18-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - బ్రాహ్మణులైన మీ జన్మ దేవతల కంటే ఉత్తమ కళ్యాణకారి జన్మ, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరే తండ్రికి సహాయకారులుగా అవుతారు ''
ప్రశ్న :-
ఇప్పుడు పిల్లలైన మీరు బాబాకు ఏ సహాయము చేస్తారు? తనకు సహాయకారులైన పిల్లలకు తండ్రి ఏ బహుమతినిస్తారు?
జవాబు :-
బాబా శాంతి-పవిత్రతల రాజ్యమును స్థాపన చేస్తున్నారు. మనము వారికి పవిత్రతా సహయోగమును చేస్తాము. బాబా రచించిన యజ్ఞమును మనము సంభాళిస్తున్నాము (నిర్వహిస్తున్నాము). అందువలన తండ్రి మనకు తప్పకుండా బహుమతినిస్తారు. సంగమ యుగములో కూడా మనకు(బాబా ద్వారా) చాలా గొప్ప బహుమతి లభిస్తుంది - మనము సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్న త్రికాలదర్శులుగా అవుతాము అంతేకాక భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతాము. ఇదే బహుమతి.
పాట :-
తండ్రి, తల్లి, సహాయకుడవు, స్వామివి, సఖుడవు..... (పితు మాత్ సహాయక్ స్వామీ సఖా.......... ) 
ఓంశాంతి.
ఇది ఎవరి మహిమ? 'శివుడు' అనే పేరు గల పరమప్రియ పరమపిత పరమాత్మది. వారి నామము(పేరు), ధామము(నివాసము) రెండూ సర్వోన్నతమైనవే. పరమపిత పరమాత్మ అంటే అందరి కంటే ఉన్నతోన్నతమైన ఆత్మ. ఇంకెవ్వరినీ పరమపిత పరమాత్మ అని అనరు. వారి మహిమ అపారమైనది. వారికి ఎంత మహిమ ఉందంటే - ''వారి అంతమును పొందలేము''(వారిని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టమని భావము). వారి అంతమును పొందలేమని ఋషులు, మునులు కూడా అనేవారు. వారు కూడా తెలియదు, తెలియదు!(నేతి నేతి) అని అంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయమునిస్తారు. ఎందుకు? తండ్రి పరిచయము పిల్లలకు తెలిసి ఉండాలి కదా! మరి పిల్లలకు పరిచయము లభించేది ఎలా? వారు ఈ భూమి పైకి రానంతవరకు ఇతరులెవ్వరూ వారి పరిచయాన్ని ఇవ్వలేరు. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేసినప్పుడే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు(శివబాబా పిల్లలను విశ్వం ముందు ఉంచి అనగా పిల్లలను ప్రత్యక్షం చేసి తాను గుప్తంగా ఉంటారు, పిల్లలు వారి సత్పరివర్తన ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు). తండ్రి అర్థము చేయిస్తున్నారు - నా పాత్ర కూడా నిశ్చితమై ఉంది. నేనే వచ్చి పతితులను పావనంగా చేయాలి. పతితపావన సీతా-రామా రండి! అని సాధువులు, సన్యాసులు కూడా పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడు తక్కువైనవాడేమీ కాదు. ప్రపంచమంతా తమోప్రధానంగా, పతితంగా ఎవరు చేశారు? - రావణుడు. మళ్లీ పావనంగా చేయువారు సమర్థుడైన రాముడు కదా. అర్ధకల్పము రామరాజ్యము నడుస్తే అర్ధకల్పము రావణ రాజ్యము కూడా నడుస్తుంది. రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. ప్రతి సంవత్సరము రావణుని తగులబెడ్తూ ఉంటారు. అయినా రావణ రాజ్యము కొనసాగుతూ ఉంటుంది. రావణుడు పూర్తిగా కాలిపోడు. పరమాత్మ సమర్థుడైతే రావణుని రాజ్యపాలన ఎందుకు చేయనిస్తారు? అని మనుష్యులంటారు. ఇది గెలుపు-ఓటముల నాటకమని, నరకము-స్వర్గముల నాటకమని తండ్రి అర్థము చేయిస్తారు. ఈ మొత్తం నాటకమంతా భారతదేశము పైనే తయారుచేయబడింది. ఇది తయారైన డ్రామా. అంతేకాని పరమపిత పరమాత్మ సర్వశక్తివంతులైతే నాటకము పూర్తి అవ్వకముందే వస్తాడని లేక అర్ధము(సగం)లోనే నాటకము సమాప్తము చేస్తాడని అనుకోరాదు. తండ్రి చెప్తున్నారు - ఈ ప్రపంచమంతా పతితమైనప్పుడు నేను వస్తాను. అందుకే శివరాత్రి పండుగ కూడా జరుపుకుంటారు. అంతేకాక ఓం నమ: శివాయ అని కూడా అంటారు. బ్రహ్మ-విష్ణు-శంకరులను దేవతాయ నమ: అని, శివుని శివ పరమాత్మాయ నమ: అని అంటారు. శివుడు బబుల్నాథ్ మందిరములో ఉన్నట్లు లేక సోమనాథ మందిరములో ఉన్నట్లు ఉంటారా? పరమపిత పరమాత్మకు ఇంత పెద్ద రూపముందా? లేక ఆత్మకు చిన్న రూపము, ఆత్మల తండ్రికి పెద్ద రూపము ఉందా?,............ ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా? ఎలాగైతే ఇక్కడ చిన్నవారిని పిల్లలని, పెద్దవారిని తండ్రి అని అంటారో అలా పరమపిత పరమాత్మ ఇతర ఆత్మల కంటే పెద్దగా ఉండి ఆత్మలమైన మనము చిన్నగా ఉంటామా? అలా ఉండము. తండ్రి అర్థము చేయిస్తున్నారు - పిల్లలూ! మీరు నా మహిమను గానము చేస్తారు. పరమపిత పరమాత్ముని మహిమ అపారమైనదని అంటారు. మానవ సృష్టికి బీజమని కూడా అంటారు. కావున తండ్రిని బీజము అని అంటారు కదా. వారు రచయిత. మిగిలిన ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, గీత, యజ్ఞ, తప, జప, దాన, పుణ్యాదులు....... ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తిమార్గములోని సామాగ్రి. వీటన్నిటికి కూడా వాటి సమయము వాటికి ఉంది. అర్ధకల్పము భక్తి, అర్ధకల్పము జ్ఞానము ఉంటాయి. భక్తిని బ్రహ్మకు రాత్రి అని, జ్ఞానమును బ్రహ్మకు పగలు అని అంటారు. శివబాబా ఈ విషయాలన్నీ మీకు అర్థము చేయిస్తారు. వారికి తమ స్వంత శరీరము లేదు. నేను మళ్లీ మీకు రాజ్యభాగ్యాన్ని ఇప్పించేందుకు రాజయోగమును నేర్పిస్తాను. ఇప్పుడు బ్రహ్మ రాత్రి పూర్తి అవుతుంది. అదే ధర్మగ్లాని సమయమే మళ్లీ ఆసన్నమయ్యింది. అందరికంటే ఎక్కువగా ఎవరిని గ్లాని చేస్తారు? పరమపిత పరమాత్మ అయిన శివుడినే అందరికంటే ఎక్కువగా గ్లాని చేస్తారు. యదా యదాహి............. అని వ్రాయబడి ఉంది కదా. కల్పక్రితము సంస్కృతములో నేనేమీ జ్ఞానము ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇదే భాషలోనే ఇచ్చాను. కావున భారతదేశములో ఎప్పుడైతే దేవీదేవతా ధర్మస్థాపన చేయువారి గ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే నన్ను రాయి, రప్పలలో తోసేస్తారో ఆ సమయములోనే నేను వస్తాను. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారో, పతితులను పావనంగా చేస్తారో వారిని ఎంతగా గ్లాని చేశారు!
భారతదేశము అన్నిటికంటే ప్రాచీన ఖండమని, అది ఎప్పుడూ వినాశనమవ్వదని, సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని కూడా ఇక్కడే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ రాజ్యమును కూడా స్వర్గ రచయితే ఇచ్చారు. ఇప్పుడైతే అదే భారతదేశము పతితంగా ఉంది. అప్పుడే నేను మళ్లీ వస్తాను. అందుకే ఓం నమ శివాయ: అని వారిని మహిమ చేస్తారు. ఈ అనంతమైన డ్రామాలో ప్రతి ఆత్మ పాత్ర నిర్ణయించబడి ఉంది. అదే పాత్ర మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంది. అందులో నుండి ఒక చిన్న ముక్కను(భాగము) తీసుకొని హద్దు డ్రామాను తయారుచేస్తారు. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా ఉన్నాము. తర్వాత మళ్లీ మనము దేవతలుగా అవుతాము. ఇది ఈశ్వరీయ వర్ణము(కులము). ఇది మీకు 84వ అంతిమ జన్మలో కూడా అంతిమ సమయము. ఇందులో నాలుగు వర్ణాల జ్ఞానము మీకు ఉంది. అందువలన బ్రాహ్మణ వర్ణము అన్నిటికంటే శ్రేష్ఠమైనది. అయితే మహిమ లేక పూజ దేవతలకు జరుగుతుంది. బ్రహ్మ మందిరము(అజ్మీరులో) కూడా ఉంది. కాని వారిలో పరమాత్మ ప్రవేశించి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారని ఎవ్వరికీ తెలియదు. స్థాపన జరుగుతున్నపుడు వినాశనము కూడా జరగాలి. అందుకే రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల వెలువడిందని అంటారు.
ఇప్పుడు అదే తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! ఇది మీ అంతిమ జన్మ. నేను మీకు మళ్లీ స్వర్గ వారసత్వమునిచ్చేందుకు వచ్చాను. మీకు హక్కు ఉంది. కాని ఎవరైతే నా శ్రీమతమును అనుసరిస్తారో, వారికి నేను స్వర్గమును కానుకగా ఇస్తాను. ప్రపంచములోని వారికి కూడా శాంతి బహుమతులు మొదలైనవి లభిస్తాయి. కాని తండ్రి మీ అందరికీ స్వర్గమును బహుమతిగా ఇస్తారు. నేను తీసుకోను. మీ ద్వారా స్థాపన చేయిస్తాను అందువలన మీకే కానుకగా ఇస్తానని వారంటున్నారు. మీరు శివబాబా పౌత్రులు, బ్రహ్మకు పిల్లలు. ఇంతమంది పిల్లలనైతే ప్రజాపిత బ్రహ్మయే దత్తత చేసుకొని ఉంటారు కదా. మీ ఈ బ్రాహ్మణ జన్మ అన్నిటికంటే ఉత్తమమైనది. ఇది కళ్యాణకారి జన్మ. దేవతల జన్మ గాని, శూద్రుల జన్మ గాని కళ్యాణకారి కాదు. ఇప్పుడు మీరు తీసుకున్న బ్రాహ్మణ జన్మ చాలా కళ్యాణకారీ జన్మ ఎందుకంటే మీరు తండ్రికి సహాయకారులుగా అయ్యి సృష్టి పై పవిత్రత, శాంతిని స్థాపన చేస్తారు. ఈ విషయము శాంతి బహుమతులు ఇచ్చేవారికి తెలియదు. వారు ఆ బహుమతులను అమెరికా వారికో లేక మరెవ్వరికో ఇచ్చేస్తారు. తండ్రే చెప్తున్నారు - ఎవరైతే నాకు సహాయకారులుగా అవుతారో వారికి నేను బహుమతినిస్తాను. పవిత్రత ఉన్నప్పుడు సృష్టిలో శాంతి, సుఖములు కూడా ఉంటాయి. ఇది వేశ్యాలయంగా ఉంది. సత్యయుగము శివాలయము. దానిని శివబాబా స్థాపన చేశారు. సాధు-సన్యాసులు హఠయోగులు. వారు గృహస్థ ధర్మములోని వారికి సహజ రాజయోగమును నేర్పించలేరు. భలే వారు వెయ్యిసార్లు గీత, మహాభారతములను చదివినా సహజ రాజయోగమును గృహస్థులకు నేర్పించలేరు. వీరైతే అందరికీ తండ్రి. మీ బుద్ధి యోగమును నా ఒక్కరితోనే జోడించమని అన్ని ధర్మాల వారికి చెప్తున్నారు. నేను కూడా ఒక చిన్న బిందువునే. అంత పెద్దగా లేను. ఆత్మ ఎలా ఉంటుందో అలాగే పరమాత్మనైన నేను కూడా ఉన్నాను. ఆత్మ కూడా ఇక్కడ భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ అంత పెద్దగా ఉంటే ఇక్కడ ఎలా కూర్చోగలదు? నేను కూడా ఆత్మలాగే ఉన్నాను. అయితే కేవలం నేను జనన-మరణ రహితుడను, సదా పావనుడను. ఆత్మలు జనన-మరణాలలోకి వస్తాయి. పావనము నుండి పతితంగా, పతితము నుండి పావనంగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్లీ పతితులను పావనంగా చేసేందుకు తండ్రి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దీని తర్వాత సత్యయుగములో ఏ యజ్ఞాలూ ఉండవు. మళ్లీ ద్వాపరము నుండి అనేక రకాలైన యజ్ఞాలను రచిస్తూ ఉంటారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము మొత్తం కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే రచింపబడ్తుంది. ఇందులో అందరి ఆహుతి పడిపోతుంది. ఆ తర్వాత ఏ ఇతర యజ్ఞాలు రచింపబడవు. ఏవైనా ఆపదలు కలిగినప్పుడు యజ్ఞములు రచిస్తారు. వర్షాలు కురవకపోతే, ఇంకా ఏ ఇతర ఆపదలైనా వస్తే యజ్ఞాలు చేస్తారు. సత్య, త్రేతా యుగాలలో అయితే ఎలాంటి ఆపదలు రావు. ఈ సమయములో అనేక రకాలైన ఆపదలు వస్తాయి. కావున అందరికంటే పెద్ద షావుకారైన(సేఠ్) శివబాబా యజ్ఞమును రచింపజేశారు. కావున అన్నీ ఎలా ఆహుతిగా పడబోతాయో ముందే సాక్షాత్కారము చేయిస్తారు. ఏ విధంగా వినాశనము జరగనున్నదో, పాత ప్రపంచము ఏ విధంగా శ్మశానవాటికగా అవ్వనున్నదో తెలియజేస్తారు. అటువంటప్పుడు ఈ పాత ప్రపంచము పై ఇంకా మనసును పెట్టుకోవాలా? కావున పిల్లలైన మీరు ఈ అనంతమైన ప్రపంచమును సన్యసిస్తారు. ఆ సన్యాసులైతే కేవలం ఇల్లు-వాకిళ్లను సన్యసిస్తారు. మీరైతే ఇల్లు-వాకిళ్లను వదిలేయరాదు. ఇచ్చట గృహస్థ వ్యవహారాలను సంభాళన చేస్తూ కూడా వాటి పై కేవలం మమకారాన్ని వదిలేయాలి. వీరందరు ఇంతకు ముందే మరణించి ఉన్నారు. వీరి పై మనస్సు ఎందుకు పెట్టుకోవాలి? ఇది మృత(మరణించి ఉన్న) ప్రపంచము, అందుకే ఫరిస్తాన్(స్వర్గము)ను స్మృతి చేయండి, శ్మశానాన్ని ఎందుకు స్మృతి చేస్తారని అంటూ ఉంటారు.
బాబా కూడా బ్రహ్మ శరీరము ద్వారా మధ్యవర్తిగా అయ్యి మీ బుద్ధియోగమును తనతో జోడింపజేస్తారు. ఆత్మ-పరమాత్మలు చాలా కాలము వేరుగా ఉండినారు............... అని అంటారు కదా, ఈ మహిమ కూడా వారిదే. కలియుగములోని గురువులను పతిత పావనులని అనజాలరు. వారు సద్గతిని ఇవ్వజాలరు. అయితే శాస్త్రాలు వినిపిస్తారు. కర్మకాండ చేయిస్తారు. శివబాబాకు టీచరు గాని, గురువు గాని ఎవ్వరూ లేరు. మీకు స్వర్గ వారసత్వమునిచ్చేందుకు నేను వచ్చానని బాబా అంటారు. ఆ పై మీరు సూర్య వంశీయులుగా అవుతారో, చంద్ర వంశీయులుగా అవుతారో మీ పైనే ఆధారపడి ఉంది. అయితే అలా యుద్ధము ద్వారా అవుతారా? లేదు. లక్ష్మీనారాయణులు గాని, సీతారాములు గానీ యుద్ధము చేసి రాజ్యమును తీసుకోలేదు. వీరు ఈ సమయములో మాయతో యుద్ధము చేశారు. మీరు గుప్తయోధులు, అందువలన శక్తి సైన్యమైన మిమ్ములను గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు యోగబలము ద్వారా మొత్తము విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. మీరే విశ్వరాజ్య అధికారమును పోగొట్టుకున్నారు. మళ్లీ మీరే దానిని పొందుతున్నారు. మీకు ఆ బహుమతిని ఇచ్చేవారు తండ్రియే. ఇప్పుడు ఎవరైతే సహాయకారులుగా అవుతారో వారికే అర్ధకల్పము కొరకు సుఖ-శాంతుల బహుమతి లభిస్తుంది. ఎవరైతే అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రమును త్రిప్పుతారో, శాంతిధామము(స్వీట్హోమ్), మధురమైన రాజధానిని స్మృతి చేసి పవిత్రంగా అవుతారో, వారినే తండ్రికి సహాయకులు అని అంటారు. ఇది ఎంతో సహజమైనది. ఆత్మలమైన మనము కూడా నక్షత్రము వంటివారము. మన తండ్రి అయిన పరమాత్మ కూడా నక్షత్రము వంటివారే. వారు అంత పెద్దగా ఏమీ ఉండరు. కాని నక్షత్ర రూపాన్ని పూజించలేని కారణంగా వారిని పూజించేందుకు అంత పెద్దగా తయారుచేశారు. పూజ అయితే మొదట తండ్రికే జరుగుతుంది. ఆ తర్వాత ఇతరులకు జరుగుతుంది. లక్ష్మీనారాయణులకు ఎంతో పూజ జరుగుతుంది కాని వారిని ఆ విధంగా తయారు చేసిందెవరు? సర్వుల సద్గతిదాత తండ్రియే. బలిహారమంతా ఆ ఒక్కరిదే కదా. వారి జయంతి(జన్మ) వజ్ర తుల్యమైనది. మిగిలిన వారందరిది గవ్వ తుల్యమైనది. ఓం నమ: శివాయ - ఇది వారి యజ్ఞము. దానిని బ్రాహ్మణులైన మీ ద్వారా రచింపజేశారు. ఎవరైతే శాంతి, పవిత్రతలను స్థాపన చేయడంలో నాకు సహాయము చేస్తారో, వారికి ఇంతటి(లక్ష్మినారాయణులుగా అయ్యే) ఫలమునిస్తానని వారంటారు. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచింపజేశారు కనుక దక్షిణ ఇస్తారు కదా. ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించారు. ఏ ఇతర యజ్ఞమూ ఇంత కాలము కొనసాగదు. ఎవరు ఎంతగా నాకు సహాయము చేస్తారో, వారికి అంత పెద్ద బహుమతినిస్తానని అంటారు. అందరికీ బహుమతినిచ్చేది నేనే. నేను మీ వద్ద ఏమీ తీసుకోను. నేనే మీకు అన్నీ ఇస్తాను. ఇప్పుడు ఎవరు చేస్తారో, వారే పొందుతారు. కొద్దిగా చేస్తే, ప్రజలలోకి వెళ్లిపోతారు. గాంధీజీకి కూడా ఎవరు సహాయము చేశారో, వారు ప్రెసిడెంటు(దేశ అధ్యక్షలు)గా, మంత్రులు మొదలైనవారిగా అయ్యారు కదా. ఇదైతే అల్పకాలిక సుఖము. తండ్రి అయితే మీకు మొత్తము ఆదిమధ్యాంతాల జ్ఞానమునిచ్చి తమ సమానం త్రికాలదర్శులుగా చేస్తారు. నా జీవిత చరిత్రను తెలుసుకున్నందున మీరు సర్వమూ తెలుసుకుంటారు. సన్యాసులు ఈ జ్ఞానమునివ్వలేరు. వారి ద్వారా వారసత్వమేం లభిస్తుంది? వారు తమ పీఠాన్ని కూడా ఒక్కరికే ఇవ్వగలరు. మిగిలిన వారికి ఏమి లభిస్తుంది? బాబా అయితే మీ అందరికీ సింహాసనమిస్తారు, ఎంతో నిష్కామ సేవను చేస్తారు. కాని మీరైతే నన్ను రాయి-రప్పలలో పడేసి ఎంతో గ్లాని చేశారు. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది. ఎప్పుడైతే గవ్వ సమానంగా అవుతారో అప్పుడు మిమ్ములను వజ్ర తుల్యంగా తయారు చేస్తాను. నేనైతే లెక్కలేనన్ని సార్లు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశాను. మళ్లీ మాయ నరకంగా తయారుచేసింది. ఇప్పుడు మళ్లీ ప్రాప్తిని పొందాలంటే తండ్రికి సహాయకారులుగా అయ్యి సత్యమైన బహుమతిని తీసుకోండి. ఇందులో మొట్టమొదటిది(ముఖ్యమైనది) పవిత్రత.
బాబా సన్యాసులను కూడా మహిమ చేస్తారు - వారు పవిత్రంగా ఉంటారు కాబట్టి వారు కూడా మంచివారే. వారు కూడా భారతదేశాన్ని పూర్తిగా దిగజారకుండా నిలబెడ్తారు లేకపోతే ఏమైపోయేదో తెలియదు. కాని ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేయాలి. అందువలన తప్పకుండా గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. 'బాప్దాదా' ఇరువురూ పిల్లలకు అర్థము చేయిస్తారు. శివబాబా కూడా ఈ పాత చెప్పు(శరీరము) ద్వారా పిల్లలకు సలహానిస్తారు. కొత్త శరీరాన్ని తీసుకోలేరు. తల్లి గర్భములో ప్రవేశించరు. పతిత ప్రపంచములో, పతిత శరీరములోకే వస్తారు. ఈ కలియుగంలో గాఢాంధకారముంది. ఈ గాఢాంధకారమునే దివ్యమైన వెలుగుగా మార్చాలి.
మధురాతి మధురమైన జ్ఞాన లక్కీ సితారాలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ అనంతమైన ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా సన్యసించి మీ మమకారాన్ని తొలగించి వేయాలి. దీని పై మనస్సునుంచరాదు.
2. తండ్రికి సహాయకారులై బహుమతిని తీసుకునేందుకు - 1. అశరీరులుగా అవ్వాలి 2. పవిత్రంగా ఉండాలి. 3. స్వదర్శన చక్రమును తిప్పాలి 4. మధురమైన ఇంటిని, మధురమైన రాజధానిని స్మృతి చేయాలి.
వరదానము :-
''జీవితంలో దివ్యగుణాలనే పుష్పాల పూతోట ద్వారా ప్రసన్నతను అనుభవం చేసే ఎవర్ హ్యాపీ భవ (సదా సంతోషీ ఆత్మా భవ)''
సదా ప్రసన్నత అనగా భర్పూర్ లేక సంపన్నత. ఇంతకుముందు జీవితము ముళ్ల అడవిలో ఉండేది, ఇప్పుడు పుష్పాల తోటలోకి వచ్చేసింది. సదా జీవితము దివ్యగుణాలనే పుష్పాల పూతోటగా అనిపిస్తోంది. అందువలన మీ సంపర్కములోకి ఎవరు వచ్చినా వారికి దివ్యగుణాలనే పుష్పాల సుగంధము వస్తూ ఉంటుంది అంతేకాక ప్రసన్నతను చూచి సంతోషిస్తారు, శక్తిని అనుభవం చేస్తారు. ప్రసన్నత ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది, సంతోషములోకి తెస్తుంది. అందువలన మీరు, మేము సదా సంతోషంగా ఉన్నామని అంటారు.
స్లోగన్ :-
''ఎవరైతే మాయ అనే బుడగలతో భయపడేందుకు బదులు వాటితో ఆడుకుంటారో, వారే మాస్టర్ సర్వశక్తివంతులు''