17-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - గృహస్థ వ్యవహారములో ఉంటూ అందరితో సంబంధాన్ని నిభాయించాలి, అసహ్యించుకోరాదు, కాని కమల పుష్ప సమానంగా పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ''
ప్రశ్న :-
మీ విజయ ఢంకా ఎప్పుడు మ్రోగుతుంది ? వాహ్-వాహ్ అనగా ప్రసంశలు, పొగడ్తలు ఎప్పుడు వెలువడ్తాయి?
జవాబు :-
అంతిమ సమయములో పిల్లలైన మీ పై మాయ గ్రహచారము కూర్చోవడం ఎప్పుడు సమాప్తమవుతుందో సదా లైను క్లియర్గా ఉంటుందో, అప్పుడు వాహ్-వాహ్ అని ప్రశంసలు వెలువడ్తాయి. విజయ ఢంకా మ్రోగుతుంది. ఇప్పుడైతే పిల్లలైన మీ పై గ్రహచారము కూర్చుంటుంది. విఘ్నాలు వస్తూ ఉంటాయి. సేవ కొరకు మూడు అడుగుల నేల కూడా అతికష్టంగా దొరుకుతుంది. కాని మీరు పూర్తి విశ్వానికంతా అధిపతులయ్యే రోజు కూడా వస్తుంది.
పాట :-
ధీరజ్ ధర్ మనువా, ధీరజ్ ధర్,...........( ధైర్యము వహించు మనసా, ధైర్యము వహించు,.........) 
ఓంశాంతి.
ఇప్పుడు పాత నాటకము పూర్తయిందని పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారము తెలుసు. ఈ దు:ఖ రోజులు ఇక కొన్ని ఘడియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తర్వాత సుఖమే సుఖము ఉంటుంది. సుఖాన్ని చవి చూసినప్పుడు, దీనికి దు:ఖధామానికి ఎంతో వ్యత్యాసముందని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సుఖము కొరకు పురుషార్థము చేస్తున్నారు. ఈ పురాతన దు:ఖభరిత నాటకము పూర్తయ్యింది, సుఖము కొరకు తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తున్నామని అర్థమయ్యింది. ఈ విషయం ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభము. ఇప్పుడు బాబా వద్దకు వెళ్లాలి. ఆ తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సంబంధాలను తప్పకుండా నిభాయించాలి. అలా నిభాయించకుంటే సన్యాసుల వలె అయిపోతారు. వారు సంబంధాలను నిభాయించరు, కనుక వారిది నివృత్తి మార్గమని, హఠయోగమని అంటారు. సన్యాసులు నేర్పించేది హఠయోగము. మనము భగవంతుని ద్వారా రాజయోగము నేర్చుకుంటున్నాము. భారతదేశపు ధర్మశాస్త్రము గీత. ఇతరుల ధర్మశాస్త్రాలతో మనకు సంబంధము లేదు. సన్యాసులు ప్రవృత్తి మార్గము వారు కాదు. వారిది హఠయోగము. ఇల్లు-వాకిలి వదిలి అడవులలో కూర్చుండిపోతారు. జన్మ-జన్మలు వారు సన్యసించవలసి ఉంటుంది. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ ఒక్కసారి సన్యాసము చేస్తారు. దాని ప్రాలబ్ధము 21 జన్మలకు పొందుతారు. వారిది హద్దు(పరిమిత) సన్యాసము, హఠయోగము. మీది అనంతమైన సన్యాసము, రాజయోగము. వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు. రాజయోగానికి చాలా మహిమ ఉంది. భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన వారిని భగవంతుడని అంటారు. శ్రీ కృష్ణుడైతే భగవంతునిగా అవ్వజాలడు. అనంతమైన తండ్రి నిరాకారులు. అనంతమైన చక్రవర్తి పదవిని వారే ఇవ్వగలరు. ఇక్కడ గృహస్థ వ్యవహారాన్ని అసహ్యించుకోరు. ఈ అంతిమ జన్మ గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. పతిత పావనులని ఏ సన్యాసులనూ అనరు. సన్యాసులు కూడా '' ఓ పతిత పావనా! రండి'' అని గానము చేస్తారు. వారిని స్మృతి చేస్తారు. వారు కూడా పావన ప్రపంచము కావాలని కోరుతారు. కాని ఆ ప్రపంచము వేరే అని వారికి తెలియదు. గృహస్థ వ్యవహారాన్ని త్యజించినందున దేవతలను కూడా గౌరవించరు, అంగీకరించరు. వారు ఎప్పుడూ రాజయోగమును నేర్పించలేరు. తండ్రి హఠయోగాన్ని ఎప్పుడూ నేర్పించలేరు. అలాగే సన్యాసులు రాజయోగాన్ని ఎప్పుడూ నేర్పించలేరు. ఇది అర్థము చేసుకునే విషయము.
ఇప్పుడు ఢిల్లీలో విశ్వ సమ్మేళనము జరుగుతుంది. వారికి అర్థము చేయించాలి - వ్రాత పూర్వకంగా అందరికీ ఇవ్వాలి. అక్కడ అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. వ్రాత పూర్వకంగా ఉంటే మీ ఉద్ధేశ్యము ఏమిటో గ్రహిస్తారు.
మనము బ్రాహ్మణుల కులానికి చెందినవారమని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. మరి శూద్ర కులములోని సభ్యులుగా ఎలా అవ్వగలము లేక వికారి కులములో మనలను మనము ఎలా నమోదు(రిజిస్టరు) చేసుకోగలము? కనుక మనము తిరస్కరిస్తాము. మనము ఆస్తికులము. వారు నాస్తికులు. వారు ఈశ్వరుని విశ్వసించరు. మనము ఈశ్వరునితో యోగము జోడించేవారము. అభిప్రాయ బేధాలు వస్తాయి. తండ్రిని గురించి తెలియనివారు నాస్తికులని అర్థము చేసుకోబడ్తుంది. కావున తండ్రియే వచ్చి ఆస్తికులుగా చేస్తారు. తండ్రివారిగా అవ్వడం ద్వారా తండ్రి వారసత్వము లభిస్తుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు. మొట్టమొదట గీతా భగవానుడు పరమపిత పరమాత్మ అని బుద్ధిలో కూర్చోబెట్టాలి. వారే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారు. భారత ఖండపు దేవీ దేవతా ధర్మమే ముఖ్యమైనది. భారతఖండానికి ఏదో ఒక ధర్మముండాలి కదా. తమ ధర్మాన్నే మర్చిపోయారు. డ్రామానుసారము భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోవాలని కూడా మీకు తెలుసు. అప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. లేకుంటే తండ్రి ఎలా రాగలరు? ఎప్పుడెప్పుడు దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోతుందో అప్పుడు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. తప్పకుండా ప్రాయ: లోపమవ్వనే అవ్వాలి. ఎద్దు యొక్క ఒక కాలు విరిగిపోయిందని, మిగిలిన మూడు కాళ్ల పై నిలిచి ఉందని అంటారు. కనుక ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. ఇప్పుడు దేవతా ధర్మపు కాలు విరిగిపోయింది. అంటే ఆ ధర్మము అదృశ్యమైపోయింది. అందుకే మర్రి వృక్షాన్ని ఉదాహరణగా ఇచ్చి దాని పునాది కుళ్ళిపోయిందని చెప్తారు. మిగిలిన కొమ్మ-రెమ్మలు ఎన్నో నిలిచి ఉన్నాయి. ఇందులో కూడా పునాది అయిన దేవతా ధర్మము లేనే లేదు. పోతే పూర్తి ప్రపంచములో ఎన్నో మఠాలు, మార్గాలు ఆచార సంప్రదాయాలున్నాయి! ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి ప్రకాశముంది. తండ్రి అంటున్నారు - పిల్లలైన మీరు ఈ డ్రామాను తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పూర్తి వృక్షమంతా పాతదైపోయింది. కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుంది. చక్రము తప్పకుండా తిరగాలి. ఇప్పుడు నాటకము పూర్తయ్యింది. మనము వెళ్తున్నామని బుద్ధిలో ఉంచుకోవాలి. నడుస్తూ-తిరుగుతూ-లేస్తూ-కూర్చుంటూ, మనమిప్పుడు వాపస్ వెళ్లాలని బుద్ధిలో గుర్తుండాలి. మన్మనాభవ, మధ్యాజీభవ అర్థమే ఇది. ఏదైనా పెద్ద సభలలో ఉపన్యసించాలంటే ఇదే అర్థం చేయించాలి - పరమపిత పరమాత్మ మళ్లీ చెప్తున్నారు - ఓ పిల్లలూ! దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ త్యాగము చేసి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానంగా అయ్యి నన్ను స్మృతి చేయండి. పవిత్రంగా ఉండండి. జ్ఞానాన్ని ధారణ చేయండి. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. సత్యయుగములో దేవతలు సద్గతిలో ఉండేవారు. ఇప్పుడు మళ్లీ తండ్రియే వచ్చి సద్గతిని ఇస్తారు. సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు......... ఇవి సద్గతి లక్షణాలు. ఇవి ఎవరు ఇస్తారు? తండ్రి. మరి వారి లక్షణాలేవి? వారు జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు. వారి మహిమ పూర్తిగా అతీతమైనది(వేరుగా ఉంటుంది). అందరూ ఒక్కటే అని కాదు. ఆత్మలందరూ ఒకే తండ్రి పిల్లలు. ప్రజాపితకు కూడా సంతానంగా అవుతారు. ఇప్పుడు నూతన రచన రచింపబడ్తుంది. అందరూ ప్రజాపిత సంతానమే కాని వారికి ఈ విషయాలు తెలియవు. బ్రాహ్మణ వర్ణము అన్నిటికంటే ఉన్నతమైనది. భారతదేశములోనే వర్ణాలు మహిమ చేయబడ్తాయి. 84 జన్మలను తీసుకోవడంలో ఈ వర్ణాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. బ్రాహ్మణ వర్ణము సంగమ యుగములోనే ఉంటుంది.
పిల్లలైన మీరిప్పుడు మధురమైన సైలెన్స్లో(శాంతిలో) ఉంటారు. ఈ శాంతి అన్నిటికంటే మంచిది. వాస్తవానికి శాంతిహారమైతే మెడలో ధరింపబడి ఉంది. శాంతిధామానికి వెళ్లాలని అందరూ ఇష్టపడ్తారు. కాని అందుకు మార్గాన్ని తెలియచేసేవారెవరు? శాంతిసాగరులు తప్ప ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. వారు శాంతిసాగరులు, జ్ఞానసాగరులని వారి బిరుదులు(టైటిల్స్) చాలా బాగున్నాయి. శ్రీ కృష్ణుడైతే స్వర్గములోని రాకుమారుడు. వారు(తండ్రి) మనుష్య సృష్టికి బీజరూపులు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. కృష్ణుడిని సృష్టికి బీజరూపుడని చెప్పలేము. సర్వవ్యాపి జ్ఞానమైతే నిలువజాలదు. తండ్రి మహిమ తండ్రిదే. వారు సదా పూజ్యులు. ఎప్పుడూ పూజారిగా అవ్వరు. పై నుండి మొదట ఎవరైతే వస్తారో, వారు పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. అనేక పాయింట్లు అర్థము చేయించబడ్తాయి. ప్రదర్శనీలకు ఎంతోమంది వస్తారు. కాని లక్ష్యము చాలా గొప్పదైనందున కోటిలో ఏ ఒక్కరో వెలువడ్తారు. ప్రజలైతే అనేకమంది తయారౌతూ ఉంటారు. కాని మాలలో మణిగా అయ్యేవారు కోటిలో ఏ ఒక్కరో వస్తారు. నారదుని ఉదాహరణలో కూడా నీ ముఖాన్ని చూచుకో - లక్ష్మిని వరించేందుకు యోగ్యముగా ఉందా? అని చెప్పబడ్తుంది. ప్రజలైతే చాలామంది తయారవ్వాలి. రాజు, రాజే. ఒక్కొక్క రాజుకు లక్షలమంది ప్రజలుంటారు. పురుషార్థమైతే శ్రేష్ఠంగా చేయాలి. రాజులలో కూడా కొందరు పెద్ద రాజులు, కొందరు చిన్న రాజులు ఉంటారు. భారతదేశములో ఎంతోమంది రాజులు ఉండేవారు. సత్యయుగములో కూడా చాలా మంది మహారాజులుంటారు. ఇది సత్యయుగము నుండి కొనసాగుతూ వచ్చింది. మహారాజుల వద్ద చాలా ఆస్తి ఉంటుంది. రాజుల వద్ద తక్కువగా ఉంటుంది. ఇది లక్ష్మీనారాయణులుగా తయారయ్యే జ్ఞానము. దాని కొరకే పురుషార్థము నడుస్తుంది. లక్ష్మీనారాయణుల పదవిని పొందుతారా? లేక సీతా-రాముల పదవిని పొందుతారా? అని ప్రశ్నిస్తే మేము లక్ష్మీనారాయణుల పదవియే పొందుకుంటామని, తల్లిదండ్రుల నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటామని చెప్తారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. వేరే ఏ ఇతర స్థానాలలో కానీ శాస్త్రాలలో కానీ ఈ విషయాలు లేవు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది. నడుస్తూ - తిరుగుతూ మేము పాత్రధారులము, ఇప్పుడిక వాపస్ వెళ్లాలని భావించండి. ఇది గుర్తుండాలి. దీనినే మన్మనాభవ, మధ్యాజీభవ అని అంటారు. నేను మిమ్ములను వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా పదే పదే స్మృతినిప్పిస్తారు. ఇది ఆత్మికయాత్ర. ఈ యాత్ర బాబా తప్ప ఇతరులెవ్వరూ చేయించలేరు. భారతదేశాన్ని కూడా చాలా మహిమ చేయాలి. ఈ భారతదేశము అత్యంత పవిత్రమైన భూమి. సర్వుల దు:ఖహర్త-సుఖకర్త, సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. వారి జన్మ స్థలము భారతఖండము. ఆ తండ్రి సర్వుల ముక్తిదాత. వారి అత్యంత పెద్ద తీర్థ స్థానాలు భారతదేశములో ఉన్నాయి. భారతవాసులు భలే శివుని మందిరాలకు వెళ్తారు కానీ వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. గాంధీగారు చాలా మంచివారని భావించి వారికి పుష్పాలు మొదలైనవి అర్పిస్తారు. లక్షలు ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఈ సమయములో వారి రాజ్యమే ఉంది. ఏది కావాలనుకుంటే అది చేయవచ్చు. ఇక్కడ తండ్రి కూర్చొని గుప్తంగా ధర్మస్థాపన చేస్తున్నారు. ఈ రాజ్యమే వేరు. భారతదేశములో మొట్టమొదట దేవతల రాజ్యముండేది. అసురులు మరియు దేవతల మధ్య యుద్ధము జరిగినట్లు చూపిస్తారు. కాని అలాంటి విషయమేదీ లేదు. ఇక్కడ యుద్ధ మైదానములో మాయ పై విజయాన్ని పొందుతారు. మాయ పై విజయాన్ని తప్పకుండా సర్వశక్తివంతుడే కలిగిస్తాడు. కృష్ణుని సర్వ శక్తివంతుడని అనరు. బాబాయే రావణరాజ్యము నుండి విడిపించి రామరాజ్య స్థాపన చేయిస్తున్నారు. పోతే అక్కడ యుద్ధాలు మొదలైన విషయాలేవీ ఉండవు. ఇప్పుడు గమనిస్తే ఈ పొందవచ్చు. కాని వారు విశ్వానికి అధిపతులుగా అయ్యే నియమము లేదు. ఈ రహస్యము మీకు మాత్రమే తెలుసు. ఈ సమయములో సర్వశక్తివంతమైన రాజధాని క్రైస్తవులది. లేకుంటే వీరు చివరిలో వచ్చినందున వీరి సంఖ్య తక్కువగా ఉండాలి. కాని 3 ధర్మాలలో ఈ ధర్మము(క్రిష్టియన్ ధర్మము) అత్యంత శక్తివంతమైనది. అందరినీ గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు. ఇది కూడా తయారైన డ్రామాయే. వీరి నుండే మళ్లీ మనకు రాజధాని లభిస్తుంది. రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో కోతికి వెన్న లభించిందని కథ కూడా ఉంది. కనుక వారు పరస్పరములో కొట్లాడుకుంటారు. మధ్యలో వెన్న భారతవాసులకు లభిస్తుంది. కథ అయితే పైస విలువదే కానీ అర్థము ఎంతో గొప్పది. మనుష్యులు ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారు! పాత్రధారులుగా ఉండి కూడా డ్రామాను గురించి తెలియదు. బుద్ధిహీనులుగా ఉన్నారు. పేదవారే బాగా అర్థము చేసుకుంటారు. ధనవంతులు ఏమీ అర్థము చేసుకోరు. పేదలపెన్నిధి, పతితపావనులని తండ్రికి గాయనముంది. వారిప్పుడు ప్రాక్టికల్గా(వాస్తవంగా) పాత్రను అభినయిస్తున్నారు. ఇదంతా మీరు పెద్ద పెద్ద సభలలో అర్థం చేయించాలి. నెమ్మది నెమ్మదిగా ప్రశంసలు వెలువడ్తాయని వివేకం చెప్తుంది. చివరి క్షణాలలో ఢంకా మ్రోగుతుంది. ఇప్పుడైతే పిల్లల పై గ్రహచారము కూర్చొని ఉంది. బుద్ధి లైను స్పష్టంగా లేదు. విఘ్నాలు వస్తూ ఉంటాయి. అవి కూడా డ్రామానుసారంగా వస్తూ ఉంటాయి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. పాండవులకు మూడడుగుల భూమి కూడా లభించలేదనే మహిమ ఈ సమయానికి చెందినదే. వారే మళ్లీ విశ్వానికి అధిపతులుగా అయ్యారని ఎవ్వరికీ తెలియదు. ఇందులో దు:ఖించరాదని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది. డ్రామా పట్టాల పైన నిలబడాలి, కదలరాదు. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది. మనము సుఖధామానికి వెళ్లిపోతాము. శ్రేష్ఠ పదవిని పొందే విధంగా చదువును చదవాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నడుస్తూ - తిరుగుతూ స్వయాన్ని పాత్రధారిగా భావించాలి. డ్రామా పట్టాల పైన అచలంగా ఉండాలి. ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్లాలి, యాత్రలో ఉన్నామని బుద్ధిలో గుర్తుండాలి.
2. సద్గతి యొక్క(సత్యయుగానికి చెందిన) సర్వ లక్షణాలను స్వయంలో ధారణ చేయాలి. సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి.
వరదానము :-
'' సహయోగమివ్వాలనే శుభ భావన ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేసే మాస్టర్ దాతా భవ ''
ప్రకృతి తన వాయుమండల ప్రభావాన్ని - ఒకసారి ఉడుకు(వేడి), ఒకసారి చలిని అనుభవం చేయిస్తుంది. ఇలా ప్రకృతిజీతులైన మీరు సదా సహయోగి, సహజయోగి ఆత్మలు తమ శుభ భావనల ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేయడంలో సహయోగులుగా అవ్వండి. వారు ఇలా ఉన్నారు, ఇలా చేస్తారని ఆలోచించకండి. ఎటువంటి వాయుమండలమైనా, ఎటువంటి వ్యక్తి అయినా నేను సహయోగమివ్వాలి అనే భావముండాలి. దాత పిల్లలు సదా ఇస్తూనే ఉంటారు. కనుక మనసు ద్వారానైనా సహయోగులుగా అవ్వండి, వాచా ద్వారా అయినా, సంబంధ-సంపర్కము ద్వారా అయినా సహయోగులుగా అవ్వండి కాని తప్పకుండా సహయోగులుగా అవ్వాలనే లక్ష్యముండాలి.
స్లోగన్ :-
''ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితి ద్వారా అందరి కోరికలను పూర్తి చేయడమే కామధేనువుగా అవ్వడం ''