20-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - స్మృతిలో ఉండే అభ్యాసము ఎంతగా చేయాలంటే, అంతిమ సమయములో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు ''

ప్రశ్న :-

ఏ శ్రీమతాన్ని పాలన చేయడం ద్వారా పిల్లలైన మీరు భాగ్యవంతులుగా అవ్వగలరు ?

జవాబు :-

బాబా శ్రీమతమునిస్తున్నారు - పిల్లలూ, నిద్రను జయించేవారుగా అవ్వండి. ఉదయము (అమృతవేళ) చాలా బాగుంటుంది. ఆ సమయములో లేచి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు అదృష్టవంతులుగా అవుతారు. ఉదయము ఉదయమే లేవకుంటే, ఎవరైతే నిదురిస్తారో వారు పోగొట్టుకుంటారు. కేవలం పడుకోవడం, తినడం - ఇది పోగొట్టుకోవడమే. కావున ఉదయమే (అమృతవేళ) లేచే అలవాటు చేసుకోండి.

పాట :-

నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు, తిని పగలు పోగొట్టుకున్నావు,.......(తూనే రాత్‌ గవాయీ సోకే, .......)   

ఓంశాంతి.

ఈ కథ పిల్లలను గురించే. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! తినడము, పడుకోవడము దీనిని జీవితమని అనరు. పిల్లలైన మీకు ఇప్పుడు అవినాశీ జ్ఞాన రత్నాల దానము లభిస్తోంది. మీ జోలె నిండుతున్నది, ఇప్పుడు కేవలము పడుకోవడం, తినడం ఇది పోగొట్టుకోవడమే అవుతుంది. ఉదయం లేవడానికి ఎంతో మహిమ ఉంది. భక్తిమార్గము మరియు జ్ఞానమార్గము రెండింటిలోనూ మహిమ ఉంది. ఎందుకంటే ఉదయము వేళలో చాలా శాంతిగా ఉంటుంది. ఆత్మలంతా అప్పుడు తమ స్వ ధర్మంలో ఉంటారు. అశరీరులుగా అయ్యి విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో స్మృతి చాలా బాగుంటుంది. పగలైతే మాయ గొడవ చాలా ఉంటుంది. ఇదొక్కటే మంచి సమయము. ఇప్పుడు మనము గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నాము. ''మీరు నా పిల్లలు, నేను మీ కొడుకును'' అని పిల్లలతో తండ్రి అంటున్నారు. బాబా కొడుకుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి తమ పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. నేను వ్యాపారిని కూడా. మీ గవ్వ తుల్యమైన తనువు, మనస్సు ఇవన్నీ పైసాకు కూడా కొరగావు. వారు మీ పాత వస్తువులన్నీ తీసుకొని మళ్లీ ట్రస్టీగా అయ్యి సంభాళించమని మీకే ఇచ్చేస్తాను. మీరు జన్మ-జన్మాంతరాలుగా నేను బలిహారమౌతాను........ అని అంటూ పాడుతూ వచ్చారు. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అన్నారు ఎందుకంటే అందరూ ప్రేయసులే. కావున ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. దేహ సహితంగా సర్వ సంబంధాలను మర్చిపోతూ మర్చిపోతూ ఒక్కరి స్మృతి ఎంతగా ఉండాలంటే ఇక అంతిమ సమయంలో ఈ శరీరము కూడా గుర్తుకు రాకూడదు, అంతేకాక ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు అంతగా అభ్యాసము చేయాలి. ఉదయం సమయం చాలా మంచిది. ఇది మీ సత్యమైన యాత్ర. వారు జన్మ-జన్మాంతరాలుగా యాత్రలు చేస్తూ వచ్చారు. కాని ఎవ్వరూ ముక్తిని పొందలేదు. కనుక అది అసత్యమైన యాత్రయే కదా! ఇది ఆత్మికమైన, సత్యమైన ముక్తి-జీవన్ముక్తుల యాత్ర. మనుష్యులు తీర్థ యాత్రలకు వెళ్లినప్పుడు అమర్‌నాథ్‌, బద్రీనాథ్‌ మొదలైనవి గుర్తుంటాయి కదా! విశేషంగా నాలుగు ధామాలని అంటారు. మీరు ఎన్ని ధామాలకు వెళ్లి ఉంటారు, ఎంత భక్తి చేసి ఉంటారు! అర్ధకల్పము భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి విముక్తులను చేసి, మార్గదర్శకులై మళ్లీ తమతో తీసుకెళ్తారు. తండ్రి ఎంతో అద్భుతమైన మార్గదర్శకుడు. పిల్లలను ముక్తి-జీవన్ముక్తి ధామాలకు తీసుకెళ్తారు. ఇటువంటి మార్గదర్శకుడు ఇంకెవ్వరూ ఉండరు. సన్యాసులు కేవలం ముక్తిధామము అని అంటారు. జీవన్ముక్తి అన్న పదము వారి నోటి నుండి రాదు. దానిని వారు కాకిరెట్టతో సమానమైన, అల్పకాలికమైన సుఖముగా భావిస్తారు. తండ్రి దు:ఖహర్త-సుఖకర్త అని పిల్లలైన మీకు తెలుసు. హే మాత-పిత! మేము మీకు పిల్లలుగా అయినప్పుడు మా దు:ఖాలన్నీ దూరమైపోతాయి, అర్ధకల్పము మేము సుఖవంతులుగా అయిపోతామని అంటారు. ఇది బుద్ధిలో ఉంటుంది కదా! కాని వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్లడంతో మర్చిపోతారు. అమృతవేళ లేవరు. ఎవరైతే నిద్రపోతారో, వారు పోగొట్టుకుంటారు.

మనకిప్పుడు వజ్ర తుల్యమైన జన్మ లభించిందని మీకు తెలుసు. ఇప్పుడు కూడా నిద్ర నుండి ఉదయమే లేవకపోతే, వారు అదృష్టవంతులు కారని భావించడం జరుగుతుంది. ఉదయమే లేచి అతిప్రియమైన తండ్రిని, ప్రియుడిని స్మృతి చేయరు. అర్ధకల్పము నుండి ప్రియుడు దూరమయ్యాడు, తండ్రిని మీరు మొత్తం కల్పమంతా మర్చిపోతారు. మళ్లీ భక్తిమార్గములో మీరు ప్రియుని రూపంలో లేక తండ్రి రూపంలో స్మృతి చేస్తారు. ప్రేయసి కూడా ప్రియుడిని తల్చుకుంటుంది. వారిని తండ్రి అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. కావున వారి శ్రీమతమును అనుసరించవలసి ఉంటుంది. శ్రీమతమును అనుసరించకపోతే పడిపోతారు. శ్రీమతము అనగా శివబాబా మతము. ఎవరి మతము లభిస్తోందో మాకేమి తెలుసు అని భావించరాదు. ఇతని(బ్రహ్మ) సలహాకు కూడా భాద్యత వారిదే అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణానికి లౌకిక రీతిలో కూడా పిల్లలకు బాధ్యుడు తండ్రే కదా! కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు. ఈ బ్రహ్మ తనువు కూడా తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. ఇతడు అల్లారుముద్దు కొడుకు. చాలా చాలా మంచి పిల్లలున్నారు. తాము ఎవరి మతానుసారం నడుచుకుంటున్నారో, ఎవరు డైరక్షన్‌ ఇస్తున్నారో కొందరికి తెలియదు. బాబానైతే స్మృతి చెయ్యరు, ఉదయం లేవరు. స్మృతి చేయకుంటే వికర్మలు కూడా వినాశనమవ్వవు. బాబా తెలుపుచున్నారు - నేను ఇంతగా కష్టపడుతున్నాను, అయినా కర్మభోగము నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ఒక్క జన్మ విషయము కాదు కదా! అనేక జన్మల లెక్కాచారాలు ఉన్నాయి. డైరెక్షన్‌ లభించింది. ఈ జన్మలో చేసిన పాపాలను తెలియజేయడం ద్వారా అవి సగం తగ్గిపోగలవు. తండ్రి అంటున్నారు - ఎన్నో పాపాలు చేశారని నాకూ తెలుసు, ధర్మరాజుకు కూడా తెలుసు. ధర్మరాజు గర్భజైలులో శిక్షలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడైతే మీరు పురుషార్థం చేసి వికర్మలు వినాశనం చేసుకుంటే మళ్లీ మీకు గర్భ మహలు లభిస్తుంది. అక్కడ మనుష్యులతో పాపాలు చేయించి శిక్షలు అనుభవింపజేసే మాయ ఉండదు. అర్ధకల్పము ఈశ్వరీయ రాజ్యము ఉంటుంది. అర్ధకల్పము రావణ రాజ్యము ఉంటుంది. సర్పము ఉదాహరణ కూడా ఇక్కడిదే. దీనినే సన్యాసులు కాపీ చేశారు. బాబా భ్రమరము ఉదాహరణ కూడా ఇస్తారు. భ్రమరము పురుగులను తన ఇంటికి తీసుకొస్తుంది. అలా మీరు కూడా పతితులను తీసుకొస్తారు. మళ్లీ కూర్చొని వారిని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మీ పేరు బ్రాహ్మణి. భ్రమరము ఉదాహరణ చాలా బాగుంది. ప్రాక్టికల్‌గా ఎంతోమంది వస్తారు. కొందరు కచ్చాగా ఉండిపోతారు, కొందరు కుళ్లిపోతారు, కొందరు అంతమైపోతారు. మాయ ఎన్నో తుఫాన్లలోకి తీసుకొస్తుంది. నిజానికి మీరందరూ ఒక్కొక్కరు హనుమంతులే. మాయ ఎన్ని తుఫానులు తీసుకొచ్చినా మనం బాబాను, స్వర్గాన్ని ఎప్పుడూ మర్చిపోము. ఘడియ ఘడియ అప్రమత్తంగా ఉండమని బాబా అంటారు. మనుష్యులు తీర్థ యాత్రలకు ఎన్నో ఎదురు దెబ్బలు తినేందుకే వెళ్తారు. ఇక్కడైతే మీరు ఇంకెక్కడికీ వెళ్లరు. ఒక్క తండ్రిని మరియు సుఖధామాన్నే స్మృతి చేస్తూ ఉండాలి. మీరు తప్పకుండా విజయాన్ని పొందేవారు. దీనిని బుద్ధియోగ బలము, జ్ఞానబలము అని అంటారు. స్మృతి చేయడం ద్వారా బలము లభిస్తుంది. బుద్ధికి వేయబడిన తాళము తెరుచుకుంటుంది. ఏదైనా నియమ విరుద్ధమైన నడవడికను నడిచినట్లైతే వారి బుద్ధి తాళము మూసుకుపోతుంది. మీరు ఇలా చేసినట్లైతే డ్రామా అనుసారము బుద్ధి తాళము మూసుకుపోతుంది అని కూడా బాబా అర్థం చేయిస్తారు. అప్పుడు మీరు వికారాలలోకి వెళ్లకండి అని ఎవ్వరికీ చెప్పలేరు. నేను ఇన్ని పాపాలు చేశానని లోలోపల మనసు తింటూ ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా మనసు తింటుంది, అలాగే మరణిస్తారు. ఆ తర్వాత క్షమించమని వేడుకుంటారు. చివరిలో అన్ని పాపాలు తమ ముందుకు వచ్చేస్తాయి. గర్భజైలులోకి వెళ్ళడంతోనే వెంటనే శిక్షలు మొదలౌతాయి. చివర్లో అవి తప్పకుండా గుర్తుకు వస్తాయి. కావున మీరు క్షమించమని వేడుకోవలసిన అవసరం లేకుండా ఇక పాపాలు చేయకండి. జైలు పక్షులు ఉంటారు కదా! అలాగే మీరు కూడా జైలు పక్షులుగా ఉండేవారు. ఇప్పుడు బాబా గర్భ జైలులోని శిక్షల నుండి విడిపిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లైతే పాపాల శిక్షల నుండి విముక్తులైపోతారు, మీరు పావనంగా అయిపోతారని బాబా అంటారు. మళ్లీ మీరు పడిపోయినట్లైతే ఎంతో పెద్ద దెబ్బ తగులుతుంది. మొదటిది అశుద్ధ అహంకారము. ఆ తర్వాత కామము, క్రోధము. కామము మహాశత్రువు. ఇది మీకు ఆదిమధ్యాంతము దు:ఖమును ఇస్తూ వచ్చింది. మీరు ఆదిమధ్యాంతము సుఖము కొరకే పురుషార్థము చేస్తారు. కావున పురుషార్థము పూర్తిగా చేయాలి. ఉదయమే లేవలేమని అంటారు. అప్పుడు పదవి కూడా ఉన్నతంగా పొందలేరు. దాస-దాసీలుగా అవ్వవలసి వస్తుంది. అక్కడ పేడ మొదలైనవి ఎత్తవలసిన అవసరముండదు. పాకీవారు ఉండరు. ఇప్పుడు కూడా విదేశాలలో నౌకర్లు మొదలైనవారిని పెట్టుకోరు. దానంతటదే శుద్ధమైపోతుంది. అక్కడ మురికి ఏదీ ఉండదు. ఛండాలురు, దాస-దాసీలు మొదలైనవారు ఉంటారు.

తండ్రి పిల్లలైన మీకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. మీ బుద్ధిలో మొత్తం రాజధాని అంతా ఉంది. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ముఖ్యమైనది ఈ చక్రమును అర్థం చేయించాలి. ప్రారంభోత్సవము కొరకు గవర్నర్‌ మొదలైనవారిని పిలుస్తారు. కావున పిల్లలకు ఆదేశము లభిస్తుంది - ప్రారంభోత్సవము చేసేందుకు ముందు వారికి కొంత జ్ఞానము తెలపండి. భారతదేశము శ్రేష్ఠాచారిగా ఉండేది, ఇప్పుడు మళ్లీ భారతదేశము భ్రష్ఠాచారిగా అయిపోయింది. భారతదేశములోని పూజ్య దేవీ దేవతలే మళ్లీ పూజారి మనుష్యులుగా అయ్యారు. ఈ విషయాన్నీ తప్పకుండా వారికి అర్థం చేయించాలి. తద్వారా సృష్టి చక్ర రహస్యాన్ని వీరు అర్థం చేయిస్తారని వారు స్వయంగా ఇతరులకు చెప్పాలి. ఇది ఎవరికైతే తెలుసో వారిని త్రికాలదర్శులని అంటారు. మనుష్యులై ఉండి డ్రామాను గురించి తెలుసుకోకుంటే వారు ఇంకెందుకు పనికి వస్తారు? బి.కెల పవిత్రత చాలా మంచిది అని చాలా మంది అంటారు. పవిత్రత అయితే అందరికీ మంచిదే అనిపిస్తుంది. సన్యాసులు పవిత్రంగా ఉంటారు. దేవతలు కూడా పవిత్రంగా ఉంటారు. అందుకే వారి ముందుకు వెళ్లి తల వంచుతారు కదా! కాని ఇది వేరే విషయం. పతితపావనులు ఒక్క పరమాత్మయే అవ్వగలరు. పతితుల నుండి పావనులుగా తయారుచేసే మనుష్య గురువులెవ్వరూ లేరు. ఈ విషయాన్ని అర్థం చేయించాలి. దయ చేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, అప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా అవ్వగలదని వారికి చెప్పండి. పూజ్య భారతదేశము పూజారిగా ఎలా అయ్యిందో, దేవీ దేవతలైన భారతవాసులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో వారికి అర్థం చేయించండి. ఈ విషయాలను వారికి తప్పక అర్థం చేయించాలి. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం భారతవాసులు దేవీ దేవతలుగా ఉండేవారు. దానిని సుఖధామమని, స్వర్గమని అంటారు. ఆ స్వర్గమే ఇప్పుడు నరకంగా అయ్యింది. ఈ విషయాలను మీరు కూర్చొని అర్థం చేయించినట్లైతే మీ మహిమ ఎంతో గొప్పగా జరుగుతుంది. వార్తాపత్రికల వారిని కూడా పిలిచి పార్టీ ఇవ్వాలి. ఆ తర్వాత వారు మంటలు అంటించినా, నీరు పోసినా ఇక వారి ఇష్టం పై ఆధారపడి ఉంది. యుద్ధము జరగవలసిందేనని పిల్లలైన మీకు తెలుసు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఎల్లప్పుడూ ఇక్కడ నుండే రక్త నదులు ప్రవహిస్తూ వచ్చాయి. హిందూ - ముస్లింల మారణహోమాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు విభజన జరిగినందున ఎంతమంది మనుష్యులు చెల్లాచెదురైపోయారు! పూర్తిగా వేరు వేరు రాజధానులైపోయాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పరస్పరం పోట్లాడుకుంటారు, విభజనలు చేస్తారు. ఇంతకు ముందు హిందుస్తాన్‌, పాకిస్తాన్‌ వేరు వేరుగా ఉండేవి కావు. భారతదేశంలోనే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. ఆ తర్వాత మళ్లీ నేతి నదులు ప్రవహిస్తాయి. దాని రిజల్టు ఎలా ఉంటుంది? కొద్దిమంది మిగిలిపోతారు. పాండవులైన మీరు గుప్త వేషములో ఉన్నారు.

కావున మొదట గవర్నర్‌కు పరిచయమునివ్వాలి. ఎవరి వద్దకైతే వెళ్ళవలసి ఉంటుందో ముందు వారిని మహిమ చేయడం జరుగుతుంది. కాని వారి కొరకు ఏమి వ్రాయబడి ఉందో ఆ రహస్యము మీకు మాత్రమే తెలుసు. ఇదంతా మృగతృష్ణ సమానమైన రాజ్యమని వారు భావించరు. డ్రామానుసారంగా వారు కూడా తమ ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. మహాభారతములో ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు. కాని నిజానికి మహాప్రళయము జరగదు. పిల్లలైన మీలో సృష్టిచక్రము యొక్క జ్ఞానము ప్రతి క్షణము మారుమ్రోగుతూ ఉండాలి. వీరికి శిక్షణను ఇచ్చేది, విద్య నేర్పేది ఎవరో వారు మొదట అర్థం చేసుకోవాలి. అప్పుడు వారు - మేము కూడా శివుని పిల్లలమే కదా! అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే. ఇది వంశము, ప్రజాపిత బ్రహ్మ గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌. మనుష్య సృష్టికి పెద్ద బ్రహ్మయే కదా! శివుడిని అలా అనరు. వారిని కేవలం తండ్రి అని అంటారు. గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ అన్న టైటిల్‌ ప్రజాపిత బ్రహ్మదే. తప్పకుండా గ్రాండ్‌ మదర్‌ (అమ్మమ్మ) గ్రాండ్‌ చిల్డ్రన్‌(పౌత్రులు) కూడా ఉంటారు. పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివుడు ఆత్మలందరి తండ్రి, వారు బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు. మన వంశాలు ఎన్ని వెలువడతాయో మీకు తెలుసు. ఇటువంటి ఎగ్జిబిషన్‌ను మూల మూలలకూ వ్యాపింపజేయాలి. మీరు ఏర్పాట్లు చేయించండి అని గవర్నర్‌కు తెలపాలి. మాకకు మూడడుగుల భూమి కూడా దొరకదు. అయినా మేము మళ్లీ విశ్వాధిపతులుగా అయిపోతాము. మీరు ఏర్పాట్లు చేయిస్తే మేము భారతదేశమును స్వర్గముగా తయారుచేసే సేవను చేస్తామని వారికి అర్థం చేయించాలి. వారు మీకు కొద్దిగా సహాయము చేసినా, గవర్నర్‌ కూడా బ్రహ్మాకుమార్‌గా అయిపోయాడని వారు అనడం ప్రారంభిస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. గవ్వ తుల్యమైన తనువు-మనస్సు-ధనము ఏవైతే మీ వద్ద ఉన్నాయో వాటిని బాబాకు అర్పణ చేసి ట్రస్టీ(నిమిత్తము)గా ఉండి సంభాళించాలి. మమకారాన్ని తొలగించి వేయాలి.

2. ఉదయము ఉదయమే లేచి బాబాను ప్రీతిగా స్మృతి చేయాలి. జ్ఞాన బలము, బుద్ధి యోగబలముతో మాయ పై విజయము పొందాలి.

వరదానము :-

''సదా ఉమంగ - ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగిరేకళలో ఎగిరే శ్రేష్ఠ ఆత్మా భవ''

జ్ఞాన-యోగాలతో పాటు ప్రతి సమయం, ప్రతి కర్మలో, ప్రతి రోజు నూతన ఉమంగ - ఉత్సాహాలు ఉండాలి - ఇదే ఎగిరేకళకు ఆధారము. ఎటువంటి పని అయినా, కసువు ఊడ్చే పని గాని, పాత్రలు శుభ్రపరచే పని గాని, సాధారణ కర్మ గాని అందులో కూడా ఉమంగ-ఉత్సాహాలు నిరంతరంగా, న్యాచురల్‌గా ఉండాలి. ఎగిరేకళలోని శ్రేష్ఠమైన ఆత్మ ఉమంగ-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉంటుంది, ఎప్పుడూ కన్ఫ్యూస్‌ అవ్వదు(తికమకపడదు). చిన్న చిన్న విషయాలకు అలసిపోయి ఆగిపోదు.

స్లోగన్‌ :-

''నిర్మాణ చిత్తులుగా, అలసిపోకుండా సదా వెలిగే జ్యోతులుగా ఉండువారే విశ్వకళ్యాణకారులు''