13-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - తండ్రి సమానం దయా హృదయులుగా, కళ్యాణకారులుగా అవ్వండి. స్వయం పురుషార్థము చేస్తూ, ఇతరులతో కూడా చేయించువారు వివేకవంతులు.''
ప్రశ్న :-
పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఎలా పరిశీలన చేసుకోగలరు, మీ పురుషార్థము ఏమిటి?
జవాబు :-
చదువు ద్వారా మీరు తమ పాత్రను ఉత్తమంగా చేస్తున్నామా లేక మధ్యమంగా చేస్తున్నామా లేక కనిష్టంగా చేస్తున్నామా అని పరిశీలించుకోవచ్చు. ఎవరైతే ఇతరులను కూడా ఉత్తమంగా తయారు చేస్తారో వారు అనగా సర్వీసు చేసి బ్రాహ్మణులను వృద్ధి చేయువారి పాత్ర అందరికంటే ఉత్తమమైన పాత్ర అని అంటారు. పాత చెప్పు(శరీరము)ను వదలి క్రొత్త చెప్పును తీసుకోవడమే మీ పురుషార్థము. ఆత్మ పవిత్రంగా తయారైనప్పుడు పవిత్రమైన క్రొత్త చెప్పు(కొత్త శరీరము) లభిస్తుంది.
ఓంశాంతి.
పిల్లలు రెండు వైపుల నుండి సంపాదిస్తున్నారు. ఒకవైపు స్మృతియాత్ర ద్వారా, మరొక వైపు 84 జన్మల చక్ర జ్ఞానమును స్మరణ చేయడం ద్వారా లభించు సంపాదన. దీనినే డబుల్ ఆదాయము అని అంటారు. అజ్ఞాన కాలములో అల్పకాలిక క్షణభంగురమైన సింగిల్ ఆదాయము మాత్రమే ఉంటుంది. మీరు చేసే స్మృతి యాత్ర వలన లభించు ఆదాయము చాలా గొప్పది. ఆయువు కూడా పెరుగుతుంది. పవిత్రంగా కూడా అవుతారు. అన్ని దు:ఖముల నుండి దూరమవుతారు. ఇది చాలా గొప్ప సంపాదన. సత్యయుగములో ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. దు:ఖమను మాటే ఉండదు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అజ్ఞాన కాలములో చదువు ద్వారా అల్పకాలిక సుఖము లభిస్తుంది. అలాగే శాస్త్రాలు చదివే వారికి కూడా అల్పకాలిక సుఖము లభిస్తుంది. వారి ద్వారా అనుచరులకు కూడా ఏ లాభమూ ఉండదు. వాస్తవానికి వారు అనుచరులు కూడా కారు. ఎందుకంటే వారు దుస్తులను మొదలైన వాటిని మార్చుకోరు, ఇంటిని కూడా వదలిపెట్టరు. కాబట్టి వారు అనుచరులు ఎలా అవ్వగలరు? అక్కడైతే శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. ఇక్కడ అపవిత్రత ఉన్నందున ప్రతి ఇంటిలో ఎంత అశాంతి ఉంది! మీకు ఈశ్వరీయ మతము లభించింది. ఇప్పుడు మీరు తమ తండ్రిని స్మృతి చేయండి. తమది ఈశ్వరీయ ప్రభుత్వముగా భావించండి. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. మనస్సులో ఎంత సంతోషం ఉండాలి! మనమిప్పుడు శ్రీమతము అనుసారంగా నడుస్తున్నాము. ఆ శక్తి ద్వారా సతోప్రధానంగా తయారవుతున్నాము. ఇక్కడ ఎవ్వరూ రాజ్యభాగ్యాన్ని తీసుకోరు. మన రాజ్య భాగ్యము క్రొత్త ప్రపంచములో ఉంటుంది. ఇప్పుడు దానిని గూర్చి తెలిసింది. ఈ లక్ష్మీనారాయణుల 84 జన్మల కథను మీరు చెప్పగలరు. మానవమాత్రులెవరైనా ఎంత గొప్ప చదువు చదువుకున్నా వీరి 84 జన్మల కథను చెప్తామని చెప్పలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు స్మృతి ఉంటుంది. విచార సాగర మథనము కూడా చేస్తారు.
మీరిప్పుడు జ్ఞాన సూర్యవంశీయులు. సత్యయుగములో విష్ణు వంశీయులని పిలువబడ్తారు. జ్ఞానసూర్యుడు ఉదయించాడు..... ఈ సమయములో మీకు జ్ఞానము లభిస్తోంది కదా! జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. అర్ధకల్పము జ్ఞానము నడుస్తుంది. మళ్లీ అర్ధకల్పము అజ్ఞానమైపోతుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మీరిప్పుడు వివేకవంతులుగా అయినారు. మీరు ఎంతెంత వివేకవంతులుగా అవుతారో అంత ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయు పురుషార్థము చేస్తారు. మీ తండ్రి దయాహృదయులు, కళ్యాణకారి. కావున పిల్లలైన మీరు కూడా అదే విధంగా తయారవ్వాలి. పిల్లలు కళ్యాణకారులుగా తయారవ్వకపోతే వారిని ఏమంటారు? ధైర్యమున్న పిల్లలకే తండ్రి సహయోగము లభిస్తుంది(హిమ్మతే బచ్చే మదదే బాప్) అని మహిమ కూడా ఉంది కదా! ఇది కూడా తప్పకుండా కావాలి. లేకపోతే వారసత్వమునెలా పొందుతారు? సర్వీసు అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు. మీరు ఈశ్వరీయ మిషన్(ప్రచార సంస్థ) కదా! క్రైస్తవ మిషన్, ఇస్లామ్ మిషన్ ఉంటాయి కదా! వారు తమ ధర్మాన్ని ఎలా పెంచుకుంటారో, అలా మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వృద్ధి చేస్తారు. డ్రామానుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహయోగులుగా అవుతారు. కల్పక్రితము ఏ పాత్ర చేశారో వారు ఆ పాత్రను మళ్లీ తప్పకుండా చేస్తారు. ప్రతి ఒక్కరు తమ ఉత్తమ, మధ్యమ, కనిష్ట పాత్రలను చేయడం మీరు చూస్తున్నారు. ఎవరైతే ఉత్తములుగా చేస్తారో వారే అందరికంటే ఉత్తమ పాత్ర చేస్తున్నారు. కావున అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయించాలి. ఋషులు, మునులు మొదలైనవారు కూడా ''మాకు తెలియదు - తెలియదు (నేతి-నేతి)'' అని వెళ్లిపోయారు. మళ్లీ మరోవైపు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇంకేమీ తెలియదు. డ్రామానుసారము ఆత్మలోని బుద్ధి కూడా తమోప్రధానమైపోయింది. శరీరము యొక్క బుద్ధి అని అనరు. ఆత్మలోనే మనస్సు - బుద్ధి ఉన్నాయి. పిల్లలైన మీరు దీనిని బాగా అర్థము చేసుకొని మరలా చింతన చేయాలి. తర్వాత ఇతరులకు అర్థము చేయించాల్సి ఉంటుంది. వారు శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్ని దుకాణాలు తెరచి కూర్చున్నారు. మీది కూడా దుకాణమే. పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి. చురుకైన పిల్లల వద్ద చాలా ఖజానాలుంటాయి. అంత ఖజానా లేకపోతే దానిని ఎవ్వరికీ ఇవ్వలేరు. నెంబరువారుగా ధారణ జరుగుతుంది. ఎవరికైనా అర్థము చేయించే విధంగా పిల్లలు బాగా ధారణ చేయాలి. పెద్ద విషయమేమీ కాదు. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవడము ఒక సెకండ్ విషయమే. ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కావున బేహద్ అధికారులుగా అయిపోయారు. అధికారులు కూడా నెంబరువారీగా ఉంటారు. రాజులూ అధికారులే, అలాగే ప్రజలు కూడా, మేమూ అధికారులమే అని అంటారు. ఇక్కడ కూడా అందరూ మా భారతదేశమని అంటారు కదా. అలా మేము మా స్వర్గాన్ని శ్రీమతము ఆధారంగా స్థాపిస్తున్నామని మీరు కూడా అంటారు. స్వర్గములో కూడా రాజధాని ఉంటుంది. అందులో అనేక విధాలైన పదవులుంటాయి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. ఇప్పుడు పురుషార్థము చేసి ఎంత పదవిని పొందుతారో, మళ్లీ కల్ప-కల్పము అదే ఉంటుంది. పరీక్షల్లో కొందరికి తక్కువ మార్కులు వస్తే వారికి గుండెపోటు కూడా వస్తుంది. ఇక్కడైతే ఇది బేహద్ విషయము. పురుషార్థము పూర్తిగా చేయకపోతే తర్వాత నిరుత్సాహపడ్తారు. శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది. ఆ సమయములో ఏమి చేయగలరు? ఏమీ చేయలేరు. ఆత్మ ఏమి చేస్తుంది! వారు జీవహత్య చేసుకుంటారు, నీళ్ళలో మునిగి మరణిస్తారు. ఇందులో హత్య మొదలైన విషయాలేవీ లేవు. ఆత్మ మరణించదు. అది అవినాశిగా ఉంటుంది. పోతే, మీరు పాత్ర చేస్తున్న శరీరము మరణిస్తుంది. మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు. ఈ పాత శరీరము వదిలి మనము కొత్త దైవీ శరీరాన్ని తీసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు? ఆత్మ. ఉదాహరణానికి పిల్లలు కొత్త దుస్తులు కావాలని అడుగుతారు కదా. మన ఆత్మలకు కూడా క్రొత్త వస్త్రాలు కావాలి. మీ ఆత్మ క్రొత్తదిగా అయితే శరీరము కూడా కొత్తది కావాలి. అప్పుడే శోభనీయంగా ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అవ్వడము ద్వారా 5 తత్వాలు కూడా కొత్తవిగా అవుతాయి. 5 తత్వాలతోనే శరీరము తయారవుతుంది. ఆత్మ సతోప్రధానమైనప్పుడు శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. ఆత్మ తమోప్రధానమైనప్పుడు శరీరము కూడా తమోప్రధానంగా ఉంటుంది. ప్రపంచములోని శరీరాలన్నీ తమోప్రధానంగా ఉన్నాయి. రోజురోజుకు ప్రపంచము పాతదిగా అవుతూ ఉంటుంది. దిగజారుతూ ఉంటుంది. క్రొత్తదిగా ఉన్న ప్రతి వస్తువు పాతదిగా అవుతుంది. పాతదిగా అయినప్పుడు మళ్లీ వినాశనము కూడా అవుతుంది. ఇది మొత్తం సృష్టి అంతటికీ ఒక ప్రశ్న. క్రొత్త ప్రపంచాన్ని సత్యయుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. పోతే ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ పాత ప్రపంచము మారాలని మీకు మాత్రమే తెలుసు.
తండ్రి, టీచరు, గురువు అయిన అనంతమైన తండ్రి పావనంగా అవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నారు. మహాశత్రువైన కామము పై విజయమును పొందితే జగత్జీతులుగా అవుతాతారు. జగత్ జీతులు అనగా విష్ణువంశీయులుగా అవ్వండి. విషయము ఒక్కటే. ఈ పదాల అర్థమును మీకు తెలుసు. పిల్లలైన మనలను చదివించువారు తండ్రి అని తెలుసు. మొదట ఈ నిశ్చయము దృఢముగా ఉండాలి. కొడుకు పెద్దవాడైతే తర్వాత తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. తర్వాత టీచరును, అటు తర్వాత గురువును స్మృతి చేయవలసి ఉంటుంది. ఆ ముగ్గురిని భిన్న - భిన్న సమయాలలో స్మృతి చేస్తారు. ఇక్కడైతే మీకు ముగ్గురూ ఒకే సమయములో ఒక్కరిలోనే లభించారు. తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. వారైతే వానప్రస్థ స్థితిని కూడా అర్థము చేసుకోలేరు. వానప్రస్థ స్థితికి వెళ్లాలి. అందువలన గురువును ఆశ్రయించాలని భావిస్తారు. 60 సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు. ఈ నియమము ఇప్పుడు వచ్చింది. తండ్రి చెప్తున్నారు - ఇది ఇతని అనేక జన్మల తర్వాతి అంతిమ జన్మ. అంతిమ జన్మలో కూడా వానప్రస్థ స్థితిలో నేను ఇతనికి సద్గురువుగా అవుతాను. బాబా కూడా 60 సంవత్సరాల తర్వాత నిర్వాణధామానికి వెళ్ళే సమయములో సద్గురువు లభించారని అంటారు. అందరినీ నిర్వాణధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. ముక్తిధామానికి వెళ్ళి మళ్లీ పాత్ర చేసేందుకు రావాల్సి ఉంటుంది. వానప్రస్థ స్థితి చాలా మందికి ఉంటుంది. తర్వాత గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజులలో చిన్న పిల్లలను కూడా గురువు వద్దకు తీసుకెళ్తారు. గురువుకు దక్ష్షిణ లభిస్తుంది. క్రైస్తవులు వారి మతము వారిగా మార్చేందుకు దత్తు తీసుకుంటారు. కాని వారు నిర్వాణధామానికి వెళ్లరు. ఈ రహస్యాన్ని తండ్రి అర్థము చేయిస్తారు. ఈశ్వరుని జ్ఞానమును ఈశ్వరుడే తెలుపుతారు. ప్రారంభము నుండి తెలుపుతూనే వచ్చారు, తమ అంతమునూ, సృష్టి జ్ఞానమును కూడా ఇస్తారు. స్వయముగా ఈశ్వరుడే వచ్చి ఆదిసనాతన దేవీదేవతా ధర్మము అనగా స్వర్గమును స్థాపన చేస్తారు. దీని పేరు భారతదేశమనే కొనసాగుతుంది. గీతలో కేవలం కృష్ణుని పేరు వేసి ఎంత గందరగోళం చేశారు! ఇది కూడా డ్రామాయే. ఇది ఓటమి-గెలుపుల ఆట. ఓటమి - గెలుపు ఇందులో ఎలా జరుగుతాయో తండ్రి తప్ప మరెవ్వరూ తెలపలేరు. ఈ లక్ష్మీనారాయణులకకు కూడా మళ్లీ ఇందులో తమకు ఎలా ఓటమి కలుగుతుందో తెలియదు. ఈ విషయం తండ్రి తప్ప మరెవ్వరూ చెప్పలేరు. దీనిని కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. శూద్రులకు కూడా తెలియదు. స్వయం తండ్రియే వచ్చి మిమ్ములను బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. హమ్ సో అర్థము కూడా పూర్తిగా భిన్నమైనది. 'ఓం' అను అర్థము కూడా వేరుగా ఉంది. మానవులకు అర్థము తెలియక వారికి ఏమి తోస్తే అది చెప్తున్నారు. మీరిప్పుడు డ్రామాలో ఎలా దిగజారారో మళ్లీ ఎలా పైకి ఎక్కుతారో మీరు తెలుసుకున్నారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకిప్పుడు లభిస్తుంది. డ్రామానుసారము మళ్లీ కల్పము తర్వాత తండ్రియే వచ్చి చెప్తారు. ధర్మస్థాపకులు తమ సమయానుసారము వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు. నెంబర్వార్ పురుషార్థానుసారంగా అని చెప్పరు. నెంబర్వార్ సమయానుసారము వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. బ్రాహ్మణ ధర్మాన్ని తర్వాత సూర్యవంశమును, చంద్రవంశమును ఎలా స్థాపన చేస్తారో తండ్రియే వచ్చి తెలియజేస్తారు. మీరిప్పుడు జ్ఞాన సూర్యవంశీయులు మళ్లీ విష్ణు వంశీయులుగా అవుతారు. ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా చాలా జాగ్రత్తగా వ్రాయవలసి ఉంటుంది.
ఈ జ్ఞానములోని ఒక్కొక్క మహావాక్యము రత్నము వంటిది, వజ్రము వంటిదని మీకు తెలుసు, పిల్లలు ఇతరులకు అర్థము చేయించేందుకు వారిలో చాలా పరిశుద్ధత(రిఫైన్నెస్) ఉండాలి. ఏ అక్షరమైనా తప్పుగా ఉంటే వెంటనే సరిజేసి అర్థము చేయించాలి. అన్నిటికంటే పెద్ద పొరపాటు - తండ్రిని మర్చిపోవడం. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆదేశమునిస్తున్నారు. ఇది మర్చిపోరాదు. మీరు చాలా పాత ప్రేయసులని, మీ అందరికీ ఒకే ప్రియుడని బాబా చెప్తున్నారు. వారేమో పరస్పరము ఒకరి ముఖము ఒకరు చూసుకొని ప్రేయసీ-ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ప్రియుడొక్కరే. వారొక్కరే ఎంతమంది ప్రేయసులను స్మృతి చేస్తారు! అనేమంది ఒక్కరిని స్మృతి చేయడం సులభము. అనే మందిని ఒక్కరే ఎలా స్మృతి చేస్తారు! ''బాబా, మేము మిమ్ములను స్మృతి చేస్తున్నాము. మీరు మమ్ములను స్మృతి చేస్తున్నారా! అని బాబాను అడుగుతారు. అరే! పతితము నుండి పావనంగా అయ్యేందుకు మీరు నన్ను స్మృతి చేయాలి. స్మృతి చేసేందుకు నేనేమైనా పతితుడనా? స్మృతి చేయడం మీ పని. ఎందుకంటే పావనంగా అవ్వాలి. ఎవరు ఎంత స్మృతి చేస్తారో, వారు అంత ధారణ చేస్తారు. అంతేకాక సర్వీసు కూడా బాగా చేస్తారు. స్మృతియాత్ర చాలా కష్టము. ఇందులోనే యుద్ధము జరుగుతుంది. 84 జన్మల చక్రమును మర్చిపోరు. ఈ చెవులు బంగారు పాత్ర వలె ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత బాగా ధారణ అవుతుంది. ఇందులో శక్తి ఉంటుంది. అందువలన స్మృతి అను పదును ఉండాలని అంటారు. జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారా సర్వ శక్తులు నెంబరువారీగా లభిస్తాయి. కత్తుల పదును కూడా నెంబర్వారీగా ఉంటుంది. అవి స్థూలమైన విషయాలు. ముఖ్యమైన విషయము (అల్ఫ్)తండ్రిని స్మృతి చేయడమే అని బాబాయే చెప్తున్నారు. ప్రపంచ వినాశనము కొరకు కేవలం అటామిక్ బాంబులు ఉంటాయి. మరేమీ ఉండవు. అందుకు సైన్యమూ అవసరముండదు, కెప్టన్ల అవసరమూ ఉండదు. ఈ రోజులలో కూర్చునే బాంబులను వదిలే విధంగా అస్త్రాలు తయారు చేశారు. మీరిక్కడ కూర్చునే రాజ్యమును తీసుకుంటారు. వారక్కడ కూర్చుని అంతా వినాశనము చేయిస్తారు. మీ జ్ఞాన-యోగాలు, వారి మృత్యువునిచ్చే సామాన్లు సమానమవుతాయి. ఇది కూడా ఆటయే. అందరూ పాత్రధారులే కదా! భక్తి మార్గము పూర్తి అయ్యింది. తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని మరియు రచన ఆదిమధ్యాంతాల పరిచయమును ఇస్తారు. వ్యర్థ విషయాలను మీరు వినకండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. అందుకే చెడు వినకు చెడు చూడకు..... దీని చిత్రమును కూడా తయారు చేశారు. ఇంతకు ముందు కోతులతో తయారు చేసేవారు ఇప్పుడు మనుష్యులతో తయారు చేస్తున్నారు. ఎందుకంటే ముఖము మానవులదే కాని గుణాలు కోతి వలె ఉన్నాయి. కావున వాటితో పోల్చుతున్నారు. మీరిప్పుడు ఎవరి సైన్యము? శివబాబా సైన్యము. కోతుల నుండి మిమ్ములను మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఎక్కడి విషయాలు ఎక్కడికో తీసుకెళ్లారు. కోతులేమైనా వంతెన మొదలైనవి నిర్మించగలవా? ఇవన్నీ కట్టు కథలు. ఎప్పుడైనా ఎవరైనా శాస్త్రాలను మీరు అంగీకరిస్తారా? అని అడిగితే, ఓ¬! శాస్త్రాలను ఒప్పుకోని వారెవరుంటారు? అందరికంటే మేము ఎక్కువగా ఒప్పుకుంటాము. మేము చదివినంతగా మీరు కూడా చదవలేదు. అర్ధకల్పము వరకు మేము చదివామని మీరు చెప్పండి అని తండ్రి చెప్తున్నారు. స్వర్గములో శాస్త్రాలు మొదలైన భక్తి సమాగ్రి ఏదీ ఉండదు. ఎంత సహజంగా తండ్రి అర్థము చేయిస్తున్నారు. అయినా తమ సమానంగా చేయలేకున్నారు. పిల్లలు మొదలైన బంధనాలు ఉన్నందువలన ఎక్కడికీ రాలేకున్నాము అని అంటారు. ఇది కూడా డ్రామాయే అని అంటారు. తండ్రి ఏమంటున్నారంటే - 7 రోజులు, 15 రోజులు కోర్సు తీసుకొని, తర్వాత తమ సమానంగా తయారు చేయడంలో మునిగి ఉండాలి. పెద్ద పెద్ద నగరాలలో, ముఖ్య పట్టణాలను(రాజధాని నగరాలను) చుట్టుముట్టి సర్వీసు చేస్తే అక్కడి నుండి శబ్ధము వెలువడ్తుంది. గొప్ప వ్యక్తులు ఇలా శబ్ధం వ్యాపించకుంటే రారు. జోరుగా ఘెరావ్ చేస్తే చాలా మంది వస్తారు. తండ్రి ఆదేశాలు లభిస్తాయి కదా! అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన-యోగాల ద్వారా తమ బుద్ధిని స్వచ్ఛంగా(రిఫైన్గా) చేసుకోవాలి. తండ్రిని మర్చిపోయే తప్పు ఎప్పుడూ చేయరాదు. ప్రేయసులుగా అయ్యి ప్రియుడిని స్మృతి చేయాలి.
2. బంధనముక్తులుగా అయ్యి తమ సమానంగా చేసే సేవ చేయాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. పురుషార్థములో ఎప్పటికీ నిరుత్సాహపడరాదు.
వరదానము :-
'' సంకల్పమనే బీజాన్ని సదా సమర్థంగా చేసే జ్ఞానయుక్త ఆత్మ భవ ''
జ్ఞానం వినడం వినిపించడంతో పాటు జ్ఞానస్వరూపులుగా అవ్వండి. జ్ఞాన స్వరూపులనగా వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ సమర్థంగా ఉండాలి. వ్యర్థము సమాప్తమైపోవాలి. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థము ఉండజాలదు. ఎలాగైతే ప్రకాశము (వెలుగు) మరియు అంధకారము (చీకటి) జత జతలో ఉండవో అలా సమర్థము, వ్యర్థము జతజతలో ఉండజాలవు. జ్ఞానమంటే ప్రకాశము, వ్యర్థమంటే అంధకారము. అందువలన జ్ఞానయుక్త ఆత్మ అనగా ప్రతి సంకల్పమనే బీజము సమర్థంగా ఉండాలి. ఎవరి సంకల్పమైతే సమర్థంగా ఉంటుందో వారి మాట, కర్మ, సంబంధము సహజంగానే సమర్థమైపోతాయి.
స్లోగన్ :-
''సూర్య వంశములోకి వెళ్లాలంటే యోగులుగా అవ్వండి, యోధులుగా కాదు. ''