19-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - శరీర నిర్వహణార్థము కర్మలాచరిస్తూ అనంతమైన ఉన్నతిని చేసుకోండి. ఈ అనంతమైన చదువు ఎంత బాగా చదువుతారో, అంత ఉన్నతి జరుగుతుంది. ''

ప్రశ్న :-

పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువు చదువుతున్నారో, అందులో అన్నిటికంటే ఉన్నతమైన కష్టమైన సబ్జెక్టు ఏది?

జవాబు :-

ఈ చదువులో అన్నిటికంటే ఉన్నతమైన సబ్జెక్టు సోదర(భాయి - భాయి) దృష్టిని పక్కా చేసుకోవడం. తండ్రి ఏదైతే జ్ఞాన మూడవ నేత్రమును ఇచ్చారో ఆ నేత్రము ద్వారా సోదర ఆత్మలను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసము చేయరాదు. ఏ దేహధారుల నామ-రూపాలలోకి బుద్ధి వెళ్ళరాదు. బుద్ధిలో కొద్దిగా కూడా ఛీ-ఛీ(చెడు) సంకల్పాలు నడవరాదు. ఇందులోనే శ్రమ ఉంది, ఈ సబ్జెక్టులో పాస్‌ అయ్యేవారు విశ్వాధికారులుగా అవుతారు.

ఓంశాంతి.

అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ప్రతి విషయము ఒకటి హద్దులోనిది ఉంటుంది, రెండవది బేహద్‌లోనిది కూడా ఉంటుంది. ఇంత సమయము మీరు హద్దులో ఉండేవారు, ఇప్పుడు బేహద్‌లో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైనదే. ఈ చదువు అనంతమైన సామ్రాజ్యము పొందేందుకు చదువుకుంటున్నారు. దీని కంటే గొప్ప చదువు మరొకటి ఏదీ ఉండదు. చదివించేది ఎవరు ? - అనంతమైన తండ్రి ! భగవంతుడు !! శరీర నిర్వహణార్థము అన్ని పనులు చేయాలి. అంతేకాక మీ ఉన్నతి కొరకు కూడా కొంత చేయవలసి ఉంటుంది. చాలా మంది ఉద్యోగము చేస్తూ కూడా ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు. అక్కడ హద్దులోని ఉన్నతి, ఇక్కడ అనంతమైన తండ్రి వద్ద అనంతమైన ఉన్నతి. తండ్రి చెప్తున్నారు - హద్దు మరియు బేహద్‌ ఉన్నతులు రెండూ చేసుకోండి. మేము ఇప్పుడు బేహద్‌ సత్యమైన సంపాదన చేసుకోవాలని బుద్ధి ద్వారా భావిస్తారు. ఇచ్చట సర్వస్వమూ మట్టిలో కలిసిపోతుంది. మీరు అనంతమైన సంపాదనలో ఎంతెంత తీక్షణమవుతూ ఉంటారో అంత హద్దు సంపాదనలోని విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వినాశనము జరగనున్నదని అందరూ అర్థం చేసుకుంటారు. వినాశము సమీపించినప్పుడు భగవంతుని కూడా వెతుకుతారు. వినాశనము జరిగినప్పుడు స్థాపన చేయువారు కూడా తప్పకుండా ఉంటారు. ఈ ప్రపంచానికి ఏమీ తెలియదు. మీరు ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలు కూడా నంబర్‌వారీ పురుషార్థానుసారము చదువుకుంటున్నారు. చదువుకునే విద్యార్థులు హాస్టల్‌లో ఉంటారు. కానీ ఈ హాస్టల్‌ భిన్నమైనది. ఈ హాస్టల్‌లో చాలామంది ఇంటికి వెళ్ళకుండా అలాగే ఉండిపోతారు. ఎవరైతే ప్రారంభములో ఇంటి నుండి వచ్చేశారో, వారు అలాగే ఉండిపోయారు. అలాగే వచ్చేశారు. రకరకాల వారు వచ్చారు. అందరూ మంచివారే వచ్చారని కాదు. చిన్న చిన్న పిల్లలను కూడా మీరు తీసుకొని వచ్చారు. మీరు పిల్లలను కూడా సంభాళన చేసేవారు. తర్వాత వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు! తోటలో పుష్పాలు కూడా చూడండి, పక్షులు కూడా ఎలా కూ-కూ(టిక్లూ - టిక్లూ) అని శబ్ధాలు చేస్తాయో చూడండి, ఇప్పుడు మనుష్య సృష్టి కూడా అలాగే ఉంది. మనలో ఎలాంటి సభ్యతా లేకుండా పోయింది. సభ్యత గలవారి మహిమను గానము చేస్తూ ఉండేవారు. మేము గుణహీనులము, మాలో ఏ గుణాలూ లేవు,.......... అని అనేవారు. భలే ఎంతో గొప్ప మనుష్యులు వస్తారు, మాకు రచయిత-రచనల ఆదిమధ్యాంతాలు తెలియవని ఫీల్‌ చేస్తారు. మరి వారెందుకు పనికి వస్తారు? మీరు కూడా దేనికీ పనికి వచ్చేవారు కాదు. ఇదంతా బాబా అద్భుతము అని మీరు భావిస్తారు. తండ్రి విశ్వాధికారులుగా తయారుచేస్తారు. ఈ రాజ్యమును మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు. కొద్దిగా కూడా విఘ్నాలు కలిగించలేరు. ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నాము! అలాంటి తండ్రి శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. భలే ప్రపంచములో ఎంతో గ్లాని, హంగామా మొదలైనవి జరుగుతాయి, ఇవన్నీ కొత్త విషయాలు కావు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఇలాగే జరిగింది. శాస్త్రాలలో కూడా ఉంది. ఈ భక్తిమార్గపు శాస్త్రాలను మళ్లీ భక్తిమార్గములో చదువుతారని పిల్లలకు తెలిపించారు. ఈ సమయములో మీరు జ్ఞానము ద్వారా సుఖధామములోకి వెళ్తారు. దాని కొరకు పురుషార్థము పూర్తిగా చేయాలి. ఇప్పుడు ఎంత పురుషార్థము చేస్తారో, కల్ప-కల్పము అంతే జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుకుంటామని ఆంతరికంగా పరిశీలించుకోవాలి. మేము ఎంత బాగా చదువుకుంటామో, అంత ఉన్నత పదవిని పొందుకుంటామని ప్రతి విద్యార్థి అర్థము చేసుకోగలడు. వీరు మాకన్నా చురుకైనవారు, నేను కూడా చురుకుగా అవ్వాలి అని విద్యార్థులు భావిస్తారు. అలాగే వ్యాపారస్థులలో కూడా నేను వీరి కంటే ఉన్నతి పొందాలి అనగా చురుకుగా అవ్వాలి అని ఉంటుంది. అల్పకాల సుఖము కొరకు శ్రమ చేస్తారు. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! నేను మీకు ఎంతో గొప్ప తండ్రిని, సాకార తండ్రి కూడా ఉన్నారు, నిరాకార తండ్రి కూడా ఉన్నారు. ఇరువురు తండ్రులు కలిసి ఉన్నారు. వారిరువురు కలిసి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థము చేెసుకున్నారు. ఈ చదువు గురించి ఇతరులెవ్వరికీ తెలియనే తెలియదు. మొట్టమొదటి విషయము మనలను చదివించేది ఎవరు? భగవంతుడు ఏం చదివిస్తున్నారు - '' రాజయోగము''. మీరు రాజఋషులు, వారు హఠయోగులు. వారు కూడా ఋషులే, అయితే వారు హద్దులోని ఋషులు. మేము ఇల్లు-వాకిళ్ళు వదిలేశామని వారంటారు. ఇదేమైనా మంచి పనా? వికారాల కొరకు విసిగించినప్పుడు మీరు ఇల్లు-వాకిళ్ళు వదిలేస్తారు. వారికి ఏమి ఇబ్బంది కలిగింది? మీకు దెబ్బలు పడినప్పుడే మీరు పారిపోయి వచ్చేశారు. ఒక్కొక్కరిని అడగండి. ఒక్కొక్క కుమారిని, ఒక్కొక్క స్త్రీని వారు ఎన్ని దెబ్బలు తిన్నారో అడగండి. అందుకే వారు ఇక్కడకు వచ్చేశారు. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు! ఇక్కడ జ్ఞానామృతము లభించేది. కనుక మేము జ్ఞానామృతమును సేవించేందుకు ఓంరాధ వద్దకు వెళ్తున్నామని పెద్దవారి వద్ద జాబు తీసుకొని వచ్చారు. వికారాల కొరకు ఈ జగడాలు, గలాటాలు ప్రారంభము నుండి వస్తూనే ఉన్నాయి. ఆసురీ ప్రపంచము ఎప్పుడు వినాశనమవుతుందో అప్పుడు ఈ గలాటాలు సమాప్తమవుతాయి. తర్వాత అర్ధకల్పము వరకు గలాటాలు జరగవు.

ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాలబ్ధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రాలబ్ధాన్ని వారసత్వము లభిస్తుంది. ఇచ్చట తండ్రి చెప్తున్నారు - మీరు ఆడ పిల్లలైనా, మగ పిల్లలైనా ఇరువురూ వారసత్వానికి హక్కుదారులే. ఆ లౌకిక తండ్రికి భేదభావాలు ఉంటాయి. కేవలం మగపిల్లలనే వారసులుగా చేస్తారు. పత్నిని అర్ధభాగస్వామి(హాఫ్‌పార్ట్‌నర్‌) అని అంటారు, కానీ వారికి కూడా భాగమును ఇవ్వరు. మగపిల్లలే సంభాళన చేస్తారు. తండ్రికి మగపిల్లల పై మోహముంటుంది. కానీ ఈ తండ్రి నియమానుసారము పిల్లలందరికీ(ఆత్మలకు) వారసత్వమునిస్తారు. ఇక్కడ మగపిల్లలు, ఆడపిల్లలు అను భేదమే తెలియదు. మీరు అనంతమైన తండ్రి నుండి ఎంతో సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు అయినా పూర్తిగా చదవరు. చదువును వదిలేస్తారు. పిల్లలు ఇలా వ్రాస్తారు - బాబా ఫలానావారు రక్తముతో వ్రాసి ఇచ్చారు కానీ ఇప్పుడు సెంటరుకు రావడం లేదు. బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి (తుమ్‌ ప్యార్‌ కరో యా ఠుకరావో...............) మేము మిమ్ములను ఎప్పుడూ వదలమని రక్తముతో వ్రాస్తారు కానీ పాలన తీసుకొని మళ్లీ వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామా అని బాబా అర్థం చేయించారు. కొందరు ఆశ్చర్యకరంగా పారిపోతారు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలాంటి అనంతమైన తండ్రిని మేము ఎలా వదల్తాము అని నిశ్చయముంటుంది. ఇది చదువు కూడా అయ్యింది. నేను జతలో తీసుకెళ్తానని తండ్రి గ్యారంటీ కూడా ఇస్తారు. సత్యయుగం ఆదిలో ఇంతమంది మనుష్యులు లేరు. ఇప్పుడు సంగమ యుగములో మనుష్యులందరూ ఉన్నారు. సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇన్ని ధర్మాలవారు ఎవ్వరూ ఉండరు. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళిపోతారు. లెక్కాచారము చుక్తా చేసుకొని పాత్రను అభినయించేందుకు ఎక్కడ నుండి వచ్చారో, అక్కడికి వెళ్ళిపోతారు. అది రెండు గంటల నాటకమే. కానీ ఇది అనంతమైన నాటకము. మనము ఆ ఇంటిలో నివసించేవారమని, ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. నిర్వాణధామము ఆత్మల నివాసస్థానమని, అది శబ్ధానికి అతీతమని కూడా మీకు తెలుసు. అక్కడ శబ్ధము ఉండదు. బ్రహ్మతత్వములో లీనమైపోతామని మనుష్యులు భావిస్తారు. బాబా చెప్తారు - ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ వినాశనమవ్వజాలదు. ఎంతమంది జీవాత్మలున్నారు! ఆత్మ అవినాశి, జీవము(శరీరము) ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మలందరూ డ్రామాలోని పాత్రధారులే, ఆత్మల నివాసస్థానము బ్రహ్మాండము, అది ఆత్మల ఇల్లు. అక్కడ ఆత్మ గ్రుడ్డు వలె కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మాండములో ఆత్మలు నివసించే స్థానముంది. ప్రతి విషయాన్ని బాగా అర్థము చేసుకోవాలి. ఒకవేళ అర్థము కాలేదంటే, వింటూ ఉన్నట్లైతే ముందు ముందు మీరే అర్థం చేసుకుంటారు. వదిలి వేశారంటే ఏమీ అర్థము చేసుకోలేరు. ఈ పాత ప్రపంచము సమాప్తమై నూతన ప్రపంచము స్థాపన అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. నిన్న మీరు విశ్వాధికారులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్లీ విశ్వాధికారులుగా అయ్యేందుకు వచ్చారని తండ్రి చెప్తారు. బాబా మిమ్ములను ఎలాంటి అధికారులుగా చేస్తున్నారంటే దానిని మా నుండి ఎవ్వరూ లాక్కోలేరు,........ అని పాట కూడా ఉంది కదా. భూమ్యాకాశాలు మొదలైన వాటి పై మన అధికారము ఉంటుంది. ఈ ప్రపంచములో ఏమేమి ఉన్నాయో చూడండి. అందురూ స్వార్థము కలిగిన సాథీలు(సహచరులు). అక్కడైతే అలా ఉండదు. ఈ ధనము సంపద అంతా మీకు ఇచ్చి వెళ్తున్నాను. దీనిని మంచి రీతిగా సంభాళించండి అని పిల్లలకు లౌకిక తండ్రి చెప్తారు. అలాగే అనంతమైన తండ్రి కూడా చెప్తారు - మీకు ధనము సంపద అంతా ఇస్తాను. మమ్ములను పావన ప్రపంచానికి తీసుకెళ్ళండని మీరు నన్ను పిలిచారు. కనుక తప్పకుండా పావనంగా చేసి విశ్వాధికారులుగా చేస్తాను. తండ్రి ఎంతో యుక్తిగా అర్థం చేయిస్తున్నారు. దీని పేరే సహజ జ్ఞానము, సహజ యోగము, ఒక్క సెకండులో ముక్తి - జీవన్ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు ఎంతో విశాలబుద్ధి గలవారిగా అయ్యారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నామనే చింతన జరుగుతూ ఉండాలి. మనము మన కొరకే రాజ్య స్థాపన చేస్తున్నాము, కనుక అందులో మనము ఉన్నత పదవిని ఎందుకు పొందుకోరాదు? తక్కువ పదవి ఎందుకు పొందాలి? రాజధాని స్థాపన అవుతుంది. అందులో కూడా పదవులుంటాయి కదా. దాస-దాసీలు అనేకమంది ఉంటారు. వారు కూడా చాలా సుఖము పొందుకుంటారు. రాజుల జతలోనే రాజభవనాలలో ఉంటారు. పిల్లలు మొదలైన వారిని సంభాళన చేస్తూ ఉంటారు, ఎంతో సుఖంగా ఉంటారు. దాస-దాసీలని పేరుకు మాత్రమే, రాజా-రాణులు ఏమి తింటారో అదే దాస-దాసీలు కూడా తింటారు కానీ ఆ భోజనము ప్రజలకు లభించదు. దాస-దాసీలకు కూడా చాలా గౌరవముంటుంది. కానీ వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. పిల్లలైన మీరు పూర్తి విశ్వాధికారులుగా అవుతారు. ఇక్కడ కూడా రాజుల వద్ద దాస-దాసీలుంటారు. రాజకుమారుల సభ జరిగినప్పుడు, పరస్పరము ఒకరినొకరు కలిసినప్పుడు పూర్తి శృంగారింపబడి కిరీటము మొదలైనవాటితో అలంకృతులై ఉంటారు. మళ్లీ వారిలో కూడా నెంబరువారిగా పెద్ద శోభాయమానమైన సభ నడుస్తుంది. అందులో రాణులు కూర్చోరు. వారు పరదా వెనుక ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. వారిని మీరు ప్రాణదాత అని జీవ దానమును ఇచ్చేవారని కూడా అంటారు. క్షణక్షణము శరీరాన్ని వదలుట నుండి రక్షించేవారు. అక్కడ మరణమును గురించిన చింత ఉండదు. ఇక్కడ ఎంత చింత ఉంటుంది! ఏదైనా కొద్దిగా జరిగినా ఎక్కడ మరణిస్తామో అని డాక్టర్‌ను పిలుస్తారు. అక్కడ భయపడే మాటే ఉండదు. మీరు మృత్యువు పై విజయాన్ని పొందుతారు. కనుక ఎంత నషా ఉండాలి. చదివించేవారిని స్మృతి చేసినా అది కూడా స్మృతియాత్రయే అవుతుంది. తండ్రి-టీచరు-సద్గురువును స్మృతి చేసినప్పటికీ అదీ మంచిదే. ఎంత శ్రీమతానుసారముగా నడుస్తారో అంత మనసా-వాచా-కర్మణా పావనంగా అవుతారు. బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. బుద్ధిలో సోదరులు(భాయి-భాయి) అని తెలుసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. సోదరీ-సోదరులు అని భావించినా ఛీ-ఛీగా అవుతారు. అన్నింటికంటే ఎక్కువగా మోసము చేసేవి ఈ కళ్ళు, అందుకే తండ్రి మనకు మూడవ నేత్రము ఇచ్చారు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మను చూడండి. దీనినే జ్ఞాన మూడవ నేత్రమని అంటారు. సోదరీ-సోదర దృష్టి కూడా ఫెయిల్‌ అయినప్పుడు మరో ఉపాయము కూడా వెల్లడించబడ్తుంది - పరస్పరములో సోదరులు అని భావించండి. అయితే ఇందులో చాలా శ్రమ ఉంది. సబ్జెక్టులు ఉంటాయి కదా. ఒక్కొక్కటి చాలా కష్టమైన సబ్జెక్టుగా ఉంటుంది. ఇది చదువు. ఇందులో కూడా శ్రేష్ఠమైన సబ్జెక్టు - మీరు ఎవరి నామ-రూపాలలో చిక్కుకోరాదు. ఇది చాలా పెద్ద పరీక్ష. విశ్వాధికారులుగా అవ్వాలి. భాయి-భాయి అని భావించడమే ముఖ్యమైన విషయమని తండ్రి చెప్తున్నారు. కనుక పిల్లలు ఇంత గొప్ప పురుషార్థము చేయాలి. కానీ నడుస్తూ నడుస్తూ కొందరు ద్రోహులుగా కూడా అవుతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. మంచి మంచి పిల్లలను మాయ తనవారిగా చేసుకుంటుంది. అప్పుడు నాకు దూరమై విడాకులు కూడా ఇచ్చేస్తారని తండ్రి చెప్తున్నారు. తండ్రి, పిల్లల మధ్యలో దూరమగుట, పతి - పత్నుల మధ్యలో విడాకులు ఉంటాయి. నాకు రెండూ లభిస్తాయని తండ్రి చెప్తున్నారు. మంచి-మంచి పిల్లలు కూడా విడాకులు ఇచ్చి రావణుని వారిగా అవుతారు. ఇది అద్భుతమైన ఆట కదా. మాయ చేయలేనిదేముంది? తండ్రి చెప్తున్నారు - మాయ చాలా కఠినమైనది. గజమును మొసలి తినేసిందని గాయనము కూడా ఉంది. చాలా అజాగ్రత్తగా ఉంటారు. తప్పులు చేస్తారు. తండ్రికి అవిధేయులుగా అవుతే మాయ పచ్చిగా తినేస్తుంది. మాయ ఎటువంటిదంటే కొందరిని ఒక్కసారిగా పట్టుకుంటుంది. అచ్ఛా!

పిల్లలకు ఎంతగా వినిపించాను. ఇంకా ఎంత వినిపించాలి!! ముఖ్యమైన విషయము బాబా(అల్ఫ్‌), ఉదయమే లేచి అల్ఫ్‌(భగవంతుడి)ను స్మృతి చేయమని ముసల్మానులు కూడా చెప్తారు. అమృతవేళ నిదురించే సమయము కాదు. ఈ ఉపాయము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. బాబా పిల్లలైన మీకు ఎంత విశ్వాసపాత్రులుగా ఉంటారు! మిమ్ములను ఎప్పుడూ వదలరు. మిమ్ములను సరిదిద్ది జతలో తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. స్మృతియాత్ర ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ఆ వైపు జమ అవుతూ ఉంటుంది. తండ్రి చెప్తున్నారు - ఎంత స్మృతి చేస్తున్నాను, ఎంత సర్వీసు చేస్తున్నాను అని లెక్కాచారము తెలిపే చిట్టా ఉంచుకోండి. వ్యాపారస్థులు కూడా నష్టమును గమనిస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. నష్టపడరాదు. కల్ప-కల్పాంతరాలకు నష్టము కలుగుతుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మనసా-వాచా-కర్మణా పావనంగా అవ్వాలి, బుద్ధిలో వికారి సంకల్పాలు కూడా రాకూడదు. అందుకు ఆత్మలు పరస్పరము సోదరులమని అభ్యాసము చేయాలి. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోరాదు.

2. బాబా ఎలా విశ్వాసపాత్రులో, పిల్లలను సరిదిద్ది ఎలా జతలో తీసుకెళ్తారో అలా మీరు కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడూ విడిపోవడం గాని, విడాకులు గాని ఇవ్వరాదు.

వరదానము :-

''అన్ని వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి ఫలీభూతులుగా అయ్యే ఫలస్వరూప భవ''

బాప్‌దాదా ద్వారా సమయ ప్రతి సమయం ఏ వరదానాలైతే లభించాయో వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించండి. కేవలం వరదానము విని ఈ రోజు చాలా మంచి వరదానము లభించిందని సంతోషించకండి. వరదానాన్ని పనిలో ఉపయోగించినందున వరదానము స్థిరంగా ఉంటుంది. వరదానాలు అవినాశి తండ్రి ఇచ్చినవి. కానీ వాటిని ఫలీభూతము చేయాలి. అందుకు వరదానానికి పదే పదే స్మృతి అనే నీటినివ్వండి. వరదాన స్వరూపంలో స్థితులయ్యే సూర్యరశ్నినిస్తే వరదానాల ఫలస్వరూపంగా అవుతారు.

స్లోగన్‌ :-

''ఎవరి దృష్టిలో (కనులలో) తండ్రి ఉన్నారో, వారికి మాయ దిష్టి తగలదు.''