08-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మేము స్వయం భగవంతుడు చెప్పిందే వింటున్నామని, స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారనే సంపూర్ణ నిశ్చయముంటే సదా సంతోషంగా ఉండగలరు ''
ప్రశ్న :-
డ్రామానుసారము ఇప్పుడు అందరూ ఏ ప్లాన్(ఉపాయము)ను తయారు చేస్తున్నారు? ఏ ఏర్పాట్లు చేస్తున్నారు?
జవాబు :-
ఇన్ని సంవత్సరాలలో ఇంత ధాన్యాన్ని పండిస్తాము, కొత్త ఢిల్లీ, కొత్త భారతదేశముగా అవుతుంది అంటూ అనేక ప్లాన్లు తయారు చేస్తారు. కాని మృత్యువు కొరకే అన్ని ఏర్పాట్లూ చేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచం కంఠములో మృత్యుహారము(యమపాశము) పడే ఉంది. అందుకే 'నరుడు ఒకటి కోరితే, జరిగేది మరొకటి' అనే సామెత కూడా ఉంది. తండ్రి ప్లాను తండ్రిది, మానవుల ప్లాను మానవులది.
పాట :-
ఎవరో నన్ను తనవారిగా చేసుకొని,............ ( కిసీనే అప్నా బనాకే ముఝ్కో,.................) 
ఓంశాంతి.
బ్రహ్మ తనువు ద్వారా నిరాకార భగవానువాచ. ఇక్కడ చదివించేది మానవులు కాదని, నిరాకార భగవానుడు చదివిస్తున్నారని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. వారిని ఎల్లప్పుడూ 'పరమపిత పరమాత్మ శివపరమాత్మ' అని అంటారు. బెనారస్లో శివుని మందిరం కూడా ఉంది కదా! అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారని మొట్టమొదట ఆత్మకు నిశ్చయముండాలి. ఈ నిశ్చయము లేనంత వరకు మానవులు దేనికీ పనికి రారు. గవ్వ సమానంగా ఉంటారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారా వజ్ర సమానంగా అవుతారు. గవ్వ సమానంగా కూడా భారతవాసులే అవుతారు. వజ్ర తుల్యంగా కూడా భారతదేశములోని మనుష్యులే అవుతారు. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మొదట ఎంతవరకు భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారని నిశ్చయము ఉండదో, అంతవరకు వారు ఈ కాలేజీలో కకూర్చున్నా వారికి ఏమీ అర్థము కాదు. వారి సంతోషపు పాదరస మీటరు పెరగదు. వారు మన అత్యంత ప్రియమైన తండ్రి. భక్తిమార్గములో వారిని దు:ఖ సమయములో ''ఓ పరమాత్మా! దయ చూపండి'' అని పిలిచేవారు. ఈ మాటలన్నీ ఆత్మయే చెప్తుంది. మానవులకు తమ లౌకిక తండ్రులున్నా వారు ఏ తండ్రిని స్మృతి చేస్తున్నారో వారికి తెలియదు. ఆత్మ నోటి ద్వారా - ''ఇతడు నా లౌకిక తండ్రి, వీరు మా పారలౌకిక తండ్రి'' అని చెప్తుంది. మీరిప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. మిగిలిన మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. వారికి ఆత్మ-పరమాత్మలను గురించి తెలియనే తెలియదు. 'ఆత్మలమైన మనము ఆ పరమపిత పరమాత్మ పిల్లలము' అన్న జ్ఞానము ఎవరిలోనూ లేదు. తండ్రి మొట్టమొదట 'ఇది భగవానువాచ' అని నేను మీకు రాజయోగమును నేర్పిస్తున్నానని నిశ్చయము చేయిస్తారు. మీరు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోయి స్వయాన్ని 'ఆత్మగా' నిశ్చయము చేసుకొని తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఏ మనిషి లేక కృష్ణుడు మొదలైనవారెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. ఇది అసత్య మాయ, అసత్య కాయము(శరీరము), అసత్య ప్రపంచము,........ ఇందులో ఒక్కరు కూడా సత్యమైనవారు లేరు. సత్య ఖండములో అసత్యమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఈ లక్ష్మీనారాయణులు సత్య ఖండానికి యజమానులుగా, పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు భారతవాసులు ధర్మభ్రష్ఠులు, కర్మభ్రష్ఠులుగా అయిపోయారు. అందుకే దీని పేరే 'భ్రష్ఠాచార భారతదేశము.' శ్రేష్ఠాచార భారతదేశము సత్యయుగములో ఉంటుంది. అక్కడ అందరూ సదా చిరునవ్వుతో ఉంటారు. వారికి జబ్బులు, రోగాలు ఎప్పుడూ రావు. ఇచ్చట భలే ఫలానావారు స్వర్గస్థులైనారని అంటారు. అయితే స్వర్గము ఎక్కడ ఉందో వారెవ్వరికీ తెలియదు. ఈ సమయంలో రాజ్యము కూడా మృగతృష్ణకు(ఎండమావులకు) సమానంగా ఉంది. ఒక జింక కథ ఉంది కదా! 'నీరు' అని భ్రమించి లోపలకు వెళ్లి ఊబిలో చిక్కుకుపోతుంది. కావున ఇప్పుడు ఉండేది ' ముంచి వేసే ఊబి' వంటి రాజ్యము. ఎంతగా అలంకరిస్తారో అంత ఇంకా క్రింద పడిపోతూ ఉంటారు. భారతదేశములో చాలా ధాన్యము పండుతుంది. ''ఇలా అవుతుంది...........'' అని అంటూ ఉంటారు. నిజానికి ఏదీ జరగదు. దీనినే ''నరుడు ఒకటి కోరుకుంటే, విధి ఇంకొకటి కోరుతుంది...........'' అని అంటారు. ఇది రాజ్యమే కాదని తండ్రి అంటున్నారు. ఎవరైనా రాజా-రాణి ఉంటేనే దానిని రాజ్యమని అంటారు. ఇది ప్రజల పై ప్రజా రాజ్యము. ఇది అధర్మయుక్తమైన, అసత్యమైన రాజ్యము. భారతదేశములో ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. ఇప్పుడు ఎంతో ధర్మ భ్రష్ఠంగా, కర్మ భ్రష్ఠంగా అయిపోయింది. తమ స్వంత ధర్మమే తెలియని దేశము మరొకటి ఏదీ లేదు. '' ధర్మమే శక్తి '' అని కూడా అంటారు. మొత్తం విశ్వమంతటి పై దేవతల రాజ్యముండేది. ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా ఉంది. విదేశాల నుండి ఎంత సహాయము తీసుకుంటున్నారు! వారికి బాహుబలపు సహాయము, మీకు యోగబలపు సహాయము ఉంది. అత్యంత ప్రియమైన తండ్రి నుండి 21 జన్మలకు సదా సుఖ వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఎప్పుడూ దు:ఖము, ఏడ్పులు మొదలైనవాటి మాటే ఉండదు. ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. ఈ రోజుల్లో వలె 4-5 పిల్లలకు జన్మనివ్వరు. ఒకవైపు తినేందుకే లేదు, ''కుటుంబ నియంత్రణ చేయండి'' అని అంటారు. నరుడు ఒకటి కోరితే,........... కొత్త ఢిల్లీ, క్రొత్త రాజ్యము ఉంటుందని అంటారు. అయితే అలాంటిదేమీ లేదు. అందరి కంఠానికి యమపాశము పడి ఉంది. మృత్యువుకు కొరకు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా 5 వేల సంవత్సరాల క్రితము వలె ఇది అదే మహాభారత యుద్ధము. తండ్రి చెప్తున్నారు - '' ఇది రాజ్యమే కాదు, ఇది మృగతృష్ణ సమానమైనది '' ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది కదా! మీరందరూ ద్రౌపదులే. ఈ వికారాల పై విజయము పొందమని తండ్రి మనలను ఆదేశిస్తున్నారు. సదా పవిత్రంగా ఉండి భారతదేశాన్ని పవిత్రంగా చేస్తామని మనము ప్రతిజ్ఞ చేస్తాము. ఈ పురుషులు పవిత్రంగా ఉండనివ్వరు. చాలామంది గుప్త గోపికలు - ప్రపంచములోనివారు మమ్ములను ఎంతగానో హింసించి, కొట్తున్నారని ఎంతగానో పిలుస్తూ ఉంటారు.
ఈ కామము మహాశత్రువని, అది మానవులకు ఆదిమధ్యాంతాలు దు:ఖమిచ్చేదని మీకు తెలుసు. దీని పై మీరు విజయము పొందాలని తండ్రి చెప్తున్నారు. గీతలో కూడా భగవానువాచ - 'కామము మహాశత్రువు' అని ఉంది. కాని మనుష్యులు అర్థము చేసుకోరు. తండ్రి చెప్తున్నారు - మీరు పవిత్రంగా అయితే రాజాధి రాజులుగా అవుతారు. ఇప్పుడు చెప్పండి - ''రాజాధి రాజులుగా అవ్వాలా? లేక పతితులుగా అవ్వాలా?'' తండ్రి చెప్తున్నారు - ఈ ఒక్క అంతిమ జన్మలో నా పై గౌరవముంచి నా కొరకు పవిత్రంగా అవ్వండి. అపవిత్ర ప్రపంచ వినాశనము, పవిత్ర ప్రపంచ స్థాపన జరిగిపోతుంది. అర్ధకల్పము మీరు విషము త్రాగుతూ - త్రాగుతూ ఇంత దు:ఖాన్ని చూశారు, అనుభవించారు. ఈ ఒక్క జన్మకు ఈ విషాన్ని వదలలేరా? ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇందులో ఎవరైతే పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది రాజయోగము. మేము బ్రహ్మకుమార-కుమారీలమని మీరు చెప్తారు. కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ సంతానము కూడా అయ్యారు. బ్రహ్మ శివుని పుత్రుడు. మీకు వారసత్వము ఇచ్చేది 'శివుడు'. ఇది నిరాకార గాడ్ఫాదర్లీ విశ్వవిద్యాలయము (యూనివర్సిటీ). వారు స్వర్గమును స్థాపించేవారు, వారసత్వమును ఇచ్చేవారు 'శివుడు'. వారే గాడ్ఫాదర్, ఆనంద సాగరులు, జ్ఞాన సాగరులు. అటువంటి తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. అయితే దేహాభిమానము తొలగినప్పుడు ఇది బుద్ధిలో కూర్చుంటుంది. భాగ్యములో లేకుంటే ధారణ జరగదు. తప్పకుండా మీరు ఆ జగత్పిత పిల్లలు, బ్రహ్మకుమార-కుమారీలు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీ స్మృతిచిహ్నమే ఇక్కడ నిలబడి ఉంది. ఇది ఎంత మంచి సుందరమైన మందిరము! దీని అర్థము పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. పూజిస్తారు, తల వంచి నమస్కరిస్తారు, ఉన్న ధనమంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు పూర్తి గవ్వ సమానంగా అయిపోయారు. తినేందుకు 'అన్నము' కూడా లేదు కావున 'సంతానాన్ని అదుపు చేసి తక్కువమందిని కనండి' అని అంటున్నారు. 'కామము మహాశత్రువు' అని చెప్పే శక్తి ఏ మానవులకు లేదు. ఎంత తక్కువమంది పిల్లలను కనమని చెప్తారో అంత ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు, కంటూ ఉంటారు. ఎవ్వరి శక్తీ పని చేయదు.
ఇది భగవంతుడైన తండ్రిగారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని, భగవంతుడు ఒక్కరేనని పిల్లలైన మీరు మొట్టమొదట అర్థము చేయించాలి. సదా తిరుగుతూ ఉండే చక్రము ఇది ఒక్కటే. ఇవి అర్థము చేసుకోవాల్సిన విషయాలు. బంధు-మిత్రులు మొదలైన వారందరికీ ఈ ఆత్మిక యాత్రా రహస్యాన్ని అర్థము చేయించాలి. భౌతికమైన యాత్రలైతే జన్మ-జన్మాంతరాలుగా చేశారు. ఈ ఆత్మిక యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అందరూ వాపస్ వెళ్లాలి. పతితులైన వారెవ్వరూ ఇక్కడ ఉండరాదు. ఇప్పుడిది వినాశ(కయామత్) సమయము. ఇప్పుడున్న అనేక కోట్ల మనుష్యులందరూ సత్యయుగములో ఉండరు. అక్కడ చాలా కొద్దిమందే ఉంటారు. అందరూ వాపస్ వెళ్లాలి. అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఎంతవరకు ఇది అర్థము చేసుకోరో అంతవరకు మధురమైన ఇల్లు, సుఖధామము గుర్తుకు రాజాలదు. స్మృతి చేయడము చాలా సహజము. ''మధురమైన మన ఇంటికి పదండి'' అని తండ్రి చెప్తున్నారు. నేను తప్ప మిమ్ములను ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. కాలులకు కాలుడను నేనే. ఎంత మంచిరీతిగా అర్థము చేయిస్తున్నాను. అయితే ఆశ్చర్యము! ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నా ధారణ అవ్వదు. కొంతమంది చాలా చురుకుగా, బుద్ధివంతులుగా అవుతారు. కొంతమంది కొంచెము కూడా అర్థము చేసుకోరు. అలాగని 'పాతవారే ఇలా ఉంటే మేమెలా ఉండాలి?' అని అనుకోరాదు. పాఠశాలలో అందరూ నెంబర్వన్గా ఉండరు. ఇక్కడ కూడా నెంబరువారుగా ఉన్నారు. అందరికీ అర్థము చేయించాలి - ఇది అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకునే సమయము. 21 జన్మలకు సదా సుఖ వారసత్వము పొందాలి. ఎంతమంది బి.కెలు పురుషార్థము చేస్తున్నారు! నెంబరువారుగా అయితే ఉండనే ఉంటారు.
'' పతితపావనులు ఆ ఒక్క తండ్రే మిగిలినవారందరూ పతితులే '' అని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - '' సర్వుల సద్గతిదాత ఒక్కరే. '' వారే స్వర్గ స్థాపన చేస్తారు. తర్వాత మళ్లీ భారతదేశము ఒక్కటే ఉంటుంది. మిగిలినదంతా వినాశమైపోతుంది. మానవుల బుద్ధిలో ఇంత చిన్న విషయము కూడా కూర్చోదు. తండ్రి చెప్తున్నారు - '' పిల్లలూ! నాకు సహాయకారులుగా అయితే నేను మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేస్తాను.'' సాహసవంతులు ధైర్యము చేస్తే భగవంతుడు సహాయము చేస్తారు ఈశ్వరీయ సేవాధారులమని పాట కూడా పాడ్తారు. వాస్తవానికి వారు భౌతికంగా స్వతంత్రమును (ముక్తి, సాల్వేషన్) ఇప్పించే సైన్యము. కాని సత్యమైన ఆత్మిక సాల్వేషన్ సైన్యము(రక్షక దళము) మీరే. భారతదేశపు మునిగి ఉన్న నావను తేల్చగలిగే మీరే శక్తి అవతారాలైన భారతమాతలు. అంతేకాక మీరు గుప్తమైన సైన్యము. శివబాబా గుప్తము కనుక వారి సైన్యము కూడా గుప్తమే. శివశక్తి పాండవ సైన్యము. ఇది సత్య-సత్యమైన సత్యనారాయణ కథ. మిగిలినవన్నీ అసత్యమైన కథలు. అందుకే చెడు చూడకు, చెడు వినకు నేను మీకు ఏమి వినిపిస్తున్నానో అదే వినండి అని బాబా చెప్తున్నారు.
ఇది అనంతమైన అత్యంత పెద్ద పాఠశాల. ఈ విశ్వవిద్యాలయములో ఈ భవనాలన్నీ తయారు చేశారు. చివరిలో ఇక్కడకు పిల్లలు వచ్చి ఉంటారు. ఎవరైతే యోగయుక్తముగా ఉంటారో, వారే వచ్చి ఇక్కడ ఉంటారు. ఈ కనులతో వినాశనము చూస్తారు. ఇప్పుడు మీరు దివ్యదృష్టి ద్వారా స్థాపన మరియు వినాశనాలను సాక్షాత్కారములో(దివ్యదృష్టితో) చూస్తున్నారు. ఆ తర్వాత దానిని మీరు స్వర్గములో ఈ కనుల ద్వారా చూస్తారు. ఇది అర్థము చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఎంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తారో, అంత బాగా బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ వికారాలలోకి వెళ్తే ఒక్కసారిగా తాళము మూసుకుపోతుంది. పాఠశాలను వదిలేస్తే జ్ఞానము బుద్ధి నుండి పూర్తిగా తొలగిపోతుంది. పతితంగా అయితే ధారణ జరగదు. చాలా కష్టము. ఇది విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదివించే కాలేజి. ఈ బి.కెలందరూ శివబాబాకు పౌత్రులు(మవనళ్లు-మనవరాండ్ల్రు). వీరందరూ భారతదేశమంతటిని స్వర్గంగా తయారు చేస్తున్నారు. వీరు ఈ ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్న ఆత్మిక సమాజ సేవకులు. ముఖ్యమైనది పవిత్రతయే. శ్రేష్ఠాచారిగా ఉన్న ప్రపంచము ఇప్పుడు భ్రష్ఠాచారిగా ఉంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దైవీవృక్షానికి అంటు కట్టడం జరుగుతోంది. ఇది మెల్ల-మెల్లగా వృద్ధి చెందుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు (04-02-1957)
అజపాజపము అనగా నిరంతర యోగము, అటూట్(ఎడతెగని) యోగము
ఏ సమయంలో ఓంశాంతి అని అంటారో దాని యదార్థమైన అర్థమేమంటే ''నేను ఆత్మను, ఆ జ్యోతి స్వరూప పరమాత్ముని సంతానాన్ని '' మనము కూడా ఆ తండ్రి జ్యోతిర్బిందు పరమాత్మ వంటి ఆకారము గలవారము. అయితే మనము సాలిగ్రామ పిల్లలము కనుక మనము మన జ్యోతిస్వరూప పరమాత్మతో యోగముంచాలి. వారితోనే యోగముంచి లైట్-మైట్ల వారసత్వము తీసుకోవాలి. అప్పుడే గీతలో 'మన్మనాభవ' అనే మహావాక్యమేదైతే ఉందో - అనగా జ్యోతిస్వరూపమైన మీ తండ్రినైన నా సమానంగా పిల్లలైన మీరు కూడా నిరాకార స్వరూపంలో స్థితమైపోండి' అని అర్థము. దీనినే అజపాజపము అని అంటారు. అజపాజపము అనగా ఏదైనా మంత్రాన్ని జపించకుండా ఆ పరమాత్మ స్మృతిలో న్యాచురల్గా ఉండడం. దీనినే పూర్ణ యోగమని అంటారు. యోగమంటే ఒక్క యోగేశ్వరుడైన పరమాత్మ స్మృతిలో ఉండడం. కనుక ఏ ఆత్మలైతే ఆ పరమాత్ముని స్మృతిలో ఉంటారో, వారిని యోగులు లేక యోగినీలు అని అంటారు. ఎప్పుడైతే ఆ యోగము అంటే స్మృతిలో నిరంతరము ఉంటారో అప్పుడే వికర్మల లేక పాపాల భారము తొలగిపోయి ఆత్మలు పవిత్రంగా అవుతాయి. తద్వారా మళ్లీ భవిష్య జన్మలో దేవతలుగా అయ్యే ప్రాలబ్ధము లభిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానము అవసరము. అప్పుడే యోగము పూర్తిగా జోడించగలరు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఇదే సత్యమైన జ్ఞానము. ఈ జ్ఞానము ద్వారానే యోగము కుదురుతుంది. అచ్ఛా. ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సత్య - సత్యమైన ఆత్మిక సాల్వేషన్ (ముక్తి, విడుదల, స్వతంత్రముగా చేయగల) సైన్యంగా తయారై భారతదేశాన్ని వికారాల నుండి సాల్వేజ్(ముక్తులుగా) చెయ్యాలి. తండ్రికి సహాయకారులుగా అయ్యి ఆత్మిక సమాజ సేవ చేయాలి.
2. ఒక్క తండ్రి నుండే సత్యమైన విషయాలు వినాలి. చెడు వినకు, చెడు చూడకు,.......... ఈ కనుల ద్వారా చివరి దృశ్యాలు చూచేందుకు యోగయుక్తంగా అవ్వాలి.
వరదానము :-
'' సరళ సంస్కారాల ద్వారా మంచి చెడుల ఆకర్షణలకు అతీతంగా ఉండే సదా హర్షితమూర్త్ భవ ''
మీ సంస్కారాలను ఈజీగా(సరళంగా) చేసుకుంటే ఏ కార్యము చేస్తున్నా ఈజీగా ఉంటారు. సంస్కారాలు టైట్గా(బిగుతుగా) ఉంటే పరిస్థితులు కూడా టైట్గా(ఊపిరి ఆడకుండా) అయిపోతాయి. సంబంధ-సంపర్కాల వారు కూడా టైట్గా(కఠినంగా) వ్యవహరిస్తారు. టైట్ అనగా టెన్షన్లో ఉండేవారు. అందువలన సరళ సంస్కారాల ద్వారా డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ మంచి లేక చెడు ఆకర్షణల నుండి అతీతంగా ఉండండి. మంచిదీ ఆకర్షించరాదు, చెడ్డదీ అకర్షించరాదు. అప్పుడు హర్షితంగా ఉండగలరు.
స్లోగన్ :-
'' ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో, వారే ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉంటారు ''