03-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - సర్వులను ఆశీర్వదించువారు ఆనందసాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. తండ్రినే దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు, వారు తప్ప ఇతరులెవ్వరూ దు:ఖమును హరించలేరు ''

ప్రశ్న :-

భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గము రెండిటిలోనూ దత్తత తీసుకొనే ఆచారముంది కాని వ్యత్యాసమేది?

జవాబు :-

భక్తి మార్గములో ఎప్పుడైనా, ఎవరికైనా దత్తత అయితే గురు-శిష్యుల సంబంధము ఉంటుంది. సన్యాసులు కూడా దత్తత అయినప్పుడు తమను అనుచరులుగా చెప్పుకుంటారు. కాని జ్ఞాన మార్గములో మీరు అనుసరించే అనుచరులుగా లేక శిష్యులు కారు. మీరిప్పుడు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లలుగా అవ్వడమంటే వారసత్వానికి అధికారులుగా అవ్వడం.

పాట :-

ఓం నమ: శివాయ,................   

ఓంశాంతి.

పిల్లలు పాట విన్నారు. ఇది పరమపిత పరమాత్మ శివుని మహిమ. శివాయ నమ: అని కూడా అంటారు. రుద్రాయ నమ: లేక సోమనాథాయ నమ: అని అనరు. శివాయ నమ: అని అంటారు మరియు వారి స్తుతి కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు శివాయ నమ: అని తండ్రినే అంటారు. గాడ్‌ఫాదర్‌ పేరు శివ. వారు నిరాకారులు. ''ఓ గాడ్‌ఫాదర్‌'' అని ఎవరు అన్నారు? - ఆత్మ అంటుంది. కేవలం ఓ ఫాదర్‌ అని అన్నట్లయితే అది శారీరిక తండ్రికి వర్తిస్తుంది. '' ఓ గాడ్‌ఫాదర్‌ '' అని అన్నందున అది ఆత్మిక తండ్రికి వర్తిస్తుంది. ఇవి అర్థము చేసుకునే విషయాలు. దేవతలను పారస బుద్ధి గలవారని అంటారు. దేవతలైతే విశ్వాధికారులుగా ఉండేవారు. ఇప్పుడు యజమానులు ఎవ్వరూ లేరు. భారతదేశానికి అధిపతులెవ్వరూ లేరు. రాజులను కూడా తండ్రి, అన్నదాత అని అంటారు. ఇప్పుడైతే రాజులే లేరు. కనుక శివాయ నమ: అని ఎవరు అన్నారు? వీరు తండ్రి అని ఎలా తెలుస్తుంది? బ్రహ్మకుమార-కుమారీలైతే చాలామంది ఉన్నారు. వీరు శివబాబాకు పౌత్రులు. బ్రహ్మ ద్వారా వీరిని దత్తత చేసుకుంటారు. మేము బ్రహ్మకుమార-కుమారీలమని అందరూ అంటారు. మంచిది. బ్రహ్మ ఎవరి పుత్రుడు? - శివబాబా పుత్రుడు. బ్రహ్మ-విష్ణు-శంకరులు ముగ్గురూ శివుని కుమారులే. శివబాబా శ్ర్రేష్ఠాతి శ్రేష్ఠమైన భగవంతుడు. నిరాకార వతనము(పరంధామము)లో ఉండేవారు. బ్రహ్మ-విష్ణు-శంకరులు సూక్ష్మ వతనవాసులు. మంచిది. మానవ సృష్టిని ఎలా రచించారు? శివబాబా అంటున్నారు - డ్రామానుసారము నేను సాధారణమైన బ్రహ్మ తనువులో ప్రవేశించి ఇతనిని ప్రజాపితగా చేస్తాను. నేను ఇతడిలోనే ప్రవేశిస్తాను. ఇతనికి బ్రహ్మ అని పేరు పెట్టాను. దత్తత తీసుకున్న తర్వాత పేరు మారిపోతుంది. సన్యాసులు కూడా పేరును మార్చుకుంటారు. మొదట గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటారు. తర్వాత సంస్కారమనుసారము చిన్నతనము నుండే శాస్త్రాలు మొదలైనవి చదువుతారు తర్వాత వైరాగ్యము వస్తుంది. సన్యాసుల వద్దకు దత్తత అవుతారు. వీరు మా గురువు అని చెప్తారు. వారిని తండ్రి అని అనరు. వారు గురువులకు శిష్యులుగా లేదా అనుచరులుగా అవుతారు. గురువులు శిష్యులను దత్తత చేసుకుంటారు. మీరు మా శిష్యులు లేక అనుచరులు అని అంటారు. ఇక్కడ తండ్రి - మీరు నా పిల్లలు అని అంటారు. ఆత్మలైన మీరు తండ్రినైన నన్ను భక్తిమార్గములో పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దు:ఖము చాలా ఉంది. త్రాహి-త్రాహి(అయ్యో, అయ్యో) అని అంటున్నారు. పతితపావనులు తండ్రి ఒక్కరే. నిరాకార శివునికి ఆత్మ నమస్కరిస్తుంది. కనుక వారు తండ్రే కదా. మీరే తల్లి-తండ్రి,.......... అని గాడ్‌ఫాదర్‌నే మహిమ చేశారు. తండ్రి ఉన్నట్లయితే తల్లి కూడా తప్పకుండా కావాలి. తల్లి, తండ్రి లేకుంటే రచన జరగదు. తండ్రి పిల్లల వద్దకు రావలసే వస్తుంది. ఈ సృష్టి చక్రము ఎలా పునరావృతము అవుతుందో దీని ఆదిమధ్యాంతాలు తెలుసుకోవాలి - దీనినే త్రికాలదర్శులుగా అవ్వడం అని అంటారు. ఇన్ని కోట్ల పాత్రధారులున్నారు. ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిదే. ఇది అనంతమైన డ్రామా. తండ్రి అంటున్నారు - నేను ముఖ్య రచయితను, దర్శకుడను. ముఖ్య పాత్రధారిని. పాత్ర చేస్తున్నాను కదా. బాబా అంటారు - ఆత్మనైన నన్ను సుప్రీమ్‌ అని అంటారు. ఆత్మ, పరమాత్మల రూపము ఒక్కటే. వాస్తవంలో ఆత్మ బిందువు. భృకుటి మధ్యలో ఆత్మ నక్షత్రములా ఉంటుంది కదా, అతిసూక్ష్మమైనది. దానిని చూచేందుకు వీలు పడదు. ఆత్మ కూడా సూక్ష్మమైనది, ఆత్మల తండ్రి కూడా సూక్ష్మమైనవారే. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఆత్మలైన మీరు బిందు సమానమైనారు. శివుడనైన నేను కూడా బిందు సమానమే. అయితే నేను సుప్రీం సృష్టికర్తను, దర్శకుడను. నేను జ్ఞాన సాగరుడను. శివబాబా చెప్తున్నారు - నాలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. నేను జ్ఞానసాగరుడను, ఆనందసాగరుడను, అందరినీ ఆశీర్వదిస్తాను. అందరినీ సద్గతిలోకి తీసుకెళ్తాను. దు:ఖహర్త-సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగములో దు:ఖితులు ఎవ్వరూ ఉండరు. అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యమే ఉంటుంది.

తండ్రి అర్థము చేయిస్తున్నారు - నేను ఈ సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడను. మామిడి వృక్షముందనుకోండి. దాని బీజము జడమైనది. అది మాట్లాడదు. ఒకవేళ చైతన్యమైతే ఇలా మాట్లాడేది - నా బీజము ద్వారా ఇలాంటి కొమ్మ, రెమ్మలు, ఆకులు వస్తాయి. ఇప్పుడిది చైతన్యమైనది. దీనిని కల్పవృక్షము అని అంటారు. మానవ సృష్టి బీజము పరమపిత పరమాత్మ. నేనే వచ్చి దీని జ్ఞానాన్ని అర్థము చేయిస్తానని తండ్రి అంటున్నారు. పిల్లలను సదా సుఖీలుగా చేస్తాను. దు:ఖితులుగా చేసేది మాయ. భక్తిమార్గము ఇప్పుడు పూర్తి అవుతుంది. డ్రామా తప్పకుండా తిరగాల్సిందే(పునరావృతమవ్వాలి). ఇది అనంతమైన ప్రపంచ చరిత్ర-భూగోళము. చక్రము తిరుగుతూ ఉంటుంది. కలియుగము మారి మళ్లీ సత్యయుగము వస్తుంది. సృష్టి అయితే ఒక్కటే. గాడ్‌ఫాదర్‌ కూడా ఒక్కరే. వీరికి ఏ తండ్రీ లేరు. వారే టీచరై చదివిస్తున్నారు. ''భగవానువాచ - నేను మీకు రాజయోగము నేర్పిస్తాను''. మనుష్యులకు తల్లిదండ్రుల గురించి తెలియదు. నిరాకారులైన శివబాబాకు మనము నిరాకార పిల్లలము అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అంతేకాక సాకార బ్రహ్మకు కూడా పిల్లలమే. నిరాకార పిల్లలంతా సోదరులు, బ్రహ్మ పిల్లలంతా సోదరీ - సోదరులు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. సోదరీ-సోదరులు వికారాలలోకి ఎలా వెళ్తారు? వికారాల అగ్నియే అంటుకుంటుంది కదా. కామాగ్ని అని అంటారు. దీని నుండి రక్షించుకునే యుక్తిని తండ్రి తెలిపిస్తున్నారు. ఒకటేమో ప్రాప్తి చాలా శ్రేష్ఠమైనది. ఒకవేళ మనము తండ్రి శ్రీమతమును అనుసరిస్తే అనంతమైన తండ్రి వారసత్వాన్ని పొందుతాము. స్మృతి ద్వారానే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రాచీన భారతదేశ యోగము ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రులైపోతారు, పాపాలు భస్మమైపోతాయి. తండ్రి స్మృతిలో శరీరాన్ని వదిలినట్లయితే నా వద్దకు వచ్చేస్తారు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇది అదే మహాభారత యుద్ధము. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో వారే విజయులుగా అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. స్వర్గాధికారులుగా తయారు చేసేందుకే భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారు. మళ్లీ మాయా రావణుడు నరకానికి అధిపతులుగా చేస్తాడు. అది శాపము లభించినట్లవుతుంది.

తండ్రి చెప్తున్నారు - ''అతి ప్రియమైన పిల్లలారా! నా మతముననుసరించి మీరు స్వర్గవాసీ భవ. మళ్లీ రావణరాజ్యము మొదలైనప్పుడు రావణుడు - హే ఈశ్వరుని పిల్లలారా, నరకవాసీ భవ'' అని అంటాడు. నరకము తర్వాత మళ్లీ స్వర్గము తప్పకుండా వస్తుంది. ఇది నరకము కదా. ఎన్ని మారణహోమాలు జరుగుతున్నాయి! సత్యయుగములో యుద్ధాలు, జగడాలు ఉండవు. భారతదేశమే స్వర్గముగా ఉండేది. అప్పుడు వేరే ఏ ఇతర రాజ్యాలు లేనే లేవు. ఇప్పుడు భారతదేశము నరకంగా ఉంది. అనేక ధర్మాలున్నాయి. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన చేసేందుకు నేను రావలసి వస్తుందని మహిమ చేయబడ్తుంది. నేను ఒక్కసారి మాత్రమే అవతరిస్తాను. తండ్రి ఈ పతిత ప్రపంచములోనే రావలసి పడ్తుంది. ఎప్పుడు ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నదో అప్పుడు వారు వస్తారు. దాని కొరకు యుద్ధము కూడా జరగాలి.

తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా, మీరు అశరీరులుగా వచ్చారు, 84 జన్మల పాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు వాపస్‌ వెళ్ళాలి. నేను మిమ్ములను పతితుల నుండి పావనంగా చేసి వాపస్‌ తీసుకెళ్తాను. లెక్కాచారము ఉంది కదా. 5 వేల సంవత్సరాలలో దేవతలు 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఇప్పుడు తండ్రి చెప్త్తున్నారు - నన్ను స్మృతి చేయండి, వారసత్వము తీసుకోండి. సృష్టి చక్రము బుద్ధిలో తిరగాలి. మనము పాత్రధారులము కదా. పాత్రధారులమై డ్రామా రచయిత, దర్శకుడు, ముఖ్య పాత్రధారులు తెలియకపోతే వారు బుద్ధిహీనులు. దీని వలన భారతదేశము ఎంత పేద దేశంగా అయిపోయింది. మళ్లీ తండ్రి వచ్చి సంపన్నం(సాల్వెంట్‌)గా చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారతవాసులైన మీరు స్వర్గములో ఉండేవారు, మళ్లీ మీరే 84 జన్మలు తప్పకుండా తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇక ఈ చివరి జన్మ మిగిలి ఉంది. భగవానువాచ - భగవంతుడైతే అందరికీ ఒక్కరే. కృష్ణుని ఇతర ధర్మాలవారు భగవంతుడని ఒప్పుకోరు. నిరాకారుని మాత్రమే అంగీకరిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. తండ్రి చెప్తున్నారు - నేను అనేక జన్మల అంతిమ జన్మలో వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను. రాజ్యము స్థాపన అవుతుంది. మళ్లీ వినాశనము మొదలవుతుంది, నేను వెళ్ళిపోతాను. ఇది చాలా పెద్ద యజ్ఞము. ఇతర యజ్ఞాలన్నీ ఇందులో స్వాహా అవ్వనున్నాయి. పూర్తి ప్రపంచములోని చెత్తా చెదారము ఇందులో పడిపోతుంది. తర్వాత ఏ యజ్ఞమూ రచింపబడదు. భక్తిమార్గము సమాప్తమైపోతుంది. సత్య-త్రేతా యుగాల తర్వాత మళ్లీ భక్తి మొదలవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. కావున ఈ మహిమ అంతా శివబాబాదే. వీరికి ఎన్నో పేర్లు ఉంచారు. కాని వారిని గురించి ఏమీ తెలియదు. వీరిని శివుడు, రుద్రుడు, సోమనాథ్‌, బబూరీనాథ్‌ అని కూడా అంటారు. ఒక్కరికే అనేక పేర్లు పెట్టేశారు. ఎటువంటి సేవ చేశారో అటువంటి పేర్లు పెట్టారు. మీకు సోమరసాన్ని తాపిస్తున్నారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాన్ని తెరిచేందుకు నిమిత్తంగా ఉన్నారు. పవిత్రులకే నమస్కరిస్తారు. అపవిత్రులు పవిత్రులకు నమస్కరిస్తారు. కన్యలకు అందరూ తల వంచుతారు. ఈ బ్రహ్మకుమార-కుమారీలు ఈ భారతదేశాన్ని ఉద్ధరిస్తున్నారు. పవిత్రంగా అయ్యి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. కామము మహాశత్రువు. కామము లేకుండా ఉండలేకుంటే కొట్టను ప్రారంభిస్తారు. రుద్ర యజ్ఞములో అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. దెబ్బలు తిని తిని చివరికి వారి పాపపు కుండ నిండగానే మళ్లీ వినాశనము జరుగుతుంది. చాలా మంది పిల్లలున్నారు. ఎప్పుడూ నన్ను చూసి ఉండరు. బాబా మీరు మాకు తెలుసు, మీ ద్వారా వారసత్వము తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవుతామని వ్రాస్తారు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - శాస్త్రాలు చదవడము, తీర్థయాత్రలకు వెళ్ళడము వంటి భక్తిమార్గపు శారీరిక యాత్రలను చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు వాపస్‌ ఇంటకి వెళ్లాలి కనుక నాతో బుద్ధియోగము జోడించండి. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క నాతో సంబంధము జోడించినట్లయితే నేను మిమ్ములను నా జతలో ఇంటికి తీసుకెళ్ళి మళ్లీ స్వర్గములోకి పంపిస్తానని బాబా అంటున్నారు. అది శాంతిధామము. అక్కడ ఆత్మలు మాట్లాడవు. సత్యయుగము సుఖధామము. ఇది దు:ఖధామము. ఇప్పుడు ఈ దు:ఖధామములో ఉంటూ శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేస్తే మళ్లీ మీరు స్వర్గములోకి వచ్చేస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. వర్ణాలు తిరుగుతూ ఉంటాయి. మొదట బ్రాహ్మణ వర్ణము శిఖ(పిలక), తర్వాత దేవతా వర్ణము, క్షత్రియ వర్ణము................. పల్టీలాట(పిల్లిమొగ్గలాట) ఆడతారు కదా. మళ్లీ ఇప్పుడు మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనిని తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతాము. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కనుక తప్పకుండా తండ్రి మతమును అనుసరించాల్సి ఉంటుంది. నిరాకారులైన పరమాత్మ వచ్చి ఈ సాకార శరీరములో ప్రవేశించారని మీరు అర్థము చేయిస్తారు. ఆత్మలైన మనము నిరాకారంగా ఉన్నప్పుడు అక్కడ ఉంటాము. ఈ సూర్య-చంద్రులు సృష్టికి వెలుగునిచ్చే దీపాలు. దీనిని అనంతమైన పగలు, రాత్రి అని అంటారు. సత్య, త్రేతా యుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. తండ్రి వచ్చి సద్గతి మార్గాన్ని తెలియజేస్తారు. ఎంత మంచి వివేకము లభిస్తుంది! సత్యయుగములో సుఖముంటుంది, తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. సత్యయుగములో 16 కళలు, త్రేతా యుగములో 14 కళలు............. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఏడ్వడము, జగడాలు, యుద్ధాలు చేయవలసిన మాటే లేదు. అంతా చదువు పైనే ఆధారపడి ఉంది. చదువు ద్వారానే మానవుల నుండి దేవతలుగా అవ్వాలి. భగవాన్‌-భగవతీలుగా తయారు చేసేందుకు భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువు పైసల చదవు. ఈ చదువు వజ్ర సమానమైనది. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. ఇది సహజాతి సహజమైన, అతిసులభమైన రాజయోగము. బ్యారిస్టరు చదువు మొదలైనవి చదవడము అంత సులభము కాదు. ఇక్కడైతే తండ్రిని మరియు చక్రాలను స్మృతి చేయడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. తండ్రిని గురించి తెలియదంటే ఏమీ తెలియనట్లే. తండ్రి స్వయం విశ్వాధిపతిగా అవ్వరు. పిల్లలను అధిపతులుగా చేస్తారు. శివబాబా అంటున్నారు - ఇతడు(బ్రహ్మ) మహారాజుగా అవుతాడు, నేను అవ్వను. నేను నిర్వాణధామములో వెళ్ళి కూర్చుంటాను. పిల్లలను విశ్వాధికారులుగా చేస్తాను. సత్య-సత్యమైన నిష్కామ సేవ ఒక్క నిరాకారుడైన పరమపిత పరమాత్మ మాత్రమే చెయ్యగలడు. మానవులు చేయలేరు. ఈశ్వరుని పొందడం వలన పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. భూమ్యాకాశాలకు అన్నిటికీ అధిపతులుగా అవుతారు. దేవతలు విశ్వాధికారులుగా ఉండేవారు కదా. ఇప్పుడైతే ఎన్ని విభాగాలైపోయాయి! ఇప్పుడు మళ్లీ తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను విశ్వాధికారులుగా తయారుచేస్తాను. స్వర్గములో మీరే ఉండేవారు. భారతదేశము విశ్వానికి యజమానిగా ఉండేది. కాని ఇప్పుడు భికారిగా అయిపోయింది. మళ్లీ ఈ మాతల ద్వారా విశ్వానికి అధిపతులుగా తయారుచేస్తాను. మెజారిటీ మాతలదే. అందుకే వందేమాతరమ్‌ అని అంటారు.

సమయము కొద్దిగా మాత్రమే ఉంది. శరీరము పై నమ్మకము లేదు. అందరూ మరణించాల్సిందే. అందరిదీ వానప్రస్థ అవస్థ, అందరూ వాపస్‌ వెళ్ళాలి. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. జ్ఞానసాగరులు, శాంతి సాగరులు, ఆనంద సాగరులని వారినే అంటారు. వారు మళ్లీ సర్వ గుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా పవిత్రంగా చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు నంబరువార్‌ పురుషార్థానుసారము ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ చదువు వజ్ర సమానంగా చేస్తుంది. అందువలన ఈ చదువు బాగా చదవాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించాలి.

2. శ్రీమతమును అనుసరిస్తూ స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. నడుస్తూ, తిరుగుతూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి.

వరదానము :-

'' శ్రీమతమనుసారము 'జీ హజూర్‌' అంటూ హజూర్‌ను (బాబాను) హాజిర్‌(ఎదురు)గా అనుభవం చేసే సర్వ ప్రాప్తి సంపన్న భవ ''

ఎవరైతే ప్రతి విషయంలో తండ్రి శ్రీమతమనుసారము జీ హజూర్‌, జీ హజూర్‌(సరే బాబా, అలాగే బాబా) అని అంటూ ఉంటారో ఆ పిల్లలతో జీ హజూర్‌ అంటూ తండ్రి తన పిల్లల ముందు హాజరవుతారు. ఎప్పుడైతే హజూర్‌(బాబా) హాజరైపోయారో అప్పుడు ఏ విషయములోనూ లోటు ఉండదు. సదా సంపన్నంగా అవుతారు. దాత మరియు భాగ్యవిధాత ఇరువురి ప్రాప్తుల భాగ్య నక్షత్రము మస్తకము పై మెరుస్తూ ఉంటుంది.

స్లోగన్‌ :-

'' పరమాత్మ వారసత్వాలకు అధికారిగా అయ్యి ఉంటే అధీనత రాజాలదు ''