవరికి తినిపించినా, వారి మనస్సు కూడా శుద్ధమైపోతుంది. ఇటువంటి భోజనము చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. ఈ భోజనము తింటూనే తిన్నవారి హృదయము ద్రవించిపోయే విధంగా నేను శివబాబా స్మృతిలో ఉంటూ భోజనము తయారు చేస్తున్నానా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. క్షణ-క్షణము స్మృతిని మర్చిపోతారు. బాబా అంటున్నారు - ఇంకా 16 కళా సంపూర్ణంగా అవ్వలేదు కనుక స్మృతిని మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడింది. తప్పకుండా సంపూర్ణంగా అయ్యే తీరాలి. పున్నమి చంద్రునిలో ఎంతో కాంతి ఉంటుంది, తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ కేవలం గీత వలె మిగిలిపోతుంది. గాఢాంధకారంగా మారి మళ్లీ గొప్ప ప్రకాశవంతంగా అవుతుంది. ఈ వికారాలు మొదలైనవి వదిలి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మ సంపూర్ణమైపోతుంది. మహారాజులుగా అవ్వాలని మీరు కోరుకుంటారు. కానీ అందరూ అవ్వలేరు. అందరూ పురుషార్థము చేయాలి. కొంతమంది పురుషార్థము చేయరు, అందువలన మహారథులు, అశ్వారూఢులు, పదాతిదళము అని అంటారు. మహారథులు కొంతమంది మాత్రమే ఉంటారు. ప్రజలు లేక సైన్యము ఎంతమంది ఉంటారో అంతమంది కమాండర్లు లేక మేజర్లు ఉండరు. మీలో కూడా కమాండర్లు, మేజర్లు, కెప్టెన్లు ఉన్నారు. పదాతి దళమువారు కూడా ఉన్నారు. మీది కూడా ఆత్మిక సైన్యమే కదా. ఆధారమంతా స్మృతియాత్ర పైనే ఉంది. దాని ద్వారానే బలము లభిస్తుంది. మీరు గుప్తయోధులు. తండ్రిని స్మృతి చేసినందున వికర్మల మురికి ఏదైతే ఉందో అది భస్మమైపోతుంది. తండ్రి అంటున్నారు - వృత్తి వ్యాపారాలు భలే చేసుకోండి, తండ్రిని స్మృతి చేయండి. మీరు ఆ ఒక్క ప్రియునికి జన్మ-జన్మాంతరాల ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు. కనుక వారిని స్మృతి చేయాలి. ఇంతకుముందు భలే స్మృతి చేస్తూ ఉండినా వికర్మలు వినాశనమయ్యేవి కాదు. మీరు ఇక్కడ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని తండ్రి తెలిపించారు. అలా ఆత్మయే తయారవ్వాలి. ఆత్మయే శ్రమ చేస్తుంది. ఈ జన్మలోనే మీరు జన్మ-జన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి. ఇది మృత్యు లోకములోని అంతిమ జన్మ. తర్వాత మళ్లీ అమరలోకములోకి వెళ్లాలి. ఆత్మ పవిత్రమవ్వకుండా అక్కడకు వెళ్లజాలదు. అందరూ తమ తమ లెక్కాచారాలు చుక్తా చేసుకొని వెళ్లాలి. తర్వాత శిక్షలు అనుభవించి వెళ్తే పదవి తగ్గిపోతుంది. ఏ శిక్షలు అనుభవించనివారు కేవలం మాలలోని 8 మణులుగా పిలువబడ్తారు. నవరత్నాల ఉంగరాలు మొదలైనవి తయారవుతాయి. ఈ విధంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సంగమ యుగములో స్వయాన్ని బదిలీ చేసుకోవాలి. చదువు మరియు పవిత్రతలను ధారణ చేసి మీ క్యారెక్టర్(స్వభావము)ను సరిదిద్దుకోవాలి. ట్రాన్స్ మొదలైన వాటి పై ఆసక్తి ఉంచుకోరాదు.
2. శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి, నిద్ర కూడా పోవాలి. ఇది హఠయోగము కాదు. కానీ స్మృతియాత్రను ఎప్పుడూ మర్చిపోరాదు. యోగయుక్తంగా ఉండి శుద్ధమైన భోజనము తయారు చేయాలి. యోగయుక్తంగా తినిపించాలి. తిన్న వారి హృదయము శుద్ధమైపోవాలి.
వరదానము :-
'' ఏ సేవ అయినా సత్యమైన మనసుతో లేక లగ్నముతో చేసే సత్యమైన ఆత్మిక సేవాధారి భవ ''
ఏ సేవ అయినా సత్యమైన మనసుతో, లగ్నముతో చేసినట్లయితే ఆ సేవకు నూటికి నూరు మార్కులు లభిస్తాయి. సేవలో చిర్రుబుర్రులుండరాదు. సేవ, పనిని దింపుకునేందుకు చేయరాదు. చెడిపోయిన వారిని బాగు చేయడం, అందరికీ సుఖమివ్వడం, ఆత్మలను యోగ్యులుగా, యోగులుగా చేయడం, అపకారులకు ఉపకారము చేయడం, సమయానికి ప్రతి ఒక్కరికి సహయోగమివ్వడమే మీ సేవ. ఇటువంటి సేవ చేసేవారే సత్యమైన ఆత్మిక సేవాధారులు.
స్లోగన్ :-
'' మీ సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానిస్తే స్థితి హెచ్చు తగ్గులగుట నుండి విడుదల అవుతుంది ''