07-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా మీ బుద్ధికి వేయబడిన తాళము తెరుచుకుంటుంది. మాటి మాటికి తండ్రిని మర్చిపోయే పిల్లలు దురదృష్టవంతులు ''
ప్రశ్న :-
ఖాతాను జమ చేసుకునేందుకు ఆధారమేది? అన్నిటికన్నా గొప్ప సంపాదన ఎందులో ఉంది?
జవాబు :-
దానము చేయుట ద్వారా ఖాతా జమ అవుతుంది. మీరు ఇతరులకు ఎంత ఎక్కువగా తండ్రి పరిచయాన్నిస్తారో, అంత మీ సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప సంపాదన మురళి ద్వారా జరుగుతుంది. ఈ మురళియే అపవిత్రంగా ఉండే(నల్లగా ఉన్న) మిమ్ములను పవిత్రంగా(తెల్లగా) చేస్తుంది. మురళిలోనే ఖుదాయీ జాదూ(ఈశ్వరీయ గారడి) ఉంది. మురళి ద్వారానే మీరు మాలామాల్(అత్యంత గొప్ప సంపన్నులు)గా అవుతారు.
పాట :-
మనము ఆ మార్గములో నడవాలి,............. (హమ్ ఉన్ రాహోం పర్ చల్నా హై,..............) 
ఓంశాంతి.
పిల్లలూ! క్రిందపడినా మీరు సంభాళించుకోవాలి - అని ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాటిమాటికి తండ్రిని మర్చిపోవడమంటే క్రింద పడడం. స్మృతి చేయడం అంటే స్వయాన్ని సంభాళించుకోవడం. మాయ తండ్రి స్మృతిని మరపింపజేస్తుంది. ఎందుకంటే ఇది కొత్త విషయము కదా! నిజానికి తండ్రిని ఎవ్వరూ మర్చిపోరు. స్త్రీ ఎప్పుడూ తన పతిని మర్చిపోదు. నిశ్చితార్థము జరిగిందంటే చాలు, ఇక బుద్ధియోగము జోడించబడ్తుంది. కనుక మర్చిపోయే విషయమే ఉండదు. పతి పతియే, తండ్రి తండ్రియే. ఇప్పుడు వీరు నిరాకార తండ్రి. వీరిని ప్రియుడని కూడా అంటారు. భక్తులను ప్రేయసులని అంటారు. ఈ సమయములో అందరూ భక్తులే. భగవంతుడు ఒక్కరే. భక్తులను ప్రేయసులని, భగవంతుని ప్రియుడని, భక్తులను పిల్లలని, భగవంతుని తండ్రి అని అంటారు. ఇప్పుడు పతులకు పతి, లేదా తండ్రులకు తండ్రి వారొక్కరే. ఆత్మలందరికీ తండ్రి పరమాత్మయే. ఆ లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరు వేరుగా ఉంటాడు. ఈ పారలౌకిక పరమపిత ఒక్కరే, సర్వాత్మలకు తండ్రి లేక గాడ్ఫాదర్. వారి పేరు శివబాబా. కేవలం గాడ్ఫాదర్ 'మౌంట్ ఆబూ' అని వ్రాసినంతనే ఉత్తరము చేరుతుందేమో చెప్పండి? పేరు వ్రాయాల్సి వస్తుంది కదా! వీరు అనంతమైన తండ్రి. వారి పేరు 'శివుడు.' శివకాశి అని అంటారు కదా! అక్కడ శివుని మందిరముంది. అక్కడకు తప్పకుండా వెళ్లి ఉంటారు కదా! రాముడు ఇక్కడకు వెళ్ళాడు, అక్కడకు వెళ్ళాడు.............. గాంధీజీ ఇక్కడకు, అక్కడకు వెళ్ళారని ఆ ప్రదేశాలను చూపిస్తారు కదా! అదే విధంగా తప్పకుండా శివబాబాకు కూడా చిత్రముంది. కాని వారు నిరాకారులు. వారిని తండ్రి అని అంటారు. ఇతరులెవ్వరినీ సర్వులకు తండ్రి అని అనజాలరు. వారే బ్రహ్మ-విష్ణు-శంకరులకు కూడా తండ్రి. వారి పేరు శివుడు. కాశీలో కూడా మందిరముంది. ఉజ్జయినీలో కూడా సోమనాథ మందిరముంది. ఇన్ని మందిరాలెందుకు తయారయ్యాయో ఎవ్వరికీ తెలియదు. ఉదాహరణానికి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. వారు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారని చెప్తారు. కాని స్వర్గము ఎప్పుడు ఉండేదో వీరు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. పూజారులు ఎవరిని పూజిస్తున్నారో, వారి కర్తవ్యము గురించే తెలియకపోతే దానిని అంధశ్రద్ధ(మూఢ నమ్మకము) అని అంటారు కదా! ఇక్కడ కూడా బాబా అని అంటారే కాని వారి పూర్తి పరిచయము తెలియదు. మాతా-పితలను గురించే తెలియదు. లక్ష్మీనారాయణులను పూజారులు పూజిస్తారు, శివుని మందిరానికి వెళ్ళి మహిమ చేస్తారు. '' మీరు మాతా-పితలు, మేము మీ పిల్లలము............'' అని పాడ్తారు. కాని వారెలా మాతా-పితలుగా అయ్యారో, ఎప్పుడు అయ్యారో ఏ మాత్రము తెలియదు. భారతవాసులకే ఏమీ తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైనవారు తమ ఏసుక్రీస్తును, బుద్ధుడిని స్మృతి చేస్తారు. క్రీస్తు ఫలానా సమయములో క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చారని అడిగిన వెంటనే చెప్తారు. కాని భారతవాసులు ఎవరిని పూజిస్తారో వారి గురించి వీరెవరు? అని అడిగితే చెప్పలేరు. శివుని గురించి గాని, బ్రహ్మ-విష్ణు-శంకరులను గురించి గాని, జగదంబను గురించి గాని, జగత్ పితను గురించి గాని, లక్ష్మీనారాయణులను గురించి గాని తెలియదు. కేవలం వారిని పూజిస్తూ ఉంటారు. వారి జీవిత గాథ ఏమిటో ఏమాత్రం తెలియదు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు - మీరు స్వర్గములో ఉన్నప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రముగా ఉండేవి. మీరు అక్కడ రాజ్యము చేసేవారు. అవును! మనము ఖచ్ఛితంగా రాజ్యము చేసేవారమని, పునర్జన్మలు తీసుకున్నామని 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నామని మీకు తెలుసు. తెల్లగా ఉండేవారము, నల్లగా అయిపోయాము. సుందరంగా ఉండేవారు, ఇప్పుడు శ్యామంగా అయిపోయారు. ఈ రోజుల్లో నారాయణుని నల్లగా చూపిస్తున్నారు అంటే దీని నుండి ఆ కృష్ణుడే నారాయణుడని ఋజువు అవుతుంది. కాని ఈ విషయాలను గురించి ఏ మాత్రం అర్థం చేసుకోరు.
మిస్సైల్స్ తయారు చేయువారు యాదవులు. కౌరవులు, పాండవులు సోదరులు. వీరిలో పాండవ సోదరులు దైవీ సంస్కారాలు కలిగినవారు, కౌరవ సోదరులు ఆసురీ సంస్కారాలు కలిగినవారు. పాండవులు కూడా అసురులుగా ఉండేవారు, వీరిని(పాండవులను) తండ్రి(శివబాబా) ఉన్నతంగా తయారు చేసి దైవీ సోదరులుగా తయారు చేశారు. మరి ఇరువురు సోదరులకు ఏమయ్యారు? అవశ్యము పాండవులకు విజయము పొందారు, కౌరవులు నాశనమయ్యారు. ఇక్కడ కూర్చుని ఉన్నా మమ్మా-బాబా అని అంటూ ఉన్నా వారికి ఏమీ తెలియదు. తండ్రి శ్రీమతమును అనుసరించరు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని వారికి తెలియదు, నిశ్చయముండదు. దేహాభిమానము కారణంగా బంధు-మిత్రులు మొదలైనవారిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు దేహీ అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఇది కొత్త విషయము. దీనిని మనుష్యులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ మాతా-పితల వద్ద కూర్చుని ఉన్నా వారెవరో తెలియదు. ఇది విచిత్రము కదా! జన్మ కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది. అయినా తెలుసుకోరు. ఎందుకంటే వారు నిరాకారులు. వారిని మంచిరీతిగా అర్థం చేసుకోలేరు. వారి మతానుసారము నడవకుంటే ఆశ్చర్యవంతముగా పారిపోతారు. ఎవరి ద్వారా 21 జన్మలకు స్వర్గ వారసత్వము లభిస్తుందో, వారిని గురించి తెలియని కారణంగా పారిపోతారు. తండ్రిని తెలుసుకున్నవారిని భాగ్యశాలురని అంటారు. దు:ఖము నుండి విముక్తి చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచములో దు:ఖము చాలా ఉంది కదా! ఇది భ్రష్ఠాచారుల రాజ్యము. డ్రామానుసారము మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇటువంటి భ్రష్ఠాచార సృష్టే ఉంటుంది. మళ్లీ తండ్రి వచ్చి సత్యయుగ శ్రేష్ఠాచారీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. ఇది మనుష్యుల ప్రపంచము. దేవతల ప్రపంచము సత్యయుగములో ఉంటుంది. ఇచ్చట ఉన్నవారు పతిత మనుష్యులు. పావన దేవతలు సత్యయుగములో ఉంటారు. బ్రాహ్మణులుగా అయిన మీకు ఏ ఈ విషయాలన్నీ అర్థము చేయించబడ్తాయి. బ్రాహ్మణులుగా అవుతూ ఉన్న వారికి అర్థము చేయిస్తూ ఉంటారు. అందరూ బ్రాహ్మణులుగా అవ్వలేరు. బ్రాహ్మణులైన వారు మాత్రమే మళ్లీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే దేవతలుగా అవ్వలేరు. ''బాబా-మమ్మా'' అనగానే బ్రాహ్మణ కులములోకి వచ్చేశారు. తర్వాత చదువంతా పురుషార్థము పై ఆధారపడి ఉంటుంది. ఇచ్చట రాజ్య స్థాపన జరుగుతోంది. ఇబ్రహీమ్, బుద్ధుడు మొదలైన వారెవరూ రాజ్యస్థాపన చేయరు. ఏసుక్రీస్తు ఒంటరిగా వచ్చారు. ఎవరిలోనో ప్రవేశించి క్రైస్తవ ధర్మ స్థాపన చేశారు. క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలు పై నుండి క్రిందికి వస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ ధర్మమునకు చెందిన ఆత్మలందరూ ఇచ్చట ఉన్నారు. అంత్యములో అందరూ వాపస్ వెళ్లాలి. తండ్రి అందరికీ మార్గదర్శకులుగా అయ్యి అందరినీ దు:ఖము నుండి విముక్తి చేస్తారు. తండ్రియే మొత్తం మానవులను విముక్తి చేస్తారు. మార్గదర్శకులై ఆత్మలందరినీ వాపస్ తీసుకెళ్తారు. ఆత్మలు పతితులైన కారణంగా వాపస్ వెళ్ళలేవు. నిరాకార ప్రపంచము పావనమయ్యింది కదా! ఇప్పుడు ఈ సాకార సృష్టి పతితంగా ఉంది. ఇప్పుడు వీరందరూ నిరాకార ప్రపంచానికి వెళ్లేందుకు వీరిని పవిత్రంగా ఎవరు చేస్తారు? అందుకే ఓ గాడ్ఫాదర్ రండి! అని పిలుస్తారు. గాడ్ఫాదర్ వచ్చి తెలుపుచున్నారు - నేను ఒక్కసారి మాత్రమే, ప్రపంచమంతా భ్రష్ఠాచారిగా అయినప్పుడు వస్తాను. ఎన్నో తుపాకీ గుండ్లు, తుపాకులు, ఫిరంగులు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు - పరస్పరము చంపుకునేందుకు ఒక వైపేమో బాంబులు తయారు చేస్తున్నారు. రెండవ వైపు ప్రకృతి భీభత్సాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. ఉరుములు, మెరుపులు చూస్తారు. పిడుగులు పడతాయి. అందరూ జబ్బులపాలవుతారు. ఎందుకంటే మంచి ఎరువు తయారవ్వాలి కదా! మురికి పదార్థాలే ఎరువుగా తయారవుతుంది కదా! కావున ఈ సృష్టి అంతటికి ఎరువు కావాలి. దీని ద్వారా ఫస్ట్క్లాస్గా పంటల ఉత్పత్తి జరుగుతుంది. సత్యయుగములో కేవలం భారతదేశము మాత్రమే ఉండేది. ఇప్పుడు వీరందరూ వినాశనమవ్వాల్సి ఉంది. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తాను. అంతా సమాప్తమైపోతుంది. మీరు స్వర్గములోకి వెళ్తారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు కదా! అయితే స్వర్గమని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. అరే! కలియుగములో మరణించువారు మళ్లీ తప్పకుండా కలియుగములోనే పునర్జన్మ తీసుకుంటారు కదా! ఇంత మాత్రము తెలివి కూడా ఎవ్వరికీ లేదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పి.హెచ్.డి.) మొదలైన బిరుదులు(పేర్లు) ఉంచుకుంటారు. కాని ఏమాత్రము అర్థము చేసుకోరు. మానవులు మందిరాలలో ఉండేవారు. అది క్షీరసాగరము, ఇది విషయ సాగరము. ఈ విషయాలన్నీ తండ్రి ఒక్కరు మాత్రమే అర్థము చేయిస్తారు. మనుష్యులనే చదివిస్తారు కాని జంతువులనైతే చదివించరు కదా!
తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఇది తయారైన డ్రామా. మనుష్యులు ఎంత ధనవంతులో వారి వద్ద అంత ఫర్నీచర్ ఉంటుంది. పేదవారి వద్ద రాయి-రప్ప, చిల్లర పెంకులుంటాయి. ధనవంతుల వద్ద ఎన్నో వైభవాలుంటాయి. మీరు సత్యయుగములో ధనవంతులుగా అవుతారు. మీ వద్ద వజ్ర వైడూర్యాల భవనాలు ఉంటాయి. అచ్చట ఇలాంటి మురికి, దుర్గందము మొదలైనవేవీ ఉండవు. ఇచ్చట దుర్వాసన వస్తుంది. అందుకే అగరుబత్తులు మొదలైనవి వెలిగిస్తారు. అక్కడైతే పుష్పాలు మొదలైన వాటిలో ప్రకృతి సిద్ధమైన సహజ సుగంధము ఉంటుంది. అగరుబత్తి వెలిగించే పనే ఉండదు. దానిని స్వర్గము అని అంటారు. తండ్రి స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. సంపూర్ణ నిశ్చయము లేకుంటే మర్చిపోతారు. ఎవరి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందో అటువంటి మాత-పితలను మర్చిపోవడం ఎంత దురదృష్టము! తండ్రి వచ్చి అత్యంత ఉన్నతంగా తయారుచేస్తారు. ఇటువంటి మాతా-పితల మతమును అనుసరించకపోవడం నూటికి నూరు శాతము అత్యంత దురదృష్టమని అంటారు! నెంబరువారుగానేమో ఉంటారు కదా! చదువు ద్వారా విశ్వానికే మాలికులుగా అవ్వడం ఎక్కడ! నౌకర్లు, చాకర్లుగా అవ్వడం ఎక్కడ! మీరు ఎలా చదువుతున్నారో మీరే అర్థము చేసుకోగలరు. అక్కడ కేవలం ధర్మ పితలు, ధర్మ స్థాపన చేసేందుకు వస్తారు. ఇది ప్రవృత్తిమార్గము కనుక ఇచ్చట మాతా-పితలున్నారు. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గముంది. లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు. కావున వారి సంతానము కూడా పవిత్రంగా ఉండేవారు. మనము ఎలా అవుతామో, ఏ పదవికి అర్హులుగా అవుతామో మీకు తెలుసు. మాతా-పితలు ఇంత ఉన్నతంగా తయారు చేస్తుంటే వారిని అనుసరించాలి కదా! భారతదేశమునే మాతా-పితల దేశమని అంటారు. సత్యయుగములో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. ఎంత మంచి రీతిగా అర్థము చేయించబడ్తుంది! కానీ తండ్రిని స్మృతి చేయకుంటే బుద్ధికి తాళము వేయబడ్తుంది. వింటూ, వింటూ చదవు వదిలేస్తే ఒక్కసారిగా తాళము బంద్ అయిపోతుంది. పాఠశాలలో కూడా నెంబరువారుగా ఉంటారు. రాతిబుద్ధి, బంగారు(పారస్)బుద్ధి అని అంటారు కదా! రాతిబుద్ధి గలవారు కొద్దిగా కూడా అర్థము చేసుకోలేరు. పూర్తి రోజులో 5 నిమిషాలు కూడా తండ్రిని స్మృతి చేయరు. 5 నిమిషాలు స్మృతి చేస్తే తాళము కూడా అంతే తెరవబడ్తుంది. ఎక్కువగా స్మృతి చేస్తే తాళము బాగా తెరుచుకుంటుంది. ఆధారమంతా స్మృతి పైననే ఉంది. కొంతమంది పిల్లలు బాబాకు - '' ప్రియమైన బాబా లేక ప్రియమైన దాదా '' అంటూ ఉత్తరాలు వ్రాస్తారు. ఇప్పుడు కేవలం ప్రియమైన దాదా అని వ్రాసి పోస్టులో వేస్తే జాబు చేరుతుందా? పేరు(అడ్రస్) కావాలి కదా! దాదాలు - దాదీలు ప్రపంచములో ఎంతోమంది ఉన్నారు. అచ్ఛా!
ఈ రోజు దీపావళి పండుగ. దీపావళి నాడు కొత్త ఖాతాలు(అకౌంటు పుస్తకాలు) తెరుస్తారు. మీరు సత్య-సత్యమైన బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు వ్యాపారులతో కొత్త అకౌంటు పుస్తకాలు తెరిపిస్తారు. మీరు కూడా మీ నూతన ఖాతాను తెరవాలి. అయితే ఇది నూతన ప్రపంచము కొరకు. భక్తిమార్గములో ఖాతా అనంతమైన నష్టంతో ఉంది. మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. అనంతమైన సుఖ-శాంతులు పొందుతారు. ఈ అనంతమైన విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. అనంతమైన సుఖమును పొందుకునే పిల్లలే ఈ విషయాలన్నీ అర్థము చేసుకుంటారు. తండ్రి వద్దకు కోట్లలో ఏ కొంతమంది మాత్రమే వస్తారు. నడుస్తూ నడుస్తూ సంపాదనలో నష్టము వాటిల్లితే జరిగితే సంపాదించుకున్నది కూడా లేకుండా పోతుంది. ఎవరికైనా దానము ఇచ్చినప్పుడే మీ ఖాతా వృద్ధి చెందుతూ ఉంటుంది. దానము ఇవ్వకుంటే ఆదాయము వృద్ధి చెందదు. మీరు మీ సంపాదనను వృద్ధి చేసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరికైనా దానము ఇచ్చి లాభము కలిగిస్తారో అప్పుడే అది వృద్ధి చెందుతుంది. ఎవరికైనా తండ్రి పరిచయము ఇస్తే జమ అయినట్లవుతుంది. పరిచయమివ్వకపోతే జమ కూడా కాదు. మీ సంపాదన చాలా చాలా గొప్పది. మురళి ద్వారా మీ సత్యమైన సంపాదన జరుగుతుంది. ఈ మురళి ఎవరిదో తెలిసినా చాలు. ఈ విషయము కూడా పిల్లలైన మీకే తెలుసు. ఎవరు నల్లగా అయ్యారో, వారే మళ్లీ సుందరంగా అయ్యేందుకు మురళి వినాలని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ''ఓ మురళీ! నీలో ఇంద్రజాలముంది....''. ఈశ్వరీయ ఇంద్రజాలము,...... అని అంటారు కదా! కావున ఈ మురళిలో ఈశ్వరీయ గారడి ఉంది. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే తెలిసింది. దేవతలకు ఈ జ్ఞానము లేదు. వారికే జ్ఞానము లేకుంటే, వారి వెనుక వచ్చేవారికి ఈ జ్ఞానమెలా ఉంటుంది? తర్వాత తయారు చేయబడిన శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మీ సత్యమైన గీతలు చాలా కొద్దిగానే ఉన్నాయి. ప్రపంచములో ఆ గీతలు లక్షల సంఖ్యలో ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలే సత్యమైన గీతలు. ఈ చిత్రాల ద్వారా ఎంత అర్థము చేసుకుంటారో, అంత ఆ గీతల ద్వారా అర్థము చేసుకోలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మంచిరీతిగా చదువుకొని స్వయాన్ని భాగ్యశాలురుగా తయారు చేసుకోవాలి. దేవతలుగా అయ్యేందుకు పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి.
2. దేహీ అయిన తండ్రిని స్మృతి చేసేందుకు దేహీ-అభిమానులుగా అవ్వాలి. దేహమును కూడా మర్చిపోయే అభ్యాసము చేయాలి.
వరదానము :-
'' దివ్యగుణాల ఆహ్వానము ద్వారా అన్ని అవగుణాలను ఆహుతినిచ్చే సంతుష్ట ఆత్మా భవ ''
ఎలాగైతే వారు దీపావళి పండుగ నాడు విశేషంగా స్వచ్ఛత మరియు సంపాదన పై గమనముంచుతారో, అలా మీరు కూడా అన్ని ప్రకారాల స్వచ్ఛత మరియు సంపాదన చేయాలనే లక్ష్యముంచుకొని సంతుష్ట ఆత్మలుగా అవ్వరో, సంతుష్టత(తృప్తి) ద్వారానే అన్ని దివ్యగుణాలను ఆహ్వానించగలరు. అప్పుడు స్వతహాగానే అవగుణాలు ఆహుతైపోతాయి. లోపల మిగిలి ఉండే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత మొదలైనవాటిని సమాప్తము చేసి కొత్త ఖాతాను ప్రారంభించండి. కొత్త సంస్కారాలనే నూతన వస్త్రాలను ధరించి సత్యమైన దీపావళిని జరుపుకోవాలి.
స్లోగన్ :-
'' ఎవరి స్మృతి అనే జ్యోతి సదా వెలుగుతూ ఉంటుందో, వారే బ్రాహ్మణ కుల దీపకులు ''