23-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - అప్రమత్తులుగా ఉండి చదువు పై పూర్తి గమనమివ్వండి. శివబాబాతోనే మాకు డైరెక్ట్ సంబంధముందని అనడము కూడా దేహాభిమానమే''
ప్రశ్న :-
భారతదేశము అవినాశి తీర్థ స్థానము - ఎలా ?
జవాబు :-
భారతదేశము తండ్రి జన్మ స్థానమైనందున ఇది అవినాశి ఖండము. ఈ అవినాశి ఖండములో సత్య, త్రేతా యుగాలలో చైతన్య దేవీ దేవతలు రాజ్యము చేశారు. ఆ సమయములో భారతదేశాన్ని శివాలయమని అంటారు. మళ్లీ భక్తిమార్గములో జడమూర్తుల ప్రతిమలను తయారు చేసి పూజిస్తారు. శివాలయాలు కూడా చాలా తయారు చేస్తారు. కనుక ఆ సమయములో కూడా తీర్థస్థానమే అవుతుంది. అందువలన భారతదేశాన్ని అవినాశి తీర్థస్థానమని అనవచ్చు.
పాట :-
ఓ రాత్రి ప్రయాణీకుడా! అలసిపోకు.......... ( ఓ రాత్ కే రాహీ! థక్ మత్ జానా,.........) 
ఓంశాంతి.
ఓ రాత్రి ప్రయాణీకుడా! అలసిపోకు అని ఎవరు గమనమిప్పిస్తున్నారు? ఇది శివబాబాయే చెప్తున్నారు. మాకు శివబాబా ఉన్నారు. మాకు వారితోనే సంబంధము అని కొంతమంది పిల్లలు అంటారు. కాని వారు(శివబాబా) కూడా బ్రహ్మముఖ కమలము ద్వారానే వినిపిస్తారు కదా. శివబాబాయే మాకు నేరుగా ప్రేరణ ఇస్తారు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కాని ఇలా భావించడం తప్పు. శివబాబా శిక్షణ ఇచ్చేది బ్రహ్మ ద్వారానే కదా. వారే పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు - పిల్లలారా అలసిపోకండి. భలే మీకు శివబాబాతో సంబంధముంది. శివబాబా కూడా మన్మనాభవ అని అంటారు. బ్రహ్మ కూడా మన్మనాభవ అని అంటారు. బ్రహ్మకుమార-కుమారీలు కూడా మన్మనాభవ అని అంటారు. కాని అలా అప్రమత్తము చేసేందుకు నోరు అవసరము కదా. కొంతమంది పిల్లలు మాకు సంబంధము శివబాబాతోనే అని భావిస్తారు. కాని ఆదేశాలను బ్రహ్మ ద్వారానే ఇస్తారు కదా. ఒకవేళ ఆదేశాలు మొదలైనవి నేరుగా లభిస్తూ ఉంటే వారు ఇక్కడకు రావలసిన అవసరమేముంది? శివబాబా బ్రహ్మబాబా ద్వారా చెప్తున్నపుడు మరి నా ద్వారా కూడా చెప్పవచ్చు కదా అని భావించే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. కాని బ్రహ్మ లేకుండా సంబంధమే ఏర్పడజాలదు. ఇలా చెప్తారని కొంతమంది పిల్లలు బ్రహ్మతో, బ్రహ్మకుమార - కుమారీల పై అలిగిపోతారు. యోగమైతే శివబాబాతోనే జోడించాలి. తండ్రి పిల్లలకు శిక్షణ మరియు గమనమిప్పించేందుకు మాట్లాడవలసి కూడా పడ్తుంది. మీరు సమయానికి క్లాసుకు రారని ఎవరు చెప్తారు? శివబాబా మరియు బ్రహ్మదాదా ఇరువురూ చెప్తారు. ఇరువురికి శరీరము ఒక్కటే. కనుక అప్రమత్తులై చదువు పై పూర్తి గమనముంచండి అని ఇరువురు చెప్తారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రి చదివిస్తున్నారు. మొట్టమొదట శివబాబానే మహిమ చేయాలి. వారి మహిమ చాలా గొప్పది. వారిది అనంతమైన మహిమ. వారి మహిమలో చాలా మంచి మంచి పదాలున్నాయి. కానీ పిల్లలు అప్పుడప్పుడు మర్చిపోతారు. విచార సాగర మథనము చేసి శివబాబా పూర్తి మహిమ వ్రాయాలి.
క్రొత్త మానవుడు(న్యూమ్యాన్) అని ఎవరిని అనాలి? వాస్తవానికి కృష్ణుడు హెవెన్లీ న్యూమ్యాన్. కాని ఈ సమయములో బ్రాహ్మణుల పిలక మహిమ చేయబడింది. పిల్లలను రచించినప్పుడు వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లక్ష్మినారాయణులను కొత్త మానవులు అని అన్నట్లయితే వారికి శిక్షణను ఇచ్చే అవసరమే లేదు. కావున ఇప్పుడు క్రొత్త మానవుడు ఎవరు? ఇవి బాగా అర్థము చేసుకొని, అర్థము చేయించవలసిన విషయాలు. ఆ తండ్రి సర్వశక్తివంతుడు. వరల్డ్ ఆల్మైటి. ఈ వరల్డ్ ఆల్మైటి అనే పదము బాబా మహిమలో వ్రాయడము మర్చిపోతారు. భారతదేశము కూడా అవినాశి తీర్థ స్థానమని మహిమ చేయబడ్తుంది. అది ఎలా? తీర్థ స్థానాలు భక్తిమార్గములో ఉంటాయి. కాని ఇది అవినాశి తీర్థ స్థానమని ఎలా అనగలరు? అది ఎలా అవినాశి తీర్థ స్థానమయింది? సత్యయుగములో మనము దీనిని తీర్థ స్థానమని అనవచ్చా? ఒకవేళ మనము దీనిని అవినాశి తీర్థమని వ్రాసినట్లయితే ఎలా? అని వివరించి చెప్పాలి. అవును, సత్య-త్రేతా యుగాలలో కూడా ఇది తీర్థ స్థానమే, ద్వాపర కలియుగాలలో కూడా తీర్థస్థానమే. అవినాశి అని అన్నప్పుడు నాలుగు యుగాలలో నిరూపించి చెప్పవలసి పడ్తుంది. తీర్థస్థానాలు మొదలైనవి ద్వాపర యుగము నుండి ఉంటాయి. మరి భారతదేశము అవినాశి తీర్థ స్థానమని వ్రాయవచ్చా? సత్య, త్రేతా యుగాలలో కూడా తీర్థ స్థానమే. ఎందుకంటే అక్కడ చైతన్య దేవీ దేవతలు ఉంటారు. ఇక్కడ ఇవి జడమైన తీర్థ స్థానాలు. అది చైతన్య సత్య-సత్యమైన తీర్థ స్థానము, అప్పుడది శివాలయము. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థము చేయిస్తున్నారు. భారతదేశము అవినాశి ఖండము. మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. ఈ విషయాలను గురించి మానవులెవ్వరికీ తెలియదు. పతితపావనులైన తండ్రి ఇక్కడే వస్తారు. ఎవరినైతే పావన దేవీ దేవతలుగా తయారు చేస్తారో, వారే మళ్లీ ఈ శివాలయములో ఉంటారు. ఇక్కడ బద్రీనాథ్, అమర్నాథ్ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ భారతదేశమంతా తీర్థ స్థానమే. అలాగని అక్కడ శివబాబా ఉంటారని కాదు. శివబాబా అయితే ఇప్పుడున్నారు. పూర్తి మహిమ అంతా ఇప్పటిదే. ఇది శివాబాబా జన్మ స్థానము. బ్రహ్మకు కూడా జన్మ స్థానము ఇదే. శంకరుని జన్మ స్థానమని అనరు. అతనికి అక్కడకు రావలసిన అవసరమే లేదు. అతడు వినాశార్థము నిమిత్తంగా సృష్ట్టింపబడ్డాడు. రెండు రూపాల్లో విష్ణువు రాజ్యము చేస్తాడు. పాలన చేస్తాడు. విష్ణువు రెండు రూపాలను యుగల్ రూపంగా చూపించారు. ఇది అతడి విగ్రహము(ప్రతిమ). అతడు సత్యయుగములో వస్తాడు. కనుక మనము ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేయాల్సి ఉంటుంది. వారు రక్షించేవారు కూడా. వారైతే ధర్మస్థాపకులను కూడా రక్షించేవారని అంటారు. ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలైనవారిని కూడా రక్షకులని అనేస్తారు. వారు శాంతిని స్థాపన చేసేందుకు వచ్చారని భావిస్తారు. కాని వారెవ్వరూ శాంతిని స్థాపన చేయలేరు. ఎవ్వరినీ దు:ఖము నుండి విడిపించలేరు. వారు ధర్మస్థాపన చేస్తారు. వారి వెనుక వారి ధర్మము వారు వస్తారు. కావున ఈ సేవియర్(రక్షించువారు) అనే పదము బాగుంది. ఇది కూడా తప్పకుండా ముద్రించాలి. ఈ చిత్రాలు విదేశాలలో ప్రత్యక్షమైనప్పుడు అన్ని భాషలలోనూ వెలువడ్తాయి. వారు పోపు మొదలైనవారిని ఎంత మహిమ చేస్తారు. ప్రెసిడెంటు మొదలైనవారు మరణిస్తే వారిని ఎంతగా మహిమ చేస్తారు! ఏ వ్యక్తి ఎంత గొప్పగా ఉంటారో, వారి మహిమ అంత గొప్పగా ఉంటుంది. కాని ఈ సమయంలో అందరూ ఒకే విధంగా తయారైపోయారు. భగవంతుని సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ విధంగా ఆత్మలందరూ మేము కూడా తండ్రులమే అంటూ తమ తండ్రిని తిట్తున్నారు. మేము కూడా తండ్రులమే అని లౌకిక పిల్లలు కూడా అనరు. వారు వారి రచనను రచించినప్పుడు వారికి తండ్రిగా అవుతారు. అది జరగవచ్చు. కాని ఇక్కడ ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. మనము వారికి తండ్రిగా అవ్వనే అవ్వలేము. వారిని కుమారుడా అని పిలవలేము. శివ బాలకుని వారసునిగా చేసుకుంటామని జ్ఞానములో రమణీకతతో అంటారు. ఈ మాటలను అర్థము చేసుకునేవారు అర్థము చేసుకుంటారు. శివ బాలకుని వారసునిగా చేసుకొని వారి పై బలిహారమవుతారు. శివబాబా పై పిల్లలు బలిహారమవుతారు. ఈ విధంగా బదిలీ జరుగుతుంది. వారసత్వము ఇవ్వడంలో ఎంతటి మహత్వముంది. తండ్రి చెప్తున్నారు - దేహ సహితంగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి నన్ను వారసునిగా చేయండి. కాని దేహాభిమానము వదలడము కష్టము. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే దేహాభిమానము వదులుతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం చాలా శ్రమతో కూడినది. మనము అవినాశి ఆత్మలము కాని మనము స్వయాన్ని శరీరమని భావిస్తూ కూర్చున్నాము. ఇప్పుడు మళ్లీ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇందులో శ్రమ ఉంది. అన్నిటికంటే పెద్ద జబ్బు దేహాభిమానమే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎవరైతే స్మృతి చెయ్యరో, వారి వికర్మలు వినాశనమవ్వవు.
తండ్రి అర్థము చేయిస్తున్నారు - బాగా చదువుకొని, వ్రాసుకుంటే నవాబులుగా అవుతారు. శ్రీమతమును అనుసరించాలి. లేదంటే శ్రీ శ్రీ హృదయ సింహాసనము పై అధిరోహించడం కూడా అసంభవము. హృదయాన్ని అధిరోహించిన వారే సింహాసనము పై కూర్చోగలరు. చాలా దయాహృదయులుగా అవ్వాలి. మానవులు చాలా దు:ఖితులుగా ఉన్నారు. చూచేందుకు చాలా ధనవంతులుగా ఉంటారు. పోపును చూడండి, ఎంత గౌరవమిస్తారో! తండ్రి చెప్తున్నారు - నేను ఎంత నిరహంకారిని. నా స్వాగతానికి ఇంత ఖర్చు చేయకండి అని వారు అనరు. బాబా ఎక్కడకు వెళ్లినా మొదటే ఇలా ఉత్తరము వ్రాస్తారు - ఏ విధమైన హంగామా చేయకండి, స్టేషన్ వద్దకు కూడా అందరూ రాకండి. ఎందుకంటే నేను గుప్తంగా ఉన్నాను. ఇది కూడా చేసే అవసరము లేదు. వీరు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. మిగిలిన వారిని గూర్చి అందరికీ తెలుసు. శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. అలా గుప్తంగా ఉండడము మంచిది. ఎంత నిరహంకారిగా ఉంటే అంత మంచిది. మౌనంగా ఉండడమే మీ జ్ఞానము. కూర్చుని తండ్రిని మహిమ చేయాలి. తండ్రి పతిత పావనులు, సర్వశక్తివంతులు అని తండ్రి ద్వారానే అర్థము చేసుకుంటారు. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఇలా పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అనజాలరు. శివబాబా ద్వారా మాకు నూతన ప్రపంచ వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీరు అంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ దేవతల సమానంగా మనము తయారవుతూ ఉన్నాము. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు వారసత్వము నిస్తున్నారు. అందుకే శివబాబాను మహిమ చేస్తారు. మన ఉద్దేశ్యము ఎంత స్పష్టంగా ఉంది! ఇచ్చేవారు వారే(శివబాబా). వారే బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నారు. చిత్రాలతో అర్థము చేయించాలి. శివుని చిత్రాలు కూడా ఎన్నో తయారుచేశారు. తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా తయారుచేసి అందరినీ ముక్తి - జీవన్ముక్తిలోనికి తీసుకెళ్తారు. చిత్రాల్లో కూడా స్పష్టంగా ఉంది. అందుకే బాబా అంటున్నారు - ఇవి మీరు అందరికీ ఇస్తే అక్కడకు తీసుకెళ్ళి చదువుతారు. ఇక్కడ నుండి ఈ వస్తువులను తీసుకెళ్తారు. అక్కడకు వెళ్ళి వాటిని అలంకరించవచ్చు. ఇది చాలా మంచి వస్తువు. పరదా గుడ్డల పై ముద్రిస్తే చాలా బాగా ఉపయోగపడ్తాయి. ఈ చిత్రాలలో కూడా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. సేవియర్(రక్షకుడు) అనే పదము కూడా తప్పనిసరి. ఇతరులెవ్వరూ రక్షకులు కాని, పతితపావనులు గాని అవ్వలేరు. కేవలం పావనాత్మలు వస్తారు. కాని వారేమైనా అందరినీ పావనంగా తయారుచేస్తారా? వారి ధర్మాల వారు క్రిందకు వచ్చి పాత్రాభినయము చేయాల్సిందే. ఈ పాయింట్లు మహావాక్యాలు. వీటిని వివేకవంతులైన పిల్లలు మాత్రమే ధారణ చేస్తారు.
శ్రీమతమును పూర్తిగా అనుసరించకపోతే చదవరు. కనుక ఫెయిలైపోతారు. స్కూలులో వీరి నడవడిక ఎలా ఉంది అని మ్యానర్స్ కూడా గమనిస్తారు. దేహాభిమానము ద్వారా అన్ని వికారాలు వచ్చేస్తాయి. తర్వాత ధారణ ఏమీ జరగదు. ఆజ్ఞాకారీ పిల్లలనే తండ్రి కూడా ప్రేమిస్తారు. పురుషార్థము చాలా చేయాలి. ఎవరికైనా అర్థము చేయించునప్పుడు మొదట తండ్రిని మహిమ చేయాలి. తండ్రి నుండి వారసత్వము ఎలా లభిస్తుందో చెప్పాలి. తండ్రి మహిమను పూర్తిగా వ్రాయాలి. చిత్రాలను మార్చలేరు. శిక్షణనైతే పూర్తిగా వ్రాయాల్సి పడ్తుంది. తండ్రి మహిమ వేరు. తండ్రి ద్వారానే కృష్ణునికి వారసత్వము లభించింది. కనుక కృష్ణుని మహిమ వేరు. తండ్రిని గురించి తెలియని కారణంగా భారతదేశము గొప్ప తీర్థ స్థానమని అర్థము చేసుకోలేరు. భారతదేశము అవినాశి తీర్థ స్థానమని ఋజువు చేసి చెప్పాలి. పిల్లలైన మీరు కూర్చుని ఇలా అర్థము చేయించండి. అది విని మనుష్యులు ఆశ్చర్యచకితులవుతారు. భారతదేశము వజ్ర సమానంగా ఉండేది. మళ్లీ భారతదేశాన్ని గవ్వ సమానంగా ఎవరు చేశారు? దీనిని బాగా అర్థము చేయించేందుకు విచార సాగర మథనము చేయవలసిన అవసరము ఎంతో ఉంది. ఇందులో దీనిని సరి చేయాల్సి ఉంది అని చిత్రాలను చూసి బాబా వెంటనే తెలుపుతారు. పిల్లలు అలా చెప్పరు. బాబా సరిదిద్దాలని ఇష్టపడతారు. ఒక ఇంజనీరు ఉండేవాడు. అతడి మిషను పాడైపోయింది. ఎక్కడ రిపేరి చేయాలో అతనికి అర్థము కాలేదు. మరొక అసిస్టెంట్ ఇంజనీరు (అతని కంటే తక్కువ హోదాలో ఉండేవారు) ఈ మిషనులో ఇది సరిచేసినట్లయితే మిషను పనిచేస్తుంది అని చెప్పాడు. అలాగే చేశాడు తర్వాత నిజంగానే మిషను బాగైపోయింది. అతడు చాలా సంతోషించి అతనికిి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పాడు. అతని నెల జీతాన్ని పెంచారు. మీరు కూడా కరెక్టు చేయండి, నేను శభాష్, శభాష్ అని అభినందిస్తాను. జగదీష్(సంజయ్) ఉన్నాడు, మంచి మంచి పాయింట్లు తీస్తాడు. బాబా చాలా సంతోషిస్తారు. పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. ఈ ప్రదర్శిని, మేళాలు మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడ చిత్రప్రదర్శన కూడా ఉంచండి. ఇక్కడ బుద్ధి తలుపులు తెరవాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పాఠశాలలో నెంబరువారుగా చదివేవారు ఉండనే ఉంటారు. చదువుకోలేదంటే వారి మ్యానర్స్ (గుణగణాలు, నడవడికలు) చెడిపోతాయి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవరి పైనా అలిగి చదువును వదిలేయరాదు. దేహాభిమానాన్ని వదిలి స్వయం పై దయ చూపుకోవాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి.
2. మంచి గుణగణాలను(మ్యానర్స్/నడవడికలను) ధారణ చేయాలి. అందరికీ సుఖాన్నివ్వాలి. ఆజ్ఞాకారులుగా ఉండాలి.
వరదానము :-
'' ఆజ్ఞాకారులుగా అయ్యి తండ్రి సహాయాన్ని, ఆశీర్వాదాలను అనుభవం చేసే సఫలతామూర్త్ భవ ''
తండ్రి ఆజ్ఞ - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఒక్క తండ్రియే ప్రపంచము అందువలన హృదయంలో ఒక్క తండ్రి తప్ప ఇతరమేదీ ఇమిడి ఉండరాదు. ''ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకము''........ ఎక్కడైతే ఒక్కరే ఉంటారో, అక్కడ ప్రతి కార్యములో సఫలత ఉంటుంది. అటువంటి వారికి ఎలాటి పరిస్థితినైనా దాటుకోవడం సులభమవుతుంది. ఆజ్ఞను పాలించే పిల్లలకు తండ్రి ఆశీర్వాదాలు లభిస్తాయి. అందువలన కష్టము కూడా సులభమైపోతుంది.
స్లోగన్ :-
''నూతన బ్రాహ్మణ జీవితము స్మృతిలో ఉంటే ఏ పాత సంస్కారము ఉత్పన్నమవ్వజాలదు ''