26-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - కళ్యాణకారి అయిన తండ్రి - మీరెప్పుడూ ఏడ్వవలసిన అవసరం లేకుండా కళ్యాణము చేస్తారు. ఏడ్వడము అకళ్యాణము లేక దేహాభిమానానికి గుర్తు''

ప్రశ్న :-

ఏ నిశ్చిత విధిని తెలుసుకొని మీరు సదా నిశ్చింతగా ఉండాలి ?

జవాబు :-

ఈ పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుందని మీకు తెలుసు. భలే శాంతి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు కాని నరుడు ఒకటి ఆలోచిస్తే, ఇంకొకటి జరిగింది............. అన్నట్లు(తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు) ఎంత ప్రయత్నించినా ఈ నిశ్చితమైన విధి మారజాలదు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి కూడా జరగనున్నాయి. మేము ఈశ్వరీయ ఒడిని తీసుకున్నాము, సాక్షాత్కారాలు పొందాము అన్న నషా మీకు ఉంది. అవన్నీ ప్రత్యక్షంగా జరగాల్సిందే అందువలన మీరు సదా నిశ్చింతగా ఉంటారు.

ఓంశాంతి.

విశ్వంలో మనుష్యుల బుద్ధిలో భక్తిమార్గానికే మహిమ ఉంది. ఎందుకంటే ఇప్పుడింకా భక్తిమార్గము కొనసాగుతోంది. ఇక్కడ భక్తికి మహిమ లేదు. ఇక్కడైతే తండ్రికి మాత్రమే మహిమ ఉంది. తండ్రిని మహిమ చేయవలసి ఉంటుంది. ఆ తండ్రి నుండి ఇంతటి ఉన్నతమైన వారసత్వము లభిస్తుంది! భక్తిలో సుఖము లేదు. భక్తిలో ఉంటున్నా స్వర్గమునే స్మృతి చేస్తారు కదా! మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. అలాగైతే సంతోషించాలి కదా! స్వర్గంలో జన్మ తీసుకున్నప్పుడు మరి ఇక ఏడ్వవలసిన అవసరమే లేదు. స్వర్గస్థులయ్యారన్నది నిజానికి సత్యము కాదు. అందుకే ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఏడ్చేవారి కళ్యాణము ఎలా జరగాలి? ఏడ్వడము దు:ఖానికి గుర్తు. మనుష్యులు ఏడుస్తూ ఉంటారు కదా. పిల్లలు జన్మించినా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే దు:ఖము కలుగుతుంది. దు:ఖము కలుగకపోతే తప్పకుండా హర్షితంగా ఉంటారు. ఏదైనా అకళ్యాణము జరిగినప్పుడు ఏడ్పు వస్తుంది. సత్యయుగంలో ఎప్పుడూ అకళ్యాణము జరగదు. అందువలన అక్కడ ఎప్పుడూ ఏడ్వరు. అక్కడ అకళ్యాణము మాటే ఉండదు. ఇక్కడ ఎప్పుడైనా సంపాదనలో నష్టం కలిగినా లేక ఆహారము లభించకపోయినా దు:ఖం కలుగుతుంది. దు:ఖంలో ఏడుస్తారు. మీరు వచ్చి అందరి కళ్యాణము చేయండి అని భగవంతుని తల్చుకుంటారు. భగవంతుడు సర్వవ్యాపి అయితే కళ్యాణము చేయమని ఎవరిని కోరుతున్నారు? పరమపిత పరమాత్మను సర్వవ్యాపి అని అనడం అన్నిటికన్నా పెద్ద తప్పు. తండ్రి సర్వుల కళ్యాణకారి. తానొక్కరే కళ్యాణకారి కనుక తప్పకుండా సర్వుల కళ్యాణము చేస్తారు. పరమపిత పరమాత్మ సదా కళ్యాణమే చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. విశ్వమంతటికీ కళ్యాణమును చేసేందుకు ఆ పరమపిత పరమాత్మ ఎప్పుడు వచ్చారు? విశ్వ కళ్యాణము చేయువారు ఇక ఎవ్వరూ లేరు. తండ్రిని మళ్లీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు తండ్రి తమ పరిచయమును ఇచ్చి ''మన్మనాభవ'' అని అంటారు. ఇందులోనే కళ్యాణము ఉంది. సత్య, త్రేతా యుగాలలో ఎట్టి పరిస్థితిలోనూ అకళ్యాణము జరగదు. త్రేతా యుగములో కూడా రామరాజ్యం ఉన్నప్పుడు అక్కడ పులి, మేక కలిసి నీళ్ళు తాగుతాయి. మనం సీతా-రాముల రాజ్యాన్ని అంతగా స్మృతి చేయము. ఎందుకంటే రెండు కళలు తగ్గిపోవడంతో కొద్దో - గొప్పో సుఖము తక్కువగా లభిస్తుంది. మనమైతే తండ్రి స్థాపించిన స్వర్గాన్ని ఇష్టపడ్తాము. అందులో పూర్తి వారసత్వాన్ని పొందితే చాలా మంచిది. ఉన్నతోన్నతుడైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని మనం కళ్యాణము చేయాలి. ప్రతి ఒక్కరూ శ్రీమతముననుసరించి తమ కళ్యాణమును చేసుకోవాలి.

ఒకటేమో - ఆసురీ సంప్రదాయము, ఇంకొకటి - దైవీ సంప్రదాయమని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు ఒకవైపు రావణరాజ్యం, మరొకవైపు నేను దైవీ సంప్రదాయాన్ని స్థాపన చేస్తున్నాను. ఇప్పుడు దైవీ సంప్రయము ఉందని కాదు. ''ఆసురీ సంప్రదాయాన్ని నేను దైవీ సంప్రదాయంగా చేస్తున్నాను. దైవీ సంప్రదాయమైతే సత్యయుగంలో ఉంటుంది'' అని అంటారు. ''ఈ ఆసురీ సంప్రదాయాన్ని దైవీ సాంప్రదాయంగా భవిష్యత్తు కొరకు తయారు చేస్తాను'' అని బాబా అంటారు. ఇప్పుడిది బ్రాహ్మణ సంప్రదాయము. దైవీ సాంప్రదాయము తయారవుతోంది. ''మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు మీకు...............(మనుష్య్‌ సే దేవతా కియే, కరత్‌ న లాగే వార్‌...............)'' అని గురునానక్‌ కూడా అన్నారు. కాని దేవతలుగా తయారుచేయబడే మనుష్యులు ఎవరు? వారికి డ్రామా ఆదిమధ్యాంతాలను గూర్చి తెలియదు. సృష్టి ఆదిలో ఉండిన శ్రేష్ఠాచారులైన లక్ష్మీనారాయణులకు కూడా ఆదిమధ్యాంతాలను గురించి తెలియదు. వారు త్రికాలదర్శులు కాదు. అంతకుముందు జన్మలో త్రికాలదర్శులుగా, స్వదర్శన చక్రధారులుగా ఉండేవారు. అప్పుడు ఈ రాజ్య పదవిని పొందారు. వారు స్వదర్శన చక్రాన్ని విష్ణువుకు చూపించారు. కావున బ్రాహ్మణులు స్వదర్శన చక్రధారులు అని అర్థం చేయించాలి. అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు. వారైతే కృష్ణుని మరియు విష్ణువును కూడా స్వదర్శన చక్రధారులు అని అనేస్తారు. విష్ణువు రెండు రూపాలు ఈ లక్ష్మీనారాయణులని వారికి తెలియదు. ఇంతకుముందు మనకు కూడా తెలియదు. మనుష్యులైతే ప్రతి విషయంలోనూ విధి అని అనేస్తారు. ఏదైతే జరగనున్నదో దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది డ్రామా. కావున మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలా లేక డ్రామా రహస్యాన్ని అర్థం చేయించాలా? అది కూడా ఎప్పుడైతే బాబా స్మృతి ఉంటుందో అప్పుడప్పుడే తెలుస్తుంది. కావున మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వాలి. అనంతమైన తండ్రి అయిన శివబాబా అయితే ప్రసిద్ధమైనవారు. రుద్రబాబా అని కూడా అనరు కదా! శివబాబా ప్రసిద్ధమైనవారు. ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారో వారికి వెళ్ళి అర్థం చేయించండి అని తండ్రి తెలిపించారు. హిమాలయాలకు ఇన్ని కోట్ల సంవత్సరాల వయస్సు అని మనుష్యులు చెప్తూ ఉండడం వార్తాపత్రికల్లో చదివారు. హిమాలయాలకేమైనా ఆయువు ఉంటుందా? ఇవన్నీ సదా కాలికంగా ఉండనే ఉన్నాయి. హిమాలయం ఎప్పుడైనా మాయమవ్వగలదా? ఈ భారతదేశం కూడా అనాది. ఇది ఎప్పుడు రచింపబడింది? దాని వయసును కనుగొనలేరు. అలాగే అది ఎప్పటి నుండి ఉందో హిమాలయము గురించి చెప్పలేరు. ఈ హిమాలయ పర్వతం ఆయువు లెక్కింపబడజాలదు. అకాశము లేక సముద్రము వంటి వాటి ఆయుష్షు ఇంత ఉంటుందని చెప్పరు. హిమాలయము ఆయువును చెప్తున్నారంటే మరి సముద్రానిది కూడా తెలపాలి కదా! వారికేమీ తెలియదు. ఇక్కడైతే మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. ఇది ఈశ్వరీయ కుటుంబము.

తండ్రికి చెందినవారిగా అవ్వడం ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారని మీకు తెలుసు. ఇది ఒక జనక మహారాజ విషయం కాదు. జీవన్ముక్తిలో లేక రామరాజ్యంలో అయితే ఎంతోమంది ఉంటారు కదా! అందరికీ జీవన్ముక్తి అయితే లభించి ఉంటుంది. మీరు క్షణములో ముక్తి-జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు, పిల్లలుగా అయ్యి మమ్మా-బాబా అని అంటారు. జీవన్ముక్తి అయితే లభిస్తుంది కదా. ప్రజలైతే లెక్కలేనంత మంది తయారవుతూ ఉంటారని అర్థము చేసుకోగలరు. రోజురోజుకు ప్రభావమైతే వెలువడాలి కదా! ఈ ధర్మస్థాపన జరగడం చాలా కష్టమైనది. వారైతే పై నుండి వచ్చి స్థాపన చేస్తారు. వారి వెనుక ఆ ధర్మములోని వారంతా పై నుండి వస్తారు. ఇక్కడైతే ఒక్కొక్కరినీ రాజ్యభాగ్యం పొందుకునేందుకు యోగ్యులుగా చేయవలసి ఉంటుంది. అర్హులుగా తయారు చేయడం తండ్రి పని. ఎవరైతే ముక్తి-జీవన్ముక్తులకు అర్హులుగా ఉండేవారో, వారందరినీ మాయ అనర్హులుగా చేసేసింది. పంచ తత్వాలు కూడా అనర్హంగా అయిపోయాయి. మళ్లీ అర్హులుగా చేసేవారు తండ్రియే. ఇప్పుడు క్షణ-క్షణం మీ పురుషార్థం ఏదైతే కొనసాగుతోందో, అది కల్ప పూర్వం కూడా ఫలానావారు ఇలా పురుషార్థం చేసి ఉంటారని భావించబడ్తుంది. కొందరు ఆశ్చర్యపడునట్లు పారిపోతారు, వదిలి వెళ్లిపోతారు. ప్రాక్టికల్‌గా చూస్తూ ఉంటారు. వినాశనం ముందు నిల్చొని ఉందని, డ్రామానుసారంగా అందరూ కర్తవ్యములోకి రావాలి. నరుడు ఒకటి కోరుకుంటే........ ఇంకొకటి జరిగింది(తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు)........ అని అంటారు. వారు శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. కాని విధిని గూర్చి పిల్లలైన మీకు తెలుసు. మీరు సాక్షాత్కారం పొందారు. వినాశనం జరగరాదని వారు ఎంతగా తల బాదుకున్నా ఈ విధిలో మార్పు ఉండజాలదు. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వారు ఏమి చేయగలరు? ఇది భగవంతుని పని అని వారంటారు. నషా కలిగి స్మృతిలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. అందరూ పరిపూర్ణంగా అయితే అవ్వలేదు. ఈ విధి లిఖితము మారజాలదని మీకు తెలుసు. అన్నము లేదు. మనుష్యులు ఉండేందుకు స్థానము లేదు. మూడడుగుల నేల కూడా లభించదు.

ఇది మీ ఈశ్వరీయ పరివారము. ఇక్కడ మాత - పితలు, వారి పిల్లలు ఉన్నారు. నేను పిల్లల ముందే ప్రత్యక్షమవుతాను. పిల్లలకు నేర్పిస్తానని తండ్రి అంటారు. మేము తండ్రి మతానుసారంగా నడుస్తామని పిల్లలు కూడా అంటారు. నేను పిల్లల సన్ముఖంలోకే వచ్చి మతమునిస్తానని తండ్రి కూడా అంటారు. పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుంటే వదిలేయండి. ఇందులో పోట్లాడే విషయమేదీ లేదు. మేము తండ్రి పరిచయమును ఇస్తాము. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు స్వదర్శన చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తి రాజులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. 'మన్మనాభవ, మధ్యాజీభవ' అర్థం కూడా ఇదే. తండ్రి పరిచయమును ఇవ్వండి. దీని ద్వారా రచయిత మరియు రచనల(క్రియేటర్‌ మరియు క్రియేషన్‌) రహస్యాన్ని అర్థము చేసుకోగలరు. ముఖ్యమైన విషయం ఇదొక్కటే. గీతలో ముఖ్యమైన పొరపాటు ఇదొక్కటే. కళ్యాణకారినైన నేనే వచ్చి కళ్యాణము చేయాలని తండ్రి అంటారు. శాస్త్రాల ద్వారా కళ్యాణము జరగదు. మీరు వారిని స్మృతి చేస్తారు కాని వారిని గురించి తెలియదు. తండ్రిని స్మృతి చేయాలంటే, వారి పరిచయం కూడా కావాలి కదా! వారు ఎక్కడ ఉంటారు? వస్తారా లేక రారా? తండ్రి వారసత్వాన్ని అయితే తప్పకుండా ఇక్కడి కొరకు ఇస్తారా లేక అక్కడి కొరకు ఇస్తారా? తండ్రి అయితే సన్ముఖంగా ఉండాలి కదా! మీరు శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివుడు పరమపిత(సుప్రీం ఫాదర్‌). వారు సర్వాత్మల తండ్రి. వారు రచయిత, కొత్త జ్ఞానమునిస్తారు. వారికి సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాలను గూర్చి తెలుసు. తాను ఉన్నతోన్నతుడైన టీచర్‌. మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. మనుష్యులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. మాకు కూడా వారే నేర్పించారు. ఇప్పుడు మేము నేర్పిస్తున్నాము. గీతలో కూడా ప్రారంభములో మరియు అంతిమంలో ''మన్మనాభవ'' మరియు ''మధ్యాజీభవ'' అని అన్నారు. వృక్షము మరియు డ్రామా జ్ఞానము కూడా బుద్ధిలో ఉంటుంది. విస్తారంగా అర్థం చేయించవలసి ఉంటుంది. క్లుప్తంగా తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి అను విషయమొక్కటే ఉంటుంది. ఇక్కడైతే ఒక్క విషయమే ఉంది - మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. విశ్వ కళ్యాణకారియే విశ్వాధిపతులుగా చేస్తారు. స్వర్గాధిపతులుగా చేస్తారు. అంతేకాని నరకాధిపతులుగా చేయరు కదా! నరక రచయిత రావణుడని, స్వర్గానికి రచయిత తండ్రి అని ప్రపంచానికి తెలియదు. మృత్యువు ఎదురుగానే నిల్చొని ఉంది. ఇది అందరి వానప్రస్థావస్థ అని, నేను తిరిగి తీసుకు వెళ్ళేందుకు వచ్చానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మ మలినము నుండి శుద్ధంగా అయిపోతుంది. మళ్లీ మిమ్ములను స్వర్గంలోకి పంపించి వేస్తాను. ఈ నిశ్చయబుద్ధితో ఎవరికైనా అర్థం చేయించాలే కాని కేవలం చిలకలా పలకడం కాదు. నిశ్చయబుద్ధి గలవారు ఏడవవలసిన లేక దేహాభిమానంలోకి రావలసిన అవసరం ఉండదు. దేహాభిమానం చాలా అశుద్ధంగా చేసేస్తుంది. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి. శరీర నిర్వహణార్థం కర్మ చేయండి. వారైతే కర్మ సన్యాసులుగా అయిపోతారు. ఇక్కడైతే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి. పిల్లలను సంభాళించాలి. తండ్రిని మరియు చక్రాన్ని తెలుసుకోవడం అయితే చాలా సహజము.

తండ్రికి ఎంతోమంది పిల్లలున్నారు. వారిలో కొందరు సుపుత్రులు, కొందరు కుపుత్రులు. పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా వికారాలలోకి వెళ్ళకండి. నా పిల్లలుగా అయ్యి ముఖాన్ని నల్లగా చేసుకుంటే కులకళంకితులుగా అవుతారని తండ్రి అంటారు. ఈ కామచితి కారణంగానే మీరు నల్లగా అయ్యారు. కామచితిలో అలా తగులబడరాదు. తేలిక పాటి నషా కూడా ఉండరాదు. సన్యాసులు మొదలైనవారు తమ అనుచరులకు ఇలా చెప్పలేరు. వారు నిజానికి అనుచరులు కారు. తండ్రి అయితే అందరికీ సత్యమైన విషయాలను అర్థము చేయిస్తారు. తండ్రి నన్ను స్మృతి చేయండి అని అంటారు. బాబా, మీ మతం పై నడుస్తూ మేము స్వర్గ వారసులుగా అవుతామని మీరు గ్యారెంటీ ఇచ్చారు. మరి పిల్లలైన మీరు విషయ వికారాలనే గుంటలో పడాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? పిల్లలైన మీరు ఎప్పుడైతే ఇలా అర్థం చేయిస్తారో అప్పుడు ఇటువంటి జ్ఞానాన్ని మేము ఎప్పుడూ వినలేదు అని అంటారు. మందిరాలలోని ముఖ్యులను పట్టుకోవాలి. చిత్రాలు తీసుకెళ్లాలి. ఈ త్రిమూర్తి చిత్రము మనోభిరాముని(దిల్‌వాలా) చిత్రమే. పైన దైవీ వృక్షము ఉంది. దైవీ వృక్షమేదైతే గతించిపోయిందో దానిని చూపిస్తారు. ఇటువంటి సేవను ఎవరైనా చేసి చూపిస్తేే వీరు అద్భుతం చేశారని బాబా మహిమ చేస్తారు. ఉదాహరణానికి బాబా రమేష్‌ను మహిమ చేస్తారు కదా! విహంగ మార్గ సేవ కొరకు మంచి నమూనాను ప్రదర్శినీని కనుగొన్నాడు. ఇక్కడ కూడా ప్రదర్శిని చేద్దాము. చిత్రాలైతే చాలా బాగున్నాయి.

ఇప్పుడు ఢిల్లీలో ధార్మిక సమ్మేళనము జరుగుతుంది, వారు కూడా అందరూ ఒక్కటి కావాలనే అంటారు. దానికి అర్థమే లేదు. తండ్రి ఒక్కరే. మిగిలిన వారంతా సోదరీ-సోదరులు. ఇది తండ్రి నుండి వారసత్వం పొందే విషయం. పరస్పరం కలిసి పాలు, పంచదారలా ఎలా ఉండాలో, ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శినీ అభివృద్ధి కొరకు యుక్తులను రచించాలి. ఎవరైతే సేవకు ఋజువు చూపించరో, వారు సిగ్గుపడాలి. 10 మంది కొత్తవారు వచ్చి 8-10 మంది చనిపోతే అనగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్లిపోతే దాని వల్ల లాభమేముంది. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఏడ్వరాదు లేక దేహాభిమానములోకి రాకూడదు.

2. శ్రీమతముననుసరించి మీ కళ్యాణమును, ఇతరుల కళ్యాణమును చేయాలి. సుపుత్రులై తండ్రి పేరును ప్రఖ్యాతము చేయాలి.

వరదానము :-

''శీతలా దేవిగా అయ్యి కర్మేంద్రియాలను శీతలంగా, శాంతిగా చేసే స్వరాజ్య అధికారీ భవ ''

ఎవరైతే స్వరాజ్య అధికారీ పిల్లలుగా ఉంటారో, వారిని ఏ కర్మేంద్రియమూ మోసము చేయలేదు. ఎప్పుడైతే మోసము చేసే చంచలత సమాప్తమైపోతుందో అప్పుడు స్వయం శీతలా దేవిగా అయిపోతారు. వారి కర్మేంద్రియాలు కూడా శీతలమైపోతాయి. శీతలా దేవికి ఎప్పుడూ కోపము రాదు. చాలామంది, కోపము రాదు కాని కొంచెం ఆవేశం(రోబ్‌) ఉంచుకోవాల్సి వస్తుందని అంటారు. కాని రోబ్‌ కూడా క్రోధము యొక్క అంశమే. ఎక్కడైతే అంశముంటుందో, అక్కడ వంశము జన్మిస్తుంది. మీరు శీతలా దేవీలు మరియు శీతలా దేవులు. అందువలన స్వప్నములో కూడా క్రోధము లేక రోబ్‌ల సంస్కారము ఉత్పన్నమవ్వరాదు.

స్లోగన్‌ :-

''ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగా ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు, వారికి ఆశీర్వాదాలు వేడుకునే అవసరముండదు''