06-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తమ సౌభాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే, ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి. మాతలకు - కన్యలకు తండ్రికి సమర్పితమవ్వాలనే తీవ్ర ఉమంగము రావాలి. శివశక్తులు తండ్రి పేరును ప్రసిద్ధము చేయగలరు''

ప్రశ్న :-

కన్యలందరికీ బాబా ఏ శుభ సలహానిస్తున్నారు?

జవాబు :-

''ఓ కన్యలారా! మీరిప్పుడు అద్భుతాన్ని చేసి చూపించండి. మీరు మమ్మా సమానంగా అవ్వాలి.'' మీరిప్పుడు ప్రాపంచిక కీర్తి ప్రతిష్ఠలను వదులుకోండి, నిర్మోహులుగా అవ్వండి. ఒకవేళ అధర్‌ కుమారీలుగా అయితే మచ్చ ఏర్పడ్తుంది. రంగు రంగుల మాయ నుండి మిమ్ములను మీరు రక్షించుకోవాలి. మీరు ఈశ్వరీయ సేవ చేస్తే వేలాది మంది వచ్చి మీ చరణాల పై పడతారు.

పాట :-

మాతా, ఓ మాతా! నీవు అందరి భాగ్యవిధాత,... (మాతా ఓ మాతా! తూ హై సబ్‌కీ భాగ్యవిధాతా,......)   

ఓంశాంతి.

ఈ పాట కూడా మీ శాస్త్రమే. సర్వశాస్త్రాలకు శిరోమణి గీత. మహాభారతము, రామాయణము, శివపురాణము, వేద-ఉపనిషత్తులు మొదలైన శాస్త్రాలన్నీ గీత నుండే వెలువడ్డాయి. ఎంత విచిత్రము! వీరి వద్ద శాస్త్రాలేవీ లేవు. నాటకాల(సినిమా) రికార్డులు వేస్తారని మీ గురించి అంటారు. కాని ఈ రికార్డులో వెలువడే అర్థములోనే సమస్త వేద గ్రంథాలు మొదలైన వాటి సారము ఇమిడి ఉందని మీరంటారు. (రికార్డు వేశారు) ఇది మమ్మా మహిమ. మాతలైతే అనేకమంది ఉన్నారు కాని జగదంబ ముఖ్యమైనది. ఈ జగదంబయే స్వర్గ ద్వారాలను తెరుస్తుంది. మళ్లీ ఆమె మొదట విశ్వాధికారిగా అవుతుంది. తప్పకుండా తల్లితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నారు. అందుకే వారికి మీరే తల్లి-తండ్రి,........... అని మహిమ ఉంది. శివబాబానే తల్లి-తండ్రి అని అంటారు. భారతదేశములో జగదంబ మరియు జగత్పిత కూడా ఉన్నారు. కాని బ్రహ్మకు అంత పేరు గాని, మందిరాలు గాని లేవు. కేవలం అజ్మీరులోని బ్రహ్మ మందిరము ప్రసిద్ధి గాంచింది. అక్కడ బ్రాహ్మణులు కూడా ఉంటారు. బ్రాహ్మణులు రెండు రకాలుగా ఉంటారు - సారసిద్ధి బ్రాహ్మణులు మరియు పుష్కరిణి బ్రాహ్మణులు. పుష్కరములో ఉండేవారిని పుష్కరిణి బ్రాహ్మణులు అని అంటారు కాని ఆ బ్రాహ్మణులకు ఇది తెలియదు. మేము బ్రహ్మముఖవంశావళీ బ్రాహ్మణులమని అంటారు. జగదంబ పేరు చాలా ప్రసిద్ధమై ఉంది. బ్రహ్మను గురించి అంతగా తెలియదు. ఎవరికైనా చాలా ధనము ప్రాప్తిస్తే సాధు సత్పురుషుల కృప అని భావిస్తారు. ఈశ్వరుని కృప అని భావించరు. నేను తప్ప మరెవ్వరూ కృప చూపించలేరని తండ్రి చెప్తున్నారు. మనమైతే సన్యాసులను కూడా మహిమ చేస్తాము. ఒకవేళ సన్యాసులు పవిత్రంగా ఉండకపోతే భారతదేశము కాలిపోయి మరణించేది. (వినాశనమును పొంది ఉండేది) కాని సద్గతిదాత అయితే ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు మనుష్యులకు సద్గతిని కలుగజేయలేరు.

సీతలైన మీరందరూ శోకవాటికలో ఉన్నారని బాబా తెలిపించారు. దు:ఖములో శోకము కలుగుతుంది కదా. జబ్బులు మొదలైనవి వచ్చినప్పుడు దు:ఖము కలుగుతుంది కదా. వ్యాధిపాలైతే ఎప్పుడు బాగౌతానని సంకల్పాలు నడుస్తాయి. అలాగే జబ్బుతో ఉండాలని అనిపించదు. నయము చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లేకుంటే మందులు మొదలైనవి ఎందుకు తీసుకుంటారు? పిల్లలైన మిమ్ములను ఈ దు:ఖాలు, జబ్బులు మొదలైన వాటి నుండి రక్షించి కానుకనిస్తాను. మాయా రావణుడు మీకు చాలా దు:ఖమునిచ్చాడు. నన్ను సృష్టి రచయిత అని అంటారు. దు:ఖమిచ్చేందుకే భగవంతుడు ఈ సృష్టిని రచించాడా అని అందరూ అంటారు. స్వర్గములో ఇలా అనరు. ఇక్కడ దు:ఖమున్నందున భగవంతుడెందుకు ఈ దు:ఖ సృష్టిని రచించారు, ఇక వేరే పనే లేదా? అని మనుష్యులు అంటారు. కాని తండ్రి అంటారు - ఇది తయారైన సుఖ - దు:ఖాల, ఓటమి - గెలుపుల ఆట. ఇది భారతదేశము పై రామ - రావణుల ఆట. భారతదేశము రావణునితో ఓడిపోయింది. మళ్లీ రావణుని జయించి రామునిదిగా అవుతుంది. శివబాబాను రాముడని అంటారు. అర్థము చేయించేందుకు రాముని పేరును, శివుని పేరును తీసుకోవలసి ఉంటుంది. శివబాబాయే పిల్లల నాథుడు(ప్రభువు). వారు మిమ్ములను స్వర్గాధిపతులుగా చేస్తారు. స్వర్గ ప్రాప్తియే తండ్రి వారసత్వము. అందులో పదవులున్నాయి. స్వర్గములో అయితే దేవతలే ఉంటారు. అచ్ఛా, స్వర్గాన్ని తయారు చేసే వారి మహిమను వినండి.

(పాట). ఈ జగదంబయే భారతదేశపు సౌభాగ్యవిధాత. ఆమెను గురించి ఎవ్వరికీ తెలియదు. అంబాజీ మందిరానికైతే దర్శనానికి చాలా మంది మనుష్యులు వెళ్తూ ఉంటారు. ఈ బాబా కూడా చాలా సార్లు వెళ్ళారు. బబుల్‌నాథ్‌ మందిరానికి, లక్ష్మినారాయణుల మందిరాలకు కూడా అనేకసార్లు వెళ్లి ఉంటారు. కాని ఏమీ తెలియదు. ఎంత అవివేకిగా ఉండేవాడు! నేనిప్పుడు ఎంత బుద్ధివంతునిగా చేశాను. జగదంబ బిరుదు - ''భారతదేశ సౌభాగ్య విధాత'' ఎంత గొప్పది! మీరిప్పుడు అంబాజీ మందిరానికి వెళ్ళి సర్వీసు చేయాలి. జగదంబ 84 జన్మల కథను తెలిపించాలి. మందిరాలు చాలానే ఉన్నాయి. మమ్మా ఈ చిత్రాన్ని అయితే ఒప్పుకోనే ఒప్పుకోరు. మంచిది. సరే! ఆ అంబా మూర్తి (విగ్రహము) గురించే అర్థము చేయించండి. జతలో ఈ పాటను కూడా తీసుకెళ్ళండి. ఈ పాటయే మీ సత్యమైన గీత. సర్వీసైతే చాలా ఉంది కదా. కాని సర్వీసు చేసే పిల్లలలో కూడా సత్యత ఉండాలి. మీరు ఈ పాటను జగదంబ మందిరములోకి తీసుకెళ్ళి అర్థము చేయించండి. జగదంబ కూడా కన్యయే, బ్రాహ్మణి. జగదంబకు ఇన్ని భుజాలెందుకు చూపించారు? - ఎందుకంటే వారికి అనేకమంది సహయోగీ పిల్లలున్నారు. శక్తి సైన్యము కదా. అందుకే చిత్రాలలో అనేక బాహువులను చూపించారు. శరీరాన్ని ఎలా చూపిస్తారు? బాహువుల గుర్తు సహజంగా, సుందరంగా శోభిస్తుంది. కాళ్ళను చూపిస్తే ముఖమెలా అయిపోతుందో చెప్పలేము. బ్రహ్మకు కూడా భుజాలను చూపిస్తారు. మీరంతా వారి పిల్లలు. కాని ఇన్ని బాహువులనైతే చూపించలేదు. కావున కన్యలు, మాతలు అయిన మీరు సర్వీసులో తత్పరులవ్వాలి. మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకోండి. అంబ మందిరములో మీరు ఈ పాటను గురించి మహిమ చేస్తే, చాలా మంది వచ్చేస్తారు. పాత బ్రహ్మకుమారీలు కూడా పొందనంత పేరు తీసుకొస్తారు. ఈ చిన్న చిన్న కుమారీలు అద్భుతాన్ని చేయగలరు. కేవలం ఒక్కరి గురించి కాదు. కన్యలందరికీ బాబా చెప్తున్నారు. వేలాది మంది వచ్చి మీ కాళ్ళ పై పడ్తారు. ఇతరులెవ్వరి ముందు వారి కాళ్ళ పై అంతమంది పడరు. అయితే ఇందులో లోక గౌరవ మర్యాదలను వదలాలి. పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. నేను వివాహము చేసుకోను. పవిత్రంగా ఉండి భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేయు సేవ చేస్తానని చెప్పాలి. అధర్‌కుమారీ పై అయితే మచ్చ పడి ఉంటుంది. కుమారీకి వివాహము అవ్వగానే మచ్చ పడడం ప్రారంభమవుతుంది. రంగు రంగుల మాయ అంటుకుంటుంది. ఒక్క జన్మలోనే మనుష్యులు ఎలా ఉండేవారు ఎలా అయిపోతారో చూడండి. మమ్మా కూడా ఈ జన్మలోనే అలా అయ్యింది కదా. వారికి అల్పకాలిక పదవులు లభించాయి. మమ్మాకు 21 జన్మలకు గౌరవము, పదవి లభిస్తుంది. మీరు కూడా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నారు. సంపూర్ణంగా ఉత్తీర్ణులైతే మళ్లీ దైవీ జన్మ లభిస్తుంది. వారికైతే అల్పకాల సుఖముంటుంది. అందులో కూడా ఎంత చింత ఉంటుంది! మనమైతే గుప్తముగా ఉన్నాము. మనకు బాహ్య ఆడంబరము అవసరము లేదు. వారు వెలుపలికి ఆడంబరము చేస్తారు. ఈ రాజ్యము మృగతృష్ణ సమానమైనది. శాస్త్రాలలో కూడా ద్రౌపది - ''అంధుని సంతానము అంధులే'' అని అంటుంది. ఇప్పుడు దేనినైతే రాజ్యమని భావిస్తున్నారో అది సమాప్తమయ్యే ఉంది. రక్తపు నదులు ప్రవహిస్తాయి. పాకిస్థాన్‌ మరియు భారతదేశము విభజన జరిగినప్పుడు ఇంటింటిలో ఎన్ని మారణహోమాలు, దాడులు జరిగాయి. ఇప్పుడైతే నడి వీధిలో దాడులు జరుగుతాయి. ఎంత రక్తము ప్రవహిస్తూ ఉంటుది! దీనిని స్వర్గమని అంటారా? నూతన భారతదేశము, కొత్త ఢిల్లీ ఇదేనా? నూతన భారతదేశమైతే ఫరిస్తాన్‌(దేవకాంతలు నివసించు ప్రదేశము)గా ఉండేది. ఇప్పుడైతే వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఇవి పెద్ద శత్రువులు. రామ-రావణుల జన్మను భారతదేశములోనే చూపిస్తారు. శివజయంతిని విదేశాలలో జరుపుకోరు. రావణుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసు. పగలు పూర్తి అయ్యి రాత్రి వస్తూనే రావణుడు వచ్చేస్తాడు. దీనిని వామమార్గమని అంటారు. వామమార్గములోకి వెళ్ళడం ద్వారా దేవతలకు ఏ గతి పట్టిందో కూడా చూపిస్తారు.

పిల్లలు సర్వీసు చేయాలి. ఎవరైతే స్వయం జాగృతులై ఉంటారో వారే ఇతరులను మేల్కొల్పుతారు. బాబా ఏమో శుభ చింతకులు. వీరికి మాయ చెంపదెబ్బ ఎక్కడా తగులరాదని శుభకామన ఉంచుతారు. వ్యాధి ఉంటే సర్వీసు చేయలేరు. జగదంబకే జ్ఞానకలశము లభిస్తుంది. లక్ష్మికి కాదు. లక్ష్మి చేతిలో దానము చేసేందుకు ధనాన్ని చూపిస్తారు. కాని అక్కడైతే దానము మొదలైనవి ఉండవు. సదా పేదవారికే దానము ఇవ్వబడ్తుంది. కావున కన్యలు ఇలా మందిరాలకు వెళ్ళి సర్వీసు చేస్తే చాలా మంది వస్తారు. మెచ్చుకొని అభినందిస్తారు. కాళ్ళ పై పడ్తారు. మాతలకు కూడా గౌరవముంది. మాతలు వినగానే ప్రఫుల్లితులుగా కూడా అవుతారు. పురుషులకైతే తమ అహంకారము(నషా) ఉంటుంది కదా.

ఈ సాకార బాబా బాహ్యర్యామి అని, ఇతనిలో ఉండే నాథుడు, నాథులకే నాథుడు అని బాబా అర్థం చేయించారు. కృష్ణుని లార్డ్‌ అని అంటారు కదా. కాని కృష్ణునికి కూడా లార్డ్‌ ఆఫ్‌ లార్డ్‌ ఆ పరమాత్మయే. వారికి ఈ ఇల్లు ఇవ్వబడింది. కావున వీరు యజమాని(భూస్వామి, ల్యాండ్‌లార్డ్‌) మరియు భూస్వామిణి(ల్యాండ్‌ లేడి) కూడా అయినారు. ఇతడు పురుషుడు మరియు స్త్రీ కూడా. విచిత్రము కదా.

భోగ్‌ పెడ్తున్నారు. మంచిది. బాబాకు అందరి ప్రియస్మృతులు తెలపండి. ఖుషీతో పెద్ద ఉస్తాదుకు సలామ్‌(నమస్కారాలు) పంపుతాము. ఇది ఒక ఆచారము. ప్రారంభములో ఎలాగైతే సాక్షాత్కారాలు జరిగాయో, అలా చివర్లో కూడా బాబా చాలా ఆహ్లాదపరుస్తారు. ఆబూలోకి చాలా మంది పిల్లలు వస్తారు. ఎవరు ఉంటారో వారు చూస్తారు. మంచిది. అచ్ఛా!

రాత్రి క్లాసు (08-04-1968) :-

ఈ ఈశ్వరీయ మిషను కొనసాగుతోంది. ఎవరైతే మన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారో వారే వచ్చేస్తారు. వారిది క్రైస్త్తవులుగా తయారు చేసే మిషనరీ(సంస్థ). క్రైస్తవులుగా అయిన వారికి ఆ క్రైస్తవ వంశములో సుఖము లభిస్తుంది. మంచి జీతము లభిస్తుంది. కనుక అనేకమంది క్రైస్తవులుగా మారిపోయారు. భారతవాసులు ఇంత జీతాలు మొదలైనవి ఇవ్వలేరు. ఇక్కడ లంచగొండితనము చాలా ఎక్కువగా ఉంది. లంచము తీసుకోకపోతే ఉద్యోగాన్నే ఊడగొట్టేస్తారు, ఇటువంటి పరిస్థితిలో ఏమి చేయాలని పిల్లలు తండ్రిని అడుగుతారు. యుక్తితో పని చేయండి, ఆ ధనాన్ని శుభకార్యములో ఉపయోగించండి అని బాబా చెప్తారు.

''పతితులైన మమ్ములను పావనంగా చేయండి, విముక్తిని కలిగించండి, ఇంటికి తీసుకెళ్ళండి'' అని ఇక్కడ అందరూ తండ్రిని పిలుస్తారు. తండ్రి తప్పకుండా ఇంటికి తీసుకెళ్తారు కదా. ఇంటికి వెళ్లేందుకే ఇంత భక్తి మొదలైనవి చేస్తారు. కాని తండ్రి వచ్చినప్పుడే తీసుకెళ్తారు. భగవంతుడు ఒక్కరే. అందరిలో భగవంతుడు వచ్చి మాట్లాడరు. వారు సంగమయుగములోనే వస్తారు. ఇప్పుడు మీరు అటువంటి విషయాలను నమ్మరు. ఇంతకుముందు అంగీకరించేవారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. మొదట మేము కూడా పూజలు చేసేవారము. ఇప్పుడు మమ్ములను పూజ్య దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారని మీరు చెప్తారు. సిక్కులకు కూడా అర్థము చేయించండి. మనుష్యుల నుండి దేవతలుగా............... అని గాయనముంది కదా. దేవతలకు మహిమ ఉంది కదా. దేవతలు సత్యయుగములో ఉంటారు. ఇప్పుడిది కలియుగము. తండ్రి కూడా సంగమ యుగములో పురుషోత్తములయ్యే శిక్షణను ఇస్తున్నారు. దేవతలు సర్వోత్తములు. అందుకే అంతగా పూజిస్తారు. ఎవరినైతే పూజిస్తారో, వారు ఎప్పుడో ఉండి వెళ్ళారని, ఇప్పుడు లేరని అర్థము. ఈ రాజధాని గడిచిపోయిందని భావిస్తారు. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. మనము విశ్వానికి అధిపతులుగా అవుతామని ఎవ్వరికీ తెలియదు. మనము చదువుకొని ఇలా అవుతామని మీకు తెలుసు. కావున చదువు పై పూర్తి గమనముంచాలి. తండ్రిని చాలా ప్రీతితో స్మృతి చేయాలి. బాబా మనలను విశ్వాధిపతులుగా చేస్తున్నారంటే ఎందుకు స్మృతి చేయము! మళ్లీ దైవీ గుణాలు కూడా కావాలి. మంచిది.

ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్‌దాదాల ప్రియస్మృతులు, గుడ్‌నైట్‌ మరియు నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ప్రపంచంలో బాహ్య అలంకారాన్ని చేసుకోరాదు. షో పనికి రాదు. సంపూర్ణంగా ఉత్తీర్ణులయ్యేందుకు గుప్త పురుషార్థము చేస్తూ ఉండాలి.

2. ఈ రంగు రంగుల ప్రపంచములో చిక్కుకోరాదు. నిర్మోహులుగా అయ్యి తండ్రి పేరు ప్రసిద్ధము చేసే సేవ చేయాలి. సర్వుల సౌభాగ్యమును మేల్కొల్పాలి.

వరదానము :-

''సదా సంతోషమనే ఆహారాన్ని తిని, తినిపించే ఖుష్‌హాల్‌, ఖుష్‌నసీబ్‌ భవ(సంపన్న, అదృష్టశాలి భవ)''

పిల్లలైన మీ వద్ద సత్యమైన అవినాశి ధనముంది. అందువలన మీరు అందరికంటే ధనవంతులు. నూనె లేని(సూఖా) రొట్టెలు తింటున్నా, సంతోషమనే ఖురాక్‌(టానిక్‌) ఆ సూఖా రొట్టెలలో నిండి ఉంటుంది. ఇతర పౌష్ఠిక ఆహారమేదీ లేదు. అందరికంటే మంచి పౌష్ఠిక ఆహారము తినేవారు, సుఖమునిచ్చే రొట్టెలు తినేవారు మీరే. అందువలన సదా ఖుష్‌హాల్‌గా(సంపన్నంగా) ఉంటారు. కనుక ఎటువంటి ఖుష్‌హాల్‌గా ఉండాలంటే ఇతరులు కూడా మిమ్ములను చూచి ఖుష్‌హాల్‌గా అయిపోవాలి. అప్పుడు ఖుష్‌నసీబ్‌ ఆత్మలని అంటారు.

స్లోగన్‌ :-

''ఎవరి ఒక్క సంకల్పము, మాట కూడా వ్యర్థంగా పోదో, వారే నాలెడ్జ్‌ఫుల్‌ (జ్ఞానస్వరూపులు) ''