19-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు శరీరము నుండి వేరై(భిన్నమై) తండ్రి వద్దకు వెళ్లాలి, ఈ శరీరాన్ని వెంట తీసుకెళ్లరు, అందువలన మీరు శరీరాన్ని మరచి ఆత్మను చూడండి. ''
ప్రశ్న :-
పిల్లలైన మీరు మీ ఆయువును యోగబలము ద్వారా పెంచుకునే పురుషార్థము ఎందుకు చేస్తారు?
జవాబు :-
ఎందుకంటే మేము తండ్రి ద్వారా ఈ జన్మలోనే అంతా తెలుసుకోవాలనే ఇష్టము మీకుంటుంది. తండ్రి ద్వారా అన్నీ వినాలని ఉంటుంది, అందువలన మీరు యోగబలము ద్వారా మీ ఆయువును పెంచుకునే పురుషార్థము చేస్తారు. ఇప్పుడు మాత్రమే మీకు తండ్రి నుండి ప్రేమ లభిస్తుంది. ఇటువంటి ప్రేమ మళ్లీ మొత్తం కల్పములో మరెప్పుడూ లభించదు. శరీరము వదిలి వెళ్లిపోయినవారి గురించి డ్రామా అని అనడం జరుగుతుంది. వారి పాత్ర అంతవరకే ఉంది.
ఓంశాంతి.
పిల్లలు జన్మ-జన్మాంతరాలు ఇతర సత్సంగాలకు వెళ్లారు. ఇప్పుడు ఇచ్చటికి కూడా వచ్చారు. వాస్తవానికి దీనిని కూడా సత్సంగము అని అంటారు. '' సత్యమైన సాంగత్యము తేెలుస్తుంది అనగా ఉద్ధరిస్తుంది (సత్ కా సంగ్ తారే).'' మనము మొదట భక్తిమార్గములో సత్సంగాలకు వెళ్లేవారము, ఇప్పుడు ఇచ్చట కూర్చొని ఉన్నామని పిల్లల హృదయాలకు అనిపిస్తుంది. దానికి, దీనికి రాత్రికి పగలుకున్నంత తేడా అనుభవమవుతుంది. ఇచ్చట మొట్టమొదట తండ్రి ప్రేమ లభిస్తుంది. ఆ తర్వాత తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మీరు పరివర్తన అవుతున్నారు. మేము ఆత్మలమని, శరీరాలు కామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శరీరము, 'ఇది నా అత్మ' అని చెప్పదు. ఆత్మ, 'ఇది నా శరీరము' అని చెప్పగలదు. జన్మ-జన్మాంతరాలుగా సాధువులు, సత్పురుషులు, మహాత్ములు మొదలైన వారి వద్దకు వెళ్తూ వచ్చామని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ రోజులలో సాయిబాబా, మెహర్ బాబాల..... ఫ్యాషన్ ఏర్పడింది. వారంతా శరీరము గలవారు. శారీరిక ప్రేమలో సుఖమనేదే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీది ఆత్మిక ప్రేమ, రెండింటికి రాత్రికి - పగలుకు ఉన్నంత భేదముంది. ఇక్కడ మీకు జ్ఞానము లభిస్తుంది. అక్కడ పూర్తి అజ్ఞానముంది. బాబా వచ్చి మనలను చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు అందరికీ తండ్రి. పురుషులు గానీ, స్త్రీలు గానీ, అందరూ స్వయమును ఆత్మ అని తెలుసుకున్నారు. బాబా -''ఓ పిల్లలారా!'' అని పిలుస్తారు. పిల్లలు కూడా బదులు పలుకుతారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళా(కలయిక) అని పిల్లలకు తెలుసు. ఇది తండ్రి-పిల్లల, ఆత్మ-పరమాత్మల మేళా. ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. పిల్లలు, ''బాబా-బాబా'' అంటూ ఉంటారు. 'బాబా' అనే పదము అతిమధురమైనది. తండ్రి అన్నంతనే వారసత్వము గుర్తుకు వస్తుంది. మీరు చిన్నవారేమీ కాదు కదా. తండ్రి పరిచయము పిల్లలకు త్వరగా అర్థమౌతుంది. తండ్రి నుండి ఏ వారసత్వము లభిస్తుందో చిన్న పిల్లలు అర్థము చేసుకోలేరు. మనము బాబా వద్దకు వచ్చామని మీకు తెలుసు. తండ్రి, ఓ పిల్లలారా! అని అంటున్నారు. ఈ పిలుపులో పిల్లలందరూ వచ్చేస్తారు. ఆత్మలందరూ పాత్ర అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడకు వస్తారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాత్ర అభినయిస్తారో కూడా బుద్ధిలో ఉంది. అందరి సెక్షన్లు(విభాగాలు) వేరు వేరుగా ఉంటాయి, అక్కడ నుండే వస్తారు. మళ్లీ చివర్లో అందరూ తమ తమ సెక్షన్లలోకి వెళ్తారు. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. తండ్రి పవ్వరినీ పంపించరు. ఈ డ్రామా స్వతహాగా తయారై ఉంది. ప్రతి ఒక్కరు తమ-తమ ధర్మములోకి వస్తూ ఉంటారు. బౌద్ధ ధర్మము స్థాపన అవ్వక ముందు ఆ ధర్మానికి చెందినవారు ఎవ్వరూ ఇక్కడకు రారు. మొట్టమొదట సూర్యవంశీయులు, చంద్రవంశీయులు మాత్రమే వస్తారు. తండ్రి ద్వారా ఎవరైతే బాగా చదువుతారో వారే నంబరువారుగా సూర్య వంశము, చంద్ర వంశములలో శరీరాలు తీసుకుంటారు. అక్కడ వికారాల మాటే ఉండదు. అక్కడ యోగబలము ద్వారా ఆత్మ వచ్చి గర్భ ప్రవేశము చేస్తుంది. అందువలన నా ఆత్మ ఈ శరీరములో ప్రవేశిస్తుందని అర్థం చేసుకుంటారు. వృద్ధులు, నా ఆత్మ యోగబలము ద్వారా ఈ శరీరము తీసుకుంటుందని భావిస్తారు. ఇప్పుడు నా ఆత్మ పునర్జన్మ తీసుకుంటుందని అర్థము చేసుకుంటారు. ఆత్మ ఎవరి వద్ద పునర్జన్మ తీసుకుంటుందో, ఆ తండ్రి కూడా నా వద్దకు ఈ ఆత్మ పుత్రునిగా వచ్చాడని అర్థం చేసుకుంటాడు. పుత్రుని ఆత్మ ఏదైతో వస్తూ ఉందో దాని సాక్షాత్కారమవుతుంది. అలాగెే నేను వెళ్లి మరొక శరీరములో ప్రవేశిస్తానని ఆ ఆత్మ కూడా అర్థము చేసుకుంటుంది. అక్కడ కూడా తప్పకుండా నియమాలుంటాయని ఆలోచన వస్తుంది కదా. పిల్లలు ఏ వయసులో వస్తారో ఇంకా మొదలైనవన్నీ కూడా అక్కడ సక్రమంగా(రెగ్యులర్గా) జరుగుతాయి కదా. పోను పోను అదంతా అనుభవమవుతుంది. అన్ని విషయాలు తెలుస్తాయి. అంతేకాని ఇక్కడ జరిగినట్లు 15-20 సంవత్సరాలకే సంతానము కలగదు. అక్కడ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. కావున ఆయువు సగము కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొడుకు పుట్తాడు. ఎందుకంటే అక్కడ దీర్ఘాయువు ఉంటుంది. ఒకే పుత్రుడు పుడ్తాడు, ఆ తర్వాత పుత్రిక కూడా పుడ్తుంది. నియమానుసారంగా జరుగుతుంది. మొదట పుత్రుడు, తర్వాత పుత్రిక ఆత్మ వస్తుంది. మొదట పుత్రుడు రావాలని వివేకము కూడా చెప్తుంది. మొదట పురుషుడు తర్వాత స్త్రీ. 8-10 సంవత్సరాల వ్యత్యాసముతో ఆలస్యంగా పుత్రిక జన్మిస్తుంది. పోను పోను పిల్లలైన మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. అక్కడి ఆచార-పద్ధతులు ఎలా ఉంటాయో, నూతన ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఆ తండ్రే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఆచార - వ్యవహారాలు కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు. పోను పోను చాలా వినిపిస్తారు. అప్పుడు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. పిల్లలు ఎలా జన్మిస్తారో, క్రొత్త విషయమేమీ కాదు.
కల్ప-కల్పము ఎక్కడికైతే తప్పకుండా పోవాల్సి ఉంటుందో అక్కడికే వెళ్తారు. వైకుంఠము ఇప్పుడు సమీపానికి వచ్చేసింది. ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేస్తారు. ప్రతి విషయము మీకు సమీపంగా కనిపిస్తుంది. మీరు జ్ఞాన, యోగాలలో ఎంత శక్తివంతంగా అవుతూ ఉంటారో అంత స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అనేకసార్లు పాత్రను అభినయించారు. ఇప్పుడు మీకు వివేకము లభిస్తుంది, దీనినే మీరు వెంట తీసుకెళ్తారు. అక్కడి ఆచార వ్యవహారాలన్నీ తెలుసుకుంటారు. ప్రారంభంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. అప్పుడు మీరు కేవలం ఒకటి, రెండు(అల్ఫ్, బే) చదువుకునేవారు(ఒనమాలు నేర్చుకునేవారు). మళ్లీ చివర్లో కూడా తప్పకుండా సాక్షాత్కారాలు జరగాలి. వాటిని తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు. అవన్నీ చూడాలనే కోరిక మీకు ఇక్కడే ఉంటుంది. శరీరము వదలరాదని, అన్నీ చూచి వెళ్లాలని భావిస్తారు. అయితే ఆయువు పెంచుకునేందుకు యోగబలము కావాలి. అప్పుడు తండ్రి ద్వారా ఏవైతే విన్నారో అవన్నీ చూస్తారు. ముందు వెళ్లిపోయిన వారిని గురించి ఆలోచించరాదు. అది డ్రామాలోని వారి పాత్ర. తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకునే అదృష్టము వారికి లేదు. ఎందుకంటే మీరు ఎంతెంత సేవాధారులుగా అవుతారో తండ్రికి అంత ప్రియంగా అనిపిస్తారు. ఎంతగా సేవ చేస్తారో, తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా ఆ స్మృతి స్థిరమవుతూ ఉంటుంది. మీకు చాలా ఆనందము కలుగుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరు నా వద్ద ఉన్నారు కదా. భక్తిమార్గములో ముక్తి కొరకు చాలా శ్రమ చేస్త్తారు. జీవన్ముక్తిని గురించి అయితే వారికి తెలియదు. ఇది చాలా లవ్లీ(ప్రియమైన) జ్ఞానము. ఇందులో చాలా ప్రేమ ఉంటుంది. ఈ తండ్రి, తండ్రే కాదు టీచరు, సద్గురువు కూడా అవుతారు. వీరు సత్య-సత్యమైన సుప్రీమ్(పరమ శ్రేష్ఠమైన) తండ్రి. వారు మనలను 21 జన్మలకు సుఖధామములోకి తీసుకెళ్తారు. ఆత్మయే దు:ఖితమౌతుంది. సుఖ-దు:ఖాలను ఆత్మయే అనుభవిస్తుంది. పాపాత్మ, పుణ్యాత్మ అని కూడా అంటారు. మనలను అన్ని దు:ఖాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతంలోకి వెళ్లాలి. అందరూ సుఖవంతులుగా అవుతారు. ప్రపంచమంతా సుఖవంతముగా అయిపోతుంది. డ్రామాలో ఎవరికి ఏ పాత్ర ఉందో అది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. మనలను స్వర్గములోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. ఆత్మలైన మన అందరినీ స్వర్గములోకి తీసుకెళ్తారు. మధురాతి మధురమైన పిల్లలూ! - నేను మిమ్ములను అన్ని దుఃఖాల నుండి దూరము చేసేందుకు వచ్చానని తండ్రి ధైర్యము చెప్తున్నారు. ఇటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి. అన్ని సంబంధాలు మీకు దుఃఖమునే ఇచ్చాయి. సంతానము కూడా దుఃఖమునిస్తుంది. మీరు దుఃఖపడుతూ దుఃఖము కలిగించు మాటలనే వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు అనేకసార్లు అర్థం చేయించారు, చక్రవర్తి రాజులుగా కూడా తయారుచేశారు. కావున ఏ తండ్రి అయితే మనలను ఇటువంటి స్వర్గానికి అధికారులుగా చేస్తారో, అటువంటివారి పై ఎంత ప్రేమ ఉండాలి! ఒక్క తండ్రిని మాత్రమే మీరు స్మృతి చేస్తారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరితోనూ సంబంధము లేదు. ఆత్మలకే అర్థం చేయించబడ్తుంది. మనము సుప్రీమ్ తండ్రి పిల్లలము. ఇప్పుడు మనకు మార్గము ఎలా లభించిందో అలా ఇతరులకు కూడా సుఖమునిచ్చే మార్గమును తెలపాలి. మీకు కేవలం అర్ధకల్పానికి మాత్రమే కాదు, ముప్పావు(3/4) కల్పానికి సుఖము లభిస్తుంది. మీకు కూడా చాలా మంది బలిహారమౌతారు ఎందుకంటే మీరు తండ్రి సందేశమును వినిపించి అన్ని దుఃఖాలను దూరము చేస్తారు.
ఈ బ్రహ్మకు కూడా ఈ జ్ఞానము సుప్రీమ్ తండ్రి ద్వారా లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఈ బ్రహ్మ మళ్లీ మనకు సందేశమునిస్తారు. మళ్లీ మనము ఆ సందేశమునే ఇతరులకు ఇస్తాము. తండ్రి పరిచయమునిచ్చి అజ్ఞాన నిద్ర నుండి పిల్లలందరినీ మేల్కొల్పుతూ ఉంటారు. భక్తిని అజ్ఞానమని అంటారు. జ్ఞానము వేరు, భక్తి వేరు. జ్ఞానసాగరులైన తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము నేర్పిస్తున్నారు. బాబా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి మనలను మేల్కొల్పుతారని ఇప్పుడు మీ హృదయాలకు తెలుసు. మన జ్యోతిలో ఇక నెయ్యి చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. అందువలన ఇప్పుడు మళ్లీ జ్ఞానమనే నెయ్యిని వేసి దీపమును వెలిగిస్తారు. తండ్రిని స్మృతి చేసినప్పుడు ఆత్మ రూపి దీపము ప్రజ్వలితమౌతుంది. ఆత్మ పై చేరిన తుప్పు అంతా తండ్రి స్మృతి ద్వారానే తొలగిపోతుంది. ఇందులోనే మాయతో యుద్ధము జరుగుతుంది. మాయ మాటిమాటికి మరపింపజేస్తుంది. తుప్పు వదిలిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువవుతుంది. తుప్పు ఎంత తొలగిపోయిందో అంతకంటే ఎక్కువ మళ్లీ ఏర్పడ్తుంది. తండ్రి అంటున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేస్తే మీ తుప్పు వదిలిపోతుంది. ఇందులో శ్రమ ఉంది. దేహము పై ఆకర్షణ ఉండరాదు. దేహీ-అభిమానులుగా అవ్వండి. మనము ఆత్మలము బాబా వద్దకు శరీరము సహితంగా వెళ్లలేము. శరీరము నుండి వేరయ్యే వెళ్లాలి. ఆత్మను చూచుట వలన తుప్పు వదిలిపోతుంది. శరీరాన్ని చూచుట వలన తుప్పు పెరుగుతుంది. అప్పుడప్పుడు పెరుగుతుంది, అప్పుడప్పుడు తరుగుతుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు పల్లము, అప్పుడప్పుడు ఎత్తు - ఇది చాలా సున్నితమైన మార్గము, ఇలా జరుగుతూ జరుగుతూ చివరిలో కర్మాతీత స్థితిని పొందుతారు. ప్రతి విషయములో మోసము చేసేది ముఖ్యంగా కనులే. అందుకే శరీరాన్ని చూడకండి. మన బుద్ధి శాంతిధామము - సుఖధామాల పై తగుల్కొని ఉండాలి. దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. భోజనము కూడా శుద్ధమైనది భుజించాలి. దేవతలది పవిత్రమైన భోజనము. వైష్ణవులు అనే పదము విష్ణువు నుండి వచ్చింది. దేవతలు ఎప్పుడూ అశుద్ధమైన పదార్థాలు తినరు. విష్ణు మందిరాలున్నాయి. విష్ణువును నరనారాయణ అని కూడా అంటారు. ఇప్పుడు లక్ష్మీనారాయణులు శరీరాలు ఉన్నవారు అనగా సాకారులే కదా. వారికి నాలుగు భుజాలుండరాదు. కానీ భక్తిమార్గములో వారికి కూడా నాలుగు భుజాలు చూపించారు. దీనిని బేహద్ అజ్ఞానము అని అంటారు. నాలుగు భుజాలు గల మనుష్యులు ఎవ్వరూ ఉండరని భావించరు. సత్యయుగములో రెండు భుజముల వారే ఉంటారు. బ్రహ్మకు కూడా రెండు భుజాలే ఉంటాయి. బ్రహ్మ పుత్రిక సరస్వతి, ఇద్దరికి కలిపి నాలుగు భుజాలు చూపించారు. ఇప్పుడు సరస్వతి బ్రహ్మకు భార్య(స్త్రీ) కాదు. ఈమె ప్రజాపిత బ్రహ్మకు కూతురు. ఇతను ఎంతమంది పిల్లలను దత్తు తీసుకుంటారో అన్ని భుజాలు పెరుగుతూ ఉంటాయి. బ్రహ్మకు 108 భుజాలు ఉన్నాయని అంటారు. విష్ణువుకు, శంకరునికి అలా అనరు. బ్రహ్మకు చాలా(సహస్ర) భుజాలున్నాయి. భక్తిమార్గములో అయితే కొంచెము కూడా అర్థము చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు ''మమ్ములను తండ్రి వచ్చి తెలివిగలవారిగా చేశారని'' అంటారు. మేము శివుని భక్తులమని మనుష్యులు అంటారు. మంచిదే, మీరు శివుని ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు శివబాబా సర్వాత్మల తండ్రి అని అందుకే ఆయనను పూజిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైన మాట తండ్రి చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ''ఓ పతితపావనా! మీరు వచ్చి మమ్ములను పావనంగా చేెయమని మీరు నన్ను పిలిచారు''. అందరూ పతిత పావన సీతారామా! అని పిలుస్తూనే ఉంటారు. ఈ బాబా కూడా పాడుతూనే ఉండేవారు. ఈ తండ్రి స్వయంగా వచ్చి తనలో ప్రవేశిస్తారని ఈ బాబాకు కూడా ఇంతకు ముందు తెలియదు. ఎంత అద్భుతము, ఎప్పుడూ సంకల్పములో కూడా లేదు. మొదట నాకు ఏమో జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడేవారు. నేను ఎవరిని చూసినా కూర్చొని ఉండగానే వారికి ఆకర్షణ కలిగేది ఇదేంటి? ఏమి జరుగుతూ ఉంది? శివబాబా ఆకర్షిస్తూ ఉండేవారు. నా ముందు ఎవరు కూర్చున్నా ధ్యానములోకి వెళ్లిపోయేవారు. ఏమయ్యింది! అని ఆశ్చర్యపడేవాడిని. ఈ విషయాలన్నీ అర్థము చేసుకునేందుకు ఏకాంతము కావాలి. అప్పుడు వైరాగ్యము కలుగుతూ వచ్చింది - ఎక్కడకు వెళ్లాలి? కాశీకి పోదామని అనుకున్నాను. ఇది కూడా ఆయన కలిగించిన ఆకర్షణ. ఈ బ్రహ్మను కూడా ఆకర్షించారు కనుక ఇంత పెద్ద వ్యాపార వ్యవహారమంతా వదిలి వెళ్లిపోయారు. బెనారస్కు ఎందుకు వెళ్లారో, పాపం వారికేమి తెలుసు? అక్కడ తోటలోకి వెళ్లి కూర్చున్నారు. పెన్సిలు చేతికి తీసుకుని గోడల పై చక్రాలు గీచేవాడిని. బాబా ఏమి చేయిస్తూ ఉన్నారో కొంచెము కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. రాత్రులు నిదుర వచ్చేది. ఎక్కడికో ఎగిరి పోయినట్లు ఉండేది. మళ్లీ క్రిందికి వచ్చేవాడిని. ఏం జరుగుతూ ఉందో కొద్దిగా కూడా తెలిసేది కాదు. ప్రారంభములో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. పిల్లలు కూర్చొని ఉండగానే ధ్యానములోకి వెళ్లిపోయేవారు. మీరు చాలా చూచారు. మేము చూచింది, మీరు చూడలేదని అంటారు. చివర్లో కూడా బాబా చాలా సాక్షాత్కారాలు చేయిస్తారు ఎందుకంటే దగ్గరవుతూ ఉంటారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలను దూరం చేయాలి. అందరికీ సుఖమునిచ్చే దారి చూపించాలి. హద్దుల నుండి వెలువడి అనంతములోకి వెళ్లాలి.
2. అంతిమ సమయములో అన్ని సాక్షాత్కారాలు చూచేందుకు, తండ్రి ప్రేమపూరిత పాలన తీసుకునేందుకు జ్ఞాన-యోగాలలో గట్టిపడాలి. ఇతరులను గురించి చింత చేయక యోగబలము ద్వారా మీ ఆయువును పెంచుకోవాలి.
వరదానము :-
'' బ్రహ్మబాబా సమానంగా లక్ష్యమును లక్షణాలలోకి తీసుకొచ్చి ప్రత్యక్ష స్యాంపుల్గా అయ్యే సర్వుల సహయోగీ భవ ''
బ్రహ్మబాబా స్వయాన్ని నిమిత్త ఉదాహరణంగా చేసుకున్నారు. సదా ఎవరైతే సేవకు ముందుకు వస్తారో వారే అర్జునులు అనే లక్ష్యాన్ని లక్షణములోకి తీసుకొచ్చారు. దీని ద్వారానే నంబరువన్గా అయ్యారు. కనుక అలా తండ్రిని అనుసరించండి. కర్మల ద్వారా సదా స్వయం జీవితంలో గుణమూర్తులుగా అయ్యి, ప్రత్యక్ష స్యాంపుల్గా అయ్యి, ఇతరులు సహజంగా ధారణ చేసేందుకు సహయోగమివ్వండి - దీనినే గుణదానమని అంటారు. దానమంటే సహయోగమివ్వడం. ఇప్పుడు ఏ ఆత్మలైనా వినేందుకు బదులు ప్రత్యక్ష ప్రమాణము చూడాలనుకుంటారు. కనుక ముందు స్వయాన్ని గుణమూర్తులుగా చేసుకోండి.
స్లోగన్ :-
'' అందరి నిరాశల అంధకారాన్ని దూరం చేసేవారే జ్ఞానదీపాలు ''