27-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ధైర్యము వహించండి, ఇప్పుడు మీరు దు:ఖపడే రోజులు సమాప్తమై, సుఖపడే రోజులు వస్తున్నాయి. నిశ్చయబుద్ధి గల పిల్లల స్థితి ధైర్యవంతంగా, గంభీరంగా ఉంటుంది ''

ప్రశ్న :-

ఏ పరిస్థితిలోనూ బెంగపడి ఉదాసీనులుగా అవ్వకుండా ఉండేందుకు సహజ విధానమేది ?

జవాబు :-

బ్రహ్మాబాబా జీవితాన్ని సదా స్యాంపుల్‌(ఉదాహరణము)గా ముందుంచుకోండి. వారు ఎంతమంది పిల్లలకు తండ్రి! అందులో కొందరు సుపుత్రులు, మరికొందరు కుపుత్రులు. కొందరు సేవ చేస్తారు, కొందరు డిస్‌సర్వీస్‌ చేస్తారు. అయినా బాబా ఎప్పుడూ బెంగపడరు(వ్యాకులపడరు), ఉదాసీనంగా ఉండరు, గాభరా చెందరు. పిల్లలైన మీకు బెంగ ఎందుకు? మీరెట్టి పరిస్థితిలోనూ ఉదాసీనంగా ఉండరాదు, బెంగపడరాదు.

పాట :-

దైర్యము వహించు మనసా!............... ( ధీరజ్‌ ధర్‌ మనువా!...............)   

ఓంశాంతి.

ధైర్యము వహించు మనసా! అని మనుష్యుల దేహానికి చెప్పరు. మనస్సు, బుద్ధి ఉండేది ఆత్మలో కావున ఈ మాటలు ఆత్మనే చెప్పడం జరుగుతుంది. ఆత్మకు పరమపిత పరమాత్మ తప్ప ధైర్యము వహించమని, ఓపిక పట్టమని చెప్పగలిగేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అధైర్యపడిన వారికే ధైర్యము ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే వారిని ధైర్యము లేనివారని అంటామా? అలా పరమాత్మను గురించి ఎప్పుడూ అనము కదా! మనుష్యులందరూ ఇప్పుడు అధైర్యంగా, దు:ఖితులుగా ఉన్నారు. అందుకే ధైర్యమునిచ్చేందుకు, సుఖమునిచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు చెప్తున్నారు - '' ఇప్పుడు ధైర్యము వహించండి.'' తండ్రి మహావాక్యాలు కేవలం మీ కొరకే కాదు. వాస్తవానికి పూర్తి ప్రపంచము కొరకు ఉద్ధేశించినవి. ప్రపంచమంతా మెల్ల మెల్లగా వింటూ వస్తుంది. ఎవరైతే వింటారో, అర్థము చేసుకుంటారో వారు వస్తూ ఉంటారు. సర్వుల సద్గతిదాత, దు:ఖహర్త ఒక్క తండ్రి మాత్రమే. ఇది దు:ఖ ప్రపంచము. ఇప్పుడు మనము ముక్తి-జీవన్ముక్తులను పొందే సమయమని లేక ఈ కలియుగ పతిత ప్రపంచము నుండి విడుదల పొందే సమయమని పిల్లలకు తెలుసు. ఇది కూడా నెంబరువారు పురుషార్థాను సారము మీ బుద్ధిలో ఉంది. అయితే మనమిప్పుడు ఈ దు:ఖ ప్రపంచము నుండి విడుదలై మన సుఖధామానికి వెళ్తామనే ధైర్యము అందరికీ లేదు. పిల్లలైన మీకు కూడా స్థిరమైన నిశ్చయము ఉండాలి. శ్రీమతమునను అనుసరిస్తూ ఉంటే ఇప్పుడు మనకు సుఖపడే రోజులు రానున్నాయి,......... ఇందులో ఆశీర్వాదాల మాట గాని, కృప చూపించే మాట గాని లేదు. తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. సహజ స్వరాజ్య యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ చదువును జ్ఞానమని కూడా అంటారు. పిల్లలైన మీకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు. మొట్టమొదట ఈ నిశ్చయము స్థిరముగా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడూ ఈ నిశ్చయము హెచ్చు తగ్గులై సడలిపోజాలదు. పరబ్రహ్మములో ఉన్న వారిని గురించిన చింత ఉండేది. వారినే పొందుకున్న తర్వాత ఇంకేం కావాలి! అని పాడ్తారు. ఆ తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందని నిశ్చయముంది. ఇంకేం కావాలి. కావున మొట్టమొదటే ధైర్యము లభిస్తుంది. ఇది అవినాశి ధైర్యము. మనము శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠాతి శ్రేష్ఠాచారీ రాజ్యభాగ్యాన్ని ఎటువంటి యుద్ధము లేకుండా స్థాపన చేస్తున్నామని నిశ్చయముంది. కావున ఇక బెంగపడే అవసరమేముంది? భలే ఇంట్లో 10-12 మంది పిల్లలుండవచ్చు. అయినా బెంగపడే అవసరమే లేదు. బాబాను చూడండి - వేలాది, లక్షలాది మంది పిల్లలున్నారు. చాలా మంది పిల్లలు హంగామా(గలాటా) చేస్తూ ఉంటారు. కొంతమంది మంచి పుత్రులున్నారు, కొంతమంది కుపుత్రులున్నారు, కొంతమంది సర్వీసు చేస్తారు, కొంతమంది డిస్‌సర్వీసు కూడా చేస్తారు. అయినా తండ్రి ఎప్పుడైనా కంగారు పడ్తారా? కావున పిల్లలు కూడా గాభరాపడరాదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. ఒకవైపు హఠయోగపు కర్మ సన్యాసులున్నారు. మీది బేహద్‌(అనంతమైన) సన్యాసము. ఇది రాజయోగము. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ తండ్రి నుండి వారసత్వము పొందాలి. చాలా సులభము. ఇప్పుడు మీకు మీ సుఖధామపు వృక్షము కనిపిస్తూ ఉంది. పరోక్షంగా, అపరోక్షంగా బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. సాక్షాత్కారమవ్వనీ, కాకపోనీ. భవిష్య స్వ రాజధాని కొరకు పురుషార్థము చేస్తున్నారు. లక్ష్యము, గమ్యము మీ ముందుంది కదా! లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూస్తున్నారు కదా! మాకు సాక్షాత్కారమైతే నమ్ముతామని అనుకోరాదు. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకోవలసిన విషయము. ఈ కనులతో చిత్రాలు చూస్తున్నారు కదా! ఇదే కనుల ద్వారా మళ్ళీ వాస్తవిక రూపాలనే చూస్తారు. ఇది రాజయోగము కదా! చిత్రాలున్నాయి కదా. మరలా సాక్షాత్కారమెందుకు? బుద్ధి కూడా చెప్తుంది. శ్రీ కృష్ణుడు సత్యయుగానికి యజమాని కదా! శివుడు పరంధామములో ఉంటారు. మీరు లక్ష్మీనారాయణులుగా అవ్వగలరు. ఇది మీ లక్ష్యము. కావున ఆ దైవీ గుణాలు మాలో ఎంతవరకు వచ్చాయని దర్పణములో చూసుకోండి. తండ్రి ధైర్యమునైతే చాలా మంచిగా ఇస్తారు.

ఇప్పుడు చదువుకోవాలి. రాజ్యాధికారము కొరకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము తండ్రి ఇస్తున్నారు. ''మేము చాలా పెద్ద ఆఫీసర్లమౌతాము'' అని ఐ.సి.యస్‌ పాసైన వారికి అందరికంటే ఎక్కువ నషా(నశా) ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాదులలో కూడా కోటీశ్వర్లుగా అవుతారు. బాబా మీకు సట్టా-మట్టా వ్యాపారము(సాహసముతో కూడిన ఊహాత్మక వ్యాపారము) నేర్పిస్తున్నారు. మీరు తండ్రికి గవ్వలిస్తారు. దానికి బదులుగా బాబా మీకు 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది వ్యాపారమే కాదు. చదువు కూడా. కేవలం వ్యాపారము చేస్తే సరిపోదు. ప్రపంచ భూగోళము-చరిత్రల జ్ఞానము కూడా కావాలి కదా! స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గములో రాజులే కాకుండా నౌకర్లు - చాకర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా అందరూ ''మా భారతదేశము'' అంటారు కదా! అయితే రాజులకు, ప్రజలకు చాలా బేధముంటుంది. తండ్రి చెప్తున్నారు - ఎంత వీలైతే అంత ఉన్నతోన్నతమైన పురుషార్థము చేసి అత్యంత ఉన్నత పదవిని పొందండి. మాతా-పితల సమానంగా పురుషార్థము చేయండి. అందరూ సింహాసనము పై కూర్చోరు. అయినా రేసు తీయించవలసి వస్తుంది. నంబరువారుగా పురుషార్థము అనుసారమే రాజ్యపదవిని పొందుతారు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో దానిని సాక్షిగా అయ్యి చూస్తారు. ఎవరి పురుషార్థమైనా చల్లగా ఉండటం గమనిస్తే దానిని తీవ్రంగా చేయడం జరుగుతుంది. చాలా నెమ్మదిగా కనిపిస్తున్నది, మాకింకా మమకారముంది. ట్రస్టీగా తయారుచేశారు. ఇంకా మమకారమెందుకు? మీరు శ్రీమతమును అనుసరించండి. '' బాబా ఇల్లు కట్టుకుందునా? '' అని పిల్లలు అడుగుతారు. అప్పుడు బాబా ఎందుకు కట్టరాదు, భలే సుఖంగా కూర్చోండి. ఈ పాత ప్రపంచములో ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. భలే విశ్రాంతిని తీసుకోండి, పిల్లల వివాహాలు కూడా భలే చేయండి. బాబా మీ నుండి ఏమీ ధనమునేమీ తీసుకోరు. వారు దాత. పిల్లలు ఉండేందుకే బాబా ఈ సమయములో ఈ భవనాలను తయారు చేయించారు. తను ఉండడానికేమో ఈ శరీరాన్ని నిమిత్తంగా చేసుకున్నారు. జీవాత్మలు ఉండేందుకేమో తప్పకుండా ఇల్లు కావాలి కదా! కావున పిల్లలైన మీ కొరకు కట్టిస్తున్నారు. బాబా కూడా ఈ ఇంట్లో కూర్చొని ఉన్నారు కదా! వారు ఆత్మల తండ్రి అని, వీరు శారీరిక తండ్రి అని మీకు తెలుసు. మిమ్ములను దత్తత తీసుకున్నారు. మీరు నా పిల్లలు. మమ్మా-బాబా అని అంటారు కదా! దీనికి ఒడిలోకి తీసుకోవడము లేక దత్తత అని అంటారు. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది పిల్లలున్నారంటే తప్పకుండా దత్తు చేసుకోబడిన పిల్లలే అయ్యి ఉంటారు. పిల్లలైన మిమ్ములను దత్తత తీసుకున్నారు. సరస్వతి కూడా కూతురే కదా! ఇవి చాలా అర్థము చేసుకోవలసిన రహస్యమైన విషయాలు. గీత, భాగవతము మొదలైనవాటిని మీరు కూడా చదివారు. ఈ బాబా కూడా చదివారు. కాని ఇప్పుడు డ్రామానుసారము శ్రీమతము లభిస్తుంది. ఏమి చెప్పినా డ్రామానుసారముగానే చెప్తారు. అందులో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. నష్టము జరగవచ్చును, కాని అందులో కూడా కళ్యాణముంది. ప్రతి విషయములోనూ కళ్యాణముంది. శివబాబా కళ్యాణకారి. వారి మతము చాలా మంచిది. ఒకవేళ వారి పై సందేహముండి, శ్రీమతము అనుసరించక తమ మతమునే అనుసరిస్తే వారు మోసపోతారు. ''బాబా ఏమి చేయాలి?'' అని అడుగడుగులో సలహా అడగాలి. సుప్రీమ్‌ మార్గదర్శకులు కూర్చొని ఉన్నారు కదా! యోగము చేయనందున, యోగములో లేనందున చాలా మంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారు. యోగము(లేక) స్మృతినే యాత్ర అని అంటారు. స్మృతి చేయకుంటే మనము విశ్రాంతి తీసుకుంటున్నాము లేక నిదురపోతున్నాము అని తెలుసుకోండి. యాత్రలు చేయునప్పుడు ఎవరైనా రెస్ట్‌ తీసుకుంటారా? మీరు కూడా రెస్ట్‌ తీసుకుంటే, స్మృతి చేయకుంటే వికర్మలు కూడా వినాశనమవ్వవు. ముందుకు కూడా వెళ్ళలేరు. స్మృతి చేయకుంటే సమీపానికి వెళ్ళలేరు. ఆత్మ అలసిపోతుంది, తండ్రిని మర్చిపోతుంది. తండ్రి చెప్తున్నారు - మీరు యాత్ర చేస్తున్నారు. రాత్రులు ఎలాగైనా మీరు రెస్ట్‌ తీసుకుంటారు. అలాగని రాత్రుళ్ళు నిద్రలో కూడా నేను యాత్ర చేస్తున్నానని అనుకోరాదు. అది యాత్ర కాదు, రెస్ట్‌. మేల్కొన్నప్పుడు మాత్రమే యాత్రలో ఉంటారు. నిద్రలో వికర్మలేవీ వినాశనమవ్వవు. అయితే ఇతర వికర్మలేవీ జరగవు. కావున తండ్రి అన్ని విషయాలు అర్థము చేయిస్తారు. అయితే ఎవరైనా వీటిని అమలులో పెట్టినప్పుడు కదా ఫలితము లభించేది. అనేక పాయింట్లు తెలుపుతూ ఉంటారు. వకీలు చదువు చదివినప్పుడు వకీలు పాయింట్లు బుద్ధిలోనికి వస్తాయి. డాక్టరు కోర్సు గాని, ఇంజనీరు కోర్సు గాని చదివితే వారు డాక్టరుగా, ఇంజనీర్లుగా మొదలైనవారుగా అవుతారు. ఏ కోర్సు చదువుకుంటే ఆ విధంగా తయారవుతారు.

ఇచ్చట ఉండేది ఒకే ఒక కోర్సు. నడుస్తూ(చదువుతూ) ఉండండి. మీ తల పై జన్మ-జన్మాంతరాల పాపాల భారము చాలా ఉంది. దానిని నాశనము చేసే ఉపాయము ఒక్కటే. తండ్రిని స్మృతి చేయడం. లేకుంటే పదభ్రష్టులైపోతారు. మాల తయారై ఉంది కదా! నవరత్నాలకు కూడా గాయనముంది. అయితే ఈ గాయనము ఎలా వచ్చిందో, వారు ఎక్కడ నుండి వచ్చారో మానవులకు తెలియదు. 8 రత్నాలున్నారు, వారు రుద్ర మాలగా అవుతారు. కావున పురుషార్థము బాగా చేయాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే రిజిష్టరు ద్వారా తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే తండ్రే టీచరు కూడా అయ్యారు. కావున అది వారికే తెలుస్తుంది. మీరు తండ్రి వద్దే చదువుకునేవారు రిజిష్టరు గురించి కూడా వారికే తెలుస్తుంది. మీరు కూడా మీ రిజిస్టరు గురించి అర్థము చేసుకోగలరు. ''మాలో గుణాలు ఎంతవరకు ఉన్నాయి, నేను ఇతరులను నా సమానమగా ఎంతవరకు తయారు చేస్తాను? ఎవరినైనా మీరు ప్రత్యక్షంగా చూస్తే వారు వారి శరీరాలను కూడా మర్చిపోయేటంత శక్తి నాలో ఉందా? పిల్లలు ధైర్యము చేస్తే భగవంతుడు సహాయము చేస్తారని(హిమ్మతే ముర్దా మదదే ఖుదా) అంటారు. తండ్రి చాలా సహాయము చేస్తారు. మీరు కూడా యోగము ద్వారా సహాయపడ్తున్నారు. తండ్రికి పవిత్రతా శక్తియే సహాయంగా అవసరము. యోగబలము ద్వారా ఈ పతిత ప్రపంచమంతటిని పావనంగా తయారుచేయాలి. ఎంతెంత యోగము ద్వారా సహయోగము చేస్తారో, బాబా అంత సంతోషిస్తారు. అయితే ఈ సహాయము బాబాకు చేసినట్లా లేక మీ కొరకా? మీరు ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రత ద్వారా నాకు సహాయం అందిస్తారు. పవిత్ర ప్రపంచము కొరకు. పతితులను పావనంగా చేసేందుకు నేను వచ్చాను. పతితంగా, పవిత్రంగా ఇక్కడనే అవుతారు. అది నిరాకారి ప్రపంచము. పతితపావనా! రండి అని గాయనము చేస్తారు. పావన ప్రపంచమని దేనినంటారో వారికి తెలియదు. సీతను రావణుని జైలు నుండి, దు:ఖము నుండి విడిపిస్తే, మళ్ళీ సుఖము కావాలి కదా. ఇతరులకు శాంతి ఏమో చాలా లభిస్తుంది. కాని సుఖము తక్కువగా లభిస్తుంది. మీకు సుఖము కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. దు:ఖము కూడా ఎక్కువగా లభిస్తుంది. చివర్లో ఏ ఆత్మలైతే వస్తాయో అవి కొద్దిగా పాత్రను అభినయించి వాపస్‌ వెళ్లిపోతాయి. ఒకటి-రెండు జన్మలే తీసుకుంటారు. కొంత సమయానికి వస్తారు. మళ్ళీ వెళ్లిపోతారు. మీది 84 జన్మల మాట. వారికి 1-2 జన్మలే. 84 జన్మల గురించి మీకు తెలుసు. చక్రమును గురించి తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు. వారు ఆ విధంగా అవ్వలేరు. వారికి ఈ జ్ఞానము లేదు. ఈ జ్ఞానము మీ కొరకే అనగా ఎవరైతే కల్పక్రితము కూడా జ్ఞానము తీసుకున్నారో వారి కొరకే. ఇప్పుడు మీరు పురుషార్థము చేయాలి. పురుషార్థము చేయు సమయమిదే. పురుషార్థము మీ కొరకే. దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేది. ఇంత సుఖము ప్రపంచములో ఇంకెవ్వరూ ఇవ్వజాలరు.

ఇది అనాదిలో తయారైన డ్రామా. అందరికీ హీరో-హీరోయిన్ల పాత్ర లభించజాలదు. రకరకాల మనుష్యులున్నారు. అందులోనూ మంచి-చెడు అనేక ప్రకారాల వారున్నారు. దేవీదేవతలు అత్యంత శ్రేష్ఠమైనవారు. శ్రేష్ఠులని వారినే అంటారు. వారు సత్యయుగములోనే ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వారు ఆ విధంగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది కృష్ణుడు ఎక్కడ చూచినా ఉన్నారని అంటారు. భగవంతుడు కూడా సర్వవ్యాపి అని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఇతరులకు అర్థము చేయించేందుకు ఈ లక్ష్యము గమ్యము చాలా బాగుంది. నిమంత్రణ(ఆహ్వానము) అందరికీ తప్పకుండా ఇవ్వాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ నిమంత్రణ లభిస్తూ ఉంది. ఇక సమయము కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకవరకు పిల్లలు యాత్ర చేస్తూ చేస్తూ అలసిపోతే కూర్చుండిపోతారు. మాయ కలిగించే తఫానులను సహించలేరు. యుద్ధ మైదానములో మాయ తప్పకుండా పట్టుకుంటుంది. మీరు రుస్తుంగా అయితే మాయ కూడా రుస్తుమ్‌(బలశాలి) అయ్యి యుద్ధము చేస్తుంది. తుఫానులు జోరుగా వస్తాయి. ఈ జ్ఞానములోనికి వచ్చినప్పటి నుండి అనేక విఘ్నాలు కలుగుతున్నాయని, వ్యాపారములో కూడా నష్టము వచ్చిందని అంటారు. బాబా చెప్తున్నారు - జ్ఞానములో వచ్చినప్పుడే విఘ్నాలు వచ్చాయని భావించకండి. ఇవన్నీ ప్రపంచములో జరిగేవే. వీటి వలన భయపడరాదు. అప్పుడప్పుడు శుక్ర మహాదశ, అప్పుడప్పుడు రాహు దుర్దశ, అప్పుడప్పుడు మరేదో గ్రహ దశ కూర్చుంటుంది. నడుస్తూ నడుస్తూ చనిపోతారు. రాహుదశ చాలా కఠినంగా ఉంటుంది. మాయ పట్టుకుని తినేస్తే నలుపులో అతినల్లగా(అత్యంత అపవిత్రమగా) అయిపోతారు. మాయ చెంపదెబ్బ వేసి ముఖము పూర్తి నల్లగా చేసేస్తుంది. మాయ కూడా జయిస్తూ ఉంటుంది. కేవలం పిల్లలే గెలుస్తుంటే వెంటనే రాజధాని స్థాపనై పోయేది. గురువును మర్చిపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇటువంటి ఆత్మిక ప్రియుని కూడా ఆత్మ రూపి ప్రేయసి మర్చిపోతుంది. ఇది కూడా ఆశ్చర్యము కదా. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. యోగబలముతో పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడంలో తండ్రికి సహయోగులుగా అవ్వాలి. స్మృతియాత్రలో విశ్రాంతి తీసుకోరాదు. ఎదుటివారు తమ శరీరాన్ని కూడా మర్చిపోయేటంత స్మృతి చేయాలి.

2. శ్రీమతములో ఎప్పుడూ సందేహముంచి తమ మన్మతమును నడిపించరాదు. ప్రతి విషయములో సలహాను తీసుకుంటూ అందులోనే మా కళ్యాణముందని భావించి నడుచుకోవాలి.

వరదానము :-

'' మీ సూక్ష్మ శక్తులను స్థాపనా కార్యంలో ఉపయోగించే మాస్టర్‌ రచయిత భవ ''

మీ రచన అయిన సైన్సు వారు విస్తారాన్ని సారములో ఇముడ్చుతున్నారు, అతి సూక్ష్మమైన మరియు శక్తిశాలి వినాశకర సాధనాలను తయారు చేస్తున్నారు. అలా మీరు మాస్టర్‌ రచయితలుగా అయ్యి మీ సుక్ష్మ శక్తులను స్థాపనా కార్యంలో ఉపయోగించండి. మీ వద్ద అన్నిటికంటే మ¬న్నత శక్తులైన శ్రేష్ఠ సంకల్పాల శక్తి, స్నేహ సహయోగాల దృష్టి ఉన్నాయి. కనుక ఈ సూక్ష్మ శక్తుల ద్వారా మీ వంశావళి యొక్క ఆశాదీపాలను వెలిగించండి. వారిని యదార్థమైన గమ్యానికి చేర్చండి.

స్లోగన్‌ :-

''ఎక్కడైతే స్వచ్ఛత, మధురత ఉంటాయో, అక్కడ సేవలో సఫలత ఉంటుంది ''