30-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇది మీ బ్రాహ్మణుల క్రొత్త వృక్షము. దీనిని వృద్ధి కూడా చేయాలి, సంభాళన కూడా చేయాలి. ఎందుకంటే లేత మొక్కను పక్షులు తినేస్తాయి''

ప్రశ్న :-

బ్రాహ్మణ వృక్షములో వెలువడిన ఆకులు ఎందుకు వాడిపోతాయి? కారణమేది? నివారణ ఏది?

జవాబు :-

తండ్రి ఏవైతే జ్ఞానములోని వండర్‌ఫుల్‌ రహస్యాలు వినిపిస్తారో, అవి అర్థం చేసుకోని కారణంగా సంశయం ఉత్పన్నం అవుతుంది. అందువలన క్రొత్త - క్రొత్త ఆకులు వాడిపోతాయి. తర్వాత చదువును వదిలేస్తారు. ఇందులో అర్థం చేయించే పిల్లలు చాలా తెలివైనవారుగా ఉండాలి. ఒకవేళ ఏదైనా సంశయం తలెత్తితే పెద్దవారిని అడగాలి. సమాధానం లభించక తండ్రిని కూడా అడగవచ్చు.

పాట :-

ప్రియతమా వచ్చి కలుసుకో,................. ( ప్రీతమ్‌ ఆన్‌ మిలో,..............)   

ఓంశాంతి.

పాటనైతే పిల్లలు చాలాసార్లు విన్నారు, దు:ఖంలో అందరూ భగవంతుని పిలుస్తారు, వారైతే మీ వద్ద కూర్చున్నారు. మిమ్ములను అన్ని దు:ఖాల నుండి లిబరేట్‌(విడుదల) చేస్తున్నారు. ఖచ్చితంగా దు:ఖధామం నుండి సుఖధామానికి తీసుకెళ్లే సుఖధామానికి అధిపతి తెలుపుతున్నారని మీకు తెలుసు. వారు వచ్చి మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు. ఇదేమీ మనుష్యుల పని కాదు. పరమపిత పరమాత్మ మమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు రాజయోగం నేర్పించారని మీరు చెప్తారు. మనుష్యులు మనుష్యులను దేవతలుగా చెయ్యలేరు. మనిషిని దేవతగా చేసేందుకు సమయం పట్టదు,......... ఇది ఎవరి మహిమ? బాబాది. దేవతలైతే సత్యయుగంలో ఉంటారు. ఈ సమయంలో దేవతలు ఉండనే ఉండరు. కనుక స్వర్గాన్ని స్థాపన చేసేవారే తప్పకుండా మనుష్యులను దేవతలుగా చేస్తారు. పరమపిత పరమాత్మ ఎవరినైతే 'శివ' అని కూడా అంటారో, వారు పతితులను పావనంగా చేసేందుకు ఇక్కడకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు వారు ఎలా వస్తారు? పతిత ప్రపంచంలో కృష్ణుని శరీరము కూడా లభించదు. మనుష్యులు తికమకపడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో వింటున్నారు. ఈ ప్రపంచ హిస్ట్రీ-జాగ్రఫీ(చరిత్ర-భూగోళము) మీకు తెలుసు. హిస్ట్రీతో పాటు జాగ్రఫీ కూడా తప్పకుండా ఉంటుంది కనుక మనుష్య సృష్టిలో హిస్ట్రీ-జాగ్రఫీ ఉంటాయి. బ్రహ్మ-విష్ణు-శంకరుల హిస్ట్రీ-జాగ్రఫీ, సూక్ష్మవతన హిస్ట్రీ-జాగ్రఫీ అని ఎప్పుడూ అనరు. అది సూక్ష్మవతనము. అక్కడ మూవీ ఉంటుంది. టాకీ అయితే ఇక్కడ ఉంది. బాబా పిల్లలైన మీకు మొత్తం ప్రపంచము యొక్క హిస్ట్రీ-జాగ్రఫీ, మూలవతన సమాచారము, మూడు లోకాలని దేనిని అంటారో అంతా వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ నూతన వృక్షము నాటబడింది. దీనిని వృక్షమని అంటారు. మఠాలు-మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృక్షము అని అనరు. భలే క్రిస్టియన్‌ ట్రీ భిన్నమైనది అని క్రిస్టియన్లకు తెలుసు, కాని కొమ్మలు-రెమ్మలు అన్నీ ఈ పెద్ద వృక్షము నుండి వెలువడ్డాయని వారికి తెలియదు. మనుష్య సృష్టి ఎలా జన్మిస్తుందో అర్థం చేయించాలి. మాత-పిత తర్వాత ఇంకా పిల్లలు..... వారు కూడా అందరూ ఒకేసారి వెలువడరు. రెండు నుండి నాలుగు, 5 ఆకులు వస్తాయి, కొన్నిటినైతే పక్షులు కూడా తినేస్తాయి. ఇక్కడ కూడా పిచ్చుకలు తినేస్తాయి. ఇది చాలా చిన్న వృక్షము. ఇంతకుముందు వృద్ధి చెందినట్లుగా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, పిలలైన మీకు ఇప్పుడు ఎంత నాలెడ్జ్‌ ఉంది! మీరు త్రికాలదర్శులు. మూడు కాలాలు తెలుసుకున్నవారు, త్రిలోకనాథులు అనగా మూడులోకాల గురించి తెలుసుకున్నవారు. లక్ష్మీనారాయణులను త్రిలోకనాథులు, త్రిలోకదర్శులని అనరు. మనుష్యులు కృష్ణుని త్రిలోకీనాథుడని అంటారు. ఎవరైతే సర్వీస్‌ చేస్తారో వారికి ప్రజలు తయారవుతారు. తమ వారసులను కూడా తయారుచేసుకోవాలి, ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. అయితే మేము త్రిలోకనాథులము అని బుద్ధిలో ఉండాలి. ఈ విషయాలు చాలా వండర్‌ఫుల్‌(అద్భుతమైనవి). పిల్లలు పూర్తి పద్ధతిగా అర్థం చేయించలేకపోతే కన్‌స్ట్రక్షన్‌(నిర్మాణం)కి బదులు డిస్‌స్ట్రక్షన్‌(పాడు చేయడం) చేసేస్తారు. వెలువడిన ఆకులను వాడిపోవునట్లు చేస్తారు. ఇక చదువునే వదిలేస్తారు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది, అయిందేదో అయిపోయినట్లుగా చూడండి అని మనమంటాము. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం కల్పం యొక్క ఆది-మధ్య-అంత్యములు తెలుసుకున్నారు. హిస్ట్రీ, జాగ్రఫీ తెలుసు. పోతే మనుష్యులు విషయాలైతే చాలా తయారుచేస్తారు కదా, ఏమేమో వ్రాస్తారు, ఎలాంటి నాటకాలు తయారు చేస్తున్నారు!

భారతదేశంలో చాలామందిని అవతారం అని నమ్ముతారు. భారతదేశమే తన పడవను ముంచేసుకుంది. ఇప్పుడు పిల్లలైన మీరు విశేషించి భారతదేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని కాపాడ్తారు. ఈ ప్రపంచ చక్రం తిరుగుతూ ఉంటుంది, మనము పైన ఉంటే నరకం క్రింద ఉంటుంది. ఎలాగైతే సూర్యుడు దిగిపోతే(అస్తమిస్తే) సముద్రం క్రిందికి వెళ్ళిపోతాడని అంటాము కాని ఎంత మాత్రం వెళ్ళడు. ద్వారక మొదలైనవి మునిగిపోయాయని భావిస్తారు. మనుష్యుల బుద్ధి కూడా వండర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇప్పుడు మీరు ఎంత ఉన్నతంగా అవుతారు! ఎంత సంతోషం ఉండాలి! దు:ఖ సమయంలో మీకు లాటరీ లభిస్తోంది. దేవతలకైతే దొరికే ఉంది. ఇక్కడ మళ్లీ మీకు దు:ఖం నుండి అంతులేని సుఖం లభిస్తుంది. ఎంత సంతోషం కలుగుతుంది! భవిష్య 21 జన్మలకు మనము స్వర్గానికి అధిపతులుగా అవుతామని ఎంత సంతోషం కలుగుతుంది!

మనుష్యులు గీతా జ్ఞానాన్ని సత్సంగం అని అంటారు. సాయిబాబా సత్సంగం మొదలైనవి ఎన్ని సత్సంగాలున్నాయి! చాలామంది దుకాణాలవారున్నారు. బ్రహ్మకుమారులకైతే ఇది ఒక్కటే దుకాణం. జగత్‌ అంబ బ్రహ్మ ముఖ వంశావళి, బ్రహ్మకు కూతురు సరస్వతి ప్రసిద్ధి చెందింది. మాతా-పితల నుండి మనకు అపారమైన సుఖం లభించిందని మీకు తెలుసు. ఇపుడు ఆ మాతా-పితలు లభించారు. సుఖం అపారంగా ఇస్తున్నారు. మంచిది, మాతా-పితలకు జన్మనిచ్చేవారు ఎవరు? శివబాబా. మనకు శివబాబా నుండి రత్నాలు లభిస్తాయి. మీరు శివబాబాకు పౌత్రులు. ఇపుడు మనము ఆ అనంతమైన తండ్రి నుండి, మాతా-పితలు బ్రహ్మ-సరస్వతుల ద్వారా అపారమైన సుఖాన్ని తీసుకుంటున్నాము. ఇచ్చేవారు వారే. ఎంత సహజమైన విషయము! ఇంకా, మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాము, పోయి అపారమైన సుఖం మళ్లీ పొందుతాము అని అర్థం చేయించాలి. మేము భారతదేశానికి సేవకులము. తనువు, మనసు, ధనములతో మేము సేవ చేస్తాము. గాంధీకి కూడా సహాయం చేసేవారు కదా. యాదవులు, కౌరవులు, పాండవులు ఏమి చేసేవారు? ఇది మీరు అర్థం చేయించగలరు. పాండవుల వైపున(పక్షాన) పరమపిత పరమాత్మ ఉన్నారు. పాండవులు వినాశకాలే ప్రీతి బుద్ధి గలవారు, కౌరవులు, యాదవులు వినాశకాలే విపరీత బుద్ధి గలవారు. వారు పరమపిత పరమాత్మనే నమ్మరు. రాళ్ళు-రప్పల్లోకి తోసేస్తారు. మీ ప్రీతి వారితో తప్ప ఇంకెవరితోనూ లేదు. కనుక చాలా హర్షితంగా ఉండాలి. కాలిగోర్లు మొదలుకొని తల పై పిలక వరకు సంతోషం ఉండాలి. పిల్లలైతే చాలా మంది ఉన్నారు కదా! మీరు మాత-పితల ద్వారా వింటారు కనుక మీకు చాలా సంతోషం కలుగుతుంది. మొత్తం సృష్టిలో మన వంటి సౌభాగ్యశాలురు ఎవ్వరూ ఉండజాలరు. మాలో కూడా కొందరు పదమాపదమ్‌ భాగ్యశాలురు. కొందరు సౌభాగ్యశాలురు, కొందరు భాగ్యశాలురు. ఇంకా కొందరు దుర్భాగ్యశాలురు కూడా ఉన్నారు. ఎవరైతే ఆశ్చర్యవంతులై పారిపోతారో వారిని మహా దుర్భాగ్యశాలురని అంటారు. ఏదో ఒక కారణంతో తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. తండ్రి అయితే చాలా మధురమైనవారు, విడాకులు ఇవ్వకుండా ఉండేందుకు శిక్షణ ఇవ్వాలి అని భావిస్తారు. మీరు వికారాలలోకి వెళ్ళి కులం పేరు పాడు చేస్తారు, ఒకవేళ పేరు పాడు చేస్తే చాలా శిక్షలు తినాల్సి వస్తుందని అర్థము చేయిస్తారు.. వారిని 'సద్గురువును నిందించువాడు......' అని అంటారు. వారు తమ లౌకిక గురువుల గురించి అని అర్థం చేసుకున్నారు. పురుషులు కూడా అబలలను భయపెడ్తారు. అమరనాథుడైన బాబా ఇప్పుడు మీ అందరికి అమర కథను వినిపిస్తున్నారు. నేనైతే టీచర్‌ను, సర్వెంట్‌ను కదా! అని బాబా అంటారు. టీచర్‌ పాదాలు కడిగి త్రాగుతారా ఏమిటి? పిల్లలు ఎవరైతే యజమానులుగా అయ్యేవారో వారితో మేము పాదాలు కడిగించుకోవాలా? వద్దు, నిరాకారి, నిరహంకారి అని మహిమ కూడా చేయబడ్తారు. ఇతడు కూడా వారితో పాటు నిరహంకారిగా అయిపోయాడు.

అబలల పై అత్యాచారము కూడా గానం చేయబడింది. కల్పక్రితము కూడా అత్యాచారం జరిగింది. రక్తపు నదులు ప్రవహిస్తాయి, పాప భాండం(పాపపు కుండ) నిండిపోతుంది. ఇప్పుడు మీరు యోగబలంతో అనంతమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. మనము తండ్రి నుండి అచంచల - అఖండ సామ్రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. మనమైతే సూర్యవంశీయులుగా అవుతాము. అవును, ఇందులో ధైర్యం కూడా ఉండాలి. నాలో ఏ వికారము లేదు కదా అని మీ ముఖం మీరు చూసుకుంటూ ఉండండి. ఏదైనా విషయం అర్థం అవ్వకపోతే పెద్దవారిని అడగండి, మీ సంశయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ బ్రాహ్మణి సంశయాన్ని తీర్చలేకపోతే బాబాను అడగండి. ఇప్పుడైతే పిల్లలైన మీరు చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. ఎప్పటివరకు జీవిస్తామో, అప్పటివరకు బాబా అర్థం చేయిస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మేము చదువుతున్నాము, బాబాను అడుగుతాము అని చెప్పండి లేదా ఈ విషయాలు ఇప్పటివరకు బాబా అర్థం చేయించలేదు అని చెప్పండి. ఇకముందు అర్థం చేయిస్తారు, మళ్ళీ అడగండి అని చెప్పండి. చాలా పాయింట్లు వెలువడ్తూ ఉంటాయి. యుద్ధం ఏమవుతుంది? అని కొంతమంది అడుగుతారు, బాబా త్రికాలదర్శి, అర్థం చేయించగలరు. కానీ ఇప్పుడైతే బాబా ఇంకా తెలుపలేదు. అర్జీ మాది, మర్జీ బాబాది అని చెప్పి తమను వదిలించుకోవాలి.

తోటలో బాబా పిల్లలను ఒక ప్రశ్న అడిగారు. బాబా జ్ఞాన సాగరులు కనుక తప్పకుండా వారు జ్ఞాన డాన్సు చేస్తూ ఉండవచ్చు. మంచిది, భక్తిమార్గంలో శివబాబా అందరి మనోకామనలు పూర్తి చేసే పాత్ర పోషిస్తారు అయితే ఆ సమయంలో ఈ సంకల్పం కలగవచు.్చ ఏమంటే మేము సంగమ యుగంలో భారతదేశంలోకి వెళ్లి పిల్లలకు ఈ రాజయోగం నేర్పించాలి, స్వర్గానికి అధిపతిగా చేయాలి అనే ఈ సంకల్పం వస్తుందా లేక ఎప్పుడైతే రావలసిన సమయం వస్తుందో అప్పుడు సంకల్పం తలెత్తుతుందా?

ఈ సంకల్పం ఉండదని ఆలోచన ఉంది. భలే వారిలో జ్ఞానం మర్జ్‌ అయ్యి ఉంటుంది కాని ఎప్పుడైతే రావాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఇమర్జ్‌ అవుతుంది. అలా అయితే మనలో కూడా 84 జన్మల పార్టు మర్జ్‌ అయ్యి ఉంది కదా! భగవంతునికి కొత్త సృష్టి రచించాలని సంకల్పం కలిగింది అని పాడ్తారు. అయితే ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు సంకల్పం నడుస్తుంది. వారు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి-క్లాసు 13-1-69

పిల్లలు ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు, పిల్లలూ, శివబాబాను స్మృతి చేస్తున్నారా? విశ్వ సామ్రాజ్యాన్ని గుర్తు చేసుకుంటారా? అని తండ్రి అడుగుతున్నారు. అనంతమైన తండ్రి పేరు శివ. మరి భాష కారణాన వేరే వేరే పేర్లు పెడ్తారు. ఉదాహరణానికి బొంబాయిలో బబుల్‌నాథ్‌ అని అంటారు ఎందుకంటే వారు ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. సత్యయుగంలో ఉన్నవారు పుష్పాలు, ఇక్కడ ఉన్న వారందరూ ముళ్ళు. అయితే తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, బేహద్‌ తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటారు? వారి పేరు శివ, కళ్యాణకారి. మీరు ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా జన్మ-జన్మాంతరాల పాపాలు కట్‌ అయిపోతాయి. సత్యయుగంలో పాపం జరగనే జరగదు. అది పుణ్య ఆత్మల ప్రపంచము, ఇది పాపాత్మల ప్రపంచము. పాపాలు చేయించేవి 5 వికారాలు. సత్యయుగంలో రావణుడు ఉండనే ఉండడు. రావణుడు మొత్తం ప్రపంచానికి శత్రువు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. అందరూ దు:ఖితులుగా, తమోప్రధానంగా ఉన్నారు. అప్పుడు పిల్లలూ! నన్నే స్మృతి చేయండి(మామేకమ్‌ యాద్‌ కరో) అని తండ్రి చెప్తారు. ఇది గీతా వాక్యము. తండ్రి స్వయంగా - దేహ సహితంగా అన్ని సంబంధాలు వదిలి ' మామేకం యాద్‌ కరో ' అని చెప్తున్నారు. మొదట మీరు సుఖ సంబంధంలో ఉండేవారు, మళ్లీ రావణుని బంధనంలోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు సుఖపు సంబంధంలోకి రావాలి. తమను ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని ఈ శిక్షణ తండ్రి సంగమ యుగంలోనే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తారు - నేను పరంధామ నివాసిని, మీకు అర్థం చేయించేందుకు ఈ శరీరంలో ప్రవేశించాను, పవిత్రంగా అవ్వకుండా మీరు నా వద్దకు రాలేరు. ఇప్పుడు పావనంగా ఎలా అవుతారు? కేవలం నన్ను స్మృతి చేయండి. భక్తిమార్గంలో కూడా కేవలం నా పూజ చేశారు, దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. ఇప్పుడు నేను పతితపావనుడను, మీరు నన్ను స్మృతి చేస్తే, మీ జన్మ-జన్మాంతరాల పాపం నశించి పోతుంది. 63 జన్మల పాపం ఉంది. సన్యాసులు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు, తండ్రియే నేర్పిస్తారు. వాస్తవానికి ఈ శాస్త్రాలు భక్తి మొదలైనవి వ్రవృత్తి మార్గం వారి కొరకు ఉన్నాయి. సన్యాసులైతే అడవిలోకి వెళ్లి కూర్చొని బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి - సర్వుల సద్గతిదాతను నేను కనుక నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా(లక్ష్మీనారాయణులుగా) అవుతారని అంటున్నారు. గమ్యము-లక్ష్యము ఎదురుగా ఉంది. ఎంత చదువుతారో, చదివిస్తారో అంత ఉన్నత పదవి దైవీ రాజధానిలో పొందుతారు. తండ్రి ఒక్కరే అల్ఫ్‌. రచన నుండి రచనకు వారసత్వం లభించదు. వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు స్వర్గంలో సద్గతిలో ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాయి. ముక్తి-జీవన్ముక్తి, గతి-సద్గతి అనే పదాలు శాంతిధామము, సుఖధామాలకు చెందినవి. తండ్రి స్మృతి లేకుంటే ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ అయితే తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇక్కడ అందరూ నాస్తికులు, తండ్రిని ఎరుగరు. మీరు ఇప్పుడు ఆస్తికులుగా అవుతారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని గాయనం కూడా ఉంది, ఇప్పుడు వినాశకాలం కదా! చక్రం తప్పకుండా తిరగాలి. వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఎవరికి ఉంటుందో వారు విజయులు. తండ్రి ఎంత సులభం చేసి వినిపిస్తారు కాని మాయ - రావణుడు మరపింపజేస్తాడు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి ఇది అంతిమ సమయం. అది అమరలోకం, అక్కడ కాళుడు(అకాల మృత్యువు) ఉండడు. రండి, మమ్ములను అందరినీ వెంట తీసుకెళ్ళండి అని తండ్రితో అంటారు. కనుక కాళుడు కదా! సత్యయుగంలో ఎంత చిన్న వృక్షం ఉంది! ఇప్పుడు చాలా పెద్ద వృక్షం అయ్యింది.

బ్రహ్మ, విష్ణుల ఆక్యుపేషన్‌(కర్తవ్యం) ఏమిటి? విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మకైతే ఏ ఆభరణాలు మొదలైనవి లేవు. అక్కడ బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శంకరుడూ లేడు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నాడు. సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారం అవుతుంది. స్థూల, సూక్ష్మ, మూల వతనాలున్నాయి కదా! సూక్ష్మ వతనంలో మూవీ ఉంటుంది, ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది గీతా పాఠశాల ఇక్కడ మీరు రాజయోగం నేర్చుకుంటారు. శివబాబా చదివిస్తారు కనుక తప్పకుండా శివాబాబాయే గుర్తుకొస్తారు కదా! మంచిది.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్‌దాదా ప్రియస్మృతులు గుడ్‌మార్నింగ్‌. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. దు:ఖ సమయంలో లభించిన అపారమైన సుఖాల లాటరీ, 'ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి కలిగింది.' దీనిని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి.

2. బాప్‌దాదా సమానంగా నిరాకారి మరియు నిరహంకారిగా అవ్వాలి. ధైర్యంతో వికారాల పై విజయం పొందాలి. యోగబలంతో చక్రవర్తి పదవిని తీసుకోవాలి.

వరదానము :-

''సారథిగా అయ్యి అతీతమైన, ప్రియమైన(న్యారా-ప్యారా) స్థితిని అనుభవం చేయించే నంబర్‌ వన్‌ సిద్ధి స్వరూప్‌ భవ ''

సారథి అనగా ఆత్మ-అభిమాని. ఈ విధి ద్వారానే బ్రహ్మబాబా నంబర్‌వన్‌ సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. ఉదాహరణానికి తండ్రి దేహాన్ని అధీనపరచుకొని ప్రవేశిస్తారు, సారథిగా అవుతారు, దేహానికి అధీనులవ్వరు. అందువలన అతీతంగా, ప్రియంగా ఉన్నారు. అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీరు కూడా తండ్రి సమానమైన సారథి స్థితిలో ఉండండి. నడుస్తూ - తిరుగుతూ, ' నేను సారథిని అనగా శరీరాన్ని నడిపించే అతీతమైన, ప్రియమైన స్థితిలో స్థితమై ఉన్నానా? ' అని చెక్‌ చేసుకోండి. దీనితోనే నంబర్‌వన్‌ సిద్ధి స్వరూపంగా అవుతారు.

స్లోగన్‌ :-

''తండ్రికి ఆజ్ఞాకారులై ఉంటే గుప్తమైన ఆశీర్వాదాలు సమయానికి సహాయం చేస్తూ ఉంటాయి''