13-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఎప్పుడైతే మీ బుద్ధియోగము దేహ సహితంగా, దేహ సర్వ సంబంధాల నుండి తొలగిపోయి ఉంటుందో, అప్పుడే ఒక్క తండ్రి జతలో మీ అవ్యభిచారీ ప్రేమ జోడించబడి ఉండగలదు.''

ప్రశ్న :-

పిల్లలైన మీ రేస్‌(పరుగు పందెం) ఏది? ఆ రేసులో ముందుకు వెళ్లేందుకు ఆధారమేది?

జవాబు :-

మీ పరుగు పందెం - '' గౌరవయుక్తంగా ఉత్తీర్ణులుగా అవ్వడము(పాస్‌ విత్‌ ఆనర్‌).'' ఈ రేసుకు ఆధారము బుద్ధియోగము. బుద్ధియోగము ఎంతగా తండ్రి జతలో ఉంటుందో అంతగా పాపాలు తొలగిపోతాయి. అంతేకాక నిశ్చల, స్థిరమైన, అఖండిత, సుఖ-శాంతిమయ 21 జన్మల రాజ్య పదవి ప్రాప్తిస్తుంది. దీని కొరకు పిల్లలూ! నిద్రను జయించేవారుగా అవ్వండి. ఒక్క ఘడియ, అర్ధ ఘడియ అయినా స్మృతిలో ఉంటూ ఉంటూ అభ్యాసము పెంచుకుంటూ ఉండండి. స్మృతి రికార్డును(చార్టు) ఉంచుకోండి అని తండ్రి సలహా ఇస్తున్నారు.

పాట :-

వారు మా నుండి దూరము కారు, హృదయము నుండి ప్రేమ తొలగిపోదు..........( న వహ్‌ హమ్‌ సే జుదా హోంగే, న ఉల్‌ఫత్‌ దిల్‌ సే నికలేగి..........)   

ఓంశాంతి.

పిల్లలు పాట విన్నారు. ఉల్‌ఫత్‌ అంటే ప్రేమ. ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ అనంతమైన తండ్రి శివబాబా జతలో జోడించబడి ఉంది. బి.కె.లైన మీరు వారిని 'తాత(దాదా)' అని అంటారు. తమ తండ్రి-తాతల కర్తవ్యము గురించి తెలియని మనుష్యులెవ్వరూ ఉండరు. ఇంతమంది మేమంతా బ్రహ్మకుమార్‌-బ్రహ్మకుమారీలము అని చెప్పగలిగిన సంస్థ ఇంకేదీ ఉండదు. మాతలైతే కుమారీలు కాదు. మరి వారిని బ్రహ్మకుమారీలు అని ఎందుకు పిలువబడ్తారు? వీరు బ్రహ్మ ముఖవంశావళి వారు. ఇంతమంది బ్రహ్మకుమార్‌ - బ్రహ్మకుమారీలు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళిగా ఉన్నారు. ఒకే తండ్రి పిల్లలు. బ్రహ్మ కర్తవ్యమును గురించి కూడా తెలుసుకోవాలి. బ్రహ్మ ఎవరి సంతానము? శివుని సంతానము. శివునికి ముగ్గురు పిల్లలు. బ్రహ్మ-విష్ణు-శంకరులు. వీరు సూక్ష్మవతన వాసులు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే స్థూల వతనవాసిగా ఉండాలి. ఇంతమంది ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి వారమని అంటున్నారు. కుఖవంశావళీ వారైతే కాజాలరు. వీరేమీ గర్భం నుండి జన్మించినవారు కాదు. ఇంతమంది బ్రహ్మకుమారీ-బ్రహ్మకుమారులని ఎలా పిలువబడ్తారని మిమ్ములను అడగను కూడా అడగరు. మాతలు కూడా బ్రహ్మాకుమారీలు అయినారంటే తప్పకుండా బ్రహ్మ పిల్లలు బ్రహ్మముఖ వంశావళీవారే అయ్యి ఉంటారు. వీరంతా ఈశ్వరుని సంతానము. ఈశ్వరుడు ఎవరు? వారు పరమపిత పరమాత్మ, రచయిత. వారు దేనిని రచిస్తారు? స్వర్గమును. కనుక తప్పకుండా వారి మనవళ్ళు, మనవరాళ్లకు స్వర్గ వారసత్వమును ఇస్తూ ఉంటారు. రాజయోగమును నేర్పించేందుకు వారికి తప్పకుండా శరీరము కావాలి. ఊరకే తలపాగాను(కిరీటము) ఉంచేయరు. శివబాబా కూర్చుని బ్రహ్మ ముఖవంశావళికి మళ్లీ రాజయోగమును నేర్పిస్తున్నారు. ఎందుకంటే వారు మళ్లీ స్వర్గ స్థాపన చేస్తున్నారు. అలా కానిచో ఇంతమంది బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు ఎక్కడ నుండి వచ్చారు? అద్భుతము! ఆశ్చర్యము! ఎవ్వరూ ధైర్యముగా ప్రశ్నించను కూడా ప్రశ్నించరు. ఎన్నో సేవాకేంద్రాలున్నాయి! మీరు ఎవరు, మీ పరిచయమునివ్వండి? అని అడగాలి. ఇదేమో స్పష్టముగా ఉంది. ప్రజాపిత బ్రహ్మకు కుమారీలు, కుమారులు మరియు శివునికి మనవళ్లు మరియు మనవరాళ్లు. మనము వారి సంతానంగా అయ్యాము. వారి పై మనకు ప్రేమ ఉంది. శివబాబా కూడా అందరి నుండి ప్రేమను లేక బుద్ధియోగాన్ని తొలగించి నా ఒక్కరితోనే ఉంచుకోండి అని అంటారు. నేను మీకు బ్రహ్మ ద్వారా రాజయోగము నేర్పిస్తున్నాను కదా. బ్రహ్మకుమారీ, బ్రహ్మకుమారులైన మీరు వింటున్నారు కదా! ఎంత సహజమైన స్పష్టమైన విషయము. మీరు అడిగితే కదా! కనుక ఇది ఒక గోశాల(ఆవులుండే ప్రదేశము). శాస్త్రాలలో బ్రహ్మ గోశాల అని కూడా మహిమ చేయబడి ఉంది. వాస్తవానికి ఇది శివబాబా గోశాల. శివబాబా ఈ నంది గణములోకి వస్తారు. గోశాల అనే పదము ఉన్న కారణంగా శాస్త్రాలలో వారు ఆవులు మొదలైన వాటిని చూపించారు. శివజయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు. తప్పకుండా ఎవరో ఒకరి తనువులో వచ్చి ఉంటారు - ఇది గాడ్‌ఫాదర్‌ పాఠశాల అని మీకు తెలుసు. శివభగవానువాచ! జ్ఞాన సాగరుడు, పతితపావనుడు వారే. కృష్ణుడు స్వయం తాను పావనంగా ఉంటాడు. అతనికి పతిత తనువులోకి రావలసిన అవసరము ఏముంది? దూరదేశములో నివసించేవారు పరాయి దేశంలోనికి వచ్చారు.............. ( దూర్‌ దేశ్‌కా రహనేవాలా ఆయా దేశ్‌ పరాయే..........) అని మహిమ కూడా ఉంది. శరీరము కూడా పరాయిదే కనుక తప్పకుండా శివబాబాయే ఇతడిని రచించి ఉంటారు. అప్పుడే మనుష్య సృష్టి రచింపబడింది. కనుక వీరు బాప్‌, దాదా అని ఋజువు అవుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ఆది దేవుడు, మహావీరుడు ఎందుకంటే మాయ పైన విజయం పొందుకుంటాడు. జగదంబ కూడా మహిమ చేయబడింది. శ్రీ లక్ష్మి కూడా మహిమ చేయబడింది. జగదంబ బ్రహ్మ కూతురైన సరస్వతి అని ప్రపంచములోని వారికి తెలియదు. ఈమె కూడా బ్రహ్మ కుమారియే. అలాగే ఈమె కూడా బ్రహ్మకుమారియే. శివబాబా బ్రహ్మ ముఖము(నోటి) ద్వారా వీరిని తమ వారిగా చేసుకున్నారు(దత్తత తీసుకున్నారు). ఇప్పుడు వీరందరి బుద్ధియోగము(ప్రేమ) వారితో ఉంది. పరమాత్మ జతలో ప్రీతిని జోడించండి అని కూడా చెప్పబడ్తుంది. మిగిలినవారందరి జతలో బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరి జతలోనే జోడించండి. ఆ ఒక్కరే భగవంతుడు. కాని వారిని గురించి తెలియదు. ఏ విధంగా తెలుసుకోవాలి? తండ్రి వచ్చి తన పరిచయనిచ్చినప్పుడే నిశ్చయం కలుగుతుంది. ఈ రోజుల్లో అయితే ఆత్మయే పరమాత్మ అని నేర్పించేశారు. దాని ద్వారా వారితో సంబంధమే తెగిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు వాస్తవములో సత్య-సత్యమైన సత్యనారాయణ కథను వింటారు. వారు సుఖదేవుడు. మీరు వ్యాసులు. గీతలో కూడా వ్యాసుని పేరు ఉంది కదా. అతడు కూడా మనిషే కాని సత్యమైన వ్యాసులు మీరే. మీరు ఏ గీతనైతే తయారు చేస్తారో అది కూడా వినాశనమైపోతుంది. అసత్యమైన మరియు సత్యమైన గీత రెండూ ఇప్పుడే ఉన్నాయి. సత్య ఖండములో అసత్యానికి నామ-రూపాలే ఉండవు. మీరు తాత నుండి వారసత్వము తీసుకుంటున్నారు. ఇది ఈ బాబా ఆస్తి కాదు. స్వర్గ రచయిత శివబాబాయే కాని బ్రహ్మ కాదు. బ్రహ్మ మనుష్య సృష్టికి రచయిత. బ్రహ్మ ముఖ కమలము ద్వారా బ్రాహ్మణ వర్ణము రచింపబడింది. మీరు శివుని పౌత్రులు అనగా ఈశ్వరీయ సంప్రదాయము వారు. వారిని మీరు తమవారిగా చేసుకున్నారు. గురు పౌత్రులు అని అంటారు కదా. ఇప్పుడు మీరు సద్గురువు పౌత్రులు. వారు కేవలం మనుమళ్లు అనగా పురుషులు మాత్రమే, మనవరాళ్ళు ఉండరు. సద్గురువు అయితే ఒక్క శివబాబాయే. సద్గురువు లేకుంటే ఘోర అంధకారము అని గాయనము చేయబడింది. బ్రహ్మకుమారీ, బ్రహ్మకుమారులనే మీ పేరు చాలా అద్భుతమైనది! తండ్రి ఎంతగానో అర్థము చేయిస్తారు. కాని చాలా మంది పిల్లలు అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు - అనంతమైన తండ్రినైన నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు సర్వమూ తెలుసుకుంటారు. సత్య, త్రేతా యుగాలలో సూర్య వంశము, చంద్ర వంశముల వారి రాజ్యములుండేది. తర్వాత మళ్లీ రావణ రాజ్యములో బ్రహ్మ రాత్రి ప్రారంభమవుతుంది. ఆచరణలో మీరు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. సత్యయుగమునే స్వర్గమని అంటారు. అక్కడ నెయ్యి, పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడైతే నెయ్యి లభించనే లభించదు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! ఈ పురాతన ప్రపంచము ఇప్పుడు వినాశనమవ్వనున్నది. ఒక రోజు ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకుంటుంది. అన్నీ అంతమైపోతాయి. తర్వాత మీరు నా నుండి ఆస్తినైతే పొందుకోలేరు.

నేను వచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని లోనుగా తీసుకోవలసి పడ్తుంది. ఇల్లు కావాలి కదా! బాబా ఎంతో మంచి రమణీయంగా అర్థము చేయిస్తారు. మీరిప్పుడు నా ద్వారా అన్నీ తెలుసుకున్నారు. ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? అందరూ అయితే తీసుకోరు. తప్పకుండా మొదట వచ్చినవారే దేవీ దేవతలే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు వారికి నేను మళ్లీ రాజయోగము నేర్పిస్తాను. భారతదేశాన్ని మళ్లీ నరకము నుండి స్వర్గంగా చేసేందుకు నేను వస్తాను. ఇతడిని నేను విముక్తము చేస్తాను. మళ్లీ మార్గదర్శకుడనై వాపస్‌ కూడా తీసుకెళ్తాను. నన్ను జ్యోతి స్వరూపుడని కూడా అంటారు. జ్యోతి స్వరూపం కూడా రావలసి పడుతుంది. వారు స్వయంగా చెప్తున్నారు - పిల్లలూ, నేను మీ తండ్రిని, నా జ్యోతి ఎప్పుడూ ఆరిపోదు. వారు నక్షత్రము, భృకుటి మధ్యలో ఉండే నక్షత్రము. మిగిలిన ఆత్మలందరూ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటారు. కనుక ఆత్మ రూపీ నక్షత్రంలో 84 జన్మల పాత్ర అవినాశిగా నిశ్చితమై ఉంది. 84 జన్మలు అనుభవించి మళ్లీ మొదటి నెంబరుతో ప్రారంభం చేస్తారు. యథా రాజా - రాణి, తథా ప్రజ అలా కాకపోతే ఆత్మలో ఇంత పాత్ర ఎక్కడ నుండి నిండి ఉందో చెప్పండి. వీటిని చాలా గుహ్యమైన, అద్భుతమైన విషయాలని అంటారు. మనుష్య సృష్టిలోని ఆత్మలందరి పాత్ర నిశ్చయింపబడి ఉంది. నాలో ఈ పాత్ర ఉంది, అది కూడా అవినాశి అని అంటారు. ఇందులో మార్పు - చేర్పులు ఏమీ జరగవు. నా పాత్ర బ్రహ్మకుమారులు - బ్రహ్మకుమారీలకు తెలుసు. పాత్రనే జీవిత గాథ(బయోగ్రఫీ) అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా జగదంబ కూడా ఉంటుంది. తాను కూడా శూద్రుని నుండి బ్రాహ్మణిగా అయ్యింది కనుక మన ప్రేమ తండ్రి జతలో ఉంది మరియు ఆ ఒక్కరితోనే ప్రేమ ఉందని పిల్లలైన మీకు తెలుసు. అవ్యభిచారి ప్రేమ ఏర్పడేందుకు సమయము పట్టదు. మాయా పిల్లి కూడా తక్కువైనదేమీ కాదు. చాలామంది స్త్రీలకు పరస్పరములో ఈర్ష్య కలుగుతుంది. అలాగే మనము కూడా శివబాబాతో ప్రేమను ఉంచితే మాయకు ఈర్ష్య కలుగుతుంది. అందుకే తుఫానులను తీసుకొస్తుంది. పాచికల ఆటలో(పచ్చీస్‌) నాలుగు పడాలి అని మీరనుకుంటారు. కాని మయా రూపీ పిల్లి మూడు పడేస్తుంది. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటారు. కేవలం మీ బుద్ధియోగం దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి తొలగించి నన్ను స్మృతి చేయండని అని బాబా చెప్తారు. నేను మీకు అత్యంత ప్రియమైన తండ్రిని, నేను మిమ్ములను స్వర్గానికి యజమానులుగా చేస్తాను. అది కూడా మీరు నా శ్రీమతము పై నడిస్తేనే. బ్రహ్మ సలహా కూడా ప్రసిద్ధి చెందినది. కావున తప్పకుండా బ్రహ్మ పిల్లల సలహా కూడా ప్రసిద్ధమవుతుంది. వారు కూడా ఇలాంటి సలహానే ఇస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రమంతటి సమాచారాన్ని తండ్రియే తెలిపిస్తారు. భలే పిల్లలను మొదలైన వారిని సంభాళన చేయండి. కాని బుద్ధియోగము తండ్రి జతలో ఉంచుకోండి. ఇది శ్మశానమని మనము ఫరిస్తాన్‌కు వెళ్తామని భావించండి. ఇది ఎంత సహజమైన విషయము!

ఏ సాకారీ లేదా ఆకారి దేవతలతో బుద్ధియోగాన్ని జోడించకండి అని తండ్రి దళారిగా అయ్యి చెప్తున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు.......... అని పాడ్తారు కదా. అలా చాలాకాలము నుండి వేరుగా అయితే దేవీ దేవతలే ఉంటారు. వారే మొట్టమొదట పాత్ర చేసేందుకు వస్తారు. సద్గురువు దళారి రూపములో లభించినప్పుడు సుందరమైన మేళా జరుగుతుంది. దళారి రూపంలో చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మరియు ''మేము, కామచితి నుండి దిగి జ్ఞానచితి పైన కూర్చుంటాము'' అని ప్రతిజ్ఞ చేయండి. తద్వారా మీరు మళ్లీ రాజ్యభాగ్యాన్ని తీసేసుకుంటారు. మేము ఎంత సమయము అటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తున్నామని మీ వద్ద రికార్డు(చార్టు) ఉంచుకోండి. కన్య రాత్రి - పగలు పతిని స్మృతి చేస్తూ ఉంటుంది కదా! తండ్రి చెప్తున్నారు - ఓ నిద్రను జయించే పిల్లలారా! ఇప్పుడు పురుషార్థము చేయండి. ఒక్క ఘడియ, అర ఘడియ.............. ఇలా ప్రారంభించండి. తర్వాత నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చేసుకుంటూ వెళ్లండి. నాతో యోగమును జోడించినట్లైతే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులౌతారు. ఈ పరుగు పందెము బుద్ధికి సంబంధించినది, సమయము పడ్తుంది. బుద్ధియోగము ద్వారానే పాపము సమాప్తమౌతుంది. తర్వాత మళ్లీ మీరు స్థిరమైన, అఖండిత, సుఖ-శాంతిమయ 21 జన్మలు రాజ్య పాలన చేస్తారు. మీరు కల్పక్రితము కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ రాజ్యభాగ్యాన్ని తీసుకోండి. కల్ప-కల్పము మనమే స్వర్గాన్ని తయారు చేస్తాము, రాజ్యపాలన చేస్తాము. మళ్లీ మనలనే మాయ నరకవాసులుగా చేస్తుంది. ఇప్పుడు మనము రాముని సంప్రదాయానికి చెందినవారము. మనకు వారి పై ప్రేమ ఉంది. తండ్రి మనకు తన పరిచయమునిచ్చారు. తండ్రి స్వర్గ రచయిత. మనము వారి సంతానము మరి మనము నరములో ఎందుకు పడి ఉన్నాము? తప్పకుండా ఎప్పుడో స్వర్గములో ఉండేవారము. తండ్రియే స్వర్గాన్ని రచించారు. బ్రహ్మకుమారీ-బ్రహ్మకుమారులు సర్వులకు ప్రాణదానము ఇచ్చేవారు. వారి ప్రాణాలను ఎప్పుడూ మృత్యువు వచ్చి నియమ విరుద్ధంగా, అకాలంగా తీసుకు వెళ్ళదు. అక్కడ అకాల మృత్యువులు జరగడం అసంభవము. అక్కడ ఏడ్వడం కూడా ఉండదు. శ్రీ కృష్ణుడు ఎలా జన్మ తీసుకుంటాడో మీరు సాక్షత్కారములో కూడా చూశారు. పూర్తిగా మెరుపు మెరుస్తుంది. సత్యయుగ మొదటి రాకుమారుడు కదా! కృష్ణుడు నెంబర్‌వన్‌ సతోప్రధానమైన ఆత్మ. తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తాడు. ఎప్పుడు తమో, శిధిలావస్థ స్థితిలోకి శరీరము వస్తుందో అప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఈ అభ్యాసము ఇక్కడే చేయడం జరుగుతుంది. బాబా! మేము ఇప్పుడు మీ వద్దకు వస్తాము. మళ్లీ అక్కడ నుండి మేము స్వర్గములోకి వెళ్లి నూతన శరీరాన్ని తీసుకుంటాము. ఇప్పుడైతే మళ్లీ బాబా వద్దకు వాపసు వెళ్లాలి కదా! అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అకాల మృత్యువు నుండి రక్షించుకునేందుకు అందరికి ప్రాణ దానమునిచ్చే సేవ చేయాలి. రావణ సంప్రదాయస్థులను రాముని సంప్రదాయస్థులుగా చేయాలి.

2. హృదయపూర్వక ప్రేమను ఒక్క తండ్రితో ఉంచాలి. బుద్ధియోగమును భ్రమింపజేయరాదు. నిద్రను జయించి స్మృతిని పెంచుకుంటూ ఉండాలి.

వరదానము :-

''సమయ ప్రమాణంగా రూప్‌-బసంత్‌ అనగా జ్ఞానయుక్త, యోగయుక్త ఆత్మలుగా అయ్యే స్వ శాసక్‌ భవ ''

ఎవరైతే స్వశాసకులుగా ఉంటారో, వారు ఏ సమయంలో కావాలనుకుంటే అప్పుడు రూప్‌లుగా (యోగులుగా) అవుతారు, ఏ సమయంలో కావాలనుకుంటే అప్పుడు బసంత్‌లుగా(జ్ఞానులుగా) అవుతారు. రెండు స్థితులను ఒక సెకండులో చేసుకోగలరు. రూప్‌లుగా అనగా యోగులుగా అవ్వాలనుకున్నప్పుడు జ్ఞాన విషయాలు జ్ఞాపకం రావడం కాదు. సెకండు కంటే తక్కువ సమయంలో ఫుల్‌స్టాప్‌ పెట్టగలగాలి. శక్తిశాలి బ్రేక్‌ అనగా ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ బ్రేక్‌ పడాలి. అందుకు ఏ సమయంలో ఏ విధి ద్వారా ఎక్కడ మనసును, బుద్ధిని లగ్నము చేయాలో అక్కడ లగ్నమవ్వాలి. ఇటువంటి కంట్రోలింగ్‌ పవర్‌, రూలింగ్‌ పవర్‌ ఉండాలి.

స్లోగన్‌ :-

''ఎవరైతే తుఫాన్‌ కలిగించే వారికి కూడా శాంతిని కానుకగా ఇస్తారో, వారే శాంతిదూతలు ''