24-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి వినిపించేదంతా మీ హృదయాల పై ముద్రింపబడాలి. మీరిచ్చటకు సూర్య వంశములో ఉన్నత పదవి పొందేందుకు వచ్చారు కనుక ధారణ కూడా చేయాలి. ''

ప్రశ్న :-

సదా తాజాగా(రిఫ్రెష్‌గా) ఉండేందుకు సాధనమేది ?

జవాబు :-

ఎలాగైతే వేసవిలో ఫ్యాను తిరుగుతూ ఉంటే తాజాగా ఉంటారో, అలా స్వదర్శన చక్రము తిప్పుతూ ఉంటే తాజాగా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంతకాలము పడ్తుందని పిల్లలు అడుగుతారు. ఒక్క సెకండేనని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఎందుకంటే దీని వల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రము తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు.

ఓంశాంతి.

ఫ్యాన్లు తిరుగుతూ అందరినీ తాజాగా చేస్తాయి, మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయ్యి కూర్చుంటే చాలా తాజాగా అవుతారు. స్వదర్శన చక్రధారి అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. కావున వారికి అర్థము చేయించాలి. అర్థము చేసుకోకుంటే చక్రవర్తి రాజులుగా అవ్వలేరు. స్వదర్శన చక్రధారులకు, మేము చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారులుగా అయ్యామనే నిశ్చయము ఉంటుంది. కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు. లక్ష్మీనారాయణుల సంయుక్త స్వరూపానికి కూడా చక్రమునిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చక్రమును ఇస్తారు. స్వదర్శన చక్రమంటే ఏమో అర్థం చేసుకున్నప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. చాలా సులభమైన విషయమే. బాబా, స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంత సమయము పడ్తుంది? అని పిల్లలు అడుగుతారు. ఒకే ఒక్క సెకండు పిల్లలారా, అని బాబా అంటారు. తర్వాత మళ్లీ మీరు విష్ణు వంశస్థులుగా అవుతారు. దేవతలను విష్ణు వంశస్థులు అనే అంటారు. విష్ణు వంశస్థులుగా అయ్యేందుకు ముందు శివ వంశస్థులుగా అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత బాబా సూర్య వంశీయులుగా చేస్తారు. ఈ పదాలైతే చాలా సులభము. మనము నూతన విశ్వములో సూర్యవంశీయులుగా అవుతాము. మనము నూతన ప్రపంచానికి అధికారులుగా, చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణు వంశీయులుగా అయ్యేందుకు ఒక్క క్షణము మాత్రమే పడ్తుంది. అలా తయారు చేయువారు శివబాబా. శివబాబా విష్ణు వంశీయులుగా చేస్తారు. ఈ విధంగా మరెవ్వరూ చేయలేరు. విష్ణు వంశీయులు సత్యయుగములో ఉంటారని, ఇక్కడ లేరని పిల్లలైన మీకు తెలుసు. ఇది విష్ణు వంశీయులుగా అయ్యే యుగము. విష్ణు వంశములోకి వచ్చేందుకే మీరు ఇక్కడకు వస్తారు. దానిని సూర్యవంశమని అంటారు. జ్ఞానసూర్యవంశము అనే పదము చాలా బాగుంది. విష్ణువు సత్యయుగానికి యజమానిగా ఉండేవాడు. అందులో లక్ష్మీనారాయణులు ఇరువురూ ఉన్నారు. లక్ష్మీనారాయణులుగా అనగా విష్ణువంశీయులుగా అయ్యేందుకు పిల్లలు ఇక్కడకు వచ్చారు. ఇది చాలా సంతోషము కూడా కలిగిస్తుంది. నూతన ప్రపంచము, నూతన విశ్వము, స్వర్ణ యుగములో విష్ణు వంశస్థులుగా అవ్వాలి. ఇంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి లేదు. అందువలన ఇందులో చాలా సంతోషము కలగాలి.

చిత్రప్రదర్శినీలో మీరు - మా లక్ష్యమే ఇది(లక్ష్మీ నారాయణులుగా తయారవ్వడం) అని అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము(యూనివర్శిటీ) అని చెప్పండి. దీనిని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని అంటారు. లక్ష్యము మరియు ఉద్ధేశ్యము ఈ చిత్రములో ఉంది. ఇదంతా పిల్లల బుద్ధిలో ఉండాలి. పిల్లలు ఒక సెకండులో అర్థము చేయించేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి. మీరు మాత్రమే దీనిని బాగా అర్థము చేయించగలరు. ఆ చిత్రాలలో కూడా మనము విష్ణువంశానికి చెందిన దేవీదేవతలుగా ఉండేవారమని వ్రాయబడి ఉంది అనగా తప్పకుండా దేవీదేవతా కులానికి చెందినవారిగా ఉండేవారము. స్వర్గానికి అధికారులుగా ఉండేవారము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, భారతదేశములో మీరు 5 వేల సంవత్సరాల క్రితము సూర్యవంశీ దేవీదేవతలుగా ఉండేవారు. ఈ విషయం ఇప్పుడు పిల్లలకు బుద్ధిలోకి వచ్చేసింది. శివబాబా పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ, మీరు సత్యయుగములో సూర్యవంశీయులుగా ఉండేవారు. సూర్యవంశాన్ని స్థాపన చేసేందుకు శివబాబా వచ్చారు. తప్పకుండా భారతదేశము స్వర్గంగా ఉండేది. ఇదే పూజ్య దేశముగా ఉండేది. ఒక్కరు కూడా పూజారులు ఉండేవారు కాదు. పూజా సామాగ్రి ఏదీ లేదు. ఈ శాస్త్రాలలోనే పూజ చేయు పద్ధతులు ఆచారాలు మొదలైనవి వ్రాయబడి ఉన్నాయి. ఇదంతా భక్తిమార్గపు సామగ్రి. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి శివబాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు, మనుష్య సృష్టికి బీజరూపులు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు - మీరే పూజ్య దేవీదేవతలుగా ఉండేవారు, తర్వాత మళ్లీ పూజారులుగా అయ్యారు. నిర్వికారులుగా ఉండే దేవతలు ఎక్కడకు వెళ్ళారు? తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగుతారు. కనుక ఈ ఒక్కొక్క పదము బాగా గుర్తుంచుకోవాలి. హృదయములోనా లేక కాగితము పైనా? ఇదంతా అర్థం చేయించేదెవరు? - శివబాబా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వమునిస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి ఏమో దేహధారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ''బాబా'' అని పిలిచినప్పుడు వారు ''ఓ పిల్లలారా'' అని జవాబిస్తారు. అందుకే వారు అనంతమైన తండ్రి అయ్యారు కదా. పిల్లలూ, మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా, పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. ఇది రావణ రాజ్యము. ప్రతి సంవత్సరము రావణుని తగులబెడ్తారు. అయినా రావణుడు మరణించనే మరణించడు. 12 మాసాల తర్వాత మళ్లీ తగులబెడ్త్తారు అనగా మనమంతా రావణ సాంప్రదాయానికి చెందినవారమని ఋజువు చేసి చూపిస్తారు. రావణుడు అనగా పంచవికారాల రాజ్యము ఇప్పుడు స్థిరంగా ఉంది. సత్యయుగములో అందరూ శ్రేష్ఠాచారులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగము పురాతన భ్రష్ఠాచార ప్రపంచము. ఈ చక్రము ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ వంశీయులు, సంగమ యుగములో కూర్చుని ఉన్నారు. మనమంతా బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు శూద్ర కులానికి చెందినవారము కాదు. ఈ సమయంలో ఉన్నదే ఆసురీ రాజ్యము. ''ఓ దు:ఖహర్తా - సుఖకర్తా'' అని అందరూ తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు సుఖము ఎక్కడుంది? సత్యయుగములో ఉంటుంది. దు:ఖమెక్కడ ఉంది? దు:ఖము కలియుగములో ఉంది. దు:ఖహర్త- సుఖకర్త శివబాబాయే. వారు సుఖ వారసత్వమునే ఇస్తారు. సత్యయుగాన్ని సుఖధామమని అంటారు. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏడ్చే అవసరమే ఉండదు. సమయానికి సరిగ్గా పాత శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు శరీరము ముసలిదైపోయిందని అర్థమౌతుంది. మొదట పిల్లలు సతోగుణము గలవారిగా ఉంటారు. అందుకే పిల్లలను బ్రహ్మ జ్ఞానుల కంటే శ్రేష్ఠమని భావిస్తారు. ఎందుకంటే వారు వికారి గృహస్థ జీవితము నుండి సన్యాసులుగా అవుతారు. వారికి అన్ని వికారాలను గురించి తెలుసు. చిన్న పిల్లలకు వికారమంటేనే తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా రావణరాజ్యము, భ్రష్ఠాచార రాజ్యము. శ్రేష్ఠాచార దేవీ దేతల రాజ్యము సత్యయుగములో ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్లీ చరిత్ర పునరావృతమవుతుంది. శ్రేష్ఠాచారులుగా చేసేది ఎవరు? ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్ఠాచారులు లేరు. అది అర్థము చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. ఇది బంగారు బుద్ధిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతిబుద్ధిని బంగారు(పారస) బుద్ధిగా చేస్తారు.

'' సత్సంగము తేలుస్తుంది, కుసంగము ముంచుతుంది '' అని అంటారు. సత్యమైన తండ్రి తప్ప మిగిలిన ప్రపంచమంతా కుసంగమే ఉంది. సంపూర్ణ నిర్వికారులుగా తయారుచేసి వెళ్తానని తండ్రి చెప్తున్నారు. మళ్లీ సంపూర్ణ వికారులుగా తయారు చేసేది ఎవరు? మాకు తెలియదని అంటారు. నిర్వికారులుగా తయారు చేసేది ఎవరు? అలా చేయగలిగింది తండ్రి ఒక్కరు మాత్రమే. వికారులుగా తయారు చేసేది ఎవరో ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మనుష్యులకేమీ తెలియదు. ఎందుకంటే ఇది రావణరాజ్యము కదా. ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఎచ్చటకు వెళ్ళారు? అని అడగండి. స్వర్గస్థులయ్యారని చెప్తారు. అనగా దాని అర్థము ఇంతవరకు నరకములో ఉండినారని కదా. అప్పుడు మీరు కూడా నరకవాసులే కదా. ఇలా అర్థం చేయించడం చాలా సులభము. అయితే స్వయాన్ని ఎవ్వరూ నరకవాసులమని భావించరు. నరకమును వేశ్యాలయమని, స్వర్గమును శివాలయమని అంటారు. 5 వేల సంవత్సరాల క్రితము ఈ దేవీ దేవతల రాజ్యముండేది. మీరు విశ్వానికి అధికారులుగా, మహారాజా - రాణులుగా ఉండేవారు. తర్వాత మళ్లీ పునర్జన్మలు తీసుకోవలసి వచ్చింది. అందరికంటే ఎక్కువ పునర్జన్మలు తీసుకున్నవారు మీరే. అందుకే ఆత్మ-పరమాత్మ చాలా కాలము వేరు వేరుగా ఉన్నారని మహిమ ఉంది. మొట్టమొదట ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారే వచ్చారని, వారే 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యారని ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలని మీకు తెలుసు. ''ఓ పతితపావనా! రండి'' అని పిలుస్తారు కూడా కదా. అత్యంత ఉన్నతులైన ఒక్క సద్గురువు మాత్రమే పావనంగా చేయగలరని అంటారు అనగా వారు సర్టిఫికేట్‌ ఇస్తారు. ఈ దేహములో కూర్చుని మిమ్ములను పావనంగా తయారు చేస్తానని వారే స్వయంగా చెప్తున్నారు. అంతేకాని, 84 లక్షల యోనులు మొదలైనవేవీ లేవు. కేవలం 84 జన్మలే. ఈ లక్ష్మీనారాయణుల ప్రజలు సత్యయుగములో ఉండేవారు, ఇప్పుడు లేరు. అయితే వారంతా ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. మొదటి నెంబరులో వచ్చేవారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. అందుకే మళ్లీ వారే మొదట వెళ్ళాలి. దేవీ దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది. సూర్యవంశీ, చంద్రవంశీయుల రాజ్యము తప్పకుండా పునరావృతమవ్వాలి. తండ్రి మిమ్ములను దానికి అర్హులుగా తయారుచేస్తున్నారు. ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయంలోకి నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీరంటారు. మా లక్ష్యము-ఉద్ధేశ్యము ఇది(లక్ష్మీనారాయణ) అని మీరు చెప్తారు. ఎవరైతే బాగా పురుషార్థము చేస్తారో వారే ఉత్తీర్ణులౌతారు. పురుషార్థము చేయకపోతే ప్రజలుగా అవుతారు, వారిలో కూడా కొంతమంది గొప్ప ధనవంతులుగా, కొంతమంది తక్కువ ధనవంతులుగా అవుతారు. ఈ రాజధాని ఇప్పుడు తయారౌతూ ఉంది. శ్రీమతమును అనుసరించి మనము శ్రేష్ఠంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీ శ్రీ శివబాబా మతముననుసరించి శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతారు. 'శ్రీ' అనగా శ్రేష్ఠులు. ఇప్పుడు ఎవ్వరినీ 'శ్రీ' అని అనరాదు. అయితే ఇప్పుడు ఎవరినంటే వారిని శ్రీ అని అంటారు. శ్రీ ఫలానా......... ఇప్పుడు దేవీ దేవతలు తప్ప మరెవ్వరూ శ్రేష్ఠులుగా అవ్వలేరు. భారతదేశము అత్యంత శ్రేష్ఠంగా ఉండేది, రావణ రాజ్యములో భారతదేశపు మహిమ పూర్తిగా సమాప్తమైపోయింది. భారతదేశానికి మహిమ కూడా చాలా ఉంది. అలాగే గ్లాని కూడా చాలా ఉంది. భారతదేశము అత్యంత ధనవంతముగా ఉండేది. ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయ్యింది. దేవతల ముందుకెళ్ళి మాలో ఏ గుణమూ లేదు, నిర్గుణులము అని వారిని మహిమ చేస్తారు. దేవతలను దయాహృదయులని అంటారు. కానీ వారు దయాహృదయులు కారు. మనుష్యులను దేవతలుగా తయారు చేయువారు ఒక్కరే దయాహృదయులు. ఇప్పుడు వారు మీకు తండ్రి, టీచరు సద్గురువుగా కూడా ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీ జన్మ-జన్మల పాపాలు భస్మమౌతాయని, వెంట తీసుకెళ్తానని వారు గ్యారంటీ ఇస్తున్నారు. మళ్లీ మీరు నూతన ప్రపంచములోకి వెళ్ళాలి. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. ఒకప్పుడు నూతన ప్రపంచముగా ఉండేది, మళ్లీ తప్పకుండా నూతన ప్రపంచంగా అవుతుంది. ప్రపంచము పతితమైనప్పుడు తండ్రి వచ్చి మళ్లీ పావనంగా చేస్తారు. పతితంగా తయారు చేసేది రావణుడు, పావనంగా తయారు చేసేది నేనని తండ్రి చెప్తున్నారు. మిగిలినదంతా బొమ్మలపూజ వంటిది. రావణునికి పది తలలు ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. అయితే అటువంటి మనుష్యులు ఎప్పుడూ ఉండరు. ఒకవేళ నాలుగు భుజాల మనుష్యులుంటే వారికి జన్మించే పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ అందరికీ రెండు భుజాలే ఉన్నాయి. వారికే మాత్రము తెలియదు. భక్తిమార్గములోని శాస్త్ర్రాలన్నీ కంఠస్థము చేస్తారు. వారికి కూడా శిష్యులు చాలా మంది ఉంటారు. చాలా విచిత్రమైన విషయము. ఈ తండ్రి జ్ఞానానికి అథారిటీ. మానవమాత్రులెవ్వరూ అధికారికంగా జ్ఞానము చెప్పలేరు. జ్ఞానసాగరులని మీరు నన్నే అంటారు. అంతేకాక వారు సర్వశక్తివంతులు...... ఇవన్నీ తండ్రి మహిమలే. మీరు తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటున్నారు. దాని వలన విశ్వానికే అధికారులుగా అవుతారు. ఒకప్పుడు మనలో చాలా శక్తి ఉండేదని, నిర్వికారులుగా ఉండేవారమని మీకిప్పుడు తెలిసింది. పూర్తి విశ్వము పై ఏ సహాయము లేకుండా ఒంటరిగా రాజ్యపాలన చేసేవారు కావున వారిని సర్వశక్తివంతులని అంటారు కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధిపతులుగా ఉండేవారు. అయితే అంతటి శక్తి వారికెలా లభించింది? తండ్రి ద్వారా లభించింది. అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు. ఎంత సులభంగా అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్ర్రాన్ని అర్థము చేసుకోవడం సులభమే కదా. దాని ద్వారానే మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది. పతితులకు చక్రవర్తి పదవి లభించదు. పతితులు వారి ముందు తల వంచుతారు. మేము అంతా వారి భక్తులమని భావిస్తారు. పవిత్రులుగా ఉన్నవారి ఎదుట తల వంచి నమస్కరిస్తారు. భక్తిమార్గము కూడా అర్ధకల్పము కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. భగవానువాచ - నేను మీకు రాజయోగము నేర్పిస్తాను, భక్తికి ఫలమునిచ్చేందుకు వచ్చాను. భగవంతుడు ఏదో ఒక రూపములో వస్తారని మహిమ ఉంది. నేను గుఱ్ఱపు బండి మొదలైనవాటిలో రానని, ఎవరు అత్యంత ఉన్నతంగా ఉండి 84 జన్మలు పూర్తి చేస్తారో, వారిలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. సత్యయుగములో ఉత్తమ పురుషులుంటారు. కలియుగములో తమోప్రధాన కనిష్ఠులు ఉంటారు. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి వచ్చి తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తారు. ఇది ఒక ఆట. దీనిని అర్థము చేసుకోకుంటే స్వర్గములోకి ఎప్పుడూ రారు. అచ్ఛా! మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఒక్క తండ్రి సాంగత్యము ద్వారా స్వయాన్ని బంగారుబుద్ధి గలవారిగా చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. చెడు సాంగత్యము నుండి దూరంగా ఉండాలి.

2. స్వదర్శన చక్రధారణ ద్వారా నూతన ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతామనే సంతోషములో సదా ఉండాలి. జ్ఞాన సూర్య వంశీయులుగా చేసేందుకు శివబాబా వచ్చారు. మన లక్ష్యమే సూర్య వంశీయులుగా అవ్వడం.

వరదానము :-

'' ఏ సేవ చేస్తున్నా నిమిత్తంగా ఉండి బేహద్‌ వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే బేహద్‌ సేవాధారీ భవ ''

ఇప్పుడు బేహద్‌ పరివర్తన చేసే సేవలో తీవ్ర వేగాన్ని తీసుకురండి. చేస్తూనే ఉన్నాము, ఎంత బిజీగా ఉంటున్నామంటే సమయమే లభించడం లేదని అనుకోరాదు. నిమిత్తంగా ఉండి ఏ సేవ చేస్తున్నా అనంతమైన(బేహద్‌) సహయోగులుగా అవ్వగలరు. కేవలం వృత్తి బేహద్‌లో ఉంటే వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి. బేహద్‌లో ఎంత బిజీగా ఉంటే, కర్తవ్యమేదైతే ఉందో అది ఇంకా అంత సహజమైపోతుంది. ప్రతి సంకల్పము, ప్రతి సెకండు శ్రేష్ఠమైన వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవ చేయడమే బేహద్‌ సేవాధారిగా అవ్వడం.

స్లోగన్‌ :-

'' శివబాబాతో కంబైండ్‌గా ఉండే శివశక్తుల అలంకారము జ్ఞాన అస్త్ర - శస్త్రాలు. ''