29-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా చేయించాలి. పాస్‌ అయ్యేందుకు మాత - పితల సమానంగా అవ్వాలి. మీరు ఏది వింటారో, దానిని ఇతరులకు కూడా వినిపించాలి''

ప్రశ్న :-

పిల్లలకు ఏ శుభకామన ఉత్పన్నమవ్వడం కూడా మంచి పురుషార్థానికి గుర్తు ?

జవాబు :-

''మేము మాతా - పితలను అనుసరించి సింహాసనము పై కూర్చుంటాము'' - అనే శుభ కామన పిల్లలకు ఉన్నట్లయితే, అది కూడా ఎంతో మంచి ధైర్యమే. ''బాబా మేము పూర్తి పరీక్షను పాసవుతాము'' అని అనేవారు కూడా శుభం పలికేవారే. దీని కొరకు తప్పకుండా పురుషార్థము కూడా అంత తీవ్రముగా చేయాలి.

పాట :-

మా తీర్థ స్థానాలు భిన్నమైనవి,.................( హమారే తీర్థ్‌ న్యారే హై,...............)   

ఓంశాంతి.

ఇక్కడ అందరూ పాపాత్మలే. పుణ్యాత్మలు స్వర్గంలోనే ఉంటారు. ఇది పాపాత్మల ప్రపంచము. ఇక్కడ అజామిళుని వంటి పాపాత్మలు ఉన్నారు. అది స్వర్గ దేవత్మాల, పుణ్యాత్మల ప్రపంచము. ఇరువురి మహిమ వేరు వేరు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ జన్మ జీవనగాథను మేము ఇన్ని పాపాలు చేశామని బాబాకు వ్రాసి పంపుతారు. బాబా వద్ద అందరి జీవన కథలు ఉన్నాయి. ఇక్కడ విని, ఇతరులకు వినిపించాలని పిల్లలకు తెలుసు. మరి వినిపించేవారు ఎంతమంది ఉండాలి! ఎప్పటివరకైతే వినిపించేవారుగా అవ్వరో, అప్పటివరకూ పాసవ్వలేరు. ఇతర సత్సంగాలలో ఇలా విని, మళ్ళీ వినిపించాలనే బంధనము లేదు. ఇక్కడ ధారణ చేసి, ఇతరులచే చేయించాలి. అనుచరులను తయారు చేయాలి. అక్కడి వలె ఒకే పండితుడు కథ వినిపించడం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాతా-పితల సమానంగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్‌ అయ్యి బాబా హృదయం పైకి ఎక్కగలరు. జ్ఞానమును గూర్చే అర్థం చేయించబడ్తుంది. అక్కడైతే అందరూ ''కృష్ణ భగవానువాచ'' అని అంటారు. ఇక్కడ ''జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతాజ్ఞానదాత అయిన శివ భగవానువాచ'' అని అంటారు. రాధా-కృష్ణులను లేక లక్ష్మీనారాయణులను భగవాన్‌-భగవతీలు అని అనజాలరు. లా(చట్టము) అలా లేదు. కాని భగవంతుడు వారికి పదవిని ఇచ్చారు. కావున తప్పకుండా భగవాన్‌ - భగవతీలుగానే చేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. మీరు విజయమాలలో కూర్చబడేందుకు పురుషార్థం చేస్తున్నారు. మాల అయితే తయారవుతుంది కదా! పైన రుద్రుడు ఉన్నాడు. రుద్రాక్ష మాల ఉంటుంది కదా! ఈశ్వరుని మాల ఇక్కడ తయారవుతోంది. మా తీర్థ స్థానాలు భిన్నమైనవని మీరు అంటారు. వారైతే తీర్థాల వద్ద ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీ విషయం అతీతమైనది. మీ బుద్ధియోగము శివబాబాతో ఉంది. రుద్రుని కంఠహారంగా అవ్వాలి. మాల రహస్యము కూడా తెలియదు. పైన పుష్పమైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత జగదంబ, జగత్పితలు. ఆ తర్వాత వారి 108 వంశావళి. బాబా చాలా పెద్ద మాలను చూశాడు. దానిని అందరూ తిప్పుతూ రామ-రామ అంటూ ఉంటారు. బాబా(బ్రహ్మ) ఇది చూశారు. కాని అక్కడ లక్ష్యమేదీ లేదు. రుద్రమాలను త్రిప్పుతారు. రామ నామ ధ్వని చేస్తూ ఉంటారు. ఇదంతా భక్తిమార్గము. ఇది ఇతర విషయాల కంటే మంచిదే. అంత సమయము ఏ పాపాలూ జరగవు. ఇవి పాపాల నుండి రక్షించుకునేందుకు యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయమేదీ లేదు. స్వయం మాలలోని మణులుగా అవ్వాలి. కావున మన తీర్థ స్థానాలు భిన్నమైనవి. మనం మన శివబాబా ఇంటికి వెళ్లే అవ్యభిచారీ యాత్రికులము. యోగము ద్వారా మన జన్మ-జన్మాంతరాల వికర్మలు భస్మమౌతాయి. కృష్ణున్ని రాత్రింబవళ్లు స్మృతి చేసినా వికర్మలు వినాశనమవ్వజాలవు. రామ-రామ అంటూ ఉంటే ఆ సమయములో పాపాలు జరగవు. తర్వాత మళ్లీ పాపాలు చేయడం మొదలు పెడ్తారు. అంతేకాని పాపాలు అంతమవ్వడమో, ఆయువు పెరగడమో జరగదు. ఇక్కడ యోగబలము ద్వారా పిల్లలైన మీ పాపాలు భస్మమవుతాయి. అంతేకాక ఆయువు పెరుగుతుంది. జన్మ-జన్మాంతరాల కొరకు ఆయువు అవినాశిగా అయిపోతుంది.

మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి - దీనినే జీవితాన్ని తయారు చేసుకోవడమని అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉంది! (మనుష్యులు దేవతల విగ్రహాల ముందుకు వెళ్ళి) తమను తాము నీచులుగా, పాపులుగా వర్ణించుకుంటారు. మరి తప్పకుండా అందరూ అలాగే ఉంటారు. నిర్గుణుడైన నాలో ఏ గుణాలు లేవు. మీరే దయ చూపించండి............... అని గానము కూడా చేస్తారు. ఇలా పరమాత్మను మహిమ చేస్తారు. వారు మిమ్ములను సర్వ గుణ సంపన్నంగా, శ్రీ కృష్ణుని సమానంగా చేసేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. ఇంతకు ముందు ఏ గుణాలూ లేవు. ఒక నిర్గుణ బాలక సంస్థ కూడా ఉంది. నిర్గుణులు అని ఎవరిని అంటారో అర్థం చేసుకోరు. శ్రీ కృష్ణుడు లేక లక్ష్మీనారాయణులనే సర్వగుణ సంపన్నులు............. అని మహిమ చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మళ్లీ ఆ విధంగా అవుతున్నారు. ఇలా చెప్పగలిగే సత్సంగము ఇక ఏదీ ఉండదు. మీరు లక్ష్మీనారాయణులను వరిస్తారా? లేక సీతారాములను వరిస్తారా? అని ఇక్కడ బాబా అడుగుతారు. పిల్లలు కూడా అవివేకులైతే కాదు కదా. బాబా మేము పూర్తిగా పరీక్ష పాసవుతాము అని వెంటనే అంటారు. శుభం పలుకుతారు కాని అందరూ ఒకేలా అవ్వగలరని కాదు. అయినా ధైర్యాన్ని చూపిస్తారు. మమ్మా, బాబాలు శివబాబాకు అతిప్రియమైన పిల్లలు. మనం వారిని పూర్తిగా అనుసరించి సింహాసనము పై కూర్చుంటాము. ఈ శుభ కామన మంచిదే. అయితే అంతటి పురుషార్థం కూడా చేయాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్ప-కల్పపు పురుషార్థంగా అయిపోతుంది. గ్యారంటీ అవుతుంది. కల్పపూర్వం కూడా ఇలా చేశారని ఇప్పటి పురుషార్థం ద్వారా తెలుస్తుంది. కల్ప-కల్పము ఇటువంటి పురుషార్థం కొనసాగుతుంది. పరీక్ష వచ్చే సమయంలో తాము ఎంతవరకు పాసవుతారో తెలిసిపోతుంది. టీచర్‌కైతే వెంటనే తెలిసిపోతుంది. ఇది ''నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చాము'' అని ఇతర గీతాపాఠశాలలలో ఇలా ఎప్పుడూ అనరు. అలాగే నేను నరుని నుండి నారాయణునిగా చేస్తానని టీచరే చెప్పగలరు. మొదట టీచరుకు నేను కూడా నరుని నుండి నారాయణునిగా అవుతానని ఉండాలి. గీతా ప్రవచనాలు చేసేవారైతే అనేకమంది ఉంటారు. కాని ఎక్కడ కూడా మేము శివబాబా ద్వారా చదువుతామని అనరు. వారైతే మనుష్యుల ద్వారా చదువుతారు. ఉన్నతోన్నతమైనవారు పరమపిత శివపరమాత్మ అని, తానే స్వర్గ రచయిత. నాలెడ్జ్‌ఫుల్‌(జ్ఞానసాగరులు) అని మీకు తెలుసు. వారే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. గురునానక్‌ కూడా వారి మహిమను గానం చేశాడు - సాహెబ్‌ను జపించినట్లయితే సుఖము లభిస్తుంది.......... అని అన్నారు. ఉన్నతోన్నతమైన, సత్యమైన సాహెబ్‌ వారేనని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని స్వయం పవరు చెప్తారు. నేను మీకు సత్యమైన అమరకథను, మూడవ నేత్రమును ఇచ్చే కథను(తీజరీ కథ) వినిపిస్తాను. కావున ఇది మూడవ నేత్రము లభించే లేక నరుని నారాయణునిగా చేసే జ్ఞానము. ఓ పార్వతులారా! అమరనాథుడినైన నేను మీకు అమరకథను వినిపిస్తున్నాను. ఉన్నతోన్నతులు శివబాబా. ఆ తర్వాత బ్రహ్మా-విష్ణు-శంరులు. ఆ తర్వాత స్వర్గంలో లక్ష్మీనారాయణులు. ఆ తర్వాత చంద్ర వంశీయులు. నెంబర్‌వారిగా రండి. సమయం కూడా సతో, రజో, తమోలుగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు. బాబా చాలా గుహ్యమైన విషయాలను ఎన్నో వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశీ పాత్ర ఉంది. ఒక్కొక్క జన్మ పాత్ర ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. నాలో కూడా పాత్ర నిండి ఉంది. మీరు సుఖధామంలో ఉంటే, నేను శాంతిధామములో ఉంటానని బాబా అంటారు. సుఖ-దు:ఖాలు మీ భాగ్యంలో ఉన్నాయి. సుఖము మరియు దు:ఖాలలో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయో కూడా అర్థము చేయించాను. నేను మీ నిష్కాముడనైన తండ్రిని. మీ అందరినీ స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. నేను కూడా పతితంగా అయినట్లయితే మిమ్ములను పావనంగా ఎవరు తయారు చేస్తారు? అందరి పిలుపును ఎవరు వింటారు? పతితపావనుడు అని ఎవరిని అనాలి? ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. గీతా పాఠకులు ఎవ్వరూ ఇలా అర్థం చేయించలేరు. వారైతే త్రిలోకాల అర్థమును భిన్న-భిన్న రకాలుగా వర్ణిస్తారు. వేదశాస్త్రాల ద్వారా భగవంతుని కలుసుకొనే మార్గము లభిస్తుందని మనుష్యులు అంటారు. ఈ శాస్త్రాలన్నీ భక్తిమార్గం కొరకేనని, జ్ఞానమార్గంలోని వారి కొరకు శాస్త్రాలు లేవని బాబా అంటారు. జ్ఞానం వినిపించే జ్ఞానసాగరుడిని నేనే. మిగిలినవన్నీ భక్తిమార్గపు సామాగ్రి. నేనే వచ్చి ఈ జ్ఞానము ద్వారా అందరికి సద్గతినిస్తాను. నీటిబుడగ నీటి నుండి వెలువడి మళ్లీ నీటిలో ఇమిడిపోతుందని వారు భావిస్తారు. కాని అలా కలుసుకొనే విషయమే లేదు. ఆత్మ అవినాశి. అది ఎప్పుడూ తగులబడదు, ఖండింపబడదు, తరగదు. తండ్రి ఈ విషయాలన్నింటినీ వివరిస్తారు. యోగబలము ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నామని పిల్లలైన మీకు కాలి గోటి నుండి జుట్టు (పిలక) వరకు సంతోషం ఉండాలి. ఈ సంతోషం కూడా నెంబరువారీగా ఉంది. ఒకే విధంగా ఉండజాలదు. పరీక్ష భలే ఒక్కటే అయినా అందరూ పాస్‌ అవ్వగలగాలి కదా! రాజధాని స్థాపన జరుగుతోంది. దాని ప్లాను తెలియజేస్తారు. సూర్యవంశములో ఇన్ని సింహాసనాలు, చంద్రవంశంలో ఇన్ని సింహాసనాలు ఉంటాయి. ఎవరైతే పాసవ్వరో వారు దాస-దాసీలుగా అవుతారు. మళ్ళీ దాస-దాసీల నుండి నెంబరువారుగా రాజా-రాణులుగా అవుతారు. చదువుకోనివారు చివరిలో పదవిని పొందుతారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. వారు ఎక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ కూడా సుఖమేమీ తక్కువ కాదని వివేకం చెప్తుంది. ఎంతో గౌరవముంటుంది. పెద్ద మహళ్ళలో ఉంటారు. పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. అక్కడ రెండు, మూడు అంతస్థులు నిర్మించవలసిన అవసరం ఉండదు. లెక్కలేనంత భూమి ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. అక్కడ నిర్మించే అభిరుచి చాలా ఉంటుంది. ఉదాహరణానికి ఇక్కడ కూడా మనుష్యులకు అభిరుచి ఉంటుంది కదా. న్యూ ఢిల్లీని నిర్మించినప్పుడు ఇది కొత్త భారతదేశము అని భావిస్తారు. నిజానికి కొత్త భారతదేశాన్ని స్వర్గమని, పాత భారతదేశమును నరకమని అంటారు. అక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత లభిస్తుంది........... అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. కల్ప పూర్వము ఏ మహళ్ళు మొదలైనవి నిర్మించి ఉంటారో అవే తయారవుతాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. కాని ఎవరి భాగ్యంలో ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. పిల్లలు పురుషార్థం చేయాలి, పూర్తి యోగంలో ఉండాలి. భక్తిమార్గంలో శ్రీ కృష్ణుని యోగంలోనే ఉంటూ వచ్చారు. కాని స్వర్గాధిపతులుగా అయితే అవ్వలేదు. ఇప్పుడైతే స్వర్గము మీ ముందే ఉంది. మీకు పరమపిత పరమాత్ముని జీవిత చరిత్ర, బ్రహ్మా-విష్ణు-శంకరుల జీవిత చరిత్ర కూడా తెలుసు. బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటాడో మీకు తెలుసు.

ఈ మాతలు స్వర్గద్వారాలను తెరిచే వారని, మిగిలినవారంతా నరకములో పడి ఉన్నారని బాబా అంటారు. మాతలే అందరి ఉద్ధారమును చేస్తారు. మనము పరమాత్ముని మహిమ చేస్తాము. శివబాబా మీకు నమస్కారము అని మీరు అర్థం చేసుకొని చెప్తారు. మీరు వచ్చి మమ్ములను వారసులుగా చేస్తారు. స్వర్గాధిపతులుగా చేస్తారు. ఇటువంటి శివబాబా! మీకు నమస్కారము అని పిల్లలు బాబాకు నమస్కరిస్తారు. మళ్ళీ తండ్రి కూడా - పిల్లలూ! నమస్తే అని అంటారు. మీరు కూడా నన్ను పైసకు విలువ చేసే వారసునిగా చేసుకుంటారు. గవ్వలకు వారసునిగా చేస్తారు. నేను మిమ్ములను వజ్రాలకు వారసులుగా చేస్తాను. శివ బాలకుడిని వారసునిగా చేసుకుంటారు కదా! అచ్ఛా!

మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు

నేత్రహీనులు అనగా జ్ఞాన నేత్ర హీనులకు దారి చూపించేవారు - పరమాత్మ

నేత్రహీనులకు దారి చూపండి ప్రభూ!....... అని మనుష్యులు పాడ్తారు. నయనహీనులకు దారి చూపండి అని అంటారు అనగా దారి చూపించేవారు ఒక్క పరమాత్మయే. అందుకే పరమాత్మను పిలుస్తారు. దారి చూపండి ప్రభూ!...... అని ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మనుష్యులకు దారి చూపేందుకు తప్పకుండా స్వయం పరమాత్మయే నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి రావలసి వస్తుంది. అప్పుడే స్థూలంలో దారి చూపిస్తారు. వారు ఇచ్చటకు రాకుండా దారి చూపించలేరు. ఇప్పుడు మనుష్యులెవరైతే భ్రమించి ఉన్నారో వారికి దారి కావాలి. అందువలన పరమాత్మను నేత్రహీనులకు దారి చూపండి ప్రభూ!........ అని వేడుకుంటారు. వారినే నావికుడు అని కూడా అంటారు. వారు ఆ తీరానికి అనగా ఈ పంచతత్వాలతో తయారు చేయబడిన ఏ సృష్టి అయితే ఉందో దీని నుండి దాటించి ఆ తీరానికి అనగా 5 తత్వాలకు దూరంగా ఏదైతే ఆరో తత్వము లేక అఖండ జ్యోతి మహాతత్వము ఉందో అందులోకి తీసుకెళ్తారు. కనుక పరమాత్మ కూడా ఎప్పుడైతే ఆ తీరము నుండి ఈ తీరములోకి వస్తారో అప్పుడే తీసుకెళ్తారు. కనుక పరమాత్మ కూడా తన ధామము నుండి రావలసి వస్తుంది. అప్పుడే పరమాత్మను నావికుడు అని అంటారు. వారే మన బోటును(ఆత్మ రూపీ నావను) ఆవలి తీరానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగముంచుతారో వారిని వెంట తీసుకెళ్తారు. మిగిలిన వారెవరైతే ఉంటారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించిన తర్వాత ముక్తులవుతారు. అచ్ఛా. ఓంశాంతి.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శివబాబా ఇంటికి అవ్యభిచారీ యాత్రికులుగా అయ్యి యోగబలం ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి.

2. తండ్రి సమానంగా సింహాసనాధికారులుగా అయ్యే శుభ కామననుంచుతూ తండ్రిని పూర్తిగా అనుసరించాలి.

వరదానము :-

''క్లియర్‌ బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే సఫలతా మూర్త్‌ భవ''

బుద్ధి ఎంత క్లియర్‌గా ఉంటుందో అంత పరిశీలనా శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువ విషయాలను ఆలోచించేందుకు బదులు ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. తండ్రితో స్పష్టంగా(క్లియర్‌గా) ఉంటే, ప్రతి విషయాన్ని సహజంగా పరిశీలించి యథార్థమైన నిర్ణయాన్ని తీసుకోగలరు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో, సంబంధ-సంపర్కములోని వారి మూడ్‌ ఎలా ఉంటుందో, అదే సమయంలో అదే ప్రమాణంగా నడుచుకోవాలి. దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా పెద్ద శక్తి. ఆ శక్తి సఫలతామూర్తిగా చేసేస్తుంది.

స్లోగన్‌ :-

''ఎవరైతే ఈ ప్రపంచము నుండి అంధకారాన్ని నిర్మూలిస్తారో, అంధకారములోకి రారో, వారే జ్ఞాన సూర్యుడైన తండ్రి తోడుగా ఉండే లక్కీ సితారాలు''