27-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీరు తప్పకుండా తండ్రి సమానము మురళీధరులుగా అవ్వాలి. మురళీధరులైన పిల్లలే తండ్రికి సహయోగులు. తండ్రి వారి పైనే రాజీ అవుతారు''

ప్రశ్న :-

ఎటువంటి పిల్లల బుద్ధి చాలా చాలా నిర్మానంగా, నిరహంకారంగా అవుతుంది ?

జవాబు :-

ఏ పిల్లలైతే అవినాశి జ్ఞాన రత్నాలను దానము చేసి సత్యమైన దాతలుగా అవుతారో, చురుకైన సేల్స్‌మెన్‌గా(అమ్మకదారులుగా) అవుతారో, అటువంటి పిల్లల బుద్ధి చాలా చాలా నిర్మానంగా(నిరహంకారిగా) అవుతుంది. సర్వీసు చేస్తూ చేస్తూ బుద్ధి రిఫైన్‌గా (శుద్ధంగా) అయిపోతుంది. దానము చేయడంలో ఎప్పుడూ అభిమానం రాకూడదు. శివబాబా ఇచ్చినదానినే ఇస్తున్నామని ఎల్లప్పుడూ బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా కళ్యాణమైపోతుంది.

పాట :-

మీరే తల్లి, తండ్రి ,................... (తుమ్‌ హీ హో మాతా,..............)   

ఓంశాంతి.

కేవలం మాత-పితల పాట వినిపించినంత మాత్రాన తల్లిదండ్రుల పేరు ఋజువు కాదు. మొదట శివాయ నమ: అనే పాటను వినిపించిన తర్వాత ఈ తల్లి, తండ్రి పాటను వినిపిస్తే జ్ఞానము గురించి అర్థమవుతుంది. మనుష్యులైతే లక్ష్మీనారాయణుల మందిరాలకు, కృష్ణుని మందిరాలకు వెళ్లి అందరి ముందు అర్థము లేకుండా మీరే తల్లి-తండ్రి అని మహిమ చేస్తారు. మొదట శివాయ నమ: అనే పాటను వినిపించి తర్వాత ఈ తల్లి-తండ్రి,........ అనే పాటను వినిపిస్తే మహిమ ఏమిటో తెలుస్తుంది. ఎవరైనా కొత్తవారు వస్తే ఈ పాటలు బాగున్నాయి. అర్థము చేయించేందుకు సహజమౌతుంది. తండ్రి పేరే 'శివ.' శివుడు సర్వవ్యాపి అని మనము అనము. సర్వవ్యాపి అయితే అందరి మహిమ ఒక్కటే అయిపోతుంది. వారి పేరే 'శివ.' ఇతరులెవ్వరూ శివాయ నమ: అను పేరు ఉంచుకోజాలరు. వారి గతి-మతి అందరి మనుష్యమాత్రుల కంటే అతీతమైనది. దేవతల కంటే అతీతమైనది. ఈ జ్ఞానమును నేర్పించేవారు మాత-పితలే. సన్యాసులకైతే మాత లేనందున వారు రాజయోగాన్ని నేర్పించలేరు. శివాయ నమ: అని ఎవ్వరినీ అనేందుకు వీలు లేదు. దేహధారులను శివాయ నమ: అని అనము. ఇది అర్థము చేయించాలి. అయితే పిల్లలైన మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి మంచి పిల్లలు కూడా పాయింట్లు మర్చిపోతారు. తమను తాము మియామిట్టుగా(అన్నీ తెలిసినవారిగా) చాలామంది భావిస్తారు. ఇందులో హృదయము స్వచ్ఛంగా ఉండాలి. ప్రతి విషయములో సత్యాన్నే చెప్పడము, సత్యవంతులై ఉండేందుకు సమయము పడ్తుంది. దేహాభిమానములోకి వచ్చినందున ఫెమీలియారిటీ(ప్రభావితులవ్వడము/చనువు) మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా ఉన్నామని ఎవ్వరూ అనలేరు. అలా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. నెంబరువారుగా ఉన్నారు. కొందరు చాలా కుపుత్రులైన పిల్లలుగా ఉన్నారు. ఎవరు బాగా సర్వీసు చేస్తున్నారో అర్థమైపోతుంది. శివబాబా హృదయాన్ని అధిష్టించినప్పుడే రుద్రమాలలో సమీపంగా వస్తారు, సింహాసనానికి అర్హులుగా అవుతారు. లౌకిక తండ్రి హృదయము పైకి కూడా తండ్రికి సహయోగులుగా ఉండే సుపుత్రులైన పిల్లలే స్థానాన్ని పొందుతారు. ఇది కూడా అనంతమైన తండ్రిగారి అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారము. కావున వ్యాపారములో సహాయము చేసేవారుగా అయితే తండ్రి కూడా సంతోషిస్తారు(రాజీగా ఉంటారు). అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేసి, చేయించాలి. కొంతమంది మేము ఇన్‌ష్యూర్‌ చేసుకున్నామని భావిస్తారు. దాని ఫలమైతే మీకు లభిస్తుంది. ఇక్కడైతే చాలామందికి దానము చేయాలి. తండ్రి వలె అవినాశి జ్ఞాన రత్నాల దాతలుగా అవ్వాలి. అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ ధనము మాటే లేదు. తండ్రికి సుపుత్రులైన పిల్లలంటేనే ఇష్టము. వ్యాపారము చేయడం రాలేదంటే వారు మురళీధరులని ఈ వ్యాపారస్థుని పిల్లలుగా ఎలా పిలువబడ్తారు? సిగ్గు కలగాలి. నేను వ్యాపారము చేయడం లేదే అని సిగ్గుపడాలి. మంచి తెలివైన అమ్మకపుదారులుగా అనిపిస్తే వారిని భాగస్వామిగా చేసుకుంటారు. భాగస్వామ్యము ఊరకే లభించదు కదా. ఈ వ్యాపారములో నిమగ్నులైతే చాలా నిర్మాణ బుద్ధిగలవారిగా అవుతారు. సర్వీసు చేస్తూ చేస్తూ బుద్ధి శుద్ధమైపోతుంది. మమ్మా-బాబాలు తమ అనుభవాలను వినిపిస్తారు. నేర్పించేవారు బాబాయే. ఈ బాబా బాగా ధారణ చేసి మురళీని బాగా వినిపిస్తారని మీకు తెలుసు. వీరిలో మురళీధరుడైన శివబాబా ఉన్నారని అనుకోండి. కాని ఈ బాబాకు కూడా తెలుసు కదా? లేకుంటే అంత గొప్ప పదవిని ఎలా పొందుతాడు? ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. శివబాబా స్మృతిలో ఉంటే మీ కళ్యాణము కూడా జరుగుతుంది. ఇతనిలో అయితే శివబాబా వస్తారు. మమ్మా తన హోదాలో వేరుగా చెప్తుంది. స్త్రీకి లిఫ్ట్‌ ఇవ్వబడుతుంది. కనుక వారి పేరును ప్రసిద్ధం చేయాలి. ఎలాగున్నారో అలా నావారే.......... అని అంటారు కదా. కావున వారిని సంభాళించవలసిందే. పురుషులే ఇలా అంటారు. స్త్రీ ఇలా చెప్పదు. తండ్రి కూడా - పిల్లలారా, మీరు ఎలాగున్నా మిమ్ములను సంభాళించవలసిందే అని అంటారు. తండ్రి పేరే ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ తండ్రి పేరు ప్రసిద్ధమయ్యే ఉంది. తర్వాత శక్తుల పేరు ప్రసిద్ధమవుతుంది. వారికి సర్వీసుకు మంచి అవకాశము లభిస్తుంది. రోజురోజుకు సర్వీసు చాలా సహజమైపోవాలి. జ్ఞానము మరియు భక్తి, పగలు మరియు రాత్రి. సత్య, త్రేతా యుగాలు పగలు, అక్కడ సుఖముంది. ద్వాపర కలియుగాలు రాత్రి, ఇక్కడ దు:ఖముంది. సత్యయుగములో భక్తి ఉండదు. ఇది ఎంత సహజము! కాని అదృష్టములో లేదంటే ధారణ చెయ్యలేరు. పాయింట్లు అయితే చాలా మంచివి లభిస్తాయి. బంధు-మిత్రుల వద్దకు వెళ్ళి అర్థం చేయించండి. మీ ఇంటిని ఉద్ధరించండి. గృహస్థ వ్యవహారములో ఉన్న మీరు చాలా సహజంగా ఎవరికైనా అర్థము చేయించగలరు. సద్గతిదాత ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే. వారే శిక్షకులు. సద్గురువు కూడా వారే. మిగిలిన వారంతా ద్వాపర యుగము నుండి దుర్గతినే ఇస్తూ వచ్చారు. కలియుగములో భ్రష్ఠాచారి పాపాత్మలు ఉన్నారు. సత్యయుగములో పాపాత్మల పేరే ఉండదు. ఇక్కడే అజామిళుడు, గణికలు, అహల్యల వంటి పాపాత్మలు ఉంటారు. అర్ధకల్పము స్వర్గమని అనబడ్తుంది. మళ్లీ భక్తి ప్రారంభమౌతే దిగజారడము మొదలవుతుంది. తప్పకుండా క్రింద పడాల్సిందే. సూర్యవంశీయులు దిగజారి చంద్రవంశీయులుగా అవుతారు. తర్వాత దిగుతూనే వస్తారు. ద్వాపర యుగము నుండి అందరూ క్రింద పడవేసేవారే లభిస్తూ వచ్చారు. ఇది కూడా మీకిప్పుడే తెలుసు. రోజురోజుకూ మీలో శక్తి వస్తూ ఉంటుంది. సాధువులు మొదలైనవారికి అర్థము చేయించేందుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. చివరికి పరమపిత పరమాత్మ సర్వవ్యాపి అయ్యేందుకు సాధ్యము లేదని తప్పకుండా అర్థము చేసుకుంటారు. అర్థము చేయించేందుకు పాయింట్లు చాలా ఉన్నాయి. భక్తి మొదట అవ్యభిచారిగా ఉంటుంది. తర్వాత వ్యభిచారిగా అవుతుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. కళలు ఎలా తగ్గుతాయో వృక్షము లేక సృషిచక్ర చిత్రములో కూడా చూపించబడింది. అర్థము చేయించడము అత్యంత సహజము. కాని అదృష్టములో లేకుంటే అర్థము చేయించలేరు. ఆత్మాభిమానులుగా అవ్వరు. పాత దేహములోనే (మోహముతో) చిక్కుకొని ఉంటారు. ఈ పాత దేహము పై మమత్వాన్ని తొలగించి స్వయాన్ని ఆత్మగా భావించమని బాబా చెప్తున్నారు. దేహి-అభిమానులుగా అవ్వకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. చివరి స్థానము లభించినా చాలని విద్యార్థులు ఎప్పుడూ అనుకోరు. అలా కూర్చుంటే వీరికి చదువు పై ధ్యాస లేదని బంధు-మిత్రులు, శిక్షకులు, తోటి విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా శ్రీమతానుసారము నడవలేదంటే అదే గతి పడ్తుంది. ఎవరు ప్రజలుగా అవుతారో, ఎవరు దాస-దాసీలుగా అవుతారో అంతా అర్థమైపోతుంది. తండ్రి అర్థము చేయిస్తారు - మీ బంధు-మిత్రుల కళ్యాణము చేయండి. ఇదొక నియమము. ఇంటిలో పెద్ద అన్నయ్య ఉంటే చిన్నవారికి సహాయము చేయడం వారి కర్తవ్యము. దీనినే చారిటి బిగిన్స్‌ అట్‌ హోమ్‌(ధర్మ కార్యము ఇంటి నుండే ప్రారంభము కావాలి) అని అంటారు. ధనమిస్తే ధనము తరగదు......... ధనమివ్వలేదంటే అది దొరకను కూడా దొరకదు, పదవి కూడా పొందలేేరని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి అవకాశము లభిస్తుంది. దయాహృదయులుగా అవ్వాలి. మీరు సన్యాసులు, సాధువుల పై కూడా దయాహృదయులుగా అవుతారు. వచ్చి తెలుసుకోండి అని మీరు చెప్తారు. మీకు మీ పారలౌకిక తండ్రి ఎవరైతే ప్రతి కల్పము భారతదేశానికి సదా సుఖ వారసత్వాన్నిస్తారో వారిని గురించి తెలియదు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. అధికారులు కూడా భ్రష్ఠాచారులైపోయారని అంటారు. మరి శ్రేష్ఠాచారులుగా చేసేదెవరు?

ఈ రోజుల్లో సాధు సమాజాలకు చాలా గౌరవముంది. తండ్రి వీరందరి పై దయ చూపుతారని మీరు వ్రాస్తారు. అది చదివి వారు చాలా ఆశ్చర్యచకితులౌతారు. పోను పోను మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. మీ వద్దకు చాలామంది వస్తూ ఉంటారు. ప్రదర్శినీలు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి కొంతమంది తప్పకుండా మేల్కొంటారు. సన్యాసులు కూడా మేల్కొంటారు. ఎక్కడకు వెళ్తారు, ఉన్నది ఒకే దుకాణము. చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అర్థము చేయించేందుకు మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకున్నప్పుడు అందరూ మేల్కొంటారు. కాని టూ లేట్‌(చాలా ఆలస్యము) అయిపోతుంది. పిల్లలైన మీకు కూడా ఇదే వర్తిస్తుంది. చివర్లో ఎంతగా పరుగెత్తగలరు? పందెములో కూడా కొంతమంది మెల్లమెల్లగా పరుగెడ్తారు. కొంతమందికి మాత్రమే బహుమతి లభిస్తుంది. ఇది కూడా గుర్రపు పందెము వంటిదే. ఆత్మికయాత్రలో పరుగెత్తేందుకు కూడా జ్ఞానీ ఆత్మలే కావాలి. తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే కదా. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. జ్ఞానము ద్వారానే మానవులు వజ్ర సమానంగా అవుతారు. అజ్ఞానము ద్వారా గవ్వ సమానంగా అవుతారు. సతోప్రధానమైన ప్రాలబ్ధాన్ని తండ్రే వచ్చి తయారుచేస్తారు. మళ్లీ అది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ పాయింట్లన్నీ ధారణ చేసి కర్మలోకి రావాలి. పిల్లలైన మీరు మహాదానులుగా అవ్వాలి. ఇక్కడ పిల్లలైన మీరు తండ్రి ముందు తనువు-మనసు-ధనములన్నీ అర్పణ చేసిన కారణంగా భారతదేశాన్ని మహాదాని అని అంటారు. తండ్రి కూడా మళ్లీ అన్నిటినీ అర్పించేస్తారు. చాలామంది మహాదానులు భారతదేశములోనే ఉన్నారు. మిగిలిన మానవులంతా అంధశ్రద్ధలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడైతే మీరు ఈశ్వరుని శరణాగతిలోకి వచ్చారు. రావణుని ద్వారా దు:ఖితులై రాముని శరణును ఆశ్రయించారు. మీరంతా శోకవాటికలో ఉండేవారు. తర్వాత ఇప్పుడు మళ్లీ అశోకవాటిక అనగా స్వర్గములోకి వెళ్లాలి. స్వర్గ స్థాపన చేస్తున్న తండ్రి శరణులోకి వచ్చారు. కొంతమంది పిల్లలు బలవంతంగా చిన్న ప్రాయములోనే వచ్చేశారు. ఇక్కడ శరణాగతిలో వారికి సుఖమనిపించదు. అదృష్టములో లేని వారికి మాయా రావణుని శరణు కావాలి. వారు ఈశ్వరుని శరణాగతి నుండి దూరమై మాయ శరణులోనికి వెళ్లేందుకు ఇష్టపడ్తారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా.

ఈ శివాయ నమ: అనే పాట బాగుంది. మీరు వినిపించవచ్చు. మనుష్యులు ఇది అర్థము చేసుకోలేరు. శ్రీమతానుసారము మేము యదార్థ అర్థమును తెలిపిస్తామని పిల్లలైన మీరు అంటారు. వారు బొమ్మలాటలు ఆడుతూ ఉంటారు. డ్రామానుసారము ఈ పాటల సహయోగము కూడా లభిస్తుంది. తండ్రికి చెందినవారిగా అయ్యి సేవాధారులుగా అవ్వకుంటే హృదయాన్ని ఎలా అధిరోహించగలరు? చాలామంది కుపుత్ర పిల్లలుగా అయితే ఎంత దు:ఖాన్నిస్తారంటే చెప్పనలవి కాదు. ఇక్కడైతే తల్లి మరణించినా హల్వా తినండి, భార్య మరణించినా హల్వా తినండి........(అమ్మా మరే తో భీ హల్వా ఖానా, బీబీ మరే తో భీ హల్వా ఖానా,.........) ఏడ్వడము, బాదుకోవడం చేయరాదు. డ్రామా పాయింటు పై దృఢంగా ఉండాలి. మమ్మా, బాబాలు కూడా వెళ్ళిపోతారు. అనన్యమైన పిల్లలు కూడా అడ్వాన్స్‌ పార్టీలోకి వెళ్తారు. పాత్రనైతే అభినయించవలసిందే. ఇందులో చింతించవలసిన విషయం ఏముంది? సాక్షిగా అయ్యి మనం ఆటను చూస్తాము. స్థితి సదా హర్షితంగా ఉండాలి. బాబాకు కూడా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆపదలు తప్పకుండా వస్తాయని నియమము చెప్తుంది. మమ్మా-బాబాలు కూడా ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు. సంపూర్ణ స్థితి అంతిమములో వస్తుంది. ఈ సమయములో ఎవ్వరూ స్వయాన్ని పరిపూర్ణులని చెప్పుకునేందుకు వీలు లేదు. ఏదైనా నష్టము సంభవిస్తుంది, ఎక్కడైనా అలజడి అవుతుంది. బి.కెల గురించి వార్తాపత్రికలలో కూడా హాహాకారాలు వెలువడ్తాయి. కాని ఇవన్నీ కల్పక్రితము జరిగినవే. ఇందులో చింతించే మాటేముంది? అంతిమంలో 100 శాతము స్థితి తయారవుతుంది. ఎప్పుడు దయాహృదయులుగా అవుతారో, ఇతరులను మీ సమానంగా తయారుచేస్తారో అప్పుడే తండ్రి హృదయమును అధిరోహిస్తారు. భీమా చేసుకున్నారు. ఆ మాట వేరే. అది స్వయం మీ కొరకు మీరే చేసుకుంటారు. ఇక్కడైతే జ్ఞాన రత్నాలను ఇతరులకు దానము చేయాలి. తండ్రిని పూర్తిగా స్మృతి చేయలేదంటే వికర్మల బరువు ఏదైతే తల పై ఉందో, అది విరుచుకుపడ్తుంది. ప్రదర్శినీలలో కూడా అర్థం చేయించేవారు యోగ్యులుగా ఉండాలి, తెలివైనవారిగా అవ్వాలి. రాత్రి వేళ స్మృతి చేస్తే చాలా మజా కలుగుతుంది. ఈ ఆత్మిక ప్రియుడిని మళ్లీ ప్రభాత సమయములో స్మృతి చేయాలి - ''బాబా, మీరు ఎంత మధురమైనవారు! ఎలా ఉన్న మమ్ములను ఎలా తయారు చేస్తున్నారు.'' మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. హృదయపూర్వకంగా సదా సత్యంగా ఉండాలి. సత్యమునే పలకాలి. సత్యవంతులై నడుచుకోవాలి. దేహాభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసినవారిగా(మియాముట్టూగా) భావించరాదు, అహంకారములోకి రాకూడదు.

2. సాక్షిగా ఉండి ఆటను చూడాలి, డ్రామా పై ధృడంగా ఉండాలి. ఏ విషయములోనూ చింత చేయరాదు. స్థితిని సదా హర్షితంగా ఉంచుకోవాలి.

వరదానము :-

''ప్రతిజ్ఞల(ప్రమాణాల) స్మృతి ద్వారా లాభము తీసుకునే సదా తండ్రి ఆశీర్వాదాలకు పాత్ర భవ''

మనసుతో గాని, మాటలతో గాని, వ్రాతతో గాని ఏ ప్రమాణాలనైతే చేస్తారో, వాటిని స్మృతిలో ఉంచుకుంటే ఆ ప్రమాణాల లాభాన్ని పూర్తిగా తీసుకోగలరు. ఎన్నిసార్లు ఎన్ని ప్రమాణాలు చేశారో వాటిని ఎంతవరకు నిభాయించారో చెక్‌ చేసుకోండి. వాయిదా మరియు ఫాయిదా(ప్రమాణము మరియు లాభము) ఈ రెండిటి బ్యాలన్స్‌ ఉంటే వరదాత అయిన తండ్రి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఎలాగైతే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో, అలా కర్మలు కూడా శ్రేష్ఠంగా ఉంటే సఫలతా మూర్తులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''స్వయాన్ని తండ్రి మాత్రమే కనిపించే దర్పణంగా చేసుకోవడమే సత్యమైన సేవ''