24-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ప్రభాత సమయంలో మనస్సు-బుద్ధి ద్వారా తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. జత జతలో భారతదేశాన్ని దైవీ రాజస్థానంగా తయారు చేసే సేవ చేయండి ''
ప్రశ్న :-
సూర్యవంశీ రాజధాని బహుమతిగా ఏ ఆధారము పై లభిస్తుంది ?
జవాబు :-
సూర్యవంశీ రాజధానిని బహుమతిగా తీసుకోవాలంటే, తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అవ్వండి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. ఆశీర్వాదాలను వేడుకోరాదు. కాని యోగబలముతో ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము చేయాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యాగము చేసి అత్యంత ప్రియమైన ఒకే ఒక తండ్రిని స్మృతి చేస్తే, మీకు సూర్యవంశ రాజధాని బహుమతిగా లభిస్తుంది. అందులో శాంతి, పవిత్రత, సుఖము అన్నీ ఉంటాయి.
పాట :-
చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది,.................. (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్,..............) 
ఓంశాంతి.
ఓంశాంతి అంటే ఏమిటో పిల్లలైన మీ బుద్ధిలో ఉండనే ఉంటుంది. తండ్రి ఏదైతే అర్థము చేయిస్తున్నారో, అది ఈ ప్రపంచములో పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ అర్థము కాదు. ఎలాగైతే ఎవరైనా కొత్తవారు ఏదైనా మెడికల్ కాలేజీలో కూర్చుంటే ఎలాగైతే వారు ఏమీ అర్థము చేసుకోలేరో, అలాగే ఇక్కడ కూడా కొత్తవారు ఏమీ అర్థము చేసుకోలేరు. మనుష్యులు వెళ్లి విన్నా అర్థము చేసుకోలేని సత్సంగము ఇంకేదీ లేదు. అక్కడైతే శాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తారు. ఇది పెద్ద కాలేజీలన్నిటిలో పెద్ద కాలేజి. కొత్త విషయమేమీ కాదు. స్వయంగా తండ్రి కూర్చొని పిల్లలకు రాజయోగాన్ని నేర్పించే ఆ రోజు మళ్లీ ఈనాడు వచ్చింది. ఈ సమయములో భారతదేశములో రాజ్యమే లేదు. మీరు ఈ రాజయోగము ద్వారా రాజాధి రాజులుగా అవుతారు. అనగా ఏ వికారీ రాజులున్నారో, వారికి కూడా మనము రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు. బుద్ధి లభించింది. ఎవరు ఏ కర్మ చేసినా అది బుద్ధిలో ఉంటుంది కదా! మీరు సైనికులు, యోధులు. ఆత్మలైన మనము ఇప్పుడు తండ్రితో యోగము జోడించడం వలన భారతదేశాన్ని పవిత్రంగా చేస్తామని మీకు తెలుసు. అంతేకాక సృష్టిచక్రము ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ధారణ చేసి మనము చక్రవర్తి రాజులుగా అవుతూ ఉన్నామని కూడా మీకు తెలుసు. మనము యుద్ధ మైదానములో ఉన్నామని సదా బుద్ధిలో ఉండాలి. విజయము మనదే. ఇది తథ్యం(నిశ్చితము). మనము ఇప్పుడు మళ్లీ ఈ భారతదేశాన్ని డబల్ కిరీటధారి రాజస్థానంగా తయారు చేస్తున్నాము. బాబా చిత్రాలను గూర్చి చాలా బాగా అర్థము చేయిస్తూ ఉంటారు. మనము 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు వాపసు వెళ్లి మళ్లీ వచ్చి రాజ్యపాలన చేస్తాము. ఈ బ్రహ్మకుమార - కుమారీలందరూ ఏమి చేస్తున్నారు? బ్రహ్మకుమారీల సంస్థ అంటే ఏమిటి? అని చాలామంది అడుగుతారు కదా! మేము శ్రీమతమును అనుసరిస్తూ ఈ భారతదేశాన్ని మళ్లీ దైవీ రాజస్థానంగా తయారు చేస్తున్నామని బి.కెలు వెంటనే చెప్తారు. మనుష్యులకు శ్రీ అను పదానికి అర్థము కూడా తెలియదు. శ్రీ శ్రీ అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు శివబాబా అని, వారి మాలయే తయారవుతుందని మీకు తెలసు. ఈ మొత్తం రచన అంతా ఎవరిది? క్రియేటర్(రచయిత) తండ్రియే కదా! సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అందరూ ఎవరైతే ఉన్నారో, వారి మాల అంతా రుద్రుడైన శివబాబాదే. అందరికీ తమ రచయిత ఎవరో తెలుసు. కాని వారి కర్తవ్యము గురించి తెలియదు. వారు(శివబాబా) ఎప్పుడు, ఎలా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారో, ఎవరి బుద్ధిలోనూ లేదు. కలియుగము ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగుతుందని వారు భావిస్తారు.
మనము దైవీ రాజస్థానాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయినామని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా దైవీ రాజస్థానము స్థాపనౌతుంది. తర్వాత మళ్లీ అది క్షత్రియ రాజస్థానంగా (త్రేతాగా) అవుతుంది. మొదటి సూర్యవంశీయుల, తర్వాత క్షత్రియ కులము వారి రాజ్యము ఉంటుంది. మీరు చక్రవర్తి రాజా-రాణులుగా తయారవ్వాలంటే బుద్ధిలో చక్రము తిరగాలి కదా! మీరు ఎవరికైనా ఈ చిత్రాలను చూపించి చాలా బాగా అర్థము చేయించగలరు. ఈ లక్ష్మీ నారాయణులు సూర్యవంశ కులమువారు, ఈ సీతారాములు క్షత్రియ కులమువారు. తర్వాత వైశ్య, శూద్ర వంశీ పతిత కులమువారిగా తయారైపోతారు. పూజ్యులు మళ్లీ పూజారులుగా అవుతారు. సింగల్ కిరీటధారి రాజుల చిత్రాన్ని కూడా తయారుచేయాలి. ఈ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా అవుతుంది. డ్రామానుసారము సేవ కొరకు ఈ ప్రదర్శిని చాలా అవసరమని మీకు తెలుసు. అప్పుడే పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానము నిలుస్తుంది. నూతన ప్రపంచము ఎలా స్థాపనవుతోందో, ఈ చిత్రాలు ద్వారా అర్థము చేయించబడ్తుంది. పిల్లల బుద్ధిలో సంతోష పాదరస మట్టము పైకెక్కి పోవాలి. సత్యయుగములో ఆత్మ జ్ఞానముంటుంది, అది కూడా ఎప్పుడైతే ముసలివారుగా అవుతారో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి మళ్లీ నూతన శరీరాన్ని తీసుకోవాలనే ఆలోచన స్వతహాగా కలుగుతుంది. ఈ ఆలోచన చివరి సమయములో వస్తుంది. మిగిలిన సమయమంతా ఖుషీగా, ఆనందంగా ఉంటారు. మొదట ఈ జ్ఞానముండదు. ఎంతవరకు తండ్రి వచ్చి తమ పరిచయమునివ్వరో, అంతవరకు పరమాత్ముని నామ-రూప-దేశ-కాలాదుల గురించి ఎవ్వరికీ తెలియదని పిల్లలైన మీకు అర్థము చేయించబడింది. వారి పరిచయము కూడా చాలా గంభీరమైనది. మొదట వారిది లింగ రూపమనే చెప్పవలసి ఉంటుంది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టితో శివలింగాలను తయారు చేస్తారు. వాటి పూజ జరుగుతూ వచ్చింది. తండ్రి మొదటనే తాను బిందు రూపమని తెలుపలేదు. బిందు రూపమని చెప్పి ఉంటే మీరు అర్థము చేసుకోలేకపోయేవారు. ఏ విషయము ఎప్పుడు అర్థము చేయించాలో అప్పుడు అర్థము చేయిస్తారు. ఈ విషయము మొదటే ఎందుకు తెలుపలేదు? ఈ రోజు ఎందుకు అర్థము చేయిస్తున్నారని అడగరాదు. డ్రామాలో ఇలాగే నిర్ణయించబడింది. ఈ ప్రదర్శిని ద్వారా సర్వీసు చాలా వృద్ధి చెందుతుంది. పరిశోధన ద్వారా కొత్తది కనుగొంటే, అది తర్వాత చాలా వృద్ధి చెందుతూ పోతుంది. బాబా మోటరు ఉదాహరణాన్ని ఇస్తారు కదా. ప్రారంభములో మొదటి మోటరు తయారు చేయడానికి(కనుగొనేందుకు) కష్టమై ఉండవచ్చు కాని తర్వాత చూడండి, పెద్ద పెద్ద కార్ఖానాలలో ఒక నిముషములో మోటరు తయారైపోతోంది. సైన్స్ ఎంతో ప్రగతిని సాధించింది.
భారతదేశము ఎంత పెద్దదో మీకు తెలుసు. ప్రపంచమెంత పెద్దదో కూడా మీకు తెలుసు. మళ్లీ అది ఎంత చిన్నదైపోతుందో కూడా మీకు తెలుసు. బుద్ధిలో ఈ విషయాలను బాగా కూర్చోబెట్టాలి. సేవాధారీ పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి. మిగిలినవారి సమయము తినడంలో, తాగడంలో, వ్యర్థ విషయాలలోనే వృథా అయిపోతుంది. భారతదేశములో మళ్లీ దైవీరాజస్థానము స్థాపనౌతూ ఉందని మీకు తెలుసు. వాస్తవానికి కింగ్డం(రాజ్యము) అను పదము కూడా తప్పే. భారతదేశము దైవీ రాజస్థానంగా తయారవుతోంది. ఈ సమయములో ఆసురీ రాజస్థానముంది, రావణ రాజ్యముంది. ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. కోట్లాది మంది ఆత్మలున్నారు. అందరూ పాత్రధారులే. వారి-వారి సమయాలలో వచ్చి పాత్ర చేసి వెళ్లిపోతారు. మళ్లీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలు రిపీట్ చేయవలసి ఉంటుంది. సెకండు సెకండు డ్రామా ఉన్నదున్నట్లు(హుబహూ) రిపీట్ అవుతుంది. కల్పక్రితము ఏ పాత్రను అభినయించారో అదే పాత్ర ఇప్పుడు అభినయిస్తారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో ఉన్నందున గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది. కాని ప్రభాత సమయానికి గాయనముంది అని తండ్రి చెప్తున్నారు. ప్రభాత సమయంలో రాముని స్మరించు ఓ మనసా!............ అని పాడ్తారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడిక ఎవ్వరినీ స్మరించకండి, ప్రభాత సమయములో నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి సన్ముఖములో చెప్తున్నారు. తర్వాత భక్తిమార్గములో దీని గాయనము నడుస్తుంది. సత్య-త్రేతా యుగాలలో గాయనము జరగదు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఓ ఆత్మాలారా! మీ మనసు-బుద్ధి ద్వారా ప్రభాత సమయాలలో తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. భక్తులు తరచుగా రాత్రి వేళలలో మేలుకొని ఏదో ఒకటి స్మృతి చేస్తారు. ఇచ్చటి ఆచారాలు-పద్ధతులు తర్వాత మళ్లీ భక్తిమార్గములో కొనసాగుతూ వచ్చాయి. ఇతరులకు అర్థము చేయించేందుకు పిల్లలైన మీకు రకరకాల యుక్తులు లభిస్తూ ఉంటాయి. భారతదేశము ఇన్ని సంవత్సరాల క్రితము దైవీ రాజస్థానముగా ఉండేది. తర్వాత క్షత్రియ రాజస్థానముగా అయ్యింది. దాని తర్వాత వైశ్య రాజస్థానముగా అయ్యింది. రోజురోజుకు తమోప్రధానమౌతూ పోతుంది. తప్పకుండా పడిపోవలసిందే. ఈ చక్రము ముఖ్యమైనది. చక్రమును తెలుసుకోవడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు మీరు కలియుగములో కూర్చొని ఉన్నారు. మీ ఎదుట సత్యయుగముంది. ఈ చక్రమెలా తిరుగుతుందనే జ్ఞానము మీకు ఉంది. రేపు మనము సత్యయుగ రాజధానిలో ఉంటామని మీకు తెలుసు. ఈ జ్ఞానమెంత సహజమైనది! పైన త్రిమూర్తి శివుడు కూడా ఉన్నారు. చక్రము కూడా ఉంది(బాబా చిత్రాలు చూపిస్తూ పిల్లలకు చెప్తున్నారు). ఇందులో లక్ష్మీనారాయణులు కూడా వచ్చేస్తారు. ఈ చిత్రాలు ఎదురుగా ఉన్నట్లయితే, ఎవరికైనా సహజంగా అర్థము చేయించగలరు. భారతదేశము దైవీ రాజస్థానముగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. సింగల్ కిరీటము వారు కూడా లేరు. చిత్రాల ద్వారానే పిల్లలైన మీరు అర్థం చేయించారు. ఈ చిత్రాలు చాలా విలువైనవి. ఎంతో అద్భుతమైనవి. కావున అద్భుతంగానే అర్థము చేయించాలి. ''30-40'' సైజులోని వృక్షము, త్రిమూర్తి చిత్రాలను కూడా అందరూ తమ తమ ఇళ్ళలో ఉంచుకోవలసి ఉంటుంది. బంధు-మిత్ర్రులు మొదలైనవారు వస్తే ఈ చిత్రాలను చూపిస్తూ అర్థము చేయించాలి. ఇది ప్రపంచ చరిత్ర-భూగోళము. పిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటి జతలో మంచి మంచి పాటలు కూడా ఉండాలి. చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. తప్పకుండా బాబా వచ్చి ఉన్నారు, మనకు రాజయోగము నేర్పిస్తారు. చిత్రాలు ఎవరు అడిగినా లభిస్తాయి. పేదవారికి ఉచితంగా లభించగలవు. కాని అర్థము చేయించే శక్తి కూడా ఉండాలి. ఇది అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా. మీరు దానము చేసే దానులు, మీ వలె అవినాశి జ్ఞానరత్నాల దానము ఇతరులెవ్వరూ చేయలేరు. ఇటువంటి దానము మరొకటి ఏదీ ఉండదు. కావున దానము చేయాలి. ఎవరు వచ్చినా వారికి అర్థము చేయించాలి. అలా ఒకరినొకరు చూసి చాలామంది వస్తారు. ఈ చిత్రాలు చాలా విలువైనవి, అమూల్యమైనవి. అలాగే మీరు కూడా అమూల్యమైనవారని పిలువబడతారు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. ఈ చిత్రాలు విదేశాలకు తీసుకెళ్లి అర్థము చేయిస్తే అద్భుతము జరుగుతుంది. ఇంతవరకు సన్యాసులు మేము భారతదేశపు యోగము నేర్పిస్తామని చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు తమ ధర్మమును మహిమ చేస్తారు. బౌద్ధ ధర్మము వారు ఎంతోమందిని బౌద్ధులుగా తయారు చేస్తారు. కాని అందులో ఎలాంటి లాభము లేదు. మీరు కూడా మనుష్యులను కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా చేస్తారు. భారతదేశములోనే సంపూర్ణ నిర్వికారులు ఉండేవారు. భారతదేశము పవిత్రంగా ఉండేది. ఇప్పుడు నల్లగా, అపవిత్రంగా ఉంది. ఎంతమంది మనుష్యులున్నారు! సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు కదా! సంగమ యుగములోనే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. ఏ పిల్లలైతే కల్పక్రితము నేర్చుకున్నారో ఆ పిల్లలకే నేర్పిస్తారు. స్థాపన అవ్వనే అవ్వాలి. పిల్లలు రావణునితో ఓడిపోతారు. మళ్లీ రావణుని పై విజయము పొందుతారు. ఎంత సహజమైనది! కావున పిల్లలు పెద్ద చిత్రాలు తయారు చేయించి వాటి ద్వారా సర్వీసు చేయాలి. పెద్ద పెద్ద అక్షరాలుండాలి. ఇక్కడ నుండి భక్తిమార్గము ప్రారంభమౌతుంది అని వ్రాయాలి. దుర్గతి పూర్తయినప్పుడే తండ్రి సద్గతినిచ్చేందుకు వస్తారు కదా!
ఎప్పుడూ ఎవరికి భక్తి చేయకండి అని చెప్పరాదు. తండ్రి పరిచయమునిచ్చి అర్థము చేయించాలి. అప్పుడు బాణము తగులుతుంది. మహాభారత యుద్ధము అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసు. ఎందుకంటే ఇది చాలా గొప్ప యజ్ఞము. ఈ యజ్ఞము ద్వారానే ఈ యుద్ధము అనగా (వినాశ జ్వాల) ప్రజ్వలితమయ్యింది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. మనుష్యులకు శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది కాని శాంతి మాత్రము ఉండదు. వాస్తవానికి శాంతిస్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారికి మీరు సహాయకులుగా ఉన్నారు. బహుమతి కూడా మీకు లభించాలి. తండ్రికి బహుమతి లభించదు. తండ్రి అయితే ఇచ్చే దాత. నంబరువారు పురుషార్థానుసారము మీకు బహుమతి లభిస్తుంది. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. మీరిప్పుడు పవిత్రత, సుఖ-శాంతులను స్థాపన చేస్తున్నారు. ఇది ఎంత గొప్ప బహుమతి! ఎవరు ఎంత కష్టపడ్తారో, దాని అనుసారము వారికి సూర్యవంశ రాజధాని బహుమానంగా లభిస్తుంది. తండ్రి శ్రీమతమునిచ్చేవారు. అంతేకాని తండ్రి ఆశీర్వదిస్తారని కాదు. తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయని విద్యార్థులకు సలహా ఇవ్వడం జరుగుతుంది. మీరందరు సీతలు, మీరు అగ్ని జ్వాలలను దాటుకొని వెళ్తారు. యోగబలము ద్వారా దాటుకొని అయినా వెళ్లాలి లేక అగ్నిలోనైనా కాలిపోవలసి వస్తుంది. దేహ సహితంగా సర్వ సంబంధాలను త్యాగము చేసి ఒకే ఒక అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. కాని ఈ స్మృతి నిరంతరము ఉండడం చాలా కష్టము. సమయం పడ్తుంది. యోగాగ్ని అని గాయనము కూడా చేయబడింది. భారతదేశపు ప్రాచీన యోగము, జ్ఞానము ప్రసిద్ధి చెందినవి. ఎందుకంటే గీత సర్వ శాస్త్రమయి శిరోమణి, అందులో రాజయోగమనే పదము ఉంది. కాని రాజ అనే పదాన్ని వదిలేసి కేవలం యోగమనే మాటను పట్టుకున్నారు. ఈ రాజయోగము ద్వారా నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తానని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు మీరు శివబాబా సన్ముఖములో కూర్చొని ఉన్నారు. ఆత్మలమైన మనమంతా అచ్చట పరంధామములో నిసించేవారమని శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. శివబాబా పునర్జన్మను తీసుకోరు. బ్రహ్మ-విష్ణు-శంకరులు కూడా పునర్జన్మలు తీసుకోరు. తండ్రి చెప్తున్నారు - నేను పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తాను. అందుకే ఓ పతితపావనా! రమ్మని అందరూ నన్ను స్మృతి చేస్తారు. ఈ వాక్యము చాలా ఖచ్చితమైనది(ఆక్యురేట్). తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను పావనంగా చేసి, దేవీ దేవతలుగా చేస్తున్నాను. అందువలన మీకు అంత నశా ఎక్కాలి కదా! బాబా ఇతనిలో వచ్చి మాకు శిక్షణనిస్తున్నారు. ఈ పండ్ల తోటకు యజమాని బాబా. మనము బాబా చేతిని పట్టుకున్నాము. ఇదంతా బుద్ధికి సంబంధించిన విషయము. బాబా మనలను ఆవలి తీరానికి విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకెళ్తారు. అచ్చట విషము(వికారము) ఉండదు. అందుకే అది నిర్వికారి ప్రపంచము అనబడ్తుంది. భారతదేశము నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు వికారిగా తయారయ్యింది. భారతవాసులే చక్రములో పూర్తిగా తిరుగుతారు. ఇతర ధర్మాలవారు పూర్తి చక్రమంతా తిరగరు. వారు చివరిలో వస్తారు. ఇది చాలా అద్భుతమైన చక్రము. బుద్ధిలో నషా ఉండాలి. ఈ చిత్రాల పై చాలా గమనముండాలి. సర్వీసు చేసి చూడండి. విదేశాలకు కూడా చిత్రాలు వెళ్తే పేరు ప్రసిద్ధి చెందుతుంది. విహంగ మార్గములో సర్వీసు జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీకు లభించిన అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను దానము చేయాలి. మీ సమయాన్ని తినడం, తాగడంలో, వ్యర్థ మాటలలో వృథా చేసుకోరాదు.
2. గవ్వ వంటి మనుష్యులను వజ్ర సమానమైన వారిగా తయారుచేయు సేవ చేయాలి. తండ్రి నుండి ఆశీర్వాదాలు లేక కృపను వేడుకోరాదు. వారి సలహా ప్రకారము నడుస్తూ ఉండాలి.
వరదానము :-
''తండ్రిని ముందుంచుకొని ఈర్ష్య అనే పాపము నుండి రక్షించుకునే విశేష ఆత్మా భవ ''
బ్రాహ్మణాత్మలందరూ సమానమైన కారణంగా ఈర్ష్య ఉత్పన్నమౌతుంది. ఈర్ష్య కారణంగా సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. కాని ఇందులో విశేషంగా ఇలా ఆలోచించండి - మీ సమానంగా ఉన్నవారు ఏదైనా విశేషమైన కార్యానికి నిమిత్తంగా అయ్యి ఉంటే, వారిని అలా నిమిత్తంగా చేసిన వారెవరో విశేషంగా ఆలోచించండి. తండ్రిని ముందుకు తెచ్చుకుంటే ఈర్ష్య రూపీ మాయ పారిపోతుంది. ఒకవేళ ఎవరి విషయమైనా మీకు నచ్చకుంటే శుభ భావనతో పైకి ఇచ్చేయండి, ఈర్ష్యకు వశమై కాదు. పరస్పరములో రేస్ చేయండి. రీస్ చేయకుంటే(ఈర్ష్య పడకుంటే) విశేష ఆత్మలుగా అయిపోతారు.
స్లోగన్ :-
''మీరు తండ్రిని మీ సాథీగా చేసుకుని మాయ ఆడే ఆటను సాక్షిగా చూచేవారు ''