05-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇది తయారు చేసి చేయబడిన అనాది డ్రామా. ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని పాత్ర నిశ్చితమై ఉంది. మోక్షం ఎవ్వరికీ లభించజాలదు''
ప్రశ్న :-
శివబాబా అశరీరి అయినా వారు శరీరంలోకి ఎందుకు వస్తారు? వారు వచ్చి ఏ పని చేస్తారు, ఏ పని చేయరు ?
జవాబు :-
పిల్లలూ! నేను పిల్లలైన మీకు కేవలం మురళి వినిపించేందుకు ఈ శరీరంలోకి వస్తాను. నేను మురళి వినిపించే కార్యమునే చేస్తాను. నేను తినేందుకు, తాగేందుకు రాను, మీకు కొత్త రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను. రుచిని చూసేది, తినేది ఇతని ఆత్మయే అని బాబా చెప్తారు.
పాట :-
ఆకాశ సింహాసనాన్ని వదలిరా!....................( ఛోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్,..........) 
ఓంశాంతి.
ఏ పాటలతో మనకు సంబంధం ఉంటుందో ఆ పాటలనే వివిపించడం జరుగుతుంది. ఆకాశంలో సింహాసనమంటూ ఏదీ లేదు. ఈ పోలార్నే(అంతరిక్షాన్నే, శూన్యమునే) 'ఆకాశము' అని అంటారు. అయితే ఆకాశతత్వంలో సింహాసనమూ లేదు, పరమపిత పరమాత్మ ఈ ఆకాశములో సింహాసనము పై ఉండనూ ఉండరు. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తారు - పరమపిత పరమాత్మ అయిన నేను మరియు ఆత్మిక పిల్లలైన మీరు ఇరువురమూ ఈ సూర్య, చంద్ర, నక్షాత్రాల కంటే అతీతంగా ఉంటాము. దానిని మూలవతనము అని అంటారు. ఎలాగైతే ఇక్కడ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయో అలాగే ఖచ్ఛితంగా ఒక వృక్షం వలె మహాతత్వంలో కూడా ఆత్మలు ఉంటాయి. ఎలాగైతే తారలు ఏ ఆధారమూ లేకుండా ఆకాశంలో ఉన్నాయో అలాగే ఆత్మలైన మీరు మరియు పరమాత్మ అయిన తండ్రి అందరమూ మహాతత్వములో ఉండేవారమే. ఆత్మ నక్షత్రము వలె ఉంటుంది. జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞానసితారలు ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే దు:ఖాలు కలుగుతాయో అప్పుడు నేను వస్తానని అర్థము చేయించాను. పాతదానిని తప్పకుండా కొత్తదిగా తయారుచేయాలి. పాతదానిలో కరువు కాటకాలు, దు:ఖాలు ఉంటాయి. కలియుగంలో దు:ఖం ఉంటుంది. స్వర్గంలో అయితే అంతా సుఖమే సుఖముంటుంది. మళ్ళీ నేను వచ్చి సహజ జ్ఞానమును మరియు సహజ రాజయోగమును నేర్పించవలసి ఉంటుంది. మీరు రండి! అని అందరూ పిలుస్తారు. సింహాసనము వదిలి రండి! అని కృష్ణుని కొరకు ఎవ్వరూ చెప్పరు. కృష్ణుని కొరకు సింహాసనము అన్న పదము శోభించదు. కృష్ణుడు యువరాజు కదా! రాజ్య సింహాసనము లభించినప్పుడే దానిని సింహాసనమని అంటారు. చిన్నపిల్లలను తండ్రి తన ఒడిలో లేక తన పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. ఆత్మలు మూలవతనములో నక్షత్రంలాగా ఉంటాయని తండ్రి అర్థము చేయించారు. మళ్లీ అక్కడ నుండి ఆత్మలు నెంబరువారుగా వస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఎలా క్రింద పడతాయో చూపిస్తారు కదా! అక్కడ నుండి కూడా వచ్చి ఆత్మలు నేరుగా గర్భంలోకి వెళ్తాయి. ప్రతి ఒక్క ఆత్మ సతో, రజో, తమో గుణాలను దాటవలసి ఉంటుందని బాగా నోట్ చేసుకోండి. ఎలాగైతే మొట్టమొదట లక్ష్మీనారాయణులు వస్తారో, వారు సతో, రజో స్థితులను దాటుతూ, పునర్జన్మలు తీసుకుంటూ మళ్లీ తమోప్రధాన స్థితిని పొందవలసిందే. ప్రతి ఒక్కరిది అదే విధంగా ఉంటుంది. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైనవారు వస్తారు. వారు కూడా సతో, రజో, తమో గుణాల గుండా దాటుకోవాలి. పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ద్వాపర యుగంలో ధర్మస్థాపకులు వస్తారు. అక్కడ నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి. మళ్ళీ తమోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు వారి సద్గతిని ఎవరు చేస్తారు? సద్గతి దాత అయితే ఒక్క శివుడే. అందరికీ సద్గతినిచ్చేందుకు నేను రావలసి ఉంటుంది అని వారు అంటారు. నా వలె కర్తవ్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. నేను దేవీదేవతా ధర్మస్థాపన చేస్తాను. మీకు రాజయోగమును నేర్పిస్తాను. గతి, సద్గతిదాతను నేనే. మీరెప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు నేను మిమ్ములను తిరిగి తీసుకెళ్తాను. మీకు కూడా సద్గతిని ఇస్తాను. మీతో పాటు అనేక ధర్మాలవారు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మస్థాపకుల సహితంగా అందరినీ ఉద్ధరిస్తాను. మిమ్ములను జ్ఞానంతో శృంగారము చేసి స్వర్గాధిపతులుగా, లక్ష్మి లేక నారాయణుని వరించేందుకు అర్హులుగా తయారుచేస్తాను. మళ్ళీ మిమ్ములను తిరిగి తీసుకెెళ్తాను. అందరినీ మొదట ముక్తిధామములోకి పంపించి వేస్తాను. సర్వుల సద్గతిదాతను కూడా అయ్యాను. ఇతర ధర్మస్థాపకులెవరైతే వస్తారో వారు సద్గతిని కలిగించరు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేయడంలో నిమగ్నమవుతారు. తమ ధర్మంలో పునర్జన్మలు తీసుకుంటూ సతో, రజో, తమోలను దాటుకుంటారు. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనులుగా సతోప్రధానులుగా ఎవరు తయారుచేస్తారు? తండ్రి స్వయంగా కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తారు. భగవంతుడు వచ్చి సర్వులకు సద్గతిని కలుగజేస్తారు, భారతదేశాన్ని స్వర్గంగా కూడా తయారుచేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే తండ్రికి ఇంతటి మహిమ ఉంది. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. కాని కృష్ణుని పేరును వ్రాయడంతో భగవంతుని మర్చిపోయారు. భగవంతుడు సర్వుల సద్గతిదాత. కావున గీత అన్ని ధర్మాలవారి కొరకు ధర్మశాస్త్రము. అందరూ దీనిని అంగీకరించవలసిందే. సద్గతినిచ్చే శాస్త్రము ఇంకేదీ లేదు. సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే. వారిదే గీత. పిల్లలైన మీకు సద్గతి కలిగించే జ్ఞానమునిస్తున్నారు. గీతలో శివుని పేరు ఉన్నట్లయితే అది అన్ని ధర్మాలవారి శాస్త్రమైపోయేది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగమును జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు నా ధామంలోకి వచ్చేస్తారు. అని బాబా అందరికీ చెబుతారు. అన్ని ధర్మాలవారికి సద్గతిని ఇచ్చేది కూడా నేనే. మిగిలినవారంతా తమ ధర్మాలను స్థాపించేందుకు వస్తారు. మోక్షము లభించదా? అని మనుష్యులు అడుగుతారు. లభించదు అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలెవరైతే ఉన్నారో వారందరి పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరి పాత్రా మార్పు చెందదు. ప్రతి ఒక్కరి పూర్తి పాత్ర అనాది డ్రామాలో రచింపబడింది. డ్రామా అనాది. దానికి ఆదిమధ్యాంతాలు లేవు. సృష్టి ఆదిని సత్యయుగము అని అంటారు, అంత్యము అని కలియుగమును అంటారు. డ్రామాకు ఆది-అంత్యాలు లేవు. డ్రామా ఎప్పుడు తయారయ్యిందో చెప్పలేరు. ఈ ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు.
బాబా అర్థము చేయించారు - ఇతర శాస్త్రాలేవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి ఒక్కరూ తమ ధర్మస్థాపన చేసుకున్నారు. ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేదు. వారు ధర్మస్థాపనను చేసుకున్నారు. వారి తర్వాత ఆ ధర్మాల వృద్ధి జరుగుతూ వచ్చింది. ఇవన్నీ ఎంత గుహ్యమైన పాయింట్లు! ఇవి వ్యాసము వ్రాయదగినవిగా ఉన్నాయి. ఇక్కడ కోతలు కోయడం కాదు. ఇది ఓటమి-గెలుపుల డ్రామా. సత్యయుగంలో పరమాత్మను స్మృతి చేసే అవసరం లేదు. పరమాత్మను స్మృతి చేసినట్లయితే బ్రాహ్మణులైన మమ్ములను వారు రచించారు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను రచయితనని మీకు సన్ముఖంగా చెబుతారు. ఇది సంగమ యుగము. బ్రాహ్మణుల కొత్త ప్రపంచము. శిఖను(పిలుకను) గూర్చి అయితే ఎవ్వరికీ తెలియదు. విరాట రూపాన్ని తయారు చేస్తారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూపిస్తారు. బ్రాహ్మణులను మర్చిపోయారు. సత్యయుగంలో దేవతలు, కలియుగంలో శూద్రులు ఉంటారు. సంగమయుగ బ్రాహ్మణులను గురించి వారికి తెలియదు. ఈ రహస్యాన్ని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. పవిత్రత లేకుండా ఎప్పుడూ ధారణ జరగదు అని బాబా అంటారు. బాబా తెలిపిస్తున్నారు - ఎన్నో వేదశాస్త్రాలున్నాయి. వాటిని ఊరేగిస్తూ ఉంటారు. మందిరాల నుండి విగ్రహాలను బయటకు తీసి ఊరేగించి మళ్ళీ తిరిగి మందిరాలలోకి తీసుకు వస్తారు. బాబా అనుభవజ్ఞులు. శాస్త్రాలతో బండిని నింపి దానిని ఊరేగిస్తారు. అలాగే దేవతల చిత్రాలను కూడా బళ్లలో ఉంచి ఊరేగిస్తారు. ఇదంతా భక్తిమార్గము.
మీరు శివశక్తులు. మీరు మొత్తం విశ్వానికి సద్గతినిస్తారు. కాని దిల్వాడా మందిరము ఖచ్ఛితంగా వీరి స్మృతి చిహ్నమేనని ఎవ్వరికీ తెలియదు. ఇటువంటి మందిరము ఇంకెక్కడా లేదు. ఇక్కడ జగదంబ ఉంది. శివబాబా కూడా ఉన్నారు. శక్తుల గదులు కూడా తయారు చేయబడి ఉన్నాయి. భక్తిమార్గంలో మళ్ళీ ఇటువంటి మందిరాలు తయారు చేయబడతాయి. మళ్ళీ వినాశనము జరిగినప్పుడు ఇవన్నీ అంతమైపోతాయి. సత్యయుగంలో మందిరాలేవీ ఉండవు. ఇదంతా భక్తిమార్గపు విస్తారము. జ్ఞానములో అయితే మౌనంగా ఉండాలి. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. శివబాబాను మరచి ఇతరులను స్మృతి చేసినట్లయితే అంతిమంలో ఫెయిలైపోతారు. కావున ఫెయిలవ్వరాదు. మనుష్యులు మరణించేటప్పుడు రాముని తల్చుకోమని, రామ-రామ అనమని మనుష్యులు అంటారు. కాని అలా గుర్తుకు రాదు. అంత్యకాలములో నారాయణుని స్మరించాలి............ అన్న గాయనము ఉంది. అది ఈ సమయానికి చెందినదే. ఈ ఎండిపోయిన వెదురు అడవికి మంటలు అంటుకోనున్నాయి. అంత్యకాలములో నారాయణుని స్మరించాలి............... అని అంటారు. మేము నారాయణుని లేక లక్ష్మిని వరిస్తాము అని మీరు భావిస్తారు. మీరు స్వర్గం కొరకు తయారవుతున్నారు. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వజాలరు. నాకు కూడా శివబాబాయే తెలియజేశారని ఈ బాబా కూడా అంటారు. దీనిని శక్తి సైన్యము లేక పాండవ సైన్యము అని అంటారు. మహారథులకు పాండవులు అన్న పేరు ఉంది. శక్తులను పులి పై స్వారీ చేస్తున్నట్లుగా చూపిస్తారు. ఎలాగైతే కల్పక్రితము సహజ రాజయోగాన్ని నేర్పించానో ఖచ్ఛితంగా అదే విధంగా ఇప్పుడు నేర్పిస్తున్నానని బాబా అంటారు. ఏ కర్మ అయితే కొనసాగుతుందో, కల్ప-కల్పము మళ్లీ అదే కొనసాగుతుంది. ఇందులో తేడా ఏర్పడజాలదు. మళ్ళీ కల్ప-కల్పము ఈ పాత్ర కొనసాగుతుంది. మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తానని బాబా అంటారు. తర్వాత ఏమవుతుందో అది చివరిలో వినిపిస్తాను కదా! అన్నీ ఇప్పుడే వినిపిస్తే మరి ఇప్పుడే తిరిగి వెళ్ళిపోనా? చివరివరకూ కొత్త పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. మనం గీతను ఎంతగానో మహిమ చేస్తాము. కాని ఆ గీత లేక మహాభారతాలలో హింసాత్మక యుద్ధాలు మొదలైన వాటిని చూపించారు. ఇప్పుడు యుద్ధమైతే లేదు. మీది యోగబలానికి చెందిన మాట. అహింస అర్థము ఎవ్వరికీ తెలియదు. కేవలం నారిని నరక ద్వారము అని అనేసారు. నిజానికి ఇరువురూ(నర-నారీలు) నరక ద్వారాలే. వారిని మళ్ళీ స్వర్గ ద్వారంగా ఎవరు తయారుచేస్తారు? ఆ శక్తి భగవంతునికే ఉంది. ఈ పాటలను బాబా తయారు చేయించారు. వాటిని తయారు చేసేవారు కొందరు సరిగ్గా తయారు చేశారు, కొందరు తప్పుగా చేశారు, కలిపేసారు. ఓ రాత్రి ప్రయాణికుడా! అలసిపోకు................... ఇటువంటి పాటలను నేనే తయారు చేయించాను. కావున ఇక్కడి విషయాలు వేరు. ఇది గోశాల మరియు వనవాసము కూడా. కాని వీటిని సరిగ్గా అర్థము చేసుకోరు. నేనెవరినైనా ఎత్తుకుపోయానా? కరాచీకి వచ్చేయండి అని ఎవ్వరితోనైనా అన్నానా? ఈ శక్తులను అడగండి. డ్రామాలో పాత్ర అలా ఉంది. ఎవరి పై అయితే అత్యాచారాలు జరిగాయో వారు వచ్చేశారు. కావున సరైనదేమిటో బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో ఏదైతే వ్రాయబడి ఉందో అదంతా భక్తిమార్గము. వాటి ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. నా వద్దకు రాలేరు. నేను మార్గదర్శకునిగా అయ్యి ఇక్కడకు రావలసి ఉంటుంది. గృహస్థ మార్గములో లేని వారి తనువు ఎందుకు తీసుకోలేదు అని అంటారు. అరే! నేను గృహస్థుని తనువులోకే వచ్చి తనకు కూడా జ్ఞానమును ఇవ్వాలి. వారి 84 జన్మల గురించి తెలియచేస్తాను. కావున ఇవి ఎంత గుహ్యమైన విషయాలు! ఇవి నూతన ధర్మము కొరకు నూతన విషయాలు. జ్ఞానము కూడా నూతనమైనదే. కల్ప-కల్పము నేను ఈ జ్ఞానమును వినిపిస్తానని తండ్రి అంటారు. నేను కల్ప-కల్పము ధర్మస్థాపన చేసేందుకు వస్తానని ఇంకెవ్వరూ ఎప్పుడూ అనరు. మేము మళ్ళీ రాజ్యము చేసేందుకు వచ్చామని లక్ష్మీనారాయణులు ఇరువురూ అనరు. అక్కడ ఈ జ్ఞానమంతా ప్రాయ: లోపమైపోతుంది. శాస్త్రాలనైతే అనేకము తయారు చేశారు. బ్రాహ్మణులైన మన కొరకు ఒకే గీత ఉంది. ధర్మస్థాపన కూడా చేస్తాను, అందరికీ సద్గతిని కూడా ఇస్తాను. ఇది డబుల్పని అయ్యింది కదా! ఇప్పుడు నేను వినిపించేది సత్యమా లేక వారు వినిపించేది సత్యమా? అని మీకు తెలుసు. నేను ఎవరిని? నేను సత్యమును. నేను ఏ వేదశాస్త్రాలనూ వినిపించను. భలే ఇతడు ఎన్నో చదివాడు. కానీ అతడేమీ వినిపించడు. శివబాబా కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు. వారు అశరీరి. వారు కేవలం ఈ మురళీని వినిపించే పని చేసేందుకు వస్తారు. అంతేకాని తినేందుకు, తాగేందుకు రారు. పిల్లలైన మీకు మళ్ళీ రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను. రుచి ఇతడి ఆత్మయే చూస్తుంది.
ప్రతి ఒక్కరి ధర్మమూ వేరు. వారు తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇక్కడైతే ఎన్నో శాస్త్రాలను చదువుతూ ఉంటారు. అందులో సారమేదీ లేదు. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా సారహీన ప్రపంచంగా అవుతూ ఉంటుంది. తమోప్రధానంగా అవ్వవలసిందే. మొట్టమొదట సృష్టిలోకి మీరే వచ్చారు. బ్రాహ్మణులైన మీరు మాతా-పితల ద్వారా జన్మ తీసుకున్నారు. అటువైపు ఆసురీ కుటుంబముంది. ఇక్కడ ఈశ్వరీయ కుటుంబముంది. మళ్ళీ వెళ్ళి దైవీ ఒడిని తీసుకుంటారు. స్వర్గాధిపతులుగా అవుతారు. మాతా-పితల మతానుసారంగా నడిచినట్లయితే అపారమైన స్వర్గ సుఖాలు లభిస్తాయి. పోతే రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. పిల్లలూ, వికారాల పై విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవ్వగలరు అని బాబా అంటారు. వివాహం చేసుకోకపోతే బలహీనంగా అయిపోతారనేది తప్పు. సన్యాసులు పవిత్రంగా అవుతారు. మరి వారు ఎంత లావుగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడైతే ఇది మెదడుతో చేసే పని, కష్టపడాలి. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా! సన్యాసులకైతే చాలా పదార్థము, ధనము లభిస్తూ ఉంటుంది. ఈ బాబా కూడా వారికి ఎంతో తినిపించేవారు. కాని ఇక్కడైతే ఎంతో పథ్యము ఉండవలసి ఉంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞానమును బాగా ధారణ చేసేందుకు పవిత్రత వ్రతమును ధారణ చేయాలి. ఇది అంత్యకాలము. కావున ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానంతగా అభ్యాసము చేయాలి.
2. దధీచి ఋషి వలె సేవ చేస్తూ వికారాల పై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వాలి.
వరదానము :-
''బుద్ధిని ఆదేశానుసారము శ్రేష్ఠ స్థితిలో స్థితము చేసే మాస్టర్ సర్వశక్తివాన్భవ''
చాలామంది పిల్లలకు వారు యోగములో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తుంది. కాని అలా జరగరాదు. ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులు సేవ కోసము సంకల్పము నడిచినా, సెకండు పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అయిన ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తు రాకూడదు. సేవ గుర్తుకొస్తే సాకారములోకి వచ్చేస్తారు. కనుక ఏ సమయంలో, ఏ స్థితిలో స్థితమవ్వాలో ఆ స్థితిలో స్థితమైపోవాలి. అప్పుడు వారిని మాస్టర్ సర్వశక్తివాన్ అని, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ గలవారని అంటారు.
స్లోగన్ :-
''ఏ పరిస్థితినైనా సహజంగా దాటుకునే సాధనము ఒకే బలము ఒకే నమ్మకము (ఏక్ బల్ ఏక్ భరోసా)''