03-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - స్మృతికి ఆధారము ప్రేమ. ప్రేమ తక్కువైతే స్మృతి ఏకరసంగా ఉండజాలదు. స్మృతి ఏకరసంగా లేకుంటే ప్రేమ లభించజాలదు. ''

ప్రశ్న :-

ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏది? అందుకు గుర్తు ఏమిటి ?

జవాబు :-

ఈ శరీరము ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు. ఎంత ప్రేమంటే దానిని వదిలేందుకు ఇష్టపడదు. దానిని రక్షించుకునేందుకు అనేక ఏర్పాట్లు రచిస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! ఇది తమోప్రధానమైన ఛీ - ఛీ శరీరము. మీరు ఇప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరము పై మమత్వము తొలగించండి. ఈ శరీర భానము ఉండరాదు - ఇదే మీ గమ్యము, లక్ష్యము.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దైవీ స్వరాజ్య ఉద్ఘాటన జరిగిపోయిందని పిల్లలకిప్పుడు తెలుసు. ఇప్పుడు అక్కడకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా శాఖను తెరిస్తే పెద్ద వ్యక్తుల ద్వారా ప్రారంభోత్సవము చేయించేందుకు ప్రయత్నిస్తారు. గొప్ప వ్యక్తిని చూచి వారి క్రింద పని చేసే ఆఫీసర్లు మొదలైన వారందరూ వస్తారు. గవర్నర్‌ వచ్చారనుకోండి, పెద్ద - పెద్ద మినిస్టర్లు మొదలైనవారు వస్తారు. ఒకవేళ కలెక్టరును పిలిస్తే అంత గొప్ప వ్యక్తులు రారు. కావున అందరికన్నా గొప్ప వ్యక్తులను తీసుకు వచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. ఏదో ఒక సాకుతో లోపలకు వస్తే మీరు వారికి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము ఎలా లభిస్తుందో ఆ మార్గము తెలపండి. బ్రాహ్మణులైన మీకు తప్ప మరి ఏ ఇతర మనుష్యులకు ఆ మార్గము తెలియదు. అలాగని భగవంతుడు వచ్చారని కూడా నేరుగా చెప్పరాదు. భగవంతుడు వచ్చేశారని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కానీ అలా చెప్పరాదు. తామే భగవంతుడు అని చెప్పుకునేవారు కూడా చాలామంది వచ్చారు. డ్రామా ప్లాను అనుసారము కల్పక్రితము వలె అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థం చేయించాలి. ఈ లైను పూర్తిగా వ్రాయాల్సి ఉంటుంది. ఎవరి అదృష్టములో ఉంటుందో వారు వ్రాసిన దానిని చదువుతారు, తర్వాత ప్రయత్నిస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు కదా. నిశ్చయబుద్ధి గల పిల్లలు మాత్రమే ఇచ్చటకు వస్తారు. నిశ్చయబుద్ధి గలవారు కూడా ఒక్కొక్కసారి సంశయబుద్ధి గలవారిగా అయిపోతారు. మాయ వెంబడిస్తూ ఉంటుంది. నడుస్తూ - నడుస్తూ పరాజయులవుతారు. ఓటమే లేకుండా ఒకేవైపు విజయముండే నియమము కూడా లేదు. గెలుపు-ఓటమి రెండూ జరుగుతూ ఉంటాయి. ప్రథమ శ్రేణి(ఫస్ట్‌ క్లాస్‌), ద్వితీయ శ్రేణి(సెకండ్‌ క్లాస్‌), తృతీయ శ్రేణి(థర్డ్‌ క్లాస్‌) అని యుద్ధములో కూడా మూడు రకాలవారు ఉంటారు. అప్పుడప్పుడు యుద్ధము చేయనివారు కూడా చూచేందుకు వస్తారు. వారిని కూడా అనుమతిస్తారు. ఒకవేళ కొద్దిగా రంగు పడినా వారు కూడా సైన్యములోకి వచ్చేస్తారని భావిస్తారు. ఎందుకంటే మీరు మహారథి యోధులని ప్రపంచములోని వారికి తెలియదు. ఎందుకంటే మీ చేతిలో ఆయుధాలు మొదలైనవేవీ లేవు. మీ చేతిలో ఆయుధాలు శోభించవు కూడా. కానీ జ్ఞాన ఖడ్గము, జ్ఞానమనే కైజారు అని తండ్రి వివరిస్తారు కదా. వాటిని వారు స్థూలమైనవని భావించారు. పిల్లలైన మీకు తండ్రి జ్ఞానము అనే అస్త్ర-శస్త్రాలను ఇస్తారు. ఇందులో హింస అనే మాటే లేదు. కానీ ఇది అర్థము చేసుకోరు. దేవీలకు స్థూలమైన ఆయుధాలు మొదలైనవి ఇచ్చేశారు. వారిని కూడా హింసకులుగా చేసేశారు. ఇది పూర్తిగా తెలివి తక్కువతనం. ఎవరెవరు పుష్పాలుగా అవ్వనున్నారో తండ్రికి బాగా తెలుసు. పుష్పాలు ముందుండాలని తండ్రే స్వయంగా చెప్తున్నారు. వీరు తప్పకుండా పుష్పాలుగా అవుతారని బాబాకు తెలుసు. కానీ బాబా వారి పేర్లు చెప్పరు. ఒకవేళ చెబితే, అయితే మేము ముళ్లుగా అవుతామా? అని మిగిలిన వారంటారు. నరుని నుండి నారాయణునిగా ఎవరు అవుతారని అడిగితే అందరూ చేతులెత్తుతారు. ఎవరు సర్వీసు ఎక్కువగా చేస్తారో వారే తండ్రిని కూడా స్మృతి చేస్తారని స్వయం కూడా భావిస్తారు. తండ్రి పై ప్రేమ ఉంటే స్మృతి కూడా వారిదే ఉంటుంది. ఏకరసంగా ఎవ్వరూ స్మృతి చేయలేరు. స్మృతి చెయ్యడం లేదంటే ప్రీతి లేదని అర్థం. ప్రియమైన వస్తువును చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ప్రియముగా ఉంటే తల్లిదండ్రులు తమ ఒడిలోకి తీసుకుంటారు. చిన్న పిల్లలు కూడా పుష్పాలే. ఎలాగైతే మీకు శివబాబా వద్దకు వెళ్లిపోవాలనిపిస్తుందో కదా అలా చిన్న పిల్లలు కూడా ఆకర్షిస్తారు. అలాంటి పిల్లలను వెంటనే ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమిస్తారు.

ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైనవారు, అన్ని శుభమైన మనోకామనలను పూర్తి చేస్తారు. మనుష్యులకు ఏం కావాలి? ఒకటేమో ఆరోగ్యం బాగుండాలి, ఎప్పుడూ జబ్బుపడరాదని అనుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యము బాగుండి ధనము లేకుంటే ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడ్తుంది. ఆరోగ్యం తర్వాత సుఖంగా ఉండేందుకు ధనము కావాలి. మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ తప్పకుండా లభిస్తాయని తండ్రి అంటారు. ఇది కొత్త విషయము కాదు. ఇవి చాలా చాలా పురాతన విషయాలు. మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారో అప్పుడు ఇలాగే చెప్తారు. అంతేకాని లక్షలు, పదమాల(కోటాను కోట్ల) సంవత్సరాల విషయాలని అనరు. అంతేకాక ఈ ప్రపంచము కొత్తదిగా ఎప్పుడవుతుందో, మళ్లీ పాతదిగా ఎప్పుడవుతుందో మీకు తెలుసు. ఆత్మలైన మనము నూతన ప్రపంచములోకి వెళ్తాము. మళ్లీ పాత ప్రపంచములోకి వస్తాము. మీకు ఆల్‌రౌండర్‌ అని పేరు పెట్టడం జరిగింది. మీరు ఆల్‌రౌండర్లు అని తండ్రి అర్థం చేయించారు. పాత్ర్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతములోకి వచ్చి చేరుకున్నారు. మొట్టమొదట మీరు పాత్ర చేసేందుకు వస్తారు. అది స్వీట్‌ సైలెన్స్‌ హోమ్‌(ూషవవ్‌ ూఱశ్రీవఅషవ నశీఎవ). మనుష్యులు శాంతి కోసము ఎంత అలమటిస్తారు! శాంతిధామములో ఉండేవారమని, పాత్ర చేసేందుకు అక్కడి నుండి వచ్చామని తెలియదు. పాత్ర పూర్తయిన తర్వాత మళ్లీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తప్పకుండా వెళ్తాము. అందరూ శాంతిధామము నుండి వస్తారు. అందరి ఇల్లు ఆ బ్రహ్మలోకము, బ్రహ్మాండము. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. రుద్రుని కూడా పెద్దగా గుడ్డు ఆకారములో తయారు చేస్తారు. ఆత్మ చాలా చిన్నదని వారికి తెలియదు. నక్షత్రములాగా ఉంటుందని కూడా అంటారు కానీ పెద్ద లింగానికే పూజలు చేస్తారు. ఇంత చిన్న బిందువుకు పూజ చేయడం వీలు పడదని మీకు తెలుసు. ఇక పూజలెవరికి చెయ్యాలి? అందుకే పెద్దదిగా చేసి పూజలు చేస్తారు. పాలాభిషేకము చేస్తారు. వాస్తవానికి ఆ శివుడు అభోక్త అయినా వారికి పాలాభిషేకము ఎందుకు చేస్తారు? పాలు తాగితే అతడు భోక్తగా అయిపోతాడు. ఇది కూడా ఒక అద్భుతము(విచిత్రము). మేము వారికి వారసులము, వారు మాకు వారసులు అని అందరూ అంటారు. ఎందుకంటే మేము వారికి బలిహారి అయ్యాము. ఎలాగైతే తండ్రి ప్లిలలకు బలిహారి అయిన కారణంగా పూర్తి ఆస్తిని పిల్లలకు ఇచ్చి వానప్రస్థానికి వెళ్తారో, అలా ఇక్కడ కూడా తండ్రి వద్ద ఎంత జమ చేసుకుంటామో అంత సురక్షితమైపోతుందని మీకు తెలుసు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది,............. అనే గాయనము కూడా ఉంది. ఏదీ ఉండదని మీకు తెలుసు. అన్నీ భస్మమైపోవాల్సిందే. విమానాలు క్రింద పడిపోతే, వినాశనము జరిగితే దొంగలకు ధనము లభిస్తుందని కూడా కాదు. ఎందుకంటే దొంగలు మొదలైనవారు కూడా అంతమైపోతారు. ఆ సమయంలో దొంగతనము మొదలైనవి కూడా సమాప్తమైపోతాయి. లేదంటే విమానాలు పడిపోతే మొట్టమొదట సంపదంతా దొంగల చేతుల్లోకి వస్తుంది. దొంగలు ఆ సంపదను అడవుల్లో ఎక్కడైనా దాచిపెడ్తారు. ఇది సెకండు పని. అనేక రకాలైన దొంగతనాలు చేస్తారు. కొందరు రాయల్‌గా, కొందరు అన్‌రాయల్‌గా చేస్తూ ఉంటారు. ఇదంతా వినాశనమైపోతుందని, మీరు మొత్తం విశ్వానికంతా యజమానులుగా అవుతారని మీకు తెలుసు. మీరు ఎక్కడా ఏమీ వెతకవలసిన అవసరముండదు. మీరు చాలా ఉన్నతమైన ఇంటిలో జన్మ తీసుకుంటారు. మీకు ధనము అవసరమే ఉండదు. రాజులకు ఎప్పుడూ ధనము తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. దేవతలకైతే అసలు ఈ ఆలోచన ఉండనే ఉండదు. తండ్రి మీకు అన్నీ ఇచ్చేస్తారు. దీనితో మీరు దొంగతనము చేయడం, ఈర్ష్య పడడం మొదలైనవేవీ ఉండవు. మీరు పూర్తి పుష్పాలుగా అయిపోతారు. ముళ్లు మరియు పుష్పాలు ఉన్నాయి కదా. ఇక్కడ అందరూ ముళ్లే ముళ్లు. వికారాలు లేకుండా ఉండలేరు. వారిని తప్పకుండా ముళ్లు అనే అనవలసి ఉంటుంది. ఇక్కడ రాజుల నుండి అందరూ ముళ్లుగానే ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు - నేను మిమ్ములను ఈ లక్ష్మినారాయణుల వలె చేస్తాను అనగా రాజాధి రాజులుగా చేస్తాను. ముళ్లుగా ఉండేవారు పుష్పాలుగా ఉండేవారి ముందుకెళ్లి తల వంచుతారు. ఈ లక్ష్మినారాయణులు తెలివైనవారు కదా. సత్యయుగము వారిని మహారాజులని, త్రేతాయుగము వారిని రాజులంటారని కూడా బాబా తెలియజేశారు. గొప్పవారిని మహారాజులని, తక్కువ సంపాదన గలవారిని రాజులని అంటారు. మొదట మహారాజుల దర్బారు జరుగుతుంది. పదవులంటూ ఉన్నాయి కదా. సింహాసనాలు(కుర్చీలు) కూడా నంబరువారుగా లభిస్తాయి. అనుకోకుండా ఎవరైనా వస్తే ముందు వారికి కుర్చీ ఇస్తారు, గౌరవించవలసి ఉంటుంది.

మన మాల తయారౌతుందని మీకు తెలుసు. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలో లేదు. రుద్రమాలను జపిస్తూ(తిప్పుతూ) ఉంటారు. మీరు కూడా తిప్పేవారు కదా. అనేక మంత్రాలను జపించేవారు. ఇది కూడా భక్తియేనని తండ్రి చెప్తున్నారు. ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చేయాలి. ముఖ్యంగా తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, దేహాభిమానము కారణముగా భక్తిమార్గములో మీరు అందరినీ స్మృతి చేసేవారు. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఒక్క తండ్రి లభించారు కనుక కూర్చుంటూ, లేస్తూ ఆ తండ్రినే స్మృతి చేస్తే చాలా సంతోషము కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం వలన మొత్తం విశ్వ రాజ్యమంతా లభిస్తుంది. సమయము ఎంత తగ్గిపోతూ వస్తుందో అంత త్వరత్వరగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. రోజురోజుకు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఆత్మ ఎప్పటికీ అలసిపోదు. శరీరముతో ఏదైనా పర్వతము మొదలైన వాటి పైకి ఎక్కితే అలసిపోతారు. తండ్రిని స్మృతి చేసినందున మీకు ఏ అలసటా కలగదు. సంతోషంగా ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. శాంతిధామానికి వెళ్లాలని పిల్లలు అర్ధకల్పము శ్రమించారు. లక్ష్యము గురించి కొద్దిగా కూడా తెలియదు. ఇప్పుడు మీకు తండ్ర్రి పరిచయముంది. భక్తిమార్గములో ఎవరి కోసమైతే ఇంత చేశారో వారే అంటున్నారు - ఇప్పుడు ''నన్ను స్మృతి చేయండి.'' బాబా చెప్పేది నిజమో కాదో మీరే ఆలోచించండి. నీటి ద్వారా పావనంగా అయిపోతామని వారు భావిస్తారు. నీరు ఇక్కడ కూడా ఉంది కదా. ఇదేమైనా గంగ నీరా? కాదు. ఇది వర్షము ద్వారా చేరిన నీరు. సెలయేర్ల నుండి ప్రవహిస్తూనే ఉంటుంది. దీనిని గంగా జలమని అనరు. ఎప్పుడూ ఆగిపోదు. ఇది కూడా ప్రాకృతిక నియమము. వర్షము ఆగిపోయినా నీరు మాత్రము ప్రవహిస్తూనే ఉంటుంది. వైష్ణవులు ఎప్పుడూ బావి నీటినే తాగుతారు. ఒకవైపు ఇది పవిత్రమైనదని భావిస్తాారు. మరోవైపు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు, గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. దీనిని అజ్ఞానమనే అంటారు. వర్షపు నీరు బాగుంటుంది. ఇది కూడా డ్రామా నియమము అని అంటారు. భగవంతుని సహజ సృష్టి నియమము. బీజము ఎంతో చిన్నదిగా ఉంటుంది. దాని ద్వారా వెలువడే వృక్షము చాలా పెద్దది. భూమి బంజరుగా అయితే అందులో శక్తి ఉండదని, దానిలో సారముండదని కూడా మీకు తెలుసు. స్వర్గము ఎలా ఉంటుందో పిల్లలైన మీకు తండ్రి ఇక్కడే అంతా అనుభవము చేయిస్తారు. ఇప్పుడైతే స్వర్గము లేదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అక్కడ పండ్లు మొదలైనవి చాలా మధురంగా ఉంటాయని పిల్లలు సాక్షాత్కారములో చూచారు. మీరు ధ్యానములో చూసి వచ్చి వినిపిస్తారు. పిల్లలకు సాక్షాత్కారము కూడా అవుతుంది. ఇప్పుడు మీరు దేనినైతే సాక్షాత్కారము చేసుకుంటున్నారో అది అక్కడకు వెళ్లిన తర్వాత ఈ కళ్లతో చూస్తారు, నోటితో తింటారు. ఏది సాక్షాత్కారము అయ్యిందో దానిని కళ్లతో చూస్తారు అయితే పురుషార్థానుసారము జరుగుతుంది. పురుషార్థమే చేయలేదంటే ఏ పదవి పొందుతారు? మీ పురుషార్థము నడుస్తూ ఉంది. మీరు ఇలా అవుతారు. వినాశనము తర్వాత ఈ లక్ష్మి-నారాయణులుగా అవుతారు. ఇది కూడా ఇప్పుడు తెలిసింది. పావనంగా అయ్యేందుకు సమయము పడ్తుంది. ముఖ్యమైనది స్మృతియాత్ర. సోదర-సోదరీలుగా భావించడం ద్వారా కూడా మార్పు రానందున ఇప్పుడు భాయీ-భాయీగా (సోదరులుగా) భావించమని చెప్తున్నారు. సోదర-సోదరీలుగా భావించడం ద్వారా కూడా దృష్టి చలించదు కానీ సోదర దృష్టితో చూస్తే శరీరమే ఉండదు. మనమంతా ఆత్మలము, శరీరము కాదు. ఇక్కడ ఏమేమి చూస్తున్నామో అదంతా వినాశనమైపోతుంది. మీరు ఈ శరీరాన్ని వదిలి అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని ఏ విధంగా వదిలి వెళ్లాలో నేర్చుకునేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. ఇదే కదా గమ్యము. ఆత్మకు శరీరమంటే చాలా ప్రియము. శరీరాన్ని వదలరాదని ఆత్మ ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. ఆత్మకు ఈ శరీరము పై చాలా చాలా ప్రేమ ఉంది. ఇది పురాతన శరీరము అని తండ్రి అంటున్నారు. మీరు కూడా తమోప్రధానంగా ఉన్నారు, మీ ఆత్మ కూడా ఛీ-ఛీగా ఉంది. అందుకే దు:ఖము, అనారోగ్యాలు వస్తాయి. ఈ శరీరము పైన ప్రీతి పెట్టుకోరాదని తండ్రి అంటున్నారు. ఇది పురాతన శరీరము. ఇప్పుడు మీరు కొత్తదానిని కొనుక్కోవాలి. కొనుక్కునేందుకు ఏ దుకాణాలూ లేవు. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి అంటున్నారు. తర్వాత మీకు పవిత్రమైన శరీరము లభిస్తుంది, పంచ తత్వాలు కూడా పావనమైపోతాయి. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయించి మళ్లీ ''మన్మనాభవ'' అని అంటారు. మంచిది. బాబా బాబాబాబా

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శివబాబాకు మనము వారసులము, వారు మనకు వారసులు. ఈ నిశ్చయంతో తండ్రి పై పూర్తిగా బలిహారమవ్వాలి. బాబా వద్ద ఎంత జమ చేసుకుంటారో అంత సురక్షితమైపోతుంది. కొందరిది మట్టిలో కలిసిపోతుంది................ అని చెప్తారు కదా.

2. ముళ్ల నుండి పుష్పాలుగా ఇప్పుడే తయారవ్వాలి. ఏకరస స్మృతి మరియు సర్వీసు ద్వారా తండ్రి ప్రేమకు అధికారులుగా అవ్వాలి రోజురోజుకు స్మృతిలో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి.

వరదానము :-

'' ఈ కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణం చేసే ప్రకృతిజీత్‌ మాయాజీత్‌ భవ ''

సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. ఈ యుగములో సదా ''నేను కళ్యాణకారి ఆత్మను, నా కర్తవ్యం మొదట స్వ కళ్యాణం తర్వాత అందరి కళ్యాణం చేయుట'' అనే స్వమానం గుర్తుండాలి. మనుష్యాత్మల కళ్యాణమే కాదు, మేము ప్రకృతికి కూడా కళ్యాణము చేసేవారము. అందువలన ప్రకతిజీతులు, మాయాజీతులు అని అంటారు. ఎప్పుడైతే పురుషుడైన ఆత్మ ప్రకృతిజీత్‌గా అవుతుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాతగా అవుతుంది. ప్రకృతి లేక మాయ కలిగించే అలజడిలోకి రాలేరు. వారి పై అకళ్యాణ వాయుమండలం యొక్క ప్రభావము పడజాలదు.

స్లోగన్‌ :-

'' ఒకరి విచారాలను రెండవవారు గౌరవిస్తే, మాననీయ ( గౌరవనీయ ) ఆత్మలుగా అవుతారు. ''