21-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - శుభ కార్యము చేయడంలో ఆలస్యము చేయరాదు. మీ సోదరీ - సోదరులను ఎదురుదెబ్బలు తినడం నుండి(మోసపోవుట నుండి) రక్షించాలి. భ్రమరం వలె భూ - భూ చేసి మీ సమానంగా తయారు చేయాలి.''

ప్రశ్న :-

ఏ విషయములో అనర్థము జరగడం వలన భారతదేశము గవ్వ తుల్యంగా తయారయింది?

జవాబు :-

గీతా స్వామిని(శివబాబా) మర్చిపోయి గీతా జ్ఞానము ద్వారా జన్మను పొందిన పిల్లవాడినే (శ్రీ కృష్ణుడు) స్వామి అని అనేశారు. ఈ ఒక్క అనర్థము కారణంగానే అందరూ తండ్రి నుండి విముఖులై పోయారు. భారతదేశము గవ్వ తుల్యంగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో సత్యమైన గీతను వింటున్నారు. ఈ గీతా జ్ఞానము ద్వారానే దేవీ దేవతా ధర్మము స్థాపనవుతుంది. మీరు శ్రీ కృష్ణుని సమానంగా అవుతారు.

పాట :-

ఈ ఆటనంతా రచించిందెవరు,............ (కిస్‌నే యహ్‌ సబ్‌ ఖేల్‌ రచాయా,...........)   

ఓంశాంతి.

బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు మనకు స్వర్గములో చాలా అపారమైన సుఖముండేదని, చాలా సంతోషంగా ఉండేవారని అర్థము చేసుకున్నారు. జీవాత్మలైన మనము స్వర్గములో చాలా ఆనందముగా ఉండేవారము, తర్వాత ఏమయింది? రంగు, రూపముల మాయ వచ్చి అంటుకుంది. వికారాల కారణంగానే దీనిని నరకము అని అంటారు. అంతా నరకమే. భ్రమరము ఉదాహరణమేదైతే ఇస్తారో ఆ భ్రమరము మరియు బ్రాహ్మణి ఇరువురి పని ఒక్కటే. భ్రమరము ఉదాహరణ మీ గురించే ఉంది. భ్రమరము పురుగులను తీసుకెళ్తుంది, ఇంటిని తయారుచేసి ఆ ఇంటిలో పురుగులను వేసేస్తుంది. ఇది కూడా నరకమే. అందరూ పురుగుల వలె ఉన్నారు కాని పురుగులన్నీ దేవీదేవతా ధర్మానికి చెందినవారు కారు. ఏ ధర్మాలకు చెందినవారైనా అందరూ నరకవాసులైన పురుగులే. ఇప్పుడు దేవీదేవతా ధర్మానికి చెందిన పురుగులెవరో కూర్చుని భూ - భూ చేసే బ్రహ్మ ముఖవంశీ బ్రాహ్మణులకు వీరేనని తెలిసేది ఎలా? ఎవరు దేవీదేవతా ధర్మానికి చెందిన వారుంటారో, వారే నిలుస్తారు. కాని వారు నిలువరు. ఇప్పుడు అందరూ నరకవాసీ పురుగులే. సన్యాసులు కూడా నరకపు ఈ సుఖము కాకిరెట్టకు సమానము(అతిఅల్పము) అని అంటారు. స్వర్గములో అపారమైన సుఖముంటుందని వారికి తెలియదు. ఇక్కడ 5 శాతము సుఖము, 95 శాతము దు:ఖము ఉంది. కనుక దీనిని స్వర్గమని ఎవ్వరూ అనరు. స్వర్గములో అయితే దు:ఖము మాటే ఉండదు. ఇక్కడైతే అనేక శాస్త్రాలు, అనేక ధర్మాలు, అనేక మతాలైపోయాయి. స్వర్గములో అయితే ఒకే అద్వైత దేవతా మతము, ఒకే ధర్మముంటుంది కావున మీరు బ్రాహ్మణీలు, భ్రమరములా భూ - భూ చేస్తారు. ఈ ధర్మానికి చెందినవారెవరైతే వారు నిలుస్తారు. మనుష్యులు అనేక రకాలుగా ఉన్నారు. కొందరు ప్రకృతిని నమ్ముతారు, కొందరు సైన్సును నమ్ముతారు, మరి కొందరు ఈ సృష్టి కేవలం కల్పిత మాత్రమేనని అంటారు. ఇటువంటి సంభాషణ ఇక్కడే జరుగుతుంది, సత్యయుగములో జరగదు. ఈ అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా తన పిల్లలకు కూర్చుని అర్థము చేయిస్తారు. మీరు నా వద్ద ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నా వద్దకు రావాలి. ఇందులో శాస్త్రాల విషయమేదీ ఉత్పన్నమవ్వదు. క్రీస్తు, బుద్ధుడు వస్తారు, వారు కూడా వచ్చి వినిపిస్తారు. ఆ సమయములో శాస్త్రాల ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. క్రీస్తు ఏమైనా బైబిల్‌ చదివేవాడా? అప్పుడు బైబిల్‌ అన్న మాటే ఉండదు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీ స్థితిని చూసుకోండి, మాయా రావణుడు మీ స్థితిని ఎలా తయారుచేశాడో చూడండి, మేము ఆసురీ రావణ సంప్రదాయములో ఉన్నామని కూడా అర్థము చేసుకుంటారు. రావణుని తగులబెడ్తారు కానీ అతడు తగులబడడు. రావణుడు తగులబడడం ఎప్పుడు ఆగుతుందో మనుష్యులకు తెలియదు. మీరు ఈశ్వరీయ దైవీ సంప్రదాయము వారు. మీరు నా పిల్లలు. ఇప్పుడు పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు నేను వచ్చాను. అనేక ధర్మాలున్నాయి, వాటి నుండి బయటకు తీసేందుకు ఎంత కష్టపడవలసి వస్తుంది. గీత కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఆదిసనాతన దేవీదేవతా ధర్మమైమేదైతే ఉందో వాటి గుర్తులు ఎక్కడ నుండి వెలువడ్డాయి. వాటిని ఋషులు, మనులు కూర్చుని తయారుచేశారు. వాటిని ఇప్పటివరకు వింటూ వచ్చారు. వేదాలను ఎవరు గానము చేశారు? వేదాలకు తండ్రి ఎవరు? '' నేను గీతా భగవానుడిని '' అని తండ్రి అంటున్నారు. శివబాబాయే గీతా మాతను రచించారు. గీత నుండి శ్రీ కృష్ణుడు జన్మ తీసుకున్నాడు. అతనితో పాటు రాధ మొదలైనవారంతా వచ్చేస్తారు. మొదట ఉన్నది బ్రాహ్మణులే.

వారు మా అత్యంత ప్రియమైన(మోస్ట్‌ బిలవెడ్‌) తండ్రి అని పిల్లలైన మీకు నిశ్చయముంది. వారిని అందరూ ''ఓ గాడ్‌ఫాదర్‌ దయ చూపండి'' అని అంటారు. దు:ఖాల నుండి విముక్తులెలా అవ్వాలి అని భక్తులు పిలుస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అయినట్లయితే పిలువలసిన అవసరమేముంది? ముఖ్యమైనది గీత విషయము. ఎన్నో యజ్ఞాలు మొదలైన వాటిని రచిస్తారు. ఇప్పుడు మీరు ఇటువంటి కరపత్రాలను ముద్రించండి. ఇప్పుడు ఎంత అనర్థమైపోయిందో చూడండి. ఎక్కడ చూసినా గీతను వ్రాస్తూ ఉంటారు. గీతను ఎవరు రచించారు? ఎవరు గానము చేశారు? ఎప్పుడు గానము చేశారు? ఎవరు తయారుచేశారు? ఈ విషయాల గురించి ఏమాత్రము తెలియదు. శ్రీ కృష్ణుని యదార్థ పరిచయము కూడా లేదు. కేవలం కృష్ణుడు సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే కృష్ణుడు అని అనేస్తారు. రాధ భక్తులు రాధ సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా అక్కడ రాధనే రాధ అని అంటారు. ఒక్క నిరాకార పరమాత్మనే సర్వవ్యాపి అంటే అది రైటు. కాని అందరినీ సర్వవ్యాపిగా ఎందుకు చేసేశారు. గణేశుని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. ఉదాహరణకు ఒక్క మథుర నగరములోనే గమనించండి. కొందరేమో శ్రీ కృష్ణుని సర్వవ్యాపి అని అంటే, కొందరేమో రాధ సర్వవ్యాపి అని అంటారు. ఎంత తికమక అయిపోయింది. ఒకరి మతము ఇంకొకరితో కలవదు. ఒకే ఇంటిలో తండ్రి గురువు వేరుగా, పిల్లలకు వేరే గురువు ఉంటారు. వాస్తవానికి వానప్రస్థములోనే గురువుల వద్దకు వెళ్తారు. తండ్రి చెప్తున్నారు - నేను కూడా వీరి వానప్రస్థ అవస్థలోనే ప్రవేశించాను. ప్రపంచములో ఎవరెంత పెద్ద గురువు అయితే అంత వారికి నషా ఉంటుంది. ఆదిదేవునికి మహావీరుడనే పేరు కూడా ఇచ్చేశారు. హనుమంతుని కూడా మహావీరుడని అంటారు. వాస్తవానికి మహావీరులు అంటే శక్తులైన మీరే. దిల్‌వాడా మందిరములో శక్తులను సింహము పైన సవారీ చేస్తున్నట్లు పాండవులను ఏనుగుల పైన సవారీ చేస్తున్నట్లు చూపించారు. ఈ మందిరము చాలా గొప్ప యుక్తితో తయారు చేయబడింది. అది పూర్తిగా మీ స్మృతిచిహ్నమే. మీ చిత్రాలనే ఉంచేందుకు మీరు ఆ సమయములోనైతే ఇదే రూపాలతో ఉండరు కదా. మందిరము ద్వాపర యుగములో నిర్మించబడింది. కనుక అప్పుడు మీ చిత్రాలు ఎక్కడ నుండి వస్తాయి? మీరు సేవ అయితే చేస్తున్నారు. విషయాలన్నీ ఈ సంగమ యుగమునకు చెందినవే. వారు తర్వాత శాస్త్రాలను తయారుచేశారు. మనము ఒకవేళ గీత పేరును ప్రస్తావించకపోతే ఇదేదో కొత్త ధర్మమని మనుష్యులు భావిస్తారు. చాలా కష్టపడవలసి ఉంటుంది. వారు(ధర్మ స్థాపకులు) ఈ ప్రపంచములో కేవలం ధర్మస్థాపన చేస్తారు. మిమ్ములనైతే తండ్రి కొత్త ప్రపంచము కొరకు తయారు చేస్తారు.

తండ్రి చెప్తున్నారు - నేను చేసే కర్తవ్యమును ఇతరులెవ్వరూ చేయలేరు. పతితులందరినీ పావనంగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు(పవిత్రత విషయములో) హెచ్చరిక చేయవలసి ఉంటుంది. భారతదేశములో ఎంతో అనర్థము జరిగిపోయింది. దాని వల్లనే భారతదేశము గవ్వ తుల్యంగా అయ్యింది. తండ్రి గీతా మాత ద్వారా కృష్ణునికి జన్మనిచ్చారు. అయితే వారు కృష్ణుని గీతా స్వామిగా చేసేశారు. నిజానికి గీతా స్వామి శివుడు. వారు గీత ద్వారా కృష్ణునికి జన్మనిచ్చారు. మీరందరూ సంజయులు, వినిపించేవారు ఒక్క శివబాబాయే. ప్రాచీన దేవీ దేవతా ధర్మమును రచించేవారెవరు? ఈ విషయాములన్నీ వ్రాసేందుకు మంచి బుద్ధి కావాలి. గీత ద్వారా మనము జన్మ తీసుకుంటున్నాము. మమ్మా రాధగా, ఇతడు(బ్రహ్మ) కృష్ణునిగా అవుతారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు కదా. బ్రాహ్మణుల జన్మను గురించి ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. విషయమంతా కృష్ణుడు మరియు పరమాత్మలకు చెందినదే. బ్రహ్మ కృష్ణుడు మరియు శివబాబా - ఈ విషయాలన్నీ గుహ్యమైనవి కదా. ఈ విషయాలను అర్థము చేసుకునేందుకు చాలా బుద్ధివంతులై ఉండాలి. ఎవరికైతే యోగము పూర్తిగా ఉంటుందో, వారి బుద్ధి పారసముగా(బంగారంగా) అవుతూ పోతుంది. బుద్ధి భ్రమిస్తూ ఉండేవారికి ఈ విషయాలు బుద్ధిలో నిలబడవు. బాబా పిల్లలైన మీకు ఎంత ఉన్నతమైన జ్ఞానమును ఇస్తున్నారు. విద్యార్థి తన బుద్ధిని కూడా నడిపిస్తారు కదా. అందువలన ఇప్పుడు కూర్చుని వ్రాయండి - శుభ కార్యములో ఆలస్యము చేయరాదు. సాగరుని పిల్లలైన మనము మన సోదరీ-సోదరులను రక్షించాలి. పాపం ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఈ బి.కెలు ఇంతగా కష్టపడుతున్నారంటే తప్పకుండా ఏదో విషయము ఉంటుంది కదా అని అంటారు. లక్షల కరపత్రాలను ముద్రించి గీతా పాఠశాల మొదలైనవాటిలో పంచండి. భారతదేశము అవినాశి ఖండము మరియు సర్వోత్తమ తీర్థ స్థానము. అందరికీ సద్గతినిచ్చే తండ్రి తీర్థ స్థానమును జాడ తెలియకుండా మాయం చేసేశారు. మరి దాని పేరును ప్రసిద్ధము చేయాల్సి ఉంటుంది కదా. పుష్పాలు అర్పించుటకు యోగ్యులు ఒక్క శివబాబా మాత్రమే. మిగిలినవన్నీ వ్యర్థమే. గీతా పాఠశాలలు చాలా ఉన్నాయి. మీరు వేషాన్ని మార్చుకొని అక్కడకు వెళ్లండి, భలే వారు మిమ్ములను బి.కెలని గుర్తించినా పర్వాలేదు. ఇటువంటి ప్రశ్నలు ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. అచ్ఛా.

శివబాబా బ్రహ్మ తనువులో కూర్చుని ఈ విషయాలను అర్థము చేయిస్తున్నారని మీరు అర్థము చేసుకుంటున్నారు. స్వర్గానికి మాలికులుగా తయారుచేసే తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు. బ్రాహ్మణులుగా అవ్వనంతవరకు దేవతలుగా అవ్వలేరు. బ్రాహ్మణ కులము దైవీ కులముకన్నా ఉన్నతమైనది. అందరి ఆత్మలు పావనంగా అవుతున్నాయి. మీరు మళ్ళీ నూతన ప్రపంచములో పునర్జన్మను తీసుకుంటారు. అచ్ఛా.

రాత్రి క్లాసు (12-01-1969) - పిల్లలైన మీరు ఒక్క తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఒక్కరి స్మృతిలో ఉండుటనే ''అవ్యభిచారీ స్మృతి'' అని అంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చుని కూడా వేరే వారి స్మృతి వచ్చినట్లయితే దానిని వ్యభిచారీ స్మృతి అని అంటారు. తినుట, త్రాగుట, ఉండుట, అన్నీ ఒక ఇంటిలో చేస్తూ ఇతరులను స్మృతి చేయడం మోసమవుతుంది. భక్తి కూడా ఎప్పటివరకు ఒక్క శివబాబానే పూజిస్తారో, అప్పటివరకు(ద్వాపర యుగము ప్రారంభములో) అది అవ్యభిచారీ భక్తి. తర్వాత ఇతరులను స్మృతి చేస్తారు అప్పుడది వ్యభిచారి భక్తి అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. ఒక్క తండ్రి ఎంత అద్భుతాన్ని చేస్తున్నారు! మనలను విశ్వానికి అధిపతులుగా చేస్తారు. అందువలన ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. నాకు ఒక్కరు మాత్రమే ఉన్నారని అనాలి. కాని పిల్లలు శివబాబా స్మృతిని మర్చిపోతామని అంటారు. వాహ్‌! మీరు భక్తి మార్గములో ఉన్నప్పుడు మేము ఒక్కరినే భక్తి చేస్తామని అనేవారు. వారే పతిత పావనులు. ఇంకెవ్వరినీ పతితపావనులని అనరు. ఆ ఒక్కరినే అలా అంటారు. వారే అత్యంత ఉన్నతులు. ఇప్పుడు భక్తి విషయమే లేదు. పిల్లలకు జ్ఞానముంది. జ్ఞానసాగరుని స్మృతి చేయాలి. భక్తి మార్గములో మీరు వచ్చినట్లయితే మేము మిమ్ములనే స్మృతి చేస్తాము అని అనేవారు. కనుక ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - ''నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తున్నానా? లేక అనేక బంధు-మిత్రులు మొదలైనవారిని స్మృతి చేస్తున్నానా?'' ఒక్క తండ్రితోనే మనసును జోడించాలి. ఒకవేళ హృదయము మరొకరి వైపు వెళ్లినట్లయితే వ్యభిచారీ స్మృతి అవుతుంది. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మామేకమ్‌ యాద్‌ కరో(నన్ను ఒక్కరినే స్మృతి చేయండి). మళ్ళీ మీకు అక్కడ దైవీ సంబంధీకులు లభిస్తారు. నూతన ప్రపంచములో మీకు అందరూ కొత్తవారే లభిస్తారు. మనమెవరిని స్మృతి చేస్తున్నామని స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్రి చెప్తున్నారు - మీరు పారలౌకిక తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. నేనే పతిత పావనుడను. ప్రయత్నము చేసి మిగిలిన అన్నివైపుల నుండి బుద్ధి యోగమును తొలగించి తండ్రిని స్మృతి చేయాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత పాపము తెగిపోతుంది. ఎంతెంత మనము బాబాను స్మృతి చేస్తామో అంత బాబా కూడా మనలను స్మృతి చేస్తారని కాదు. పాపము తొలగించుకోవలసిన అవరసరము తండ్రికి లేదు. పావనులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. శివబాబా కూడా ఇక్కడే ఉన్నారు. వారికి తమ శరీరమైతే లేదు. లోను(ఋణము)గా తీసుకున్నారు. మీరు - 'బాబా! మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగా అయ్యి నూతన ప్రపంచానికి మాలికులుగా అవుతాము' అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. మీ హృదయముతో ప్రశ్నించుకుంటూ ఉండండి. మాటిమాటికి తండ్రి నుండి బుద్ధియోగపు లింకు(సంబంధము) తెగిపోతూ ఉంటుందని గ్రహించారు. తండ్రికి తెలుసు - లింకు తెగిపోతూనే ఉంటుంది. మళ్ళీ స్మృతి చేస్తారు, మళ్ళీ తెగిపోతుంది. పిల్లలు నంబరువారుగా పురుషార్థమైతే చేస్తూనే ఉంటారు. మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే మీరు ఈ రాజధానిలో వచ్చేస్తారు. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. డైరీ ఉంచుకోండి - రోజంతటిలో మా బుద్ధి యోగము ఎక్కడెక్కడకు పోయింది? తర్వాత తండ్రి మళ్ళీ అర్థము చేయిస్తారు. ఆత్మలో ఉన్న మనసు, బుద్ధి పరిగెడుతూ ఉంటాయి. అలా పరిగెత్తుట వలన నష్టము కలుగుతుందని తండ్రి చెప్తారు. నన్ను స్మృతి చేయడం వలన చాలా లాభముంటుంది. మిగిలినదంతా నష్టమే నష్టము. ముఖ్యంగా ఒక్కరినే స్మృతి చేయాలి. స్వయం పై చాలా గమనముంచాలి. అడుగడుగులో లాభము, అడుగడులో నష్టము. 84 జన్మలు దేహధారులను స్మృతి చేస్తూ నష్టమునే పొందారు. ఒక్కొక్క రోజు గడుస్తూ 5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. నష్టమే జరిగింది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉంటూ లాభం పొందుకోవాలి.

ఈ విధంగా విచార సాగర మథనము చేసి జ్ఞాన రత్నాలను వెలికి తీయాలి. తండ్రి స్మృతిలో ఏకాగ్రచిత్తులై నిమగ్నమవ్వాలి. చాలామంది పిల్లలకు గవ్వలను సంపాదించుకోవడంలోనే చింత ఉంటుంది. మాయ వ్యాపారము మొదలైన వాటిని గురించి ఆలోచనలను తీసుకొస్తుంది. ధనవంతులకైతే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాబా ఏమి చేయగలరు? బాబాకు ఎంత మంచి వ్యాపారముండేది. ఎటువంటి ఎదురుదెబ్బలు తినవలసిన అవసరమే లేదు. ఎవరైనా వ్యాపారి వచ్చినట్లయితే నేను వారిని - '' మీరు వ్యాపారులా ? లేక ఏజెంటా (ప్రతినిధులా) అని ప్రశ్నించేవాడిని. (బ్రహ్మాబాబా గత జీవితపు విషయము). మీరు వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా బుద్ధి యోగాన్ని తండ్రితో జోడింపజేయాలి. ఇప్పుడు కలియుగము పూర్తయ్యి సత్యయుగము వస్తుంది. పతితులైతే సత్యయుగములోకి వెళ్ళనే వెళ్ళరు. ఎంతగా స్మృతి చేస్తే, అంత పవిత్రంగా అవుతారు. పవిత్రత వలన ధారణ మంచిగా జరుగుతుంది. పతితులు స్మృతి చేయలేరు వారికి ధారణ కూడా జరగదు. కొంతమందికి వారి అదృష్టము కొలది సమయము లభిస్తుంది. పురుషార్థము చేస్తారు. కొంతమందికి సమయమే లభించదు. స్మృతి చేయనే చేయరు. కల్పక్రితము ఎవరెంత ప్రయత్నము చేశారో, ఇప్పుడు కూడా అంతే ప్రయత్నము చేస్తారు. ప్రతి ఒక్కరు తమంతకు తాము శ్రమ చేయాలి. సంపాదనలో నష్టము వస్తే ఇంతకుముందు ఈశ్వరేచ్ఛ అనేవారు. కానీ ఇప్పుడు డ్రామా అని అంటారు. కల్పక్రితము ఏమి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు 4 గంటలు యోగము చేస్తే, మరో కల్పములో ఎక్కువగా చేస్తారని కాదు. శిక్షణ ఇవ్వబడుతుంది. ఇప్పుడు పురుషార్థము చేస్తే కల్ప-కల్పము మంచి పురుషార్థము చేస్తారు. కాబట్టి బుద్ధి ఎక్కడెక్కడకు వెళ్తూ ఉందో పరిశీలించుకోండి. మల్లయుద్ధములో చాలా హెచ్చరికగా ఉంటారు. అచ్ఛా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. బుద్ధివంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా మీ బుద్ధిని పారసబుద్ధిగా చేసుకోవాలి. బుద్ధిని అక్కడా - ఇక్కడా భ్రమింపచేయరాదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని గూర్చే ఆలోచించాలి.

2. భ్రమరము వలె తయారై భూ - భూ చేసి నరకవాసులుగా ఉన్న పురుగులను దేవీ దేవతలుగా చేయు సేవ చేయాలి. శుభ కార్యములో ఆలస్యము చేయరాదు. తమ సోదరీ-సోదరులను రక్షించాలి.

వరదానము :-

''అవినాశి సౌభాగ్యము ద్వారా భాగ్య తిలకధారి నుండి భవిష్యత్తులో రాజ్య తిలకధారీ భవ ''

సంగమ యుగంలో దేవాది దేవుని సౌభాగ్యము మరియు పరమాత్మ లేక ఈశ్వరీయ సంతానమనే భాగ్య తిలకము ప్రాప్తి అవుతుంది. ఒకవేళ సౌభాగ్యము మరియు భాగ్య తిలకము అవినాశిగా ఉంటే మాయ ఈ తిలకాన్ని చెరిపేయదు. కనుక ఇక్కడి సౌభాగ్యము మరియు భాగ్యము తిలకధారుల నుండి భవిష్యత్తులో రాజ్య తిలకధారులుగా అవుతారు. ప్రతి జన్మలో రాజ్య తిలకాన్ని దిద్దే ఉత్సవము జరుగుతుంది. రాజుతో పాటు రాయల్‌ ఫ్యామిలీ వారికి కూడా తిలకము దిద్దే రోజు జరపబడ్తుంది.

స్లోగన్‌ :-

''సదా ఒక్కరి స్నేహములో (ప్రేమలో) ఇమిడి ఉంటే ఈ ప్రేమ శ్రమను సమాప్తం చేసేస్తుంది''