16-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీరు చాలా పెద్ద ఓడలో కూర్చున్నారు. మీరు ఉప్పు నీటి కాలువను దాటి క్షీరసాగరములోకి వెళ్తున్నారు. మీ లంగరు ఎత్తివేయబడింది ''

ప్రశ్న :-

పిల్లలకు ఏ విషయములో విశేషంగా అలసట కలుగుతుంది? అలసట కలిగేందుకు ముఖ్యమైన కారణమేది ?

జవాబు :-

పిల్లలు నడుస్తూ-నడుస్తూ స్మృతి యాత్రలోనే అలసిపోతారు. ఇందులో అలసట కలిగేందుకు ముఖ్యమైన కారణము సాంగత్య దోషము. ఎలాంటి సాంగత్యము లభిస్తుందంటే తండ్రి చేతిని కూడా వదిలేస్తారు. మంచి సాంగత్యము తేలుస్తుందని, చెడు సాంగత్యము ముంచేస్తుందని అంటారు. సాంగత్యములోనికి వచ్చి స్టీమరు నుంచి కాలు కిందికి దించారంటే మాయ పచ్చిగా తినేస్తుంది. అందువలన పిల్లలూ! సమర్థుడైన తండ్రి చేతిని ఎప్పుడూ వదలకండి అని బాబా పిల్లలను హెచ్చరిస్తున్నారు.

పాట :-

మాతా ఓ మాతా! మీరు అందరి భాగ్యవిధాత,.........(మాతా ఓ మాతా! తూ హై సబ్‌ కీ భాగ్యవిధాతా!.......) .   

ఓంశాంతి.

''పిల్లలారా! ఓంశాంతి'' అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. దీనిని కూడా 'మహామంత్రము' అని అంటారు. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. శాంతి కొరకు ఏ అడవికీ వెళ్లవలసిన అవసరము లేదు. నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని. ఇవి నా అవయవాలు. శబ్ధము చేయడం, చేయకపోవడమనేది నా చేతిలో ఉంది. కాని ఈ జ్ఞానము లేకుండుట వలన అడుగడుగునా వెతుకుతారు. దీనిని గురించి ఒక కథ కూడా ఉంది - ఒక రాణి తన కంఠహారాన్ని తన మెడలోనే ఉంచుకొని ఆ విషయాన్ని మర్చిపోయి, నా హారము కనిపించడం లేదు అని హారాన్ని బయట వెతికిందని ఆ కథలో ఉంది. తర్వాత ఆ హారము మీ కంఠములోనే ఉంది అని ఎవరో చెప్పారు. ఇక్కడ కూడా ఈ దృష్టాంతాన్నిస్తారు. మనుష్యులు అటూ-ఇటూ భ్రమిస్తూ వెతుకుతూ ఉంటారు. సన్యాసులు కూడా మానసిక శాంతి ఎలా లభిస్తుంది? అని అంటారు. కాని ఆత్మలోనే మనస్సు-బుద్ధి ఉన్నాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాలలోకి రావడంతో మాట్లాడ్తుంది. మీరు ఆత్మలు మీ స్వధర్మములో ఉండండి, ఈ దేహ ధర్మాలన్నీ మర్చిపోండిి అని బాబా చెప్తారు. పదే పదే అర్థము చేయిస్తున్నా కొందరు పిల్లలు మమ్ములను శాంతిలో కూర్చోబెట్టండి, నిష్ఠలో కూర్చోబెట్టండి అని అడుగుతారు. ఇలా అడగడం కూడా తప్పే. నన్ను శాంతిగా కూర్చోబెట్టండి అని ఒక ఆత్మ మరొక ఆత్మతో చెప్తుంది. అరే! నీ స్వధర్మము శాంతియే కాదా? నీ అంతట నీవే శాంతిగా కూర్చోలేవా? నడుస్తూ, తిరుగుతూ నీవు నీ స్వధర్మములో ఎందుకు స్థితమవ్వడము లేదు? ఎంతవరకైతే దారిని తెలిపే తండ్రి లభించరో అంతవరకు స్వధర్మములో ఎవ్వరూ స్థితులవ్వజాలరు. వారైతే ఆత్మయే పరమాత్మ అని అనేశారు. కనుక వారు స్వధర్మములో స్థితమవ్వలేరు. ఈ అశాంతి దేశములో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మీరు శాంతిదేశానికి వెళ్లాలి. తర్వాత సుఖధామానికి వెళ్లాలి. ఇక్కడైతే ప్రతి ఇంటిలో అశాంతి ఉంది. సత్యయుగములో ప్రతి ఇంటిలో ప్రకాశముంటుంది. ఇక్కడ అంధకారముంది. ఇక్కడ ప్రతి విషయములోనూ దెబ్బలు తినవలసి ఉంటుంది. ప్రతి ఇంటిలోనూ అంధకారముంది. కనుకనే దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే రావణుడు మరణిస్తాడో అప్పుడు దీపావళిని ఆచరిస్తారు. అక్కడ రావణుడు ఉండడు. కనుక అక్కడ సదా దీపావళే ఉంటుంది. ఇక్కడ రావణ రాజ్యమున్నందున 12 మాసాల తర్వాత మళ్లీ దీపావళిని ఆచరిస్తారు. రావణుడు మరణించాక మళ్లీ లక్ష్మీనారాయణుల పట్టాభిషేకము జరుగుతుంది. వారు ఖుషీగా ఆచరిస్తారు. సత్యయుగములో లక్ష్మీనారాయణులు సింహాసనము పై కూర్చునప్పుడు పట్టాభిషేకమును జరుపుతారు. ఇప్పుడు రావణరాజ్యము పూర్తి అవుతుందని మీకు తెలుసు. భారతదేశానికి మళ్లీ రాజ్యభాగ్యము లభించాలి. ఇప్పుడు ఏ రాజ్యమూ లేదు. తండ్రి ద్వారా రాజ్యము లభిస్తుంది. అనంతమైన తండ్రి అనంతమైన రాజధానిని వారసత్వంగా ఇస్తారు. బాబా అంటారు - నేను మీకు సదా సుఖ వారసత్వమును ఇస్తాను. మిగిలిన వారందరూ మీకు దు:ఖమునిచ్చేవారు. ఈ సాధు-సన్యాసులు, గురువులు, సాధువులు, మామలు, పినతండ్రులు మొదలైన వారంతా మీకు దు:ఖమునిచ్చేవారే. ఒకవేళ సుఖాన్నిచ్చినా, అది అల్పకాల క్షణ భంగురమైనది. ఆ సుఖము కాకిరెట్టతో సమానమైనది. నేను మీకు ఎంతటి సుఖమునిస్తానంటే మళ్లీ మీకు ఎప్పుడూ దు:ఖమే కలుగదు. కనుక దేహ సహితంగా, దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఈ దేహము, దేహ సంబంధీకులందరూ మీకు దు:ఖాన్నిచ్చేవారే. వారందరినీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఉదయమే అమృతవేళలో స్మృతి చేయవలసి ఉంటుంది. భక్తిమార్గములో కూడా మనుష్యులు ఉదయమే లేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతానుసారము ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. బాబా అర్థము చేయిస్తున్నారు - ఉదయాన్నే లేచి ఎంత ఎక్కువ సాధ్యమవుతుందో అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇది తండ్రి ఆజ్ఞ.

భక్తులు ఒకవైపు భగవంతుని స్మృతి చేస్తారు. మరోవైపు అందరూ భగవంతులే(సర్వవ్యాపి) అని అనేస్తారు. ఇప్పుడు వారు అర్థము చేసుకోరు. ఒక రోజు వారందరూ అర్థం చేసుకొని మీకు మిత్రులుగా అవుతారు. మీ మాట నిజము అని అంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడం, తమ నావను మరియు భారతదేశ నావను ముంచి వేయడమే. మరొక విషయము - భారతదేశానికి స్వరాజ్యమనే వెన్నను ఇప్పించేవారు ఆ తండ్రియే. వారికి బదులుగా వెన్న లభించిన కృష్ణుని పేరును ఉంచడము జరిగింది. కనుక భారతదేశానికి వెన్నను ఇప్పించగలిగేవాడు కృష్ణుడేమోనని మనుష్యులు భావిస్తారు. తండ్రి పేరుకు బదులుగా కొడుకు పేరును వేసి అనర్థము చేసేశారు. ఇప్పుడు పూర్తి ప్రపంచానికి భగవంతుడు కృష్ణుడు కాజాలడు. మనుష్యులు రావణుని మతముననుసరించి తమకు తామే శాపగ్రస్థులుగా అయ్యారు. బాబా నావికుడు. మనమంతా నావలము. మా నావను ఒడ్డుకు చేర్చండని గానము చేస్తారు కదా. ఇప్పుడు మీరు పెద్ద ఓడలో(స్టీమరులో) కూర్చున్నారు. చంద్రకాంత వేదాంతములో స్టీమరు విషయము చెప్పబడింది. అది కూడా ఇప్పటి విషయాన్ని గూర్చి వ్రాయబడిందే. మీరు స్టీమరులో ఆవలి తీరానికి వెళ్తున్నారు. విషయసాగరము నుండి అమృత లేక క్షీర సాగరములోకి వెళ్తున్నారు. లండన్‌ నుండి ఉప్పు నీటి కాలువ ద్వారా ఏ స్టీమర్లైతే దాటి వస్తాయో వాటికి బహుమతి లభిస్తుంది. ఇక్కడ నరకము నుండి స్వర్గానికి వెళ్లాలి. ఇది విషయ సాగరము, ఉప్పునీటి సాగరము. మీరు పెద్ద స్టీమరులో కూర్చున్నారు. మీరు వెళ్తూ ఉన్నప్పుడు పోర్టు(ఓడరేవు) వస్తుంది. అక్కడ కొందరు దిగుతారు, కొందరు ఎక్కుతారు. ఎవరైతే ఆహార పానీయాలకు వెళ్తారో, వారు అక్కడే నిల్చిపోతారు. దీనిని గురించి ఒక కథ కూడా తయారు చేయబడింది. కృష్ణునికి బదులు మహారాజు అని వ్రాశారు. అతడు స్టీమరుకు కెప్టన్‌. వెళ్తూ, వెళ్తూ స్టీమరు నుండి కొందరు దిగిపోతారు. అక్కడ మాయ రూపి కొండచిలువ కూర్చుని ఉంటుంది. మహారథులను కూడా మింగేస్తుంది. చదువును వదిలేస్తారు. అనగా వారు నిశ్చయబుద్ధి గలవారిగా లేకపోవడం. మళ్లీ సాగరము మధ్యలో పడిపోతారు.

పక్షి మరణించినట్లయితే చీమల గుంపు వచ్చి దానిని తీసుకు వెళ్తాయి. ఇక్కడ 5 వికారాల రూపి భూతము ఒకేసారి పచ్చిగా మింగేస్తుంది. దీని గురించి పెద్ద కథ వ్రాయబడింది. కొందరు స్టీమరులో కూర్చుని ఉంటారు. గ్యారంటీ కూడా వ్రాస్తారు. తమ ఫోటో కూడా పంపుతారు. తిరిగి ఒకవేళ ఎవరి సాంగత్యము కారణంగానైనా పాడైపోయారంటే, చదువును వదిలివేస్తారు. తర్వాత ఆ చిత్రాన్ని వారికి వాపస్‌ పంపేస్తారు. ఈ సమయంలో మాయ తమోప్రధానంగా ఉంది. ఈశ్వరుని చేతిని వదిలేశారంటే అసురులు పట్టుకుంటారు. ఇలా చాలామంది నడుస్తూ, నడుస్తూ చేతిని వదిలి దిగిపోతారు. ఫలానావారిని క్రోధ భూతము, మోహ భూతము పట్టుకుందని సమాచారము వస్తుంది. మొట్టమొదట నిర్మోహులుగా అవ్వవలసి ఉంటుంది. మోహము ఒక్కరి పైననే ఉంచుకోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. మోహపు సంకెళ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు బుద్ధియోగాన్ని ఒక్కరితోనే జోడించాలి. మనుష్యులు భక్తి చేస్తున్నప్పుడు వారి బుద్ధి ఎలాగైతే వ్యాపార వ్యవహారాల వైపు, ఇంటివైపు వెళ్లిపోతుందో ఇక్కడ మీకు కూడా అలాగే అవుతుంది. నడుస్తూ నడుస్తూ మీకు మీ కొడుకు గుర్తుకొస్తాడు. పతి జ్ఞాపకం వస్తాడు. ఈ సంకెళ్ల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఒకవేళ అంతిమ సమయంలో ఇతరులెవరైనా స్మృతిలోకి వచ్చినట్లయితే, అంత్యకాలములో ఎవరైతే పతిని స్మృతి చేస్తారో..........'' చివరిలో ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ గుర్తుకు రానంతగా అభ్యాసము చేయాలి. ఉదయమే లేచి బాబాను స్మృతి చేయండి. బాబా, మేము మీ వద్దకు వచ్చాము. తప్పకుండా మేము స్వర్గానికి అధికారులుగా అవుతాము అని మాట్లాడండి. తండ్రిని మరియు వారసత్వాన్ని అనగా ' అల్ఫ్‌ మరియు బే ' ను స్మృతి చేయాలి. అల్ఫ్‌ అనగా అల్లా, బే అనగా రాజ్యాధికారము. ఆత్మ ఒక బిందువు. అది ఉన్న చోటుకు గుర్తుగా మనుష్యులు తిలకాన్ని ధరిస్తారు. కొంతమంది బిందువును ధరిస్తారు. కొంతమంది పొడవుగా ఉండే తిలకాన్ని ధరిస్తారు. కొందరు కిరీటము వలె దిద్దుతారు. కొందరు చిన్న నక్షత్రము వలె ధరిస్తారు. మరి కొందరు వజ్రము వలె తిలక ధారణ చేస్తారు. మీరు ఆత్మలని బాబా చెప్తున్నారు. ఆత్మ ఒక నక్షత్రములా ఉంటుందని మీకు తెలుసు. ఆ ఆత్మలోనే మొత్తం డ్రామా రికార్డు అంతా నిండి ఉంది. నిరంతరము తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మిగిలినందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించండి అని ఇప్పుడు బాబా ఆజ్ఞాపిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మీ తల పై అనేక జన్మల పాప భారముంది. అది స్మృతి ద్వారా తప్ప మరి ఇతర వేటి ద్వారా భస్మము కాదు అని తండ్రి చెప్తున్నారు. సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే సదా ఐశ్వర్యవంతులుగా అయ్యే వారసత్వము బాబా నుండి మాత్రమే లభిస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము ఉన్నట్లయితే ఇంకేమి కావాలి? ఆరోగ్యము ఉండి, ఐశ్వర్యము లేకున్నా, ఐశ్వర్యముండి ఆరోగ్యము లేకున్నా మజా(సంతోషము)ఉండదు. ఆత్మ అయితే మొదట తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక 21 జన్మల వరకు ఆరోగ్యము లభిస్తుంది. స్వదర్శన చక్రధారులుగా అయితే 21 జన్మలకు ఐశ్వర్యము లభిస్తుంది. ఇది ఎంత సహజమైన విషయము! మనము ఈ విధంగా 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాము. ఇప్పుడు అంతా బూడిదగా అవ్వనున్నది. అటువంటి వాటి పై మనసు ఎందుకు పెట్టుకోవాలి? ఎవరైతే నూతన ప్రపంచ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారో వారి పైననే మనసును ఉంచుకోవాలి. పిల్లలూ! ఇప్పుడు ఈ శరీరమును మరచి స్వయాన్ని అశరీరులుగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని వారు ఆత్మలతో మాట్లాడ్తారు. ఈ శరీరము మీకు పాత్ర్రను అభినయించేందుకు లభించింది. ఉదయాన్నే లేచి ఈ విషయాలను స్మరణ చేయాలి. ఏ ప్రియతముడైతే ఈ మురికి అగాధము నుండి తీరానికి తీసుకెళ్తారో వారిని స్మృతి చేయాలి. మిగిలిన వారందరూ విషయ సాగరములో ముంచేవారే. తండ్రి ఒక్కరు మాత్రమే తీరానికి చేరుస్తారు. వారిని నావికుడని, తోటమాలి అని కూడా అంటారు. మిమ్ములను ముళ్ల నుండి పుష్పాలుగా చేసి స్వర్గములోకిి పంపిస్తారు. స్వర్గములో మీరు ఎప్పుడూ దు:ఖాన్ని చూడరు. అందుకే వారిని దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. హర హర మహాదేవ అని అంటారు కదా. ఈ విధంగా శివుడినే పిలుస్తారు. వీరు బ్రహ్మ-విష్ణు-శంకరులకు కూడా తండ్రి. ఆ తండ్రియే 21 జన్మల కొరకు సుఖ వారసత్వమునిస్తారు. కనుక వారిని స్మృతి చేయాలి కదా. ఇందులో ధైర్యము కావాలి. స్మృతి చేస్తూ అలసిపోయినట్లయితే నడవడం కూడా ఆపేస్తారు. ఎటువంటి సాంగత్యము లభిస్తుందంటే వారు తండ్రినే వదిలేస్తారు. అందుకే మంచి సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది అని అంటారు. బయటకు వెళ్లినట్లయితే చెడు సాంగత్యమే లభిస్తుంది. అప్పుడు నషా ఎగిరిపోతుంది. బ్రహ్మకుమారీల వద్ద ఇంద్రజాలముంది, అది మీకు కూడా అంటుకుంటుంది, వారి వద్దకు వెళ్లకండి అని కొందరు చెప్తారు. పరీక్షలైతే వస్తూనే ఉంటాయి. 10 సంవత్సరాలు ఉండి కూడా సాంగత్య దోషములోకి వచ్చేవారు చాలామంది ఉన్నారు. కాలు క్రిందికి దించారంటే మాయ పచ్చిగానే తినేస్తుంది. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము తప్పకుండా లభిస్తుంది అనే నిశ్చయము కూడా ఉంటుంది. అయినా మాయ ద్వారా పెద్ద, పెద్ద తుఫానులు వస్తాయి. ఇది యుద్ధ మైదానము. అర్ధకల్పము మాయ యొక్క రాజ్యము నడిచింది. ఇప్పుడు ఆ వికారాల పై విజయము పొందాలి. రావణుడిని తగులబెడ్తారు. ఒక రోజు వేడుకలు జరుపుకుంటారు. ఇదంతా కృత్రిమమైన సుఖము. నిజమైన సుఖము సుఖధామములో లభిస్తుంది. పోతే ఈ నరక సుఖాలు కాకిరెట్టతో సమానము. స్వర్గములో అయితే సుఖమే సుఖముంటుంది. మీరు సుఖధామము కొరకు పురుషార్థం చేస్తున్నారు. ఇది బాక్సింగ్‌(మల్లయుద్ధము). ఒకసారి మాయకు విజయము, ఒకసారి పిల్లలకు విజయము లభిస్తుంది. ఈ యుద్ధము రాత్రింబవళ్ళు జరుగుతుంది. ఉస్తాదు(గురువు) చేతిని గట్టిగా పట్టుకోవాలి. ఉస్తాదు సర్వశక్తివంతుడు, సమర్థుడు. వారి చేతిని మీరు వదిలేశారంటే సర్వశక్తివంతులైన ఆయన మాత్రము ఏమి చేయగలరు? చేతిని వదిలారంటే సమాప్తమైపోతారు. స్టీమరు(నావ) విషయము శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు స్టీమరు వెళ్తూ ఉంది. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వైకుంఠము దగ్గరలో కనిపిస్తోంది. ప్రారంభములో మీరు ఏ విధంగా పదే పదే వైకుంఠ దృశ్యాలు చూసేవారో, అలాగే చివరి సమయములో కూడా మీరు క్షణ క్షణము వైకుంఠ దృశ్యాలు చూస్తూ ఉంటారు. అంతిమ సమయంలో కూడా మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎవరు ఇక్కడ ఉంటారో, ఎవరు ధైర్యంగా చేయి పట్టుకొని ఉంటారో, వారే అంతిమ సమయములో ఇవన్నీ చూస్తారు. బాబా, మీరు దాసీలుగా అవుతారు, ఫలానావారు ఇలా అవుతారు అని పిల్లలు తెలపడం ప్రారంభిస్తారు. మేము దాసీలుగా అవుతామా అని దు:ఖిస్తారు, పశ్చాత్తాపపడ్తారు. శ్రమ చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ప్రారంభంలో మీరు చాలా ఆట-పాటలు(రాసలీలు) మొదలైనవి ఎన్నో చూశారు. ఒక పాట కూడా ఉంది కదా - మేము ఏదైతే చూశామో.,............ సమయము ఎంతెంత సమీపంగా వస్తూ ఉంటుందో అంతంత అన్నీ తెలియజేస్తూ ఉంటారు. మళ్లీ చదువు అనేది ఉండదు. అప్పుడు తండ్రి చెప్తారు - మీకు ఎంతగా అర్థము చేయించాను! మీరు శ్రీమతము పై నడవలేదు. అందుకే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కల్ప-కల్పము ఈ పదవియే లభిస్తూ ఉంటుంది. కనుకనే తండ్రి చెప్తారు - మీరు మీ పురుషార్థము చేస్తూ ఉండండి. మాతా-పితలను అనుసరిస్తూ ఉండండి. కొందరు కుపుత్రులు కూడా ఉంటారు కదా. మాయకు వశమై ఎంతగానో విసిగిస్తారు, సతాయిస్తూ ఉంటారు. వారు చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్ఠమైపోతుంది. శిక్షలు కూడా పిల్లలు సాక్షాత్కారములో చూశారు. ప్రపంచంలో ఆసురీ సాంగత్యముంది. ఇక్కడ ఈశ్వరీయ సాంగత్యముంది. తర్వాత మాకేమి తెలుసు? అని ఎవ్వరూ అనకుండా తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. వినాశన సమయములో మనుష్యులు చాలా త్రాహి-త్రాహి(రక్షించండి, రక్షించండి) అని అరుస్తూ, విలపిస్తూ ఉంటారు. మీరు సంతోషము కలిగించే సాక్షాత్కారాలు చాలా చూస్తూ ఉంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు(పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణసంకటము/ మిరువా మౌత్‌ మలూకా షికార్‌) అని అంటారు కదా. ఈ విధంగా మీరు నృత్యము చేస్తూ ఉంటారు. వినాశనము తర్వాత మళ్లీ మన భవనాలు ఎలా తయారవుతాయో మీరు చూస్తూ ఉంటారు. ఎవరైతే జీవించి ఉంటారో, వారు అన్నీ చూస్తారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి వారిని విడిచి వెళ్లిపోతే వీటిని చూడలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి కలుసుకున్న పిల్లలకు నంబరువార్‌ పురుషార్థానుసారము ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సమర్థుడైన తండ్రి చేతిని పట్టుకుని ఉండాలి. ఒక్క తండ్రి పైననే మనస్సునుంచాలి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చోవాలి.

2. సాంగత్య దోషము నుండి మిమ్ములను మీరు రక్షించుకోవాలి. చెడు సాంగత్యములోకి వచ్చి చదువును ఎప్పుడూ వదిలేయరాదు.

వరదానము :-

'' సేవలలో సదా సహయోగులుగా అయ్యి సహజయోగులనే వరదానాన్ని ప్రాప్తి చేసుకునే విశేషతా సంపన్న భవ ''

బ్రాహ్మణ జీవితము విశేషతలతో సంపన్నమైన జీవితము. బ్రాహ్మణులుగా అవ్వడం అనగా సహజయోగీ భవ అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకోవడం. ఇదే మొట్టమొదటి జన్మలోని వరదానము. ఈ వరదానాన్ని సదా బుద్ధిలో గుర్తుంచుకోవడం - ఇదే వరదానాన్ని జీవితంలోకి తీసుకురావడం. వరదానాన్ని స్థిరంగా ఉంచుకునే సహజ విధి - సర్వ ఆత్మల పట్ల వరదానాన్ని సేవలో ఉపయోగించడం. సేవలో సహయోగులుగా అవ్వడమే సహజయోగులుగా అవ్వడం. కనుక ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని విశేషతా సంపన్నులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

''మస్తకమణి ద్వారా స్వ స్వరూపాన్ని, శ్రేష్ఠమైన గమ్యాన్ని సాక్షాత్కారము చేయించడమే లైట్‌హౌస్‌గా అవ్వడం ''