04-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - దేహ సంబంధాలలో బంధనముంది. అందుకే దు:ఖముంది. దేహీ(ఆత్మ) సంబంధములో ఉంటే అపారమైన సుఖము లభిస్తుంది. ఒక్క మాత-పితల స్మృతి ఉంటుంది ''

ప్రశ్న :-

ఏ నషా ఉంటే మాయ పై విజయాన్ని పొందగల ధైర్యము వస్తుంది ?

జవాబు :-

ఇదే నషా ఉండాలి - మనము కల్ప-కల్పము తండ్రి స్మృతి ద్వారా శత్రువైన మాయ పై విజయం పొంది వజ్ర సమానంగా అయ్యాము. స్వయం భగవంతుడే మా తల్లి-తండ్రి అనే ఈ స్మృతి లేక నషా ద్వారా ధైర్యము వచ్చేస్తుంది. ధైర్యముంచే పిల్లలు తప్పకుండా విజయులుగా అవుతారు. సదా ఈశ్వరీయ సేవలోనే తత్పరులై ఉంటారు.

పాట :-

తుమ్‌హారే బులానే కో జీ చాహ్‌తా హై.......... ( మిమ్ములను పిలవాలని మనస్సు కోరుకుంటోంది........)   

ఓంశాంతి.

దేవీ దేవతల పూజారులు పారలౌకిక తల్లిదండ్రులను స్మృతి చేస్తూనే వచ్చారు. వారికి భక్తి ఫలితమును ఇచ్చేందుకు తల్లి-తండ్రి తప్పకుండా రావలసి ఉంటుందని భక్తులకు కూడా తెలుసు. కాని ఆ తల్లి-తండ్రి ఎవరో పాపం వారికి తెలియనే తెలియదు. పిలుస్తున్నారంటే సంబంధముందని ఋజువవుతుంది. మొదటిది లౌకిక సంబంధము, రెండవది పారలౌకిక సంబంధము. లౌకిక సంబంధాలు అనేక రకాలు. పిన తండ్రి, చిన్నాన్న, మామ మొదలైనవన్నీ లౌకిక బంధనాలు. అందుకే పరమపిత పరమాత్మను పిలుస్తారు. సత్యయుగములో ఏ బంధమూ ఉండదని పిల్లలకు తెలుసు. మేమిప్పుడు బంధనములో ఉన్నాము, మీ సంబంధములోకి రావాలనుకుంటున్నామని తండ్రిని పిలుస్తారు. అనేక ప్రకారాల బంధనాలలో చిక్కుకొని ఉన్నామని భక్తులకు గుర్తుంది. దేహ స్మృతి ఉన్న కారణంగానే బంధనాలు చాలా ఉన్నాయి. దేహీ(ఆత్మిక) సంబంధములో ఒక్క తల్లి - తండ్రి మాత్రమే గుర్తుంటారు. లౌకిక స్మృతికి, పారలౌకిక స్మృతికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. ఇది శారీరిక బంధము, అది ఆత్మిక సంబంధము. శారీరిక సంబంధములో సత్యయుగములో కూడా ఉంటారు. కాని దానిని దు:ఖ సంబంధమని అనరు, ఎందుకంటే అక్కడ సుఖ సంబంధమని అంటారు. ఇక్కడ దు:ఖ బంధనమని అంటారు. వీటిని సంబంధాలని అనరు. ఈ విషయాలను గురించి ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు అర్థము చేసుకున్నారు. ఓ మాతా-పిత రండి,........ అని పిలుస్తూ వచ్చారు. తండ్రి అయితే అందరికీ తప్పకుండా సుఖమునే ఇస్తారు. కాని తండ్రి ఏ సుఖమునిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రితో సంబంధముంది. వారి ద్వారా సదా సుఖమే లభిస్తుంది. సుఖాన్ని సంబంధమని, దు:ఖమును బంధనమని అంటారు. కావున వచ్చి ఇటువంటి మధురాతి మధురమైన విషయాలను వినిపించమని పిల్లలు మాతా-పితలను పిలుస్తారు. వారు పరోక్షంగా పిలుస్తారు. మీరు ప్రత్యక్షంగా పిలుస్తారు. వారు కూడా ఓ పరమపిత పరమాత్మా! అని స్మృతి చేస్తారు. తండ్రి ఉన్నారంటే తప్పకుండా తల్లి కూడా ఉండాలి. లేకుంటే తండ్రి ఎలా రచిస్తారు? శివబాబాకు పిల్లలు ఉత్తరము ఎలా వ్రాస్తారు? అలాగే(నిరాకారము) వారు చదవలేరు. శివబాబా ఇక్కడ(బ్రహ్మ భృకుటిలో) కూర్చొని ఉన్నారు. అందుకే శివబాబా త్రూ బ్రహ్మాబాబా అని వ్రాస్తారు. శివబాబా తప్పకుండా ఏదో ఒక శరీరాన్ని ధరిస్తారు. ఆత్మలు - పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినారని గానం కూడా చేస్తారు. సద్గురువు అని వారినే అంటారు. వారు సర్వుల సద్గతిదాత. వారు వచ్చి ఈ శరీరములో ప్రవేశిస్తారు. కూర్చుని ఇతనికి 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తారు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు అని గాయనము చేయబడ్డాయి. మొదట రచయిత అయిన పరమపిత పరమాత్మ, వారు మొదట బ్రహ్మ-విష్ణు-శంకరులను రచిస్తారు. పరమపిత బ్రహ్మ రాత్రిని, బ్రహ్మ పగలుగా చేసేందుకు తప్పకుండా వస్తారు. ప్రజాపిత బ్రహ్మ పగలు అంటే ప్రజాపిత బ్రహ్మకుమారి-బ్రహ్మకుమారులకు కూడా పగలే అవుతుంది. సత్య-త్రేతా యుగాలను పగలని, ద్వాపర-కలియుగాలను రాత్రి అని అంటారు. ఇప్పుడు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పిల్లలైన మీరు వచ్చారు. వారిని గురించే త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని గాయనము కూడా చేస్తారు. సఖుని రూపములో వచ్చి ఆహ్లాదపరుస్తారు. ముఖ్యమైనవి మూడు సంబంధాలు - తండ్రి, టీచరు, సద్గురువు. ఈ సంబంధాల ద్వారానే లాభముంది. అంతేకాని మామ, చిన్నాన్న మొదలైన సంబంధాల విషయమే లేదు. కావున సంపూర్ణమైన తండ్రి వచ్చి పిల్లలను సంపూర్ణులుగా తయారుచేస్తారు. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతున్నారు. మీరు అనుభవజ్ఞులు. ఇతరులు ఎలా తెలుసుకోగలరు? ఎంతవరకు పిల్లలైన మీ సాంగత్యములోకి రారో అంతవరకు వారు అర్థము చేసుకోలేరు.

భక్తిమార్గములో కూడా బంధనముందని ఇప్పుడు మీకు తెలుసు. రావణుని పంచ వికారాల బంధనములో ఉన్నప్పుడు స్మృతి చేస్తారు. తండ్రి పేరే లిబరేటర్‌(ముక్తిదాత). ఆంగ్ల శబ్ధాలు చాలా బాగున్నాయి. విముక్తి కలిగిస్తారు - మనుష్యులకు విముక్తిని కలిగిస్తారు. దు:ఖము, మాయా బంధనాల నుండి ముక్తి కలిగించేందుకు వస్తారు. అంతేకాక మార్గదర్శకుడుగా కూడా అవుతారు. దోమల గుంపు వలె అందరినీ వాపస్‌ తీసుకెళ్తారని గీతలో కూడా చెప్పబడింది, అంటే వినాశనము కూడా తప్పకుండా జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము చేయిస్తారని మహిమ చేయబడింది. ఎవరు స్థాపన చేస్తారో వారి ద్వారానే పాలన కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు నెంబరువారు పురుషార్థానుసారము తయారవుతున్నారు. దేహ బంధనాలను బుద్ధి ద్వారా వదిలేయాలి. సన్యాసులైతే ఇల్లు-వాకిళ్ళు వదిలి పారిపోతారు. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ రాజయోగమును నేర్చుకుంటారు. జనకుని ఉదాహరణ కూడా ఉంది. అతడే మళ్లీ అనుజనకుడుగా అవుతాడు. జనకుని వలె మేము రాజధానిలో ఉంటూ కూడా జ్ఞానమును తీసుకోవాలని చాలామంది పిల్లలు చెప్తారు. ప్రతి ఒక్కరు తమ ఇంటికి రాజులే కదా. యజమానిని రాజు అని అంటారు. ఇంటిలో తండ్రి, వారి పత్ని, పిల్లలు ఉంటారు. ఇదంతా హద్దులోని రచన. సృష్టిస్తారు, పాలన కూడా చేస్తారు. పోతే సంహారమైతే చెయ్యరు. ఎందుకంటే సృష్టి వృద్ధి అవ్వనే అవ్వాలి. అందరూ జన్మను ఇస్తూనే ఉంటారు. కేవలం అనంతమైన తండ్రి వచ్చి నూతన రచనను రచించడమే కాక పాతదానిని వినాశనము కూడా చేయిస్తారు. నూతన సృష్టి స్థాపన మరియు పురాతన సృష్టి వినాశనాన్ని బ్రహ్మ-విష్ణు-శంకరుల రచయిత అయిన పరమపిత పరమాత్మయే చేస్తారు. ఈ విషయాలను పిల్లలైన మీరు బాగా అర్థము చేసుకుంటారు. ఈ విషయాలైతే చాలా సహజమైనవి. దీని పేరే సహజయోగము లేక సహజ స్మృతి. భారతదేశపు జ్ఞాన-యోగాలు ప్రసిద్ధమైనవి.

తండ్రి పిల్లలైన మీకిప్పుడు దైవీ మతమునిస్తారు. దీని ద్వారా మీరు సదా హర్షితంగా ఉంటారు. మాత-పితల ద్వారానే నూతన సృష్టి రచన జరుగుతుంది. భగవంతుడే మనకు జన్మనిచ్చారని అందరికీ తెలుసు. పరమాత్మ ఎలా వచ్చి నూతన సృష్టిని రచిస్తారో ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. నూతన సృష్టిని దత్తు తీసుకుంటారు. వారు తప్పకుండా మాతా-పితలే. తండ్రి ఇతని(బ్రహ్మ) ద్వారా దత్తు తీసుకుంటున్నారు కనుక ఇతను పెద్ద తల్లి అవుతాడు. మళ్లీ మొదటి నెంబరులో సరస్వతిని దత్తు తీసుకున్నారు. తండ్రి ఇతనిలో ప్రవేశించారు కదా! ఈ మమ్మా అయితే దత్తు తీసుకోబడ్డది. బ్రహ్మాబాబా చెప్తున్నారు - శివబాబా మీకైతే మాత-పిత అయినారు. కాని నాకైతే పతి మరియు పిత కూడా అయినారు. ఎందుకంటే నాలో ప్రవేశించి నన్ను పత్నిగా కూడా చేసుకున్నారు, కొడుకుగా కూడా చేసుకున్నారు. ఇవన్నీ సన్ముఖములో వినవలసిన అత్యంత రమణీక విషయాలు. మీలో కూడా నెంబరువారుగా అర్థము చేసుకుంటారు. ఒకవేళ అర్థము చేసుకుని ఉంటే ఇతరులకు కూడా అర్థము చేయించాలి. అర్థము చేయించలేకపోవడమంటే కొంచెము కూడా అర్థము చేసుకోలేదని అర్థము. జడ బీజము ద్వారా వృక్షము ఎలా ఉద్భవిస్తుందో - ఇది ఎవరైనా వెంటనే చెప్పగలరు. ఈ బేహద్‌ వృక్ష జ్ఞానము తండ్రి వచ్చి అర్థము చేయించినంత వరకు ఎవ్వరికీ అర్థము కాదు. మనము తండ్రి ద్వారా రాజయోగము నేర్చుకొని వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో ఉండాలి. ఇది డబుల్‌(రెండు) సంబంధము, అక్కడైతే కేవలం సింగల్‌(ఒకే) సంబంధము ఉంటుంది. అక్కడ(సత్యయుగంలో) పారలౌకిక తండ్రిని స్మృతి చేయరు. ఇక్కడ ఉన్నవన్నీ బంధనాలే. మనమిప్పుడు ఆ బంధనములో కూడా ఉన్నాము, ఆ బంధనము నుండి విడుదల పొందేందుకు ఈ తండ్రి సంబంధములోకి వచ్చాము. ఈ రోజుల్లో ఎన్నో మతాలు వెలిశాయి. పరస్పరము పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. నీటి కోసము, భూమి కోసము కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది మా హద్దులో ఉంది, ఇది మీ హద్దులో లేదు అంటూ పూర్తిగా హద్దులోకి వచ్చేశారు. భారతవాసులు సత్యయుగములో అనంతమైన అధిపతులుగా ఉండినామనే విషయాన్ని మర్చిపోయారు. అధికారులుగా ఉన్నవారే మళ్లీ మర్చిపోతారు. మర్చిపోవడం తప్పనిసరి. మర్చిపోతేనే తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. ఈ విషయాలను గురించి ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ బంధనముంది. ఇక్కడ మాత-పితలతో సంబంధముంది. మనము శ్రీమతమును అనుసరిస్తూ అపారమైన సుఖ వారసత్వాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. నేను మీకు సుఖ వారసత్వమును ఇస్తానని తండ్రి చెప్తున్నారు. తర్వాత మళ్లీ శాపమును ఎవరు ఇస్తారు? - మాయా రావణుడు. శాపములో దు:ఖము, వారసత్వములో అయితే సుఖము ఉంటుంది. మనుష్యులకు దు:ఖ వారసత్వమును ఎవరిస్తారో తెలియదు. తండ్రి సత్యయుగాన్ని స్థాపిస్తారంటే తప్పకుండా సుఖ వారసత్వమునే ఇస్తారు. తండ్రిని దు:ఖమిచ్చేవారని అనరు. శత్రువులైతే దు:ఖాన్నిస్తారు. కానీ ఈ విషయాలను ఎవ్వరూ అర్థము చేసుకోరు. ఎక్కడి మాటలను ఎక్కడికో తీసుకెళ్ళారు. లంక పై దాడి చేసి బంగారు దోచుకొని పోయారని అంటారు. సిలోన్‌లో బంగారేమీ పెట్టి ఉండలేదు. బంగారము గనుల నుండి లభిస్తుంది. అక్కడక్కడ నదుల నుండి కూడా దొరుకుతుంది.

ఇది అనాది సృష్టి నాటకము అని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలైన మీ బుద్ధిలో నెంబరువారు పురుషార్థానుసారము కూర్చుంది. ఎవరు అర్థము చేసుకొని, చేయించలేరో వారు ఏ పదవిని పొందుతారు? చదువుకున్నవారి ముందు బరువులు మోస్తారు. రాజు-రాణి, ప్రజలలో వ్యత్యాసముంటుంది కదా. ఎలాగైతే మమ్మా-బాబా వెళ్లి శ్రేష్ఠ పదవిని పొందుతారో, అలా మీరు కూడా పురుషార్థము చేసి మమ్మా-బాబాల సింహాసనము పై కూర్చునే విధంగా చదవండి. విజయ మాలలోని పూసలుగా అవ్వండి. ఎంతో ఉత్సాహము(టెంప్టేషన్‌) ఇవ్వబడుతుంది. ఇది రాజయోగము కదా, మీరు రాజయోగము ద్వారా రాజ్యమునైతే పొందుకోండి. ఎంత తక్కువ పురుషార్థము చేసినా, ప్రజలుగానైనా తప్పకుండా అవుతారు. తండ్రిని అనుసరించండి(ఫాలో ఫాదర్‌) అని సదా చెప్పబడుతుంది. మీరు పిల్లలు కదా, ఆ తండ్రి తర్వాత ఈ తండ్రి, తల్లి కూడా ఉన్నారు. ఆమె(మమ్మా) నెంబర్‌వన్‌గా ఫాలో చేస్తోంది. మీరు సోదరీ-సోదరులు. తండ్రి ఒక్కరే ఉండాలి కదా. అందరూ ఓ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. కనుక అందరూ సోదరీ-సోదరులే అయ్యారు కదా. ఇంకే సంబంధమూ లేదు. సోదరీ - సోదరులు అంతే. అక్కడైతే తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలు మొదలైనవారు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ తండ్రి ఒక్కరే, అన్న కూడా ఒక్కరే. ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే. అతని ద్వారా రచన రచింపబడ్తుంది. సోదరీ-సోదరులైన మీరే నెంబరువారు పురుషార్థానుసారము పదవి పొందుతారు. తర్వాత వెళ్లి వృక్షములో తమ-తమ స్థానములో వ్రేలాడుతారు. స్థానమైతే ఉంది కదా. మళ్లీ అక్కడ నుండే నెంబరువారుగా వస్తారు. ఇక్కడున్నది జీవన బంధనము. ఆత్మలు అక్కడ నుండి మొదట సుఖములోకి వస్తారు. అందుకే మొదట జీవన్ముక్తి ఉంటుంది. మొట్టమొదట స్వర్గములో భారతవాసుల జీవన్ముక్తి ఉంటుంది. ఎంత మంచి మంచి విషయాలు తండ్రి వినిపిస్తారు. నాకు ఒక్క సర్వోత్తమ టీచరు తప్ప మరెవ్వరూ లేరు. కన్యలు మాకు ఒక్క శివబాబా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరని అంటారు. కన్యలు ఈ విషయములో చాలా గమనమివ్వాలి. ఈ ప్రభుత్వము వారిగా అయ్యాక ఈశ్వరీయ సేవలో పూర్తిగా నిమగ్నమవ్వాలి. మళ్లీ వారు అసురీ సేవను ఎలా చేస్తారు? ప్రతి ఒక్కరి కర్మ బంధనము అనుసారము సలహా ఇవ్వబడ్తుంది. రాగలుగుతారా లేదా అని పరిశీలింపబడ్తుంది. మంచి తీక్షణ బుద్ధిగల వారైతే ఈశ్వరీయ సేవలోనే ఉండిపోతారు. పిల్లలైన మీరు చేసేది ఈశ్వరీయ సేవ, నిర్వికారులుగా చేసే సేవ. మనము సైన్యము. భగవంతుడు మనకు మాయతో యుద్ధము చేయడం నేర్పిస్తారు. రావణుడు చాలా పాత శత్రువు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు రావణుని పై విజయము పొంది వజ్ర సమానంగా అవుతారు. పిల్లలలో ఆ ధైర్యము, ఆ నషా తప్పకుండా ఉండాలి. మనుష్యులైతే జగడాలాడుకుంటూనే ఉంటారు. ఎక్కడ చూసినా జగడాలే జగడాలు. మనకు ఎవరితోనూ జగడాలు లేవు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, అంతేకాక మాయ మీ పై దాడి చేయదు. తర్వాత వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి పరిచయాన్నిచ్చి వారితో బుద్ధియోగమును జోడింపచేయాలి. వారు మనకు మాత-పిత. శివబాబా తండ్రి అయితే తల్లి ఎవరో చెప్పండి? అని అడగాలి. ఇవి కూడా ఎంతో గుహ్యమైన విషయాలు. ఆత్మల తండ్రి ఎవరు? అని మీరు అడుగుతారు. వారు కూడా పరమాత్మ అని వ్రాసేస్తారు సరే తల్లి ఎవరు? తల్లి లేకుండా పిల్లలను ఎలా రచిస్తారు? అప్పుడు జగదంబ వైపు వెళ్లిపోతారు. సరే జగదంబను ఎలా రచించారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ పుత్రిక సరస్వతి అని మీకు తెలుసు. ఆమె కూడా ముఖవంశావళియే. రచయిత అయితే తండ్రియే. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. నాకు సర్వోత్తమ టీచరైన ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ నిశ్చయంతో తల్లిదండ్రుల సమానంగా చదవాలి. పురుషార్థములో పూర్తిగా వారిని అనుసరించాలి.

2. దేహ బంధనాలను బుద్ధి ద్వారా తెంచేయాలి. దైవీ మతానుసారము నడిచి సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ సేవ చేయాలి.

వరదానము :-

''తనువు, మనసు మరియు హృదయము యొక్క స్వచ్ఛత ద్వారా సాహెబ్‌ను(బాబాను) సంతోషపరచే సత్యమైన హోలీహంస భవ ''

స్వచ్ఛత అనగా మనసా-వాచా-కర్మణా, సంబంధము అన్నిటిలో పవిత్రత. పవిత్రతకు గుర్తుగా తెలుపు రంగును చూపిస్తారు. హోలీ(పవిత్ర) హంసలైన మీరు కూడా శ్వేత వస్త్రధారులు, శుద్ధమైన మనసు అనగా స్వచ్ఛతా స్వరూపులు. తనువు, మనసు మరియు హృదయము ద్వారా సదా మచ్చ లేనివారు అనగా స్వచ్ఛమైనవారు. శుద్ధమైన మనసు లేక శుద్ధమైన హృదయము పై సాహెబ్‌ సంతోషిస్తారు. వారి కోరికలన్నీ అనగా అన్ని కామనలు పూర్తి అవుతాయి. హంసల విశేషత స్వచ్ఛత. అందువలన బ్రాహ్మణ ఆత్మలను హోలీహంసలని అంటారు.

స్లోగన్‌ :-

''ఈ సమయంలో అన్నీ సహించేవారే చక్రవర్తులుగా (శహన్‌శాహ్‌గా) అవుతారు ''