13-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీ మనస్సులో సంతోషపు ఢంకా మ్రోగుతూ ఉండాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు ''

ప్రశ్న :-

మాయ మనుష్యులను ఎటువంటి భ్రమలో భ్రమింప చేసినందున వారు స్వర్గములోకి వెళ్లే పురుషార్థము చేయలేరు?

జవాబు :-

చివరి సమయములో మాయ చూపించే ఆడంబరము అనగా 100 సంవత్సరాలలో విమానము, విద్యుత్తు) మొదలైనవి.......... ఇంకా ఏవైతే వెలువడ్డాయో, వాటిని చూస్తూ మనుష్యులు స్వర్గము ఇక్కడే ఉందని భావిస్తారు. ధనము ఉంది, బంగళాలున్నాయి, వాహనాలు ఉన్నాయి చాలు మాకు ఇదే స్వర్గమని అనేస్తారు. ఇవన్నీ భ్రమింపచేసే, మాయ కలుగజేయు అల్పకాలిక సుఖాలు. ఇవి భ్రమింపజేస్తాయి. ఈ కారణంగానే వారు స్వర్గములోకి వచ్చే పురుషార్థము చేయలేరు.

పాట :-

మాతా ఓ మాతా! మీరు అందరి భాగ్యవిధాత,..... (మాతా ఓ మాతా! తు సబ్‌ కీ భాగ్యవిధాతా,..... )   

ఓంశాంతి.

ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లిపోతారో వారి మహిమ గాయనము చేయబడుతుందని పిల్లలకిప్పుడు అర్థము చేయించబడింది. ఇది భారతవాసులకు తెలియదు. విద్వాంసులు, పండితులకు కూడా తెలియదు. జగదంబ అనగా జగత్తులోని మనుష్యులను రచించేవారు. ఎవరినైతే జగదంబ అని అంటారో వారిప్పుడు పిల్లల సన్ముఖములో కూర్చొని ఉన్నారని మీకు తెలుసు. భక్తిమార్గములో అయితే ఊరకే మహిమ చేస్తూ వచ్చారు. కాని పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది అనగా జగదంబ పరిచయము లభించింది. జగదంబ పేరుతో కూడా రకరకాల చిత్రాలు అనేకము తయారుచేశారు. వాస్తవంగా ఉండేది ఒకే ఒక్క జగదంబ. ఆమెకే కాళి అని, సరస్వతి అని, దుర్గ అని అనేకమైన పేర్లు పెట్టడం వలన మనుష్యులు తికమక పడ్డారు. కలకత్తాలో కలకత్తా కాళీ అని కూడా అంటారు. కాని అటువంటి చిత్రముండదు. ఇవన్నీ భక్తిమార్గపు సామగ్రి అని తండ్రి చెప్తున్నారు. భక్తిమార్గము ఎప్పటి నుండి మొదలవుతుందో అప్పటి నుండి రావణ రాజ్యము కూడా మొదలవుతుంది. మనుష్యులెవ్వరికీ రాముడెవరో, రావణుడెవరో కూడా తెలియదు. ఇది అనంతమైన కథ. రావణ రాజ్యము పూర్తి అయిన తర్వాత మళ్లీ రామరాజ్యము ప్రారంభమవుతుందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. రాముడు తప్పకుండా సుఖమిచ్చేవాడిగా ఉంటాడు. రావణుడు తప్పకుండా దు:ఖమిచ్చేవాడుగా ఉంటాడు. భారతదేశములో ఇప్పుడు రావణ రాజ్యముంది. కావున దీనిని శోకవాటిక అని అంటారు. తండ్రి అర్థము చేయించారు - ఈ సమయములో మీరందరూ రావణ రాజ్యములో ఉన్నారు. ముఖ్యంగా ఇది భారతదేశానికి చెందిన విషయమే. రావణ రాజ్యములో మీరంతా భ్రష్ఠాచారులుగా అయిపోయారు. రాముడు అనగా అనంతమైన సుఖమిచ్చే తండ్రి. ఈ సమయములో మనుష్యులందరూ ఆసురీ మతములో ఉన్నారు. అంతేకాని 10 తలల రావణుడెవ్వరూ లేరు. ఇది 5 వికారాల మతము. దీనిని రావణ మతమని అంటారు. శివబాబా ఇచ్చే మతము శ్రీమతము. ఇప్పుడుండేది ఆసురీ సంప్రదాయము కదా. ఇవన్నీ అనంతమైన విషయాలు. శ్రీమతము ద్వారా 21 జన్మలు సుఖాన్ని పొందుతారు. ఆసురీ మతము ద్వారా మీరు 63 జన్మలు దు:ఖాన్ని పొందారు.

ఈ రావణుడు పెద్ద శత్రువులలో అతి పెద్ద శత్రువని, అందుకే అతనిని తగులబెడ్తూ ఉంటారని మీకు తెలుసు. చివరికి రావణుని తగులబెట్టడం ఎప్పటికి మానేస్తారో వారికి తెలియదు. రావణుని తగులబెట్టడం అయితే పరంపరగా వస్తూ ఉందని అంటారు. దిష్టిబొమ్మను తయారు చేసి తగులబెడ్తూ ఉంటారు. నిజంగా ఈ రావణుడు అందరికీ దు:ఖమిచ్చాడు. ముఖ్యంగా భారతదేశానికి. కావున రావణుడు పెద్ద శత్రువు కదా! కాని ఈ అనంతమైన శత్రువు గురించి ఎవ్వరికీ తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖాన్నిస్తారు. ఇటువంటి సహజమైన విషయాలు కూడా ఏ విద్వాంసులకు గాని, పండితులకు గాని తెలియవు. మనము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు. అయినా మీరు తండ్రిని క్షణ-క్షణము మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గములో నన్ను మీరు - ఓ తండ్రీ, నా పై దయ చూపించు అని పిలుస్తూ వచ్చారు. నేను దయ చూపిస్తూనే ఉంటాను. ఏ ఏ భావనలతో దేవతలను పూజిస్తారో, ఆ భావనలకు వారికి తప్పకుండా అల్పకాలిక సుఖము ఇస్తానని తండ్రి చెప్తున్నారు. ఇంకెవ్వరూ ఇలాంటి సుఖమునివ్వలేరు. సుఖదాతను నేనే. భక్తిమార్గములో కూడా ఇచ్చే దాతను నేనే. గాడ్‌ఫాదర్‌ ప్రసాదించారని భగవంతుని గురించే చెప్తారు. మరి అలాంటప్పుడు ఫలానా సాధువు, ఫలానా గురువు ఈ ధనమిచ్చారని ఎందుకు చెప్తారు? సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఓ భగవంతుడా! మా దు:ఖాలను దూరము చేయండి అని పాటలు కూడా పాడ్తారు. మళ్లీ ఫలానా సాధువు మా దు:ఖాన్ని దూరం చేశాడు, కొడుకునిచ్చాడని ఎందుకంటారు? ఆ సాధువు కృప ద్వారా సుఖము లభించిందని భావిస్తారు. వ్యాపారములో లాభం వస్తే, గురువు కృప ద్వారా లభించిందని భావిస్తారు. కాని నష్టము వస్తే గురువు అకృప చూపించారని ఎప్పుడూ అనరు. పాపం భక్తులు అర్థం చేసుకోకుండా నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు. ఏది వింటారో దానిని అనుసరిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాయే.

ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను తనవారిగా చేసుకుంటారు. తండ్రి పై ప్రీతి ఉంచుకోవడంలో కూడా మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. ఒక్కసారిగా ముఖము తిప్పేస్తుంది. 21 జన్మలకు సుఖమునిచ్చే తండ్రి నుండి విడాకులిప్పిస్తుంది. భక్తి మార్గానికి, జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉందని తండ్రి అర్థము చేయిస్తున్నారు. భక్తి చేస్తూ చేస్తూ మీరు నిరుపేదలైనప్పుడు మళ్లీ తండ్రి వచ్చి జ్ఞానమిచ్చి మిమ్ములను 21 జన్మల కొరకు సంపన్నంగా చేస్తారు. ఆ భక్తినైతే మీరు జన్మ- జన్మలుగా చేస్తూ వచ్చారు. అల్పకాల సుఖము లభిస్తుంది. దు:ఖమైతే చాలా ఉంది కదా. తండ్రి చెప్తున్నారు - మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్లీ ఇచ్చేందుకు నేను వచ్చాను. ఇది అనంతమైన విషయము కదా. అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారందరూ నిర్వికారి దేవతలు. వారి భవనాలలో ఎన్ని వజ్రాలు, రత్నాలు, మణులు ఉంటాయి. మీరు ముందు ముందు చాలా చూస్తారు. అంతిమ సమయానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో, అంత స్వర్గ దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద దర్బారులు ఉంటాయి. కిటికీల పైన బంగారు, వజ్రాలు, రత్నాలతో కూడిన చాలా మంచి అలంకరణ ఉంటుంది. ఇక ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభమవుతుంది. ఏ వైకుంఠాన్ని మీరు దివ్యదృష్టితో ఇప్పుడు చూస్తున్నారో, దానిని మీరు ప్రాక్టికల్‌గా తప్పకుండా చూస్తారు. ఏ వినాశనాన్ని మీరు దివ్యదృష్టితో చూస్తున్నారో, దానిని ప్రాక్టికల్‌గా చూస్తారు. మీ లోలోపల సంతోషపు ఢంకాలు మ్రోగుతూ ఉండాలి. ఎందుకంటే మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన ఆస్తిని తీసుకుంటున్నాము. ఈ చిత్రమైతే ఖచ్ఛితమైన చిత్రము కాదు(ఇప్పుడున్న సత్యయుగ చిత్రము). అవన్నీ మీరు దివ్యదృష్టితో చూస్తారు. అక్కడకు వెళ్లి మీరు రాస నృత్యములు (రాస లీలలు) మొదలైనవి చేస్తారు. అనేక స్వర్గ చిత్రాలు మొదలైనవి తయారు చేసేవారు. తండ్రి ఏ దృశ్యములనైతే దివ్యదృష్టి ద్వారా చూపించారో, అవన్నీ ప్రాక్టికల్‌గా తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు ఈ ఛీ-ఛీ(పాడైపోయిన) ప్రపంచము సమాప్తమైపోతుందని మీకు తెలుసు. మీరిక్కడ శ్రీమతము ఆధారంగా మీ స్వరాజ్యమును తీసుకొను పురుషార్థము చేస్తూ ఉన్నారు. ఆ భక్తి మార్గమెక్కడ? ఈ జ్ఞాన మార్గమెక్కడ? ఇక్కడ భక్తి మార్గములోని భారతదేశ స్థితి ఎలా ఉందో చూడండి? - తినేందుకు అన్నము కూడా లేదు. కాని పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. వారి ప్లాను ఎలా ఉందో, మీ ప్లాను ఎలా ఉందో గమనించండి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. రామాయణం మొదలైనవాటిలో ఎన్నో కథలు వ్రాసేశారు. కాని నిజానికి అలాంటివేవీ లేవు. రావణుని ప్రతి సంవత్సరము మళ్లీ మళ్లీ ఎందుకు తగులబెడ్తారు? తగులబెడితే రావణుడు సమాప్తమైపోవాలి కదా! భక్తిమార్గపు సంపాదన ఎలా ఉందో జ్ఞాన మార్గపు సంపాదన ఎలా ఉందో చూడండి! తండ్రి ఒక్కసారిగా భండారాన్ని పూర్తిగా నింపేస్తారు. దాని కొరకే శ్రమ చేయాలి. తప్పకుండా పవిత్రంగా ఉండవలసి వస్తుంది. అమృతాన్ని వదిలి విషమునెందుకు త్రాగాలి అని గానము కూడా చేస్తారు. అమృతము పేరుతో అమృతసర్‌లో ఒక సరస్సును తయారు చేశారు. ఆ సరస్సులో మునకలు వేస్తారు. మానస సరోవరము అను పేరుతో కూడా ఒక సరస్సును తయారుచేశారు. అయితే మానస సరోవరము అర్థం కూడా తెలుసుకోరు. మానస సరోవరము అనగా జ్ఞానసాగరుడైన నిరాకార పరమపిత పరమాత్మ మానవ శరీరములోకి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. మనుష్యులు కూర్చొని అనేక కథలు మొదలైనవి తయారు చేశారు. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత,......... అని మహిమ చేస్తారు. అయితే దానిలో కృష్ణ ఉవాచ అని వ్రాసేశారు. మళ్లీ కృష్ణుని గురించి కూడా ఎన్ని మాటలు వ్రాసేశారు! సర్పము కాటేసిందని, కృష్ణుడు స్త్రీలను ఎత్తుకెళ్లాడు......... అని అసత్య కళంకాలెన్నో ఆపాదించారు. ఇప్పుడు మీరు సత్యాన్ని అర్థము చేయించగలరు. ఇక్కడ కృష్ణుని మాటే లేదు. బ్రహ్మ ద్వారా పరమపిత పరమాత్మ కూర్చొని అన్ని వేద శాస్త్రాల, గ్రంథాల సారము తెలియజేస్తున్నారు. నెంబర్‌వన్‌ అయ్యింది శ్రీమద్భగవద్గీత. భారతవాసుల ధర్మశాస్త్రము ఒకే ఒక్కటి. దానిని ఖండన చేయడం వలన దాని పిల్లలైన వేద శాస్త్రాలన్నీ ఖండితమైపోయాయి.

తండ్రి ఎంత మంచి రీతిగా అర్థము చేయిస్తున్నా, పిల్లలు నడుస్తూ, నడుస్తూ మాయతో చెంపదెబ్బలు తింటూ ఉంటారు, ధారణ చేయరు. ఇది యుద్ధ మైదానము. పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. గీత మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు వ్రాయలేదు. మీరు బ్రహ్మ ముఖ వంశావళివారు, బ్రహ్మ ద్వారా యజ్ఞము రచింపబడింది. రుద్ర జ్ఞాన యజ్ఞము తప్పకుండా ఉంది. అయితే యుద్ధ మైదానము ఎక్కడ నుండి వచ్చింది. రాజశ్వ అశ్వమేధ యజ్ఞమని గాయనము కూడా చేయబడింది. మన రథము(శరీరము) ఏదైతే ఉందో దానిని మనము బలిహారము చేస్తాము. వారు మళ్లీ దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచించి అశ్వమును స్వాహా చేస్తారని ఏమేమిటో వ్రాసేశారు. సత్యయుగంలో భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు అక్కడ తప్పకుండా చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారని మీకు తెలుసు. దేవీదేవతలు కొద్ది మంది మాత్రమే ఉండేవారు. యమునా నదీ తీరాన రాజ్యము తప్పకుండా ఉంటుంది. కేవలం దేవీదేవతలే రాజ్యము చేస్తూ ఉంటారు. కాశ్మీరుకు గాని, సిమ్లాకు గాని వెళ్ళవలసినంత వేడి అచ్చట(సత్యయుగములో) ఉండదు. తత్వాలు కూడా పూర్తి సతోప్రధానంగా అయిపోతాయి. ఈ విషయాలను కూడా అర్థం చేసుకునేవారు మాత్రమే అర్థము చేసుకోగలరు. సత్యయుగాన్ని స్వర్గమని, కలియుగాన్ని నరకమని అంటారు. ద్వాపర యుగాన్ని ఇంత నరకమని అనరు. త్రేతా యుగములో కూడా రెండు కళలు తగ్గుతాయి. అన్నింటికంటే ఎక్కువ సుఖము స్వర్గములోనే ఉంటుంది. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ వారికి స్వర్గమంటే ఏమిటో తెలియదు. స్వర్గస్థులయ్యారంటే అప్పటివరకు నరకములో ఉన్నట్లే కదా! ఇప్పుడు ప్రతి ఒక్కరూ నరకములోనే ఉన్నారు. ఇప్పుడు తండ్రి మీకు అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. అక్కడ అన్నీ, సర్వస్వమూ మీవిగానే ఉంటాయి. మీ భూమి, మీ ఆకాశం.............. అన్నీ మీవే. మీరు స్థిరమైన, అఖండమైన, శాంతిమయమైన రాజ్యము చేస్తారు. అక్కడ దు:ఖమను మాటే ఉండదు. కావున దాని కొరకు మీరు ఎంత పురుషార్థము చేయాలి! పిల్లల స్థితి ఎలా ఉంది? మన మమ్మా, బాబాలు చాలా మంచిరీతిగా పురుషార్థము చేస్తున్నారని కూడా తెలుసు. మనము కూడా అలాంటి పురుషార్థము చేసి వారసత్వం ఎందుకు తీసుకోరాదు? అని కూడా భావిస్తారు.

తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! అలసిపోకండి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీమతమును ఎప్పుడూ మర్చిపోకండి. దీనిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చేసేందుకు ముందు ''బాబా! మేము ఇందులో తికమకపడుతున్నాము. ఈ పని చేయడం వలన మాకు పాపము అంటదు కదా!'' అని అడగండి. బాబా ఎప్పుడూ ఎవరి నుండీి ఏమీ తీసుకోరు. భక్తిమార్గములో కూడా ఈశ్వరార్థము దానము చేస్తారు. అందుకు ప్రతిఫలము తీసుకుంటారు కూడా. శివబాబా తీసుకొని ఏమి చేసుకుంటారు? వారికి భవనాలు తయారు చేసుకునే పని లేదు. అంతా పిల్లల కోసమే చేస్తారు. నివాస స్థానాలు(ఇళ్లు) నిర్మించినా, అవి కూడా చివరిలో మీరు వచ్చి ఉండేందుకే నిర్మిస్తారు. మీ స్మృతి చిహ్నమైన మందిరము కూడా ఇక్కడే ఉంది. మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారు పోను, పోను చాలా అద్భుతాలు, అనందాన్ని చూస్తారు. ఇక్కడ కూర్చుని ఉండే స్వర్గమును చుట్టి వస్తారు. తర్వాత మళ్లీ అక్కడకు వెళ్లి భవనాలు నిర్మిస్తారు. ఇళ్ల తయారీలో కూడా పోటీ ఉంటుంది కదా! ఇప్పుడు 100 సంవత్సరాలలో ఎన్ని తయారుచేశారో చూడండి. భారతదేశాన్ని స్వర్గము వలె తయారు చేశారు. మరి అక్కడ స్వర్గంలో 100 సంవత్సరాలలో ఏమి తయారు కావో చెప్పండి. సైన్సు అక్కడ మీకు పూర్తిగా ఉపయోగపడ్తుంది. సైన్సు సుఖము కూడా అక్కడ మీకు ఉంటుంది. ఇక్కడైతే దు:ఖము కూడా ఉంది. సైన్సు విషయములో ఎంత శ్రమిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు - వీరు కేవలం తమను తాము మహిమ చేసుకుంటూ గొప్పలు పోతున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ అల్పకాలికమైన క్షణభంగుర సుఖముంది. ఇదంతా చివరి సమయములో మాయ చూపించే ఆడంబరము. ఈ విమానాలు, రాకెట్లు మొదలైనవాటిలో ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకుముందు ఈ సాధనాలు మొదలైనవి ఏవీ లేవు. విద్యుత్తు మొదలైనవి కూడా లేవు. ఇవన్నీ మనుష్యులను భ్రమింపచేసే మాయ ఇచ్చే సుఖాలు. ఇదే స్వర్గమని మనుష్యులు భావిస్తారు. విమానాలు మొదలైనవి స్వర్గములో ఉండేవి ఇప్పుడు ఉన్నాయి కదా. కావున ఇది స్వర్గమే అని భావిస్తారు. కాని ఇప్పుడు స్వర్గము కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారికి తెలియదు. ధనముంది, భవనాలున్నాయి కావున మాకు ఇదే స్వర్గమని అనుకుంటారు. మంచిది. మీ భాగ్యములో ఈ స్వర్గమే ఉంది. మేమైతే కష్టపడి సత్య-సత్యమైన స్వర్గములోకి వెళ్లాలని మీరంటారు. అందుకే మీరు పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థములో నిర్లక్ష్యముగా ఉండరాదు, ఢీలా పడరాదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పురుషార్థము చేయాలి, సేవ చేయాలి. స్వయం పవిత్రులుగా అయ్యి మీ బంధు-మిత్రులు మొదలైన వారిని కూడా అందుకు అర్హులుగా తయారు చేయండి. మధురమైన మాటలు వినిపించండి. ఇద్దరు తండ్రుల పాయింటును తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. ఆస్తి, వారసత్వము తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. అచ్ఛా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. పురుషార్థములో ఎప్పుడూ అలసిపోరాదు. చాలా అప్రమత్తంగా శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి, తికమకపడరాదు.

2. ఎలాంటి పాప కర్మలను చేయరాదు. సత్యమైన స్వర్గములోకి వెళ్లేందుకు పవిత్రంగా అవ్వాలి. అంతేకాక ఇతరులను పవిత్రంగా తయారు చేసే సేవ చేయాలి.

వరదానము :-

'' అనాసక్తులుగా అయ్యి లౌకికాన్ని తృప్తిపరుస్తూ కూడా ఈశ్వరీయ సంపాదనను జమ చేసుకునే రాజయుక్త భవ (నిగూఢ భావాలను అర్థం చేసుకునేవారిగా అవ్వండి) ''

చాలామంది పిల్లలు లౌకిక కార్యము, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంబంధ-సంపర్కాలను నిభాయిస్తూ తమ విశాల బుద్ధి ద్వారా అందరినీ తృప్తి పరుస్తారు కూడా అంతేకాక ఈశ్వరీయ సంపాదన చేసుకునే రహస్యము తెలిసినందున విశేష భాగాన్ని కూడా వేరుగా తీస్తారు. ఎటువంటి ఏక్‌నామీ, ఎకానమీ(పొదుపు) చేసేవారు అనాసక్త పిల్లలు. వీరు సర్వ ఖజానాలను, సమయాన్ని, శక్తిని మరియు స్థూల ధనాన్ని లౌకికంలో పొదుపు చేసి విశాల హృదయముతో అలౌకిక కార్యములో ఉపయోగిస్తారు. ఇటువంటి యుక్తియుక్త, రాజయుక్త పిల్లలే మహిమా యోగ్యులు.

స్లోగన్‌ :-

'' స్మృతి స్వరూపులుగా అయ్యి ప్రతి కార్యాన్ని చేసేవారే లైట్‌హౌస్‌లుగా అవుతారు ''