06-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి మెడలోని హారంగా అయ్యేందుకు జ్ఞాన-యోగాల రేస్ చేయండి. పూర్తి ప్రపంచానికి తండ్రి పరిచయమివ్వడం మీ కర్తవ్యము ''
ప్రశ్న :-
సదా ఏ నషా(మస్తీ)లో ఉంటే జబ్బు కూడా నయమైపోతుంది ?
జవాబు :-
ఈ పాత శరీరము గురించి చింత చేయకుండా జ్ఞాన-యోగాల మస్తీలో ఉండండి. ఎంతగా ఈ శరీరము పట్ల బుద్ధిని ఉంచుతారో, లోభము ఉంచుకుంటారో అంతగా జబ్బులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవడం, పౌడర్, ఫేస్క్రీమ్లు మొదలైనవి పూసుకోవడము - ఇవన్నీ వ్యర్థమైన అలంకారాలు. మిమ్ములను మీరు జ్ఞాన-యోగాలతో అలంకరించుకోండి. ఇదే మీ సత్య-సత్యమైన అలంకారము.
పాట :-
తండ్రి జతలో ఉన్నవారి కొరకే వర్షము,..............( జో పియా కే సాథ్ హై ఉన్ కే లియే బర్సాత్ హై,..............) 
ఓంశాంతి.
ఇప్పుడు ప్రపంచములో తండ్రులైతే చాలామంది ఉన్నారు. కాని వారందరి రచయిత అయిన తండ్రి ఒక్కరే. వారే జ్ఞానసాగరులు. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడని, జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుందని తప్పకుండా అర్థము చేసుకోవాల్సి ఉంటుంది. సత్యయుగము స్థాపన అయినప్పుడే మనుష్యులకు సద్గతి లభిస్తుంది. సద్గతిదాత అని తండ్రి ఒక్కరినే అంటారు. సంగమ సమయము ఎప్పుడు వస్తుందో అప్పుడు జ్ఞానసాగరుడు వచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. భారతదేశము అన్నిటికన్నా ప్రాచీనమైనది. 84 జన్మల గాయనము భారతవాసులకే ఉంది. మొట్టమొదట సృష్టిలోకి ఏ మనుష్యులైతే వచ్చి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటారు. దేవతలకు 84 జన్మలంటే బ్రాహ్మణులకు కూడా 84 జన్మలని అర్థము. ముఖ్యమైన వారినే ఉదహరిస్తారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తప్పకుండా బ్రహ్మ ద్వారానే సృష్టిని రచిస్తారు. మొట్టమొదట సూక్ష్మ లోకాన్ని తర్వాత స్థూల లోకాన్ని రచిస్తారు. ఇప్పుడు సూక్ష్మలోకము ఎక్కడుందో, మూల లోకము ఎక్కడుందో పిల్లలైన మీకు తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - వీటినే మూడు లోకాలని అంటారు. త్రిలోకనాథుడు అని అన్నప్పుడు, దాని అర్థము కూడా కావాలి కదా. తప్పకుండా ఏవో మూడు లోకాలైతే ఉంటాయి కదా. వాస్తవానికి ఒక్క తండ్రిని మరియు వారి పిల్లలైన మిమ్ములనే త్రిలోకనాథులని పిలువవచ్చు. ఇక్కడైతే త్రిలోకనాథ్, శివ, బ్రహ్మ, విష్ణు, శంకర్....... అని అనేకమంది మనుష్యుల పేర్లుంటాయి. భారతవాసులు ఈ పేర్లన్నీ తమ పై ఉంచుకున్నారు. రాధా-కృష్ణ, లక్ష్మినారాయణ అని డబల్ పేర్లు (జంట పేరు) కూడా ఉంచుకుంటారు. రాధ మరియు కృష్ణులు వేరు వేరుగా ఉండేవారని ఎవ్వరికీ తెలియదు. రాధ ఒక రాజ్యములో రాకుమారిగా ఉండేది. కృష్ణుడు మరొక రాజ్యములో రాకుమారునిగా ఉండేవాడు. ఈ విషయాలు ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. మంచి-మంచి పిల్లల బుద్ధిలో మంచి-మంచి పాయింట్లు ధారణ అయ్యి ఉంటాయి. ఎలాగైతే తెలివైన డాక్టరు వద్ద ఎన్నో మందుల పేర్లుంటాయి. ఇక్కడ కూడా నూతన మహావాక్యాలు చాలా వెలువడుతుంటాయి. రోజురోజుకు అన్వేషణలు జరుగుతూ ఉంటాయి. మంచి అనుభవమున్న వారు కొత్త కొత్త పాయింట్లు ధారణ చేస్తూ ఉంటారు. ధారణ చేయలేదంటే మహారథుల వరుసలోకి తీసుకోబడరు. ఆధారమంతా బుద్ధి పై మరియు అదృష్టము పై కూడా ఉంది. ఇది కూడా డ్రామాలో ఉంది కదా. డ్రామాను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కర్మక్షేత్రములో మనము పాత్రను అభినయిస్తున్నామని కూడా అర్థము చేసుకుంటారు. కాని డ్రామా ఆదిమధ్యాంతాలు తెలియకుంటేే ఏమీ తెలియనట్లే. పిల్లలైన మీరు అన్నీ తెలుసుకోవాలి.
తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. కనుక ఇతరులకు కూడా తండ్రి పరిచయమివ్వడం పిల్లల కర్తవ్యము. పూర్తి ప్రపంచానికి తెలియజేయడం వారి బాధ్యత. తర్వాత నాకు తెలియదు అని ఎవ్వరూ అనరాదు. మీ వద్దకు చాలామంది వస్తారు. సాహిత్యము మొదలైనవి చాలా తీసుకుంటారు. పిల్లలు ప్రారంభములో చాలా సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు. ఈ క్రీస్తు, ఇబ్రహీమ్ మొదలైనవారు కూడా భారతదేశములోకి వస్తారు. భారతదేశము అందరినీ తప్పకుండా ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి అనంతమైన తండ్రి జన్మ స్థానము భారతదేశమే కదా. కాని వారికి ఈ భారతదేశము భగవంతుని జన్మ స్థానమని తెలియదు. భలే శివపరమాత్మ అని అంటారు కూడా. కాని అందరూ పరమాత్మలే అని అన్నందున అనంతమైన తండ్రి మహత్వము మాయం చేసేశారు. పిల్లలైన మీరిప్పుడు భారతఖండము అన్నింటికన్నా గొప్ప తీర్థ స్థానమని అర్థము చేసుకున్నారు. మిగిలిన సందేశకులు మొదలైనవారందరూ వారి వారి ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారి వెనుక వారి ధర్మాలకు చెందిన వారు వస్తూ ఉంటారు. ఇప్పుడిది అంతిమ సమయము. వాపస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడికి మిమ్ములను ఎవరు తీసుకొచ్చారు? ఏసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశాడు. అతడే మిమ్ములను ఇక్కడకు లాక్కుని వచ్చాడు. ఇప్పుడు తిరిగి వాపసు వెళ్లేందుకు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయారు. ఈ విషయము మీరు అర్థము చేయించాలి. అందరూ వారి వారి పాత్రను అభినయించేందుకు వస్తారు. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ దు:ఖములోకి రావలసిందే. మళ్లీ ఆ దు:ఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకెళ్లడం తండ్రి కర్తవ్యమే. భారతదేశము తండ్రి జన్మ స్థానము. ఈ మహత్యము పిల్లలైన మీలో కూడా అందరికీ తెలియదు. అర్థము చేసుకునేవారు కొద్దిమందే. వారికే నషా కూడా ఎక్కువవుతుంది. తండ్రి కల్ప-కల్పము భారతదేశములోనే వస్తారు. ఇది అందరికీ తెలియజేయాలి, ఆహ్వానమివ్వాలి. మొదట ఈ సేవ చేయవలసి వస్తుంది. సాహిత్యాన్ని తయారు చేయించవలసి ఉంటుంది. ఆహ్వానమైతే అందరికీ ఇవ్వాలి కదా. రచయిత, రచనల జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. సేవాధారులుగా అయ్యి తమ పేరును ప్రసిద్ధము చేసుకోవాలి. ఎవరైతే చురుకైన పిల్లలుగా ఉంటారో, ఎవరి బుద్ధిలో చాలా పాయింట్లు ఉంటాయో వారి సహయోగము అందరూ కోరుతారు. వారి పేరే స్మరిస్తూ ఉంటారు. మొదట శివబాబాను జపిస్తారు. తర్వాత బ్రహ్మాబాబాను తర్వాత పిల్లలందరినీ నంబరువారుగా జపిస్తారు. భక్తిమార్గములో చేతితో మాలను తిప్పుతారు. ఇప్పుడు ఫలానివారు చాలామంచి సేవాధారులు, నిరహంకారులు, చాలా మధురమైనవారు, వారికి దేహాభిమానమే లేదు అని నోటితో జపిస్తారు. మధురంగా అయినట్లైతే అందరూ మధురంగా వ్యవహరిస్తారని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు - మీరు దు:ఖితులుగా అయ్యారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే నేను కూడా మీకు సహయోగము చేస్తానని తండ్రి అంటారు. మీరు ద్వేషిస్తే నేనేం చేస్తాను? అంటే వారు తమను తామే ద్వేషించుకుంటారు. పదవి లభించదు. ధనము లెక్కలేనంత లభిస్తుంది. ఎవరికైనా లాటరీ తగిలితే ఎంతగా సంతోషిస్తారు. అందులో కూడా బహుమతులు వస్తాయి. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతులు ఉంటాయి. అలాగే ఇది కూడా ఈశ్వరీయ రేస్. జ్ఞానము మరియు యోగ బలాల పందెము. ఇందులో ఎవరు వేగంగా వెళ్తారో వారే మెడలోని హారంగా అవుతారు అంతేకాక సింహాసనము పై సమీపంగా కూర్చుంటారు. చాలా సహజంగా అర్థము చేయించబడ్తుంది. మీరు కర్మయోగులైనందున మీ గృహస్థాన్ని కూడా సంభాళించండి తరగతిలో ఒక గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళి దాని పై మననము చేయాలి. పాఠశాలలో కూడా ఇలాగే చేస్తారు కదా. స్కూలులో చదువుకుంటారు తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారు. తండ్రి చెప్తున్నారు - ఒక ఘడియ, అర్ధ ఘడియ..............(రోజులో 8 ఘడియలు ఉంటాయి). తండ్రి చెప్తున్నారు - అందులో ఒక ఘడియ, అర్ధ ఘడియ అయినా స్మృతి చేయండి.15-20 నిమిషాలైనా క్లాసుకు వచ్చి ధారణ చేసి మళ్లీ మీ కార్య కలాపాలలోకి వెళ్ళండి. ఇంతకు ముందు బాబా స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రమును త్రిప్పండి అని మిమ్ములను కూర్చోపెట్టేవారు(యజ్ఞ ప్రారంభపు విషయము). స్మృతి అనే పేరు అయితే ఉండేది కదా. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ, తిప్పుతూ ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి. అప్పుడే అంతిమతి సో గతి అవుతుంది. మళ్లీ అమృతవేళ సమయములో లేచినప్పుడు అదే పాయింట్లు గుర్తకు వస్తుంటాయి. ఇలాంటి అభ్యాసము చేస్తూ చేస్తూ మీరు నిద్రను జయించేవారిగా అయిపోతారు.
ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారు కనిపిస్తూ ఉంటారు. వారి నడవడికలే ప్రత్యక్షమౌతాయి. చేయలేని వారి నడవడికలు మరొక విధంగా ఉంటాయి. ఈ పిల్లలు విచార సాగర మథనము చేస్తారు, ధారణ చేస్తారు అని గమనించబడుత్తుంది. లోభము మొదలైనవి ఏవీ లేవు కదా. ఇది పాత శరీరము. జ్ఞాన-యోగాల ధారణ జరిగినప్పుడే ఈ శరీరము కూడా బాగుంటుంది. ధారణ చేయలేదంటే ఈ శరీరము ఇంకా పాడైపోతుంది. నూతన శరీరము మళ్లీ భవిష్యత్తులో లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. ఇదైతే పురాతన శరీరము. దీనికి ఎంత పౌడర్ వేసినా, లిప్స్టిక్(పెదవులకు వేసుకొను శృంగారము) మొదలైనవి వేసుకొని అలంకరించుకున్నా పైసాకు పనికి రాదు. ఈ అలంకారమంతా వ్యర్థమే.
ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థము శివబాబాతో జరిగింది. వివాహము జరిగే రోజున పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరాన్ని అలంకరించుకోరాదు. మిమ్ములను మీరు జ్ఞాన-యోగాలతో అలంకరించుకుంటే, మళ్లీ భవిష్యత్తులో రాకుమార-రాకుమారీలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరము. ఇందులో జ్ఞాన మునలు వేస్తూ ఉంటే స్వర్గములోని దేవతలుగా అవుతారు. ప్రజలను దేవతలని అనరు. కృష్ణుడు ఎత్తుకుపోయాడని తమ మహారాణులుగా, పట్టపురాణులుగా చేసుకున్నారని అంటారు కదా. అంతేకాని ఎత్తుకుపోయి ప్రజలలో కూడా ఛండాలురు మొదలైనవారిగా తయారు చేశాడని అనరు కదా. మహారాజా-మహారాణులుగా చేసేందుకే ఎత్తుకెళ్ళాడు. మీరు కూడా ఈ పురుషార్థము చేయాలి. ఏ పదవి దొరికినా మంచిదే అని అనుకోకండి. ఇక్కడ చదువు ముఖ్యమైనది. ఇది పాఠశాల కదా, గీతా పాఠశాలను చాలా తెరుస్తారు. వారు కూర్చొని కేవలం గీతను వినిపిస్తారు, కంఠస్థము చేసి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని అర్ధగంట, ముప్పావు గంట దాని పై మాట్లాడ్తుంటారు. ఇందులో ఏ ప్రాప్తి కూడా లేదు. ఇక్కడైతే తండ్రే కూర్చుని చదివిస్తారు. మన లక్ష్యము, ఉద్ధేశ్యము స్పష్టంగా ఉంది. ఇక ఏ వేద శాస్త్రాల అధ్యయనములో గాని, జప, తపాదులలో గాని ఏ లక్ష్యము లేదు. కేవలం పురుషార్థము చేస్తూ ఉంటారు. కాని ఏం లభిస్తుంది? ఎప్పుడు చాలా భక్తి చేస్తారో అప్పుడే భగవంతుడు లభిస్తారు. అయినా రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావలసిందే, అలా సమయానికి జరుగుతుంది కదా. కల్పము ఆయువు గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. వారికి అర్థము చేయిస్తే శాస్త్రాలు అసత్యమెలా అవుతాయని అంటారు, అయితే భగవంతుడు అసత్యము చెప్తారా? అర్థము చేయించేందుకు శక్తి కావాలి అంతే.
ఇప్పుడు పిల్లలైన మీలో యోగబలము కావాలి. యోగబలముతో అన్ని పనులు సహజమైపోతాయి, సంపన్నమవుతాయి. ఏ పనినైనా చేయలేకుంటే కారణము - శక్తి లేదు, యోగము లేదు అని అర్థము. అక్కడక్కడా బాబా కూడా సహాయము చేస్తాడు. డ్రామాలో ఏ నిర్ణయముందో అదే పునరావృతమౌతుంది. ఇది కూడా పిల్లలైన మనమే అర్థము చేసుకోగలము. ఇతరులెవ్వరూ దీనిని అర్థము చేసుకోలేరు. క్షణ క్షణము ఏమి జరుగుతూ ఉంటుందో అది గడియారపు ముల్లులా టిక్ - టిక్ అంటూ ఉంటుంది. మనము శ్రీమతానుసారము కర్మలోకి వస్తాము. శ్రీమతానుసారము నడుచుకోలేదంటే శ్రేష్ఠంగా ఎలా అవుతారు? అందరూ ఒకేలా అవ్వలేరు. మనమంతా ఒకటైపోవాలి అని మనుష్యులు భావిస్తారు, కాని ఒక్కటిగా(ఏక్) అవ్వడం అంటే అర్థము తెలియదు. దేనిలో ఒక్కటిగా అవ్వాలి? అందరూ తండ్రులుగా అవ్వాలా లేక అందరూ సోదరులుగా అవ్వాలా? సోదరులు అన్నా సరిగ్గానే ఉంటుంది. శ్రీమతానుసారము తప్పకుండా మనమంతా ఒక్కటిగా అవ్వగలము. మీరందరూ ఒకే మతము పై నడుస్తారు. మీ తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. శ్రీమతము పై పూర్తిగా నడవలేని వారు శ్రేష్ఠంగా కూడా అవ్వలేరు. పూర్తిగా నడవలేదంటే సమాప్తమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని మాత్రమే పందెములో తీసుకుంటారు. ఏదైనా పెద్ద పందెము జరిగినప్పుడు గుర్రాన్ని కూడా మంచి ఫస్ట్ క్లాస్గా ఉండేదానిని ఎన్నుకుంటారు. ఎందుకంటే లాటరీలో పెద్ద మొత్తము ఉంచుతారు. ఇది కూడా గుఱ్ఱపు పందెమే. హస్సేన్ గుఱ్ఱము అని అంటారు కదా. వారు హుస్సేన్ను గుఱ్ఱము పై యుద్ధము చేసినట్లు చూపించారు. ఇప్పుడు పిల్లలైన మీరు డబుల్ అహింసకులు. కామ హింస నంబరు వన్ హింస. ఈ హింసను గూర్చి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. కేవలం ఇది వికారము అని చెప్తారు. తండ్రి చెప్తారు - కామము మహాశత్రువు, అది ఆదిమధ్యాంతాలు దు:ఖాన్ని ఇస్తుంది. మాది ప్రవృత్తి మార్గపు రాజయోగమని, మీది హఠయోగమని నిరూపించి చెప్పాలి. మీది హఠయోగము. మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకుంటారు, మేము శివాచార్యుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటామని చెప్పాలి. సమయము వచ్చినప్పుడు ఇటువంటి విషయాలను వినిపించాలి.
దేవతలకు 84 జన్మలు కదా, ఈ క్రైస్తవులు మొదలైనవారికి ఎన్ని జన్మలని కొంతమంది అడుగుతారు. అరే! మీరే లెక్క వేసుకోవచ్చు అని చెప్పండి. 5 వేల సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. మరి క్రీస్తు వచ్చి 2 వేల సంవత్సరాలయ్యింది. సరాసరి ఎన్ని జన్మలు తీసుకొని ఉండవచ్చునో లెక్క వేయండి. 30-31 జన్మలుండవచ్చు. ఇది స్పష్టంగా ఉంది. ఎవరైతే చాలా సుఖాన్ని చూస్తారో, వారు దు:ఖాన్ని కూడా చాలా చూస్తారు. వారికి సుఖము కూడా తక్కువే. దు:ఖము కూడా తక్కువే. సరాసరి లెక్క వేయాలి. చివరిలో వచ్చేవారు కొద్ది జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీమ్ మొదలైన వారి లెక్కను కూడా తీయవచ్చు. ఒకటి - రెండు జన్మల వ్యత్యాసము వస్తుంది అంతే. కావున ఈ విషయాలన్నీ విచార సాగర మథనము చేయాలి. ఎవరైనా అడిగితే ఏమి చెప్తారు? మొదట తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి కదా. మీరు తండ్రిని స్మృతి చేయండి. ఎన్ని జన్మలు తీసుకోవాలో అన్ని తీసుకునే తీసుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్పండి. బాగా అర్థము చేయించాలి. శ్రమతో కూడిన పని. శ్రమ పడితేనే సఫలీకృతమౌతారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. బాబాతో మరియు బాబా ఇచ్చే ధనము పట్ల చాలా ప్రీతి ఉండాలి. కొందరైతే ధనమే తీసుకోరు. అరే! జ్ఞాన రత్నాలనైతే ధారణ చేయండి అని అంటే, వాటిని మేమేం చేయాలి, మాకు అర్థము కాదు అని అంటారు. అర్థము అవ్వడం లేదంటే మీ భాగ్యము అంతే. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవ్వరినీ ద్వేషించరాదు. అందరితో మధురంగా వ్యవహరించాలి. జ్ఞాన-యోగాల రేస్ చేసి తండ్రికి కంఠహారంగా అవ్వాలి.
2. నిద్రాజీతులుగా అయ్యి ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. దేనిని వింటారో, దానిని గురించి విచార సాగర మథనము చేసే అలవాటు చేసుకోవాలి.
వరదానము :-
'' సదా సురక్షిత రేఖ లోపల ఉంటూ పరమాత్మ ఛత్రఛాయను అనుభవం చేసే మాయాజీత్ భవ ''
''బాప్ ఔర్ ఆప్(తండ్రి మరియు మీరు)'' ఇదే సురక్షిత రేఖ. ఈ రేఖయే పరమాత్మ ఛత్రఛాయ. ఎవరైతే ఈ ఛత్రఛాయ రేఖ లోపల ఉంటారో, వారి వద్దకు వచ్చేందుకు మాయ ధైర్యము కూడా చేయదు. అప్పుడు కష్టము, ఆటంకము, విఘ్నము - ఈ శబ్ధాలంటే ఏమిటో అవిద్యగా(తెలియకుండా) అయిపోతారు, సదా సురక్షితంగా ఉంటారు. తండ్రి హృదయంలో ఇమిడిపోయి ఉంటారు. ఇదే తీవ్ర వేగముతో వెళ్లేందుకు లేక మాయాజీత్గా అయ్యేందుకు అన్నిటికంటే సహజమైన పురుషార్థము.
స్లోగన్ :-
'' సర్వ దివ్య గుణాలనే అలంకారాలతో అలంకరింపబడి ఉంటే అహంకారము రాజాలదు ''