23-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఎంతగా స్మృతిలో ఉంటారో, పవిత్రులుగా అవుతారో అంతగా పారలౌకిక మాత - పితల దీవెనలు లభిస్తాయి, దీవెనలు లభించడంతో మీరు సదా సుఖవంతులుగా అయిపోతారు ''

ప్రశ్న :-

తండ్రి తన పిల్లలందరికీ ఏ సలహానిచ్చి ''కు''(చెడు) కర్మల నుండి రక్షిస్తారు ?

జవాబు :-

పిల్లలూ! మీ వద్ద ధనము, సంపద మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ వద్దనే ఉంచుకోండి కానీ ట్రస్టీలు(నిమిత్తులు)గా అయ్యి నడుచుకోండి అని బాబా సలహా ఇస్తారు. భగవంతుడా! ఈ సర్వస్వము మీదే అని అంటూ వచ్చారు. భగవంతుడే కొడుకును ఇచ్చాడు, ధనము, సంపద అన్నీ ఇచ్చాడని అంటారు. ఇప్పుడు వీటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ట్రస్టీలుగా ఉండండి. శ్రీమతమును అనుసరిస్తే ఏ చెడు కర్మలూ జరగవు. మీరు శ్రేష్టులుగా అయిపోతారని భగవంతుడు సలహా ఇస్తున్నారు.

పాట :-

మాత - పితల దీవెనలను తీసుకోండి,.................(లేలో, లేలో దువాయే మా బాప్‌కీ ,.............)   

ఓంశాంతి.

ఏ పిల్లలైతే మాకు నోరు రావడం లేదు, అర్థం చేయించలేకపోతున్నామని అంటారో వారికి సెంటరులోని బ్రాహ్మణీలు ఎలా నేర్పించాలో శివబాబా అర్థం చేయిస్తారు. చిత్రాల పై అర్థం చేయించడం చాలా సహజం. చిన్న పిల్లలకు చిత్రాలను చూపించి అర్థం చేయించవలసి ఉంటుంది కదా! క్లాసులో అందరూ వచ్చి కూర్చోవడంతోనే మీరు మురళీని ప్రారంభించడం కాదు. ఇక్కడ మీరు హృదయపూర్వకంగా కూర్చొని అర్థం చేయించాలి. పిల్లలు పాటేమో విన్నారు. ఒకరేమో పారలౌకిక మాత-పితలు. నీవే తల్లివి-తండ్రివి,....... అని వారిని స్మృతి చేస్తూ ఉంటారు. వారు సృష్టి రచయిత. మాత-పితలు తప్పకుండా స్వర్గమునే రచిస్తారు కదా! సత్యయుగములో స్వర్గములో నివసించే పిల్లలు ఉంటారు. ఇక్కడి మాత-పితలు స్వయం వారే నరకవాసులుగా ఉన్నారు. కావున నరకవాసులైన పిల్లలకే జన్మనిస్తారు. మాతా-పితల దీవెనలు తీసుకోండని పాటలో చెప్పారు. అయితే ఈ సమయంలోని మాత-పితలు దీవెనలు ఇవ్వరని పిల్లలైన మీకు తెలుసు. స్వర్గవాసులుగా అవ్వమని ఈ మాతా-పితలు దీవెనలు ఇస్తారు. అర్ధకల్పం తర్వాత శ్రాపితులుగా అయిపోతారు. వారు(ఆ మాత-పితలు) స్వయం పతితులుగా అవ్వడమే కాక పిల్లలను కూడా పతితులుగా చేస్తారు. దానిని ఆశీర్వదించడం అని అనరు. శాపాన్ని ఇస్తూ ఇస్తూ భారతవాసులు శ్రాపితులుగా అయిపోయారు. ఇక్కడ దు:ఖమే దు:ఖముంది. అందుకే మాత-పితలను తలుచుకుంటారు. ఇప్పుడు ఆ మాత-పితలు దీవెనలు ఇస్తున్నారు. వారు చదివించి పతితుల నుండి పావనులుగా చేస్తున్నారు. ఇక్కడ ఇది ఆసురీ సంప్రదాయము, రావణ రాజ్యము. అక్కడ దైవీ సంప్రదాయము, రామరాజ్యము ఉంటుంది. రావణుని జన్మ కూడా భారదేశములోనే జరిగింది. అలాగే శివబాబాను ఎవరినైతే రాముడు అని అంటారో వారి జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే వామమార్గములోకి వెళ్తారో అప్పుడు భారతదేశములో రావణ రాజ్యము ప్రారంభమౌతుంది. కావున భారతదేశమునే రాముడైన పరమపిత పరమాత్మ వచ్చి పతితము నుండి పావనంగా చేస్తాడు. రావణుడు వస్తే మనుష్యులు పతితులుగా అవుతారు. రాముడు పోయాడు, రావణుడు కూడా పోయాడు, వారి బహు పరివారాలూ పోయాయని గానము చేస్తారు. రాముని పరివారము చాలా చిన్నది. మిగిలిన ధర్మాలన్నీ అంతమైపోతాయి. అందరూ వినాశనమైపోతారు. అయితే దేవీదేవతలైన మీరు మిగులుతారు. మీరు ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారే సత్యయుగములోకి బదిలీ అవుతారు. కావున ఇప్పుడు మీకు మాతా-పితల దీవెనలు లభిస్తున్నాయి. మాత-పితలు మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. అక్కడ అంతా సుఖమే సుఖముంటుంది. ఈ సమయములో కలియుగములో దు:ఖముంది. అన్ని ధర్మాలూ దు:ఖితంగా ఉన్నాయి. ఇప్పుడు కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము రానున్నది. కలియుగములో మనుష్యులు ఎందరు ఉన్నారు! సత్యయుగములో ఇంతమంది మనుష్యులు ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులుగా ఉంటారో వారే మళ్లీ అక్కడ దేవతలుగా అవుతారు. వారు కూడా త్రేతాయుగము వరకు వృద్ధి చెందుతూ ఉంటారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం సత్యయుగము ఉండేదని అంటారు. క్ర్రీస్తు పూర్వము, కీస్తు శకము(తర్వాత) అని అంటారు కదా! సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. అక్కడ మనుష్యులు కూడా కొద్దిమందే ఉంటారు. కేవలం భారతదేశము ఒక్కటే ఉంటుంది. ఇంకే ధర్మమూ అక్కడ ఉండదు. కేవలం సూర్యవంశీయులే ఉంటారు. చంద్రవంశీయులు కూడా ఉండరు. సూర్యవంశీయులను భగవాన్‌-భగవతి అని అనవచ్చు, ఎందుకంటే వారు సంపూర్ణులు.

పతితపావనుడు ఒక్క పరమపిత పరమాత్మయేనని పిల్లలైన మీకు తెలుసు (చక్రము చిత్రము వైపు చూపిస్తూ) చూడండి! పైన బాబా కూర్చున్నారు. ఈ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఈ దేవతల రాజ్యము ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండదు. మళ్లీ అర్ధకల్పం తర్వాత వృద్ధి అవుతూ ఉంటుంది. పై నుండి ఆత్మలు వస్తూ ఉంటాయి. వర్ణాలు బదిలీ అవుతూ ఉంటాయి. జీవాత్మలు పెరుగుతూ ఉంటారు. సత్యయుగములో 9 లక్షల మంది ఉంటారు. తర్వాత కోటి మంది అవుతారు. ఆ తర్వాత ఇంకా వృద్ధి చెందుతూ ఉంటారు. సత్యయుగములో భారతదేశము శ్రేష్ఠాచారిగా ఉండేది. ఇప్పుడు భ్రష్ఠాచారిగా ఉంది. అన్ని ధర్మాల వారు శ్రేష్ఠాచారులుగా అయిపోతారని కాదు. ఎంతమంది మనుష్యులున్నారు! ఇక్కడ కూడా భ్రష్ఠాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా అయ్యేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. ఘడియ-ఘడియ శ్రేష్ఠాచారులుగా అవుతూ-అవుతూ మళ్లీ వికారాలలోకి వెళ్లి భ్రష్ఠాచారులుగా అయిపోతారు. మిమ్ములను నల్లని వారి(అపవిత్రుల) నుండి తెల్లనివారు(పవిత్రులు)గా తయారు చేసేందుకు నేను వచ్చానని తండ్రి అంటారు. మీరు మళ్లీ పదే పదే పడిపోతారు! అనంతమైన తండ్రి విషయాన్ని నేరుగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కులకళంకితులుగా ఎందుకు అవుతారు? ముఖాన్ని ఎందుకు నల్లగా చేసుకుంటారు? మీరు తెల్లగా(పవిత్రంగా) అవ్వాలనుకోవడం లేదా? అని బాబా అడుగుతున్నారు. మీరు అర్ధకల్పము శ్రేష్ఠంగా ఉండేవారు. తర్వాత కళలు తగ్గిపోతూ వచ్చాయి. కలియుగాంతములో అయితే కళలు పూర్తిగా అంతమైపోతాయి. సత్యయుగములో కేవలం ఒక్క భారతదేశమే ఉండేది. ఇప్పుడైతే అన్ని ధర్మాలున్నాయి. తండ్రి వచ్చి మళ్లీ సత్యయుగీ శ్రేష్ఠ సృష్టిని స్థాపన చేస్తారు. మీరు కూడా శ్రేష్ఠాచారులుగా అవ్వాలి. శ్రేష్ఠాచారులుగా ఎవరు తయారుచేస్తారు? బాబా పేదలపాలిట పెన్నిధి. ఇక్కడ డబ్బు విషయమేమీ లేదు. అనంతమైన తండ్రి వద్దకు శ్రేష్ఠులుగా అయ్యేందుకు వస్తారు. అయినా మీరు అక్కడకు ఎందుకు వెళ్తున్నారని అందరూ అంటారు. ఎన్ని విఘ్నాలు కలిగిస్తారు! ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో అసురుల విఘ్నాలు చాలా పడ్తాయని మీకు తెలుసు. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. కొందరు స్త్రీలు కూడా ఎంతగానో విసిగిస్తారు. వికారాల కొరకే వివాహము చేసుకుంటారు. ఇప్పుడు బాబా కామచితి పై నుండి దించి జ్ఞానచితి పై కూర్చోపెడ్తారు. ఇది జన్మ-జన్మాంతరాల కాంట్రాక్ట్‌. ఈ సమయములో ఉండేదే రావణ రాజ్యము. ప్రభుత్వము వారు ఎన్నో ఉత్సవాలు చేస్తుంటారు. రావణుని తగులబెడ్తారు, ఆటను చూసేందుకు వెళ్తారు. ఇప్పుడు ఈ రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు? రావణుడు జన్మించి 2500 సంవత్సరాలు అయ్యింది. ఈ రావణుడు అందరినీ శోకవాటికలో కూర్చోబెట్టాడు. అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. రామరాజ్యములో అందరూ సుఖీలుగా ఉంటారు. ఇప్పుడిది కలియుగాంతము. మీ ముందు వినాశనము నిల్చొని ఉంది. ఇన్ని కోట్లాదిమంది మనుష్యులు మరణించాలంటే యుద్ధము తప్పకుండా జరుగుతుంది కదా! ఆవగింజల వలె అందరూ నలిగిపోతారు. ఇప్పుడు దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండడం మీరు గమనిస్తారు. బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ జ్ఞానాన్ని బాబాయే వచ్చి ఇస్తారు, పతితులను పావనంగా చేస్తారు. సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగములో సద్గతియే ఉంటుంది. అక్కడ గురువు అవసరమే ఉండదు. ఇప్పుడు మీరు ఈ జ్ఞానము ద్వారా త్రికాలదర్శులుగా అవుతారు. సత్యయుగములోని లక్ష్మీనారాయణులలో ఈ జ్ఞానము బొత్తిగా ఉండదు. కనుక ఈ జ్ఞానము పరంపరగా ఎలా వస్తుంది? ఇప్పుడిది కలియుగ అంతిమ సమయము. తండ్రి చెప్తున్నారు - మీరు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. స్వర్గ రాజధానిని స్థాపన చేసే తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. తప్పకుండా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచములో కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యపుడు మొదలైనవారు ఉండరు. కలియుగ విషయాలను సత్యయుగములోకి తీసుకెళ్లారు. శివబాబా కలియుగాంతములో వచ్చారు. ఈ రోజు శివబాబా వచ్చారు, రేపు శ్రీ కృష్ణుడు వస్తాడు. కనుక శివబాబా పాత్రను, శ్రీ కృష్ణుని పాత్రను కలిపేశారు. శివభగవానువాచ - నా ద్వారా చదివి కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందుతుంది. వారు పొరపాటుగా గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఈ పొరపాటు మళ్లీ కూడా జరుగుతుంది. మనుష్యులు భ్రష్టాచారులుగా అయితేనే తండ్రి వచ్చి శ్రేష్ఠాచారులుగా చేస్తారు కదా! శ్రేష్ఠాచారులే 84 జన్మలు పూర్తి చేసి భ్రష్ఠాచారులుగా అవుతారు. ఈ చక్రాన్ని చూపి అర్థము చేయించడం చాలా సులభము. వృక్షములో కూడా క్రింద మీరు రాజయోగ తపస్సు చేస్తున్నట్లుగా చూపించబడింది. పైన లక్ష్మీనారాయణుల రాజ్యముంది. ఇప్పుడు మీరు వేర్లలో కూర్చున్నారు. పునాది వేయబడుతోంది. మళ్లీ సూర్యవంశీ కులము(వైకుంఠము)లోకి వెళ్తామని మీకు తెలుసు. రామరాజ్యాన్ని( త్రేతా యుగాన్ని ) వైకుంఠమని అనరు. వైకుంఠమని కృష్ణుని రాజ్యాన్ని(సత్యయుగాన్ని) అంటారు.

ఇప్పుడు మీ వద్దకు చాలా మంది వస్తారు. ఎగ్జిబిషన్‌ మొదలైనవాటి ద్వారా మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. ఒకరినొకరు చూసి వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థము చేయిస్తారు. చిత్రాల ద్వారా ఎవరికైనా అర్థము చేయించడం చాలా సులభము. భగవంతుడే వచ్చి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. వారు పతిత ప్రపంచములోనే వస్తారు. నల్లగా(అపవిత్రంగా) ఉన్నవారిని తెల్లగా(పవిత్రంగా) చేస్తారు. మీరు కృష్ణుని రాజధానికి చెందిన వంశావళి వారు. అంతేకాక ప్రజలు కూడా మీరే. తండ్రి మంచిరీతిగా అర్థము చేయిస్తారు. నిరాకారుడైన శివబాబా కూర్చొని మీరు నన్ను స్మృతి చేయండి అని ఆత్మలకు అర్థము చేయిస్తారు. ఇది ఆత్మిక యాత్ర. హే ఆత్మలారా! మీరు మీ శాంతిధామాన్ని, నిర్వాణధామాన్ని స్మృతి చేస్తే స్వర్గ వారసత్వము లభిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగములో కూర్చుని ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లైతే మీరు స్వర్గములోకి వచ్చేస్తారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో, ఎంత పవిత్రముగా ఉంటారో అంత ఉన్నతపదవి లభిస్తుంది. ''ధనవాన్‌ భవ!, ఆయుష్మాన్‌ భవ! పుత్రవాన్‌ భవ!'' అని మీకు ఎన్ని గొప్ప దీవెనలు లభిస్తున్నాయి! దేవతల ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడిక ఈ శరీరాన్ని వదిలి చిన్న బాలునిగా అవ్వాలని అక్కడి వారికి సాక్షాత్కారమవుతుంది. కావున ఆత్మ అయిన నేను ఈ పాత శరీరాన్ని వదిలి గర్భములో నివసిస్తానని లోలోపల భావించాలి. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. వృద్ధులుగా అవ్వడం కంటే నేను వెళ్లి చిన్న బాలునిగా ఎందుకు అవ్వరాదు? ఆత్మ ఈ శరీరముతో ఉన్నప్పుడే అన్ని కష్టాలు అనుభవము చేస్తుంది. ఆత్మ శరీరము నుండి వేరైపోతే, ఆత్మకు ఏ విధమైన కష్టము, బాధ అనుభవమవ్వదు. శరీరము నుండి వేరైపోతే అన్నీ సమాప్తం. ఇప్పుడు మనం మూలవతనానికి వెళ్లాలి. మనలను తీసుకెళ్ళేందుకు బాబా వస్తారు. ఇది దు:ఖధామము. ఇప్పుడు మనం మళ్లీ ముక్తిధామములోకి వెళ్తాము. అందరినీ ముక్తిధామములోకి తీసుకెళ్తానని తండ్రి అంటున్నారు. ఏ ధర్మానికి చెందినవారైనా అందరూ ముక్తిధామములోకి వెళ్లాల్సిందే. వారు ముక్తిలోకి వెళ్ళేందుకే పురుషార్థము చేస్తారు.

నన్ను స్మృతి చేసినట్లైతే నా వద్దకు వచ్చేస్తారని తండ్రి అంటున్నారు. బాబాను స్మృతి చేస్తూ భోజనము తయారుచేసి, తింటే మీకు శక్తి లభిస్తుంది. అశరీరిగా అయ్యి మీరు కాలినడకన ఆబూ రోడ్‌ వరకు వెళ్లినా మీకు ఎప్పుడూ ఏ విధమైన అలసట అనుభవమవ్వదు. బాబా ప్రారంభములో ఈ అభ్యాసాన్ని చేయించేవారు. ''నేను ఒక ఆత్మను'' అని భావించేవారు. అలా తేలికగా అయ్యి నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఏ మాత్రము అలసట కలిగేది కాదు. శరీరము లేకుండా ఆత్మ అయిన మీరు ఒక్క క్షణములో బాబా వద్దకు చేరుకోగలరు. ఇక్కడ ఒక శరీరాన్ని వదిలి క్షణములో లండన్‌లో జన్మ తీసుకుంటారు. ఆత్మ వంటి చురుకైనది ఇంకే వస్తువు ఉండదు. కనుక పిల్లలూ, ఇప్పుడు మిమ్ములను తీసుకెళ్ళేందుకు నేను వచ్చాను. ఇప్పుడు తండ్రి అయిన నన్ను స్మృతి చేయమని బాబా చెప్తారు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా అనంతమైన పారలౌకిక తండ్రి నుండి దీవెనలు (ఆశీర్వాదాలు) లభిస్తున్నాయి. తండ్రి పిల్లలకు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతాన్ని ఇస్తున్నారు. ధనము, సంపద మొదలైన వాటన్నింటిని మీ వద్దనే ఉంచుకోండి. కేవలం ట్రస్టీలుగా అయ్యి నడుచుకోండి. ఓ భగవంతుడా! ఈ సర్వస్వము మీదేనని కూడా మీరు అంటూ వచ్చారు. భగవంతుడు పిల్లలను ఇచ్చాడు. భగవంతుడు ఈ ధన-సంపదలను ఇచ్చాడని కూడా అంటారు. అచ్ఛా! ఇప్పుడు వీటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి మీరు ట్రస్టీలుగా అయ్యి నడుచుకోండి అని భగవంతుడు వచ్చి చెప్తున్నారు. శ్రీమతమును అనుసరిస్తే తండ్రికి తెలుస్తుంది. మీరు చెడు కర్మలు ఏవీ చేయరు కదా! శ్రీమతమును అనుసరించడం ద్వారానే మీరు శ్రేష్ఠంగా అవుతారు. ఆసురీ మతము పై నడవటం ద్వారా మీరు భ్రష్టులుగా అయ్యారు. భ్రష్టులుగా అయ్యేందుకు మీకు అర్ధకల్పము పట్టింది. 16 కళల నుండి మళ్లీ 14 కళలుగా అవుతారు. తర్వాత కళలు మెల్ల-మెల్లగా తగ్గుతూ పోతాయి. కావున ఇందుకు సమయము పడ్తుంది కదా! మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. నడుస్తూ - తిరుగుతూ అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి. భోజనము ఒక్క తండ్రి స్మృతిలోనే తినాలి.

2. మాతా - పితల దీవెనలు తీసుకోవాలి. ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. ఏ విధమైన చెడు కర్మలను చేయరాదు.

వరదానము :-

''జ్ఞాన స్వరూపులుగా అయ్యి కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని నడిచే కర్మబంధన ముక్త్‌ భవ ''

చాలామంది పిల్లలు ఆవేశముతో అన్నీ వదిలేసి శరీరము నుండి దూరంగా పోతారు. కాని మానసిక లెక్కాచారాలున్న కారణంగా మనసు లాగుతూ ఉంటుంది. బుద్ధి అటువైపు వెళ్తూ ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద విఘ్నంగా అయిపోతుంది. అందువలన ఎవరి నుండి అయినా దూరం అవ్వాలనుకుంటే మొదట నిమిత్తంగా ఉన్న ఆత్మలతో వెరిఫై చేయించండి. ఎందుకంటే ఇది కర్మల ఫిలాసఫి(సిద్ధాంతము). బలవంతంగా తెంచితే మనసు పదే పదే అటువైపే వెళ్తూ ఉంటుంది. కనుక జ్ఞాన స్వరూపులుగా అయ్యి కర్మ ఫిలాసఫీని తెలుసుకొని వెరిఫై చేయిస్తే కర్మబంధనము నుండి ముక్తులైపోతారు.

స్లోగన్‌ :-

'' స్వమానమనే సీటు పై సెట్‌ అయ్యి ఉంటే, మాయ మీ ముందు సరెండర్‌ అయిపోతుంది ''