20-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - స్మృతి రూపీ ఔషధము ద్వారా స్వయాన్ని సదా నిరోగిగా చేసుకోండి. స్మృతి చేసే మరియు స్వదర్శన చక్రమును తిప్పే అభ్యాసముంచుకుంటే వికర్మాజీతులుగా అయిపోతారు''

ప్రశ్న :-

ఏ పిల్లలైతే తమ ఉన్నతి పై సదా గమనముంచుకుంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి?

జవాబు :-

వారి ప్రతి కర్మ సదా శ్రీమతము పై ఆధారపడి ఉంటుంది. పిల్లలూ, దేహాభిమానములోకి వశము కాకండి. స్మృతియాత్ర చార్టును ఉంచండి. తమ లెక్కాచారాన్ని వ్రాసుకోండి. ''ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉన్నాము, ఎంత సమయము ఇతరులకు అర్థము చేయించాము'' అని చెక్‌ చేసుకోండి అని తండ్రి శ్రీమతమునిచ్చారు.

పాట :-

నీవు ప్రేమసాగరుడవు,.......................(తూ ప్యార్‌ కా సాగర్‌ హై,......................)   

ఓంశాంతి.

ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలో కూర్చోవాలి. మాయ చాలామందిని స్మృతి చేయనివ్వదు. ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. కొంతమందికి బంధు-మిత్రులు, కొంతమందికి ఆహార-పానీయాలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక్కడకు వచ్చినప్పుడు మీరు తండ్రిని ఆహ్వానించాలి. ఉదాహరణానికి లక్ష్మిని పూజించునప్పుడు లక్ష్మిని ఆహ్వానిస్తారు కదా. అప్పుడు లక్ష్మి ఏమీ రాదు. కేవలం అలా అంటారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేయండి లేక ఆహ్వానించండి. స్మృతి చేయడం లేక ఆహ్వానించడం రెండూ ఒక్కటే. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. వికర్మలు చాలా చేశారు కనుక ధారణ జరగదు. అందుకే తండ్రిని కూడా స్మృతి చేయలేరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మాజీతులుగా అవుతారు. ఆరోగ్యం లభిస్తుంది. ఇది చాలా సహజము. కాని మాయ లేక గతంలో చేసిన వికర్మలు అవరోధాలు కలిగిస్తాయి. తండ్రి చెప్తున్నారు - మీరు అర్ధకల్పము అయ్యధార్థంగా స్మృతి చేశారు. ఇప్పుడైతే ప్రత్యక్షముగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారు వచ్చి మురళి వినిపిస్తారని మీకు తెలుసు. కాని ఈ స్మృతి చేసేందుకు అలవాటు పడి ఉండాలి. సదా నిరోగులుగా అయ్యేందుకు సర్జన్‌ ''నన్ను స్మృతి చేయండి'' అని స్మృతి అనే ఔషధమునిస్తారు. మళ్లీ మీరు వచ్చి నన్ను కలుసుకుంటారు. నన్ను స్మృతి చేయడం ద్వారానే వారసత్వము పొందుతారు. తండ్రిని, మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. ఎక్కడకు వెళ్లాలో ఆ ఇంటిని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి ఇక్కడకు వచ్చి సత్యమైన సందేశాన్ని ఇస్తారు. ఇతరులెవ్వరూ ఈశ్వరుని సందేశాన్ని ఇవ్వలేరు. ఆ సందేశకులైతే ఇక్కడకు స్టేజి పై పాత్రను అభినయించేందుకు వస్తారు. ఈశ్వరుని మర్చిపోతారు. ఈశ్వరుని గురించే వారికి తెలియదు. నిజానికి వారిని సందేశకులని, పైగంబర్లు, మెసెంజర్లు అని అనజాలరు. మనుష్యులు వారికి ఆ పేర్లు పెట్టారు. వారు ఇక్కడకు వచ్చి తమ పాత్రను అభినయించాలి. కనుక వారు ఎలా స్మృతి చేస్తారు? పాత్ర చేస్తూ చేస్తూ పతితులుగా అవ్వాల్సిందే. మళ్ళీ చివర్లో పావనంగా అవ్వాలి. తండ్రే వచ్చి పావనంగా చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు - పావనంగా అయ్యేందుకు ఒకే ఉపాయముంది - దేహ సహితము ఉన్న దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి.

పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయమని ఆత్మలైన మీకు ఆజ్ఞ లభించిందని మీకు తెలుసు. అలా స్మృతి చేస్తే ఆజ్ఞాకారులని పిలువబడ్తారు. ఎవరెంత పురుషార్థము చేస్తారో అంత ఆజ్ఞాకారులు. స్మృతి తక్కువగా చేస్తే తక్కువ ఆజ్ఞాకారులు. ఆజ్ఞాకారులు పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. తండ్రి ఆజ్ఞ - ఒకటేమో తండ్రినైన నన్ను స్మృతి చేయండి. రెండవది జ్ఞానాన్ని ధారణ చేయండి. స్మృతి చేయలేదంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే చాలా ధనము ప్రాప్తిస్తుంది. భగవానువాచ - నన్ను స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి. అనగా డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోండి. నా ద్వారా నన్నూ తెలుసుకోండి సృష్టి ఆదిమధ్యాంతాల చక్రమునూ తెలుసుకోండి. ఈ రెండూ ముఖ్యమైన విషయాలు. వీటి పై గమనమివ్వండి. శ్రీమతము పై పూర్తి గమనముంచినట్లయితే ఉన్నతమైన పదవిని పొందుతారు. దయాహృదయులుగా అవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలిపించాలి. కళ్యాణము చేయాలి. మిత్ర సంబంధీకులు మొదలైనవారిని సత్యమైన యాత్రకు తీసుకుని వెళ్ళే యుక్తిని రచించాలి. అవి శారీరిక యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక జ్ఞానము ఇంకెవ్వరి వద్దా లేదు. అవన్నీ శాస్త్రాల వేదాంతము. ఇది ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానము. పరమాత్మ, ఆత్మలకు అర్థము చేయించి వాపస్‌ ఇంటికి తీసుకెళ్లేందుకే ఈ జ్ఞానమునిస్తున్నారు.

చాలామంది పిల్లలు గత్యంతరము లేక తప్పదన్నట్లు ఇక్కడకు వచ్చి కూర్చుంటారు. వారికి తమ స్వ ఉన్నతి గురించిన ఆలోచనే ఉండదు. దేహాభిమానము చాలా ఉంటుంది. ఆత్మాభిమానులుగా ఉంటేనే దయాహృదయులుగా అవుతారు. శ్రీమతమును అనుసరిస్తారు. కాని ఆజ్ఞాకారులుగా లేరు. ఎంత సమయము స్మృతి చేశాను? ఏ ఏ సమయాలలో స్మృతి చేశాను? అని చార్టు పెట్టండి. ఇంతకముందు చార్టు పెట్టేవారు భలే బాబా వద్దకు పంపకపోయినా మీ వద్ద అయినా చార్టునుంచండి. మేము లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా అయినామా? అని తమ ముఖాన్ని చూసుకోండి. వ్యాపారస్థులు తమ లెక్కాచారము వ్రాసుకుంటారు. కొందరు మనుష్యులు రోజంతటి దినచర్యను వ్రాసే అభిరుచిని కలిగి ఉంటారు. ఎంత సమయము నేను బాబా స్మృతిలో ఉన్నానని లెక్కాచారము వ్రాయడం చాలా మంచిది. ఎంత సమయము ఇతరులకు అర్థము చేయించాను? ఇలా చార్టు ఉంచితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇలా ఇలా చేయమని తండ్రి సలహానిస్తారు. పిల్లలు తమ ఉన్నతిని చేసుకోవాలి. మాలలోని మణిగా అయ్యేవారు చాలా పురుషార్థము చేయాలి. బ్రాహ్మణుల మాల ఇప్పుడే తయారవ్వజాలదని, అంత్యములో అవుతుందని అప్పుడు రుద్రమాల తయారవుతుందని బాబా చెప్పారు. బ్రాహ్మణుల మాలలోని మణులు మారుతూ ఉంటాయి. నేడు 3-4 నంబరులో ఉన్నవారు మరుసటి రోజు చివరికి వెళ్లిపోతారు. ఎంత తేడా వచ్చేస్తుంది. కొందరు క్రింద పడి దుర్గతి పాలవుతారు. మాల నుండి కూడా పోతారు. ప్రజలలో కూడా పూర్తి ఛండాలుర జన్మను తీసుకుంటారు. మాలలో కూర్చబడాలంటే చాలా కష్టపడాలి. తమ ఉన్నతిని ఎలా చేసుకోవాలో చాలా మంచి సలహానిస్తారు. బాబా అందరి కొరకు చెప్తారు. భలే చెవిటివారికైనా సైగలతో తండ్రి స్మృతిని ఇప్పించవచ్చు. చెప్పేవారి కంటే ఉన్నతంగా వెళ్లవచ్చు. గ్రుడ్డివారు, కుంటివారు ఎలాంటివారైనా ఆరోగ్యవంతుల కంటే శ్రేష్ఠ పదవిని తీసుకోవచ్చు. క్షణములో సూచన ఇవ్వడం జరుగుతుంది. సెకండులో జీవన్ముక్తి లభిస్తుందని గాయనముంది కదా. తండ్రివారిగా అవుతూనే వారసత్వము తప్పకుండా దొరికేస్తుంది, కాని అందులో నెంబరువారు పదవులు తప్పకుండా ఉంటాయి. పిల్లలు జన్మించగానే ఆస్తికి హక్కుదారులుగా అవుతారు. మీరు ఆత్మలు పురుషులైన కారణంగా తండ్రి నుండి వారసత్వ అధికారాన్ని తీసుకోవాలి. ఆధారమంతా పురుషార్థము పైనే ఉంది. తర్వాత కల్పక్రితము కూడా ఇటువంటి పురుషార్థమే చేశామని అనడము జరుగుతుంది. ఇది మాయ జతలో మల్లయుద్ధము. మాయా రావణునితో పాండవులే యుద్ధము చేశారు. కొందరు పురుషార్థము చేసి విశ్వాధిపతులుగా, డబల్‌ కిరీటధారులుగా అవుతారు. కొందరు ప్రజలలో కూడా నౌర్లు, చాకర్లుగా అవుతారు. అందరూ ఇక్కడే చదువుతున్నారు. రాజధాని స్థాపన అవుతోంది. తప్పకుండా ప్రారంభంలో ఉన్న మణుల పైకే గమనము వెళ్తుంది. అష్టరత్నాలు ఎలా నడుస్తున్నారో పురుషార్థము ద్వారా తెలిసిపోతుంది. బాబా అంతర్యామి కాదు. అందరి మనస్సును చదివేవారు కాదు. అంతర్యామి అంటే సర్వజ్ఞులు. ప్రతి ఒక్కరి మనస్సులోని మాటలను కూర్చుని తెలుసుకోరు. సర్వజ్ఞులు అంటే జ్ఞానసాగరులు. సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవారు. అలాగని నన్ను థాట్‌రీడర్‌(సంకల్పమును చదువువారు) అని అనుకుంటున్నారా? నేను సర్వజ్ఞుడను అనగా భూత, వర్తమాన, భవిష్యత్తులనే సృష్టి ఆదిమధ్యాంతాలను తెలిసిన వారని అంటారు. అంతేకాని వీరు కూర్చుని ఒక్కొక్కరి హృదయాన్ని చదవరు. నన్ను థాట్‌రీడర్‌గా భావిస్తున్నారా? నేను అన్నీ తెలిసినవాడిని అనగా జ్ఞానస్వరూపుడను(నాలెడ్జ్‌ఫుల్‌). భూత, భవిష్యత్‌, వర్తమానాలనే ఆదిమధ్యాంతాలని అంటారు. ఈ చక్రమెలా తిరుగుతుందో, ఎలా పునరావృతము అవుతుందో దాని గురించి నాకు తెలుసు. ఆ జ్ఞానాన్నే పిల్లలైన మీచే చదివించేందుకే వస్తాను. ఎవరు ఎంత సర్వీసు చేస్తున్నారో, ఎంతగా చదువుతున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోగలరు. అలాగని బాబా కూర్చుని ఒక్కొక్కరిని గురించి తెలుసుకుంటారని కాదు. బాబా కూర్చుని ఈ వ్యాపారము ఎందుకు చేస్తారు? వారైతే సర్వమూ తెలిసినవారు. మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు. మనుష్య సృష్టి ఆదిమధ్యాంతాలు మరియు ముఖ్య పాత్రధారుల గురించి నాకు తెలుసని అంటున్నారు. పోతే రచన అయితే అంతులేనిది. సర్వమూ తెలిసినవారు అనే పదమైతే చాలా పాతది. నాకు తెలిపిన జ్ఞానాన్ని మీకు చదివిస్తున్నాను. పోతే మీరు ఏమేమి చేస్తారో అది రోజంతా కూర్చొని చూడను కదా! నేను సహజ రాజయోగము మరియు జ్ఞానాన్ని నేర్పించేందుకు వస్తాను. పిల్లలైతే చాలామంది ఉన్నారు. నేను పిల్లల ముందు ప్రత్యక్షమై ఉన్నాను. వ్యవహారమంతా(పనంతా) పిల్లలతోనే. నా పిల్లలయ్యే వారికే నేను తండ్రిని. ఎవరు స్వంత పిల్లలవుతారో, ఎవరు సవతి పిల్లలవుతారో నేను అర్థము చేసుకోగలను. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తున్నారు. శ్రీమతానుసారము ప్రతి కర్మ చేయాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. బృహస్పతి వారమును వృక్షపతి వారమని పిల్లలైన మీకు తెలుసు. తాను వృక్షపతి మరియు శివుడు కూడా. ఉన్నది వారు ఒక్కరే. గురువారం రోజున స్కూలులో కూర్చొని గురువును స్వీకరిస్తారు. ఉదాహరణానికి ఈ రోజు సోమనాథుని రోజు అనగా సోమవారము. శివబాబా సోమరసాన్ని తాపిస్తారు. వారి పేరు శివుడే కాని వారు చదివిస్తున్నందున సోమనాథుడని అనేశారు. సోమనాథుని రుద్రుడని కూడా అంటారు. రుద్రజ్ఞాన యజ్ఞమును రచించారంటే జ్ఞానాన్ని వినిపిస్తారని అర్థము. వారికి అనేక పేర్లు పెట్టేశారు. కనుక వాటి అర్థము తెలియజేయబడ్తుంది. ప్రారంభము నుండి ఈ ఒక్క యజ్ఞమే నడుస్తూ ఉంది. పూర్తి పురాతన సృష్టి సామాగ్రి అంతా ఈ యజ్ఞములో స్వాహా అవుతుందని ఎవ్వరికీ తెలియదు. మొత్తం మనుష్యులెవరైతే ఉన్నారో, తత్వాల సహితంగా మిగిలినవేవైతే ఉన్నాయో అన్నీ పరివర్తన అవ్వనున్నాయి. ఇది కూడా పిల్లలు చూస్తారు. చూసేవారు గొప్ప మహావీరులుగా ఉండాలి. ఏమి జరిగినా మర్చిపోరాదు. మనుష్యులైతే త్రాహి - త్రాహి అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట ఎవరికైనా ఇలా తెలిపించాలి. కొద్దిగా ఆలోచించండి. సత్యయుగములో ఒకే భారతదేశముండేది. అందులో మనుష్యులు చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఒకే ధర్మముండేది. కాని ఇప్పుడు కలియుగ అంత్యములో ఎన్ని ధర్మాలున్నాయి! ఇవి ఎంతవరకు కొనసాగుతాయి? కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుంది. ఇప్పుడు సత్యయుగ స్థాపన ఎవరు చేస్తారు? రచయిత అయితే ఆ తండ్రి ఒక్కరే. సత్యయుగ స్థాపన మరియు కలియుగ వినాశనము జరుగుతుంది. ఈ వినాశనము ఎదురుగా నిలిచి ఉంది. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా భూత, వర్తమాన, భవిష్యత్తుల జ్ఞానము లభించింది. ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. తండ్రి మరియు తండ్రి రచనలనైతే స్మృతి చేయాలి. ఇది ఎంత సహజమైన విషయము.

చిత్రాలలో జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులని వ్రాస్తారు. అందులో ప్రేమ సాగరుడనే పదము తప్పకుండా ఉండాలి. తండ్రి మహిమ పూర్తిగా భిన్నమైనది, సర్వవ్యాపి అని చెప్పి మహిమనంతా సమాప్తము చేస్తారు. కావున ప్రేమ సాగరుడనే పదము తప్పకుండా వ్రాయాలి. ఇది అనంతమైన తల్లిదండ్రుల ప్రేమ. అందుకే మీ కృపతో అపారమైన సుఖాలు ప్రాప్తిస్తాయని గానము చేస్తారు. కాని వారికి అర్థము తెలియదు. మీరు నన్ను తెలుసుకుంటే సర్వమూ తెలుసుకుంటారని తండ్రి చెప్తున్నారు. నేనే సృష్టి ఆది-మధ్యాంతాల జ్ఞానాన్ని తెలిపిస్తాను. ఒక్క జన్మ విషయము కాదు. పూర్తి సృష్టి భూత, వర్తమాన, భవిష్యత్తులను తెలిసినవాడను. మరి ఎంతగా బుద్ధిలో కూర్చోవాలి. ఎలాగైతే ఆత్మాభిమానులుగా అవ్వరో, వారికి ధారణ కూడా జరగదు. పూర్తి కల్పమంతా దేహాభిమానమే కొనసాగింది. సత్యయుగంలో కూడా పరమాత్మ జ్ఞానముండదు. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. పరమాత్మ జ్ఞానాన్ని మర్చిపోతారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటుందని అర్థము చేసుకుంటారు. కాని అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. జ్ఞానసాగరులు, ప్రేమ సాగరులు - ఇది తండ్రి మహిమ. మన్మనాభవ, మధ్యాజీభవ......... ఈ ఒక్క బిందువు లభించడం ద్వారా మనము విషయ సాగరమును దాటి క్షీరసాగరములోకి వెళ్లిపోతాము. స్వర్గములో పాలు, నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు కదా. ఇదంతా మహిమ మాత్రమే. అంతేకాని పాలు, నెయ్యి నదులు ఉండవు. వర్షాలతో నీరు వెలువడ్తుంది, నెయ్యి ఎక్కడ నుండి వస్తుంది! ఇది కేవలం మహిమయే. స్వర్గమని దేనిని అంటారో మీకు తెలుసు. భలే అజ్మీరులో మాడల్‌(నమూనా) ఉంది కాని అర్థము తెలియదు. మీరు ఎవ్వరికి అర్థము చేయించినా వెంటనే అర్థము చేసుకుంటారు. ఎలాగైతే తండ్రికి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉందో అలా పిలలైన మీ బుద్ధిలో కూడా తిరుగుతూ ఉండాలి. తండ్రి పరిచయమునివ్వాలి. ఖచ్ఛితమైన మహిమ వినిపించాలి. వారి మహిమ అపారమైనది. అందరూ ఒకే సమానంగా ఉండరు. ప్రతి ఒక్కరికి వారి-వారి పాత్ర లభించి ఉంది. దివ్యదృష్టిలో బాబా చూపించినదంతా మీరు పోను పోను వాస్తవిక రూపములో చూస్తారు. స్థాపన మరియు వినాశనముల సాక్షాత్కారమును చేయిస్తూ ఉంటారు. అర్జునునికి కూడా దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారము చేయించారు. తర్వాత అదంతా ప్రత్యక్షంగా చూశాడు. మీరు కూడా ఈ కన్నులతో వినాశనాన్ని చూస్తారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారము చేసుకున్నారు. అవి వాస్తవమైనప్పుడు సాక్షాత్కారాలు సమాప్తమైపోతాయి. ఎంత మంచి మంచి విషయాలను బాబా అర్థము చేయిస్తారు! వీటిని పిల్లలు ఇతరులకు అర్థము చేయించాలి. సోదరీ-సోదరులారా, మీరు వచ్చి ఇటువంటి తండ్రి నుండి జ్ఞాన-యోగాల ద్వారా వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ అర్థం చేయించాలి.

బాబా ఆహ్వాన పత్రాన్ని సరిదిద్దుతున్నారు. క్రింద, ఈ కార్యము కొరకు తనువు-మనసు-ధనముల ద్వారా ఈశ్వరీయ సేవకు అంకితమై ఉన్నామని సంతకము చేస్తారు. పోను పోను ఎంతో మహిమ వెలువడ్తుంది. కల్పక్రితము ఎవరైతే వారసత్వము తీసుకున్నారో వారు తప్పకుండా రావాల్సిందే. కష్టపడాలి. ఖుషీ పాదరస మట్టము పెరుగుతూ పెరుగుతూ స్థిరమైన స్థితి తయారవుతుంది. తర్వాత పదే పదే వాడిపోరు. తుఫానులైతే చాలా వస్తాయి, వాటిని దాటుకోవాలి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. వ్యవహారము కూడా చేయండి. సర్వీసుకు ఋజువు చూపనంత వరకు తండ్రి ఈ సర్వీసులోకి తీసుకోరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శ్రీమతము పై పూర్తిగా గమనముంచి తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. అందరితో సత్యమైన యాత్రను చేయించాలి, దయాహృదయులుగా అవ్వాలి.

2. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటించాలి. స్మృతి లేక సేవా చార్టును తప్పకుండా ఉంచాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి.

వరదానము :-

''సత్యమైన హృదయంతో సాహెబ్‌ను రాజీగా చేసే రాజయుక్త, యుక్తియుక్త, యోగయుక్త భవ ''

బాప్‌దాదా టైటిల్‌ - దిల్‌వాలా, దిలారాం. ఎవరైతే సత్యమైన హృదయం గల పిల్లలుగా ఉంటారో వారి పై సాహెబ్‌ రాజీ అవుతారు. హృదయపూర్వకంగా తండ్రిని స్మృతి చేయువారు సహజంగా బిందు రూపంగా అవ్వగలరు. వారు తండ్రి ఇచ్చే విశేష ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. సత్యతా శక్తి ద్వారా సమయ ప్రమాణంగా వారి బుద్ధి యుక్తియుక్తంగా ఉండి, యధార్థ కార్యాన్ని స్వతహాగానే చేస్తారు. భగవంతుని రాజీ చేస్తారు(సంతోషపరుస్తారు). అందువలన వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ యధార్థంగా ఉంటాయి. వారు రాజయుక్తంగా, యుక్తియుక్తంగా, యోగయుక్తంగా అవుతారు.

స్లోగన్‌ :-

''తండ్రి ప్రేమలో సదా లీనమై ఉంటే అనేక ప్రకారాల దు:ఖము మరియు మోసాల నుండి రక్షింపబడ్తారు''