10-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సేవలో వృద్ధి కొరకు కొత్త - కొత్త పద్ధతులను కనుగొనండి. గ్రామ గ్రామానికి వెళ్లి సర్వీసు చేయండి. సేవ చేసేందుకు జ్ఞాన పరాకాష్ఠ కావాలి''

ప్రశ్న :-

బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉండేందుకు సహజమైన యుక్తి ఏది?

జవాబు :-

ఘడియ - ఘడియ ఇంటిని స్మృతి చేయండి. ఇప్పుడు మృత్యులోకము నుండి లెక్కాచారమంతా సమాప్తము చేసుకొని అమరలోకానికి వెళ్లాలని బుద్ధిలో ఉండాలి. దేహము నుండి కూడా భికారిగా అవ్వాలి. '' ఈ దేహము కూడా నాది కాదు.'' ఈ విధమైన అభ్యాసము ఉంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ పాత ప్రపంచములో ఉంటూ మన పరిపక్వ అవస్థను తయారు చేసుకోవాలి. ఏకరస స్థితి కొరకు శ్రమ చేయాలి.

పాట :-

మాతా! ఓ మాతా! మీరు సర్వుల భాగ్యవిధాత,............ (మాతా! ఓ మాతా! తూ హై సబ్‌కీ భాగ్య్‌విధాతా..............)   

ఓంశాంతి.

భారతదేశములో జగదంబకు చాలా మహిమ ఉంది. జగదంబను గురించి భారతవాసులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పేరు విన్నారు. వీరిని 'ఈవ్‌' అనగా 'బీబీ' అని కూడా అంటారు. ఇప్పుడు బీబీ మరియు మాలికుడు(యజమాని/భర్త) లేకుండా రచన రచింపబడదని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా జగదంబ ప్రకటితమవ్వవలసే ఉంటుంది. జగదంబ తప్పకుండా ఉండేది. అందువల్లనే మహిమ చేస్తారు. భారతదేశానికి చాలా మహిమ ఉంది. దానిని స్వర్గము అని కూడా అంటారు అంతేకాక భారతదేశమే ప్రాచీనమైనదని కూడా వారికి తెలుసు. కనుక తప్పకుండా స్వర్గము ఉండి ఉండాలి. ఈ విషయాలు ఈశ్వరీయ సంతానమైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. కల్పక్రితము ఎవరైతే అర్థము చేసుకున్నారో వారే ఇప్పుడు మళ్లీ అర్థం చేయించేందుకు చాలా మంచి పదాలున్నాయి. ''పవిత్ర ఆత్మ'' - పవిత్రత ద్వారా మీరు ప్రకాశ కిరీటాన్ని పొందుతారు. ఇంకొక విధంగా పుణ్యాత్మ అని దాన-పుణ్యాలు చేసేవారిని అంటారు. వారిని ఆంగ్లములో మహాదాని(ఫిలాంత్రోఫిస్ట్‌) అని కూడా అంటారు. పవిత్రతను నిర్వికారము అని అంటారు. వేరు వేరు పదాలు ఉన్నాయి. భారతదేశములో దాన-పుణ్యాలైతే చాలా జరుగుతాయి. ప్రత్యేకించి తరచుగా గురువులకు దానము చేస్తారు. భలే ఇప్పుడు వారిని పవిత్రాత్మలు అని అనవచ్చు గాని పుణ్యాత్మలని అనలేరు. వారు దాన-పుణ్యాలు చేయరు. వారైతే దాన-పుణ్యాలు తీసుకుంటారు. కనుక వీరందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి తండ్రితో జోడించాలి. అందువల్లనే ఇది సరికాదని తండ్రి అర్థము చేయించవలసి పడ్తుంది. వీరందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. మీరు జ్ఞానసాగరుల నుండి వెలువడిన జ్ఞాన గంగలు. వాస్తవానికి గంగ అనే పదము సరియైనది కాదు. కాని గాయనము(మహిమ) నడుస్తూ వచ్చింది. అందువల్ల పోలిక చేసి చెప్పడం జరుగుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచపు పాత వస్తువులన్నిటినీ కొత్తవిగా చేస్తారు. స్వర్గము నూతన వస్తువు. నూతన వస్తువు గురించిన సమాచారము గురించి తండ్రికి మాత్రమే తెలుసు. ప్రపంచములోని వారికి తెలియదు.

భగవానువాచ! - అని ఉంది కాని గీతలో కృష్ణుని పేరు వేసినందువలన అందరి బుద్ధియోగము భగవంతుని నుండి తెగిపోయింది. అందువల్లనే సర్వవ్యాపి అని అనేశారు. కృష్ణుని జతలో అనేకమంది బుద్ధి యోగముంది. ఎక్కడైతే గీతకు గౌరవముంటుందో అక్కడ కృష్ణునికి కూడా గౌరవముంది. వాస్తవానికి తండ్రి మహిమ అనే టోపి కొడుకు పైకి వచ్చేసింది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ విషయాలు తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు.

బాబా మాటి మాటికి - '' ఎవరైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గురించి, వీరితో మీకు ఏ సంబంధముంది?'' అని అడగండని అర్థము చేయిస్తారు. బాబా మంచి ప్రశ్నావళిని కూడా తయారు చేయించారు. దాని వలన సేవ చాలా బాగా జరగగలదు. జగదంబ మందిరములో బాగా సేవ జరిగేందుకు అవకాశముంది. అక్కడికి వెళ్లి ఈమె జగదంబ, సృష్టిని రచించే మాత అని అర్థము చేయించండి. ఆమె ఏ ప్రపంచాన్ని రచిస్తుంది? అని అడగండి. తప్పకుండా నూతన ప్రపంచాన్నే రచిస్తుందని అర్థము చేయించండి. అచ్ఛా! ఈ మాతకు తండ్రి ఎవరు? వీరికి ఎవరు జన్మనిచ్చారు? అని అడగండి. మనుష్యులకైతే ముఖవంశావళి అనే పదానికి అర్థము కూడా తెలియదు. వీరికి పరమపిత పరమాత్మయే జన్మనిచ్చారని మీకు తెలుసు. పిల్లలైన మీరే అందరికీ అర్థము చేయించాలి. జగదంబ ముఖవంశావళి. కాని ఏ విధంగా? పరమపిత పరమాత్మ అయితే నిరాకారుడు కనుక బ్రహ్మ తనువు ద్వారా అని తెలియజేయవలసి ఉంటుంది. పరమపిత పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మను ఎలా దత్తత తీసుకున్నారో, అలాగే ఈమెను(కూతురును) కూడా దత్తత తీసుకున్నారు. ఈ విషయాలన్నీ అందరి బుద్ధిలో ఒకే విధంగా, స్థిరంగా నిలబడవు. ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు. పిల్లలు చాలా సేవ చేయవచ్చు. జగదంబ మందిరములోకి వెళ్లి పరిచయమును ఇవ్వాలి. తద్వారా వారి బుద్ధియోగము కూడా తండ్రితో జోడించబడ్తుంది. జగదంబ కూడా వారితో యోగము జోడిస్తుంది కనుక మనము కూడా వారితోనే యోగాన్ని జోడించాలి అని చెప్పండి. క్రింద జగదంబ తపస్సులో కూర్చొని ఉంది, వారి మందిరము పైన ఉంది. క్రింద రాజయోగ తపస్సు చేస్తున్నారు. తర్వాత సత్యయుగములో రాజరాజేశ్వరిగా, స్వర్గ యజమానురాలుగా అవుతుంది. ఇప్పుడిది కలియుగము. మళ్లీ ఎప్పుడు తపస్సులో కూర్చుంటు0దో, అప్పుడు స్వర్గానికి యజమానురాలిగా అవుతుంది కదా. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. ఈ సత్యమైన సలహా మనుష్యులకు ఇవ్వబడ్తుంది. మీరు ప్రతి ఒక్కరి పరిచయమునిస్తారు. కాని ప్రతి ఒక్కరి బుద్ధిలో అంత త్వరగా కూర్చోదు. ఒకవేళ కూర్చుంటే వెంటనే సర్వీసులో నిమగ్నమౌతారు. చిత్రాలు కూడా చాలా బాగా తయారు చేయబడి ఉన్నాయి. లక్ష్మీనారాయణుల మందిరములోకి వెళ్లి అర్థం చేయించవచ్చు. బాబా చెప్తారు - '' నా భక్తులకు వినిపించండి. భక్తులు తప్పకుండా మందిరాలలోనే లభిస్తారు. వారికి ప్రేమతో అర్థము చేయించండి - ఇవి లక్ష్మీనారాయణుల చిత్రాలు. వీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారని అందరూ చెప్తారు.'' అచ్ఛా! మరి ఇప్పుడు ఇదేమిటి? అని అడగండి. కలియుగమని తప్పకుండా చెప్తారు. కలియుగములో దు:ఖమే దు:ఖముంది. మరి వీరికి రాజ్య భాగ్యము ఏ విధంగా లభించింది? మీకు తెలుసు కనుక మీరు అందరికీ వినిపించగలరు. ఒక్కరికి అర్థము చేయిస్తే సత్సంగము జమ అవుతుంది. తర్వాత అందరూ మా వద్దకు రండి, మా వద్దకు రండి........... అని పిలుస్తారు. మందిరాలలో చాలా పెద్ద మేళా జరుగుతుంది. రాముని మందిరములోకి కూడా వెళ్లి వారి కర్తవ్యాన్ని గురించి తెలుపవచ్చు. నెమ్మది - నెమ్మదిగా యుక్తిగా అర్థము చేయించాలి. చాలామంది పిల్లలు - ''బాబా! మేము ఇలా - ఇలా అర్థము చేయించాము'' అని వ్రాస్తారు. ఒక్కరికి అర్థము చేయించడం ద్వారా ఇతరుల నుండి నిమంత్రణ వస్తుంది. మా ఇంటికి కూడా వచ్చి 7 రోజుల కోర్సును నడిపిస్తే మంచిది అని పిలుస్తారు. మళ్లీ ఇక అక్కడి నుండి ఇంకొకరు వెలువడ్తారు. ఎవరు ఆహ్వానించినా వారు ఇక వదిలి వెళ్లని విధంగా అర్థము చేయించాలి. మీరు భాషణము చేయడం ద్వారా అక్కడ దగ్గరి దగ్గరి వారు, వారి బంధు-మిత్రులు మొదలైన వారంతా ప్రోగవుతారు. అలాగే వృద్ధి జరుగుతుంది. సేవాకేంద్రానికి ఇంతమంది రాలేరు. ఇది మంచి యుక్తి. ఈ విధంగా శ్రమ చేయాలి. అయితే ఈ విధానము ఏ కొద్దిమందికో వస్తుంది. అందరూ కష్టపడరు. అందుకు జ్ఞాన పరాకాష్ఠ కావాలి. బాబా మనకు నేర్పించేందుకు ఎంత దూరము నుండి వస్తారు! ఒకవేళ సేవ చేయలేదంటే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? పాఠశాలలో పిల్లలు చాలా మంచి చమత్కారులుగా ఉంటారు. గెంతులేస్తూ ఉంటారు. ఇది కూడా చదువే. ఇది అద్భుతమైన చదువు. ఇందులో వృద్ధులు, యువకులు, పిల్లలు అందరూ చదువుకుంటారు. పేదలకు ఇది ఇంకా చాలా మంచి అవకాశము. సన్యాసులు కూడా వాస్తవానికి పేదవారే. ఎంతో గొప్ప-గొప్ప ధనికులైన మనుష్యులు వారిని తమ వద్దకు పిలుస్తూ ఉంటారు. సన్యాసులు ఇల్లు - వాకిళ్లను వదిలి నిరుపేదలుగా(భికారులుగా) అయ్యారు. వారి వద్ద ఏమీ లేదు. మీరు కూడా ఇప్పుడు నిరుపేదలే(భికారులే). మళ్లీ మీరు రాకుమారులుగా అవుతారు. వారు కూడా నిరుపేదలే. ఇందులో ముఖ్యమైనది పవిత్రత విషయము. మీ వద్ద ఇక ఏమీ లేదు. మీరు దేహాన్ని కూడా మర్చిపోతారు. దేహ సహితంగా సర్వస్వాన్ని త్యాగము చేసి ఒక్క తండ్రికి చెందినవారిగా అవుతారు. ఒక్క తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంత ధారణ జరుగుతుంది. ఏకరస ధారణ కొరకు శ్రమ చేయాలి. మనము బాబా వద్దకు వెళ్లాలి కనుక ఈ పాత ప్రపంచము గురించి ఎందుకు ఆలోచించాలి? పరిపక్వ అవస్థ రానంత వరకు ఈ పురాతన ప్రపంచములోనే, పురాతన శరీరములోనే ఉండాలి.

ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఈ మృత్యు లోకముతో లెక్కాచారాలు తీరిపోతాయి. ఇప్పుడిక అమరలోకానికి వెళ్లాలి. ఘడియ - ఘడియ ఇంటిని స్మృతి చేయడం ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. గీతలో బాబా ఏమి చెప్పారో చెప్పమని అడగండి. భగవంతుని బాబా(తండ్రి) అని అంటారు. నిరాకార బాబా చెప్తున్నారు - '' మామేకం యాద్‌ కరో '' (నన్నొక్కరినే స్మృతి చేయండి) యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమౌతాయి.'' కృష్ణుడు ఈ విధంగా చెప్పలేడు. ''ఈ పాత ప్రపంచము మరియు పాత శరీరాన్ని కూడా వదిలేయండి'' - అనునది భగవంతుని మహావాక్యము. దేహీ-అభిమానులుగా అయ్యి నిరంతరము బాబాను స్మృతి చేయండి. భగవంతుడు నిరాకారుడు. ఆత్మ శరీరాన్ని తీసుకొని శబ్ధములోకి వస్తుంది. బాబా అయితే గర్భము ద్వారా జన్మించరు. వారి పేరు ''శివుడు.'' బ్రహ్మ-విష్ణు-శంకరులు ఆత్మలు, వారికి తమ సూక్ష్మ శరీరాలున్నాయి. వీరు నిరాకార పరమపిత పరమాత్మ. వారి పేరు ''శివుడు'', వారే జ్ఞాన సాగరులు. బ్రహ్మ-విష్ణు-శంకరులను రచయిత అని అనరు. రచయిత అని ఒక్క నిరాకారుడినే అంటారు. అయితే వారు సాకార రచనను ఎలా రచిస్తారు? కనుక వారు వచ్చి బ్రహ్మ ద్వారా తెలియజేస్తారు. కృష్ణుడైతే కాదు కదా! బ్రహ్మ చేతిలోనే వేద శాస్త్రాలను చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని గాయనము కూడా ఉన్నది. బ్రహ్మ ద్వారా సర్వ శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. నిరాకారుడు సాకారుని ద్వారా వినిపిస్తారు. ఈ విషయాలను బాగా ధారణ చేయవలసి ఉంటుంది. భగవానువాచ - ''నేను రాజయోగాన్ని నేర్పిస్తాను.'' వినాశనానికి ముందే స్థాపన కూడా తప్పకుండా జరగాలి. మొట్టమొదట స్థాపన జరుగుతుంది. చాలా బాగా స్పష్టంగా వ్రాస్తూ ఉంటారు - బ్రహ్మ ద్వారా సూర్యవంశ రాజ్య స్థాపన. ఇలా వ్రాయడంలో చాలా గొప్ప రహస్యముంది కాని ఎవరైనా శ్రమ చేసి సేవలో నిమగ్నమవ్వాలి. సేవలో నిమగ్నమైతే చాలా ఆనందము కలుగుతుంది. మమ్మా-బాబాలకకు కూడా సర్వీసులో ఆనందము కలుగుతుంది. పిల్లలు కూడా సర్వీసు చేయాలి. మమ్మానైతే మందిరములోకి తీసుకెళ్లరు కదా. మమ్మాకైతే చాలా మహిమ ఉంది. పిల్లలైతే వెళ్లవలసిందే. బాబా చెప్తారు - వానప్రస్థములోని వారి వద్దకు వెళ్ళి వారిని '' ఎప్పుడైనా గీతాధ్యయనము చేశారా? గీతా భగవానుడు ఎవరు? '' అని అడగండి. భగవంతుడైతే ఒకే ఒక్క నిరాకారుడే. సాకారుని భగవంతుడని అనరు. భగవంతుడు ఒక్కరే అని చెప్పండి. ఇందులో సర్వీసు కొరకు చాలా విచార సాగర మథనము నడవాలి. అభ్యాసము చేసిన తర్వాత బయటకు వెళ్లి ట్రయల్‌ చేసి చూడాలి. జగదంబను దర్శించేందుకు రోజూ వస్తారు. త్రివేణీ సంగమము వద్దకు కూడా చాలామంది మనుష్యులు వెళ్తారు. అక్కడికి కూడా వెళ్లి సర్వీసు చేయాలి. మీరు భాషణ చేసినట్లైతే చాలామంది వచ్చి ప్రోగౌతారు. మా వద్దకు వచ్చి సత్సంగాన్ని జరపండి అని చాలామంది నిమంత్రణ ఇస్తూ ఉంటారు. మమ్మా-బాబాలు ఎక్కడికీ వెళ్లలేరు. పిల్లలు వెళ్లగలరు. బెంగాలులో కాళికా మాత మందిరముంది. అక్కడ కూడా చాలా సర్వీసు చేయగలరు. 'కాళి' మాత ఎవరు? దీని పై కూడా భాషణ చేయండి. కాని ధైర్యముండాలి. ఎవరు అర్థము చేయించగలరో బాబాకు తెలుసు. ఎవరిలో దేహాభిమానముంటుందో వారు ఏమి సర్వీసు చేయగలరు? సేవకు నిదర్శనమివ్వరు. పూర్తిగా సేవ చేయకపోతే పేరును చెడిపేస్తారు. యోగీ ఆత్మలలో మంచి శక్తి ఉంటుంది. అర్థము చేయించేందుకు చాలా పాయింట్లు ఇస్తూ ఉంటారు. కాని మంచి మంచి మహారథులు కూడా మర్చిపోతారు. సర్వీసు అయితే చాలా ఉంది. దీనిని అనంతమైన సర్వీసు అని అంటారు. ఈ సర్వీసు చేసినవారు తర్వాత చాలా గౌరవాన్ని కూడా పొందుతారు. ముఖ్యమైనది పవిత్రత విషయము. కొంతమంది నడుస్తూ నడుస్తూ పడిపోతారు. లౌకిక తండ్రి పట్ల ఎప్పుడూ ఎవ్వరికీ నిశ్చయము తెగిపోదు. ఇక్కడ బాబా వద్ద జన్మ తీసుకుంటారు. ఇటువంటి తండ్రిని ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే వీరు విచిత్రమైనవారు. ఈ తండ్రికి చిత్రము లేదు. తండ్రి చెప్తున్నారు - '' నన్ను స్మృతి చేయండి, మీరు పవిత్రముగా అవ్వండి, తద్వారా నా వద్దకు వచ్చేస్తారు.'' నేను 84 జన్మల పాత్రను అభినయించానని ఆత్మ భావిస్తుంది. ఆత్మలోనే పాత్ర నిశ్చితమై ఉంది కాని శరీరములో పాత్ర ఉండదు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది! బుద్ధిలో ఎంత నషా ఉండాలి. వ్యవహారముతో పాటు ఈ సర్వీసు కూడా చేయవచ్చు. మాతా-పితలైతే ఎక్కడికీ వెళ్లరు. పిల్లలు ఎక్కడికైనా వెళ్లి సర్వీసు చేయవచ్చు. పిల్లలనే అదృష్ట నక్షత్రాలు(లక్కీ స్టార్స్‌ ) అని అంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన జ్ఞాన లక్కీ సితారాలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానాన్ని వదిలి సర్వీసు చేయాలి. విచార సాగర మథనము చేసి బేహద్‌ సర్వీసుకు నిదర్శనమివ్వాలి.

2. ఈ మృత్యులోకములోని పాత లెక్కాచారాలన్నీ సమాప్తము చేయాలి. పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోతూ ఉండాలి.

వరదానము :-

''కర్మలు చేస్తూ శక్తిశాలి స్థితిలో స్థితమై ఆత్మిక పర్సనాలిటిని అనుభవం చేయించే కర్మయోగీ భవ ''

పిల్లలైన మీరు కేవలం కర్మలు చేయరు, యోగయుక్తంగా ఉండి కర్మలు చేసే కర్మయోగులు. వీరు పనులైతే చేతులతో చేస్తున్నారు కాని పనులు చేస్తున్నా తమ శక్తిశాలి స్థితిలో స్థితమై ఉన్నారని ప్రతి ఒక్కరికి అనుభవమవ్వాలి. సాధారణ రీతిలో నడుస్తున్నా, నిల్చొని ఉన్నా, మీ ఆత్మిక పర్సనాలిటి దూరం నుండే అనుభవమవ్వాలి. ఎలాగైతే ప్రాపంచిక పర్సనాలిటి ఆకర్షిస్తుందో, అలా మీ ఆత్మిక పర్సనాలిటి, పవిత్రతా పర్సనాలిటి, జ్ఞానయుక్త, యోగయుక్త పర్సనాలిటి స్వతహాగా ఆకర్షిస్తుంది.

స్లోగన్‌ :-

''సత్యమైన దారిలో నడుస్తూ అందరికి సత్యమైన దారిని చూపించే వారే సత్య సత్యమైన మైట్‌హౌస్‌లు ''