24-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - దేహ సహితంగా ఇవన్నీ సమాప్తమవ్వనున్నవి. అందువలన మీరు పాత ప్రపంచములోని సమాచారాలను వినే అవసరము లేదు. మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి''

ప్రశ్న :-

శ్రీమతము గురించి ఏ గాయనముంది? శ్రీమతమును అనుసరించేవారి గుర్తులు వినిపించండి?

జవాబు :-

శ్రీమతము కొరకు గాయనముంది - ఏది తినిపిస్తారో, ఏది ధరింపజేస్తారో, ఎక్కడ కూర్చోబెడ్తారో,............. అదే చేస్తాను. శ్రీమతమును అనుసరించే పిల్లలు తండ్రి ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. వారి ద్వారా సదా శ్రేష్ఠ కర్మలే జరుగుతాయి. వారు ఎప్పుడూ శ్రీమతములో తమ మన్మతమును కలపరు. వారిలో తప్పు-ఒప్పుల జ్ఞానముంటుంది.

పాట :-

బన్వారీ రే జీనేకా సహారా తేరా నామ్‌ రే......(ఓ కృష్ణా! నీ నామమే నా జీవితానికి ఆధారము.........)   

ఓంశాంతి.

ఈ పాట ఎవరిది? పిల్లలది. కొన్ని పాటలు - తండ్రి పిల్లలకు అర్థం చేయించేవిగా కూడా ఉంటాయి. కానీ ఈ పాటలో పిల్లలు తండ్రితో - '' బాబా, ఇప్పుడు ఈ ప్రపంచము అసత్య ప్రపంచంగా, అసత్య బంధనంగా అయ్యిందో ప్రపంచములోని వారికి తెలియదు, కాని మేము అర్థము చేసుకున్నామని అంటారు. ఇక్కడ అందరూ దు:ఖితులైన కారణంగా ఈశ్వరుని స్మృతి చేస్తారు. సత్యయుగములో అయితే ఈశ్వరుని కలుసుకునే మాటే లేదు. ఇక్కడ దు:ఖముంది కనుకనే ఆత్మలకు తండ్రి గుర్తుకొస్తారు. కాని డ్రామానుసారము తండ్రి స్వయంగా వచ్చినప్పుడే పిల్లలతో మిలనము చేస్తారు. మిగతా ఏ పురుషార్థాలైతే చేస్తున్నారో అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే ఈశ్వరుని సర్వవ్యాపిగా భావిస్తారు. ఈశ్వరుని పొందే మార్గాన్ని తప్పుగా తెలియజేస్తారు. ఈశ్వరుడు మరియు వారి రచన ఆదిమధ్యాంతాల గురించి మాకు తెలియదని అంటే అది సత్యమే. పూర్వము ఋషులు, మునులు మొదలైనవారు సత్యము చెప్పేవారు. ఆ సమయములో వారు రజోగుణము గలవారిగా ఉండేవారు. ఆ సమయంలో దానిని అసత్య ప్రపంచమని అనరు. కలియుగ అంతిమ సమయాన్ని అసత్య ప్రపంచము, నరకము అని అంటారు. ఇది నరకము, అది స్వర్గము అని సంగమ యుగములో అంటారు. ద్వాపర యుగాన్ని నరకమని అనరు. ఆ సమయములో రజోప్రధాన బుద్ధి ఉంటుంది. ఇప్పుడు తమోప్రధానంగా ఉంది. కావున నరకము మరియు స్వర్గము అని సంగమ యుగములోనే వ్రాస్తారు. ఈ రోజు నరకంగా ఉంది, రేపు స్వర్గంగా అవుతుంది. ఇది కూడా తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. ఇది కలియుగాంత సమయమని ప్రపంచములోని వారికి తెలియదు. అందరూ తమ-తమ లెక్కాచారాలను సమాప్తము చేసుకొని అంతిమంలో సతోప్రధానంగా అవుతారు. మళ్లీ సతో, రజో, తమోలోకి రావలసిందే. ఎవరికైతే ఒకటి లేక రెండు జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా ఆ కొద్ది సమయములోనే సతో, రజో, తమోలోకి వస్తారు. వారి పాత్రయే కొద్దిగా ఉంటుంది. ఇది అర్థము చేసుకునేందుకు గొప్ప బుద్ధి కావాలి. ప్రపంచములో అయితే అనేక మతాల మానవులున్నారు. అందరిదీ ఒకే మతముండదు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలుంటాయి, వారి వారి మతాలు ఉంటాయి. తండ్రి కర్తవ్యము వేరు. ప్రతి ఒక్క ఆత్మ కర్తవ్యము వేరు, ధర్మము కూడా వేరు. కావున ఒక్కొక్కరికి ప్రత్యేకంగా అర్థము చేయించాలి. నామ, రూప, దేశ, కాలాలన్నీ అందరికీ వేరు వేరుగా ఉంటాయి. వీరు ఫలాని ధర్మము వారు అనేది చూస్తూనే తెలుస్తుంది. హిందూ ధర్మమని అందరూ అంటారు. కాని అందులో కూడా అందరూ వేరు వేరుగా ఉంటారు. కొంతమంది ఆర్య సమాజులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది బ్రహ్మ సమాజులు, సన్యాసులు మొదలైన వారందరిని కూడా హిందూ ధర్మము వారిగా భావిస్తారు. మనము బ్ర్రాహ్మణ ధర్మము వారము లేక దేవతా ధర్మము వారము అని చెప్పినా వారు హిందూ ధర్మములోనే వ్రాసేస్తారు. ఎందుకంటే ఇతర విభాగాలు వారి వద్ద లేనే లేవు. కావున ప్రతి ఒక్కరి ఫారమ్‌ వేరు వేరుగా ఉండడం ద్వారా వారు ఏ ధర్మము వారో స్పష్టమౌతుంది. ఇతర ధర్మముల వారైతే వారు ఈ విషయాలను అంగీకరించరు. (అలా అనేక ధర్మాలవారు కలిసి ఒకేసారి వచ్చినట్లైతే) అప్పుడు వారికి అర్థము చేయించడం కష్టమౌతుంది. వారు మిమ్ములను గురించి - వీరు వీరి ధర్మాన్ని గొప్పగా మహిమ చేస్తున్నారని భావిస్తారు. ఇందులో ద్వైతము ఉంది. అర్థము చేయించే పిల్లలు కూడా నెంబరువారుగా ఉన్నారు. అందరూ ఒకే సమానంగా ఉండరు. అందుకే మహారథులను పిలుస్తూ ఉంటారు.

బాబా అర్థము చేయించారు - ''నన్ను స్మృతి చేయండి, నా శ్రీమతమును అనుసరించండి'' ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. ఒకవేళ ప్రేరణతో కర్తవ్యము చేయగలిగితే తండ్రి వచ్చే అవసరమే లేదు. శివబాబా అయితే ఇక్కడ ఉన్నారు. మరి వారికి ప్రేరణ ఇచ్చే అవసరమేముంది? ఇక్కడ బాబా మతము పై నడవవలసి వస్తుంది. ప్రేరణ మాటే లేదు. కొంతమంది సందేశీలు సందేశము తీసుకొస్తారు. అందులో కూడా చాలా మిక్స్‌ అయిపోతుంది. సందేశీలందరూ ఒకే విధంగా ఉండరు. మాయ యొక్క ప్రవేశము చాలా ఉంటుంది. ఇంకా ఇతర సందేశీలను పంపి వెరిఫై(పరిశీలించుట) చేయించవలసి ఉంటుంది. కొందరైతే మాలోకి బాబా వచ్చారు, మమ్మా వచ్చారు అని చెప్పి వేరే సేవాకేంద్రాన్ని తెరిచి కూర్చుంటారు. ఇలా మాయ ప్రవేశము కూడా జరుగుతుంది. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. సర్వీసు యోగ్య పిల్లలే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. ఎవరైతే శ్రీమతమును అనుసరించరో వారు ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. మీరు ఏది తినిపిస్తే, ఏమి ధరింపచేస్తే, ఎక్కడ కూర్చోపెడితే అదే చేస్తాము,........ అని శ్రీమతానికి గాయనమున్నది. ఇలా కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు మరి కొందరు ఇతర మతాల ప్రభావములోకి వచ్చేస్తారు. ఏ వస్తువైనా దొరకలేదంటే, ఏదైనా విషయము నచ్చకపోతే వెంటనే అలిగిపోతారు. అందరూ ఒకేలాగ సుపుత్రులుండేందుకు సాధ్యమౌతుందా? ప్రపంచములో అయితే అనేక మతాలవారున్నారు, అజామిళుని వంటి పాపాత్మలు, గణిక(వేశ్య)ల వంటివారు చాలామంది ఉన్నారు.

ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం తప్పు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. పంచ వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. అందుకే ఇది ఆసురీ ప్రపంచమని తండ్రి అంటారు. సత్యయుగములో పంచ వికారాలు ఉండవు. శాస్త్ర్రాలలో ఇలా వ్రాసి ఉందని అంటారు కాని శాస్త్రాలను తయారు చేసింది మనుష్యులే కదా. కావున శ్రేష్ఠులు మనుష్యులా లేక శాస్త్ర్రాలా? తప్పకుండా వినిపించేవారే శ్రేష్ఠమైనవారు కదా! వ్రాసినవారు మనుష్యులే, వ్యాసుడు వ్రాశాడు. అతడు కూడా మనిషే కదా. ఈ విషయాలు నిరాకార తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ధర్మస్థాపకులు వచ్చి వినిపించిన వాటిని తర్వాత శాస్త్ర్రాలుగా తయారుచేస్తారు. ఉదాహరణానికి గురునానక్‌ వినిపించిన తర్వాత అది గ్రంథ్‌(సిక్కుల మత గ్రంథము, గురు గ్రంథము)గా తయారయ్యింది. కావున ఎవరు వినిపిస్తారో వారికే పేరు వస్తుంది. గురునానక్‌ కూడా వారిని మహిమ చేశారు - సర్వుల తండ్రి ఆ ఒక్కరే. తండ్రి గురునానక్‌ ఆత్మకు(పరంధామములో) వెళ్ళి ధర్మస్థాపన చేయమని చెప్తారు. అయితే నన్ను అలా పంపించే వారెవ్వరూ లేరని ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు. శివబాబా స్వయంగా కూర్చొని అర్థము చేయిస్తున్నారు - వారు(ధర్మ స్థాపకులు) సందేశాన్ని తీసుకొని వచ్చేవారు, అలా నన్ను పంపే వారెవ్వరూ లేరు. నన్ను సందేశీ అని, పైగంబర్‌ అని అనరు. నేను పిల్లలకు సుఖ-శాంతులు ఇచ్చేందుకు వస్తాను. నాకెవ్వరూ చెప్పలేదు, నేను స్వయంగా యజమానిని. మాలికుని నమ్మేవారు కూడా ఉంటారు, కాని వారిని ప్రశ్నించాలి - మీరు మాలికుడనే పదానికి అర్థము తెలుసుకున్నారా? వారు మాలికులు. మనము వారి పిల్లలము అయితే తప్పకుండా వారసత్వము లభించాలి. పిల్లలు 'మా బాబా' అని అంటారు. మరి తండ్రి ధనానికి మీరు యజమానులు. 'నా బాబా' అని పిల్లలే అంటారు. బాబా నా వారైతే బాబా ధనము కూడా నాదే. ఇప్పుడు మనం ఏమంటాము? - మా శివబాబా అని అంటాము. తండ్రి కూడా వీరు నా పిల్లలని అంటారు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వము లభిస్తుంది. తండ్రి వద్ద ఆస్తి ఉంటుంది. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. భారతవాసులకు కూడా వారసత్వము ఎవరి నుండి లభిస్తుంది? శివబాబా ద్వారా. శివజయంతిని కూడా ఆచరిస్తారు. శివజయంతి తర్వాత మళ్లీ కృష్ణ జయంతి, తర్వాత రామ జయంతి జరుగుతుంది. మమ్మా, బాబాల జయంతి లేక జగదంబల జయంతిని ఎవ్వరూ మహిమ చేయరు. శివబాబా జయంతి తర్వాత రాధా-కృష్ణుల జయంతి తర్వాత సీతా-రాముల జయంతి.

ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు శూద్ర రాజ్యము వినాశనమవుతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. తండ్రి తప్పకుండా వస్తారు. తండ్రిని ఎందుకు పిలుస్తారు? శ్రీ కృష్ణపురిని స్థాపించేందుకు శివజయంతి తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. శివబాబా జ్ఞానమునిస్తున్నారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మ స్థాపన జరుగుతోంది. శివజయంతి అన్నిటికంటే గొప్ప జయంతి. తర్వాత బ్రహ్మ-విష్ణు-శంకరులది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నాడు. తర్వాత రచనలో ముఖ్యులు లక్ష్మీ-నారాయణులు. కావున శివుడు మాత-పిత తర్వాత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతులు కూడా మాత-పితలు. ఇవి అర్థము చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. పరమపిత పరమాత్మ తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారని మొదట అర్థము చేయించాలి. వారు నామ-రూపాలకు అతీతులైతే వారి జయంతి ఎలా సాధ్యము? (గాడ్‌)భగవంతుని తండ్రి అని అంటారు. తండ్రినైతే అందరూ ఒప్పుకుంటారు. ఆత్మ, పరమాత్మ ఇరువురూ నిరాకారులే. ఆత్మలకు సాకార శరీరము లభిస్తుంది. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. శాస్త్ర్రాలు మొదలైనవేవీ చదవని వారికి ఇది ఇంకా సహజము. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ, స్వర్గ స్థాపన చేస్తారు. స్వర్గములో రాజ్యముంటుంది. అంటే వారు(శివబాబా) తప్పకుండా సంగమ యుగములో రావలసి ఉంటుంది కదా. వారు సత్యయుగంలోకి అయితే రాజాలరు. ఆ ప్రాలబ్ధము, 21 జన్మల వారసత్వము సంగమ యుగములోనే లభిస్తుంది. ఇది బ్రాహ్మణుల సంగమ యుగము. బ్రాహ్మణులు శిఖ స్థానములో ఉన్నారు. ఆ తర్వాత దేవతల యుగము. ప్రతి యుగము 1250 సంవత్సరములుంటుంది. ఇప్పుడు మూడు ధర్మాలు స్థాపనౌతాయి, బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ఎందుకంటే తర్వాత అర్ధకల్పము వరకు ఇతర ఏ ధర్మాలుండవు. సూర్యవంశీ, చంద్రవంశీ పూజ్యు.లుగా ఉండేవారు తర్వాత మళ్లీ పూజారులుగా అవుతారు. ఆ బ్రాహ్మణులు రకరకాలుగా ఉంటారు.

ఇప్పుడు మీరు మంచి కర్మలు చేస్తున్నారు. తర్వాత సత్యయుగములో వాటి ప్రాలబ్ధాన్ని పొందుతారు. తండ్రి మంచి కర్మలు నేర్పిస్తారు. శ్రీమతానుసారము మనము ఎలాంటి కర్మలు చేస్తామో, ఇతరులను మన సమానంగా తయారు చేస్తామో అంత దాని ప్రాలబ్ధము లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా స్థాపనవుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు రాజధాని ఉంటుంది. ఇది ప్రజల పై, ప్రజా రాజ్యము(ప్రజాస్వామ్యము), పంచాయితి రాజ్యము. అనేక పంచాయితీలు ఉన్నాయి. లేకపోతే 5 పంచాయితీలు మాత్రమే ఉండాలి(హిందీలో పాంచ్‌ అనగా తెలుగులో అర్థము '' 5 ''). ఇక్కడైతే అందరూ పంచాయితీ రాజులే. అది కూడా ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. ఈ రోజు మంత్రిగా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. ఒప్పందము చేసుకొని తర్వాత రద్దు చేసేస్తారు. ఇది అల్పకాల క్షణభంగుర రాజ్యము. ఎవరినైనా దించడంలో వెనుకాడరు. ఇది ఎంత పెద్ద ప్రపంచము, వార్తాపత్రికల ద్వారా కూడా ఏదో కొంత తెలుస్తూ ఉంటుంది. ఇన్ని వార్తాపత్రికలను ఎవ్వరూ చదవలేరు. మనకైతే ఈ ప్రపంచ వార్తలు అవసరమే లేదు. దేహ సహితంగా ఈ ప్రపంచములో ఉన్నదంతా సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేసినట్లైతే మీరు నా వద్దకు వచ్చేస్తారు. మరణించిన తర్వాత అంతా సాక్షాత్కారమౌతుంది. శరీరాన్ని వదిలి ఆత్మ తిరుగుతూ కూడా ఉంటుంది. ఆ సమయములో కూడా లెక్కాచారము అనుభవిస్తుంది. అంతా సాక్షాత్కారమౌతుంది. లోలోపలే సాక్షాత్కారమౌతుంది, అనుభవిస్తారు, చాలా పశ్చాత్తాపపడతారు - మళ్లీ మేము ఎందుకు ఇలా తప్పులు చేశాము? అని పశ్చాత్తాపము కలుగుతుంది కదా. కొంతమంది జైలు పక్షులుగా ఉంటారు. వారు జైలులోనే భోజనము దొరుకుతుంది కదా అని అంటారు. అనగా వారికి ఆహారమే ముఖ్యము. వారు గౌరవ మర్యాదలను గురించి ఆలోచించరు. మీకైతే ఎలాంటి కష్టము లేదు. తండ్రి ఉన్నారు కనుక తండ్రి శ్రీమతమును అనుసరించాలి. ఇతరులకు దు:ఖమిస్తారని కాదు. వారు సుఖదాత, బాబా మీరెలా ఆదేశాలనిస్తే అలాగే చేస్తామని ఆజ్ఞాకారీ పిల్లలు అంటారు. మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము,.......... ఇది శివబాబా గురించే గాయనము చేయబడింది. భాగీరథుడు లేక నందీ గణము కూడా ప్రసిద్ధంగా ఉన్నారు. మాతల శిరస్సు పైన కలశము ఉంచారని వ్రాయబడింది కదా. తర్వాత గోవును కూడా చూపుతారు. ఏవేవో విషయాలు వ్రాసేశారు.

ఈ ప్రపంచములో ఎవ్వరూ సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు. అనేక ప్రకారాల రోగాలున్నాయి. అక్కడ ఎలాంటి రోగాలు ఉండవు. అకాల మృత్యువు కూడా జరగదు. సమయమొచ్చినప్పుడు సాక్షాత్కారమౌతుంది. వృద్ధులకైతే సంతోషము కలుగుతుంది. వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. నేను వెళ్ళి కుమారునిగా అవుతానని సాక్షాత్కారమౌతుంది. మేము శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమార-రాకుమారీలుగా అవుతామని యువత అయిన మీకు సంతోషముంది. పిల్లలు గాని, పెద్దలు గాని అందరూ మరణించవలసిందే కదా. కనుక మేము వెళ్ళి తప్పకుండా రాకుమారులుగా అవుతామని అందరికీ నషా ఉండాలి. సర్వీసు చేస్తేనే కదా అలా అయ్యేది. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము. బాబా మళ్లీ మమ్ములను స్వర్గములోకి పంపేస్తారు అని ఖుషీ ఉండాలి. సర్వీసు చేయాలి. పిల్లలు పాట విన్నారు. మురళి గల కృష్ణుడు కాదు. ఆ కొయ్యతో చేసిన మురళీ అయితే అనేకమంది వద్ద ఉంటుంది. చాలా బాగా మ్రోగిస్తారు. ఇందులో ఆ మురళి విషయమే లేదు. శ్రీమతమును ఒక్క తండ్రే ఇస్తారని మీరంటారు. శ్రీ కృష్ణునిలో అయితే ఈ జ్ఞానమే లేదు. ఈ సహజ రాజయోగము మరియు జ్ఞానము అతనిలో లేనే లేదు. అతడు రాజయోగాన్ని నేర్పించలేదు. అతడు రాజయోగాన్ని తండ్రి ద్వారా నేర్చుకున్నారు. ఎంత గొప్ప విషయము. ఎంతవరకు పిల్లలుగా అవ్వరో, అంతవరకు ఎవ్వరూ అర్థము కూడా చేసుకోలేరు. ఇందులో శ్రీమతమును కూడా అనుసరించవలసి ఉంటుంది. తమ మతమును అనుసరిస్తే ఉన్నత పదవి పొందలేరు. తండ్రిని ఎవరైతే తెలుసుకున్నారో వారు ఇతరులకు కూడా తండ్రి పరిచయమును ఇస్తారు. తండ్రి మరియు రచనల పరిచయమును ఇవ్వాలి. తండ్రిని పరిచయాన్ని ఇతరులకు ఇవ్వలేదంటే స్వయం తెలుసుకోనట్లే. స్వయానికి నషా ఎక్కి ఉంటే ఇతరులకు కూడా ఆ నషా ఎక్కించాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శ్రీమతముననుసరించి సదా శ్రేష ్ఠకర్మలు చేయాలి. ఇతరుల మత ప్రభావములోకి రాకూడదు. సుపుత్రులై ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి. అర్థము కాని విషయాన్ని తప్పకుండా వెరిఫై(పరిశీలన) చేయించుకోవాలి.

2. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లి మేము యువరాజ-యువరాణులుగా అవుతామని సదా నషా లేక ఖుషీలో ఉండాలి. ఈ నషాలో ఉండి ఈశ్వరీయ సేవ చేయాలి.

వరదానము :-

''సదా తమ శ్రేష్ట శాన్‌(స్వమానం)లో ఉంటూ పరేశాన్‌లను(దు:ఖాలను) నిర్మూలించే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ''

సదా ఈ వరదానం స్మృతిలో ఉండాలి - మేము మా శ్రేష్ఠ శాన్‌లో ఉండి, ఇతరుల పరేశాన్‌లను నిర్మూలించే మాస్టర్‌ సర్వశక్తివంతులము, బలహీనులము కాదు. శ్రేష్ఠ శాన్‌ యొక్క సింహాసనాధికారులము. ఎవరైతే అకాలతక్త్‌ నశీన్‌, తండ్రి హృదయ సింహాసనాధికారులమనే శ్రేష్ఠ శాన్‌లో ఉంటారో, వారు స్వప్నములో కూడా ఎప్పుడూ పరేశాన్‌గా అవ్వలేరు. ఎవరు ఎంత పరేశాన్‌గా చేసినా, వారు తమ శ్రేష్ఠ శాన్‌లోనే ఉంటారు.

స్లోగన్‌ :-

''సదా తమ శ్రేష్ఠమైన స్వమానంలో ఉంటే, సర్వుల మాన్‌ ( గౌరవం ) లభిస్తూ ఉంటుంది''