08-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఆత్మ మరియు పరమాత్మల మిలనమే సత్య - సత్యమైన సంగమము లేదా కుంభము(కుంభమేళా). ఈ మిలనము ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇందుకు స్మృతి చిహ్నంగా వారు మేళా జరుపుతారు''
ప్రశ్న :-
పిల్లలైన మీకు ఏ విషయములో చాలా చాలా వివేకము అవసరము ?
జవాబు :-
జ్ఞానములో సున్నితంగా(నాజూకుగా) ఉండే విషయాలను అర్థము చేయించేందుకు చాలా వివేకముండాలి. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గములను యుక్తితో ఋజువు చేయాలి. ఎలాగైతే ఎలుక మొదట గాలినీ ఊదుతుంది, తర్వాత కొరకుతుందో, అలా సర్వీసు కొరకు యుక్తులను రచించాలి. కుంభమేళాలో ప్రదర్శినీ ఏర్పాటు చేసి అనేక ఆత్మల కళ్యాణము చేయాలి. పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేయాలి.
పాట :-
ఈ పాపపు ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్లు............. (ఇస్ పాప్ కీ దునియా సే దూర్ లే చలో.............) 
ఓంశాంతి.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - పాప ప్రపంచమని కలియుగీ పతిత భ్రష్టాచారీ ప్రపంచమును అంటారు. పుణ్య ప్రపంచమును సత్యయుగీ పావన శ్రేష్ఠాచారీ ప్రపంచమని అంటారు. పరమాత్మయే వచ్చి పుణ్యాత్మల, పవిత్రాత్మల లేక పుణ్య ప్రపంచాన్ని తయారు చేస్తారు. పతితపావనుడని తండ్రిని మనుష్యులు పిలుస్తారు. ఎందుకంటే వారు స్వయం పావనంగా లేరు. పతితపావని గంగ లేక త్రివేణి అని ఒకవేళ భావించినట్లయితే ఇక '' ఓ పతితపావనా రండి! అని పిలవడం ఎందుకు? '' గంగ లేక త్రివేణి ఇక్కడే ఉన్నాయి కదా. అవి ఉన్నా పిలుస్తూ ఉంటారు. అయినా బుద్ధి పరమాత్మ వైపుకు వెళ్తుంది - పరమపిత పరమాత్మ ఎవరైతే జ్ఞాన సాగరులో వారు రావాలి. కేవలము ఆత్మ కాదు, పవిత్ర జీవాత్మ అని పిలుస్తారు. ఇప్పుడు పావన జీవాత్మలైతే ఎవ్వరూ లేరు. పతితపావనులైన తండ్రి ఎప్పుడు వస్తారంటే, సత్యయుగ పావన ప్రపంచాన్ని స్థాపన చేయవలసి ఉన్నప్పుడు, కలియుగ ప్రపంచాన్ని వినాశనము చేయవలసి ఉన్నప్పుడు తప్పకుండా సంగమ యుగములోనే వస్తారు. సంగమమునే కుంభము అని కూడా అంటారు. త్రివేణి సంగమము ఉంది, దాని పేరు కుంభము అని ఉంచేశారు. మూడు నదులు పరస్పరము అక్కడ కలుస్తాయని అంటారు. వాస్తవానికి ఉన్నది రెండు నదులే, మూడవ నదిని గుప్తము అని అంటారు మరి ఈ కుంభమేళాలో పతితుల నుండి పావనంగా అవుతారా? పతితపావనుడైతే తప్పకుండా రావాలి. వారు జ్ఞాన సాగరులు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడం, కలియుగాన్ని సత్యయుగంగా చేయడం పరమపిత పరమాత్మ కర్తవ్యము. ఏ మనుష్యులదీ కాదు. ఇక్కడ ఉండేదంతా గుడ్డి నమ్మకమే. ఇప్పుడు అంధులకు కర్ర కావాలి. మీరు ఇప్పుడు కర్రగా(లాఠీగా) నంబరువారు పురుషార్థానుసారముగా అయ్యారు. లాఠీలు (ఊతకర్రలు) కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని లాఠీలు వంద రూపాయల విలువ చేస్తే, మరి కొన్ని రెండు రూపాయలకే లభిస్తాయి. ఇక్కడ కూడా అందరూ నంబరువారుగా ఉన్నారు. కొందరైతే చాలా సర్వీసు యోగ్యులుగా ఉన్నారు. రోగిగా అయినప్పుడు సర్జన్ను పిలువవలసి వస్తుంది. ఇప్పుడిది పతిత ప్రపంచము, మీరు పావనంగా అవుతున్నారు. ఆత్మ-పరమాత్మలు చాలా కాలము నుండి వేరుగా ఉండేవి,.................. అని అంటారు. పరమపిత పరమాత్మ అనేక ఆత్మల మధ్యలోకి వస్తారు. దానిని సంగమ యుగములోని కుంభమేళా అని అంటారు.
మనుష్యులు కుంభమేళాలో చాలా దాన ధర్మాలు చేస్తారు. అందులో సాధువులు, సన్యాసులకు మరియు ప్రభుత్వానికి కూడా సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీరు తనువు-మనసు-ధనముల సహితంగా సర్వస్వాన్ని పతితపావనుడైన తండ్రికి దానము చేయాల్సి ఉంటుంది. వారు భవిష్యత్తులో మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. వారు త్రివేణి పేరును తీసుకొని సాధువులు, సన్యాసులకు దానము చేస్తారు. వాస్తవానికి సంగమము అని నదులు సాగరములో కలిసే స్థానమును అంటారు. అక్కడ సాగరమైతే లేనే లేదు. ఇక్కడైతే నదులు పరస్పరములో కలుస్తాయి. నదులు మరియు సాగరముల మిలనాన్నే సత్య-సత్యమైన మేళా అని అంటారు. కాని ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ప్రభుత్వము కూడా రైలు, మోటారు బండ్లు , భూమి,................ మొదలైన వాటి నుండి చాలా సంపాదన లభిస్తుంది. కనుక ఇది సంపాదన మేళా అవుతుంది. ఈ విషయాలను పిల్లలైన మీరు జడ్జ్(నిర్ణయము) చేయగలరు. ఎందుకంటే మీరు ఈశ్వరీయ మతమును అనుసరిస్తున్నారు. కనుక కుంభమేళా అర్థమును తెలిపించాలి. బాబా ఇటువంటి వ్యాసాన్ని ఇస్తారు. వివేకవంతులైన పిల్లలు వీటిని తీసుకోవాలి. అందరికంటే నంబర్ వన్ వివేకవంతురాలు మమ్మా తర్వాత రెండవ వారు సంజయుడు(జగదీశ్ భాయి). వారు అందరికి పంచేందుకు కరపత్రాలు మొదలైనవి తయారు చేయాల్సి పడ్తుంది. ఈ త్రివేణి పతితపావని కాదు. పతితపావనుడైతే సర్వుల సద్గతిదాత ఒక్క శివబాబాయే. త్రివేణినైతే సద్గతిదాత అని అనరు. ఈ నదులైతే ఉండనే ఉన్నాయి. అవి వచ్చే విషయమే లేదు. పతితపావనా! రండి, వచ్చి పావనంగా చేయండి అని పాడ్తారు. కనుక కరపత్రాలను తయారుచేయాలి. సోదరీ-సోదరులారా! పతిత పావనుడు జ్ఞాన సాగరుడు పరమపిత పరమాత్మయా? లేక ఈ నదులా? ఇవైతే సదా ఉండనే ఉన్నాయి. పరమాత్మనైతే రమ్మని పిలుస్తారు. వాస్తవానికి పతితపావనుడు ఒక్క పరమాత్మయే. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు,.......... ఆ సద్గురువే వచ్చి అందరికి సద్గతినిచ్చి వాపస్ తీసుకెళ్తారు. వాస్తవానికి జ్ఞాన స్నానమునైతే పరమపిత పరమాత్మతోనే చేయాలి. పావన ప్రపంచ స్థాపన పరమపిత పరమాత్మ చేయిస్తారు. మీకు వారిని గురించి తెలియదు. భారతదేశము శ్రేష్ఠాచారిగా ఉన్నప్పుడు దేహీ-అభిమాని దేవతలుండేవారు. దానిని శివాలయము అని అనేవారు. ఇప్పుడు కుంభమేళాకు వెళ్లి అందరికీ అర్థము చేయించేందుకు ప్రదర్శినీ ఏర్పాటు చేసి తెలిపించాలి - పతితపావనుడు ఒక్క తండ్రియే అని అర్థము చేయించాలి. వారు చెప్తున్నారు - పతితులను పావనంగా చేయవలసి ఉన్నప్పుడు నేను వస్తాను. అందువల్ల ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. రక్షాబంధనము అనగా భగవంతునితో సంబంధమును ఉంచుకోవడం. అంతేకాని సాధువులు, సన్యాసులతో కాదు. ప్రతిజ్ఞ పరమపిత పరమాత్మతోనే చేయడం జరుగుతుంది. త్రివేణితో కాదు. ''ఓ బాబా! మేము మీ శ్రీమతము ద్వారా పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తాము. తండ్రి కూడా చెప్తారు - నేను మిమ్ములను పావన ప్రపంచానికి అధిపతులుగా చేస్తాను. ఇది బాబా ఇచ్చే సూచన - ఇందులో సేవ చేసేవారు చాలా తెలివైనవారుగా ఉండాలి. చిత్రాలు కూడా ఇంకా తయారు చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మంచి మండపాన్ని తీసుకోవలసి పడ్తుంది. అక్కడ మీకు చాలామంది శత్రువులు కూడా వస్తారు. ఒకానొక సమయములో నిప్పు అంటించేందుకు కూడా వెనుకాడరు. ఎవరైనా కొట్లాడాలనుకుంటే తిట్లు తిట్టడం ప్రారంభిస్తారు. మీరైతే నిరహంకారులుగా అయ్యి సైలెన్స్లో ఉండాలి. బ్రహ్మకుమారీలైతే ప్రసిద్ధి గాంచి ఉన్నారు. కరపత్రాలు మొదలైనవి తప్పకుండా పంచాలి. కుంభమేళాకు విశేషమైన మహత్వమునుంచుతారు. వాస్తవానికి మహత్వము ఇప్పటిదే. ఇది కూడా డ్రామా ఆట. అక్కడి నుండి కూడా ఎవరికైనా కళ్యాణము జరగగలదు. కాని శ్రమ చేయాలి. ముళ్లను పుష్పాలుగా చేయడంలో శ్రమ ఉంటుంది. కుంభమేళాలో ప్రదర్శినీ ఏర్పాటు చేసేందుకు కూడా ధైర్యముండాలి. విఘ్నాలు కలుగకుండా పరిచయస్థులు కూడా ఉండాలి. పతితపావనుడు ఎవరో మీరు ఋజువు చేయాలి. మనుష్యులు పావన ప్రపంచమైన స్వర్గాన్ని తల్చుకుంటారు కూడా. ఎవరైనా మరణిస్తే ఫలానావారు స్వర్గవాసులయ్యారని అంటారు. అక్కడ చాలా సంపద, వైభవము ఉంటాయి. మరి అక్కడ నుండి ఇక్కడికి పిలిచి ఎందుకు తినిపిస్తారు? మీరు శ్రీనాథ మందిరంలో ఎన్ని పదార్థాలు తయారవుతాయో చూస్తారు. ఇప్పుడు శ్రీనాథపురి మరియు జగన్నాథపురి వాస్తవంలో ఒక్కరివే. కాని శ్రీనాథ ద్వారములో చాలా వైభవంగా పదార్థాలు(వంటకాలు) తయారవుతాయి. జగన్నాథపురిలో కేవలం చప్పని అన్నాన్ని భోగ్గా సమర్పిస్తారు. నెయ్యి మొదలైనవి ఏమీ ఉండవు. సుందరంగా(పవిత్రంగా) ఉండేవారు కనుక ఆ విధమైన పదార్థము(శ్రీనాథపురిలో) మరియు ఇక్కడ(జగన్నాథపురిలో) నల్లగా(అపవిత్రంగా) అయినందున చప్పని అన్నము లభిస్తుందని తేడాను చూపిస్తారు. ఈ రహస్యము చాలా బాగుంది. తండ్రి కూర్చుని ఈ విషయాలు అర్థము చేయిస్తారు. శ్రీనాథ ద్వారములో ఎంత ఎక్కువగా భోగముంచుతారంటే తర్వాత పూజారులు దానిని దుకాణాలలో అమ్ముతారు కూడా. వారికి సంపాదన కూడా దీని ద్వారానే జరుగుతుంది. ఉచితంగా లభిస్తుంది, దాని ద్వారా సంపాదిస్తారు. ఇవి ఎంత మూఢ నమ్మకాలో గమనించండి. ఇది భక్తి మార్గము. జ్ఞాన మార్గము సద్గతినిచ్చేది. గంగా స్నానము ద్వారా సద్గతి లభించదు. చాలా యుక్తితో అర్థము చేయించాలి. ఎలుక ఎలాగైతే మొదట చల్లని గాలి ఊది తర్వాత కొరుకుతుందో అలా యుక్తిగా అర్థము చేయించాలి. అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించేందుకు చాలా వివేకము కూడా ఉండాలి. ఇవి చాలా నాజూకు విషయాలు. '' హే పరమపిత పరమాత్మ! మీ గతి - మతి మీకే తెలుసు,..............'' అని మనుష్యులంటారు. వారికి దీని అర్థమేమిటో తెలియదు. మీ శ్రీమతము ద్వారా ఏ సద్గతి లభిస్తుందో దానిని మీరే ఇప్పించగలరు. ఇంకెవ్వరూ ఇప్పించలేరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. ''సర్వ'' అనే పదము తప్పకుండా ఉపయోగించాలి. చాలా అర్థము చేయించబడ్తుంది. కాని అర్థము చేసుకునేవారు చాలా తక్కువమంది వెలువడ్తారు. ప్రజలైతే అనేకమంది తయారవుతూ ఉంటారు.
మనుష్యులు ఖుదా(భగవంతుడు) పేరు మీద అనేక దాన-పుణ్యాలు చేస్తారు. కనుక అందుకు ప్రతి ఫలంగా వారికి ఒక్క జన్మ కొరకు ఫలము లభిస్తుంది. ఇక్కడైతే 21 జన్మల వరకు లభిస్తుంది. ఈశ్వరార్థము దానము చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. వీరు ఈశ్వరుడినే తెలుసుకోలేదంటే ఇక శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది. హిందువులకు గురువులు - మఠాధిపతులైతే అనేకమంది ఉన్నారు. క్రైస్తవులను చూడండి, ఒక్కరే ఉన్నారు. ఒక్కరికే ఎంత గౌరవాన్ని ఇస్తారు. ధర్మములోనే శక్తి ఉంది అని అంటారు. ఇప్పుడు మీరు ధర్మాన్ని అర్థము చేసుకున్నారు కనుక ఎంతో శక్తి లభిస్తుంది. బాబా చెప్తున్నారు - పిల్లలారా! అందరికీ ఈ వశీకరణ మంత్రమునివ్వండి. పిల్లలకు తండ్రి చెప్తారు - మీరు ఎక్కడ నుండి వచ్చారో దానిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సో గతి అవుతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా అవుతారు. పాపాలు దగ్ధమవుతాయి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. దీని ద్వారా చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధిని తొలగించి తండ్రి జతలో జోడించే పురుషార్థము చేయాలి. ఇక అంతిమ సమయములో వారే(తండ్రి) గుర్తు రావాలి. ఇంకెవరైనా గుర్తు వచ్చారంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా తగ్గిపోతుంది. కనుక వాస్తవంలో కుంభము అని కల్పము యొక్క సంగమ సమయమునే అంటారు. అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ కలుస్తారు. పరమాత్మయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు పునర్జన్మ రహితులు కాని పిల్లలు కూడా అర్థము చేసుకోరు. శ్రీమతమును అనుసరించకపోతే నావ ఎలా తీరము చేరుతుంది? నావ తీరానికి చేరడమంటే, రాజ్య పదవిని పొందడం. శ్రీమతము ద్వారానే రాజ్యము లభిస్తుంది. శ్రీమతము పై నడవకపోతే చివరికి సమాప్తమైపోతారు. ఎవరి దీపము వెలిగి ఉంటుందో ఆ ప్రేయసులు మాత్రమే జతలో వస్తారు. ఎవరి జ్యోతి ఆరిపోయి ఉంటుందో వారు జతలో రాలేరు. అనన్యమైన పిల్లలు మాత్రమే వస్తారు. మిగిలినవారంతా వెనుక వస్తారు. కాని అందరూ పవిత్రంగా అయితే అవుతారు. ఆత్మలన్నీ ఒకే విధమైన శక్తిని కలిగి ఉండజాలవు. ప్రతి ఆత్మ పాత్ర ఎవరిది వారిదే. ఒకే విధమైన పదవి లభించజాలదు. అంతిమములో అందరి పాత్ర స్పష్టమవుతుంది. వృక్షము ఎంతో పెద్దది. ఎంతమంది మనుష్యులున్నారు! ముఖ్యమైన పెద్ద-పెద్ద కొమ్మలు-రెమ్మలు ఏవి ఉన్నాయో అవి కనిపిస్తాయి. ముఖ్యమైనది పునాది, మిగిలినవైతే తర్వాత వస్తాయి, వాటిలో శక్తి తక్కువగా ఉంటుంది. అందరూ స్వర్గములోకి రాలేరు. భారతదేశమే స్వర్గముగా ఉండేది. భారతదేశానికి బదులుగా జపాన్ ఖండము స్వర్గమవుతుందని కాదు. అలా జరిగేందుకు వీలు లేదు. అచ్ఛా!
మధురాతి మధురమైన బాప్దాదా లేక మాత - పితల అతి ప్రియమైన, అపురూపమైన, జ్ఞాన నక్షత్రాలైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రి క్లాసు (24-04-1968) - పిల్లలకు అర్థము చేయించబడింది - ఇతర ధర్మ స్థాపకులెవ్వరూ సర్వుల కళ్యాణము చేయలేరు. వారు అందరినీ తీసుకు వస్తారు. ఎవరైతే ముక్తులుగా చేసి మార్గాన్ని చూపిస్తారో వారికే మహిమ ఉంది. వారు భారతదేశములోనే వస్తారు. కనుక భారతదేశము అన్నింటికంటే ఉన్నతమైన దేశము. భారతదేశాన్నే చాలా మహిమ చేయాలి. తండ్రియే వచ్చి అందరికి సద్గతినిస్తారు. అప్పుడే శాంతి ఏర్పడ్తుంది. విశ్వములో ఒకప్పుడు శాంతి ఉండేది. సృష్టి ఆదిలో స్వర్గములో ఒకే ధర్మముండేది. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. తండ్రియే వచ్చి శాంతి స్థాపన చేస్తారు. కల్పక్రితము వలె స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు జ్ఞానము లభించింది కనుక విచార సాగర మథనము నడుస్తుంది. ఇతరులెవ్వరికీ నడవనే నడవదు. ఇది కూడా మీరు గ్రహిస్తారు. దేహాభిమానము కారణంగా దేహాలనే పూజిస్తూ ఉంటారు. ఆత్మ తప్పకుండా ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు - పావనుడైతే ఒక్కరే. తండ్రియే గుప్త జ్ఞానమునిస్తారు. దీని ద్వారా అందరికి సద్గతి కలుగుతుంది. అంతేకాని హనుమంతుడు, గణేశుడు మొదలైనవారిలాగ ఎవ్వరూ ఉండరు. వీరందరినీ పూజారులని అంటారు. అచ్ఛా.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదాల యాద్ప్యార్ మరియు గుడ్నైట్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శిక్షల నుండి రక్షించుకునేందుకు సర్వ దేహ సంబంధాల నుండి బుద్ధి యోగమును తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. అంతిమ సమయములో తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు.
2. నిరహంకారులుగా అయ్యి శాంతిగా ఉంటూ ముళ్లను పుష్పాలుగా చేసేందుకు శ్రమ చేయాలి. శ్రీమతమును అనుసరించి అంధులకు లాఠీగా (చేతికర్రగా) అవ్వాలి. పావనంగా అయ్యి పావనంగా చేయాలి.
వరదానము :-
''వాచాతో పాటు మనసా ద్వారా శక్తిశాలి సేవ చేసే సహజ సఫలతా మూర్త్ భవ''
ఎలాగైతే వాచా సేవలో సదా బిజీగా ఉండేందుకు అనుభవీలుగా అయ్యారో అలా ప్రతి సమయం వాచాతో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. మనసా సేవ అనగా ప్రతి సమయం, ప్రతి ఆత్మ పట్ల స్వతహాగా శుభ భావన, శుభ కామనతో, శుద్ధమైన వైబ్రేషన్లు, స్వయానికి ఇతరులకు అనుభవమవ్వాలి. మనసుతో ప్రతి సమయం సర్వ ఆత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడ్తూ ఉండాలి. ఇలా మనసా సేవ చేసినందున వాచా శక్తి జమ అవుతుంది. ఈ మనసు యొక్క శక్తిశాలి సేవ సహజంగా సఫలతా మూర్తులుగా చేస్తుంది.
స్లోగన్ :-
''తమ ప్రతి నడవడిక ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధము చేసేవారే సత్య - సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు''