05-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా మీ తనువు-మనస్సు-ధనాలను భీమా(ఇన్‌ష్యూరెన్స్‌) చేయండి. ఈ సమయములోనే ఈ బేహద్‌ ఇన్‌ష్యూరెన్స్‌ జరుగుతుంది. ''

ప్రశ్న :-

పరస్పరం ఏ స్మృతిని ఇప్పించుకుంటూ ఉన్నతిని పొందాలి ?

జవాబు :-

ఇప్పుడు నాటకము పూర్తి అయ్యింది, వాపస్‌ ఇంటికి వెళ్ళాలి - అని ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోండి. అనేక మార్లు ఈ పాత్రను అభినయించాము. 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు శరీర రూపీ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తాము అన్న స్మృతిని ఒకరికొకరు ఇప్పించుకోండి. ఇదే ఆత్మిక సమాజ సేవకులైన మీ సేవ. మీరు ఆత్మిక సమాజ సేవకులు. అందరికీ దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి తండ్రి మరియు ఇంటిని తలంపు చేయండి అన్న సందేశాన్ని ఇస్తూ ఉండండి.

పాట :-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి,............. (ఛోడ్‌ భీ దే ఆకాశ్‌ సింగాసన్‌,................)   

ఓంశాంతి.

ఎక్కడైతే గీతా పాఠశాలలుంటాయో అక్కడ తరచుగా ఈ పాట పాడుతూ ఉంటారు. గీతను వినిపించేవారు మొదట ఈ పాటను పాడ్తారు. కాని ఎవరిని పిలుస్తున్నారో వారికి తెలియదు. ఇది ధర్మగ్లాని సమయము. మొదట ప్రార్థన చేస్తారు. తర్వాత రండి, పాపాలు చాలా పెరిగి పోయాయి, వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు. అప్పుడు వారు(బాబా) అవును, వస్తానని జవాబునిస్తారు. ఎప్పుడైతే భారతవాసులు పాపాత్మలుగా, దు:ఖితులుగా అవుతారో, ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. స్వరూపము మార్చుకోవలసి పడ్తుంది. తప్పకుండా మనుష్య శరీరములోనే వస్తారు. రూపాన్ని అయితే ఆత్మలందరూ మార్చుకుంటారు. ఆత్మలైన మీరు నిజానికి నిరాకారులు. మళ్లీ ఇక్కడకు వచ్చి సాకారులుగా అవుతారు. మనుష్యులుగా పిలువబడ్తారు. ఇప్పుడు మనుష్యులు పాపాత్మలుగా, పతితులుగా అయినందున నేను కూడా నా రూపాన్ని రచించవలసి వచ్చింది. ఎలా మీరు నిరాకారుల నుండి సాకారులైనారో అలాగే నేను కూడా అవ్వవలసి ఉంటుంది. ఈ పతిత ప్రపంచములోకి శ్రీ కృష్ణుడు రాజాలడు. అతడు స్వర్గానికి యజమాని. శ్రీ కృష్ణుడు గీతను వినిపించాడని అంటారు. కాని కృష్ణుడైతే పతిత ప్రపంచములో ఉండేందుకు వీలు లేదు. అతని నామ, రూప, దేశ, కాల, కర్తవ్యాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ విషయాలు తండ్రి అర్థము చేయిస్తున్నారు - కృష్ణునికైతే తన తల్లిదండ్రులున్నారు. అతడు తన తల్లి గర్భము నుండి ఆ రూపాన్ని పొందాడు. నేనైతే గర్భములోకి వెళ్ళను. నాకు రథము తప్పకుండా కావాలి. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. మొదటి నెంబరు శ్రీ కృష్ణుని జన్మ. ఇతని అనేక జన్మల చివరి జన్మ ఈ 84వ జన్మ. కావున నేను ఇతనిలోనే వస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. నాకు నా జన్మల గురించి తెలియదని శ్రీ కృష్ణుడైతే అనడు కదా. నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతనికి తన జన్మల గురించి తెలియదని నాకు తెలుసునని భగవంతుడు అంటారు. కృష్ణుడు రాజధానికి అధిపతి. సత్యయుగములో సూర్యవంశ రాజ్యము, విష్ణుపురి ఉంటుంది. లక్ష్మీనారాయణులను విష్ణువు అని అంటారు. ఎక్కడ ఉపన్యసించినా ఈ ఒక్క పాట(రికార్డు) చాలు. ఎందుకంటే భారతవాసులు స్వయంగా ఈ పాటను పాడ్తారు. ధర్మము ప్రాయ: లోపమైనప్పుడు నేను వచ్చి గీతను వినిపిస్తాను. అదే ధర్మాన్ని మళ్లీ స్థాపన చేస్తాను. ఆ ధర్మానికి చెందిన వారెవ్వరూ లేరు కనుక వారు ఎవ్వరూ లేనప్పుడు గీతా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చింది? సత్య, త్రేతా యుగాలలో ఏ శాస్త్రాలు మొదలైనవి ఉండవని తండ్రి అర్థము చేయించారు. ఇవన్నీ భక్తిమార్గములోని సామాగ్రి. వీటి ద్వారా ఎవ్వరూ నన్ను కలుసుకోలేరు. నేను రావలసి పడ్తుంది. నేను వచ్చి అందరికీ గతి ద్వారా సద్గతినిస్తాను. అందరూ వాపస్‌ వెళ్ళవలసి ఉంటుంది. గతిలోకి వెళ్ళి ఆ తర్వాత స్వర్గములోకి రావాలి. ముక్తిలోకి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి రావాలి. ఒక్క క్షణములో జీవన్ముక్తి లభించగలదని తండ్రి చెప్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటున్నా ఒక్క క్షణములో జీవన్ముక్తులు అంటే దు:ఖ రహితులని గాయనము చేయబడింది. సన్యాసులైతే జీవన్ముక్తులుగా చేయలేరు. వారు జీవన్ముక్తిని అసలు అంగీకరించరు. ఈ సన్యాసుల ధర్మమైతే సత్యయుగములో ఉండనే ఉండదు. సన్యాస ధర్మము తర్వాత వస్తుంది. ఇస్లామీయులు, బౌద్ధులు వీరంతా సత్యయుగములోకి రారు. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి. కాని దేవీ దేవతా ధర్మము లేదు. వారంతా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు. తమ ధర్మము గురించే వారికి తెలియదు. ఎవ్వరూ తమను తాము దేవీ దేవతా ధర్మము వారమని అనుకోవడం లేదు. జైహింద్‌ అని అంటారు. ఇప్పుడసలు విజయము(జై) లేనే లేదు. భారత విజయము మరియు భారత ఓటమి ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రాజ్యభాగ్యము లభించినప్పుడు భారతదేశానికి విజయము కలుగుతుంది. అప్పుడే పాత ప్రపంచము వినాశనమవుతుంది. ఓడించేది రావణుడు. విజయము కలుగజేసేది రాముడు. '' జై భారత్‌ '' అని అంటారు. '' జై హింద్‌ '' అని అనరు. పదాలను మార్చేశారు. గీతలో మంచి మంచి పదాలున్నాయి.

భగవంతుడు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. నాకు ఏ తల్లి-తండ్రులు లేరని అంటారు. నా రూపాన్ని నేనే తయారు చేసుకోవలసి పడ్తుంది. నేను ఇతనిలో(బ్రహ్మలో) ప్రవేశము చేస్తానని వారు అంటున్నారు. కృష్ణునికి తన తల్లి జన్మనిచ్చింది. తండ్రి చెప్తున్నారు - నేను రచయితను. ఈ శాస్త్రాలన్నీ భక్తిమార్గము కొరకు డ్రామానుసారంగా తయారు చేయబడ్డాయి. ఈ గీత, భాగవతము మొదలైనవన్నీ దేవతా ధర్మము పైననే తయారు చేయబడినవి. తండ్రి ఏదైతే దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారో అది ఇప్పుడు గడిచిపోయింది. మళ్లీ భవిష్యత్తులో ఉంటుంది. ఆదిమధ్యాంతాలను భూత, వర్తమాన, భవిష్య కాలాలని అంటారు. ఇక్కడ ఆదిమధ్యాంతాల అర్థము వేరెే. ఏదైతే జరిగిపోయిందో, అదే మళ్లీ వర్తమానంగా అవుతుంది. భూతకాలపు ఏ కథలు వింటూ ఉంటామో అవన్నీ మళ్లీ భవిష్యత్తులో పునరావృతమౌతాయి. ఈ మాటలను మనుష్యులు అర్థము చేసుకోలేరు. గడచిపోయిన కథలను బాబా వర్తమానములో వినిపిస్తారు. అవే భవిష్యత్తులో మళ్లీ పునరావృతమవుతాయి. ఇది అర్థము చేసుకునేందుకు చాలా స్వచ్ఛమైన బుద్ధి ఉండాలి. ఎక్కడకైనా మిమ్ములను ఆహ్వానించినట్లయితే పిల్లలు వెళ్ళి భాషణ చెయ్యాలి. పిల్లలు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. తమ తండ్రి ఎవరో పిల్లలు తెలుపుతారు. తండ్రి అయితే తప్పకుండా కావాలి. తండ్రి లేరంటే వారసత్వము ఎలా తీసుకుంటారు? పిల్లలైన మీరు చాలా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. కాని గొప్ప వ్యక్తులకు కూడా గౌరవమివ్వవలసి ఉంటుంది. మీరు అందరికి తండ్రి పరిచయమును ఇవ్వాలి. అందరూ గాడ్‌ఫాదర్‌ను పిలుస్తారు. ఓ గాడ్‌ఫాదర్‌ రండి అని ప్రార్థన చేస్తారు. కాని వారెవరు? మీరు శివబాబాను, శ్రీ కృష్ణుని కూడా మహిమ చేయాలి. భారతదేశమును కూడా మహిమ చేయాలి. భారతదేశము శివాలయము, స్వర్గముగా ఉండేది. 5 వేల సంవత్సరాల ముందు దేవీ దేవతల రాజ్యముండేది. దానిని ఎవరు స్థాపన చేశారు? తప్పకుండా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన భగవంతుడే. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన నిరాకార పరమపిత పరమాత్మను శివాయ నమ: అని అంటారు. కాని భారతవాసులు శివజయంతిని ఆచరిస్తారు. కాని శివుడు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా స్వర్గానికి ముందు సంగమ యుగములో వచ్చి ఉంటారు. తండ్రి అంటున్నారు - కల్ప-కల్పము కల్పపు సంగమ యుగములో నేను వస్తాను. అంతేకాని ప్రతి యుగములో రాను. ఒకవేళ ప్రతి యుగములో అని చెప్పినా నాలుగు అవతారాలు మాత్రమే ఉండాలి. వారైతే ఎన్ని అవతారాలు చూపించారు? శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే స్వర్గ రచయిత. భారతదేశమే స్వర్గముగా ఉండేది. నిర్వికారిగా ఉండేది. మళ్లీ అక్కడ ఎలా జన్మ తీసుకుంటారు అనే ప్రశ్న రాకూడదు. అక్కడ ఏ నియమము, పద్ధతులున్నాయో అవే జరుగుతాయి. మీరు వాటి గురించి ఎందుకు చింత చేస్తారు? మొదట మీరు తండ్రిని తెలుసుకోండి. అక్కడ ఆత్మ జ్ఞానముంటుంది. మనము ఆత్మలము, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాము. అందులో దు:ఖించే మాటే లేదు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువే ఉండదు. సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. రూపాన్ని మార్చుకొని ఎలా వస్తారో తండ్రి అర్థం చేయించారు. కృష్ణుని గురించి అలా అనరు. అతడు గర్భము ద్వారా జన్మ తీసుకుంటాడు. బ్రహ్మ-విష్ణు-శంకరులు సూక్ష్మ వతనవాసులు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి. మనము వారి సంతానము. ఆ నిరాకార తండ్రి అవినాశి. ఆత్మలమైన మనము కూడా అవినాశియే. కాని మనము తప్పకుండా పునర్జన్మలలోకి రావాలి. ఇది తయారైన డ్రామా. మళ్లీ వచ్చి గీతా జ్ఞానము వినిపించమని అంటారు. అందరూ చక్రములోకి తప్పకుండా వస్తారు. తండ్రి కూడా ఒకప్పుడు వచ్చి వెళ్ళినవారే, మళ్లీ ఇప్పుడు వచ్చారు. మళ్లీ వచ్చి గీతా జ్ఞానము వినిపిస్తానని అంటున్నారు. పతితపావనా! రండి అని పిలుస్తారు. అంటే ఇది తప్పకుండా పతిత ప్రపంచమే కదా. అందరూ పతితులుగానే ఉన్నారు. ఆ పాపాలను పోగొట్టుకునేందుకు గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. స్వర్గములో ఈ భారతదేశమే ఉండేది. భారతదేశము ఉన్నతమైన(శ్రేష్ఠమైన) అవినాశి ఖండము. అందరికీ తీర్థ స్థానము. మానవులందరూ పతితులుగా ఉన్నారు. అందరికీ జీవన్ముక్తినిచ్చేవారు ఆ తండ్రియే. ఎవరైతే ఇంత గొప్ప సర్వీసు చేస్తారో వారి మహిమ తప్పకుండా గాయనము చేయాలి కదా. అవినాశి తండ్రి జన్మ స్థానము భారతదేశము. వారే అందరినీ పావనంగా చేస్తారు. వారు తమ జన్మ స్థానాన్ని వదిలి ఇంకెక్కడికీ వెళ్ళరు. కనుక తండ్రి కూర్చొని తాను ఏ విధంగా రూపాన్ని రచిస్తారో అర్థము చేయిస్తారు.

అంతా ధారణ పైననే ఆధారపడి ఉంది. ధారణ అనుసారమే పిల్లలైన మీ పదవి ఉంటుంది. అందరి మురళీ ఒకే విధంగా ఉండజాలదు. వెదురు మురళిని అందరూ వాయిస్తారు. అందరూ ఒకే విధంగా మ్రోగించలేరు. ప్రతి పాత్రధారుల పాత్ర వేరుగా ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది! నేను కూడా పాత్రధారినే అని పరమాత్మ కూడా చెప్తున్నారు. ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. భక్తిమార్గములో కూడా నేనే ఇస్తాను. ఈశ్వరార్థముగా దాన-పుణ్యాలు చేస్తారు. ఆ ఫలితాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తారు. అందరూ స్వయానికి ఇన్‌ష్యూర్‌ చేసుకుంటారు. దీని ఫలితము మరుసటి జన్మలో లభిస్తుందని వారికి తెలుసు. మీరు 21 జన్మలకు భీమా చేసుకుంటారు. అయితే అది హద్దు భీమా, పరోక్షముగా చేసుకునేది. ఇది బేహద్‌ ఇన్‌ష్యూరెన్స్‌ డైరెక్ట్టుగా(ప్రత్యక్షముగా) చేసుకునేది. మీరు తనువు-మనసు-ధనముల ద్వారా స్వయాన్ని భీమా చేసుకుంటారు. తర్వాత లెక్కలేనంత ధనాన్ని పొందుతారు. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. మీరు నేరుగా భీమా చేస్తున్నారు. మానవులు ఈశ్వరార్థము దానము చేస్తారు. ఈశ్వరుడు ఇస్తాడని భావిస్తారు. అయితే ఎలా ఇప్పిస్తారో వారికి తెలియదు. ఏదైతే లభిస్తుందో అదంతా ఈశ్వరుడే ఇచ్చాడని మానవులు భావిస్తారు. ఈశ్వరుడే కొడుకునిచ్చారు అని అంటారు. అచ్ఛా, ఇచ్చినవారు మళ్లీ తీసుకుంటారు. అందరూ తప్పకుండా మరణించాలి. జతలో ఏదీ వెళ్ళదు. ఈ శరీరము కూడా సమాప్తమవుతుంది. కావున ఇప్పుడు ఏదైతే భీమా చేసుకుంటారో అది చేయండి. అదే మళ్లీ 21 జన్మలకు భీమాగా అవుతుంది. అలాగని భీమా చేసుకొని సర్వీసేమీ చేయకుండా తింటూ ఉండమని కూడా కాదు. సర్వీసైతే చేయాలి కదా. మీ ఖర్చు కూడా నడుస్తుంది కదా. భీమా చేసుకొని తింటూ ఉంటే ఏమీ లభించదు. ఎప్పుడైతే సర్వీసు చేస్తారో అప్పుడు శేష్ఠ పదవిని కూడా పొందుతారు. ఎవరెంత ఎక్కువ సర్వీసు చేస్తారో అంత ఎక్కువ లభిస్తుంది. సర్వీసు కొద్దిగా చేసినట్లయితే కొద్దిగానే లభిస్తుంది. ప్రభుత్వ సమాజ సేవకులు కూడా నెంబరువారుగా ఉంటారు. వారి పైన పెద్ద పెద్ద హెడ్స్‌ ఉంటారు. అనేక ప్రకారాల సమాజ సేవకులు ఉన్నారు. అయితే వారిది దేహ సంబంధమైన సేవ. మీది ఆత్మిక సర్వీసు. ప్రతి ఒక్కరిని మీరు యాత్రికులుగా చేస్తారు. ఇది తండ్రి వద్దకు వెళ్లే ఆత్మికయాత్ర. తండ్రి చెప్తున్నారు - దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను, గురువులను, గోసాయిలు మొదలైన వారిని కూడా వదిలేసి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. పరమపిత పరమాత్మ నిరాకారులు. సాకార రూపాన్ని ధారణ చేసి అర్థము చేయిస్తున్నారు. నేను లోనుగా తీసుకుంటాను. ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని వారు చెప్తారు. మీరు కూడా నగ్నంగా వచ్చారు. ఇప్పుడు అందరూ వాపస్‌ వెళ్ళాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని అన్ని ధర్మాల వారికి చెప్తారు. యాదవులు, కౌరవులు సమాప్తమైపోతారు. మిగిలిన పాండవులు మళ్లీ వచ్చి రాజ్యము చేస్తారు. ఈ గీతాధ్యాయము మళ్లీ పునరావృతమౌతూ ఉంది. పాత ప్రపంచము వినాశనమవుతుంది. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇది పాతదిగా అయిపోయింది. 84 జన్మలు పూర్తి అయిపోయాయి. నాటకము పూర్తి అయ్యింది. ఇప్పుడు వాపస్‌ వెళ్ళాలి. శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్లిపోతాము. ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్ళాలని పరస్పరము స్మృతినిప్పించుకుంటూ ఉంటారు. అనేకసార్లు ఈ 84 జన్మల పాత్ర చేశాము. ఈ నాటకము అనాదిగా తయారయ్యింది. ఎవరెవరు ఏ ఏ ధర్మాల వారుగా ఉంటారో వారు వారి వారి సెక్షన్లలోకి వెళ్ళాలి. దేవీ దేవతా ధర్మము ఏదైతే అదృశ్యమైపోయిందో దాని కొరకు అంటు కట్టబడ్తోంది. ఎవరైతే పుష్పాలుగా ఉంటారో వారు వచ్చేస్తారు. మంచి మంచి పుష్పాలు వచ్చేస్తాయి. మాయ తుఫాను వచ్చినట్లయితే మళ్లీ పడిపోతారు. మళ్లీ జ్ఞానమనే సంజీవనీ మూలిక లభిస్తూనే లేచి నిల్చుంటారు. మీరు శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇతనికి గురువులు మొదలైనవారు ఉండేవారని తండ్రి కూడా చెప్తున్నారు. గురువుల సహితంగా అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్కరే. ఒక సెకండులో ముక్తి-జీవన్ముక్తి. రాజా-రాణులదైతే ప్రవృత్తి మార్గము. నిర్వికారి ప్రవృత్తి మార్గముండేది. ఇప్పుడు సంపూర్ణ వికారిగా ఉంది. అక్కడ రావణరాజ్యము ఉండదు. రావణ రాజ్యము అర్ధకల్పము నుండి ప్రారంభమవుతుంది. భారతవాసులే రావణుని చేతిలో ఓడిపోతారు. మిగిలిన అన్ని ధర్మాలవారు వారి వారి సమయాలలో సతో, రజో, తమోలలోకి వస్తారు. మొదట సుఖములో ఉంటారు తర్వాత దు:ఖములోకి వస్తారు. ముక్తి తర్వాత జీవన్ముక్తి ఉండనే ఉంటుంది. ఈ సమయములో అందరూ తమోప్రధానంగా పతనావస్థలో ఉన్నారు. ప్రతి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్లీ మరో కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. తండ్రి చెప్తున్నారు - నేను జనన-మరణాలలోనికి రాను. నాకు తండ్రి ఎవ్వరూ లేరు. మిగిలిన అందరికీ తండ్రి ఉంటారు. కృష్ణుని జన్మ తల్లి గర్భము నుండే జరుగుతుంది. ఈ బ్రహ్మయే రాజ్యము తీసుకున్నప్పుడు గర్భము నుండి జన్మ తీసుకుంటాడు. ఇతడే పాత నుండి కొత్తగా అవుతాడు. 84 జన్మలు తీసుకున్న పురాతనమైనవాడు. కొంతమందికే అతికష్టముతో యదార్థముగా బుద్ధిలో కూర్చుంటుంది. నషా ఎక్కుతుంది. ఇది సువాసన ఇచ్చే కస్తూరి జ్ఞానము. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఆత్మిక సమాజ సేవకులుగా అయ్యి అందరికీ ఆత్మిక యాత్రను నేర్పించాలి. తమ దేవీ దేవతా ధర్మానికి అంటు కట్టాలి.

2. మీ స్వచ్ఛమైన(రిఫైన్‌/=వటఱఅవ) బుద్ధి ద్వారా తండ్రిని ప్రత్యక్షము చేయాలి. మొదట స్వయంలో ధారణ చేసి మళ్లీ ఇతరులకు వినిపించాలి.

వరదానము :-

'' అందరికి అమరమైన జ్ఞానమునిచ్చి అకాల మృత్యు భయము నుండి విడిపించే శక్తిశాలి సేవాధారీ భవ ''

ప్రపంచములో ఈ రోజులలో అకాలమృత్యు భయమే ఉంది. భయముతోనే తింటున్నారు, భయముతోనే నడుస్తున్నారు, నిదురిస్తున్నారు కూడా. ఇటువంటి ఆత్మలకు సంతోషము కలిగించే మాటలు వినిపించి భయము నుండి విడిపించండి. మేము మిమ్ములను 21 జన్మల వరకు అకాల మృత్యువు నుండి రక్షించగలము అని వారికి సంతోషము కలిగించే వార్తను వినిపించండి. ప్రతి ఆత్మకు అమర జ్ఞానమునిచ్చి అమరంగా చేయండి. తద్వారా వారు జన్మ-జన్మలకు అకాల మృత్యువు నుండి రక్షింపబడ్తారు. ఇలా మీ శాంతి, సుఖాల వైబ్రేషన్ల ద్వారా జనులకు సుఖ-శాంతులను అనుభూతి చేయించే శక్తిశాలి సేవాధారులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

'' స్మృతి మరియు సేవల బ్యాలెన్స్‌ ఉంచుట ద్వారానే అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి.''